“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జనవరి 2024, గురువారం

జనవరి 22 న నూతన శకం ప్రారంభం - అందరూ పాలు పంచుకోండి

మానవచరిత్రలో మహత్తరమైన సంఘటనలు  అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. అటువంటి వాటిలో ఒకటి శ్రీరామజననం. సృష్టి-స్థితి-లయకారకుడు, సాక్షాత్తు పరబ్రహ్మము అయిన మహావిష్ణువే శ్రీరామునిగా జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కోట్లాది హిందువుల నమ్మకం కూడా అదే.

ఆయన రఘువంశంలో దశరధ మహారాజు కుమారునిగా జన్మించడము, తండ్రికిచ్చిన మాటప్రకారం వనవాసం చేయడము, సీతాదేవిని అపహరించిన రావణుని వానరసైన్యం సాయంతో వధించి, తిరిగి అయోధ్యా నగరానికి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యం చేయడము, అవతార పరిసమాప్తి చేసి తిరిగి తన ధామానికి చేరుకోవడము ఇదంతా రామాయణంలో ఉన్నది, మనకందరికీ ఇది తెలుసు.

రామాయణంలో వాల్మీకిమహర్షి వర్ణించిన కొన్ని విషయాలను బట్టి కనీసం లక్ష సంవత్సరాల క్రితం రామాయణం జరిగి ఉండాలి. వాటిలో ఒకటి, రావణుని భవనానికి నాలుగు దంతాల ఏనుగులు కాపలా కాస్తున్నాయని ఆయన వ్రాయడం. అటువంటి ఏనుగులు లక్ష సంవత్సరాల క్రితం ఉండేవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే విధంగా రామాయణం నిండా ఇటువంటి ఎన్నో రుజువులు లభిస్తున్నాయి. వాటిపైన ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని త్వరలో విడుదల చేయబోతున్నాను.

నేటికి 6000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ను పాలించిన ఫారో రాజులలో 'రామా' అనే పేరు సర్వసామాన్యంగా ఉండేది. థాయ్ ల్యాండ్, ఇండోనేషియా, మొదలైన దేశాలలో శ్రీరాముని నేటికీ పూజిస్తారు. ఇండోనేషియా రాజవంశానికి పూర్వీకులు రఘువంశపు రాజులే. వారి చరిత్ర ఈ విషయాన్ని చెబుతున్నది. లాటిన్ అమెరికా లోని హొండురాస్ దేశాన్ని (పాతాళ లోకాన్ని) ఆంజనేయుడు చేరుకొని అక్కడ భీభత్సం సృష్టించినట్లు ఈనాటికీ అక్కడ గాధలున్నాయి. మహిరావణ చరిత్రలో దీనికి ఆధారాలున్నాయి.

శ్రీరాముడు జన్మించిన భవ్యమందిరం, మహారాజ ప్రాసాదంగా 1660 CE వరకూ అయోధ్యలో ఉండేది. ఆ సంవత్సరంలో, ఆ ప్రాంతానికి గవర్నరు, ఔరంగజేబు అనుచరుడైన ఫిదాయ్  ఖాన్ అనే నీచుడు ఆ రాజభవనాన్ని అందులోని మందిరాన్ని కూలగొట్టి, 1528 CE లో బాబర్ సైన్యాధిపతి అయిన మీర్ బాకీ అనే ఇంకొక నీచుడిచే కట్టబడిన మసీదును పెద్దదిగా నిర్మించి, దానికి బాబరీ మసీద్ అని పేరు పెట్టాడు.

గాంధీ నెహ్రూల కుట్రలు + సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ పాలనల పుణ్యమా అని హిందువులు తమ దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులయ్యారు. వారి ఆలయాలు, చారిత్రక స్థలాలు దిక్కులేని వయ్యాయి. దేశచరిత్ర మొత్తం వక్రీకరించబడింది. హిందూమతాన్ని ఒక ప్లాన్ ప్రకారం చాప క్రింద నీరులాగా నిర్మూలించే కుట్ర అమలుచేయడం మొదలైంది. కులాలను రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓట్లు దండుకుని అధికారం చేజిక్కించుకుని తమ తమ ఎజెండాలు అమలు చెయ్యడం మొదలైంది. 

ఈ క్రమంలో అనర్హులు అందలాలు ఎక్కారు. నీతి అనేది సమాజం నుంచి మాయమైంది. అడుగడుగునా అవినీతి మయమైంది. దేశం పరాయి దేశాల తొత్తుగా మారింది. దేశసంపద ఇతర దేశాలకు తరలిపోయింది. ఎడారి మతాల ప్రాబల్యం పెరిగింది. టెర్రరిజం పెరిగింది. స్వతంత్రం వచ్చాక భరతమాత మళ్ళీ బందీ అయింది. అంతర్జాతీయ వేదికల పైన నవ్వుల పాలైంది. అన్నిరకాలుగా పతనమై పోయింది.

6 డిసెంబర్ 1992 న, దౌర్జన్యానికి, బానిసత్వానికి ప్రతీక అయిన బాబరీ మసీదు రామభక్తుల చేత కూలగొట్టబడింది. ఆ చైతన్యాన్ని వారిలో రగిల్చింది, లాల్ కృష్ణ అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఇంకా అనేకులు ఏళ్ల తరబడి చేసిన నిరంతర కృషి. ఆ క్రమంలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పులలో అనేకమంది కరసేవకులు, రామభక్తులు చనిపోయారు.  అయినా సరే వెనుకకు తిరుగకుండా, ఆ అక్రమ కట్టడాన్ని కూలగొట్టి తమ దేశభక్తిని, దైవభక్తిని చాటుకున్నారు. చరిత్రలో నిలిచిపోయారు. భగవంతుని పాదాల చెంతకు చేరుకున్నారు. మనం వారిని మర్చిపోయినా, దైవదృష్టిలో వారు ఉత్తములే అని నా నమ్మకం.

ఆ రోజు నుంచి హిందువులలో చైతన్యం రావడం మొదలైంది.

అప్పటినుంచీ బీజేపీ పార్టీ, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ లు చేసిన సమిష్టి న్యాయపోరాట ఫలితంగా  విజయాన్ని సాధించి, అయోధ్యలో శ్రీరాముని భవ్య మందిరాన్ని నిర్మించి, ఈ నెల 22 న బాలరాముని విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ట చేయబోతున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక భారతదేశ పునరుజ్జీవనం మొదలైంది. కోల్పోయిన గత వైభవాన్ని మన దేశం తిరిగి పొందటం మొదలైంది. ప్రపంచదేశాలు మనల్ని ఒక కలోనియల్ బానిసలా చూడటం మానేసి, తిరిగి గౌరవించడం మొదలు పెట్టాయి.

మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత అయి ఉండికూడా, ఊపిరి సలపనంత బిజీ పనులలో ఉంటూ కూడా, 22 న రామ్ లాలా విగ్రహ ప్రాణప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక సామాన్యుడిలాగా పది రోజుల ఉపవాసదీక్షను చేస్తున్నారు. నేలపైన నిద్రపోతూ నిరంతరం రామనామాన్ని జపిస్తున్నారు. ఆయనకిప్పుడు 73 ఏళ్లు.  దేశంకోసం ధర్మంకోసం కుటుంబాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. వివేకానందస్వామి అనుచరుడు. ఇటువంటి దైవత్వం ఉన్న మనీషి మన ప్రధానమంత్రి కావడం మన అందరి అదృష్టం. అటువంటి ఉత్తముడు అసలు రాజకీయాలలో ఉండటమే ఒక అద్భుతం !

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ ఇంకొక కారణజన్ముడు. కళంకం లేని దేశభక్తుడు. మహాయోగి గోరఖ్ నాథ్  స్థాపించిన యోగసంప్రదాయానికి చెందిన నేటి జగద్గురువు ఈయన. అటువంటి నిస్వార్థపరుడు,  బ్రహ్మచారి, నిజమైన సన్యాసి, సాధువు, ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, టెర్రరిజాన్ని అణచి పారేసి, రామరాజ్యాన్ని అక్కడ నడిపిస్తున్నాడు. 'సన్యాసి రాజ్యం ఏలుతాడు' అని వీరబ్రహ్మేంద్ర స్వామి  తన కాలజ్ఞానంలో వ్రాసినది యోగి అదిత్యనాథ్ గురించే గాని, కొందరు పిచ్చివాళ్ళు అనుకున్నట్లు ఎన్టీఆర్ గురించి కానే కాదు. రంగుగుడ్డలు వేసుకున్నంత మాత్రాన, రంగులు పూసుకుని నటించినంత మాత్రాన, నలభై రోజుల పార్ట్ టైమ్ దీక్షలు చేసినంత మాత్రాన, ఎవరూ గురుస్వాములు, సన్యాసులు, స్వామీజీలు అయిపోరు. వారి జీవితచరిత్రలు, దినచర్యలు అందుకు అనుగుణంగా, మచ్చ లేనివిగా ఉండాలి.

యోగి అదిత్యనాథ్ వంటి మరొక్క మహనీయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమయంలో పుట్టడం మనందరి అదృష్టం.

రామ్ లాలా విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తన కుటుంబానికి దూరంగా ఉంటూ, ఆరు నెలలు మౌనదీక్షలో ఉండి, ఆ విగ్రహాన్ని కర్ణాటకలో దొరికే నల్లరాతి ఏకశిల నుండి చెక్కాడు. అతని జన్మ ధన్యమైంది !  అతని తపస్సు ఫలించింది. ఆ విగ్రహాన్ని కోట్లాదిమంది యుగయుగాలపాటు పూజించబోతున్నారు. దానిలో శ్రీరామచంద్రుని దివ్యమూర్తిని దర్శించ బోతున్నారు. ఎంతటి ధన్యాత్ముడో ఈ శిల్పి! ఈ పుణ్యబలం వల్ల, అరుణ్ యోగిరాజ్ పూర్వీకులందరూ ఉత్తమలోకాలను పొందారని నా నమ్మకం !

అయోధ్య కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో గొప్ప ఐకమత్యం., సోదరభావం, దేశభక్తులు వెల్లివిరుస్తున్నాయి. కులాలకు అతీతంగా వారిలో ఐక్యతాభావం పెల్లుబుకుతోంది. శ్రీరాముని పాదపద్మాల చెంత అందరూ ఒక్కటౌతున్నారు.

ఈ సమయం భారతదేశ చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం. ఇటువంటి సమయంలో మనం పుట్టి, ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉండటం గొప్ప అదృష్టం.

ఇది సాంస్కృతిక ధార్మిక పునరుజ్జీవన యుగం.  జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి మరపురాని ఘట్టాన్ని ఆసాంతం ఆస్వాదించండి. ఉప్పొంగిన హృదయాలతో శ్రీరామ నామగానం చేయండి. హిందువులుగా పుట్టినందుకు, ప్రపంచంలో ఎక్కడా లేని మహోన్నతమైన ఆధ్యాత్మిక సంస్కృతికి వారసులైనందుకు గర్వించండి.

పంచవటి తరఫు నుండి మేము కూడా రేపటినుంచి మూడు రోజుల దీక్ష చేస్తున్నాం. దీనిలో ఉపవాసము, మౌనం, నిరంతర రామనామ జపం భాగాలుగా ఉంటాయి. 22 వ తేదీన, 'రామ తాపినీ ఉపనిషత్' కు నా వ్యాఖ్యానమును ఉచిత 'ఈ-బుక్' గా విడుదల చేస్తున్నాము. ఇది శ్రీరాముని పాదపద్మముల చెంత మేము ఉడతాభక్తిగా చేస్తున్న సేవ.

హిందువులందరూ మీకు చేతనైన రీతిలో కనీసం ఈ మూడు రోజులైనా దీక్షలు చెయ్యండి. 22 వ తేదీన జరిగే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవాన్ని మీ మీ కుటుంబాలలో ఒక పండుగగా జరుపుకొండి. 

మీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది.

మరువకండి !

రామభక్తులుగా జీవించండి. రావణ సైన్యంలో చేరకండి

జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ !