“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, జనవరి 2015, ఆదివారం

స్వచ్చమైన ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ కాదు--రామసేతువు

'శ్రీవిద్యారహస్యం' పుస్తకం ఇద్దామని ఆ మధ్యన గంగ శ్రీనివాస్ గారిని కలిశాను.ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే లో చీఫ్ పర్సనల్ ఆఫీసర్ గా ఉన్నారు.మంచి రచయిత.స్వాతిలోనూ నవ్యలోనూ ఆయన వ్రాసిన వ్రాస్తున్న కధలు తరచుగా ప్రచురింపబడుతూ ఉంటాయి. సీరియల్స్ కూడా వివిధ పత్రికలలో వస్తూ ఉంటాయి.

వృత్తి ఏదైనా,మంచి ప్రవృత్తి ఉన్న సహృదయులతో పరిచయం కావడం ఒక అదృష్టమే.'జీవిక కోసం వృత్తి,(ఉదాత్తమైన) భూమిక కోసం ప్రవృత్తి'--అనే మాటను నేను నమ్ముతాను.

మాటల సందర్భంలో, ఆయన వ్రాసిన 'సేతురహస్యం' అనే పుస్తకాన్ని నాకు ప్రెజెంట్ చేశారు.అది 2008 లో వచ్చింది.కాసేపు మాట్లాడి ఆ పుస్తకం తీసుకుని వచ్చేశాను.


తీరికగా ఆ పుస్తకాన్ని చదివాను.చాలా బాగుంది.ఒక మంచి ప్లాట్ తీసుకుని దానికి సైన్స్ నూ,చరిత్రనూ,పురాణాలనూ,సాంఘికతనూ మేళవించి ఒక నవలగా చాలా చక్కగా వ్రాశారు.సంతోషం కలిగింది.


ఆ పుస్తకంలో మంచి విషయాలు చాలా ఉన్నప్పటికీ ఒకే ఒక్క భావం నా మనస్సుకు గట్టిగా హత్తుకుపోయింది.అది ఎంతో అద్భుతమైన భావం.


'స్వచ్చమైన ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ కాదు.రామసేతువు.' అన్నదే ఆ భావం.


ఎంత నిజం !!

తాజ్ మహల్ అంటే ప్రేమకు చిహ్నమని దానిని వెన్నెల్లో చూడాలని ఎందఱో వెళ్లి అక్కడ ఫోటోలు దిగి మురిసిపోతూ వస్తుంటారు.ముఖ్యంగా ప్రేమికులు దానిని ఏదో అపురూపంగా భావిస్తారు.ఎంత మాయ !!

ప్రపంచం అంతా కుళ్ళుమాయలో బ్రతుకుతున్నదనడానికి మళ్ళీ ఇదొక రుజువు.

అసలు తాజ్ మహల్ అనేది షాజహాన్ కట్టించినది కాదనీ అప్పటికే అక్కడ ఉన్న తేజోమహాలయాన్ని షాజహాన్ మార్పులు చేసి ఇలా తయారు చేశాడనీ P.N.OAK తన పరిశోధనలో నిర్ద్వంద్వంగా నిరూపించాడు.ఆ పుస్తకం మన దేశంలో బ్యాన్ చేశారు.ఆ పరిశోధనకు తార్కాణంగా తాజ్ మహల్లో మూసేసిన నేలమాళిగలూ,ఆ డిజైన్లో ఉన్న నాన్-అరబిక్ ధోరణులూ, కలశమూ, లోపలున్న శివలింగమూ ఇత్యాది చాలా రుజువులను ఆయన ఉటంకించాడు.


ఆ విషయాలన్నీ నిజాలే.అయితే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం బానిస మనస్తత్వంతో కుళ్ళిపోతున్న మన సమాజానికి ఉండదు గనుక ఆ సంగతి అలా ఉంచుదాం.


అసలు ముంతాజ్ అనే ఆవిడ షాజహాన్ భార్య కాదు.తన వద్ద సామంతుడైన ఒక ఉద్యోగి భార్య.ఆమెను షాజహాన్ మోహిస్తాడు.ఆ సంగతి గ్రహించిన ఆ భర్త ఆమెను తీసుకుని ఎక్కడెక్కడో దాక్కున్నా కూడా షాజహాన్ అతన్ని వెతికించి పట్టుకుని చంపేసి ముంతాజ్ ను తన జనానాలో కలిపేసుకుంటాడు. ఆమె చనిపోతే,అప్పటికే ఉన్న శివాలయాన్ని మార్పులు చేర్పులు చేసి తాజ్ మహల్ గా ఆమె సమాధిగా కట్టిస్తాడు.అంటే తన స్వార్ధం కోసం ఇంకొక కుటుంబాన్ని నాశనం చేసినదానికి రుజువుగా ఈనాటికీ మన కళ్ళెదుట నిలిచి ఉన్న ఒక చెడుకట్టడమే ఈ తాజ్ మహల్.దానిని ఒక సౌందర్య సూచికగా మనం ఆరాదిస్తున్నాం.


ఎంత ఖర్మ !!!


ముంతాజ్ ను వదులుకోవడానికి ఆ అసలు భర్త ఎంత బాధపడి ఉంటాడో,చివరకు తన రక్తాన్ని కట్నంగా ఇచ్చి,తన భార్యను షాజహాన్ కు అప్పగించినప్పుడు ఎంతగా కుమిలిపోయి ఉంటాడో ఊహిస్తే అప్పుడు తాజ్ మహల్ మనకు తెల్లగా కనిపించదు.మెరిసే వెన్నెల్లో కూడా ఎర్రగా రక్తం రంగులో కనిపించి అసహ్యాన్ని కలిగిస్తుంది.

సరే ఆ భర్త సంగతి అలా ఉంచుదాం.అన్నేళ్ళు కాపురం చేసిన ఆ భర్తను వదలిపెట్టి,ఎవడో చక్రవర్తి కోరినంత మాత్రాన,ముంతాజ్ ఎలా రాగలిగింది? తనకోసం ప్రాణాలు కూడా తృణప్రాయంగా ఇచ్చిన తన భర్తది ప్రేమకాదా?రాజపుత్ర స్త్రీ మంటల్లో దూకి భర్తతో బాటే సహగమనం చేసినట్లుగా తనూ తన భర్తతోనే చనిపోయి ఉండాలి.షాజహాన్ని తిరస్కరించి ఉండాలి.అదీ అసలైన ప్రేమ.అంతేగాని రక్తమోడుతున్న భర్త శవం మీదుగా నడిచివెళ్లి ఆనందంగా షాజహాన్ కౌగిట్లో ఒదిగిపోయింది.అంటే ఆమెకు డబ్బూ విలాసాలే ముఖ్యాలు గాని భర్త ప్రేమ ముఖ్యం కాదు.ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే,ఎవరి దగ్గర ఇంకా మెరుగైన విలాస జీవితం దొరికితే వాడి దగ్గరకు హాయిగా వెళ్ళిపోతుంది.ఎంత ఛండాలపు మనస్తత్వం??


దీనిని అమరప్రేమ అని ఎలా అనగలం?

కనుక ఏ విధంగా చూచినా కూడా షాజహాన్ ముంతాజ్ లు అమరప్రేమికులు కానేకారు.వారు పరమ స్వార్ధపరులు.తమ సుఖం తప్ప ఇంకేమీ పట్టని దౌర్భాగ్యులు.ఎదుటివారి ప్రాణాలు పోయినా సరే,తమ సుఖం తమకు దక్కితే చాలనుకునే నీచులు.తాజ్ మహల్ ను ఒక ప్రేమచిహ్నంగా భావించడం మన దౌర్భాగ్యం.


దీనికి విభిన్నంగా -- రామసేతువు ఏమిటో చూద్దాం.


సీత ఒక రాజకుమార్తె.అమాయకురాలు.అల్లారు ముద్దుగా పెరిగింది.ఎండ కన్నెరుగని కోమలి.సవతి అత్తగారి దురాశకీ,మామగారి చేతగాని తనానికీ తలొగ్గి,ఎదురుతిరగకుండా,భర్తనే దైవంగా భావించి ఆయనతో అడవిలో పద్నాలుగేళ్ళు దుర్భరమైన జీవితం గడపడానికి, మంచి వయస్సులో ఉన్న సమయంలో, బయలుదేరింది.


ఎంతటి త్యాగమూర్తి సీతాదేవి !!!


"మీమీ గొడవలలో నా జీవితాన్ని నేనెందుకు బలిచేసుకోవాలి? అత్తగారు మామగార్ల కుట్రలకు నేనెందుకు నా యవ్వనాన్నీ వివాహజీవితాన్నీ బలి చెయ్యాలి?నేను దీనికి ఒప్పుకోను.నా భర్తే చక్రవర్తి.నేనే మహారాణిని.మీరంతా నోర్మూసుకుని పడుండండి.లేదా జైల్లో పడి చావండి.అంతేగాని మేమెందుకు అడవికి పోవాలి?"- అని ఆ తల్లి ఒక్కమాట కూడా అనలేదు.అని ఉంటే చరిత్ర వేరుగా ఉండేది.కానీ సీతమ్మ అలా చెయ్యలేదు.మారుమాట్లాడకుండా తలవంచుకుని భర్తతో అడవికి వెళ్ళడానికి సిద్ధపడింది.

పైగా,అడవికి వెళ్లాలని ఆమెకేమీ నియమం లేదు.ఆ షరతు శ్రీరామునకే వర్తిస్తుంది.ఆమెకు వర్తించదు.తను హాయిగా అయోధ్యలోనే ఉండవచ్చు.లేదా ఆ పద్నాలుగేళ్ళూ తన తండ్రిగారి వద్ద ఉండి ఆ తర్వాత మళ్ళీ అయోధ్యకు రావచ్చు.కానీ స్వచ్చందంగా భర్తతో బాటు అడివికి బయల్దేరింది.ఆయన కష్టాలు తనకూ కష్టాలే అనుకుంది.ఆయన సుఖాలలోనే కాదు కష్టాలలో కూడా తనకు భాగం ఉన్నదని నమ్మింది.


ఎంతటి ఔన్నత్యం !!!


సరే ఆమె విషయం అలా ఉంచుదాం.శ్రీరాముని సంగతి కొంచం చూద్దాం.


అడవిలో ఉంటున్నారు.పదమూడేళ్ళు అయిపోయాయి.ఇంకొక ఏడాదిలో వనవాసం అయిపోతుంది.తాము అయోధ్యకు వెళ్లి హాయిగా రాజ్యం చేసుకోవచ్చు.ఈ సమయంలో ఒక రాక్షసుడు. వాడొచ్చి తన భార్యను ఎక్కడికో ఎత్తుకుపోయాడు.ఎక్కడున్నాడో తెలియదు.సీత ఏమైపోయిందో తెలియదు.అసలు బ్రతికుందో లేదో తెలియదు.


"తాను మహారాజు.సీత కాకుంటే ఇంకొక గీత.తాను "ఏకపత్నీవ్రతం" అన్న ఒక్క మాటను తననుంచి చెరిపేస్తే,మహా సౌందర్యవతులైన ఎందఱో రాజకుమార్తెలు తనకోసం పరిగెత్తుకుంటూ వస్తారు.సీత పోతే పోయిందిలే.నానాబాధలు పడి ఎక్కడుందో వెతికి తెచ్చుకుని ఏలుకోవాల్సిన ఖర్మ నాకెందుకు?హాయిగా వెనక్కు వెళ్ళిపోయి ఒక పదిమంది రాజకుమార్తెలను చేసుకుని సుఖంగా కాలక్షేపం చేద్దాం" అని శ్రీరాముడు కలలో కూడా అనుకోలేదు.


ఆమె కోసం పరితపించాడు.తననే  నమ్ముకుని తనకోసం ఇంతదూరం ఈ అడివిలోకి వచ్చింది.నానా కష్టాలు పడింది.చివరకు ఎవడో రాక్షసుడి చేతుల్లో చిక్కుకుని అలమటిస్తున్నది.ఎలాగైనా తనను రక్షించాలి.శత్రువు మహా బలవంతుడు.రాజు.తానో? ప్రస్తుతం ఒక సామాన్యుడు.చేతిలో ఆయుధాలు లేవు.సైన్యం లేదు.దారి తెలియదు.సమాచార వ్యవస్థా గూఢచార యంత్రాంగమూ లేవు.ఏం చెయ్యాలో తెలియని తిక్కుతోచని పరిస్థితి.


"అయినా సరే.ఏదేమైనా సరే సీత ఎక్కడుందో తెలుసుకోవాలి.ఆమెను రక్షించాలి.లేకుంటే ఆ ప్రయత్నంలో తానూ మరణించాలి.అంతేగాని వెనక్కు మరలే ప్రసక్తే లేదు." అని నిశ్చయించుకుని ప్రయత్నాలు సాగించాడు. కాలినడకన అడవులు దాటి కొండలు దాటి కోతులతో స్నేహం చేసి సీత జాడ కనిపెట్టాడు.


ఆమె శత్రుదుర్భేధ్యమైన మహానగరంలో మహా క్రూరులైన రాక్షసుల మధ్యలో బందీగా ఉన్నది.అయినా సరే,వారిది అధర్మం.తనది ధర్మం.చివరకు ధర్మమే జయిస్తుంది.అన్న ధృఢమైన నమ్మకంతో ముందుకు సాగాడు.


మహాసముద్రం అడ్డొచ్చింది.ఎలాగైనా సరే, దానిని కూడా దాటే తీరాలి.సీతను చేరుకోవాలి.అప్పుడు ఉద్భవించినదే రామసేతువు.పది యోజనాల వెడల్పుతో నూరు యోజనాల పొడవుతో కోతులచేత సముద్రం మీదుగా నిర్మించబడినదే  ఈ మహావారధి.నేడు శాటిలైట్ చిత్రంలో మనకు కనిపిస్తున్నది నిజమైన రామసేతువు కాదు.దాని అవశేషం మాత్రమే.నిజమైన రామసేతువు ఇంకా పెద్దది.అది కాలగర్భంలో సముద్రగర్భంలో కలసిఉన్నది.


నిజమైన,స్వచ్చమైన,అపురూపమైన ప్రేమకు అసలైన చిహ్నం రామసేతువు.రాక్షసుని చేతుల్లో చిక్కి తనకోసం కుమిలిపోతూ ఏడుస్తున్న తన ప్రియసతిని రక్షించాలన్న మహాసంకల్పానికి రూపమే రామసేతువు.ఇదే అసలైన ప్రేమ చిహ్నం.

ఎంత గొప్ప ప్రేమ శ్రీరామునిది?

ఎంత ఉన్నతమైన సంకల్పం ఆయనది?

ఆ మహాసంకల్పమే ఏకాకిగా అడవులనూ సముద్రాన్నీ జయించింది.

"మహాసైన్యంతో కూడి అన్ని వసతులూ వనరులూ ఉన్న రాక్షసులను ఏ సదుపాయాలూ యంత్రసంపత్తీ లేని తను కోతుల సాయంతో ఎదుర్కోవాలి,తన సీతను రక్షించాలి"-- అన్న దృఢమైన నిశ్చయాన్ని శ్రీరామునకు ఇచ్చింది.

ఇక సీతాదేవి విషయం కాస్త ఆలోచిద్దాం.

రావణుడు మహా అందగాడు.చక్రవర్తి.రాముడో సామాన్య మానవుడు.ప్రస్తుతం అన్ని హోదాలూ పోయి అడవిలో పడి అల్లాడుతూ ఉన్నాడు.అయోధ్య సంగతి చూద్దామా అంటే అది మట్టీ రాళ్ళతో కట్టిన నగరం.మరి లంకో? బంగారు నగరం.ఇక్కడ లక్ష్మి అణువణువునా తాండవిస్తున్నది.తనకంటే కూడా మహా సౌందర్యవతులైన ఎందఱో స్త్రీలు రావణునికోసం పరితపిస్తూ ఎదురు చూస్తున్నారు.కానీ రావణుడు తనను కోరుతున్నాడు.అతని ప్రేమ కూడా గొప్పదే.అసలు రాముడు బ్రతికి ఉన్నాడో లేడో తెలియదు.ఇక్కడకు వస్తాడో లేడో తెలియదు.తనకు కాపాడతాడనే నమ్మకం లేదు.ఈ గోలంతా ఎందుకు? అసలు ఈ రాముణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాతే తనకు కష్టాలు ఆరంభమయ్యాయి.ఎన్నో ఊహలతో అత్తగారింట్లో అడుగు పెట్టింది.కానీ మరుక్షణం నుంచీ అన్నీ కష్టాలే.యవ్వనంతో కూడిన తన జీవితమంతా రాజభవనంలో కాకుండా అడివిలో రాళ్ళమధ్య గడిచిపోయింది.

అసలెందుకీ ఖర్మ?హాయిగా రావణుడికి భార్యగా ఉండిపోతే బాగుంటుంది కదా.తనను పట్టపు రాణిని చేస్తానని అంటున్నాడు.మండోదరినే తనకు చెలికత్తెగా నియమిస్తానని అంటున్నాడు.ఇంకేం కావాలి? జీవితాంతం ఇక్కడే హాయిగా రాణిగా ఉండిపోతే పోలా?"

ఈ విధంగా సీత కలలో కూడా ఆలోచించలేదు.అసలామె రావణుని వైపు తలెత్తి కూడా చూడలేదు.ఒక గడ్డిపరకను ఎదురుగా ఉంచుకుని దానివైపు చూస్తూ అతనితో మాట్లాడింది.నా దృష్టిలో నీవొక గడ్డిపరకవని చెప్పకనే చెప్పింది.

ఏకవస్త్రగా తొమ్మిదినెలలు దుర్భరవేదనను అనుభవించింది. నిరాహారిగా ఉన్నది.పక్కన బాధలు పెడుతున్న రాక్షస స్త్రీల సాధింపులను మౌనంగా సహించింది.వస్తాడో రాడో తెలియని రాముని కోసం చెక్కుచెదరని మొక్కవోని సంకల్పంతో ఎదురుచూస్తూ కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని బ్రతికింది.

ఏమిటా తల్లి మానసిక స్థైర్యం!!!

ఎంత గొప్పది రామునిపై ఆమె నమ్మకం !!

అందుకనే వాల్మీకి మహర్షి -- 'సీతాయాశ్చరితం మహత్' (సీతాదేవి చరిత్ర మహత్తరమైనది) అన్నాడు.

ఎంత గొప్ప మాట !!!

వందలమైళ్ళ దూరంలో ఉన్నా సీతారాముల ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి.ఒకరి ప్రాణాలు ఒకరిపైనే ఉన్నాయి.కష్టాలను వారు లెక్కచెయ్యలేదు."అసాధ్యం" అనే మాట వారిలో తలెత్తలేదు.వారు ధర్మాన్ని నమ్మారు.ప్రేమను నమ్మారు. అల్పమైన, తాత్కాలికమైన సుఖాలకోసం వారు వెంపర్లాడలేదు.ప్రేమకోసం ఎంతటి కష్టాన్నైనా సహించారు.మాటకోసం నిలబడ్డారు.ధర్మం కోసం నిలబడ్డారు.

కనుకనే నేటికీ ప్రతీ పల్లెలో దైవాలుగా ఆరాధింపబడుతున్నారు.

తాజ్ మహల్ కూ రామసేతువుకూ ఎక్కడా పోలికే లేదు.

తాజ్ మహల్ స్వార్ధానికీ,దుష్టత్వానికీ,దురాశకీ,పరకళత్ర కాముకత్వానికీ పరాకాష్ట అయితే,రామసేతువు స్వచ్చమైన, నిష్కల్మషమైన, మేరుసమానమైన ప్రేమకి,అచంచలమైన సంకల్పశక్తికీ  ప్రతిరూపం.

అప్పటికే ఉన్న శివాలయాన్ని దోచుకుని మార్పులు చేసి ఒక అక్రమ సంబంధానికి ప్రతీకగా ఇంకొకరి భార్యకు కట్టిన సమాధి తాజ్ మహల్.

ధర్మంకోసం,తమ ప్రభువుకోసం,కొండరాళ్ళను పోగుచేసి సముద్రం మీద అమాయకమైన భక్తితో కోతులు కట్టిన వారధే రామసేతువు.

కామదాహానికీ రక్తదాహానికీ నీతిలేనితనానికీ ప్రతీక తాజ్ మహల్.

స్వచ్చమైన ప్రేమకీ,ధర్మానికీ,సంకల్పశక్తికీ తార్కాణం రామసేతువు.

డబ్బులు పడేసి కూలీలతో ఒక దేవాలయాన్ని కూలగొట్టించి,సమాజపు ధనాన్ని దోచుకుని తన సుఖంకోసం ఖర్చుపెడుతూ,ఆ డబ్బుతో పరాయివ్యక్తి భార్య శవంమీద కట్టిన అక్రమకట్టడం తాజ్ మహల్.

శ్రమదానంతో,ఏమాత్రం లాభాపేక్ష లేకుండా,నిస్వార్ధంగా,ఒక ఉదాత్తమైన ధర్మాశయం కోసం తమ చెమటను చిందించి కోతులు కట్టిన వారధి రామసేతువు.

ఎంత తేడా ఈ రెంటికీ??

షాజహాన్ ముంతాజ్ ల స్వార్ధ కామపూరితమైన వ్యామోహం ఎక్కడ?

సీతారాముల అకలంకమైన,మహోజ్జ్వలమైన ప్రేమ ఎక్కడ?

సీతారాముల కాళ్ళక్రింద మట్టిలో ఉన్న ఒక్క ధూళికణంతో కూడా షాజహాన్ ముంతాజ్ లు ఏమూలకూ సరిపోరు.

మనం రామసేతువుని పూజించాలి.రామసేతువుని ప్రేమచిహ్నంగా గుర్తించాలి.అప్పుడే మనం దైవత్వం వైపు ఎదుగుతాం.సీతారాములు మనకు ఆదర్శం.వారిని మరచి పనికిమాలిన పాప్ స్టార్స్ నీ,నీతిలేని సినిమా యాక్టర్లనీ,మన దేశాన్ని దోచుకున్న పరాయి పరిపాలకులనూ ఆదర్శంగా తీసుకున్నంతవరకూ మనకు పతనం తప్పదు.

రాక్షసత్వానికి సూచిక అయిన తాజ్ మహల్ని ఒక గొప్ప ప్రేమచిహ్నంగా భావిస్తున్నంతసేపూ మన సమాజం ఇంకాఇంకా పతనం కాక తప్పదు.

ప్రేమచిహ్నం అయిన రామసేతువుని విస్మరిస్తున్నంత కాలం మన సమాజంలో విలువలు తిరోగమనం చెందకా తప్పదు.

ఒక గొప్ప భావాన్ని తన 'సేతు రహస్యం' నవల ద్వారా చెప్పిన గంగ శ్రీనివాస్ గారికి మన:పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.