అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

27, జులై 2009, సోమవారం

భయాన్ని జయించటం ఎలా?

భయం లేని మనిషి ఉండడు. ఏదో ఒక రకమైన భయం ప్రతి వానిని వెంటాడుతూ ఉంటుంది. భయం లేకపోతే మృత్యు భయం ఉండనే ఉంటుంది. నాకు చావంటే భయం లేదు అని బీరాలు పలికే వారు చివరి దశలో గజ గజా వణికి పోవటం నేను చూచాను. అలాగే, అతి మామూలు మనుషులు అని లోకం దృష్టిలో కనిపించేవాళ్ళు ఇంకో పది నిమిషాల్లో చనిపోతున్నాను అని తెలిసినా, ధైర్యంగా నవ్వుతూ పోవటమూ చూచాను.

భయం పోవటానికి నాకు తెలిసిన ప్రక్రియ చెబుతాను. మనకు భయాన్ని కలిగించే పరిస్థితిని తప్పించుకోవటానికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రయత్నం చెయ్యరాదు. పరిస్తితిలోనే ఉండి భయం ఎందుకు కలుగుతున్నది, ఎక్కణ్ణించి వస్తున్నది గమనించాలి. ఒక ఉదాహరణతో చెప్తాను. నాకు చీకటిగా ఉన్న ఇంటిలో ఒక్కడినే ఉండాలి అంటే భయం అనుకుందాం. అటువంటప్పుడు ఎవరినో తోడూ తెచ్చుకోవటం లేదా చుట్టాల ఇంటికిపోయి రాత్రికి అక్కడ పడుకోవటం మొదలైన పనులు చెయ్యరాదు. ఒక్కడే అదే ఇంటిలో ఉండాలి. మనసు పీచు పీచు మంటున్నా మొండిగా ఉండాలి. భయం ఎందుకు, ఎలా, ఎక్కణ్ణించి మనసులో తలెత్తుతున్నదో గమనిస్తూ తనను తానె తరచి చూచుకుంటూ అవసరమైతే రాత్రంతా గడపాలి. ఇలా ఒక్క సారి చెయ్య గలిగితే భయం పటాపంచలౌతుంది. చెయ్యలేకపోతే జీవితాంతం భయం వెంటాడుతూనే ఉంటుంది.

కొందరికి కుక్కలంటే, ఇంకొందరికి చీకటంటే, దయ్యాలంటే, కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే, ఇంకొందరికి ఒంటరిగా బయటకు పోవటం అంటే, కొందరికి స్టేజి మీద ఉపన్యాసం చెప్పాలంటే, ఇంకొందరికి పరీక్షలంటే ఇలా రకరకాల భయాలుంటాయి. వీటన్నిటికీ ఇదొక్కటే మందు. బుద్ధుడు ఆరేళ్ళపాటు ఒంటరిగా సాధన చేసాడు. అప్పుడు అడవులలో ఒక్కడే తిరిగేవాడు. సమయంలో తనలో కలిగిన భయాన్ని గురించి దానిని తాను ఎలా అధిగామించాడనే దాని గురించి తరువాతి వివరం గా చెప్పాడు. అడవిలో రాత్రిపూట ఒంటరిగా తిరిగేటప్పుడు ఒక్కొక్క ప్రదేశం లో ఒళ్ళు జల్లుమని భయం పుడుతుంది. అప్పుడు అదే చోట నిలిచి ఎందుకు భయం కలుగుతున్నది, అసలు మనసులోకి ఎలా ప్రవేశిస్తున్నది, కారణం ఏమిటి అని ధ్యానిస్తూ భయం పోయేవరకూ అక్కడే ఉండేవాడుట. విధంగా తాను భయాన్ని జయించానని ఆనందునితో సంభాషణల లో చెప్తాడు.

చాలా మందికి చీకటిలో ఒంటరిగా నడిచేటప్పుడు, ముఖ్యం గా నిర్మానుష్య మైన ప్రదేశాలలో, ఉన్నట్టుండి ఒళ్ళు ఝల్లు మన్నట్లు అనిపిస్తుంది. మన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. తల తిప్పి చూద్దామన్నా ధైర్యం చాలదు. ఇట్టి పరిస్తితి నాకూ చాలా సార్లు ఎదురైంది. అప్పుడు బుద్ధుని మాటలు గుర్తు తెచ్చుకొని అదే ప్రదేశం లో నిలిచి ధ్యానించేవాడిని. ఎక్కడైతే భయం కలుగుతున్నదో అక్కడే మొండిగా నిలిచి, వీలైతే కూర్చొని ధ్యానం చేసేవాడిని. కొద్ది సేపటికి భయం పటాపంచలయ్యేది. నా స్థితికి నాకే నవ్వొచ్చేది. మళ్ళీ బుద్ధ భగవానుని తలచి ప్రణామాలు అర్పించి ముందుకు పోయేవాడిని.

ఒకసారి దెయ్యాల కొంపగా పేరు పడ్డ ఒక పాడుబడిన ఇంట్లో రాత్రి పదకొండు గంటల సమయంలో ధ్యానం చేశాను. శరీరం మనసు రెండూ బలవంతంగా వ్యతిరేకిస్తున్నాయి.లేచి బయటకు పారిపోదామని బలంగా అనిపిస్తున్నది. గుండె పీచు పీచు మంటున్నది. చెమటలు పడుతున్నాయి. నా మనస్సు రెండుగా చీలిపోయి ఒక భాగం ఉండు అని ఒక భాగం లేచి పారిపో అని చెబుతున్నాయి. అయినా మొండిగా అలాగే కూర్చొని ఒక గంటసేపు ధ్యానం చేశాను. ఏం జరుగుతుంది మహా అయితే ప్రాణం పోతుంది. అంతేగా. అదీ చూద్దాం ఎలా ఉంటుందో అనుకుంటూ కూచున్నాను. నాకు ఏమీ దెయ్యాలు కనిపించలేదు. మన మనస్సులో ఎప్పుడో విన్న కథలు, చదివిన పుస్తకాలు, చూచిన సినిమాలే జ్ఞాపకాలుగా గుర్తొచ్చి భయపెడతాయి తప్ప ఇంకేమీ లేదు. దయ్యాలు లేవా అంటే అది వేరే సబ్జెక్టు. ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మాత్రం అనుమానం లేదు. కాని నూటికి తొంభై శాతం మన మనసే మనలను భయపెడుతుంది.

భయాన్ని అనేక విధాలుగా జయించవచ్చు. కొందరు తమ ఇష్ట దైవం మీద విశ్వాస బలంతోనూ, ఇంకొందరు నామ జపం లేదా మంత్ర జపం తోనూ, ఇంకొందరు మనో బలం తోనూ, ఇంకొందరు బుద్ధుని మార్గమైన విపస్సాన విధానంతోనూ అధిగమించ వచ్చు. వీటిలో బుద్ధుని మార్గం కష్టతరమైనది. ఎందుకంటే దీనిలో దేవుని వంటి బాహ్యమైన ఇంకొకరిపైన ఆధార పడటం ఉండదు. ఉన్న సమస్యను లోతుగా తరచి చూచి దాని మెకానిజం అర్థం చేసుకొని, మనస్సులో మార్పులు ఎలా కలుగుతున్నవో లోతుగా గమనించి చూచి సమస్యను అధిగమించటం ఉంటుంది. కాని చెయ్యగలిగితే ఇది అద్భుతమైన విధానం. దీనిని మించిన పధ్ధతి లేదు అని చెప్పవచ్చు. కాని సాహసం ధైర్యం ఉన్నవారే దీనిని అమలులో పెట్ట గలుగుతారు. ధైర్యం లేని వారికి ఇది కష్టం గా ఉంటుంది.

ఉపనిషత్తుల ముఖ్యమైన బోధన ఏమిటి అని ఒకరు మహాయోగి, మహా జ్ఞాని అయిన వివేకానంద స్వామిని అడిగారు. ఆయన దానికి సమాధానమిస్తూ. అభీహి, అభీహి ( భయ రహితుడవై ఉండు, భయ రహితుడవై ఉండు) అనేదే ఉపనిషత్తుల ముఖ్య బోధన అని చెప్పారు. తనను అనుసరించే వారికి కూడా ఉండవలసిన ముఖ్య లక్షణం ఇదే అని ఆయన నొక్కి చెప్పారు. తనను అన్ని జీవులలోను, అన్ని జీవులను తనలోను చూస్తున్న వానికి భయమేక్కడిది? అసహ్య మేక్కడిది? అని చెప్పే మంత్రాలు ఉపనిషత్తులలోను భగవత్ గీతలోను ఉన్నాయి. ఇట్టి స్థితి ఆధ్యాత్మిక సాధనలో అత్యున్నత భూమిక అయిన బ్రాహ్మీ భూత స్థితి. మనకు స్థాయి లేకపోయినా, మన చేతనైనంతలో ధైర్యాన్ని కలిగి ఉండటం ముఖ్యం. నిర్భయత్వం అనేది సాధనా మార్గంలో సాధించ వలసిన ఒక ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాధన చేసే వారు తనలోని భయాలను గుర్తించి వాటిని అధిగమించవలసి ఉంటుంది. దానిని సాధించటంలో బుద్ధుని విపస్సాన ధ్యాన మార్గం అత్యుత్తమం.
read more " భయాన్ని జయించటం ఎలా? "

25, జులై 2009, శనివారం

వీర విద్యలు-అభ్యాస విధానాలు


ప్రపంచంలోని ముఖ్యమైన వీర విద్యలన్నీ పరిశీలిస్తే కొన్ని ముఖ్య విషయాలు అన్నింటిలో ఒకటిగానే ఉంటాయి. స్వల్పమైన తేడాల వల్లే వేరు వేరు విద్యలుగా గుర్తించ బడుతున్నా, నిజానికి ఇవన్నీ వేర్వేరు కావు. అతి ప్రాచీన మైనకలారి పాయట్టు, మర్మ అడి, వజ్ర ముష్టి, ఇంకా చైనీస్ కుంగ్ ఫూ విద్యలలో ఓపెన్ హేండ్ మరియు వెపన్స్ రెండూకలిపి నేర్పే పద్ధతులు ఉండేవి. కాని తరువాత తరువాత టెక్నిక్స్ ను బట్టి వేరు వేరు విద్యలుగా చీలిపోయాయి.

ఉదాహరణకు-- మనిషిని ఎత్తి విసిరి పారవేసే బాడీ త్రోస్ ఎక్కువగా ఉండటం జూడో ప్రత్యేకత. అలాగే జాయింట్ లివరేజి టెక్నిక్స్ ఉపయోగించి కాళ్ళు చేతులు విరిచేయటం, మనిషిని కదలకుండా బంధించటం జుజుత్సు ప్రత్యేకత. ఇక కుంగ్ఫూ లోని విభిన్న శాఖలలో- ప్రత్యర్థిని హాని చేయకుండా కంట్రోల్ చేయటం నుంచి, ప్రాణాంతక టెక్నిక్స్ వరకూ అన్నిస్థాయిలు ఉన్నాయి. ప్రత్యర్థి బలాన్ని తిప్పి అతని మీదే ప్రయోగించి ఓడించటం అయికిడో ప్రత్యేకత. ఇక తాయిఛి విషయానికొస్తే అతి తేలికగా కనిపించే టెక్నిక్స్ తో ప్రాణశక్తిని ఉపయోగించి నాడీకేంద్రముల మీద ప్రత్యెకమైన దెబ్బలతో ప్రత్యర్థిని మట్టి కరిపించటం దీని లక్షణం. కరాటేలో మనిషిని భయంకరమైన ప్రాణాంతక దెబ్బలతో పడగొట్టటం ఉంటుంది.

కరాటే లోని విభిన్న స్టైల్స్ లో కొన్ని ఎక్కువ హేండ్ మూవ్మెంట్స్ కు మరికొన్ని స్టైల్స్ కిక్స్ కు ఎక్కువ గా ప్రాధాన్యతనిస్తాయి. సదరన్ షావులిన్ కుంగ్ ఫూ లో ఎక్కువగా హేండ్ టెక్నిక్స్ వాడకం ఉంటుంది. అదే నార్తర్న్ షావులిన్ కుంగ్ఫూ లో కిక్స్ కు ప్రాధాన్యత ఎక్కువ. ఒక్క కుంగ్ఫూ లో మాత్రమె 50 రకాల ఆయుధాలు వాడటం నేర్చుకోవచ్చు. జపనీస్ కరాటే స్టైల్స్ లో ఆయుధాలు ఉండవు. కరాటే అంటేనే ఎంప్టీ హేండ్ కనుక ఆయుధాల అభ్యాసానికి "కొబుడో" అనే జపనీస్ మార్షల్ ఆర్ట్ విడిగా ఉంది. దీనిలో నన్ చాకు, సాయి, టోంగ్ఫా, కాలి మొదలైన ఆయుధాల వాడకంనేర్చుకోవచ్చు.

అన్ని మార్షల్ ఆర్ట్స్ ను పరిశీలించిన మీదట నా సొంత స్టైల్ లో నేను ఈ క్రింది అభ్యాసాలు ముఖ్యంగా తీసుకున్నాను.

>>Body Conditioning: దీనిలో ఒంటిని దృడం గా చేసే అభ్యాసాలు, ఎటు కావాలంటే అటు విల్లులా వంచేఅభ్యాసాలు ముఖ్యమైనవి

(Strength and Flexibility Improving Exercises) ఇవి కాక శరీరంలోని పిడికిలిమొదలైన ముఖ్య సహజ ఆయుధాలను ఉక్కులా గట్టి పరిచే ప్రక్రియలు. కలారి పయట్టులోని "మైప్పత్తు" విభాగం లోనుంచి కొన్ని అభ్యాసాలు తీసుకున్నాను.

>>Offense Techniques: దీనిలో చేతి వెళ్ళు, కణుపులు, పిడికిలి, అరచెయ్యి, ముంజేయి, మోచేయి, భుజం, తల, ఉపయోగించి కొట్టే 24 రకాల దెబ్బలు ఉంటాయి. అలాగే మోకాలు, పాదం, మడమ, పాదం పక్కన కత్తి లాంటి భాగం ఉపయోగించి చేసే ముఖ్యమైన 12 రకాలైన కిక్స్ ఉన్నాయి. ఇవి కాక జాయింట్ లాక్స్, బాడిత్రోస్ తో బాటు నాడీకేంద్రాలను దెబ్బ తీసే ప్రాణాంతకమైన మర్మవిద్యా విధానాలు ఉంటాయి.

>>Defense Techniques: వీటిలో లాఘవంగా తప్పుకొనే విధానాలు, చేతులు కాళ్ళు ఉపయోగించి చేసే 24 రకాల బ్లాకింగ్ పద్ధతులు ఉన్నాయి.ఒకేసారిగా ఈ రెండు విభాగాలలో ఫుట్ వర్క్ కూడా కలిసే అభ్యాసం చేయటం జరుగుతుంది.ఎనిమిది రకాలైన ఫుట్ వర్క్ వాడటం దీనిలో ఉంటుంది.

>>Weapons: ముఖ్యమైన 6 రకాల ఆయుధాలు వాడే విధానాలు ఇందులో ఉంటాయి. ప్రాచీన కాలంలో ఉపయోగించిన ఆయుధాలు ఇప్పుడు ఉపయోగపడవు. ఉదాహరణకు సమురాయి స్వోర్డ్ భుజానికి తగిలించుకుని తిరగటం ఈ రోజులలో నేరం. అందుకని లాంగ్ స్టిక్, డబుల్ షార్ట్ స్టిక్స్, శికిబో, చేతిలో ఇమిడిపోయే యావార స్టిక్, బెల్ట్ అండ్ టవల్, షార్ట్ నైఫ్-- మొదలైన ఆయుదాలకే ప్రాధాన్యత నిచ్చాను.
 
రెండునెలల క్రితం ఒకసారి ఆదోని కొండమీద రణమండల ఆంజనేయస్వామి గుడికి పోదామని కొండ ఒంటరిగా ఎక్కుతుంటే కొండముచ్చుల గుంపు ఎటాక్ చేసింది.అప్పుడు నడుముకున్న బెల్టుని బాణాకర్రలా తిప్పి వాటిని పారదోలటం జరిగింది.
 
>>Breathing and Meditation: వీర విద్యలకు అవసరమైన ప్రాణాయామ, ధ్యాన విధానాలు ఈ విభాగంలో పొందుపరచాను.

ఈ విధంగా ముఖ్యమైన అన్ని అభ్యాసాలు క్రోడీకరించి నా పర్సనల్ స్టైల్ ను ఒక పరిపూర్ణమైన విధానంగా తయారుచేశాను.
read more " వీర విద్యలు-అభ్యాస విధానాలు "

18, జులై 2009, శనివారం

ఉత్తర కాలామృతం-ఇందులగ్నం

ధన మూల మిదం జగత్. ప్రపంచం డబ్బుతో నడుస్తున్నది. ప్రతివారికీ తనకెంత ధనయోగం ఉందో తెలుసుకోవాలనిఉంటుంది. జీవితంలో తనకు ధనయోగం ఉందా లేదా తెలుసుకోవాలని ఉంటుంది. ఇది తెలియాలంటే,ధనయోగాలు జాతకంలో ఉన్నవా లేవా చూడటం ఒక పధ్ధతి.

అయితే, కాళిదాసు తన ఉత్తర కాలామృతం గ్రంధం లో నాలుగోఅధ్యాయం లో ఇరవై ఏడవ శ్లోకంలో ఇందు లగ్నం అనే ఒక కొత్త పద్ధతిని ఇచ్చి ఉన్నాడు.
ఈ విశేష విధానం ఇతర గ్రంధాలలో కనిపించదు. దీని ద్వారా ధనయోగం ఉందా లేదా? ఉంటే దశలో అది ఫలిస్తుంది? అనేది తెలుసుకోవచ్చు. తద్వారా సమయంలో ప్రయత్నాలు బలం గా చెయ్యటం ద్వారా ధన సంపాదన చెయ్య వచ్చు.

శ్లోకం||అర్కాన్నాగ చటస్తనుర్జన నట ఖేటాయనం స్యుస్తనో||శ్చంద్రా ద్భాగ్యపయో కలైక్య మిన హ్రుచ్చిష్టంవిదోర్యద్గృహం||
తద్రాశౌతు విపాప శోభన ఖగే కోటీశ్వరం తన్వతే ||చేత్ పాపేతు సహస్రశః ఖల ఖగే తుంగేతు కోటీశ్వరం||

అర్థం|| అర్కాత్= సూర్యుడు మొదలు; నాగ=30; చట=16; తను=6; జన=8; నట=10; ఖేట=12; అయనం=1; స్యు= అగుచున్నవి.
స్తనోశ్చంద్రా ద్భాగ్యపయో కలైక్య మిన హ్రుచ్చిష్టం విదోర్యద్గృహం= లగ్న చంద్రులనుంచి భాగ్యాదిపతులకళలను పన్నెండుచే భాగించి, మిగిలిన సంఖ్య చంద్రునినుంచి ఎన్నవ రాశియగునో; తద్రాశౌతు విపాప శోభన ఖగే కోటీశ్వరం తన్వతే= రాశి పాపుల స్పర్శ లేక శుభ గ్రహముల తో కలసి ఉంటే కోటీశ్వరుడగును. పాపేతు సహస్రశః= పాప గ్రహ మున్నను వేలాదికారిని చేయును. ఖల ఖగే తుంగేతు కోటీశ్వరం= పాప గ్రహమైనను ఉచ్చ స్థితి యందున్న యెడల కోటీశ్వరుడగును.

అనగా, రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శనులకు వరుసగా 30,16,6,8,10,12,1 అనే (Units) కళలున్నవి. మనకుకావలసింది భాగ్య భావ విషయం కాబట్టి లగ్న చంద్రులనుంచి భాగ్యాదిపతుల కళలను కూడి పన్నెండుచే భాగించివచ్చిన సంఖ్యా ప్రమాణ రాశి చంద్రుని నుంచి లెక్కించగా రాశి లేదా రాశ్యాదిపతి స్థితిని బట్టి ధన యోగం ఊహించమని శ్లోకార్థం.

ఉదాహరణకు మధ్యనే వ్రాసిన NTR జాతకం తో చూద్దాం. ఈయనకు లగ్నం చంద్ర లగ్నం రెండూ తుల కనుక భాగ్యభావం మిథునం అధిపతి బుధుడు అవుతాడు. బుధుని కళ 8+8=16/12=4 శేషం. కనుక చంద్రుని నుంచి నాలుగుఅయిన మకరం అధిపతి శని. శని భగవానుడు దశామ్షలో ఉచ్చ స్థితి లో ఉండటంతో. లాభ స్థానం లో రాహువుతోకలిశి ఉండటంతో, శని దశలో విపరీత భాగ్య వృద్ధి ఉంది అని చెప్ప వచ్చు. తరువాత వచ్చిన బుధ దశ భాగ్యదిపతి దశకనుక ఇదీ యోగిస్తుంది అని చెప్ప వచ్చు. నిజంగా జరిగింది కూడా ఇదే కదా. ఈయనకు శని దశ, బుధ దశలలోవిపరీత ధన యోగం కలిగింది.

ఈ విధానం ప్రపంచంలో గొప్ప కోటీశ్వరులైన బిల్ గేట్స్, అంబానీ సోదరులు, వారెన్ బఫెట్, లక్ష్మి మిట్టల్ మొదలైన వారి జాతకాలలో పరీక్షించగా ఆశ్చర్య కరమైన ఫలితాలు కనిపించాయి.

ఇంకొక జాతకానికి లగ్నం మకరం, చంద్ర లగ్నం మీనం. కనుక భాగ్యదిపతులు వరుసగా బుధుడు, కుజుడు అవుతారు. వీరితో లెక్క వేయగా,8+6=14/12=2 శేషం అవుతుంది. కనుక మీనాత్ రెండు అయిన మేషం. మేషం లో ఎవరూ లేరు. కాని కుజుడు సింహ రాశిలో బలంగా ఉన్నాడు. కనుక 2017 నుంచి మొదలయ్యే కుజ దశ ధన పరంగా బాగాయోగిస్తుంది అని చెప్ప వచ్చు.

ఇంకొక జాతకానికి లగ్నం వృషభం, చంద్ర లగ్నం ధనుస్సు. భాగ్యాదిపతులు వరుసగా శని, రావులు. కనుక లెక్కించగా 1+30=31/12=7
కనుక ధనుస్సు నుంచి ఏడవది మిథునం. బుధుడు గురువు తో కలిశి మేషంలో చంద్ర లగ్నాత్పంచమంలో ఉన్నందున 2013 నుంచి వచ్చే గురు దశ ధన పరంగా యోగిస్తుంది అని చెప్ప వచ్చు.

ఇలా లగ్న చంద్ర లగ్నాల వల్ల ధన యోగాన్ని లెక్కించే విధానం కాళిదాసు మనకు ఇచ్చాడు. ఇది జాతకంలోచూచినా సరిగా సరిపోయే ఒక ఖచ్చితమైన పద్దతి. ఆధారంతో గ్రహాలకు కళలు (Units) కేటాయించారోమనకు తెలియదు. కాని దీనికి తప్పక ఒక లెక్క ఉండే ఉంటుంది. ఆయా గ్రంధాలు ధ్వంసం అవటం వల్ల అనేక missing links
ఏర్పడ్డాయి. ప్రస్తుతం మనం ఊహించవలసిందే. చంద్రునికి కళలు పదహారు అని అంటారు కదా. బహుశా అందుకనే ఇక్కడ పదహారు కళలు ఇచ్చి ఉండవచ్చు. శుభ ఫలితాలు ఇచ్చే రీత్యా ఈ కళలు కేటాయించారు అనిపిస్తుంది. అందుకనే రవికి 30 మరియు శనికి 1 ఇచ్చినట్లుంది. మొత్తంమీద కళలు ఎలా కేటాయించారో తెలియనప్పటికీ విధానం విశ్లేషణలో చక్కగా పని చేస్తుంది. జ్యోతిర్విజ్ఞానం లో పరిశ్రమ చేస్తున్నమిత్రులు పరీక్షించి చూడండి.
read more " ఉత్తర కాలామృతం-ఇందులగ్నం "

16, జులై 2009, గురువారం

NTR జాతకం

NTR 28-5-1923 తేదీన సాయంత్రం 4-43 నిముషాలకు కృష్ణాజిల్లా లోని నిమ్మకూరు గ్రామంలో పుట్టారు.ఈయన రుధిరోద్గారి నామ సంవత్సరం అధికజ్యేష్ట శుక్ల త్రయోదశి సోమవారం రవి హోరలో జన్మించాడు. ఆయన జాతకచక్రాలు రాశి,నవాంశ,దశాంశలు ఇక్కడ చూడండి. ఈయన జాతకవిశ్లేషణ అంత తేలిక కాదు. 

అసలు అన్నిజాతకాలకూ ఒకే పద్దతి పనికి రాదు. ప్రతి మనిషి ఇతరుల కంటే విభిన్నంగా ఎలాగైతే ఉంటాడో అలాగే ప్రతి జాతకమూ దానికది ప్రత్యేకంగానే ఉంటుంది. అన్నింటికీ ఒకేపద్దతి పనికి రాదు.కాని అన్నింటికీ వర్తించే కొన్ని సూత్రాలు ఉంటాయి.అలాగే ఆజాతకానికి మాత్రమె వాడవలసిన ప్రత్యెకసూత్రాలు కొన్నిఉంటాయి. ఆ కోణంలోనించి చూస్తేనే ఆ జాతకం అర్థం అవుతుంది. 

ఈయన జాతకంలో బుధుడు,గురువు,శనిమూడు గ్రహాలు వక్రించి ఉన్నాయి.మామూలుగా పైపైన చూస్తె ఈయన జాతకం గొప్పజాతకం అని అనిపించదు.కాని ఈ మూడుగ్రహాల వక్రత్వంవల్ల వాటిని రెక్టిఫై చేస్తేనే ఈజాతకం లోతు అర్థం అవుతుంది. నాడీవిధానం ప్రకారం వక్రగ్రహాలు వెనుక రాశులలో ఉన్నట్లుచూడాలి.ఆ విధంగా వేశిన జాతకం విశ్లేషణ చేస్తే ఈయనజాతకం సరిగ్గా అర్థం అవుతుంది. ఈ విషయం గ్రహించలేక పేరుమోసిన అనేక మంది జ్యోతిష్కులు ఈయన జాతకాన్ని విశ్లేషణ చెయ్యటానికి నానాతంటాలూ పడి ఏవేవో సూత్రాలు అప్ప్లై చేసి మొత్తంమీద ముగించామని అనిపించుకున్నారు. నేను వారినెవరినీ విమర్శించటం లేదు.సందర్భం వచ్చింది గనుక నాకు తోచిన మాటగా పరిశీలనలో నిగ్గుతేలిన సత్యాన్ని వినమ్రతతో చెబుతున్నాను. 

చాలామంది విశ్లేషణ చేసి చెప్పినప్రకారం ఈయన జాతకంలో గజకేసరియోగం వల్లనే ఆయనకు మహాయోగం పట్టింది అంటారు.కాని గజకేసరి యోగం ఒక్కటే అంతటి ఎత్తులకు తీసుకుపోలేదు. మిగిలిన జాతకంకూడా కొంత బలంలేకపోతే ఉత్త గజకేసరియోగం పెద్దగా ఫలితాలు ఇవ్వదు. శని ఆత్మకారకునిగా లాభస్థానంలో రాహువుతో కలిశిఉండటంతో రంగులు వేసుకొని వేషాలు మార్చే సిన్మారంగంలో లాభసాటిగా ధనాన్ని సంపాదించాడు.రాహువుకున్న కారకత్వాలలో వేషాలు మార్చటం ఒకటి.రాహువు వేషంమార్చి దేవతలపంక్తిలో చేరి అమృతం సేవించిన కథ చాలామందికి తెల్సు కదా. సినిమా నటుల జాతకాలలో రాహువుకు ప్రత్యెకపాత్ర ఉంటుంది.ఎందుకంటే రాహువు స్వతహాగా రాక్షసుడు మరియు మాయావి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపజేయటం రాహువు కారకత్వాలలో ఒకటి. NTR కూడా రావణుడు, దుర్యోధనుడు మొదలైన పాత్రల్లోనే బాగా రాణించాడు. రాముడు, కృష్ణుడు మొదలైన పాత్రలు మొదట్లో వేసినా తరువాత తరువాత పురాణాలలోని విలన్లను హీరోలుగాను, హీరోలను విలన్లుగాను చూపే ప్రయత్నం చేసాడు.భూకైలాస్ గాని, దానవీరశూరకర్ణ గాని,ఇంద్రజిత్ గాని ఇవే తరహా సినిమాలు. వీటికి కారణం లాభస్థానం లోని రాహువు మరియు ఆత్మకారకుడైన శని యొక్క ప్రభావం. రాహువు యొక్క దేవద్వేషం పరోక్షంగా ఈయనమీద ప్రభావంచూపింది.ఒక గ్రహం మనకు యోగకారకం అయినపుడు దానిలక్షణాలు కూడా మనమీద ప్రభావం చూపుతాయి. 

అలాగే రాహువు ఈయనను బాగా ప్రభావితం చేసింది. భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమకేంద్రంలో లగ్నాధిపతి అయిన శుక్రునితో కలిసిఉండి ఇద్దరూ కలిసి లగ్నాన్ని బలంగా చూస్తున్నారు.కనుక అందం, కళాకౌశలం, తెలివి, విలాసవంతమైన జీవితం కలిగాయి. ధనాధిపతి మరియు సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉండటంవల్ల ధనయోగం కలిగింది. అంతేకాదు, ఈయన జాతకం కంటే ఈయన సతీమణి జాతకం బలంగా ఉందని, ఆ జాతకబలం ఈయనకు తోడై నిలిచిందని తెలుస్తున్నది. అందుకే వివాహం చేసుకున్న తరువాతనే ఈయనకు బాగా కలిసి వచ్చింది. అలాగే ఆమె మరణం తరువాత ఈయనకు చెడుకాలం మొదలైంది. ఈ సంగతి అందరికీ తెలుసు. 

NTR జాతకంలో చిక్కుముడి

మూడు గ్రహాలు వక్రించి ఉండటం ఈయన జాతక విశ్లేషణలో పెద్దచిక్కు. కాని చిక్కుముడి విప్పగలిగితే తర్వాతి జాతకం తేలికగా అర్థం అవుతుంది. వక్రగ్రహాల ఫలితం ఏమిటంటే, స్థూలంగా చెప్పాలంటే, మొదట్లో ఉన్న పరిస్థితి తరువాత మారిపోతుంది. ఎందుకంటే వక్రగ్రహం తానున్న స్థానం నుంచి వెనుకభావంలోకి ప్రయాణం చేస్తుంది కనుక. గురువుగారి వక్రత్వంవల్ల మొదట్లో గజకేసరియోగం ఉన్నప్పటికీ, తరువాత యోగభంగం కలగటం జరుగుతుంది. అలాగే రెండుసార్లు రాజయోగం పట్టి, తరువాత పదవి ఊడింది కదా. శని వక్రతవల్ల, మొదట్లో ఒక మోస్తరు కుటుంబంనుంచి వచ్చినా కాలక్రమేణా రాహువుఉన్న ఏకాదశస్థానానికి శని చేరటంవల్ల సినిమా రంగంలో లాభించి బాగా ధనార్జన చేయటం జరిగింది. కళలను సూచించే సహజ పంచమస్థానం సింహం ఈయన జాతకంలో లాభస్థానం కావటం చూడవచ్చు.పంచమం ఎలా కళలను సూచిస్తుంది అనే అనుమానం రావచ్చు. నాటకరంగాన్ని తృతీయం చూపిస్తుంది. పంచమం దీనికి తృతీయం కనుక భావాత్భావసూత్రం ప్రకారం పంచమం అతి బలీయమై ప్రదర్శకకళలను (Performing Arts) చూపుతుంది. అలాగే బుధుని అష్టమస్థితి సప్తమకేంద్రస్థితిగా మారి, మిత్రుడైన శుక్రునితో కలయికవల్ల, మరియు గజకేసరియోగ దృష్టి వాటిమీద పడటంవల్ల క్రమేణా జీవితంలో ఉన్నతశిఖరాలు అధిరోహించటం సూచింపబడింది. అదికూడా వివాహం తదుపరి యోగం పట్టింది అని సప్తమస్థానం వల్ల తెలుస్తున్నది. కాని వీటికి ఇంకొక అర్థంకూడా ఉన్నది.

బుధుని వక్రస్థితివల్ల జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం జరుగుతుంది. సప్తమంలో శుక్రబుదుల స్థితివల్ల రెండవకళత్రం విషయంలో సరియైన నిర్ణయం తీసుకోలేక ఘోరమైన దెబ్బతినడం జరిగింది. పంచమంలో కేతుస్థితివల్ల మంత్రసిద్ధి త్వరగా కలుగుతుంది. అందుకే మంత్రతంత్రాలలో ఆసక్తి, జాతకాలమీద నమ్మకాలు, పూజలు పునస్కారాలలో ప్రవేశం, నియమనిష్టలను పాటించటం ఉన్నాయి. తెల్లవారుజామున నాలుగుగంటలకే లేచి అరగంటసేపు పూజ ధ్యానం చెయ్యటం అనేది ఈ కేతువు మంత్రస్థానం అయిన పంచమంలో ఉండటం వల్ల వచ్చింది. కాని ఇంకోరకంగా ఇది పుత్రదోషం కనుక కుమారుడు రామకృష్ణ మరణించాడు. గురువు వక్రస్థితివల్ల దేవబ్రాహ్మణులంటే మొదట్లో గౌరవం ఉన్నా, చివరికి ద్వేషంగా మారింది. శని వక్రస్థితివల్ల మొదట్లో తనకు ఓట్లేసి గెలిపించి బ్రహ్మరథం పట్టిన సామాన్యజనమే చివరికి పదవీచ్యుతున్ని చేసారు. బుధుడుబుద్ధికీ, గురువు దేవబ్రాహ్మణులకూ, శని సామాన్యజనానికీ కారకులని జ్యోతిర్వేత్తలకు తెలుసుకదా. దశామ్శలొ కూడా శనివక్రత్వంవల్ల అష్టమంనుంచి సప్తమం అయిన తులాలగ్నానికి వచ్చి Exalted అవుతాడు. అక్కణ్ణించి లగ్నాన్ని అందులోని గజకేసరియోగ కారకులైన గురుచంద్రులను సప్తమద్రుష్టితోను, D-10 చార్ట్ లోదశమం అయిన మకరాన్ని దశమదృష్టి తోనూ బలంగా చూస్తాడు. ఈ శని ఈయన జాతకంలో ఆత్మ కారకుడనేది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. D-10 లో పట్టిన ఈ అత్యంత శుభయోగం వల్ల ఈయన సినిమారంగాన్ని అన్నిదశాబ్దాలు మకుటం లేని మహారాజులా ఏలాడు. వృత్తిపరంగా ఎదురులేకుండా ఉండటానికి గ్రహస్థితే కారణం.వర్గచక్రాలు చూడకుండా ఉత్త రాశిచక్రంచూచి మొత్తం ఫలితాలు చెప్పలేము అనటానికి ఇది ఒక ఉదాహరణ. రాశిచక్రంలో లేని ప్రత్యేకతలు వర్గచక్రాలలో కనిపిస్తూ, ఆయా రంగాలలో లోతైన విశ్లేషణ చెయ్యటానికి పనికి వస్తాయి. అందుకేపరాశర మహర్షి వర్గచక్రాల గురించి (Divisional Charts) బృహత్ పరాశరహోరాశాస్త్రం మొదట్లోనే చెబుతాడు. మూడుగ్రహాల వక్రత్వం అనే చిక్కుముడిని ఈ విధంగా విప్పి అర్థంచేసుకుంటే తరువాతి జాతకం సులభంగా అర్థంఅవుతుంది.  

దశలు - జీవిత విశేషాలు 

ఈయన స్వాతినక్షత్రం నాలుగోపాదంలో పుట్టటంతో రాహు మహర్దశ చివరిలో ఇంకా ఒక ఏడాది ఏడు నెలలు మిగిలిఉండగా జననం జరిగింది. అంటే దాదాపు 18 సంవత్సరాలు వచ్చేవరకూ ( అంటే 1941 వరకూ) గురు మహర్దశ జరిగింది. తరువాత 1960 వరకూ శనిమహర్దశ జరిగింది. తరువాత 1977 వరకూ బుధమహర్దశ, 1984 వరకూ కేతుదశ, తరువాత 18-1-1996 వరకూ శుక్రదశ జరిగాయి. ఈయన జీవితంలో మంచి రాజయోగ కాలం శని, బుధ, కేతు దశలు, కొంతభాగం శుక్రదశలలో జరిగింది. మొత్తంమీద జీవితంలో యుక్తవయసు నుంచి యోగకారక దశలు జరిగాయి కనుక గొప్పయోగజాతకం అని తెలుస్తున్నది.  

1941-1960 శని మహర్దశ: మే నెల 1942 లో రామారావు గారికి వివాహం జరిగింది. శని ఈ లగ్నానికి యోగ కారకుడు, శుక్రుడు లగ్నాధిపతి వివాహాన్ని సూచించే సప్తమస్థానంలో ఉన్నాడు. వివాహ సమయానికి జాతకంలో శని/శని/శుక్ర దశ జరుగుతున్నది. యోగకారక శనిదశ మొదలుకావటంతోనే వివాహం జరగటం చూడవచ్చు. కనుక యోగజాతకురాలైన భార్య దొరికింది. ఇందాక మనం అనుకున్న విషయం ఇక్కడ మళ్ళీ రుజువు అవుతున్నది. తరువాత బుధ అంతర్దశ మొదలైంది. బుధుడు సహజ విద్యాకారకుడు. వక్రస్థితిలో ఉండటం వల్ల, దశా నాథుడైన శనికి రాహుస్పర్శ వల్ల, శని చతుర్తాదిపత్యం వల్ల ( విద్య), ఇంటర్మీడియేట్ రెండుసార్లు తప్పాడు. గుంటూరు AC కాలేజీలో ఉన్నప్పుడే జగ్గయ్యతో కలిసి నాటకాలేసేవాడు. మే నెల 1947 లో ఈయనకు మొదటి మేకప్ టెస్ట్ జరిగింది. అప్పుడు శని/కేతు/గురు దశ జరుగుతున్నది. శని యోగకారకత్వం, సినిమా రంగానికి సూచకుడు రాహువుతో కలయిక, గురువుగారి గజకేసరియోగం కలిసి అప్పుడు పనిచేశాయి. కేతువు పంచమంలో ఉండటం తృతీయానికి భావాత్భావం కావటం గమనించాలి. భావాత్భావం సూత్రం జ్యోతిర్విజ్ఞానంలో ప్రవేశం ఉన్నవారికి మళ్ళీ వివరించవలసిన పనిలేదు. October 1947 లో శని/శుక్ర దశ జరిగినపుడు గుంటూరులో సబ్ రిజిస్త్రార్ గా ఉద్యోగంలో చేరాడు. సినిమాలలో చేరాలా వద్దా అని ఊగిసలాట ఒకవైపు, ఆఫీసులో అవినీతి భరించలేక ఒక వైపు సంఘర్షణకు లోనయ్యాడు. చివరకు ఉద్యోగం మానేసి మళ్ళీ మద్రాస్ చేరి 1950 వరకూ నానాకష్టాలు పడ్డాడు. 1947-50 మధ్యలో జరిగిన శని/శుక్ర దశలో ఒకసారి చేతిలో ఎనిమిది అణాలు లేక మూడురోజులు పస్తులున్నాడు. కనీసం సైకిలుకూడా లేక మైళ్ళకు మైళ్ళు మద్రాసులో నడిచి పోయేవాడు. రాహువు యొక్క బలీయమైన స్థితితో కలిగిన ఆత్మాభిమానంవల్ల ఈ సంగతి రూంమేట్స్ తో కూడా చెప్పలేదు. ఇదీ ఉత్తరకాలామృతంలో కాళిదాసు చెప్పిన దశాప్రభావం!!! నేను ఇంతకూ ముందే వ్రాసినట్లు- ఉత్తరకాలామృతంలో కాళిదాసు కొన్ని వందలఏళ్ళనాడే చెప్పాడు, శని శుక్రుడు ఇద్దరూ యోగ కారకులైతే శనిలో/శుక్ర దశ లేదా శుక్ర లో/శని దశ రాజును కూడా బిచ్చగాణ్ణి చేస్తుంది అనిఅది అక్షరాలా రుజువు కావటం ఇక్కడ చూడ వచ్చు. ఎంత పరిశోధనతో ఈ సూత్రాలు రూపొందించారో ఆ మహానుభావులు అని ఆశ్చర్యం కలుగుతుంది. మళ్ళీమళ్ళీ ఎన్ని జాతకాలు చూచినా ఈ సూత్రాలు తిరిగితిరిగి నిజం అవుతుంటాయి. ఇటువంటి ఋజువులు చూచినపుడు, మహర్షుల జ్ఞానసంపదకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకోవైపు మన వారసత్వ సంపదను తెలుసుకోకుండా, మన సంస్కృతిని చెడగొడుతున్న హేతువాద, నాస్తిక, కమ్యూనిస్టు చెత్త సాహిత్యం చదివి, తెలిసీతెలియని మాటలు మాట్లాడుతూ విమర్శించేవారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. 1950 ప్రాంతాలలో వచ్చిన సంసారం, షావుకారు మొదలైన చిత్రాలలో నటించినా, 1951 లో విడుదల అయిన పాతాలభైరవితో ఈయన జీవితం మలుపుతిరిగింది. అప్పటినుంచి 1981 వరకూ 30 ఏళ్ళు సినిమాలలో నటించాడు. మధ్యమధ్యలో అపజయాలు ఎదురైనా తిరిగి నిలదొక్కుకుంటూ విజయవంతమైన చిత్రాలలో నటించాడు. శనిలో/రవిదశనుంచి ఈయనకు ఎదురు లేకుండా జరిగింది. కారణం రవి రాశి, దశామ్శలలొ వర్గోత్తమస్థితిలో ఉండటం. అప్పటినుంచి కేతుదశ చివరివరకూ సినిమాజేవితం జరిగింది. శుక్రదశ ప్రారంభంలో రాజకీయజీవితం ప్రారంభంఅయింది. 29th of March 1982 at 2.30PM తెలుగుదేశంపార్టీ మొదలైంది. కేతువులో/శని, బుధ అన్తర్దశలలొ తెలుగుదేశంపార్టీ పెట్టటం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యటం జరిగాయి. కేతువు గురునక్షత్రంలో ఉండటం, గురు, బుధ, శనులు యోగకారకులు కావటం గమనించ వచ్చు. ఈయనకు మార్చి 1983 నుంచి శుక్రమహర్దశ మొదలైంది. రాజయోగం పట్టింది. 1989 లో శుక్రలో/కుజదశ జరుగుతున్నపుడు పార్టీ ఓడిపోయింది. కుజుడు దశామ్శలొ నీచస్థితిలో ఉండుట గమనించండి. తిరిగి 1994 లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు శుక్ర దశలో చెడు చేసిన కుజ/ రాహు అన్తర్దశలు అయిపోయి, గురుఅంతర్దశమొదలైంది. శుక్రదశలో/ గురు అంతర్దశలో /చంద్ర విదశలో 18-1-1996 ఈయన మరణించాడు. అప్పటివరకూ మంచిచేసిన కుజుడు, రాహువు పూర్తిగా విపరీతఫలితాలు ఇవ్వటం ఇక్కడ చూడవచ్చు. జీవితం ముగియబోతున్నదని, పుణ్యబలం మరియు ఆయుస్సు అయిపోవస్తున్నాయని తెలుసుకోవటానికి ఇదొక సూచన. అప్పటివరకూ సపోర్టు చేసిన పంచభూతాలు, విరమించుకోవటమే మరణం. అలాగే అప్పటివరకూ యోగాన్ని ఇచ్చిన గ్రహాలు వెనుకకు తగ్గి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం జీవితం ఆఖరుకు ఒకసూచన. 1991 ప్రారంభంలో సుఖస్థానమైన మకరంలోకి శనిభగవానుని ప్రవేశంతో ఈయనకు అర్థఅష్టమశని మొదలయ్యింది. అప్పటినుంచే కుటుంబంలో కలతలు ప్రారంభం. 1993 మార్చిలో శని భగవానుడు కుంభరాశిలో ప్రవేశించాడు. పంచమంలో శనిప్రవేశంతో సంతానంతో మానసికఅగాథం ఏర్పడింది. కుటుంబచికాకులు ఎక్కువయ్యాయి. అక్కడ నుంచి తృతీయదృష్టితో సప్తమస్థానం అయిన మేషాన్ని వీక్షించాడు. 1994 లొ గురువు తులారాశి ప్రవేశంతో ఆయన సప్తమదృష్టి మేషంమీద పడింది. అందుకే 1994 లొ ద్వితీయవివాహం చేసుకున్నాడు. 1995 డిసెంబర్ లొ గురువుగారు ధనూరాశిలో ప్రవేశంతో పంచమద్రుష్టి మళ్ళీ మేషంమీద పడింది. మొదటిసారి వివాహకారకత్వాన్ని చూపిన సప్తమస్థానం ఈసారి మారక కారకత్వం Activate అయింది. జనవరి 1996 లో మరణం సంభవించింది. మరణం 22వ ద్రేక్కాణం నుంచి చూడవచ్చు. లగ్న, చంద్రుల నుంచి 22వ ద్రేక్కాణం వృషభం రెండవ ద్రేక్కాణంఅవుతుంది. వరాహమిహిరుని "బృహజ్జాతకం" ప్రకారం వృషభం రెండవద్రేక్కాణం ఇలా ఉంటుంది. "The 2nd Drekkana of sign Taurus is a man skilled in works connected with agriculture, grain, cows, music, dance, painting, writing and the like, skilled at the plough and in works connected with a conveyance, with a neck bent like that of the bullock, thirsty, with a face like that of the ram and dressed in dirty garments."
read more " NTR జాతకం "

15, జులై 2009, బుధవారం

12, జులై 2009, ఆదివారం

కామ్య కర్మలు-తంత్ర విద్య

బాహ్యమైన పనులు పూర్తి కావటానికి, అధర్మమైన కోరికలు తీర్చుకోటానికి తంత్రాన్నిఉపయోగించటం అంత మంచిదికాదు. కాని కొందరు సాధకులు ఇది సరియైనదే అంటారు.ఎందుకంటే పిల్లవాడు ఏది కావాలన్నా తల్లిని అడిగి తీసుకుంటాడు.కొందరు బాగా తెలివైన పిల్లలు మోక్షాన్ని కోరవచ్చు. అంత పరిపక్వత లేని ఇంకొందరు పిల్లలు రకరకాలైన లౌకికకోరికలు కోరవచ్చు.తప్పు లేదు.ఎదుటి వ్యక్తికి హాని చెయ్యనంత వరకు జగన్మాతను ఏదైనా కోరవచ్చు.

ఎదుటి వారికి హాని కలిగించే అభిచారము, వశీకరణం, విద్వేషణం, ఉచ్చాటనం,మారణం వంటి క్రియలు కూడా తంత్రంలో భాగాలే. కాని అవి చేసేవారు వారి జీవితంలో తీవ్రఫలితాలు ఎదుర్కొంటారు. వారి జీవితాలు అర్థాంతరంగా విషాదంగా ముగుస్తాయి. ఎందుకంటే చేసిన కర్మ తిరిగి చక్రవడ్డీతో సహా తీర్చడం సృష్టి ధర్మం. దీనికి ఎంతటివారైనా మినహాయింపు లేదు.


ఒరిస్సాకు చెందిన నా స్నేహితుడు ఒక జరిగిన సంఘటన చెప్పాడు. అతనికి తెలిసిన ఒక వ్యక్తి రంభాఊర్వశి సాధన చేసేవాడు. ఇటువంటివి తంత్రంలో తక్కువ తరగతికి చెందిన యక్షిణీ విద్యలు. ఇతనికి అందమైన భార్య ఉండేది. కాని ఇతనికి అప్సరసల సాంగత్యం మీద గొప్ప కోరిక ఉండేది. పల్లెటూరిలో అతని ఇల్లు ఖాళీ చేసి ఈ సాధన కోసం ఊరిబయట ఒక ఇంట్లో ఉండేవాడు. ఇటువంటి అప్సరసాసాధనలు చేసేవారికి కనిపించే మొదటి రుజువు ఏమిటంటే ఈసాధనలు మొదలుపెట్టిన కొద్ది కాలానికి అతని భార్య మరణిస్తుంది.పుష్పదేహ అప్సరసాసాధన కూడా ఇటువంటిదే.రంభా ఊర్వశుల కంటే కూడా పుష్పదేహ అప్సరస చాలా అందగత్తె. ఈ అప్సరసలు మానవలోకంలోని మిస్ వరల్డ్ ల కంటే ఎన్నో రేట్లు సంమోహనకరమైన అందాన్ని కలిగి ఉంటారు. మానవ సుందరీమణులు వీరి ముందు కోతుల్లా ఉంటారు.

సరే,ఈ సాధన మొదలుపెట్టిన కొన్నాళ్ళకు ఇతని భార్య హఠాత్తుగా మరణించింది. ఇతని సాధన ఫలించడం మొదలుపెట్టింది. ఇతను ఎప్పుడూ తలుపులు వేసుకొని ఉండేవాడు.ఆ ఇంట్లోకి ఎవ్వర్నీ రానిచ్చేవాడు కాదు. రాత్రిళ్ళు మాత్రం ఆ ఇంటిలోనుంచి ఎవరో అమ్మాయి కిలకిల నవ్వినట్లు శబ్దాలు, గజ్జెలు కట్టి ఎవరో నాట్యం చేస్తున్నట్లు శబ్దాలు వచ్చేవి. ఇతను మాత్రం రోజురోజుకూ క్షీణించిపోతుండేవాడు.


ఇలా ఒరిస్సా మంత్రతంత్రాల సాధనవల్ల క్రమేణా ఇతను చిక్కిశల్యమై  అస్థిపంజరంలా తయారయ్యాడు.కాని చాలా ఆనందంగా ఉల్లాసంగాఉండేవాడు.మంచి బట్టలు వేసుకొని సెంటు పూసుకొని ఎప్పుడు చూసినా జల్సాగా తిరిగేవాడు.ఒకరోజు తన స్నేహితునితో కలిసి మోటారుసైకిలు మీద దగ్గిరిలో ఉన్న 'బెరహంపూర్' అనే ఊరికి పోతుండగా ఎవరో విసిరేసినట్టు ఉన్నట్టుండి మోటారు సైకిల్ ఎగిరి రోడ్డు పక్కనపడి ఇతడు, ఇతని స్నేహితుడు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. తరువాత ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూస్తె అతనిగదిలో ఒక మంచి జీవకళగా ఉన్న ఊర్వశి విగ్రహం పూజలో ఉంది.

అతను కంసాలి కులానికి చెందినవాడు కనుక తానే విగ్రహాన్ని తయారుచేసుకొని ఎవరి దగ్గరో ఈమంత్రాన్ని నేర్చుకొని ఈ సాధన చేసేవాడు. ఆ ఇంటిలో ఏమి జరిగి ఉంటుందో నేను వ్రాయను.మీ ఊహకే వదలి వేస్తున్నాను. ఇటువంటి సాధనలు ఎంతమాత్రం మంచివి కావు. అప్సరసల మీద మోజుతో కట్టుకున్న భార్యను బలిచేసుకునే ఇలాంటి మూర్ఖులు ఉంటారు. పరాయిఆడదాని మోజులో భార్యను అన్యాయం చేసేవాళ్ళు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నట్టే వీళ్ళూఉంటారు.

తంత్రం లౌకిక ప్రయోజనాలకూ పనికొస్తుంది. పారమార్థిక ప్రయోజనాలకూ పనికొస్తుంది. అది ఒక బలీయమైన శక్తి. దానిని వాడుకోవటం మన విచక్షణను బట్టి ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు అనుభవించవలసివస్తుంది.గుంటూరుకు చెందిన ఒక మాంత్రికుడు ఈ మధ్యనే కొండవీటికొండల్లో ఉన్న నిధులమీద మోజుతో జరిగిన ప్రయోగాలలో కేరళమాంత్రికులు చేసిన ఎదురు ప్రయోగంలో మరణించాడు. ఇది జరిగి దాదాపు ఒక సంవత్సరం అవుతుందేమో. 

చాలామంది నమ్మక పోవచ్చు కాని ఇది నిజంగా జరిగింది. ఆయన చేసిన మహత్యాలు బాహాటంగా చూచినవారు చాలామంది ఉన్నారు.మా ఇంటి పక్కనే ఉన్న ఆయన స్నేహితుని ఇంటికి చాలాసార్లు వచ్చేవాడు. తిరుగుతూ ఉన్న సీలింగ్ ఫెన్ ఆయన ఆగమంటే ఆగిపోయేది. చూస్తే కరెంటు బాగానే ఉండేది. మళ్ళీ తిరగమంటే తిరగడం మొదలు పెట్టేది. ఈ మిరకిల్ ను ఆయన్ను చాలెంజ్ చేసిన నాస్తికుల ఎదుట కూడా ప్రయోగించి చూపించాడు.వాళ్ళు బిత్తరపోయారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయన దేవీ ఉపాసకుడు అయి ఉండి కూడా ఇటువంటి కార్యకలాపాలలో తలదూర్చి అనవసరంగా మరణాన్ని కొనితెచ్చుకున్నాడు.

ఈయనా,ప్రస్తుతం స్వాములవారైన ఇంకోకాయనా స్నేహితులు. వీరిద్దరూ  కలిసి ఇలాంటి కొన్నిశక్తుల సాధనకు క్షుద్రపూజలు చేసి కోళ్ళు బలి ఇచ్చేవారు. తర్వాత కొన్నాళ్ళకి ఈ రెండోవ్యక్తీ (ప్రస్తుతం స్వామీజీ అవతారం ఎత్తాడు)ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారి దర్శనానికి వెళితే అమ్మ ఇతన్ని చూస్తూనే 'ఎందుకురా ఆ మూగజీవాల ఉసురు తీస్తారు మీరు?' అని ప్రశ్నించింది.ఆయనతో వచ్చినవారికీ చుట్టుపక్కల ఉన్నవారికీ ఈ మాటలు అర్ధం కాలేదు.బహుశా ఆయనక్కూడా అర్ధం అయ్యాయో లేదో తెలియదు.ఎందుకంటే ఆయనకు ఈ మహిమల పిచ్చి ఇప్పటికీ తగ్గలేదు మరి. ఏం చేస్తాం ఎవరి ఖర్మ వారనుభవించక తప్పదు కదా?
read more " కామ్య కర్మలు-తంత్ర విద్య "

10, జులై 2009, శుక్రవారం

గ్రహాలు-వారాలు

మనకున్న ఏడు వారాలు ఏడు గ్రహాల నుంచి వచ్చాయని చాలామందికి తెలుసు.కొంత మందికి తెలియక పోవచ్చు. అవి ఎలా వచ్చాయో తెలుసుకుందామా? ఆది వారం తరువాత సోమ వారమే ఎందుకు రావాలి. ఏ శుక్ర వారమోరావచ్చుగా? అని అనుమానం రావటం సహజం.

హేతు వాదులకు అన్నీ హేతువులు కావాలి. కాని వారి వాదనలోహేతువు ఎంతవరకు ఉందొ మాత్రం వారు చూచుకోరు. జ్యోతిషం పూర్తిగా లాజిక్ మీద ఆధారపడి ఉన్న శాస్త్రం. ఇందులోని ప్రతి దానికీ లాజిక్ ఉంది. అసలు Astrology అంటేనే Logic of the Astral Bodies అని అర్థం. వారాలలోఉన్న లాజిక్ చూద్దామా?

గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చెయ్యటానికి ఇన్ని సైడీరియల్ రోజులు పడుతుంది.
Saturn - 10759.22
Jupiter- 4332.58
Mars-686.98
Sun(Earth)-365.26
Venus-224.70
Mercury-87.97
Moon-27.32

ఇంకో విధం గా చెప్పాలంటే ఒక రాశిని దాటడానికి
శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు,
గురువు ఒక సంవత్సరం,
కుజుడు దాదాపు నలభై అయిదు రోజులు,
సూర్యుడు ముప్పై రోజులు,
శుక్రుడు ఇరవై అయిదు రోజులు,
బుధుడు పదిహేను నుంచి ఇరవై రోజులు,
చంద్రుడు రెండున్నర రోజులు తీసుకుంటారు.

ఇది డిసేన్డింగ్ ఆర్డర్ లో గ్రహాల పరిభ్రమణ కాలం.

ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు. రవి గ్రహరాజు కనుక గ్రహాలన్నీ ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నవి. కనుక ఆదివారం నాడు మొదటి గంట రవి హోర అనుకుంటే ( హోర అంటే hour ) రెండవది గ్రహాల descending order లో దాని తరువాత శుక్ర హోరఅవుతుంది. ఇలా ఏడు గ్రహాలు x3 ఆవృత్తులు =21 గంటలు అయి పోతాయి. మిగిలిన మూడు గంటలలో రవి, శుక్ర, బుధ హోరలు గడిచి, మర్నాడు సూర్యోదయానికి చంద్ర హోర మొదలు అవుతుంది. కనుక రెండవ రోజు సోమ వారంఅవుతుంది.

మళ్ళీ ఇదే లెక్క వేస్తె మూడో రోజు ఉదయానికి కుజ హోర, తరువాతరోజున బుధ హోర, ఇలా గురుహోర, శుక్ర హోర, శని హోర అయ్యి మళ్ళీ ఆదివారానికి సూర్యోదయ కాలంలో రవి హోర ఉదయిస్తుంది. కనుకవారాల వరుస ఆది, సోమ, మంగళ...ఇలా వచ్చింది. దీని వెనుక ఒక లాజిక్ ఉంది. ఒక పొందిక అమరిక ఉన్నాయి. వెరసి ఇదంతా గ్రహముల గమన వేగాన్ని బట్టి స్థిరపరుచ బడిన ఒక పద్దతి. పధ్ధతి లేకుండా ఉండటం కన్నా పధ్ధతి గాఉండటం మంచిది అని ఎవరైనా ఒప్పుకుంటారు కదా. నాస్తికులు హేతువాదులు సోమవారం ఆఫీసులకు పోకుండా ఇదిఆదివారం ఎందుకు కాకూడదు అని వితండ వాదం చేస్తూ ఇంట్లోనే కూచోకండి. ఉద్యోగాలు ఊడతాయి.

ఇక్కడ ఒక అనుమానం రావాలి. అసలు మొదటి రోజు ఆదివారం అని ఎట్లా గుర్తించడం? ఈ రోజు సూర్యోదయానికి ఉన్నది రవి హోరనే అని ఎలా గుర్తించటం? అలా లెక్క మొదలు పెట్టటానికి ఆధారం ఏమిటి? నేను ప్రతిదానికీ సమాధానం చెప్పను. మీరే ఊహించి నాకు మీ అభిప్రాయం చెప్పండి. తరువాత దీనికి ఆధారం ఏమిటో నేను చెబుతాను.

సూర్యుడు భ్రమణం చెయ్యటం ఏమిటి? అది గ్రహం కాదు గదా అని కొందరికి అనుమానం వస్తుంది. మనం భూమి మీద ఉన్నాము. సూర్యుని మీద లేము. మన భూమి మీది గాలిని పీల్చి మనం బతుకుతున్నాం. సూర్యుని మీది గాలిని పీల్చి కాదు. కనుక అది భ్రమ అయినా సూర్యుడు మన చుట్టూ తిరగటమే మనకు సత్యం. దీన్నే అప్పరెంట్ మోషన్ ఆఫ్ ప్లానేట్స్అంటారు. కనుక భూమి తిరుగుతున్నప్పటికీ మనం సూర్యుడే తిరుగు తున్నట్లు తీసుకోవాలి. కారణం మనం ఉన్నభూమే మనకు సెంటర్ కనుక.

మనం సినిమా చూస్తున్నపుడు అది తెరమీద బొమ్మల ప్రొజెక్షన్ మాత్రమే, నిజానికి అక్కడ ఏమీ లేదు అని అనుకుంటే సినిమా ఎంజాయ్ చెయ్యలేము. కనుక అక్కడ నిజానికి ఏమీ లేకపోయినా ఎలాగైతే ఆ కథలో ఇన్వాల్వ్ అవుతున్నామో అలాగే నిజానికి భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా, మనకు కనిపిస్తున్నది నిజమే అని ప్రస్తుతానికి అనుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించేదే మనకు ప్రస్తుతానికి నిజం. అసలు నిజం ఏదైనా కావచ్చు.

నిజానికి సూర్యుడు కూడా స్థిరం గా లేడు. ఆయన కూడా ఒక గాలక్టిక్ సెంటర్ చుట్టూగ్రహాలతో సహా భ్రమిస్తున్నాడు. ఈ వివరాలన్నీ వేదములలో చక్కగా ఉన్నాయి. తెల్సుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుస్తాయి. అర్థం చేసుకుంటే అర్థం అవుతాయి.

తెలిసో తెలియకో ప్రపంచంలో అందరూ జ్యోతిష శాస్త్రం తయారు చేసి ఇచ్చిన ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. హేతువాదులు నాస్తికులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు (ఒక పక్క జ్యోతిష్యాన్ని విమర్శిస్తూనే). ప్రపంచంలో ఎక్కడైనా ఇదే వరుసలో వారాలు వస్తాయి. దీన్ని లోకానికి అందించినది మన భారతీయులే అనేది నేడు చాలామందికి తెలీదు.

ఇంత వరకూ థియరీ పార్టు బాగానే ఉంది. మరి దీని ఉపయోగం ఏమిటి? ఆస్ట్రానమీ వల్ల గ్రహ గతులు తెలుస్తాయి. దాని ఉపయోగం ఏమిటి? అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేదే ఆస్ట్రాలజీ. అంటే జ్యోతిషం అనేది ఖగోళ గణిత విజ్ఞానం యొక్క ప్రాక్టికల్ పార్టు అన్నమాట.

ఈ గ్రహ హోరల ఉపయోగం ప్రశ్న శాస్త్రం లో ఉంది. ప్రశ్న శాస్త్రం అనేది రోజు వారీ సమస్యలకు చక్కగా ఉపయోగ పడేవిధానం. దీనికి జాతకుని జనన సమయం తో పని లేదు. మన మనసులో ఏదైనా సమస్య గురించి సందేహంతలెత్తినపుడు ఉన్న గ్రహ స్థితి ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఇదొక అద్భుత మైన విధానం.

ఇందులో లగ్నాన్నిగుర్తించ దానికి హోరా జ్ఞానం ఉపయోగ పడుతుంది. అంటే ప్రశ్న అడిగి నపుడు జరుగుతున్న హోరను (Planetary hour)బట్టి ఆగ్రహం ఉన్న రాశిని లగ్నం గా తీసుకోవటం జరుగుతుంది. ఉదాహరణకు ప్రశ్న అడిగినపుడు శుక్ర హోర జరుగుతున్నది అనుకుందాం. అప్పుడు శుక్రుడు మీన రాశిలో ఉన్నాడు అనుకుందాం. కనుక మీనం లగ్నం గా తీసుకొని లెక్క వేసి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం జరుగుతుంది.

ఇది అంజన విద్య లాంటి అద్భుత విధానం. జాతకం అవసరం లేకుండానే చక్కని ఫలితాలు తెలుసుకోవచ్చు. పూర్వ కాలంలో దైవజ్ఞులు ఏ జాతకాన్ని చూడకుండానే అడిగిన ప్రశ్నకు టక్కున జవాబు చెప్పేవారు. అవి దాదాపు
90% నిజం అయ్యేవి. దానికి అనుబంధం గా ఈ హోరా జ్ఞానం ఉపయోగపడుతుంది. ప్రశ్న శాస్త్రం గురించి త్వరలోవ్రాస్తాను.
read more " గ్రహాలు-వారాలు "

8, జులై 2009, బుధవారం

కాళీ తత్త్వం-5


కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి.

ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల్ కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసంనురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు.

'సైషాప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే' అంటుంది దేవీ సప్తశతి.అంటే ఆ దేవి ప్రసన్నురాలై వరదాయిని అయినపుడు మానవుడు మోక్షాన్ని పొందగలడు.దుర్లభమైన మోక్షమే సాధ్యమైనపుడు ప్రాపంచిక కోరికలు తీరవా?చాలా తేలికగా తీరుతాయి.కోహినూర్ వజ్రమే చేతిలో ఉన్నవానికి గులకరాయి దొరకదా? ఎక్కడబడితే అక్కడే దొరుకుతుంది.

వివేకానందస్వామి ఇంకా నరెంద్రునిగా ఉన్న సమయంలో ఒకరోజు ఆయనకు ధ్యానంలో ఒక దర్శనం కలిగింది. అప్పుడు ఆయనకు ఇరవై ఏళ్ల వయసు ఉండవచ్చు. ఆయనకు కాళీమంత్ర బీజాక్షరాలు జ్యోతుల మాదిరి వెలుగుతూ దర్శనం ఇచ్చాయి.సామాన్యంగా ఇటువంటి స్థితిలో కుండలినీ ప్రబోధం కలుగుతుంది.వెన్నెముక క్రింద భాగంలో కరెంటుషాక్ కొట్టినట్లు అనిపిస్తుంది.అలాగే వెన్నెముక గుండా ఏదో జరజర పాకినట్టు అనిపిస్తుంది.స్వామి సత్యానంద సరస్వతికి మొదటిసారి కుండలిని ప్రబోధం కలిగినపుడు తన కాళ్ళ క్రింద భూమి చీలిపోయి తానేక్కడికో పాతాళంలోకి పడిపోతున్నట్లు అనుభవం కలిగింది.

కొందరికి ఇతరదర్శనాలు కూడా కలుగ వచ్చు.మరింత అదృష్టవన్తులకు కాళీమాత నిజదర్శనం కలుగవచ్చు.అది ఒక్కొక్కరి కర్మ పరిపక్వతను బట్టి, మానసిక పవిత్రతను బట్టి ఉంటుంది. కాళీమాత దర్శనం కలిగితే అది తట్టుకొవటానికి చాలా చాలా సాధన కావాలి. అది అంత తేలికైన విషయం కానే కాదు.

అసలు దేవతాదర్శనాలు అంటే ఏమిటి?మనకు సంబంధించని, ఎంతో అతీతమైన స్పందనా భూమికలలో (higher vibratory levels) ఉన్న శక్తులు రూపం ధరించి మన మనోభూమికకు దిగి వచ్చి కనిపించటమే.ఇలా జరిగినప్పుడు ఆయా స్పందనలను (vibrations) తట్టుకోగల శక్తి సాధకునికి ఉండాలి.అది లేనపుడు ఏమి జరుగుతుంది? 

ఒక ఉదాహరణతో చెప్తాను.ఒక చిన్నబల్బులోకి లక్ష వోల్టుల కరెంటు ప్రవహిస్తే ఏమి జరుగుతుంది?బల్బు పేలిపోతుంది.అలాగే ఇటువంటి దర్శనాలు తట్టుకునే శక్తి లేకుంటే బ్రెయిన్ సర్క్యూట్స్ ఫెయిల్ అయి పిచ్చెక్కుతుంది.లేదా ఆ షాక్ తట్టుకోలేక గుండె ఆగిపోతుంది.కాబట్టి దేవతాదర్శనాలు అందులోనూ కాళీమాత వంటి శక్తి దర్శనాలు అంత త్వరగా కలుగవు.దానికి ఆయా దేవతల అనుగ్రహమే కారణం.వారు కనిపించలేక కాదు.కనిపిస్తే సాధకుడు తట్టుకోలేడని వారికి తెలుసు.అందుకే సాధకునికి తపస్సు ద్వారా తగిన పరిపక్వత వచ్చినపుడే వారి దర్శనం కలుగుతుంది.

ఇంకొకసారి వివేకానందస్వామికి ధ్యానంలో బ్రహ్మాండమైన త్రికోణాకారం బంగారురంగులో వెలుగుతూ కనిపించింది.ఈ విషయాన్ని ఆయన శ్రీరామకృష్ణునికి చెబితే ఆయన సంతోషించి 'నీకు ఈరోజు బ్రహ్మయోని దర్శనం కలిగింది.నేను తంత్రసాధనలు చేసేరోజులలో ఆదర్శనం నాకూ కలిగింది.కాని దానినుంచి అనుక్షణం అనేక బ్రహ్మాండాలు లోకాలు జన్మిస్తున్నట్లు కూడా నేను చూచాను'.అని చెబుతారు. ఆ దర్శనం వివేకానందునికి కలుగలేదు. అంటే అనేక గెలాక్సీలను అనుక్షణం సృష్టి చేస్తున్న కాళీశక్తిని (source of creative power) వారు దర్శించారు. అంతే కాదు, శ్రీ రామకృష్ణునికి కలిగిన దర్శనంలో ఆ ఆద్యాశక్తి వచ్చి తనలోనే కలిసిపోయినట్లు,తానే ఆశక్తిని అన్న అనుభూతి ఆయనకు కలిగింది.

కాళీమాతకు కుండలినీశక్తికి సంబంధం ఉంది.ఏలాగంటే,ఆద్యాశక్తియే ప్రతి మనిషిలోనూ కుండలినీ రూపంలో నిద్రాణస్థితిలో ఉంటుంది. సూక్ష్మభూమికలను చూడగలిగే అంటే ఫీల్ అవగలిగే శక్తిలేక పోవటమే "నిద్రాణస్థితి" అంటే. కాళీమంత్రసాధకులకు కుండలినీ జాగరణ దానంతట అదే సులభంగా జరుగుతుంది. కాళీమంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది. నిద్రాణంలో ఉన్న కుండలినీశక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది.

కాళీమాత మొల చుట్టూ మానవఖండిత కరములు చుట్టుకొని ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు వ్రాసినట్లు మన దేవీదేవతల చిత్రాలు అన్నీ గూడార్ధసంకేతాలు.ఆచిత్రాల వెనుక రహస్యమైన అర్థాలు దాగి ఉంటాయి.దీని అర్థం ఇప్పుడు వివరిస్తాను. మనుషులు పని చేసేది చేతులతోనే. చెయ్యి లేనపుడు మానవుడు ఏపనీ చెయ్యలేడు.అనగా క్రియాశక్తికి సంకేతం మానవుని చెయ్యి. ప్రపంచంలోని అందరు మానవుల చేతుల ద్వారా పని చేయిస్తూ తాను మాత్రం కనపడకుండా దాగిఉన్న శక్తి కాళిమాత. 

ఇంకొక గూడార్థం.మానవుడు పూర్తిగా క్రియాకలాపాలు మాని, అనగా తన స్వంత ప్రయత్నాలు మానేయడమే తెగిపోయిన చేతికి సూచన.అంటే రమణమహర్షివలె పూర్తిగా భగవంతుని పైన ఆధారపడి,కర్మను పూర్తిగా విసర్జించినవాడే జగన్మాత ఒడిలోకి చేరుకోగలడు.వేదం కూడా ఇదే చెబుతున్నది. నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకేనమృతత్వ మానశు-- మనిషి కర్మవల్ల కాదు, సంతానంవల్ల కాదు, ధనంవల్ల కాదు-- ఒక్క త్యాగంవల్ల మాత్రమె అమృతత్వాన్ని పొందగలడు.ఈవిధంగా,తెగిన చేతులు కర్మత్యాగాన్ని సూచిస్తున్నాయి.కర్మత్యాగియే మాత ఒడికి చేరుకోగలడు.ఇట్టి కర్మత్యాగం అందరికీ సాధ్యం కాదు అని అంటారా? సాధ్యంకాదు కనుకనే కాళీమాత దర్శనం కూడా అందరికీ సాధ్యం కాదు.

మాత మెడలో పుర్రెలదండ ఉంటుంది. దీని అర్థం తెలుసుకుందాం. ఈ పుర్రెలు తంత్రశాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్రవిజ్ఞానం ప్రకారం ఇవి సంసృతంలోని ఏభై అక్షరాలు. ఈ పుర్రెలదండను వర్ణమాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు.అక్షరములు అనే మాటలో అద్భుత అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు.మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు.కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు.కనుక వాటికి నాశనం లేదు.ఈ సందర్భంలో వాగర్థా వివ సంపృక్తౌ శ్లోకం గుర్తుకు వస్తున్నది. వాక్కు దాని అర్థమువలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అంటాడు కాళిదాసు.అనగా శబ్దం దాని అర్థంవలె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నారని అర్థం.

పుర్రెలు శాశ్వతత్వానికి సూచన.ఎందుకని?మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి.మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి.కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.ఆమె అకారాది క్షకారాంతమయి.వర్ణమాల అనే తంత్రగ్రంధాన్ని చదివి ప్రేరితుడై sir John woodroffe(Arthur Avalon) ఒక అద్భుత గ్రంథం వ్రాసాడు. దాని పేరు The Garland of Letters. అందులో ఈ వివరాలన్నింటినీ తంత్ర శాస్త్రం నుంచి సేకరించి వ్రాశాడు.

ఈ పుర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది.ఈ ఏభై అక్షరాలు షట్ చక్రాలలోని ఏభైదళాలలో ఉంటాయి.కుండలినీ సాధన చేసేవారికి ఇవి సుపరిచితాలు.మూలాధార పద్మం=4 దళములు. స్వాదిష్టాన పద్మం=6 దళములు. మణిపూరక పద్మం= 10 దళములు, అనాహత పద్మం=12 దళములు, విశుద్ధ పద్మం= 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం=2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు వైబ్రేషన్లుగా ఉంటాయి.సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే.కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్రమయి. సర్వ మంత్ర స్వరూపిణి.

ఈ అక్షరబీజముల మంత్రజపంతో కుండలినీ సాధన చెయ్యటాన్ని రహొయాగం అంటారు.ఇది శ్రీ విద్యోపాసనలో అంతర్యాగ విధానం. అంటే బాహ్యంగా చేసే యాగంవంటిదే లోపల్లోపల చేసే అంతర్యాగ క్రమం.దీనిని చేసేవారిని గుప్తయోగులు/యోగినులు అంటారు.అంటే వీరు సాధనచేసే విధానం బయటకు కనిపించదు.దీనిని వివరిస్తూ లలితాసహస్రనామం"రహో యాగ క్రమారాద్యా రహస్తర్పణ తర్పితా" రహోయాగక్రమంలో ఆరాధించబడేదానవు,రహస్సు అనబడే తర్పణముతో తడిసిన దానవు అయిన నీకు ప్రణామము- అంటూ మాతను ప్రార్ధిస్తుంది.నా గురువుల వద్ద ఇటువంటి రహస్యాలు అనేకం నేర్చుకునే అదృష్టాన్ని మాత నాకు ప్రసాదించింది. 

జ్యోతిషవిజ్ఞానంలో శాక్తేయ పరిహారాలలో శనిభగవానుని పీడలకు కాళీ ఉపాసన చక్కని ఉపాయం.కారణమేమంటే శని భగవానుడు యమునికి సంకేతం.యముడు కాలస్వరూపం.కాళిమాత కాలమునే సంహరించగలదు. కనుక శనిదశలో వచ్చే బాధలకు, ఏలినాటి శని మొదలైన గోచారబాధలకు కాళీ ఉపాసన శ్రేష్టం.కాని దీనికి ముఖ్యంగా నియమనిష్టలతో కూడిన జీవితం, అహంకారంలేని జీవితం గడపవలసి ఉంటుంది.అపుడే మాత అనుగ్రహం త్వరగా కలుగుతుంది.నియమం తప్పితే ఫలితాలు దారుణంగా ఉంటాయి.

కాళీసాధనా రహస్యాలు చాలా ఉన్నాయి.వాటిని ఇంతకంటే ఇంకా బహిర్గతం చేయటానికి నాకు అనుమతి లేదు.అలా చేసినందువల్ల ప్రయోజనమూ లేదు.నిజంగా సాధన చేయాలని ఆరాటపడేవారికి మాతయే మార్గాన్ని చూపుతుంది.కనుక దశమహావిద్యలలో మొదటిది అయిన కాళీతత్త్వం మీద సీరీస్ ఇంతటితో ముగిస్తున్నాను.
read more " కాళీ తత్త్వం-5 "

6, జులై 2009, సోమవారం

కాళీ తత్త్వం-4

సృష్టి మొత్తం విశ్లేషణ చేస్తే రెండే తత్వాలు కనిపిస్తాయి. ఒకటి శివుడు. రెండు శక్తి. అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది తప్ప ఎంత వెతికినా సృష్టిలో ఏమీ లేదు.మనకు కనిపించే సమస్త ప్రకృతిలో ఇవే నిండి నడుపుతూ ఉన్నాయి.దీనిని ప్రాచీన ఋషులు ఏనాడో కనుగొని ఆరాధించారు.

తంత్రం శివుని మహాకాలుడు అంటుంది, శక్తిని కాళి అంటుంది. ఉజ్జయినిలోని శివునికి మహాకాలేశ్వరుడు అని పేరు. కాళి అనగా కాలము అని అర్థం. కాలానికి అధిపతి కాలేశ్వరుడు. లేక మహాకాలుడు. కాలాధీనం జగత్సర్వం, అంటే సర్వ ప్రపంచం కాలానికి లోబడి నడుస్తున్నది. కాలము అంటే ఏమిటి? మన భూమి వరకూ చూస్తె, సూర్యోదయం సూర్యాస్తమయం తో కలుగుతున్న రోజులు,నెలలు,ఋతువులు,సంవత్సరాలు వెరసి కాలం ముందుకు నడుస్తూ మానవుని ఆయుస్సు నశిస్తూ ఉంటుంది.ఇదే కాలం. 

భగవత్ గీతలో భగవంతుడు 'కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవ్రుద్దో' అంటూ లోకాన్ని నాశనం చేసే కాలాన్ని నేనే అంటాడు. ఆ భయంకర విశ్వరూపాన్ని చూడలేక భయభ్రాన్తుడై అర్జునుడు ఆ రూపాన్ని ఉపసంహరించి ఎప్పటిలాగే సుమనోహరమైన కృష్ణరూపంలో దర్శనం ఇమ్మని వేడుకుంటాడు.తెలిసిన వారు కాళియే కృష్ణుడు అని అంటారు.మా ఆమ్మగారు కూడా ఇదే చెప్పే వారు.రాజరాజేశ్వరి,శ్రీరాముడు ఒకటే అని కాళి కృష్ణుడూ ఒకటే అని అనేవారు.

కాని ఇంకొంచం లోతుగా పరిశీలిద్దాం. సూర్యోదయం సూర్యాస్తమయం ఇదేనా కాలం అంటే. ఒక వ్యక్తిని ఎండ చొరబడని, రాత్రో పగలో తెలియని ఒక గదిలో ఉంచితే అతనికి కాలం స్తంభించి పోతుందా? బాహ్య ప్రపంచాన్ని నడిపే కాలం అతనికి తెలియదు.కాని తన శరీరంలో జీవ రసాయనిక ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కణాలు మరణించి తిరిగి పుడుతూనే ఉంటాయి. కనుక అతనివరకూ కాలం అతని శరీరంలో నడుస్తూనే ఉంటుంది. దీన్ని బయలాజికల్ క్లాక్ అంటున్నారు. బాహ్య కాల ప్రక్రియకు అంతర కాల ప్రక్రియకు సమన్వయము ఉన్నంత వరకు మనిషి ఆరోగ్యం బాగుంటుంది. దీన్నే ప్రకృతిని అనుసరించే జీవనం అని నేటి యోగాచార్యులు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా ఇదే చెప్పింది.

అదలా ఉంచితే, మీ ఊహా శక్తికి కొంత పని చెబుతాను. భూమిని వదలి కొన్ని వెల మైళ్ళు అంతరిక్షం లోకి పోయామని ఊహించుకోండి. అక్కడ చుట్టూ చీకటి. శూన్యంలో నిరాధారంగా మనం నిలబడి ఉన్నాం. చుట్టూ మిణుగురు పురుగుల మాదిరిగా నక్షత్రాల గుంపులు. అక్కడ కాలం ఉందా? లేదా? భూమికి సంబంధించిన కాలం అక్కడ లేదు. మనం ఏదైనా గ్రహం మీదకు పొతే, అక్కడ కాల మాన పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాని శూన్యంలో కాలం ఉందా? లేదా? ఉంది అనే చెప్పాలి.

ఏలాగంటే చూచే 'నేను' ఉన్నంత వరకు నావరకు కాలం పని చేస్తూనే ఉంటుంది. నేను అదృశ్యం అయిన స్థితిని చేరితే అక్కడ మాత్రమె కాలం అదృశ్యం అవుతుంది. అందుకే రెండు మూడు గంటలు ఒళ్లుతెలియని ధ్యానం లో ఉండి బయటకు ఒచ్చినపుడు ఒక్క క్షణం మాత్రమె జరిగిన అనుభూతి కలుగుతుంది.ఇప్పుడే కదా ధ్యానానికి కూర్చున్నాను అనిపిస్తుంది. కాని గడియారం చూస్తె గంటలు గడిచి ఉంటాయి.కనుక మొత్తం మీద తేలేదేమంటే,  'నేను' అన్న భావనే కాలం పని చెయ్యటానికి ఆధారం. అది ఉన్నంత వరకూ మనం కాలం అధీనంలో ఉండక తప్పదు.అంటే అందరూ కాళీమాత ఆధీనంలో ఉన్న వాళ్ళమే.వాళ్లు మహాపురుషులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు,అవతార పురుషులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు.కాలానికి అతీతులై ఎవరూ లేరు. అందుకే ఎంతటివారైనా అందరూ జగన్మాత బిడ్డలే అని చెప్పేది. 

శ్రీ రామకృష్ణులు భక్త రాంప్రసాద్ వ్రాసిన ఒక గీతాన్ని చాలా సార్లు పాడేవారు. "అమ్మా. ప్రపంచం అనే సంతలో నీవు గాలిపటాలు ఎగుర వేస్తున్నావు. అవి రంగురంగులుగా ఉండి రకరకాల ఎత్తులలో ఎగురుతూ ఉన్నాయి. లక్షలో ఒకటోరెండో దారం తెంచుకొని గాలికి ఎగిరి కనపడని సీమలకు వెళ్ళి  పోతున్నాయి.వాటిని చూచి నీవు చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నావు." అంటూ ఆ గీతం సాగుతుంది. ఈ గీతం మనం అనుకుంటున్న విషయాన్నే మార్మికంగాచెబుతున్నది.

ఈ సృష్టి జగన్మాత లీల. ఇదంతా ఒక ఆట. ఇందులోని కోట్లాది జీవులలో ఒకరో ఇద్దరో మాయా బంధాలు తెంపుకొని ఎగిరిమోక్షాన్ని చేరుకుంటున్నారు. అంటే ఇంద్రియాతీత, మనోతీత, గుణాతీతస్థితికి చేరుతున్నారు.వారే కాలానికి అతీతస్థితికి చేరుతున్నారు.అంటే కాళి వారికి తనదే అయిన ఇంకొక స్థితిని, అనగా నిశ్చల సమాధిలో నిమగ్నుడై త్రిగుణాతీతుడైన శివస్వరూపస్థితిని అనుగ్రహిస్తున్నది.అచలతత్వరూపంగా విరాజిల్లుతున్నది కూడా జగన్మాతయే గనుక ఆమె అనుగ్రహం లేనిదే అట్టి స్థితి ఎవరికీ అందదు.

దేవీసూక్తంలో ఒక అద్భుతమంత్రం ఉంది."అహమేవ స్వయమిదం వదామి జుష్టం. దేవేభిరుత మానుషేభిహి. యంకామయే తముగ్రం కృనోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం" అంటూ సాగే ఈమంత్రార్థం- "నేనే దీన్ని స్వయంగా చెబుతున్నాను. దేవతలుగాని మనుషులుగాని ఎవరిమీద నైతే నేను అనుగ్రహాన్ని చూపుతానో అతనిని ఉన్నతున్ని చేస్తాను,బ్రహ్మజ్ఞానిగా చేస్తాను,ఋషిగా చేస్తాను,చక్కని మేధస్సును ఇస్తాను" అంటుంది ఈ దేవీ సూక్తమంత్రం. కనుక ఏది సాధించాలన్నా శక్తి అనుగ్రహం తప్పనిసరి. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగార్ని ఒకరడిగారు. "అమ్మా ఫలానా వాడికి ఏమి అర్హతలు ఉన్నాయని జీవితంలో అంత ఎత్తుకు ఎదిగాడు?"అని.దానికి అమ్మగారు- "చూడు నాయనా. అర్హతలు ఏమున్నాయో నాకు తెలుసు. ఏది ఇవ్వాలో నాకు తెలుసు" అని జవాబు చెప్పారు.

కాళి ఎందుకు నల్లగా ఉంటుంది? శ్రీ రామకృష్ణులు దీనికి చక్కని వివరణ ఇచ్చారు. నీవు దూరంగా ఉండిచూస్తె ఆమె నల్లగానే కనిపిస్తుంది.సముద్ర జలం దూరంనించి చూస్తె నీలంగా ఆకుపచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది.అదే దగ్గరికిపోయి చేతిలోకి తీసుకొని చూస్తె దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది. అలాగే ఆకాశం నీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.కాని మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని దగ్గిరగా చూస్తె దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది.అలాగే కాళీమాత దూరం నుంచి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని దగ్గరగా చూస్తె, ఆమెకు ఏ రంగూ లేదు అని, అన్ని రంగులూ ఆమెవే అనీ తెలుస్తూంది. అంతే కాదు శక్తీ ఆమెయే, శివుడూ ఆమెయే అన్న సత్యజ్ఞానం కలుగుతుంది. సృష్టి లో అనంతమైన ప్రతిదీ నీలంగానో నల్లగానో ఉంటుంది. ఉదాహరణకు ఆకాశం, సముద్రం మొదలైనవి.అంటే ఈ రంగులు అనంతతత్వాన్ని,రహస్యమైన శక్తినీ చూపుతాయి. నేటి భౌతికశాస్త్రం కూడా సృష్టిలో అల్టిమేట్ ఎనర్జీని డార్క్ ఎనేర్జీ అని తలుస్తూ దానిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. అందుకనే కాళిమాత నల్లని రంగులో ఉన్నట్లు తంత్రం దర్శించింది. 

కనుక ప్రపంచంలో సర్వ కార్యకలాపాలకు ఆధారమైన క్రియాశక్తి,చర్యాశక్తినే కాళి అని తంత్రం పిలుస్తుంది.ఎక్కడచలనం ఉన్నదో అక్కడ కాళీశక్తి పని చేస్తున్నది.చలనం లేని రాళ్ళు రప్పలలో కూడా అణువు దానిలో శక్తులు పనిచేస్తూ ఉన్నాయి.కనుక వాటిలో కూడా కాళీశక్తి ఉన్నది.అవీ కాలానికి లోబడే ఉన్నాయి.కనుక బాహ్యంగా,అంతరికంగా కాలానికి కాళీశక్తికి అతీతంగా ఎవరూ లేరు. సృష్టి ఉన్న ప్రతి చోటా కాళీశక్తి పని చేస్తూనే ఉన్నది.

ఒక్క శివుడే కాలానికి అతీతస్థితిలో ఉన్నాడు.ఇంకో విధంగా చెప్పాలంటే కాళియే తన ఇంకొక రూపమైన శివునిగా కాలాతీత స్థితిలో విరాజిల్లుతూ ఉంది.ఆ శివస్థితిని అందుకోవటమే జీవిత పరమార్థం.ఇది అందుకునే వరకూ జీవికి జన్మలు తప్పవు.అది అందుకోవటానికి జగన్మాత కటాక్షం తప్పనిసరి. అందుకే సాక్షాత్ భగవంతుని అవతారమూర్తులైన శ్రీ రామకృష్ణుడు మొదలైన వారు కూడా శక్తిని ఉపాసించారు.

తంత్రంలో ఒక అద్భుత శ్లోకముంది. 'త్వం స్త్రీ త్వం పుమానషి త్వం కుమారా ఉతవా కుమారీ, త్వం జీర్ణో దండేనవంచసి, త్వం జాతో భవసి విశ్వతోముఖ:' "నీవే స్త్రీవి. నీవే పురుషుడవు. నీవే కుమారునివి. నీవే కుమారివి. నీవే జీర్ణ దండముతో నడుస్తున్నావు. నీవే తిరిగిపుట్టి విశ్వతోముఖముగా విస్తరించి ఉన్నావు". 

కాలంలో బ్రతుకుతున్న జీవులు ఏది సాధించాలన్నా కాళీ అనుగ్రహం తప్పకుండా కావలసి ఉంటుంది.చివరికి కాలాన్ని అధిగమించి మోక్షాన్ని సాధించాలన్నా కాళీ అనుగ్రహం తప్పనిసరి. అందుకే జగన్మాతను భుక్తి ముక్తి ప్రదాయిని అని ప్రార్దిస్తాం.
read more " కాళీ తత్త్వం-4 "

2, జులై 2009, గురువారం

జ్యోతిషం సైన్సు కాదు

జ్యోతిషం ఒక శాస్త్రం కాదు అని వాదించే అర్భకులు ఎందఱో నేడు కనిపిస్తారు. ఆయుర్వేదం, హోమియోలు కూడా సైన్సు కాదు అని వాదించేవారు కోకొల్లలుగా ఉన్నారు. సరే అవి వైద్య శాస్త్రాలు వాటి గురించి తరువాత వ్రాస్తాను. ప్రస్తుతానికి జ్యోతిషం గురించి మాత్రమె మాట్లాడుకుందాం. నాకు న్యూక్లియర్ సైన్సు తెలియదు కాబట్టిఅది సైన్సు కాదు అని నేను వాదిస్తే అది నా అజ్ఞానాన్ని బయట పెట్టుకోవటమే అవుతుంది. అలాగే శాస్త్రమైనా ఇంతే. జ్యోతిష్యం సైన్సు కాదు. ఇది నేనూ ఒప్పుకుంటాను. వెంటనే తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. ఇది సైన్సు కాదుసూపర్ సైన్సు. నేటి సైన్సుకు అందని ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి. బహుశా ఇంకొక 100 ఏళ్ళుపరిశోధించినా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న రహస్యాలను సైన్సు కనుక్కోలేదు.

కారణం తెలుసా? దాదాపు 10000 BC లోనే శాస్త్రం లో మన దేశంలో అద్భుతమైన రీసెర్చి జరిగింది. నాడీ గ్రంధాలుజ్యోతిష్యానికి జరిగిన రీసెర్చిలో పుట్టిన అత్యున్నత సాహిత్యం. అంటే PhD స్థాయి పరిశోధనా ఫలితాలే నాడీగ్రంధాలు. కొన్ని వందల కుటుంబాలు తర తరాలుగా శాస్త్రాన్ని మధించి దీని లోతులు కనుక్కున్నాయి. శాస్త్రమైనాదాన్ని శ్రద్ధగా అభ్యాసం చేస్తే, దాని లోతులు కనిపిస్తాయి. అంతే గాని ఏదో నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్నాంగదా అని విమర్శిస్తే మన ప్రాచీన సంపదను మనమే రోడ్డున పెట్టి వేలం వేసుకున్నట్టు ఉంటుంది.
ప్రపంచంలోని ఇతర జాతైనా తన వారసత్వ సంపదని గురించి గర్వం గా చెప్పుకుంటుంది. కాని ప్రపంచం మొత్తం మీద మన సంస్కృతినీ ధర్మాన్నీ శాస్త్రాలనూ సిగ్గు లేకుండా విమర్శించుకునే వాళ్ళం ఒక్క మన భారతీయులే తప్ప ఇంకో జాతి కనిపించదు. ఇది నేను అనే మాట కాదు. ఒక సారి నాకు రైలు ప్రయాణం లో ఒక కెనడియన్ పరిచయంఅయ్యాడు. అతను అన్న మాట ఇది.

అసలు మన ప్రాచీన శాస్త్రాలకు నేటి సైన్సు సర్టిఫికేట్ ఎంత మాత్రం అవసరం లేదు. సైన్సు ఇంకా శైశవం లో ఉంది. మనశరీరాన్ని గురించి మనకు పూర్తిగా ఇంకా తెలీదు అంటె మీరు నమ్ముతారా? నిద్ర ఎందుకు వస్తుందో సైన్సు ఈనాటికీచెప్పలేకపోతున్నది. మెదడు రహస్యాలు సైన్సుకు ఇంకా తెలీదు. లివర్ కు ఉన్న తనను తానె బాగు చేసుకునే శక్తిఎలా వస్తున్నదో సైన్సుకు తెలీదు. జలుబును నివారించటం సైన్సుకు తెలీదు, కేన్సరు కు మందు లేదు, ఎయిడ్సు కుమందు లేదు. మధ్యలో విచిత్రంగా వస్తున్న వైరల్ జ్వరాలు ఎందుకు వస్తున్నవో సైన్సు చెప్ప లేక పోతున్నది. ఇకమరణం ఎందుకు కలుగుతున్నదో సైన్సు చెప్పలేదు. మరణం తరువాత ఏమి జరుగుతుందో అస్సలే తెలీదు.

పుట్టిన తేది, సమయం, ప్రదేశం మూడు వివరాలతో జెర్మనీ లో ఉన్న మనిషి ఒంటి మీద పుట్టు మచ్చలుఎక్కడున్నాయో మనిషి ముఖం చూడకుండా చెప్పగలిగే శాస్త్రం సైన్సు కాకుండా ఎలా పోతుంది? నమ్మ లేకపోతున్నారా? ఇది నిజం గా జరిగింది. ఐదేళ్ళ క్రితం ఇలాగే నెట్ లో ఒక జర్మన్ యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్నాకు మిత్రుడయ్యాడు. ఆయన జ్యోతిష్యం లో బాగా పరిశ్రమ చేసిన వాడు. ఒక సాఫ్ట్ వేరు కూడా వ్రాశాడు. అది నెట్ లోఇప్పటికీ ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు చెప్పటం భావ్యం కాదు కనుక చెప్పటం లేదు.

ఆయన జాతకాన్ని నేను సరదాగా వ్రాశి ఆయనకు మెయిల్ ఇచ్చాను. రెండురోజుల్లో ఆయన, ఆయన సతీ మణిఇద్దరూ మన మతాన్ని, జ్యోతిష్యం వంటి శాస్త్రాలను ఎంతో మెచ్చుకుంటూ నాకు మెయిల్ ఇచ్చారు. ఇంతా చేస్తే నేనువ్రాసిందేమిటి? నేను వ్రాసిన ఆయన జీవిత వివరాలు పూర్తిగా సరిపోయినవి అలా ఉంచితే, ఆయన ఎడమ తొడ మీదతెనేరంగులో మచ్చలు Birth Marks ఉంటాయి అని నేను వ్రాసాను. అది యధా తధం గా నిజం కావటంతో వాళ్లు బిత్తరపోయి ఇన్ని వేల మైళ్ళ దూరంలో నుంచి మీరు విషయాన్ని ఎలా ఊహించ గలిగారు? అని ప్రశ్నల పరంపరకురిపిస్తూ Oh! It is unbelievable. We have heard a lot about India.Now we are direct witnesses to Her great wisdom. Our salutations to your great country and its ancient wisdom!!! అని మెయిల్ఇచ్చారు.

నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకని? అక్కడేదో నేను చెప్పిన విషయం నిజం అయినందుకు కాదు. ఆయనఒంటి మీద పుట్టు మచ్చలు ఎక్కడున్నా ప్రపంచానికి ఒరిగేదీ లేదు తరిగేదీ లేదు. అది నేను చెప్పినందువల్ల ప్రత్యేకంగా జరిగేదీ లేదు. కాని విధం గా చెప్పగల ఒక అద్భుత విజ్ఞానం మన మహర్షులు మనకు అందించారు. వారి యొక్కపరిశ్రమ, తపస్సు, అన్నింటినీ మించి వారి నిస్వార్థత తలపుకు వచ్చి నాకు ఆనందం కలిగింది.

ఎవరు కనిపెట్టారో తెలియని యోగాసనాలకు కూడా పేటెంట్లు తీసుకుని ఆసనం నాది అంటూ వ్యాపారంచేసుకుంటున్న మనకు-- ఎంతెంత అమూల్య విజ్ఞానాన్ని, వారి వారి జీవిత కాల పరిశ్రమనూ కనీసం పేరు కూడాచెప్పకుండా మనకు అందించి వెళ్లి పోయిన వారి నిస్వార్థ జీవితాలకు తేడా స్ఫురించి ప్రాచీన మహర్షులను స్మరించిచేతులెత్తి నమస్కరించాను.

అన్నింటినీ మించి కనీసం ఒక్క విదేశీ కుటుంబాని కైనా మన దేశం యొక్క ప్రాచీన విద్యల యొక్క గొప్ప తనాన్నిరుజువు చేయగలిగాను అన్న ఆత్మ తృప్తి నాకు కలిగింది. ప్రాచీన ఋషుల రక్తం ఇంకా మన నరాల్లో ప్రవహిస్తున్నది అని నాకు ఆనందం కలిగింది. ఇదీ భారతీయ విజ్ఞానం అంటే. అవును జ్యోతిషం సైన్సు కాదు మరి , అది సూపర్ సైన్సు.
read more " జ్యోతిషం సైన్సు కాదు "