“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, జనవరి 2020, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (నామ నక్షత్రాల గోల)

పురోహిత జ్యోతిష్కులు జ్యోతిష్యశాస్త్రానికి చేసిన మరొక పెద్ద కీడు - 'నామనక్షత్రాలు' అంటూ ఒక స్కీమ్ తయారు చెయ్యడం. దీనిని కొంతమంది అజ్ఞానులు చాలా గుడ్డిగా పాటిస్తున్నారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే, జ్యోతిషశాస్త్రంలో ప్రతిదానికీ ఒక లాజిక్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఏ లాజిక్కూ లేదు.

జ్యోతిష్యశాస్త్రంలో లేని అనేక విషయాలు పంచాంగాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ 'పురోహిత జ్యోతిష్కుల' సృష్టే. వీటిని పాటించవలసిన పని ఏ మాత్రమూ లేదు. అసలు ఇలాంటి కట్టుకథలు సృష్టించబడడం వల్లనే ఎంతో గొప్పదైన జ్యోతిష్యశాస్త్రం ప్రజలలో తన విలువను కోల్పోయింది. నోరున్న ప్రతివాడూ ఎగతాళి చేసేలా తయారైంది నేడు దాని పరిస్థితి.

మీరు ఏ పంచాంగం చూసినా మీకిది కనిపిస్తుంది.

చూ-చే-చో-ల - అశ్వని
లీ-లూ-లే-లో - భరణి ..... ఇత్యాది

అంటే, అశ్వని మొదటి పాదంలో పుట్టినవారికి 'చూ' అనే శబ్దంతో మొదలయ్యే పేరు పెట్టాలని ఇది చెబుతుంది. ఈ అక్షరంతో పేరు పెట్టాలంటే 'చూడామణి' అనే పేరు తప్ప, లేదా, 'చుంచుమొహం', 'చుప్పనాతి' మొదలైన పేర్లు తప్ప ఇంకే పేర్లూ దొరకవు. ఇదే విధంగా మిగతా నక్షత్రాలకు కూడా ఉంటుంది. కానీ దీనికి ప్రమాణం మాత్రం ఎక్కడా మనకు దొరకదు. దీని వెనుక ఉన్న లాజిక్కూ దొరకదు.

దీనికి విరుద్ధంగా - ఒక జాతకంలో సప్తమంలో శని ఉంటే, ఆ జాతకునికి ఏమి జరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. లేదా అక్కడ కుజుడు ఉంటే, ఏమి జరుగుతుందో కూడా మనకు తెలుసు. వీటి వెనుక లాజిక్స్ ఉంటాయి. కానీ నామనక్షత్ర స్కీమ్ వెనుక ఉన్న లాజిక్ మాత్రం శూన్యం. తంత్రశాస్త్రంలోనూ, మంత్రశాస్త్రంలోనూ, నాడీశాస్త్రంలోనూ ఈ లాజిక్స్ ఉన్నాయని కొందరు భావిస్తారు. ఇవి మూడూ నాకు బాగానే తెలుసు. ఈ విషయం వరకూ, వాటిల్లో కూడా స్థిరమైన లాజిక్స్ ఎక్కడా నాకు కనపడలేదు.

లగ్నాధిపతికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, నక్షత్రాలకు ప్రాముఖ్యతనివ్వడం వల్లనే ఈ గొడవంతా మొదలైంది. ఈ గోల మొదలు పెట్టినవారు, జ్యోతిష్యశాస్త్రంలో లోతైన అవగాహన లేని పురోహిత జ్యోతిష్కులే.

పోనీ, నక్షత్రాలే ముఖ్యం అనుకుంటే, అభిజిత్ నక్షత్రం ఏమైంది? దానినెందుకు తీసేశారు? దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, అప్పుడు దానికేమేమి అక్షరాలూ పంచుతారు? ఎలా పంచుతారు? అసలు నక్షత్ర వైబ్రేషన్స్ ను ఎవరు లెక్కించారు? ఎలా లెక్కించారు? వీటికి జవాబులు లేవు.

అసలీ గోలంతా లేకుండా, దీనికంటే శాస్త్రీయమైన విధానం మరొకటి ఉంది.

లగ్నాధిపతిని బట్టి, లేదా లగ్నాన్ని బాగా ప్రభావితం చేస్తున్న గ్రహాన్ని బట్టి శిశువుకు పేరును పెట్టడం అనేది చాలా తార్కికమైన భావన. ఇది నామనక్షత్రం కంటే మంచిది. చాలా మంచి ఫలితాలనిస్తుంది కూడా.

పేరును బట్టి జాతకం చెప్పడం శుద్ధ తప్పువిధానం. అయితే దీనిలో ఒక సౌలభ్యం ఉంది. పాతకాలంలో, నామనక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు కనుక, ఒకరి పేరు తెలిస్తే, ఆ పేరులోనే మొదటి అక్షరాన్ని బట్టి అతని జన్మనక్షత్ర పాదం తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో తెలుస్తుంది. దాన్ని బట్టి, గోచార గ్రహాలను గమనించి స్థూలంగా ఫలితాలు చెప్పవచ్చు. ఇంతవరకూ ఈ విధానం పనికొస్తుంది. కానీ, అసలు మొదట్లో, ఈ నామనక్షత్ర స్కీమ్ ఎలా తయారైంది? దీని వెనుక ఉన్న లాజిక్స్ ఏమిటి? అన్న ప్రశ్నలకు స్పష్టములైన జవాబులు లేవు. దొరకవు.

ముస్లిం దండయాత్రలలో అగ్నికి ఆహుతైన వేలాది విలువైన గ్రంధాలలో ఈ సమాచారం ఉందని కొందరు వాదిస్తారు. అది నిజమే కావచ్చు. కానీ, కొన్ని తంత్రగ్రంధాలలో ఉన్న ప్రాధమిక సమాచారం తప్ప, ఈ సబ్జెక్టు మీద లోతైన వివరాలు ప్రస్తుతం మనకు దొరకడం లేదు.

లగ్నాధిపతి అయిన గ్రహం ఆ జాతకుడికి సూచిక. ఆ గ్రహానికి సంబంధించిన పేరు జాతకుడికి పెట్టడం తార్కికం అవుతుంది. క, చ, ట, త, ప సూత్రం ప్రకారం హల్లుల గ్రూపులకు గ్రహాల ఆధిపత్యం మనకు తెలుసు.

అచ్ఛులు - సూర్యుడు
క గ్రూప్ (క, ఖ, గ, ఘ, జ్ఞ) - కుజుడు
చ గ్రూప్ (చ, ఛ, జ, ఝ,న్య ) - శుక్రుడు
త గ్రూప్ (త, థ, ద, ధ, న ) - గురువు
ట గ్రూప్ (ట, ఠ, డ, ఢ, ణ ) - బుధుడు
ప గ్రూప్ (ప, ఫ, బ, భ, మ) - శని
య గ్రూప్ (య, ర, ల, వ, శ, ష, స, హ) - చంద్రుడు

సూర్యుడూ చంద్రుడూ బింబగ్రహాలు. అంటే, మండలాకారంలో (Circle) ఉండే గ్రహాలు. మిగతా ఐదూ తారాగ్రహాలు. అంటే చుక్కల్లాగా (Dot) ఉండే గ్రహాలు. మండలంలో బిందువు (Dot in Circle) అనేది శ్రీచక్రానికి, static and dynamic energies of the universe కి సూచిక.

దీనిలో ఉన్న యోగరహస్యాలను కొద్దిగా ఇక్కడ స్పృశిస్తాను. నా ఇన్నర్ సర్కిల్ శిష్యులకు ఇవన్నీ సుపరిచితాలే.

'అ' అనేటప్పుడు ఊపిరి లోనికి పీలుస్తాము. అంటే ఉచ్ఛ్వాసం. 'హ' అనేటప్పుడు ఊపిరి వదులుతాము. అంటే, నిశ్వాసం. అక్షరాలన్నీ 'అ' నుంచి 'హ' మధ్యలోనే ఉన్నాయి. అందుకే 'అహమ్ (నేను)' అనేది దైవానికి గల అసలైన పేరు. ఈ దైవం అహమ్ అహమ్ అంటూ నిత్యం మనలో ఊపిరిగా సంచరిస్తూ ఉన్నది. ఇదే మనలో నిత్యం సాగే అజపాజపం. అందుకే అది మనలోనుంచి పోతే, దైవం మనల్ని వదిలేస్తే, మనం చనిపోతాము.

అలాగే కుజాది అయిదు గ్రహాలూ సూర్యచంద్రుల మధ్యలోనే ఉన్నాయి. వాటి అక్షరాలు కూడా అలాగే ఉన్నాయి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు గనుక వాటికి అక్షరాలు లేవు. అవి ఏ రాశిలో ఉంటె, ఆ అక్షరం ఆ శబ్దం వాటిదై పోతుంది.

కుజ, శుక్ర, గురు, బుధ, శనిగ్రహాల అధీనంలో ఉన్న 5x5= 25 శబ్దాలు + చంద్రుని అధీనంలో ఉన్న 8 శబ్దాలు మొత్తం 33. ఈ 33 అక్షరాలే వేదకాలంలో పూజింపబడిన ముప్పై ముగ్గురు దేవతలు. ఇవి సృష్టిని నడిపించే వైబ్రేషన్స్ లేదా ధ్వనిశక్తులు. వీటిల్లో అ నుంచి అ: వరకూ ఉన్న అచ్చులు అంతర్లీనంగా ఉంటూ వాటిని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే, ప్రకృతి శక్తులకు సూర్యశక్తి ఆధారం అయినట్లుగానే, హల్లులకు అచ్ఛులే ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు, క్ అనేదానికి అ అనే శబ్దం కలిస్తేనే క అనే శబ్దం వస్తుంది.  అంటే, క్ అనే మూలశబ్దానికి అ అనే శబ్దం ఆధారంగా ఉన్నది.

సందర్భం వచ్చింది గనుక, వేదకాలపు ప్రాచీన దేవతలు ఎవరో ఒకసారి చెప్తాను.

అష్టవసువులు      -       8 మంది
ఏకాదశ రుద్రులు -     11 మంది
ద్వాదశ ఆదిత్యులు - 12 మంది
అశ్వనీ దేవతలు -       2
మొత్తం -                     33

కొన్ని చోట్ల అశ్వనీ దేవతల బదులుగా ఇంద్రుడు, ప్రజాపతి ఉంటారు. మొత్తం మీద ఎలా చూచినా ఈ 33 దేవతలే వేదాలలో ఉన్నారు. ప్రకృతిలో కూడా మనకు ఇవే శక్తులు కనిపిస్తాయి.

నేడు మనం పూజిస్తున్న దేవతలందరూ, వేదకాలపు దేవతలు కారనీ, పురాణకాలంలో మనం కల్పించుకున్న రూపాలేనన్నది ముందుగా మనం గ్రహించాల్సిన చేదునిజం. నేడు మనం పూజిస్తున్న దేవతలెవరూ వేదాలలో లేరు. నేడు వైదికులుగా చెప్పుకుంటున్నవారు కూడా వేదకాలపు దేవతలను పూజించడం లేదు. పురాణకాలపు దేవతలని పూజిస్తున్నారు. అసలు వేదాలలో ఏయే దేవతలున్నారో కూడా నేటి వైదికులలో ఎవరికీ గుర్తులేరు. ఇదొక విచిత్రం ! 

ఈ రకరకాల కల్పిత దేవతలకు కూడా ఈ 33 మూలశక్తి వైబ్రేషన్స్ మాత్రమే ఆధారశక్తులుగా ఉంటాయి. ఈ 33 అక్షరాల లోనుంచే అన్ని మంత్రాలూ పుట్టాయి. మంత్రశాస్త్రానికి కూడా ఈ 33 అక్షరాలే ఆధారాలు. అందుకనే మంత్రశక్తిలో (శబ్దశక్తిలో) దైవశక్తి ఉంటుందని మంత్రశాస్త్రం అంటుంది. ఇదే అసలైన మంత్ర - తంత్ర విజ్ఞానం.

కనుక, లగ్నాధిపతిని సూచించే మంత్రశబ్దాలైన అక్షరాల ప్రకారం జాతకునికి పేరు పెట్టడం కరెక్ట్ అవుతుంది. అంతేగాని, నామనక్షత్ర స్కీమ్ ప్రకారం పేర్లు పెట్టడం తప్పున్నర తప్పేగాక దాని వెనుక ఏ విధమైన లాజిక్కూ లేదు.

ఇకపోతే, పేర్లను బట్టి వివాహపొంతనం చూడటం కూడా శుద్ధ తప్పుపధ్ధతే. జాతకంలోని లగ్నభావం, చతుర్ధభావం, సప్తమభావం, అష్టమభావాలను గమనించి, ఇద్దరి జాతకాలలోనూ ఈ రెండూ సరిపోయినప్పుడు మాత్రమే వారిద్దరికీ వివాహం చెయ్యాలి. కానీ, ఇది నేటి జ్యోతిష్కులు చాలామంది పాటించడం లేదు. దీనిగురించి మరో పోస్ట్ లో వ్రాస్తాను.

ఈ నామనక్షత్ర స్కీమ్ ఎంత ఎగతాళి పాలైపోయిందంటే, పాతకాలంలోని ఏదో జానపద సినిమాలో మాంత్రికుడి శిష్యుడు 'లీలూలేలో -  దేదోచాచీ' మొదలైన మాటలను మంత్రాలుగా వాడుతూ ఉంటాడు. అంటే, కామెడీ మంత్రాలన్నమాట !

లగ్నాధిపతిని బట్టి జాతకుడికి పేరు పెడితే, ఆ పేరు వైబ్రేషన్ ఆ జాతకంతో తులతూగుతుంది (నేటి భాషలో చెప్పాలంటే, మ్యాచ్ అవుతుంది) కాబట్టి, ఆ పేరుతో పిలిచిన ప్రతిసారీ, అతని లగ్నం శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. ఆ విధంగా అతనికి మేలు జరుగుతుంది. దీనికి విరుద్ధంగా, ఏవేవో పిచ్చిపిచ్చి పేర్లు, లేదా నామనక్షత్రం ప్రకారం, లీలూలేలో స్కీమ్ ప్రకారం పేర్లు పెడితే దానికి విరుద్ధంగా జరుగుతుందని గమనించాలి. అప్పుడు ఆ జాతకుడికి మంచి జరగకపోగా, అతని జాతకంలో చెడు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, వేరే ఏదో లగ్నం పేరుతో ఆ జాతకుడిని  పిలవడం వల్ల అతని జాతకం శక్తిని కోల్పోతూ ఉంటుంది. అందువల్ల అతని జీవితంలో నెగటివ్ వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది !

నేను చెబుతున్నది నిజం అనడానికి ఒక రుజువును చూపిస్తాను !

చాలామందికి మామూలు పేరుతో బాటు ముద్దుపేర్లు ఉంటాయి. ఆ ముద్దుపేరుతో వారు పిలిపించుకుంటూ ఉన్నంత కాలం వారి జీవితం బాగా ఉంటూ ఉంటుంది. దానికి కారణం వారి జాతకంలో పుణ్యకర్మ బలంగా ఉండటమే. దానికి అనుగుణమైన ముద్దుపేరుతో వారు పిలువబడుతూ ఉండటమే !

దీనికి విరుద్ధంగా మరి కొంతమందికి వారి జాతకానికి విరుద్ధమైన ముద్దుపేర్లు చెలామణీలో ఉంటూ ఉంటాయి.  వారు ఆ పేరుతో పిలిపించుకుంటూ ఉన్నంతకాలం, వారి జీవితంలో చేదు అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. దీనికి కారణం వారి జాతకంలో బలంగా ఉన్న చెడు ఖర్మ.  అందుకే వారా పేర్లతో పిలువబడుతూ ఉంటారు.

ఒక ఉదాహరణ !

ఒకతనికి 'నాగ వెంకట ఆంజనేయ దుర్గా వరప్రసాద్' అని తల్లిదండ్రులు పేరు పెడతారు. ఇందులో, తాత ముత్తాతలనీ, కులదేవతలనీ అందరినీ కలుపుకుని ఆ పేరు పెడతారు. కానీ పిలవవలసి వచ్చేసరికి, "వెంకట్" అని మాత్రమే పిలుస్తూ ఉంటారు. లేదా, 'పప్పీ!' అంటూ కుక్కపేరుతో పిలుస్తూ ఉంటారు. అన్ని దేవతల పేర్లూ తన పేరులో ఉండి, చివరకు కుక్కపేరుతో ఆ వ్యక్తి పిలువబడుతూ ఉంటాడు. అలా పిలవబడటానికి కూడా ఆ జాతకంలో ఉన్న బలమైన గ్రహం ( వాడి ఖర్మను బట్టి అది చెడుగ్రహం కావచ్చు లేదా మంచిగ్రహం కావచ్చు) మాత్రమే కారణం అవుతుంది. అంతేగాని నామనక్షత్రమూ కారణం కాదు. లేదా మనిష్టం వచ్చినట్లు పెట్టుకునే పేరూ కారణం కాదు.

అలా పెట్టుకోడానికి కూడా ఆ మనిషికి స్వతంత్రం లేదన్నది సారాంశం. ఆ మనిషి జాతకంలో బలమైన గ్రహాన్ని బట్టి ఆ సమయానికి ఆ పేరు పెట్టబడుతుంది. ఆ పేరు పెట్టేవాడికి ఆ సమయానికి అలాంటి బుద్ధి పుడుతుంది. లేదా అలాంటి ముద్దు పేరుతో పిలిపిస్తుంది. ఆ పేరు పెట్టేవారు హిందువులైనా కాకపోయినా సరే, జాతకాలను నమ్మేవారైనా నమ్మనివారైనా సరే, ఇండియాలో ఉండేవారైనా, లేక విదేశాలలో ఉంటూ వేరేభాష మాట్లాడేవారైనా సరే, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గ్రహప్రభావాలకు మన నమ్మకాలతో, మనం ఉండే దేశాలతో, మనం మాట్లాడుకునే భాషతో పని లేదు.

'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ' అని పేరు పెట్టబడిన గాంధీజీ, 'బాపూ' అని  పిలువబడుతున్నాడు. జవహర్లాల్ నెహ్రూని 'చాచాజీ' అంటూ పిలుస్తున్నారు. అసలు పేర్లు పోయి, ఇవి మిగిలాయి. అది వారివారి ఖర్మను బట్టి జరుగుతుంది. అర్థమైందా అక్షరాల వైబ్రేషన్ శక్తి?

మనం నమ్మినా నమ్మకపోయినా ఎండ వేడిగానే ఉంటుంది, వెన్నెల చల్లగానే ఉంటుంది కదా మరి !