“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, మే 2011, ఆదివారం

విచిత్ర దినాలు

ఈ రోజు "మదర్స్ డే" అని తెలిసింది. ఈ మధ్యన మన దేశంలోకూడా ఈ దినాల విషసంస్కృతి బాగా పాతుకుపోతున్నది. మీడియా పుణ్యమా అని ఈ విషం త్వరత్వరగా సమాజంలో వ్యాపిస్తున్నది. దీనివెనుక పాశ్చాత్య క్రైస్తవ కుట్ర ఉందేమో అన్న అనుమానంలో నిజం లేకపోలేదు.

అనేక దేశాల సంస్కృతులనూ పండుగలనూ ఆచారాలనూ చాపకింద నీరులా నిర్మూలించడంలో క్రైస్తవానికి అతిగొప్ప పేరుంది. దానిలో భాగమే ఈ దినాల గోల అని నాకు గట్టి సందేహం. మన దేశంలో ముఖ్యమైన అనేక పండుగలు పర్వ దినాలూ మూలపడ్డాయి. కాని పాశ్చాత్య రోగాలైన ఫాదర్స్ డే, మదర్స్ డే, మొ|| మాత్రం మన జీవితాల్లో వేగంగా ప్రవేశిస్తున్నాయి. దాని ఫలితమే ఈరోజున పిల్లలు తల్లులతో ఫోటోలు దిగటం, వాళ్లకు బహుమతులివ్వటం, విషెస్ చెప్పటం. రేపు మళ్ళీ ఇంకో దినానికి రెడీ అవ్వటం. ఏంటో ఈ కాకిగోల?

పాశ్చాత్య దేశాల్లో మాతృత్వానికి విలువ లేదు. వారి దృష్టిలో స్త్రీ ఒక భోగ్య వస్తువు. అంతే. కాని మన ప్రాచీన సంస్కృతి స్త్రీని జగన్మాత ప్రతిరూపంగా తలచింది. మన ఆచారాలలో తల్లికి అత్యున్నతమైన స్థానం ఉన్నది. " తల్లి సంతోషిస్తే సమస్త దేవతలూ సంతోషిస్తారు " లాంటి మహత్తరమైన వాక్యాలు మన వాజ్మయంలో చాలాచోట్ల దర్శనమిస్తాయి.

పాశ్చాత్యులు తల్లిని మదర్స్ డే ఒక్క రోజునే తలచుకుంటారు. అదీ ఒక మొక్కుబడి లాగా మాత్రమే. తరువాత చక్కగా మరచిపోతారు. కాని వేదాలను అనుసరించే మనం ప్రతిరోజూ నాలుగు సంధ్యల్లోనూ క్రమం తప్పక చేసే దైవప్రార్దనలో భాగంగా పితృదేవతలనూ, ముఖ్యంగా తల్లితండ్రులనూ భక్తి పూర్వకంగా స్మరిస్తాము. ఈ దేహాన్ని మనకు ఇచ్చిన దైవాలుగా వారిని భావించి కృతజ్ఞతగా అంజలి ఘటిస్తాము. వారి మాట వేదవాక్కుగా పాటిస్తాము. ఇదీ మనకూ పాశ్చాత్యులకూ మధ్యన గల తేడా.

ఈ రోజు ఉదయం నాకు తెలిసిన ఒక టీనేజి యువకుణ్ణి " నేటి ప్రాముఖ్యత ఏమిటి" అని అడిగాను.

"టుడే ఈస్ మదర్స్ డే" అని ఇంగ్లీషులో చెప్పాడు.

నాకు చాలా బాధనిపించింది.

"ఆది శంకరుల" పేరు విన్నావా? అని అడిగాను.

" విన్నాను " అని కాజువల్ గా జవాబిచ్చాడు.

"ఆయన జన్మించిన మహత్తరమైన రోజు ఈ రోజు." అని చెప్పాను.

నేటి యువతకు మన మహాపురుషుల గురించి తెలీదు. కొందరికి చూచాయగా తెలుసు, కాని వారేమి చెప్పారు? వారి జీవితాలు ఎంత మహత్తరంగా, జాజ్వల్యమానంగా గడిచాయి? అన్న విషయాలు తెలీదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ లేదు. పాశ్చాత్య వ్యామోహాల మత్తులో పడి కొట్టుకుపోతున్నవారికి తమవైన ఉన్నతసంస్కృతీ మూలాలు ఎలా తెలుస్తాయి?


ఆది శంకరుల మహత్తర మేధా శక్తి ఎంతటి గొప్పదో, సూక్ష్మమైనదో తెలుసుకోవాలంటే ఆయన వ్రాసిన భాష్యాలూ గ్రంధాలూ చదవాలి. అప్పుడు గాని ఆయన యొక్క మేధస్సూ ఆత్మశక్తీ మనకు అర్ధం కావు. హిందువులకున్న రుణాల్లో రుషిఋణం ఒకటి. అది తీరాలంటే మన ప్రాచీన గ్రంధాలను చదివి అర్ధం చేసుకుని వారికి అంజలి ఘటించడమే మార్గం. ఆచరణ లో పెట్టడం తరువాత సంగతి, కనీసం వారు చెప్పినది అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం మన జాతిచేసుకున్న దౌర్భాగ్యాల్లో ఒకటి. శంకరుల వంటి మహనీయుడు పాశ్చాత్యదేశాల్లో పుట్టి ఉన్నట్లయితే ఆయన్ను ఒకవిశ్వప్రవక్తగా నిలబెట్టి ప్రపంచమంతా ఆయన భావజాలాన్ని వ్యాపింప చేసి ఉండేవారు. మనమో? మన మధ్యన ఎందరుమహనీయులు పుట్టినా మనకు చీమ కుట్టినట్లు కూడా ఉండదు.

శంకరులు మహా జ్ఞాని అన్నది వాస్తవం. ఆయనది ఉత్త మేధా శక్తి కాదు. ఆధ్యాత్మిక సాధనా, అనుభవ జ్ఞానమూ, గొప్పపాండిత్యమూ ఆయనలో సామరస్య పూర్వకంగా మిలితమైనాయి. ఆయన జ్ఞానే కాని, అంత మాత్రం చేత కర్మనూ, భక్తినీ, యోగాన్నీ , తంత్రాన్నీ నిరసించలేదు. వాటి విలువ వాటికుంది. కాని జ్ఞానం సర్వోత్తమం అనీ, జ్ఞానమే మనిషికళ్ళు తెరిపిస్తుంది అనీ, సత్యాన్ని ముఖాముఖి దర్శింప చేయ గలుగుతుంది అనీ ఆయన చెప్పారు. అది వాస్తవంకూడా. ఆయన వ్రాసిన మహత్తరమైన గ్రంధాలూ, భాష్యాలూ పదహారేళ్ళ వయసులోనే వ్రాసి పూర్తిచేసారన్న సంగతి గుర్తుంచుకుంటే మన కళ్ళు గిర్రున తిరుగుతాయి.

శంకరుల గురించి రాధాకృష్ణన్ పండితుడు ఏమన్నాడో చూద్దామా?

‘The Advaitism of Shankara is a system of great speculative daring and logical subtlety .Its austere intellectualism, its remorseless logic, which marches on indifferent to the hopes and beliefs of man, its relative freedom from theological obsessions, make it a great example of a purely philosophical scheme.

It is impossible to read Shankara’s writings, packed as they are with serious and subtle thinking, without being conscious that one is in contact with a mind of a very fine penetration and profound spirituality. With his acute feeling of the immeasurable world his stirring gaze into the abysmal mysteries of the spirit, his unswerving resolve to say neither more nor less than what could be proved, Shankara stands out as a heroic figure of the first rank in the somewhat motley crowd of the religious thinkers of medieval India ....

అపూర్వ మేధాసంపన్నులనూ మహనీయమూర్తులనూ కులాలకూ మతాలకూ పరిమితం చేసి వాళ్ళు కొందరిమనుషులు, మనకు సంబంధం లేదు, అని అనుకుంటూ వారి భావాలనూ బోధలనూ నిర్లక్ష్యం చెయ్యడం మనభారతీయులకు పట్టిన దురదృష్టం అని నా భావన.

ఆదిశంకరుల వంటి అద్బుతమూర్తిని స్మరిస్తూ, ఆయన వ్రాసిన అనేక మహత్తర గ్రంధాలలో నుంచి కనీసం "వివేక చూడామణి ", "ఆత్మబోధ " వంటి చిన్న చిన్న గ్రందాలనైనా రోజు చదివి ఆయన చెప్పినది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం భారతీయులుగా మన కనీస కర్తవ్యం .