23, ఫిబ్రవరి 2015, సోమవారం

Astro Workshop -2 విజయవాడలో జరిగింది.
























Astro Workshop -2 విజయవాడలో జయప్రదంగా జరిగింది.

హైదరాబాద్ లో జరిగిన Astro workshop-1 కు హాజరు కాలేని వారికోసం విజయవాడలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరువరకూ ఈ కార్యక్రమం జరిగింది.హైదరాబాద్ లో చెప్పిన విషయాలనే కొత్తపద్ధతిలో వివరిస్తూ,ఇంకా కొన్ని ఎక్కువ విషయాలను చెప్పడం జరిగింది.

ఈ సమావేశానికి హాజరై,జ్యోతిష్యశాస్త్రపు మౌలికాంశాలను ఆకళింపు చేసుకున్నవారికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

వదలకుండా ఈ సబ్జెక్టును బాగా నేర్చుకుని మంచి జ్యోతిశ్శాస్త్రవేత్తలుగా రాణించాలని వారందరినీ కోరుతున్నాను.
read more " Astro Workshop -2 విజయవాడలో జరిగింది. "

21, ఫిబ్రవరి 2015, శనివారం

ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మంచిరోజులు


ఒంటిమిట్ట రామాలయం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది.దానికి కారణాలు అనేకం ఉన్నాయి.

ఒకటి-
భక్తకవి అయిన పోతన్నగారు ఇక్కడ నివసిస్తూ,కోదండరాముని కటాక్షాన్ని పొందినవాడై,తనయొక్క శ్రీమద్భాగవత రచన గావించడం వల్ల ఆ క్షేత్రానికి వచ్చిన ప్రాశస్త్యము.

రెండు-
ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారు ఈ క్షేత్రంలోనే ఎక్కువకాలం ఉండి తన తెలుగు రామాయణం (మందరం) ను వాల్మీకి ప్రణీతమైన సంస్కృత రామాయణానికి సరిసమానమైన 24000 పద్యాలలో రచించడము.అంతేగాక దాదాపు నూరేళ్ళ నాడే దేశమంతా తిరిగి భిక్షమెత్తి,జీర్ణస్థితికి చేరిన ఈ దేవాలయాన్ని  ఆ ధనంతో బాగుచెయ్యడము.  

మూడు-
ఈ ఆలయంలోని కోదండరాముని దర్శించిన క్షణంనుంచే నాలో కవితాఝరి ఉప్పొంగి దాదాపు 108 తెలుగు ఆశుపద్యాల రూపంలో ప్రవహించడము.ఆ తర్వాత అప్పటినుంచీ ఇప్పటివరకూ దాదాపు రెండువేల తెలుగుపద్యములు నా నోటినుంచి ఆశువుగా రావడము.

నాలుగు-
మార్కండేయుడు తన తపస్సుతో పరమేశ్వరుని మెప్పించి మరణాన్ని జయించిన ప్రదేశం ఇదే కావడము.

అయిదు-
అన్నింటి కంటే మించినది,సీతా రామలక్ష్మణులు తమ వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మూడురోజులు నివసించడము.

ఈ కారణముల వల్ల,ఈ ఆలయం అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమాభిమానములు ఉన్నవి.ఇక్కడి కోదండరాముని కటాక్షం అనుపమానమైనదన్న విశ్వాసం నాకు అనేక అనుభవములు రుజువులతో సహా లభించింది.ఇదంతా జరిగి ఇప్పటికి దాదాపు అయిదేళ్ళు అవుతున్నది. అప్పట్లో నేను వ్రాసిన ఆయా పద్యములన్నీ నా బ్లాగు చదువరులకు సుపరిచితములే.

ఇన్నాళ్ళ తర్వాత,ఒంటిమిట్ట ఆలయాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలని భావించడం,నిర్దారించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది.విజయనగరం  జిల్లా రామతీర్ధమా? లేక కడపజిల్లా ఒంటిమిట్టయా? యన్న సందిగ్ధత తొలగిపోయి,ఒంటిమిట్ట వైపే ప్రభుత్వం మొగ్గుచూపడం బాగున్నది.రామతీర్ధం తక్కువది అని నా ఉద్దేశ్యం కాదు. అదికూడా మహత్తరమైన పుణ్యక్షేత్రమే.కానీ అనేక ఇతర అంశాలను బేరీజు వేసిన మీదట,ప్రభుత్వం చేత ఈ నిర్ణయం తీసుకోబడటం ముదావహం. రామతీర్ధాన్ని కూడా బాగా అభివృద్ధి చెయ్యవలసిన అవసరం గట్టిగా ఉన్నది.

ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారి కలలు ఈ విధంగానైనా నెరవేరి మహిమాన్వితమైన ఈ ఆలయం వెలుగులోకి వచ్చితే తెలుగుజాతికి అంతకంటే అదృష్టం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం.

అయితే,ఇదే అదనుగా చూచుకుని,వ్యాపారులు,షాపులు,దళారీలు, మోసగాళ్ళు ఇక్కడకు చేరి దీనిని కూడా ఒక వ్యాపారకేంద్రంగా మార్చి చివరకు ఒంటిమిట్టను కూడా తిరుపతిలా తయారు చెయ్యకుండా,దాని పవిత్ర వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలమీదా ప్రభుత్వంమీదా కూడా ఉన్నది.

అన్నింటినీ,చివరకు దేవాలయాలనూ పుణ్యక్షేత్రాలనూ కూడా భ్రష్టు పట్టించే ఈ కలియుగంలో ఇది ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.

ఇక్కడ వాతావరణం దిగజారకుండా,ఆలయ పవిత్రత కాపాడబడుతూ, ఇంకొకవైపు సౌకర్యాలు అభివృద్ధి జరిగితే అంతకంటే సంతోషం రామభక్తులకు ఇంకొకటి ఉండదు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.
read more " ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మంచిరోజులు "

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

Astro Workshop-1 విజయవంతంగా జరిగింది





















Astro Workshop-1 హైదరాబాద్ లో విజయవంతంగా జరిగింది.

ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం అయిదున్నర వరకూ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.హేతువాద భవనంలో,హేతువాద (logical) శాస్త్రం అయిన జ్యోతిష్యం చర్చింపబడటం చాలా సమంజసంగా అనిపించింది.

కార్యక్రమానికి 49 మంది హాజరయ్యారు.వీరిలో ఉద్యోగులు(ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు),వ్యాపారులు,గృహిణులు ఉన్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చినవారే కాక,దూరప్రాంతాలైన బెంగుళూర్ మొదలైన ప్రదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వచ్చినవారందరూ చాలా శ్రద్ధగా ఏడుగంటలపాటు మౌనంగా ఉండి సబ్జెక్టును వింటూ అర్ధం చేసుకుంటూ చక్కగా సహకరించారు.

దాదాపు 280 slides తో కూడిన పవర్ పాయింట్ సహాయంతో సబ్జెక్ట్ ని వివరించడం జరిగింది.

అయితే చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలన్న అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ సబ్జెక్ట్ అనేది ఇంతకు ముందు పరిచయం లేకపోవడంతో అతి బేసిక్ స్థాయి నుంచి మొదలుపెట్టి వివరిస్తూ రావడం జరిగింది.ఈ క్రమంలో సబ్జెక్ట్ లో ప్రవేశం ఉన్నవారికి కొంత విసుగు కలిగి ఉండవచ్చు.ఈ విషయాన్ని ముందుగానే చెప్పి,తమ సహచరులను దృష్టిలో ఉంచుకుని,సంయమనాన్ని పాటించమని వారందరినీ ముందుగానే కోరడం జరిగింది.

జ్యోతిష్య విజ్ఞానంలో ఉన్న పరాశర,జైమిని,తాజక,నాడీ మొదలైన రకరకాల సిస్టమ్స్ ను క్లుప్తంగా పరిచయం చేస్తూ,గ్రహాలు,రాశులు,నక్షత్రాలు,భావాలు, వాటి రకరకాల కారకత్వాలు,పంచాంగవివరాలను బట్టి జాతకుని జీవితాన్ని స్థూలంగా ఎలా గ్రహించాలి?ప్రాధమిక గ్రహయోగాలైన వేసి,వాసి, ఉభయచరి, అనఫా,సునఫా,దురుధరా,కేమద్రుమ,పంచమహాపురుష యోగాలైన రుచక, భద్ర,హంస,మాలవ్య,శశయోగాలు,కాలసర్పయోగం మొదలైన అనేక విషయాలను వివరించడం జరిగింది.

జ్యోతిర్విజ్ఞానంలో ఉన్న ప్రాధమిక అంశాలను,దాని పునాదులుగా నిలిచి ఉండే రకరకాల విషయాలను సభ్యులకు అర్ధమయ్యేలా చెప్పడంలో ఈ సమావేశం ఫలప్రదం అయిందని నేను భావిస్తున్నాను.

ఆరోజున క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ దానిని కూడా వదులుకొని ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.ఇది వారిలోని శ్రద్ధకు తార్కాణంగా నేను భావిస్తున్నాను.

ఈ సెమినార్ లో వివరింపబడిన విషయాలను బాగా ఆకళింపు చేసుకుని, ఇవ్వబడిన హోం వర్క్ చక్కగా చేస్తూ,ఒకటి రెండునెలలలో మళ్ళీ జరగబోయే రెండవ వర్క్ షాప్ కు సిద్ధం కావాల్సిందిగా మొన్న అటెండ్ అయిన అందరినీ కోరుతున్నాను.

ఈసారి జరగబోయే వర్క్ షాప్ లో - జాతకచక్రాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?ఎలా విశ్లేషణ చెయ్యాలి? అనే అంశాలను,అనేక సెలెబ్రిటీ చార్టులను ఉదాహరణలుగా చూపిస్తూ,జ్యోతిష్యపరమైన టెక్నికల్ పదాలను ఉపయోగిస్తూ డైరెక్ట్ గా వివరించడం జరుగుతుంది.ఈలోపల మొన్నటి వర్క్ షాప్ లో ఇవ్వబడిన మెటీరియల్ ను బాగా అర్ధం చేసుకుని తయారు అవ్వవలసిందిగా కోరుతున్నాను.ఆపైన జరుగబోయే వర్క్ షాపులలో 'అడ్వాన్సుడ్ ఎస్ట్రాలజీ టాపిక్స్' లోకి సరాసరి వెళ్ళడం జరుగుతుంది. 

ముఖ్యంగా స్త్రీలుకూడా జ్యోతిష్య విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం కలిగించింది.మనకు మహిళా జ్యోతిష్యవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు.ఒక గాయత్రీ దేవి వాసుదేవ్(బీవీ రామన్ గారి కుమార్తె),ఒక మృదులా త్రివేది మొదలైనవారు తప్ప జ్యోతిష్యరంగంలో పెద్దగా మనకు మహిళలు కనిపించరు.ఈ నేపధ్యంలో, ఇంతమంది స్త్రీలు ఈ వర్క్ షాప్ లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇందులో పాల్గొన్న 49 మందీ,సబ్జెక్టును బాగా నేర్చుకుని మంచి జ్యోతిష్యవేత్తలుగా రాణించాలని ఎంతోమంది జీవితాలను బాగుచేసే శక్తిని తద్వారా వారు సంపాదించాలని శ్రీరామకృష్ణులను,కాళీమాతను ఈ సందర్భంగా ప్రార్ధిస్తున్నాను.

అన్ని పనులనూ ఎంతో ప్లానింగ్ తో చూచుకుని,ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి కారకులైన రాజూ సైకం (MA Astrology),జానకిరాం,గిరిధర్ వర్మ లకు,మంచి ఫోటోలను తీసి ఇచ్చిన రేణూకుమార్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Astro workshop-2 ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలో మళ్ళీ బ్లాగు ముఖంగా ప్రకటన చెయ్యబడుతుంది.
read more " Astro Workshop-1 విజయవంతంగా జరిగింది "

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఉచ్చు

లౌకికజీవితంలో ఎదురయ్యే ఆటంకాలనూ అడ్డంకులనూ ఎలా అధిగమించాలో మానవుడికి తెలుసు.కానీ అంతరికలోకంలో,ఆధ్యాత్మిక లోకంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా దాటాలో తెలీదు.

లోకంలో ఎవరైనా మనల్ని ఒక తాడుతో కట్టేస్తే ఆ కట్లు ఎలా విప్పుకోవాలో మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మికలోకంలో మనల్ని మనమే రకరకాల తాళ్ళతో కట్టేసుకుంటూ ఉన్నామన్న సంగతి మనకు తెలియదు.మనల్ని మనమే కట్టేసుకుంటున్నామన్న విషయం తెలియకపోతే ఇక ఆ కట్లను విప్పుకోవాలని ఎలా అనిపిస్తుంది?మనకు తెలియకపోవడమే కాదు. తెలిసినవారు చెప్పినా వినిపించుకునే స్థితిలో,ఒప్పుకునే స్థితిలో మనం ఉండము.అదే ఆధ్యాత్మిక లోకంలో అసలైన విచిత్రం.

ఇలా జరగడానికి కారణం ఏమిటి?

బయట ప్రపంచంలో ఉన్న ఉచ్చులు ఆటంకాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.కనుక వాటిని దాటటం మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉండే ఆటంకాలు ఉచ్చులు కనిపించవు.బయట ప్రపంచంలో ఆటంకాలు బయటనుంచి వస్తాయి.ఇతరుల నుంచి వస్తాయి.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఆటంకాలు తమనుంచే పుట్టుకొస్తాయి.లోలోపలే అవి ఉంటాయి.వాటిని తయారు చేసుకునేదీ మనమే.వాటితో మనల్ని మనం కట్టుకునేదీ మనమే.కనుక వాటిని దాటే విధానం మనకు తెలియదు.దాటాలని కూడా మనకు అనిపించదు.ఆ కట్లను విప్పుకోవాలన్న స్పృహే మనకు ఉండదు. ఎందుకంటే ఆ కట్లు చాలా సుఖంగా ఉన్నట్లు అనిపిస్తాయి.

ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నవారుకూడా తాము స్వేచ్చగా ఉన్నామని అనుకోవడమే ఆధ్యాత్మిక లోకంలోని విచిత్రాలలో ఒకటి.

ఆధ్యాత్మిక లోకపు ఉచ్చులు ఎలా ఉంటాయో చూద్దామా?

'అ' 'ఆ' లు రానివారికి అద్భుతాల ఉచ్చు
అన్నీ చదివిన వాడికి అహంకారపు ఉచ్చు
అతితెలివి ఉన్నవాడికి అడుగు పడని ఉచ్చు
ఆశ ఎక్కువైపోతే అయోమయపు ఉచ్చు

ఆధ్యాత్మికత అంటే ఓనమాలు తెలియనివారు చాలామంది ఉంటారు.వారికి అద్భుతాల మీద మహామోజుగా ఉంటుంది.గారడీవిద్యలకూ ఈ అద్భుతాలకూ ఏమీ తేడాలేదు.రోడ్డుమీద గారడీ చేసి డబ్బులు అడుక్కునేవారికీ అద్భుతాలు చేసే మహాత్ములకూ పెద్దగా భేదం ఏమీలేదు. ఇద్దరూ దాదాపుగా ఒక స్థాయిలోని వారే.ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నవారు ఇలాంటి గారడీవిద్యలు చూచి బోర్లా పడిపోయి మోసపోతూ ఉంటారు.

ఇంకొంతమంది పుస్తకాలు విపరీతంగా చదివేసి విషయసేకరణ చేసి ఉంటారు. తద్వారా అన్నీ తెలుసుకున్నామని అనుకుంటూ ఉంటారు.ఇలాంటివారు పాండిత్య అహంకారం అనే ఉచ్చులో చిక్కుకుని ఇక అక్కడనుంచి ముందుకు కదలలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంతమంది అతితెలివితో నిండిపోయి ఉంటారు.వీరికి ఆధ్యాత్మికత అంటే ఒక పిచ్చివ్యవహారం కింద లెక్క.అదొక "టైంవేస్ట్" అని వారి ఉద్దేశ్యం.ఇలాంటి అతితెలివి మనుషులకు వారి అతితెలివే ఉచ్చుగా మారి వారిని ముందుకు అడుగు వెయ్యనివ్వకుండా ఆపుతూ ఉంటుంది.మాకన్నీ తెలుసు అనే భ్రమలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని కామెంట్ చేస్తూ వారు ఏమి కోల్పోతున్నారో వారే గ్రహించలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంత మందికి అత్యాశ ఉంటుంది.వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఏదో లాభం పొందుదామనే ప్రయత్నిస్తూ ఉంటారు.ఇలాంటివారు ఎన్నేళ్ల తరబడి అందులో ఉన్నాకూడా చివరకు ఏమీ అర్ధంకాని అయోమయమే వారికి మిగులుతుంది.వారి అత్యాశే వారికి ఉచ్చుగా మారి బిగిస్తుంది.అప్పనంగా వరాలొస్తాయన్న అత్యాశతో నిన్నా మొన్నటివరకూ కొందరు ప్రసిద్ధ గురువులను,అవతార పురుషులను(?) అనుసరించిన వారికి నేడు మిగిలింది అదే.ఆయా గురువులూ,అవతార పురుషులూ 'ఫ్రాడ్' అని నేడు తేలడంతో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో వారు ప్రస్తుతం ఉన్నారు.

గురువులమనుకునేవారికి గ్రుడ్డితనపు ఉచ్చు
మోసకారులకు వారి మోహపాశమే ఉచ్చు
అడుగు వెయ్యని వారికి అలసత్వమనే ఉచ్చు
అర్పణ చేతకానివారికి అహంకారమే ఉచ్చు

అసలు "విషయం" అంటూ వారిదగ్గర పెద్దగా లేకపోయినా, అనేకమంది వారికివారే 'సద్గురు' వులమని పేర్లు పెట్టుకుని శిష్యులచేత ప్రచారాలు చేయించుకుంటూ తెలిసీ తెలియని ఆధ్యాత్మికతను బాగా మార్కెటింగ్ చేస్తున్నారు.ఇలాంటి స్వయంగురువులకు వారి గ్రుడ్డితనమే వారికి ఉచ్చుగా మిగులుతుంది.

ఇంకొంతమంది వారి మోసకారుతనాన్ని ఆధ్యాత్మికలోకంలో కూడా ప్రయోగిస్తూ ఉంటారు.ఇలాంటివారికి కావలసింది ఆయా సర్కిల్స్ లో దొరికే పరిచయాలు.ఆ పరిచయాల ద్వారా అయ్యే పనులు.వీరంతా పచ్చి మోసగాళ్ళు.పనులు కావడమే వీరికి ప్రధానంగాని పరిణతి రావడం కాదు. వారిని పట్టి పీడిస్తున్న మోహాలే ఇలాంటివారికి ఉచ్చులుగా మారుతాయి. పక్కదారులు పట్టిస్తాయి.

ఇంకొంతమంది ఏళ్ళతరబడి ప్రవచనాలూ బోధలూ వింటూ ఉన్నప్పటికీ ఆచరణలో ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేరు.ఇలాంటి వారికి వారి అలసత్వమూ బద్ధకాలే ఉచ్చులుగా మారి కట్టివేస్తాయి.

ఇంకొంతమంది గురువుకూ దైవానికీ శరణాగతి కాలేరు.దానికి అడ్డుపడేది వారి అహంకారమే.'అహం' అన్న మాటను ఒప్పుకోకుండా దానికి రకరకాల కారణాలను వారు చెబుతారు.అలా వారికి వారే సర్దిచెప్పుకుంటూ సంతృప్తి పడుతూ ఉంటారు.ఇలాంటివారికి వారి అహంకారమే ఉచ్చుగా మారి బంధిస్తుంది.దానిని వారు దాటలేరు.

లోన శుద్ధికాకపోతె లోకమనేదే ఉచ్చు
కాలు కదపలేకపోతే కల్లమాటలే ఉచ్చు
మానవత్వమెరుగనిచో మాయతంతులే ఉచ్చు
దేశద్రిమ్మరులకేమో దేబిరింపే ఉచ్చు

మనస్సు శుద్ధి కాకపోతే లోకంలో ప్రతిదీ ఉచ్చుగా మారి మనల్ని కదలకుండా బంధిస్తుంది.మనస్సు శుద్దంగా ఉంటే లోకంలో ఏదీ మనల్ని బంధించలేదు.మనస్సు ద్వారానే బంధమైనా స్వతంత్రమైనా మనిషికి ప్రాప్తిస్తుంది.

కొంతమంది ఆచరణ అనేది లేకుండా ఊరకే కూచుని ఉపన్యాసాలు ఇస్తుంటారు.వారికి చివరకు మిగిలేవి కల్లమాటలూ సొల్లుమాటలే.ఆ మాటలే వారికి ఉచ్చులు.

ఇంకొంతమంది దేశాలు పట్టుకుని ఊరకే పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.అదే నిజమైన ఆధ్యాత్మికత అని వారనుకుంటారు.పోయిన ప్రతీచోటా ఏదో దొరుకుతుంది అన్న దేబిరింపే వారికి ఉచ్చుగా మారి వారిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా కట్టి ఉంచుతుంది.ఆ సంగతి వారు గ్రహించలేరు.

మరికొంతమంది మాయతంతులు హోమాలూ పూజలే మహాగొప్ప విషయాలని భ్రమిస్తూ వాటిల్లో మునిగి తేలుతూ ఉంటారు.వారికి మానవత్వం మాత్రం ఉండదు.ఇలాంటి మనుషులకు వారి మాయతంతులే ఉచ్చుగా మారి వారిని బంధిస్తూ ఉంటాయి.వారూ ఈ విషయాన్ని గ్రహించలేరు.

ఈ విధంగా ఆధ్యాత్మికలోకంలో అడుగడుగునా ఎవరి అజ్ఞానమూ స్వార్ధమూ అహంకారమూ అలసత్వమూ ఆశపోతుతనాలే వారికి ఉచ్చులుగా మారి వారిని కట్టిపడేస్తూ ఉంటాయి.కానీ అలా కట్టబడి ఉన్నామన్న స్పృహ వారికి ఉండదు.

ఇదే ఆధ్యాత్మిక లోకపు విచిత్రాలలో ఒక మహావిచిత్రం.

ఈ ఉచ్చులనుండి బయటపడలేకపోతే నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో ఎన్నటికీ అర్ధం కాదనేది మాత్రం కఠోరవాస్తవం.అర్ధం చేసుకోడానికే జన్మంతా సరిపోతుంటే ఇక దానిని ఆచరణలో పెట్టేది ఎన్నడు? అనుభవాన్ని పొందేది ఎప్పుడు?
read more " ఉచ్చు "

29, జనవరి 2015, గురువారం

స్వైన్ ఫ్లూ--హోమియో చికిత్స

అంటువ్యాధులూ సాంక్రామిక వ్యాధులూ ప్రబలినప్పుడే జనం హోమియోపతిని గురించి మాట్లాడుకుంటారు. కలియుగ సమాజంలో ఇదొక వింత.ఇలాంటి సమయాలలో సమర్ధవంతంగా పనిచేసే హోమియో మందులు మరి మిగతా రోగాలకు కూడా ఇంతే సమర్ధవంతంగా పనిచేస్తాయని ప్రజలకు ఎందుకు తోచదో అర్ధం కాదు.ఒకవేళ తోచినా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బు ఏదో ఒక డాక్టరు పాలు గాక తప్పదు గనుక అల్లోపతీ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారేమో తెలియదు.

ప్రస్తుతం స్వైన్ ఫ్లూ బూచి మళ్ళీ తెరమీదకు వచ్చింది.అక్కడక్కడా కేసులు వినిపిస్తున్నాయి.ఎక్కడ చూచినా 'ఆర్సెనికం ఆల్బం' మందును బటానీల లాగా పంచి పెడుతున్నారు.ఇంతకు ముందు మెదడు వాపు వ్యాధిలో 'బెల్లడోనా' మందును ఇలాగే పప్పు బెల్లాల లాగా వాడారు.ఆ వ్యాధి పుణ్యమాని 'బెల్లడోనా' పేరు చదువు రానివారి నోళ్ళలో కూడా నానింది.ఇప్పుడు 'ఆర్సెనికం ఆల్బం' పేరు నానుతోంది.

స్వైన్ ఫ్లూ రాకుండా నివారక ఔషధంగా (prophylactic) 'ఆర్సెనికం ఆల్బం' పనిచేస్తుంది అని ప్రచారం జరుగుతున్నది.నిజమే కావచ్చు.కానీ దానితో బాటే -'ఇన్ఫ్లూయంజినం' కూడా ఉపయోగపడుతుంది.వ్యాధి వచ్చిన తర్వాత బాధించే ఒళ్ళు నొప్పులను చలినీ తగ్గించదానికి 'యూపటోరియం పర్ఫోలియేటం' కూడా పనిచేస్తుంది.

"ఫలానా వ్యాధికి హోమియోలో మందు ఉన్నదా?" అని కొందరు అడుగుతూ ఉంటారు.అన్ని రోగాలకూ హోమియోలో ఔషధాలు ఉన్నాయి.ఈ విషయం అన్నీ తెలుసనుకునే నేటి నాగరికులకు ఎందుకు అర్ధం కాదో తెలియదు.

బహుశా దీనికి కూడా కారణం ఖర్మే అని నేననుకుంటాను.

మనకు డబ్బు వదిలించుకుని,బాధ తగ్గక,అవస్థపడే యోగం ఉన్నపుడు,హోమియోపతి వాడదామని తోచదు.అక్రమసంపాదన అంతా వదిలి,ఒళ్ళు గుల్ల అయిన లాస్ట్ స్టేజిలో మాత్రమే హోమియో వైపు జనం చూస్తారు.అప్పుడెలాగూ ఉపయోగం ఉండదు.'మేము హోమియో కూడా వాడాము'- అని చెప్పుకోడానికి తప్ప ఇంక దేనికీ అది ఉపయోగపడదు.

ఖర్మ తీరే సమయం ఇంకా రాకపోతే,ఒకవేళ హోమియోపతి వాడుదామని తోచినా,సరియైన హోమియో వైద్యుడు దొరకక ఎవరో ఒకరి దగ్గర హోమియో మందులు వాడి,రోగం తగ్గక,బాధపడుతూ ఉంటారు.తగ్గలేదని హోమియోపతి వైద్యాన్ని నిందిస్తూ ఉంటారు.ఇలాంటి వారిని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం.

అంటువ్యాధులు ప్రబలినప్పుడే కాదు మామూలు సమయాలలో వచ్చే రకరకాల రోగాలకు కూడా హోమియోపతి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.సరియైన వైద్యుని వద్ద మందులు వాడితే ఈ విషయం అతికొద్ది రోజులలోనే అర్ధమౌతుంది.

జ్యోతిష్య ఫలితం తప్పితే, జ్యోతిష్యశాస్త్రాన్ని నిందించకూడదు.అది జ్యోతిష్కుని చాతకానితనం.అలాగే,హోమియో మందులు పనిచెయ్యకపోతే ఆ శాస్త్రాన్నే నిందించడం తప్పు.ఆ వైద్యునికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాతకాలేదని తెలుసుకోవాలి.

ప్రస్తుతం మనకు తెలిసిన అన్ని రోగాలకూ(ఏవో ఒకటి రెండు తప్పించి) హోమియోపతిలో సమర్ధవంతమైన మందులు ఉన్నాయన్నది వాస్తవం.అవి ఇంగ్లీషు మందుల కంటే బ్రహ్మాండంగా పని చేస్తాయన్నదీ వాస్తవమే.

ఈ విషయం అనుభవంలో మాత్రమే తెలుస్తుంది.

అంటువ్యాధులను హోమియో ఔషధాలు చాలా వేగంగా సమర్ధవంతంగా తగ్గించడమే దీనికి ఋజువు.
read more " స్వైన్ ఫ్లూ--హోమియో చికిత్స "

25, జనవరి 2015, ఆదివారం

స్వచ్చమైన ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ కాదు--రామసేతువు

'శ్రీవిద్యారహస్యం' పుస్తకం ఇద్దామని ఆ మధ్యన గంగ శ్రీనివాస్ గారిని కలిశాను.ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే లో చీఫ్ పర్సనల్ ఆఫీసర్ గా ఉన్నారు.మంచి రచయిత.స్వాతిలోనూ నవ్యలోనూ ఆయన వ్రాసిన వ్రాస్తున్న కధలు తరచుగా ప్రచురింపబడుతూ ఉంటాయి. సీరియల్స్ కూడా వివిధ పత్రికలలో వస్తూ ఉంటాయి.

వృత్తి ఏదైనా,మంచి ప్రవృత్తి ఉన్న సహృదయులతో పరిచయం కావడం ఒక అదృష్టమే.'జీవిక కోసం వృత్తి,(ఉదాత్తమైన) భూమిక కోసం ప్రవృత్తి'--అనే మాటను నేను నమ్ముతాను.

మాటల సందర్భంలో, ఆయన వ్రాసిన 'సేతురహస్యం' అనే పుస్తకాన్ని నాకు ప్రెజెంట్ చేశారు.అది 2008 లో వచ్చింది.కాసేపు మాట్లాడి ఆ పుస్తకం తీసుకుని వచ్చేశాను.


తీరికగా ఆ పుస్తకాన్ని చదివాను.చాలా బాగుంది.ఒక మంచి ప్లాట్ తీసుకుని దానికి సైన్స్ నూ,చరిత్రనూ,పురాణాలనూ,సాంఘికతనూ మేళవించి ఒక నవలగా చాలా చక్కగా వ్రాశారు.సంతోషం కలిగింది.


ఆ పుస్తకంలో మంచి విషయాలు చాలా ఉన్నప్పటికీ ఒకే ఒక్క భావం నా మనస్సుకు గట్టిగా హత్తుకుపోయింది.అది ఎంతో అద్భుతమైన భావం.


'స్వచ్చమైన ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ కాదు.రామసేతువు.' అన్నదే ఆ భావం.


ఎంత నిజం !!

తాజ్ మహల్ అంటే ప్రేమకు చిహ్నమని దానిని వెన్నెల్లో చూడాలని ఎందఱో వెళ్లి అక్కడ ఫోటోలు దిగి మురిసిపోతూ వస్తుంటారు.ముఖ్యంగా ప్రేమికులు దానిని ఏదో అపురూపంగా భావిస్తారు.ఎంత మాయ !!

ప్రపంచం అంతా కుళ్ళుమాయలో బ్రతుకుతున్నదనడానికి మళ్ళీ ఇదొక రుజువు.

అసలు తాజ్ మహల్ అనేది షాజహాన్ కట్టించినది కాదనీ అప్పటికే అక్కడ ఉన్న తేజోమహాలయాన్ని షాజహాన్ మార్పులు చేసి ఇలా తయారు చేశాడనీ P.N.OAK తన పరిశోధనలో నిర్ద్వంద్వంగా నిరూపించాడు.ఆ పుస్తకం మన దేశంలో బ్యాన్ చేశారు.ఆ పరిశోధనకు తార్కాణంగా తాజ్ మహల్లో మూసేసిన నేలమాళిగలూ,ఆ డిజైన్లో ఉన్న నాన్-అరబిక్ ధోరణులూ, కలశమూ, లోపలున్న శివలింగమూ ఇత్యాది చాలా రుజువులను ఆయన ఉటంకించాడు.


ఆ విషయాలన్నీ నిజాలే.అయితే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం బానిస మనస్తత్వంతో కుళ్ళిపోతున్న మన సమాజానికి ఉండదు గనుక ఆ సంగతి అలా ఉంచుదాం.


అసలు ముంతాజ్ అనే ఆవిడ షాజహాన్ భార్య కాదు.తన వద్ద సామంతుడైన ఒక ఉద్యోగి భార్య.ఆమెను షాజహాన్ మోహిస్తాడు.ఆ సంగతి గ్రహించిన ఆ భర్త ఆమెను తీసుకుని ఎక్కడెక్కడో దాక్కున్నా కూడా షాజహాన్ అతన్ని వెతికించి పట్టుకుని చంపేసి ముంతాజ్ ను తన జనానాలో కలిపేసుకుంటాడు. ఆమె చనిపోతే,అప్పటికే ఉన్న శివాలయాన్ని మార్పులు చేర్పులు చేసి తాజ్ మహల్ గా ఆమె సమాధిగా కట్టిస్తాడు.అంటే తన స్వార్ధం కోసం ఇంకొక కుటుంబాన్ని నాశనం చేసినదానికి రుజువుగా ఈనాటికీ మన కళ్ళెదుట నిలిచి ఉన్న ఒక చెడుకట్టడమే ఈ తాజ్ మహల్.దానిని ఒక సౌందర్య సూచికగా మనం ఆరాదిస్తున్నాం.


ఎంత ఖర్మ !!!


ముంతాజ్ ను వదులుకోవడానికి ఆ అసలు భర్త ఎంత బాధపడి ఉంటాడో,చివరకు తన రక్తాన్ని కట్నంగా ఇచ్చి,తన భార్యను షాజహాన్ కు అప్పగించినప్పుడు ఎంతగా కుమిలిపోయి ఉంటాడో ఊహిస్తే అప్పుడు తాజ్ మహల్ మనకు తెల్లగా కనిపించదు.మెరిసే వెన్నెల్లో కూడా ఎర్రగా రక్తం రంగులో కనిపించి అసహ్యాన్ని కలిగిస్తుంది.

సరే ఆ భర్త సంగతి అలా ఉంచుదాం.అన్నేళ్ళు కాపురం చేసిన ఆ భర్తను వదలిపెట్టి,ఎవడో చక్రవర్తి కోరినంత మాత్రాన,ముంతాజ్ ఎలా రాగలిగింది? తనకోసం ప్రాణాలు కూడా తృణప్రాయంగా ఇచ్చిన తన భర్తది ప్రేమకాదా?రాజపుత్ర స్త్రీ మంటల్లో దూకి భర్తతో బాటే సహగమనం చేసినట్లుగా తనూ తన భర్తతోనే చనిపోయి ఉండాలి.షాజహాన్ని తిరస్కరించి ఉండాలి.అదీ అసలైన ప్రేమ.అంతేగాని రక్తమోడుతున్న భర్త శవం మీదుగా నడిచివెళ్లి ఆనందంగా షాజహాన్ కౌగిట్లో ఒదిగిపోయింది.అంటే ఆమెకు డబ్బూ విలాసాలే ముఖ్యాలు గాని భర్త ప్రేమ ముఖ్యం కాదు.ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే,ఎవరి దగ్గర ఇంకా మెరుగైన విలాస జీవితం దొరికితే వాడి దగ్గరకు హాయిగా వెళ్ళిపోతుంది.ఎంత ఛండాలపు మనస్తత్వం??


దీనిని అమరప్రేమ అని ఎలా అనగలం?

కనుక ఏ విధంగా చూచినా కూడా షాజహాన్ ముంతాజ్ లు అమరప్రేమికులు కానేకారు.వారు పరమ స్వార్ధపరులు.తమ సుఖం తప్ప ఇంకేమీ పట్టని దౌర్భాగ్యులు.ఎదుటివారి ప్రాణాలు పోయినా సరే,తమ సుఖం తమకు దక్కితే చాలనుకునే నీచులు.తాజ్ మహల్ ను ఒక ప్రేమచిహ్నంగా భావించడం మన దౌర్భాగ్యం.


దీనికి విభిన్నంగా -- రామసేతువు ఏమిటో చూద్దాం.


సీత ఒక రాజకుమార్తె.అమాయకురాలు.అల్లారు ముద్దుగా పెరిగింది.ఎండ కన్నెరుగని కోమలి.సవతి అత్తగారి దురాశకీ,మామగారి చేతగాని తనానికీ తలొగ్గి,ఎదురుతిరగకుండా,భర్తనే దైవంగా భావించి ఆయనతో అడవిలో పద్నాలుగేళ్ళు దుర్భరమైన జీవితం గడపడానికి, మంచి వయస్సులో ఉన్న సమయంలో, బయలుదేరింది.


ఎంతటి త్యాగమూర్తి సీతాదేవి !!!


"మీమీ గొడవలలో నా జీవితాన్ని నేనెందుకు బలిచేసుకోవాలి? అత్తగారు మామగార్ల కుట్రలకు నేనెందుకు నా యవ్వనాన్నీ వివాహజీవితాన్నీ బలి చెయ్యాలి?నేను దీనికి ఒప్పుకోను.నా భర్తే చక్రవర్తి.నేనే మహారాణిని.మీరంతా నోర్మూసుకుని పడుండండి.లేదా జైల్లో పడి చావండి.అంతేగాని మేమెందుకు అడవికి పోవాలి?"- అని ఆ తల్లి ఒక్కమాట కూడా అనలేదు.అని ఉంటే చరిత్ర వేరుగా ఉండేది.కానీ సీతమ్మ అలా చెయ్యలేదు.మారుమాట్లాడకుండా తలవంచుకుని భర్తతో అడవికి వెళ్ళడానికి సిద్ధపడింది.

పైగా,అడవికి వెళ్లాలని ఆమెకేమీ నియమం లేదు.ఆ షరతు శ్రీరామునకే వర్తిస్తుంది.ఆమెకు వర్తించదు.తను హాయిగా అయోధ్యలోనే ఉండవచ్చు.లేదా ఆ పద్నాలుగేళ్ళూ తన తండ్రిగారి వద్ద ఉండి ఆ తర్వాత మళ్ళీ అయోధ్యకు రావచ్చు.కానీ స్వచ్చందంగా భర్తతో బాటు అడివికి బయల్దేరింది.ఆయన కష్టాలు తనకూ కష్టాలే అనుకుంది.ఆయన సుఖాలలోనే కాదు కష్టాలలో కూడా తనకు భాగం ఉన్నదని నమ్మింది.


ఎంతటి ఔన్నత్యం !!!


సరే ఆమె విషయం అలా ఉంచుదాం.శ్రీరాముని సంగతి కొంచం చూద్దాం.


అడవిలో ఉంటున్నారు.పదమూడేళ్ళు అయిపోయాయి.ఇంకొక ఏడాదిలో వనవాసం అయిపోతుంది.తాము అయోధ్యకు వెళ్లి హాయిగా రాజ్యం చేసుకోవచ్చు.ఈ సమయంలో ఒక రాక్షసుడు. వాడొచ్చి తన భార్యను ఎక్కడికో ఎత్తుకుపోయాడు.ఎక్కడున్నాడో తెలియదు.సీత ఏమైపోయిందో తెలియదు.అసలు బ్రతికుందో లేదో తెలియదు.


"తాను మహారాజు.సీత కాకుంటే ఇంకొక గీత.తాను "ఏకపత్నీవ్రతం" అన్న ఒక్క మాటను తననుంచి చెరిపేస్తే,మహా సౌందర్యవతులైన ఎందఱో రాజకుమార్తెలు తనకోసం పరిగెత్తుకుంటూ వస్తారు.సీత పోతే పోయిందిలే.నానాబాధలు పడి ఎక్కడుందో వెతికి తెచ్చుకుని ఏలుకోవాల్సిన ఖర్మ నాకెందుకు?హాయిగా వెనక్కు వెళ్ళిపోయి ఒక పదిమంది రాజకుమార్తెలను చేసుకుని సుఖంగా కాలక్షేపం చేద్దాం" అని శ్రీరాముడు కలలో కూడా అనుకోలేదు.


ఆమె కోసం పరితపించాడు.తననే  నమ్ముకుని తనకోసం ఇంతదూరం ఈ అడివిలోకి వచ్చింది.నానా కష్టాలు పడింది.చివరకు ఎవడో రాక్షసుడి చేతుల్లో చిక్కుకుని అలమటిస్తున్నది.ఎలాగైనా తనను రక్షించాలి.శత్రువు మహా బలవంతుడు.రాజు.తానో? ప్రస్తుతం ఒక సామాన్యుడు.చేతిలో ఆయుధాలు లేవు.సైన్యం లేదు.దారి తెలియదు.సమాచార వ్యవస్థా గూఢచార యంత్రాంగమూ లేవు.ఏం చెయ్యాలో తెలియని తిక్కుతోచని పరిస్థితి.


"అయినా సరే.ఏదేమైనా సరే సీత ఎక్కడుందో తెలుసుకోవాలి.ఆమెను రక్షించాలి.లేకుంటే ఆ ప్రయత్నంలో తానూ మరణించాలి.అంతేగాని వెనక్కు మరలే ప్రసక్తే లేదు." అని నిశ్చయించుకుని ప్రయత్నాలు సాగించాడు. కాలినడకన అడవులు దాటి కొండలు దాటి కోతులతో స్నేహం చేసి సీత జాడ కనిపెట్టాడు.


ఆమె శత్రుదుర్భేధ్యమైన మహానగరంలో మహా క్రూరులైన రాక్షసుల మధ్యలో బందీగా ఉన్నది.అయినా సరే,వారిది అధర్మం.తనది ధర్మం.చివరకు ధర్మమే జయిస్తుంది.అన్న ధృఢమైన నమ్మకంతో ముందుకు సాగాడు.


మహాసముద్రం అడ్డొచ్చింది.ఎలాగైనా సరే, దానిని కూడా దాటే తీరాలి.సీతను చేరుకోవాలి.అప్పుడు ఉద్భవించినదే రామసేతువు.పది యోజనాల వెడల్పుతో నూరు యోజనాల పొడవుతో కోతులచేత సముద్రం మీదుగా నిర్మించబడినదే  ఈ మహావారధి.నేడు శాటిలైట్ చిత్రంలో మనకు కనిపిస్తున్నది నిజమైన రామసేతువు కాదు.దాని అవశేషం మాత్రమే.నిజమైన రామసేతువు ఇంకా పెద్దది.అది కాలగర్భంలో సముద్రగర్భంలో కలసిఉన్నది.


నిజమైన,స్వచ్చమైన,అపురూపమైన ప్రేమకు అసలైన చిహ్నం రామసేతువు.రాక్షసుని చేతుల్లో చిక్కి తనకోసం కుమిలిపోతూ ఏడుస్తున్న తన ప్రియసతిని రక్షించాలన్న మహాసంకల్పానికి రూపమే రామసేతువు.ఇదే అసలైన ప్రేమ చిహ్నం.

ఎంత గొప్ప ప్రేమ శ్రీరామునిది?

ఎంత ఉన్నతమైన సంకల్పం ఆయనది?

ఆ మహాసంకల్పమే ఏకాకిగా అడవులనూ సముద్రాన్నీ జయించింది.

"మహాసైన్యంతో కూడి అన్ని వసతులూ వనరులూ ఉన్న రాక్షసులను ఏ సదుపాయాలూ యంత్రసంపత్తీ లేని తను కోతుల సాయంతో ఎదుర్కోవాలి,తన సీతను రక్షించాలి"-- అన్న దృఢమైన నిశ్చయాన్ని శ్రీరామునకు ఇచ్చింది.

ఇక సీతాదేవి విషయం కాస్త ఆలోచిద్దాం.

రావణుడు మహా అందగాడు.చక్రవర్తి.రాముడో సామాన్య మానవుడు.ప్రస్తుతం అన్ని హోదాలూ పోయి అడవిలో పడి అల్లాడుతూ ఉన్నాడు.అయోధ్య సంగతి చూద్దామా అంటే అది మట్టీ రాళ్ళతో కట్టిన నగరం.మరి లంకో? బంగారు నగరం.ఇక్కడ లక్ష్మి అణువణువునా తాండవిస్తున్నది.తనకంటే కూడా మహా సౌందర్యవతులైన ఎందఱో స్త్రీలు రావణునికోసం పరితపిస్తూ ఎదురు చూస్తున్నారు.కానీ రావణుడు తనను కోరుతున్నాడు.అతని ప్రేమ కూడా గొప్పదే.అసలు రాముడు బ్రతికి ఉన్నాడో లేడో తెలియదు.ఇక్కడకు వస్తాడో లేడో తెలియదు.తనకు కాపాడతాడనే నమ్మకం లేదు.ఈ గోలంతా ఎందుకు? అసలు ఈ రాముణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాతే తనకు కష్టాలు ఆరంభమయ్యాయి.ఎన్నో ఊహలతో అత్తగారింట్లో అడుగు పెట్టింది.కానీ మరుక్షణం నుంచీ అన్నీ కష్టాలే.యవ్వనంతో కూడిన తన జీవితమంతా రాజభవనంలో కాకుండా అడివిలో రాళ్ళమధ్య గడిచిపోయింది.

అసలెందుకీ ఖర్మ?హాయిగా రావణుడికి భార్యగా ఉండిపోతే బాగుంటుంది కదా.తనను పట్టపు రాణిని చేస్తానని అంటున్నాడు.మండోదరినే తనకు చెలికత్తెగా నియమిస్తానని అంటున్నాడు.ఇంకేం కావాలి? జీవితాంతం ఇక్కడే హాయిగా రాణిగా ఉండిపోతే పోలా?"

ఈ విధంగా సీత కలలో కూడా ఆలోచించలేదు.అసలామె రావణుని వైపు తలెత్తి కూడా చూడలేదు.ఒక గడ్డిపరకను ఎదురుగా ఉంచుకుని దానివైపు చూస్తూ అతనితో మాట్లాడింది.నా దృష్టిలో నీవొక గడ్డిపరకవని చెప్పకనే చెప్పింది.

ఏకవస్త్రగా తొమ్మిదినెలలు దుర్భరవేదనను అనుభవించింది. నిరాహారిగా ఉన్నది.పక్కన బాధలు పెడుతున్న రాక్షస స్త్రీల సాధింపులను మౌనంగా సహించింది.వస్తాడో రాడో తెలియని రాముని కోసం చెక్కుచెదరని మొక్కవోని సంకల్పంతో ఎదురుచూస్తూ కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని బ్రతికింది.

ఏమిటా తల్లి మానసిక స్థైర్యం!!!

ఎంత గొప్పది రామునిపై ఆమె నమ్మకం !!

అందుకనే వాల్మీకి మహర్షి -- 'సీతాయాశ్చరితం మహత్' (సీతాదేవి చరిత్ర మహత్తరమైనది) అన్నాడు.

ఎంత గొప్ప మాట !!!

వందలమైళ్ళ దూరంలో ఉన్నా సీతారాముల ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి.ఒకరి ప్రాణాలు ఒకరిపైనే ఉన్నాయి.కష్టాలను వారు లెక్కచెయ్యలేదు."అసాధ్యం" అనే మాట వారిలో తలెత్తలేదు.వారు ధర్మాన్ని నమ్మారు.ప్రేమను నమ్మారు. అల్పమైన, తాత్కాలికమైన సుఖాలకోసం వారు వెంపర్లాడలేదు.ప్రేమకోసం ఎంతటి కష్టాన్నైనా సహించారు.మాటకోసం నిలబడ్డారు.ధర్మం కోసం నిలబడ్డారు.

కనుకనే నేటికీ ప్రతీ పల్లెలో దైవాలుగా ఆరాధింపబడుతున్నారు.

తాజ్ మహల్ కూ రామసేతువుకూ ఎక్కడా పోలికే లేదు.

తాజ్ మహల్ స్వార్ధానికీ,దుష్టత్వానికీ,దురాశకీ,పరకళత్ర కాముకత్వానికీ పరాకాష్ట అయితే,రామసేతువు స్వచ్చమైన, నిష్కల్మషమైన, మేరుసమానమైన ప్రేమకి,అచంచలమైన సంకల్పశక్తికీ  ప్రతిరూపం.

అప్పటికే ఉన్న శివాలయాన్ని దోచుకుని మార్పులు చేసి ఒక అక్రమ సంబంధానికి ప్రతీకగా ఇంకొకరి భార్యకు కట్టిన సమాధి తాజ్ మహల్.

ధర్మంకోసం,తమ ప్రభువుకోసం,కొండరాళ్ళను పోగుచేసి సముద్రం మీద అమాయకమైన భక్తితో కోతులు కట్టిన వారధే రామసేతువు.

కామదాహానికీ రక్తదాహానికీ నీతిలేనితనానికీ ప్రతీక తాజ్ మహల్.

స్వచ్చమైన ప్రేమకీ,ధర్మానికీ,సంకల్పశక్తికీ తార్కాణం రామసేతువు.

డబ్బులు పడేసి కూలీలతో ఒక దేవాలయాన్ని కూలగొట్టించి,సమాజపు ధనాన్ని దోచుకుని తన సుఖంకోసం ఖర్చుపెడుతూ,ఆ డబ్బుతో పరాయివ్యక్తి భార్య శవంమీద కట్టిన అక్రమకట్టడం తాజ్ మహల్.

శ్రమదానంతో,ఏమాత్రం లాభాపేక్ష లేకుండా,నిస్వార్ధంగా,ఒక ఉదాత్తమైన ధర్మాశయం కోసం తమ చెమటను చిందించి కోతులు కట్టిన వారధి రామసేతువు.

ఎంత తేడా ఈ రెంటికీ??

షాజహాన్ ముంతాజ్ ల స్వార్ధ కామపూరితమైన వ్యామోహం ఎక్కడ?

సీతారాముల అకలంకమైన,మహోజ్జ్వలమైన ప్రేమ ఎక్కడ?

సీతారాముల కాళ్ళక్రింద మట్టిలో ఉన్న ఒక్క ధూళికణంతో కూడా షాజహాన్ ముంతాజ్ లు ఏమూలకూ సరిపోరు.

మనం రామసేతువుని పూజించాలి.రామసేతువుని ప్రేమచిహ్నంగా గుర్తించాలి.అప్పుడే మనం దైవత్వం వైపు ఎదుగుతాం.సీతారాములు మనకు ఆదర్శం.వారిని మరచి పనికిమాలిన పాప్ స్టార్స్ నీ,నీతిలేని సినిమా యాక్టర్లనీ,మన దేశాన్ని దోచుకున్న పరాయి పరిపాలకులనూ ఆదర్శంగా తీసుకున్నంతవరకూ మనకు పతనం తప్పదు.

రాక్షసత్వానికి సూచిక అయిన తాజ్ మహల్ని ఒక గొప్ప ప్రేమచిహ్నంగా భావిస్తున్నంతసేపూ మన సమాజం ఇంకాఇంకా పతనం కాక తప్పదు.

ప్రేమచిహ్నం అయిన రామసేతువుని విస్మరిస్తున్నంత కాలం మన సమాజంలో విలువలు తిరోగమనం చెందకా తప్పదు.

ఒక గొప్ప భావాన్ని తన 'సేతు రహస్యం' నవల ద్వారా చెప్పిన గంగ శ్రీనివాస్ గారికి మన:పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
read more " స్వచ్చమైన ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ కాదు--రామసేతువు "

17, జనవరి 2015, శనివారం

One day Astrology Workshop in February-2015

అనేకమంది చాలారోజుల నుంచి నన్ను కోరుతున్నారు జ్యోతిష్యంలో మీ విధానాన్ని మాకూ నేర్పించండి అని.నేర్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు.కానీ అనేక కారణాల వల్ల దానిని వాయిదా వేస్తూ వస్తున్నాను.

ఏ విద్య అయినా మనతోనే ఉండిపోకూడదు.మనతోనే నశించి పోకూడదు అని నేను నమ్ముతాను.నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్నవారికి నా వద్ద ఉన్న విద్యలు నేర్పడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను.

ఇప్పుడు,వారందరి అభ్యర్ధనను మన్నిస్తూ,ఫిబ్రవరి 2015 లో One day Astrology workshop నిర్వహించబడుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.

ఈ workshop  హైదరాబాద్ లో గాని,విజయవాడలో గాని అందరికీ వీలుగా ఉండేలా ఒక ఆదివారం రోజున జరుగుతుంది.ఉదయం ఒక సెషన్ మధ్యాన్నం ఒక సెషన్ ఉంటాయి.ఇందులో పాల్గొనేవారికి నేను అనుసరించే జ్యోతిష్య విశ్లేషణా విధానాన్ని మొదటి నుంచీ నేర్పించడం జరుగుతుంది.సబ్జెక్ట్ ను అతి ప్రాధమికస్థాయి నుంచి మొదలుపెట్టి అతి అడ్వాన్సుడు స్థాయివరకూ క్రమంగా నేర్పడం జరుగుతుంది.

ప్రతి రెండు లేదా మూడు నెలలకొకసారి ఈ విధమైన workshops నిర్వహించి ఉత్సాహం ఉన్నవారికి అసలైన జ్యోతిర్విద్యను నేర్పించాలని,ప్రస్తుతం ఎక్కడ చూచినా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న కుహనా జ్యోతిష్కులకు విరుద్ధమైన అసలైన జ్యోతిర్విద్యా సాధకులను తయారు చెయ్యాలని నా సంకల్పం.

ఉత్సాహం ఉన్నవారు,మరిన్ని వివరాలకోసం,మా "పంచవటి" గ్రూపు సభ్యుడు శ్రీ రాజు సైకం ను ఈ క్రింది అడ్రస్ లో సంప్రదించగలరు.

E-mail:-- www.raju@gmail.com
Mobile:--9966007557
read more " One day Astrology Workshop in February-2015 "

11, జనవరి 2015, ఆదివారం

దర్శనమివ్వని శ్రీనివాసుడు ధన్యతనిచ్చాడు

ఈ మధ్యన తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళడం జరిగింది.

ముందురోజున సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా దర్శనం చేసుకుని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందామని VIP బ్రేక్ లో టికెట్స్ బుక్ చేశాము.

నేను తిరుమల వెళ్లి దాదాపు నాలుగేళ్ళు అయింది.ఈ నాలుగేళ్ళలో ఏమైనా మారిందా అని చూచాను.అక్కడి పరిస్థితి ఏమీ మారలేదు.అదే తోపులాట.అదే హడావుడి.మనుషుల్లో అదే స్వార్ధం.అదే చవకబారుతనం. అదే మోసం.

విసుగొచ్చింది.

సరే ఉదయాన్నే లేచి స్నానాలు కానిచ్చి ఆరింటికల్లా క్యూలో నిలబడ్డాము.గేట్ దగ్గరకు వచ్చేసరికి అందరికీ ID కార్డ్స్ ఉండాలని గేట్లో ఉన్న ఉద్యోగులు పట్టుబట్టారు.టికెట్స్ బుక్ చేసేటప్పుడు నా ఐడీ మీద బుక్ చేశాము.సరిపోతుందిలే అనుకున్నాము.కానీ అలా కుదరదనీ,ఒక కుటుంబంలో నలుగురు ఉంటె నలుగురికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలనీ ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళమనీ లేకుంటే ఆగిపోమ్మనీ గేట్లో ఉన్న  TTD ఉద్యోగులు పట్టుబట్టారు.మాలాగే దాదాపు ఒక 50 మంది ఆగిపోయారు.వారిలో అహమ్మదాబాద్ మొదలైన దూరప్రాంతాలనుంచి వచ్చ్సినవారే గాక,విదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వారందరూ బిక్కముఖాలు వేసుకుని ఉద్యోగులను బ్రతిమిలాడుకుంటున్నారు.

నాకు భలే చికాకూ అసహ్యమూ కలిగాయి.ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండవచ్చు.దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.ఎవరూ కాదనరు.కానీ దూరం నుంచి వచ్చినవారినీ,ఒకే కుటుంబంలోని వారినీ,కొందరిని వదిలి,కొందరిని వదలకుండా వాళ్ళు పెట్టె హింస చాలా చండాలం అనిపించింది.అంతంత దూరాలనుంచి వచ్చి అంత చలిలో పొద్దున్నే క్యూలో నిలబడే వాళ్ళు టెర్రరిస్టులా లేక భక్తులా అన్న విచక్షణ అక్కడి ఉద్యోగులకు లేకపోవడం చూసి అసహ్యం కలిగింది.

కొద్దిసేపు అక్కడే ఉండి,ఆ గొడవ అంతా పరిశీలిస్తూ ఉన్నాను.బ్రతిమిలాడే వాళ్ళు రకరకాలుగా బ్రతిమిలాడుతున్నారు.ఉద్యోగులు కరగడం లేదు.పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది.ఎంతో దూరం నుంచి వచ్చి,డబ్బులు కట్టి టికెట్స్ బుక్ చేసుకుని,తీరా వాకిట్లోకి వచ్చేసరికి లోనికి వెళ్ళనివ్వకపోతే ఎంత బాధ కలుగుతుందో ఆ బ్రతిమిలాడే వాళ్ళను చూస్తె అర్ధమౌతుంది.నాకైతే వాళ్ళను చూస్తె అయ్యో పాపం అనిపించింది.వారి తరఫు నుంచి నేనూ కొంత సేపు ఉద్యోగులతో వాదించాను.కానీ వాళ్ళు వినడం లేదు.

ఈ లోపల మా గ్రూపులో ఐడీ కార్డ్ ఉన్న ఒకరిని లోనికి పంపించాము.నా దగ్గర ID card ఉన్నప్పటికీ మావాళ్ళ కోసం నేను ఆగిపోయాను.

ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్లో నాకు పరిచయాలున్నాయి.కొంతమంది మంత్రులూ వాళ్ళ పీఏలూ కూడా నాకు పరిచయం ఉన్నది.ప్రభుత్వం లోని ఉన్నతోద్యోగులు కూడా నాకు చాలామంది తెలుసు.వాళ్లకు ఒక్క ఫోన్ చేస్తే పని చిటికెలో అయిపోతుంది.గేట్లో ఆపుతున్న ఉద్యోగులే అప్పుడు నమస్తే పెట్టి దగ్గరుండి లోపలదాకా తీసికెళతారు.

కానీ నాకాపని చెయ్యాలనిపించలేదు.అలా రికమండేషన్ తో దర్శనం పొందటం ఏదో గిల్టీగా అనిపించింది.

పరాయి మతాలవాళ్ళు చర్చిల తలుపులు బార్లా తీసి లోనికి రమ్మని పిలుస్తుంటే మనం మాత్రం దైవదర్శనానికి టికెట్లు పెట్టి, డబ్బులు కట్టినవారిని కూడా నానా మాటలంటూ,పొమ్మని తోసేస్తున్నాము.ఇలాంటి అవమానాలు పొందిన కొందరు ఈ ఖర్మ మనకెందుకంటూ ఇతర మతాలకు మారడం నాకు తెలుసు.అక్కడైతే ఎదురు డబ్బులు ఆస్తులు ఇచ్చి మరీ లోనికి రమ్మంటారు.ఇక్కడేమో వాకిట్లోకి వచ్చినవారిని పోపొమ్మంటున్నారు.

భలే వింత!!

పైగా,మన మతాన్నీ మన దేవాలయాలనూ మన దేవుళ్ళనూ విమర్శించడానికి ఇలాంటి చర్యలద్వారా మనమే ఇతర మతాలకు చక్కని అవకాశం కల్పిస్తున్నాం.కొంతమంది భక్తులు గుంపుగా ఒక కుటుంబంగా వచ్చినపుడు కొందరికి ఐడీ ఉండి కొందరికి లేనప్పుడు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించే పరిస్థితి అక్కడి అధికారులకు ఉంటుంది. ప్రతి నియమానికీ ఒక వెసులుబాటు తప్పకుండా ఉంటుంది.కానీ వాళ్ళు దానిని ఉపయోగించడం లేదు.గుడ్డిగా రూల్ ను ఫాలో అవుతున్నారు. లేదా అలా నటిస్తున్నారు.కొండొకచో తమకు కావలసినప్పుడు మాత్రం అదే రూల్ ను చక్కగా తీసి పక్కన పెడుతున్నారు.

పైగా క్యూలో ఉన్నవాళ్ళు తీవ్రవాదులు కారు.వారివద్ద మారణాయుధాలు ఏమీ లేవు.ఒంటిమీద చొక్కా కూడా తీసేసి ఒక తువ్వాలు కప్పుకుని పంచె కట్టుకుని ఉన్నవారివల్లా,ఆడవారూ పిల్లలవల్లా,చలిలో వణుకుతూ దర్శనానికి వచ్చిన భక్తులవల్ల ఆలయానికి ప్రమాదం ఏముంటుంది?చిన్న పిల్లల దగ్గర ఐడీ కార్డ్ ఎలా ఉంటుంది?ఇలాంటి తలాతోకా లేని రూల్స్ ఎందుకు పెడతారో ఎవరు పెడతారో ఆ దేవునికే ఎరుక.

మాకు దర్శనం కానందుకు నాకు బాధ కలగలేదు.కానీ దూరాభారాల నుంచి వచ్చి దైవదర్శనం కోసం ఉద్యోగుల కాళ్ళూవేళ్ళూ పట్టుకుంటున్న ఆ భక్తులను చూచి బాధ కలిగింది.మన హిందూమతపు దుస్థితి చూచి బాధ కలిగింది.

ఇదంతా చూచిన మీదట నాకొక ఆలోచన వచ్చింది.

దేవుడున్నాడో లేడో మనకు తెలీదు.దేవుడు గొప్పవాడో కాడో మనకు తెలియదు.కానీ ఒక్కటి మాత్రం వాస్తవం.భక్తుల నమ్మకం విశ్వాసం మాత్రం గొప్పవి.

మౌనంగా వెనక్కు తిరిగి నిదానంగా నడుచుకుంటూ కాటేజీకి వచ్చేశాము.

మా శ్రీమతి బాధపడుతూ ఉండటం గమనించి 'నిన్న ఒకసారి దర్శనం అయింది కదా.ఎన్నిసార్లైనా అదే దర్శనం.బాధపడకు.దర్శనం ముఖ్యం కాదు.ఆ దర్శనంవల్ల మనలో ఎంత పరిపక్వత వచ్చిందీ అనేదే ముఖ్యం. దర్శనం ఎందరికో అందుతుంది.ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం.దానివల్ల ఏమి ఒరిగింది? దర్శనం ముఖ్యం కాదు. సమత్వస్థితిలో కలిగే ధన్యత ముఖ్యం.ప్రశాంతంగా ఆలోచించు.' అని చెప్పాను.

కాటేజీలో మౌనంగా ధ్యానంలో కూచుని నా మనస్సును పరిశీలించుకున్నాను.ఎక్కడా ఏమూలా బాధ అనేదిగాని,కోపం అనేది గాని,"అయ్యో ఇంతదూరం వస్తే ఇలా జరిగిందే" అన్న ఫీలింగ్ గాని కొద్దిగా కూడా కనిపించలేదు.

పైపెచ్చు ఏదో తెలియని సంతోషం లోనుంచి ఉబికి వస్తున్నది.

చుట్టూ ఉన్న ప్రకృతిని తేరిపార చూచాను.దైవం మహోజ్జ్వలంగా వెలుగుతూ ప్రకృతిలో దర్శనం ఇస్తున్నది.ఇంతకంటే మించిన దైవదర్శనం ఇంకెక్కడుంది? దైవం ఒక్క రాతి విగ్రహంలోనే లేడుగా? మనం చూడగలిగితే దైవం ప్రతిచోటా ఉన్నది.'చరాచర జగన్నాథా చక్రరాజ నికేతనా' అని లలితా సహస్రం అనడంలేదా?

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఒకరిలా అడిగారు.

'అమ్మా.దైవం ఎక్కడుంది?'

'ఎక్కడికక్కడే నాన్నా' -- అమ్మ జవాబు.

మౌనంగా కూచున ఉన్న నాకు హటాత్తుగా గురునానక్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

గురునానక్ ఒకసారి ఇలాగే ఎంతో కష్టపడి మక్కా కు వెళతాడు.అక్కడ పూజారులు ఈయన హిందువని లోనికి రానివ్వరు.గురునానక్ ఏమీ బాధపడడు.చీకటి రాత్రిలో ఆరుబయట వెల్లకిలా పడుకుని పైన కనిపిస్తున్న నక్షత్ర మండలాలను చూస్తూ "నీలి గగనమందు వెలిగె చంద్రతారలూ,నీ మహిమయె గోచరించె నలుదిక్కులనూ" అంటూ గానం చేస్తాడు.

ఒకరోజున ఆయన కాళ్ళను 'కాబా' వైపు ఉంచి నిద్రిస్తూ కనిపిస్తాడు.అక్కడ ఉన్న కాజీ రుక్నుద్దీన్ అనేవాడు కోపంతో - నానక్ ను లేచి తలను కాబా వైపుగా ఉంచి పడుకోమ్మని గద్దిస్తాడు.

దానికి నానక్ ' నేను నిద్ర మత్తులో నీరసంగా ఉన్నాను.లేవలేను.నీవే నా కాళ్ళను జరుపు' అని కాజీ ని కోరుతాడు.కాజీ నానక్ కాళ్ళను ఎటు తిప్పితే అటువైపుననే కాబా అతనికి దర్శనం ఇస్తుంది.దానితో నిర్ఘాంతపోయిన కాజీకి నానక్ ఇలా చెబుతాడు - 'చూడు.భగవంతుడు అన్ని దిక్కులలోనూ ఉన్నాడు.ఏ దిక్కులో నా తలను ఉంచాలి? ఏ దిక్కులో నా కాళ్ళను ఉంచాలి?"

దేవాలయంలో మాత్రమే దైవాన్ని చూడటం చాలా ప్రాధమిక స్థితి.సర్వే సర్వత్రా అన్నిచోట్లా దైవస్పర్శను ఫీలవడం అత్యుత్తమమైన స్థాయి.

ఆ రోజంతా కొండమీదే ఉండి అటూఇటూ తిరుగుతూ ఉన్నాము.వ్యతిరేక భావాలు ఏమీ తలెత్తలేదు.సాయంత్రానికి కొండ దిగుతూ మళ్ళీ మరొక్క సారి మనస్సులోకి తొంగి చూచాను.ప్రశాంతంగా ఆనందంగా ఉన్నది.దర్శనం కలిగితే వచ్చే డొల్ల ఆనందం కంటే,కలగకుండా వస్తున్న ఆనందమే ఎంతో ఉన్నతంగా జీవంతో కూడి ఉన్నట్లు అనిపించింది.

ఇంటికి వచ్చాక ఒక మిత్రురాలు ఫోన్ చేసింది.

విషయం అంతా విని -'పాపం!మీకు ప్రాప్తం లేనట్లు ఉన్నది' అన్నది.

'అవును.నాకు ఏది ప్రాప్తం ఉన్నదో తెలియాలంటే ఇప్పుడే నీకర్ధం కాదు. ఎప్పటికైనా నీకర్ధం అయితే మాత్రం అదృష్టవంతురాలవే.' అని క్లుప్తంగా జవాబు చెప్పాను.

విజయంలో ఆనందాన్ని పొందటం అందరికీ తెలుసు.ఆ ఆనందం క్షణికమే. కానీ అపజయంలో కూడా అమితమైన ఆనందాన్ని పొందగలగడమే అసలైన ఆధ్యాత్మికత అని నేనంటాను.ఎందుకంటే రెంటిలోనూ ఉన్నది అమ్మేగా.

ఈ విషయమై భగవద్గీత ఏమంటున్నది?

శ్లో||తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఏనకేన చిత్
అనికేత: స్థిరమతి: భక్తిమాన్యే ప్రియో నర:

(నిందనూ పొగడ్తనూ సమంగా స్వీకరించి సమచిత్తంతో సంతోషంతో ఉన్నవాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు) 

శ్లో||సుఖ దుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్జస్వ నైవం పాపమవాప్స్యసి

(సుఖాన్నీ దుఖాన్నీ, లాభాన్నీ నష్టాన్నీ, జయాన్నీ అపజయాన్నీ సమంగా చూచి (జీవన) యుద్ధాన్ని చెయ్యి.అప్పుడు నీకు ఏ విధమైన పాపమూ అంటదు.)

ఈ భావాన్నే 'శ్రీవిద్యా రహస్యం'లో ఇలా వ్రాశాను.

ఆ||సుఖము నొందు నపుడు చక్కనేడ్వగజాలు
దుఖమొదవి నంత దేరినవ్వు
దేని నందగోర దాని నెదుటను జూచు
రెంటి మీరినట్టి రహితమెరుగు

(సుఖం కలిగినప్పుడు ఏడవగలడు.దుఖం కలిగినప్పుడు నవ్వనూ గలడు. దేనిని కావాలంటే దానిని క్షణంలో కళ్ళెదుట చూడగలడు.ఈ రెంటినీ దాటిన రహితస్థితిని చేరుకోవడం అతనికి తెలుసు.మనస్సును మట్టిముద్దలా చేసి ఆడుకోవడమూ అతనికి తెలుసు)

ఆ విధంగా రెండు రోజులు తిరుమల కొండమీద ఉండి దర్శనం కాకుండా ఆనందంగా క్రిందకు దిగి వచ్చాము.

శ్రీనివాసుడు దర్శనం ఇవ్వకపోతేనేమి? ధన్యత్వాన్ని ఇచ్చాడు.

అర్ధం చేసుకుంటే అది చాలు.
read more " దర్శనమివ్వని శ్రీనివాసుడు ధన్యతనిచ్చాడు "

7, జనవరి 2015, బుధవారం

కాశ్మీర శైవం - త్రిక సిద్ధాంతం

2011 లో కాశ్మీరశైవాన్ని గురించి వ్రాస్తూ మధ్యలో అసంపూర్తిగా వదలి ఉంచాను.దాని కొనసాగింపును ఇక్కడ ఇస్తున్నాను.

కాశ్మీరశైవం త్రికసిద్ధాంతం అనబడుతుంది.జీవుడు,శక్తి,శివుడు అన్న మూడింటిని వివరించేదే త్రికం.జీవుడు పాశబద్ధుడు.శివుడు పాశరహితుడు. వీరిద్దరినీ శక్తి అనుసంధానం గావిస్తుంది.

శ్రీ రామకృష్ణులు తరచుగా ఇలా అనేవారు.

'పాశబద్ధుడే జీవుడు.పాశముక్తుడే శివుడు.'

మాయ అనే పాశంతో బంధింపబడి జీవుడు ఏడుస్తున్నాడు.అదే మాయ తొలగిననాడు అదే జీవుడు తాను జీవుడనుగాను శివుడనే అనిన అనుభవాన్ని పొందుతున్నాడు.ముండకోపనిషత్తులో చెప్పబడిన ఒక చెట్టుమీద ఉన్న రెండుపక్షుల కధ దీనినే సూచిస్తున్నది.

దీనినే 'శ్రీవిద్యా రహస్యం' లో ఇలా పద్యరూపంలో వ్రాశాను.

ఆ|| ఒక్కగాను దోచు రెక్కపక్షులు రెండు
చెట్టుమీద జేరి చిత్రముగను
ఒకటి దినగబోవు నొక్కొక్క ఫలమును
ఒకటి నిల్చునచట యొంటిగాను

ఒకే విధంగా ఉన్న రెండుపక్షులు ఒక చెట్టుమీద ఉన్నవి.ఒకటి పై కొమ్మ మీద ఉంటె రెండవది కిందకొమ్మ మీద ఉన్నది.క్రింద ఉన్న పక్షి ఆ చెట్టు పండ్లను తింటూ,చేదు పండ్లను తిన్నపుడు ఏడుస్తూ,మంచి పండ్లను తిన్నప్పుడు నవ్వుతూ,అనేక కొమ్మల మీదకు ఎగురుతూ గెంతుతూ ఉన్నది.పైనున్న రెండవ పక్షి మాత్రం ఏ పండునూ తినకుండా కదలకుండా మౌనంగా ఉండి ఊరకే చూస్తూ ఉన్నది.

క్రింద ఉన్న పక్షి నానారకాలైన పండ్ల వెంట పరుగెత్తుతూ వాటిని తింటూ ఉన్నంత కాలం దాని ఏడుపు తప్పదు.ఎప్పుడైతే అది ఈ వెదుకులాటను వదలిపెట్టి రెండవ పక్షిని తదేకంగా వీక్షిస్తుందో అప్పుడు నిజానికి రెండు పక్షులు లేవని ఉన్నది ఒకటే పక్షి యన్న సత్యాన్ని అది అనుభవంలో గ్రహిస్తుంది.

అంతేగాక శ్రీవిద్యలోని పరా,పరాపరా,అపరా అనే ఉపాసనా భేదములు కూడా దీనినే సూచిస్తున్నవి.

'పరా' అనేది శివుడు.ఎందుకంటే ఆయన మాయకు అతీతుడు,పరుడు గనుక.

'అపరా' అనేది జీవుడు.ఎందుకంటే అతడు మాయకు బద్దుడు గనుక.

ఇద్దరినీ అనుసంధానం గావించే 'పరాపర' అనేది శక్తి.మాయలో మునిగి ఉన్న జీవుని,మాయకు అతీతుడైన శివునితో అనుసంధానం గావించేది కరుణాస్వరూపిణి అయిన శక్తి.అందుకే శక్తి అనుగ్రహం లేనిదే మాయను దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

పరాతత్వం సహస్రారగతం.అపరా తత్త్వం మూలాధారగతం.కులమార్గంలో ఈ రెంటినీ కలిపే శక్తిసంచారమే పరాపర తత్త్వం.

ఈ కాశ్మీర శైవదర్శనం(త్రికం) తిరిగి ప్రత్యభిజ్ఞ, క్రమ, కుల, స్పంద అన్న నాలుగు సిద్ధాంతాలుగా నలుగురు కాశ్మీరశైవసాంప్రదాయపు సిద్ధగురువులచేత బోధింపబడింది. ప్రత్యభిజ్ఞ సిద్ధాంతం సోమానందనాధుని చేతా, క్రమసిద్ధాంతం ఏరాకనాధుని చేతా, కులసిద్ధాంతం సుమతీనాధుని చేతా, స్పందసిద్ధాంతం వసుగుప్తనాధుని చేతా ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నాలుగు మార్గాలకూ వాటివాటి ప్రత్యేకమైన ధ్యాన ఉపాసనా విధానాలున్నవి.

అవి ఏమి బోధిస్తున్నవో క్లుప్తంగా చూద్దాం.

ప్రత్యభిజ్ఞం:--

ప్రత్యభిజ్ఞమంటే పుస్తకజ్ఞానానికి భిన్నమైన ప్రత్యక్షదర్శనం.అద్వైతం దీనినే అపరోక్షానుభూతి (Direct experience) అంటుంది.అపరోక్షం అంటే 'సూటి','సరాసరి','డైరెక్ట్' అని అర్దాలున్నవి.

అంటే,సాధకుడైనవాడు ఇతరములైన ఏ విధానాల సహాయమూ లేకుండా, సూటిగా,తన ఆత్మను పరమశివస్వరూపంగా అనుభవంలో దర్శించడమే ప్రత్యభిజ్ఞం.

ఉత్పలాచార్యుడు తన 'ఈశ్వర ప్రత్యభిజ్ఞమ్' లో ఈ వివరాలు ఇచ్చి ఉన్నాడు.దీనికి అభినవగుప్తుడు వ్యాఖ్యానం వ్రాశాడు.వసుగుప్తుని శివసూత్రాలలో ఇవ్వబడిన నాలుగు ఉపాయాలను తన వ్యాఖ్యానంలో అభినవగుప్తుడు విపులంగా చర్చించాడు.

అవి అణూపాయము, శాక్తోపాయము, శాంభవోపాయము, అనుపాయము.

ఉపాయాలంటే జీవభ్రాంతిని వదిలించి శివజ్ఞానాన్ని సిద్ధింపజేసే ఆచరణాత్మక సాధనా మార్గాలు,ధ్యాన విధానాలు అని అర్ధం.

అర్హతలు లేని మందాధికారులకు అణూపాయము ఆచరణీయం.కొంచం ఉన్నత తరగతికి చెందిన సాధకులకు శాక్తోపాయం అనుసరణీయం. ఇంకొంచం పైస్థాయి సాధకులకు శాంభవోపాయం అనుసరణీయం. అత్యున్నత తరగతికి చెందిన ఉత్తమసాధకులకు అనూపాయం(ఏ ఉపాయమూ అక్కర్లేని స్థితి) ఉచితం.

రమణమహర్షి పాటించినది నాల్గవస్థితి అయిన అనూపాయం. ఇక్కడ ఏ విధమైన సాధనా ఉండదు.సూటిగా ఆత్మను సరాసరి దర్శించడం ఉంటుంది.అయితే ఈ స్థితికి చేరాలంటే జ్ఞానయోగంలో మెట్లైన శమదమాది షట్కసంపత్తి నుంచి మొదలుబెట్టి ఒక్కొక్కదాన్నీ సాధిస్తూ ఎదగాలి.అప్పుడే ఈ సాధన కుదురుతుంది.నేటి మనుషులు ఈ పునాదులను ఒదిలిపెట్టి, సరాసరి రమణులు చెప్పిన 'నేనెవర్ని?' అనే సాధన ఆచరిస్తున్నారు. పునాదులు సరిగ్గా లేని ఇళ్ళు గనుకనే, వీరు సాధనలో ఎదగలేకపోతున్నారు.కొద్దిగా గాలి వీయగానే పడిపోతున్నారు.

రమణులు ఎంతో సాధన తర్వాత ఎన్నో అర్హతలు సంపాదించుకుని ఈ జన్మలో ఈ స్థితికి చేరినారు.మనం ఆ విషయం గమనించకుండా సరాసరి ఆయన బోధించిన సాధనను చేయ్యబోవడమే అసలైన పొరపాటు.గురుముఖతా నేర్చుకోకుండా పుస్తకాలు చదివి సాధనలు చేసేవారి పరిస్థితి ఇలాగే ఉంటుంది.

ముందుగా అర్హతలు సంపాదించుకోవాలి.ఆ తర్వాత ఆశించాలి.అర్హతలు లేని ఉత్తుత్తి ఆశ వల్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమీ ఉపయోగం ఉండదన్న సంగతిని సాధకులు కాగోరేవారు ముందుగా స్పష్టంగా గ్రహించాలి.

గ్రంధపాండిత్యం వల్ల కలిగే మేధోపరమైన జ్ఞానం ఆ పేరుకు తగదు. సాధనానురూపమైన అనుభవజ్ఞానమే అసలైన జ్ఞానంగాని పుస్తకజ్ఞానం జ్ఞానంకాదు.కాశ్మీర శైవులు అనుభవ జ్ఞానులు.వారు వివిధగ్రంధాలలో మహాపండితులే గాని, దానికితోడు సాధనాపరమైన అనుభవ జ్ఞానం కూడా కలిగినట్టివారు.

క్రమం:--

క్రమమంటే దేశ,కాల,రూపాలనుంచి క్రమముగా విముక్తిని పొంది వాటి బంధాలకు అతీతుడు కావటం.

దేశమంటే స్థలం ప్రదేశం అని అర్దాలున్నవి.మనిషి ప్రదేశానికి బద్ధుడు.ఒక ప్రదేశంతో అతనికి రుణానుబంధం ఉన్నపుడు అక్కడనుంచి తెంచుకుని రాలేడు.అవతలకు పోలేడు.ఇది భౌతిక స్థలాలకూ దేశాలకూ వర్తిస్తుంది. ఉదాహరణకు అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్లి కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి వద్దామని భావించినవారు అలా రాలేక అక్కడే చిక్కుకుని జీవితాంతం అక్కడే ఉండవలసి రావడం మనం ఈనాడు చూస్తున్నాం.ఇది భౌతికమైన దేశబంధం.

అలాగే అంతరిక ఆధ్యాత్మికస్థితులకూ ఇది వర్తిస్తుంది.సాధనామార్గంలో ఒక స్థాయిని అందుకున్నవారు దానిని దాటి అక్కడనుంచి ముందుకు పోలేరు.ఆ సిద్దే వారికి ఒక దేశంగా మారి వారిని పట్టి బంధిస్తుంది.ఇది అంతరిక దేశబంధం.

మనిషి కాలానికి లోబడే బ్రతుకును సాగిస్తూ ఉంటాడు.కాలాన్ని దాటి ఎవరూ ముందుకు పోలేరు.కాలప్రభావాన్ని ఎవ్వరూ అధిగమించలేరు.మనిషి కాలానికి కట్టుబానిస.కాలానుగుణం గానే మనిషి జీవితంలో సమస్తమూ జరుగుతుంది.కాని మన అహంకారంతో,అంతా మన ఇష్టప్రకారమే జరుగుతున్నదని మనం అనుకుంటాము.జీవితంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలి కొంత పరిపక్వత వచ్చినపుడు మాత్రమే ఈ సత్యం అర్ధమౌతుంది. కాలమే కాళీస్వరూపం.కాలాన్ని దాటాలంటే కాళీకటాక్షం తప్పనిసరిగా కావలసి ఉంటుంది.

మనిషి రూపానికీ దాసుడే.కళ్ళతో చూడగా కనిపించే రూపాలకే మనిషి కట్టుబడిపోతూ ఉంటాడు.మాయ అనేది కనిపించే వస్తువులు మనుష్యుల చుట్టూ ఆవరించిన ఆకర్షణగా మనిషిని మెడపట్టి తోసుకుంటూ నడిపిస్తూ ఉంటుంది.నేత్రేంద్రియానికి లొంగని వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు.కనిపించేది నిజం అనుకోవడమే మాయ.ఈ భ్రమను దాటినప్పుడే మనిషి సత్య స్వరూపమైన శివతత్వాన్ని చేరుకోగలుగుతాడు.

కనుక మాయాస్వరూపమైన దేశ,కాల,రూపాలను అధిగమించే సాధనలు ఈ మార్గంలో ఉపదేశించబడతాయి.

కులం:--

కులమంటే వ్యష్టి కుండలినిని సమిష్టిచైతన్యం అయిన పరమశివునితో అనుసంధానించే మార్గం.దీనినే 'కౌలమార్గం' అని కూడా అంటుంటారు.లలితా సహస్రంలో ఈ మార్గాన్ని శ్లాఘించే అనేక మంత్రాలున్నవి.

'కులకుండాలయా కౌలమార్గ తత్పర సేవితా'

కులం అంటే మూలాధారచక్రం అని అర్ధం.కులకుండం అంటే మూలాధారమనబడే అగ్నిగుండం.అక్కడ నిద్రిస్తున్న కుండలినీ శక్తిని ప్రజ్వరిల్లజేసే సాధన ఈ మార్గంలో ప్రాధమికంగా గావించవలసి ఉంటుంది.

'కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ'

'కౌలినీ కులయోగినీ'

'కురుకుళ్ళా కులేశ్వరీ'

మొదలైన అనేక నామాలు ఈ కౌలమార్గాన్నే సూచిస్తున్నాయి.

కాశ్మీర్లో 'Kaul' అనబడే ఇంటి పేరున్నవారు ఈ సాంప్రదాయానికి చెందినవారే.మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పూర్వీకులు కూడా కౌళులే.తర్వాత తర్వాత వారి ఇంటిపేరు 'నెహ్రూ' గా మారింది గాని వారి అసలైన ఇంటి పేరు 'కౌల్' మాత్రమే.వారి పూర్వీకులందరూ కౌలమార్గాన్ని అనుసరించిన వారే.

'యోగభోగాత్మకం కౌలమ్'- అని తంత్రాలంటాయి.అంటే కౌలాచారంలో భోగమూ యోగమూ కలసి ఆచరించబడతాయి.కౌళులు భోగాన్ని త్యజించరు. దానిని యోగంగా మార్చుకునే రహస్యవిద్య వారికి తెలుసు.భోగాలను అనుభవిస్తూ కూడా వారు యోగంలో ఉండగలరు.అందుకే కౌలాచారం అనేది సమయ,దక్షిణ,వామ,కౌలాచారాలనబడే నాలుగు ఆచారాలలోకీ అత్యున్నతమైనదని వారంటారు.

స్పందం:--

స్పందమంటే అఖండసచ్చిదానందశివుని యొక్క లీలాస్పందనను ప్రతిచోటా ప్రతిక్షణమూ అనుభవిస్తూ ఉండటం.నిర్వికారుడైన శివుని నుంచి జనించిన స్పందమే శక్తి.ఎక్కడైతే చలనమూ స్పందనమూ ఉన్నవో అక్కడ శక్తి ఉన్నది.

ఈ శక్తి విశ్వంలో ఓంకారంగా నిరంతరమూ ప్రతిధ్వనిస్తూ ఉన్నది. అదే శక్తి మానవునిలో హృదయస్పందనగా నిత్యమూ స్పందిస్తూ ఉన్నది.కుండలినీ స్పందనగా ప్రాణాధారయై మానవునిలో నిలిచి ఉన్న శక్తి ఈమెయే.

ప్రకృతిలో కదలిక ఉన్న ప్రతిచోటా ఈ చైతన్య స్పందనను ఈమార్గ సాధకులు చూచి, గ్రహించి,దానితో తాదాత్మ్యతను పొంది దానిని అనుభవిస్తారు.ఒక చెట్టు ఆకు కదిలినా కూడా ఆ స్పందనలో వారు శక్తినీ దైవత్వాన్నీ గమనిస్తారు.

ఈ విధంగా నాలుగురకాలైన సాధనామార్గాల ద్వారా అఖండ సచ్చిదానంద పరశివానుభవంలో కరిగిపోయే విధానాలను ఉపదేశించే మార్గమే కాశ్మీర శైవసిద్ధాంతం.ఇదంతా ఆచరణాత్మకమైన సాధనామార్గం.అంతేగాని గ్రంధపాండిత్యంతో చర్చలు చేసుకుంటూ కూచునే ఉబుసుబోని కాలక్షేపం కాదు.

వీటిలోని ఆచరణాత్మక సాధనలను గురుముఖతా నేర్చుకోవాలన్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన పనిలేదు.

కాశ్మీరశైవం మీద 2011 నాటి పాత పోస్ట్ లను ఇక్కడమరియు ఇక్కడ  చూడండి.
read more " కాశ్మీర శైవం - త్రిక సిద్ధాంతం "