“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఈరోజు వైద్యతపస్వి జన్మదినం

ఈరోజు వైద్యతపస్వి జన్మదినం. ఆయనెవరో కాదు హోమియోపతి సృష్టికర్త డా || శామ్యూల్ హన్నేమాన్. ఈయన గురించి ఎంతైనా అనుకోవచ్చు.ఒక్క మందును కనిపెట్టిన మనిషికి నోబెల్ ప్రైజ్ ఇస్తే నూరు మందులు కనిపెట్టిన మనిషికి ఏమివ్వాలి? డా || హన్నేమాన్ తన జీవితంలో నూరు మందులు కనిపెట్టాడు. మానవాళికి మహోపకారం చేసిన మనుషులలో హన్నేమాన్ పేరు నిజానికి ప్రధమస్థానంలో ఉండాలి. కానీ విచిత్రం ఏమంటే, ఈరోజున ఆయన్ను తలుచుకునే వాళ్ళే లేరు. అదీ విచిత్రమంటే !

అసలీ లోకమే పెద్ద దరిద్రపు విశ్వాసహీనమైన లోకం. మనుషులలో చాలామంది జంతువులే అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం. దీనికి తిరుగులేదు. ఎందుకంటే, మనుషుల్లో చాలామందికి విశ్వాసం ఉండదు. పొందిన మేలును గుర్తుంచుకునే తత్త్వం ఉండదు, కృతజ్ఞత ఉండదు, ఏది సత్యం ఏదసత్యం అన్న విచక్షణ ఉండదు, ఒకవేళ ఉన్నా సత్యాన్ని అనుసరించే ధైర్యం అసలే ఉండదు. వీళ్ళకు తెలిసిందల్లా సంపాదించడం, తినడం, బ్రతకడం, నిరర్ధకంగా చావడం. మరి ఇలాంటి చవకబారు జంతువులకి మానవాళి కోసం తపించిన నిస్వార్ధజీవులు ఎలా గుర్తుంటారు? వాళ్ళొక పనిలేని పనికిమాలిన పక్షులుగా వీళ్ళకు కనిపిస్తారు. ఏదో రకంగా డబ్బులు సంపాదించేవాడే ఈ చెత్తలోకం దృష్టిలో గొప్పవాడు. వాడెంత నిరర్ధకంగా బ్రతికినా సరే !

డా || హన్నేమాన్ లాంటి మహనీయులు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ లోకంలో జన్మిస్తారు. ఎందుకంటే, చీకటిలో కూడా ఎప్పుడో ఒకసారి మెరుపు మెరుస్తుంది కదా అలాగన్నమాట. కానీ విచిత్రమేమంటే మనిషి స్వార్ధానికి వాళ్ళ జీవితాలు బలై పోతుంటాయి. వారిని ఎవరూ గుర్తుంచుకోకపోగా తిట్టిపోస్తారు. ఇంతే లోకం తీరు. కానీ వాళ్ళిదంతా ఏమీ పట్టించుకోరు. అది వేరే విషయం అనుకోండి.  

హన్నేమాన్ బ్రతికున్న రోజులలో అతన్ని ఒక మాంత్రికుడని, సైతాన్ భక్తుడని ముద్రవేసి తరిమితరిమి కొట్టారు సాంప్రదాయ క్రైస్తవులు. ఇంకా నయం సజీవదహనం చెయ్యలేదు సంతోషం ! తనను తరిమేవారి బారినుండి తప్పించుకోవడం కోసం తన కుటుంబాన్ని తీసుకుని 36 ఊర్లు మారాడు ఆయన. ఎందుకోసం? తనకు అర్ధమైన ప్రకృతిసత్యాలను నమ్మి అనుసరించడం కోసం ! లోకం గుడ్డితనాన్ని తాను హర్షించలేక పోయినందుకు ! స్వార్ధంకోసం తన విలువలను వదిలిపెట్టకపోయినందుకు !

పోనీ ఇదంతా 250 ఏళ్ళ క్రితం జరిగిందిలే. ప్రస్తుతం మనం ఎంతో ఎదిగాం. 21 వ శతాబ్దంలో ఉన్నాం. మనకన్నీ తెలుసు అని విర్రవీగుతున్నాం కదా ! ఈ నాటికీ హోమియోపతి అనేది అసలొక వైద్యమే కాదని ప్రపంచమంతా నమ్ముతోంది. ఇదేం వింతో మరి? కాకపోతే ఎప్పుడు ఏ ఎపిడెమిక్ వచ్చినా హోమియోనే దిక్కూ మొక్కూ అవుతుంది మనకందరికీ ! ఇది ఇంకొక వింత !

'ఆ ! హోమియో పనిచెయ్యదు. అదొక వైద్యమే కాదు' అనేవాళ్ళు కూడా డెంగూలూ, చికన్ గున్యాలూ, కరోనాలూ వచ్చినపుడు మాత్రం హోమియో మందులే మింగుతారు. అప్పుడు వాళ్ళు కొన్ని సామెతల చాటున దాక్కుంటారు. వాటిల్లో ఒకటి - 'ఏ పుట్టలో ఏ పాముందో? చూద్దాం. చేస్తే మంచి చేస్తుంది. లేకపోతే ఉత్త చక్కెరమాత్రలే కదా సరదాగా చప్పరిద్దాం.' అంటారు. ఇలాంటి హిపోక్రైట్స్ ని చూస్తుంటే వీళ్ళనే అసలు సజీవదహనం చెయ్యాలన్నంత కోపం వస్తుంది నాకు. చెత్తమనుషులు ! చెత్తలోకం !

కరోనా కాటేస్తున్న ఈ రోజులలో కూడా, ఎన్నో దేశాలలో హోమియోను ఆదరిస్తున్న ఈ రోజులలో కూడా, హన్నేమాన్ నూ హోమియోనూ ఎవరూ తలచుకోకపోవడానికి కారణాలేంటి? ఒక్కటే కారణం. అదే ఫార్మా కంపెనీల లాబీయింగ్. ప్రపంచమంతా వీటి వ్యాపారగుప్పిట్లో చిక్కిపోయి ఉంది. అవి చేసే అబద్దప్రచారం వల్లనే హోమియో అంటే లోకంలో మూడనమ్మకాలు బలంగా పాతుకుని ఉన్నాయి. హోమియోడాక్టర్ల చేతగానితనం ఇంకొక కారణం అనుకోండి. మెరిట్ కి విలువ లేని మన విద్యావిధానం మరొక కారణం అనుకోండి. లక్ష కారణాలు !

ఫార్మాకంపెనీలు ఎంత బలమైనవంటే, ప్రభుత్వాలు కూడా అవి చెప్పినట్టే వింటాయి. వాటి వ్యాపారానికి ప్రభుత్వాలు కూడా తందానతాన అంటాయి. ఇంకా విచిత్రమేమంటే, కనీసం మన ప్రభుత్వం మన దేశం చాలా మంచివి. కనీసం హోమియో అనేది ఇక్కడ ఒక వైద్యంగా ఒప్పుకోబడింది. అనేక తెల్లదేశాలలో అయితే ఈనాటికీ అదొక కల్ట్ మెడిసిన్ గానే చూడబడుతోంది. ఇదే మానవాళి ఖర్మ.

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనా సృష్టి అనీ, దాని బిజినెస్ చేసుకోవడం కోసం ప్రపంచమీదకు దానిని వదిలింది చైనానే అనీ కొన్ని వర్గాలంటున్నాయి. కావచ్చు. చదరంగపు పావులకు గేమ్ ప్లాన్ అర్ధం కానట్లే, సామాన్య మానవులకు హైలెవల్లో జరిగే ప్లానులు అర్ధం కావు. వీడు గుర్రంలాంటి వాడు. కళ్లకున్న గంతల్లోంచి కనిపించే రోడ్డువరకే వీడి దృష్టి ఉంటుంది గాని అంతకు మించి ఉండదు. పొద్దున్న లేస్తే 'నా పాలపాకెట్టు రాలేదే' అన్నదే వీడి సమస్యగాని, పెద్దపెద్ద ప్లానులకు తను ఎలా బలౌతున్నాడో వీడికి అనవసరం. ఆఫ్ కోర్స్ ! తెలిసినా చేసేదేమీ లేదనుకోండి అది వేరే విషయం ! 

అసలిలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందో చెప్తా వినండి.

ప్రపంచంలో అన్నీ సవ్యంగా ఉంటే, మనిషి తన ఖర్మను తను అనుభవించేది ఎలాగ? నానా చెత్తపనులు చేస్తూ, ప్రకృతికి విరుద్ధంగా, దైవానికి విరుద్ధంగా బ్రతుకుతున్న మనిషికి తన పాపాలకు శిక్షలు పడేది ఎలాగ? ఎలాగంటే, సత్యం వాడి ఎదురుగా ఉన్నా కూడా వాడికి కనిపించకుండా ఉండాలి. దానిని వాడు గుర్తించలేకుండా ఉండాలి. అనుసరించలేకుండా ఉండాలి. సత్యం అని భ్రమిస్తూ అసత్యాన్ని వాడు అనుసరించాలి. దైవాన్ని పూజిస్తున్నా అనుకుంటూ సైతాన్ని వాడు పూజించాలి. అప్పుడే వాడి పాపం పండుతుంది. అప్పుడే వాడి ఖర్మను వాడు అనుభవించే పరిస్థితి తయారౌతుంది. లేకపోతే, అన్నీ సవ్యంగా అందుబాటులో ఉంటె వాడు నేలమీద నడుస్తాడా?

సరిగ్గా ఈ కారణం వల్లనే, వెలుగు ఎదురుగా ఉన్నా కూడా మనిషి చీకట్లోనే ఉంటాడు. చీకటినే వెలుగు అనుకుంటూ విర్రవీగుతూ ఉంటాడు. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసనుకుంటూ పొగరుగా ఎగురుతూ ఉంటాడు. నాశనమౌతూ ఉంటాడు. కర్మ ప్లాన్ ఇంతే. దైవన్యాయం ఇంతే. అందుకే ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇది మారదు. తెలివైనవాళ్ళు తాము మారాలి. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ చెత్తలోకంలో ఉన్నప్పటికీ దీనికి అంటకుండా ఉండాలి. అందరూ చీకట్లో ఏడుస్తున్నా తాము మాత్రం వెలుగులో నడవాలి. ఇదే ఈ ప్రపంచన్యాయం. ఇదే కర్మన్యాయం. ఇదే దైవన్యాయం.

అందుకే డా || హన్నేమాన్ లాంటి వాళ్ళు లోకానికి గుర్తుండరు. మరేం పరవాలేదు. సత్యాన్ని గుర్తించే అతి కొద్దిమందికి గుర్తుంటే చాలు. భర్త్రుహరి తన నీతిశతకంలో మహనీయులను గురించి చెబుతూ 'వసంతవత్ లోకహితం చరన్త:' అంటాడు. అంటే, మహనీయులైనవాళ్లు వసంతఋతువు లాగా చడీచప్పుడు లేకుండా వచ్చి లోకానికి వాళ్ళు చెయ్యవలసిన మేలును చేసి అలాగే నిశ్శబ్దంగా వెళ్ళిపోతారని అర్ధం. వసంతం రాకుంటే లోకం బ్రతకదు. కానీ వసంతం ఎందరికి గుర్తుంటుంది? ప్రతిదాన్నీ వాడుకుని వదిలేసే నీచమనస్తత్వం ఉన్న మనుషులలో ప్రకృతిపట్ల కృతజ్ఞత ఎందరికుంటుంది? ఎక్కడో కొద్దిమందిలో ఇది ఉంటే ఉంటుందేమో? హోమియోపతి కూడా అలాంటి విస్మృతవైద్య విధానమే. దానిని లోకం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. కానీ లోకానికి అది చేసే మేలును అది చేస్తూనే ఉంటుంది.

సత్యం ఈ లోకంలో ఎప్పుడూ మైనారిటీయేగా !