“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, అక్టోబర్ 2016, శనివారం

భారత్ పాకిస్తాన్ యుద్ధాలు - జ్యోతిశ్శాస్త్ర పరిశీలన - 4

ఈ పరిశీలన వల్ల మనకు కొన్ని సూత్రాలు అర్ధమయ్యాయి.వాటిని ఉపయోగించి ప్రస్తుతం ఏం జరుగుతుందో గమనిద్దాం.

దాదాపుగా ఆనాటి యుద్ధ పరిస్థితులే ఈనాడు కూడా మనకు కనిపిస్తున్నాయి.

యధావిధిగా ఇప్పుడు కూడా శనీశ్వరుడు వృశ్చికంలో ఉంటూ వృషభాన్ని చూస్తున్నాడు. రాహువు మన సుఖస్థానమైన సింహంలో ఉంటూ మన దేశంలోని శాంతికి సౌఖ్యానికి విఘాతం కలిగిస్తున్నాడు.ఇది పాకిస్తాన్ కు బుద్ధిస్థానం కనుక ఈ సమయంలో వారి నీచబుద్ధి చాలా బాగా పనిచేస్తుందని అనుకోవచ్చు.

కనుక జనవరి 27 తేదీతో శనీశ్వరుడు ధనూరాశిలో అడుగు పెట్టేవరకూ ఈ పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి.

ఈలోపల ఏం జరుగవచ్చో గమనిద్దాం.

అక్టోబర్ 31 వరకూ కుజుడు ధనూరాశిలో సంచరిస్తాడు.కనుక ఆ సమయంలో మేషరాశి అనేది కుజ రాహువుల ప్రభావంలో ఉంటుంది. అందుకని అక్టోబర్ నెల అంతా పాకిస్తాన్ దుందుడుకు చర్యలు కొనసాగుతాయి.

నవంబర్ 1 న కుజుడు మకరంలో అడుగు పెడతాడు.అప్పుడు కార్యరంగం భారతదేశానికి మారుతుంది.అప్పటి నుంచి డిసెంబర్ 12 వరకూ మళ్ళీ కుజుడు కుంభరాశిలో అడుగు పెట్టేటంతవరకూ మన దేశానికి గడ్డు కాలమే. పాకిస్తాన్ టెర్రరిస్ట్ చర్యల నుంచి మనం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. సరిహద్దు వెంబడే కాక, మన దేశం లోని స్లీపర్ సెల్స్ నుంచి కూడా పౌరులకు ప్రమాదం పొంచి ఉన్నది.సరిహద్దులో మనల్ని ఏమీ చెయ్యలేకపోతే, మన దేశంలోని వారి తొత్తులతో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలలో బాంబు దాడులు చేయిస్తారు.ఇది అందరికీ తెలిసినదేగా !

కనుక ఈ మూడు నెలలలో అక్టోబర్ 15 పౌర్ణమి, అక్టోబర్ 30 అమావాస్య,నవంబర్ 14 పౌర్ణమి, నవంబర్ 29 అమావాస్య, డిసెంబర్ 13 పౌర్ణమి, డిసెంబర్ 28 అమావాస్య రోజులకు అటూ ఇటూగా గొడవలు పెరిగే సమయాలే. వీటిలో డిసెంబర్ 28 ఎక్కువ ప్రమాదకరమైనది.ఈ సమయాలలో పాకిస్తాన్ తీవ్రవాదుల దుష్ట పన్నాగాలు ఊపందుకుంటాయి.

ఈ పరిస్థితులు జనవరిలో శనీశ్వరుని రాశి మార్పుతో అంతం అవుతాయని ఆశిద్దాం.