3, నవంబర్ 2014, సోమవారం

Telugu Melodies-పూచెను సుమములే వెన్నెల జారగా...




(సౌండ్ క్లారిటీ కోసం,ఈ పాటను మంచి స్పీకర్స్ లో వినండి.కంప్యూటర్ స్పీకర్ లో మీకు ఆ క్లారిటీ రాదు)
----------------------------------------------
నేను పాడిన కరావోకే పాటలలో మొదటిదిగా 'పూచెను సుమములే వెన్నెల జారగా..' ఈ పోస్ట్ లో ఇస్తున్నాను.

ఇది 'ఖిల్తే హై గుల్ యహా..' పాటకు తెలుగులో నేను వ్రాసుకున్న సాహిత్యం. కొంచం హిందీ పాట భావాన్నీ కొంత నా భావాన్నీ కలిపి ఈ పాట వ్రాశాను.పాట లిరిక్స్ ఈ క్రింద ఇస్తున్నాను.పాడుకోవడం వరకూ ఈ లిరిక్స్ వాడుకోవాలని ఎవరైనా అనుకుంటే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.కానీ కమర్షియల్ పర్పస్ కు వాడరాదు.


ఇదొక మధుర ప్రేమగీతం.

కురుస్తున్న వెన్నెలలో పూవులు విరుస్తున్నాయి. హృదయం నీకోసం వేచి చూస్తున్నది,సమయం ముందుకు దొర్లిపోతున్నది,ఈ ప్రపంచం నిత్యం కాదన్న సత్యాన్ని ప్రేయసికి వివరిస్తూ ప్రేమను ఆస్వాదించడంలో ఆలస్యం చెయ్యవద్దని చెబుతూ పాడే పాట.

ఎంతో ఫీల్ తో వ్రాసిన పాట.అంతే ఫీల్ తో పాడిన పాట.

విని ఆనందించండి.

పాట:--
పూచెను సుమములే...

రచన-గానం:--

సత్యనారాయణ శర్మ.
-------------------------

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే – వలపుల తేలగా
పూచెను సుమములే – వెన్నెల జారగా
వేచెను హృదయమే....

{రేపిక వచ్చునా – మాపిక మిగులునా

ఈ మృదు సమయమే – కదలక నిల్చునా}-2
ఉన్న రెండు క్షణములే - ప్రేమ నింపి చూడుమా

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే...

{మేఘపు రాగమే – యేరుల తేలదా

పూవుల గుండెలో – చల్లని జ్వాలగా}-2
నాదు హృదయమందు మెదలె- నీ అగాధ వేదన

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే...

{ప్రేమను కోరుచు – వేచెను నామది

నిన్నిక తోడుగా – రమ్మనె ఈ నిశి}-2
అన్ని మరచి ఈక్షణం –నన్ను కలువజాలవా

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే – వలపుల తేలగా

పూచెను సుమములే....
read more " Telugu Melodies-పూచెను సుమములే వెన్నెల జారగా... "

1, నవంబర్ 2014, శనివారం

రేపే శనీశ్వరుని రాశిమార్పు

రెండున్నర ఏళ్ళుగా తులారాశిలో ఉన్న శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి మారే రోజు రేపే.

ఈ మార్పువల్ల ప్రపంచవ్యాప్తంగానూ,వ్యక్తిగత జీవితాలలోనూ కూడా పెనుమార్పులను ఆయన కలిగిస్తాడు.గత నెలరోజుల నుంచే ఆయా మార్పులు,సూచనలు కనిపించడం ప్రారంభించాయి.ఎందుకంటే మందగ్రహమైన శనీశ్వరుడు కనీసం ఒక నెలరోజుల ముందునుంచే తన ప్రణాళికను సూచనాప్రాయంగా ప్రకటించడం ప్రారంభిస్తాడు. 

వరుసగా సముద్రంలో ఏర్పడుతున్న తుఫానులూ,మొన్న ఆంధ్రాలో వచ్చిన స్వల్ప భూకంపమూ,హుద్ హుద్ తుఫాను ప్రభావం వల్ల కుదేలౌతున్న వ్యవసాయరంగమూ,వైరస్ కంటే వేగంగా విస్తరిస్తూ పంటలను నాశనం చేస్తున్న దోమలూ-- ఇవన్నీ శనీశ్వరుని గోచారప్రభావ సూచనలే.ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ముందు ముందు రాబోతున్న విలయాలకు వార్నింగ్ సిగ్నల్స్ మాత్రమే.

ప్రపంచవ్యాప్తంగా నిశ్శబ్దంగా పెరుగుతున్న ముస్లిం తీవ్రవాదం ఇంకొక ప్రధానమైన విలయసూచన.తన కుమారుడిని ఇమాంగా ప్రకటించబోయే మీటింగ్ కి మన ప్రధానమంత్రిని పిలవకుండా పాకిస్తాన్ ప్రధానినీ ఇంకా అనేక దేశాలనుంచి ఇతర వ్యక్తులనూ ఆహ్వానించిన జామా మసీదు ఇమాం ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కోణంలో చూస్తే అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం. 

అంటే,ప్రకృతి విపత్తులే గాక,మనిషి చేజేతులా చేసుకుంటున్న పనులు కూడా రాబోయే రెండేళ్లలో అనేక విపత్తులను కొని తేబోతున్నాయని అర్ధమౌతున్నది.

వ్యక్తిగత జీవితాలలో గనుక మీరు గమనించుకుంటే,గత నెలరోజులుగా అందరి జీవితాలలో ఇంతకు ముందు లేని మార్పులు చోటు చేసుకోవడం మీరు స్పష్టంగా చూడవచ్చు.ఆ మార్పులు ఈఈ విధాలుగా ఉంటాయి.
  • ఆరోగ్యాలలో తేడాలు రావడం.దీర్ఘవ్యాధులు బయట పడటం.
  • మేము చాలా ఆరోగ్యవంతులం అనుకునే వారిలో కూడా అనారోగ్యాలు బయటపడటం.
  • కొత్త పరిచయాలు ఏర్పడటం.కొత్త వ్యాపకాలు మొదలు కావడం.
  • కొత్త కొత్త అనుకోని సంఘటనలు జరగడం.
  • బాధ్యతలు ఎక్కువై పోవడం.అవి కుటుంబ బాధ్యతలు కావచ్చు ఉద్యోగ/వృత్తి బాధ్యతలు కావచ్చు.
  • మానసిక చింతా ఆందోళనా ఎక్కువ కావడం.
  • అసహజములైన అలవాట్లూ,పోకడలూ బయటపడటం.పైగా వాటిని గర్వంగా చెప్పుకోవడమే గాక ప్రపంచం మొత్తం గుర్తించి జేజేలు కొట్టాలని కోరుకోవడం.యాపిల్ కంపెనీ సి.ఈ.వో కూడా నేను 'గే' ని కావడానికి గర్వపడుతున్నానని ప్రకటించడం ఈ ప్రభావమే.
  • పెద్దవీ చిన్నవీ యాక్సిడెంట్లు ఎక్కడ చూచినా ఎక్కువ కావడం.
  • గొడవలు ఘర్షణలు చీటికీ మాటికీ విసుగులు ఎక్కువ కావడం.తొందరపాటు తనమూ దూకుడూ ఎక్కువ కావడం.
  • భార్యా భర్తల మధ్యన గొడవలై విడాకుల దాకా పోవలసి రావడం.ఇద్దరి మధ్యనా మానసికంగా దూరం పెరగడం.
  • గైనిక్ సమస్యలూ,పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలూ,నోరు,పళ్ళు,చిగుళ్ళ సమస్యలూ ఉన్నట్టుండి ఎక్కువ కావడం.వాటికి టెస్టులూ,మందులూ మొదలు కావడం.
ఈ మార్పులు చాలామంది జీవితాలలో ఇప్పుడు కనిపిస్తున్నాయి.ఒక్కసారి శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి అడుగుపెడితే అప్పుడు ఆయా ప్రభావాలు ఇంకా స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తాయి.

మొత్తంమీద రాబోయే రెండున్నర సంవత్సరాల కాలం,మనుషుల జీవితాలలోనూ,ప్రపంచ ముఖచిత్రంలోనూ చాలా మార్పులను తీసుకు రాబోతున్నది.అద్భుతమైన ఈ యూనివర్సల్ డ్రామా రేపటినుంచీ మన కళ్ళముందు ఎలా  ఆవిష్కరింపబడుతుందో గమనిద్దాం.
read more " రేపే శనీశ్వరుని రాశిమార్పు "

30, అక్టోబర్ 2014, గురువారం

పురచ్చితలైవి డా|| జయలలిత జాతకం-ఒక పరిశీలన-2

చెన్నై నుంచి ఇంకొక మిత్రుడు ఇచ్చిన వివరాల ప్రకారం డా||జయలలిత అసలైన జనన సమయం మధ్యాన్నం 14.34 hours.ఇది చాలా ఖచ్చితమైన జననసమయం అని ఆయన చెబుతున్నారు.కనుక దీనిని కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

ఆ సమయానికి వేసిన జాతకచక్రం ఇక్కడ ఇచ్చాను.

రెండుగంటల సమయం తేడాలో ఒక్కొక్కసారి పెద్దగా తేడాలు రావుగాని ఒక్కొక్కసారి రెండు నిముషాల తేడా కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది.ముఖ్యంగా దశలు మారిపోతాయి. భావాలూ వాటి రీడింగ్సూ పూర్తిగా మారిపోతాయి.అందుకని జీవిత వివరాలను కొంచం లోతుగా పరిశీలిద్దాం.

ఈ సమయానికి మిధున లగ్నం అయి కూచుంది.వివాహమూ సంతానమూ మొదలైన వ్యక్తిగత భావాలను పరిశీలిస్తే మొదటి జాతకంకంటే ప్రస్తుత జాతకమే ఎక్కువ సరిగ్గా సరిపోతున్నది.

ఈ జాతకానికి గురువు ఉభయ కేంద్రాధిపత్యదోషి.సప్తమంలో ఉంటూ కళత్ర భావాన్ని పాడుచేస్తున్నాడు.సంతాన కారకుడు కూడా ఈయనే కావడంతో ఈ రెండు భావాలూ దెబ్బతిన్నాయి.దానికి తోడు పంచమంలో కేతువువల్ల పుత్రదోషం సూచింపబడుతున్నది.కనుక వివాహభావమూ సంతాన భావమూ రెండూ పాడైపోయాయి.

అయితే పంచమాధిపతి శుక్రుడు దశమంలో ఉచ్ఛస్థితి వల్ల తనకు సంతానం లేకపోయినా లక్షలాది తమిళుల చేత 'అమ్మా' అని ప్రేమగా పిలిపించుకునే యోగం పట్టింది.సప్తమంలో గురువు వల్ల మధ్యవయస్సు నుంచి లావెక్కే శరీరతత్వం సూచితం అవుతున్నది.తృతీయంలో కుజచంద్రులవల్ల మంచి వాగ్దాటీ,ఉపన్యాస పటిమా కనిపిస్తున్నాయి.లాభంలోని రాహువు వల్ల కుట్రలతో కూడిన రాజకీయజీవిత లాభం కనిపిస్తున్నది.దశమోచ్చ శుక్రునివల్ల సినిమారంగంలో ప్రతిభ కనిపిస్తున్నది.

ఇప్పుడు కొన్ని ఇతర వివరాలు చూద్దాం.

ఈమె తాతగారు మైసూరు మహారాజుగారి సంస్థానంలో ఆస్థానవైద్యునిగా ఉండేవారు.వృషభ లగ్నం అనుకుంటే దశమాత్ దశమం వృశ్చికం అవుతుంది.కుజుడు చతుర్దంలో ఉంటూ దశమాన్ని చూస్తున్నాడు.కనుక తాతగారికి సర్జన్ వృత్తి సరిపోతున్నది.అదే మిధున లగ్నం అయితే తాతగారి స్థానంలో గురువున్నాడు గనుక ఆయన మెడికల్ సర్జన్ ను సూచించడు గనుక సరిపోలేదు.కాకపోతే ఒక ఉన్నతాధికారిని సూచిస్తున్నాడు.

ఈమెకు రెండేళ్ళ వయస్సున్నప్పుడు తండ్రి చనిపోయాడు.వృషభ లగ్న జాతకం ప్రకారం కేతువు/శనిలో ఇది జరిగింది.సరిపోయింది.మిధున లగ్న జాతకం అయితే ఇది సరిపోవడం లేదు.కానీ గోచార రీత్యా అప్పుడు శని కన్యా రాశిలో సంచరించాడు గనుక చతుర్ధ శనిసంచారం తండ్రి మరణాన్ని సూచిస్తుంది గనుక గోచారరీత్యా ఇది సరిపోయింది.అంటే ఒక పాయింట్ వృషభ లగ్నజాతకాన్ని సూచిస్తే ఇంకొక పాయింట్ మిధున లగ్నజాతకాన్ని సూచిస్తున్నది.కనుక ఇంకా జాతక వివరాలను పరిశీలించాలి.

తాతగారు సంపాదించిన మంచి ఆస్తిని తండ్రి తగలేశాడని ఆమే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.మిధున లగ్నం అయితేనే దశమంలో ఉన్న ఉచ్ఛశుక్రునివల్ల తండ్రికి ఉండే విలాసాలూ అతి ఖర్చులూ సరిపోతాయి.అదే వృషభ లగ్నం అయితే తండ్రికి ఈ అలవాట్లు ఉండే అవకాశం లేదు.కనుక మిధున లగ్నమే కరెక్ట్ అని తెలుస్తున్నది.

రెండు జాతకాలూ ఈమెపైన ఇంకొక సంతానం ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఈమెకొక అన్నయ్య ఉన్నాడు.ఆయన పేరు జయకుమార్.ఆయన 1990 లో చనిపోయాడు.వృషభలగ్నం అయితే ఒక అక్క ఉన్నట్లు కనిపిస్తున్నది.ఇది కరెక్ట్ కాదు.అదే మిధునలగ్నం అయితే అన్నయ్య ఉన్నట్లు కనిపిస్తున్నది.వృషభలగ్నం గనుక అయితే కుజ/గురుదశ సరిపోవడం లేదు.మిధునలగ్నం అయితే 1990 లో కుజ/గురువుగాని కుజ/శనిగాని జరిగింది. రెండూ సరిగ్గా సరిపోతున్నాయి.కనుక మిధునలగ్న జాతకమే కరెక్ట్ అని అనిపిస్తున్నది.

తండ్రి చనిపోయిన తరువాత ఈమె తల్లి బెంగుళూరుకు వెళ్ళిపోయి అక్కడనుంచి సినిమా రంగంలో అడుగుపెట్టింది.ఆమె సోదరి అప్పటికే సినిమాలలో ఉన్నది.ఈ వివరం బట్టి చూడగా,1951 లో మొదలైన శుక్రదశలో తల్లి సినిమానటి కావాలంటే కూతురుది మిధున లగ్నమే అయ్యి ఉండాలి. వృషభ లగ్నం అయితే ఇది సాధ్యం కాదు.కనుక మిధున లగ్నమే కరెక్ట్ అని ఇక్కడ కూడా అనిపిస్తున్నది.

ఆమెకు 15 ఏళ్ళున్నప్పుడు (1962-63) మొదటిసారి సినిమాలలో నటించిందని మనకు తెలుసు.ఈ సమయం ప్రకారం కూడా అప్పుడు శుక్ర/గురు దశే జరిగింది.అయితే ఖచ్చితమైన తేదీలు ఉంటే విదశ మొదలైన ఇతర లెవల్స్ చూడవచ్చు.

1971 లో నవమ రవిదశ మొదలవ్వగానే ఆమెకు అవార్డులు రావడం మొదలైనట్లు కనిపిస్తున్నది.1973 లో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డ్ వచ్చినపుడు ఆమెకు రవి/రాహువు గాని రవి/గురువు గాని నడిచింది.అంటే భాగ్యభావం వికాసం చెందటం అప్పుడు మొదలైందన్నమాట.

1982లో ఈమె రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు చంద్ర/శనిదశ జరిగింది. మిధునలగ్న జాతకం ప్రకారం లాభాదిపతితో కూడిన చంద్రుడూ,వృత్తి కారకుడైన శనీ ఈమెకా యోగాన్నిచ్చారని అనుకోవాలి.

1984 లో రాజ్యసభకు నామినేట్ చెయ్యబడినప్పుడు ఆమెకు చంద్ర/బుధ దశ జరిగింది.బుధుడు రవితో కూడి నవమంలో ఉన్నాడు.సరిపోయింది.

1987 లో మొదలైన కుజదశ ఆమెకు మళ్ళీ రాజకీయ వైభవాన్ని కట్టబెట్టింది.తిరిగి 1991 లో కుజ/బుధ దశలో ఆమె ఎన్నికలలో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యింది.బుధుడు మళ్ళీ ఆమెను నిలబెట్టాడు.

ఒక ఫుల్ టర్మ్ చేసిన తర్వాత 1996 లో ఆమె అధికారం కోల్పోయి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది.దానికి కారణం 1994 లో మొదలైన రాహు మహాదశ.

2000-2002 మధ్యలో జరిగిన రాహు/శని శపిత యోగదశ జరిగింది.2011 లో రాహు/చంద్ర లేదా రాహు/కుజదశలో పదవి మళ్ళీ వరించిన సంఘటన ప్రకారం లాభరాహువునుంచి చూస్తే వృషభలగ్నం కంటే మిధునలగ్నమే ఎక్కువగా సరిపోతున్నది.

2014 లో గురు/శనిదశలో ఆమె అక్రమ ఆస్తుల కేసులో జైలుకెళ్ళడం ద్వారా పదవిని మళ్ళీ కోల్పోవలసి వచ్చింది.నవంబర్ 2004 లో రాహు/బుధదశ జరిగినప్పుడు కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేయించిన సంఘటన కూడా నవమరాహువు దృష్ట్యా మిధునలగ్నానికే బాగా సరిపోతున్నది.

ఈ పరిశీలనను బట్టి చూస్తే,ఇప్పటివరకూ చూచిన ఎక్కువ పాయింట్లు వృషభ లగ్నంకంటే మిధునలగ్నాన్నే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నందున,జనన సమయం 14.34 hours కరెక్ట్ అని అనిపిస్తున్నది.
read more " పురచ్చితలైవి డా|| జయలలిత జాతకం-ఒక పరిశీలన-2 "

29, అక్టోబర్ 2014, బుధవారం

పురచ్చితలైవి డా|| జయలలిత జాతకం-ఒక పరిశీలన

ఒకప్పటి సినిమా నటి,నిన్నటి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత జాతకం చూడమని ఒక మిత్రుడు కోరాడు.ఆయనకు సినిమా వాళ్ళూ,తమిళనాడు రాజకీయ ప్రముఖులూ కొందరు తెలుసు.ఆమె కర్నాటక జెయిల్లో ఉన్నప్పుడే ఈ అభ్యర్ధన వచ్చింది.ఇంకా చెప్పాలంటే, కోర్టు తీర్పు విడుదల కాకముందే ఆయన నన్ను అడిగాడు. ప్రముఖులు వివాదాస్పద సమయాలలో ఉన్నపుడు, అందులోనూ కోర్టు వ్యవహారాలలో ఉన్నపుడు మనం జోక్యం చేసుకోరాదని నేను నిరాకరించాను.

జయలలిత జాతకాన్ని చూడమని ఆయన మరీమరీ కోరినమీదట,ఆమె జననసమయం కావాలని అడిగాను.నిన్నటితరం సినిమానటి జయంతిగారిని ఆయన ఫోన్లో అడిగి చెప్పిన వివరాల ప్రకారం జయలలిత 24-2-1948 న మధ్యాన్నం 12.30 కి మైసూరు మహారాజా ప్యాలెస్ లో పుట్టిందని తెలిసింది.ఇంకొక తమిళనాడు ఎమ్మెల్యే చెప్పిన వివరాల ప్రకారం తేదీ అదేగాని సమయం మధ్యాన్నం 14.51 కి శ్రీరంగంలో పుట్టిందని ఒక వివరం తెలిసింది.ఇంకొకాయన చెప్పిన వివరం ప్రకారం తేదీ అదేగాని,సమయం మధ్యాన్నం 14.51 అనీ జన్మస్థలం మాండ్యా జిల్లా మెల్కోటే అనీ తెలిసింది.

అనేక కారణాల వల్ల ప్రముఖులు తమతమ జననవివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు.ఆసలైన జననవివరాలు బయటకు తెలిస్తే ప్రత్యర్ధులు ఎవరైనా మంత్రగాళ్ళను ఆశ్రయించి ఏమైనా చేయిస్తారేమో అనే భయం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.జననవివరాలను బట్టి ప్రయోగాలు చేసే విధానం ఒకటి ప్రాచీన జ్యోతిష్యజ్ఞానంలో ఉన్నది.ఆంధ్రాలో అంతటి శక్తివంతులు లేరుగాని, తమిళనాడు కేరళలలో ఉన్నారు.కారణం ఏదైనా, ప్రముఖులు తమ అసలైన జననవివరాలను అంత త్వరగా బయటకు చెప్పరనేది సత్యమే.

జాతకం చూడమని ఎవరైనా నన్నడిగినప్పుడు వారు ఏ ఉద్దేశ్యంతో అడిగారో,వారిలో సిన్సియారిటీ ఎంతుందో నాకు వెంటనే తెలుస్తుంది.ఆ సిన్సియారిటీలో పాళ్ళను బట్టి వారికి జవాబు చెప్పాలా వద్దా,ఆ జాతకం చూడాలా వద్దా నేను నిర్ణయించుకుంటాను.తదనుగుణంగానే వారికి జవాబిస్తాను.జాతకుని ఖర్మగానీ అడిగినవారి ఖర్మగానీ చాలా బలంగా ఉంటే కూడా నన్ను ఆ జాతకాన్ని చూడనివ్వకుండా చేస్తుంది.అడిగినవారిలో ఉండవలసిన పద్ధతులు లేకుంటే కూడా నేను ఆ జాతకం చూడను.

నాకు పైన లభించిన రకరకాల డేటాను సంస్కరించి చూడగా జయలలిత జననసమయం 24.2.1948;12.30 hours;మెల్కోటే;మాండ్యాజిల్లా అని అనిపిస్తుంది.ఆ సమయానికి వేసిన చక్రం ఇక్కడ ఇస్తున్నాను.

ఈమె పౌర్ణమి నాడు జన్మించింది.పౌర్ణమి నాడు జన్మించినవారి జాతకాలలో వివాహ జీవితం దెబ్బతింటుంది అని నా పరిశోధన అనేక జాతకాలలో ఋజువు చేసింది.ఆ సూత్రం ఇక్కడ కూడా స్పష్టంగా కనిపించడం గమనార్హం.

ఆమెకు 15 ఏళ్ళున్నప్పుడు (1962-63) మొదటిసారి సినిమాలలో నటించింది.అప్పుడామెకు శుక్ర/గురు దశ జరిగింది.లాభస్థానంలో ఉన్న ఉచ్ఛశుక్రుడూ, లాభాధిపతి అయిన అష్టమగురువూ కలసి ఆమెకు అవకాశాలు ఇచ్చారు. గురువు కేతునక్షత్రంలో ఉండటమూ ఆ కేతువు షష్ఠమంలోని శుక్రరాశిలో ఉండటమూ గమనిస్తే ఆమెకు సినిమా చాన్సులు అంత చిన్న వయసులోనే ఎందుకు వచ్చాయో తెలుస్తుంది.దశమం తర్వాత షష్టాన్నే వృత్తిస్థానంగా చూడాలి.

1972 లో దశమ రవిదశ మొదలవ్వగానే ఆమెకు అవార్డులు రావడం మొదలైంది.1973 లో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డ్ వచ్చినపుడు ఆమెకు రవి/కుజ దశ నడిచింది.కుజుడు చతుర్ధంలోనూ రవి దశమంలోనూ ఉండి పరస్పర సమసప్టక దృష్టిలో ఉన్నారని,రవి యోగకారకుడూ తృతీయంలో బలంగా ఉన్న శని నక్షత్రంలోనూ కుజుడు శుక్రుని సూచిస్తూ ద్వితీయవృత్తి స్థానంలో ఉన్న కేతువు నక్షత్రంలోనూ ఉన్న విషయాన్ని గమనించాలి.

1982 లో రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు చంద్ర/గురుదశ జరిగింది.వీరిద్దరి మధ్యనా శుభ పంచమ దృష్టి తో బాటు,గురువు కూడా శుక్రసూచకుడై ద్వితీయ వృత్తిస్థానంలో ఉన్న కేతువు నక్షత్రంలో ఉన్న విషయం గమనార్హం.అందుకే సినిమాల నుంచి ఆమె రాజకీయ రంగప్రవేశం చేసింది.దాదాపు ఇదే సమయంలో ఇంకొక సినిమా నటుడైన NTR కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టాడు.ఆ సమయంలో సహజ వృత్తి కారకుడూ,వీరిద్దరికీ యోగకారకుడూ అయిన శని,సినిమానటులకూ ఉన్నతాధికారులకూ సూచకమైన తులారాశిలోకి గోచారరీత్యా ప్రవేశించ బోతున్నాడు.

1984 లో రాజ్యసభకు నామినేట్ చెయ్యబడినప్పుడు ఆమెకు చంద్ర/బుధ దశ జరిగింది.బుధుడు రవితో కూడి దశమంలో ఉండటం చూడవచ్చు.

1988 లో మొదలైన కుజదశ ఆమెకు మళ్ళీ రాజకీయ వైభవాన్ని కట్టబెట్టింది.అయితే ఆ దశలోని కుజ,రాహు,గురు,శని అంతర్దశలు నానారకాల గొడవలతో గడిచాయి.తిరిగి 1991 లో కుజ/బుధ దశలో ఆమె ఎన్నికలలో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యింది.బుధుడు మళ్ళీ ఆమెను నిలబెట్టాడు.

ఒక ఫుల్ టర్మ్ చేసిన తర్వాత 1996 లో ఆమె అధికారం కోల్పోయి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది.దానికి కారణం 1995 లో మొదలైన రాహు మహాదశ.రాహువు శనీశ్వరుల దశలు జాతకంలో జరుగుతున్నపుడు ఆ జాతకుడు చాలా జాగ్రత్తగా పద్దతిగా బ్రతకాలి.ఎందుకంటే ఈ రెండు గ్రహాలకూ దయాదాక్షిణ్యం ఉండదు.చిన్న తప్పు చేసినా వీపు పగలగొడతాయి.కానీ చాలామంది మానవులు ఈ సమయంలోనే తప్పులు చేస్తుంటారు.ఫలితాలు అనుభవిస్తుంటారు.ఇదొక కర్మ నియమం.

గ్రహాలకు పెద్దాచిన్నా రాజూపేదా అన్న తారతమ్యం ఉండదు.అవి దైవ స్వరూపాలు.మన హోదాలూ పదవులూ వాటిముందు ఏమీ పనిచెయ్యవు.ఎవరి కర్మను వారికి అందజెయ్యడమే వాటి పని.మన విషయాలు మనకు గొప్ప కావచ్చేమోగాని విశ్వశక్తులైన గ్రహాలకు అవి పూచికపుల్లలతో సమానం. 

2000-2003 మధ్యలో జరిగిన రాహు/శని శపిత యోగదశలో ఆమె నానా బాధలు పడింది.కోర్టు గొడవలు చుట్టుముట్టాయి.పదవి వరించి, ఊడిపోయి, మళ్ళీ వరించింది.2011 లో రాహు/చంద్రదశలో పదవి మళ్ళీ వరించినా వివాదాలు మాత్రం ఆమెను వదలలేదు.ఈ దశలో ఆమె మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం చతుర్ధంలోని చంద్రమంగళ యోగమే.

2014 లో గురు/గురు దశలో ఆమె అక్రమ ఆస్తుల కేసులో జైలుకెళ్ళడం ద్వారా పదవిని మళ్ళీ కోల్పోవలసి వచ్చింది.నవంబర్ 2004 లో రాహు/బుధ/రాహు దశ జరిగినప్పుడు కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేయించి జైల్లో నేలమీద కూచోబెట్టిన ఫలితమే ఈనాడు ఈ స్థితికి కారణం అని కొందరి ఊహ.ఎందుకంటే గురుదశ ప్రారంభం కావడంతోనే ఈమె కోర్టు కేసులో జైలుకెళ్ళి పదవిని కోల్పోవడం గురుశాపాన్ని సూచిస్తున్నది.

గురుదశలో ఎవరికైనా కష్టాలు మొదలయ్యాయంటే వారి జాతకంలో ఖచ్చితమైన గురుశాపం ఉంటుంది.అది ఈ జన్మది కావచ్చు,లేదా గత జన్మలది కావచ్చు.

మహనీయులను,గురువులను,హింసపెట్టడం,అవమానించడం మొదలైన పనులు గురుశాపానికి కారణం అవుతాయి.ఆయా గురువులు శాపాలను ఇవ్వకపోవచ్చు.ఉదారస్వభావంతో వారు క్షమించి ఊరుకోవచ్చు. కాని ప్రకృతి క్షమించదు.ఎందుకంటే ప్రకృతిలో నియమమే ఉన్నది గాని క్షమ అనేది లేదు.కాలగమనంలో ఆయా చర్యల ఫలితాలు తప్పనిసరిగా కనిపిస్తాయి.ఇది ఎంతటివారికైనా తప్పదు.సమయం వచ్చినప్పుడు ఎవరికి తగిన కష్టాలను వారు పడక తప్పదు.

ప్రస్తుతం శనిగోచారం వల్ల ఇంకొక నాలుగు రోజులలో ఈమెకు అర్దాష్టమ శని మొదలౌతున్నది.గురు మహర్దశలో ప్రస్తుతం జరుగుతున్న గురు అంతర్దశ, ఆ తర్వాత 2017 వరకూ జరిగే శని అంతర్దశ కూడా ఈమెకు మంచి ఫలితాలను ఇవ్వవు.ఆ తర్వాత వచ్చే బుధ అంతర్దశ మాత్రమే మళ్ళీ వెలుగును ఇవ్వగలదు.

అంతవరకు ఈ జాతకురాలికి కష్టకాలమే అని చెప్పాలి.

జాతకాన్ని స్థూలంగా మాత్రమే పరిశీలించడం జరిగింది.సూక్ష్మ వివరాలలోనికి కావాలనే వెళ్ళడం లేదు.
read more " పురచ్చితలైవి డా|| జయలలిత జాతకం-ఒక పరిశీలన "

26, అక్టోబర్ 2014, ఆదివారం

దయ్యాలు లేవూ?-3

ముందుగా నీవడిగిన ప్రశ్నకు వివరంగా జవాబు చెబుతా.

'మా రూంలో ఇంత మంచి వాతావరణం ఉంటేకూడా ఆ ఆత్మ ఎలా రాగలిగింది?' అని కదా నీవడిగావు?ఊరకే పటాలు పెట్టి పూజలు చేసినంత మాత్రాన శక్తి రాదమ్మా.దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది.ఆ పూజలూ అవీ చాలావరకూ మన ఆత్మసంతృప్తి కోసం మాత్రమే చేస్తాము.నిజమైన శక్తిని సంపాదించే పద్ధతులు వేరేగా ఉంటాయి.అవి గురూపదేశం ద్వారా తెలుసుకొని ఆచరించాలి.

పైగా,కొన్ని ఆత్మలు బ్రతికి ఉన్న రోజులలో పూజలూ అవీ బాగానే చేసి ఉంటాయి.వాటికీ భక్తి ఉంటుంది.కనుక దేవుళ్ళ పటాలు ఉన్న గదులలోకి కూడా కొన్ని ఆత్మలు చక్కగా రాగలవు.

ఇంకొక విషయం ఏమంటే,ఆత్మ మీ రూంకి రాలేదు.ఆ ప్రదేశంలో అది ఎప్పటినుంచో ఉన్నదని నీవే చెబుతున్నావు.మీరే అవి ఉన్న చోటికి వెళ్ళారు.అవి మీరున్నచోటికి రాలేదు.దానింటికే మీరు వెళ్ళారు.

మరి మేము చేసిన ప్రక్రియవల్ల అది ఎందుకు వెళ్ళిపోయిందని నీకు అనుమానం రావచ్చు.ఆ సమయంలో మీరు పడుతున్న బాధను చూచి,నీకు రక్షణగా ఉన్న ఏదో శక్తి నీకా సమయంలో అండగా నిలబడి సాయం చేసింది. ఆ సాయాన్ని స్వీకరించే వాతావరణాన్ని మీరు మీ రూంలో కల్పించారు. అందుకే ఆ ఆత్మ అక్కడనుంచి వెళ్ళిపోయింది.ఒక్క మీరు చేసిన ప్రక్రియ మాత్రమే దానికి చాలదు.మీకు తెలియని ఒక శక్తి ఏదో మీకు ఆ సమయంలో బయటనుంచి సాయం చేసింది.పైగా ఆ ఆత్మ హానికరమైనది కాదు.హాని చేసే ఆత్మలు అలా ఉండవు.' అన్నాను.

'ఓ! అదా సంగతి!!నాకూ అదే అనుమానం వచ్చింది.ఊరకే హనుమాన్ చాలీసా ప్లే చేసి మంత్రజపం చేస్తేనే అది వెళ్లిపోయిందా?ఇదెలా సంభవం?అని నాకూ అనిపించింది.ఇంతకీ ఎవరా శక్తి?నీవేనా?' అడిగింది మా అమ్మాయి.

'అసలైన విషయాలు అంత త్వరగా చెప్పనని నీకు తెలుసుగా.నేను కావచ్చు.కాకపోవచ్చు.' అన్నాను నవ్వుతూ.

'నీతో వచ్చిన సమస్య ఇదే నాన్నా.అసలు విషయం తప్ప అన్నీ చెబుతావు.' అన్నది.

'అన్నీ చెప్పడానికి సమయం సందర్భం రావాలమ్మా.అవి వచ్చినపుడు అన్నీ చెబుతాను.ఇన్నేళ్ళ నా రీసెర్చిని మీకు కాక ఇంకెవరికి చెబుతాను?' ప్రశ్నించాను.

'సరే నాన్నా.ప్రేతాత్మలతో డీల్ చేసే విధానాలు చెప్పు.' అడిగింది.

చెప్పడం ప్రారంభించాను.

'వాటితో డీల్ చెయ్యాలంటే స్థూలంగా మూడు మార్గాలున్నాయమ్మా.

ఒకటి-వస్తువుల సహాయంతో.

శక్తితో నింపబడిన కొన్ని వస్తువులను మన వద్ద ఉంచుకోవడం ద్వారా ప్రేతాత్మల ప్రభావం నుంచి మనం రక్షించుకోవచ్చు. తాయెత్తులు,ఒంటిమీద ధరించే యంత్రాలు,జాతిరాళ్ళు,కొన్ని మూలికలు, సిద్ధక్షేత్రాలలో పూజకు వాడిన కుంకుమ మొదలైన పూజా ద్రవ్యాలు, మహనీయుల చేత మంత్రపూతం గావించబడిన జపమాలలు, రుద్రాక్షలు, నిర్మాల్యం మొదలైన వస్తువులు మన దగ్గర ఉంచుకోవడం ఒక పద్ధతి.

యుద్ధానికి వెళుతూ కవచం ధరించి వెళ్ళడం వంటిది ఇది.మనలో శక్తి లేనప్పుడు బయటి వస్తువుల సహాయం తీసుకోవాలి.ఇది అధమమార్గం. ఎందుకంటే ఈ విధానంలో మనకు వాటినుంచి రక్షణ ఉంటుంది.అంతేగాని వాటిని మనమేమీ చెయ్యలేము.వాటిని మార్చలేము.వాటికి విముక్తిని కలిగించలేము.ఆ వస్తువులు మనవద్ద ఉన్నంతవరకూ మనకు రక్షణ ఉంటుంది.అంతే.

రెండు-ఉపాసనా బలంతో.

నీకు నిజమైన ఉపాసనా బలం ఉన్నపుడు ఆ బలంతో వాటిని ఎదుర్కోవచ్చు.దానికి కొంత తంత్రమూ కొంత క్రియా కలాపమూ ఉంటుంది.మంత్ర-తంత్ర విధానంలో వాటిని నిగ్రహించి పాలద్రోలవచ్చు.ఇందులో వాటిని అక్కడనుంచి వెళ్ళగొట్టటమే ఉంటుంది గాని అసలు వాటి బాధ ఏమిటి?అవి అక్కడ ఎందుకున్నాయి?మొదలైన సమస్యలు పరిష్కారం కావు.వాటిని పరిష్కారం చేసే శక్తి ఈ స్థాయిలో వారికి ఉండదు.యుద్ధానికి వెళుతూ కవచంతో బాటు కత్తీ డాలూ ధరించి వెళ్ళడం వంటిది ఈ స్థాయి.ఇందులో,నిన్ను నీవు రక్షించుకుంటూ ఎదుటి శక్తిని ఎదుర్కొనే శక్తి నీకుంటుంది.కానీ వాటి బాధలు ఏమిటో గమనించి ఆ బాధలను తీర్చేశక్తి నీలో ఉండదు.వాటిని అక్కడనుంచి బలవంతాన వెళ్ళగొట్టగలుగుతావు.అంతే.దానివల్ల నీకు మళ్ళీ కొంత పాపఖర్మ చుట్టుకుంటుంది.ఆ వలయంలో నీవూ చిక్కుకుంటావు.

ఇందులో మళ్ళీ రకరకాల సబ్ గ్రూపులున్నాయి.లోకంలో ఉండే మంత్రగాళ్ళూ,నిజమైన ఉపాసకులూ,నకిలీ ఉపాసకులూ అందరూ ఈ స్థాయిలోనే ఉంటారు.వారి విధానాలలో ఎన్నో తేడాలు ఉంటాయి.వారు టాప్ చేసే శక్తులలో కూడా రకరకాలైన తేడాలుంటాయి.ప్రాణికశక్తులను అదుపులో ఉంచుకుని ప్రక్రియలు చేసేవారు కొందరైతే,దైవశక్తిని కొద్దిగా సాధించి దానితో చేసేవారు ఇంకొందరు.వారు చేసే విధానాన్ని బట్టి వారు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవచ్చు.

మూడు-అత్యున్నత ఆధ్యాత్మికశక్తితో

నిజమైన ఆధ్యాత్మిక శక్తి నీలో ఉన్నప్పుడు నీ సంకల్పబలంతోనే వాటిని అక్కడనుంచి పంపించేయవచ్చు. ఊరకే నీవు సంకల్పించిన వెంటనే ఈ అద్భుతం జరుగుతుంది.అయితే అది నీ సంకల్పం కాదు.దైవంతో నీవు అనుసంధానం అయ్యి ఉండాలి.నీవు పిలిస్తే దైవం వెంటనే పలకాలి.నీవు కోరినది దైవం చెయ్యాలి.అంతటి చనువు నీకూ దైవానికీ మధ్యన ఉండాలి.అప్పుడు మాత్రమే ఈ స్థాయికి చెందిన ప్రక్రియ సాధ్యమౌతుంది.

నిరాయుధుడుగా యుద్ధానికి వెళ్ళే మహావీరుని వంటి స్థాయి ఇది.ఈ స్థాయిలో ఉన్నవారికి ఏ ఆయుధమూ అవసరం లేదు.ఏ కవచమూ అవసరం లేదు.వారి సంకల్పమే అమోఘమైన శక్తిగా పనిచేస్తుంది.అదే అత్యున్నతమైన ఆయుధం.

ఈ స్థాయిలో మనం ప్రక్రియను చేస్తే,ఆ ఆత్మ పడే బాధను మనం తొలగించి దానిని ఉన్నత లోకాలకు పంపగలుగుతాము.ఈ భూవాతావరణపు ఊగిసలాటనుంచి దానికి విముక్తి కల్గించి జననమరణ చక్రంలో మళ్ళీ దానిని ప్రవేశ పెట్టగలుగుతాము.వాటిని అక్కడనుంచి పారద్రోలడమే గాక వాటి సమస్యనుంచి వాటికి విముక్తి కలిగించి ఉన్నతమైన గతులను సృష్టిక్రమంలో వాటికి కలిగించే ప్రక్రియ ఇది.మహాయోగులూ సిద్ధులూ అయినవారు మాత్రమే దీనిని చెయ్యగలరు.

మద్రాస్ మెరీనా బీచ్ లో ఒకసారి స్వామి వివేకానంద నడుస్తున్నపుడు ఆయనకొక స్పిరిట్ (పిశాచం) కనిపించి తనకు విముక్తి ప్రసాదించమని ప్రార్ధించింది.

'నేను సర్వసంగ పరిత్యాగిని.నీకు నేనేమివ్వగలను?' అని ఆయన ప్రశ్నించారు.

'నీ చేత్తో ఏదిచ్చినా నాకు ఈ పిశాచజన్మ నుంచి విముక్తి లభిస్తుంది' అని అది జవాబిచ్చింది.

వెంటనే స్వామి ఒక గుప్పెడు ఇసుకను చేతిలోకి తీసుకుని శ్రీరామకృష్ణులను తన మనస్సులో స్మరిస్తూ దాని వైపు ధారగా విడచిపెట్టారు.మరుక్షణమే ఆ పిశాచరూపం దానికి వీడిపోయి ఉత్తమలోకాలవైపు ఆ జీవి సాగిపోయింది.ఇది వివేకానందస్వామి మద్రాస్ లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన.

అవతార పురుషుడైన శ్రీరామకృష్ణుని కటాక్షం తనపైన పుష్కలంగా ఉన్నది గనుకా,తను పిలిస్తే ఆయన వెంటనే పలుకుతారు గనుకా,వివేకానందులు ఆ పనిని అంత సులభంగా చెయ్యగలిగారు.మహాసిద్ధులైన వారి సంకల్పానికి అంతటి శక్తి ఉంటుంది.

ఏ కారణమూ ఏ బాధా ఏ తీరని కోరికా లేకుండా ఎవరూ ప్రేతాత్మలుగా మారరు.ఆ ప్రేతాత్మ పడే అవస్థ వెనుక తీరని కోరికలూ,కసీ,కోపమూ ఉంటాయి.ఆ నెగటివ్ వైబ్రేషన్స్ ను డిజాల్వ్ చెయ్యగలిగే శక్తి నీకు ఉంటే అప్పుడు మాత్రమే ఈ స్థాయికి చెందిన విధానం నీకు సాధ్యమౌతుంది.ఇది చెప్పుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు.ఘనీభవించిన నెగటివ్ శక్తులతో చెలగాటం.తేడా వస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి.

ఇవమ్మా వీటిలోని మూడు స్థాయిలు.

ఇవిగాక,యూనివర్సల్ ఈవిల్ ఫోర్సెస్ కొన్ని ఉంటాయి.వీటిని డెమన్స్ అనీ రాక్షసులనీ పిలవవచ్చు.ఇవి చాలా భయంకరమైన దుష్టశక్తులు.వీటి ప్రభావం గ్లోబల్ లెవల్లో ఉంటుంది.వాటిని సామాన్యమానవుడు ఎవడూ టాకిల్ చెయ్యలేడు.మనిషి అంటే వీటికి ఒక వడియంతో సమానం.అందుకే ఇవి మనుషుల జోలికి రావు.మనిషనేవాడు వాటి కళ్ళకు ఆనడు.

పెద్దపెద్ద గ్లోబల్ కార్యకలాపాలలో మాత్రమే ఇవి పాలుపంచుకుంటాయి. జనసమూహాలమీదా,దేశాలమీదా,కులాలమీదా,గ్రూపులమీదా మాత్రమే ఇవి పనిచేస్తాయి.వాటిని టాకిల్ చెయ్యడం ఒక్క అవతారపురుషుల వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. మహాయోగులు కూడా ఈపని చెయ్యలేరు.వీటిముందు వారి శక్తి కూడా చాలదు.ఇవి యూనివర్సల్ డార్క్ ఫోర్సెస్.వాటి గురించి మళ్ళీ ఇంకోసారి సందర్భం వచ్చినపుడు వివరంగా చెబుతాలే.' అన్నాను.

'అర్ధమైంది నాన్నా.మరి,ఆ ఆత్మల్లో కూడా తేడాలుంటాయి కదా.' అడిగింది తను.

'అవునమ్మా.అన్ని ఆత్మలూ ఒకేలా ఉండవు.వాటిల్లో కూడా కొన్ని దుష్టాత్మలుంటాయి.వాటితో డీల్ చెయ్యడం చాలా కష్టం.మనుషుల్లో దుర్మార్గులున్నట్లే వాటిలోనూ ఉంటాయి.మనుషులేగా దయ్యాలయ్యేది?బతికున్నపుడు ఎలా ఉంటాడో దయ్యమైన తర్వాతా అలాగే ఉంటాడు.తేడా ఏమీ ఉండదు.వీటిని మార్చాలంటే చాలా కష్టం.లొంగవు.మారవు.మొండిగా ఉంటాయి.అలా ఉండటమే వాటికిష్టం.ఆ స్థితినుంచి మారాలని వాటికనిపించదు.మార్చాలని మనం ప్రయత్నిస్తే మనల్ని ఎటాక్ చెయ్యడానికి కూడా వెనుకాడవు.

కొన్ని మిస్చీవస్ ఆత్మలుంటాయి.అవి చెప్పేవి ఏదీ నిజం కాదు.అబద్దాలు చెప్పి నిన్ను తప్పుదోవ పట్టించి ఆనందించడం వాటికొక సరదా.నువ్వు కంగారు పడుతుంటే అవి ఆనందంతో ఎగురుతూ ఉంటాయి.మనుషులలో మోసగాళ్ళున్నట్లే వాటిలోనూ ఉంటాయి.నిన్ను విమర్శించడం,శల్యసారధ్యం చెయ్యాలని చూడటం,'నన్ను వదిలించడం నీవల్ల కాదని' హేళన చెయ్యడం వాటికి సరదా.ఆ స్థితి వాటికీ ఆనందంగా ఉంటుంది గనుక మారాలని వాటికీ తోచదు.కనుక ఎదురు తిరుగుతాయి.

కొన్ని అమాయక ఆత్మలుంటాయి.బ్రతికున్నపుడు వాటికి అన్యాయం జరిగి ఉంటుంది.ఆ ఉక్రోషం ఎటూ పోదు.మార్గం కనపడదు.అందుకని అవి దిగాలుగా ఏడుస్తూ తిరుగుతూ ఉంటాయి.ఎవరైనా తమకు సహాయం చేస్తే బాగుండునని వెదుకుతూ ఉంటాయి.వీటికి సాయం చెయ్యడం తేలిక.కానీ దానికి తగిన శక్తి మనలో ఉండాలి.ఇలాంటి వాటికి సాయం చెయ్యడం మనకు కూడా మంచిదే.ఎందుకంటే ఒక అమాయక ప్రాణికి సహాయం చేసినందువల్ల మనకు కూడా మంచి జరుగుతుంది.

ఈ మూడురకాల ఆత్మల్లో దేనితో డీల్ చేసినా ఒక్క విషయం నీవు గుర్తుంచుకోవాలి.ప్రాధమికంగా ఇదంతా ఇతరుల కర్మతో చెలగాటం ఆడటం. బుద్ధిలేక ఇతర్లు చేసుకున్న కర్మలో నీవు జోక్యం చేసుకోవడం అని మర్చిపోకు.కారణం లేకుండా నీ అనవసరమైన ఉత్సుకతతో నీవు వాటిలో తలదూరిస్తే నీకు బొప్పి కట్టడం ఖాయం.' అన్నాను.

'పనికిమాలిన లోకుల బాధలు తీర్చాలని నాకేమీ లేదులే నాన్నా.లోకమంతా స్వార్ధమయమే.మంచివాళ్ళు భూతద్దంతో వెదికినా ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు.ఇతరుల గోల మనకెందుకు?ఊరకే తెలుసుకుందామని అడిగాను.' అన్నది.

'మంచిదమ్మా! నీ సాధన తీవ్రతరం చెయ్యి.అదే నిన్ను ఎల్లవేళలా రక్షిస్తుంది. అదే సమయంలో నీకు సహాయం చేసి ఆ ఆత్మను పారద్రోలిన శక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి.'-అన్నాను నవ్వుతూ.

'చేస్తాలే.తప్పుతుందా?నీవెలాగూ చెప్పవుగా?' అంది.

'నాది ఐ.ఐ.టీ టీచింగమ్మా.ఆన్సర్ నా అంతట నేను చెప్పను.కొన్నికొన్ని హింట్స్ మాత్రమే నేనిస్తాను.ఆన్సర్ నీ అంతట నీవే తెలుసుకునేటట్లు చెయ్యడమే నా విధానం' అన్నాను.

(సశేషం)
read more " దయ్యాలు లేవూ?-3 "

25, అక్టోబర్ 2014, శనివారం

వృశ్చికరాశిలో శనిసంచారం - ఫలితాలు

ఇంకొక్క వారంలో శనీశ్వరుడు ఖగోళంలో తులారాశిని వదలి వృశ్చికరాశి లోకి అడుగుపెట్టబోతున్నాడు.

రాబోయే రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఘోరమైన ఉపద్రవాలు జరుగుతాయని 'రోహిణీ శకట భేదనం' శీర్షికలో ముందే హెచ్చరించాను.ప్రస్తుతం జరిగిన 'హుద్ హుద్' తుఫాను,రాబోతున్న ఇంకా పెద్ద విలయాలకు ముందస్తు సూచన మాత్రమే.శనీశ్వరుడు తులారాశిని వదలి వృశ్చికరాశిలోకి అడుగు పట్టడానికి సంసిద్ధుడౌతున్న సమయంలోనే ఇది జరిగిందన్న విషయం గమనార్హం.

ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో వ్యక్తుల జాతకాలలో గోచార రీత్యా ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

మేషరాశి
ఇందులోని నక్షత్ర పాదాలను బట్టి ఆయా జాతకులకు ఈ క్రింది ఫలితాలు జరుగుతాయి.
  • కొందరికి జీవితం దుర్భరం అవుతుంది.నిరాశా నిస్పృహలు చుట్టూ కమ్ముకుంటాయి.నష్టాలు ఎదురౌతాయి.
  • కొందరికి ఉన్నట్టుండి వృత్తి ఉద్యోగాలలో హటాత్తు మార్పులు గోచరిస్తాయి.ఉన్నతమైన ఉద్యోగాలు ప్రోమోషన్లు వస్తాయి.ఆస్తి గొడవలు పరిష్కారం అవుతాయి.పిత్రార్జితం కలసి వస్తుంది.
  • మొత్తం మీద ఈ రాశివారికి జీవితంలో మార్పులను సూచించే ముఖ్యమైన సమయం అవుతుంది.
  • స్త్రీలకు గైనిక్ సమస్యలు విజ్రుంభిస్తాయి.
వృషభ రాశి
  • వృత్తి ఉద్యోగాలలో సమాజ సంబంధాలలో పెనుమార్పులు కలుగుతాయి.
  • ఆయా నక్షత్ర పాదాలను బట్టి కొందరికి చుట్టూ ఉన్నవారితో గొడవలు,సంబంధాలు దెబ్బతినడం,ప్రతికూల పరిస్థితులలో పనిచెయ్యవలసి రావడం,పార్ట్ నర్లతో చేసే వ్యాపారాలలో నష్టాలు రావడం జరుగుతుంది.
  • కొందరికి భార్యతో/భర్తతో గొడవలు మొదలౌతాయి.వారి ఆరోగ్యాలు దెబ్బతినడం జరుగుతుంది.కళత్ర వియోగం కూడా కొందరికి సంభవిస్తుంది.
మిధునరాశి
  • వృత్తి ఉద్యోగాలలో కలసి వస్తుంది.పురోభివృద్ది కనిపిస్తుంది.కాకుంటే ఆ అభివృద్ధి ఘర్షణాత్మకంగా ఉంటుంది.అంటే ఇతరులతో ఘర్షణ తర్వాత మాత్రమే అది కనిపిస్తుంది.సజావుగా,సక్రమంగా ఉండదు.
  • వివాదాలలో కోర్టు కేసులలో గొడవలలో విజయాలు సొంతం అవుతాయి.
  • ఆస్తి తగాదాలలో బిజినెస్ డీల్స్ లో నష్టాలు చవిచూచినా చివరకు ఒడ్డున పడతారు.
కర్కాటక రాశి
  • మానసిక వేదన,ఘర్షణ ఎక్కువౌతాయి.
  • వృత్తి ఉద్యోగాలలో సాధింపులు,పై అధికారుల,సహోద్యోగుల వేధింపులు ఎక్కువౌతాయి.
  • జీవితంలో సుఖమూ శాంతీ లోపిస్తాయి.ప్రేమికుల మధ్యనా భార్యాభర్తల మధ్యనా విభేదాలు పొడసూపుతాయి.
  • ప్రేమవ్యవహారాలు అక్రమసంబంధాలు రోడ్డుకెక్కుతాయి.
సింహరాశి
  • విద్యార్ధులకు విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి.పరీక్షలు తప్పుతారు.
  • గృహశాంతి లోపిస్తుంది.
  • గుండె,ఊపిరితిత్తుల రోగులకు రోగం ఎక్కువౌతుంది.
  • తల్లితండ్రులకు ఆరోగ్యాలలో తేడాలొస్తాయి.
  • స్త్రీలకు గైనిక్ సమస్యలు ఎక్కువౌతాయి.
కన్యారాశి
  • జీవితంలో ధైర్యం పెరుగుతుంది.ఆత్మవిశ్వాసం ఎక్కువౌతుంది.
  • ప్రేమవ్యవహారాలలో ధైర్యంగా ముందుకు పోతారు.
  • రచనావ్యాసంగాలు సఫలం అవుతాయి.
  • ఇతరులతో కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది.
  • తమ్ములకు చెల్లెళ్ళకు కష్టకాలం.
తులారాశి
  • గృహబాధ్యతలు ఎక్కువౌతాయి.ఇంట్లోవారితో మాటపట్టింపులు వాదనలు ఎక్కువౌతాయి.
  • మరికొందరికి పిరికితనం ఎక్కువౌతుంది.మాట పెగలదు.వాదనలలో ఓడిపోతారు.గాయకులకు అవకాశాలు తగ్గుతాయి.
  • ఇతరుల ముందు తమ వాదనను సమర్ధవంతంగా వినిపించే శక్తి సన్నగిల్లుతుంది.
వృశ్చికరాశి
  • కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
  • శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాలు చేస్తారు.
  • మానసిక అశాంతీ చికాకూ ఎక్కువౌతాయి.
  • తద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
  • స్త్రీలకు గైనిక్ సంబంధ సమస్యలు కనిపిస్తాయి.
ధనూరాశి
  • హటాత్ ఖర్చులు పెరుగుతాయి.నష్టాలు చవిచూస్తారు.
  • యాత్రలకు,పుణ్యక్షేత్ర సందర్శనకు,రహస్య కార్యకలాపాలకు ఖర్చు చేస్తారు.
  • కుటుంబ సభ్యుల,మిత్రుల రోగాల దృష్ట్యా ఆస్పత్రి సందర్శనం కలుగుతుంది.
  • చెప్పాలనుకున్నది చెప్పలేక మధనపడటం ఎక్కువౌతుంది.
  • దీర్ఘ రోగాలు విజ్రుంభిస్తాయి.
మకరరాశి
  • జీవితంలో లాభాలు కనిపిస్తాయి.
  • అన్నలకు అక్కలకు కష్టకాలం మొదలౌతుంది.
  • బంధువులతో విరోధాలు కలుగుతాయి.
  • స్నేహితుల, పరిచారకుల సహకారం బాగా ఉంటుంది.
కుంభరాశి
  • వృత్తిలో కష్టాలు ఎక్కువౌతాయి.
  • శరీర మానసిక ఒత్తిళ్ళు పెరుగుతాయి.
  • తండ్రికి ఆరోగ్యభంగం ఉంటుంది.దీర్ఘవ్యాధులతో బాధపడే తల్లితండ్రులు,పెద్దలు గతిస్తారు.
మీనరాశి
  • ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
  • వైరాగ్యం ఎక్కువౌతుంది.
  • పెద్దలకు,గురుసమానులకు ఆరోగ్యభంగం లేదా పరలోక ప్రయాణం.
  • ఆదాయమూ ఖర్చూ కూడా అనుకోకుండా పెరుగుతాయి.
వ్యక్తిగత జాతకాలలో జరుగుతున్న దశలను బట్టి ఈ గోచార ఫలితాలు మారుతాయి.రెంటినీ సమన్వయం చేసుకుని జరుగబోయే ఫలితాలను గమనించి,తదనుగుణములైన నివారణోపాయాలను పాటించాలి.
read more " వృశ్చికరాశిలో శనిసంచారం - ఫలితాలు "

23, అక్టోబర్ 2014, గురువారం

దయ్యాలు లేవూ?-2

(ఈ భాగం సరిగ్గా అమావాస్య నాడు పోస్ట్ చేస్తానని కొందరు మిత్రులకు చెప్పాను.అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఇక చదవండి)

'మా ఫ్రెండ్ కొంచం సేదదీరాక జరిగినదంతా దానికి చెప్పాన్నాన్నా.' అంది మా అమ్మాయి.

'ఆ తర్వాతేం జరిగిందో చెప్పు.' అడిగాను.

'ఇద్దరం కలిసి ఆ దయ్యాన్ని మా రూంలోనుంచి బయటకు పంపించాలని నిశ్చయించుకున్నాం.ఇంతకీ ఆ దయ్యం ఎవరై ఉంటుందో చెప్పగలవా?' అడిగింది.

'ఏముంది?మీరు పడుకుని ఉంటే రూంలో ఊరకే అటూఇటూ తిరుగుతూ ఉంటుంది.వేళకు లేపి మందులేసుకొమ్మని చెబుతుంది గనుక ఎప్పుడో చనిపోయిన ఏ నర్సింగ్ స్టూడెంటో అయి ఉంటుంది.' అన్నాను.

'నాన్నా.నీకొక విషయం చెప్పాలి.నేను మొదట్లో హాస్టల్లో చేరడానికి వెళ్ళినపుడు మెస్ లో మా సీనియర్ ఒకమ్మాయి పిలిచి ఏమందో తెలుసా?

'అమ్మాయ్.ఈ హాస్టల్లో చాలా తేడాలున్నాయి.జాగ్రత్తగా ఉండండి.'--అని హెచ్చరించింది.

'ఎందుకు మేడం?ఏమైంది?ఎందుకలా జాగ్రత్తలు చెబుతున్నారు?అనడిగాను.

'మీకే తెలుస్తుందిలే ముందుముందు' అని అదోలా చూస్తూ చెప్పింది.

'ఇంతలో ఇంకొక సీనియర్ వచ్చి 'ఎందుకే వాళ్ళను అలా భయపెడతావ్?నిదానంగా వాళ్ళకే తెలుస్తుందిలే' అని దానిని వారించింది.

అలా చెప్పి భయపెట్టడం ర్యాగింగ్ లో భాగమేమో అని మేము నవ్వుకొని ఊరుకున్నాము.కాని తర్వాత మాకే తెలిసింది అందులో కొన్ని హాంటెడ్ రూములున్నాయని.ఆ తర్వాత విచారిస్తే తెలిసింది.అక్కడ మా ఫ్లోర్ లోనే ఒక నర్శింగ్ అమ్మాయి సూయిసైడ్ చేసుకుని చనిపోయిందట ఎప్పుడో.ఆ అమ్మాయి దయ్యమై అక్కడే ఉంది నాన్నా.మాకే కాదు చాలామందికి కనిపించింది.

ఇంకో సంగతి చెప్పనా.కాకి తన్నిన అమ్మాయి దర్గాకి వెళ్లి తాయెత్తు కట్టించుకుని వచ్చింది కదా.ఆ దర్గా దగ్గర ఇలా దయ్యాలు పట్టినవాళ్ళు చాలామంది వస్తారట.వాళ్లకు వదిలిన దయ్యాలు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాయట వీక్ గా ఉన్నవాళ్ళను పడదామని.అందులో కొన్ని మా ప్రెండ్ వెంట మా హాస్టల్ కి వచ్చాయన్నమాట.అందుకే ఆ తాయెత్తు ఊడిపోయిన మరుక్షణం అవి వాటి ప్రతాపం చూపడం మొదలు పెట్టాయని అనుకుంటున్నాను.లేకుంటే ఆ నీడలు అవన్నీ ఏమిటి నాన్నా?'అడిగింది.

'ఊ' అంటూ సాలోచనగా చూచాను.

'ఇంకప్పుడేంజేశామంటే,తలుపులూ కిటికీలూ మూసేసి,ముందు రూమంతా క్లీన్ చేశాం.మేం రూం క్లీనింగ్ మొదలుపెట్టినప్పుడే ట్యూబ్ లైట్ వెలిగీ ఆరిపోతున్నది.ఆ చీకట్లోనే స్నానం చేసి రూంలో నరసింహస్వామి దగ్గరా ఆంజనేయస్వామి దగ్గరా అగర్బత్తీ వెలిగించి నా స్తోత్రాలన్నీ చదివాను నాన్నా. అగర్బత్తీ వెలిగిద్దామని ఫాన్ ఆపాము నాన్నా.కానీ ఏమైందో తెలుసా?అగ్గిపుల్ల వెలిగించగానే ఫాన్ దానంతట అదే రయ్యిమని తిరగడమూ అగ్గిపుల్ల ఆరిపోవడమూ ఇలా నాలుగైదుసార్లు జరిగింది.'నీ పని ఇలా ఉందా?'అని మొత్తమ్మీద ఎలాగోలాగ అగ్గిపుల్ల వెలిగించి అగర్బత్తీ అంటించాము. జిల్లెళ్లమూడి నుంచి మనం తెచ్చిన అమ్మ కుంకుమ పెట్టుకుని ఆ చీకట్లోనే రూంలో ఒకమూల కూర్చుని మంత్రజపం మొదలు పెట్టాను నాన్నా.

ఈలోపల మా ఫ్రెండ్, నా మొబైల్లో ఉన్న ఎమ్మెస్ రామారావుగారి హనుమాన్ చాలీసా ఆన్ చేసింది.అలా ఒక అరగంట జపం చేశాను నాన్నా.హనుమాన్ చాలీసా లూప్ అలా వస్తూనే ఉన్నది.అందులో-'భూత పిశాచ శాకినీ డాకిని భయపడి పారు నీ నామజపము విని..'-అంటూ ఒక లైన్ వస్తుంది కదా.అరగంట తర్వాత ఆ లైన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా రూం కిటికీలు నాలుగూ భళ్ళున వాటంతట అవే తెరుచుకున్నాయి నాన్నా.అప్పుడు నాకర్ధమైంది ఆ అమ్మాయి బయటకెళ్ళిపోయిందని.

ఆ తర్వాత మా రూంలో అంతకు ముందున్న వాతావరణం మారిపోయి ప్రశాంతంగా అయిపోయింది.ఆరోజు రాత్రి బాగా నిద్ర పట్టింది.కలలూ కలతనిద్రా ఏమీ లేవు.ఆ అమ్మాయి కూడా కనిపించలేదు.నాకూ మా రూమ్మేటుకూ ఇద్దరికీ అలాగే అనిపించింది.మేం చేసినది కరెక్టేనా నాన్నా?' అడిగింది.

'బాగుందమ్మా.మీరిద్దరూ చిన్నపిల్లలైనా భయపడకుండా భలే చేశారు.వెరీ గుడ్' అన్నాను.

'అసలది ఎలా వెళ్ళిపోయింది?' అనడిగింది.

'ఏం లేదమ్మా.మీ గదిలోని వైబ్రేషన్స్ ను మీరు మార్చేశారు.హనుమాన్ చాలీసా పారాయణమూ,నీ మంత్రజపమూ,అమ్మ కుంకుమా అన్నీ కలసి ఈ అద్భుతాన్ని చేశాయి.డివైన్ వాతావరణమూ,డివైన్ వస్తువులూ ఉన్నచోట ప్రేతాత్మలు నిలవలేవు.అక్కడ వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఆ వాతావరణాన్ని మీ రూంలో మీరు కల్పించారు.అందుకే అది అక్కడనుంచి వెళ్ళిపోయింది.' అన్నాను.

'ఆ అమ్మాయి ఎక్కడికి పోయి ఉంటుంది నాన్నా?' తనడిగింది.

'ఏముంది? తన పాత రూంకి వెళ్ళిపోయి ఉంటుంది' అన్నాను.

'అవున్నాన్నా.నిజమే.నువ్వు చెబితే ఇప్పుడు అనిపిస్తున్నది.ఇది జరిగాక మర్నాడు ఏదో నోట్స్ కావలసి వచ్చి,కాకి తన్నిన అమ్మాయి రూంకెళ్ళి తలుపుకొట్టాను నాన్నా.ఆ అమ్మాయి తలుపు తీసి మాట్లాడింది.కానీ అదోరకంగా చూసింది నాన్నా నన్ను.' అన్నది.

'ఎలా చూసింది?' అడిగాను.

'చంద్రముఖి సినిమాలో గంగలాగా కళ్ళు అదో రకంగా పెద్దవి చేసి చూసింది నాన్నా'-అన్నది.

'నువ్వేం చేశావ్?' అడిగాను.

'ఆ...నీ మొహం నువ్వు నన్నేం చెయ్యగలవ్?అనుకుంటూ వెనక్కి వచ్చేశాను.' అన్నది.

'గుడ్.వెరీ గుడ్.బాగుంది.అంటే నర్స్ దయ్యం వెనక్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఆవహించేసిందన్న మాట.అందుకే ఆ అమ్మాయి ఎప్పుడూ తలుపేసుకుని అలా ఉంటుంది ఆ రూంలో' అన్నాను.

'ఇంకో సంగతి విను నాన్నా.మా ఓల్డ్ హాస్టల్లో ఒక రూం ఉందిట నాన్నా.మా సీనియర్లు చెప్పారు.అందులో ఒక ఫైనల్ యియర్ అమ్మాయి ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం గ్యాంగ్ రేప్ కి గురైందిట.బాగా డబ్బూ పొలిటికల్ అండా ఉన్న కొందరు అబ్బాయిలు అది చేసి ఆ అమ్మాయిని చంపేశారట.కేస్ బయటికి రాలేదు.కానీ ఆ తర్వాత ఆ రూంలో పుస్తకాలు వాటంతట అవే చెల్లా చెదురుగా పడిపోవడమూ,రాత్రిళ్ళు ఎవరో ఏడుస్తున్నట్లూ,అటూ ఇటూ పరిగెత్తుతున్నట్లూ చప్పుళ్ళు రావడం ఇలా జరిగేదిట నాన్నా.అందుకని ఏవేవో హోమాలు చేసి ఆ రూముని తాళం వేసి మూసేశారట.ఇప్పటికీ ఆ రూం ఉందిట.' అన్నది.

'నువ్వు చూచావా ఆ రూంని?' అడిగాను.

'లేదు నాన్నా.నేను చూడలేదు.మా సీనియర్లు చెప్పారు.' అన్నది.

'అలాంటి పుకార్లు నమ్మకమ్మా.జూనియర్స్ ని భయపెట్టడానికి సీనియర్లు అలా కధలు అల్లి చెబుతూ ఉంటారు.అవన్నీ నమ్మకండి.అది సరేగానమ్మా,నువ్వు చెప్పిన ఈ దయ్యంకధని మంచి సినిమా తియ్యొచ్చు. ఇప్పటి ట్రెండ్ హర్రర్+కామెడీయే కదా.ఎలా ఉంది నా ఐడియా?' అడిగాను.

'కధేంటి నాన్నా?మళ్ళీ మొదటికొచ్చావ్?అంటే నేను చెప్పిందంతా కధ అనుకుంటున్నావా?' మళ్ళీ తనకు కోపం వచ్చేసింది.

'కధలు కూడా నిజాల నుంచే పుట్టుకొస్తాయిలే గాని,ముందు సినిమా సంగతి చెప్పు.ఆ సిన్మాలో నీకే రోల్ బాగుంటుంది?' అడిగాను.

'నా రోలే నేను వేస్తాను.స్టూడెంట్.మరి నువ్వే రోల్?' అడిగింది తను.

'ఏముంది? ఇదెలాగూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాయే కదా.హీరోయిన్ కి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చి ఉండాలి.ఎందుకంటే ఆ నర్స్ ను ఎవరు చంపారో తెలుసుకోవడానికి చేసే పరిశోధనలో విలన్స్ ను ఎదుర్కొని ఫైట్ చెయ్యవలసి వస్తుందికదా.అందుకని హీరోయిన్ కి మార్షల్ ఆర్ట్సూ,మంత్రతంత్రాలూ నేర్పే గురువుగా నేను నటిస్తాను.'అన్నాను.

'కానీ పాటలు మంచివి ఉండాలి నాన్నా.మ్యూజిక్ హిట్ అయితేనే సినిమా హిట్ అవుతుంది.అందులో నువ్వూ ఒక పాట పాడవచ్చు.' అన్నది తను.

'ఊ.అలాగే చేద్దాం.ఈ కధతో మంచి నిర్మాతని కలుద్దాం.' అన్నా.

'నువ్వు కలిసేలోపు,నీ బ్లాగులో ఈ కధ చూసి ఏ అసిస్టెంట్ డైరెక్టరో ఈ ప్లాట్ ఎత్తేసి ఇవ్వాల్సిన వాళ్లకి ఇచ్చేస్తాడు.వాళ్ళు సినిమా తీసేస్తారు.ఆర్నెల్ల తర్వాత మనమే ఆ సినిమాని చూస్తాం.ఇప్పటికే నువ్వు వ్రాస్తున్న మేటర్ కొన్ని దినపత్రికలలో 'స్పిరిట్యువల్ కాలమ్స్'లో కొద్ది మార్పులతో కనిపిస్తున్నది చూచావా?' అన్నది తను.

'కాపీ కొట్టుకుని వ్రాసుకోనియ్యమ్మా.విషయం జనాలకి అర్ధం కావడం మనకి ముఖ్యం. అంతేగాని ఈ పేర్లూ గొప్పలూ మనకెందుకు?నా వ్రాతలు చదివి కొందరైనా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అన్న విషయం గ్రహించి వాళ్ళ జీవితాలు సక్రమంగా గడిపితే అదే చాలు.వాళ్ళెవరో కూడా నాకు తెలియవలసిన పని లేదు' అన్నాను.

'సర్లే నాన్నా.ఇదంతా వదిలెయ్.నాదొక అనుమానం?' అడిగింది.

'చెప్పమ్మా' అన్నాను.

'నాన్నా.మా రూంలో నేను నరసింహస్వామీ ఆంజనేయస్వామీ పటాలు పెట్టాను.రోజూ పూజ చేస్తాను.నీవు చెప్పిన మంత్రజపం శ్రద్దగా చేస్తున్నాను.ఆ వాతావరణం ఉన్నప్పుడు అసలా దయ్యం మా రూంలోకి ఎలా రాగలిగింది? అసలీ ప్రేతాత్మలతో డీల్ చెయ్యాలంటే ఎన్ని పద్ధతులున్నాయి?వాటిని ఎలా చెయ్యాలి?' అడిగింది.

విషయం తెలుసుకోవాలన్న తన ఉత్సుకతకు ముచ్చటేసింది.

'ఇదొక పెద్ద సైన్సమ్మా.చెప్తా విను' అంటూ మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)
read more " దయ్యాలు లేవూ?-2 "

22, అక్టోబర్ 2014, బుధవారం

తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-2

అన్నయ్యా.'జీవితంలో ఏది జరిగినా అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నీవేం బాధపడకు.' అని అమ్మ చెప్పింది కదా? అడిగాడు సుబ్బు.

'అవును.'

'మరి అదే నిజమైతే,ఆకలితో ఉన్నవాళ్ళకు అన్నం పెట్టాలన్న ఒక్కదానిమీద అమ్మ అంత శ్రద్ధ ఎందుకు పెట్టింది?వాడి ఆకలి వాడి ఖర్మ అని వదిలెయ్య వచ్సుకదా?తను చెప్పినదానికి ఇది విరుద్ధంగా లేదూ?' అడిగాడు.

'ఇదేనా నీ సందేహం? అడిగాను.

'అవును' అన్నాడు.

చెప్తా విను.మహనీయుల మాటలను అర్ధం చేసుకోవడం కష్టం.వారి భావాన్ని సరిగ్గా గ్రహించాలంటే కూడా కష్టమే.చాలామంది,మహనీయులనూ వారి అసలైన భావాలనూ సరిగ్గా అర్ధం చేసుకోలేరు.వారి మాటలను తమకర్ధమైన రీతిలో మాత్రమే వారు అర్ధం చేసుకుంటారు.అంటే వారు గ్రహించేది వారి మనస్సులు చెప్పే భాష్యాలను మాత్రమేగాని ఆ మహనీయులు చెప్పిన అసలైన విషయాన్ని కాదు.మెజారిటీ భక్తులకూ అనుచరులకూ ఇదే జరుగుతుంది.

ఇక్కడ రెండు విషయాలున్నాయి.జాగ్రత్తగా గమనించు.

ఒకటి-ఏం జరిగినా మన ఖర్మ అని ఊరుకోవడం ఒక విధానం.నీవు నిజంగా అలా ఊరుకోగలిగితే అంతకంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు.కాని అలా ఊరుకోలేం కదా.బలవంతాన మనం ఊరుకున్నా మనస్సు ఊరుకోదు.అది పోరుపెడుతూనే ఉంటుంది.

కనుక రెండవ విధానం ఏమంటే-నీ ప్రయత్నం నీవు చెయ్యి.కానీ ప్రయత్నం చేసినా కొన్ని కావు.అప్పుడు ఇక ఊరుకోక చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు.ఒక రోగం వచ్చిందనుకో.ఎంతమంది డాక్టర్లకు చూపించినా అది తగ్గడం లేదు.ఇక నీవు చేసేదేమున్నది?మన ఖర్మ అని ఊరుకోవడమే.జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు.కొన్నికొన్నైతే ఎంత ప్రయత్నించినా మనిష్టప్రకారం జరగవు.అలాంటప్పుడు పూర్వకర్మప్రభావం బలంగా ఉన్నదని గ్రహించాలి.

ప్రయత్నం చేసినంత మాత్రాన,అదెందుకు కాదు అని గింజుకోవడమూ, హైరానా పడిపోవడమూ,దానికోసం కుట్రలూ కుతంత్రాలూ చెయ్యడమూ, మోసాలు చెయ్యడమూ ఇలాంటి పనులు చెయ్యవద్దని అమ్మ చెప్పింది.మన ప్రయత్నం మనం తప్పకుండా చెయ్యాలి.ప్రయత్నం కూడా కర్మేకదా. పాతకర్మని కొత్తకర్మతో జయిస్తాం.కనుక ప్రయత్నం మానరాదు.ప్రయత్నం చేసినంత మాత్రాన విజయం రావాలని కూడా కోరుకోకూడదు.ఒకవేళ విజయం దక్కకపోయినా బాధపడకుండా ఉండాలి.

ఎందుకంటే -- 'అమ్మ ఏమన్నది? విజయం దేవుడిస్తుంటే అపజయం ఎవరిస్తున్నారూ? అన్నదా లేదా? మరి అపజయం కూడా వాడిస్తున్న వరమే అయినప్పుడు ఇంక బాధకు తావెక్కడున్నది?

పైగా ఇక్కడ ఇంకొక కోణం ఉన్నది.అమ్మ మనల్ని ఆచరించమని చెప్పిన విషయాలు మనకే వర్తిస్తాయి.ఆమెకు కూడా అవే వర్తిస్తాయనీ వర్తించాలనీ అనుకోవడం తప్పు.మన స్థాయి వేరు.అమ్మ స్థాయి వేరు.స్థాయీ భేదం ఉన్నది.కనుక మనకు చెప్పిన విషయాలు మనం చెయ్యాలి.అంతేగాని అమ్మ చర్యలను మనం తీర్పు తీర్చకూడదు.

పైగా,అసలు విషయం ఏమంటే,అమ్మ అన్నపూర్ణాదేవి అవతారమని నా నమ్మకం.అన్నం పెట్టడం అమ్మ సహజలక్షణం.కనుక తనకు సహజమైన పనిని తాను చేసింది.మనం చెయ్యవలసిన పనిని మనల్ని చెయ్యమన్నది. అది మనం చెయ్యకుండా 'నువ్వెందుకు అలా చేస్తున్నావు?' అని ఆమెనే ప్రశ్నించడం కరెక్ట్ కాదు.' అన్నాను.

'ఇంకో ప్రశ్న అడగనా?' అన్నాడు.

'ఊ.అడుగు'

'కాలాన్నీ కర్మనీ ఒకటిగా తీసుకోవచ్చా?అంటే ఈ రెండు పదాలనూ పర్యాయ పదాలుగా తీసుకోవచ్చా?' అడిగాడు.

'ఈ అనుమానం నీకెందుకు వచ్చింది?' అన్నాను.

డ్రైవింగ్ చేసున్న డా|| సాంబశివరావు జవాబు చెప్పాడు.

'అంటే-'దేనికైనా కాలం ఖర్మం కలిసి రావాలి' అంటారు కదా? అదేనా నీ ప్రశ్న?' అన్నాడాయన.

'అవును' అన్నాడు సుబ్బు.

'అవి రెండూ ఒకటి కావు.కాలం అనేది ఒక విశాలమైన framework.అందులో కర్మ అనేది జరుగుతుంది.కాలం అనేది ఒక రంగస్థలం అనుకుంటే కర్మ అనేది దానిమీద జరిగే నాటకం అనుకో.అలా అన్నమాట.కాలపరిపక్వతలో మన పూర్వకర్మ ఫలితానికి వస్తుంది.అందుకే ఆ మాట వచ్చింది' అన్నాను.

'అన్నయ్యా.అమ్మ చెప్పిన ఒక మాట ఈ మధ్యనే చదివాను.నాకు బాగా నచ్చింది.'అన్నాడు సుబ్బు.

'ఏంటది?' అడిగాను.

'సహనానికీ సహజ సహనానికీ తేడాను అమ్మ భలే చెప్పింది' అన్నాడు.

'ఏమని చెప్పింది?' అడిగాను నాకు తెలిసినా కూడా.

'ఏదైనా కష్టం వచ్చినప్పుడు బలవంతాన దానిని సహించడం సహనం.కానీ అసలది కష్టమనీ,దానిని నేను సహిస్తున్నానన్న భావనే మనస్సులో తలెత్తకుండా దానిని సహించడం సహజసహనం అని అమ్మ చెప్పింది' అన్నాడు.

'అవును.శ్రీ రామకృష్ణులు కూడా ఒక మాట అనేవారు.బెంగాలీ అక్షరమాలలో 'స' అనే అక్షరం మూడుసార్లు వస్తుంది.మనం 'శ',ష' 'స' అనే మూడింటినీ బెంగాలీలు 'స' అనే పలుకుతారు.దానిమీద శ్రీరామకృష్ణులు చమత్కరిస్తూ ఈ 'స' అనే అక్షరం సహనాన్ని సూచిస్తుందనీ,జీవితంలో సహనం యొక్క విలువను నొక్కి చెప్పడానికే అక్షరమాలలో ఆ అక్షరం మూడుసార్లు వస్తుందనీ ఆయననేవారు.శారదామాత జీవితం అనంతమైన సహనానికీ అతి స్వచ్చమైన ప్రేమకూ ప్రతిరూపం.అలాగే జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా. ఆమెకూడా సహనానికి ప్రతిరూపమే.తన జీవితంలో ఎన్ని బాధలను అమ్మ మౌనంగా సహజంగా సహించిందో మన ఊహకు అందదు.అమ్మ సహనదేవత.ఈ సంగతి ఆమె జీవితాన్ని చదివితే అర్ధమౌతుంది.వాళ్ళంతా మనలాంటి మనుషులు కాదు సుబ్బూ.దేవతలు.'- అన్నాను.

ఈ లోపల కారు ఉయ్యూరు దాటి మచిలీపట్నం వైపు పోతున్నది.కృష్ణాజిల్లా వాతావరణం మొదలైంది.నాకు కృష్ణా జిల్లా అంటే చాలా ఇష్టం.బహుశా అక్కడ చెట్లూ పచ్చటి పొలాలూ మంచి నీటివసతీ ఉండటం వల్ల అనుకుంటాను.నేను కృష్ణా జిల్లాకు వెళ్ళిన ప్రతిసారీ నాకు కోనసీమా కేరళా గుర్తొస్తాయి.

ఈలోపల మబ్బులు ముసురుకొచ్చి వాన మొదలైంది.వాతావరణం ఎంతో అద్భుతంగా మారిపోయింది.మాట్లాడుతున్న టాపిక్ మీద ఒక్కసారిగా నాకు ఇంటరెస్ట్ పూర్తిగా పోయింది.మూడ్ మారిపోయింది.అలాంటప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని నాకు అనిపించదు.మౌనంగా కారు కిటికీ లోనుంచి బయట ప్రకృతినీ వాననూ చూస్తూ ఉండిపోయాను.అలాంటి వాతావరణంలో గంటల తరబడి మౌనంగా అలా ఉండటం నాకలవాటే.

సుబ్బు నా పరిస్థితి గమనించాడల్లే ఉంది.అందుకే తనూ చాలాసేపు నన్ను కదిలించకుండా మౌనంగా ఉన్నాడు.కాలం భారంగా చాలాసేపు అలా గడిచింది.

కాసేపైన తర్వాత -' అన్నయ్యా.ఇంకో ప్రశ్న అడగనా?' అన్నాడు.

'ఊ' అన్నాను అంతరిక ప్రపంచంలోనుంచి తేరుకుంటూ.

'దుర్గాదేవీ నరసింహస్వామీ ఒక్కటే అని నా ఊహ.నీవేమంటావు' అడిగాడు.

'వాళ్ళు ఒక్కటి కాదు.వేర్వేరు.కానీ నీ ఆలోచనలో కూడా కొంత సత్యం ఉన్నది.దుర్గాదేవినే వైష్ణవీదుర్గ అనికూడా అంటారు.దుర్గా కాళీ మొదలైన దేవతలు తాంత్రిక దేవతలు.వాళ్ళు గ్రామదేవతలుగా ఊరూరా ప్రాచుర్యం పొందారు.మధ్యయుగంలో శైవం సామాన్యుల ఇళ్ళల్లో తిష్ట వేసుకుంది.వైష్ణవం కొంచం క్లాస్ మతం.తంత్రంలో శివశక్తులే మూలం.గ్రామాలలో వచ్చే సాంక్రామిక సమస్యలను నివారించే అమ్మతల్లులుగా,శక్తులుగా శైవతాంత్రిక దేవతలు బాగా ప్రాబల్యంలోకి వచ్చారు.దానికి సమానంగా వైష్ణవంలో ఏ దేవతా లేదు.విష్ణువూ,ఆయన అవతారాలైన రాముడూ కృష్ణుడూ సాత్విక దేవతలు.ఉగ్రదేవతల ఆరాధనలో సహజంగానే కొంత ఆకర్షణ ఉంటుంది. భయంలోకూడా మంచి ధ్రిల్ ఉంటుంది.భయపడుతూ కూడా హర్రర్ సినిమాలు చూస్తాం చూడు.అలాగన్నమాట.

సమాజంలో వ్యాపిస్తున్న తంత్రపుధాటినీ దుర్గా కాళీ వంటి ఉగ్రదేవతల ధాటినీ తట్టుకోవడానికి వైష్ణవంలో నరసింహస్వామిని బాగా పాపులర్ చేశారు. చీడపీడలను వదిలించే దేవతగా గ్రహబాధలను నివారించే దేవతగా ఆయన బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు.క్రమేణా శైవ తాంత్రికదేవతల ఆరాధన సమాజంలో తగ్గిపోయింది.ఎందుకంటే వాళ్ళు సహజంగానే భయం గొలిపే ఆకారంతో ఉంటారు.వారి దేవాలయ పరిసరాలు కూడా కొంచం భయం గొలిపేటట్లే ఉంటాయి.నరసింహస్వామి కూడా భయంకరుడే.కానీ ప్రహ్లాదునికి ఆయన సౌమ్యమూర్తే.పైగా డబ్బూ రాజుల ప్రాపకమూ ఉన్న వైష్ణవులు ఆయన్ను బాగా ప్రచారం లోకి తెచ్చారు.ఆ విధంగా ఆయన బాగా పాపులర్ అయ్యాడు.

నరసింహస్వామి యొక్క ధాటిని తట్టుకోవడానికి శైవంలో గండభేరుండం అనీ శరభసాళువం అనీ కొన్ని పోకడలు పుట్టుకొచ్చాయి.కాని అవి క్రమేణా కనుమరుగయ్యాయి.ఈ లోపల ముస్లిం దండయాత్రలు మొదలయ్యాయి. అంతటితో మనవాళ్ళ క్రియేటివిటీకి అడ్డుకట్ట పడింది.అదీ సంగతి.'- అన్నాను.

మాటల్లోనే మచిలీపట్నం వచ్చేసింది.ఆ ఊరు బ్రిటిష్ వారు కట్టినది కదా విశాలమైన ప్లానింగ్ తో చాలా బాగుంటుంది.అదొక స్లీపింగ్ టౌన్.కాకినాడా బాపట్లా కూడా ఇలాగే స్లీపింగ్ టౌన్స్.జనాభా తక్కువ ఉండి,విశాలంగా ఉండే ఊళ్లు నాకు బాగా నచ్చుతాయి.అలాంటిచోట్ల,వేరే మనుషులతో సంబంధం లేకుండా నెలల తరబడి నాలోకంలో నేను మౌనంగా ఉండగలను.

వాణీ హోటల్లో భోజనానికి కూచున్నాము.

భోజనం చేసే సమయంలోనే సుబ్రహ్మణ్యం 'అన్నయ్యా.డాక్టరు గారి జాతకం నీవు కూడా కొంచం చూడు.' అనడిగాడు.

అడగనిదే నేను ఎవరి జాతకాలూ నా అంతట నేను కల్పించుకుని చూడను. పదేపదే అడిగినా కూడా కొందరివి చూడను.ఇదంతా ఒక మార్మికలోకం.అలా నేను చెయ్యడానికి మార్మికమైన కారణాలుంటాయి.సరే,సుబ్బు అడిగాడు కదా అని ఆయన జననవివరాలు అడిగి నా ఫోన్ లో ఉన్న సాఫ్ట్ వేర్లో చూచాను.విషయాలు అర్ధమయ్యాయి.సోమశేఖర్ జాతకం నాకు తెలుసు.డాక్టర్ గారి జాతకం చూచాక ఆయన అంతదూరం నుంచి సోమశేఖర్ను వెదుక్కుంటూ ఎందుకు వచ్చాడో అర్ధమైంది.చూచాయగా కొన్ని విషయాలను అక్కడికక్కడే ఆయనకు చెప్పాను.ఈ లోపల ఆర్డర్ చేసిన భోజనం వచ్చింది.

భోజనం అయ్యాక గొడుగుపేటలో ఉన్న సోమశేఖర్ ఇంటికి వెతుక్కుంటూ చేరుకున్నాము.కుశలప్రశ్నలు అయ్యాక డాక్టర్ గారి జాతకవిశ్లేషణ మొదలైంది.

'మా గురువుగారి ఎదుట నేను మీ జాతకం చూచే సాహసం చేస్తున్నాను.' అని డాక్టర్ గారితో అంటూ సోమశేఖర్ నావైపు చూచాడు.

'దానిదేముంది?తన జాతకాన్ని నీకు చూపాలని ఆయనింత దూరం వచ్చాడు. చూడు.నేను పక్కనే ఉండి ఊరకే చూస్తుంటాను.అదీగాక ఆయన జాతకాన్ని ఒక్కసారి చూచావంటే మీకిద్దరికీ ఉన్న లింక్ ఏమిటో నీకు వెంటనే అర్ధమౌతుంది.' అన్నాను.

సోమశేఖర్ తన లాప్టాప్ లో డాక్టర్ గారి జాతకాన్ని వేసి చూచాడు.

'ఏముంది?నాకూ లగ్నంలో కేతువున్నాడు.డాక్టర్ గారికీ అంతే.అదేగా మా ఇద్దరి లింక్?' అన్నాడు నవ్వుతూ.

'అవును.వారిద్దరి మధ్యనా పంచమ శుభదృష్టిని కూడా గమనించు.'-వెంటనే దానిని పట్టేసినందుకు మెచ్చుకోలుగా అన్నాను.

సోమశేఖర్ తన స్టైల్లో విశ్లేషణ మొదలుపెట్టాడు.నేను కొంచం దూరంగా కూచుని కళ్ళు మూసుకుని మౌనంగా వింటున్నాను.

'మీ జాతకంలో కాలసర్పదోషం ఉన్నది.అందుకే మీ జాతక విశ్లేషణ కొంచం కష్టం.ఇప్పుడు మీరు నాదగ్గరికి వచ్చిన విషయం తెలుసుకోవడం కూడా కొంచం కష్టమే.' అన్నాడు సోమశేఖర్.

వింటున్న నేను కల్పించుకుని -'ఏమీ కష్టంలేదు సోమశేఖర్.ప్రస్తుతం ఏ దశ జరుగుతున్నదో చూడు.' అన్నాను.

'కేతువులో బుధుడు'- అన్నాడు.

'కాలసర్ప దోష కేతువు లగ్నంలో ఉన్నాడు.అంటే సప్తమంలో రాహువున్నట్లే కదా.ఇకపోతే బుధుడు కేంద్రాదిపత్య దోషి.చతుర్దంలో నీచలో ఉన్నాడు. అదీగాక అస్తంగతుడై ఉన్నాడు.లగ్నాదిపతితో కలసి ఉన్నాడు.ఆ బుధుడు సప్తమ దశమ భావాల అధిపతి.ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆయన నీ దగ్గరికి ఎందుకొచ్చాడో ఊహించు.' కళ్ళుమూసుకునే అన్నాను.

సోమశేఖర్ తెలివైనవాడు.వెంటనే ఆ పాయింట్స్ పట్టుకుని- 'మీరు ఫలానా విషయం అడగటానికి నా దగ్గరికి వచ్చారని'- కరెక్ట్ గా చెప్పేశాడు.

డాక్టర్ గారి ముఖం చూస్తే ఆయన ఇంప్రెస్ అయినట్లే అనిపించింది.

జాతక విశ్లేషణలో సోమశేఖర్ శైలి వేరు.ఇష్టకష్ట ఫలాలు,షడ్బలాలు,వింశోపక బలం,అష్టకవర్గు,అంశచక్రాల మీద గ్రహచారం ఇత్యాదులు చూచి సోమశేఖర్ విశ్లేషణ చేస్తాడు.

నా విధానం అదికాదు.

పరాశరవిధానం,జైమినిపద్ధతి,నాడీజ్యోతిష్యవిధానం,దశలు,గోచారం,ప్రశ్నవిధానం,చరస్థిరకారకత్వాలు,భావాద్భావం,శకునశాస్త్రం,శరీరలక్షణశాస్త్రం, జాతకుని హస్తరేఖలు,స్ఫురణ,నా అనుభవంలో నిగ్గుదేలిన కొన్ని రహస్య విధానాలు,తాంత్రిక జ్యోతిష్యసూత్రాలను కలగలిపి నేను ఉపయోగిస్తాను.ఇది నా వ్యక్తిగత విధానం.అనేక సంవత్సరాల నిరంతర పరిశోధన మీదట నేను ఈ స్టైల్ ను తయారు చేసుకోగలిగాను.

కొద్దిసేపు డాక్టర్ గారి జాతకాన్ని సోమశేఖర్ వివరించాడు.నేను కొంచం దూరంగా కూచుని కళ్ళుమూసుకుని మౌనంగా వింటున్నాను.ఇక మనం రంగంలోకి దిగక తప్పదనిపించింది.అప్పుడు నేను కల్పించుకుని,ఆయన జాతకంవైపు చూడకుండానే,ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలనూ వాటి సంవత్సరాలనూ చెప్పాను.అవి నిజమే అని ఆయన ఒప్పుకున్నాడు.కొన్నింటిని ఆయన మర్చిపోయి ఆ సంవత్సరాలలో ఏమీ జరగలేదని అన్నాడు.కొద్దిసేపటి తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకుని 'అవును.జరిగాయి' అని అన్నాడు.

చివరిగా ఒక్క విషయాన్ని చెప్పాను.

'మీ మేనమామ గారిది కూడా మీ జాతకం వంటిదే.మీరు పడిన బాధలు ఆయనకూడా పడ్డాడు.ఈ చార మీ మేనమామగారి దగ్గరనుంచే మీకొచ్చింది.' అని చెప్పాను.


'అవును మా మేనమామ కూడా ఇవే బాధలు పడ్డాడు.ఆయన పడిన బాధల ముందు నా బాధలు తక్కువే' అన్నాడాయన ఆశ్చర్యంగా.

కళ్ళుమూసుకుని,ఆయన జాతకం చూడకుండానే ఇదంతా చెప్పాను.నా విశ్లేషణలో నేను కొన్నిలోతుల్లోకి వెళతాను.పూర్వజన్మలు,అప్పుడు చేసుకున్న ఖర్మలు,వంశపారంపర్యంగా కొన్ని కొన్ని కుటుంబాలలో వెంటాడే శాపాలు,దోషాలు వీటిని నేను చూస్తాను.అంటే ప్రస్తుత సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయో నేను గమనిస్తాను.అప్పుడే వాటిని ఎలా పరిష్కరించాలో మనకు తెలుస్తుంది.గతం మీదే వర్తమానమూ భవిష్యత్తూ కూడా నిర్మితమై ఉంటాయి.

ఒక జాతకాన్ని మనం చూచినప్పుడు,ఆ జాతకుని జీవితమేగాక,అతని తల్లిదండ్రులూ,దగ్గరి బంధువులూ వాళ్ళ జీవితాలూ కూడా మనకు తెలుస్తాయి.

ఈ లోపల ఆయనేదో పర్సనల్ గా సోమశేఖర్ తో మాట్లాడేలా అనిపించాడు. అందుకని నేనూ సుబ్బూ శ్రీనివాసరావూ బయటకు వెళ్లి అరుగుమీద కూచున్నాము.కాసేపట్లో జాతక విశ్లేషణ అయిపోయింది.అందరం కలసి సునీల్ ఆర్కేష్ట్రా ఎక్కడుందో వెదుకుతూ బయల్దేరాము.

'ఇంగ్లీష్ చర్చ్' ఏరియాలో సునీల్ గారుండే ఇల్లు దొరికింది.కాసేపు మాటలయ్యాక మాకు కావలసిన ఒక ఏభై పాత తెలుగుపాటల ట్రాక్స్ తీసుకుని గుంటూరుకు బయల్దేరాము.ఆయన దగ్గర తెలుగు హిందీ అన్నీ కలిపి మూడు వేల పైగానే పాటల ట్రాక్స్ ఉన్నాయి.ఒక మనిషి అంత సంగీతసేవ చెయ్యాలంటే అతని జాతకంలో శుక్రబుధుల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. సరస్వతీ కటాక్షం అలాంటివాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది.దానికి మనమనుకునే కులంతోనూ మతంతోనూ సంబంధం ఉండదు.


అక్కడ ఉన్న కాసేపట్లో సునీల్ గారి శరీర నిర్మాణాన్ని బట్టి,ఆయన మాట్లాడే తీరును బట్టి ఆయన జాతకం నాకర్ధమైపోయింది.

ట్రాక్స్ తీసుకుని గుంటూరుకు బయల్దేరాము.
read more " తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-2 "

20, అక్టోబర్ 2014, సోమవారం

తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-1

తెలుగు,హిందీ పాతపాటల ట్రాక్స్ సేకరించడం,తీరిక సమయాలలో వాటిని పాడటం నాకొక హాబీ.నాదగ్గర మెహదీ హసన్,రఫీ,కిషోర్,మన్నాడే,హేమంత్ కుమార్,తలత్ మెహమూద్,ముఖేష్,మహేంద్ర కపూర్,జేసుదాస్ ల హిందీ ట్రాక్స్ చాలా ఉన్నాయి.అలాగే పంకజ్ ఉదాస్,గులాం అలీ లు పాడిన ఘజల్ ట్రాక్సూ ఉన్నాయి.తీరిక సమయాలలో నేనొక్కడినే వాటిని పాడుకుంటూ ఉంటాను. లేదా స్నేహితులు,సంగీత ప్రేమికుల సమక్షంలో పాడుతూ ఉంటాను.

పాటలు పాడటం చిన్నప్పటి నుంచీ నాకలవాటుంది.అయితే ట్రాక్స్ పాడటం మాత్రం గత కొన్నేళ్ళక్రితమే మొదలైంది.వ్యక్తిగతంగా నేను మహమ్మద్ రఫీ అభిమానిని.

డిసెంబర్ నాలుగో తారీకున గుంటూరులో ఘంటసాల మ్యూజికల్ నైట్ జరుగుతుంది.అందులో నన్ను రెండుమూడు పాటలు పాడమని నిర్వాహకులు అడిగారు.మంచి పాత డ్యూయెట్స్ ఎంచుకోమని అన్నారు. నాకూ అవే ఇష్టం గనుక సరేనన్నాను.'చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి','ఈనాటి ఈహాయీ కలకాదోయి నిజమోయీ'- అనే రెండు పాటలు పాడతానని చెప్పాను.ఫిమేల్ సింగర్స్ ఎలాగూ ప్రొఫెషనల్స్ ఉంటారు గనుక వాళ్ళు ఏ పాటనైనా సులభంగా పాడగలరు. 

మచిలీపట్నంలో సునీల్ అని ఒక ఆర్కెష్ట్రా ఆయన ఉన్నాడు.అతని దగ్గర దాదాపు మూడువేల వరకూ తెలుగు హిందీపాటల ట్రాక్స్ ఉన్నాయని నాకు తెలిసింది.ఒకరోజు మచిలీపట్నం వెళ్లి కొన్ని తెలుగుపాటల ట్రాక్స్ కొనుక్కుందామని అనుకున్నాను.ఆయనతో ఫోన్లో మాట్లాడితే-"ఇంతదూరం రావడం ఎందుకు? మీకు కావలసిన పాటలు చెప్పండి.ఆన్ లైన్ పేమెంట్ చేస్తే ట్రాక్స్ మీకు మెయిల్ చేస్తాను"- అన్నాడు.

నాకు ఫోన్ పరిచయం కంటే వ్యక్తిగత పరిచయం అంటేనే ఇష్టం.ఫోన్లో మన పని కావడం ముఖ్యం కాదు.ఒక వ్యక్తితో పరిచయమూ స్నేహమే నాకు ముఖ్యం. అందుకని,నేనేవచ్చి కలుస్తానని చెప్పాను.మిత్రుడు 'హోరాసర్వం' సోమశేఖర్ కూడా అక్కడే ఉన్నాడు గనుక ఒకసారి తననూ కలసినట్లు ఉంటుంది అనుకున్నాను.

ఇంతలో తమ్ముడు సుబ్రహ్మణ్యం నుంచి ఫోనొచ్చింది.

'అన్నయ్యా.మచిలీపట్నం వెళ్ళాలి.సోమశేఖర్ కి ఫోన్ చేస్తే నువ్వూ వస్తున్నావని చెప్పాడు.కలిసే వెళదాం సరేనా?' అన్నాడు.

'అలాగే' అంటూ-'ఏంటి పని?' అడిగాను.

'మా ఫ్రెండ్ ఒక డాక్టర్ గారున్నారు.డిగ్రీలో నా క్లాస్ మేటే.ఆయన జాతకం సోమశేఖర్ కు చూపించాలి.అందుకని వెళుతున్నాం.' అన్నాడు.

'అలాగే వెళదాం.రండి.మధ్యాన్నం పన్నెండుకు రండి.ఈ లోపల నేను కొన్ని పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను' అని చెప్పాను.

ముందే అనుకున్నట్లుగా ఉదయం పదింటికి స్టూడియోలో మిత్రులం అందరం కలిశాం.

హిందీ పాటల ట్యూన్స్ ని మనవాళ్ళు చాలా కాపీ కొట్టారు.కొన్నింటినేమో చరణాలలో ట్యూన్ సంగ్రహించి దాని చుట్టూ వీళ్ళ ట్యూన్ అల్లారు. కొన్నింటినేమో మొత్తం ట్యూనే ఎత్తేశారు.

ఉదాహరణకి 'షర్మీలీ' సినిమాలో కిషోర్ కుమార్ పాడిన 'ఖిల్తే హై గుల్ యహా..' అనే పాటని తెలుగులో 'ధనమా దైవమా' అనే సినిమాలో సుశీల చేత 'నీ మది చల్లగా స్వామీ నిదురపో..' అని పాడించారు.కానీ హిందీపాట ఒక మధుర విషాద ప్రేమగీతం.తెలుగుదేమో జోలపాట.రెంటివీ సన్నివేశాలు వేర్వేరు.భావమూ వేరేనే.అందుకే తెలుగు లిరిక్స్ నాకు నచ్చలేదు.పైగా రెండో చరణంలో రాముణ్నీ సీతనూ అనవసరంగా తీసుకొచ్చారు.మొత్తం మీద హిందీపాట భావం తెలుగులో ఖూనీ అయింది.

అందుకని ఆపాట లిరిక్స్ ను నాకు నచ్చినట్లుగా నేనే తెలుగులో చక్కగా వ్రాసుకున్నాను.

'పూచెను సుమములే -- వెన్నెల జారగా 
వేచెను హృదయమే -- వలపుల తేలగా...'

అంటూ ఒక మధుర ప్రేమగీతంగా ఆ పాటను వ్రాశాను.బాగా వచ్చింది.స్నేహితులలో కొందరికి పాడి వినిపిస్తే చాలా బాగుందని అన్నారు.

ఆపాటను రికార్డ్ చేసి సీడీగా మార్చే కార్యక్రమం మధ్యాన్నం పన్నెండు వరకూ ఉంటుంది గనుక ఆ తర్వాత బయలుదేరదామని సుబ్బుతో చెప్పాను.

అనుకున్నట్లుగానే పదకొండుకి రికార్డింగ్ అయిపోయింది.ఇంకా కొన్ని పాటలు కూడా పాడమనీ రికార్డింగ్ చెయ్యమని మిత్రులు అడిగితే సరేనని - 'యారానా' సినిమాలో కిషోర్ పాడిన 'ఛూ కర్ మెరె మన్ కో కియా తూనే క్యా ఇషారా..',-'తీస్రీ మంజిల్' సినిమాలో రఫీ పాడిన ' దీవానా ముఝ్ సా నహీ ఇస్ అంబర్ కే నీచే..',కిషోర్ పాడిన హిందీ పాట -'ఖిల్తే హై గుల్ యహా..' ఈ మూడు పాటలూ రికార్డింగ్ చేసేసరికి మధ్యాన్నం పన్నెండయింది.ఇంతలో ఇంటినుంచి ఫోనొచ్చింది.సుబ్బూ వాళ్ళు వచ్చి నాకోసం చూస్తున్నారు రమ్మని ఆ ఫోన్ సారాంశం.

వెంటనే స్టూడియో నుంచి బయల్దేరి ఇంటికొచ్చాను.నేను,సుబ్రమణ్యం,డాక్టర్ సాంబశివరావు,సుబ్బు ఇంకో స్నేహితుడు శ్రీనివాసరావు నలుగురం కార్లో మచిలీపట్నం బయల్దేరాము.భోజనం దారిలో ఎక్కడో ఒకచోట చేద్దాంలే అని ముందు బయల్దేరాము.

కారు గుంటూరు వదలి విజయవాడవైపు పరుగులు తీస్తున్నది.

'అన్నయ్యా.నాదొక ధర్మ సందేహం. అడగమంటావా?' అన్నాడు సుబ్బు.

'ఈ మధ్యన ధర్మసందేహాలకు జవాబులు చెప్పడం మానేశాను.అధర్మ సందేహాలకు మాత్రమే చెబుతున్నాను.' అన్నాను సీరియస్ గా.

అందరూ నవ్వేశారు.

'అది కాదు.సీరియస్ గా అడుగుతున్నా.కొన్ని ఆధ్యాత్మిక సందేహాలున్నాయి' అన్నాడు.

'సరే.అడుగు.కానీ ఒక్క విషయం చెప్పనీ నన్ను.నీవేం అడిగినా అది రేపు బ్లాగులో వచ్చేస్తుంది.దానికి నీకు ఇష్టం అయితేనే అడుగు.ఒక మాట అంటారు చూడు."బ్రతుకు బస్టాండు అయింది" అని.నేను ఇంకోలా అంటాను. "బ్రతుకు బ్లాగై పోయింది" అని.నీకు ఇష్టమైతే అడుగు.మళ్ళీ ఫీలవకూడదు.' అన్నా నవ్వుతూ.

'ఏం పర్లేదులే.వ్రాయి.వ్యక్తిగతమైనవి ఎలాగూ ఎడిట్ చేస్తావుగా.నాకు తెలుసు.ఏం పరవాలేదు.' అన్నాడు సుబ్బు.

'ఓకే.ప్రొసీడ్'- అన్నా.

సుబ్బు తన మొదటి సందేహం అడిగాడు.

(ఇంకా ఉంది)
read more " తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-1 "