చాలామందిలో ఒక జబ్బును గమనిస్తున్నాను.
ఆశ్రమంలో మేమేం చేస్తున్నాము? మా ఆదర్శాలేమిటి? మా గమ్యాలేమిటి? వాటిని అందుకోవడానికి మేమనుసరిస్తున్న మార్గమేమిటి? ఇవేవీ వారికి ఆవసరం లేదు. దానిబదులు, వాళ్ళిష్టప్రకారం గానూ, వాళ్ళు ఊహించుకున్నట్లుగానూ మేమున్నామా లేమా? అన్నదానిని మాత్రమే చూస్తున్నారు.
నన్ను కలుస్తున్నవారిలో, మాట్లాడుతున్న వారిలో అందరూ ఇలాగే ఉన్నారు.
వాళ్ళెలా ఉన్నప్పటికీ, యధాప్రకారం నాకు మాత్రం నవ్వూ, జాలీ, ఈ రెండే కలుగుతున్నాయి.
మొన్నొకరోజున ఒకాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాను.
మాటలసందర్భంలో 'ఈరోజు తొలి ఏకాదశి' అన్నాడాయన.
నేనేమీ మాట్లాడలేదు.
'ఇవాళ విష్ణుదేవునికి పేలపిండి నైవేద్యం పెట్టాలి' అన్నాడు.
'అవునా !' అన్నాను.
'మీరు చేస్తున్నారా ఆశ్రమంలో?' అడిగాడు.
'మీరన్నది పేలపిండా లేక పేలాలపిండా?' అడిగాను.
అంత సున్నితంగా చెబితే ఈ జనానికెక్కడ అర్ధమౌతుంది?
'అదేలెండి. పేలాల పిండే. మా పల్లెటూళ్ళలో ఇలా కూడా అంటాము' అన్నాడు నవ్వుతూ.
నేనేమీ అనలేదు.
'ఏకాదశినాడు విష్ణుదేవునికి ఈ నైవేద్యం పెడిదే మంచిది' అన్నాడు మళ్ళీ.
యూట్యూబ్ యూనివర్సిటీలో బాగానే చదువుకుంటున్నాడు. ముచ్చటేసింది.
'విష్ణువు అనే పదానికి అర్ధమేమిటి?' అడిగాను.
'ఏముంది? విష్ణువే' అన్నాడు.
ఇంకేం మాట్లాడగలం?
నాకీమాత్రం కూడా తెలీనందుకు అతనికి నామీద చాలా జాలేసినట్టుంది.
'చెయ్యండి గురువుగారు. చేస్తే మంచిది' అన్నాడు మళ్ళీ.
'నాకు బట్టతలుంది. పేలు పడే అవకాశం లేదు.' అన్నాను.
పెద్దగా నవ్వి, 'అయితే ఏమైంది? నాకూ ఉంది, ప్రతి మొగాడికీ కొద్దో గొప్పో ఉంటుంది' అన్నాడు.
'పేలే లేనప్పుడు పేలపిండితో పనేముంది?' అన్నాను.
'అర్ధం కాలేదు' అన్నాడు నీరసంగా.
'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అని ఫోన్ పెట్టేశాను.