అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

31, డిసెంబర్ 2015, గురువారం

నడక

మార్గమేమో సరళం
మనసేమో సంక్లిష్టం
ఎలా సాధ్యమౌతుంది?
నడక

ఆకలేమో అల్పం
ఆశేమో అనంతం
ఎలా కుదురుతుంది?
పడక

ప్రస్తుతం వెలితి
ప్రయాణం భీతి
ఎప్పటికి దక్కేను?
ప్రమోదం

వీడని అహం
వదలని ఇహం
ఎందుకాగుతుంది?
వినోదం

చుక్కలపై దృష్టి
లోలోపల నిత్యసృష్టి
ఎలా అందుతుంది?
ఆకాశం

ఫలసాయం ఆమోదం
వ్యవసాయం అతిహేయం
ఎలా తీరుతుంది?
ఆక్రోశం

త్రికరణం వెక్కిరిస్తుంది
ప్రతి ఋణం తీరనంటుంది
ఎలా దక్కుతుంది?
ముక్తి

అనుభవం ఆగనంటుంది
అనుదినం కరగిపోతుంది
ఎలా తగ్గుతుంది?
అనురక్తి

చేతితో వందనం
మనసులో బంధనం
ఎలా కలుగుతుంది?
మోక్షం

తలుపు తడుతున్న నేస్తం
గడియ తియ్యలేని హస్తం
ఎలా తెరుచుకుంటుంది?
గవాక్షం

మోముపై దరహాసం
మనసంతా మోసం
ఎప్పటికి కలుగుతుంది?
శాంతి

చీకటంటే వ్యామోహం
వెలుగుకై ఆరాటం
ఎలా వదులుతుంది?
భ్రాంతి
read more " నడక "

30, డిసెంబర్ 2015, బుధవారం

ఓ మహర్షీ ఓ మహాత్మా...

గుండె గుహలో నిత్యమెపుడు
నేను నేనను స్పందనముతో
వెలుగు కేవలమేది కలదో
అదియె నేనను నిజము నెరుగ
చిన్తనమునో మగ్నతమునో
శ్వాస నియమపు ఊత వలనో
అడుగు జేరుచు అణగిపోవుచు
అన్ని లోకము లాక్రమించుచు
ఆత్మ తానై నిలిచి జూడగ
ఆట ముగియును అంతు దెలియును
సాధనంబుల సారమిదియే

అంటూ సాధనా సారాన్ని మొత్తం ఒకే ఒక్క శ్లోకంలో ఇమిడ్చి చెప్పిన మహనీయుడు రమణమహర్షి పుట్టినరోజు మొన్న 26-12-2015 మార్గశిర బహుళ ద్వితీయ.

తేదీల ప్రకారం ఈరోజు.

ఆ మహనీయుని స్మరిస్తూ ఈ కవిత...
-------------------------------

దైవం జడం కాదన్న నిన్నే
ఒక విగ్రహంగా మార్చి పూజిస్తున్నాం
ప్రదక్షిణాలొద్దన్న నీ చుట్టూ
నిత్య ప్రదక్షిణాలు చేస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

తంతులెందుకన్న నీ చుట్టూ
అంతులేని తంతులను నిర్మించాం
సొంతగూటిని మర్చిపోయి
వింత అహంతో మంతనాలాడుతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

ఆత్మనిష్ఠవు నీవై నిరూపించినా
కర్తవ్యనిష్ఠను మాకై నువ్వు బోధించినా
వాటిని పాటించలేని అశక్తులం
బంధాలను తెంచుకోలేని గానుగెద్దులం 
ఓ మహర్షీ ఓ మహాత్మా...

మౌనబోధవై నీవు చెలగుతుంటే
మాటల ప్రశ్నలతో నిన్ను వేధిస్తున్నాం
జ్ఞానతేజస్సువై నీవు వెలుగుతుంటే
చీకటి గబ్బిలాలమై నిన్ను శోధిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

శుద్ధజ్ఞానపు వెలుగును చూడలేక
నాటకాలకు తెరలను దించలేక
మేటి బాటల సాగే ధాటిలేక
ఆటపాటల చెరలో అలమటిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

నువ్వు చెప్పేవి ఊరకే వింటున్నాం
మేం చేసేవి మాత్రం మేం చేస్తున్నాం
నిన్ను అనుసరిస్తున్నామన్న భ్రమలో
మా అహాలకే మేం ఆహుతౌతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

ఆత్మే దైవమని నీవెంతగా చెప్పినా
అనేక క్షేత్రాలలో దాన్ని వెదుకుతున్నాం
అవ్యయబోధను నీవు మాకిచ్చినా
అజ్ఞానపు బరువుతో అణగిపోతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

నీ వాక్యాలను ఇతరులకు బోధిస్తున్నాం
నీ గౌరవాన్ని మేం గుంజుకుంటున్నాం
నీతో మాత్రం నడవలేక పోతున్నాం
చీకటి బ్రతుకులలో తడబడుతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

మౌనంగా ఉండమని నీవంటే
నీపై స్తోత్రాలల్లి పాడుతున్నాం
నీలో నీవుండమని నీవంటే
లోకంతో సంసారం సాగిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

దేహభ్రాంతిని ఒదుల్చుకోలేక
మోహశాంతిని పొందే వీల్లేక
ఆత్మదీప్తిని అందుకోలేని అధములమై
ఆషాఢభూతులమై మిగిలిపోతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

వెలుగుచుక్కవై నీవు దారి చూపిస్తున్నా
వెయ్యి చీకట్లలో చిక్కి విలపిస్తున్నాం
బ్రతుకు మార్గాన్ని నీవు బోధిస్తున్నా
అతుకుల బొంతలమై అఘోరిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

ప్రశ్నలెన్నో అడుగుతాం
నీ జవాబును మాత్రం వినిపించుకోం
అడుగు వెయ్యమంటే లెక్కచెయ్యకుండా
మళ్ళీమళ్ళీ అవే ప్రశ్నలడుగుతాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

చిత్తశుద్ధిలేని మాకెప్పటికి నిష్కృతి?
విత్తమోహం వీడని మాకెప్పటికి సుగతి?
మొత్తం స్వార్ధంతో నిండిన మాకెప్పటికి ప్రగతి?
నిత్యసోమరులమైన మాకేనాటికి ఆత్మస్థితి?
ఓ మహర్షీ ఓ మహాత్మా...
read more " ఓ మహర్షీ ఓ మహాత్మా... "

29, డిసెంబర్ 2015, మంగళవారం

2nd Martial arts class Videos

27-12-2015 న గుంటూరులో జరిగిన రెండవ మార్షల్ ఆర్ట్స్ క్లాస్ నుంచి కొన్ని ఎంపిక చెయ్యబడిన వీడియో క్లిప్స్ ను ఇక్కడ చూడండి.

https://youtu.be/ISQUVPRFAUA
read more " 2nd Martial arts class Videos "

2015 లో పంచవటిలో ఏం జరిగింది?

2015 అయిపోవస్తున్నది.

ఈ సంవత్సరంలో 'పంచవటి' లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి.అనేక రకాలైన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.నా దారిలో నడవడానికి ఇష్టపడే అనేక కొత్త మెంబర్లు 'పంచవటి' లో చేరారు.

కొందరేమో రకరకాల కారణాలవల్ల ఇక్కడ ఇమడలేక నిష్క్రమించారు.మరికొందరు ఇందులో మెంబర్స్ అయినప్పటికీ,రకరకాల మానసిక ఆలోచనలలో భయాలలో చిక్కుకుని,ఈయన్నసలు అనుసరించాలా వద్దా, అని తేల్చుకోలేక సైలెంట్ గా ఉంటున్నారు.వారికి కాలం వేగంగా వృధా అవుతున్నది. 'సంశయాత్మా వినశ్యతి'.

ఇకపోతే, కొద్దిమంది మాత్రం ఇదొక మహదవకాశంగా స్వీకరించి నేను చూపిన మార్గంలో మనస్ఫూర్తిగా నడుస్తున్నారు.అసలైన ఆధ్యాత్మిక మార్గంలో వారి అడుగులు పడుతున్నాయి.కలలో కూడా ఊహించలేని ఆధ్యాత్మిక అనుభవాలు వారికి కలుగుతున్నాయి.ఆ క్రమంలో వాళ్ళ జీవితాలు గొప్పదైన ఆత్మసంతృప్తితో నిండుతూ జీవనసాఫల్యతను సంతరించుకుంటున్నాయి. 


అన్నింటినీ మించి వీరందరికీ ఒక 'ఫేమిలీ ఫీలింగ్' ఏర్పడింది. గట్టిగా చెప్పాలంటే వారివారి 'ఫేమిలీ మెంబర్స్' కంటే కూడా గట్టిదైన బాండ్ "పంచవటి" సభ్యుల మధ్యన ఏర్పడింది. 

2015 సంవత్సరం 'పంచవటి'కి చాలా సంతృప్తిని మిగిల్చింది.ఈ ఏడాది మొత్తం మీద 13 కార్యక్రమాలు జరిగాయి.

పోయిన ఏడాది డిసెంబర్ చివరలో 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం రిలీజ్ కావడం ఆ తర్వాతి శుభకార్యక్రమాలకు నాందీప్రస్తావన పలికింది.ఆయా కార్యక్రమాలను ఈ క్రింద చూడవచ్చు.
----------------------------
December - 2014
"శ్రీవిద్యా రహస్యం" పుస్తకావిష్కరణ - విజయవాడ.

February - 2015
మొదటి జ్యోతిష్య సమ్మేళనం-హైదరాబాద్
రెండవ జ్యోతిష్య సమ్మేళనం-విజయవాడ.

May - 2015
ఏడవ ఆధ్యాత్మిక సమ్మేళనం - శ్రీశైలం

June - 2015
'తారా స్తోత్రం' పుస్తకావిష్కరణ - విజయవాడ.

July - 2015
యోగా రిట్రీట్ - హైదరాబాద్

August - 2015
గురుపూర్ణిమ ఆధ్యాత్మిక సమ్మేళనం-గుంటూరు
జిల్లెళ్ళమూడి యాత్ర
మూడవ జ్యోతిష్య సమ్మేళనం - హైదరాబాద్

October - 2015
మొదటి మార్షల్ ఆర్ట్స్ క్లాస్ - గుంటూరు.

November 2015
మొదటి తంత్ర ఫౌండేషన్ మరియు ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్ క్లాస్ - గుంటూరు.

December 2015
నాలుగవ జ్యోతిష్య సమ్మేళనం - వైద్య జ్యోతిష్యం- హైదరాబాద్ 
రెండవ తంత్ర మరియు మార్షల్ ఆర్ట్స్ క్లాస్ - గుంటూరు

2016 లో నా అమెరికా ట్రిప్ తో మన "పంచవటి" కార్యక్రమాలు అమెరికాలో కూడా ప్రారంభం కాబోతున్నాయి.అక్కడి జిజ్ఞాసువులకు కూడా ఈ అమృతం అందబోతున్నది.నన్ను అనుసరించాలనీ నా మార్గంలో నడవాలనీ ఎదురుచూస్తున్న అమెరికా సభ్యులకు అప్పుడు దీక్ష ఇవ్వడం జరుగుతుంది.

పాతికేళ్ళ క్రితం పూజ్యపాద నందానందస్వామి వారు నాతో చెప్పిన మాట నేడు నిజమై ఈవిధంగా కళ్ళెదురుగా కనిపిస్తున్నది.

2016 లో "పంచవటి"లో ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు జరగాలనీ,మనదేశంలోనూ విదేశాలలోనూ ఉన్న పంచవటి సభ్యులు ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు ఎదగాలనీ,నిజమైన ఆత్మసాఫల్యతను అందుకోవాలనీ ఆశిస్తున్నాను.
read more " 2015 లో పంచవటిలో ఏం జరిగింది? "

28, డిసెంబర్ 2015, సోమవారం

2nd Martial Arts Class Photos

ముందే ప్లాన్ చేసినట్లు, రెండవ తంత్ర - మార్షల్ ఆర్ట్స్ క్లాస్ 27-12-2015 న జయప్రదంగా జరిగింది.నాతో గత నాలుగైదు ఏళ్ళుగా సన్నిహితంగా ఉంటున్న నా శిష్యులను మాత్రమే ఈ క్లాస్ కు ఎంపిక చెయ్యడం జరిగింది.

ఈ క్లాస్ లో "ఐకిడో" విద్యను పరిచయం చేస్తూ దానినుండి కొన్ని టెక్నిక్స్ ను వీరికి నేర్పడం జరిగింది.

అన్ని వీరవిద్యలలోకీ "ఐకిడో" అనేది చాలా రిఫైండ్ మార్షల్ ఆర్ట్ అని చాలామంది అభిప్రాయపడతారు.కారణమేమంటే - వింగ్ చున్ కుంగ్ఫూ లోవలె ఇందులోకూడా మినిమం మూమెంట్ తో మేక్జిమం ఎఫెక్ట్ రాబట్టడం ఉంటుంది.అంతేగాక ప్రత్యర్ధికి ఎక్కువ హాని జరగకుండా మానవతా దృక్పథంతో అతన్ని ఎంతవరకు కంట్రోల్ చెయ్యాలో అంతవరకు మాత్రమే చేసే విద్య ఇది.

ఇందులో 'కి' లేదా ప్రాణశక్తి కి సంబంధించిన అభ్యాసాలు ఉంటాయి.అయితే అవి సీనియర్స్ కి మాత్రమే నేర్పబడతాయి.

ఐ-కి-డో అనే జపనీస్ పదంలో మూడు మాటలున్నాయి.

ఐ - శబ్దానికి, కలయిక అని అర్ధం.
కి - శబ్దానికి ప్రకృతిలో ఉన్న ఎనర్జీ అని అర్ధం.
డో - అనే శబ్దానికి దారి లేదా మార్గం అని అర్ధం.

కనుక ఈ పదానికి - ప్రకృతిలోనూ తనలోనూ ఉన్న ప్రాణశక్తితో అనుసంధానం అవడం అనే అర్ధం వస్తుంది.

జపనీస్ విద్యలలో చాలావాటికి చివరలో 'డో' అనే పదం వస్తుంది. అంటే అదొక మార్గం లేదా ప్రత్యేకమైన విద్య అని అర్ధం.ఉదాహరణకు - జూడో - కెండో - నగినాట డో - కరాటే డో -బుషి డో మొదలైనవి. 

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.

వచ్చే పోస్ట్ లో వీడియో క్లిప్స్ చూడండి.
































 

read more " 2nd Martial Arts Class Photos "

25, డిసెంబర్ 2015, శుక్రవారం

అసలైన క్రైస్తవం

ఈరోజు క్రీస్తు జన్మదినంగా ప్రపంచం భావిస్తున్నది.అది నిజమో కాదో ఎవరికీ తెలియదు.అదొక నమ్మకం అంతే.ప్రపంచం నమ్మకాల మీదనే నడుస్తున్నది గాని సత్యాన్ని అనుసరిస్తూ నడవడం లేదు.ఏ మతమైనా నమ్మకాల నీడలోనే నిద్రిస్తున్నది గాని సత్యపు వెలుగులో నడవడం లేదు.ఆ విషయాన్ని అలా ఉంచుదాం.

క్రిస్మస్ సందర్భంగా ఆసలైన క్రైస్తవం ఏం చెబుతున్నదో చూద్దాం.అసలిదంతా ఎందుకంటే - అసలైన క్రైస్తవానికీ అసలైన హిందూమతానికీ ఏమీ భేదం లేదు.రెండూ ఒకటే.ఈ విషయాన్ని చెప్పడానికే ఈ టాపిక్ మీద వ్రాస్తున్నాను.ఈ ప్రయత్నాన్ని స్వామి యుక్తెశ్వర్ గిరిగారు కూడా చేశారు.అలా చెయ్యమని ఆయనకు బాబాజీ ఆదేశించారని తన "The Holy Science" అనే పుస్తకంలో వ్రాశారు.

అయితే తనకు అప్పటికి అందుబాటులో ఉన్న పురాణాలు బైబిలు ప్రతుల ఆధారంగా ఆయన ఆపనిని చేసే ప్రయత్నం చేశాడు. ఆయన తర్వాత చాలా నిజాలు క్రైస్తవ ప్రపంచంలో వెలుగుచూశాయి.వాటిని ఉపయోగించుకునే అవకాశం ఆయనకు రాలేదు.ఇప్పుడు గనుక ఆయన ఆపని చేస్తే ఇంకా అధికారికంగా వ్రాయగలిగి ఉండేవారు.


కైరోలో జరిగిన పురావస్తు తవ్వకాలలో 
'నాగ్ హమ్మడి' తాళపత్రాలు,వెస్ట్ బ్యాంక్ లోని కొన్ని గుహలలో "Dead Sea Scrolls"బయటపడటమే ఆ నవీన ఆవిష్కరణ.ఈ తాళపత్రాలలో ఉన్న విషయాలు ఇప్పటివరకూ క్రైస్తవులు నమ్ముతున్న సిద్ధాంతాల మౌలికత్వాన్నే ప్రశ్నించేటట్లు చేస్తున్నాయి.

హిందూమతమూ క్రైస్తవమూ ఒకటే విషయాన్ని చెబుతున్నపుడు ఇన్ని భేదాలెందుకని ప్రశ్న వస్తుంది? విషయం ఏమంటే, అసలైన హిందూమతం గురించి హిందువులకూ తెలియదు.అసలైన క్రైస్తవం గురించి క్రైస్తవులకూ తెలియదు.వీరిద్దరికీ తెలిసినదేమంటే - పాపులర్ హిందూమతమూ పాపులర్ క్రైస్తవమూ మాత్రమే.నిజానికి పాపులర్ హిందూమతం అసలైన హిందూమతమూ కాదు. పాపులర్ క్రైస్తవం అసలైన క్రైస్తవమూ కాదు.రెండూ పూర్తిగా అజ్ఞానపూరితాలే.

19 వ శతాబ్దపు ఆఖరులో ఈజిప్టు, వెస్ట్ బ్యాంక్ లలో జరిగిన త్రవ్వకాలలో "Dead Sea Scrolls" మరియు 'నాగ హమ్మడి' తాళపత్రాలు బయట పడేంతవరకూ క్రైస్తవమతంలో రహస్య జ్ఞానభాగం ఒకటి ఉన్నదన్న విషయం ప్రపంచానికి తెలియదు. ఈనాటికీ ఆ తాళపత్రాలలో ఉన్న విషయాలను ఆర్దోడాక్స్ చర్చి ఒప్పుకోవడం లేదు.అలా ఒప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా గత 2000 సంవత్సరాలుగా ప్రచారం కాబడుతున్న క్రైస్తవం అబద్దం కాకపోయినా పూర్తిసత్యం మాత్రం కాదు అని తేలుతుంది.అలా జరిగేపనైతే చర్చి ఆధిపత్యానికి గండి పడుతుంది.అందుకని ఆర్దోడాక్స్ చర్చి వర్గాలు ఈ నూతనంగా వెలుగుచూచిన ప్రాచీన విషయాలను ఒప్పుకోవటం లేదు.చర్చి దానిని ఒప్పుకోనంత మాత్రాన ఆ తాళపత్రాలు అబద్దమూ కావు.వాటిలోని విషయాలూ అబద్దాలు కావు.అవి సత్యాలే.

నిజానికి అవే అసలైన క్రైస్తవ జ్ఞాన భాగాలు.


నాగ్ హమ్మడి అనేది ఈజిప్ట్ లోని ఒక ప్రాంతం.1945 లో జరిగిన పురావస్తు త్రవ్వకాలలో ఒక సమాధిలో కొన్ని తాళపత్రాలు బయటపడ్డాయి.వాటిలో క్రీ శ.2 వ శతాబ్ది నాటి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. వాటిని చదివిన పరిశోధకులు నిర్ఘాంతపోయారు.అవి క్రైస్తవ మత సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు.దాదాపు 2000 సంవత్సరాల నాడు ఆ ప్రాంతంలో నివసించిన "ఎస్సీన్స్" అనబడే తెగకు చెందిన వ్రాతప్రతులు అవి.

ఈ తాళపత్రాలలో బయల్పడిన గ్రంధాలలో ఒకటి - "గాస్పెల్ ఆఫ్ మేరీ". ఇప్పటివరకూ ప్రపంచానికి తెలిసినవి నాలుగు గాస్పెల్సే.

అవి.

గాస్పెల్ ఆఫ్ జాన్
గాస్పెల్ ఆఫ్ మేథ్యూ 
గాస్పెల్ ఆఫ్ లూక్
గాస్పెల్ ఆఫ్ మార్క్

కానీ వీటికి భిన్నంగా 'గాస్పెల్ ఆఫ్ మేరీ' అని ఒకటున్నది ఇది కైరో త్రవ్వకాలలో బయటపడింది.ఇందులో ఇప్పటివరకూ క్రైస్తవమతానికి తెలిసిన సిద్ధాంతాలకు పూర్తిగా విభిన్నమైన భావాలు చాలా ఉన్నాయి.


గాస్పెల్ ఆఫ్  మేరీ నుంచి కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

శిష్యులు జీసస్ ను ఇలా ప్రశ్నించారు.

ప్రశ్న:--భౌతిక పదార్ధం అంతం అవుతుందా?
జవాబు:--ప్రపంచంలోని అన్నీ,చరాచర సమస్తమూ,జీవులూ అన్నీకూడా ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి.అవన్నీ అంతిమంగా వాటివాటి మూలాలుగా మారిపోతాయి.

భౌతిక పదార్ధం అంతా పంచభూతాలతో నిండి ఉన్నదనీ అవి వాటి వాటి తన్మాత్రలుగా చివరకు లయం అవుతాయనీ హిందూమతం చెబుతున్నది.ఇదే విషయాన్ని జీసస్ తన శిష్యులకు చెప్పాడు.

పీటర్ ఇలా ప్రశ్నించాడు.

ప్రశ్న:-- పాపం అంటే ఏమిటి? ఏది పాపం?
జవాబు:--ఈ ప్రపంచంలో పాపం అంటూ ఏదీ లేదు.కానీ మీరు చేసే వ్యభిచారం వంటి పనులవల్ల పాపాన్ని మీరే సృష్టిస్తున్నారు.

మామూలుగా క్రైస్తవ మతం అంతా 'పాపం' అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది.కానీ 'గాస్పెల్ ఆఫ్ మేరీ' ప్రకారం - పాపమనేదే లేదని జీసస్ అంటున్నాడు.ఇది కూడా హిందూమతపు భావనయే. వేదాంతం ప్రకారం అజ్ఞానం అనేది ఉన్నది కాని పాపం అనేది లేదు.వేదాంత భావననే ఇక్కడ జీసస్ చెప్పాడు.

ఆ తర్వాత ఒక సందర్భంలో మిగతా శిష్యులు అందరూ మేరీని ఇలా అడిగారు.

'నీవు జీసస్ తో చాలా సన్నిహితంగా ఉన్నావు కదా.మాకు చెప్పని విషయాలు నీకు ఏమేం చెప్పాడో అవన్నీ మాకు తెలియచెప్పు.'

దానికి మేరీ ఇలా జవాబిచ్చింది.

ఒకరోజున నేను ఆయన్ను ఒక దర్శనంలో చూచాను.ఆ విషయం ఆయనకు చెప్పాను.అప్పుడాయన ఇలా అన్నారు.

'మంచిది.నీ మనస్సు ఎక్కడుంటే అక్కడే నీ నిధి కూడా ఉంటుంది. (అంటే నీ మనస్సేదో నువ్వు అదే)'- అని అర్ధం.

వేదాంతం కూడా ఇదే మాట అంటుంది.శుద్ధ వేదాంత భావననే జీసస్ ఇక్కడ చెప్పాడు.

"మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో:" మనిషి యొక్క బంధానికి గానీ మోక్షానికి గానీ మనస్సే కారణం అవుతున్నది - అని ఉపనిషత్తులూ భగవద్గీతా అంటున్నాయి.

అప్పుడు నేను(అంటే మేరీ) ఆయన్ను ఇలా అడిగాను.

"ఒక వ్యక్తి ఒక దివ్యదృశ్యాన్ని చూచినప్పుడు దేనిద్వారా అతను ఆ దృశ్యాన్ని చూస్తాడు. ప్రాణం ద్వారానా? ఆత్మద్వారానా?"

దానికి జీసస్ ఇలా చెప్పాడు.

"ప్రాణం ద్వారానో ఆత్మ ద్వారానో  ఈ దర్శనాలు కనిపించవు.ఈ రెంటి మధ్యన ఉన్న మనస్సే ఆ దర్శనాలను చూస్తుంది."

ఇది కూడా శుద్ధ వేదాంత భావనయే.

ఇలాంటి అనేక వేదాంత భావాలు 'గాస్పెల్ ఆఫ్ మేరీ' లో ఉన్నాయి. ఆ భావాలను జీసస్ తనతో చెప్పినట్లు మేరీ మిగతా శిష్యులతో చెప్పింది.వాటిని వాళ్ళు నమ్మలేదు.వారిలో ఆండ్రూ,పీటర్ మొదలైన వారు ఆమెను ఖండించారు.కానీ వారందరిలో 'లెవీ' ఒక్కడే ఆమెకు వత్తాసుగా మాట్లాడాడు.

ఇలాంటి విషయాలు అందులో ఉన్నాయి గనుకనే ఈ గాస్పెల్ ను చర్చి ఒప్పుకోవడం లేదు.ఆనాడూ మేరీ ఈ విషయాలను చెబితే జీసస్ శిష్యులు ఒప్పుకోలేదు.ఈనాడూ చర్చి ఒప్పుకోవడం లేదు.అజ్ఞానం అంత త్వరగా సమసిపోతే అది అజ్ఞానం ఎందుకౌతుంది?

ఈ మేరి జీసస్ తల్లి కాదు. ఈమె మేగ్దలిన్ మేరి (Mary of Magdalene). న్యూ టెస్టమెంట్ ఈమెను ఒక వేశ్యగా చిత్రీకరిస్తుంది.కానీ సత్యం వేరు.

ఈమె వేశ్య కాదు.ఈమె ధనికురాలే గాక ఆప్రాంతంలో కొన్ని ఊళ్లమీద ఆధిపత్యం కలిగిన ఒక జమీందారిణి వంటి వ్యక్తి.ఈమె జీసస్ కు ప్రియురాలేగాక ప్రధాన శిష్యురాలు కూడా.ఈ ఇతివృత్తం మీద 'డావిన్సీ కోడ్' సినిమా వచ్చింది.ఆ విషయాలన్నీ నేను మళ్ళీ చెప్పబోవడం లేదు.

జీసస్ పరిచయం కాకముందు నుంచే మేరీ ఒక జిజ్ఞాసాపరురాలైన సాధకురాలు.ఆమె ఎన్నో మార్మిక గ్రంధాలు చదివింది.అలెగ్జాండ్రియా గ్రంధాలయంలో ఉన్న అనేక జ్ఞానగ్రంధాలను ఆమె శ్రద్దగా అధ్యయనం చేసింది.ప్రాచీన హిందూ బౌద్ధ మతాల జ్ఞానమంతా ఆ లైబ్రరీలో భద్రపరచబడి ఉన్నది.వాటన్నిటినీ ఆమె చదివింది.అనేక మార్మిక సాంప్రదాయాల జ్ఞానాన్ని,ఉపాసనా మార్గాలనూ ఆమె ఆకళింపు చేసుకున్నది. 

కానీ పుస్తకాల జ్ఞానం ఆత్మదాహాన్ని ఎప్పటికీ తీర్చలేదు. ఆత్మదాహం ఇంకొక ఆత్మద్వారానే తీరుతుంది. జీసస్ పరిచయంతో ఆమెలోని ఆత్మదాహం తీరింది.

తాను పుస్తకాలలో చదివిన జ్ఞానాన్ని ఆమె జీసస్ లో ప్రత్యక్షంగా చూచింది. ఎందుకంటే జీసస్ ఇండియా,టిబెట్ లలో ఏళ్ళ తరబడి సంచరించి అక్కడి వేదాలు ఉపనిషత్తులు బౌద్ధమతాల రహస్యజ్ఞానాన్ని సాధన చేసి అనుభవాలు పొంది సిద్ధపురుషుడై తిరిగి తమ దేశానికి వచ్చి ఉన్నాడు. తాను పుస్తకాలలో చదివిన విషయాలను ఆయన అనుభవంలో సంపాదించి ఉన్నాడు.

జీసస్ తన పన్నెండవ ఏట నుంచి ముప్పై ఏళ్ళు వచ్చేవరకూ, 18 ఏళ్ళపాటు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.క్రైస్తవ చరిత్రలో ఈ ఘట్టం ఎక్కడా రికార్డ్ కాబడి లేదు.దానిని వాళ్ళు "మిస్సింగ్ యియర్స్" అంటారు. అన్నేళ్ళు ఆయన ఏమైపోయాడో ఎవరికీ తెలియదు.మామూలు క్రైస్తవులు ఆయనా సమయంలో గెలీలీ లో ఒక వడ్రంగిగా పనిచేస్తున్నాడని భావిస్తారు.కానీ అసలు జరిగింది వేరు.


సత్యమేమంటే - ఆ 18 ఏళ్ళూ ఆయన ఇండియాలోని కాశీ పూరీ మొదలైన క్షేత్రాలలో నివసించాడు.దక్షిణాదికి కూడా వచ్చాడేమో మనకు తెలియదు.కానీ ఉత్తరాదిలో ఆయన నివసించినట్లు ఆధారాలున్నాయి.ఎందుకంటే ఆ రోజుల్లో దైవిక మార్మిక విజ్ఞానానికి భారత దేశమూ ఈజిప్తూ కేంద్రాలుగా ఉండేవి.ఈజిప్టుకు కూడా ఈ జ్ఞానం మన దేశంనుంచే పోయింది.కనుక ధార్మిక దైవ విజ్ఞానానికి మూలకేంద్రమైన మన దేశాన్ని సందర్శించి ప్రాక్టికల్ గా ఆ విషయాలు నేర్చుకోవాలని ఆయన అనుకోవడంలో వింత ఏమీ లేదు.


ఆ విధంగా మన దేశంలో ఉన్న సమయంలో వేదజ్ఞానాన్నీ ఉపనిషద్ జ్ఞానాన్నీ మాత్రమేగాక యోగతంత్ర సాంప్రదాయాల మార్మికజ్ఞానాన్ని ఆయన ఔపోసన పట్టినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత ఆయన టిబెట్ లోని బౌద్ధారామాల్లో ముఖ్యంగా 'హెమిస్ మొనాస్టరీ' లో చాలాకాలం నివసించినట్లు ఆ మొనాస్టరీ లైబ్రరీలో జాగ్రత్తగా భద్రపరచబడి ఉన్న తాళపత్రాలలో స్పష్టంగా వ్రాసి ఉన్నది.


ఈ విషయాలన్నింటినీ పరిశోధించిన వారు కొందరున్నారు.


వీరిలో లూయిస్ జాకోలియట్(1869), నికొలాస్ నోటోవిచ్(1887), లెవి డౌలింగ్(1908),హోల్జర్ కేర్స్టెయిన్ (1981) మొదలైనవారు ప్రముఖులు.వీరంతా కూడా జీసస్ ఆ 18 ఏళ్ళూ ఇండియాలో ఉన్నాడని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.

  
నోటోవిచ్ తన "సీక్రెట్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రీస్ట్" అన్న పుస్తకంలో చాలా ఆధారాలను ఉటంకించాడు.ఆ తర్వాత ఎందఱో పరిశోధకులు పరిశోధించి అది నిజమే అని తేల్చారు.ఎందఱో అహంమదీయా శాఖానుయాయులూ ఇదే చెప్పారు.చివరికి మెహర్ బాబా కూడా ఇదే భావాన్ని నిర్ధారించాడు.జీసస్ సిలువమీద చనిపోలేదనే వీరందరూ చెప్పారు.ఖురాన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించిందని అహంమదీయా శాఖను అనుసరించేవారు ఖురాన్ లోని శ్లోకాలను ఉటంకిస్తూ నొక్కివక్కాణిస్తారు.జీసస్ సమాధి ప్రస్తుత కాష్మీరులోని 'పహల్ గావ్' లో ఉన్నదని కూడా చాలామంది పరిశోధకులు నిర్ధారించారు.

కానీ క్రైస్తవ సమాజం ఈ విషయాలను ఒప్పుకోవడం లేదు.అలా ఒప్పుకోకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి.అలా ఒప్పుకుంటే వాళ్ళ ఐడెంటిటీ పోతుందేమో అన్న భయం దానిలో ప్రధానమైనది.వాళ్ళ భయాలు ఎలా ఉన్నప్పటికీ జీసస్ తనను శిలువ వెయ్యడానికి ముందూ వెనుకా కూడా ఇండియాలో నివసించాడనేది వాస్తవం.అక్కడే కాష్మీరులో మామూలుగా అందరిలాగే చనిపోయాడనేది కూడా వాస్తవం. వ్యాసమహర్షి వ్రాసిన మన "భవిష్యపురాణం" లో కూడా దీనికి ఆధారాలున్నాయి.


ఆ విషయాలన్నీ ప్రస్తుతానికి అలా ఉంచుదాం.


ఆ విధంగా ఇండియా టిబెట్ లలో 18 సంవత్సరాల పాటు సంచరించి జ్ఞానిగా మారి తిరిగి వచ్చిన జీసస్ ను కలుసుకుని ఆయన వద్ద ఉన్న మార్మికజ్ఞానాన్ని పొందిన అదృష్టవంతులలో ప్రధమురాలు మేగ్దలీన్ మేరీ.ఆమె అప్పటికే ఎన్నో మార్మికగ్రంధాలను చదివి,అయినా తన ఆధ్యాత్మిక దాహం తీరక తపిస్తున్న ఒక స్వచ్చమైన ఆత్మ. జీసస్ పరిచయంతో ఆమెకు స్వర్గద్వారాలు ఒక్కసారిగా తెరుచుకున్నట్లు అయింది.తను ఇన్నాళ్ళు వెదుకుతున్న గురువు తన ఎదుట కన్పించాడు.ఆ ఆనందంలో ఆయనకు సర్వార్పణం గావించి ప్రియతమ శిష్యురాలిగా మారింది.


జీసస్ కూడా మిగిలిన పన్నెండుమంది శిష్యులకంటే మేరీని ఎక్కువగా ప్రేమించాడు.ఇందులో దాపరికం ఏమీ లేదు.ఈ విషయాన్ని ఆయన శిష్యులు కూడా ఒప్పుకున్నారు.ఎందుకంటే మిగిలినవారిలో కొంచం అనుమానం, తర్కం,వాదించే గుణం,అహం ఇలాంటి లక్షణాలుండేవి. కానీ మేరీలో అవి లేవు.ఆమె పూర్తిగా జీసస్ తో మమేకం అయిపొయింది.శరణాగతికి మారుపేరుగా మారింది.కనుక తన శక్తిని ఆమెకు ప్రసారం చెయ్యడం సులభమని జీసస్ భావించాడు.


అందుకని, తను ఇండియా టిబెట్ ఈజిప్టులలో సంపాదించిన మార్మిక జ్ఞానాన్ని మొత్తం ఆమెకు నేర్పాడు.మార్మిక దీక్షలిచ్చి ఆమెను అంతరిక ఆత్మమార్గంలో ముందుకు నడిపించాడు. ఆ క్రమంలో ఆమె మిగిలిన పన్నెండుమంది శిష్యులకంటే దైవమార్గంలో ఎంతో ముందుకు వెళ్ళిపోయింది. అది వారిలో కొందరికి రుచించేది కాదు. ముఖ్యంగా సెయింట్ పీటర్, సెయింట్ థామస్ లకు ఈమె వ్యవహారం నచ్చేది కాదు. మగవారైన తమను వదిలేసి ఒక మామూలు స్త్రీ అయిన ఈమెకు జీసస్ అంత విలువనివ్వడం వాళ్లకు మింగుడు పడేది కాదు.ఆ రోజుల్లో స్త్రీలంటే ఆధ్యాత్మిక గ్రూపులలో కూడా చాలా చిన్నచూపు ఉండేది.


స్త్రీలు నోరుతెరిస్తే అబద్దాలు ఆడతారనీ,వాళ్లకు మోరల్స్ ఉండవనీ,వాళ్లకు అసూయ ఎక్కువనీ,వాళ్ళు పుట్టింది మగవాడి ఆనందం కోసమేననే భావనలు ఆనాటి సమాజంలో ఉండేవి.కనుక స్త్రీలకు ఆనాటి సమాజంలో పెద్దగా విలువ ఉండేది కాదు.

జీసస్ శిలువ వెయ్యబడిన తర్వాత జరిగిన కొన్ని చర్చలలో కూడా ఆయా శిష్యులతో బాటు మేరీ కూడా ఉంటుంది.జీసస్ తనకు చెప్పిన బోధలను ఆమె వారికి చెబుతుంది.వారిలో కొందరు ఆమె భావాలతో తీవ్రంగా విభేదిస్తారు.


"ఈ బోధలు చాలా కొత్తగా ఉన్నాయి.ఇవి మనవి కావు.వీటిని జీసస్ ఎప్పుడూ మాకు చెప్పలేదు.నీకెలా చెప్పాడు?వీటిని మేము నమ్మాలా?"- అంటూ ఆమెను ధిక్కరిస్తారు.ఆమె చాలా బాధపడి,కన్నీటి పర్యంతమైపోయి 'నేను అబద్ధాలు చెబుతానని మీరెలా భావిస్తున్నారు?ఆయన ఈ విషయాలను నాతో చెప్పినది నిజమే.' అని నమ్మకంగా చెబుతుంది. అయినా సరే వాళ్ళు నమ్మరు.


అసలు విషయం ఏమంటే - జీసస్ తనకు తెల్సిన విషయాలను అన్నింటినీ ఒకేసారి ఉపన్యాసంలాగా అందరికీ సమానంగా చెప్పలేదు. నిజమైన ఏ గురువూ ఆ విధంగా చెప్పడు. ఎవరెవరి స్థాయిని, రిసీవింగ్ కేపాసిటీనీ బట్టి వారివారికి తగిన బోధను గావిస్తాడు.అది నిజమైన గురులక్షణం. అదే విధంగా జీసస్ కూడా సామాన్య జనానికి "విశ్వాసం" అనే బోధను మాత్రమె ఇచ్చాడు.తనను నమ్మమనీ,తనకు దైవాదేశం ఉన్నదనీ, దైవానుభూతి ఉన్నదనీ,తనయందు విశ్వాసం ఉంచి నిష్కల్మషమైన హృదయంతో ప్రార్ధిస్తే వారికి కూడా తనద్వారా తేలికగా దైవానుభూతి కలుగుతుందనీ చెప్పాడు.అదే నేడు చర్చి బోధనగా మారింది.ప్రపంచం మొత్తం ఈ "విశ్వాస" మార్గాన్నే ఇప్పుడు అనుసరిస్తున్నది.


కానీ అర్హులైన కొద్దిమంది అంతరంగికులకు మాత్రం ఆయన తన వద్దనున్న మార్మిక జ్ఞానాన్ని డైరెక్ట్ గా పంచిపెట్టాడు.వారికి రహస్యమైన మార్మిక దీక్షలిచ్చాడు. అంతరిక ప్రపంచంలో ఎలా ముందుకు నడవాలో దగ్గరుండి వారికి నేర్పించాడు.వారిని చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించాడు.ఆ దీక్షలన్నీ తాను ఇండియా టిబెట్ లలో నేర్చుకున్న యోగతంత్రమార్గాలే.వాటిని జనసామాన్యానికి ఆయన ఓపన్ గా బోధించలేదు.అలా చేస్తే - ఏదో విదేశీ మతాలను ఆయా పద్ధతులను తమమీద రుద్దుతున్నాదన్న కోపంలో ఆయన్ను వెంటనే చంపుతారని ఆయనకు తెలుసు. అప్పటికీ పైపైనే ఆయన వైదిక బౌద్ధమతాల బోధనలను ఆ దేశంలో చెప్పాడు.ఆ కొద్దిమాత్రానికే ఆయన్ను శిలువ వేశారు.ఇక ఆయా మతాల రహస్య సాధనలను బాహాటంగా బోధిస్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు.కనుక వాటిని తనకు బాగా దగ్గరైన ఇన్నర్ సర్కిల్ శిష్యులకు మాత్రమె బోధించాడు.


మళ్ళీ వాటిల్లో కూడా బాగా శక్తివంతములైన రహస్యములైన సాధనా విధానాలను మేరీ వంటి తన అంతరంగిక శిష్యులకు మాత్రమే నేర్పించాడు గాని అందరికీ నేర్పలేదు.


ఈ విధంగా ఆయన తన శిష్యులలో కూడా తరతమ భేదాలను బట్టీ వారివారి వ్యక్తిత్వాలను బట్టీ రిసీవింగ్ కెపాసిటీని బట్టీ బోధనలు మార్చుకుంటూ వెళ్ళాడు. ఆయనే కాదు ఏ సద్గురువైనా ఇదే చేస్తాడు.


నేను 1982-87 మధ్యలో గుంతకల్ లో ఉన్న రోజుల్లో నా శిష్యులలో కొందరు క్రిష్టియన్స్ ఉండేవారు.నేను హైస్కూలు రోజుల్నుంచే బైబిలు బాగా చదివాను.బైబుల్లో ఏ చాప్టర్ లో ఏముందో నేను చూడకుండా చెప్పేవాడిని.న్యూ టెస్టమెంటులో చాలాభాగం నాకు నోటికి వచ్చు.అంతగా ఆ పుస్తకాన్ని తిరగా మరగా చదివాను.


ఆరోజులలో నా శిష్యులను ఒక మాట అడిగాను.

'తన శిష్యులకు జీసస్ ఏ సాధనా విధానాన్నీ బోధించినట్లు బైబుల్లో ఎక్కడా కనబడదు.తనను నమ్మమని మాత్రమె ఆయన చెప్పాడు.కాకపోతే జీవితంలో పాటించవలసిన నీతినియమాలను గురించి మాత్రం "కొండమీద చేసిన ప్రసంగం"లో చెప్పాడు.అంతేగాని మార్మికమైన సాధనా విధానాలను తన శిష్యులలో ఎవరికీ ఎక్కడా ఉపదేశించినట్లుగా కనబడదు.ఏమిటీ వింత?అంత గొప్ప మహనీయుడు అలాంటివి ఏవీ చెప్పకుండా ఎలా ఉంటాడు?తన శిష్యులకు తనను నమ్మి అనుసరించినవారికీ ఏ ఉపదేశమూ ఇవ్వకుండా ఎలా ఉంటాడు? కనుక ఇందులో ఏదో మర్మం ఉన్నది.ఒకవేళ ఆయన చెప్పినా కూడా అవి చరిత్రవెలుగును చూడలేదా? కప్పబడిపోయాయా?లేదా ధ్వంసం చెయ్యబడ్డాయా?ఎందుకంటే తనకు నచ్చని ఎంతో మెటీరియల్ ను ఆవిధంగా చర్చి ధ్వంసం చేసినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి.ఈ విషయంలో మీకేమైనా తెలుసా?'


ఈ ప్రశ్నలకు వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళేదో మామూలు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాళ్ళు,వారానికొకసారి చర్చికెళ్ళి ప్రార్ధన చేసుకుని వచ్చే బాపతు మామూలు మనుషులు, వాళ్ళకీ లోతుపాతులు అర్ధం కాలేదు. అందుకని నేనడిగిన ప్రశ్నలకు వాళ్ళు బిక్కమొహం వేశారు.వాళ్లకు విషయం తెలియదని అర్ధమై నేనూ మౌనం వహించాను.


నిజమేమంటే -- జీసస్ తన మార్మికజ్ఞానాన్ని అత్యంత అర్హులైన అతి కొద్దిమందికి మాత్రమే అందించాడు.మిగతా శిష్యులకు 'విశ్వాసం' అన్నదాన్ని మాత్రమే ఇచ్చాడు,రెండవదైన "మార్మికజ్ఞానం"అన్నదానిని కొందరికే రుచిచూపించాడు.వారిలో ఆయన ప్రియశిష్యురాలైన మేరి ఒకతి. ఆమెకూడా తనకు తెలిసిన విషయాలను 'గాస్పెల్ ఆఫ్ మేరీ' గా వ్రాసింది.కానీ పురుషాధిక్య అపోస్తలుల ప్రభావం ముందు ఒక స్త్రీ వ్రాసిన గాస్పెల్ భూస్థాపితమై పోయింది.


దాదాపు 2000 సంవత్సరాల తర్వాత కైరో త్రవ్వకాలలో బయటపడేసరికి మేరీ గాస్పెల్ కొన్ని పేజీలు ధ్వంసమై ఉన్నాయి.లేదా వాటిని ముందుగా చదివిన క్రైస్తవులు వాటిని కావాలని ధ్వంసం చేసి ఉండవచ్చు.ఎందుకంటే తమ నమ్మకాలకు వ్యతిరకంగా ఉన్నట్టి విషయాలను అవి క్రైస్తవం అయినా సరే తట్టుకోలేని మనస్తత్వం వారిలో ఉంటుంది.


నమ్మకానికీ సత్యానికీ యుద్ధం జరిగితే నమ్మకమే గెలుస్తుంది గాని సత్యం గెలవలేదు. ఎందుకంటే నమ్మకం మూర్ఖంగా ఉంటుంది.సత్యం చాలా సున్నితమైనది.కనుక గెలుపు ఎప్పుడూ నమ్మకానిదే అవుతుంది.


జీసస్ తన అంతరంగశిష్యులతో చెప్పిన బోధనలలో పునర్జన్మ ఉన్నదనీ, ఆత్మ జననమరణ చక్రంలో తిరుగుతుందనీ,తనలోని మాలిన్యాన్ని వదిలించుకునేవరకూ ఆత్మకు జన్మలు తప్పవనీ,సాధనామార్గంలో తనను తాను ప్రక్షాళన చేసుకుని దైవాన్ని చేరుకునేవరకూ ఈ చక్రభ్రమణం తప్పదనీ చెప్పాడు.అయితే మిగతా బయటవారికి చెప్పిన బోధలలో మాత్రం ఇవే విషయాలను సూచనాప్రాయంగా మార్మికంగా మాత్రమె చెప్పాడు.వాటిని వారి నమ్మకాలకు తగినట్లుగా
వారు  అన్వయించుకున్నారు.అదే పాపులర్ క్రైస్తవం అయి కూచుంది.ప్రపంచం దీనినే అనుసరిస్తున్నది.

క్రీస్తు చెప్పిన రహస్యబోధలలో కర్మ ఉన్నది.పునర్జన్మ ఉన్నది.ఆయన మూడుశక్తులు(త్రిమూర్తులు) ఉన్నాయని చెప్పాడు.వాటినే Wisdom (బ్రహ్మ),Love(విష్ణు),Strength(రుద్ర) అన్నాడు.ఇవే ఇండియాలో ప్రసిద్ధి గాంచిన జ్ఞానమార్గం,భక్తిమార్గం,యోగ(తంత్ర)మార్గం అనబడే మూడు దారులు.


ఆత్మను గురించి,అంతరిక సాధన గురించి,ముక్తిని గురించి చెప్పాడు.క్రీస్తు చెప్పిన ఈ రహస్యబోధనలకూ హిందూమతపు మౌలికబోధలకూ ఏమీ భేదం లేదు.రెండూ ఒకటే.కారణం ఏమంటే జీసస్ మన దేశంనుంచే ఈ భావాలను గ్రహించాడు.

అయితే మేరీ చెప్పిన ఈ విషయాలతో విభేదించిన జీసస్ శిష్యులు ఆమెను గద్దించి నోరు మూయించారు.తమకు ఆయన చెప్పిన "విశ్వాసపరమైన" బోధలను మాత్రమె వారు లోకంలో ప్రచారం గావించారు.ఆ విధంగా జీసస్ కు తెలిసిన రహస్య మార్మికవిజ్ఞానం కొందరికే పరిమితం అయిపొయింది.ఆ తర్వాత మేరీ ఏమైందో ఎక్కడా రికార్డు లేదు.


కానీ జీసస్,తన తల్లి మేరీతోనూ,తన ప్రధాన శిష్యురాలూ ప్రియురాలూ అయిన మేరీతోనూ  తన శిష్యులు సెయింట్ బార్తోలోము (నతానియేల్), సెయింట్ ధామస్ లతో కలసి ఇండియాకు వచ్చేసి కాశ్మీరులో చాలాకాలం నివసించి తన నూట ఇరవయ్యవ ఏట అక్కడే కన్నుమూశాడు.ఇది నిజం. వీరిలో సెయింట్ బార్తోలోమును పర్షియాకు పంపించాడు.సెయింట్ ధామస్ ను ఇండియాలో దక్షిణాదికి పంపించాడు.ఆయన దక్షిణాదికి వచ్చి మద్రాసు మైలాపూరులో ఒక కొండ మీద నివాసం ఏర్పాటు చేసుకుని తమ భావాలను ప్రచారం చేస్తూ మద్రాసు లోనే కన్నుమూశాడు.ఆయన చనిపోయిన ప్రదేశమే ప్రస్తుతం 'సెయింట్ థామస్ మౌంట్' గా మద్రాసులో భాగంగా ఉన్నది.


జీసస్ చెప్పిన అసలైన రహస్య బోధలకు నేటి క్రైస్తవం పూర్తిగా విరుద్ధమైన భావాలను నమ్ముతున్నది.అనుసరిస్తున్నది.కానీ క్రైస్తవంలో ఒక శాఖ అయిన Gnostic Church మాత్రం జీసస్ యొక్క అసలైన ఈ రహస్య బోధలనూ భావాలనూ నమ్ముతున్నది.అనుసరిస్తున్నది.వీరి భావాలు మన హిందూమతపు  మౌలిక భావాలకు చాలా దగ్గరగా ఉంటాయి.వీరు కర్మను నమ్ముతారు.పునర్జన్మను నమ్ముతారు.త్రిమూర్తులను (రూపాలతో కాకుండా) నమ్ముతారు.శక్తిని నమ్ముతారు. ఇవన్నీ మన భావాలే.


కానీ మెజారిటీ క్రైస్తవులు వీటిని ఇంకా ఒప్పుకోవడం లేదు. Gnostic Church నీ,Nag Hammadi Tradition నూ,Dead Sea Scrolls నూ వాళ్ళు విశ్వసించడం లేదు.అలా ఒప్పుకుంటే వేలాది సంవత్సరాలుగా వాళ్ళు నమ్ముతున్న భావాలను వాళ్ళు సమూలంగా మార్చుకోవలసి వస్తుంది.అది వాళ్ళ మతానికి మౌలికమైన దెబ్బ అవుతుంది.


నమ్మకం ముఖ్యమా? లేక  సత్యం ముఖ్యమా? వాళ్ళు తేల్చుకోవాలి.


మన నమ్మకం అసత్యం అని తెలినప్పుడు ఆ నమ్మకాన్ని వదులుకొని సత్యాన్ని అనుసరించడమే ఉత్తమమైన పని.కానీ మనుషుల అహం వారిని అలా చెయ్యనివ్వదు.


ఒక ఉదాహరణ !!

మకర సంక్రాంతి నాడు శబరిమల కొండపైన కనిపించే జ్యోతిని చూడాలని వేలాదిజనం వేలంవెర్రిగా ఎగబడి కొంగల్లాగా మెడలు నిక్కించి చూచే ప్రయత్నంలో ఆ తొక్కిడిలో లోయల్లో పడి అనేకమంది ఇప్పటికి కన్ను మూశారు.ఆ తర్వాత జరిగిన గొడవల్లో-"అక్కడ మనుషుల్ని పెట్టి ఆ పనిని మేమే చేయిస్తున్నాము,అక్కడ బస్తాలలో కర్పూరం పోసి వెలిగిస్తున్నది మేమే" అని కేరళ గవర్నమెంట్ పబ్లిగ్గా కోర్టులో ఒప్పుకుంది.కనుక మకరజ్యోతి పచ్చిఅబద్ధం అని తేలిపోయింది.

అయినా సరే కరుడుగట్టిన అయ్యప్ప భక్తులు ఈనాటికీ ఆ జ్యోతి బూటకమని తెలిసినా సరే దానికోసం ఎగబడుతూనే ఉన్నారు. "ప్రభుత్వం వెలిగించకపోతే మేమే వెలిగించుకుంటాం.ఆ జ్యోతి బూటకం అయినా సరే.దానిని మేం చూడాల్సిందే."- అని అంటున్నారు.మనుషుల మూర్ఖత్వమూ అజ్ఞానమూ ఆ స్థాయిలో ఉంటాయి.

నమ్మకాలను - అవి నిరాధారాలూ అబద్ధాలూ అని తెలిసినా సరే - మనుషులు మార్చుకోలేరు.క్రైస్తవులకూ అయ్యప్ప భక్తులకూ అజ్ఞానంలో ఏమీ తేడా లేదు. దొందూ దొందే.

అన్నిమతాలూ అజ్ఞానపు నమ్మకాలనే అనుసరిస్తున్నాయి గాని నిజమైన దైవజ్ఞానాన్ని అవి అనుసరించడం లేదన్నది స్పష్టం.


ప్రపంచం తమ అసత్య నమ్మకాలను మార్చుకోగలిగిన పరిపక్వస్థితికి ఎదిగినప్పుడు మాత్రమే, నిజమైన క్రీస్తు బోధనలను అది అనుసరిస్తుంది. అప్పుడది సనాతనధర్మాన్నే అనుసరిస్తున్నట్లు అవుతుంది.

ఏదో నాటికి సత్యాన్ని అనుసరించడం ఎవరికైనా తప్పదుగా మరి !!
read more " అసలైన క్రైస్తవం "

22, డిసెంబర్ 2015, మంగళవారం

రంగనాధ్ విషాదాంతం వెనుక కొన్ని కోణాలు- ఆత్మహత్య నేరమా?

రంగనాధ్ విషయంలో జరిగింది ఆత్మహత్య అని అందరూ అంటున్నారు. పోలీస్ పరిశోధన ఇంకా జరుగుతూనే ఉన్నప్పటికీ,ఆయన టీవీ ఇంటర్వ్యూలలో బాహాటంగా చెప్పిన విషయాలను బట్టీ,మొదట్నించీ ఆయన మనస్తత్వాన్ని బట్టీ,ప్రస్తుత గ్రహప్రభావాన్ని బట్టీ అది ఆత్మహత్యే అని ప్రస్తుతానికి మనం కూడా అనుకుందాం.అధికారిక విచారణలో ఏం తేలుతుందో గమనిద్దాం.

ఈ సందర్భంలో ఒక మౌలికమైన ప్రశ్న తలెత్తుతున్నది.

'ఆత్మహత్య అనేది తప్పా?' అనేదే ఆ ప్రశ్న.

ఈ విషయం మీద అనేక దృక్కోణాలున్నాయి.

>>జీవితం మనం సృష్టించుకున్నది కాదు.అది భగవంతుని వరం.కనుక జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మనకు లేదని చాలామంది అంటారు.

ఈ వాదనని కొంచం పరిశీలిద్దాం.అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో మనకు తెలియదు.దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే.ఆడా మగా కలయికతో సృష్టి జరుగుతుందనేది అందరికీ తెలుసు.ఇందులో భగవంతుడు అనే కాన్సెప్ట్ తీసుకురావలసిన పని లేదని కొందరి వాదన.అలాంటప్పుడు జీవితం దేవుడిచ్చిన వరం అనే మాటలో అర్ధం లేదని వీళ్ళంటారు.మన జీవితం మనిష్టం గనుకా, బ్రతకడం బ్రతకకపోవడం మన ఇష్టం గనుకా, ఇక బ్రతకలేని పరిస్థితులలో ఆత్మహత్య తప్పు కాదనే వాదనలున్నాయి.

ఒక ఆఫీసులో మనం ఉద్యోగం చేస్తుంటాం.కొన్నాళ్ళకు అక్కడ మనం ఉండలేని పరిస్థితులు తలెత్తవచ్చు.అప్పుడు ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తాం.ఇంకొక ఉద్యోగ ప్రయత్నం చేస్తాం.ఇదీ అలాంటిదే.ఈ జీవితం దుర్భరం అయినప్పుడు ఇంకొక జీవితాన్ని వెదుక్కుంటూ వెళ్ళిపోవడం తప్పు కాదు.

>>ఆత్మహత్య అనేది చట్టరీత్యా నేరం అనే వాదన ఉన్నది.చట్టాలు మనం వ్రాసుకున్నవి.అవి శిలాశాసనాలేమీ కాదు.మన రాజ్యాంగాన్నే ఇప్పటికి 96 సార్లు మార్చిపడేశాం.అలాంటప్పుడు చట్టాలను కూడా మార్చుకోవచ్చు. ఈరోజు నేరం అనేది రేపు చట్టం మార్చబడితే నేరం కాకపోవచ్చు. ఒక దేశంలో వ్యభిచారం అనేది నేరం కావచ్చు.ఇంకొక దేశంలో అదే లీగల్ కావచ్చు.ఏదైనా మనం వ్రాసుకునే చట్టాలను బట్టి ఉంటుంది. కనుక ఈ కోణం కూడా ఒక స్థిరమైన రూలేమీ కాదు.

న్యాయశాస్త్రంలో కూడా ఉరిశిక్ష అనే దానిని పూర్తిగా తీసెయ్యాలన్న వాదనలున్నాయి.దానిని ఉంచాలన్న వాదనలూ తీసేయ్యాలన్న వాదనలూ సమానంగా ఉన్నాయి. లీగల్ జ్యూరిస్ ప్రుడెన్స్ అనే సబ్జెక్ట్ ఇలాంటి వివాదాస్పద విషయాలలో చర్చను ప్రోత్సహిస్తుంది.నేను లా చదివే రోజుల్లో ఇది నా ఫేవరేట్ సబ్జెక్ట్స్ లో ఒకటి.

ఉరిశిక్ష అనేది ప్రభుత్వం వేస్తే తప్పు కానప్పుడు మనకు మనం వేసుకుంటే తప్పెలా అవుతుంది? నా జీవితంలో నేను ఘోరంగా అశాంతికి గురయ్యాను. ఫెయిలయ్యాను.నాకంతా చీకటిగా కనిపిస్తున్నది.నాకీ లోకంలో ఉండాలని లేదు.కనుక అలాంటి పరిస్థితిలో నేను ఆత్మహత్య చేసుకోవడం తప్పెలా అవుతుంది? ఇప్పుడు తప్పు తప్పు అంటున్న వారందరూ ఆ మనిషి బ్రతికి ఉన్నపుడు ఏం సాయం చేశారు? అతను బ్రతకడానికి ఏం దోహదపడ్డారు? ఏమీ లేదు.కనుక ఆ మనిషి మానసిక స్థితిని తెలుసుకోకుండా అది తప్పు అనడమే అసలైన తప్పు.

నేడు ప్రముఖ నటులుగా చెలామణీ అవుతున్న వారిలో చాలామంది కనీసం రంగనాద్ మృతదేహాన్ని చూడటానికి కూడా రాలేదు.ఒక సీనియర్ ఆర్టిస్ట్ అన్న జ్ఞానం కూడా వాళ్లకు లేదు.ఇక ఇలాంటివాళ్ళకు ఆయన్ను విమర్శించే హక్కు ఎక్కడుంది?

>>>ఆత్మహత్య అనేది పిరికితనం.ఇది పిరికివాళ్ళు చేసే పని అని చాలామంది అంటుంటారు.ఈ మాట విన్నప్పుడు నాకు నవ్వొస్తూ ఉంటుంది.వాళ్లకు వాస్తవజ్ఞానం లేదు.ఆత్మహత్య పిరికితనం కాదు.ఆ పని చెయ్యాలంటే చాలా ధైర్యం ఉండాలి.జీవితాన్ని లెక్కచెయ్యని తెగింపు ఉండాలి. అది పిరికితనం ఎలా అవుతుంది?

ప్రతిమనిషికీ అత్యంత ప్రియమైనది తన దేహమే.దానికి కొంచం నొప్పి కలిగినా భరించలేడు.అలాంటిది ఏకంగా ఆ దేహాన్నే వదిలేయ్యాలన్న నిర్ణయం వెనుక ఎంత ధైర్యం ఉండాలో ఆలోచించవచ్చు.ఆ ధైర్యాన్ని ప్రోది చేసేవి పరిస్థితులు కావచ్చు,నిరాశానిస్పృహలు కావచ్చు,విరక్తి కావచ్చు ఇంకేదైనా కావచ్చు. కానీ అది పిరికితనం మాత్రం కాదనేది వాస్తవం. ఎంతో ధైర్యం ఉన్నవాడే ఆ పని చెయ్యగలడు అని నేనంటాను.

>> దీనిలో ఆధ్యాత్మికకోణం ఒకటి ఉన్నది.ఒక వ్యక్తి పూర్తి పరిపక్వతను పొంది జ్ఞాని అయినప్పుడు అతను ఆత్మహత్య చేసుకున్నా అది పాపమూ నేరమూ కాదు.నిజానికి దానిని ఆత్మహత్య అనరు.శరీరత్యాగం అంటారు.జ్ఞాని అన్నింటినీ త్యాగం చేస్తూ వస్తాడు.చివరకు తన దేహాన్ని కూడా త్యాగం చేస్తాడు. అది తప్పు కాదు.

శ్రీరామకృష్ణుల జీవితంలో ఒక సంఘటన ఉన్నది.ఆయన దగ్గరకు ఒక పదిహేనేళ్ళ కుర్రవాడు వస్తుండేవాడు.అతడు చాలా ఉన్నతమైన ఆత్మ. పూర్తిగా పారమార్ధికభావాలతో నిండి,అంత చిన్న వయసులోనే గంటలపాటు ధ్యానంలో ఉండేవాడు.ఎక్కడో కొండలలోకి అడవులలోకి పోయి రోజులతరబడి ధ్యానంలో గడిపేవాడు.ఆ సమయంలో అతనికి అనేక దేవీ దేవతల దర్శనాలు కలుగుతూ ఉండేవి.ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను ఆతను పొందుతూ ఉండేవాడు.మధ్యమధ్యలో రామకృష్ణుల దర్శనం చేసుకుని తన అనుభవాలను ఆయనకు వివరించి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉండేవాడు.

ఒకసారి అలా ఆయన దగ్గరకు వచ్చినపుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు.

'ఇదే మీ దగ్గరకు నేను ఈ దేహంతో వచ్చే చివరిసారి.'

రామకృష్ణులు చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు.

ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.దీనిమీద రామకృష్ణుల భక్తబృందంలోని వారు కొందరు సంశయాన్ని లేవనెత్తుతారు. దానికి ఆయనిలా జవాబిచ్చారు.

'మీలాంటి మామూలు మనుషుల నియమాలు జ్ఞానులకు వర్తించవు.జ్ఞాని అయినవాడు ఆత్మహత్య చేసుకున్నా కూడా అతనికి పాపం ఏమాత్రం అంటదు.అతడు లోకాచారాలకు అతీతుడు.ఈ నియమాలన్నీ మీకోసం మీరు పెట్టుకున్నవి.అతడు వాటికి అతీతంగా వెళ్ళాడు. తాను ఈ దేహాన్ని కానన్న అనుభవ జ్ఞానం అతనికి ఉన్నది.అలాంటప్పుడు ఈ దేహం ఉన్నా పోయినా అతనికి భేదం ఏమీ లేదు.జ్ఞానాన్ని పొందిన తర్వాత కొందరు ఇంకా దేహంలోనే ఉండటానికి ఇష్టపడవచ్చు. మరికొందరు వారి దేహాన్ని వదిలెయ్యవచ్చు.అదంతా వారి ఇష్టం.మీ లోకపు చట్టాలతో వారిని మీరు కొలవలేరు. ఈ అబ్బాయికి పాపం ఏమీ అంటదు.అతడు ఉత్తమగతిని పొందాడు. ఇక మీరు మౌనం వహించండి.'

అంతటితో ఇంకెవరూ ఆ విషయమై మాట్లాడలేదు.

శ్రీరామకృష్ణుల సమకాలికుడు పవహారిబాబా అని ఒక హఠయోగి ఉండేవాడు. ఆయన గాలిని మాత్రమే భోజనం చేసేవాడు.మనలా తిండి తినేవాడు కాదు. అందుకే ఆయనకు పవ(నా)హారి బాబా అని పేరొచ్చింది.ఆయన ఒక గుహలో ఉంటూ కొన్నికొన్ని హోమాలు చేస్తూ ఉండేవాడు.ఒకరోజున ఆయన ఉండే గుహలోనుంచి బాగా పొగ వస్తుంటే ఏమిటో చూద్దామని భక్తులు లోనికి వెళ్ళారు. ఏముంది? హోమగుండంలో ఆయనే కూచుని తగలబడి పోతూ కనిపించాడు.అంటే - అన్నింటినీ హోమం చేస్తూ వచ్చి వచ్చి చివరకు తన శరీరాన్నే హోమగుండంలో సమిధగా సమర్పించాడు ఆయన.

దీనిని ఏమనాలి? ఆత్మహత్య అని దీనిని అనగలమా? అనలేము.

అసలు విషయం ఏమంటే - దైవన్యాయం అనేది మానవన్యాయం కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. దీనిని అర్ధం చేసుకోవడం కష్టం.ఇది అందరికీ అర్ధం కాదు.

చాలామంది యోగులు తమ ఇష్టానుసారం తమ దేహాలను వదిలేస్తుంటారు. వాళ్ళకది నేరం కాదు.అసలు యోగం యొక్క పరమావధి - బ్రతికుండగానే మరణించడమే.జీవితకాలం ఇంకా ముగియకముందే మరణాన్ని తనంతట తాను టేస్ట్  చెయ్యడమే ధ్యానం యొక్క అసలైన గమ్యం. మరణపు హద్దులలోకి తనంతట తాను అడుగుపెట్టి మళ్ళీ వెనక్కు తిరిగిరావడమే యోగి యొక్క పరమగమ్యం.

పాతకాలంలో రాజులూ మునులూ చాలామంది ప్రాయోపవేశం చేసేవారు. అంటే తిండి మానేసి ఆరుబైట ఒక దర్భచాప పైన పడుకుని చావు వచ్చేంతవరకూ దానికోసం అలా ఎదురు చూచేవారు.అలాగే చనిపోయేవారు. జైనమునులు చాలామంది ఇలాగే దేహాన్ని వదిలేసేవారు.అంతెందుకు? మనం వాడవాడలా దైవంగా కొలిచే శ్రీరామచంద్రుడు కూడా సరయూ నదినీళ్ళలోకి అలా నడిచి వెళ్ళిపోయి నీటిలో మునిగి దేహాన్ని వదిలేశాడు. స్వామి రామతీర్ధ మళ్ళీ అదేపని చేశాడు.స్వామి వివేకానంద ధ్యానసమాధిలో స్వచ్చందంగా శరీరాన్ని వదిలేశాడు.వీటన్నిటినీ 'ఆత్మహత్య' అనే పదంతో మనం సూచించలేము.మన చట్టాల ప్రకారం దానిని నేరమనీ అనలేము.

వీరందరి సంగతి అలా ఉంచితే,నిజమైన యోగులు స్వచ్చందంగా జీవనపరిధిలోనుంచి మరణపు పరిధిలోకి వెళ్లి మళ్ళీ వెనక్కు తిరిగి వస్తుంటారు.బ్రతికున్నప్పుడే వీరు అనేకసార్లు ఈ పనిని చేస్తుంటారు. అందుకనే ఇంద్రియాతీతమైన అనేక విషయాలు వారికి సునాయాసంగా తెలుస్తుంటాయి.మామూలు మనుషులు కూడా వారివారి ఆలోచనలలో కొంత పరిపక్వతను తెచ్చుకుని వారి జీవనశైలిలో మార్పును తెచ్చుకుంటే వారుకూడా యోగుల స్థాయికి దగ్గరగా వస్తారు.కానీ యోగులకూ వీరికీ ఒక ప్రధానమైన భేదం ఉంటుంది.

అదేమంటే - ఇష్టానుసారం మరణ ప్రపంచంలోకి వెళ్లివచ్చే ప్రాక్టికల్ నాలెడ్జి యోగులకు ఉంటుంది.సాధనాపధంలో ఏళ్ళతరబడి నడకవల్ల వారా స్కిల్ ను సంపాదించి ఉంటారు.కానీ మామూలు మనుషులకు ఆ సాధనా రహస్యాలు తెలియవు గనుక వారికా విధానాలు అందుబాటులో ఉండవు.మానసికంగా మాత్రం యోగులతో సమానమైన వైరాగ్యస్థాయిలోకి మామూలు మనుషులు కూడా కొండొకచో కొన్నికొన్ని సమయాలలో రావడానికి ఆస్కారం ఉన్నది. ఆయా సమయాలలో వారికి కూడా దేహం అంటే చిరాకు వచ్చేస్తుంది. సంసారం అంటే చిరాకు వచ్చేస్తుంది.అదొక జైలులా వారికి అనిపిస్తుంది.వారు చేరాలనుకుంటున్న లోకానికి చేరడానికి ఈ శరీరం ఒక పెద్ద అడ్డంకి అనిపిస్తుంది.అలాంటప్పుడు దేహం నుంచి బయటకు రావాలంటే వారికి తెలిసిన ఒకేఒక మార్గం ఆత్మహత్య. అందుకని ఆ పనిని ఎంచుకుంటారు. అంతరిక యోగసాదనలో సరియైన ట్రెయినింగ్ లేకపోవడమే ఈ అవస్థకు కారణం. 

ఆత్మహత్య చేసుకునే అందరూ జ్ఞానులని నా భావన కానేకాదు.అనేకమైన కారణాల వల్ల మామూలు మనుషులు కూడా ఆ పనికి పాల్పడవచ్చు.వారికి చీకటి లోకాలతో నిండిన అధోగతి ప్రాప్తిస్తుంది.' అసూర్యా నామతే లోకా అంధేన తమసావృతా...' అనే వేదవాక్యమే దీనికి ప్రమాణం.కానీ జ్ఞాని అయినవాడికి అలాంటి దుర్గతి పట్టదు.అతడు వెలుగులోకే ప్రవేశిస్తాడుగాని చీకటిలోకి ఎన్నటికీ వెళ్ళడు.

సామాన్య ప్రజానీకం అందరూ జ్ఞానులు కావడం దుస్సాధ్యం అయినప్పటికీ కొందరు భావుకులు కళారాధకులు ప్రేమికులు మాత్రం ఒక జ్ఞాని లేదా యోగసిద్ధుని స్థితికి దగ్గరగా రాగలుగుతారు.దానికి వారికున్న ఏకైన బలం ఏమంటే వారివారి ఆరాధన.సాధారణంగా అది ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంటుంది.ఆ వ్యక్తి భగవంతుడు కావచ్చు కాకపోవచ్చు.కానీ వారి ఆరాధన మాత్రం ఒక ఆధ్యాత్మిక ఆరాధనకూ ఉపాసనకూ ఏమాత్రం తగ్గదు, తీసిపోదు. లైలా మజ్నూ వంటి అమరప్రేమికులు ఈ ప్రేమబలంతోనే అమరత్వాన్ని అందుకోగలుగుతారు.ఒక యోగి లేదా ఒక భక్తుని ప్రేమబలమూ,ఈ ప్రేమికుల ప్రేమబలమూ దాదాపు సమానంగానే ఉంటాయి.కనుక ఈ ప్రేమికులు ఒకరికోసం మరొకరు శరీరత్యాగం చెయ్యడమూ,ఒక యోగి జీవసమాధిలో స్వచ్చందంగా తనువును చాలించడమూ దాదాపు సమానమే అవుతాయి.

లోకందృష్టిలో ఇలాంటివారి ఆత్మహత్య నేరం కావచ్చుగాని దైవం దృష్టిలో మాత్రం కాదు.దైవదృష్టిలో అది ఒక ఉదాత్తమైన త్యాగం అవుతుంది.

కనుక ఆత్మహత్య అనేదానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే అర్ధం,మామూలు మనుషులు అనుకునే లౌకికార్దానికి చాలా విభిన్నంగా ఉంటుంది.

రంగనాద్ స్వతహాగా కళాకారుడు,సున్నితమనస్కుడు,విశాలభావాలు కలిగిన భావుకుడు గనుక ఈ ప్రపంచంలో ఇమడలేక పోయాడు.అందులో విచిత్రం ఏమీలేదు.సున్నితమైన మనస్సు ఉన్నవాళ్ళు నిజంగానే ఈ ప్రపంచంలో ఉండలేరు.ఎందుకంటే ఇక్కడ ఎటుచూచినా స్వార్ధమూ మోసమూ తప్ప ఇంకేమీ లేవు.ఇది పచ్చి వాస్తవం.

ప్రతి ఆలోచనాపరుడికీ,సున్నిత హృదయుడికీ ఏదో ఒక సమయంలో జీవితం మీద విరక్తి అనేది తప్పకుండా వస్తుంది.నేను కూడా నా జీవితంలో రెండు సందర్భాలలో అటువంటి ఆలోచన చేశాను.కానీ బాధ్యతలనేవి మనల్ని ఆపుతూ ఉంటాయి.రంగనాద్ గారికి బాధ్యతలు లేవు.తన బాధ్యతలన్నింటినీ ఆయన సక్రమంగా నెరవేర్చాడు.తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఆ పనులను ఆయన నెరవేర్చాడు.ఇక తను ఉండవలసిన అవసరం లేదని బలంగా నమ్మాడు.

కానీ ఒక యోగిలాగా అనుకున్నప్పుడల్లా దేహం నుంచి బయటకు వచ్చే విద్య ఆయనకు తెలియదు.తన భార్య ఉన్న లోకాలను చూడగలిగే సాధనా బలం కూడా ఆయనకు లేదు.ఆయనకున్నది భావుకతతో కూడిన మంచి ఆలోచన మాత్రమే.ఆధ్యాత్మికలోకంలో అది చాలదు.అక్కడ అడుగుపెట్టాలంటే చాలా సాధనాబలం ఉండాలి.స్వచ్చందంగా శరీరంలోనుంచి బయటకు రాగలిగే విధానాలు తెలియాలి.వాటిమీద మంచి పట్టు ఉండాలి.అప్పుడే అది వీలవుతుంది.లేకుంటే వీలుకాదు.

అది వీలుకానప్పుడు ఇంక మిగిలిన ఏకైకమార్గం ఆత్మహత్య ఒక్కటే.అందుకే ఆ పనికి పాల్పడ్డాడు.దీనివల్ల ఆయనకు పాపం ఏమీ అంటదు.

వ్యక్తిగతంగా ఆయన ఎంతో ఉత్తముడు.ఎంతమందికి తన జీవితంలో సాయం చేశాడో లెక్కలేదు.నీతికి నియమాలకు కట్టుబడిన వ్యక్తి.ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవాడు.జీవితంలో ఆయన పడిన కష్టాలకు కూడా లెక్కలేదు. కానీ ఎంతో ఆత్మాభిమానంతో వాటిని నిబ్బరంగా ఎదుర్కొన్నాడు. అధిగమించాడు.అంతటి పుణ్యబలం ఉన్నవ్యక్తికి ఈ పని ఏమీ పాపాన్ని అంటించలేదు.

ఆయన ఆత్మకు ఉత్తమగతులు ప్రాప్తించాయని నాకు తెలిసింది.తను చేరుకోవాలనుకున్న చోటకు ఆయన చేరుకున్నాడని నాకు రుజువులు లభించాయి.ప్రస్తుతం ఆయన ఆత్మ చాలా ఆనందంగా ఉన్నది.తన ఆప్తులను, తను కలుసుకోవాలని అనుకుంటున్నవారిని, కలుసుకుంది. కనుక నా దుఖం మాయమైంది. ఇక ఆయన గురించి చింతించవలసిన పని లేదు.

భగవద్గీతలోని  'ఆత్మసంయమ యోగం' ఏమంటున్నదో వినండి.

పార్ధ ! నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే
నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత ! గచ్చతి

(భగవద్ గీత -6:40)

"నాయనా పార్ధా !విను. ఈలోకంలో గాని పరలోకంలో గాని అతనికి వినాశనం ఉండదు.ఎందుకనగా - మంచి చేసినవానికి ఎన్నటికీ దుర్గతి కలుగదు."

లోకం దృష్టిలో ఏమైతేనేమి? దైవం దృష్టిలో ఉత్తములమైతే చాలు.
read more " రంగనాధ్ విషాదాంతం వెనుక కొన్ని కోణాలు- ఆత్మహత్య నేరమా? "

7, డిసెంబర్ 2015, సోమవారం

4th Astro Workshop on Medical Astrology and Nadi Principles - Photos

ముందే ప్లాన్ చేసినట్లుగా 4th Astro Workshop హైదరాబాద్లో విజయవంతంగా జరిగింది.ఈ వర్క్ షాప్ కు దాదాపు 50 మంది జ్యోతిశ్శాస్త్ర అభిమానులు హాజరై రోజంతా ఓపికగా కూర్చుని జ్యోతిశ్శాస్త్ర రహస్యాలను ఆకళింపు చేసుకున్నారు.

మెడికల్ ఆస్ట్రాలజీ (వైద్యజ్యోతిష్యం) లోని రహస్యాలను, భృగునాడీ జ్యోతిష్య రహస్యాలతో మిళితం గావిస్తూ ఉదయం 9.30 నుంచి సాయంతం 5.30 వరకూ సభ్యులకు క్లాస్ చెప్పడం జరిగింది.

ఈ వర్క్ షాప్ కు హాజరైనవారు - వారీ అదృష్టాన్ని నిలుపుకోగలిగితే మాత్రం - చాలా అదృష్టవంతులనే చెప్పాలి.ఎందుకంటే ఈ రహస్యాలను వారంతట వారు నేర్చుకోవాలంటే ఎన్నేళ్ళు ప్రయత్నించినా సాధ్యంకాదు.గురుముఖతా విన్నప్పుడే ఇవి వంటబడతాయి.వినయపూర్వకమైన అచంచలసాధనతో జీర్ణం కాబడతాయి.దాదాపు నాయొక్క పదిహేనేళ్ళ రీసెర్చిని 60 జాతకచక్రాల సహాయంతో విశ్లేషణాత్మకంగా వివరిస్తూ సులువైన ప్రభావవంతమైన నాడీ జ్యోతిష్యశాస్త్ర సూత్రాలను ఈ సందర్భంగా సభ్యులకు వివరించి చెప్పడం జరిగింది.

నాడీజ్యోతిష్య శాస్త్రానికి ఆద్యుడైన భృగుమహర్షి అనుగ్రహంతోనే ఇది సాధ్యమైనదని భావిస్తున్నాను.

మరొక్క విషయం.

విశాలభావాలూ ఉన్నత వ్యక్తిత్వమూ కలిగిన ఉత్తమసాధకులను చూచినా వారితో మాట్లాడినా నాకు చాలా ఆనందం కలుగుతుంది.ఈ సమ్మేళనానికి వచ్చినవారిలో అనంతమూర్తి గారు అటువంటి ఉత్తమవ్యక్తి.

ఈ సందర్భంగా లంచ్ బ్రేక్ సమయంలో అనంతమూర్తిగారితో జరిగిన సంభాషణ చాలా ఆనందాన్ని కలిగించింది.వృత్తిపరంగా ఆయనొక ఉన్నతోద్యోగి.ప్రవృత్తిపరంగా చూస్తె ఆయనొక ఉన్నతస్థాయికి చెందిన రహస్య శ్రీవిద్యోపాసకుడు.వృత్తిపరంగానూ ఉపాసనాపరంగానూ ఉన్నత స్థాయిలలో ఉన్నప్పటికీ గొప్ప వినయశీలి.వయసులో నాకంటే కొంచం పెద్దవాడైనప్పటికీ శక్తి ఉపాసనలో లోతైన అనుభవజ్ఞానం కలిగినవాడైనప్పటికీ, ఆయన యొక్క వినయసంస్కార పూరితమైన ప్రవర్తన నన్ను ముగ్దుడిని గావించింది.ఆయన చుట్టూ ఉన్న 'ఆరా' చాలా ఆహ్లాదంగా ఉండి ఆయన ఉపాసనా స్థాయి ఏమిటో మనకు సూచిస్తున్నది.

శంకరుల అద్వైతాన్నీ,కాశ్మీర శైవాన్నీ,శాక్తేయాన్నీ,ఉత్తరకౌళ సాంప్రదాయపు సాధనా విధానాలనూ,నిజమైన శ్రీవిద్యనూ, శ్రీరామకృష్ణుల అత్యున్నతమైన భావనలనూ స్పృశిస్తూ సాగిన మా సంభాషణ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.నిజానికి ఆయన జ్యోతిష్య శాస్త్రం కోసం ఈ మీటింగ్ కు రాలేదు.కేవలం నాతో మాట్లాడాలని మాత్రమె వచ్చారు.నిజానికి నా దగ్గర దీక్ష స్వీకరించిన చాలామంది నా శిష్యులు, ఊరకే నన్ను చూచి నా మాటలు వినడానికే దూరాలనుంచి వస్తున్నారని కూడా నాకు తెలుసు.

బెంగాల్ లోని మహాసిద్ధక్షేత్రం"తారాపీఠ్" నుంచి తారాదేవి పాదాలను ఈ సందర్భంగా రత్న నాకు తెచ్చి ఇవ్వడం ఆదిపరాశక్తి తారాదేవి నామీద కురిపిస్తున్న అనుగ్రహంగా భావిస్తున్నాను.


జ్యోతిశ్శాస్త్రం మీద ఎంతో ప్రేమతో నామీద నమ్మకంతో అభిమానంతో ఎంతో దూరాలనుంచి వచ్చి ఈ సమావేశానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


ఉన్న తక్కువసమయంలో ఎంతో శ్రమించి,లాజిస్టిక్స్ మొత్తాన్నీ ఎంతో చక్కగా ప్లాన్ చేసి,ఈ workshop ను విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలకూ పాత్రుడైన రాజూ సైకంను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి ఉత్తమశిష్యులు దొరకడం జగన్మాత నాకిచ్చిన వరంగా భావిస్తున్నాను.


నేను అనుసరించే తంత్రయోగమార్గంలో దీక్ష ఇవ్వమని చాలామంది ఈ సందర్భంగా నన్ను అడిగారు. వారి కోరిక త్వరలో తీరుతుంది.త్వరలో మళ్ళీ జరుగబోతున్న "సాధనా సమ్మేళనం" లో వారికి దీక్ష ఇవ్వబడుతుంది.

ఈ సందర్భంగా శ్రమపడి ఫోటోలు తీసి, కార్యక్రమం మొత్తాన్నీ చిత్రాలలో బంధించి మాకందించిన సునీల్ వైద్యభూషణ, రాఘవేంద్ర,సరళాదేవిలను అభినందిస్తున్నాను.

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.


















































































































































read more " 4th Astro Workshop on Medical Astrology and Nadi Principles - Photos "