“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, ఆగస్టు 2018, సోమవారం

బ్లాగు భేతాళ కధలు - 7 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

va
'అసలు స్వామీజీకి ఈ క్షుద్రశక్తులెలా వచ్చాయి?' అడిగాను.

'అదంతా పెద్ద కధ. నాకూ తెలీదు. మాతాజీ చెప్పింది.' అన్నాడు సూర్య.

'ఎంత పెద్ద కధైనా సరే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను' అన్నాన్నేను.

'సరే నీ ఖర్మ ! విను ! హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడే, అంటే దాదాపు ఏభై ఏళ్ళ క్రితమే, స్వామీజీ తెలుగు సినిమాలు బాగా చూసేవాడు. వాటిల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు కొన్నున్నాయి. అవే - బాలనాగమ్మ, పాతాళభైరవి, మహామంత్రి తిమ్మరుసు, శ్రీనాధ కవిసార్వభౌముడు' అన్నాడు సూర్య.

'అదేంటి ఆయన టేస్ట్ అలా ఉంది? ఆయన ఎన్టీఆర్ వీరాభిమానా?' అడిగాను.

'కాదు. మంత్రతంత్రాల అభిమాని. జానపద చిత్రాల అభిమాని' అన్నాడు.

'నేనూ అంతేగా ! మా ఇద్దరి టేస్టూ ఒకటే ఈ విషయంలో' అన్నా నేనూ నవ్వుతూ.

'అవునా? ఆ సినిమాలు చూసి వాటిల్లోని మాంత్రికులలాగా ఈయన ఫీలై పోతూ ఉండేవాడు. ఎవరైనా హీరోతో ఐడెంటిఫై   అవుతారు. కానీ ఈయన విలన్ తో అయ్యేవాడు. ఆ సినిమాల్లోని మాంత్రికులే ఈయన రోల్ మోడల్స్. తన ఇల్లు కూడా బాలనాగమ్మ సినిమాలో మాంత్రికుడి గుహలాగా కట్టించుకున్నాడు. ఎన్నో క్షుద్రదేవతా విగ్రహాలను ఆ ఇంట్లో పెట్టించుకున్నాడు. వీళ్ళింటికి వెళితే, వాటిని దాటుకుంటూనే మనం ఈయన్ను కలవాలి. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలు లాగా, తిమ్మరుసు లాగా, శ్రీనాధుడిలాగా తనను తాను ఊహించుకుంటూ ఊహల్లో బ్రతుకుతూ ఉండేవాడు. ఆ క్రమంలో - 'పూర్వజన్మలో వీళ్ళందరూ తానే' అన్న గట్టి నమ్మకానికి వచ్చేసాడు.' అన్నాడు సూర్య.

'ఇదొక మానసిక రోగం సూర్యా! దీనినే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఇలాంటి వాళ్ళు తమను తాము పురాణపురుషుల లాగా ఊహించుకుంటూ ఉంటారు. అంతేకాదు, తమ చుట్టూ ఉన్నవాళ్ళను కూడా ఆ జన్మల్లో తమ అనుచరులుగా భావిస్తూ ఉంటారు. నేటి కుర్రకారులో కూడా చాలామంది సినిమా హీరోల లాగా ఊహించుకుంటూ జీవితంలో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అవే డైలాగులు చెబుతూ ఉంటారు. వీళ్ళంతా మానసిక రోగులు. హిస్టీరియా ఫస్ట్ స్టేజిలో ఉన్నవాళ్ళు. వీళ్ళకు సైకియాట్రీ ట్రీట్మెంట్ అవసరం.' అన్నాను.

'భలే చెప్పావ్ ! అలాగే జరిగింది.' అన్నాడు సూర్య.

'ఏమైంది? పిచ్చాసుపత్రిలో చేరాడా ఈయన?' అన్నా నేనూ ఉత్సాహంగా.

'లేదు. ఇలాంటి పిచ్చోడే ఇంకోడు ఈయనకు పరిచయం అయ్యాడు' అన్నాడు సూర్య.

'అవునా? ఎవరాయన? ఏమా కధ?' అడిగాను.

'అతని పేరు తిమ్మయ్య గౌడ్. ఇతను హైదరాబాద్ చుట్టుపక్కల, నల్గొండ, మిర్యాలగూడెం పరిసరాల్లో దొంగసారా బట్టీల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తిమ్మయ్య పేరు చూసి, ఇతనే పూర్వజన్మలో మహామంత్రి తిమ్మరుసని, తను క్రిష్ణదేవరాయలనీ అనుకున్నాడు స్వామీజీ.' అన్నాడు సూర్య.

'ఇంకా నయం. తను డాన్ క్విక్జోట్ అనీ, తిమ్మణ్ణి శాంకోపాంజా అనీ అనుకోలేదు సంతోషం' అన్నా నేను నవ్వుతూ.

'వాళ్ళెవరు?' అన్నాడు సూర్య ప్రశ్నార్ధకంగా.

'వాళ్ళా? నీ పూర్వజన్మలో నా బంధువుల్లే ! నువ్వు కానీ !' అన్నా నేను.

'నువ్వొకడివి. ఈ స్వామీజీకి తోడుబోయినట్టే ఉన్నావ్ ! అర్ధం కాని కేరెక్టర్స్ పేర్లు చెబుతూ ఉంటావ్!' అన్నాడు సూర్య.

'అది సరే ! కనీసం కామన్ సెన్స్ కూడా లేనట్టుందే ఈ స్వామీజీకి ! మహామంత్రి తిమ్మరుసు ఈ జన్మలో దొంగసారా బట్టీల వ్యాపారం ఎందుకు చేస్తాడు? తను గతజన్మలో కృష్ణదేవరాయలు అయితే ఈ జన్మలో కోచింగ్ సెంటర్ ఎందుకు నడుపుతాడు? కనీసం ఈ ఆలోచనైనా రాలేదా ఆయనకీ?' అడిగాను.

'ఏమో నాకదంతా తెలీదు. నువ్వు చెప్పినట్టే ఈ స్వామీజీకి ఏదో మానసిక రోగం ఉన్నట్టే ఉంది' అన్నాడు సూర్య.

'సరే. ఈ తిమ్మడు ఈయనకెలా పరిచయం అయ్యేడు?' అడిగా.

'వీళ్ళిద్దరికీ ఎక్కడ పరిచయమయిందీ తెలియాలంటే, అంతకంటే ముందు నీకు సుద్ధంకి రామ్మూర్తి గురించి చెప్పాలి' అన్నాడు సూర్య.

'మధ్యలో ఈ కేరెక్టర్ ఎవరు? నీ ఇష్టం వచ్చినట్టు కొత్త కొత్త క్యారెక్టర్స్ ని ప్రవేశపెడుతూ పోతే కధ చాలా పెద్దదై పోతుంది. తర్వాత నేను ఎడిట్ చెయ్యలేను' అన్నా నేను తనని ఉడికిస్తూ.

'ఇతనే ఈ కధలోకెల్లా చాలా ముఖ్యమైన కేరెక్టర్. విను. ఈ సుద్ధంకి రామ్మూర్తి ఒక మహామాంత్రికుడు. మనకు తెలిసిన బాబాల కంటే గొప్ప మహత్యాలు నిజంగా చెయ్యగల శక్తిమంతుడు. మంత్రతంత్రాలు నేర్చుకోడం కోసం స్వామీజీ ఈ రామ్మూర్తి దగ్గరకు పోతూ ఉండేవాడు. ఆయన దగ్గరే ఇతను ప్రత్యంగిరా మంత్రం నేర్చుకున్నాడు. దాన్ని సాధించాలంటే, సారాయి త్రాగి రాత్రిపూట నగ్నంగా స్మశానంలో కూచుని తెల్లవార్లూ జపం చెయ్యాలి. ఆ సారాయి కోసం తిమ్మయ్య గౌడ్ ని సారాబట్టీలో అప్రోచ్ అయ్యాడు స్వామీజీ. అలా వీళ్ళిద్దరికీ పరిచయం అయింది.' అన్నాడు సూర్య.

'ఏడిసినట్టుంది వీళ్ళ పరిచయం! అదేదో గాంధీకీ నెహ్రూకీ పరిచయం అయినట్టు చెబుతున్నావే? ఇంతకీ ప్రత్యంగిరామంత్రం ఈయనకు సిద్ధించిందా?' అడిగా నేను నవ్వుతూ.

'అదేమో నాకు తెలియదుగాని రోజూ సారాయి పుచ్చుకోవడం మాత్రం బాగా సిద్ధించింది. ఆ మత్తులో కూచుని వాగుకుంటూ 'నువ్వు కృష్ణదేవరాయలు, నేను తిమ్మరుసు, నువ్వు ప్రోలయ వేమారెడ్డి, నేను శ్రీనాధకవి సార్వభౌముడను అని ఇద్దరూ మురిసిపోతూ ఉండేవారు' అన్నాడు సూర్య.

పగలబడి నవ్వాను నేను.

'భలే బాగుంది కధ ! ఇంకా చెప్పు' అన్నా.

'ఇలా ఉండగా, ఈ స్వామీజీ మాయమాటలు నమ్మి కొందరు ఈయన చుట్టూ చేరడం మొదలుపెట్టారు. వాళ్లకు ఇలాగే కాకమ్మ కబుర్లు చెబుతూ, తనకు తోచిన మంత్రాలు వాళ్లకు ఉపదేశిస్తూ వాటిని జపించమని చెబుతూ ఉండేవాడు. ఆ మంత్రాలన్నింటినీ కోటీ సెంటర్లో ఆదివారంనాడు ఫుట్ పాత్ మీద అమ్మే పుస్తకాలలో తను కొన్న 'మళయాళ మంత్ర రహస్యములు' అనే పుస్తకం నుంచి సేకరించి వీళ్ళకు ఉపదేశిస్తూ ఉండేవాడు. ఇంకొంతమంది చేత, అర్ధరాత్రిపూట ఎండు మిరపకాయలు, మిరియాలు, ఆవాలు, బొగ్గులు, వెంట్రుకలు... ఇలాంటి వాటితో నానా ఛండాలపు హోమాలు చేయిస్తూ ఉండేవాడు. ఆ హోమాలన్నింటికీ తిమ్మరుసు ఇంచార్జిగా ఉండేవాడు. సారా బిజినెస్సు కంటే ఇదే బాగుందనిపించిన తిమ్మరుసు సారాబట్టీలు మూసేసి, హోమాలు చేయించడంలో బిజీ అయ్యాడు. అక్కడైతే, పోలీస్ రైడ్స్, ఎక్సైజ్ వాళ్ళను మేపడం ఈ గోలంతా ఉండేది. ఇక్కడదేమీ లేదు. ఒక్కో హోమానికి పదివేల నుంచి, లక్షదాకా వసూలయ్యేది. రోజుకు కనీసం నాలుగు హోమాలు జరిగేవి. రోజుకు ఎంత లేదన్నా మినిమం రెండు లక్షలు మిగిలేది.

వీళ్ళ కొత్త బిజినెస్సు ఈ రకంగా బ్రహ్మాండంగా సాగుతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. ఒకరోజున స్వామీజీ పూజించే ప్రత్యంగిరాదేవత విగ్రహం ఏరోప్లేన్ లాగా గాల్లోంచి తేలుకుంటూ వచ్చి ఈయన ఇంటి డాబామీద దిగి, మెట్లమీదుగా నడుచుకుంటూ కిందకొచ్చి, ఒక గదిలో సెటిలైంది.' అన్నాడు సూర్య.

నన్ను నేనే ఒకసారి గట్టిగా గిచ్చుకున్నా.

'చూడు బాసూ ! ఏదో వింటున్నా కదా అని, మరీ కాకమ్మ పిచ్చికమ్మ కధలు చెప్పకు. ఎలా కనిపిస్తున్నా నీకు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.' అన్నా.

గట్టిగా నవ్వాడు సూర్య.

'అది లోకానికి వీళ్ళు ప్రచారం చేసిన కధ. అసలు కధ ఏంటో నేను చెబుతా విను.' అన్నాడు.

(ఇంకా ఉంది)