“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, నవంబర్ 2016, శనివారం

స్వామి యదునాధానందతో సంభాషణ -8 (శ్రీ రామకృష్ణులు దైవం యొక్క అవతారమా? నేనొప్పుకోను )





ఈ విధంగా చాలా సేపు మాట్లాడుతూ కూచున్నాము. ఇంతలో భోజనాల వేళ అయింది.అదేరాత్రి పదింటికి చెన్నై బస్సులో స్వామీజీ బయలుదేరి వెళ్ళాలి. అందుకని పెందలాడే భోజనం కానిచ్చాము.

'నాకు గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి.చల్లనీళ్ళు నేను త్రాగను.నాకు కొంచం జలుబు చేసే తత్త్వం ఉంది.' అన్నారు స్వామీజీ.

'అలాగే. నేనూ అంతే. చలికాలం గోరువెచ్చని నీరే నేనూ త్రాగుతాను.' అన్నాను.

'మీరు వంటల్లో వెల్లుల్లి వాడతారా?' అడిగారు స్వామీజీ అనుమానంగా.

'శుభ్రంగా వాడతాము.అలాంటి పట్టింపులు మాకు లేవు.' అన్నాను.

'అవును.వెల్లుల్లి గుండెకు చాలా మంచిది.శాకాహారంలో కూడా ఇది పనికిరాదు అది పనికిరాదు అంటూ అనవసరమైన పట్టింపులు చాదస్తాలు మంచివి కావు.ప్రతి వస్తువుకూ కొంత చెడు గుణం ఉంటుంది.దానిని పోగొట్టి వాడుకుంటే అది శరీరానికి మంచే చేస్తుంది.చలికాలంలో జలుబు చేసే తత్త్వం ఉన్నవారు పొద్దున్నే ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచం మిరియాలు కలిపి నూరి దానిని ఒక గ్లాసు నీళ్ళలో కాచి, దానికి కొంచం ఉప్పు తగిలించి త్రాగితే చాలా మంచిది.తిన్నది కూడా బాగా అరుగుతుంది.నేను అదే చేస్తాను.' అన్నాడు స్వామీజీ.

శుద్ధ వైష్ణవ సాంప్రదాయం నుంచి వచ్చిన స్వామీజీకి తిండి విషయంలో ఇంత విశాల భావాలు ఉన్నందుకూ వెల్లుల్లి తింటానని అన్నందుకూ నాకు సంతోషం అనిపించింది.

'అవును స్వామీజీ ! హోమియోలో కూడా వెల్లుల్లిని ఒక మందుగా వాడతారు. "అల్లియం సటైవా" అంటే అదే.' అన్నాను.

మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చి, శ్రీమతి వద్ద సెలవు తీసుకుని కార్లో బస్టాండ్ కు బయలుదేరాము.

దారిలో మా సంభాషణ ఇలా సాగింది.

'రామకృష్ణా మఠానికి గాని, శారదా మఠానికి గానీ అప్పుడప్పుడూ వెళుతూ ఉంటారా? ' అడిగాడు స్వామీజీ.

'చిన్నప్పుడు వెళ్ళేవాడిని. కానీ ఒక పాతికేళ్ళ నుంచీ పూర్తిగా మానేశాను.' అన్నాను.

'ఎందుకు?' అన్నాడాయన.

'అక్కడ వాతావరణాలు నాకు నచ్చడం లేదు.నేను ఆశించినంత ఉన్నతమైన వ్యక్తులూ నాకు కన్పించడం లేదు.ఎంతో మహనీయులైన స్వామి నందానంద, స్వామి తపస్యానంద,స్వామి ఉద్ధవానంద,స్వామి గంభీరానంద మొదలైన వారిని నేను చూచాను.అలాంటి స్వామీజీలు ప్రస్తుతం ఎక్కడా కన్పించడం లేదు.అందుకని ప్రస్తుతం నేనెక్కడికీ పోవడం లేదు.ఈ జీవితంలో చూడవలసిన వారిని చూచాను. చాలు. ఇక ఎవరినీ చూడవలసిన పని లేదు. ఎవరి బోధలూ వినవలసిన పని కూడా లేదు.' అన్నాను.

ఆయన మౌనంగా వింటున్నాడు.

'అదీగాక నేటికాలపు స్వామీజీలలో ఆధ్యాత్మిక అహంకారం ఎక్కువగా నాకు కనిపిస్తున్నది."మీరు గృహస్తులు కనుక మీకు మోక్షం రాదు.కారణం ఏమంటే మీకు బ్రహ్మచర్యం ఉండదు కదా?మీకంటే మేమే గొప్ప" అని వీరి భావన. ఇదే మాటను కొంతమంది మాతాజీలు అన్నారు. ఆ దెబ్బతో నాకు వీళ్ళంటే విరక్తి వచ్చేసింది. అందుకని ఎక్కడికీ వెళ్ళడం మానేశాను. పాతకాలపు స్వామీజీలు ఎవరూ ఇలా సంకుచితమైన భావాలు ఉన్నవారు కారు.

మా గురువైన గంభీరానందస్వామి ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన మహనీయుడు. ఒకసారి కల్పతరు దినోత్సవ సందర్భంగా 1963 లో కలకత్తాలో ఒక సభ జరిగింది.ఆ సభకు గంభీరానంద స్వామి అధ్యక్షులుగా ఉన్నారు.సభలో మాట్లాడిన వక్తలలో - సాదువులే గొప్ప అని కొందరు - గృహస్తులే గొప్ప - అని కొందరు మాట్లాడారు.శ్రీ రామకృష్ణుల అనుగ్రహం మాకే ఉందంటే మాకే ఉందని వారు వాదులాడు కున్నారు.

అందరూ మాట్లాడాక, అధ్యక్షోపన్యాసం చెయ్యడం కోసం గంభీరానంద స్వామి లేచారు. ఆయన ఈ ఇరువర్గాలకూ బాగా చీవాట్లు పెట్టారు.

'శ్రీరామకృష్ణులను మీరు ఎంత తక్కువ చేస్తున్నారు? ఎంత దిగజారుస్తున్నారు? ఇటువంటి సంకుచిత భావాలను ఆయన సహించేవారే కాదు.ఆయన్ను మీరేం అర్ధం చేసుకున్నారసలు? మీ రెండు వర్గాల కోసమేనా ఆయన పుట్టింది? కాదు. ప్రపంచంలోని అన్ని జాతులూ అన్ని కులాలూ అన్ని జీవుల కోసం ఆయన అవతారం దాల్చాడు.వారూ వీరూ అని ఆయనకు తారతమ్యం ఎంతమాత్రమూ లేదు.ఆయనొక మహాసముద్రం వంటి వాడు.ఆయన్ను మీరొక ఉగ్గుగిన్నెలో దాచాలని చూస్తున్నారు.ఇది చాలా తెలివితక్కువ పని.' అని గట్టిగా వారికి బోధించారు.

అలా చెప్పేవారు ఇప్పుడు కరువయ్యారు. స్వామీజీలలో కూడా క్వాలిటీ తగ్గింది.అందుకే నేను వారి దగ్గరకు వెళ్ళడం పూర్తిగా మానేశాను.అసలు శ్రీ రామకృష్ణులను వీరెవరూ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదని నా ఉద్దేశ్యం.లోకం ఎలాగూ ఆయన్ను అర్ధం చేసుకోలేదు. కనీసం ఆయన సాంప్రదాయపు స్వామీజీలు కూడా అలాగే ఉన్నారు.అదీ బాధాకరం.

అసలీ గోలంతా ఏమిటి? సన్యాసులేమిటి? గృహస్థులేమిటి? అందరికీ ఆయన మోక్షం ఇచ్చారు.సాధన అనే పదమే వినని రసిక్ అనే కాళికాలయ పాకీవాడికి కేవలం ఆయన అనుగ్రహంతో మోక్షం దొరికింది.వినోదిని అనే డ్రామా నటికి అలాగే మోక్షం లభించింది. ఊరకే ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చినందుకు రమణి అనే వేశ్యకు ఆయన మోక్షం ఇచ్చారు.మన్మద్ అనే రౌడీ, ఆయన అనుగ్రహంతో గొప్ప సెయింట్ గా మారిపోయాడు.జీవితమంతా తనను తిట్టిపోసిన హాజ్రాకు మోక్షం ఇచ్చారాయన.అహంకారంతో తనను వదిలేసి వెళ్ళిపోయిన హృదయ్ కు మోక్షం ఇచ్చారు.ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు ఉన్నాయి. వీరికందరికీ మోక్షం వచ్చినపుడు మనకు రాదా? తప్పక వస్తుంది. అనన్యమైన భక్తి ముఖ్యం గాని ఇవన్నీ ఏమిటి నాన్సెన్స్?" అన్నాను.

ఆశ్చర్యంగా నా వైపు చూచారు స్వామి.

'మీ భావాలు వింటూ ఉంటే,బేలూర్ మఠంలో నేను బ్రహ్మచారి ట్రెయినింగ్ లో ఉన్నపుడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తున్నది.' అంటూ చెప్పసాగారు ఆయన.

చెన్నై మఠంలో రెండేళ్ళు ఉన్న తర్వాత నాకు బేలూర్ మఠంలో బ్రహ్మచారి ట్రెయినింగ్ మొదలైంది.ఆ బ్యాచ్ లో మేం మొత్తం దాదాపు ముప్పై మందిమి ఉన్నాము.ట్రెయినింగ్ అయిపోయాక మేము ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మిగతా ప్రశ్నలతో బాటు ఒక ప్రశ్న ఉంటుంది. అదేమంటే - 'శ్రీ రామకృష్ణులను మీరు అవతారంగా ఒప్పుకుంటున్నారా?" అని.

మా బ్యాచ్ లోని అందరూ  దానికి 'అవును.ఒప్పుకుంటున్నాను.' అని వ్రాశారు.కానీ నేను మాత్రం 'నో. నేను ఒప్పుకోవడం లేదు' అని వ్రాశాను. బ్రహ్మచర్య ట్రెయినింగ్ కాలేజికి ఒక సీనియర్ స్వామీజీ ప్రిన్సిపాల్ గా ఉంటారు.ఆయన నా ఆన్సర్ చూసి షాకయ్యారు. నన్ను ఆఫీస్ రూమ్ కి పిలిపించి అడిగారు.నేను నా మాట మీదే ఉన్నాను."శ్రీ రామకృష్ణులు అవతారం కాదు.నేనొప్పుకోను." - అని ఆయనతో గట్టిగా చెప్పాను.ఏం చెయ్యాలో ఆయనకు పాలు పోలేదు. 

"ఇలా అయితే నీకు బ్రహ్మచర్య దీక్షను ఇవ్వడం కుదరదు.నిన్ను మా మఠంలో ఉంచుకోవడం కూడా కుదరదు." అని ఆయన అన్నారు.

'మీ ఇష్టం.కానీ నా మాట మాత్రం అదే. ఇక్కడ నన్ను ఉంచుకోవడమూ లేదా పొమ్మనడమూ మీ ఇష్టం కాదు.బ్రహ్మచర్యదీక్షనూ సన్యాసదీక్షనూ మాకు మీరివ్వడం లేదు. ఠాకూర్ ఇస్తున్నారు. ఆయన ఇష్టమైతే ఉంటాను.లేకుంటే ఆయనే నన్ను పంపించేస్తారు.' అని నేనన్నాను.

కాసేపు ఆలోచించిన మీదట ఆయన నాతో ఇలా చెప్పారు.

'నీ కేసును నేను ట్రస్టీలకు పుటప్ చెయ్యవలసి ఉంటుంది. నీవు వెళ్లి వారిని కలువు.' ఇలా అంటూ ఆయన ఫోన్ చేసి నా విషయం వారికి చెప్పారు.

రామకృష్ణా మిషన్ లో అత్యున్నతమైన అడ్మినిస్ట్రేటివ్ బాడీని ట్రస్ట్ బోర్డ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మఠాలు మిషన్ లు అన్నింటినీ ఈ ట్రస్టీలు కంట్రోల్ చేస్తూ ఉంటారు.వీరు చాలా సీనియర్ స్వామీజీలై ఉంటారు.మిషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు అందరూ ఈ బోర్డులో ఉంటారు. వారి దగ్గరకు నన్ను ఇంటర్వ్యూకు పంపారు. నాతోటి బ్రహ్మచారులందరూ నా పని అయిపోయిందని అనుకున్నారు. ఆరోజుతో నన్ను బాగా తిట్టి ఇంటికి పంపించేస్తారని భయపడ్డారు.

ట్రస్టీ స్వామీజీలు అందరూ ఒక గదిలో సమావేశమై నన్ను పిలిచారు.నేను ధైర్యంగా ట్రస్టీల రూమ్ లోకి వెళ్లాను. అయిదారుగులు మోస్ట్ సీనియర్ స్వామీజీలు అక్కడ కూచుని ఉన్నారు.వాళ్ళ ముఖాలు చాలా సీరియస్ గా ఉన్నాయి.

'ఠాకూర్ ను అవతారంగా నువ్వు ఒప్పుకోవా?' అని వారు అడిగారు.

'ఒప్పుకోను.అదేగా నేను ఆ కాగితంలో వ్రాసింది.' అన్నాను.

'అలా అయితే ఇన్నాళ్ళూ ఈ మఠంలో ఎందుకున్నావు? బ్రహ్మచారి ట్రెయినింగ్ ఎందుకు కంప్లీట్ చేశావు?' అని వారడిగారు.

'నా మనసులో ఉన్న విషయం నేను చెప్పాను. మిగతా బ్రహ్మచారులు తల ఊపారని నేను కూడా ఊపలేను.' అని నేను ధైర్యంగా చెప్పాను.

ఆ రూమ్ లో వాతావరణం అంతా చాలా సీరియస్ గా ఉన్నది.

'అసలు నీ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా చెప్పు. ఠాకూర్ ను నువ్వేమని అనుకుంటున్నావు?' అని వారు అడిగారు.

అప్పుడు నేను ఇలా చెప్పాను.

'ఠాకూర్ ను అవతారం అని మీరంటున్నారు.కానీ అలా అనడం ఆయన్ను తక్కువ చెయ్యడం అని నేను భావిస్తున్నాను. భగవంతుడంటే ఒక మహాసముద్రమైతే, అవతారం అనేది ఆ సముద్రంలోని ఒక అల మాత్రమే. రాముడైనా కృష్ణుడైనా ఇంకే అవతారమైనా కూడా ఆ మహాసముద్రంలోని అలలే. కానీ - ఆ సముద్రమే శ్రీరామకృష్ణులని నేను భావిస్తున్నాను. అవతారం అనేది చాలా చిన్న మాట. అలాంటి మాట వాడి ఠాకూర్ ను మనం ఎందుకు తక్కువ చెయ్యాలి? అది నాకిష్టం లేదు. అందుకే అలా జవాబు చెప్పాను.

'ఠాకూర్ ను అవతారంగా నువ్వు ఒప్పుకుంటావా?' అన్న ప్రశ్నను మీరు ఆ ఫార్మాట్ లో నుంచి ముందు మార్చండి.సమస్త ప్రకృతికీ అతీతుడైనప్పటికీ, సమస్త ప్రకృతికీ ఆధారంగా కూడా ఉన్నట్టి అవాన్మానస గోచరుడైన పరబ్రహ్మంగా నీవు శ్రీరామక్రిష్ణులను గుర్తిస్తున్నావా లేదా? అంతటి పరిపక్వతా అవగాహనా నీకున్నాయా?' అని మీరు అడగాలి. అదే సరియైన ప్రశ్న." - అని నేనన్నాను.

ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది.

అప్పటివరకూ మహా సీరియస్ గా ఉన్న ట్రస్టీ స్వామీజీల ముఖాలు ఒక్కసారిగా పరమానందంతో వికసించాయి. అందరూ లేచి నా భుజం తట్టి - 'వెరీ గుడ్ త్యాగరాజ్. అద్భుతంగా చెప్పావు.నువ్వు చెప్పినది పరమసత్యం.ఇదా నీ భావన !! మరి ముందే ఎందుకు చెప్పలేదు?' అని నన్ను బ్లెస్ చేశారు.

'నువ్వు మంత్రదీక్ష తీసుకున్నది ఎవరి దగ్గర? నీ గురువు ఎవరు?' అని వారు అడిగారు.

'తపస్యానందస్వామి శిష్యుడనని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను.' అని వారికి ధైర్యంగా చెప్పాను.

'ఓ ! అదా సంగతి ! నువ్వు వారి శిష్యుడవా? వెరీ గుడ్. You have proved yourself' అని అందరూ అన్నారు. అనడమే కాదు. ఒక్కొక్కరూ ఒక కేజీ స్వీట్స్ ప్యాకెట్ నాకిచ్చారు. అన్ని స్వీట్స్ ప్యాకేట్స్ తో బయటకొచ్చి, అక్కడ నాకోసం వెయిట్ చేస్తున్న బ్రహ్మచారులందరికీ ఆ స్వీట్స్ పంచాను.

తిట్లు తిని, ఊస్టింగ్ తో బయటకు వస్తానని అనుకున్న ప్రిన్సిపాల్ స్వామీజీ, మొయ్యలేనన్ని స్వీట్స్ పేకెట్స్ పట్టుకుని నేను రావడం చూచి మళ్ళీ షాకయ్యారు. విషయం తెలిసిన తర్వాత మహదానందంతో ఆయన కూడా ఇంకొక స్వీట్ ప్యాకెట్ నాకిచ్చారు.' అన్నాడు స్వామీజీ.

మౌనంగా వింటున్న నాకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగింది. కారును సైడుకు తీసి ఆపేశాను. ఆయన వైపు తిరిగి ఇలా అన్నాను.

'స్వామీజీ.పొద్దున్న నుంచీ మీరు చెప్పిన విషయాలన్నీ ఒక ఎత్తు. ఇదొక్కటీ ఒక ఎత్తు. అద్భుతంగా చెప్పారు మీరు.చాలా కరెక్ట్.' అన్నాను.

'అవును. ఎందుకంటే శ్రీరామకృష్ణులను గురించి వివేకానంద స్వామికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఆయన్ను సరిగ్గా అర్ధం చేసుకున్నది వివేకానందుడొక్కడే. కానీ ఆయన కూడా శ్రీ రామకృష్ణుని జీవితాన్ని గురించి వ్రాయడానికి వెనుకంజ వేశాడు. ఆపనిని తాను చెయ్యలేననీ, ఆయన మహత్యాన్ని వర్ణించడంలో తాను న్యాయం చెయ్యలేననీ ఆయనన్నాడు.

కానీ - ఎన్నో పేజీలు  వ్రాసి కూడా చెప్పలేని విషయాన్ని ఒక్క చిన్న పదంలో చెప్పవచ్చు. అందుకే వివేకానంద స్వామి వ్రాసిన శ్రీరామకృష్ణ స్తోత్రంలో ఒక మాట వాడాడు. " భాస్వర భావసాగర" అనేదే ఆ మాట !!

నాకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి !!

స్వామీజీ కంటిన్యూ చేశాడు.

'ఠాకూర్ భావసాగరుడు. అవికూడా మామూలు భావాలు కావు. ఉజ్జ్వలమైన కాంతితో వెలుగుతున్న దివ్యభావాలవి. మిగతా మహనీయులూ అవతారాలూ ప్రవక్తలూ ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని మాత్రమే వారి జీవితాల్లో ఆచరించగలిగారు.మనకు చూపించగలిగారు.ఉదాహరణకు బుద్ధుడు - శుద్ధ జ్ఞానమూర్తి.శంకరుడూ అంతే. చైతన్యుడు భక్తి భావ ప్రపూర్ణుడు.గోరఖ్ నాద్, మొదలైనవారు యోగులు.రమణమహర్షి జ్ఞాన స్వరూపుడు.అరవిందులది యోగమార్గం.ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని మాత్రమే ఆచరించగలిగారు. కానీ శ్రీరామకృష్ణులలో ఇవన్నీ ఉన్నాయి. ఆయనలో యోగము, భక్తి, జ్ఞానము,తంత్రము ఇంతేగాక అన్ని రకాలైన మతాలూ మార్గాలూ సాధనలూ మొత్తం రాశిగా ఏర్పడి ఉన్నాయి.

మిగతా మహనీయులది ఒక భావం మాత్రమే.కానీ ఈయనో?భావసముద్రుడు. మిగతా మహాపురుషులందరూ నీటి బిందువులు. ఈయన మహాసాగరుడు. ఈ విషయం స్పష్టంగా తెలుసు గనుకనే వివేకానందస్వామి, శ్రీ రామకృష్ణులను - "భాస్వర భావసాగర" అని సంబోధించాడు.

కనుక - ఆయన్ను ఉత్త అవతారం అని భావించడం తప్పు. అది కరెక్ట్ భావన కాదు. అవతారాలన్నీ ఏ పరబ్రహ్మం నుంచి ఉద్భవిస్తాయో అదే శ్రీరామకృష్ణుడు. ఇది సత్యం. అందుకని నేను అదే భావాన్ని వారితో చెప్పాను.' అన్నాడు స్వామీజీ.

నేను చాలాసేపు ఏమీ మాట్లాడలేక పోయాను. ఎందుకంటే స్వామీజీ చెబుతున్నది సత్యం అని నాకు తెలుసు.మహనీయులైన నా గురువుల నోళ్ళ వెంట ఇవే మాటలను నేను 30 ఏళ్ళ క్రితం విన్నాను.

స్వామీజీ కొనసాగించాడు.

'ఇంకో విషయం వినండి. బేలూర్ మఠంలో న్యూ యియర్ రోజున ఠాకూర్ కు ప్రత్యేక పూజ జరుగుతుంది.ఆనాడు ఆయనకు దాదాపు ఏభై రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.వాటిల్లో చేపకూర కూడా ఉంటుంది. బెంగాల్ లో అది సర్వసాధారణం.

ఆ పూజ చేసే స్వామీజీ ఒక న్యూ యియర్ రోజున నాతో ఇలా అన్నారు.

'త్యాగరాజ్. పూజ అయిపోయింది. ప్రసాదం తీసుకోండి. ముఖ్యంగా ఆ చేపకూర ప్రసాదం కొంచం టేస్ట్ చెయ్యండి. బాగుంటుంది.' 

' క్షమించండి మహరాజ్ ! నేను చేపలు తినను.' అని నేను సమాధానం చెప్పాను.

దానికాయన "ఠాకూర్ దగ్గర అవన్నీ వదిలెయ్యాలి. దీనిని ప్రసాదంగా మాత్రమే తీసుకోండి.కొంచమే తీసుకోండి. ఎక్కువ తినమని నేను చెప్పడం లేదు. ఒక చిన్న ముక్క తినండి.అసహ్యం అనే భావాన్ని మీ మనసులో నుంచి తీసెయ్యాలి." అన్నాడు.

నాకు కోపం వచ్చింది.

'అసలు మీరు పెడుతున్న నైవేద్యం ఆయన తీసుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా?' అని సూటిగా అడిగాను.

'అదేంటి త్యాగరాజ్ ! నేను ఈ ఆలయంలో గత పదేళ్లుగా ఈ పని చేస్తున్నాను. అలా అంటావేంటి. ఠాకూర్ నా పూజను స్వీకరించడం లేదని నీకెలా తెలుసు?" అని ఆయన అన్నాడు.

నేనిలా చెప్పాను.

'మీరు మాట్లాడే తీరును బట్టే నాకలా అనిపిస్తున్నది. చేపలు తినమని నన్ను మీరు బలవంతం చెయ్యడం ఎందుకు? వేరే చాలా ఉన్నాయి కాదా ఆ నైవేద్యంలో? ఏదో ఒక స్వీట్ తీసుకుంటాను. నా చాయిస్ ను మీరు గౌరవించాలి. మిమ్మల్ని చేపలు మానుకొమ్మని నేను చెప్పడం లేదు. కానీ నన్ను మీరు ఫోర్స్ చెయ్యకూడదు.ఎందుకంటే ఇది నా ఇష్టం. ఠాకూర్ ఎప్పుడూ ఎదుటి మనిషిని గౌరవించమనే చెప్పేవారు.ఇతరుల విశ్వాసాలను దెబ్బ తీయవద్దనే ఆయన ఎప్పుడూ అనేవారు.అన్ని మతాలూ అన్ని సంప్రదాయాలూ సత్యాలే అనేది ఆయన బోధలలో ఒకటి. మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. పరమ విశాల భావాలకు నిలయం అయిన ఠాకూర్ ను మీలాంటి సంకుచిత భావాలతో మీరెన్నటికీ అర్ధం చేసుకోలేరు. అందుకే అలా అన్నాను.' అని ఆయనతో చెప్పాను.

ఇందులో స్వామీజీ ఏం చెప్పాలని అనుకున్నారో నాకర్ధం కాలేదు. ఆ అర్చక స్వామి చెప్పిన మాటల్లో కూడా కొంత సత్యం ఉందనీ, దానికీయన అంతగా రియాక్ట్ కావలసిన అవసరం లేదనీ నాకనిపించింది.కానీ ఆ విషయాన్ని నేను బయటకు అనలేదు.

అప్పటిదాకా కారును రోడ్డు పక్కనే పార్కు చేసి మౌనంగా ఇదంతా వింటున్నాను. యధాలాపంగా టైం వైపు చూచాను. బస్సు టైం దగ్గర పడిందని అర్ధమైంది. వెంటనే కార్ స్టార్ట్ చేసి బస్టాండ్ వైపు పోనిచ్చాను.

బస్టాండ్ లో కొద్ది సేపు వెయిట్ చేసిన తదుపరి, చెన్నై వెళ్ళే బస్సు వచ్చింది. స్వామీజీ బస్సెక్కి నాకు టాటా చెప్పి తన సీట్లో కూచున్నాడు. బస్సు బయల్దేరింది.

నేనూ ఆయనకు టాటా చెబుతూ మౌనంగా అక్కడ నిలబడ్డాను. బస్సు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు నేనక్కడే నిలబడి ఉన్నాను. చివరకు తేరుకుని బయటకొచ్చి ఇంటి దారి పట్టాను.

కారు ప్రయాణిస్తోంది. యాంత్రికంగా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను.కానీ మనస్సులో ఒకటే మాట పదేపదే మెదులుతోంది.

'భాస్వర భావసాగర'

ఎంత గొప్ప పదం !! తన దైవం అయిన శ్రీ రామకృష్ణులను వర్ణించడానికి వివేకానందస్వామి ఉపయోగించిన మాట ఇది !! రామకృష్ణుల జీవితాన్ని వ్రాయడానికి తాను అశక్తుడనని ఆయన భావించి ఉండవచ్చుగాక. ఆ ప్రయత్నం చెయ్యడానికే ఆయన భయపడి ఉండవచ్చు గాక !! కానీ ఈ ఒక్క పదంతో ఆ పనిని ఆయన చేశాడు.కనీసం చాలావరకూ కృతకృత్యుడయ్యాడు.లెక్కలేనన్ని ఉజ్జ్వల దివ్యభావముల మహాసాగరమే శ్రీరామకృష్ణుని స్వరూపం అన్న విషయం ఆయన ఎంతో స్పష్టంగా ఈ పదంలో చెప్పాడు. ఎంత గొప్ప విషయం !!

ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించాను. నిద్ర పోతున్నా కూడా ఆ ఒక్క పదమే నా మనస్సులో సుడి తిరుగుతూ ఉన్నది. కలల్లో కూడా ఎన్నెన్నో కాంతి వలయాలు! రంగురంగుల తేజోగోళాలు! ఒకదానిలో మరొకటి లీనమౌతూ, విడిపోతూ, విశ్వాంతరాళాలను ఆక్రమిస్తూ, అనంత దిగంతాలలోకి మాయమై పోతూ, తెల్లవార్లూ కనిపిస్తూనే ఉన్నాయి.

తెల్లగా తెల్లవారింది. మెలకువ వచ్చింది. మెలకువ వస్తూనే నా మదిలో, శ్రీ రామకృష్ణ స్తోత్రం నుంచి ఈ పాదం మెదిలింది  - 

'భాస్వర భావసాగర చిర ఉన్మద ప్రేమ పాధార్ 
భక్తార్జన యుగళచరణ తారణ భవ పార్ ".

"నీవు అనంతములైన దివ్య భావముల మహా సముద్రమువు. ప్రేమోన్మత్తుడవు. నీ భక్తులు నీ చరణములను ధ్యానించి, ఈ ప్రపంచమనే సాగరమును అతి తేలికగా దాటగలుగుతున్నారు".

నిద్ర లేచినా, కళ్ళు తెరవకుండా అలాగే పడుకొని ఉన్న నా మనోనేత్రం ముందు దివ్య దరహాసంతో వెలుగుతున్న శ్రీరామకృష్ణుని మనోహర తేజోమయ రూపం ప్రకాశిస్తూ కనిపిస్తూనే ఉంది.

ఫోన్ మ్రోగుతుంటే కళ్ళు తెరిచి ఫోనెత్తాను.

'నేను యదునాధానందను మాట్లాడుతున్నాను. ఇప్పుడే చెన్నైలో క్షేమంగా దిగాను. మీతో గడిపిన రోజంతా ఎంతో ఆనందంగా గడిచింది. రాత్రంతా నిద్రలేదు.సీట్లో కూచుని శ్రీరామకృష్ణులను ధ్యానిస్తూనే ఉన్నాను. చాలా బాగుంది. ఎప్పుడో బేలూర్ మఠంలో జరిగిన సంఘటన మీ మాటలతో బయటకు వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. త్వరలో మళ్ళీ కలుద్దాం.' అన్నాడాయన.

'అలాగే స్వామీజీ.త్వరలో చెన్నై వచ్చే పని ఉన్నది. వచ్చినపుడు మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను.' అని ఫోన్ పెట్టేశాను.  

ఉన్నతములైన భావములను నిరంతరం మనస్సులో చింతించేవారిని కలవడం నాకూ ఆనందమేగా మరి !!

(అయిపోయింది)