ఏడవ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం ఈనెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు పంచవటి ఆశ్రమప్రాంగణంలో జరిగింది.
ఊకదంపుడు మాటలకు, సోదికబుర్లకు పూర్తివ్యతిరేకదిశలో సాగుతున్న మా నడక, ఉత్త థియరీని వదలిపెట్టి, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో ముందుకు పోతోంది.
అనుకున్నరీతిలోనే సాధనామార్గంలో పురోగమిస్తున్న శిష్యులకు ఆశీస్సులనందిస్తూ, ఉన్నతస్థాయికి చెందిన ఒక ధ్యానవిధానంలో వీరికి దీక్షనిచ్చాను. అందుకున్నవారు అదృష్టవంతులు. వీరిలో ఒక 13 ఏళ్ల చిన్నపిల్ల కూడా ఉన్నది. ఇంత చిన్నవయసులో ఇటువంటి దీక్షను పొందటం ఈమె అదృష్టం. ఏమంటే, అసలైన హిందూమతం ఇదే. అసలైన సనాతన ధర్మమార్గం ఇదే. కోట్లాదిమందికి 83 వచ్చినా ఇది దొరకదు. అలాంటిది 13 ఏళ్ల వయసులో ఇది లభించడం అదృష్టం కాకపోతే మరేమిటి?
నిజానికి, సాధన మొదలుపెట్టవలసింది ఈ వయసులోనే. దైవకటాక్షంతో లభించిన ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోమని వారికి గుర్తుచేస్తున్నాను.
మూడురోజులపాటు బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆశ్రమంలోని ప్రశాంతవాతావరణంలో జీవనసాఫల్యతా సాధనలో సమయాన్ని గడిపిన శిష్యులందరూ తిరిగి వారివారి ఇళ్లకు ఈ రోజు ఉదయానికి చేరుకున్నారు.
తిరిగి డిసెంబర్ లో జరుగబోయే సాధనాసమ్మేళనంలో కలుసుకుందామనిన సంకల్పంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.
మనుషులనేవారు కనిపించడం అరుదైపోయిన ఈ రొచ్చుప్రపంచంలో, కనీసం కొంతమందినైనా నిజమైన మనుషులను తయారు చేయగలుగుతున్నానన్న సంతృప్తిని నాకు మిగిల్చింది.