28, అక్టోబర్ 2025, మంగళవారం
భయం భయం
26, అక్టోబర్ 2025, ఆదివారం
పిరమిడ్ పిచ్చోడు
మొన్న మధ్యాన్నం ఒకాయన్నుంచి వాట్సాప్ కాలొచ్చింది.
ఎవరో చూద్దామని ఎత్తాను.
పరిచయాలయ్యాక, 'నేను పిరమిడ్ చేస్తుంటాను' అన్నాడు.
వడ్రంగేమో అనుకుని, 'మాకు ప్రస్తుతం చెక్కపని అవసరం లేదు' అన్నాను.
అవతలనుంచి కాసేపు సైలెన్స్.
'అది కాదు, మెడిటేషన్' అన్నాడు సీరియస్ గా.
'ఓహో అదా? సరే. నాకెందుకు ఫోన్ చేశారు?' అడిగాను.
'మీరు ఫోర్తు లెవల్లో ఉన్నారు. ఫిప్త్ లెవల్ ఇనీషియేషన్ ఇవ్వమని మా గురువుగారు చెప్పారు. అందుకే ఫోన్ చేస్తున్నాము' అన్నాడు గంభీరంగా.
'ఎవరాయన? అడిగాను.
పేరు చెప్పాడు.
'ఆయన పోయాడుగా?' అడిగాను.
'కలలో కనపడి చెప్పారు. మాకు అలాగే చెబుతూ ఉంటారు' అన్నాడు.
'నాక్కూడా కనపడి, ఇదే ముక్క చెప్పి పుణ్యం కట్టుకోమనండి' అన్నాను.
'ఆయన్ని కలలో చూడ్డానికి మీ లెవల్ సరిపోదు' అన్నాడు.
'మరి ఆయన గురువే కనిపించాడుగా నాకు' అన్నాను.
'ఆయనకు గురువా? ఎవరు?' అడిగాడు.
'మీకు తెలీదా?' ఎదురు ప్రశ్నించాను.
'అవన్నీ మాకు చెప్పరు. అవసరమైనవి మాత్రమే చెప్తారు, ఆయన గురువెవరు?' అన్నాడు.
'లోబ్సాంగ్ రాంపా' అని ఒకడున్నాడులే. టిబెటన్ గురువు. 1978 లో నేను ఇంటర్ చదివే టైములో ఆయన పుస్తకం ఒకటి 'The Third Eye' అనేది చదివాను. ఆ రాత్రే నాక్కనిపించాడు కలలో' అన్నాను.
ఆగంతుకునిలో ఉత్సుకత పెరిగింది.
'అవునా సార్. ఏం చెప్పారాయన?' అన్నాడు.
'47 ఏళ్ల తర్వాత నువ్వు ఫోన్ చేస్తావని చెప్పాడు. ఆయన చెప్పింది నీ గురించేనా? నీ వయసెంత?' అన్నాను ఏకవచనంలోకి దిగుతూ.
నేను ఎగతాళి చేస్తున్నానని అతనికి అర్ధమైంది.
'మాస్టర్స్ తో చతుర్లొద్దు సార్' అన్నాడు కోపంగా.
' గ్రాండ్ మాస్టర్ తో అసలే వద్దు. వయసు చెప్పు ముందు ' అన్నాను.
' ముప్పై ఎనిమిది' అన్నాడు.
'అంటే, నువ్వింకా పుట్టకముందే మీ గురువుగారి గురువును నేను కలలో చూశాను. అర్థమైందా?' అన్నాను.
'నేను నమ్మను' అన్నాడు.
'నీ కలని నేను నమ్ముతున్నాగా. నా కలని నువ్వెందుకు నమ్మలేవు?' అడిగాను.
జవాబు చెప్పకుండా మాటమార్చి, 'పిరమిడ్ లోకి రావాలంటే అదృష్టం ఉండాలి' అన్నాడు.
'ఆ లెక్కన, చచ్చిన మమ్మీలన్నీ లక్కీ ఫెలోసేగా?' అన్నాను.
'మీ ఆశ్రమంలో కూడా ఒక పిరమిడ్ కట్టించండి, అప్పుడు తెలుస్తుంది దాని మహిమ' అన్నాడు.
'నేను ఫారోనీ కాను, మమ్మీనీ కాదు. మనిషిని. అందులోనూ భారతీయుడిని. ఈజిప్ట్ సమాధులు నాకెందుకు?' అన్నాను.
' మీకు పూర్తిగా జ్ఞానం తెలీదు. అందులో కింగ్స్ చేంబర్, క్వీన్స్ చేంబర్ అని ఉంటాయి. అక్కడ కూచుని మెడిటేషన్ చేసి చూడండి. తెలుస్తుంది' అన్నాడు.
'ఏం? కీప్స్ చేంబర్ ఉండదా?' అడిగాను.
'ఉండదు. ఒకసారి చెయ్యండి. యాస్ట్రల్ ట్రావెల్ లోకి వెళ్లకపోతే అప్పుడు చెప్పండి' అన్నాడు.
' నేను ప్రతిరోజూ చేసేపని అదేగా, నిద్రలో ' అన్నాను.
'అది వేరు. ఇది వేరు. మీకు పూర్తి నాలెడ్జి లేదు. అందుకే మీకు ఫిఫ్త్ లెవల్ ఇనీషియేషన్ ఇమ్మని మా గురువుగారి ఆజ్ఞ' అన్నాడు.
'సరే మీరింతగా చెబుతుంటే నాక్కూడా తీసుకుందామనే అనిపిస్తోంది. కాకపోతే ఒక కండిషన్. ఎలా ఇస్తారు? యాస్ట్రల్ బాడీతో ఇస్తారా, ఫిజికల్ బాడీతో ఇస్తారా?' అడిగాను.
'మీరెలా కావాలంటే అలా' అన్నాడు దర్పంగా.
'అలా అయితే, ఫిజికల్ బాడీతో గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఇవ్వండి. తీసుకుంటాను' అన్నాను.
'ఏంటి సార్. జోకులా?' అన్నాడు.
'కాదు. మేకులు. మూడే కొడతా. డైరెక్టుగా పరలోకమే' అన్నాను.
'అలా ఎవ్వరూ ఎగరలేరు' అన్నాడు.
'గలరు. మాస్టర్స్ అలా ఎగురుతారని మీ గుగ్గురువు రాంపా రాశాడు. కావాలంటే చదువుకో' అన్నాను.
'మరి నన్నేం చెయ్యమంటారిప్పుడు?' సంకటంలో పడ్డాడు.
'ముందు మీ డాబామీద కెక్కి, అక్కడనుంచి గాల్లోకి ఎగరడం ప్రాక్టీసు చెయ్యి. సక్సెస్ అయితే అలాగే ఎగురుకుంటూ నా దగ్గరికి రా. నేను రెడీగా ఉంటాను. ఒకవేళ కిందపడ్డావనుకో. అప్పుడెలాగూ యాస్ట్రల్ బాడీలోనే వస్తావు. ఐదర్ వే అయామ్ గుడ్' అన్నాను .
అవతల ఫోన్ కట్ అయిపోయింది.
'ఈ పిచ్చోడికి నా నంబర్ ఎవడిచ్చాడో? ఒకవేళ లోబ్సాంగ్ రాంపా ఇచ్చాడేమో?' అన్న అనుమానం నాలో తలెత్తింది.
'ఇవాళ రాత్రికి యాస్ట్రల్ ట్రావెల్లో వాడి పని చెప్తా' అనుకుంటూ ఫోన్ పక్కన పడేశా.
25, అక్టోబర్ 2025, శనివారం
కాపీ కష్టాలు
అసలే మేముండేది పొలిమేరలో.
ఇక్కడ దయ్యాలున్నాయని ఊరిజనం చెప్పుకుంటారు. కానీ నాకెప్పుడూ కనిపించలేదు. కనిపిస్తే వాటికి మోక్షం వస్తుంది కదా ! ఆరేళ్లక్రితం మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్ లో ఒక దయ్యానికి అలా మోక్షం వచ్చింది. అంత అదృష్టం ప్రతి గాలిదయ్యానికీ ఎలా పడుతుంది?
రాత్రుళ్ళు చీకట్లో తిరగడం నాకు బాగుంటుంది. అర్ధరాత్రిపూట అయితే ఇంకా బాగుంటుంది. ఒంటరిగా అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మా సెక్రటరీస్వామి ఇక్కడుంటే అలా చెయ్యనివ్వడు. గురువుగారికి ఏదో ఒక దయ్యం కనిపించి మోక్షం కొట్టేస్తుందని, నా వెంటే తనుకూడా ఒక కర్ర ఒక టార్చి తీసుకుని వస్తాడు. పక్కనెవరైనా ఉంటే అవి కనిపించవు. అందుకని సెక్రటరీస్వామి పనిమీద ఏదైనా ఊరికెళ్ళినపుడు ఇలాంటి సరదాలు తీర్చుకుంటూ ఉంటాను.
మొన్న అమావాస్య ఛాయలో ఒక రాత్రిపూట సరదాగా అలా తిరుగుతున్నా. చుట్టుపక్కల నరసంచారం లేదు. చిమ్మచీకటి, అప్పుడప్పుడూ అరిచే ఊరకుక్కలు తప్ప ఇంకేమీ కనుచూపుమేరలో లేవు. రోడ్డు పక్కన ఉన్న వేపచెట్లు జుట్టు విరబోసుకుని ఉన్న దయ్యాల్లా ఉన్నాయి. వాటిమధ్యలో రోడ్డుమీద నడుస్తూ పోతున్నా.
అప్పుడే, ఒక అనుకోని సంఘటన జరిగింది.
చాలా ఏళ్ల తర్వాత, ఒక చెట్టునీడలో నిలబడి కర్ణపిశాచి కనిపించింది. అది కనిపించి దాదాపు ఐదారేళ్లయి పోయింది.
ముందు ఎవరో పల్లెటూరి మనిషనునుకున్నా. కొంతమంది పొలాల్లో కాపలాగా పడుకుంటారు. 'అలాంటి ఎవరో అక్కడ నిలబడి ఉన్నారు' అనుకుని దాటి ముందుకు పోతున్నా. కానీ తననుండి వచ్చే ఒకవిధమైన వాసన 'తను తనే' అని పట్టించేసింది.
'చూశావని, గుర్తుపట్టావని అర్ధమైంది. నటించకు' అంది కాపీ, చెట్టునీడనుండి బయటకొచ్చి నాతో అడుగులేస్తూ.
మాటమాటకీ 'పిశాచి' అంటే బాగుండదు గనుక, ముద్దుగా 'కాపీ' అని పిలుచుకుందాం.
'ఎప్పుడో ఒకసారి కనిపిస్తే ఎలా గుర్తుపడతాను?' అడిగాను.
'నువ్వేగా, ఎప్పుడుపడితే అప్పుడు రావద్దన్నావు. అందుకే, అవసరమైన పనుంటే తప్ప రావడం లేదు' అంది.
'సరే. ఇంతకంటే మంచిముహూర్తం దొరకలేదా నీకు? అమావాస్య ఛాయలో కనిపించావ్?' అన్నాను.
'మాకిదే మంచిటైము. అందుకే ఈ టైంలో వచ్చా. అయినా, నువ్వేంటి? హాయిగా నిద్రపోకుండా, ఇంత రాత్రిపూట తిరుగుతున్నావ్? అవున్లే మొన్న రాశావుగా 'ఇది నా కర్మ' అని. మళ్ళీ అడగటం నాదే తప్పు' అంది.
'తెలిసీ అవే తప్పులు ఎందుకు చేస్తున్నావ్ మరి?' అందామని నోటిదాకా వచ్చినా, కాపీ కదా అని భయమేసి, 'అబ్బో, బ్లాగులు కూడా చదూతున్నావా?' అడిగా.
'అన్నీ తెలుసు మాకు, ఈ మధ్య రాయట్లేదుగా నువ్వు?' అంది నవ్వుతూ.
'సర్లే దానికేంగాని, సంగతులు విశేషాలు చెప్పు' అన్నా నడుస్తూ.
తను కొంచం ఒళ్ళు చేసింది. స్పీడుగా నడవలేకపోతోంది.
నా ఆలోచనని పట్టేసి, 'ఈ మధ్య యోగా చెయ్యడం లేదు. మళ్ళీ మొదలుపెట్టాలి. అస్సలు టైముండటం లేదు. దేశాలు తిరగటమే సరిపోతోంది' అన్నది.
'జోకు బాగుంది. నాకు పోటీ వస్తున్నావ్. అమెరికా సంగతులు చెప్పు' అన్నా.
'ఏముంది? నీ పాత శిష్యురాళ్ళు ఇద్దరికి కష్టకాలం నడుస్తోంది' అంది.
'ఆహా' అన్నా తెలిసినా తెలీనట్టు.
'పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ళతో సమస్యలు. చాలా బాధల్లో ఉన్నారు' అంది.
'ఎవరు వాళ్ళు?' అడిగా అర్ధం కానట్టు.
'నటించకు. 12 ఏళ్ళు వెనక్కి వెళ్లి గుర్తుతెచ్చుకో' అంటూ ఇద్దరి పేర్లు చెప్పింది.
'ఓ. వాళ్ళా? ఇలా అవుతుందని అప్పుడే చెప్పా. వినలేదు. నేనేం చెయ్యను?' అన్నాను.
'అయినా ఒకప్పటి నీ శిష్యురాళ్లే కదా ! ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా నీకు? వాళ్ళలా కష్టాలు పడుతుంటే పట్టించుకోవా?' అడిగింది కోపంగా.
'వినేవాళ్ళనైతే పట్టించుకోవచ్చు. అన్నీ మాకు తెలుసనుకునేవాళ్ళకి చెప్పడం దేనికి? అయినా, లోకానికి బోధలు చేసేవాళ్ళు, తమ పిల్లల బాగోగులు చూసుకోలేరా?' అడిగాను.
'నీకు పరిచయం ఉన్న రోజుల్లో, వాళ్ళు పిల్లలు. ఇప్పుడు పెద్దలయ్యారు. అది అమెరికా. ఇంకా చెప్పమంటావా అక్కడి కష్టాలు?' అంది.
'ఒద్దులే. అర్ధమైంది. అక్కడి కష్టాలూ తెలుసు, సుఖాలూ తెలుసు. అయినా, ఒకళ్ళకి నేనేం సాయం చెయ్యగలను చెప్పు? ఒక సివిల్ సర్వెంట్ గా రిటైరైన నేనే అర్ధరాత్రిళ్ళు ఇలా తిరుగుతున్నాను. అయినా, చెప్తే వినేరకాలా నా శిష్యురాళ్ళు?' అన్నా.
మాటల్లోనే పక్కఊరు వచ్చేసింది. ఊరు నిద్రలో జోగుతోంది. కుక్కలు అరుస్తున్నాయి.
వెనక్కు తిరిగాం.
' మరి 'సంగతులేంటి?' అని ఎందుకడుగుతావ్? ఏమీ చెయ్యనోడివి?' అంది చనువుగా.
'ఊరకే. న్యూసు తెలుసుకుందామని అడుగుతా. అపాత్రదానం చెయ్యకూడదు కదా. అయినా, అంత వేదాంతం తెలిసినోళ్లకి కష్టాలేముంటాయి? 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్' అని పాడుకోమను. సరిపోతుంది' అన్నా.
'అంతేలే. నువ్వడిగావని వాళ్ళ న్యూసు చెప్పా. నాకెందుకు వాళ్ళ గోల? వేరే పనుంది. నా కష్టాలు నావి. ఈ మధ్య ఓటీ కూడా చెయ్యాల్సొస్తోంది' అంది మాయం కావడానికి రెడీ అవుతూ.
'ఏమైంది?' అన్నా.
'రాష్ట్రాలు విడిపోయాక కొంత వర్క్ లోడు తగ్గుతుందని సంబరపడ్డా. తెలంగాణా కాపీ మాటమాటకీ లీవు పెడుతోంది. దాని పని కూడా నేనే చెయ్యాల్సొస్తోంది' అంది విచారంగా.
'అలాగా. ఎక్కువ నటించకు. నమ్మేగలను. నీకూ మంచిరోజులొస్తాయిలే. ఓపికపట్టు' అన్నా.
'నీకేం? ఎన్నైనా చెప్తావ్? మా బాధలు మావి' అంది.
'సర్లే. ఒంటరి ఆడపిల్లవి. ఇండియాలో రాత్రిపూట తిరక్కు. అసలే లోకం బాలేదు' అన్నా నవ్వుతూ.
'నువ్వూ నీ జోకులు. నువ్వేం మారలేదు ఈ ఆరేళ్లలో' అంది.
'నువ్వు మారావా?' అడిగా నవ్వుతూ.
'సర్లే. అవన్నీ మళ్ళీ వచ్చినపుడు మాట్లాడుకుందాం. టాటా' అని నవ్వుతూ మాయమైంది కాపీ.
వెనక్కు నడుస్తున్న నా ఆలోచన పన్నెండేళ్ళు వెనక్కు పోయింది. అప్పటి సంగతులు, నేను వాళ్ళకిచ్చిన సలహాలు, వాళ్ళు వినకపోవడం, విడిపోవడం, చాలా గుర్తొచ్చాయి.
'ఎక్కిన పొగరు దించడానికే కష్టాలొచ్చేది. ఎవరేం చెయ్యగలరు? ఎవరి కష్టాలు వాళ్ళవి. పడండి' అనుకుంటూ ఆశ్రమం వైపు అడుగులేశా.
23, అక్టోబర్ 2025, గురువారం
వాయువును బంధిస్తా
'ఒక పెద్దాయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు' శిష్యుడినుంచి ఫోనొచ్చింది.
'ఎవరాయన?' అన్నాను.
' మనకు పరిచయం లేదు. 75 పైనే ఉంటాయి ' అన్నాడు.
' అవసరం లేదు. ముందు మన బుక్స్ చదవమను ' అన్నాను.
' ఆయన గత 20 ఏళ్ళనుంచి ఆధ్యాత్మికమార్గంలోనే ఉన్నాట్ట, ఆ పుస్తకాలూ గట్రా తనకవసరం లేదన్నాడు' అన్నాడు.
' మరెందుకు కలవడం?' అన్నాను.
' పంచవాయువులలో నాలుగింటిని బంధించడం వచ్చేసిందట. ఒక్కదాన్ని మాత్రం బంధించలేకపోతున్నాడట. అది మీ దగ్గర నేర్చుకోవాలని కోరిక ' అన్నాడు.
' అపానవాయువునా?' అడిగాను.
' ఏమో మరి. నాతో చెప్పలేదు ' అన్నాడు శిష్యుడు.
' అదైతే అస్సలు రావద్దని చెప్పు. మనం భరించలేం ' అన్నాను.
' వాయుబంధనం కావాలట' అన్నాడు.
' దానిని ప్రత్యేకంగా నేర్చుకోవడమెందుకు? ఎలాగూ 75 దాటాయంటున్నావు. కొన్నేళ్లు ఓపిక పడితే సహజంగానే అవుతుంది' అన్నాను.
' ప్రకృతిలో కలిసిపోవాలని ఉందిట' అన్నాడు.
' అన్నింటినీ బిగబడితే జరిగేది అదే. అంత తొందరెందుకు?' అన్నాను.
' ఏమో మరి?' అన్నాడు శిష్యుడు
' అదేదో వాళ్ళింట్లోనే కలిసిపొమ్మను. ఇక్కడికొచ్చి ఆశ్రమంలో పోతే మళ్ళీ అదొక కేసవుతుంది. మనకెందుకా గోల? ' అన్నాను.
' ఏం చెప్పమంటారు ఆయనకీ?' అడిగాడు.
' రెండ్రోజుల్నించీ వానలు పడి గురువుగారు జలబంధనంలో ఉన్నారు. అవి తగ్గాక వాయుబంధనం గురించి ఆలోచిస్తానన్నారని చెప్పు' అని ఫోన్ పెట్టేశాను.
ఎన్ని రకాల పిచ్చోళ్ళురా బాబూ ఈ లోకంలో?
22, అక్టోబర్ 2025, బుధవారం
నిమ్మకు నీరెత్తిన సర్వీస్
నిన్న పనుండి ఒక ఫ్రెండ్ కి కి ఫోన్ చేశాను.
మాటల సందర్భంలో, 'ఇవాళంతా చాలా గందరగోళంలో ఉన్నాం' అన్నాడు.
వీడు రిటైరై కూడా ఏదో కంపెనీలో చేరి ఇంకా పని చేస్తున్నాడు. ఎవడిగోల వాడిది !
'ఏం?' అన్నాను.
'AWS గురించి విన్నావా?' అని అడిగాడు.
'తెలుసు' అన్నాను.
'ఏంటో చెప్పు' అడిగాడు నవ్వుతూ.
అంటే, నేనీ మూల ఉన్నాను కాబట్టి, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో నాకు తెలీదని వీడి నమ్మకం.
'ఆల్ వర్రీ సర్వీస్' అన్నాను.
'కాదు. అమెజాన్ వెబ్ సర్వీస్' అన్నాడు.
'అయితే ఇప్పుడేమంటావ్?' అడిగాను.
'ఔటేజి వచ్చింది. లక్షలాదిమందికి ఇబ్బంది. మేము కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం' అన్నాడు.
'సరే పడు' అన్నాను.
'నీకీ బాధ లేదేమో హాయిగా ఉన్నావ్' అన్నాడు.
'అవును నా దగ్గర NWS ఉంది' అన్నాను.
'అంటే నో వర్రీ సర్వీసా' అడిగాడు.
తెలివైన బుర్రే.
'అవును. ఆ తర్వాత NNS' అన్నాను.
'అదేంటి?' అడిగాడు.
'చెప్పుకో చూద్దాం' అన్నాను
'అంత టైం లేదు. నువ్వే చెప్పు' అన్నాడు.
'నిమ్మకు నీరెత్తిన సర్వీస్' అన్నాను.
'జోకులాపు. ఇంతకుముందు ఇలాంటివి వస్తే పోస్టులు రాసేవాడివి. ఇప్పుడు రాయడం లేదు. రెమెడీలు చెప్పడం లేదు. ఎందుకు?' అడిగాడు.
'అవసరం అనిపించడం లేదు. చెప్పాల్సినవాళ్ళకి చెబుతున్నాను. అందుకోగలిగిన వాళ్ళు అందుకుంటున్నారు' అన్నాను.
'మాక్కూడా నేర్పవచ్చు కదా NWS?' అడిగాడు.
' ఈ జన్మలో నీ వల్లకాదు. చివరిక్షణం వరకూ ఉద్యోగం చేసుకో' అన్నాను.
'ఎందుక్కాదు? నేర్పడం నీకిష్టం లేదని చెప్పు' అన్నాడు.
'సరే నేర్పిస్తాను, రాత్రికి బయల్దేరి రేప్పొద్దున్నకల్లా ఇక్కడుండు' అన్నాను.
' అంటే... మా బాస్ కి ముందుగా చెప్పాలి. ఇంత సడన్ గా అంటే ఒప్పుకోడు. పైగా ప్రస్తుతం గందరగోళంలో ఉన్నాం' అన్నాడు.
'అందుకే అన్నాను. నీ వల్లకాదని. ఆ ఊబినుంచి నువ్వీ జన్మకి బయటపడలేవు' అన్నాను.
'పోనీ తర్వాత వీలు చూసుకుని రమ్మంటావా?' అడిగాడు.
'నీకు వీలైనప్పుడు నాకు వీలు కావద్దా?' అన్నాను.
'మరెలా?' అన్నాడు.
'ఈ సమస్య తెగేది కాదు. ఫోన్ పెట్టేసి పని చూసుకో' అని ఫోన్ కట్ చేశాను.
20, అక్టోబర్ 2025, సోమవారం
రెమెడీ చెప్పమంటావా?
ఇవాళ మా ఫ్రెండ్ మరొకడు ఫోన్ చేశాడు.
'25 వ తేదీ దగ్గరకొస్తోంది. గుర్తుందిగా?' అడిగాడు.
'గుర్తుంది' అన్నాను.
'మరొస్తున్నావా హైద్రాబాద్?' అడిగాడు.
'రావడం లేదు' అన్నాను.
'మొన్న వస్తానని చెప్పావుగా మన ఫ్రెండ్ తో?' అన్నాడు.
'ఇప్పుడు రానంటున్నాను' అన్నాను.
'అదేంటి రోజుకోమాట చెప్తావ్?' అన్నాడు.
'మాటమీద నిలబడటం నాకలవాటు లేదు. నేలమీద మాత్రమే నిలబడతాను' అన్నాను.
ఇలా కాదనుకున్నాడో ఏమో మాట మార్చి, 'ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు?' అన్నాడు.
'ఖాళీగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అన్నాను.
'బోరు కొట్టడం లేదా?' అన్నాడు.
'కొడదామని చూస్తోంది. అది కొట్టేలోపు నేనే కొట్టేస్తున్నాను, మార్షల్ ఆర్ట్స్ ఇలా ఉపయోగపడుతోంది' అన్నాను.
'జ్యోతిషం నేర్చుకున్నావుగా. కనీసం అందరికీ రెమెడీలు చెబుతూ ఉండు. సోషల్ సర్వీసు చేసినట్టు ఉంటుంది' అన్నాడు.
' సర్వీసు పూర్తయింది. ఇక చెయ్యను' అన్నాను.
'పోన్లే నీ ఇష్టంగాని, మా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఇంకంటాక్స్ డిపార్ట్ మెంటులో పెద్ద పొజిషన్లో రిటైరయ్యాడు. సంపాదించిందంతా షేర్లలో పెట్టాడు. అంతా పోయింది. మిగిలిన డబ్బుని ఇంకొక ఫ్రెండ్ చేస్తున్న బిజినెస్ లో పెట్టాడు. ఇప్పుడు వాడు వడ్డీ ఇవ్వడంలేదు. అసలుకూడా ఇవ్వడం లేదు. ఏం చెయ్యమంటావో రెమెడీ చెప్పు. ప్లీజ్' అడిగాడు.
'మీ ఫ్రెండ్ ఎక్కడుంటాడు?' అడిగాను.
'కేరళలో' అన్నాడు.
'అక్కడ ముళ్లపెరియార్ డ్యాం అని ఒకటుంటుంది' అన్నాను.
'అయితే?' అన్నాడు అనుమానంగా.
'అందులో దూకి చావమను. భూమికి భారం తగ్గుతుంది' అన్నాను.
'అదేంటి అంత మాటనేశావ్?' అన్నాడు.
'అవినీతి సంపాదన అలాగే పోతుంది. కనీసం కష్టార్జితమైనా తన కుటుంబం కోసం మిగుల్చుకుందామన్న జ్ఞానం లేని దురాశాపరుడికి, ఇదే సరైన రెమెడీ. వెంటనే వెళ్లి దూకమను. లేటైతే వాటర్ లెవల్ తగ్గుతుంది' అన్నాను.
'ఇదా నువ్వు నేర్చుకున్న జ్యోతిషం?' అన్నాడు చనువుగా.
'అవును. దొంగలకు రెమెడీలు చెప్పకూడదని నేర్చుకున్నాను. రిటైరయ్యాక మీ ఫ్రెండ్ గాడికి అంత దురాశ అవసరమా?' అన్నాను.
మాటమార్చి 'నేను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాను. గుళ్ళు తిరుగుతున్నాను' అన్నాడు.
'మంచిదే. నీ ఓపిక' అన్నాను.
'నీకు నాడీజ్యోతిషం వచ్చా?' అడిగాడు.
'వచ్చు' అన్నాను.
'ఈ మధ్యనే నాడీజ్యోతిషం చూపించుకున్నా' అన్నాడు.
'ఎక్కడ? వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళావా?' అడిగా.
'కాదు. ఇక్కడే తాంబరంలో. ఇక్కడ వాళ్ళ బ్రాంచి ఉంది. నాకు 80 ఏళ్ళు ఆయుష్షని చెప్పాడు. శివుణ్ణి పూజచేస్తే ఇంకో ఐదేళ్లు ఎక్కువ బ్రతుకుతావన్నాడు. అందుకే తమిళనాడులో శివాలయాలు తిరుగుతున్నా' అన్నాడు.
'అంత కష్టపడి ఇంకో ఐదేళ్లు బ్రతక్కపోతే ఏం?' అన్నాను.
'ట్రై చేస్తే తప్పులేదు కదా?' అన్నాడు.
' అందుకని ఈ ఐదేళ్ళు ఇలా గుళ్ళు తిరుగుతావా?' అడిగాను.
'అంటే?' అన్నాడు.
'అయిదేళ్లకోసం ఐదేళ్ళు గుళ్లు తిరగడం కంటే, ఉన్నచోట ఉండి 80 కి పోవడం బెటరేమో?' అడిగాను.
'నీతో కష్టంరా బాబు' అన్నాడు.
'సరే అదలా ఉంచు. నీక్కూడా ఏదైనా రెమెడీ చెప్పమంటావా?' అడిగాను నవ్వుతూ.
'బాబోయ్. నాకొద్దు నీ రెమెడీలు' అన్నాడు.
'అందుకే ఫోన్ పెట్టెయ్. హైద్రాబాద్ రాను. ఇక ఫోన్లు చెయ్యకండి. మన వాళ్లందరికీ చెప్పు' అని నేనే డిస్కనెక్ట్ చేశాను.
14, అక్టోబర్ 2025, మంగళవారం
కులమా? గుణమా?
ఆశ్రమంలో క్రొత్త బిల్డింగు కడుతున్నాం. పనులు జరుగుతున్నాయి. కట్టుబడికోసం ఇసుకట్రాక్టర్లు వస్తున్నాయి. శిష్యులు ఏవో పనులమీద బయటకెళ్తే నేనే దగ్గరుండి చూస్తున్నాను.
ఒక ట్రాక్టరబ్బాయి ఇలా అడిగాడు.
'ఇదేంటి సార్?'
చూస్తే, పాతికేళ్ళుంటాయి. ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది.
'ఆశ్రమం' అన్నాను.
'అంటే?' అన్నాడు
'ఆశ్రమమే' అన్నాను.
'అంటే ముసలోళ్ల ఆశ్రమమా?' అడిగాడు.
'కాదు' అన్నాను.
'అంటే ఇక్కడ ఏం చేస్తారు?' అడిగాడు సంకోచంగా.
'ఏమీ చెయ్యం. ధ్యానమే' అన్నాను.
'అంటే మెడిటేషనా?' ఇంగ్లీషు దొర్లింది.
'అవును. చదువుకున్నావా?' అన్నాను.
'డిగ్రీ చదివాను. అందరికీ నేర్పిస్తారా?' అన్నాడు.
'లేదు. మా వరకే' అన్నాను.
అతను నిరాశపడ్డాడు.
'మాది చిన్నకులం సార్' అన్నాడు నిరాశగా.
జాలేసింది. పల్లెటూళ్ళలో అన్నిటికీ కులం ముందుంటుంది.
'నీకైతే నేర్పిస్తాను. నేర్చుకుంటావా?' అడిగాను.
అనుమానంగా చూశాడు.
'దీనికి కులంతో పనిలేదు నాయనా. దేవుడి దగ్గర కులమేంటి?' అన్నాను.
'అంటే, అందరూ చెప్పరు సార్' అన్నాడు.
'నేను చెప్తాను. నీకు శ్రద్ధ ఉంటే రా, నేర్పిస్తాను' అన్నాను.
'మాది ఫలానా కులం సార్' అన్నాడు.
' దానితో నాకు పని లేదు ' అన్నాను.
'మేం పనులు చేసుకుంటాం సార్. ఆదివారం అయితే రాగలను' అన్నాడు.
'సరే రా' అన్నాను.
'అదేనా మందిరం?' అన్నాడు ధ్యానమందిరం వైపు చూస్తూ.
'అదే. అక్కడే అందరూ. నువ్వూ అక్కడే' అన్నాను.
అతని ముఖంలో సంతోషం కనిపించింది.
'ఎంత కట్టాలి?' అడిగాడు, మళ్ళీ సంశయిస్తూ.
'ఇది బేరాల ఆశ్రమం కాదు. సారాల ఆశ్రమం' అన్నాను.
నమ్మలేనట్లు చూచాడు.
'సరే సార్' అని ట్రాక్టర్ ఎక్కి వెళ్ళిపోయాడు.
నాకు పరిచయస్తులలో ఎంతోమంది పెద్దకులాల వాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు, బాగా సెటిలైనవాళ్ళు ఉన్నారు. ఎవరూ ఇలా అడగలేదు. వాళ్ళ అహంకారాలు వాళ్లకు అడ్డుగోడలయ్యాయి. వినయానికేమో అదృష్టం పట్టింది.
ఆధ్యాత్మికలోకంలో అహంకారం ఎలా పనిచేస్తుంది? గుంతలోనే నీళ్లు నిలబడతాయి. మిట్టమీదనుండి జారిపోతాయి.
ఇంత చిన్నవిషయం కోట్లాదిమందికి అర్ధం కాదు.
చల్లనిగాలీ, వెన్నెలా, విశాలమైన ప్రకృతీ, ఆరుబయట గుడిసెలో ఉన్నవారికే అందుతాయి గాని, ఆడంబరంగా ఏసీరూముల్లో దాక్కుని ఉండేవారికి ఎలా అందుతాయి?
'ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు?' అనుకున్నాను.
12, అక్టోబర్ 2025, ఆదివారం
గెట్ టుగెదర్
నిన్నమధ్యాన్నం పాతఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. తనతో మాట్లాడి దాదాపు రెండేళ్లయింది. 2023 లో తిరువన్నామలై వెళ్ళినపుడు చెన్నైలో కలిశాడు. అప్పటికి తనింకా సర్వీసులోనే ఉన్నాడు. ఏడాది క్రితం చెన్నైలోనే రిటైరయ్యాడు. చాలామంది మా కొలీగ్స్ లాగే తనుకూడా హైద్రాబాద్ లో సెటిలయ్యాడు.
'ఏంటి ఉన్నట్టుండి గుర్తొచ్చాను?' అడిగాను.
'ఈ నెల చివరివారంలో మన బ్యాచ్ వాళ్లందరికీ గెట్ టుగెదర్ పెడుతున్నాం. నువ్వూ రావాలి' అన్నాడు.
మా బ్యాచ్ లో అందరికంటే చిన్న కొలీగ్ మొన్న జూలైలో దిగిపోయాడు. దీనితో రైల్వేలో మా బ్యాచ్ అందరూ రిటైరయ్యారు.
ఇలాంటి పార్టీలన్నీ హైదరాబాద్ లోనే పెడుతుంటారు వీళ్ళు. అది మొదటినుంచీ అలవాటు.
'సారీ నేన్రాను' అన్నాను తడుముకోకుండా.
'అదేంటి? ఎందుకలా?' అన్నాడు.
'మీరు మాట్లాడుకునే మాటలు నేను భరించలేను. దానికోసం అంతదూరం రావడం ఎందుకు?' అన్నాను.
'హైదరాబాద్ రావా అసలు?' అడిగాడు.
'నిన్నగాక మొన్న హైదరాబాద్లోనే ఉన్నా' అన్నాను.
'ఏం?' అన్నాడు.
'ఏదో పనిమీద వచ్చాలే' అన్నాను.
'మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నేను అత్తాపూర్ లో ఉంటాను. వచ్చి కలిసేవాణ్ని కదా' అన్నాడు.
'మామాపూర్ వద్దన్నాడు' అన్నాను.
'వాడెవడు?' అన్నాడు.
'నేనే. ఎవరికీ చెప్పాలనిపించలేదు. అందుకే ఎవరినీ కలవలేదు. వచ్చిన పనిచూసుకున్నాను. వెనక్కు వచ్చేశాను' అన్నాను.
'మనవాళ్ళని కలవచ్చుగా కనీసం' అన్నాడు.
'నా వాళ్ళని కలిశాను. మనవాళ్లతో నాకెందుకు?' అన్నాను.
పార్టీకి నన్ను ఒప్పించాలని చాలాసేపు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు.
'ఆశ్రమం కట్టుకున్నావని విన్నాను' అన్నాడు చివరకు.
'నేను కట్టుకోలేదు. మేస్త్రీలు కట్టారు' అన్నాను.
'అదేలే. ఏం చేస్తుంటావక్కడ?' అడిగాడు కుతూహలంగా.
'నువ్వు మీ ఇంట్లో చేసేదే' అన్నాను.
'దానికోసం అంతదూరం పోవడమెందుకు?' అడిగాడు.
'మనుషులని వెతుక్కుంటూ అడివిలోకి వచ్చాను' అన్నాను.
'ఊరికి దూరమని విన్నాను' అన్నాడు.
'నువ్వు సరిగ్గా వినలేదు. ప్రపంచానికే దూరం' అన్నాను.
'అదికాదు. టైం పాస్ ఎలా అవుతుంది?' అన్నాడు.
చాలామంది అడిగే ప్రశ్న ఇదే.
'మనం పట్టుకోకపోతే, అదే పాసవుతుంది' అన్నాను.
అదేదో పెద్ద జోకులాగ గట్టిగా నవ్వేశాడు.
'పుస్తకాలు చదువుతుంటావేమో?' అడిగాడు.
'రాస్తుంటాను' అన్నాను.
అది వినకుండా, 'నేనొచ్చి నాల్రోజులుంటా మీ ఆశ్రమంలో' అన్నాడు.
'నాలుగు గంటలు కూడా ఉండలేవు' అన్నాను.
'అదేంటి? వస్తానంటే వద్దంటావు?' అన్నాడు నిష్టూరంగా.
'వచ్చాక నువ్వు పడే బాధ చూడలేను కాబట్టి, వద్దంటున్నాను' అన్నాను.
'మనవాళ్లంతా హాయిగా హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీస్ లో సెటిలైతే, నువ్వెందుకు అలా దూరంగా ఉంటున్నావు?' అడిగాడు.
'నా కర్మ' అన్నాను.
'అయితే చూడాల్సిందే మీ ఆశ్రమాన్ని' అన్నాడు.
'నీ కర్మ' అన్నాను.
'గాయత్రిని వదలకు. అప్పట్లో బాగా చేసేవాడివి కదా' అడిగాడు 30 ఏళ్లనాటి సంగతులు గుర్తుచేసుకుంటూ.
'నేను వదల్లేదు. తనే వదిలేసింది' అన్నాను.
'అదేంటి?' అన్నాడు మళ్ళీ.
'సావిత్రి వచ్చిందని గాయత్రి వెళ్ళిపోయింది' అన్నాను.
'ఏంటి అదోలా మాట్లాడుతున్నావ్?' అన్నాడు.
'నిన్న సాయంత్రం నుంచీ పిచ్చెక్కింది' అన్నాను.
'ఇంతకీ పార్టీకి రానంటావ్?' అడిగాడు.
'రానని కాదు. వచ్చి, మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నాను' అన్నాను.
'ఏంటిరా బాబు. సరిగ్గా చెప్పు' అన్నాడు తల బాదుకుంటూ.
'ఏముందిరా? మీరంతా అక్కడ చేరి ఏం చేస్తారు? తింటారు. తాగుతారు. షేర్లు, కార్లు, ఆస్తులు, ఒక్కొక్కడు ఎన్ని ఇళ్ళు కొన్నాడు, పిల్లలు ఎక్కడ సిటిలయ్యారు, వాళ్లెలా సంపాదిస్తున్నారు, మీమీ గొప్పలు, ఎచ్చులు, ఈగోలు, రంకుపురాణాలు, రాజకీయాలు ఇవేగా మీరు మాట్లాడుకునేవి. ఆ చెత్త నేను వినలేను.
సర్వీసులో ఉన్నపుడు ఒక్కడంటే ఒక్కడు మనుషుల్లాగా బ్రతికార్రా మీరు? సగంమందివి అవినీతి బ్రతుకులు. మిగతా సగంమందివి అర్ధంలేని బ్రతుకులు. ఏముంది మీరు చెప్పేది నేను వినేది? మీ సోది నేను తట్టుకోలేను. నా సోది మీరు తట్టుకోలేరు. ఇంకెందుకు అక్కడకి రావడం?' అడిగాను.
ఫ్రెండ్ గాడు పట్టువదలని విక్రమూర్ఖుడు.
'అయినా సరే ఒకసారి రావచ్చుకదా నా కోసం' అన్నాడు.
'నీకోసమైతే, ఈసారి వచ్చినపుడు చెప్తాను. కలువు. ఎక్కడన్నా డిన్నర్ చేద్దాం. మాట్లాడుకుందాం ' అన్నాను.
'సరే అలాగే. కానీ ఇదికూడా కాదనకు. ప్లీజ్'' అన్నాడు.
పాపం ఇంతగా భంగపోతున్నాడని, చివరికిలా చెప్పాను.
'సరే. వస్తాను. డేటు, వెన్యూ పంపించు. ఆ తర్వాత ఏం జరిగినా నా బాధ్యత లేదు. ముందే చెబుతున్నాను. మళ్ళీ నన్ను అనొద్దు' అన్నాను.
'అమ్మయ్య. ఒప్పుకున్నావ్. నేను మేనేజ్ చేస్తాలే. డోంట్ వర్రీ. నువ్వు రా' అన్నాడు.
'తెలిసి తెలిసి దిగుతున్నావ్. నీ కర్మ' అన్నాను.
ఫ్రెండ్ గాడు ఫోన్ పెట్టేశాడు.
3, అక్టోబర్ 2025, శుక్రవారం
లాభనష్టాలు
పొద్దున్న ఏదో పనిలో ఉండగా, మిత్రుడు రవి ఫోన్ చేశాడు.
అది తన వాకింగ్ టైం.
"నవరాత్రులు బాగా జరిగాయా?" అడిగాడు.
"ఆ. జరిగాయి" అన్నాను.
"పలానా గురువుగారి ఆశ్రమంలో అమ్మవారి పూజలకు, అలంకరణకు బాగా డబ్బులు వసూలు చేశాడు. తెలుసా?" అడిగాడు.
"నాకనవసరం. అలాంటి చెత్త నాకు చెప్పకు" అన్నాను.
నన్ను రెచ్చగొట్టడం రవికి సరదా. నేనేదైతే వద్దంటానో అవే చెబుతూ ఉంటాడు.
"అలాకాదు. అమ్మవారికి అలంకరణ చెయ్యాలి, పూజలు చెయ్యాలి. డబ్బులు పంపండి, పంపండి' అని శిష్యుల వెంటపడి మరీ అడుక్కున్నాడు. బాగానే పోగయ్యాయిట మొత్తంమీద" అన్నాడు.
గతంలో ఆయన దగ్గర ఏదో అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం పొందాడు రవి. ప్రస్తుతం ఇద్దరికీ చెడింది. కానీ వదలకుండా వాళ్ళ న్యూసు మాత్రం సేకరిస్తూ ఉంటాడు.
'ఇంతకీ ఏమంటావ్?' అన్నాను.
'నువ్వు కూడా అలా చేస్తే బాగుంటుందేమో?', అన్నాడు.
'అలంకరణ నేనే చేసుకోను, ఇక అమ్మవారికేం చేస్తాను?' అన్నాను.
'ఇంత సమయాన్ని ఇతరులకోసం వెచ్చిస్తున్నందుకు నీకు లాభం ఉండాలి కదా?" అన్నాడు.
' అలాంటిదేమీ ఉండదు. ఇక్కడ ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. అంతే ' అన్నాను.
'మరి నీ శిష్యులకైనా ఏదో ఒక లాభం ఉండాలి కదా?' అడిగాడు.
'ఉంటుంది. అది డబ్బుతో కొలవబడేది కాదు' అన్నాను.
' ఇలా అయితే నీ దగ్గరకెవరొస్తారు? ' అన్నాడు.
' రమ్మని ఎవడు దేబిరిస్తున్నాడు?' అన్నాను.
' అదికాదు. లాభం లేకుండా ఎలా? ' మళ్ళీ అడిగాడు.
'లాభనష్టాలను దాటి ఆలోచించలేవా?' అడిగాను.
'ఎలా? జీవితమంతా అవేగా?' అన్నాడు.
'లాభం కోరుకుంటే నష్టం. నష్టం అనుకోకపోతే లాభం' అన్నాను.
' నీ ధోరణి నీదేగాని నా మాటవినవు కదా? ' అన్నాడు.
' నువ్వు వాకింగ్ మానేసి యోగాభ్యాసం చెయ్యమంటే చెయ్యవు కదా?' అన్నాను.
'బై' అంటూ ఫోన్ పెట్టేశాడు రవి.
2, అక్టోబర్ 2025, గురువారం
గర్భగుడి
'అష్టమి నాడు దర్శనానికి 8 గంటలు పట్టిందట?' అన్నాడు శిష్యుడు మొన్న.
'ఎక్కడ?' అడిగాను.
'విజయవాడ కనకదుర్గా అమ్మవారి గుడిలో' అన్నాడు.
'అలాగా' అన్నాను.
'మనకేంటో ఇక్కడ? అసలివాళ ఏ తిథో కూడా తెలీడం లేదు' అన్నాడు.
నవ్వాను.
'గుడిని దాటాకే గర్భగుడి' అన్నాను.
మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల
1, అక్టోబర్ 2025, బుధవారం
పూర్ణాహుతి
చాలారోజులనుంచీ తెలిసిన ఒక పెద్దాయన ఇవాళ ఫోన్ చేశాడు. ఆయనకు 75 పైనే ఉంటాయి.
కుశలప్రశ్నలయ్యాక, విషయంలోకొచ్చాడు.
'రేపు మా ఇంట్లో చండీహోమం పూర్ణాహుతి చేస్తున్నాము. మీరు రావాలి' అన్నాడు.
'అవడానికా?' అడిగాను.
'అదేంటి?' అన్నాడు.
అర్ధం కాలేదని అర్ధమైంది.
'పోయినేడాది కూడా చేసినట్టున్నారు హోమం?' అన్నాను.
'అవునండి. చేశాము' అన్నాడు.
'అప్పుడివ్వలేదా?' అడిగాను.
'ఇచ్చాము' అన్నాడు.
'మరి ఇంకెందుకు?' అన్నాను.
'అంటే?' అన్నాడు.
'ఒకసారి పూర్ణంగా ఆహుతయ్యాక మళ్ళీ అవ్వడానికి ఇవ్వడానికి ఇంకేం మిగిలుంటుంది?' అన్నాను.
ఏదో గొణుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు పెద్దాయన.
నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.
30, సెప్టెంబర్ 2025, మంగళవారం
పదకొండో అవతారం
పొద్దున్నే ఫ్రెండ్ ఫోన్ చేశాడు.
'ఈ వార్త విన్నావా?' అన్నాడు సంభ్రమంగా.
'ఏంటది?' అన్నాను.
'ఈ ఏడాది అమ్మవారికి పదకొండో అవతారం వచ్చింది' అన్నాడు.
'ఏం? పది సరిపోలేదా?' అన్నాను నిరాసక్తంగా.
'అవును. ఈ ఏడాది పదకొండు తిథులొచ్చాయి. అందుకే పదకొండు అవతారాలు' అన్నాడు.
'బాగుంది నీ అవతారం' అన్నాను.
'నువ్విలాంటివేవీ చెయ్యవు కదా. నీకు తెలీదులే' అన్నాడు.
'అసలు అమ్మవారంటే ఏంటో తెలిస్తే ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.
'అదేంటి?' అన్నాడు.
'పోనీ నీ అవతారమేంటో తెలుసుకున్నా, ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.
'ఇదీ అర్ధం కాలేదు' అన్నాడు.
'ఫోన్ పెట్టేసి నీ వ్యాపారం నువ్వు చేసుకో' అన్నాను.
'నాకేం వ్యాపారం లేదు' అన్నాడు.
'పోనీ ఇంకొకరి వ్యాపారంలో సమిధవై పో' అన్నాను.
ఫ్రెండ్ ఫోన్ పెట్టేశాడు.
నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.
29, సెప్టెంబర్ 2025, సోమవారం
మైకుకు మోక్షం
నిన్న రాత్రి ఏదో పనుండి ప్రక్క పల్లెకెళ్ళాను
ఆ టైములో కూడా, ఒక గుడిపైన మైకు జోరుగా మ్రోగుతోంది.
ఏవో జానపద భక్తిగీతాలు పెద్ద సౌండుతో వినవస్తున్నాయి
గుడిలో ఒక్క పురుగు లేదు.
అమ్మవారు అయోమయంగా చూస్తోంది.
'నవరాత్రుల మైకు' అన్నది ప్రక్కనున్న శిష్యురాలు
'నాల్రోజుల్లో దానికి మోక్షం గ్యారంటీ' అన్నాను ఏడుస్తున్న ప్రశాంతతను చూస్తూ.
22, సెప్టెంబర్ 2025, సోమవారం
నవ్వుతున్న నవరాత్రులు
ప్రక్కఊరినుండి అప్పుడపుడు కొంతమంది ఏదో పనిమీద ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వారిలో ఒకతను ఈ మధ్యన ఇలా అడిగాడు.
'ప్రతి ఏడాది మా గుడిలో నవరాత్రులు చేస్తాము. మీరూ ఆశ్రమంలో చేస్తారా?'
'రాత్రులను మనం చేసేదేముంది? అవే వచ్చిపోతుంటాయి' అన్నాను.
షాకయ్యాడు.
'అంటే, అమ్మవారికి ప్రత్యేకపూజలు ఏవీ చెయ్యరా?' అడిగాడు అనుమానంగా.
'ప్రత్యేకంగా చేసేది పూజ ఎలా అవుతుంది?' అన్నాను.
అయోమయంగా చూచాడు.
'మరి నైవేద్యాలు?' భయంగా అడిగాడు.
'కాలానికి మనం అవుతున్నాంగా ప్రతిరోజూ - నైవేద్యం' అన్నాను.
కాసేపు మాటరాలేదు.
'మరి మైకులు భజనలు ఉండవా?' అన్నాడు.
'అమ్మవారికి చెవుడు లేదు. ఆమెకు భజనపరులు నచ్చరు' అన్నాను.
అతను లేచి వెళ్ళిపోయాడు.
నవరాత్రులు నవ్వుతున్నాయి.
18, సెప్టెంబర్ 2025, గురువారం
కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు
146 కోట్ల ప్రజలు. అంతకంటే ఎక్కువ సమస్యలు.
దేశంనిండా దేశద్రోహులు. నల్లడబ్బు, అవినీతికంపు. సొంతదేశాన్ని బలహీనపరచి విదేశాలకు అమ్మేయాలని ప్రయత్నించే రాజకీయశక్తులు. వాటికి విదేశీసహాయాలు, వీరిని గుడ్డిగా నమ్మే పిచ్చిజనాలు, సరిహద్దు గొడవలు, దేశద్రోహపార్టీలు, వర్గవిభేదాలు, కులవిభేదాలు, అవకాశవాదాలు, మతమార్పిడులు, జిహాద్ లు, కమ్యూనిష్టు విషప్రచారాలు, టెర్రరిస్టుల దాడులు, కుట్రలు, కుతంత్రాలతో రకరకాలుగా చీల్చబడుతూ సర్వనాశనం దిశగా శరవేగంగా పోతున్న దేశం.
ఇలాంటిస్థితిలో దేశపగ్గాలు చేపట్టారు మోదీగారు.
ఆయనకు కుటుంబం లేదు.
ఒకప్పుడు ఉండేది, దేశంకోసం కుటుంబాన్ని వదులుకున్నారు.
ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.
కోట్లకు కోట్లు నల్లధనం లేదు.
ఆయన తినేది చాలా తక్కువ. అదికూడా పూర్తి శాకాహారం.
నిద్రపోయేది రోజుకు 3 గంటలు.
దేశంకోసం కష్టపడేది 21 గంటలు.
ఏడాదిలో ఎక్కువరోజులు ఉపవాసదీక్షలు. నేలమీద నిద్రిస్తారు.
విలాసాలు లేవు. సరదాలు లేవు. ఇతర వ్యాపకాలు లేవు.
క్రమశిక్షణతో కూడిన జీవితం.
ఉన్నతమైన ఆదర్శాలతో కూడిన ఆలోచనావిధానం.
75 ఏళ్ల వయసులో కూడా అలసిపోని దేహం.
చెరిగిపోని చిరునవ్వు.
తను ఏ దేశంకోసం పాటుపడుతున్నాడో, అదేదేశంలో దాదాపు సగంమంది తనను వ్యతిరేకించినా, ఆ వ్యతిరేకతకు మతపిచ్చి తప్ప ఏ ఇతరకారణమూ లేకపోయినా, చెదరని సంకల్పశక్తి.
వారికి కూడా అభివృద్ధి ఫలాలను, ఫలితాలను సమానంగా అందించే ఉదారత్వం.
అదీ నరేంద్రమోదీగారు !
పదేళ్లు తిరిగాయి.
ఒకప్పుడు అన్నిదేశాల దగ్గరా అప్పులు చేసిన దేశం, ఈనాడు అన్ని అప్పులూ తీర్చేసింది. చిన్నదేశాలను ఆదుకునే స్థితికి ఎదిగింది.
నేడు మనదేశం అన్ని రంగాలలో ముందుకు పోతూ, అగ్రరాజ్యాల బెదిరింపులకు లొంగకుండా, వాటికే షరతులు విధిస్తూ, వాటితో సమానంగా అంతర్జాతీయ వేదికలపైన నిలబడిందంటే - నరేంద్రమోదీ గారు మాత్రమే కారణం !
'సన్యాసి రాజ్యపాలన చేస్తాడు' అని వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసింది ఈయన గురించే.
మోదీగారు కాషాయవస్త్రాలు కట్టుకోనక్కరలేదు. కానీ, ఆయన ఏ పీఠాధిపతికీ, ఏ స్వామీజీకి తక్కువ కాదు. నిజానికి వాళ్లలో చాలామంది ఈయన కాలిగోటికి కూడా ఏమాత్రమూ సరిపోరు.
కారణం?
వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు.
ఈయన దేశంకోసం పాటుపడుతున్నాడు.
ఎవరు ఎక్కువ?
దేశం బాగుంటే కదా మతం, ధర్మం బాగుండేది?
చట్టం సరిగ్గా ఉంటేకదా మఠాధిపతులైనా, మతాధిపతులైనా, నిర్భయంగా తిరగగలిగేది?
మోదీగారు ఒక రాజర్షి.
జనకమహారాజు గురించి మనం చదివాము. శివాజీ మహారాజు గురించి చదివాము. గురు గోవింద్ సింగ్ గురించి చదివాము. ఇప్ప్పుడు మోదీగారిలో వారందరినీ చూస్తున్నాము.
ఇటువంటి రాజర్షి, ఇటువంటి కర్మయోగి మన ప్రధానమంత్రిగా ఉండటం కోట్లాది భారతీయుల పుణ్యఫలం.
ఎంతమంది దేశభక్తుల ఎన్నివేల ఏళ్ల ప్రార్ధనల ఫలితమో ఈనాడు ఈ రాజర్షి మన దేశసారధి అయ్యాడు.
ఈయనకు నిన్న 75 ఏళ్ళు నిండాయి.
ఇంకా 25 ఏళ్ళు, నిండునూరేళ్ళు, ఈయన ఇదేవిధంగా జీవించాలని, దేశాన్ని మున్ముందుకు నడిపించాలని, మన దేశపు పూర్వవైభవాన్ని మళ్ళీ ఆవిష్కరించాలని, పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.
మనదేశంలో వేలాదిసంవత్సరాలుగా పుట్టిన అందరు మహనీయుల ఆశీస్సులూ ఈయనపైన ఉండుగాక !
పరమేశ్వరుని కటాక్షం ఈయనపైన పరిపూర్ణంగా ఉండుగాక !
జై మోదీజీ ! జై భరతమాత ! జై హింద్ !
15, సెప్టెంబర్ 2025, సోమవారం
దీపపు కుదురు
అయితే,
ఎర్రజెండా మొండి మనుషులు
లేకపోతే,
తురకబాబా మూఢభక్తులు
కాకపోతే,
కొలుపులు, బలుపులు, బలులు
ఇంకా చాలకపోతే,
కోరికల భజనలు, దీక్షలు, పూజలు
అదీకాదంటే,
పిరమిడ్లు, సమాధుల దొడ్లు, సూక్ష్మలోక ప్రయాణాలు
ఇదీ ఒంగోలు చుట్టుప్రక్కల గోల . . .
మనుషుల అజ్ఞానం ఎంత దట్టంగా ఉందంటే
చిమ్మచీకటి కూడా దీనిని చూచి సిగ్గుపడుతోంది
చెవిటివాడికి శంఖం ఊదటం ఎలాగో
వీరికి అసలైన ఆధ్యాత్మికత నేర్పడం అలాగ
అందుకే,
ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్లో మా బుక్ స్టాల్
ఇదే మొదటిసారి,
ఇదే చివరిసారి కూడా
ఎడారిలో చిరుదీపం వెలుగుతోంది
దాని వెలుగు చాలా దూరానికి ప్రసరిస్తోంది
కానీ కుదురుదగ్గర మాత్రం
చీకటిగానే ఉంది.
ఏ దీపమైనా ఇంతేనేమో?
8, సెప్టెంబర్ 2025, సోమవారం
ఏడవ రిట్రీట్ విశేషాలు
ఏడవ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం ఈనెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు పంచవటి ఆశ్రమప్రాంగణంలో జరిగింది.
ఊకదంపుడు ఉపన్యాసాలకు, సోదికబుర్లకు పూర్తివ్యతిరేకదిశలో సాగుతున్న మా నడక, ఉత్త థియరీని వదలిపెట్టి, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో ముందుకు పోతోంది.
సాధనామార్గంలో పురోగమిస్తున్న శిష్యులకు ఆశీస్సులనందిస్తూ, ఉన్నతస్థాయికి చెందిన ఒక ధ్యానవిధానంలో వీరికి దీక్షనిచ్చాను. అందుకున్నవారు అదృష్టవంతులు. వీరిలో ఒక 13 ఏళ్ల చిన్నపిల్ల కూడా ఉన్నది. ఇంత చిన్నవయసులో ఇటువంటి దీక్షను పొందటం ఈమె అదృష్టం. ఏమంటే, అసలైన హిందూమతం ఇదే. అసలైన సనాతన ధర్మమార్గం ఇదే. కోట్లాదిమందికి 83 వచ్చినా ఇది దొరకదు. అలాంటిది 13 ఏళ్ల వయసులో ఇది లభించడం అదృష్టం కాకపోతే మరేమిటి?
నిజానికి, సాధన మొదలుపెట్టవలసింది ఈ వయసులోనే. దైవకటాక్షంతో లభించిన ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోమని వారికి గుర్తుచేస్తున్నాను.
మూడురోజులపాటు బయటప్రపంచాన్ని మర్చిపోయి ఆశ్రమంలోని ప్రశాంతవాతావరణంలో సాధనలో సమయాన్ని గడిపిన శిష్యులందరూ తిరిగి వారివారి ఇళ్లకు ఈ రోజు ఉదయానికి చేరుకున్నారు.
తిరిగి డిసెంబర్ లో జరుగబోయే సాధనాసమ్మేళనంలో కలుసుకుందామనిన సంకల్పంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.
మనుషులనేవారు కనిపించడం అరుదైపోయిన ఈ రొచ్చుప్రపంచంలో, కనీసం కొంతమందినైనా నిజమైన మనుషులను తయారు చేయగలుగుతున్నానన్న సంతృప్తిని నాకు మిగిల్చింది.
15, ఆగస్టు 2025, శుక్రవారం
ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్
పంచవటి ఆశ్రమాన్ని గురించి, మా భావజాలాన్ని గురించి, అసలైన హిందూమతాన్ని గురించి తెలుసుకోవడానికి ఒంగోలు చుట్టుప్రక్కల ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
11, ఆగస్టు 2025, సోమవారం
మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల
10, ఆగస్టు 2025, ఆదివారం
'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల
మొదటి ముద్రణలో 1318 పద్యములున్నాయి. మూడవముద్రణలో 1731 పద్యములైనాయి. అంటే దాదాపు 400 పద్యములను అదనంగా వ్రాసి చేర్చడం జరిగింది. అంతేగాక, అదనపు అధ్యాయములను కూడా చేర్చడం జరిగింది.
ప్రస్తుతపు మూడవముద్రణలో చేర్చబడిన ముఖ్యాంశము మంత్రభాగపు వివరణ. మొదటి రెండు ముద్రణలలో మంత్రభాగాన్ని పెద్దగా స్పృశించలేదు. కారణం, మంత్రములను పుస్తకరూపంలో ఇవ్వడం ఎందుకని భావించడమే. కానీ, శ్రీవిద్యకు మంత్రమే ప్రాణం గనుక అది కూడా ఉండాలని కొందరు అభిమానులు పదే పదే చెప్పడంతో, దానిని ఈ ముద్రణలో వివరంగా చర్చించడం జరిగింది. అయితే, గురూపదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పడం జరిగింది.
మంత్రములను పుస్తకముల నుండి గ్రహించవచ్చు. కానీ వాటియొక్క జపధ్యానవిధానములను (తంత్రమును) మాత్రం గురూపదేశపూర్వకంగానే నేర్చుకోవలసి ఉంటుంది.
2015 తరువాత ఈ పదేళ్లలో 70 పైగా పుస్తకములను నేను వ్రాసినప్పటికీ, మొట్టమొదటిసారిగా వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' మాత్రం నేటికీ పాఠకుల అభిమానగ్రంధంగా నిలిచి ఉన్నది. నా భావజాలాన్ని, మా సాధనామార్గాన్ని చదువరులకు స్పష్టం చేస్తూనే ఉన్నది.
ఈ మూడవముద్రణ సందర్భంగా నా శిష్యులకు, అభిమానులకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ నెల 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవంలో 'పంచవటి స్టాల్' లో 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణతో సహా మా పుస్తకాలన్నీ లభిస్తాయి.
ఇది మా ఆశ్రమానికి దగ్గరే కాబట్టి, పుస్తకప్రాంగణంలో నేను కూడా మీకు అప్పుడపుడు కనిపిస్తాను. పుస్తకప్రాంగణంలో కలుసుకుందాం.
22, జూన్ 2025, ఆదివారం
International Yoga Day - 2025
9, జూన్ 2025, సోమవారం
భట్టిప్రోలు భయంకరి
చాలా రోజుల తర్వాత శిష్యపరమాణువు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే భోరుమన్నాడు.
నాకు కంగారు పుట్టింది.
'ఏమైంది నాయనా' అన్నాను కంగారు బయటకు కనపడకుండా జాగ్రత్తపడుతూ.
'స్వామీజీకి యాక్సిడెంట్ అయింది' అన్నాడు వెక్కుతూ.
విరక్తిగా నవ్వాను.
'పిచ్చివాడా ! స్వామీజీగా మారడమే ఒక పెద్ద యాక్సిడెంట్రా. ఆ తర్వాత ఎన్ని అయితే మాత్రం లెక్కేముంది?' అన్నాను.
'అది కాదు అదికాదు ఈ ఈ ఈ ' అని వెక్కిళ్లు పెడుతూ నసుగుతున్నాడు.
'చెప్పన్నా ఏడువ్. ఏడిచన్నా చెప్పు' అన్నాను.
'మరి వాళ్లిద్దరూ ఏమయ్యారు?' అన్నాడు.
'ఎవరా ఇద్దరు?' అన్నాను.
'అదే చిన్నమస్త, ప్రత్యంగిర?' అన్నాడు.
'చిన్నమస్త చీరాల కెళ్ళింది, ప్రత్యంగిర పాలకొల్లులో ఉంది' అన్నాను.
'మిమ్మల్ని అడగడమంత బుద్ధి తక్కువ ఇంకేమీ ఉండదు' అన్నాడు కోపంగా.
'తెలుసుకున్నావ్ గా ! ఇక దయచెయ్' అని తలుపెయ్యబోయాను.
'సారీ గురూజీ. ఏదో నోరు జారి మనసులో మాట బయటకొచ్చింది. ఇకమీద రానివ్వను జాగ్రత్తగా ఉంటాను, నా డౌటు తీర్చండి మరి' అన్నాడు.
'ఒక కథ చెబుతా వింటావా?' అడిగాను.
'ఓ ! చెప్పండి' అన్నాడు చతికిలబడుతూ.
'అనగనగా ఒక పోపు గారున్నారు. కోట్లాదిమంది కాథలిక్కులు ఆయన్ను దైవంగా కొలిచేవారు. ఆయన పిలవకుండానే జీసస్ పలుకుతాడని, దేవుడితో డైరెక్ట్ హాట్ లైన్ ఆయనకుందని అనుకునేవారు. ఏ భక్తుడొచ్చి ఏ కష్టం చెప్పుకున్నా ఆయన ఆశీర్వాదంతో తగ్గిపోయేది. పెద్దపెద్ద దేశాధినేతలే ఆయన దర్శనం కోసం వచ్చేవారు. ఇదిలా ఉండగా, వన్ ఫైన్ మార్నింగ్ పోపుగారు జబ్బుపడ్డారు. బెస్ట్ డాక్టర్లు మందులిచ్చినా తగ్గలేదు. చక్రాల కుర్చీకి అంకితమైపోయారు. అప్పుడొక విచిత్రం జరిగింది' అని ఆపాను, పరమాణువు ఫీలింగ్స్ గమనిస్తూ.
'ఏం జరిగింది గురూజీ? కొంపదీసి జీసస్ గాని ప్రత్యక్షమయ్యాడా?' పరమాణువు పగిలిపోయేలా ఉంది.
'అదేం జరగలేదు. "పోపుగారి ఆరోగ్యం కోసం భక్తులందరూ దేవుడిని ప్రార్ధించండి" అని వాటికన్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అంటే, పాతపేషంట్లే ఇప్పుడు డాక్టరుకు వైద్యం చెయ్యాలన్నమాట' అన్నాను.
పరమాణువు నోరెళ్లబెట్టాడు.
'మరి పోపుకీ, దేవుడికీ ఉన్న హాట్ లైన్ ఏమైంది? తెగిపోయిందా? పోపుని దేవుడు చూసుకోడా? భక్తులు ప్రార్ధించడం ఎందుకు? దేవుడికీ పోపుకీ చెడిందా?' అని నీలాంటి ఒక భక్తుడే అడిగాడు. నేనేం చెప్పాలి?' ప్రశ్నించాను.
నోరు అలాగే ఉంది.
'మూసుకో. ఇంకో కథ విను. అనగనగా ఒక శ్రీవిద్య గురువుగారున్నారు. అంటే సిన్మాయాక్టర్ శ్రీవిద్యకు గురువు కాదు. నేర్పించే గురువన్నమాట. "క్షేమంకరీ మంత్రం జపించండి' మీకు ఏ ఆపదా రాదు" అని నీలాంటి పరమాణువులకు ఊదరగొట్టేవాడు. ఒకరోజున అదే మంత్రాన్ని ఒక రెండొందలమంది శిష్యసమూహానికి ఉపదేశించి, తన ఊరికి తిరిగి వస్తుండగా, ఈయన కారుకే యాక్సిడెంట్ అయింది. కట్ చేస్తే, గురువుగారు ఆస్పత్రిలో బెడ్ పైన. ఒళ్ళంతా కట్లు. కాలేమో సీలింగుకు వేలాడుతోంది. అప్పుడు కూడా మరో విచిత్రం జరిగింది' మళ్ళీ సస్పెన్స్ లో ఆపాను.
పరమాణువు లేచి నిలబడ్డాడు.
'నేను తట్టుకోలేను గురూజీ. త్వరగా చెప్పి నన్ను రక్షించండి. క్షేమంకరి బెడ్ పక్కన ప్రత్యక్షమైందా?' అన్నాడు ఏడుస్తూ.
'ఆపేయ్ వెధవేడుపు. అంత ఊహించుకోకు. అలాంటివాళ్ళెవరూ రాలేదు. 'గురువు గారు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. ఆయన క్షేమంకోసం భక్తులందరూ క్షేమంకరిని ప్రార్ధించండి' అంటూ ఆశ్రమం నుండి ప్రెస్ రిలీజ్ మాత్రం వచ్చింది'
'అప్పుడేమయింది?' నిరాశగా అన్నాడు పరమాణువు.
'ఏమౌతుంది? మామూలే. 'స్వామీజీని క్షేమంకరి ఎందుకు రక్షించలేదు. వాళ్ళిద్దరికీ చెడిందా?' అని వారి భక్తుడే ఒకాయన నన్నడిగాడు' అన్నాను.
'అసలూ, అందరి భక్తులూ మిమ్మల్నే ఎందుకడుగుతారు?' డౌటు వెలిబుచ్చాడు పరమాణువు.
కోపంగా చూశాను.
'అనుమానిస్తున్నావా ! మూర్ఖుడా ! భట్టిప్రోలు భయంకరిని ప్రయోగిస్తా నీ మీద. జాగ్రత్త !' అన్నాను గర్జిస్తూ.
భయపడ్డాడు.
నేను కొనసాగించాను.
'అనగనగా ఇంకో స్వామీజీ గారున్నారు. రమ్మంటే రాజశ్యామలే కదిలి వస్తుందంటారు. హోమాలు చేసి ప్రభుత్వాలనే మార్చేస్తామంటారు. అవతలివాళ్ళు వారాహిని ప్రయోగించారు. రాజశ్యామల రాజమండ్రికి పారిపోయింది. ఇప్పుడు స్వామీజీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు' అన్నాను.
'అంటే, అందరికంటే వారాహి పవర్ ఫుల్ అంటారా గురూజీ?' అడిగాడు.
'వాళ్ళెవరూ నాకు పరిచయాలు లేరు నాయనా. అసలు వాళ్లంతా ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు. తెలిస్తే ఇలా ఎందుకుంటాను?' అంటూ ఇంకో కథను మొదలుపెట్టాను.
'అనగనగా ఇంకో స్వామీజీ ఉన్నారు. చిన్నమస్తతో చిత్రాలు చేస్తానంటారు. ప్రత్యంగిరతో పల్టీలు కొట్టిస్తానంటారు. వేలాది భక్తులకు వేవిళ్లు తెప్పించానంటారు. ఆయనకీ యాక్సిడెంట్ అయింది. ఆస్పత్రి, కట్లు, కాలు, సీలింగ్ . అన్నీ మామూలే' అని ఆపాను.
'అర్ధమైంది గురూజీ. తర్వాత కథ నేను చెప్తాను' అన్నాడు ఉత్సాహంగా.
ముచ్చటేసింది.
'చెప్పుకో' అంటూ కుర్చీలో వెనక్కు వాలాను.
'చిన్నమస్త, ప్రత్యంగిరలు ప్రత్యక్షం కాలేదుగాని, యధావిధిగా ఆశ్రమం నుండి ప్రెస్ రిలీజ్ వచ్చింది. ''భక్తులెవరూ ఆస్పత్రికి వచ్చి డిస్ట్రబ్ చేయద్దు. మీమీ ఇళ్లలోనే ఉండి, చిన్నమస్తను చిన్నగాను, ప్రత్యంగిరను పెద్దగాను జపాలు చెయ్యండి. స్వామీజీ కోలుకోవడం కోసం ప్రార్ధించండి' అనేది దాని సారాంశం'' అన్నాడు పరమాణువు.
'పర్లేదోయ్. ఎదుగుతున్నావ్. వెరీ గుడ్. ముందుకెళ్లు' అన్నాను.
అప్పుడు నాలాంటి ఒక పరమాణువు వచ్చి, 'ఎందుకిలా జరిగింది గురూజీ? వాళ్లిద్దరూ ఏమయ్యారు? హాట్ లైన్ ఏమై పోయింది? ఇన్నాళ్లూ తమ కష్టాలు తీర్చిన స్వామీజీ కోలుకోవాలని ఆ భక్తులే ప్రార్ధించవలసిన పరిస్థితి రావడం ఏంటి? ఇదంతా గందరగోళంగా ఉంది? నాకేమీ అర్ధం కావడం లేదు. స్వామీజీకి వాళ్ళిద్దరికీ చెడిందా? అసలేమైంది? నా డౌట్ తీర్చండి' అని మిమ్మల్ని అడిగాడు' అన్నాడు పరమాణువు.
'కరెక్ట్ గా చెప్పావ్' అన్నాను భుజం తడుతూ.
పరమాణువు దుఃఖం మాయమైంది. 'మరి నా డౌటు?' అన్నాడు సూతనోత్సాహంతో.
'నీ డౌటూ నా డౌటూ ఒకటే. జీససు, క్షేమంకరి, చిన్నమస్త, ప్రత్యంగిర, రాజశ్యామల, వారాహి ఈ దేవతలున్నారు చూశావూ, అంతా బాగున్నపుడు పలికిన వీళ్ళందరూ, నిజంగా అవసర సమయంలో మాత్రం ఎందుకు ముఖాలు చాటేస్తున్నారు? అన్నదే ఆ డౌటు. ఇది నీదీ నాదీ మాత్రమే కాదు. బుర్ర ఉండి, లాజికల్ గా ఆలోచించగలిగిన ప్రతివాడిదీ ఇదే డౌటు. నువ్వు ఆన్సర్ చెప్పు' అన్నాను.
'నాకు బుర్ర ఉంటే మీ దగ్గరకెందుకొస్తాను?' అన్నాడు.
'వెరీ గుడ్ ఆన్సర్. కుజుడు రాశి మారాక నీ బుర్ర పాదరసమై పోయింది. విను చెప్తా' అంటూ ఇలా ముగించాను.
'చిన్నమస్త చీరాల కెందుకెళ్ళిందో తెలుసా? అదామె పుట్టినిల్లు. రాజశ్యామల రాజమండ్రి కెందుకెళ్ళిందో తెలుసా? అదామె మెట్టినిల్లు. ప్రత్యంగిర పాలకొల్లు కెందుకెళ్ళిందో తెలుసా? అదామె పడకటిల్లు. వారాహి వరంగల్లు కెందుకెళ్ళిందో తెలుసా? అదామె వంటిల్లు. జీసస్ జెరూసలేం కెందుకెళ్లాడో తెలుసా. అదాయనను పూడ్చినిల్లు'. అన్నాను.
' ఛీ అదేంటి గురూజీ. పుట్టినిల్లు బాగుంది గాని, పూడ్చినిల్లేంటి అసహ్యంగా' అన్నాడు.
'నోర్ముయ్, ఫ్లో కి అడ్డురాకు. పుట్టినిల్లు ఉన్నపుడు పూడ్చినిల్లు కూడా ఉంటుంది. ఏం? వాళ్ళకి మాత్రం కాస్త వెకేషన్ వద్దా? సరదాలు ఉండవా? ఉండకూడదా? పద్దాక పిలుస్తుంటే వాళ్ళుమాత్రం ఎందుకు పలుకుతారు? వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే పలకలేదు. ఇరవైనాలుగ్గంటలూ ఫోన్ మోగుతుంటే నువ్వు మాత్రం ఎత్తుతావా? ఇదీ అంతే. ఎంత దేవతలైనా వాళ్లకూ కొంచెం రెస్టు కావాలి కదా. తీసుకుంటున్నారు. వీళ్ళని పట్టించుకోలేదు. అందుకే ఇవన్నీ జరిగాయి. వెరీ సింపుల్' అన్నాను.
'అదికాదు గురూజీ. మిగతావాళ్ల సంగతి నాకు తెలీదుగాని, మా స్వామీజీకి మాత్రం వాళ్లిద్దరూ ఎప్పుడూ పక్కనే ఉంటారు. వాళ్ళు కార్లో ఉండగా ఇలా ఎలా జరిగిందో?' పాదరసం మళ్ళీ పనిచేసింది.
'ఉండబట్టే జరిగింది' అన్నాను.
మళ్ళీ నోరు.
'మూసేయ్ వెధవనోరు. దేవతలు గుళ్లలో ఉండాలిగాని, మన రోడ్లమీద కార్లల్లో తిరక్కూడదు. తిరిగితే ఇలాగే అవుతుంది. అయినా, వాళ్ళు దేవతలు కదా, యాక్సిడెంట్ టైంలో విండోలోంచి బయటకు దూకేసి ఉంటారు. తప్పించుకున్నారు. ఈయన దూకలేకపోయాడు. సింపుల్ ' అన్నాను.
'అర్ధమైంది గురూజీ. నా జన్మ ధన్యమైంది, ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?' అన్నాడు పరమాణువు.
'మీ ఇంట్లో బావుందా?' అడిగాను.
'ఉంది. ఎందుకు?' అడిగాడు అనుమానంగా.
నీకిప్పుడు 'భట్టిప్రోలు భయంకరి' మంత్రం ఉపదేశిస్తాను. ఇంటికెళ్లి, ఎవరితో పలక్కుండా సూటిగా దొడ్లోకెళ్లి బావిలో దూకు, అందులోనే మూడురాత్రుళ్ళూ మూడు పగళ్ళూ ఉండి ఈ మంత్రం జపించు' అన్నాను.
'అప్పుడేమౌతుంది గురూజీ' అన్నాడు భక్తితో తేలిపోతూ.
'ఏమీ కాదు. స్పృహ తప్పుతుంది. తాళ్ళేసి పైకి లాగుతారు. ఆస్పత్రిలో స్వామీజీ పక్కన బెడ్ దొరుకుతుంది. అప్పుడాయన్నే నీ సందేహం అడుగు. నీకు సరియైన జవాబొస్తుంది. ప్రాబ్లం సాల్వ్' అన్నాను.
'భలే ఐడియా. సరే గురూజీ. ఉపదేశించండి' తొందరపడ్డాడు.
'మరి పదిలక్షలు తెచ్చావా?' అడిగాను.
'అదేంటి?' అడిగాడు అయోమయంగా.
'మంత్రాలు ఊరకే వస్తాయనుకున్నావురా మలపసన్నాసి? పోయి డబ్బులు తెచ్చుకో. అప్పుడే నీ ముఖం నాకు చూపించు. ఈ లోపల మళ్ళీ ఒచ్చావంటే చంపుతా. ఫో' అంటూ బయటకు తోసి తలుపేశా.
'హమ్మయ్య' అనుకుంటూ వెనక్కు తిరిగేసరికి, సోఫాలలో ఎవరెవరో కూచుని ఉన్నారు.
'ఎవరు మీరంతా?' అడిగాను భయం భయంగా.
'నేను ప్రత్యంగిర. అది చిన్నమస్త. ఈమె రాజశ్యామల. ఈయన జీసస్. ఇది వారాహి' అంది ఒకామె.
'మరి ఆమె?' అన్నాను మౌనంగా ఉన్న ఒకామెవైపు చూస్తూ.
'నేనేరా. భట్టిప్రోలు భయంకరిని. నన్నేగా పదిలక్షలకు అమ్మబోయావ్ ఇప్పుడే. నీ పని చెప్పడానికే వచ్చాంరా అందరం' అని సోఫాలోనుంచి లేచింది ఆమె. ఆమెతోబాటు అందరూ లేచి నిలబడ్డారు.
నాకు స్పృహ తప్పింది.
16, మే 2025, శుక్రవారం
గురుగోచారం - మే 2025
నిన్న, గురుగ్రహం వృషభం నుండి మిధునం లోకి మారింది. తెలిసినవారికి వారి జీవితాలలో అనేక మార్పులు కనిపిస్తాయి. తెలీనివారికి ఏ బాధా లేదు.
గతంలో లాగా, రాశిఫలాలు వ్రాయదలుచుకోలేదు. కానీ ఈ గోచారాన్ని నిర్లక్ష్యం చేయలేము కూడా. అందుకే ఈ పోస్టు. దేశఫలాలు చూద్దాం.
మిధునంలో జీవకారకుని సంచారం కదా ! అమెరికాకు నూతనోత్సాహం వచ్చింది. అందుకేనేమో, 'యుద్ధాన్ని ఆపింది నేనే' అంటోంది. అంతేకాదు. ఇప్పటివరకూ టెర్రరిస్టులుగా తనే ముద్రవేసిన వాళ్ల దగ్గరకే వచ్చి మరీ గ్రూప్ ఫోటోలు దిగుతోంది. ఇప్పటిదాకా గ్లోబల్ టెర్రరిస్టులైనవాళ్లు ఉన్నట్టుండి రాత్రికి రాత్రే చాలా మంచివాళ్లై పోయారు. ఇదేం వింతో మరి?
అంతేకాదు. 'ఇండియాలో యాపిల్ ఫోన్లు తయారు చేయొద్దు' అని యాపిల్ సంస్థకు అమెరికా చెప్పింది. ఆఫ్కోర్స్ ! టిం కుక్ ఈ మాటను పట్టించుకోలేదనుకోండి. అది వేరే సంగతి ! ట్రంప్ మనల్నీ, రోగ్ దేశం పాకిస్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నాడు.
ట్రంప్ పక్కా వ్యాపారవేత్త. మనదేశం నుండి వేలాదికోట్ల డిఫెన్స్ డీల్స్ ఏవైనా అమెరికాకు దొరికితే హఠాత్తుగా ఇండియా ఎంతో మంచిదైపోతుంది. ప్రస్తుతం అది లేదుకదా ! అందుకని ఇప్పుడు మనం కనిపించం మరి. సహజమే !
మేషం నుండి మూడోభావంలో గురుసంచారం కదా ! పాకిస్తాన్ కు ధైర్యం తగ్గిపోతుంది. అయితే, త్వరలో రాహువు కుంభంలో లాభస్థానంలోకి వస్తాడు. అప్పటినుంచీ మళ్ళీ కుట్రలు ఊపందుకుంటాయి. IMF (Islamic Mujahideen Fund) డబ్బులొస్తున్నాయి కదా ! వాటిని టెర్రరిస్టులకు పంచి, మళ్ళీ మన దేశంపైకి వాళ్ళను ఉసిగొల్పుతుంది. పాకిస్తాన్ తో గట్టిగా వ్యవహరించడం ఒక్కటే దీనికి మార్గం. పొరపాటున కూడా పాకిస్తాన్ ను, బాంగ్లాదేశ్ ను నమ్మకూడదు. నమ్మితేమాత్రం వెన్నుపోటే. విశ్వాసం అనేది ఆ రక్తంలో ఉండదు.
మకరం నుండి శత్రుభావంలో గురుసంచారం గనుక, మనకు శత్రుబాధ ఉన్నప్పటికీ అది బాగా అదుపులో ఉంటుంది. మోదీగారి సమర్ధవంతమైన నాయకత్వమే దీనికి కారణం. మోడీవంటి కళంకం లేని దేశభక్తుడు మనకు PM గా ఉండటం మన అదృష్టం అన్నది ఎంతమంది గ్రహిస్తారో మరి !
బయట చూద్దామంటే టర్కీ, చైనా, పిల్లదేశం అజర్ బైజాన్ లు మాత్రమే మనకు శత్రువులు. కానీ దేశజనాభాలో దాదాపు 40 శాతం మన శత్రువులే. బయటివారికంటే లోపలివాళ్లే చాలా ప్రమాదం. మన దేశంలో ఉంటూ 'జై పాకిస్తాన్' అన్నాడంటే వాడిని వెంటనే మోసుకెళ్లి పాకిస్తాన్ బార్డర్లో పారెయ్యాలంతే. పోలీసులు, కోర్టులు ఏవీ ఈ విషయంలో కల్పించుకోకూడదు. లేదంటే ప్రస్తుత ఇజ్రాయెల్ పరిస్థితి ముందుముందు మనకు కూడా వస్తుంది.
గుంటనక్క టర్కీని ఆర్ధికరంగంలో బహిష్కరించడం చాలా మంచిపని. వీలైతే చైనాను కూడా అదే చెయాలి. ఆర్ధికరంగంలో దెబ్బ కొడితేనే ఎవడైనా మాట వినేది. మంచిమాటలు ఇలాంటివాళ్ల దగ్గర పనిచేయవు.
లేకపోతే, అతిమంచితనం చేతగానితనం అవుతుంది. విశ్వాసం లేని కుక్కలకు మంచితనం ఎందుకు చూపించాలి? దేశంకంటే ఏదీ ఎక్కువ కాదు కదా !
12, మే 2025, సోమవారం
మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల
స్వామివారి గురించి ఇంతకుముందు వ్రాసిన 'శివయోగ దీపిక' పోస్టులో వివరించాను. ఆయన వ్రాసిన గ్రంధములలో ముఖ్యమైనది 'ఆత్మవిద్యా విలాసము'. ఇది 64 శ్లోకములతో కూడిన చిన్న పుస్తకమే. కానీ భావగాంభీర్యతలో చాలా గొప్పది. ఈ శ్లోకములకు అర్థమును వివరిస్తూ, ఆటవెలది, కందము, ఉత్పలమాల ఛందస్సులలో పద్యములుగా తెనిగించాను. ఈ పద్యములను కేవలం రెండు రోజులలో వ్రాశాను.
'సదాశివేంద్ర స్తవము' లో 45 శ్లోకములున్నాయి. చాలావరకు 'ఆత్మవిద్యావిలాసము'లో ఇవ్వబడిన భావములనే స్వీకరించి, సదాశివేంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు ఈ శ్లోకాలను రచించారు. కనుక మొదటి 64 శ్లోకములలో వాడబడిన ఛందస్సులను మళ్ళీ వాడటం ఎందుకనిపించింది. అందుకని, ఒక క్రొత్త ఒరవడిలో, 'వృషభగతి రగడ' అనే ఛందస్సులో ఈ 45 పద్యములను రచించాను. కొన్ని పద్యములు, దీనికి దగ్గరి ఛందమైన 'మత్తకోకిల' లో వచ్చినాయి.
రగడలలో 20 దాకా రకాలున్నాయి. ఇవి, లయ-తాళ ప్రధానమైన ఛందోరీతులు. 'సదాశివేంద్రస్తవము'లో నేను వ్రాసిన పద్యములు పూర్తిగా ఛందోబద్ధములుగా లేవు. ఏమంటే, యతిప్రాసల చట్రంలో ఇముడ్చబడినపుడు, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛాసౌందర్యం కుంటుపడుతుంది. కనుక, లయకు నడకకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఈ పద్యములను వ్రాశాను. చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, రాగబద్ధంగా పాడుకోవటానికి రగడలు దరువులు చాలా తేలికగా హాయిగా ఉంటాయి.
శృంగేరీ పీఠాధిపతులందరూ ఈ 'ఆత్మవిద్యావిలాసము' ను వేదంతో సమానంగా స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీస్వామి వారైతే, తన చివరిక్షణం వరకూ ఈ పుస్తకమును దగ్గర ఉంచుకుని, దీని శ్లోకములను వింటూ దేహత్యాగం చేశారు.
ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి.
అవధూతోపనిషత్ మరియు అవధూతగీతలలో ఉన్న భావజాలమే దీనిలో ఇంకొకవిధంగా చెప్పబడింది. అవధూతోపనిషత్ అనేది కృష్ణయజుర్వేదమునకు చెందిన సన్యాసోపనిషత్తు. అంటే, సన్యాససాంప్రదాయమును ఉగ్గడించే శ్లోకములను కలిగి ఉంటుంది. ఇటువంటివి నాలుగువేదములలో కలిపి 19 ఉపనిషత్తులున్నాయి. ఇవి లౌకికజీవితమును పూర్తిగా త్యజించి, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడం పైన దృష్టిని ఉంచుతాయి. ఈ గ్రంథంలో చెప్పబడిన అవధూతస్థితి కూడా దీనినే వర్ణిస్తున్నది.
అవధూతస్థితిని గురించి అనుకోవాలంటే దత్తాత్రేయుల తరువాత సదాశివేంద్రులనే చెప్పుకోవాలి. ఈయన మన తెలుగువాడు మాత్రమే కాదు, మూడువందల ఏళ్ల క్రితం మనకు దగ్గరగా తమిళనాడులో నడయాడిన మహోన్నతుడు. మనమేమో ఇటువంటి మహనీయులను మర్చిపోయి, పీర్లను, ఫకీర్లను ఆరాధిస్తూ, దర్గాలలో తాయెత్తులు కట్టించుకుంటూ, మన మూలాలను మర్చిపోయి మతాలు మారిపోతూ, 'అందరూ దేవుళ్ళే కదండీ' అని నంగినంగి మాటలు మాట్లాడుకుంటూ, హిందూమతానికి ద్రోహులుగా, దరిద్రులుగా తయారై ఉన్నాము. ఇదీ మన పరిస్థితి !
యధావిధిగా ఈ గ్రంధమును వ్రాయడంలోనూ, విడుదల చేయడంలోనూ నాకు తోడునీడలుగా ఉన్న సరళాదేవి, అఖిల, లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతానికి ఇది E Book గా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, తెలుగుపద్యముల అభిమానులకు ఈ గ్రంధం మహదానందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను.




.jpeg)





