“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఇండియా శాపం

షష్ఠగ్రహ కూటమి + సూర్యగ్రహణం వల్ల కరోనా వైరస్ పుట్టి అన్నిదేశాలనూ గడగడలాడిస్తోంది అని గతంలో వ్రాశాను. అది జ్యోతిష్యపరంగా ఇచ్చిన వివరణ మాత్రమే. అది అంతిమం కాదు. జ్యోతిష్యమూ, గ్రహాలూ మన కర్మను మోసుకొచ్చి మనకు అందించే ఏజంట్లు మాత్రమే. అవి కర్మను సృష్టించలేవు. మన జీవితాలను నిర్దేశించే అంతిమశక్తి మనం చేసుకున్న కర్మే. దానిని మనం అనుభవించక తప్పదు.

ఆర్ధికరంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా నేడు భయంతో గడగడా ఒణికిపోతూ ఉందంటే దానికి కారణం కరోనా వైరస్ కాదు. ఏ వైరసూ అనవసరంగా పుట్టదు. ఏ రోగమూ ఏ దురదృష్టమూ ఎవరికీ అనవసరంగా రాదు. దాని వెనకాల కర్మ లింకులుంటాయి. ఆద్యాత్మికదృష్టితో చూస్తె అవేంటో స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రస్తుతం చైనా అనుభవిస్తున్న శాపానికి కారణం ఏమిటో తెలుసా? పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తూ, ఇండియాకు వ్యతిరేకంగా పనిచెయ్యడమే ఈ శాపానికి గల కారణం. నవ్వొస్తోందా? నవ్వుకోండి. కానీ ఇది నిజం.

అది మనిషి కావచ్చు, దేశం కావచ్చు - అమాయకులని హింస పెడితే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది. నేను ఇంతకు ముందు ఎన్నో పోస్టులలో వ్రాశాను. మనిషి అతి చేస్తే, ప్రకృతి దెబ్బ కొడుతుంది. తప్పదు అని. దానినే ఇప్పుడు చైనాలో చూస్తున్నాం మనమంతా !

అంతేకాదు, ముందు ముందు సినిమా ఇంకా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు లక్ష బాతులను పంపిస్తోంది చైనా. ఎందుకు? పాకిస్తాన్లో పంటలను మిడుతలు పాడుచేస్తున్నాయట. ఆ మిడతలను తినే బాతులను చైనా సరఫరా చేస్తుందట. అవి మిడతలనే తింటాయో, ఇంకేం చేస్తాయో, వాటినుంఛి ఏ రోగం పాకిస్తాన్ కు పాకి, పాకీ దేశాన్ని ఏం చేస్తుందో ముందు ముందు చూద్దాం. అసలే బాతుమాంసం అంటే పాకీగాళ్ళకు చాలా ఇష్టమని విన్నాను ! మిడతల్ని బాతులు తినేలోపు ముందు బాతులు మిగలాలిగా ! 

పాకిస్తాన్ అనే దేశం టెర్రరిస్ట్ దేశం అనీ, దానికొక పద్ధతీ పాడూ లేదనీ, ఒక ప్లాన్ తొ కూడిన డెవలప్ మెంట్ లేదనీ ప్రపంచం మొత్తానికీ తెలుసు. దానికున్న ఏకైన అజెండా - ఇండియాతో శత్రుత్వం. కానీ ఆ దేశం ఎక్కడనుంచి పుట్టింది? ఇండియానుంచే పుట్టింది. ఆ విశ్వాసం దానికుందా? లేదు. పాలు త్రాగిన రొమ్మునే గుద్దడం అంటే ఇదే మరి ! అలాంటి నీచబుద్ధి ఉన్న దేశానికి ప్రకృతి ఏం శిక్ష విదిస్తుందో మనకింకా తెలీదు గాని, ప్రస్తుతానికి ఆ దేశానికి సాయం చేస్తున్న చైనాకు మాత్రం చావుదెబ్బ కొట్టింది ప్రకృతి !

ఇంతేనా ! ఇంకా ఉంది. వినండి.

రెండువందల ఏళ్ళ పాటు మనల్ని ఇష్టారాజ్యంగా దోచుకుంది బ్రిటన్. ఇప్పుడేమైంది? బ్రెగ్జిట్ అంటూ యూరోపియన్ దేశాలలో ఏకాకి అయి కూచుంది. ఒకపక్క స్కాట్ లాండూ, ఇంకో పక్క అయిర్లాండూ మేము విడిపోతాం ఎప్పటినుంచో అంటున్నాయి. బహుళజాతుల సమస్యలతో సతమతమౌతూ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసా? రెండువందల ఏళ్ళ పాటు ఇండియాను దోచుకుని అన్యాయం చేసిన ఫలితమే !

మనిషి జీవితంలో కర్మకు ప్రతికర్మ ఎలాగైతే ఉంటుందో, దేశాలకు కూడా అలాగే ఉంటుంది. అయితే, తప్పులు చేసేటప్పుడు మనిషికి ఎలాగైతే అర్ధం కాదో, పడేటప్పుడు మాత్రం ఏడుస్తాడో, దేశాలకు కూడా అంతే జరుగుతుంది. అదే ఇప్పుడు చైనాకు జరుగుతోంది. దాని ప్రభావంతో అన్ని దేశాలకూ వాత పడుతోంది.

అమెరికాలో ఆటోమొబైల్ పరిశ్రమ కుంటుపడింది. మొబైల్ పరిశ్రమ కుంటు పడింది. ఇన్ డైరెక్ట్ గా అన్ని పరిశ్రమలూ నెగటివ్ గా ప్రభావితం అయ్యాయి. ఎందుకంటే, ఆ స్పేర్ పార్టులు అన్నీ చైనానుంచి రావాలి. కరోనా దెబ్బకు అన్నీ మూతపడుతున్నాయి. ఇంకో వింత చెప్పనా ! కరోనా దెబ్బకు హైదరాబాద్ లో బార్బర్ షాపులకు పనిలేకుండా పోయింది.

ఈ మధ్యన కుర్రకారందరూ రాక్షసుల మాదిరి వికృతమైన హెయిర్ స్టైల్స్, గడ్డం స్టైల్స్ పెంచుతున్నారు. పాతకాలంలో విఠలాచార్య జానపద చిత్రాలలో రాక్షసులకు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఉండేవి. ఆ వెర్రి పోకడ ఇప్పటి కుర్రకారులో కనిపిస్తోంది. సరే అది వాళ్ళ ఖర్మ అనుకుందాం. అలాంటి గడ్డాలు పెంచితే కరోనా వైరస్ సోకే ప్రమాదం మామూలుకంటే కొన్నిరెట్లు ఎక్కువగా ఉంటుందట. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో, కుర్రకారందరూ రాక్షసిగడ్డాలు తీసేస్తున్నారు. అంటే, చైనాలో వచ్చిన వైరస్ దెబ్బకి, హైదరాబాద్ లో మంగలి షాపులకు పనిలేకుండా పోయింది. ఎంత విచిత్రం? కరోనా దెబ్బ, కర్మ దెబ్బ ఎలా ఉన్నాయో చూడండి మరి !

మొన్న ఒక డిన్నర్ కి వెళ్లాను. విచిత్రంగా అందులో చికెన్ అయిటంస్ లేవు. అందుకని అవి తినే ఫ్రెండ్స్ కొందరు చాలా బాధపడ్డారు. 'ఎందుకయ్యా చికెన్ లేదూ?' అంటే, కరోనా దెబ్బకి హైదరాబాద్ లో చికెన్ తినేవాళ్ళు తగ్గిపోయారని చెప్పారు. అదీ సంగతి ! వారానికి ఏడురోజులు చికెన్ తినే హైదరాబాద్ లో చికెన్ మాట దేవుడెరుగు, చివరకు ఎగ్స్ తినాలంటే కూడా భయపడుతున్నారు. అంటే, చావుకి ముడిపెడితేగాని మనిషి చెప్పినమాట వినడన్నమాట ! అందుకే అంటారు, భయంలాంటిది కాదు భక్తి అని. భక్తి చెయ్యలేని పనిని భయం చాలా తేలికగా చేస్తుంది. మంచిగా చెబితే విననప్పుడు కాల్చి వాత పెడితే చచ్చినట్టు వింటారు. అదీ సంగతి !

ఇదే కర్మవలయం అంటే ! అర్ధం చేసుకుంటే అంతా అర్ధం అవుతుంది. ఏం లేదని మన ఇష్టానుసారం చేస్తుంటే చివరకు వాత పడుతుంది. మనిషైనా అంతే, దేశాలైనా అంతే, ఇండియాకు ద్రోహం చేస్తున్న దేశాలకు ముందుముందు ఎలాంటి వాతలు పడతాయో మనమే చూస్తాం ! ఎందుకంటే మనమెప్పుడూ ఏ దేశాన్నీ దోచుకోలేదు. మన బ్రతుకేదో మనం బ్రతికాం. చేతనైతే మంచి చేశాం. లేకపోతే ఊరుకున్నాం. ప్రపంచానికి అత్యున్నతమైన ఆధ్యాత్మికతను ఇచ్చాం. కానీ మనల్ని మాత్రం అనేక దేశాలు దురాక్రమణ చేశాయి. దోచుకున్నాయి. దోచుకున్నది చాలక, ఇంకా ఇంకా నాశనం చెయ్యాలని చూస్తున్నాయి. ఒక్కొక్కదానికీ చక్కటి గుణపాఠం ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపు. కొంచం ఓపిక పట్టండి మరి !