“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, అక్టోబర్ 2014, సోమవారం

తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-1

తెలుగు,హిందీ పాతపాటల ట్రాక్స్ సేకరించడం,తీరిక సమయాలలో వాటిని పాడటం నాకొక హాబీ.నాదగ్గర మెహదీ హసన్,రఫీ,కిషోర్,మన్నాడే,హేమంత్ కుమార్,తలత్ మెహమూద్,ముఖేష్,మహేంద్ర కపూర్,జేసుదాస్ ల హిందీ ట్రాక్స్ చాలా ఉన్నాయి.అలాగే పంకజ్ ఉదాస్,గులాం అలీ లు పాడిన ఘజల్ ట్రాక్సూ ఉన్నాయి.తీరిక సమయాలలో నేనొక్కడినే వాటిని పాడుకుంటూ ఉంటాను. లేదా స్నేహితులు,సంగీత ప్రేమికుల సమక్షంలో పాడుతూ ఉంటాను.

పాటలు పాడటం చిన్నప్పటి నుంచీ నాకలవాటుంది.అయితే ట్రాక్స్ పాడటం మాత్రం గత కొన్నేళ్ళక్రితమే మొదలైంది.వ్యక్తిగతంగా నేను మహమ్మద్ రఫీ అభిమానిని.

డిసెంబర్ నాలుగో తారీకున గుంటూరులో ఘంటసాల మ్యూజికల్ నైట్ జరుగుతుంది.అందులో నన్ను రెండుమూడు పాటలు పాడమని నిర్వాహకులు అడిగారు.మంచి పాత డ్యూయెట్స్ ఎంచుకోమని అన్నారు. నాకూ అవే ఇష్టం గనుక సరేనన్నాను.'చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి','ఈనాటి ఈహాయీ కలకాదోయి నిజమోయీ'- అనే రెండు పాటలు పాడతానని చెప్పాను.ఫిమేల్ సింగర్స్ ఎలాగూ ప్రొఫెషనల్స్ ఉంటారు గనుక వాళ్ళు ఏ పాటనైనా సులభంగా పాడగలరు. 

మచిలీపట్నంలో సునీల్ అని ఒక ఆర్కెష్ట్రా ఆయన ఉన్నాడు.అతని దగ్గర దాదాపు మూడువేల వరకూ తెలుగు హిందీపాటల ట్రాక్స్ ఉన్నాయని నాకు తెలిసింది.ఒకరోజు మచిలీపట్నం వెళ్లి కొన్ని తెలుగుపాటల ట్రాక్స్ కొనుక్కుందామని అనుకున్నాను.ఆయనతో ఫోన్లో మాట్లాడితే-"ఇంతదూరం రావడం ఎందుకు? మీకు కావలసిన పాటలు చెప్పండి.ఆన్ లైన్ పేమెంట్ చేస్తే ట్రాక్స్ మీకు మెయిల్ చేస్తాను"- అన్నాడు.

నాకు ఫోన్ పరిచయం కంటే వ్యక్తిగత పరిచయం అంటేనే ఇష్టం.ఫోన్లో మన పని కావడం ముఖ్యం కాదు.ఒక వ్యక్తితో పరిచయమూ స్నేహమే నాకు ముఖ్యం. అందుకని,నేనేవచ్చి కలుస్తానని చెప్పాను.మిత్రుడు 'హోరాసర్వం' సోమశేఖర్ కూడా అక్కడే ఉన్నాడు గనుక ఒకసారి తననూ కలసినట్లు ఉంటుంది అనుకున్నాను.

ఇంతలో తమ్ముడు సుబ్రహ్మణ్యం నుంచి ఫోనొచ్చింది.

'అన్నయ్యా.మచిలీపట్నం వెళ్ళాలి.సోమశేఖర్ కి ఫోన్ చేస్తే నువ్వూ వస్తున్నావని చెప్పాడు.కలిసే వెళదాం సరేనా?' అన్నాడు.

'అలాగే' అంటూ-'ఏంటి పని?' అడిగాను.

'మా ఫ్రెండ్ ఒక డాక్టర్ గారున్నారు.డిగ్రీలో నా క్లాస్ మేటే.ఆయన జాతకం సోమశేఖర్ కు చూపించాలి.అందుకని వెళుతున్నాం.' అన్నాడు.

'అలాగే వెళదాం.రండి.మధ్యాన్నం పన్నెండుకు రండి.ఈ లోపల నేను కొన్ని పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను' అని చెప్పాను.

ముందే అనుకున్నట్లుగా ఉదయం పదింటికి స్టూడియోలో మిత్రులం అందరం కలిశాం.

హిందీ పాటల ట్యూన్స్ ని మనవాళ్ళు చాలా కాపీ కొట్టారు.కొన్నింటినేమో చరణాలలో ట్యూన్ సంగ్రహించి దాని చుట్టూ వీళ్ళ ట్యూన్ అల్లారు. కొన్నింటినేమో మొత్తం ట్యూనే ఎత్తేశారు.

ఉదాహరణకి 'షర్మీలీ' సినిమాలో కిషోర్ కుమార్ పాడిన 'ఖిల్తే హై గుల్ యహా..' అనే పాటని తెలుగులో 'ధనమా దైవమా' అనే సినిమాలో సుశీల చేత 'నీ మది చల్లగా స్వామీ నిదురపో..' అని పాడించారు.కానీ హిందీపాట ఒక మధుర విషాద ప్రేమగీతం.తెలుగుదేమో జోలపాట.రెంటివీ సన్నివేశాలు వేర్వేరు.భావమూ వేరేనే.అందుకే తెలుగు లిరిక్స్ నాకు నచ్చలేదు.పైగా రెండో చరణంలో రాముణ్నీ సీతనూ అనవసరంగా తీసుకొచ్చారు.మొత్తం మీద హిందీపాట భావం తెలుగులో ఖూనీ అయింది.

అందుకని ఆపాట లిరిక్స్ ను నాకు నచ్చినట్లుగా నేనే తెలుగులో చక్కగా వ్రాసుకున్నాను.

'పూచెను సుమములే -- వెన్నెల జారగా 
వేచెను హృదయమే -- వలపుల తేలగా...'

అంటూ ఒక మధుర ప్రేమగీతంగా ఆ పాటను వ్రాశాను.బాగా వచ్చింది.స్నేహితులలో కొందరికి పాడి వినిపిస్తే చాలా బాగుందని అన్నారు.

ఆపాటను రికార్డ్ చేసి సీడీగా మార్చే కార్యక్రమం మధ్యాన్నం పన్నెండు వరకూ ఉంటుంది గనుక ఆ తర్వాత బయలుదేరదామని సుబ్బుతో చెప్పాను.

అనుకున్నట్లుగానే పదకొండుకి రికార్డింగ్ అయిపోయింది.ఇంకా కొన్ని పాటలు కూడా పాడమనీ రికార్డింగ్ చెయ్యమని మిత్రులు అడిగితే సరేనని - 'యారానా' సినిమాలో కిషోర్ పాడిన 'ఛూ కర్ మెరె మన్ కో కియా తూనే క్యా ఇషారా..',-'తీస్రీ మంజిల్' సినిమాలో రఫీ పాడిన ' దీవానా ముఝ్ సా నహీ ఇస్ అంబర్ కే నీచే..',కిషోర్ పాడిన హిందీ పాట -'ఖిల్తే హై గుల్ యహా..' ఈ మూడు పాటలూ రికార్డింగ్ చేసేసరికి మధ్యాన్నం పన్నెండయింది.ఇంతలో ఇంటినుంచి ఫోనొచ్చింది.సుబ్బూ వాళ్ళు వచ్చి నాకోసం చూస్తున్నారు రమ్మని ఆ ఫోన్ సారాంశం.

వెంటనే స్టూడియో నుంచి బయల్దేరి ఇంటికొచ్చాను.నేను,సుబ్రమణ్యం,డాక్టర్ సాంబశివరావు,సుబ్బు ఇంకో స్నేహితుడు శ్రీనివాసరావు నలుగురం కార్లో మచిలీపట్నం బయల్దేరాము.భోజనం దారిలో ఎక్కడో ఒకచోట చేద్దాంలే అని ముందు బయల్దేరాము.

కారు గుంటూరు వదలి విజయవాడవైపు పరుగులు తీస్తున్నది.

'అన్నయ్యా.నాదొక ధర్మ సందేహం. అడగమంటావా?' అన్నాడు సుబ్బు.

'ఈ మధ్యన ధర్మసందేహాలకు జవాబులు చెప్పడం మానేశాను.అధర్మ సందేహాలకు మాత్రమే చెబుతున్నాను.' అన్నాను సీరియస్ గా.

అందరూ నవ్వేశారు.

'అది కాదు.సీరియస్ గా అడుగుతున్నా.కొన్ని ఆధ్యాత్మిక సందేహాలున్నాయి' అన్నాడు.

'సరే.అడుగు.కానీ ఒక్క విషయం చెప్పనీ నన్ను.నీవేం అడిగినా అది రేపు బ్లాగులో వచ్చేస్తుంది.దానికి నీకు ఇష్టం అయితేనే అడుగు.ఒక మాట అంటారు చూడు."బ్రతుకు బస్టాండు అయింది" అని.నేను ఇంకోలా అంటాను. "బ్రతుకు బ్లాగై పోయింది" అని.నీకు ఇష్టమైతే అడుగు.మళ్ళీ ఫీలవకూడదు.' అన్నా నవ్వుతూ.

'ఏం పర్లేదులే.వ్రాయి.వ్యక్తిగతమైనవి ఎలాగూ ఎడిట్ చేస్తావుగా.నాకు తెలుసు.ఏం పరవాలేదు.' అన్నాడు సుబ్బు.

'ఓకే.ప్రొసీడ్'- అన్నా.

సుబ్బు తన మొదటి సందేహం అడిగాడు.

(ఇంకా ఉంది)