“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, ఆగస్టు 2017, బుధవారం

సూర్యగ్రహణ ప్రభావం - లేస్తున్న పెద్దతలలు

సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన తర్వాత కొన్ని పెద్ద తలకాయలు లేవడం మామూలే. ఎందుకంటే సూర్యుడు అధికారులకు నాయకులకు సూచకుడు. సామాన్యంగా అయితే రాజకీయ నాయకులో అధికారులో లేచిపోతుంటారు. కానీ ఈ సారి ఈ ఫోకస్ రైల్వే మీదకు వచ్చింది.

అమావాస్యా, సూర్యగ్రహణమూ, రాహుకేతువుల రాశి మార్పూ జరిగిన నాలుగు రోజులలోపే రెండు పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయి.

నిన్న రాత్రి, అంటే 23-8-2017 న తెల్లవారు ఝామున 2.55 గంటలకు ఉత్తర ప్రదేశ్ లో ఆచల్డా నుంచి డిల్లీ వెళ్ళే కైఫీయత్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. దీనికి కారణం అది ఒక టిప్పర్ ను గుద్దుకోవడమే. ఈ టిప్పర్ రైల్వే ట్రాక్ మీదకు ఎలా వచ్చిందో తెలియదు.ఎంక్వయిరీలో తేలుతుంది అంటున్నారు. యధావిధిగా ఒక 70 మంది బాగా గాయపడ్డారు.

దీనికి బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డ్ చైర్మన్ ఏకే మిట్టల్ రాజీనామా చేశారు. ఇంకా కొంతమంది టాప్ అఫిషియల్స్ కూడా లీవులో పంపబడ్డారు. ఇది డిసిప్లినరీ యాక్షన్ క్రిందకే వస్తుంది. మధ్య,క్రింది స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు.

ఈ చర్యల వల్ల జరిగిన నష్టం పూడిపోదు. కానీ సిస్టం లో భయం అనేది వస్తుంది. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని పనిచెయ్యడం అలవాటౌతుంది. అయితే, ఇప్పుడు ఉద్యోగులు అలా పని చెయ్యడం లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.

రైల్వే సిస్టం అనేది మిలిటరీ కంటే గట్టిది. మిలిటరీలో ఎప్పుడో గాని యుద్ధం రాదు. రైల్వేలో ప్రతి రోజూ యుద్ధమే. ప్రతిరోజూ టెన్షనే. ఎందుకంటే తెల్లారితే ఏరోజుకారోజే కొత్త. ప్రతిరోజూ సాయంత్రానికి అమ్మయ్య అనుకోవడం మళ్ళీ మర్నాడు టెన్షన్ తో నిద్ర లేవడమే రైల్వేలో సాధారణంగా జరిగేది.

అయితే ఈ మధ్యన రైల్వేలో పని గాడి తప్పిందనేది నిర్వివాదాంశం. మితిమీరిన, అర్ధంలేని బాసిజమూ, అందరూ నీతులు చెప్పడమే గాని ఆచరించేవారు ఒక్కరూ లేకపోవడమూ, ప్రతిదీ ఎదుటివాడి మీదో క్రిందవాడి మీదో తోసేసి చేతులు దులుపుకునే ధోరణీ, ఒక దారీ తెన్నూ లేని పనితీరూ, ఆచరణాత్మకం కాని టార్గెట్లూ, నిజమైన సమస్యను పై అధికారుల దృష్టికి తెస్తే పట్టించుకోకపోవడమూ, పరిష్కారం చూపకపోవడమూ, మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు ' మాకెందుకు చెప్పలేదు?' అనడమూ -- ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వేలో ఎన్నో ఎన్నెన్నో అవలక్షణాలున్నాయి.

రైల్వేలో ప్రధాన సమస్య ట్రాక్ మెయింటనెన్స్. కొత్తకొత్త లైన్లు వెయ్యకుండా, ఉన్న లైన్ల మీదే ప్రతి ఏడాదీ కొత్త కొత్త రైళ్ళు ప్రవేశపెడుతున్నారు. వాటి వేగాలు కూడా పెంచేస్తున్నారు. రోజుకు పది రైళ్ళు మాత్రమే నడవగలిగిన ట్రాక్ మీద ఇరవై రైళ్ళను కుక్కి కుక్కి నడిపిస్తున్నారు. ఈ మధ్యలో ట్రాక్ మెయింటనెన్స్ చెయ్యడానికి సమయం దొరకడం లేదు. అలా ట్రాక్ మెయింటనెన్స్ రెగ్యులర్ గా చెయ్యకపోతే ఏదో ఒకరోజున పట్టాలు విరిగో, బోల్టులు ఊడో, పెద్ద యాక్సిడెంట్ అవడం ఖాయం. అదే ఇప్పుడు జరుగుతున్నది.

మనిషికైనా మిషన్ కైనా మెయింటనెన్స్ అవసరం. రెస్ట్ ఇవ్వకుండా దానిని అదేపనిగా బాదుతూ ఉంటే ఏదీ ఎక్కువకాలం బ్రతకదు. కొన్నేళ్ళ క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో రైల్వే గూడ్స్ రవాణాలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెడుతున్నామంటూ CC+6+2 మరియు CC+8+2 అంటూ క్యారీయింగ్ కెపాసిటీ కంటే ఒక వ్యాగన్ కు రెండు టన్నులు ఎక్కువ లోడ్ చేసి ఒక్కసారిగా గొప్ప లాభాలు సంపాదించాం అని చంకలు చరుచుకున్నారు. కానీ ఈ చర్య వల్ల ట్రాక్ లైఫ్ స్పాన్ ఘోరంగా తగ్గిపోతుందని ఆనాడే నిపుణులు మొత్తుకున్నారు. ఎవరూ వినలేదు. ట్రాక్ లైఫ్ తగ్గిపోతే ఎక్కడికక్కడ రైల్ బ్రేకేజిలు, వెల్డ్ జాయింట్ బ్రేకేజిలు వస్తాయి. అప్పుడు ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం అదే జరుగుతున్నది.

రైల్వే వ్యవస్థలోని మౌలికమైన లోపం ఏమంటే - అసలైన సమస్యలను పట్టించుకోకుండా ఊరకే మీటింగుల మీద మీటింగులు పెట్టుకుని పేజీలకు పేజీలు JPO లు తయారుచేసి క్రిందవాళ్ళ మీద రుద్దడమే గాని అవి ఎంతవరకు ప్రాక్టికల్ అనే విషయం ఎవ్వరూ పట్టించుకోకపోవడమే. అంతేగాక అందినంత వరకూ ఆవునుంచి పాలు పిండుకుందామని ప్రయత్నమే గాని ఆ ఆవుకు తిండి సరిగ్గా పెడుతున్నామా దాని ఆరోగ్యం ఎలా ఉందో చూస్తున్నామా లేదా అనే విషయాన్ని ఎవ్వరూ గమనించడం లేదు.

ఒక పక్కన పంక్చువాలిటీ తగ్గకూడదు. ప్రతిరోజూ ఉదయం రైల్వే బోర్డు నుంచి మరీ ఈ పాయింట్ ను మానిటర్ చేస్తారు. ఏడాదికేడాది అదే ట్రాక్ మీద కొత్త కొత్త రైళ్ళు ప్రవేశపెడుతూ ఉంటారు. రైళ్ళు ఒకదాని వెంట ఒకటి క్రిక్కిరిసి నడుస్తూ ఉంటాయి. మధ్యలో ట్రాక్ మెయిన్టేనెన్స్ చెయ్యాలంటే వాటిని ఆపి, అంటే రైల్వే భాషలో చెప్పాలంటే ట్రాఫిక్ బ్లాక్ తీసుకుని, రైళ్ళను రెగ్యులేట్ చేసి, ఆ పని చెయ్యాలి. అది కుదరదు ఎందుకంటే అలా చేస్తే పంక్చువాలిటీ దెబ్బతింటుంది. ఎక్కువకాలం ఇలాగే సాగితే ట్రాక్ దెబ్బతింటుంది. అవ్వా కావాలి బువ్వా కావాలి. గిన్నెలో అన్నం గిన్నెలోనే ఉండాలి పిల్లాడి ఆకలి మాత్రం పూర్తిగా తీరాలి. ఒకపక్క పంక్చువాలిటీ, ఇంకో పక్క ట్రాక్ మెయింటేనెన్సూ రెండూ చెడకుండా సాగినంత కాలం సాగిద్దాం అనే ధోరణి టాప్ అధికారులది. విత్తు ముందా చెట్టు ముందా అనే సమస్యలాగే ఇదీ ఉంటుంది. చివరకు ఏదీ తేలదు. ఈలోపల సిస్టం ఎక్కడో ఒకచోట బ్రేక్ అవుతుంది. ప్రస్తుతం జరిగిన ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం ఇలాగే జరిగింది.

మౌలికమైన సమస్యలను పరిష్కారం చెయ్యకుండా పేరబెట్టుకుంటూ ఊరకే administrative jargon తో కాలక్షేపం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఇలాగే అవుతుంది మరి. మన దేశంలో ప్రాణాలకు విలువ ఎలాగూ లేదుకదా ! చూద్దాం మనవాళ్ళు దీన్నుంచైనా ఏవైనా పాఠాలు నేర్చుకుంటారో లేదో??