“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, అక్టోబర్ 2015, సోమవారం

నా రమణాశ్రమ జీవితం - 4 (భిన్న ధృవాలు)


మహర్షి గతించిన తర్వాత ఆశ్రమంలో నైరాశ్యం అలముకున్నది. అందరూ ఒక్కసారిగా డిప్రెషన్ కు గురయ్యారు.అంతకు ముందు కొన్ని నెలలుగా ఇక మహర్షి బ్రతకరు ఇవి చివరిరోజులే అని అందరికీ చూచాయగా తెలిసి పోయింది.బయటపడి బాహాటంగా ఎవరూ అనకపోయినా అందరూ గుసగుసలుగా అనుకునేవారు.చివరకు అందరినీ నిరాశా సముద్రంలో ముంచి 14-4-1950 న మహర్షి శరీరాన్ని వదిలేశారు.

అది ఖచ్చితంగా మేష సంక్రమణదినం. సూర్యుడు మీనరాశిని వదలి తనకు ఉచ్చస్థితి అయిన మేషరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి దినం.అదే రోజున మహర్షి కూడా నశ్వరమైన శరీరాన్ని వదలి జాజ్జ్వల్యమానంగా ప్రకాశించే తన ఆత్మస్థితిలోకి శాశ్వతంగా ప్రవేశించారు.మహనీయుల జననమూ మరణమూ కూడా ఖగోళపరంగా జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైన దినాలలోనే జరుగుతాయి. ప్రతి మహనీయుని జీవితంలోనూ దీనిని ఖచ్చితంగా గమనించవచ్చు. మామూలు మనుషులకు ఇవి అర్ధంకాని అంతుబట్టని విషయాలు.కానీ అంతరిక మార్మికశాస్త్రాలలో పరిజ్ఞానం ఉన్నవారికి ఈ రహస్యాలు కరతలామలకంగా అర్ధమౌతాయి.

సూర్యమానం ప్రకారం అప్పుడే వికృతి నామసంవత్సరం ప్రవేశించింది. అంతకు కొద్దిరోజుల ముందు నాగమ్మ మహర్షితో మాట్లాడుతూ ఇదేమాట అంటే - 'ఓహో వచ్చిందీ వికృతి?' అని మహర్షి ఒకవిధమైన స్వరంతో అంటారు. అంటే దేహానికి వికృతి కలిగి తన ప్రకృతిలోకి తాను ప్రవేశించబోతున్నానని సూచనాప్రాయంగా మహర్షి ఆనాడే అన్నారు.

మహర్షి శరీరత్యాగంతో ఆయన్ను నమ్ముకుని ఆయన చుట్టూ గ్రహాలలాగా పరిభ్రమిస్తున్న వారంతా కకావికలై పోయారు.వారు దిక్కుతోచని పక్షులై పోయారు.ఏం చెయ్యాలో వారికి అర్ధం కాలేదు.ఇకమీద తమ గతి ఏమిటో వారికి దిక్కు తోచలేదు.ఇన్నాళ్ళూ వారికి ఏ సందేహం కలిగినా చెప్పడానికి మహర్షి ఉండేవారు.ఏ సమయంలోనైనా నిస్సంకోచంగా ఆయన్ను సమీపించి తమ సందేహాన్ని తీర్చుకునేవారు. సాయంకాలపు నీరెండ వంటి ఆయన సమక్షంలో సేదదీరేవారు.తమను వేధిస్తున్న అనేక బాధలనుంచి ఓదార్పును పొందేవారు.ఇప్పుడో - ఆ వెసులుబాటు హటాత్తుగా మాయమై పోయింది. ఇకమీద వారికి ఆశ్రమంలో ఉండబుద్ధి కాలేదు.రోజూ మనుషులతో కిటకిటలాడే హాలు ఉన్నట్టుండి నిర్మానుష్యమై పోయింది.అందరూ ఒక్కొక్కరుగా ఆశ్రమాన్ని వదలి పోవడం మొదలు పెట్టారు.

ప్రతి మహనీయునికీ ఇదే గతి పడుతుంది.ఆయన/ఆమె గతించిన తర్వాత ఇక అక్కడ సామాన్య భక్తులు ఎవ్వరూ ఉండరు.తమ స్వార్ధం కోసం, తమ కోరికలకోసం వారిని ఆశ్రయించిన దొంగ భక్తులు అందరూ ఉన్నట్టుండి మాయమౌతారు.ఎవరో అతి కొద్దిమంది మాత్రం ఆ బాధను దిగమింగి అక్కడే ఉంటారు.

సామాన్యంగా ఏం జరుగుతుందంటే - ఒక మహనీయుని బోధను - ఆయన భక్తులతో సహా - ఈలోకంలో ఎవరూ నిజంగా పాటించరు అని ఇంతకు ముందే వ్రాశాను.ఇది ప్రత్యక్షరసత్యం.ఈలోకంలో అందరూ ప్రశ్నలు అడుగుతారు, సోది మాట్లాడతారు,చొప్పదంటు ప్రశ్నలు గుప్పిస్తారు-కాని ఆచరణాత్మక సందేహాలను అడిగేవారు మాత్రం ఎక్కడో ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. అలా అడిగి తెలుసుకున్నవాటిని సాధనలో ఆచరించేవారు ఇంకా అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు.మిగతా అందరూ ఊరకే కాలక్షేపంరాయుళ్ళే. పనిలేని ఆడవాళ్ళు ఒకచోట కూచుని సోదిముచ్చట్లు చెప్పుకున్నట్లుగా వీరి సందేహాలు ఉంటాయి.అందుకే ఇలాంటి వాగుడుకాయలకు మహర్షి ఏమీ జవాబు ఇచ్చేవారు కారు. వారు ఎందుకు అడుగుతున్నారో ఆయనకు వెంటనే తెలిసిపోయేది.వీరు ఊరకే మాటలవరకే గాని చేతలకు పనికిరారన్న విషయం ఆయనకు బాగా తెలుసు.అందుకే ఎవరుబడితే వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్పేవారు కారు.

ఒక మహనీయుడిని నిజంగా అనుసరిస్తే, ఆయన చెప్పినదానిని నిత్యజీవితంలో ఆచరిస్తే, అప్పుడు ఆ మనిషిలో కలిగే అంతరిక పరివర్తన అనూహ్యంగా ఉంటుంది.అలా ఆచరించే వ్యక్తిలో రోజురోజుకీ మార్పు కలుగుతుంది.ఒక ఏడాది తర్వాత ఆ పాతమనిషి స్థానంలో ఒక క్రొత్తమనిషి ఉంటాడు.అతని ఆలోచనావిధానమూ అతని ప్రవర్తనా సమూలంగా మారిపోతాయి.మారిపోవాలి కూడా.అలా జరిగినప్పుడే అది నిజమైన సాధన అవుతుంది.అంతేగాని ఆ మహనీయుడు చెప్పిన విషయాలను బట్టీపట్టి ఇంకొకరికి అప్పగించడమూ,ఆయనమీద పుస్తకాలు వ్రాయడమూ, ఆయన మీద అష్టోత్తరాలూ సహస్రనామాలూ గిలకడమూ,ఆయనకు విగ్రహాలు చేయించడమూ,నగలు చేయించడమూ,ఆయనకు పెళ్లి చెయ్యడమూ  - ఇలాంటి పనికిమాలిన పనులన్నీ ఎందుకంటే - ఆయన చెప్పిన అసలైన సాధనను చెయ్యకుండా తప్పించుకోవడానికి వేసే దొంగఎత్తులే ఇవన్నీను. అలాంటి భక్తులందరూ ఎన్నేళ్ళు గడచినా ఏ మార్పూ లేకుండా పాతమనుషుల లాగే ఉంటారు.లేదా ఇంకా దరిద్రంగా దిగజారుతారు. ఉన్నతంగా మాత్రం ఎదగలేరు.ఇలాంటి వారిని ఈలోకంలో ఎటుచూచినా గమనించవచ్చు.

భక్తులమనీ శిష్యులమనీ అనుకునేవారిలో నూటికి తొంభైమంది ఇలాంటి పనిదొంగలే ఉంటారు.కానీ వారు తమను తాము అత్యంత గొప్ప భక్తులుగా భావించుకుంటూ ఉంటారు. ఇదే అసలైన ఆధ్యాత్మిక మాయ.

అసలు ఆధ్యాత్మిక ప్రపంచమే పెద్ద మాయ.లోతుగా విచారిస్తే ఈ విషయం చక్కగా అర్ధమౌతుంది.

భిన్నధృవాలు ఆకర్షించుకుంటాయన్న విషయం మనకు ఫిజిక్స్ లో తెలుసు. సజాతిధృవాల మధ్యన వికర్షణ ఉంటుందనీ మనకు తెలుసు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది.

ఒక మహనీయుని చుట్టూ ఎవరు చేరతారంటే - ఎవరైతే ఆయన చెప్పినదానిని ఆచరించరో - ఎవరైతే ఆయన భావాలకు పూర్తి వ్యతిరేకమైన జీవితాలు గడుపుతూ ఉంటారో - ఎవరైతే ఊరకే మాటలతో కాలక్షేపం చేస్తుంటారో - ఎవరైతే ఆయన విగ్రహాలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ బిజినెస్ చేసుకుంటారో - అలాంటివాళ్ళే ఆయా మహనీయుల చుట్టూతా ఎక్కువగా చేరతారు.వారిలో అతి కొద్దిమంది మాత్రం ఆయన చెప్పిన బోధను ఆచరించేవాళ్ళు ఉంటారు.దీనికి ఉదాహరణలుగా ఎన్నైనా ఇవ్వవచ్చు.

ఒంటిమీద ఉన్న గుడ్డలను కూడా వదిలేసిన దిగంబర మహావీరుడి చుట్టూ వస్త్రవ్యాపారం చేసే వ్యాపారులూ, బంగారునగల వ్యాపారం చేసే వ్యాపారులూ భక్తులుగా చేరుతారు. "హింస అస్సలు పనికిరాదు,ఊపిరి గట్టిగా వదిలితే కూడా గాలిలోని కొన్ని జీవులు చనిపోతాయి,అందుకని ముక్కుకూ మూతికీ గుడ్డ కట్టుకో" - అని చెప్పిన ఆయన భక్తులేమో వడ్డీవ్యాపారం చేసి మనుషుల రక్తాన్ని జలగలలా డైరెక్ట్ గా పీల్చేవాళ్ళూ ఎదుటి మనిషిని పూర్తిగా దోచుకునే వాళ్ళూ అయి ఉంటారు.

రాజభోగాలను వదిలేసి జీవితమంతా చెట్లక్రింద బ్రతికిన గౌతమబుద్ధుని భక్తులందరూ భవనాలలో ఉంటూ సమస్త భోగాలూ అనుభవించే మహారాజులూ మహారాణులూనూ."అంతా శూన్యం.ఇక్కడ సత్యం లేదు" అని చెప్పిన ఆయన భక్తులేమో "ఇదంతా సత్యం. అన్నీ అనుభవిద్దాం" అనుకునే బాపతు మనుషులు.

కామకాంచన త్యాగమే అసలైన రహస్యం అని చెప్పిన రామకృష్ణుని భక్తులేమో వాటిల్లో పడి జోరుగా ఈత కొడుతున్నవారు,ఆయన బోధలను దేనినీ సక్రమంగా అర్ధం చేసుకోలేనివారూ, ఆచరించలేనివారూను. One sidedness, narrow mindedness అస్సలు పనికిరావని చెప్పిన రామకృష్ణుని భక్తులందరూ వాటితో నిండా నిండిపోయి నిలువెల్లా సంకుచితంగా స్వార్ధపూరితంగా ఆలోచించేవారే అయిఉంటారు.

జీవితంలో ఏది జరిగినా అన్నింటినీ 'సరే' అంటూ యాక్సెప్ట్ చెయ్యమని చెప్పిన జిల్లెళ్ళమూడి అమ్మగారి భక్తులెవరంటే - జీవితంలో దేనినీ యాక్సెప్ట్ చెయ్యలేనివారూ, అంతా తమ ఇష్టప్రకారమే జరగాలని ఆశించేవారూ, తద్భిన్నంగా జరిగితే ఏమాత్రం తట్టుకోలేక గిలగిలలాడిపోయే చౌకబారు మనుషులూను.ఇక దీనిలో అమ్మ చెప్పిన acceptance ఎక్కడుందో నాకైతే అర్ధం కాదు.వీరెవరూ అమ్మ చెప్పినది చెయ్యరు.అమ్మను వదలరు.వారి కోరికలను మాత్రం తీర్చమని మొక్కుకుంటూ ఉంటారు.

జీవితమంతా యోగమే అని చెప్పిన అరవిందుల చుట్టూ చేరిన భక్తులు ఎవరయ్యా అంటే - తామేదో పైనుంచి ఊడిపడిన దేవతలమనీ మిగిలిన మనుషులందరూ క్షుద్రులనీ అనుకునే బాపతు దురహంకారులు.ఇంతా చేస్తే అరవిందుల యోగాన్ని వారు ఆచరిస్తున్నారా అంటే - ఆచరణ మాట అటుంచి దానిని అర్ధం చేసుకోవడమే వారి వల్ల కాదు.

ఇక - ఎల్లప్పుడూ ఆత్మస్థితుడవై ఉండమని చెప్పిన రమణమహర్షి చుట్టూ చేరిన భక్తులు ఎవరంటే - ఇరవై నాలుగ్గంటలూ దేహభ్రాంతిలో మునిగి ఉంటూ అదే సర్వస్వంగా భావిస్తూ,ఆయన దేహచిత్రానికి పటం కట్టి పూజిస్తూ,పైకి మాత్రం వాచావేదాంతం చెప్పే మనుషులు.

అత్యున్నతమైన సూఫీ తత్వాన్ని బోధించిన షిర్డీ సాయిబాబా చుట్టూ మూగే భక్తులు ఎవరంటే - కోరికలతో నిలువెల్లా కుళ్లిపోయి నిరంతరమూ ఏదో ఒక అద్భుతాలను ఆశిస్తూ, నిత్యజీవితంలో అవినీతితో దురహంకారంతో నిండిపోయి బ్రతికే అతితక్కువ స్థాయి మనుషులు.

ఇస్లాం అంటే శాంతి అని చెప్పేవారి వల్ల జరిగినంత రక్తపాతమూ, దుర్మార్గమూ ఇంకేమతం వారివల్లా ఈ భూమిమీద జరుగలేదు.శాంతే మా మతం అని చెప్పేవారి ఆచరణేమో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.

అలాగే - "ఇతరుల కోసం అన్నీ త్యాగం చెయ్యి.చివరకి నీ ప్రాణాన్ని కూడా ఇచ్చెయ్యి.ఒకచెంప మీద ఎవరైనా కొడితే రెండో చెంపను కూడా చూపించు" - అని చెప్పిన జీసస్ ను అనుసరించే భక్తులూ దేశాలూ ఎవరయ్యా అంటే - కేపిటలిస్ట్ భావజాలంతో ఇతర దేశాలను దోచుకుంటూ, ఇతర సంస్కృతులను నాశనం చేస్తూ, మత మార్పిడులు చేస్తూ, ప్రేమ ముసుగులో ద్వేషాన్ని ప్రచారం చేస్తూ, ఎదుటి మనిషికి ఈ చెంపా ఆ చెంపా రెండూ ఒకేసారి వాయించేవాళ్ళు.

ప్రపంచం మొత్తం మీద ఏ మతమైనా ఇంతే.ఏ మహనీయుని గతి అయినా ఇంతే.వారు చెప్పినదానిని వారి భక్తులే పాటించరు.దీనికి మూలకారణం ఒక్కటే - మనుషుల నీచ మనస్తత్వాలు, వారి మొండితనాలు,కపటంతో కూడిన వారి మోసపూరిత వ్యక్తిత్వాలే ఈ పరిస్థితికి అసలైన కారణాలు. ప్రపంచంలోని మనుషులందరూ దొంగలే.అందరూ అవకాశవాదులే.అందుకే వాళ్ళు ఎప్పటికీ ఉన్నతంగా మారరు.మహనీయుల బోధలను ఆచరించరు. ఆచరించినట్లుగా ఊరకే నటిస్తారు.లోపల్లోపల వారివారి సొంత అజెండానే నడిపించడానికి ప్రయత్నిస్తారు. అంతే. ఇది అసలైన సత్యం.

మహనీయులకు పట్టిన గతి ఇలాగే ఉంటుంది.వారి భక్తులే వారికి గుదిబండలు.వారు చెప్పిన బోధను ఆయా భక్తులు దమ్మిడీ కూడా పాటించరు.ఊరకే వారిని పూజిస్తారు.కోరికలు కోరతారు.అంతేగాని వారు చూపిన మార్గంలో నడవరు. నిజానికి వారిని తమ లోపల్లోపల ఏమాత్రం లెక్కచెయ్యరు.ఇదీ లోకం తీరు.

నేను చెప్పేది చాలామందికి మింగుడుపడదు.కానీ నేను వాస్తవాన్నే మాట్లాడతాను.అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాన్నే నేను వెల్లడిస్తాను.

కనుకనే - "ఏ తీర్ధయాత్రలూ అక్కర్లేదు మీలో మీరు ఉండండి"- అని చెప్పిన రమణమహర్షి చనిపోయిన వెంటనే ఆయన భక్తులందరూ పొలోమని భారతదేశం నాలుగు దిక్కులకూ తీర్ధయాత్రలకు బయలుదేరారు.ఇది విచిత్రంగా లేదూ? ఇక ఆయన బోధను వీరు ఏమి పాటింఛినట్లు? ఆయన భావాలను వీరు ఏమి అర్ధం చేసుకున్నట్లు? ఏళ్ళకేళ్ళు ఆయన చుట్టూ చేరి రకరకాల సోది ప్రశ్నలు అడిగి ఆయననుంచి ఏమి నేర్చుకున్నట్లు?

మనుషులందరూ గురువులను తమతమ స్వార్ధాలకు వాడుకుందామని చూచేవారే గాని, ఆయా గురువులు చెప్పినవాటిని ఆచరిద్దామని చూచేవారు ఎవ్వరూ లేరు.ఇలాంటి చౌకబారు మనుషులు తమచుట్టూ చేరడమే ఆయా మహనీయుల ఖర్మ.ఈ ఖర్మకు ఏ మహనీయుడూ మినహాయింపు కాడు.

మహర్షి చనిపోయిన వెంటనే నాగమ్మగారు కూడా భారతదేశం నలుమూలలా తీర్ధయాత్రలకు వెళ్ళింది.ఎక్కడకు పోయినా పూజారుల డబ్బు యావా,వాళ్ళ దౌర్జన్యమూ,మనుషుల నీచ మనస్తత్వాలే గాని తను కోరుకున్న మనశ్శాంతి ఎక్కడా దొరకలేదని ఆమె వాపోయింది.అది అలాగే ఉంటుందని ఎటూ తిరగవద్దని "మనశ్శాంతి నీ బయట లేదు,అది నీలోపలే ఉంది" అని మహర్షి ఎన్నోసార్లు నెత్తీ నోరూ మొత్తుకుని చెప్పారు.కానీ వినేవారెవరు? ఆయన శిష్యులే ఆయన చెప్పినది పాటించలేదు.

ఆయన శిష్యులే కాదు.ఏ గురువు శిష్యులూ ఆయన చెప్పినది సరిగ్గా అర్ధం చేసుకోరు.సరిగ్గా పాటించరు.ఇది ఆధ్యాత్మిక లోకపు తిరుగులేని నియమాలలో (శాపాలలో) ఒకటి.

మహనీయుల అసలైన శత్రువులు ఎవరయ్యా అంటే వారి భక్తులే.

వారి శిష్యులే.

వినడానికి చేదుగా ఉన్నప్పటికీ ఇదే అసలైన వాస్తవం.

వాస్తవాలన్నీ చేదుగానే ఉంటాయిగా మరి !!