అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

25, ఫిబ్రవరి 2012, శనివారం

విస్మృత యాత్రికుడు

శాంతి కొఱకై వెదకితి నెన్నొ ఏండ్లు
దిక్కులన్నిట జూచితి నీడ కొరకు
అర్ధమయ్యెను కడకొక్క సత్యమింక   
నేను వెదకెడి శాంతియు నీడ నేనె

శాంతి లేదెంత వెదకిన నా యందుదప్ప  
బహువాకిళ్ళ బిచ్చమెత్తితి ప్రేమకొరకు
పరువులెత్తితి కోరితి దాహశాంతి   
లేదెచటనోయది నా హృదంతరాలపు సీమదప్ప

తీర్ధ యాత్రల దిరిగితి అనుగ్రహార్ధినై 
ఎంత మూర్ఖుడ నేను?
వెదకుచుంటిని సుదూరసీమలందు
హృదయాగాధపు లోతుల నెపుడు
వెలుగుచున్నట్టి శాంతిని కానలేక 
ఎంత మూర్ఖుడ నేను?
యోజనములు పరుగిడి వెదకుచుంటి
నిజయాత్ర నాలోన వేచియుండ

కస్తూరి జింక తన సుగంధ భ్రాంతి చేత 
వనమునంతయు దిరిగి వేసారినట్లు 
నావ కొసను నిలచియున్న పక్షికి 
నీడ చూడగ నెక్కడ దొరకనట్లు  
కొలనిలోన విహరించెడు  మీనుకేమొ
దాహ భ్రాంతిని గొంతెండి పోయినట్లు 

ఏ గృహపు ముంగిట నింక నర్ధించబోను
ప్రేమార్దినై వెతల నందబోను
వెదకులాటలు ప్రయాస వేసరములు 
స్వచ్చమౌ ప్రేమ లేదను మాట నిజము.

ప్రేమకోరకై బిచ్చమెత్తితి వీధులందు 
స్వార్ధమే కనిపించే నన్నిచోట్ల 
ప్రేమముసుగున, నింక ఈ ఆట చాలు
విరమించెద నీ జూదక్రీడ ఇదియె మేలు

ఆశ పెకలించి నాలోనె విశ్రమింతు 
ఎవరినైనను ఇకనేమి కోరబోను
ఎంత యద్భుత మిది జూడ ఏమి వింత 
ముగియనున్నది యుగయుగాల వెదుకులాట 

ఎంత మూర్ఖుడ నేను?
వేచి యుంటిని నీకొరకు వేలఏండ్లు 
రమ్ము నాయెద్ద కంచును చేయిసాచి 
వెదకుచున్నది నాలోనె దాగియుండ
వెదకుచుంటిని లోకాన వేసరిల్లి 

మృతిని పొందితి నెంతయు నెన్నొమార్లు
మరల పుట్టితి జూడగ నన్నిసార్లు
పరువులెత్తితి మరీచిక వీధులందు 
తేటయయ్యె సత్యమిపుడు తేరిచూడ

ఇంతకాలము నేనిట వెదకు ప్రేమ 
నిలిచియున్నది నాలోన మౌనముగను
చేయి సాచుచు రమ్మను తల్లివోలె 
వేయి తప్పులు క్షమియించు తల్లివోలె 

ప్రేమించినంతసేపు నా చిన్నబ్రతుకును
చావు వెంటాడె నన్ను నా నీడవోలె 
నాఇల్లు వదలి నే బయలు వెడలినపుడు 
లోకమే నా ఇల్లయి నిలచేనిపుడు

మృతికి వెరువను నేనిక ఎన్నడైన
దాని రమ్మంటి నావైపు చేయి సాచి
మిత్రుడయ్యెను నాకది ఏమి వింత?
బోధించెనొక నిగూఢరహస్యము నిశ్చయముగ
చావు బ్రతుకులనన్నిటి మించి వెలుగు
విశ్వజీవితజ్ఞానము తెల్లమయ్యె  

స్వప్నముల చిక్కుట కల్ల ఇంక
దేబిరించుట లెల్లను దూరమయ్యె
రుతువులోచ్చును పోవును రోజుమారు 
పెరిగి తరుగును లోకము లీలయందు 
నాయందు నేనుందు నిశ్చలముగ
నిర్మలాకాశరీతిని నెమ్మదించి 

నియమాల నన్నిటి నే ధిక్కరింతు
సాగెద జీవితాన నా ఇష్టరీతి
నేనొక ఉన్మత్తుడనని తలచిరి లోకులెల్ల  
తలువనిమ్ము వారికి తోచినట్లు 
నాకు తెలియును నాదగు తత్వమేమొ 

చల్లగాలుల నేనిక సాగిపోదు
వేడిగాడ్పుల జేసెద నాట్యరవళి
సాగిపోయెడి  మబ్బుల తేలిపోదు
కురియు వానల జల్లుల నేలబడుదు
భూమిలోపల కింకుచు దాగిపోదు 
గగనసీమల రేగుచు విక్రమింతు 
మృతిని మించుచు లేచెడి పక్షివోలె

జీవనుల యందలి జీవితమ్ము నేను
మృతుల ఘూర్ణించు తమోగుణధృతియు నేనె
జీవనమ్మున రేగేద విస్తరించి
ముదము నొందెద మృతిలోన మునిగియుండి

వర్షధారల నర్తించు వృక్షమేను
గగనసీమల పారెడి మబ్బు నేను
స్థిరత నిలచెడి పర్వతరాజమేను
సంద్రమును చేర పరువెత్తు నదిని నేను

ప్రేమికుల గాఢ పరిష్వంగసుఖము నేనె
నిరాశాదృక్కుల దోచు ఎడారి నేనె        
దిక్కులేని బతుకుల వ్యధయు నేనె  
ధన్యజీవుల జీవనతృప్తి నేనె
కష్టజీవుల కడగండ్లపాట్లు నేనె
చక్రవర్తుల రాజసదీప్తి నేనె

గగనసీమల సాగెడి పక్షి నేను
సంద్రమున ఈదెడి మీను నేను
భీకరమ్ముగ చెలరేగి బాధపెట్టు
మృత్యువిహ్వల ప్రచండమూర్తి నేను 
జగతి నిదురించు నిశీధ సమయమందు 
నిద్రలేకుండ రాజిల్లు మౌనమేను   

ఏకాగ్రచిత్తుడౌ యోగి నేత్రాలలో 
తెరపులేక జ్వలించు ఎరుక నేను
కాటికేగెడి శవాల తోడునీడ
సాగిపోయెడి మృత్యువు చాయ నేను

కొండలోయల ఆనందనృత్యమాడు 
పిల్లగాలుల తేలెడి పువ్వు నేను
శిశిరఋతువున పండుచు రాలిపోవు
మట్టి కలసెడి విశీర్ణ పత్రమేను 

తనదు బిడ్దను ముద్దిడు తల్లియందు
కరగిపోదును నేనిక ప్రేమ నగుచు 
ప్రేమతాపపు మంటల కాగిపోవు 
యువకరక్తపు ఎర్రనిఛాయ నేను
ప్రేమ బెంచిన సుతుల చీదరింపులతో
కుమిలి ఏడ్చెడి వార్ధక్యవ్యధలు నేను   

గుండెలోతుల ధ్వనియించు నాదమేను
ధ్యాని చవిచూచు ఆనందసీమ నేను
స్వప్నసీమల తోచెడి వెలుగు నేను
చెక్కుచెదరని యోగుల దృష్టి నేను

బ్రహ్మచారుల తేజపు వెలుగు నేను
పైకిలేచెడి యోగపు శక్తి నేను
సాదుమూర్తుల పవిత్రదీప్తి నేను
జ్ఞానిచూపుల కరుణాసంద్రమేను

సూర్యకాంతుల నాట్యమొనరింతు నేను  
మృతిని బోలెడు రాత్రుల విశ్రమింతు
వీరయోధుల శక్తియు యుక్తి నేను
ఓడిపోయెడి వారల సిగ్గు నేను

యాచకుని ఆకలి యందు నుందు
ధనపు మదమున తూలెడి మత్తు నేను
యవ్వనమ్మున రేగెడి శక్తి నేను
వణకుచుండెడి వార్ధక్యస్తితిని నేను
శిశువు కన్నుల మెరసెడి నవ్వు నేను
శక్తిహీనత పడియుండు శవము నేను

రాత్రిచుక్కల మెరపుల మేళవింతు
సాంద్రఘోషల నెగసెడి  శబ్దమేను
మంద్రగతి సాగెడి నదిని నేను
సడిలేక నిలచు గంభీరసంద్రమేను

లోకరీతుల నన్నిట నేనె యుందు  
అష్టదిక్కుల నిండెద విస్తరించి
వేడినిచ్చెడి వెలుగులరేడు నేను
చల్లచల్లని చందురు కాంతి నేను 
 
మౌనధ్యానపు లోతుల ఉబికివచ్చు
స్వర్లోక సుమధుర గానమేను  
రాత్రిఝాముల నిశ్శబ్దసీమయందు
వినగవచ్చెడి వేణువు నాదమేను    

ముసిగ నవ్వెడి ముగ్ధంపు శిశువు నేను
కామజ్వాలల తపియించు కాంక్ష నేను
కర్రయూతాన వణకెడి ముసలి నేను
చితిని మండెడి నికృష్టశవము నేను

కసాయి కత్తి కరకుదనము నేనె
గొంతు తెగిపోవు జంతువు గూడ నేనె
కుష్టురోగుల వ్రణముల రసిని నేను  
నష్టలోకపు నిరాశ ఛాయ నేను.

తల్లిపాదాల చెంతన నేర్చుకొంటి 
ధన్యజీవిత రహస్యజ్ఞానమేల్ల
బ్రతుకుటెట్టులో మరి చచ్చుటెట్లో   
నేర్పే మాయమ్మ తన జీవయాత్ర చేత
     
అమ్మ మాటల నెప్పుడు ఆచరించి
బ్రతికేదను రోజు మరియును చత్తునట్లే
జీవింతు ప్రతిక్షణము మరుక్షణమున చత్తునటులే
బ్రతికియుందును మృతియందు చిత్రముగను

మృతిని బొందెద ప్రతిరోజు మానకుండ    
తిరిగిలేచేద మరునాడు శిశువువోలె 
తేటకన్నుల చూచెద లోకమెల్ల
అమ్మ నేర్పిన రహస్యజ్ఞానమిదియె

జోలపాటల నూగితి నెన్నొమార్లు
కాలిపోయితి చితిలోన అన్నిసార్లు
కనులు తెరచితి నిప్పుడు నిశ్చయముగ 
కనుక వాటి చాయలకింక పోను

స్వప్నభ్రాంతిని బోలెడు లోకమెల్ల 
కనుల ముందర కదలాడి సాగిపోవు
నన్ను తాకంగ దానికి శక్తిలేదు      
చూతునన్నిటి నొక మౌనసాక్షి వోలె
మూలనిలచిన అదృశ్యఆత్మ వోలె

సాటిజీవుల బాధలు పట్టకుండ
పూజచేయగ చూచి నవ్వుకొందు
మార్పులేనట్టి జీవనరీతి జూచి
పొరలి నవ్వుదు నెంతయు వేడ్కతోడ
గుడ్డిగురువుల చేష్టల గుర్తుబట్టి
నవ్వుకొందును వారల గతులనెరిగి  

సురలనొల్లను, నెప్పుడు చూడబోను
వారలందరు నన్నిట వదలిపోరు
ధిక్కరింతు నందరి పొండు పొండనుచు       
కాని అంతయు నాదె ఇదియె వింత 

అడిగిరేవ్వరొ నన్ను-- గుడులు గోపురాలు తిరుగవేల?
అతనినడిగితి నోక్కగు వింత ప్రశ్న
మనిషి హస్తము తాకని దేవళమును 
చూపుమా పరుగెత్తిపోయేద నచటికంచు

ఒకరనిరి నాతోడ ఒక్కరోజు
పూజమానిన నరకాన పడేదవంచు
పొరలినవ్వితి వానిజూచి పక్కుమంచు
స్వర్గనరకాలు నాలోని కలలు జూడ      
ఎచటికేగేద నేను? ఎట్లు బోదు?

జనులు నవ్విరి నన్నుజూచి
పనికిమాలిన వాడవు నీవటంచు
నేనును నవ్వితిని వారిజూచి
నిజము మీరలు చెప్పెడి మాట నిజము   

పనులన్నియు నన్ను విడచి పారిపోయె
సర్వనక్షత్రసీమల నావరించు
శూన్యమునదూరితి శూన్యమైతి
పనికిమాలినవాడనె పచ్చినిజము

నాదుకన్నుల దోచెడి శూన్యదృష్టి
జనులమనమున భయమును దోపచేయు
వారు నన్నొక జడుడవనిరి
నేను నవ్వెద వారల శ్రుతిని గలిపి
పొరలి నవ్వెద లోకుల పాటుజూచి

చంపువాడును మరియిక చచ్చువాడు
చంపు క్రియయును ఈమూడు కలసిపోయి
కలల రీతిని నాలోనె  కానుపింప    
ఏమి చేయంగ గలవాడనింక నేను?

లోకలీలను చూచుచు సంతసింతు
అంతరంగాన నవ్వుల తేలిపోదు
ఉన్నవన్నియు లోకాన చక్కగానె
చావుపుటకల జూచితి నే జన్మయందో
మరచిపోయితి వానిని ఇప్పుడింక
read more " విస్మృత యాత్రికుడు "

18, ఫిబ్రవరి 2012, శనివారం

హోమియోపతి-మరికొన్ని కేన్సర్ ఔషధాలు

నిజానికి హోమియోపతిలో ఈ రోగానికి ఈ మందు అని ఉండదు. అదే హోమియోపతి వైద్య విధానంలోని విచిత్రం. ఇది వినడానికి కొంచం చిత్రంగా ఉంటుంది. కాని కొంత వివరణ తర్వాత దీని వెనుక ఉన్న నిజం అర్ధం అవుతుంది. 

ఒకే రోగంతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు రోగలక్షణాలు ఒకే విధంగా ఉండవు. ఇద్దరిలోనూ రోగం ఒకే స్థాయిలో ఉండదు అని కాదు దీని అర్ధం. రోగం ముదిరిన తీరునుబట్టి దాని లక్షణాలు ఒకరోగికీ ఇంకొకరోగికీ భిన్నంగానే ఉంటాయి. రోగం యొక్క ఎదుగుదలను బట్టి ,దాని స్థాయిని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. దీని గురించి నేను చెప్పటం లేదు. 

ఒకేస్థాయిలో ఉన్న ఒకేరోగంతో బాధపడే ఇద్దరు రోగులకు హోమియోపతిలో ఒకేమందు ఇవ్వడం జరుగదు. ఎందుకంటే ఇక్కడ రోగి యొక్క లక్షణాలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. శారీరిక మానసిక లక్షణాలు ఏ ఇద్దరికీ ఒకే విధంగా ఉండవు. ఈ శారీరిక మానసిక లక్షణాలు అనేవి మన పూర్వీకులనుంచి జీన్స్ రూపంలో సంక్రమిస్తాయి. వాటికి తోడు రోగలక్షణాలు కలుస్తాయి. కనుక వాటిని లెక్కలోకి తీసుకోకుండా చేసే వైద్యం శాస్త్రీయ వైద్యం అనిపించుకోదు. ఈ కోణంలో చూచినపుడు, ఒకే స్థాయిలో ఉన్న ఒకే రోగంతో బాధపడే ఇద్దరు వ్యక్తుల లక్షణాలు భిన్నంగా ఉండటం చూడవచ్చు. కనుక ఆ ఇద్దరికీ రెండు వేర్వేరు మందులు సూచింపబడతాయి. హోమియోపతిలో రోగంతో బాటు రోగిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించడం జరుగుతుంది. అల్లోపతిలో రోగాన్ని మాత్రమే పరిశీలించడం ఉంటుంది. రోగం శరీరంలో తీసుకొచ్చిన మార్పులు మాత్రమే అక్కడ ప్రాముఖ్యతను పొందుతాయి. వారికి రోగి యొక్క మానసిక స్తితి అనవసరం. అందుకనే, చాలామంది అల్లోపతీ వైద్యులు, రోగి చెబుతున్న విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఏదేదో ప్రిస్క్రిప్షన్ రాసి రోగి ముఖాన కొట్టడం సర్వసాధారణ దృశ్యంగా మనం చూడవచ్చు. ఇది సరియైన వైద్యం కానేకాదు.

హోమియోపతిలో ఉన్న అన్ని మందులూ సమయం సందర్భాన్ని బట్టి కేన్సర్ వంటి దీర్ఘరోగాల్లో బాగా పని చేస్తాయి.  లక్షణాలను బట్టి వీటిని వాడుకోవాలి. పోయిన సారి కోనయం గురించి వ్రాశాను. ఇప్పుడు మిగిలినవాటిలో కొన్ని మందుల స్వరూప స్వభావాలను ఇక్కడ పరిచయం చేస్తాను.

కార్బో ఏనిమాలిస్ 
ఇది యానిమల్ చార్కోల్. కర్బన కుటుంబానికి చెందిన మందులన్నీ దీర్ఘరోగాలలో అద్భుతంగా పని చేస్తాయి. ఎందుకంటే జీవం యొక్క పరమాణు నిర్మాణంలో కర్బనం (Carbon )ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీర్ఘరోగాలలో, కణాలలోని కర్బనబంధాలలో మార్పులు వస్తాయి. ఆ మార్పులను పోటేన్సీలలో వాడే ఈమందులు పరమాణు స్థాయిలో సరి చేస్తాయి.

ఈ రోగులలో ప్రాణశక్తి బాగా క్షీణించి ఉంటుంది. కేన్సర్ కణుతులు వచ్చి ఉంటాయి. గ్రంధులు వాచి ఉంటాయి. సిరలు ఉబ్బి వాచి నీలంగా ఉంటాయి. బరువులెత్తడం వల్ల తేలికగా వీరు బాధలకు లోనవుతారు. శరీరంలో పుళ్ళు పడి అవి కుళ్ళుడుగా మారుతాయి. వీరి ఒంటిలోనుంచి వచ్చే స్రావాలు భయంకర దుర్వాసనగా ఉంటాయి. శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో వాపులు ఉంటాయి కాని వేడి ఉండదు. ప్రాణశక్తి క్షీణతవల్ల శరీరవేడి తగ్గుతుంది. వాపు ఉన్నచోట వేడి ఉండాలి. అది లేకుంటే విచిత్రలక్షణంగా (peculiar symptom ) పరిగణించాల్సి ఉంటుంది. 

వీరు మనుషులతో కలవరు. మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎప్పుడూ డిప్రెషన్ లో ఉంటారు.వీరిలో వినికిడి శక్తి అయోమయంలో ఉంటుంది. శబ్దం ఏ వైపునుంచి వస్తున్నదో చెప్పలేరు. జీర్ణక్రియ బాగా దెబ్బ తిని ఉంటుంది. పొట్ట కేన్సర్ ఉండవచ్చు. గాలి త్రేన్పులు, పొట్ట ఉబ్బరం, చికాకు ఉంటాయి. కొందరిలో పైల్స్ కూడా ఉండవచ్చు. స్త్రీలలో నెలసరి తర్వాత అమిత నీరసంగా ఉంటారు.స్తనాలలో మెరుపులలాగా (shooting pains ) నొప్పులు వస్తుంటాయి. పరీక్షించినప్పుడు వాటిలో గడ్డలలాగా చేతికి తగులుతాయి. ముఖ్యంగా కుడిస్తనంలో ఈ బాధలు ఎక్కువగా ఉంటాయి. గర్భాశయ కేన్సర్ ఉండవచ్చు. ఇలాటి వారిలో గర్భాశయద్వారం (cervix) వాచి ఉంటుంది.

శరీరంలో గ్రంధులు వాచి నొప్పిగా ఉంటాయి. మెడలో, చంకలలో, స్థనాలలో, గజ్జలలో గ్రంధులు వాచి ఉంటాయి. గ్రందుల్లో నొప్పులు దారుణంగా, కత్తితో కోస్తున్నట్లు, మంటతో కూడి ఉంటాయి.

కాడ్మియం మెటాలికం
ఇది ముఖ్యంగా పొట్ట కేన్సర్ మీద బాగా పని చేస్తుంది. ఆహారం గాని ద్రవాలు గాని తీసుకొని తీసుకోక ముందే వాంతి అయిపోతుంటాయి. వాటిని ఏ మాత్రం అరిగించుకోలేని స్తితిలో జీర్ణాశయం ఉంటుంది. వాంతి నల్లగా కాఫీ డికాషిన్ రంగులో ఉంటుంది. 

కాడ్మియం అనే మందు హోమియో ఔషధాలలో చేరకముందు ఎందఱో కేన్సర్ రోగులు బలైపోయారు. కాని ఈ మందు ప్రూవింగ్ అయిన తర్వాత ఎందఱో రోగులు కాపాడబడ్డారు.  వీటిలో కాడ్మియం బ్రోమేటం, కాడ్మియం సల్ఫ్, కాడ్మియం అయోడం మొదలైన ఇతర కాంబినేషన్ డ్రగ్స్ ఉన్నాయి. వాటి లక్షణాలు కూడా ఒకదానికొకటి విభిన్నం గా ఉంటాయి. ఉదాహరణకు కాడ్మియం బ్రోమేటం అనే మందు ఊపిరితిత్తుల బాధలమీదా ఉదరకోశ కేన్సర్ మీదా పనిచేస్తుంది. కాడ్మియం అయోడం అనేది పేగు కేన్సర్ మీదా, తదితర బాధల మీదా పనిచేస్తుంది. కాడ్మియం సల్ఫ్ అనేది నల్లని వాంతి అవుతున్న దశలోనూ, ముఖ పక్షవాతం లోనూ,ఇతర ఉదరకోశ కేన్సర్ స్తితులలోనూ పనిచేస్తుంది.

ఆర్సేనికం ఆల్బం
కేన్సర్ రోగం లో ముందుగా ఈ మందును చెప్పుకోవాలి. ఇందులో బాధలన్నీ అర్ధరాత్రి గానీ మిట్ట మధ్యాన్నం గానీ ఉద్రేకిస్తాయి. రోగి చాలా చికాకుగా ఉంటాడు. స్తిమితం ఉండదు. ఒకచోట ఉండలేదు. కోపంగా ఉంటాడు. చాలా నీరసంగా ఉంటాడు. వేడి పానీయాలు తాగితే ఇతనికి హాయిగా ఉంటుంది. రక్తం వాంతులు అవ్వవచ్చు. ఇతని బాధలన్నీ మంటలతో కూడి ఉంటాయి. అయినా సరే వేడి ఇతనికి హాయినిస్తుంది. ఇతనికి ఉదరకోశ కేన్సర్ ఉండవచ్చు. పొట్టలో వస్తున్న మంటలతో కూడిన బాధలు తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటాడు.
కార్సినోసిన్ 
ఇది కేన్సర్ కణుతుల నుండి తీసిన పదార్ధాన్ని పోటెన్సీలోకి  మార్చి రాబట్టిన మందు. హోమియో విధానంలో రోగి యొక్క స్రావాలనుంచే మందులు తయారు చేసే పద్దతి ఉంది. ఇలా తయారుచేసిన మందులను 'నోసోడ్స్' అంటారు. సూచింపబడుతున్న ఇతరమందులు ఏవీ పనిచెయ్యని స్తితిలో ఈ మందును వాడుతారు. అప్పుడు రోగి యొక్క ప్రాణశక్తి ఉత్తేజితమై, మళ్ళీ మందులను స్వీకరించి పనిచేసే స్తితికి వస్తుంది.అప్పుడు సూచింపబడుతున్న ఇతర మందులు మళ్ళీ వాడుకోవచ్చు. కొన్ని సార్లు సరాసరి కేన్సర్ బాధలమీద కూడా ఈమందు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాణశక్తి బాగా క్షీణించి కుప్పకూలిన స్తితిలో ఉంటుంది. రోగి చాలా నీరసంగా ఉంటాడు. పొట్టలో మండుతున్న బాధలుంటాయి. దొడ్డికి పోయినప్పుడు విపరీతమైన మంటగా ఉంటుంది. ఇతర కేన్సర్ లక్షణాలు ఉంటాయి.

హోమియోపతిలో కనీసం నూరుమందులు కేన్సర్ మీద పనిచేసేవి ఉన్నాయి.అవి రోగంలోని వివిధస్థాయిలలో వివిధబాధలలో ఉపయోగపడతాయి. లక్షణాలపరంగా జాగ్రత్తగా ఎంచుకొని సరియైన పోటేన్సీలో హోమియోసూత్రాల కనుగుణంగా వీటిని వాడుకోవాలి. చాలా మంది రోగులు కేమోథెరపీ అయిన తర్వాత ఆ బాధలు భరించలేక హోమియోని ఆశ్రయిస్తుంటారు. దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ముందే హోమియోపతి వాడితే రోగం ముదరడం జరుగదు. రోగం మొదటినుంచే హోమియో ఔషధాలు వాడితే అది ముదిరి సర్జరీ వరకూ రావడం ఎన్నటికీ జరుగదు. అయితే రోగం బాగా ముదిరి ఇతర వైద్యవిధానాలు వాడిన తర్వాత హోమియోఔషధాలు మొదలుపెడితేనో,లేక అల్లోపతీ మందులూ హోమియోపతీ మందులూ కలిపి వాడితేనో పూర్తి ఫలితాలు కనపడవు. రోగం పూర్తిగా తగ్గటమూ జరుగదు. కొన్నాళ్ళు రోగం ముదరటం మాత్రం వాయిదా వెయ్యబడుతుంది. కనుక ముందునుంచే హోమియో ఔషధాలు వాడటం శ్రేయస్కరం.
read more " హోమియోపతి-మరికొన్ని కేన్సర్ ఔషధాలు "

11, ఫిబ్రవరి 2012, శనివారం

హోమియోపతిలో కేన్సర్ ఔషధాలు-కోనయం మాక్యులేటం

ఒక వ్యాధిని హోమియౌ వైద్య శాస్త్రం చూచే దృష్టి అల్లోపతీ కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్యూట్ రోగాలలో రోగకారక క్రిముల పాత్రను హోమియో వైద్య శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఈ విషయంలో ఇతర వైద్యాలకూ హోమియో విధానానికీ స్పర్థ లేదు. కానీ, దీర్ఘరోగాల విషయంలో హోమియో సిద్ధాంతాలు భిన్నమైనవి. చాలా దీర్ఘ రోగాలకు కారణాలు ఏమిటో అల్లోపతీ విధానం ఇంతవరకూ కనిపెట్టలేదు. ఉదాహరణకు నిన్న గాక మొన్న యువరాజ్ సింగ్ కు వచ్చిన రోగానికి కారణం ఏమిటో స్పెషలిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. లక్షలో ఒకరికి ఈ వ్యాధి రావచ్చు అంటారు గాని, ఆ ఒక్కడూ ఇతనే ఎందుకు కావాలో చెప్పలేరు. 

ట్రీట్మెంట్ విధానం కూడా అల్లోపతీలో ఎలా ఉంటుందంటే, క్షీణిస్తున్న ప్రాణశక్తికి సూక్ష్మ స్త్తాయిలో బలాన్ని ఇవ్వడం ఒదిలేసి, ప్రాణం చెయ్యవలసిన పనిని వారు మందులద్వారా పరికరాల ద్వారా పూరించాలని చూస్తారు. తద్వారా, తన పని ఎవరో చేస్తున్నారు కనుక ప్రాణం ఇంకా ఇంకా చతికిలబడుతూ ఉంటుంది. కనుకనే, అనుకూల పరిస్తితి వచ్చినపుడు వ్యాధి మళ్ళీ రిలాప్స్ అవుతుంది. హోమియోపతిలో అయితే,ప్రాణాన్ని సూక్ష్మ స్థాయిలో సరిదిద్దటం ద్వారా వ్యాధిని ప్రాణమే సమర్ధవంతంగా ఎదుర్కొనేలా చెయ్యడం ఉంటుంది. ఈ ప్రక్రియ పోటేన్సీ ఔషధాల ద్వారా జరుగుతుంది. పోటేన్సీలు ప్రాణవ్యాకులత ఉన్న పరమాణు స్థాయిలోకి వెళ్లి అక్కడి లోటును సరిదిద్దుతాయి. కనుక ప్రాణం బలాన్ని పుంజుకొని వ్యాధిని తిప్పికొట్టగలుగుతుంది. అల్లోపతీలో వాడే స్థూలస్థాయి మందులు పరమాణుస్థాయిలోకి వెళ్ళలేవు.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఉద్యోగం లేని వ్యక్తికి, రెండు విధాలుగా మనం సాయం చెయ్యవచ్చు. ఒకటి-- జీవితాంతం అతన్ని మనం పోషిస్తూ  ఆదుకోవడం. రెండు- అతని కాళ్ళమీద అతనే నిలబడేలా చేసి జీవనోపాధి కలిపించడం. . ఇందులో మొదటి విధానం అల్లోపతీ అయితే, రెండవ విధానం హోమియోపతి అని చెప్పవచ్చు. అల్లోపతీలో జీవితాంతం మందులు వాడుతూ ప్రాణం చేసే పని మనం చేస్తాం. హోమియోపతీలో ప్రాణాన్ని చక్కదిద్ది దానిపని అది చేసుకునేలా చేస్తాం. ఇదీ రెంటికీ తేడా.

కేన్సర్ కు వాడే హోమియో ఔషధాలలో 'కోనయం మాక్యులేటం' అనే మందు ఒకటి. దీని ముఖ్య లక్షణాలు కొన్ని పరిశీలిద్దాం. ఇవి ముఖ్య లక్షణాలు మాత్రమేననీ, మందు యొక్క సమగ్ర స్వరూపం కాదనీ గుర్తుంచుకోవాలి. 

ఇది 'హెమ్లాక్' అనే విషం. సోక్రటీస్ కు ఇది ఇచ్చినందువల్లె ఆయన  చనిపోయాడు. చనిపోయేముందు ఆయన పడిన బాధలనూ, ఆ బాధలను వర్ణించిన తీరునూ సోక్రటీస్ శిష్యుడైన  'ప్లేటో' వ్రాసి పెట్టాడు. బహుశా 'కోనయం' మొదటి ప్రూవింగ్ అదే అయ్యుండవచ్చు. అందులో, శరీరం క్రమేణా చచ్చు బడినట్లు అనిపిస్తున్నదనీ అలా చచ్చుబడటం కాళ్ళలో మొదలై క్రమేణా పైకి పాకుతున్నదనీ సోక్రటీస్ అంటాడు. 

ఈ మందు అవసరం అయ్యే పేషంట్లు గట్టివారు. వారి గ్రంధులు గట్టిపడి ఉంటాయి. వీరికి ఏ పనీ చేద్దామని ఉండదు. ఊరకే అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా క్షీణించి ఉంటుంది. తేలికగా ఉద్రేకపడతారు. ఊరకే ఇతరులతో గొడవలు పెట్టుకుంటారు. ఎవరైనా వీరికి ఎదురుచేబితే భరించలేరు. ఉద్రేకం ఎక్కువై దాన్నుంచి డిప్రెషన్ లోకి పోతుంటారు. 

ఆడవారిలో స్థనాలు, మగవారిలో వృషణాలు బాగా గట్టిపడి రాళ్ళలా ఉంటాయి. స్త్రీలలో నెలసరికి ముందూ, నెలసరి సమయంలోనూ స్థనాలు గట్టిపడి నొప్పిగా బాధగా ఉంటాయి. ఇలాటి వారిలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.స్తనాలను పరిశీలించినప్పుడు వాటిలో రాళ్ళలాగా గడ్డలు తగులుతాయి. కొందరిలో  చంకలలో గ్రంధులు వాచి ఆ నొప్పి తిమ్మిరిలాగా చేతిగుండా పాకుతూ వేళ్ళవరకూ వస్తుంది. 

ఒవరీలలోనూ, గర్భాశయంలోనూ బాధలున్నవారిలో కొందరికి కళ్ళు గిర్రున తిరుగుతాయి. మెడ పక్కకు తిప్పినా, కళ్ళు పక్కకు తిప్పినాs గది మొత్తం గిర్రున తిరిగినట్లు ఉంటుంది. ఎక్కువగా ఈ లక్షణం బెడ్ మీద పడుకుని ఉన్నపుడు కనిపిస్తుంది.

ప్రోస్టేట్ కేన్సర్ ఉన్న మగవారిలోనూ, గర్భాశయ సమస్యలున్న ఆడవారి లోనూ ఒంటేలుకు పోయేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. యూరిన్ ధార మధ్యమధ్యలో ఆగిఆగి వస్తుంది.ఆడవారిలో నెలసరి ఆగిపోతుంది. నెలసరికి ముందు ఒంటిమీద ఎర్రని సన్ననిదద్దుర్లు వచ్చి నెలసరి రాగానే మాయమౌతాయి. నెలసరి తర్వాత పది రోజులకు లుకోరియా కనిపిస్తుంది. 

సెక్స్ కోరికలను బలవంతంగా అణచిపెట్టుకున్నవారిలోనూ, లేక విపరీతంగా కోరికలు తీర్చుకున్నవారిలోనూ లేటు వయసులో కేన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈవిషయం అల్లోపతీకి తెలియదు.ఇది హోమియో వైద్యపు insights లో ఒకటి. ఇలాటి వారికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాని శరీరం సహకరించదు. అంటే యయాతిలాంటి వారన్నమాట. అలాటి వారికి ముందుముందు కేన్సర్ రావచ్చు అని అనుమానించవచ్చు. ఇటువంటి వారికి ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది.

వీరికి పగలూ రాత్రీ ఒకటే చెమటలు పడుతుంటాయి. ఈ మందు అవసరమైన వారి లక్షణాలు రాత్రిపూట ఉద్రేకిస్తాయి.పక్కమీద చేరిన తర్వాత బాధలు  ఎక్కువౌతాయి. బ్రహ్మచర్యం పాటిస్తే వీరి బాధలన్నీ ఉద్రేకిస్తాయి. 
    
కోనయం రోగికి బాధలు శరీరంలో కిందినుంచి పైకి వ్యాపిస్తాయి. Ascending  paralysis వీటిలో ఒకటి. ఈ పక్షవాతం అనేది క్రమేనా పై పైకి ఎదిగి చివరికి ఊపిరితిత్తులను ఆక్రమించి శ్వాస అందకపోవడం వల్ల చావును కొని తెస్తుంది. ఇలాంటి వారికి ముఖ్యంగా నీరసంగా ఉంటుంది. కాళ్ళలో కండరాలు చాలా నీరసంగా అనిపిస్తాయి.

వీరికి ఉపవాసం ఉంటె బాధలు శాంతిస్తాయి. చీకటిలో ఉంటే బాగుంటుంది. తిరుగుతూ ఉన్నా, ఒళ్ళు పట్టించుకున్నా హాయిగా ఉంటుంది. కాళ్ళూ చేతులూ బెడ్ మీదనుంచి కిందకు వేలాడేసి పడుకుంటే హాయిగా ఉంటుంది. 

మందులక్షణాలూ, రోగిలక్షణాలూ, రోగలక్షణాలూ కలిసినప్పుడు ఈ మందు ఇండికేట్ అవుతుంటే సరైన దశలోగనుక దీనిని వాడగలిగితే ఈ మందు కేన్సర్ ను కూడా తగ్గిస్తుంది.దీని ప్రభావంవల్ల కేన్సర్ కణుతులు కరిగిపోయి కనిపించకుండా మాయమౌతాయి.కెమోథెరపీ,రేడియేషన్ థెరపీలు చెయ్యలేని పని ఈమందు చేస్తుంది.రోగి యొక్క మానసికశారీరికలక్షణాలు పరిశీలించి సరియైన పోటేన్సీలో హోమియోసూత్రాల కనుగుణంగా దీనిని వాడవలసి ఉంటుంది. అప్పుడు అద్భుతాలు జరగడం చూడవచ్చు.

వచ్చే పోస్ట్ లో మరికొన్ని కేన్సర్ మందులు చూద్దాం.
read more " హోమియోపతిలో కేన్సర్ ఔషధాలు-కోనయం మాక్యులేటం "

8, ఫిబ్రవరి 2012, బుధవారం

కాలజ్ఞానం - 5

మాఘ కృష్ణ ఏకాదశి మార్గమేదో చూపుతోంది
నీచరాహు దృష్టంతా దనుజగురువు మీదుంది 
తమకు తగని మన్మధాగ్ని లోకాన్నే కమ్ముతుంది 
జనుల మానసాలలోన చిచ్చునేమొ పెంచుతుంది

రాజులనగ  పేదలనగ వ్యత్యాసం లేకుండా 
ప్రతివారిని కామాగ్ని పడవేయ బూనుతుంది 
వింత వింత చేష్టలతో లోకం పోటెత్తుతుంది 
మదనబాణ ధాటిలోన మాటలేక పడుతుంది

శివభక్తులకే చూడగ చిత్రమైన రక్షణుంది
మోరెత్తుకు తిరుగువారి మాడు పగిలిపోతుంది 
అహంకారులను చూస్తె అంటకాగబెడుతుంది
ఎరుకగలుగువారినేమొ ఏమనక సాగుతుంది
read more " కాలజ్ఞానం - 5 "

నాతో కలిసి నడుస్తావా నేస్తం?

గోవుల్లాంటి మూగజీవులకు 
చెత్తకుండీలలో ఎంగిలాకులు
కుక్కాపిల్లీ క్రూరజంతువులకు 
ఏసీరూములు సోఫామెత్తలు
గమనించావా లోకపు న్యాయాన్ని?

మెత్తనిభర్తలకు కరుకుభార్యలు 
లేతమొగ్గలకు వ్యసనపు మొగుళ్ళు 
చదువుకోవాలంటే అవకాశాలు శూన్యం 
వసతులమరిస్తే చదువు పూజ్యం
ఏమిటంటావ్ ఈ విచిత్రం?

ఆలయాలలో హోరున పూజలు 
నడిరోడ్డున దిక్కులేని శవాలు
వేదికలపైన ధార్మికోపన్యాసాలు 
రాతిగుండెల శ్రోతల జీవితాలు
మితిలేని ఆత్మవంచనలు; కాదనగలవా?


ఆశకూ ఆనందానికీ మధ్య ఇంతటి దూరాలెందుకో?
కన్నీటికీ చిరునవ్వుకీ మధ్య తీరని అంతరాలేమిటో
విచిత్రమైంది కదూ ఈ సృష్టి?


ఆశల పెనాల మీద ఆవిరయ్యే జీవితాలు
గమ్యం చేరుకోలేక కూలే ఊహలవిహంగాలు
ఎప్పటికీ మారని ఎదురుచూపులు
ఎన్నటికీ తీరని మనిషి కోరికలు
ఎక్కడికంటావ్ మన పరుగు?

కోరుకున్నది వెంటనే దొరికితే తెలుస్తుందా జీవితం విలువ?
అన్నీ సుఖంగా అమిరితే పుట్టుకొస్తుందా తెగువ?
చీకటే లేకుంటే పగటికి విలువేది?
లేమి నుంచేగా కలిమి మొదలయ్యేది? 


కడుపు నిండినా ఇంకా తినాలని ఆశెందుకో
ఎన్నటికీ తృప్తిలేని సుఖాలపై మోజెందుకో
అంతముందా ఆశల అన్వేషణకు 
పొంతనుందా లోకపు తీరులకు
కళ్ళుతేరిచి చూడు నేస్తం నీవే గ్రహిస్తావు సమస్తం 


పగలూ రాత్రీ అంతులేని ఆటలో
దారీతెన్నూ తోచని పరుగు పందెంలో
ఆలోచించావా ఎప్పుడైనా?
ఎన్నాళ్ళుగా గడిపావో ఈ వ్యధాభరిత జీవితాన్ని
ఎన్నేళ్ళుగా నడిచావో వృధాగా ఈ ఎడారి నడకల్ని


ఎక్కడికో నీ ప్రయాణం ఈ లోకంలో
ఎందుకోసమో నీ అన్వేషణ ఈ మోహంలో 
దాక్కున్నావా బాధ్యతల ముసుగులో?
దారితప్పావా ఆత్మవంచన అనే అడివిలో?
నీకేం కావాలో నీకైనా తెలుసా? 
నీ పయనం ఎక్కడికో అదైనా తెలుసా?


మారిందా లోకమనే కుక్కతోక ఎన్నడైనా?
తీరిందా మనసు దాహం ఎప్పుడైనా?
పాతకాలం నుంచీ మనిషితీరు మారిందా ?
మనసుపాశం ఎన్నడైనా మనిషిని వదిలిందా ?
లోకంలో ఆనందం ఆకాశపుష్పమేనోయ్
ఉందని అనుకోవడం నీ భ్రమేనోయ్ 

ఎవరెలా పోతే నీకెందుకు లోకమేమైపోతే నీకెందుకు 
నీవెవరో ముందు తెలుసుకో నిన్నే నీగమ్యంగా నిలుపుకో 
నీవే నీకు తెలియవు లోకాన్నేం జయిస్తావ్ నువ్వు? 
స్వార్ధమే నీకు కావలిస్తే అమితంగా దానిని పెంచుకో 
ప్రపంచాన్ని మొత్తం మింగేసి నీవొక్కడివే మిగులు 

లోకమనేది ఎక్కడా లేదనేది తెలుసుకో 
ఉన్నది మనుషులూ వాళ్ళ స్వార్ధమే 
నీలోకి నువ్వే నడచిపో మిగిలినదంతా వ్యర్ధమే
భరించలేవా ఈ నిజాన్ని? తాకలేవా ఈ అగ్నిని? 
అయితే నీ జీవితం వృధాయేనంటాను నేను


ఎక్కడున్నావ్ పుట్టకముందు? 
ఏమౌతావ్ పోయిన తర్వాత?
ఊహించావా ఎప్పుడైనా ఒక్క క్షణం?
బ్రతుకుపోరాటంలో పడి మరిచావా ఈ ప్రశ్నని?
కట్టుకున్నావ్ కదూ నీ కళ్ళకి పట్టుగంతల్ని?


శాశ్వతమనుకుంటున్నావా నువ్విక్కడ 
అదే నిజమైతే, నీ ముందరివాళ్ళంతా ఎక్కడ?
నీవు పోయిన మరుక్షణం నిన్ను మరిచిపోతుందీ లోకం
నీకు నచ్చినా నచ్చకున్నా ఇదే అసలైన చేదునిజం 
నీ జీవితకాలం ఈలోకంలో అతి స్వల్పం 
విశాలవిశ్వంలో నీ బ్రతుకే అత్యల్పం 

కనీసం ఇప్పుడైనా కళ్ళుతెరవవా మరి 
లోకమూ వద్దు నీమనసూ వద్దు 
ఈరెంటినీ వదిలిచూడు ఒకసారి
నేనన్నది నిజమేనని అంటావప్పుడు
ఎన్నడూ వినని నాదం వింటావప్పుడు


అన్ని సమస్యలూ అర్ధమౌతాయప్పుడు
చిక్కుముళ్లన్నీ విడిపోతాయప్పుడు
నీ పెద్దలందరూ ఈ బాటనే నడిచారు 
అందరు దేవుళ్ళూ ఆత్మదేవుణ్నేకొలిచారు

ఆరాటమనేదుంటే ఆచరించు ఈవిధానం స్వయంగా 
నీవే చూడు, చేరుతావో లేవో నీగమ్యం నిజంగా
read more " నాతో కలిసి నడుస్తావా నేస్తం? "

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

యువరాజ్ సింగ్ కు కాన్సర్- గ్రహప్రభావాలు

క్రికెటర్ యువరాజ్ సింగ్ కు లంగ్ కాన్సర్ అనీ, దానికి విదేశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ వార్తలు వస్తున్న నేపధ్యంలో అతని జాతకం పరిశీలిస్తే ఆశ్చర్యకరవిషయాలు కొన్ని  కన్పించాయి. అవేమిటో చూద్దాం.

ఇతను డిసెంబర్ 12 ,  1981 న చండీఘర్ లో పుట్టాడని సమాచారం దొరుకుతోంది. ఇది నిజమో కాదో తెలియదు.డిసెంబర్ పన్నెండున పుట్టినవాళ్ళు సామాన్యంగా మహా మొండివాళ్లై  ఉంటారు. నాకు క్రికెట్ మీద బొత్తిగా ఆసక్తి లేదు కనుక అతని ఆట గురించి నాకు తెలియదు. క్రికెట్ ఆటను నేను అసలు చూడను. కానీ సామాన్యంగా ప్రతి ఆటగాడూ మొండివాడై ఉండాలని నేను నమ్ముతాను. లేకుంటే ప్రతికూల పరిస్తితుల్లో ఆటను ఆడలేడు.కనుక ఇతనూ మొండిమనిషే అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు డిసెంబర్ 12 సరియైన జననతేదీనే కావచ్చు.ఇంతకంటే ఖచ్చితమైన సమాచారం దొరికేవరకూ ఇదే నిజమని అనుకుందాం.

సాధారణంగా ప్రముఖుల అసలైన జననవివరాలు వారు బయటపెట్టరు. దానికి కారణాలు అనేకం ఉంటాయి. ప్రస్తుతం మాత్రం ఈ వివరాలు నిజమే అని నమ్ముతూ ఈ విశ్లేషణలో ఏమి కనిపిస్తుందో చూద్దాం.ఇతని సరియైన జననసమయం మాత్రం తెలీలేదు. కనుక స్థూలవిచారణ చేద్దాం.ఇతని జాతకంలో ముఖ్యంగా కనిపించే అంశాలు కొన్ని --

1 . రాహుకేతువులు సున్నా డిగ్రీలలో ఉండటం.

2 . శని కన్యారాశిలో 26  డిగ్రీలలో ఉంటూ తృతీయదృష్టితో వృశ్చికరాశిలో 26 డిగ్రీలలో ఉన్న రవిని డిగ్రీదృష్టితో వీక్షించడం.

3 . బుధుడు రవికి అతి దగ్గరగా ఉండి అస్తంగతుడవ్వడం.

4 . గురువు తులారాశిలో 9 డిగ్రీలలో ఉంటూ బలహీనుడైన (?) రాహు నక్షత్రంలో ఉండటం.

కేన్సర్ కు అనేక గ్రహస్తితులు కారణం అవుతాయి. వాటిలో గురు శనులు, గురు కుజులు, గురు రాహువులు, గురు కేతువులు ప్రముఖ పాత్ర వహిస్తారు. అందరిలోకీ గురువుపాత్ర మాత్రం ఖాయంగా ఉంటుంది. గురువు సంపూర్ణ శుభగ్రహం కదా ఇదేంటి ? దేవగురువైన బృహస్పతి కాన్సర్ ను కలిగిస్తాడా ? అన్న అనుమానానికి నా పాత పోస్ట్ లలో వివరణ ఇచ్చాను. వాటిలో గురువూ శనీ ఎలా కాన్సర్ కు కారకులౌతారో వివరించాను.కావలసినవారు అవి ఒకసారి చదువవచ్చు.  

గోచారరీత్యా ఇప్పుడు గురువు మళ్ళీ మేషరాశి 9  డిగ్రీలలో ఉండి జననకాల గురువును ఖచ్చితమైన డిగ్రీదృష్టితో చూస్తున్నాడు. జననకాలశుక్రుడు వీరిద్దరికీ సరిగ్గా మధ్యన మకరం 8 డిగ్రీలలో ఉండటం చూడవచ్చు. దీని వివరాన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఇదొక వివాదాస్పద అంశం. జ్యోతిష్య వేత్తలకు దీని అర్ధం తెలుస్తుంది.

గోచారశని తులారాశి 5  డిగ్రీల మీద సంచరిస్తూ జననకాల గురువుకు అతి దగ్గరగా ఉన్నాడు. కనుక శని గురువుల ప్రాధమిక ప్రభావం ఇతని రోగం వెనుక కనిపిస్తున్నది. అంతేకాక సహజతృతీయరాశి అయిన మిథునానికి అధిపతి అవుతూ ఊపిరితిత్తులకు సూచకుడైన బుధుడు రవికి అతిదగ్గరగా ఉంటూ అస్తంగతుడై, శనిదృష్టివల్ల  ఊపిరితిత్తుల కాన్సర్ కు దారి తీశాడు. ఈ కాన్సర్ కణితి గుండెకు అతిదగ్గరగా ఉండటం కూడా రవిపైన ఖచ్చితమైన శనిదృష్టి వల్లనే జరిగింది. రవి గుండెకు కారకుడని మనకు తెలుసు.


జననకాల మరియు గోచారగురుశనుల ప్రభావం వల్లనే ఈపరిస్తితి తలెత్తింది.కేన్సర్ కారకులలో గురు, శని గ్రహాల యొక్క పాత్ర ఈవిధంగా మళ్ళీ రుజువౌతున్నది. రవి వల్ల గుండె, బుదునివల్ల ఊపిరితిత్తులూ సూచింప  బడుతున్నాయి. ఏ జాతకానికైనా రవి చంద్రుల బలం ప్రధానం. ఎందుకంటే వీరిద్దరూ జీవితానికి వెలుగునిచ్చే గ్రహాలు. ఇతని జాతకంలో వీరిద్దరూ శని ప్రభావానికి లోనయ్యారు.శని యొక్క తృతీయదశమదృష్టులు రవి చంద్రులపైన ఉండటం చూడవచ్చు. 


చంద్ర లగ్నాత్ పరిశీలిస్తే, షష్ఠఅష్టమ స్తానాదిపతులైన కుజశనులు చాతీని సూచించే చతుర్దంలో కలవడం వల్ల ఛాతీకి సంబంధించిన తీవ్రరోగం సూచితం. శనికుజుల కలయిక మంచిది కాదు. దీనివల్ల తప్పక తీవ్రపరిణామాలు ఉంటాయి.రోగస్థానంలో లగ్నాధిపతి అయిన బుధుడు ఆయుస్థానాధిపతి అయిన రవితో కల్సి ఉండటం, వారిమీద చతుర్ధం నుంచి శనికుజుల దృష్టి పడటం కూడా ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలు సూచిస్తున్నది.   


జైమిని మహర్షి తన ఉపదేశసూత్రాలలో ప్రధమాధ్యాయంలో 'కుజదృష్టే మహారోగః' అన్నాడు. కారకాంశకు చతుర్ధమున చంద్రుడుండి కుజునిచేత చూడబడితే 'మహారోగం' కలుగుతుంది అన్నాడు. అంటే ఒక పెద్దరోగం అని అర్ధం.ఈ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది.యువరాజసింగ్ జాతకంలో ఆత్మకారకుడు బుధుడయ్యాడు. కారకాంశ మీనం అయింది. మీనం నుంచి చతుర్దంలో చంద్రుడున్నాడు. కన్యనుంచి రాశిదృష్టితో కుజుడు చంద్రుని వీక్షిస్తున్నాడు. జైమినిమహర్షి రాశి దృష్టులను చెప్పాడు. దాని ప్రకారం ద్విస్వభావ రాశులు ద్విస్వభావరాశులను వీక్షిస్తాయి. జైమిని మహర్షి చెప్పిన సూత్రం ఇతని జాతకంలో ఖచ్చితంగా రుజువైంది.ఏం పరవాలేదు ఇది చిన్నరోగమే అని కొందరు అంటున్నప్పటికీ, చిన్నరోగం అయితే అమెరికా వెళ్లి స్పెషలిస్టుల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవలసిన అవసరం లేదు. 
   
ఇకపోతే ప్రస్తుత పరిస్తితి చూద్దాం.


రేపు 8 వ తేదీనుంచి శనిభగవానుడు వక్రస్తితిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 24 వరకూ వెనక్కు వెళుతూ మళ్ళీ కన్యారాశిలో ప్రవేశిస్తాడు. కనుక జననకాల గురువుకు క్రమంగా దూరమౌతాడు. ఈ సమయంలో ఇతని ఆరోగ్యపరిస్తితి మెరుగుపడుతుంది.  ఆ తర్వాత శనిభగవానుడు మళ్ళీ రుజుగమనంలోకి వచ్చి, అక్టోబర్ 31 ప్రాంతంలో మళ్ళీ తులారాశిలోని జననకాల గురువుమీద సంచరిస్తాడు. కనుక ఆ సమయంలో మళ్ళీ ఇతనికి వ్యాధి తిరగబెట్టవచ్చు. లేదా ఇంకొక రౌండ్ ట్రీట్మెంట్ అవసరం కావచ్చు. జూన్ లో గురువు గోచారరీత్యా ద్వాదశరాశిలో ప్రవేసిస్తాడు.కనుక అప్పుడు ఇతనికి విపరీత ఖర్చులు ఉంటాయి. అవి ట్రీట్మెంట్  కోసమే కావచ్చు.


యువరాజ్ సింగ్ జననసమయం ఖచ్చితంగా తెలిస్తే ఇతని జాతకాన్ని ఇంకా వివరంగా పరిశీలించవచ్చు. ఇతనికి కావలసిన రెమెడీస్ కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనకు ఇంతకంటే వివరాలు దొరకలేదు. చిన్న వయసులో కేన్సర్ రావడం దురదృష్టమే. ఇతని కెరీర్ ఇకముందు ఎలా ఉంటుందో సందేహమే. ఇతనికి త్వరలో నయం కావాలని మాత్రం కోరుకుందాం.
read more " యువరాజ్ సింగ్ కు కాన్సర్- గ్రహప్రభావాలు "

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

కార్పోరేట్ హోమియోపతి

జర్మనీదేశంలో పుట్టిన హోమియోపతి అనే వైద్యవిధానం  మొదటగా మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో కాలుపెట్టింది. దాదాపు 1830 ప్రాంతంలో డాక్టర్ జాన్ మార్టిన్ హోనిగ్ బెర్గెర్ అనేవాడు పంజాబ్ రాజైన మహారాజా రంజిత్ సింగ్ ను హోమియోపతి వాడి ప్రాణాపాయం నుంచి రక్షించాడు. ఈ డాక్టర్, హన్నేమాన్ వద్ద హోమియోపతి నేర్చుకున్నాడు. మహారాజా రంజిత్ సింగ్ జలోదరంతో బాధపడుతుంటే డాక్టర్ హోనిగ్ బెర్గేర్ ఇచ్చిన 'డల్కమారా' అనే మందుతో అతనికి బాధ తగ్గి ఆరోగ్యం చేకూరింది. వర్షాకాలంలో వచ్చే దురదలకూ, ఏసీ  రూముల్లో ఎక్కువసేపు ఉంటె వచ్చే బాధలకూ, వర్షంలో తడిస్తే వచ్చే బాధలకూ, ఎప్పుడూ తడిబట్టలలో నానుతూ ఉండవలసి వచ్చేవారికీ, నీళ్ళల్లో ఎక్కువగా తడిసేవారికీ  ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక   మహారాజా రంజిత్ సింగ్ గుర్రానికి దెబ్బలు తగిలి గాయాలతో ఉంటే ఆ పుండ్లను హోమియో ఔషధాలతో ఇతను నయం చేశాడు.  మహారాజు ఇతన్ని ఆదరించి తన ఆస్థానవైద్యునిగా ఉండనిచ్చాడు. డాక్టర్ హోనిగ్ బెర్గేర్ కలకత్తాలో చాలా రోజులు ఉండి హోమియో వైద్యాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. 'సింకోనా' అనే మందుతో హోమియో వైద్యం ఆవిర్భవిస్తే, 'దల్కమారా' అనే మందుతో అది భారతదేశంలో అడుగుపెట్టింది.

తర్వాత బెంగాల్ రాష్ట్రంలో ఉద్దండులనదగిన హోమియో వైద్యులు ఆవిర్భవించారు. భారతదేశపు హోమియోవైద్య పితామహునిగా 'డాక్టర్  రాజేంద్రలాల్  దత్త' ను చెప్పుకోవాలి. ఇతనివల్లనే హోమియో వైద్యం బెంగాల్ రాష్ట్రంలో ఎంతో ప్రచారంలోకి వచ్చింది. ఈయన పండిత ఈశ్వరచంద్రవిద్యాసాగర్ కు వైద్యుడు. అంతేకాక, అప్పట్లో కలకత్తాలో ప్రముఖ అల్లోపతీ MD అయిన డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ను హోమియో వైద్యంవైపు మళ్లించిన ఘనత ఈయనదే. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ 1863 లో కలకత్తా మెడికల్ కాలేజీనుంచి MD ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన మేధావి. అప్పటి యూరోపియన్ ప్రొఫెసర్లకు ప్రియశిష్యుడు. ఈయనకి మొదట్లో హోమియోపతి అంటే సరిపడేది కాదు. అల్లోపతీ డాక్టర్ అవడంవల్ల సహజంగా హోమియోని ఎగతాళి చేసేవాడు. తర్వాత డాక్టర్ రాజేంద్రలాల్ దత్త చేసిన అద్భుతమైన క్యూర్స్ చూచిన తర్వాత ఈయన హోమియోపతి వైపు మళ్లాడు. తద్వారా తన కొలీగ్స్ నుంచి ఎంతో ప్రతిఘటననూ, ఎగతాళినీ ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కు మళ్ళకుండా హోమియోపతిని అధ్యయనం చేసి ఎంతో మంచిపేరును సంపాదించాడు. నాటినుంచీ నేటివరకూ ఆలోచనాపరులైన అల్లోపతీ డాక్టర్లు ఎందఱో హోమియోవైద్యం వైపు మళ్లుతున్నారు. డాక్టర్ ప్రతాప్ చంద్ర మజుందార్, డాక్టర్ భగత్ రాం, డాక్టర్ యుద్ధవీర్ సింగ్, ఫాదర్ ముల్లర్,డాక్టర్ NM చౌధురీ  మొదలైన డాక్టర్లు హోమియోపతిని ఎంతో అధ్యయనం చేసి ఎన్నో రోగాలను సమర్ధవంతంగా నయం చేసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్నారు. 

డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్, శ్రీ రామకృష్ణపరమహంసకు కాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ధన్యుడు.శ్రీ రామకృష్ణుని  చివరిరోజులలో ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తూ 'లైకోపోడియం-200 ' అనే మందును ఇచ్చాడు. ఆ మందు ప్రభావం వల్ల శ్రీ రామకృష్ణునికి  కొంత తేలికగా అనిపించి లేచి నడవగలిగారు. తత్ఫలితంగానే 1886  జనవరి ఒకటో తేదీన ఆయన లేచి నడుస్తూ బయటకు వచ్చి, శిష్యులందరికీ మహత్తరమైన దివ్యానుభూతులను ఆరోజు ప్రసాదించారు. ఎవరు ఏ వరం అడిగితే ఆ వరం ఆరోజు ఆయన ఇచ్చారు. అప్పటినుంచీ శ్రీ రామకృష్ణ భక్తులు జనవరి ఒకటిని 'కల్పతరుదినం'గా జరుపుకుంటారు. భగవత్శక్తికి మందులతో పని లేనప్పటికీ, శరీరధర్మానుసారం డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆ మందును ఇవ్వడమూ తత్ఫలితంగా 'కల్పతరుదినం' అనేది చక్కగా జరగటమూ, ఎంతో మంది భక్తులు ఆరోజున అనేక దివ్యానుభవాలను పొందటమూ సంభవించింది. ఆ విధంగా శ్రీరామక్రిష్ణునికీ హోమియోపతివైద్యానికీ సంబంధం కలిగింది. ఆయన బ్లెస్సింగ్స్ ఆ వైద్య విధానానికి ఉన్నాయి. 

తర్వాత ఎందఱో మహనీయులైన వైద్యులు నిస్వార్ధంగా జీవిస్తూ అతి తక్కువ ఫీజు తీసుకుంటూ ఎందఱో రోగులకు చక్కని సేవలందిస్తూ హోమియోపతి వైద్యాన్ని పరిపుష్టం చేసారు. వారు కూడా డబ్బు సంపాదించారు. దానితో పాటు మంచిపేరూ సంపాదించారు.చక్కని వ్యక్తిత్వాన్నీ సొంతం చేసుకున్నారు. కాని నేటి వైద్యులలాగా కక్కుర్తి పడలేదు. డబ్బే పరమావధిగా ప్రవర్తించనూ లేదు. వారి కృషివల్ల బెంగాల్లో హోమియోపతి ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. బెంగాల్లో మారుమూల గ్రామాలకు వెళ్లి చూచినా అక్కడ పల్లెకారుప్రజలు కూడా హోమియో ఔషధాలు వాడుతూ ఉంటారు. అక్కడ హోమియో వైద్యం కూడా చాలా చవక. డాక్టర్ ఫీజు అయిదు రూపాయలో పది రూపాయలో ఉంటుంది. అందులోనే మందులు కూడా డాక్టరే ఇస్తాడు.  అదంతా ఒకప్పటి మాట. కాని నేటి పరిస్తితి మాత్రం చాలా ఘోరంగా తయారైంది. దానికి కారణం, ధనపిశాచి ఆవహించిన నేటి డాక్టర్లు.

ప్రస్తుతం హోమియోపతిని కూడా కార్పోరేట్ స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైద్యంలో నైపుణ్యతాస్థాయి ఏమాత్రం పెరగలేదు. ఇంకాపైగా ఘోరంగా దిగజారిపోతున్నది. డా|| హన్నేమాన్ కానీ ఇతర హోమియోపయనీర్స్ గానీ చేసిన బ్రిలియంట్ క్యూర్స్ నేటి హోమియో వైద్యులు కలలోకూడా చెయ్యలేరు.నేటి కుర్రడాక్టర్లు మామూలు జ్వరాన్నికూడా శుద్ధమైన హోమియోపతితో తగ్గించలేరు.హోమియోమందుతో జ్వరాన్ని తగ్గించడం చేతకాక, పారాసేటమాల్ ఇచ్చిన హోమియోడాక్టర్లు నాకు తెలుసు. కాని ఫీజులు మాత్రం వేలకువేలు వసూలు చేస్తున్నారు. రోగియొక్క అన్ని లక్షణాలకూ కలిపి ఒకసారికి ఒక్క మందును మాత్రమె వాడమని, అది కూడా మినిమం డోస్ లో వాడమనీ  హన్నేమాన్ చెబితే, నేటి వైద్యులు మాత్రం పచారీ కొట్లో సరుకులలాగా మందులు మూటలు కట్టి ఇస్తూ, హన్నేమాన్ కూ హోమియోపతికీ తలవంపులు తెస్తున్నారు. కొందరైతే జ్వరానికి సంబంధించిన మందులన్నీ కలగలిపి 'ఫీవర్ మిక్చర్' అని ఇస్తున్నారు.ఇది చాలా తప్పు విధానం. తెలియనివారు ఇదే నిజమైన హోమియో వైద్యం అనుకునే ప్రమాదం ఉంది.

నేను ఒకటి రెండుఏళ్ళ క్రితం ఏదోమందు కావలసివచ్చి హైదరాబాద్లో ఒక హోమియో స్టోర్ కు వెళ్లాను. అదొక క్లినిక్ కం స్టోర్. హాల్లో ఒక ముప్పై మంది పేషంట్లు కూచుని ఉన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇచ్చిన తర్వాత, మందులకోసం ఆ చీటీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డిస్పెంసరీ కి వెళుతుంది. అక్కణ్ణించి ఏతాంలో నీళ్ళు తోడినట్లు ఒక బక్కెట్లో మందులు మూటకట్టి హాల్లోకి దించుతున్నారు. హాల్లో వెయిట్ చేస్తున్న పేషంట్లు ఆ బక్కేట్లోని మందుల మూటను దించుకొని తీసుకుపోతున్నారు. అసలు హోమియోలో అన్నన్ని మందులు ఎందుకు వాడాలో నాకైతే అర్ధం కాలేదు. జ్వరాల దగ్గరనుంచీ ఎన్నో క్రానిక్ డిసీజెస్ వరకూ ఒకటి లేదా రెండు మందులను మాత్రమే వాడి నయం చెయ్యటం నేను చూచాను. అదే విధానం నేను నేర్చుకున్నాను. అంతేకాని కేజీలు కేజీలు మందులు మింగించడాన్ని హోమియోపతి అని ఎలా అంటారో నాకైతే అర్ధం కాదు. 

నేటి హోమియో షాపులలో అల్మారాలలో కనిపించే టూత్ పెస్టులూ, హెయిర్ ఆయిల్సూ, సబ్బులూ, కాస్మేటిక్సూ, ఆయింట్ మెంట్లూ అన్నీ హోమియో సిద్ధాంతాలకు వ్యతిరేకమైనవే. హన్నేమాన్ ఇలాంటి హోమియోపతిని బోధించలేదు. ఊహించలేదు. ఇదంతా నేటికాలపు వ్యాపార హోమియోపతీ మాత్రమె. అందుకే అది అస్సలు పనిచెయ్యదు. హోమియోపతీలో కేటలాగ్ వైద్యం లేనే లేదు. పైపూతలకు హోమియోలో విలువ లేదు. ఏదైనా ప్రాణశక్తి నుంచే, లోపలనుంచే రావాలి.ప్రాణానికి విలువ ఇచ్చే వైద్యం ఒక్క హోమియోపతి మాత్రమే.   

అయితే ఒకటి మాత్రం నిజం. నేటి ప్రజలు కూడా పత్యాలూ నియమాలూ పాటించమంటే వినేరకాలు కారు. ఆహారపు అలవాట్లూ, జీవనవిధానాలూ మార్చుకోమ్మంటే ససేమిరా వినరు. వీళ్ళు ఉండే అనాచారపద్దతుల్లో వీరు ఉంటారు. కాని రోగాలు మాత్రం తగ్గిపోవాలి. ఆ క్రమంలో స్టెరాయిడ్స్ వాడినా,ఒళ్ళు గుల్ల అయినా వారికి అనవసరం. అందినంతవరకూ జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం.ఒంట్లో ఏదైనా చెడిపోతే కార్పోరేట్ హాస్పటల్ కు పరిగెత్తి ICU లో పడుకోవడం. ఆఫ్ కోర్స్. అక్కడ బెడ్స్ ను ఎలాగూ అవినీతిమంత్రులూ,కేసులేదుర్కొంటున్న అధికారులూ ముందే ఆక్రమించుకొని ఉంటారనుకోండి. అది వేరే సంగతి.ఇలాంటి మనస్తత్వాలు ఉన్న పేషంట్లకు నేటి కార్పోరేట్ అల్లోపతీ వైద్యులే సరైన గురువులు. పాతకాలంలో వైద్యుని వద్దకు వెళితే జేబు మాత్రమె ఖాళీ అయ్యేది. నేడు వైద్యుని వద్దకు వెళితే బేంక్ బేలన్స్ మొత్తం ఖాళీ అవుతున్నది. కానీ రోగం మాత్రం పూర్తిగా తగ్గటం లేదు. ఒకరకంగా నేటి ప్రజలకు ఇలాంటి డాక్టర్లే కావాలి. అక్రమసంపాదనకు అలవాటు పడ్డ నేటి ప్రజలకు అక్రమంగా దోచుకునే డాక్టర్లే సరియైన గురువులు.పాతకాలపు శుద్ధమైన వైద్యం నిస్వార్ధంగా చేసే డాక్టర్లు నేటి తరానికి నచ్చరు.

అయితే చవకైన హోమియోపతీ వైద్యాన్ని కూడా అత్యంతఖరీదైన వైద్యంగా మార్చే ప్రయత్నాలు ఈమధ్యన జరుగుతున్నాయి. చెయిన్ క్లినిక్సూ, మల్టి స్పెషాలిటీ హోమియో క్లినిక్సూ వెలుస్తున్నాయి. మొన్నీ మధ్యన సంతానం లేని ఒక జంట 'హోమియో ఫెర్టిలిటీ క్లినిక్' ఒకదానికి వెళ్లి అక్కడి డాక్టర్ని కలిస్తే, మీ సమస్యకు ఆరునెలలు ట్రీట్ మెంట్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి పాతిక వేలు అవుతుంది అని చెప్పి ముందుగానే ఏభై వేలూ కట్టమని చెప్పారట. వాళ్ళ గుండాగినంత పనయ్యి మాకోద్దులే ఈ వైద్యం అని చక్కా వచ్చారు. నిజానికి ఆ సమస్యకు ఇచ్చే ట్రీట్మెంట్ కు అందులో ఎభైయ్యో వంతు (అంటే వెయ్యి రూపాయలు) కూడా అవదు. కాకపోతే కార్పోరేట్ ఆస్పత్రి ఖర్చులు, మేయిన్టేనేన్సూ  ఎవరు పెట్టుకోవాలి? అని డాక్టర్లు వాదిస్తారు. అదే డాక్టర్లు మరి పాతకాలపు హోమియో దిగ్గజాలకున్న వైద్యనైపుణ్యాన్ని అందుకోవాలని మాత్రం ప్రయత్నించరు. అదేమంటే ఆ పాతకాలపు పద్దతులు ఇప్పుడు పనికిరావు అంటారు. 

'రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే తాగమన్నాడు' అన్నట్లు నేటి ప్రజలకూ హంగులూ ఆర్భాటాలూ చూపి  మోసంచేసే వైద్యులే కావాలి. డాక్టర్లకేమో సాయంత్రానికి లక్షలు కావాలి.అందుకే ఒకరికొకరు సరిపోయారు.కానీ, హోమియో వంటి ఉన్నతమైన ఆశయాలతో పుట్టిన వైద్యవిధానాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్న నేటి హోమియోడాక్టర్లను చూచి హన్నేమాన్ ఆత్మ ఎలా క్షోభిస్తుందో నేనైతే ఊహించలేకున్నాను. నేటి డాక్టర్లకు ఆశ ఎక్కువ నైపుణ్యం తక్కువ. అందుకే హోమియోవైద్యం గురించి ప్రజలకు సరైన వాస్తవాలు తెలియని పరిస్తితి ఇంకా సమాజంలో ఉన్నది. 

మన దేశంలో హోమియో వైద్యరంగంలో మొదటితరపు దిగ్గజాల ఉత్తేజపూరిత జీవితాలు చదివి అయినా నేటితరపు డాక్టర్లు కొంత విలువలనూ, ఆశయాలనూ, నైపుణ్యాన్నీ నేర్చుకుంటే అదే పదివేలు. భారీ ఫీజులు వసూలు చేస్తే చేసారు, కనీసం శుద్ధమైన హోమియోపతిని వాడి ప్రజలకు వైద్యం చేసే డాక్టర్లు కొంతమంది అయినా తయారైనప్పుడే మళ్ళీ పాతకాలపు స్వర్ణయుగం హోమియో ప్రపంచంలో వస్తుంది. ఉన్నత ఆశయాలతో ఒక విప్లవాత్మకమైన వైద్య విధానాన్ని సృష్టించిన డాక్టర్ హన్నేమాన్ ఆత్మ కొంతైనా సంతోషిస్తుంది. కాని అంతటి నైపుణ్యాన్ని సాధించాలంటే, ఎంతో దీక్షతో పట్టుదలతో విలువలతో కూడిన అధ్యయనం ఉండాలి. నేటి డాక్టర్లకు అంతటి దీక్ష ఉందా అనేది నాకైతే అనుమానమే. 
read more " కార్పోరేట్ హోమియోపతి "

30, జనవరి 2012, సోమవారం

వీరవిద్యలు- వింతవాస్తవాలు

కుజప్రభావానికి మనమూ అతీతులము కాము కదా. కనుక కుజ కారకత్వాలలో ఒకటైన మార్షల్ ఆర్ట్స్ గురించి కొంత మాట్లాడుకుందాం.


మార్షల్ ఆర్ట్స్ ప్రపంచం కూడా మాయకు అతీతం ఏమీ కాదు. అందులో కూడా బోలెడంత మోసం ఉంది. కుళ్ళూ కపటమూ ఉన్నాయి. అదొక బిజినెస్. వందల సంవత్సరాల నాటి  మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో విలువలుండేవి. ఇప్పటి స్కూల్స్ లో అవి పోయి రాజకీయాలు పెరిగాయి. డబ్బులిస్తే బ్లాక్ బెల్ట్ లు పడేసే మాస్టర్లు బోలెడు మంది ఉన్నారు. అసలైన ఆర్ట్ ని నేర్పకుండా టోర్నమెంట్లు పెట్టుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్న మాస్టర్లు బోలెడు మంది ఉన్నారు. కొన్నాళ్ళు ఒక సంస్థలో నేర్చుకుని వేరు కుంపటి పెట్టుకున్న వాళ్ళు ఎందఱో ఉన్నారు. నేను  చెప్తున్నది ఒక ఇరవై అయిదేళ్ళ క్రిందటి మాట. ఆనాటి మాస్టర్లు చాలామంది స్కూల్స్ మూసేసి ఈనాడు ఇతర వ్యాపారాలలో స్తిరపడ్డారు. చాలామంది అమెరికాకు వెళ్ళిపోయి సాఫ్ట్ వేర్ రంగంలో స్తిరపడ్డారు. నాకు తెలిసిన హైదరాబాద్ మాస్టర్లు కొందరు   ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు.


బ్రూస్లీ పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వీరవిద్యలకు ఒకప్పుడు డిమాండ్ వెల్లువెత్తింది. కాని జనాలకు తెలియక కరాటే నేర్చుకోవడం మొదలు పెట్టారు. బ్రూస్లీ అభ్యాసం చేసింది కరాటే కాదు. అతను కుంగ్ఫూ నేర్చుకున్నాడు. తర్వాత చాలా దేశాల వీరవిద్యలనుంచి చాలా టెక్నిక్స్ కలగలిపి ఒక సాంబార్ వండాడు. దానిపేరు 'జీత్ కునే డో'. ఇదంతా జనాలకు తెలియక 1970 -80  దశకాల్లో  'కరాటే' విద్య వైపు పిచ్చిగా మళ్ళారు. అప్పట్లో మన దేశంలో కుంగ్ఫూ నేర్పేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. చాలామందికి కరాటే కుంగ్ఫూ విద్యల మధ్య తేడా తెలీదు. రెండూ ఒకటే అనుకునేవాళ్లు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.


కరాటేని దాదాపు పదేళ్ళు అభ్యాసం చేసిన తర్వాత  అదంటే నాకు మొహం మొత్తి ఇతర విద్యల వైపు మళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది - టోర్నమెంట్ కరాటే అసలు కరాటేనే కాదు. అదొక చెత్త. పాయింట్ సిస్టం పెట్టి శుద్ధమైన కరాటేని ఖూనీ చేశారు. కరాటే టోర్నమెంట్లలో  జరిగే రాజకీయాలు అన్నీఇన్నీకావు.అందులో కులమూమతమూ జోరబడ్డాయి. ప్రాంతీయాభిమానాలూ భాషాభిమానాలూ ఉన్నాయి. ఇక టోర్నమెంట్డలో డబ్బు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రేపు టోర్నమెంట్ అనగా రాత్రికి మాస్టార్ని బారుకు తీసుకుపోయి పార్టీ ఇచ్చి మందు పోయించి మర్నాడు పోటీలో మార్కులు కొట్టేసి పతకాలు సంపాదించిన ఘనులు నాకు తెలుసు. తాగి పడిపోయి టోర్నమెంట్ కి ఆలస్యంగా ఉబ్బరించిన మొహంతో వచ్చిన మాస్టర్లూ నాకు తెలుసు.


ఈ కుళ్ళుని అలా ఉంచితే, అసలు కరాటే సిలబస్ కూ, నేర్చుకున్న విద్యకూ, టోర్నమెంట్ లో జరిగే 'డాన్స్' కూ పోలికే ఉండదు. ఏళ్లకేళ్ళు కష్టపడి నేర్చుకున్న "కటాస్" టోర్నమెంట్లో ఎందుకూ పనికిరావు. కటాలలో నేర్చుకున్న ఏ ఒక్క టేక్నిక్కూ టోర్నమెంట్లో ఉపయోగపడదు. ఉపయోగపడని టెక్నిక్స్ అలా ఏళ్లతరబడి ఎందుకు నేర్చుకోవాలో ఏ ఒక్క మాస్టారూ చెప్పడు.చెప్పటానికి వాడికే తెలిసిచావదు. క్లాస్ లోనేమో గంటలుగంటలు చెమటోడ్చి ఒళ్ళొంచి కటాస్ నేర్చుకుంటారు.టోర్నమెంట్లో కొచ్చేసరికి కోతిలా ఎగురుతూ చెత్తచెత్త మూమెంట్స్ తో ఏవో మార్కులు కొట్టేయ్యాలని చూస్తారు. ఇది చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది. టోర్నమెంట్ కరాటేకూ నిజమైన కరాటేకూ పోలికే లేదు.


నిజమైన కరాటే ప్రాణాపాయ పరిస్తితుల్లోంచి పుట్టింది. ప్రాచీన జపాన్లో అది నేర్చుకోకపోతే సైనికుల చేతుల్లోనో బందిపోట్ల చేతుల్లోనో వాడికి చావు మూడినట్లే. కనుక చాలా సీరియస్ గా ఆ విద్యని నేర్చుకునేవారు.ఆనాటి అభ్యాస విధానాలు కూడా వేరు. ఈనాటి కరాటేని చూస్తె ప్రాచీన యోధులు 'ఇదొక వీరవిద్యా?' అంటూ నవ్వుతారు. అంత చెత్తగా తయారైంది నేటి కరాటే. టోర్నమెంట్ కరాటే అనేది కోతిగంతులు తప్ప ఇంకేమీ కాదు. టోర్నమెంట్లో మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళు స్ట్రీట్ ఫైట్ లో మామూలు మనుషులచేతిలో బాగా దెబ్బలు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. టోర్నమెంట్ కరాటే నిజజీవితంలో పనికిరాదు. ఈ విషయం అర్ధమైన తర్వాత నిజజీవితంలో స్ట్రీట్ ఫైట్ లో పనికొచ్చే కరాటే (లేదా ఇతర వీరవిద్యల) టెక్నిక్స్ మీద నా దృష్టి పెట్టడం సాగించాను. ఇదంతా 1980 -90 మధ్యలో జరిగింది. ఆ రోజుల్లో రోజుకు మూడు నాలుగుగంటల ప్రాక్టీస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి.


తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో నాకు నచ్చని ఇంకొక అంశం -- నాది 'ఫలానా స్టైల్' అని గిరిగీసుకోవడం.ఇది నాకస్సలు నచ్చేదికాదు. అందుకే అన్ని మార్షల్ ఆర్ట్స్ నుంచీ ఎన్నో టెక్నిక్స్ నేను అభ్యాసం చేసేవాణ్ణి.నా శిష్యులకు కూడా నేర్పించేవాణ్ని.నా శిష్యులలో మంచి ఫైటర్స్ చాలామంది ఉన్నారు. కాని ప్రాణవిద్యాస్థాయికి ఎదిగిన వాళ్ళు ఒక్కరూ లేరు.ఈ విషయంలో బ్రూస్లీని మెచ్చుకోవాలి. 'గిరి గీసుకుని కూచుంటే ఆ గిరి బయట ఉన్న విజ్ఞానం మనకు దూరం అయినట్లే' అని అతను భావించేవాడు. అందులో చాలా వాస్తవం ఉంది. ఒక రకంగా నేడు అమెరికాలో బహుళ ప్రచారంలో ఉన్న 'మిక్సేడ్ మార్షల్ ఆర్ట్స్ స్టైల్' (M.M.A)కు ఇతనే ఆద్యుడని చెప్పవచ్చు.


నేను నేర్చుకునే రోజుల్లో చాలామంది కొట్లాటకు పనికొచ్చే నాలుగు టెక్నిక్స్, నాలుగు కటాస్ నేర్చుకుని 'నాకు కరాటే వచ్చేసింది' అనుకునేవారు. నాకేమో అంతటితో సంతృప్తి ఉండేది కాదు. దీనిలో ఇంకా ఏదో లోతు ఉంది అని నా మనసుచెప్పేది. ప్రాణవిద్యా రహస్యాలు, మర్మవిద్యా రహస్యాలు ఎవరూ స్కూళ్ళలో చెప్పరేమిటి? అవన్నీ ఏమి పోయాయి?అని నాకు అనిపించేది. అసలైన రహస్యవిద్య ఇది కాదు, ఇంకేదో ఉంది అని నాకు లోలోపల అనిపించేది. అదొకటి ఉందని నాకు ఎవరో లోపల్నించి చెప్తున్నట్టు ఉండేది.


తర్వాత ఆ ఫీల్డ్ లో ఎంతో రీసెర్చి చేసిన అనంతరం మర్మవిద్యా రహస్యాలు నాకు అవగతమయ్యాయి. నేడు 4th degree, 5th degree black belts అని చెప్పుకునే వారికి కూడా ప్రాణవిద్యా  రహస్యాలు తెలీవని నేను గట్టిగా చెప్పగలను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్నవారికి కూడా మర్మవిద్యలో ఓనమాలు తెలియవు. అవి ఏ స్కూల్స్ లోనూ నేర్పరు. నేర్పడానికి అసలు వాళ్ళకే అవి తెలియవు. ఒక్క కేరళలోని 'కలరిపయట్' విద్యలో మాత్రం ఇంకా ఆ రహస్యాలు మిగిలి ఉన్నాయి. కాని వాటిని నేర్పే మాస్టర్లు అక్కడా అంతరిస్తున్నారు. వాటిని ఎవరికి పడితే వారికి చచ్చినా నేర్పరు. శిష్యుడిపైన ఎంతో నమ్మకం కుదిరితే కాని ఆ రహస్యాలు చెప్పరు. మర్మవిద్యతో పోలిస్తే నేటి కరాటే పరమచెత్తవిద్య అని నేను అనుభవ పూర్వకంగా చెప్పగలను. కాని అది నేర్చుకోవాలంటే ఒక ప్రాచీనకాలపు గురుకులంలో చేరి గురువుకు సేవచేస్త్తూ నిష్టగా విద్య నేర్చుకునే శిష్యుడికి ఉండే లక్షణాలు ఉండాలి.ఒక యోగవిద్యా సాధకుడికి ఏఏ నైతిక విలువలూ లక్షణాలూ ఉండాలో మర్మవిద్యా సాధకుడికి కూడా అవే ఉండాలి.ఆ స్థాయిలో విలువలు పాటిస్తూ అసలైన విద్యను నేర్చుకునే శిష్యులే ప్రస్తుతం లేరు. ఇదొక విచిత్ర సంకటంలా ఉంది. అర్హత ఉన్నవాడికే ఈ విద్యను నిస్వార్ధంగా నేర్పించాలి. ఆ అర్హత ఉన్నవాడు మాత్రం ఎక్కడా దొరకడు. చాలా విద్యలు ఇలాగే నశించి పోయాయని నాకు చాలాసార్లు అనిపిస్తుంది.


కేరళలో మర్మవిద్యా గురువులు ఎందఱో తమ రహస్యాలను ఎవరికీ చెప్పకుండా అలాగే వెళ్లిపోయారు. కొందరైతే తమ తాటాకు పుస్తకాలను కాల్చేసి మరీ చనిపోయారు. ఇదేంటి అని అడిగిన కొందరికి 'అర్హత ఉన్నవాడికి వాడి తపనే అంతా నేర్పిస్తుంది' అని మాత్రం చెప్పారుట. ఈ విషయం కేరళలో ఒక 'కలరి' లో విన్నాను.


నిజమైన తపన ఉన్నవాడికి, అది ఏవిద్య అయినా కావచ్చు, అందులో సంతృప్తి మాత్రం ఉండదు. ఉండకూడదు. అప్పుడే వానికి నిరంతర పురోగతి కొనసాగుతూ ఉంటుంది. ఒక విద్యను నేర్చుకోవాలంటే దానికోసం తపించాలి. గురువులకోసం వెదకాలి. సమయమూ ధనమూ వెచ్చించాలి. అదొక జీవితాశయంగా మారినప్పుడే ఇదంతా సాధ్యమౌతుంది. గ్రాండ్ మాస్టర్ ఒయామా అలాంటి తపనతోనే 'క్యోకుశింకై కరాటే'ను మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు అదీ ఒక నిర్బంధచట్రంలా తయారైంది. ఆ నిర్బంధం నచ్చని కొందరు దాన్నుంచి బయటకొచ్చి 'అషిహర కరాటే' మొదలు పెట్టారు. కొన్నాళ్ళకు అదీ నచ్చని ఇంకొందరు మళ్ళీ విడిపోయి 'ఎన్షిన్ కరాటే' మొదలు పెట్టారు.  ఇంతా చేస్తే మొదటి దాంట్లో మొద్దు బలానికీ లీనియర్ మూమెంట్స్ కీ ప్రాధాన్యత ఉంటె, రెండవ మూడవ స్టైల్స్ లో స్పీడ్ కీ సర్కులర్ మూమెంట్స్ కీ ప్రాధాన్యత  ఉంటుంది. ఇంతే తేడా. 'సబాకి' అనే టెక్నిక్ తోనే రెంటి మధ్యా తేడా వస్తుంది. ఈ 'సబాకి' అనే టెక్నిక్, కుంగ్ఫూ విద్యలోని 'వాటర్ ప్రిన్సిపుల్' నుంచి పుట్టింది. వైట్ క్రేన్,ప్రేయింగ్ మాంటిస్, వింగ్ చున్ మొదలైన కుంగ్ఫూ స్టైల్స్ లో ఇదే ప్రధానసూత్రం. ఇది సాప్ట్ స్టైల్స్ లో వాడేటటువంటి విధానం. హార్డ్ స్టైల్స్ కు ఇది తెలీదు.మరి రెండూ ఒకదానిలోనే ఎందుకు ఇమడలేవు?  లీనియర్ మూమెంట్స్, సర్కులర్ మూమెంట్స్, హార్డ్ టెక్నిక్స్, సాఫ్ట్ టెక్నిక్స్ ఒకే స్కూల్లో ఎందుకు కలిసిమెలిసి ఉండలేవు? అనేది నా ప్రశ్న. ఈ ప్రశ్నే నన్ను మార్షల్ ఆర్ట్స్ లో రీసెర్చికి పురికొల్పింది.


పందెపు ఎద్దులను కూడా ఒకే గుద్దుతో మట్టి కరిపించిన గ్రాండ్ మాస్టర్ 'ఒయామా'చివరికి హాంకాంగ్ లో ఒక బలహీనంగా కనిపిస్తున్న ముసలివాడి చేతిలో ఓడిపోయాడని చెప్తారు.ఆ ముసలివాడు 'తాయ్ చీ' విద్యలో అఖండుడు. అతని గురించి ఒయామా ఎంతో విన్నాడనీ, కాని అతనితో ఫైట్ చెయ్యాలని హాంగ్ కాంగ్ వెళ్ళిన ఒయామా,సన్నగా ఒక పేషంట్లా ఉన్న అతన్ని చూచి, అసలితను ఒక మాస్టరేనా అన్న అనుమానంతో, గుద్దితే అతను చనిపోతాడేమో  అన్న భయంతో,  ఫైట్ చెయ్యకుండా వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నాడనీ అంటారు.


"ఇక్కడి దాకా వచ్చావుకదా, 'తాయ్ చీ' ఎలా ఉంటుందో కూడా చూడు" అన్న ముసలిమాస్టర్ ఆహ్వానంతో బరిలోకి దిగిన ఒయామా కొద్ది నిముషాలలోనే, అతన్ని ఓడించడం అసాధ్యం అన్నసంగతి గ్రహించాడు.ఒయామా ప్రయోగించిన పంచెస్ కిక్స్ అన్నింటినీ ముసలిమాస్టర్ అతి సులభంగా న్యూట్రలైజ్ చెయ్యగలిగాడు. ప్రత్యేకమైన 'చెన్ స్టైల్ తాయ్ చీ' టెక్నిక్స్ ఉపయోగిస్తున్న ఆ ముసలి మాస్టర్ను ఒయమా గుద్దులు అసలు తాకలేకపోయాయి. చాలాసేపు ఫైట్ చేసిన అనంతరం 'ఒయామా' ఆయాసంతో కూలబడ్డాడు. కాని ముసలి మాస్టర్ మాత్రం నవ్వుతూ మామూలుగా ఉన్నాడు. 'ఈ రహస్యం ఏమిటి?' అని అడిగిన ఒయామాకు ' నీది మామూలు కండబలం.నాది ప్రాణశక్తి. అందుకే నువ్వు అలిసిపోతున్నావు. నాకు అలుపు లేదు.నీవి లీనియర్ మూమెంట్స్. నావి సర్కులర్ మూమెంట్స్.నీ శక్తిని నీవు ఉపయోగిస్తున్నావు.నేనేమో నీశక్తిని తిప్పి నీమీదే ప్రయోగిస్తున్నాను.నీ శక్తి ఖర్చై పోతున్నది. నా శక్తిలో మార్పు లేదు. అదీ మనిద్దరికీ తేడా.' అని 'తాయ్ చీ' మాస్టర్ జవాబిచ్చాడు. ఈ సంఘటన జరిగిన తరువాతే క్యోకుశిన్ కరాటేలో సర్కులర్ మూమెంట్స్ కి ప్రాధాన్యత పెరిగింది అని ఒక వాదన ఉన్నది. పాయింట్ అండ్ సర్కిల్ మెథడ్ మీదే క్యోకుశిన్ కరాటే ఆధారపడి ఉంటుంది.


కండబలం మీద ఆధారపడే మొద్దువిద్యలకూ, ప్రాణశక్తి మీద ఆధారపడే వీరవిద్యలకూ చాలా తేడా ఉంటుంది. అది విశ్వామిత్రుడికీ వశిష్టుడికీ  మధ్య ఉన్న తేడా లాంటిది. కండబలం త్వరగా వస్తుంది. త్వరగా పోతుంది. ప్రాణశక్తి త్వరగా రాదు. ఒకసారి పట్టుపడితే ఎన్నటికీ పోదు. కండబలానికి పరిమితులు ఉంటాయి.ప్రాణశక్తికి లిమిట్స్ లేవు. కండబలం తిండినుంచి,వ్యాయామంనుంచీ  వస్తుంది. ప్రాణశక్తి ప్రకృతిలో అమితంగా ఉంది. దాన్ని శరీరంలోనికి స్వీకరించే రహస్యం తెలిస్తే దానికి అంతంటూ ఉండదు. అదేన్నటికీ నశించదు కూడా.


కరాటే స్కూల్స్ మధ్యకూడా హార్డ్ సాఫ్ట్ అంటూ తేడాలు పెట్టుకుని గిరిగీసుకుని శత్రుత్వాలు పెంచుకుంటూ ఉంటారు.ఉదాహరణకి శోటోకాన్  కరాటే అనేది హార్డ్ స్టయిల్. గోజుర్యు కరాటే అనేది సాఫ్ట్ స్టయిల్. ఇలా గిరి గీసుకోవడం వల్లే ఒక స్కూల్ కీ, ఇంకొక స్కూల్ కీ  మధ్య గొడవలు విభేదాలు పెరిగిపోయాయి. అజ్ఞానంతోనే ఇలాంటి గిరి గీసుకోవడం జరుగుతుంది. ఇది మంచిది కాదని నా ఉద్దేశం.


ఏ హార్డ్ స్టైల్ అయినా సాప్ట్ స్టైల్ లో ఉన్న రహస్యాలు కూడా అవగతం చేసుకున్నప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుంది. ఎందుకంటే సాప్ట్ స్టైల్ అనేది ప్రాణవిద్య మీద ఆధారపడి ఉంటుంది.  మొద్దుబలం పనికి రాదు అన్న విషయం మనిషికి నిదానంగా తెలుస్తుంది. సాప్ట్ స్టైల్స్ అంత  త్వరగా పట్టు చిక్కవు.మామూలు కరాటేను నేర్చుకోవడానికి ఒక అయిదేళ్ళు సరిపోతే, సాఫ్ట్ స్టైల్ కరాటే నేర్చుకోవడానికి పన్నెండేళ్ళు పడుతుంది. అసలైన 'తాయ్ చీ' విద్యను ఫైట్లో సమర్ధవంతంగా వాడాలంటే వెయ్యిమందిలో ఒక్కరే ఆ పని చెయ్యగలరు.కారణం,వారికి ప్రాణశక్తి యొక్క రహస్య విజ్ఞానం అనుభవం లోకి రావాలి. అది అంత త్వరగా పట్టు చిక్కదు. దానికంటే జిమ్ కెళ్ళి కండలు పెంచడం అతి సులభం. ఆ కండలు మళ్ళీ కరిగిపోవడమూ అంతే త్వరగా జరిగిపోతుంది.


అందుకే నా అనుభవంతో నేను తయారు చేసుకున్న స్టయిల్ కి 'ఇంటెగ్రల్ మార్షల్ ఆర్ట్' అని పేరు పెట్టుకున్నాను. ఇదీ ఒక రకమైన మిక్సేడ్ మార్షల్ ఆర్టే అని చెప్పవచ్చు. యోగవిద్యా రహస్యాలు కలిసిన ఈవిద్య ఒక పరిపూర్ణ వీరవిద్య అని నేను భావిస్తాను. మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ఉన్న కుళ్ళు నన్ను ఈరకంగా కాపాడింది అని, అసలైన వీరవిద్యకోసం వెదికేలా చేసింది అనీ, నాదైన ఒకవిద్యను నాకు చూపింది అనీ ఎప్పుడూ అనుకుంటాను. చెడునుంచి  కూడా మంచిని తీసుకోవచ్చు అంటే ఇదేనేమో?
read more " వీరవిద్యలు- వింతవాస్తవాలు "

28, జనవరి 2012, శనివారం

కుజుని వక్రత్వ ఫలితాలు మొదలు

జనవరి 23న కుజగ్రహం వక్రగతిలో ప్రవేశించింది. అప్పటినుంచి ఏప్రియల్ 13 వరకూ ఈ వక్రత్వం కొనసాగుతుంది. ఫిబ్రవరి 8 నుంచి శని కూడా వక్రస్తితిలో ప్రవేసిస్తున్నాడు.మార్చి 13 న కుజరాహువులు సరిగ్గా కేంద్రదృష్టిలోకి వస్తారు.ఇప్పటినుంచి ఏప్రియల్ వరకూ  మధ్యలో ఉన్నకాలం మంచిదిగా కనిపించడం లేదు.


కుజుడు వక్రించి నాలుగురోజులు కాకముందే యానాంలో కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసకాండ జరగడం ఒక ఎత్తు అయితే ప్రజలే దొంగలలాగా మారి సెరామిక్ ఫేక్టరీని ధ్వంసం చేసి అందినమేరకు వస్తువులు దోచుకెళ్ళడం ప్రజల అనైతికప్రవర్తనకు అద్దం పడుతోంది.ఎదుటిమనిషికి  నీతులు చెప్పడం దానికి పూర్తిగా విరుద్ధంగా తాము  ప్రవర్తించడం నేటి భారతదేశపు జనజీవన విధానంలాగా కనిపిస్తోంది. మన దేశంలోని పరమ అధ్వాన్నపు లా అండ్ ఆర్డర్ పరిస్తితికి కూడా ఇదొక మంచి ఉదాహరణ. ఈ దేశంలో నాయకులూ దొంగలే, ప్రజలూ దొంగలే. అందుకే దొందూదొందే లాగా ఒకరికొకరు బాగా సరిపోయారు. ఎవరికి తోచినట్లూ చేతైనట్లూ వారు ప్రతిదాన్నీ చక్కగా దోచుకుంటున్నారు.


ప్రాచీనకాలంలో రాజులూ ప్రజలూ కూడా నీతిగా జీవించేవారు. రాజు ధర్మాన్ని తప్పేవాడు కాదు. కనుక ప్రజలు కూడా "యధారాజా తధాప్రజా" అన్నట్లు నీతిగా బ్రతికేవారు. తరువాత తరువాత నాయకులు నీతికి తిలోదకాలిచ్చారు. ప్రజలను భయపెట్టటం సాగించారు. కాని కొంతలో కొంత ప్రజలు నీతిగానే ఉండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం నాయకులూ ప్రజలూ అందరూ దొంగలయ్యారు. అవకాశం దొరకనంతవరకే ఎవరి నీతులైనా. అవకాశం దొరికితే మాత్రం ఎవ్వరూ దేనినీ వదలటం లేదు. అదీ ప్రస్తుత పరిస్తితి.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హింసకూ,విధ్వంసానికీ,యుద్దాలకూ కుజగ్రహంతో  సంబంధం ఉంది. మార్స్ అనే పేరు మీదనే యుద్ధవిద్యలకు మార్షల్ ఆర్ట్స్ అనే పేరు వచ్చింది. వీరుల జాతకాలలో కుజుని పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కుంగ్ఫూ వీరులు బ్రూస్లీ, జాకీ చాన్, జెట్లీల జాతకాలు  చూస్తే ఈ విషయం తేటతెల్లంగా కనిపిస్తుంది. అలాగే ప్రపంచయుద్ధాలు గమనిస్తే కూడా కుజుని పాత్ర కనిపిస్తుంది.


ఆ విషయం అలా ఉంచితే, మొన్న 23 తేదీన కుజుడు వక్ర స్తితిలో ప్రవేశించీ ప్రవేశించక మునుపే మళ్ళీ విధ్వంసకాండలు మొదలయ్యాయి.యానాంలో నిన్న జరిగిన విధ్వంసం చాలా దారుణమైనది.దానికి మనకు కనిపించే కారణాలు ఏమైనప్పటికీ,కుజవక్రత్వం యొక్క ప్రభావం మనుషులమీద ఈ విధంగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.ఇటువంటి సంఘటనలు రాబోయే మూడునెలలలో మరిన్ని జరుగవచ్చు అనడానికి ఇదొక సూచన మాత్రమే. ఈ ప్రభావంవల్ల హటాత్తుగా మనుషుల మూడ్స్ రెచ్చగొట్టబడే సంఘటనలు జరుగుతాయి. తద్వారా విధ్వంసం తలెత్తుతుంది.రాబోయే మూడునెలలలో ఏఏ తేదీలు ఎక్కువ ప్రమాదకారులో చూద్దాం.


ఫిబ్రవరి 7 న పౌర్ణమి వస్తున్నది. ఆరోజున వక్రకుజ చంద్ర రాహువులు నవాంశలో ధనుస్సులో ఉన్నారు. మిథునంలో కేతుగురువులున్నారు. కనుక ఆ తేదీకి అటూ ఇటూగా గొడవలు హింసా జరగవచ్చు. అవి మతపరమైనవి కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మర్నాటినుంచీ శని వక్రస్తితి మొదలు కాబోతున్నది. కనుక ఆ సమయంలో భూకంపాలు గానీ, వాయుయాన ప్రమాదాలు గానీ జరుగవచ్చు. ఫిబ్రవరి 21 అమావాస్య అయ్యింది.ఆరోజున నవాంశ చక్రంలో వక్రశని,వక్రకుజుడూ,రాహువూవృశ్చికంలో గుమిగూడారు.ఇది కుట్రలకూ విధ్వంసరచనకూ సూచిక. ఈ తేదీకి అటూఇటూగా కూడా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గొడవలు,విధ్వంసాలు జరిగే అవకాశాలున్నాయి. మార్చి 7,8 తేదీలలో వస్తున్న పౌర్ణిమ నాటి గ్రహస్తితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఆరోజున చంద్రుడు వక్రకుజునితో డిగ్రీయుతిలో ఉన్నాడు. బుధుడు నీచస్తితిలో ఉన్నాడు.రాహుకుజులమధ్యన ఖచ్చితదృష్టి ఉన్నది. నవాంశలో శని చంద్రులూ రాహువూ మళ్ళీ వృశ్చికంలో కలిశారు.రవి,కేతుగ్రస్తుడయ్యాడు.ఇదికూడా ప్రమాదసూచక సమయమే. ఈసమయంలో కళాకారులకూ, మేధావులకూ,ఉన్నతవర్గాలవారికీ ప్రమాదం పొంచి ఉన్నది.మార్చి 22  న వచ్చే అమావాస్యనాడు వక్ర బుదుడూ రవీ డిగ్రీ కన్జంక్షన్లో ఉన్నారు.నవాంశలో శని కుజులు వృశ్చికంలో ఉన్నారు. కనుక ఇదీ మంచిది కాదు.


ఈ మూడునెలలలో కుజుడు తాను ప్రస్తుతం ఉన్న ఉత్తరా నక్షత్రం నుంచి వెనక్కు వెళుతూ పూర్వఫల్గుణి, మఖా నక్షత్రాలలో సంచారం చేస్తాడు. ఉత్తరానక్షత్రం అధిపతి రవి కనుకనూ అగ్నితత్వరాశి అయిన సింహంలో ఉండటం వల్లనూ ప్రస్తుత ప్రమాదాలన్నీ అగ్నితత్వ ప్రధానంగా ( ఆస్తులు తగలబెట్టడం, పేలుళ్లు, దాడులు వగైరాలుగా)  ఉంటాయి. ప్రస్తుతం కుజుడు రాశి నవాంశలలో  తూర్పును సూచించే సింహ,ధనూ రాశులలో ఉండటం వల్ల తూర్పున ఉన్న యానాంలో ఈ విధ్వంసం జరిగింది.


కుజుడు పుబ్బానక్షత్రసంచారంలో ఉండే సమయంలో సినిమావారికి,కళాకారులకు,విలాసజీవితాలు గడిపే ఉన్నతవర్గాలవారికి ప్రమాదాలున్నాయి.మఖానక్షత్ర సంచారంలో హటాత్ ప్రమాదాలు, వాహనప్రమాదాలు, పేలుళ్లు, జలప్రమాదాలు వగైరాలు జరుగవచ్చు.ఆయా సమయాలలో కుజుని నక్షత్రపాదాల స్తితిమీదా, రాశి నవాంశలలో ఉన్న స్తితిమీదా,కుజునిపైన ఇతర గ్రహస్తితుల పైనా జరుగబోయే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.


మొత్తంమీద ఈమూడునెలలూ కుజప్రభావంవల్ల జనజీవనంలో విధ్వంసం తప్పదు అని జ్యోతిష్యపరమైన సూచన ఉన్నది.కుజుని వక్రస్తితి మొదలైనప్పటినుంచీ అక్కడక్కడా భూకంపాలు(మన ఆంధ్రాలోకూడా)కనిపిస్తూ ఉండటం గమనార్హం.ఈమూడునెలలూ ముఖ్యంగా పైతేదీలలో వాహనాలు స్పీడుగా నడపకుండా ఉండటం,దూకుడు తగ్గించుకోవడం,గొడవలకు దూరంగా ఉండటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం  జనులకు చాలా మంచిది. లేకుంటే చెడుఫలితాలు తప్పవనే చెప్పాలి.
read more " కుజుని వక్రత్వ ఫలితాలు మొదలు "

24, జనవరి 2012, మంగళవారం

మాయల మరాటీలు

"ఫలానా సామీజీ దర్శనం చేసుకుందాం వస్తారా ?" అడిగాడు మిత్రుడు. మిత్రుడి పేరును సంక్షిప్తంగా "కోపా" అని పిలుద్దాం.కోపా ఊళ్ళో అడుగుపెడితే నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు.ఎక్కడో ఒకచోట కలుసుకుని కొన్ని గంటలపాటు రకరకాల విషయాలమీద మాట్లాడుకోవడం జరుగుతుంది.ఎక్కువగా ఆధ్యాత్మికతే మా మాటల్లో దొర్లుతుంది.


"ఆయనంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు" చెప్పాను.


నా చిన్నతనంనుంచీ నిజమైన స్వాములను చూచి వారితో తిరిగి ఉండటంవల్ల, కొద్దిసేపు చూస్తె చాలు ఎవరు నిజమైన సాధువో ఎవరుకాదో నేను వెంటనే చెప్పగలను. కొద్దిసేపు వారి మాటలు వింటే చాలు, వారి ఆధ్యాత్మికస్థాయి ఎంతలో ఉందో కూడా నాకు తెలిసిపోతుంది అని వినమ్రంగా చెప్పగలను. ఇది గర్వంతో చెప్పేమాట కాదు.


చిన్నతనంనుంచీ స్వీట్ల మధ్య పెరిగినవాడు ఏ స్వీట్ ఎలాంటిదో చూచి టక్కున చెప్పగలడు. ఇదే సూత్రం బిజినెస్ కి కూడా వర్తిస్తుంది. చిన్నతనం నుంచీ ఒక బిజినెస్ రంగంలో తిరిగినవారు దానికి సంబంధించిన కిటుకులు టక్కున పట్టుకోగలరు.ఆరంగంలో ప్రవేశం లేనివారు ఆపని అంత సులువుగా చెయ్యలేరు.ఇదీ అలాటిదే.ఏరంగంలోనైనా అనుభవం ఉన్నవారికి దానివిషయం టక్కున తెలిసిపోతుంది.ఇది అనుభవంతో వచ్చే నైపుణ్యం.అంతేకాని ఇదేదో అతీతశక్తి అనుకోకూడదు.


చాలా ఆశ్రమాలలో జరిగే తంతులు నాకు అస్సలు  నచ్చవు.ముఖ్యంగా రాజకీయులకూ మతగురువులకూ ఉండే అక్రమసంబంధాలు,డబ్బుకోసం నడిచే దొంగనాటకాలు నాకు కంపరం పుట్టిస్తాయి. అందుకని నాకు ఆషామాషీ స్వామీజీలు నచ్చరు. నిఖార్సైన వజ్రంలా ఉండేవారినే నేను ఇష్టపడతాను.అలాటివారు ప్రస్తుతం ఎక్కడాలేరు. కనుక ప్రస్తుతసమాజంలో చెలామణీలో ఉన్న ఏస్వామీజీ అయినా సరే నాకొక బఫూన్ లాగే కనిపిస్తాడు.


కర్మకాలి ఇంతకు ముందు ఒకటి రెండుసార్లు ఈ స్వామీజీ ఆశ్రమానికి నేను వెళ్లి ఉన్నాను.ఆ సమయానికే జరుగుతున్న కొన్ని వ్యవహారాలు నా కంట పడటమూ, ఇక దానితో మళ్ళీ ఆ చాయలకు నేను వెళ్ళకపోవడమూ  జరిగింది. అదే విషయం కోపాతో చెప్పాను. "అలాటివి పట్టించుకోకూడదు. ఆ స్వామీజీకి మంత్రశక్తులున్న మాట నిజమే" అని కోపా అన్నాడు. "ఉంటే ఉంచుకోమనండి నాకు వాటిమీద పెద్దగా ఆసక్తి లేదు" అంటూ, పోనీలే అడిగాడు కదా ఒకసారి వెళ్లిచూద్దాం అనిపించి, "సరే మీతో కలిసి వస్తాలే" అని చెప్పాను. "నాకేమీ సందేహాలు లేవు. స్వామీజీని మీరే ఏమైనా అడగండి." అన్నాడు కోపా. "నాదీ అదే పరిస్తితి. మీరు రమ్మన్నారు కదా అని మీతో వస్తున్నాను. లేకుంటే నేనా చాయలక్కూడా వెళ్ళను." చెప్పాను.


"సరే రామకృష్ణుడు గొప్పవాడా షిర్డీసాయి గొప్పవాడా? రామకృష్ణునికి గుళ్ళూ గోపురాలూ ఎందుకు లేవు? బాబాకి ఎక్కడ చూచినా ఎందుకు ఉన్నాయి? అని అడుగుతాను. మీరు గమ్మున ఊరుకోండి." అన్నాడు. 


"అలాగే. నేనేమీ మాట్లాడను. కనీసం నేను ఫలానా అని పరిచయం కూడా చేసుకోను.లోప్రొఫైల్లో ఉంటాను." అని ఒప్పుకున్నాను. కాకపోతే ఆరోజున ఆదివారమూ అమావాస్యా అయి కూచుంది. "కనుక ఆరోజు అక్కడ క్షుద్రహోమాలు చాలా జరుగుతాయేమో, అక్కడికి వెళ్లి వాటిని, వాళ్ళ ముఖాలను చూచే ఖర్మ మనకెందుకు. ఇంకో రోజు వెళ్లి చూద్దాంలే." అని అన్నాను. వాళ్ళ ఆశ్రమానికి కోపా వెళ్లి కనుక్కుంటే ఆరోజుకి ఒక నలభైమంది  పనికిమాలిన జనం అప్పటికే స్వామీజీ దర్శనార్ధం వచ్చి ఉన్నారనీ, ఆరోజు ఆయన దర్శనం కుదరకపోవచ్చుననీ తెలిసింది. పైగా అప్పుడే ఒక రాజకీయప్రముఖుని నుంచి కబురువస్తే ఈ స్వామీజీగారు పరిగెత్తుకుంటూ రాజకీయ అధికారి దర్శనార్ధం వెళ్ళాడని కోపా ఫోన్లో చెప్పాడు. నాకు బాగా నవ్వొచ్చింది. ఈ స్వామీజీలు ఇలాటిచోట్లే అడ్డంగా దొరికిపోతారు. రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే స్వామీజీ గోచీ ఊడుతున్నా చూసుకోకుండా పరిగెత్తిపోవడం ఏమిటో నా మట్టిబుర్రకు ఎంత తన్నుకున్నా అర్ధం కాలేదు.


"సర్వసంగపరిత్యాగికి రాజకీయాలతోనూ, నైతికంగా కుళ్ళిపోయిన నాయకులతోనూ పనేమిటి? స్వామి దర్శనార్ధం వారురావాలి గాని వారు పిలిస్తే వీరు పరిగెత్తిపోవడం ఏమిటి?" అడిగాను.


"అంటే, వారికీ వీరికీ ఏవో కొన్ని పనులుంటాయి కదా? వాటికోసం కొన్నికొన్ని చెయ్యక తప్పదు". అన్నాడు కోపా.


"అలాటప్పుడు "సర్వసంగపరిత్యాగి""పరమహంస పరివ్రాజకాచార్య" అంటూ వారికివారే తగిలించుకునే బిరుదుల  ప్రయోజనం ఏమిటి?వారు దేనిని పరిత్యజించినట్లు? ఒకసారి ఇందిరాగాంధీ తన దర్శనార్ధం వస్తే కంచిపరమాచార్య ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దానికి కారణం ఆమె ఎమర్జెన్సీ విధించడమూ, ఆ సమయంలో జరిగిన అకృత్యాలూనూ. ఆయన ఉన్న పూరిగుడిసెలోకి తడికెతలుపు తోసుకుని ఆమె వెళ్ళలేక కొన్నిగంటలు బైటే వేచిచూచి చివరికి తన సెక్యూరిటీతో సహా వెనక్కు వెళ్ళిపోయింది. అదీ స్వచ్చమైన తపశ్శక్తి  అంటే. అంతేగాని రాజకీయనాయకులు పిలవగానే వీరు పరిగెత్తి పోవడం కాదు."అన్నాను.


"మీకు నేను చెప్పలేనుగాని, రేపు స్వామీజీ ఖాళీగా ఉంటే మనం వెళదామా?" అడిగాడు.


"అలాగే. ఆశ్రమం వద్దకు మీరు వెళ్లి ఆయన ఖాళీగా ఉంటే నాకు ఫోన్ చెయ్యండి. నేను వస్తాను." అని చెప్పాను.


సాయంత్రం ఆరు తర్వాత ఫోన్ మోగింది. "స్వామీజీ ఖాళీగా ఉన్నారు వచ్చెయ్యండి. మళ్ళీ కొద్దిసేపటిలో  ఆయన జన్మదిన సన్మానకార్యక్రమానికి వెళ్ళాలిట"  కోపా గొంతు మోగింది.


"స్వామీజీకి జన్మదినమా? అదేంటి?" మళ్ళీ నాకు సందేహం తలెత్తింది.


"అంటే ఆ పండుగను ఆయన చేసుకోకూడదు. భక్తులు చెయ్యవచ్చు." కోపా చెప్పాడు.


"రెంటికీ తేడా ఏంటి? ఆయన చేసుకున్నా వాళ్ళు చేసినా కార్యక్రమం జరుగుతుంది కదా?సన్యాసం స్వీకరించినవానికి సన్మానం ఏమిటి?జన్మదిన కార్యక్రమం ఏమిటి? ఇంకెక్కడి జన్మదినం? విరజాహోమంలో పాతజీవితం అంతా భస్మం అవ్వాలి కదా? అలాంటప్పుడు జన్మతేదీ ఎక్కడుంటుంది? దానికి మళ్ళీ సెలబ్రేషన్ ఏమిటి? "అడిగాను.


"బాబూ నీకు నేను చెప్పలేను గాని తొందరగా రా" అని ఫోన్లో వినిపించింది.నేను ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడేవో హోమాలూ అవీ మాంచి జోరుగా జరిగినట్లు పొగలు వస్తున్నాయి.అక్కడే బయట వేచి ఉన్న కొందరు పెద్ద మనుషుల్లా కనిపిస్తున్న వారిని "ఏమండీ స్వామీజీ ఉన్నారా? కలవొచ్చా?"అనడిగాను."ఆ! ఉన్నారు. ఎవరితోనో మాట్లాడుతున్నారు.వారోచ్చాక మీరు వెళ్లి కలవచ్చు." అన్నారు.


కోపా ఎక్కడా అని పరికించి చూచాను.స్వామీజీరూము బయట తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు.నన్ను చూచి నా దగ్గరకొచ్చి తానూ అదే చెప్పాడు.సరే నేను కూడా తనతో కలిసి ఆ తలుపు బయట కాపలా నిలబడ్డాను.మాతో బాటు ఎర్రటి బట్టలు వేసుకుని గడ్డం పెంచి పెద్ద బొట్టుతో ఒక మాంత్రికునిలాఉన్న ఒకవ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.


అలా కాసేపు ఆ పొగని భరిస్తూ నిలబడేసరికి, పంచె కట్టుకున ఒక ముసలిశాల్తీ తలుపు తోసుకుని బయటకొచ్చి "అందరూ ఒక పక్కగా నిలబడండి. ఏమిటిది అడ్డదిడ్డంగా నిలబడ్డారు?"అని కసురుకుంది.ఆ శాల్తీని నేను గుర్తుపట్టాను. కాని ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఒకానొక గురువుకు శిష్యున్నని చెప్పుకుంటూ వేదికలెక్కి ప్రేమతత్వం గురించి ఉపన్యాసాలు తెగదంచే మనిషి ఆయన. అనవసరంగా మమ్మల్ని అలా కసురుకోవాల్సిన అవసరం ఏమిటో నాకర్ధం కాలేదు. బహుశా ప్రేమతత్వం ఎక్కువైతే ఇలా వికటిస్తుందేమోలే అని సరిపెట్టుకున్నాను. సరే అందరం గోడకు ఆనుకొని బల్లుల్లా ఒకమూలకు నిలబడ్డాం.


అలా కొంతసేపు గేటుకాపలా కాసినతర్వాత, ఎర్రడ్రస్ మాంత్రికుడు లోపలకెళ్ళాడు.కోపాకూడా లోపలకి తొంగిచూచి నన్నూ రమ్మని సైగచేస్తూ లోపలకి అడుగుపెట్టాడు.సరే నేనూ లోపలకెళ్ళాను.ఇద్దరం ఒక పక్కగా నిలబడ్డాం. మాతోబాటు ఇంకా ముగ్గురు నిలబడి ఉన్నారు.స్వామీజీ ఒక ఫేము కుర్చీలాంటి దానిలో కూర్చుని ఉన్నాడు. ఆ ముగ్గురి వాలకమూ చూస్తే మేము తొందరగా బయటకెళితే ఏదో రహస్యవిషయం స్వామీజీతో మాట్లాడటానికి వేచి ఉన్నారని అర్ధమైంది. చేతుల్లో ఏవో సంచులు ఉన్నాయి.


ఎర్రగుడ్డల మాంత్రికుడు ఆయన ముందు నిలబడి ఏదో అడుగుతున్నాడు. "ఐశ్వర్యం వచ్చే మార్గం ఉపదేశించండి స్వామీ"అన్నట్లుగా నాకర్ధమైంది.స్వామీజీ ఇలా చెప్తున్నాడు.


"మీరు హోమాలు ఏమైనా చేస్తారా? బలులు ఇస్తారా?" అడిగాడు స్వామీజీ.


"చేస్తుంటాను. కాని బలి ఇవ్వను."మాంత్రికుడు చెప్పాడు.


"అదే మీరు చేస్తున్న పొరపాటు. హోమాలు చేసేటప్పుడు ఏదైనా బలి ఇవ్వాలి. లేకుంటే దేవతలు తృప్తి చెందరు.కనుక హోమంచేసి తర్వాత కూష్మాండంకాని గుమ్మడికాయకాని బలి ఇవ్వండి.తామరపూలతో హోమం చేస్తే మీకు ఐశ్వర్యం వస్తుంది.ఎర్రటి అన్నం మీకు మీరే దిష్టి తీసుకుని పక్షులకు వెయ్యండి."అంటూ ఈ ధోరణిలో ఏదేదో చెబుతున్నాడు.నాకు నవ్వు ఆగడం లేదు.బలవంతాన నవ్వు ఆపుకున్నా ముఖంలో  నవ్వు తెలిసిపోతోంది. "ఏంటి అందరూ భయభక్తులతో నిలబడి ఉంటే ఇతను ఇలా నవ్వుతున్నాడు?"అన్న భావంతో స్వామీజీ ఒకటి రెండుసార్లు నా వైపు తేరిపార  చూచాడు.


ఈలోపల కోపా వంతు వచ్చింది. ఆయన ఒకడుగు ముందుకేసి తన ప్రశ్న సంధించాడు. "స్వామీ. షిరిడీబాబా గొప్పవాడా? రామకృష్ణుడు గొప్పవాడా? బాబాకు గుళ్ళు విపరీతంగా ఉన్నాయి. రామకృష్ణునికి లేవు. ఎందుకలా?"


స్వామీజీ అసహనంగా చూచాడు.


"వాళ్లకి గుళ్ళు లేకపోతే మనకెందుకు?" అన్నాడు.


"అదికాదు స్వామి.ఈ సందేహం చాలాకాలం నుంచి నన్ను వేధిస్తున్నది." అడిగాడు కోపా.


"నువ్వడిగిన దానికి నేనొక ఉపన్యాసం చెప్పాలి. ఇప్పుడు  నాకంత టైం లేదు.జపం ధ్యానం చెయ్యి.నీకే అర్ధమౌతుంది."అన్నాడు స్వామీజీ.అలా అంటూ "ఇక మీరు వెళ్ళవచ్చు" అన్నట్లుగా ఒక అరటిపండు కోపా చేతిలో పెట్టాడు.


తేరగా డబ్బులు వచ్చి ఒళ్లో పడాలి అనడిగిన ఒకాయనకు బాగా వివరించి మరీ హోమాలు ఎలా చెయ్యాలో చెప్పాడు. ఒక మంచి ఫిలసాఫికల్ ప్రశ్న అడిగిన కోపా కేమో ఇలా అసహనంగా జవాబు చెప్పాడు. ఇదంతా నేను నవ్వుతూ చూస్తున్నాను.చేసేదిలేక కోపా వెనక్కితిరిగి బయటకొచ్చాడు. స్వామీజీకి ఒక నమస్కారం పడేసి నేనూ అనుసరించాను.


"ఎప్పుడూ స్వామీజీ బాగానే మాట్లాడతాడు.ఈసారి చుట్టూ మనుషులు ఉన్నారని నాతో అలా మాట్లాడాడు." అన్నాడు కోపా.


"పాపం ఆయనకొకపక్క సన్మానానికి టైం అవుతోంది. ఆయన తొందర ఆయనది. ఎంతైనా అన్నీ వదిలేసిన "పరమహంస పరివ్రాజకాచార్య" కదా.మన పిచ్చి ప్రశ్నలతో ఆయన్ను విసిగిస్తే ఎలా?మనం కూడా ఒక వెయ్యికోట్లు ఎలా తేరగావచ్చి వొళ్ళో పడతాయో అడిగితే మార్గం చెప్పేవాడు.ఇలాటి పిచ్చిప్రశ్నలు అడిగితే ఆయనకి కోపం రాదూ మరి." అన్నాను.


కోపా ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. సరే నేను వస్తానని చెప్పి నాదారిన నేను బయల్దేరాను.


నేటి స్వామీజీల తంతు ఇదీ.వాళ్ళు సంసారాన్ని వదిలామని చెప్పుకుంటారు.కాని అంతకంటే పెద్ద సంసారంలో చిక్కుకున్నారు.వాళ్ళకూ ఈషణత్రయంలో ఈతకొడుతున్న సామాన్యులకూ ఏమీ భేదం లేదు. ఒకరకంగా చూస్తే సామాన్యుడే మంచివాడు.తన స్తితిని తాను ఒప్పుకుంటాడు.కాని అన్నీ వదిలామనీ గురువులమనీ చెప్పుకుంటూ తద్భిన్నమైన జీవితాలు గడిపే స్వాములను ఏపేరుతో పిలవాలో అర్ధంకాదు.ఈతిబాధలకు తరుణోపాయాలు చెప్పేవాడు, సత్యాన్ని చెప్పనివాడూ,ఏమైనా కావచ్చు కాని సద్గురువూ జగద్గురువూ మాత్రం కాలేడు.సద్గురువైనవాడు పేరు ప్రఖ్యాతులకోసం ఏమాత్రం ఆరాటపడకుండా సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పాలి.అది ఇతరులకు నచ్చినా నచ్చకపోయినా సరే.ఒకరి మెప్పును ఆశించేవాడు సద్గురువు ఎలా అవుతాడు?


మౌనంగా ఆలోచిస్తున్న నాలో "సన్యాసం తీసుకోవడం కాదు. సన్యాసిగా మారాలి"అన్న రమణమహర్షి అమృతవాక్కులు గింగురుమన్నాయి.
read more " మాయల మరాటీలు "