“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, జనవరి 2010, గురువారం

సంధ్యోపాసనా రహస్యాలు


సంధ్యోపాసన అనేది ఉపనయనం అయిన ప్రతివ్యక్తీ చేయవలసిన నిత్యోపాసన.శూద్రుడుగా జన్మించిన ప్రతి మనిషీ, సంస్కారకర్మ వల్ల ద్విజుడు అవుతున్నాడు. ఉత్తజంధ్యాన్ని ధరించి నంతమాత్రాన ఎవడూ ద్విజుడు కాలేడు. సంద్యోపాసనా రహస్యాలను తెలుసుకొని ఆచరించి దాని లోతులు అందుకున్న వాడే ద్విజుడు. ఇతరులు ఒట్టి వేషగాళ్ళు మాత్రమె.

ప్రపంచం యొక్క, తన జీవితంయొక్క అనిత్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవటమే రెండవజన్మ.అంతేగాని ఉత్త యజ్ఞోపవీతాన్ని ధరించటం కాదు. ఈవిధంగా ద్విజుడైనవాడు ఈ లోకయాత్రను సాగిస్తూనే ఆత్మసాధనను కూడా అభ్యాసం చేస్తాడు.ఈ విధమైనటువంటి అవగాహనను ఇచ్చే సంస్కార కర్మయే ఉపనయనం.

ఈ ఉపనయనం అనే మాటకు సామాన్య అర్థం ఏదైనప్పటికీ నేను మాత్రం ఒకే అర్థాన్ని విశ్వసిస్తాను.మానవునికి గల మూడోకన్ను అనబడే నేత్రాన్ని వికసింపచేసేదే ఉపనయనం.ఈ మూడోకన్ను అనేది దేవీమూర్తులకు, పరమేశ్వరునికి ఉన్నట్లుగా మనం చిత్రాలలో చూస్తాము. ఇది వెన్నెముకలో ఉన్న షట్చక్రాలలో చివరిదైన ఆజ్ఞాచక్రానికి సరాసరి సూటిగా నుదుటిలో ఉండే నాడీకేంద్రం.చాలామంది ఇదే ఆజ్ఞాచక్రం అనుకుంటారు. కాదు. రెంటికీ భేదం ఉన్నది. అది అనుభవంలో తెలుస్తుంది.

ఇది వికసించిన మనిషి దేవతలతో సమానమైన స్థితిని అందుకుంటాడు. దీనికి సూచికగానే హిందువులలో నుదుటిలో బొట్టును ధరించటం అనే సాంప్రదాయం వచ్చింది.బొట్టు అనేది జాగృతి చెందిన మూడవ నేత్రానికి సూచిక.కాని మన ఖర్మకొద్దీ నేటి ఆడపిల్లల్లో బొట్టు పెట్టుకోవటమే మోటు అనే స్తితి వచ్చింది.దీనికి తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. వాళ్ళకే తెలియని విషయాలు వారి పిల్లలకు ఏమి నేర్పించగలరు?

ఇది ప్రతి మనిషికీ ఉంటుంది. కాని నిద్రావస్థలో ఉంటుంది. దీనిని వికసింప చేయగలిగితే మానవుడు అతీంద్రియజ్ఞానం కలిగినవాడౌతాడు.అంటే ఇతరులు చూడలేనివి అతడు చూడగలుగుతాడు.ఇతరులు వినలేని శబ్దాలు అతడు వినగలుగుతాడు.సూక్ష్మభూమికలతో అనుసంధానం కాగలుగుతాడు. అతీంద్రియసిద్ధులు పొందగలుగుతాడు.అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని వెలుగును దర్శించగలుగుతాడు.

ఇటువంటి ఉప నయనాన్ని (additional eye) ఇచ్చే సంస్కారకర్మనే ప్రాచీనులు ఉపనయనం లేక వడుగు అని పిలిచారు. కాని ఈ అర్థం ఇప్పుడు పూర్తిగా విస్మరింపబడింది.ఆంతరికమైన యౌగికఅర్థం మరుగునపడి, ప్రస్తుతం వడుగు అంటే బంధువర్గం అంతా కలిసి చేసుకునే ఒక పండుగగా మారిపోయింది.తూతూ మంత్రంగా ముగించే ఒక తంతుగా మారింది. వివాహానికి ముందుగా చెయ్యాలి కాబట్టి, విసుక్కుంటూ చేసుకునే ఒక తంతుగా మారిపోయింది.ఇది పూర్తిగా తప్పుడు పధ్ధతి. ఇటువంటి స్థితి ఎందుకు కలిగింది?ముఖ్యంగా కలిప్రభావంవల్ల మనిషి ఇంద్రియవ్యామోహాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మికసాధనను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటమే దీనికి కారణం.

గురుతెరుగగ జెప్పు గురుడెవ్వడునులేడు
గురుతునెరుగు శిష్యవరుడు లేడు
గురుడు శిష్యుడనుట గుడ్డెద్దు చేనురా
విశ్వదాభిరామ వినురవేమ

అని వేమన యోగి చెప్పినట్లు, అంతరార్థాలు వివరించే గురువులూ ప్రస్తుతం కరువయ్యారు.చెప్పినా విని ఆచరించే శిష్యులూ కరువయ్యారు. కనుకనే జీవంలేని కట్టెలా,ఆంతరిక అర్థాలు లేని ఉత్తుత్తి ఆచరణలు,పైపై తంతులు మాత్రమె మిగిలి హిందూమతం,పండుగలు పబ్బాలు చేసుకుంటూ, సినిమాలు వీడియోలు చూసుకుంటూ బంధువులంతా కలసి లోకాభిరామాయణం చెప్పుకునే ప్రస్తుతస్తితికి చేరింది.ఈ స్థితిని ఊర్ధ్వలోకాలనుంచి చూచి గోత్రఋషులు ఎంతగా బాధ పడుతుంటారో ఆలోచిస్తే బాధ కలుగుతుంది. ఇది నిజంగా శోచనీయం.

ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. సంధ్య అంటే ఒక స్థితినుంచి ఇంకొక స్థితికి మారే దశ (transitional state).మనకు ఇరవైనాలుగుగంటలలో ఈ స్థితి నాలుగుసార్లు వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి. ఈ నాలుగు సమయాలలో ప్రకృతి ఒక స్థితినుంచి ఇంకొక స్థితికి మారుతుంది. కనుక అప్పుడు సాధనకు అత్యంత అనుకూల సమయంగా ఉంటుంది.

కారణం? ఏ స్థితి అయినా కోనసాగుతున్న వరకూ మనిషి అదే శాశ్వతం అనే భ్రమలో ఉంటాడు.కాని స్థితి మారినప్పుడు అతనికి ఆ స్థితి యొక్క అనిత్యత్వం బాగా అనుభవంలోకి వస్తుంది. సరిగ్గా సంధ్యాసమయంలో ఇదే జరుగుతుంది.మారిన ప్రకృతి స్థితివల్ల ప్రపంచం యొక్క అనిత్యత్వం సరాసరి మానవుడు అనుభవించగలుగుతాడు.అందుకే ఆ స్థితిని చాలామంది తట్టుకోలేరు.

సాయంకాలాల్లో ప్రశాంతంగా కూర్చోనలేక బట్టలు వేసుకొని రోడ్లమీద తిరగటానికి తయ్యారు అయ్యేవాళ్ళు మనకు చాలామంది దర్శనం ఇస్తారు. వారంతా బజారులోని జనసందోహంతో మమేకం చెందుతూ మనం హాయిగా ఉన్నాం మనకు ఏమీ పరవాలేదు అనే భ్రమను కల్పించుకొని తమ అంతచ్చేతనను మోసం చేసుకుంటూ ఉంటారు. మనస్సు లోపల లోతులలో ఇంత తతంగం జరుగుతుంది అని స్పృహ కూడా వారికి ఉండదు.

గొర్రె అనే జంతువు మందలో ఉంటూ తాను సుఖంగా ఉన్నాను అన్న భ్రమలో ఉంటుంది. కాని మృత్యువు తనను మింగటానికి వస్తున్నది అన్న నిజం అది తెలుసుకోలేదు. తెలిసినా ఆ స్పృహను తప్పించుకోటానికి మందతో మమేకం చెందుతూ అదే రక్షణ అన్న భ్రమలో ఉంటుంది. మనుషులలో కూడా చాలా మంది ఈ గొర్రె స్థితిలోనే ఉంటారు.

అందుకే మామూలు మనిషికి సాధకునికి ఉన్న అతి చిన్నతేడా ఏమిటంటే, సంధ్యాసమయంలో సాధకుడు ఏకాంతాన్నిఅభిలశిస్తాడు. జనంతో కలవడానికి ఇష్టపడడు.బాహ్యమైన భ్రమలకంటే ఆంతరికమైన సత్యాన్ని ధైర్యంగాఎదుర్కోటానికే అతడు ప్రాధాన్యతనిస్తాడు. అందుకే సాధకుడైన వాడు ఈ సంధ్యాసమయాన్ని దుర్వినియోగం చెయ్యరాదు.ఇతరత్రా వ్యాపకాలు వదలి ఆంతరిక ధ్యానసాధనలోనే ఈ సమయాన్ని ఉపయోగించాలి.

అలాగే, మానవుని జీవితంలో సంధ్యాసమయం కూడా నాలుగుసార్లు వస్తుంది. మానవుని పూర్ణాయుర్దాయం అయిన 120 ఏళ్లలో ప్రతి 30 ఏళ్ళకూ ఒకసారి సంధ్యాసమయం వస్తుంది.కొందరికి 96 మరి కొందరికి 108 గా ఈ ఆయుర్దాయం ఉంటుంది.అటువంటి వారికి ప్రతి 24 మరియు 27 ఏళ్లకు ఒకసారి ఈ సంధ్యాసమయం వస్తుంది. ఈ వివరాలు జ్యోతిర్విజ్ఞానం లో భాగమైన కాలచక్ర దశాజ్ఞానం ఉన్నవారికి బాగా అర్థం అవుతాయి.

కాలచక్రదశ అనేది దశావిదానములలో ఒక ముఖ్యమైన దశ. పరాశరమహర్షి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.ఇది రాశిదశ.ఉడుదశ కాదు.అలాగే రాశిచక్రంలో ఉన్న నాలుగు విభాగాలలో ఈ సంధికాలం మనం జ్యోతిష్యంలో కూడా చూడవచ్చు.1,4,7,10 భావాల మొదటిలో ఈ సంధికాలం ఉంటుంది. 

శైశవం,యవ్వనం,నడి వయస్సు,ముసలితనం ఈ విభాగాల ద్వారా సూచింప బడతాయి.సహజ నైసర్గిక కారకాత్వపరంగా ఈ విభాగాలకు బుధుడు, కుజుడు,గురువు,శని గ్రహాల ఆధిపత్యం ఉంటుంది.ఈ విధమైన సమన్వయము జీవితానికి,ప్రకృతికి,గ్రహాలకు,ఆంతరిక-బాహ్యపరంగా కనిపిస్తుంది. కాని చూచేదృష్టితో దీనిని చూడాలి.

ఆంతరిక ధ్యానసాధన చేసేవారికి దీనిలోని ఇంకొన్ని రహస్యాలు తెలుస్తాయి. మనం మెలకువ నుంచి నిద్రలోకి పోయే సమయంలోకూడా సంధ్యాసమయం ఉంటుంది.అలాగే నిద్రనుంచి మెలకువకు వచ్చే స్థితిలో కూడా సంధ్యా సమయమే.ఈ సంధ్యాసమయంలో ధ్యానస్థితిలో ఉండగలిగితే వానికి ఆధ్యాత్మికపురోగతి అత్యంతత్వరితంగా కలుగుతుంది. దీనిని సూచిస్తూనే మన పెద్దవాళ్ళు నిదానంగా నిద్రలెమ్మని,మెలకువ తెచ్చుకొమ్మని చెబుతారు. అలాగే, నిద్రలో ఉన్న మనిషిని అకస్మాత్తుగా లేపకూడదని కూడా చెబుతారు.

నిద్రపోయే ముందు జపం ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకోవడం ఒక మంచి అభ్యాసం.దీనివల్ల చెడుకలలు రాకపోవటమే కాక నిద్ర లేచేవరకూ అంతచ్చేతనలో మంత్రజపం లేదా ధ్యానస్థితి అలా కోనసాగుతూ ఉంటుంది. నిద్ర మెలకువ వచ్చేటపుడు కూడా మంత్రజపం లేదా ధ్యానస్థితితోనే దానంతట అది మెలకువ వస్తుంది. దీనివల్ల మనస్సు అత్యంత త్వరితంగా శుద్దత్వాన్ని సంతరించు కుంటుంది.

అయితే దీనిలో ఒక ప్రమాదం ఉంది. జపం మొదలుపెట్టగానే నిద్ర ముంచుకొచ్చే అలవాటు కాకుండా సాధకుడు జాగ్రత్తపడాలి.

ఇప్పుడు నేను చెప్పబోయే స్థితి కోటికి ఒకరికి కూడా అనుభవంలో ఉండదు. ఇది ఇంకా లోతైన సంధ్యాసమయం.కలలుకనే స్థితినుంచి గాఢనిద్రలోకి జారుకునే సమయంలో కూడా ఒక సంధ్యాస్థితి ఉంటుంది. తిరిగి గాఢనిద్ర నుంచి కలలుకనే భూమికలోకి వచ్చే స్థితిలో కూడా కొంతసేపు సంధ్యా సమయం ఉంటుంది. అయితే ఈ రెండూ స్తితులు యోగసాధనలో లోతులు అందుకున్నవారికే అనుభవంలోకి వస్తాయి.

జనసామాన్యానికి ఇవి అందుబాటులో ఉండవు. గాఢనిద్ర అనేది పూర్తిగా అరుదైపోయిన నేటి అస్తవ్యస్త సమాజంలో ఇవి ఊరకే బుద్దిపరంగా అర్థం చేసుకోవటానికి పనికొస్తాయిగాని అనుభవంలో అందవు. అందుకే ఈ స్తితి కోటిమందిలో ఒకరు మాత్రమె అందుకోగలరు అని ముందే చెప్పాను. అర్థరాత్రి వరకూ చెత్త టీవీ సీరియల్లు చూసి, నిద్రరాక,ఉత్త మామూలు నిద్ర కోసం తన్నుకులాడి,నిద్రమాత్రల సాయంతోనో లేదా ఆల్కహాల్ సాయంతోనో లేదా సెక్స్ సాయంతోనో ఎప్పుడో అర్థరాత్రి దాటిన తరువాత కలతనిద్రలోకి జారుకునే నేటి మనుషులకి ఇవి చెప్పినా అర్థంకావు.

దీనిలో ఇంకొంత లోతులు చూద్దాం. ఒక ఆలోచన ఆగి మరొక ఆలోచన మొదలయ్యే మధ్యలో కూడా సంధ్యాసమయం ఉంటుంది. ఈ విరామం తెలియాలంటే ఆలోచనలు గమనించే సామర్ధ్యం ఉండాలి. ఇది సామాన్యంగా అందరికీ ఉండదు. ఏ ఆలోచన వస్తే దానిలో పడి కొట్టుకుపోవడమేగాని వాటిని సాక్షిగా గమనించే సామర్ధ్యం సామాన్యంగా ఉండదు. ఇట్టి సామర్ధ్యం ఏళ్ళ తరబడి చేసిన ధ్యానసాధన ద్వారానే వస్తుంది.

ఇట్టి ప్రజ్ఞ కలిగినవాడు ఆలోచనకూ ఆలోచనకూ మధ్యన ఉన్న శూన్యమైన స్థితిని పట్టుకోగలుగుతాడు. ఆ శూన్యస్థితిలో ఎల్లప్పుడూ ఉండటం అలవాటు అయితే ఆలోచనారహితస్థితి అందుకుంటాడు.ఈ ఆలోచనా రహితస్థితి సమాధిస్థితికి అతి దగ్గరగా ఉంటుంది.ఇంకొక్క అడుగు ముందుకు వెయ్య గలిగితే సమాధిస్థితిని అందుకోవచ్చు. కాని ఆఒక్క అడుగు వెయ్యడానికి బ్రహ్మప్రళయం అవుతుంది. అనేకసార్లు ఈఒక్క అడుగు వెయ్యటానికి అనేకజన్మల సమయం పడుతుంది. ఇది అత్యంత రహస్యవిజ్ఞానం మరియు వ్యక్తిగతంగా అత్యంత సమర్థుడైన శిష్యునికి వివరించ వలసిన విషయం కనుక ఇంతకూ మించి వ్రాయలేను.

ఆలోచనారహితస్తితి అందుకుంటే ప్రకృతిలోని రహస్యద్వారాలు తెరుచు కుంటాయి.అంతకు ముందు కనిపించని అనేక వింతలు కనిపిస్తాయి. ఈ లోకానికి చెందని సూక్ష్మధ్వనులు వినపడతాయి. అప్పుడు వినపడే కొన్ని ధ్వనులను ఈలోకంలోని ఏ సంగీత వాయిద్యమూ సృష్టించలేదు.అవి అంతటి విభిన్నంగా మధురంగా ఉంటాయి.అనేక రంగుల వలయాకారాలు,కాంతి ఒక ఫౌంటెన్ వలె విరజిమ్మబడటం వంటి అనేక దృశ్యాలు కనిపిస్తాయి.

ఇట్టి స్తితిని అందుకోగలిగితే ప్రకృతిలో ప్రతిదీ జీవంతో తొణికిసలాడుతూ దర్శనం ఇస్తుంది.చెట్లతో మాట్లాడవచ్చు.రాళ్ళను పలుకరించవచ్చు. గాలి ఆత్మీయస్పర్శను అందుకోవచ్చు.నీటి గలగలలలో సూక్ష్మలోకవాసుల మాటలను ఆలకించవచ్చు.ఇంతెందుకు.సాక్షాతూ దైవస్పర్శను ప్రతి దానిలోనూ అడుగడుగునా తిలకించవచ్చు.

అప్పుడు మామూలు మనుషులకు అగమ్యమైన ఒక కొత్తలోకం ఈలోకంలోనే మనకు దర్శనం ఇస్తుంది.కాని లోకానికి ఒక పిచ్చివానివలె కనిపిస్తాము. మహనీయులైన సిద్దులందరూ ఇట్టి స్థితిలో ఉన్నపుడు లోకం దృష్టిలో పిచ్చివారుగా చూడ బడినవారే.

సంధ్యోపాసన అనేది సరిగ్గాచేస్తే ఇంతటి ఔన్నత్యాన్ని మానవునికి ఇవ్వగలదు. కాని దీన్ని బోధించేవారు,దారి చూపించేవారు కరువు అయ్యారు.ఒకవేళ అటువంటివారు ఉన్నా కూడా ఆచరించే వారు అరుదయ్యారు. సంపదను ఉంచుకొని కూడా అది మరిచిపోయి బికారిగా బతుకుతున్న అభాగ్యునివలె మన పరిస్తితి నేడు ఉన్నది ఆంటే అతిశయోక్తి కానేరదు.కొన్నాళ్ళు పోయాక ఏ అమెరికావాడో వచ్చి నాయనలారా మీ ప్రాచీన వేద-తంత్ర విజ్ఞానంలో ఇంత మహత్తరమైన విషయాలు ఉన్నాయి. తెలుసుకొని ఆచరించండిరా అని చెబితే వాళ్ళను కూడా పిచ్చివాళ్ళ కింద జమకట్టి నవ్వుతామేమో.అలా ఉంది మన హీనస్తితి.

మనం నిర్లక్ష్యం చేస్తున్న సంధ్యావందనం అనే ప్రక్రియలో ఇంతటి గూఢమైన అర్థాలు ఉన్నాయి.సంధ్యారహస్యం ఇంకా చాలాచాలా ఉన్నది. వ్రాస్తూపొతే ఇదే కొన్ని అధ్యాయాలుగల ఒక పుస్తకం అవుతుంది. ప్రస్తుతానికి చాలు.