10, జులై 2012, మంగళవారం

విశ్వాత్మ(స్వామి విశ్వాత్మానంద) గారు ఇక లేరు

నా బ్లాగు చదువరులకు ఒక దుర్వార్త. నేను పోయినేడాది విశ్వాత్మగారి గురించి వ్రాసినప్పుడు చదివినవారికి ఆయన గుర్తుండి ఉంటారు. మొన్న ఆదివారం 8-7-2012 న హటాత్తుగా ఆయన చనిపోయారు. ఆ సంఘటన  కూడా చాలా బాధాకరంగా జరిగింది. ఆయన శరీరం మూడురోజులనుంచీ విజయవాడ NTR Health University మార్చురీ లో పోస్ట్ మార్టం కోసం వేచి ఉన్నది.

ఆదివారం నాడు ఉదయమే ఆయన ఒక శిష్యునితో కలిసి సీతానగరం వైపు కృష్ణానదీ తీరంలో ఒక పూజను నిర్వహించి తిరిగివస్తున్నారు. శిష్యుడు మోటార్ సైకిల్ తోలుతుంటే ఆయన వెనుక కూర్చొని ఉన్నారు.ప్రకాశం బారేజీ దాటగానే ఒక ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది. ఎడమవైపు వెళితే అమ్మవారి గుడి, కుడివైపు వెళితే కృష్ణ లంక వస్తాయి. ఆ సిగ్నల్ దగ్గర వెనుకనుంచి వచ్చిన ఒక ట్రాక్టర్ ఈ మోటార్ సైకిల్ ను గుద్దేసి వెళ్ళిపోయింది.ఆ ట్రాక్టర్ కు నంబర్ లేదు.  విశ్వాత్మ గారు కిందపడి పోగా తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే ప్రాణం వదిలారు. కపాలమోక్షం అలా అయింది. 

ఆయన స్వచ్చమైన సన్యాసి. తన వివరాలు ఎవరికీ చెప్పేవారు కారు. "నవ్వులాట" శ్రీకాంత్ గారికి ఆయన మంచి మిత్రుడు అని చెప్పవచ్చు. శ్రీకాంత్ గారి ఆఫీస్ కి చాలా సార్లు వచ్చి కూచొని తీరికసమయంలో చాలాసేపు మాట్లాడేవారు. నేను ఆయన్ను విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ఒకసారి మాత్రమె చూచాను. కొద్దిసేపు మాట్లాడాను. ఆ కొద్దిసేపటిలోనే ఆయనంటే నాకు గౌరవభావం కలిగింది. నిరాడంబరుడు, నిర్మొహమాటి, చాలా ఉన్నతమైన వేదాంతభావాలు కలిగిన సాధువు అని చెప్పాలి.

ఆయన పుట్టింది సంపన్నమైన కమ్మకులంలో. పెరిగింది సత్యసాయిబాబా సన్నిధిలో ప్రశాంతినిలయంలో. కోట్లు మూలుగుతున్నా ప్రాపంచిక జీవితంమీద విరక్తితో సన్యాసం తీసుకున్నాడు. సత్యసాయిబాబా బెడ్ రూం లోకి అప్పాయింట్ మెంట్ లేకుండా సరాసరి వెళ్లి మాట్లాడగలిగే చనువు ఆయనకు ఉండేది. ఆయనకు తెలియని గురువులు లేరు. ముప్పై ఏళ్ళ క్రితమే ఓషో రజనీష్ తో కొన్నినెలలు పూనాలో ఉండి ఆయనతో కలిసి వ్యాహ్యాళికి వెళ్ళేవాడు. ఒజాయ్ లో జిడ్డు కృష్ణమూర్తితో కొన్ని నెలలు కలిసి గడిపాడు. దలైలామాతో పరిచయం ఆయనకు ఉంది. ఇంకా చాలామంది ప్రసిద్ధ గురువులతో, సమాజంలో ఉన్నత వ్యక్తులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. హిమాలయాలకు తరచూ వెళ్లి కొన్ని నెలలు అక్కడ ఉంటూ ఉండేవాడు. టిబెట్ యోగులతో ఆయనకు పరిచయాలున్నాయి. కానీ ఎక్కడా బయటపడకుండా చాలా నిరాడంబరంగా కనిపించేవాడు. నాలుగు రోజుల క్రితమే టిబెట్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలిసింది.

ఆయన ఉండేది విజయవాడలో అయినా ఎక్కడ ఉంటాడో ఎవరికీ చెప్పేవాడు కాదు. ఎక్కువగా ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు. కానీ ఎక్కడో యధాలాపంగా కలిస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. చాలా మంచి మనిషి. ఉన్నతమైన వేదాంతి. ఉత్త వేదాంత పాండిత్యం కలిగిన ఊకదంపుడు  వ్యక్తి కాదు. వేదాంతాన్ని ఆచరించి జీవితంలో అనుసరించిన వ్యక్తి. ఆయన జేబులో దొరికిన సెల్ ఫోన్ లో ఎవరో కొందరు భక్తుల నంబర్లు తప్ప తనవాళ్ళవంటూ ఎవరివీ నంబర్లు లేవు. ఆ శిష్యులకు కూడా ఆయన బంధువులు ఎవరో ఎక్కడున్నారో తెలియదు. అందుకే ఆయన శరీరం మూడురోజులనుంచీ మార్చురీలో పడి ఉంది.

ఆయన కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని కొడాలిలో ఉన్న మళయాళ స్వాములవారి సాంప్రదాయ ఆశ్రమంలో కొన్ని నెలలు ఉన్నారు. అక్కడ ఆశ్రమం వారికి ఆయన బాగా పరిచయం ఉన్నారు. కనుక చివరికి ఆ ఆశ్రమంవారే ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి కొడాలిలో అంత్యసంస్కారం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమం ఈరోజు జరగవచ్చు.

నదీమూలం ఋషిమూలం పరిగణించరాదు అంటారు. నది పుట్టినచోట చిన్న కాలువలాగే ఉంటుంది. దాని మహత్తు అక్కడ తెలీదు. సముద్రంలో కలిసే చోట దానిని చూడాలి. అలాగే మహనీయుల విలువను కూడా వారు పుట్టిపెరిగిన కుటుంబమూ పరిసరాలూ నిర్ణయించవు. ఆధ్యాత్మిక జీవితంలో వారు అందుకున్న స్థాయీ, వారి జీవితమూ మాత్రమే దానికి గీటురాళ్ళు. విశ్వాత్మగారు కూడా అటువంటి మంచి వేదాంతీ నిజమైన సాదువూనూ.

దేనినీ కూడా ఆయన గుడ్డిగా విమర్శించడం ఎవరూ చూడలేదు. ఆయన మాటల్లో ఒక రీజన్ ఉండేది. ప్రతివిషయాన్నీ చక్కగా సమన్వయ దృష్టితో చూచేవారు. కాని అసత్యాన్ని ఎక్కడా సమర్ధించేవారు కాదు. లోపం ఉంటే ఎంత పెద్దవారినీ ఒప్పుకునేవారు కాదు. ఆయనకు చిన్నప్పటి నుంచీ తెలిసిన సత్యసాయిబాబాని కొన్ని విషయాలలో విమర్శించడం నాకు తెలుసు.


ప్రస్తుతం రాశి చక్రంలో గురువూ కేతువూ మూడు డిగ్రీల దూరంలో ఉన్నారు. గురువు ఆధ్యాత్మిక గురువులకు సూచకుడు. కేతువు హటాత్ సంఘటనలకు దుర్ఘటనలకు సూచకుడు. శుక్రరాశి వల్ల జలసంబంధ ప్రదేశం సూచితం.ఈ దుర్ఘటన కృష్ణానదీ తీరంలోనే, ప్రకాశం బారేజీమీదే జరిగిందని గమనించాలి. మానవుల మీద గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.


మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఎవరూ పాటించరు. ఆ మాటకొస్తే ఏ రూల్సూ ఎవరూ పాటించరు. ప్రతివారూ రూల్స్ ఎదుటివారికి మాత్రమె, నాకుకాదు అనుకోవడం మనదేశంలోని విచిత్రపరిస్తితి.గట్టిచట్టాలూ,మంచి న్యాయవ్యవస్తా, పోలీస్ వ్యవస్థా లేకపోవడం మనకొక పెద్దలోపం. ప్రతిదానిలో రాజకీయప్రమేయం ఇంకొక చండాలం. పౌరుల్లో సివిక్ సెన్స్ లేకపోవడం ఇంకొక ప్రధానలోపం.భారతీయులకు ముందుగా కావలసింది సిక్స్త్ సెన్స్ కాదు సివిక్ సెన్స్ & కామన్ సెన్స్ అని నేనెప్పుడూ అంటుంటాను. ట్రాఫిక్ రూల్స్ పాటించని రాష్ డ్రైవింగ్ వల్ల ఎంతమంది జీవితాలు ఇలా రోడ్డుపాలు అయిపోతున్నాయో దేవుడికేరుక.

అంత మంచి సాధువు జీవితం ఇలా ముగియటం మాత్రం బాధాకరం. కర్మ ఎవరినీ వదలదు అనడానికి విశ్వాత్మగారి జీవితంలో చివరిఘట్టం  ఇంకొక  ఉదాహరణ అనిపిస్తుంది.


ఆయన  గురించి వ్రాసిన పాత పోస్ట్ లు ఇక్కడ చూడవచ్చు.


http://teluguyogi.blogspot.in/2011/01/blog-post.html

http://teluguyogi.blogspot.in/2011/01/blog-post_07.html

http://teluguyogi.blogspot.in/2011/01/blog-post_11.html
read more " విశ్వాత్మ(స్వామి విశ్వాత్మానంద) గారు ఇక లేరు "

8, జులై 2012, ఆదివారం

రాహుకేతువుల ఆవృత్తులు - ప్రపంచవ్యాప్త సంఘటనలు- ఒక పరిశీలన

రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ వాటి ప్రభావం భూమ్మీద అమితంగా ఉంటుంది అనేది సత్యం.  వీటియొక్క విద్యుత్ అయస్కాంతప్రభావం భూమిమీద ఖచ్చితంగా ఉంటుంది అని ఎన్నో సార్లు రుజువైంది. వీటి యొక్క సైక్లిక్ మూమెంట్ వల్ల అనేక సంఘటనలు భూమ్మీద యాక్టివేట్ అవుతుంటాయి.ఈ రాహుకేతువులు రాశిచక్రాన్ని ఒకసారి చుట్టి రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. కనుక ప్రతి 18 ఏళ్ళకూ వీటియొక్క ఒక సైకిల్ పూర్తి అవుతుంది. అందుకనే మనిషి జీవితంలో కూడా ప్రతి పద్దెనిమిది ఏళ్లకూ ఒక విధమైన దశ పూర్తి అవుతుంది.


పుట్టిన నాటినుంచీ 18 ఏళ్ళవరకూ మనిషికి లోకమంటే ఏమిటో తెలియని ఒక విధమైన అమాయకత్వదశ నడుస్తుంది.18 ఏళ్ళు వచ్చేసరికి మనిషి యవ్వనం లోకి అడుగుపెడతాడు.లోకం కొత్తగా కనిపించడం మొదలౌతుంది. తిరిగి 36 ఏళ్ళు వచ్చేసరికి ఆ వేడి తగ్గి ఒకవిధమైన పరిపక్వత వస్తుంది.బాధ్యతలు చుట్టుముడతాయి. బాధ్యతలు ముగిసి 54 ఏళ్ళు వచ్చేసరికి మధ్యవయసు  దశ మొదలౌతుంది.ఎందుకు పుట్టామో ఏం సాధించామో తెలియక మనిషి అయోమయంలో పడే దశ ఇది. తర్వాత వచ్చే ఆవృత్తిలో 72ఏళ్లలోపు చాలామంది పరలోక ప్రయాణం కడుతుంటారు. ఎవరైనా మిగిలితే ఆ తర్వాతి దశలో ఎలాగు చావు తప్పదు. కనుక రాహుకేతువుల అయిదు  చుట్లలోనే మనిషి జీవితం దాగుంది అని చెప్పవచ్చు. ఒకరకంగా చూస్తె పంచభూతాలనే అయిదుచుట్లుగా చుట్టుకున్న రాహుకేతువులనే కాలసర్పం మానవులను బంధించి ఉందని ఊహించవచ్చు.


రావుకేతువులు వృశ్చికంలోనూ వృషభంలోనూ ఉన్నపుడు నీచస్తితిలో ఉంటాయని ఒక భావన ఉంది. వీరి ఉచ్ఛనీచల గురించి అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా  అనుసరించబడే రాశులు ఇవి రెండే. వీరు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ ఏమేమి సంఘటనలు జరిగాయో, ప్రపంచవ్యాప్తంగానూ మన దేశంలోనూ కూడా, ఒక్కసారి పరిశీలిద్దాం.

నవంబర్ 1899 నుంచి ఏప్రిల్ 1901  

USS Maine అనే యుద్ధ నౌక హవాన హార్బర్ లో పేలిపోయి మునిగిపోయింది. దానిలోని దాదాపు 300 మంది సిబ్బంది చనిపోయారు. దీనివల్ల అమెరికా స్పెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయ్యింది. అమెరికా ఫిలిప్పైన్స్ మధ్య కూడా ఈ సమయం లోనే యుద్ధం జరిగింది. కొలంబియా లో వచ్చిన సివిల్ వార్ లో దాదాపు లక్షమంది చనిపోయారు. గురుశనులు అమెరికాకు సూచిక అయిన ధనుస్సులో ఉండటం చూడవచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం దీనికి ఎదురుగా ఉండే మిధునం అమెరికాను సూచిస్తుంది.


జూన్ 1918 నుంచి నవంబర్ 1919 వరకూ

 మొదటి ప్రపంచయుద్దపు రోజులు. ప్రపంచమంతా  యుద్ధ జ్వాలలతో గందరగోళంగా ఉంది. ఇదే సంవత్సరంలో మన దేశంలో జలియన్వాలాబాగ్ సంఘటన జరిగింది. షిర్డీసాయిబాబా మరణం కూడా అప్పుడే జరిగింది. గురుశనుల సాముదాయక దృష్టి తులారాశిమీద పడటం చూడవచ్చు. తుల సమతుల్యతకు సూచిక. ప్రపంచపు సమతుల్యత దెబ్బతినడం సూచింపబడుతున్నది. గురుశనులు వక్రించి ఉండటమూ రాహువు నుంచి గురువు అష్టమంలో ఉండటమూ చూడవచ్చు.


జనవరి 1937 నుంచి జూలై 1938

జపాన్ జర్మనీల దురహంకార చర్యల వల్ల రెండవ ప్రపంచయుద్దానికి కావలసిన ఘట్టం సిద్ధం అయ్యింది. చైనా లోని నాంకింగ్ పట్టణం పైన జపాన్ జరిపిన అమానుష దాడిని "రేప్ ఆఫ్ నాంకింగ్" అని ఇప్పటికీ అంటారు.ఈ సమయంలో హిట్లర్ ప్రణాలికలు చాలా చురుకుగా సాగాయి. 1939 లో రెండవ ప్రపంచయుద్ధం మొదలైంది. గురుశనుల సాముదాయకదృష్టి వృషభం మీదా, కన్యమీదా ఉంది. నవీన భారతదేశాన్ని సూచించే వృషభం వల్ల ఈ సమయంలో మన దేశంలో స్వతంత్రం కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. రంగం సిద్ధం అయింది.


ఆగస్ట్ 1955 నుంచి ఫిబ్రవరి 1957

హంగేరీ లో విప్లవం వచ్చింది. కాని అది బలవంతంగా మిలిటరీ చేతిలో అణిచివేయబడింది. క్యూబా లో కూడా విప్లవం వచ్చింది. సూడాన్ కు బ్రిటన్ చేతులోనుంచి స్వతంత్రం వచ్చింది. సామాన్య జనాన్ని సూచించే శని రాహువుతో కూడి ఉండటం గమనించవచ్చు.ఇదే సమయంలో జనానికి ఉపయోగపడే పోలియో వాక్సిన్ కనుక్కోబడింది.ట్రీటీ ఆఫ్ రొమ్ ద్వారా EEC (యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) స్థాపించబడింది. రష్యా గగనతలంలోకి స్పుత్నిక్ ను ప్రయోగించింది. మన దేశంలో అయితే ఇదే సమయంలో  భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

మార్చి 1974  నుంచి సెప్టెంబర్ 1975

అమెరికాలో వాటర్ గెట్ కుంభకోణం జరిగి ప్రెసిడెంట్ నిక్సన్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది. అమెరికాను సూచించే  మిథునంలో శని వక్రించి ఉండటం రాహువు నుంచి అష్టమంలో ఉండటం  చూడవచ్చు. సైప్రస్ ను టర్కీ ఆక్రమించింది. అంగోలా కు స్వతంత్రం వచ్చింది. లెబనాన్ లో సివిల్ వార్ మొదలైంది. అమెరికా రష్యాల స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ జరిగింది. మనదేశంలో పోఖరాన్ అణుపరీక్ష జరిగింది. ఎమర్జెన్సీ విధించబడి దేశం సంక్షోభానికి గురయ్యింది.


నవంబర్ 1992  నుంచి మే 1994
    
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. యూరోప్ దేశాలన్నీ కలిసి సంఘటిత మార్కెట్ ను మొదలు పెట్టాయి. రువాండా మారణహోమంలో కనీసం పదిలక్షల మంది టుట్సీ జాతివారు హుటూ సైన్యం చేతిలో ఊచకోతకు గురయ్యారు.షూమేకర్ తోకచుక్క గురుగ్రహాన్ని డీ కోట్టింది. గురువు వక్రించి ఉండటమూ,శనిగురువుల మధ్య శని కుజుల మధ్యా షష్టాష్టకం ఉండటమూ కుజుడు నీచలో ఉండటమూ తన అష్టమ దృష్టితో శనిని చూస్తూ ఉండటమూ చూడవచ్చు.ఇందువల్లే అంత మారణహోమం జరిగింది. మనదేశంలో బాబ్రీమసీదు విధ్వంసం కూడా అప్పుడే జరిగింది. 
  
ఇకపోతే మళ్ళీ ఇప్పుడు రాహుకేతువులు నీచస్తితిలో ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల గురించీ సంఘటనల గురించీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదుకదా.  అవి కళ్ళ ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కనుక రాహుకేతువులు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  ముఖ్యమైన సంఘటనలు తప్పక జరుగుతాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఆయా సంఘటనలు గురువు, శని, కుజుల స్తితులను బట్టీ  అవి ప్రభావితం చేసే రాశులను బట్టీ జరుగుతూ ఉంటాయి. గ్రహగతులను సూక్ష్మంగా పరిశీలించడం వల్ల వాటిని అర్ధం చేసుకోవచ్చు.
read more " రాహుకేతువుల ఆవృత్తులు - ప్రపంచవ్యాప్త సంఘటనలు- ఒక పరిశీలన "

6, జులై 2012, శుక్రవారం

హిగ్స్ బోసాన్ కణావిష్కరణ - జ్యోతిష్య కోణాలు

4-7-2012 న హిగ్స్ బోసాన్ కణం కనుక్కున్నామని జెనీవాలో శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనిని దైవకణం అంటున్నారు. ఈ కణం ఉందని ఊహాత్మకంగా లెక్కల ఆధారంగా ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నప్పటికీ దీని ఉనికిని నిర్ధారించడం ఇదే మొదటిసారి. నేను పాతికేళ్ళ క్రితం డిగ్రీ చదివే సమయంలోనే మోడరన్ ఫిజిక్స్ లో సబ్ అటామిక్ పార్టికిల్స్ గురించి చదివినప్పుడు చాలా ఇంట్రస్ట్ కలిగేది. మనకు తెలిసిన ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ లే కాక, న్యూట్రినో మొదలైన అనేక ఇంకా సూక్ష్మ అణువులు ఉన్నాయని చదివినప్పుడు భలే ఆశ్చర్యం కలిగేది. సరే విధివశాత్తూ ఆ లైన్ లో నా చదువూ సంధ్యా ముందుకు సాగలేదు. అదలా ఉంచుదాం. మనకు తెలిసిన అటామిక్ మోడల్ తో విశ్వాన్ని అర్ధం చేసుకోవాలంటే అణువులకు బరువును ఇచ్చే ఒక ప్రాధమిక కణం ఉండాలని శాస్త్రవేత్తలు ఎప్పుడో ఊహించారు. దాన్నే హిగ్గ్స్ బోసాన్ కణం అంటున్నారు. థియరీ పరంగా అది ఉండాలి అని ఊహించినప్పటికీ దాని ఉనికిని ఖచ్చితంగా నిర్దారించామని మాత్రం ఇప్పుడే శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఈ సందర్భంగా చిన్న జ్యోతిష్యపరిశీలన చేద్దాం. ప్రతి సైన్స్ ఆవిష్కరణ సమయంలోనూ యురేనస్ గ్రహం ప్రముఖపాత్ర పోషించినట్లు మనం సైన్స్ చరిత్ర చూస్తె అర్ధమౌతుంది. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు జ్యోతిశ్శాస్త్రవేత్తలూ ఒప్పుకున్నారు. కనుక యురేనస్ యొక్క పాత్ర ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ కోణంలో 4-7-2012 న గ్రహచక్రం చూస్తె కొన్ని ఆశ్చర్యకర నిజాలు కనిపిస్తాయి.

ఆ రోజున మీనంలో యురేనస్సూ,ధనుస్సులో ప్లూటో, వృషభంలోని శుక్రుడూ, కర్కాటకంలోని బుదుడూ అందరూ కలిసి 14 డిగ్రీలమీద ఖచ్చితమైన కంజంక్షన్ లో ఉన్నారు. ఇది వింతకాక మరేమిటి? యురేనస్ ప్లూటోలు square aspect లోనూ, యురేనస్ బుధులు angular aspect లోనూ ఉన్నారు. యురేనస్ శుక్రుల మధ్యన sextile aspect ఉంది. అలాగే శుక్రబుదుల మధ్య కూడా అదే ఉంది. కనుక స్థూలంగా మూడుగ్రహాల ప్రభావం ఆరోజున బుధుని మీద ఖచ్చితంగా ఫోకస్ అయింది. దీనికి తోడు  ఆరోజున బుధవారం అవటం ఇంకొక వింత. బుధుడు scientist లనూ, మేధావులనూ సూచిస్తాడని మనకు తెలుసు. కనుక ఆరోజునే శాస్త్రవేత్తల నుంచి ఈ ప్రకటన వెలువడింది. శుక్రుడు దైవాన్ని సూచించే గురుకేతువులతో కలిసి ఉండటమే ఈ కణాన్ని దైవకణం అని  పిలవడానికి కారణం. కాని అది దైవకణం కాదు. దైవం ఒక కణంలో మాత్రమె ఎప్పుడూ ఉండదు. ఈ కణం తెలిసినంత మాత్రాన దైవం గురించి మానవుడు ఏమీ తెలుసుకోలేడు.ఈ సంగతి ఇంకోమారు ముచ్చటించుకుందాం.


పౌర్ణమి అమావాస్యల ప్రభావాన్ని గురించి నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను. ఎన్నో రుజువులు చూపించాను కూడా. మొన్న మూడో తేదీన పౌర్ణమి. మర్నాడే నాలుగోతేదీన ఈ ఆవిష్కరణ జరిగింది. లోకంలో ముఖ్యమైన సంఘటనలు అన్నీ అమావాస్యా పౌర్ణమి దగ్గరలో జరుగుతాయి అని నేను చెప్తూ వస్తున్నది మళ్ళీ నిజం కావడం గమనించవచ్చు.దీనికి కారణం మనిషి మనసు మీద చంద్రుని ప్రభావమే. మనిషి ఎంత విర్రవీగినా ప్రకృతిశక్తుల ప్రభావానికి అతీతుడు కాలేడు. గ్రహప్రభావానికి అతీతుడు కాలేడు. యోగసాధనలో ఉన్నతస్థాయిలు అధిరోహించినపుడు మాత్రమె మనిషి గ్రహప్రభావానికి అతీతుడు కాగలడు. సామాన్యులకు అది అసాధ్యం. సైంటిష్టులూ సామాన్యమానవులే గనుక వారికీ గ్రహాలు అనుకూలించినప్పుడే ప్రయోగాలు విజయవంతం అవుతాయి. అందుకే పై గ్రహసంయోగాలు ఉన్నప్పుడే అదికూడా పౌర్ణమిఘడియల ప్రభావంలోనే ఈ ఆవిష్కరణ సాధ్యం అయింది.

ఇకపోతే ప్లూటోగ్రహం వక్రస్తితిలో ఉంటూ, గెలాక్టిక్ సెంటర్ కు దగ్గరలో ఉండటం చూస్తె ఒక విషయం స్ఫురిస్తుంది. ప్లూటో గ్రహం అతీతశక్తులకూ అతీంద్రియ స్ఫురణలకూ సూచకుడు. అందుకే ఈ మధ్యన కొత్తకొత్త గ్రహాలూ కనుక్కున్నామనీ, కొత్త గెలాక్సీలు బయట పడ్డాయనీ ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. దైవకణం కనుక్కోవడం అంటే సృష్టికి మూలం అనేది దగ్గరగా తెలియడమే. మూలానక్షత్ర ప్రాంతంలోనే విష్ణునాభి అనే కాస్మిక్ శక్తికేంద్రం  ఉంటుందని మనకు తెలుసు. అందులోనుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ ఉదయించాడు. ఆ ప్రాంతంలో అతీంద్రియ అనుభవాలకూ శక్తులకూ సూచిక అయిన ప్లూటో  గ్రహం సంచరిస్తూ ఉన్నపుడు ఈ దైవకణం గురించి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న మనుషులకు తెలియడం కాకతాళీయం ఎలా అవుతుంది? కాదని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక రాహుకేతువులను పరిశీలిస్తే, ఇంకొక రహస్యం స్ఫురిస్తుంది. రాహుకేతువులు ప్రస్తుతం నీచలో ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో అనేక మార్పులు తప్పక వస్తాయి అనేది చాలాసార్లు రుజువైంది. రాహుకేతువులు నీచలో ఉండగా పుట్టిన జాతకాలు కూడా ప్రత్యేకమైనవే. వీరి ప్రమేయం లేకుండానే వీరికి కొన్ని అతీంద్రియ అనుభవాలు కలుగుతూ ఉంటాయి.అయితే వీరికి కర్మబందాలు ఎక్కువగా ఉంటాయి.వృశ్చికరాశి విశ్వకుండలినికి స్థానం కనుక ఆ స్థానంలో రాహువు ఉన్నప్పుడు విశ్వకుండలినిలో చలనం ఉంటుంది. అందుకే విశ్వమేధస్సు అనబడే మేరుపర్వతం రాహుకేతువులనే తాడుచేత చిలకబడి క్షీరసాగరమధనం జరిగినట్లు జరిగి అందులోనుంచి ఎన్నో విలువైన మణులు పుట్టుకొస్తాయి. అలాంటి మణులలో ఒకటే ప్రస్తుత హిగ్స్ బోసాన్ అనబడే దైవకణం ఆవిష్కరణ. కానీ సాగరమధనంలో హాలాహలం కూడా పుట్టింది. ఆ హాలాహలం ఏమిటి? ఎప్పుడు పుడుతుంది? ఆ విషయాలు ముందు ముందు చూద్దాం. 

ప్రస్తుతానికి ఈసందర్భంగా ఒక కొత్త విషయం స్ఫురిస్తుంది. సుదూరగ్రహాలైన యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలకు మనకు తెలిసి ఏ దృష్టులూ లేవు. కాని పై చక్రం పరిశీలిస్తే కొన్ని విషయాలు స్ఫురిస్తాయి. యురేనస్ కు ఖచ్చితంగా పంచమ దృష్టి ఉన్నది. లేకుంటే అది బుధుడిని డిగ్రీ దృష్టితో చూడలేదు. దీనికి ఇంకొక దృష్టి కూడా ఉండి ఉండాలి. గురువుకు ఉన్నట్లే అది నవమ దృష్టా? అదే అయితే రాహువును తన నవమ దృష్టితో చూస్తూ ఉండాలి. కాని ఇది ఖచ్చితమైన దృష్టి కాదు. ఇకపోతే దశమ దృష్టి అయితే, యురేనస్ ప్లూటో ను ఖచ్చితమైన దృష్టితో చూస్తుంది. కనుక యురేనస్ కు పంచమ దశమ దృష్టులు ఉండి ఉండాలి. అలాగే ప్లూటోకు కుజునికి ఉన్నట్లు చతుర్ధ అష్టమ ప్రత్యెక దృష్టులు ఉండి ఉండాలి. అప్పుడే ప్లూటో యురేనస్ నూ, బుదుడినీ వీక్షించగలుగుతాడు. ఈ ప్రత్యెక దృష్టులు ఈ గ్రహాలకు ఉన్నాయా లేవా అనే విషయం ఒక 50 జాతకాల మీద పరీక్షించి చూస్తె అర్ధం చేసుకోవచ్చు.

రాహుకేతువులు నీచలో ఉండటం, ప్లూటో విష్ణునాభికి దగ్గరగా ఉండటం జరుగుతున్న ఈ సమయంలోనే ఇతర గ్రహాలగురించి తెలియడం ఇతర గెలాక్సీల గురించి తెలియడం సృష్టి మూలకణాల గురించి తెలియడం జరుగుతోంది. అంటే ఒకరకంగా విశ్వరూపసందర్శనం జరుగుతోంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని యుద్ధం ముందే ప్రదర్శించాడు. మళ్లీ ఒకసారి కురుక్షేత్రయుద్ధం మధ్యలో ప్రదర్శించాడు. కనుక ప్రస్తుత విశ్వరూపదర్శనం తర్వాత కూడా ఒక యుద్ధం రాబోతున్నదా? లేకపోతే త్వరలోనే ఒక మినీ ప్రళయం రాబోతున్నదా? సమాజంలో గతి తప్పిన ధర్మమూ, మితిమీరిన స్వార్ధమూ దీనినే సూచిస్తున్నాయా? ప్రకృతి అనేది సమాజానికి గట్టిగా  బుద్ధిచెప్పే సంఘటనలు త్వరలో జరుగనున్నాయా?     

తాంత్రికజ్యోతిష్యం లో ధనుస్సునుంచి మీనం వరకూ ఉన్న రాశులను "లయఖండం" అంటారు. అంటే ఈ నాలుగురాశులూ నాశనాన్ని సూచిస్తాయి. ప్లూటో సృష్టికి మూలం అయిన ధనుస్సులో ఉన్నాడు. యురేనస్ సృష్టికి అంతం అయిన మీనంలో ఉన్నాడు. యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలు ముగ్గురూ లయఖండంలోనే ఉన్నారు. ఈ అమరిక ఏదో ఉత్పాతాన్నే సూచిస్తోంది. ఆ ఉత్పాతం ఏమిటి? ఈ మూడుగ్రహాలూ  భూమికి అతి దూరంలో ఉన్నాయి. కనుక విశ్వాంతరాళంలో సుదూరతీరాల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల భూమికి ఉత్పాతాలు పొంచి ఉన్నాయని ఇది సూచనా? చూద్దాం కొన్ని నెలలు ఆగితే అన్నీ తెలుస్తాయిగా. తొందరెందుకు.
read more " హిగ్స్ బోసాన్ కణావిష్కరణ - జ్యోతిష్య కోణాలు "

5, జులై 2012, గురువారం

ఇదా మానవత్వం?

నిన్న గాక మొన్న జరిగిన ఒక సంఘటన చూచాక మనుషుల మీద నమ్మకం నాకు పూర్తిగా నశించింది. మనుషుల్లో పచ్చి స్వార్ధం తప్ప ఇంకేమీ లేదనీ, మన బ్రతుకులన్నీ దొంగ బ్రతుకులేననీ, మనుషుల్లో మనుషులు లేరనీ ఉన్నవి జంతువులేననీ పూర్తిగా అర్ధం అయింది.

మొన్న గుంటూరులో ఒక వ్యానూ ఒక టూవీలరూ గుద్దుకుని, ఆ వ్యాను టూవీలర్ నడుపుతున్న వ్యక్తీ కాళ్ళ మీదుగా ఎక్కింది. అతనికి రెండు కాళ్ళూ నుజ్జు అయిపోయాయి. కుయ్యో మొర్రో అని ఏడుస్తూ రోడ్డు మీద పడి రక్షించమని అందరినీ ప్రాధేయపడుతుంటే, రోడ్డున పోతున్న వారుగాని, ఆటోలవాళ్ళు గాని, కార్లవాళ్ళు గాని ఎవరూ ఒక్కరుకూడా అతనికి సాయం చెయ్యలేదు. అతను అరిచీ అరిచీ రోడ్డుమీదే ప్రాణం కోల్పోయాడు. దీనిలో హైలైట్ ఏమిటంటే ఇది జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఒక టీవీ చానల్ వారు, అతని అరుపులు ఏడుపులు చక్కగా షూట్ చేస్తూ అతని ప్రాణం పోవడం కూడా స్టేజి బై స్టేజి ఎలా పోతోందో క్లియర్ గా బ్రాడ్ కేస్ట్ చేశారు. అతన్ని రక్షించి వెంటనే ఒక ఆస్పత్రి లో చేరుద్దామని మాత్రం ఒక్కరూ ప్రయత్నం చెయ్యలేదు.ప్రతివారూ ఒక్క చూపు చూచి తమదారిన తాము పోతున్నారు.

పాతకాలంలో అయితే పరిస్తితి ఇలా ఉండేది కాదు. వెంటనే ఎవరో ఒకరు స్పందించి సాయం చేసి ఉండేవారు. కాని ఇప్పుడు ప్రతివారిలోనూ స్వార్ధం విశ్వరూపం దాల్చింది. ఈ పని చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. అందుకే  కుటుంబసభ్యుల మధ్యన కూడా ఆర్ధికవ్యాపారమే తప్ప ప్రేమవ్యవహారం ఉండటం లేదు."లోకంలో ఉన్నవి ఆర్ధికపరమైన  సంబంధాలు మాత్రమే"అని మార్క్స్ అన్నది నిజమేనేమో అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తుంది. ప్రస్తుత సమాజంలో అన్ని బ్రతుకులూ నాటకపు బ్రతుకులుగా తయారయ్యాయి. ఎంగిలి చేత్తో కాకిని విదిలించడు అనీ, పిల్లికి బిచ్చం పెట్టడు అనీ, విరిగిన వేలిమీద ఒంటెలు కూడా పొయ్యడు అనీ పల్లెటూర్లలో సామెతలు ఉండేవి.ఇప్పుడు నిత్యజీవితంలోనే అవి ప్రతిరోజూ కనిపిస్తున్నాయి.ఒకవైపు భక్తి కూడా ఎక్కడచూచినా వికృతనృత్యం చేస్తున్నది. ప్రతి ఊళ్లోనూ గుళ్ళూ గోపురాలూ కిటకిటలాడుతున్నాయి. అది భక్తి కాదు, భయం అని నా అవగాహన చెబుతోంది. మనుషులలో స్వార్ధం మితిమీరినప్పుడు భయం కూడా ఎక్కువ అవుతుంది. తాము చేస్తున్నది తప్పని తమ అంతరాంతరాలలో తెలుసు కాబట్టి భయంతో గుడికెళ్ళి దేవుడికి లంచం ఇద్దామని ప్రయత్నం చేస్తాడు మానవుడు. దానిని భక్తిగా భ్రమిస్తాడు.తన కళ్ళు తాను పొడుచుకుని దేవుడి కళ్ళు కూడా పొడవడమే నేటి భక్తికి నిర్వచనం. భక్తిగా మనకు కనిపించేది నిజానికి మితిమీరిన స్వార్ధమూ భయమూ మాత్రమే.

మానవత్వం లేనివాడికి దైవత్వం అనేది ఎన్ని జన్మలెత్తినా దొరకదు అని నేనెప్పుడూ చెబుతాను. స్వార్ధం వికృతరూపం దాలుస్తున్న నేటి సమాజంలో మానవత్వమే మృగ్యం అవుతుంటే ఇక దైవత్వం అనేది మానవుల ఊహకు కూడా అందదు అనేది నగ్నసత్యం. సాటిమనిషిలో దేవుని చూడమని వివేకానందస్వామి చెప్పాడు. కనీసం మనిషిని మనిషిగా చూడటం కూడా మనకు సాధ్యం కావడం లేదు. ఒక వస్తువుకంటే హీనంగా ఎదుటి మనిషిని చూస్తున్నాం. నేటి సమాజంలోని మానవమృగాలకు ఎప్పటికైనా నిష్కృతి అనేది ఉంటుందా అని నా అనుమానం.  

మన చుట్టూ మనుషులు లేరని, మనిషి తోలు కప్పుకుని పులులూ తోడేళ్ళూ నక్కలూ కుక్కలూ పాములూ ఎలుగుబంట్లూ తిరుగుతున్నాయని నేను ఎప్పుడూ అనుకుంటాను. అది నిజమే అని ప్రతిరోజూ నిర్ధారణ అవుతోంది.

భగవంతుడు ఎంత ఉన్నతమైన భావనతో మనిషిని సృష్టించాడు? చివరికి మనిషి ఎలా తయారయ్యాడు? ఏదన్నా ప్రళయం వచ్చి ఈ ప్రపంచం  అంతా త్వరగా సర్వనాశనం అయి, కొద్దిమంది మంచివాళ్ళు మాత్రమె మిగిలితే ఎంత బాగుంటుంది అని ఈ మధ్యన నాకు తరచుగా అనిపిస్తోంది.
read more " ఇదా మానవత్వం? "

2, జులై 2012, సోమవారం

గురుపూర్ణిమ (గుండెధైర్యం లేనివాళ్ళు చదవొద్దు)

ఈరోజు ఉదయమే కొంతమంది నా దగ్గరకొచ్చి గురుపూర్ణిమ చందా అడిగారు. "సరే దాందేముంది ఇస్తాలేగాని దానితో ఏం చేస్తారు?" అని అడిగాను. సాయిబాబా గుళ్ళో ప్రత్యెకపూజ చేయిస్తామని చెప్పారు. "మామూలు పూజే వేస్ట్ అని నేననుకుంటుంటే ప్రత్యేకపూజ కూడానా?" అన్నాను. ఇంకొకసారి నా దగ్గరకొచ్చి ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. పరిస్తితి తేడాగా ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపాను. 

గురుపూర్ణిమ అంటూ రకరకాల గుళ్ళలోనూ, గురువుల సమక్షంలోనూ  చేసే తంతులన్నీ శుద్ధ పనికిమాలిన పనులు. ఈరోజుల్లో కులానికొక గురువు, వర్గానికొక గురువు, పనులు కావడానికొక గురువూ, పాస్ పోర్ట్ త్వరగా రావడానికొక గురువూ, గర్ల్ ఫ్రెండ్ త్వరగా కరుణించడానికొక గురువూ ఇలా వీధికొకరు, పనికొకరు, పనికిమాలిన గురువులు బ్రోకర్లలా  తయారయ్యారు. వీళ్ళందరూ అసలు "గురువు" అన్న పదానికి అర్హులేనా అని నాకు ఎప్పటినుంచో పెద్ద అనుమానం.

"అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిదీయతే" అంటూ అంధకారాన్ని తొలగించేవాడే గురువు అని శాస్త్రం చెబుతోంది. మరి ఇన్నేళ్ళ నుంచీ చేస్తున్న ఈ గురుపూజలవల్ల ఎవరికి ఏ అంధకారం ఎలా తోలిగిందో నాకైతే అర్ధం కాదు. నేను ఇన్నేళ్ళలో కొన్ని వందలమందిని క్లోజ్ గా గమనించాను.  గురుపూజా మహోత్సవాలు అని జరుపుకునే ప్రహసనాలు చాలా చూచాను. నాకు తెలిసి ఈ పూజలు చేస్తున్న ఎవరిలోనూ ఏ అందకారమూ తొలగలేదు. అహంకారరూపంలో ఇంకా బాగా దట్టంగా పట్టుకుంది. 

సమస్తలోకాలకూ ఆదిగురువు పరమశివుడు ఈ రోజున ఎవరికీ గుర్తురాడు. చిన్ముద్రాలంకృతుడై మౌనంగా అత్యుత్తమ జ్ఞానప్రసారం చేసి అనవసరపు  శాస్త్రజ్ఞానపు బరువుతో ముసలివగ్గులై పోయిన శిష్యులకు ఆత్మానుభవజ్ఞానాన్ని ప్రసాదించిన దక్షిణామూర్తి ఎవరికీ గుర్తురాడు. అనంతమైన వేదరాశిని ఆమూలాగ్రం అవగతం చేసుకొని దానిని ఋగ్యజుస్సామాధర్వణ భాగాలుగా విభజన చేసి పద్దెనిమిది పురాణాలనూ, ఉపపురాణాలనూ రచించి భరతజాతికి ఒక సంస్కృతిని ఇచ్చి ప్రాణంపోసిన వేదవ్యాసమహర్షి ఎవరికీ గుర్తురాడు.బ్రహ్మమానసపుత్రులై జన్మించి సంసారాన్ని తిరస్కరించి నిత్యమూ బ్రహ్మానుభూతిలో విరాజిల్లుతూ అయిదేళ్ళ పసిబాలురవలె వెలిగే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనబడే  జ్ఞానమూర్తులు ఎవరికీ గుర్తురారు. త్రిమూర్తుల ఔన్నత్యాన్నే పరీక్షించిన తపశ్శాలి భ్రుగుమహర్షి ఎవరికీ గుర్తురాడు.అరవైవేలమంది క్షత్రియయోధులను ఒక్క చూపుతో భస్మం చేసిన కపిలమహర్షి ఎవరికీ గుర్తురాడు. నిరంతర నారాయణనామస్మరణతో తన్మయుడై వైకుంఠానికి ఎప్పుడు బడితే అప్పుడు వెళ్లి రాగలిగిన మహాగురువు దేవరుషి నారదుడు ఎవరికీ గుర్తుకు రాడు. ఒకవేళ వచ్చినా మన దరిద్రపుకధలు సిగ్గులేని సినిమాల పుణ్యమా అని ఒక కమెడియన్ గా, ఒక తంపులమారిగా గుర్తొస్తాడు. కనీసం ద్వైతాద్వైత విశిష్టాద్వైత మత ప్రవర్తకులైన మధ్వ, శంకర, రామానుజులు కూడా గుర్తురారు. ఇదీ మన పరిస్తితి. 

మన గోత్రఋషులలో ఎవరి చరిత్ర ఏమిటో ఎవరికైనా తెలుసా? వారు ఎంతటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మహర్షులో ఎంతటి తపశ్శక్తి సంపన్నులో ఎంతటి చరితార్ధమైన జీవితాలను గడిపినవారో తెలుసా? మనవలె శిశ్నోదర పరాయణులై నిరర్ధక జీవితాలను గడిపినవారు కారని మనకు తెలుసా? కనీసం వారి మహోన్నత ఆదర్శమయ జీవితాలను తెలుసుకుందామనీ, అనుసరించే ప్రయత్నం చేద్దామనీ మనకు ఎన్నడైనా అనిపిస్తుందా? 

గురుపూర్ణిమ ఎలా చేసుకోవాలో మనకసలు తెలుసా? ఆ అర్హత మనకసలు ఉందా? మనకు తెలిసిందల్లా జనందగ్గర చందాలు వసూలు చేసి, పూజలంటూ ఏవేవో వస్తువులు పోగేసి వాటితో ఏవేవో దండగమారి పూజలు చేసేసి, ఏదన్నా సొమ్ము మిగిలితే దానిని స్వాహా చేసేసి, ఏదో ఘనకార్యం చేసినట్లు పొంగిపోవటమే కాని, భరతజాతికి అసలు గురువులెవరు? వారేమి ఉపదేశించారు? ఎంతటి మహత్తర జ్ఞానసంపదను వారు మనకు అందించారు? అందులో మనకెంత అర్ధం అయింది? దానిని ఎలా ఆచరించాలి? అని ఒక్కసారైనా ఆలోచించిన పాపం చేశామా?

సాయిబాబా అంటే నాకేమీ ద్వేషంలేదు. కాని గురుపూర్ణిమ రోజున సాయిబాబా గుళ్ళలో జరిగే తంతులు చూస్తుంటే నాకు పొట్ట చెక్కలయ్యే నవ్వు వస్తుంది. ఈ మనుషుల మీదా సమాజం మీదా అసహ్యం  తీవ్రస్థాయిలో నాలో పెరిగిపోతుంది. నిత్యజీవితాలలో కుళ్ళూ కుత్సితాలతో పుచ్చిపోయిన దొంగభక్తులందరూ అక్కడ చేరి వారివారి కోరికల చిట్టాలు తెరిచి, తమకు అర్హత ఉందా లేదా అనేదికూడా చూచుకోకుండా, మాకదివ్వు ఇదివ్వు అంటూ ఒకటే ఊదరగొట్టి, నాలుగుడబ్బులు పడేసి, ఏదో ఘనమైన పూజలు ఆయనకు చేసినట్లు ఆత్మవంచన చేసుకుంటూ పొంగిపోతూ బయటకు వస్తుంటారు.సాయిబాబా కనుక జీవంతో ఉంటే, "పొండిరా దొంగల్లారా" అంటూ  తన చేతిలో ఉన్న కమ్చీతో తనకు ఓపిక ఉన్నంతవరకూ వీళ్ళను తరిమితరిమి కొట్టి ఉండేవాడు.

ఒక భక్తురాలు సాయిబాబాకు ఎన్నో ఏళ్లుగా ఎన్నో పూజలు చేసింది. కాని 29 ఏళ్ల ఆమె కూతురు ఈ మధ్యనే అకస్మాత్తుగా చనిపోయింది. "ఇన్నేళ్ళు పూజలు చేసినందుకు ఇదేనా బాబా నాకిచ్చే ప్రతిఫలం?" అంటూ నాతో వాపోయింది. ఎందుకలా చేసాడో బాబానే అడగమని ఆమెకు చెప్పాను. "ఆయన ఏమీ పలకడం లేదని" ఆమె చెప్పింది. "దానికి నేనేం చెయ్యను ఇన్నాళ్ళూ పలికినాయన ఇప్పుడెందుకు పలకడం లేదు?" అని అడిగాను.ఆమెకు బాధ కలిగినా ఇంకొకమాట కూడా అన్నాను. "మీ పూజలు కావాలని ఆయనేమైనా దేబిరించాడా? ఆ పూజలు చేసినందువల్ల మీకాయన బానిసగా ఉంటానని బాండ్ రాసిచ్చాడా?" అని అడిగాను."ఈ పూజల వల్ల ఉపయోగం ఏమిటి?" అని తప్పకుండా ఆమెకు సందేహం వచ్చి ఉంటుంది. ఈ సందేహాన్ని వదలకుండా పట్టుకుంటే అదే ఆమెకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. కాని ఆపని ఆమె చెయ్యలేదు. ఆమే కాదు. కోరికల చిట్టాతో కుళ్ళిపోతున్న మనుషులందరి పరిస్తితీ అంతే.

ఇంకొక భక్తురాలుంది. ఈమె శ్రీ రామకృష్ణుని ముప్ఫైఏళ్ళ పైగానే కొలిచింది. ముప్పై ఏళ్లక్రితం ఈమెకు పెళ్లయింది. అయిదేళ్ళ క్రితం భర్త గతించాడు. మామూలుగా భార్యాభర్తల మధ్యన ప్రేమ గట్టిగా ఉంటే ఇద్దరికీ ఒకేసారి పోవాలని అనిపించడం సహజం. కాని అలా జరగదు కదా. ఇద్దరూ ఒకేసారి పుట్టలేదుగా ఒకేసారి పోవడానికి. ఒకరు ముందూ ఒకరు వెనుకా ఎవరికైనా తప్పదు. కాని ఈ సంఘటనను జీర్ణించుకోలేక తాను ఇన్నేళ్ళుగా పూజిస్తున్న పటాలను తీసి పడేసింది. ఇప్పుడు పూజాలేదు ఏమీ లేదు. ఇన్నేళ్ళ ఆరాధన వల్ల వచ్చిన పరిపక్వత ఇదా అని నాకనిపించింది. అన్నీ మనం అనుకున్నట్లు జరుగుతూ ఎక్కడా కష్టాలూ చావులూ లేకుండా లోకం ఉండాలంటే కుదురుతుందా? మనం చేసే దొంగపూజల వల్ల ఇక ప్రతివాడికీ అన్నీ అనుకున్నట్లు జరిగితే సృష్టి ఎందుకు? 

నాకు తెలిసి ఇంకొక భక్తురాలుంది. ఆమె సాయిబాబా భక్తురాలు కాదు. ఇంకొక మహాగురువును ఆరాదిస్తుంది. ఆమె తల్లిగారు ఒకరోజున దేవునికి హారతి ఇస్తూ ఆ మంట చీరకొంగుకు అంటుకుని గమనించే లోపల వళ్ళంతా కాలిపోయి సజీవదహనం అయి చనిపోయింది. తన తల్లి అలా చనిపోతే ఆ భక్తురాలు ఒక్కమాట అనలేదు. "మన ఖర్మ ఇలా ఉంటే దైవాన్ని నిందించి ఏమి ప్రయోజనం?" అన్నది. ఈ ముగ్గురూ భక్తులే. ముగ్గురికీ పెద్ద నష్టమే వాటిల్లింది. మరి దేవుడిలో తేడా ఉందా? భక్తులలో తేడా ఉందా? భక్తిలో తేడా ఉందా? లేక వీరి కర్మలో తేడా ఉందా?

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఒకరు ఇలా అడిగారు.
"అమ్మా. మన కష్టాలు తీర్చమని భగవంతుని కోరుకోవచ్చా?"
దానికి అమ్మ ఇలా చెప్పారు.
"ఆ. నీవిచ్చిన కష్టాలు నీవే తీసెయ్యమని అడగవచ్చు."

అమ్మ ఇంకా ఇలా అనేవారు. "సుఖాలు భగవత్ప్రసాదం అయితే మరి కష్టాలు ఎవరిస్తున్నారూ?". కష్టాలు కూడా ఆయనే ఇస్తున్నపుడు ఇంక వాటిని తీసెయ్యమని అడగడం ఎందుకు? ఎలా అడగాలి? అలా అడిగితే ఆయన మీద మనకు ప్రేమ లేదనే కదా. నీకన్నా నేనే తెలివైనవాడిని అన్న అహంకారం భగవంతుని దగ్గర ప్రదర్శించినట్లే కదా.

నేటి సమాజంలో ఒక ప్రసిద్ధ గురువుగారున్నారు. పాతకాలంలో ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ఒకసారి ఆయన్ని ఇలా అడిగాను. "మీరు ఏవేవో పూజలూ అవీ చెయ్యమని జనాలకు ఎందుకు పురెక్కిస్తారు? పైగా మీరు చెప్పే ఉపన్యాసాలలో ఏమీ సత్యం ఉన్నట్లు నాకు అనిపించదు. ఉన్న సత్యాన్ని ఉన్నట్లు జనానికి చెప్పవచ్చు కదా" అన్నాను. దానికాయన- "అలా చెప్తే మాదగ్గరకు ఎవరొస్తారు?" అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ మాటతో సత్యం ఆయనకు కూడా అనుభవం కాలేదని నాకు అర్ధమైంది. ఎందుకంటే సత్యసాక్షాత్కారం అయినవాడు, ఒకడు తన దగ్గరికి రాలేదనో, తనకు భజన చెయ్యలేదనో చస్తే అనుకోడు. అలా అనుకుంటున్నాడంటే అతను సత్యానికి ఆమడదూరంలో ఉన్నాడని అర్ధం. ఆరోజు తర్వాత నేనా గురువు దగ్గరకు మళ్ళీ పోలేదు. ఈ సంఘటన జరిగి ఇరవైఏళ్ళు దాటింది.

"గురుతు చెప్పేవాడే గురువు" అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు. గురువు చెప్పిన గురుతును మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే ఆ ఉపదేశాన్ని మన జీవితంలో శ్రద్ధగా ఆచరించాలి. అది చెయ్యకుండా, ఆయనకు గ్రానైట్ విగ్రహం చేయించి, ఒక బంగారుకిరీటం పెట్టించి, ఏడాదికొకసారి ఊరేగిస్తే దానివల్ల ఏమిటి ఉపయోగం? ఆ గురువు ఆత్మ క్షోభించడం తప్ప? "గురువు శిష్యుడన్న గుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినుర వేమా" అని వేమనయోగి మొత్తుకున్నాడు. ఆయన చెప్పినదానిలో కనపడని లోతైన అర్ధం ఉంది. గుడ్డిగా గురువు చెప్పినది నమ్మి ఆచరిస్తే అదే మనల్ని మహోత్తమస్థాయికి తీసుకెళుతుంది. ఆ ఆచరణే నేడు కరువైంది. ఒక రాయిని నమ్మినా, మన నమ్మకంలో లోపం లేకుంటే అదే మనకు మోక్షాన్నిస్తుంది. ఏకలవ్యుడికి,తిన్నడికీ,వాల్మీకికీ జరిగింది అదేకదా. అటువంటి తదేకదీక్షా, భక్తీ మనకు ఉండాలి.

"చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుమ్భినీధవు  జెప్పెడి గురుడు గురుడు"- అంటాడు ప్రహ్లాదుడు. దైవాన్ని చేరే మార్గం చూపేదే నిజమైన చదువు. అక్కడకు ఎలా చేరాలో ప్రాక్టికల్ గా చూపించేవాడే అసలైన గురువు. అంతేగాని ఫీజులు కట్టించుకొని పాదపూజలు చేయించుకునేవారు , షాపులు ఓపెన్ చెయ్యడానికి డబ్బులు తీసుకొని విచ్చేసే గురువులూ గురువులు కారు. వారు శిష్యుల విత్తాపహారులే గాని, చిత్తాపహారులూ కారు, చిత్త తాపహారులు అసలే కాలేరు. ఆత్మవిద్యను ఆమూలాగ్రం బోధించలేక ఏవేవో కాకమ్మకబుర్లు చెబుతూ శిష్యులను అంధకారంలో ఇంకా పడదోశేవారు "గురువు" అన్న పదానికి అనర్హులు.అలాంటి గురువులు చెప్పేది విద్య కాదు. మిధ్య. అలాంటి గురువులు మరణించిన తర్వాత నరకంలో ఎలాంటి బాధలు పడతారో ఒక నిజమైన సన్యాసి ఒకసారి చెప్పి బాధపడ్డారు. గడ్డాలు పెంచి రంగుబట్టలు వేసుకున్నంత మాత్రాన ఎవరూ గురువులు కాలేరు.

నలభై ఏభై ఏళ్ళక్రితం ఒక సంఘటన జరిగింది. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారు మద్రాసు వెళ్లారు.అక్కడ ఒక భక్తురాలి ఇంటిలో ఉన్నప్పుడు సినిమానటి సావిత్రి అమ్మ దర్శనానికి వచ్చింది. దర్శనం అయ్యిన తర్వాత వెళుతూ వెళుతూ, "అమ్మా. మా ఇంటికి కూడా ఒకసారి మీరు రావాలి" అని అడిగింది. అమ్మ మౌనంగా ఉంది. సావిత్రి ఏమనుకుందో ఏమో, "అలా రావడానికి మీరేం తీసుకుంటారమ్మా?" అనింది. ఆమెవైపు చూచి చిరునవ్వు నవ్విన అమ్మ, "నేను ఇచ్చే అమ్మనే గాని తీసుకునే అమ్మను కానమ్మా" అని జవాబు చెప్పింది. అదీ దైవత్వం అంటే. పాపం సావిత్రి తప్పుకూడా ఏమీ లేదు. ఆమెకు అప్పటివరకూ తారసపడిన గురువులూ బాబాలూ అందరూ ఇంకా ఇమ్మని అడిగి మరీ తీసుకున్నవారె గాని ఇస్తామంటే వద్దన్నవారు ఒక్కరూ లేరు. అందుకే ఆమె తెలీక అలా మాట్లాడింది.

నూట ఏభై ఏళ్ళ క్రితం శ్రీ రామకృష్ణులకు లక్ష్మీనారాయణ మార్వాడీ అని ఒక సంపన్న భక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆ భక్తుడు పదివేల బంగారు నాణేలను శ్రీ రామకృష్ణునికి కానుకగా ఇవ్వబోతాడు. "అలాంటి సంకల్పాలు పెట్టుకుంటే ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు" అని రామకృష్ణులు గట్టిగా చీవాట్లు పెట్టి పంపిస్తారు. అది నిజమైన దైవత్వం అంటే. ఆరోజుల్లో పదివేల బంగారు నాణేలు అంటే ఈరోజుల్లో ఎంతో మనం ఊహించుకోవచ్చు.

లోకం అంతా నకిలీగురువులతో నిండి ఉంది. ఎక్కడో కొన్ని ఆశ్రమాలు,కొందరు స్వాములూ తప్ప, మిగతా అన్ని చోట్లా ధనమూ అసత్యమూ కలిసి అసహ్యపు రికార్డింగ్ డాన్స్లు చేస్తున్నాయి.ఆశ్రమాలు వ్యాపారకేంద్రాలయ్యాయి. స్వాములు అసలైన వేదాంతాన్ని ఎక్కడా చెప్పడం లేదు. అలాంటి దొంగస్వాములను నమ్మిన జనం కొన్నేళ్ళకు తమ తప్పు తెలుసుకొనికూడా ఆ విషవలయం నుంచి బయట పడలేక కన్నంలో దొంగల్లా కిక్కురుమనకుండా జీవితాలు సాగిస్తున్నారు.స్వార్ధంతో నిండిపోయిన జనంకూడా తమతమ లౌకికపనులు అవుతాయి అనుకున్న గురువులు దేవుళ్ళ దగ్గరకే ఎగబడుతూ ఉన్నారుగాని సత్యాన్ని సూటిగా బోధించే గురువులు ఎవరికీ అవసరం లేదు. "హంసలు హంసలగుంపులో కలుస్త్తాయి. కాకులు కాకులగుంపులో కలుస్తాయి" అని ఊరకే అనలేదు. 

"యదా పత్నీ తదా పతి:  యదా శిష్యా తదా గురు:" భార్యకు తగిన భర్తలూ,శిష్యులకు తగిన గురువులూ కర్మానుసారంగా ఎవరికివారు దొరుకుతారు. చలంగారు ఒక మంచిమాట చాలాసార్లు అనేవారు. "ప్రతివాడూ తనకు సీతాదేవిలాంటి పతివ్రత భార్యగా కావాలని అనుకుంటాడు. కాని తాను శ్రీరామచంద్రుడేనా అన్నది మాత్రం ఎవడూ చూచుకోడు." అలాగే ప్రతివాడూ తనకు రామకృషుని వంటి గురువు కావాలని అనుకుంటాడు. అలా ఆశించడంలో తప్పులేదు. కాని తనకు వివేకానందునికున్న లక్షణాలు ఉన్నాయా లేవా అని మాత్రం ఎవడూ ఆలోచించడు. ఇదీ విచిత్రం.

సత్యాన్ని సూటిగా బోధించని గురువులు వేశ్యలవంటి వారు. వేశ్యకు ప్రేమ ఎలా ఉంటుంది? దాని దృష్టి అంతా విటుడు తెచ్చే దనం మీద ఉంటుంది. అలాగే నకిలీ గురువుల దృష్టికూడా, శిష్యుని సామాజిక స్థాయి మీదో, అతని పదవి మీదో, అతని వద్ద ఉన్న ఆస్తిమీదో ఉంటుంది. అలాగే ఈ శిష్యులకు కూడా ఆ గురువు వల్ల ఒనగూడే హై లెవల్ పరిచయాలు, ప్రయోజనాల  మీదే దృష్టి ఉంటుంది. ఇద్దరికీ దైవంతో మాత్రం పని ఉండదు. కనుక చివరికి ఇదొక అసహ్యకరమైన అక్రమసంబంధంగా మారుతుంది. ఒక విటునికి స్వచ్చమైన ప్రియురాలు ఎలా దొరుకుతుంది? అతనికి వెలయాలే దొరుకుతుంది. అలాగే, నకిలీ శిష్యులకు స్వచ్చమైన సద్గురువులు ఎలా దొరుకుతారు? వారికి తగిన గురువులే వారికి దొరుకుతారు.

రమణ మహర్షిని ఒకతను చాలా రోజులనుంచీ "మాయ అంటే ఏమిటి?" అని అడుగుతూ ఉండేవాడు. మహర్షి ఏమీ చెప్పేవారు కాదు. మౌనంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజున రాష్ట్రపతిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ మహర్షి దర్శనార్ధమై వచ్చారు.ఆశ్రమవాసులందరూ హడావుడి చేసారు. మహర్షి ముఖంలో మాత్రం ఏ మార్పూ లేదు. ఒక సామాన్యుడు వస్తే ఎలా  ఉన్నాడో రాష్ట్రపతి వచ్చినా అలాగే ఉన్నాడు. రాజేంద్రప్రసాద్ గారు మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు. దర్శనం అయిపోయాక రాష్ట్రపతి వెళ్ళేటప్పుడు అందరూ ఆయనకు సెండాఫ్ ఇవ్వడానికి పోలోమంటూ పరిగెత్తి పోయారు. మహర్షి దగ్గర ఎవరూ లేరు. ఈ సందేహం అడిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అప్పుడు మహర్షి అతనితో " మాయ అంటే ఇదే " అని ఒక్కమాట మాత్రం చెప్పారు. వారు అసలైన గురువులు.

వివేకానందుడు ఎంతో మందిని " మీరు దేవుని చూచారా?" అని అడిగాడు. ఎవరూ ఆయనకు సూటిగా జవాబు చెప్పలేదు. ఒక్క శ్రీరామకృష్ణుడు మాత్రం " చూచాను. చూస్తున్నాను. నీకూ చూపగలను" అన్నాడు. అలా అంటూనే  నరేంద్రుని హృదయస్థానంలో చిన్నగా స్పర్శించి సమాధి స్తితిని, దైవానుభవాన్నీ ఒక్క క్షణంలో ప్రసాదించాడు. నరేంద్రుడు ఆ అనుభవం పొందిన తర్వాత "మీరు దేవుణ్ణి చూచారా?" అని ఇంకెవరినీ అడగలేదు. వారు నిజమైన గురువులు.

అలాంటి గురువులు చెప్పినదేమిటో మనం అర్ధం చేసుకోవాలి. దానిని జీవితంలో ఆచరించాలి. అనుభవాన్ని పొందాలి. అంతేగాని, మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వాటితో ప్రత్యేకపూజలూ నా బొందపూజలూ చేయ్యడం వల్లనో గుళ్ళూ గోపురాలూ కట్టించి ఏడాదికోకసారి దేవుడికి పెళ్లి చేసి (వీలైతే ఆంజనేయుడూ వినాయకుడూ కుమారస్వామీ వంటి బ్రహ్మచారులకు కూడా రెండు పెళ్ళిళ్ళు చేసి) ఉత్సవాలు చేసినంత మాత్రానో ఏమీ ప్రయోజనం లేదు. మనుషుల జీవితాలలో మార్పు రావాలి. వ్యక్తిత్వాలు ఉన్నతంగా ఎదగాలి. మనుషులలో దైవత్వం నిండాలి. బోధలు మాటలలో కాదు చేతలలో ప్రతిఫలించాలి. ఆచరణలు నిత్యజీవితంలో నిరూపింపబడాలి. అప్పుడే గురువులైనవారు సంతోషిస్తారు. వారు సంతోషించినప్పుడే నిజమైన గురుపూర్ణిమ. దైవం కూడా అప్పుడే సంతోషిస్తుంది.

"ఈయన నా గురువు" అని మనం డప్పు వాయించుకోవడం కాదు. "వీడు నా ప్రియశిష్యుడు" అని ఒక సద్గురువు తన నోటితో చెప్పినప్పుడే మనకు నిజమైన ఘనత. అదే నిజమైన గురుపూర్ణిమ. ఎందుకంటే అప్పుడే మనం గురువు యొక్క ఆకాంక్షను పూర్తి చేసినవారం అవుతాము. ఏ గురువైనా తన శిష్యుడు దైవానుభూతిని పొందాలనే కోరుకుంటాడు. తనను మించి తన శిష్యుడు ఎదగాలని కోరుకుంటాడు. శిష్యుడు అలా ఎదిగినప్పుడే ఆ గురువుకు పూర్ణిమ. అదే నిజమైన గురుపూర్ణిమ. అంతేగాని మనం ఇచ్చే బోడి బహుమతులూ, చేసే దొంగపూజలూ, మన బ్లాక్ మనీ తో చేయించే బంగారుకిరీటాలూ, మన సొల్లు పొగడ్తలూ, చొంగ కార్చే నంగివేషాలూ, ఏ సద్గురువూ ఆశించడు. మన పొగడ్తలు వారికి అగడ్తలుగా తెగడ్తలుగా కనిపిస్తాయి. ఒకవేళ వాటిని ఆశిస్తే అతను సద్గురువే కాదు, మామూలు "గురువు" అన్న పదానికి కూడా అతను అర్హుడు కాదు.

గురువుకు ఉండవలసిన లక్షణాలను ఉపనిషత్తులు వివరించాయి.గురువు అనేవాడు శ్రోత్రియుడూ బ్రహ్మనిష్ఠ కలిగినవాడూ అయి ఉండాలి అని పిండితార్ధంగా అవి ఘోషించాయి. అంటే వేదములకు సరియైన అర్ధం తెలిసినవాడూ ఆ తెలిసినదానిని ఆచరణలో పెట్టగలిగినవాడూ అయి ఉండాలి అని అర్ధం. అంతేగాక అతడు కరుణా హృదయుడూ, విశాల భావాలు కలిగిన వాడూ అయిఉండాలి. ముండకోపనిషత్ అయినా వివేకచూడామణి అయినా ఇదే చెప్పాయి. 

మరి శిష్యునికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి కదా. అవేమిటి? సంసారం అంటే విరక్తి కలిగి దానిని ఎలాగైనా దాటాలి, తానెవరో దైవమేవరో తెలుసుకోవాలి అన్న బలమైన తపన శిష్యునకు ఉండాల్సిన ముఖ్యమైన అర్హత.అది అతని జీవితంలో మొదటి priority అయి ఉండాలి. ఏమీ తోచనప్పుడు కలిగే last priority కాకూడదు. దానికోసం అతడు ఏమైనా చెయ్యడానికి తయారుగా ఉండాలి. దారి చూపగల గురువుకోసం అవసరమైతే భూగోళం అవతలి అంచుకు కూడా వెళ్లి వెదకగల తపన ఉండాలి.ఆ దారి దొరికెంత వరకూ తిండి సహించక నిద్రపట్టక చికాకుతో అసహనంతో వేగిపోయే స్త్తితిలో శిష్యుడు ఉండాలి. ఆ తపన ముందు కుటుంబసభ్యులూ బందుత్వాలూ స్నేహాలూ అన్నీ గడ్డిపోచలలాగా కనిపించాలి. "నన్ను నేనెలా తెలుసుకోవాలి? దైవాన్ని ఎలా తెలుసుకోవాలి?" అన్న తపనే అతని జీవితంలో ప్రప్రధమస్థానాన్ని ఆక్రమించాలి. అది అతనికి నిద్రపట్టకుండా చెయ్యాలి. ఊపిరాడకుండా చెయ్యాలి. ప్రాణం పోతుందేమో అన్నంత తపనతో అతను వేగిపోవాలి. దానికోసం జీవితంలో అతడు ఇంక దేనినైనా వదులుకోగలిగే స్తితికి రావాలి. నిజమైన శిష్యునికి అలాంటి తపన ఉండాలి.

అటువంటి శక్తివంతుడూ కరుణాసముద్రుడూ అయిన గురువూ, ఇటువంటి నిరంతర తీవ్రతపన కలిగిన శిష్యుడూ ఒకచోట కలిసినపుడు అద్భుతాలు జరుగుతాయి. కానీ అలాంటివాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడో తప్ప ఉండరు కనుక మామూలుగా గురువూ శిష్యులూ అనుకునేవారిలో అలాంటి అద్భుతాలు ఏవీ జరగవు.ఎందుకంటే శిష్యునికి అలాంటి తపనా ఉండదు. గురువుకు అలాంటి జ్ఞానమూ,శక్తీ,కరుణా ఉండవు. కనుక వారి మధ్యన ఏమీ జరగదు. వ్యాపారాలు మాత్రం బాగా సాగుతూ ఉంటాయి. కాలక్షేపం కబుర్లు మాత్రం జరుగుతూ ఉంటాయి.

ఏ గురువైనా శిష్యునిలో ఆత్మశక్తిని పెంపొందించాలి. తనను తాను  తెలుసుకునే దారి చూపించాలి. అంతేగాని ఎల్లకాలమూ గురువుమీద శిష్యుడు ఆధారపడి ఉండేటట్లు చెయ్యరాదు. అతన్ని తన చుట్టూ తిప్పుకొని తన అవసరాలకు అతన్ని వాడుకోకూడదు. లౌకిక వాసనలు వారిమధ్యన ఏవీ ఉండరాదు. ఇద్దరి ఆలోచనా "దైవానుభూతిని ఎలా పొందాలి" అన్న ఒక్క విషయం చుట్టూనే పరిభ్రమించాలి. భయమూ స్వార్ధమూ అపనమ్మకమూ అనవసర సంభాషణలూ వారిమధ్యన ఉండరాదు. ఒకరికొకరు సైకలాజికల్ బరువు దించుకునే చెత్తబుట్టలు కాకూడదు. అలాంటి గురుశిష్యుల బంధం నిజమైనది. "ఆశ్చర్యో వక్తా కుశలస్యలబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానువిష్ట:" అంటుంది కఠోపనిషత్తు. అలాంటి గురువూ శిష్యుడూ ఇద్దరూ ఆశ్చర్యకరమైనవారే అని అర్ధం. అటువంటివారి మధ్యనే బ్రహ్మానుభూతి అనే అద్భుతం ఆవిష్కరింపబడుతుంది.    

శ్రద్ధ కలిగిన శిష్యుని చూచినపుడు గురువు ఆనందంతో పరవశిస్తాడు. ఎందుకు? అలాంటి స్తితిలో తానూ కొన్నేళ్ళ క్రితం గందరగోళంలో ఉన్నాడు. తనకు దారి సులువుగా దొరికి ఉండవచ్చు లేదా చాలా కష్టం తర్వాత దొరికి ఉండవచ్చు. అలాంటి స్తితిలో ఇంకొక మనిషి ఇప్పుడు తన ఎదురుగా ఉన్నాడు. దారీ తెన్నూ కనపడక తపిస్తున్నాడు. అతనికి ఆ దారి చూపించాలి అని ఉప్పొంగిపోతాడు. వివేకానందుని మొదటిసారి చూచినపుడు శ్రీ రామకృష్ణుని మనసు ప్రపంచాన్ని అధిగమించి సమాధి స్తితిలోకి ఎగసిపోయింది. ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇంత మంచి ఉత్తమలక్షణ సమన్వితుడైన సాధకుడు వచ్చాడు కదా అని ఆనందంతో పరవశించింది. ఒరనుంచి తీసిన ఖడ్గం లాగా వైరాగ్యజ్వాలతో వెలుగుతున్న  నరేంద్రుని తన అక్కున చేర్చుకుంది.

అటువంటి గురువును వెదకి పట్టుకొని ఆ గురువు ఉపదేశించిన సాధనను అచంచలవిశ్వాసంతో, తదేకనిష్టతో, ఆచరించి ఫలితాన్ని పొంది గురువుకు ఆనందాన్ని కలిగించిననాడే నిజమైన గురుపూర్ణిమ. అంతేగాని స్వార్ధంతో కూడిన కోరికలతో జీవంలేని విగ్రహాలకు శవపూజలు చేసినంత మాత్రాన గురుపూర్ణిమ అనిపించుకోదు. అలాంటి పూజల వల్ల ఏ సద్గురువూ సంతోషాన్ని పొందడు.

నిజమైన గురువు మన మనసే. "శుద్ధమనసే అసలైన గురువు" అని శ్రీ రామకృష్ణులు అన్నారు. "మరి గురువును బయట వెదకడం ఎందుకూ?" అంటే "తెలియక" అని జిల్లెళ్ళమూడి అమ్మగారు జవాబు చెప్పారు. తగినంత పరిశుద్ధమైన మనసు మనలో లేదు కనుక బయట ఒక గురువు అవసరం అవుతుంది. దానికి తగినంత పరిపక్వతా శుద్ధతా వచ్చినపుడు అదే గురువు అవుతుంది. "కొన్నేళ్ళ సాధన తర్వాత నీ మనసే నీ గురువౌతుంది." అని బ్రహ్మానంద స్వామి అనేవారు. గురుశక్తీ దైవశక్తీ సాధకుని మనస్సులో ప్రవేశించినపుడు అంతా మనసులోనే అర్ధమౌతుంది.

గురుపూర్ణిమను ఎలా జరుపుకోవాలో ఇక మన ఇష్టం. వేదం సూచించిన మార్గాన్ని అనుసరించాలా లేక మన ఇష్టానుసారం పిచ్చిపనులు చేసుకుంటూ ఇదే సరైన దారి అనుకుంటూ కాలక్షేపం చెయ్యాలా మన ఇష్టం. "యం శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారకాత్ నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం", శాస్త్రం నిర్దేశించిన మార్గాన్ని వదలి తన ఇష్టానుసారం చేసేవాడు ఇహనికీ పరానికీ చెడి, రెంటికిచెడిన రేవడి అవుతాడు అని భగవానుడే గీతలో చెబుతాడు.
read more " గురుపూర్ణిమ (గుండెధైర్యం లేనివాళ్ళు చదవొద్దు) "

29, జూన్ 2012, శుక్రవారం

శని వక్రత్యాగం - ఆశ్చర్యకరఫలితాలు

మీలో ఎవరైనా మొన్న సోమవారం 25-6-2012 తర్వాత ఊహించని మార్పులను మీ జీవితంలో గమనించారా? అవి పెద్దపెద్ద మార్పులు కావచ్చు. లేదా అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు. కానీ ఊహించనివీ అనుకోనివీ కొన్ని నెలలనుంచీ పెండింగ్ లో ఉన్నవీ ఖచ్చితంగా అయి ఉంటాయి. దానికి కారణం ఏమిటో ఊహించారా? ఏదో కాకతాళీయంగా ఇవి జరుగుతున్నాయి అనుకుంటున్నారా? కాదు. దీనికి కారణాలున్నాయి.

నాలుగు నెలలుగా వక్రస్తితిలో (retrograde motion) ఉన్న శని మొన్న సోమవారం (25-6-2012) నాడు తన వక్రగతిని వీడి రుజుగతి(direct movement) లోకి ప్రవేశించాడు. దాని కారణంగా మనుష్యుల జీవితాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చేసుకుంటున్నాయి కూడా. మీమీ జీవితాలు గమనించుకుంటే నేను వ్రాస్తున్న ప్రతి అక్షరమూ సత్యమే అని మీకే తెలుస్తుంది.

ఏఏ మార్పులు మీమీ జీవితాలలో జరుగుతున్నాయో కొంచం వివరిస్తాను. వినండి. ఫిబ్రవరి ఏడో తేదీ ముందు మీ జీవితం ఎలా ఉందొ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మొదలై ఇన్నాళ్ళూ మీ జీవితంలో సాగిన స్తితి ఇప్పుడు రివర్స్ అవుతుంది. అంతకు ముందటి స్తితి మళ్లీ ఇప్పుడు వస్తుంది. 

>>ఫిబ్రవరి తర్వాత మీ జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు ఇప్పుడు హటాత్తుగా నిష్క్రమిస్తారు. లేదా వారితో సంబంధాలు దెబ్బతింటాయి.

>>అనుకోకుండా కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు. లేదా ఇళ్ళు మారతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సడన్ గా కదులుతాయి.  

>> మానసికంగా అనుకొని హటాత్తు మార్పులు కొందరిలో కలుగుతాయి. ఇప్పటివరకూ ఉన్న మూడ్స్ మారిపోయి దానికి పూర్తిగా వ్యతిరేకమైన మూడ్ లోకి వెళతారు. సన్నిహితులతో, అధికారులతో, సహోద్యోగులతో, స్నేహితులతో మాటామాటా పెరిగి గొడవలు అవుతాయి. ఈ వాదనల వెనుక పెద్ద పెద్ద రీజన్స్ ఏమీ ఉండవు. చాలా చిన్న విషయాలమీద ఈ గొడవలు అవుతాయి.

>>ఇప్పటి వరకూ ఒకరికి ఒకరుగా ఉన్నవారిలో కూడా గొడవలు జరిగి ఎడమొహం పెడమొహంగా అవుతారు. ఇప్పటి వరకూ చిన్నచిన్న కారణాలుగా కనిపించినవి ఒక్కసారి పెద్దవిగా కనిపించి మూడ్ ఆఫ్ అవుతుంది.

>>స్తబ్దుగా ఉన్న కొందరి ఉద్యోగ జీవితం ఉన్నట్లుంది చాలా చురుకుగా మారుతుంది. అనుకొని అధికారులతో పరిచయాలు కలుగుతాయి. స్తంభించిన వ్యాపారాలు మళ్లీ చురుకుగా కదులుతాయి.

>> నిత్యజీవితంలో జరుగుతున్న ఒక చిన్న విషయం చెప్తాను. నేను వ్రాసే అనేక విషయాలలాగే ఇదీ వినడానికి వింతగా ఉంటుంది. ఇసుక దొరకక భవన నిర్మాణాలు కొన్ని నేలలుగా మందకొండిగా సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రతిష్టంభన తొలగిపోతుంది. మళ్లీ భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఇది శనీశ్వరుల ప్రభావమే.

>>కొందరికి శని వక్రించినప్పుడు మంచి జరుగుతుంది. అటువంటి వారికి ప్రస్తుతం మళ్లీ చెడుకాలం మొదలౌతుంది. జీవితంలో కోపాలు, చికాకులు, విసుగులు, డిప్రెషన్లు  మొదలౌతాయి. ఇవి వినడానికి విచిత్రంగా ఉంటాయి. కాని మనకు తెలియని శక్తులు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇది గమనిస్తే బాగా అర్ధం అవుతుంది.

>> కొంతమందికి ఎప్పుడో మరచిపోయిన వారితో మళ్లీ సంబంధాలు నేరపాలని బలంగా అనిపిస్తుంది. దూరపు బంధువులు మళ్లీ తారసపడతారు. ఇన్నాళ్ళూ ఫోన్ చెయ్యని వారూ పలకరించని వారూ మళ్లీ పలకరిస్తారు.

>>కొందరు వాతరోగులుంటారు(rheumatic patients). వారికి కొన్ని నెలలుగా వాతనొప్పులు కాస్త ఉపశమనంగా ఉంటాయి. మొన్న సోమవారం నుంచీ అవి మళ్లీ తిరగబెట్టి ఊపందుకుంటాయి. తగ్గిన రోగాలు చాలామందిలో మళ్లీ తిరగబెడతాయి.

>>కొందరు తమతమ వాహనాలకు,వస్తువులకు రిపేర్లు చేయిద్దామని కొన్ని నెలలుగా అనుకుంటూ వాయిదా వేస్తూ ఉంటారు. అవి మొన్న సోమవారం తర్వాత సడన్ గా జరుగుతాయి.


ఇలాంటి విచిత్రాలు మానవ జీవితంలో చాలా జరుగుతాయి. గమనించండి. నేను వ్రాసింది ఎంత నిజమో మీకే తెలుస్తుంది. ఇప్పుడైనా మానవజీవితం మీద గ్రహప్రభావం నిజమేనని నమ్ముతారా? ఇంకా నమ్మకపోతే మీ ఇష్టం. మీరు నమ్మినా నమ్మకున్నా విశ్వశక్తుల చేతిలో మనిషి కీలుబొమ్మ అన్నది అక్షరసత్యం.


చిన్న సూచన:--రాబోయే కొద్దిరోజులలో శనికుజుల కన్జక్షన్ వల్ల  కొంతమంది జీవితంలో వాహనప్రమాదాలు జరుగుతాయి. రక్తదర్శనం , కుట్లు పడటం జరుగుతుంది. గమనించి జాగ్రత్తగా ఉండండి.
read more " శని వక్రత్యాగం - ఆశ్చర్యకరఫలితాలు "

25, జూన్ 2012, సోమవారం

అతీతలోకాలు - అదృశ్యశక్తులు

చాలామంది అతీతలోకాలు లేవని అనుకుంటారు. అదృశ్యశక్తులు కూడా లేవని అనుకుంటారు. అది నిజం కాదు. అవి ఉన్నాయి. మనకు కనిపించనంత మాత్రాన "లేదు" అనుకోవడం వెర్రితనం. రాత్రిళ్ళు మనకు సూర్యుడు కనిపించడు.అంతమాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ఇదీ అంతే. రాత్రి మాత్రమె తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు. కాని పగటిని చూచినవాన్ని అడిగితే సూర్యుడున్నాడు  అని అతను చెప్తాడు. అలాగే, మనకు కనిపిస్తున్నదే సత్యమనీ తక్కినది అబద్దమనీ అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేం. అంతమాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా.

మనిషి ఇంద్రియాలకున్న పరిధి అతి స్వల్పమైనది. మన మెదడులోనూ ఊపిరితిత్తులలోనూ ఉన్న శక్తిలో మనం నిత్యజీవితంలో వాడుకునేది చాలా స్వల్పం. సాధారణ మానవులలో పినియల్ గ్లాండూ, పిట్యూటరీ గ్లాండూ చాలావరకూ నిద్రాణంగా పడి ఉంటాయి.అలాగే మన పొటెన్షియల్ శక్తిలో ఎంతో భాగం నిరుపయోగంగా పడిఉంది. లేదా వృధాగా పోతూ ఉంటుంది. యోగులు ఆ మొత్తాన్నీ నిగ్రహించి దానిని సరియైన వాడుకలోనికి తెస్తారు. అందువల్ల వారి ఇంద్రియాల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. వారి దర్శనశక్తి కూడా అమితంగా వృద్ధి చెంది ఉంటుంది. అందుకే మామూలు మనుషులు చూడలేనివి వారు చూస్తారు. ఇతరులు వినలేనివి వారు వినగలరు. ఆ క్రమంలోనే అతీతలోకాలను వారు చూడగలుగుతారు. అదృశ్య శక్తులతో సంభాషించగలుగుతారు.

మనిషి చూడలేని వేవ్ లెంగ్త్ లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఒక్కొక్కసారి దయ్యాలను చూచి ఏడుస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడ్చిన ప్రతిసారీ అక్కడేదో దయ్యం ఉన్నట్లు అనుకోవడం కూడా తప్పే. దానికి ఆకలేసినా, సీజన్ వచ్చినా కూడా అలాగే ఏడుస్తుంది.  ప్రేతాత్మలను చూచినప్పుడు కుక్క ఏడవటం ఒక తీరులో ఉంటుంది. అనుభవంలో దానిని కనిపెట్టవచ్చు. గబ్బిలాలు సూక్ష్మ తరంగాల ఆధారంగానే దేనికీ తగలకుండా ఎగరగలుగుతాయి. పక్షులు తమలోని అయస్కాంత దిక్సూచి ఆధారంగానే వేలమైళ్ళు ప్రయానంచేసినా మళ్లీ తమ గూటికి చేరుకోగలుగుతాయి. పిల్లులు కూడా మనం చూడలేని వేవ్ లెంగ్త్ లో ఉన్న జీవులను చూడగలవు. పాములు ఈ విషయంలో మరీ శక్తివంతమైన జీవులు. మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కదలికలను అవి గుర్తుపట్టగలవు. కొన్ని దేవతా సర్పాలకైతే అతీత శక్తులు ఉంటాయి. అవి మానవరూపం ధరించగలవు. మానవ భాషలో మాట్లాడగలవు కూడా.

నిద్రాణంగా ఉన్న మన  ఇంద్రియశక్తులను  యోగం ద్వారా నిద్రలేపినపుడు అద్భుతాలు చూడవచ్చు. ఇంతవరకూ మనం చూస్తున్న లోకం వెనుక ఎన్ని లోకాలున్నాయో గమనించవచ్చు. వాటిలో ఎన్నెన్ని జీవులున్నాయో చూడవచ్చు.  వారితో ఇంటరాక్ట్ కావచ్చు. కొందరు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం మనం చూస్తున్న డైమెన్షన్ వెనుక కనీసం ఆరు ఇతర డైమెన్షన్ లు ఉన్నాయి. అంటే మొత్తం ఏడు లోకాలున్నాయి అని అర్ధం. మన ప్రాచీనులు చెప్పిన భువర్లోక సువర్లోకాది సప్త ఊర్ధ్వలోకాలు అవే. వీటికి నెగటివ్ పోల్స్ నే అతల వితలాది సప్త అధోలోకాలు అన్నారు.

ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటాయి. మళ్లీ వీటిలో విభిన్న తరగతుల వాళ్ళు ఉంటారు. మానవలోకంలో అందరూ మానవులే అయినప్పటికీ వాళ్ళలో మళ్లీ తేడాలున్నట్లుగా అక్కడ కూడా ఉంటుంది.వీరిలో కొందరు ఉన్నత స్థాయికి చెందిన జీవులు వారి ఇష్టానుసారం మనకు కనిపించి సూచనలు ఇవ్వగలవు. మన కర్మలో పాలుపంచుకోగలవు. సద్గురువులకు ఈ శక్తి ప్రస్ఫుటంగా ఉంటుంది. తమ శిష్యులను జన్మజన్మాన్తరాలవరకూ వారు గైడ్ చెయ్యగలరు. 

మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, యోగసాధనా బలం తగినంత ఉన్నపుడు, సద్గురువులతో మనం కోరినప్పుడు సంభాషించవచ్చు. ఊర్ధ్వలోకాలలో ఉండే ఉత్తమ జీవులను దేవతలు అంటాము. వారు కాంతి శరీరాలను కలిగి ఉంటారు. అవి రకరకాల రంగులలో ఉంటాయి. ఆయా రంగులు వారి తత్వాన్నీ శక్తులనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవతలనబడే ఈ ఉత్తమ జీవులను చూచి వారితో సంభాశించగలిగే శక్తి కొందరికి ఉంటుంది. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందస్వామికి ఈ శక్తి ఉండేది. ఆయన దేవతలను చూచి వారితో మాట్లాడగలిగేవారు. రాత్రిళ్ళు మూసి ఉన్న ఆయన గదితలుపుల వెనుక నుంచి రకరకాల కాంతులు బయటికి ప్రసరిస్తూ ఉండేవి. ఖాళీగా నిరాడంబరంగా ఉండే ఆయన గదినుంచి రకరకాల వాయిద్యాల ధ్వనులు ఒక్కొక్కసారి బయటికి వినవచ్చేవి. రకరకాల సువాసనలు అకస్మాత్తుగా ఆ గదినుంచి గుప్పుమనేవి.

ఇవన్నీ కూడా వినడానికి "ఫెయిరీ టేల్స్" లా ఉండవచ్చు. కానీ ఆ కధలవేనుక ఉన్న ప్రేరణకూడా కొన్ని వాస్తవాలమీద ఆధారపడినట్టిదే అని మరువరాదు. అతీతలోకాల దర్శనాన్ని పొందినవారు అన్నికాలాలలోనూ అన్నిదేశాలలోనూ ఉన్నారు. వారు చెప్పిన వివరాలనుంచి ఈ కధలు (fairy tales) పుట్టుకొచ్చాయి. అయితే ఈ అతీతశక్తులను పొందటం ఎలా అనేది ఒక సైన్స్ గా క్రోదీకరించబడినది మాత్రం మన దేశంలోనే.మన యోగులు మహర్షులు ఈ సైన్స్ కు సృష్టికర్తలు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉన్న రహస్యవిద్య. అర్హత ఉన్నవారిని ఈ రంగంలో ఇప్పటికీ సద్గురువులు గైడ్ చేస్తూనే ఉంటారు. వారి కమ్యూనికేషన్ విధానాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అదొక రహస్య ప్రపంచం అని చెప్పవచ్చు. బయటి వారికి దీనివివరాలు అస్సలు తెలియవు.

నిత్యజీవితంలో కూడా మనకు కొన్నికొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంచం సెన్సిటివ్ గా ఉన్నవారికి ఇవి అనుభవం లోనే ఉంటాయి. ఉదాహరణకు, ఈరోజు ఒక స్నేహితున్ని చూస్తామేమో అనిపిస్తుంది. అదేరోజు అతను అనుకోకుండా ఊడిపడతాడు. అనుకోకుండా పని పడి వచ్చాను, సరే ఊళ్లోకి వచ్చాను కదాని నిన్ను కలిసిపోదామని వచ్చాను అంటాడు. ఒక ఫోన్ కాల్ వస్తుందని అనిపించిన కొద్ది నిముషాల లోనే ఆ కాల్ రావడం ఎన్నో సార్లు జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదో చెడువార్త వింటాం అనిపిస్తుంది. మధ్యాన్నానికి ఎవరో పోయారనో,లేదా ఇంకేదో అయిందనో వార్త వింటాము. లేదా కలలో ఒక వ్యక్తీ కనపడి మూగగా చూస్తూ మాయం అవుతాడు. తర్వాత కొన్నాళ్ళకు అతను చనిపోయాడని వార్త వింటాము. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనుషుల మధ్య కంటికి కనిపించని బందాలుంటాయి. సరియైన రాపోర్ట్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి జ్వరం వస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఈ స్పందనకు కాలంతో దూరంతో పని ఉండదు. ఇది ఒక మాగ్నెటిక్ రేసోనేన్స్ లాగా పనిచేస్తుంది.

నిత్యజీవితంలో జరిగే ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లల తల్లికి ఇవి బాగా అనుభవంలో ఉంటాయి. బిడ్డకు నలతగా ఉంటే తల్లికి వెంటనే తెలిసిపోతుంది. అలాగే తల్లి తమ మీదనుంచి దృష్టి తిప్పి వేరే విషయం మీద దృష్టి పెడితే బిడ్డ నిద్రపోతున్నా కూడా వెంటనే మేలుకొని ఏడవడం మొదలుపెడుతుంది. అబ్బబ్బ ఒక్క పని కూడా చేసుకోనివ్వడు. ఎటూ కదలనివ్వడు వీడికేలా తెలుస్తుందో అని విసుక్కునే తల్లులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రేసోనేన్స్ వల్లనే జరుగుతాయి. ప్రేమికుల మధ్యన కూడా ఇలాంటి రేసోనేన్స్ ఉంటుంది. ఒకరికి ఏదైనా బాధ కలిగితే వెంటనే రెండో వారికి ఎందుకో తెలీని బాధ కలుగుతుంది. కానీ కారణం మాత్రం వారికి తెలియదు. ఇలాంటి రేసోనేన్స్ అనేది తల్లీ పిల్లలు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, గురుశిష్యులు కావచ్చు వీరిలో ఎవరి మధ్యనైనా ఉండవచ్చు. దీనిలో ముఖ్యంగా ఉండవలసింది ఏకమనస్కత. అంటే ఒకే వేవ్ లెంగ్త్ లో వారిద్దరూ ఉండాలి. అలాంటప్పుడు కాలంతో దూరంతో సంబంధం లేకుండా ఇది ఏర్పడుతుంది. ఇది చాలామంది మామూలు మనుషులకు కూడా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ శక్తి వారి అదుపులో ఉండదు. కావలసినప్పుడల్లా దీనిని వారు ఫీల్ అవలేరు.

ఈ శక్తినే యోగం ద్వారా విపరీతంగా వృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు అది వారి స్వాధీనం అవుతుంది. సంకల్ప శక్తితో మనస్సును ఫ్లడ్ లైట్ లా కేంద్రీకరించగలిగితే  ఆ లైట్ పడిన చోట ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. పతంజలి మహర్షి ఈ శక్తుల గురించి తన యోగసూత్రాలలోని "విభూతిపాదం"(Chapter on Powers) అనే అధ్యాయంలో చెప్పారు. ఏ ఏ విషయాల పైన సంయమం చేస్తే యోగిలో ఏఏ శక్తులు ఎలా వృద్ధి చెందుతాయో అందులో వివరించారు.


ఉదాహరణకు మహర్షి ఒకచోట ఈ సూత్రాన్ని ఇచ్చారు "సమాన జయాత్ ప్రజ్వలనం". శరీరంలో ఉన్న సమానవాయువు అనేదాన్ని అదుపులోనికి తెచ్చుకుంటే యోగి తన శరీరం నుంచి జ్వలించే కాంతిని వెదజల్లగలడు. దీనిని సాధించిన యోగులు చాలామంది నేటికీ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి నేనొకసారి మాట్లాడుతున్నపుడు నా స్నేహితుడొకడు ఒప్పుకోలేదు. "ప్రకృతిలో సాధ్యం కాని విషయాలను ఏదో పుస్తకంలో రాసినంత మాత్రాన ఎలా నమ్మాలి?" అని వాదించాడు. అతనితో ఇలా చెప్పాను. "ప్రకృతిలో లేవని నీవు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి. చూచే దృష్టి నీకు లేదు. నీకు తెలియనంత మాత్రాన ప్రకృతిలోనే ఇవి లేవు అని ఎలా నిర్ధారణకు వస్తున్నావు? మిణుగురు పురుగును చూచావుకదా. రాత్రిపూట అది తనలోనుంచి కాంతిని ఎలా వెదజల్లుతుంది? అలాంటి శక్తి ఈ టెక్నిక్ వల్ల మనిషికి కూడా వస్తుంది." అని చెప్పాను. అతను మళ్లీ మాట్లాడలేదు. 


అలాగే "కంటకూపే క్షుత్పిపాసా నివృత్తి:" అనేది ఇంకొక సూత్రం. తన గొంతులో ఉన్న విశుద్ధ చక్రంమీద సంయమం చెయ్యగలిగిన యోగి ఆకలి దప్పులచేత పీడింపబడడు అనేది దీని అర్ధం. ఇది కూడా చాలామంది యోగులకు అనుభవైక వేద్యమే. ఆహారం దొరకని హిమాలయ సానువుల్లో రోజుల తరబడి ధ్యానసమాధిలో ఉండే యోగులు ఈ టెక్నిక్ ద్వారానే ఆకలిదప్పులకు అతీతులుగా ఉండగలుగుతారు.
  
మనం చూస్తున్న లోకం వెనుకే, మనం చూడలేని లోకం ఒకటుంది. ఆ లోకం, మనం చూస్తున్న లోకంకంటే అనేక వేలరెట్లు పెద్దదీ, విభిన్నమైనదీ, అనేక రంగులతో కూడినదీ. మనిషి ఒక చిన్న బురదగుంతలో బతుకుతున్న ఛిరుకప్ప లాంటివాడు. ఈ గుంతనే అతను గొప్ప ప్రపంచం అనుకొని, అందులో సాధ్యమైనంత దోచుకొని దాచుకోవడానికి రకరకాల మోసాలు చేస్తూ నీచమైన బతుకు బతుకుతున్నాడు. అతీతలోకాలను ఒక్కసారి దర్శిస్తే  మన బ్రతుకు ఎంత అల్పమైనదో ఎంత నీచమైనదో అర్ధమౌతుంది. అప్పుడు మన జీవితం మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఉన్నతజీవితం మీద అభిలాష తీవ్రమౌతుంది.

ఒక ఉపన్యాసంలో వివేకానందస్వామి ఇలా అంటారు. "ఏమీ చూడని వానికంటే ఒక దెయ్యాన్ని చూచినవాడైనా ఉత్తముడే. ఎందుకంటే మనం చూడని ఇంకొక లోకం ఉందన్న సత్యం అతనికి అలాగైనా అర్ధమౌతుంది." తద్వారా అంతరిక జీవితం మీద అతనికి ఆసక్తి మొదలౌతుంది.క్రమేనా అదే అతన్ని ఉన్నత స్థాయిలకు చేర్చే అవకాశం ఉంది.

మనం చూస్తున్న ఈలోకం వెనుక, ఎన్నో లోకాలున్న మాట వాస్తవం. వాటిలో మన స్థాయికి మించిన అనేకరకాల జీవులున్న మాట కూడా వాస్తవమే. సరైన ట్రెయినింగ్ తో ఆలోకాలను చూడవచ్చు . ఆ జీవులతో సంభాషించవచ్చు. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.
read more " అతీతలోకాలు - అదృశ్యశక్తులు "

22, జూన్ 2012, శుక్రవారం

వృషభరాశిలో గురుకేతువుల సంయోగం -- ఫలితాలు

ప్రస్తుతం బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తూ నీచకేతువుతో కలిసి ఉన్నాడు. ఈయన దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ రాశిలో ఉండబోతున్నాడు. ఈ గ్రహయుతి ఫలితాలు ఎలా ఉంటున్నాయో కొంచం గమనిద్దాం. వృషభరాశి నవీన భారతదేశాన్ని సూచిస్తుంది. కనుక ఈ గ్రహ ఫలితాలు మన దేశంమీద ఎక్కువగా ఉంటున్నాయి. 

గురువు న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ సూచకుడు. ఈయన కేతుగ్రస్తుడవడం వల్ల న్యాయరంగానికి మలినం పట్టింది. ఈ మధ్యన న్యాయమూర్తులు కూడా అవినీతికేసుల్లో ఇరుక్కుని అరెష్టవడం దీని ప్రభావమే. న్యాయం కూడా ఒంటి కాలిమీద నడుస్తూ ఉండటం చూడవచ్చు.   

గురువు ఆధ్యాత్మిక గురువులకు సూచకుడు కూడా. కనుక నకిలీ గురువులు కొందరు వివాదాస్పద అంశాలలో ఇరుక్కుని జైలు పాలవడం, రాజకీయాలలో తలదూర్చి నాయకులతో విరోధాలు పెంచుకోవడం, విమర్శలు చెయ్యడం, వార్తలకేక్కడం జరుగుతోంది.

గురువు నాయకులకూ, ఉన్నత అధికారులకూ సూచకుడు. ఈ మధ్యన నాయకులందరూ అరెష్టు కాబడటం, ఇన్నాళ్ళూ ఇతరులకు ఆదేశాలు ఇచ్చిన అయ్యేఎస్ అధికారులు కటకటాల వెనక్కు వెళ్లడం కూడా ఈ గ్రహయుతి ప్రభావమే.

ఇంకా చూస్తె, గురువు వృద్ధనాయకులకు సూచకుడు. కనుక త్వరలో కొందరు వృద్ధ నాయకులు అకస్మాత్తుగా పరలోక ప్రయాణం కట్టే సూచనలున్నాయి.

గురువు ధర్మానికీ సూచకుడే. అందుకే ఈ మధ్యలో ధర్మం దారి తప్పినంతగా ఎన్నడూ జరుగలేదు. ప్రజలలో ధర్మం అనేది పూర్తిగా లోపించి స్వార్ధం కరాలనృత్యం చేస్తున్న మాట నిజం. ప్రస్తుతం ఎవరిలోనూ ధార్మిక చింతన లేదు అని చెప్పవచ్చు. ధర్మం పేరుతో మతం పేరుతో జరుగుతున్నది అంతా కూడా చాలావరకూ మోసమే.

అయితే దీనిలో ఇంకొక కోణం కూడా ఉన్నది. గురు కేతువుల యుతి వల్ల నిజమైన ఆధ్యాత్మిక పరులకు సహాయపడే స్పందనలు ఇప్పుడు అధికం అవుతాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అటువంటి వారికి మంచి పురోగతి ఉంటుంది. ఈ పరిస్తితి ఒక ఏడాది పాటు ఉంటుంది కనుక ఆ మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ గ్రహ ప్రభావాన్ని సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది.

వృషభ రాశి భూతత్వ రాశి కనుక ఈ గ్రహయుతి వల్ల భారతదేశంలో భూకంపాలు వస్తున్నాయి. శనీశ్వరుడు కూడా భూతత్వ రాశి అయిన కన్య లో ఉండటం గమనిస్తే ఇదెంత ఖచ్చితంగా జరుగుతున్నదో అర్ధం అవుతుంది. మొన్న అమావాశ్య ప్రభావంతో సత్తెనపల్లి కేంద్రంగా భూకంపం వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. దీని ఫలితంగా గుంటూరులో కూడా ఇళ్ళు ఇంట్లోని వస్తువులు రెండు మూడు సెకన్లు ఊగినట్లు అనిపించింది.


ప్రస్తుతం గురుకేతువులు ఒకరికొకరు ఒక డిగ్రీ దగ్గరలో ఉన్నారు. నిన్న గురువారం నాడు ముంబాయిలోని మహారాష్ట్ర సెక్రెటేరియట్ కు నిప్పంటుకుని ఘోరప్రమాదం జరిగింది.ఇద్దరు ముగ్గురు చనిపోయారని అంటున్నారు. మంత్రులు కొద్దిలో బయటపడ్డారు. కేతువు కారకత్వాలలో ఒకటైన షార్ట్ సర్క్యూట్ కారణం అని అంటున్నారు. అధికారకేంద్రం అయిన విధానసౌధంలో ఇది జరగటం గురువు కేతువుల సంయోగ ఫలితమే. ఆర్ధిక రాజధానిలో ఇది జరగడం శుక్రుని రాశి అయిన వృషభంలో  కేతువు ఉన్న ఫలితమే. ఇది అగ్ని ప్రమాదాలకు కారకుడైన కుజ హోరలో జరిగింది. కుజుడు ప్రస్తుతం సున్నా డిగ్రీలలో ఉండి తన శత్రువైన శనిని సమీపిస్తూ చాలా అసౌకర్యంగా ఉన్నాడు.

డిసెంబర్ 23 వరకూ కేతువు వృషభరాశిలోనే ఉంటాడు. అప్పటివరకూ  ఇలాంటి ఫలితాలు మనదేశంలో కనిపిస్తూనే ఉంటాయి. తమతమ జాతకాలకు సరిపోయే రేమేడీలు పాటించడం వల్ల ఈ దుష్ప్రభావాల నుండి బయట పడవచ్చు.
read more " వృషభరాశిలో గురుకేతువుల సంయోగం -- ఫలితాలు "

13, జూన్ 2012, బుధవారం

పంచవటి సాధనా సమ్మేళనం - 4

జూన్ 11,12 తేదీలలో పంచవటి నాలుగో సాధనాసమ్మేళనం హైదరాబాద్ లో ఒక సభ్యురాలి ఇంటిలో జరిగింది. ఈ రెండురోజులూ పంచవటి సభ్యులు దాదాపు 25 మంది హాజరై ఉదయం నుంచి సాయంత్రంవరకూ ఎన్నో ఆధ్యాత్మికవిషయాల మీద చర్చించి వారివారి సందేహాలు తీర్చుకుని జ్ఞానలబ్దిని పొందారు. ప్రాణాయామ ధ్యానాది సాధనలు కొన్ని ప్రాక్టికల్ గా చేసి ప్రత్యక్షంగా సాధనామార్గం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. 

వేదోపనిషత్తుల సారాన్ని, మహనీయుల జీవిత ఘట్టాలనూ, వివిధ సాధనా మార్గాలనూ, వాటిలోని లోతుపాతులనూ, నిత్యజీవితంలో వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలి,ఎలా ఆచరించాలి అన్న విషయాలనూ, సాధనా మార్గంలో ఎలా ఎదగాలి, నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అన్న విషయాలనూ కూలంకషంగా చర్చించి అర్ధం చేసుకోవడానికి ఈ సమ్మేళనం ఒక వేదికగా ఉపయోగపడింది. సమావేశంలో పాల్గొన్న వారికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే వీలు కల్పించబడి ఆనందాన్ని కలిగించింది.

ఈ సమావేశానికి హాజరైనవారందరూ నిష్కల్మషమైన విశాలమైన భావాలు కలిగినవారే.ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసినవారే. ఇంకా చేస్తూ ఉన్నవారే కావడంతో వారికి కలిగిన కలుగుతున్న సందేహాలు చర్చించి సమాధానాలు పొందటానికి అనువైన వాతావరణం ఈ సమ్మేళనంలో కల్పించబడింది. స్వచ్చమైన,నిజమైన ఆధ్యాత్మికతను కొంతైనా అర్ధం చేసుకున్నామన్న ఆనందాన్ని ఈ సమ్మేళనం వారిలో నింపింది. జీవితసాఫల్యతా సాధనలో ముందడుగు వేస్తామన్న నమ్మకాన్ని పెంచింది. జీవన పోరాటాన్ని దైవబలంతో ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని కలిగించింది.

నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమ్మేళనంలో పాల్గొన్న పంచవటి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
read more " పంచవటి సాధనా సమ్మేళనం - 4 "

9, జూన్ 2012, శనివారం

మనిషి జీవితంలో మౌలిక ప్రశ్నలు

ప్రతి మనిషీ జీవితంలో తనను తాను ఏదో ఒకరోజు ప్రశ్నించుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు కొన్నున్నాయి. కాని ప్రతి వాడూ వీటిని వాయిదా వేస్తూ పోతుంటాడు.ఈ వాయిదా వెయ్యడానికి కారణాలు ఎన్నున్నా అన్నింటి వెనకా ఒకటే మూలకారణం కనిపిస్తుంది. దానిని తృష్ణ అనవచ్చు, లేదా ఇంద్రియాకర్షణ అనవచ్చు లేదా మాయ అనవచ్చు. దీనికి లోబడే లోకంలో ప్రతి మనిషీ జీవిస్తున్నాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో, తానెంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఇప్పటి దాకా  కూడబెట్టాడు, ముందు ఇంకా ఎంత కూడబెట్టాలి, దానితో ఎన్ని సుఖాలు అనుభవించాలి అన్న ఆలోచనలే చేస్తుంటాడు. కాని అతను ఆలోచించని విషయం ఒకటుంది. ఈ తాపత్రయంలో పడి విలువైన జీవితాన్ని అతను కోల్పోతున్నాడు. ఆయుస్సు అనుక్షణం తగ్గుతూ వస్తున్నది. మరణం అనుక్షణం దగ్గర అవుతున్నది. ఈ జీవన పోరాటంలో శాంతి అనేది కనుచూపు మేరలో ఎక్కడా కనిపించదు. మనిషి తాపత్రయానికి అంతం కూడా ఎప్పటికీ ఉండదు. కానీ, ఎంతకాలం ఈ అర్ధం లేని పరుగు? అన్న విషయం మాత్రం ఎవరూ ఆలోచించరు. అదే మాయ.

తాను సంపాదించిన దానికంటే తాను ఖచ్చితంగా  ముఖ్యమైనవాడు. సంపాదన తనకోసమే గాని తాను సంపాదన కోసం పుట్టలేదు. సంపాదన కోసం ఎవడూ సంపాదించడం లేదు. సంపాదించిన దానితో తను తన కుటుంబమూ సుఖంగా ఉండాలనే ప్రతివారూ ఆశిస్తారు. అంతేగాని అవసరం ఉన్నా లేకున్నా లక్షల కోట్లూ, కోట్ల కోట్లూ పోగేయ్యాలని ఎవరైనా ఆశించి ఆ కోణంలో ప్రయత్నం చేస్తుంటే వారి వ్యక్తిత్వంలో మౌలికంగా ఏదో దారుణమైన లోపం ఉన్నదని భావించాలి. సుఖం కోరుకోవడం తప్పు కాదు. కాని దానికి అంతెక్కడ అన్న విషయం గ్రహించలేకపోవడమే తప్పు. ఇక చాలు అని ఒక గిరి గీసుకోలేక పోవడమే తప్పు. దీని తరువాత ఏమిటి? అన్న విషయం ఆలోచించలేకపోవడమే తప్పు.

ప్రతివాడూ సుఖాభిలాషతోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు.మనిషి మాత్రమె కాదు. లోకంలో ప్రతిప్రాణీ సుఖాన్ని కోరుతూ దు:ఖాన్ని వద్దనుకుంటుంది. కాని ఇక్కడే ఒక మెలికను ప్రకృతి ఉంచింది. ఏ సుఖమూ శాశ్వతంగా ఎల్లకాలమూ నిలిచి ఉండదు. తిన్న కాసేపు ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కాసేపటికి మళ్ళీ తలెత్తుతుంది. అలాగే, ఏ ఆనందమూ స్తిరంగా  ఉండదు. నిజానికి ఆనందాన్ని అనుభవిస్తున్న క్షణంలోనే అది ఆవిరైపోతూ ఉంటుంది. ఇది ప్రకృతిలోని అత్యంత కీలకమైన అమరిక. జారిపోతున్న సుఖాన్ని నిలిపి ఉంచడం కోసం మనిషి నిరంతరం పరుగులు తీస్తూ ఉంటాడు. ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే బాహ్యప్రపంచంలో మనకు దొరికే ఏ సుఖమూ శాశ్వతం కాదు. అది క్షణికం మాత్రమె.అందుకే క్షణికాన్ని శాశ్వతం చేసుకుందామన్న భ్రమలోనే మనిషి జీవితం వెళ్ళిపోతున్నది. మళ్ళీ మళ్ళీ అదే ఆనందాన్ని పొందుదాం అన్న భ్రమలోనే మనిషి జీవితం ఆవిరై పోతున్నది. అతని ఆయుస్సు తరిగి పోతున్నది. కాని అదేన్నటికీ జరిగే పని కాదు. బాహ్య విషయాలు ఇచ్చే ఆనందం ఎన్నటికీ శాశ్వతంగా ఉండదు. ఈ విషయం మనిషికి జీవిత చరమాంకంలోనే అర్ధమౌతుంది. చాలామందికి అప్పుడు కూడా విషయం అర్ధంకాదు. అప్పటికే మరణం వచ్చి తలుపు తడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెయ్యగలిగింది ఏమీ ఉండదు. కానీ, చాలా కొద్ది మందికి మాత్రం ఈ మెలిక చిన్నతనంలోనే అర్ధమౌతుంది.

ప్రపంచంలో ఏ వస్తువైనా తనకంటే ఎక్కువ కాదు. వస్తువులు తనకోసం ఉన్నాయి గాని, తాను వాటికోసం లేడు. ఈ సత్యాన్ని మరచి మనిషి వస్తువులకోసం, వాటిని కొనగలిగే ధనంకోసం, విలువైన తన జీవితాన్ని వృధాగా వెచ్చిస్తున్నాడు. కాని అన్నింటికంటే విలువైన తనకోసం మనిషి ఏమీ చెయ్యడం లేదు. తనను తాను తెలుసుకుందామని ప్రయత్నం చెయ్యడం లేదు. 

మనలో ప్రతివారికీ భౌతికమైన తన అడ్రస్ తెలుసు. కాని తానెవరో తెలియదు. ప్రతివారికీ డ్రస్ ఎలా వేసుకోవాలో తెలుసు. కాని ఇప్పటికే మనల్ని ఆవరించి ఎన్ని డ్రస్సులు ఉన్నాయో వాటిని ఎలా వదిలించుకోవాలో ఎవరికీ తెలియదు.  ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నాడో ప్రతివానికీ తెలుసు. కాని ఎక్కడినుంచి ఈ లోకంలోకి వచ్చాడో తెలియదు. ఎలా వచ్చాడో తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు. ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు.ఎప్పుడు పోతాడో తెలియదు. ఎక్కడికి పోతాడో తెలియదు. ఆ తర్వాత ఏమౌతుందో తెలియదు. మళ్ళీ పుట్టుక ఉందొ లేదో తెలియదు. ఈ చక్రభ్రమణం ఎన్నాళ్ళో అసలే తెలియదు. ఇవీ అసలైన మౌలికప్రశ్నలు. మనిషి తనను తాను ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలూ, జవాబులు వెదకవలసిన ప్రశ్నలూ ఇవే. కానీ జీవితంలో ఇవి ముఖ్యం కాదులే అనుకుంటూ  ప్రతిసారీ వాయిదా వేస్తూ పోయే ప్రశ్నలు  కూడా ఇవే. 

ఈ ప్రశ్నలు మనిషి వేసుకున్నప్పుడు, అతనిలో ఒక జిజ్ఞాస మొదలౌతుంది. నిరంతరమైన ఆ జిజ్ఞాస క్రమేణా ఒక తపనగా మారుతుంది. ఆ తపన అతనికి ఒక దారిని చూపిస్తుంది. అదే అతన్ని ఒక వివేకానందునిగా మారుస్తుంది. ఒక రమణమహర్షిగా మారుస్తుంది. అప్పుడే అతనికి జీవితంలో ఏది ముఖ్యమో ఏది కాదో తెలుస్తుంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. జీవితంలో దేనివిలువ ఏమిటో అప్పుడే తెలుస్తుంది. ఇప్పటి వరకూ నిరర్ధకంగా గడుపుతున్న జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలో తెలుస్తుంది. ఆ రోజునుంచే అతను నిజంగా జీవించడం మొదలు పెడతాడు. ఎప్పటికీ జారిపోని, శాశ్వతమైన సుఖం కోసం,ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు. చివరికి దానిని అందుకుంటాడు. ఆ క్రమంలో వ్యామోహాన్నీ తృష్ణనూ మాయనూ అధిగమిస్తాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో ఏదోనాడు వేసుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు ఇవే. వీటికి సమాధానాలను పుస్తకాలనుంచి కాకుండా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనిషి పరుగు ఆగుతుంది.అప్పుడే అతని జన్మజన్మల దాహం తీరుతుంది. అప్పుడే అతని అన్వేషణ అంతమౌతుంది. అప్పుడు మాత్రమె అతనికి అత్యన్తికమైన శాంతి దొరుకుతుంది. కాని ఆ పనిని ఎందరు చెయ్యగలరు? కోటికి ఒక్కరైనా ఉంటారా? మనిషిని నిరంతరం వెంటాడే కర్మఫలం ఆ పనిని సజావుగా చేయ్యనిస్తుందా? ఆ అనుభవాన్ని పొందటం  అంత సులభం అయితే సందుకొక రమణమహర్షీ, గొందికొక వివేకానందుడూ, ఊరికొక అరవిందుడూ ఉండకపోయారా?

కానీ ఒక్క విషయం చెప్తాను. ఎంత కష్టమైనా సరే ఏదోనాడు ప్రతివారూ ఈ ప్రశ్నలకు జవాబులు వెదుకక తప్పదు. కొందరు ముందూ కొందరు వెనుకా అంతే తేడా. ఎందుకంటే పరిణామక్రమం ప్రకృతిలోని అంతస్సూత్రం. ప్రతివారూ ఏదోనాటికి ఎదిగి పరమ గమ్యాన్ని చెరక తప్పదు. కనుక ఈ ప్రశ్నలు ఎవరికీ వారు వేసుకుని, వాటికి జవాబులు తమ స్వానుభవంనుంచి గ్రహించే ప్రయత్నం ఎంత త్వరగాచేస్తే అంతమంచిది. ఎక్కువ సమయం వృధా అవకుండా ప్రకృతి నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోవడం అప్పుడు సులభం అవుతుంది. అప్పుడే మనిషి జీవితం ధన్యం అవుతుంది. లేకుంటే జన్మ తరువాత ఇంకొక జన్మ ఇలా ప్రతిజన్మా వృధా అవుతూనే ఉంటుంది. మనిషి జీవితం నిరర్ధకంగా ఈషణాత్రయంలో గడుస్తూనే ఉంటుంది.


మౌలికమైన ఈ ప్రశ్నలకు ఏదో ఒకనాడు ప్రతి మనిషీ సమాధానాలు వెదకక తప్పదు.
read more " మనిషి జీవితంలో మౌలిక ప్రశ్నలు "