“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, మార్చి 2014, ఆదివారం

మలేషియా విమానం ఏమైంది?

పిబ్రవరి మార్చ్ నెలల జాతకాలు వేసినప్పుడు వాహన ప్రమాదాల గురించి యాక్సిడెంట్ల గురించీ, జననష్టం గురించీ ప్రస్తావించాను. అవి ఊహించినట్లే జరుగుతూ ఉండటం గమనించవచ్చు. జరుగుతున్న సంఘటనలను కనెక్ట్ చేసుకుని చూస్తే విషయాలు అర్ధమౌతాయి.

పోయిన శనివారం నాడు అదృశ్యమైన మలేషియా విమానం ఏమైందో ప్రశ్న ద్వారా చూద్దాం.అది ఆరోజున (అంటే మార్చ్ 8 న) 1.22 గంటలకు చివరిసారిగా ఫ్లైట్ కంట్రోల్ కు అందుబాటులో ఉన్నది.తర్వాత ఏమైందో తెలియదు.

దీనిగురించి చెప్పమని పంచవటి సభ్యుడు ఒకాయన పంపిన మెయిల్ ఈరోజు చూచాను.ఈరోజు ఉదయం 7.34 కి ప్రశ్న చక్రం వేసి పరిశీలించడం జరిగింది.దీనిని కొంత విశ్లేషణ చేద్దాం.

మీనలగ్నం సూర్యసహితమై ఉదయిస్తున్నది.జలతత్వ లగ్నం గనుక విమానం నీటిలో ఉన్నట్లు తెలుస్తున్నది.సూర్యుడు షష్టాదిపతి గనుక శత్రువుల కుట్రవల్ల ఈ ప్రమాదం సంభవించిందని సూచన ఉన్నది.

లగ్నంలో ఉన్న యురేనస్ లగ్నాధిపతి అయిన గురువుతో ఖచ్చితమైన కేంద్రదృష్టిలో ఉండటం వల్ల,అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా విమానం దారితప్పి కూలిపోయిందని తెలుస్తున్నది.అష్టమాదిపతి అయిన శుక్రునితో యురేనస్ అర్ధకోణదృష్టి గమనార్హం.ఇదికూడా ఇదే ఫలితాన్ని సూచిస్తున్నది.

లగ్నాధిపతి గురువు చతుర్దంలో ఉండటంవల్ల విమానం పాతాళంలో(అంటే నీటి అడుగున) ఉన్నదని తెలుస్తున్నది.చతుర్దానికి పాతాళం అని జ్యోతిష్య శాస్త్రంలో పేరున్నది.

అష్టమంలోని మూడు గ్రహాల(శని,రాహు,కుజ)కూటమి వల్ల ఘోరప్రమాదం జరిగిందని సర్వనాశనం అయిందని తెలుస్తున్నది.రాహువు,శని,కుజుడూ కలసినప్పుడు ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయని ఎంతోముందే హెచ్చరించాను.ఈ విషయం నేనేకాదు ప్రపంచం మొత్తంమీద ఎందఱో జ్యోతిష్కులు గమనించి ముందే హెచ్చరించారు.ఈ గ్రహకూటమి ఫలితంగా ప్రతిరోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉండటం నేడు మనం కళ్ళారా చూస్తున్నాం.దానిలో ఒకటే ఈవిమాన ప్రమాదం కూడా.

అయితే ఈ విమానం ప్రస్తుతం ఎక్కడున్నది అనేదే అసలైన ప్రశ్న.

ఈ చక్రంవరకూ మిధునం ఉత్తరదిక్కును సూచిస్తున్నది.అలాగే పాపగ్రహ కూటమి ఉన్న తులారాశి కూడా ఉత్తరదిక్కును సూచిస్తున్నది.లగ్నాధిపతి గురువు ఈశాన్యదిక్కుకు అధిపతి.పై గ్రహసూచనలను బట్టి ఈ విమానం ప్రస్తుతం మనకు ఉత్తరఈశాన్యంలో సముద్రంలో పడిఉన్నదని నేను ఊహిస్తున్నాను.మనకు ఉత్తరఈశాన్యం అంటే కాంబోడియా, థాయిలాండ్, బర్మా,ఇండియాల మధ్యన ఉన్న సముద్రప్రాంతం.

విమాన సమాచారం లోకానికి ఎప్పుడు లభిస్తుంది?

ఈరోజు ప్రశ్నసమయానికి శుక్రనక్షత్రమూ శుక్రహోరా జరుగుతున్నాయి. శుక్రుడు ప్రశ్నలగ్నానికి లాభస్తానంలో ఉన్నాడు.కనుక సమాచారం లభిస్తుంది.

సమాచార వ్యవస్థకు కారకుడైన బుధుడు ఎల్లుండి అనగా మార్చ్ 18 న రాహువుతో ఖచ్చితమైన డిగ్రీ కోణదృష్టిలోకి వస్తాడు.కనుక విమానం ఎక్కడుందో అప్పుడు లోకానికి తెలుస్తుంది.