“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, మే 2018, బుధవారం

May - 2018 అమావాస్య ప్రభావం

నిన్న నిండు అమావాస్య.

అమావాస్య ప్రభావాన్ని మళ్ళీ రుజువు చేస్తూ నిన్న మంగళవారం నాడు ఏం జరిగిందో చూడండి.

తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం దగ్గర గోదావరిలో లాంచీ మునిగి 45 మంది జలసమాధి అయ్యి చనిపోయారు. కనీసం వాళ్ళు బయటకు కూడా రాలేకుండా, లాంచీ గది తలుపులు మూసేయ్యడంతో అంతమందీ శవాలుగా మారి, నది అడుగున ఆ లాంచీలో అదే గదిలో ఉన్నారు. 

దాదాపు ఏభై ఏళ్ళనుంచీ ఆ ప్రాంతంలో అవే లాంచీలు నడుస్తున్నాయట. టెక్నాలజీ మారినా అవే పాత లాంచీలు నడుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో, వాటిని ఏళ్ళ తరబడి ఓవర్ లోడ్ తో నడిపిస్తుంటే, సదరు మంత్రివర్గ అధికారులూ,  ప్రజా సంక్షేమం అంటూ ఇన్ని ఉపన్యాసాలు దంచే రాజకీయులూ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.

మన దేశంలో దేనికీ ముందుచూపు ఉండదు.  వాగుడెక్కువ పని తక్కువ. ఏదైనా జరిగాక అందరూ పోలో మంటూ గోల చేస్తారు. లేదా ఆ ప్రమాదం నుండి లబ్ది పొందుతారు. ఎటు చూచినా మన దేశంలో దోపిడీ తప్ప ఇంకేమీ లేదు. అందుకే ఎప్పుడో బీసీలో జరగాల్సిన ప్రమాదాలు ఇప్పుడు కూడా ఇండియాలో జరుగుతూ ఉంటాయి. అందుకే ఇతర దేశాలు మనల్ని చూచి హేళన చేస్తాయంటే చెయ్యవూ మరి ?

మరొక దుర్ఘటన !

అదే మంగళవారం, అంటే నిన్ననే, వారణాసిలో ఇంకా నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి సింపుల్ గా 16 మంది పచ్చడి అయిపోయారు.  కొన్ని కార్లు ఇతర వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఇంకా నిర్మాణం దశలోనే ఫ్లై ఓవర్ కూలిపోవడం ఏమిటో? దానిని కడుతున్న వారిపైన చర్యలు ఉంటాయో ఉండవో? ఈ దేశంలో అన్నీ శేష ప్రశ్నలే.

మళ్ళీ ఇదే మంగళవారం రోజున, గుంటూరులో పోలీస్ స్టేషన్ మీద ముస్లిం ప్రజలు దాడిచేసి రాళ్ళు రువ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలోని డొల్లదనానికి పరాకాష్ట. దానికి కారణం ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేయ్యబోయారట. జనానికి దొరికిపోయేసరికి అతను సరాసరి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. అతడిని రాజకీయులూ పోలీసులూ కలసి రక్షిస్తారేమో అని ముస్లిం వర్గాలు కోపం తెచ్చుకుని పోలీసులను, పోలీస్ స్టేషన్నూ, పోలీస్ వాహనాలనూ ఎటాక్ చేశాయి. లాఠీచార్జీలూ, రాళ్ళు రువ్వడాలూ వగైరాలతో అర్ధరాత్రిదాకా గుంటూరు పాత పోలీస్ స్టేషన్ ప్రాంతం రణరంగంలా ఉండి మరో కాశ్మీర్ ను తలపించింది.

ఇవన్నీ మంగళ వారం రోజునే, అందులోనూ అమావాస్య పరిధిలో జరగడం గమనార్హం.

అమావాస్య ప్రభావం మళ్ళీ రుజువైందా లేదా మరి ?