“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, నవంబర్ 2011, సోమవారం

తిరుపతి ప్రయాణం లో ఆధ్యాత్మికానుభూతులు

భక్తిలో రెండు పద్ధతులున్నాయి. ఒకటి -- "నేను నీ భక్తుణ్ణి" అని మనం చెప్పుకోవడం. రెండు -- "నీవు నా భక్తుడవు" అని భగవంతుడే చెప్పడం. ఈ రెండింటిలో రెండవది మొదటిదానికంటే శ్రేష్టమైనది. 

మనంతట మనం అనుకోని గుళ్ళూ గోపురాలూ తిరగడం ఒక రకమైతే, అనుకోకుండా ఆయా పర్వదినాలలో ఆయా దేవాలయాలకు ఏదో కారణంచేత వెళ్ళవలసిరావడం, అక్కడ అద్భుతమైన ఆహ్వానాలు మనకోసం ఎదురుచూస్తూ ఉండటం రెండవ రకం. 

మొన్నీ మధ్యన కాకాని శివాలయం, తిరుమలా ఈ రకంగానే వెళ్లి రావడం జరిగింది. కాకాని శివాలయం పురాతనమైనదే అయినప్పటికీ కొన్నేళ్ళ క్రితం రాహుకేతు ప్రతిష్టలు జరిగిన తర్వాత మాత్రమే బాగా అభివృద్ధి చెందింది. నేనెప్పుడో పది పదిహేనేళ్ళ క్రితం అనుకుంటా అక్కడికి వెళ్లాను. మళ్ళీ మొన్న వెళ్లి చూస్తే ఆలయం చాలా అభివృద్ధి చెందినట్లు కనిపించింది.

అక్కడికి వెళ్ళడం కూడా అనుకోకుండా హటాత్తుగా జరిగింది. ఒక ప్రముఖునితో కలసి అప్పటికప్పుడు అనుకోని పరమేశ్వరదర్శనానికి వెళ్ళడమూ, ఆలయమర్యాదలతో పూర్ణకుంభస్వాగతమూ, పరమేశ్వరునికి శాస్త్రోక్తంగా అభిషేకం చేయించడమూ చాలా చక్కగా జరిగాయి. 


అదేరోజు రాత్రికి బయల్దేరి తిరుమలకు వెళ్ళడం కూడా ఇలాగే జరిగింది. ఒకపక్క తుపాను హెచ్చరికలు వినిపిస్తున్నాయి, నెల్లూరులో వారంనుంచి కుంభవృష్టి కురిసి నగరం జలమయమైందని వార్తలు వస్తున్నాయి. తిరుమలలోని మిత్రులతో మాట్లాడితే కొండమీద కూడా బాగా వర్షం పడుతున్నదని, బాగా చలిగా ఉందనీ చెప్పారు. అయినా సరే బయలుదేరి వెళ్ళడం జరిగింది.

తిరుపతిలో దిగి చూస్తే, పొగమంచు మేఘాల మధ్యనుంచి కనీ కనిపించకుండా తిరుమల కొండలు దర్శనం ఇచ్చాయి. వానలోనే ఉదయం ఎనిమిదిన్నరకు అలిపిరిమార్గం గుండా నడక మొదలుపెట్టి, నిదానంగా నడుస్తూ మధ్యాన్నం ఒంటిగంటకు గెస్ట్ హౌస్ కు చేరాము. దారిలో వాన పడుతున్నప్పటికీ దారిపొడుగునా షెల్టర్ ఉండటంతో ఇబ్బంది లేదు. అక్కడక్కడా షెల్టర్ లేని చోట్ల తెచ్చుకున్న గొడుగులు ఉపయోగ పడ్డాయి. 

నాతోపాటు మా అబ్బాయి మాధవ్ ఉన్నాడు. తనతో దారిలో అనేక విషయాలు మాట్లాడాను. మానవజీవితగమ్యం ఏమిటి? మనిషి పుట్టుకకు ఒక అర్ధం అంటూ ఉందా? ఉంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? అర్ధం ఇదీ అని తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలి? పశు పక్ష్యాదుల లాగా మనమూ అదే జీవితాన్ని గడిపితే మనిషి జన్మకు ప్రయోజనం ఏమిటి? ఒక వంశంలో ఋషులను ఉద్భవింపచేసే సూత్రాలు, జీవన విధానాలు ఏమిటి? వాటిని ఎలా పాటించాలి? మన జ్ఞానసంపదను  మనవంశంలోని తర్వాతితరాలకు ఎలా అందించాలి? అన్న మౌలికవిషయాలతో మొదలుపెట్టి  -- యోగ, వేదాంత రహస్యాలు, జ్యోతిష శాస్త్రంలో రేమేడీలు ఎలా నిర్ణయించాలి? వాటిలో మళ్ళీ తేడాలు ఎలా ఉంటాయి? తరతరాలుగా వచ్చే జెనెటిక్ లక్షణాలు జాతకంలో ఎలా ప్రతిఫలిస్తాయి? ఏ ఏ దోషాలు ఎలా తరతరాలకు వెంటాడతాయి? వాటి జాడలు జాతక చక్రంలో ఎలా కనిపిస్తాయి? యోగాభ్యాసం ఎన్నిరకాలు? కుండలినీయోగం యొక్క మూలసూత్రాలేమిటి? వాటికి ఆధారాలేమిటి? తిరుమల ఏడుకొండలకూ సప్తచక్రాలకూ ఉన్న సామ్యాలు, వాటివెనుక రహస్యాలు ఏమిటి? వెంకటేశ్వరస్వామి అవతారం యొక్క చారిత్రిక నేపధ్యాలు ఎక్కడున్నాయి?  స్వామి విగ్రహం అమ్మవారి విగ్రహం అనేమాట నిజమేనా? -- ఇలా అనేకవిషయాలు చర్చకు వచ్చాయి.

దారిలో మనం ఎక్కేమెట్లకు ఎడమపక్కగా గోడలపైన వరుసగా చెక్కి విష్ణుసహస్రనామావళి కనిపించింది. వాటిలో ఏ ఏ శ్లోకాలు ఏ ఏ జాతకదోషాలను పోగొడతాయి? వాటియొక్క అంతరార్ధాలు ఏమిటి? జాతకప్రకారం రేమేడీలుగా ఏఏ శ్లోకాలను/మంత్రాలను ఎలా ఎంచుకోవాలి?అన్న విషయాలు మాధవ్ కు వివరించాను. 

ముఖ్యంగా వరాహావతార రహస్యమూ, శ్రీకృష్ణునితో సమంగా ఆ అవతారాన్ని పూర్ణావతారం  అని ఎందుకంటారు? "మహావరాహో గోవిందస్సుశేణ కనకాంగదీ" అన్న నామానికి అర్ధం గురించి మాట్లాడుకున్నాం.
     
దారిలో శ్రీమద్రామానుజుల విగ్రహమూ, ఆ విగ్రహం చుట్టూ కట్టిన చిన్న దేవాలయమూ కనిపించాయి. రామానుజులు తిరుమలకొండ ఎక్కేటప్పుడు ఆ స్తలంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారట. కొన్నేళ్ళక్రితం వరకూ నాకు రామానుజులంటే  త్రిమతాచార్యులలో ఒకరిగా గౌరవం ఉండేది కాని అంత గొప్పగౌరవం ఉండేది కాదు. కాని ఈ మధ్యకాలంలో నా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. విశిష్టాద్వైతం ఎంత గొప్ప సిద్ధాంతమో నాకు అర్ధమౌతూ వచ్చింది. కనుక ఆయంటే నాకున్న గౌరవం ఈమధ్యలో చాలారెట్లు పెరిగింది. ఆ ఆలయం దగ్గర కూర్చుని విశిష్టాద్వైతసిద్దాంతపు భావపరంపరలో మునిగిన నాకు భావోద్రేకం కలిగింది. మావాడు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గొంతు సహకరించలేదు. కాసేపు ఆగమని సైగ చేసాను. నా పరిస్తితి గమనించి తనూ మాట్లాడకుండా ఉన్నాడు. కాస్త నెమ్మదించాక, విశిష్టాద్వైత సిద్ధాంతం ఎంత గొప్పదో తనకు వివరించాను. అభినవగుప్తుని  కాశ్మీరశైవానికీ, రామానుజుని విశిష్టాద్వైతానికీ ఉన్న సామ్యాలు - భేదాలు గురించి కొద్దిసేపు చర్చ నడిచింది. చివరగా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను శ్రీరామకృష్ణులు, వివేకానందులు ఎలా సమన్వయం చేసారో వివరించాను. 

దారిలో కులశేఖర ఆల్వార్ విగ్రహం దగ్గర ఆయన మహారాజు అయ్యి ఉండీ ఎంతటి మహాభక్తుడో, ఎంతటి మహాకవో వివరించి ఆయన సంస్కృతంలో వ్రాసిన "ముకుందమాల" గురించి వివరించాను. ఇలా మాట్లాడుకుంటూ ప్రయాస తెలీకుండా నడుస్తూ కొండమీదకు చేరాము.

మంగళ బుధవారాలలో మధ్యాన్నం రెండు గంటల తర్వాత 300 రూపాయల దర్శనం ఉండదు అని ముందే తెలిసింది. కనుక మర్నాడు దర్శనానికి వెళదామని నిర్ణయించుకున్నాము. గుండు చేయించుకోడమూ, స్నానమూ, భోజనమూ కానిచ్చి సాయంత్రంపూట  రెస్ట్ తీసుకోకుండా పాపనాశనమూ, ఆకాశగంగా, జాబాలి తీర్ధమూ దర్శించాము. మబ్బులు పట్టి రోజంతా తెరలు తెరలుగా వర్షం పడుతూనే ఉంది. 


జాబాలితీర్ధం చేరేసరికి సాయంత్రం అయిదున్నర అయింది. అప్పటికే బాగా మబ్బులవల్ల చీకటి పడినట్లుగా అయింది. జాబాలితీర్ధం అనిఉన్న ఎంట్రన్స్ దగ్గరనుంచి అడివిమార్గంలో  లోపలికి ఒకటిన్నర  కి.మీ. దూరం ఉండవచ్చు. దారంతా  నిర్మానుష్యంగా ఉంది. ముసురుకుంటున్న మసకచీకటిలో, తుంపరగా పడుతున్న వానలో నిదానంగా నడుస్తూ, ఆ అడివిదారిలో పోతుంటే ప్రపంచంలో మనంతప్ప ఇంకెవరూ లేనట్లు, విశాల ప్రకృతిమధ్యంలో మనం ఒక్కరమే ఉన్నట్లు ఒక వింత అనుభూతి కలుగుతుంది. కాలం స్తంభించిన అనుభూతి కలుగుతుంది.

దారంతా మా అమ్మాయి ఏదేదో మాట్లాడుతూనే ఉంది. మాటలు ఆపమని తనకు సైగ చేసి, మౌనంగా అడివిచెట్ల ఆకులమీద పడుతున్న వానశబ్దం వినమని మెల్లిగా చెప్పాను. అంతే. నిశ్శబ్దంగా ఆ చినుకుల శబ్దంవింటూ నడక సాగించాము.  తరువాత, జెన్ ధ్యానవిధానాలలో ఇదీ ఒక విధమైన ధ్యానం అని, అది ఎలా చేస్తారో, దాని ఫలితం ఏమిటో వివరించాను. దట్టమైన అడివిలోకి వెళ్ళినతర్వాత లోపలగా ఒక చదునైన దిగువప్రదేశంలో పెద్దపెద్ద చెట్ల మధ్యన, ఒక కొలను పక్కగా హనుమాన్ ఆలయం కనిపించింది. అక్కడ వాతావరణం ఎంతో రమణీయంగా ఉంది. చీకటీ, ఎడతెరిపిలేకుండా పడుతున్న వానా, దట్టమైన అడివిలోపల జనసంచారానికి బాగా దూరంగా ఉన్న ప్రదేశమూ కావడంతో  మనసు అప్రయత్నంగా ప్రశాంతతను సంతరించుకుంది.  ఒకప్పుడు అక్కడ ఎలుగుబంట్లు బాగా సంచరించేవిట. పిల్ల ఎలుగులు ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే, పెద్దవి మాత్రం అప్పుడప్పుడూ ఒంటరిగా వెళుతున్న యాత్రికులను ఎటాక్ చేసేవిట. ఆ తర్వాత అటవీశాఖవారు వాటిని బంధించి ఎక్కడికో తరలించారని చెప్పారు. ప్రస్తుతం మామూలు కోతులు తప్ప ఎలుగుబంట్లు ఎక్కడా కనిపించలేదు.  

అక్కడ ఒక అరగంట సేపు ఉన్నాము. ఈ ఆలయం హథీరాంబాబాజీ ట్రస్ట్ అధీనంలో ఉంది. పూజారి, ఇంకొక స్వామి అక్కడే పక్కగా ఉన్న ఒక పెంకుటింటిలో ఉంటారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా లేనట్టే కనిపించాయి. అడవిలో బాగా లోపలిప్రాంతం కావడంతో అక్కడికి సెల్ సిగ్నల్స్ కూడా రావు. వాళ్ళ లోకంలో వాళ్లున్నట్టుగా తోచారు. పక్కగా కొన్ని షాపులు మాత్రం ఉన్నాయి.

ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఒకసాధువు ఒకటే అరవటం మొదలుపెట్టాడు. "ఆంజనేయా, మై ఆగయా" అని ఒకటే అరుస్తున్నాడు. ఆ సాధువును చూస్తే నాకు మంచి అభిప్రాయం కలగలేదు. చాలా నేలబారు రకం అనిపించింది. అతను అలా అరవాల్సిన అవసరం ఏమిటో అర్ధం కాలేదు. మా అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. " అదేంటి నాన్నా. "ఆంజనేయా" అని అరుస్తూ తన క్లాస్ మేట్ ని పిలిచినట్లు అలా పిలుస్తున్నాడు." అని అంది. "నిజమేనమ్మా. ఒకవేళ భక్తునికి భగవంతునితో చనువు ఉంటే ఉండవచ్చు. కాని ఇతరులముందు దానిని ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరం లేదు. మౌనంగా పిలిస్తే భగవంతుడు ఇంకా త్వరగా పలుకుతాడు. ఇలాటి రకాలు చాలామంది ఉంటారు. ఇదంతా మామూలే, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు." అని చెప్పాను.

జాబాలిమహర్షి ఆ స్థలంలో తపస్సు చేసినప్పుడు ఆయనకు ఆంజనేయస్వామి దర్శనం ఇచ్చి అనుగ్రహించాడుట. వేదాలలో ఉన్న సత్యకామజాబాలీ ఈయనా ఒక్కరేనో కాదో మనకు తెలియదు. సత్యకామ జాబాలి పేరు మీద వచ్చిన నగరమే మధ్యప్రదేశ్ లోని "జబల్ పూర్". పాతకాలంలో దానిపేరు "జాబాలిపురం" అని ఉండేది. 

తిరుమలకొండల్లో చాలాచోట్ల జనసంచారం ఉండని  లోపలి ప్రదేశాలలో చాలామంది మునులు సిద్దులూ ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉన్నారన్నది నిజమే. ఏభై ఏళ్ల క్రితం స్వామి అసంగానంద (మళయాళస్వామి) అనే మహర్షి గోగర్భం డ్యాం ప్రాంతంలోని కీకారణ్యంలో దాదాపు ఎనిమిదేళ్ళు తపస్సు చేసారు. ఆరుబయట అడివిలో, ధ్యానంలో మునిగి ఒక రాతిమీద ఆయన కూర్చుని ఉంటే, పులులూ సింహాలూ ఎలుగుబంట్లూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవిట. అటువంటి చోట్లకు మామూలు మనుషులు పోవడం అసాధ్యం అనీ, బ్రహ్మచర్య శక్తీ, సాధనా బలమూ, నిర్భయత్వమూ లేని సామాన్యులను ఆ జంతువులు బ్రతకనివ్వవు అని ఆయనే చెప్పారు. 

ఆయన గొప్ప ఋషీ, అసలైన వేదాంతీనూ. ఆయనకు శ్రీరామకృష్ణ వివేకానందులంటే అమితమైన భక్తి ఉండేది. వారి శిష్యపరంపర కూడా మంచి అనుష్టానవేదాన్తులూ, నిజమైన మహాత్ములూనూ. నా గురువైన స్వామినందానందగారికి మళయాళస్వాములవారంటే అమితమైన గౌరవం ఉండేది.


(మిగతా భాగం వచ్చే పోస్ట్ లో)