అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

31, మార్చి 2016, గురువారం

గతజన్మల జాడను నేను...

ఎచటకు పోతున్నావ్ మిత్రమా
ఈ చీకట్లో?
ఎందుకు నిలబడ్డావ్ మిత్రమా
ఈ వాకిట్లో?

సుఖావహ జీవితం
నీకు విసుగ్గా ఉంది కదూ?
భోగమయ ప్రపంచం
నీకు ఎడారిలా ఉంది కదూ?

మనుషుల కపటం నీలో
అసహ్యాన్ని నింపుతోంది కదూ?
మోసపు లోకం నీలో
ఆవేశాన్ని రేపుతోంది కదూ?

తెలియని అసంతృప్తి తప్ప
నీ గమ్యం నీకే తెలియదు
అర్ధంకాని తపన తప్ప
నీ దారే నీకు తెలియదు

నాతో రా
నీకు దారి చూపిస్తా
నా చేయి అందుకో
నిన్ను గమ్యం చేరుస్తా

భయంగా చూడకు నావైపు
నేనెవరనేగా నీ సందేహం?
నువ్విన్నాళ్ళూ వెదుకుతున్నది నా కోసమే
నువ్విన్నాళ్ళూ వేచింది నా కోసమే
ఇప్పుడు స్వయంగా నేనే వచ్చా
తీర్చడానికి నీ దాహం

నువ్వు ఎప్పటినుంచో వెదికే
నీ నేస్తాన్ని నేను
నీకోసం చిరకాలంగా చాచిన
స్నేహహస్తాన్ని నేను

ఇదే దారిలో
నీ ముందు నడచినవాణ్ణి
ఇదే లోకంలో
నీలాగే నలిగినవాణ్ణి
నువ్వు వెదికే
గమ్యం చేరినవాణ్ణి
అయినా సరే
మీకోసం వచ్చినవాణ్ణి

నన్నుగాక ఇంకెవరిని నమ్మగలవు?
ఈ మాయాలోకంలో
నన్ను గాక ఇంకెవరిని అడుగగలవు?
ఆ అవతల ఏముందో?

ఇంతా చేస్తే
నా లాభం ఏంటనేగా నీ సందేహం?
ఇదంతా చూస్తే
నాకేమొస్తుందనేగా నీ అనుమానం?

మీ లాభనష్టాల కోణంలో నన్ను చూడకు
అవి నన్ను తాకలేవు
నీ ఇష్టాఇష్టాల త్రాసులో నన్ను ఉంచకు
అది నన్ను తూచలేదు

నేను నాలో కలసినట్లు
నిన్ను నాలో కలుపుకుంటా
నువ్వు సిద్ధమేనా?

నేను నేనుగా మిగిలినట్లు
నిన్ను నాలా మలుచుకుంటా
నీకిష్టమేనా?

సరిగా చూడు నాలో ఏముందో?

నేను
నువ్వనుకునే నేనును కాను
నేను
నీకు తెలిసిన నేనును కాను

నువ్వు  నన్ను గుర్తిస్తే
నీ గమ్యం నీ ఎదుటే ఉంది
నువ్వు నాతో నడిస్తే
నీ మార్గం నీలోనే ఉంది

నీ గమ్యపు నీడను నేను
నీ మార్గపు తోడును నేను
గతజన్మల జాడను నేను
నీ స్నేహం వీడను నేను

నువ్వు వెదికేది
ఎవరికోసమో తెలుసా?
నా కోసమే
సరిగా చూడు
నువ్వే నేను.....
read more " గతజన్మల జాడను నేను... "

సత్యం - అసత్యం

ఈ మాయాలోకంలో
సత్యాసత్యాల మధ్యగీత
చాలా పలుచన

స్వార్ధంకోసం నీతిని
నిస్సిగ్గుగా వదిలేసే వారికి
సత్యం చాలా చులకన

సత్యమూ అసత్యమే
నమ్మబడదు గనుక
అసత్యమూ సత్యమే
ఉంది గనుక

అసత్యం అందలాలెక్కిస్తే
అంతా సౌఖ్యమే
శాంతి మాత్రం శూన్యం

సత్యం నీలో నిండితే
అంతా ఆనందమే
ఎలా మిగుల్తుంది దైన్యం?

అసత్యం అనుక్షణం మోసగిస్తుంది
కానీ దానిని వదలవు
సత్యం అనుక్షణం హెచ్చరిస్తుంది
కానీ దానిమాట వినవు

సత్యమే అనుకుంటూ
అసత్యాన్ని ఆరాధించడం
అసత్యం అనుకుంటూ
సత్యాన్ని తిరస్కరించడం

ఈ రెండే మానవజాతికి శాపాలు
ఈ రెండే మనుషులు చేసే పాపాలు

ఈ మెలిక అర్ధమైతే
నీ జీవితం ధన్యమే
ఈ తడిక తొలగిపోతే
అన్యం శూన్యమే....
read more " సత్యం - అసత్యం "

30, మార్చి 2016, బుధవారం

గంధర్వ సంగీతం..

నిశీధ నిబిడాంధకార
సముద్రపు లోతుల్లోకి
సడిలేకుండా దిగివచ్చిందొక
సూర్యుని కాంతిపుంజం

యుగాలుగా కదలిక లేని
మరణాల మత్తుల్లోకి
వడిగా అరుదెంచిందొక
అమృత దివ్యధామం

మసిబారిన మస్తిష్కపు
చీకటి గదుల్లోకి
తానై ప్రసరించిందొక
వెలుగుల ప్రవాహం

కర్మరోదనా భరిత
కారడవుల మూలల్లోకి
అడుగు మోపిందొక
ఆనందపు ఆకాశం

కష్టాల కన్నీళ్ళ కట్లను
తుత్తునియలు గావిస్తూ
ఒళ్ళు విరుచుకుందొక
మహిమా విలాసం

మాయా మోహాలనన్నింటినీ
మసిచేసి పారేస్తూ
కళ్ళు తెరిచిందొక
ప్రజ్ఞా ప్రకాశం

అయోమయపు అట్టడుగుల్లో
వియోగాల వింత వీధుల్లో
వినసొంపుగా వినిపించిందొక
గంధర్వ సంగీతం...
read more " గంధర్వ సంగీతం.. "

హృదయపు గడియ

పడమటింట పగటిరేడు
నిదురరాని నిశాదేవి
తెరచుకున్న మది తలుపులు
ముసురుకున్న నీ తలపులు

మొద్దునిద్రలో తాను
నిదురరాని నీ మేను
జాగారపు జాబిల్లి
జిగిబాసిన సిరిమల్లి

నిను మరచిన తన స్వార్ధం
నువు మరచిన పరమార్ధం
హృదయం లేని ఆమె
ఉదయం రాని రేయి

ధనం తనకు సర్వస్వం
ప్రేమ నీకు ప్రియనేస్తం
స్వార్ధపు వలలో తాను
ముగిసిన కలలో నీవు

అహం హద్దులో ఆమె
ఇహం వద్దనే నీవు
నొప్పించడం తనకిష్టం
ఒప్పించడం నీ కష్టం

భానుని కోరే కలువ
ఎరుగదు వెన్నెల విలువ
సత్యం మరచిన చెలియ
బిగిసిన హృదయపు గడియ....
read more " హృదయపు గడియ "

29, మార్చి 2016, మంగళవారం

ఆడదాన్ని నమ్మబోకు నరుడా....(గోసాయి తత్త్వాలు)

గోసాయి పదాలు,బైరాగి చిటికెలు అనే మాటలు ఈ తరానికి తెలియవు.కానీ నా చిన్నప్పుడు ఈ పదాలు తరచుగా వినేవాళ్ళం.పల్లెటూళ్ళలో అడుక్కుంటూ తిరిగే బైరాగుల నోళ్ళలో ఇవి వినబడుతూ ఉండేవి.

నేను హైస్కూలు చదివే రోజుల్లో ఒక బైరాగి ఈ గోసాయి తత్త్వాన్ని పాడుతూ తంబురా మీటుతూ అడుక్కోవడానికి వచ్చేవాడు. అతన్ని వెంటబడి బ్రతిమాలి ఈ తత్త్వాన్ని నా తెలుగు నోట్సులో వ్రాసుకున్నాను.ఆ నోట్సు పోయినా, ఎప్పటికప్పుడు ఎత్తి వ్రాసుకుంటూ ఇన్నేళ్ళ తర్వాత కూడా భద్రంగా దీనిని బ్రతికిస్తూ ఇప్పటిదాకా తెచ్చాను.

పాత కాగితాల త్రవ్వకాలలో బయటపడిన వాటిలో ఇదీ ఒకటి.

చదవండి.
--------------------------
రాగం :-- కదనకుతూహల రాగం
తాళం :-- ఆదితాళం
--------------------------
ఆడదాన్ని నమ్మబోకు నరుడా
అగచాట్లను పొందబోకు నరుడా

అడుసు తొక్కి కడుగనేల గురుడా
అలుపు దెచ్చు పరుగులేల గురుడా               ||ఆడదాన్ని||

నంగనాచి నాటకాలు నరుడా
నమ్మినావ నరకమేర నరుడా                        ||ఆడదాన్ని||

సంసారపు సుద్దులేల గురుడా
సన్యాసం సుఖమిచ్చును గురుడా              ||ఆడదాన్ని||

నమ్మితేను నాంచారిని నరుడా
నెత్తికెక్కి నాట్యమాడు నరుడా                    ||ఆడదాన్ని||

వయ్యారని వెంటబోకు గురుడా
సయ్యాటలు చావుదెచ్చు గురుడా            ||ఆడదాన్ని||

ముండమోపి మోహమేల నరుడా
బండదాని భ్రమల బడకు నరుడా           ||ఆడదాన్ని||

వగలు జూచి వీగిపోకు గురుడా
పగలు రేయి పాడుజేయు గురుడా            ||ఆడదాన్ని||

రంగు జూచి మోసపోకు నరుడా
రక్తమాంస పంజరమ్ము నరుడా                ||ఆడదాన్ని||

ఒంపుసొంపు లంటినంత గురుడా
వైతరణిని దాటలేవు గురుడా                   ||ఆడదాన్ని||

మెరమెచ్చుల బడినావా నరుడా
మరమనిషై పోతావుర నరుడా                 ||ఆడదాన్ని||

కొంగుబట్టి తిరుగబోకు గురుడా
కొండముచ్చు బ్రతుకౌరా గురుడా           ||ఆడదాన్ని||

పడతి మేను పట్టిజూడ నరుడా
చీమునెత్తురుల చెరువే నరుడా              ||ఆడదాన్ని||

శుక్లశోణితాల జూచి గురుడా
శోషదెచ్చు కొబోకుర గురుడా                 ||ఆడదాన్ని||

సిగ్గుబోవు సరసమేల నరుడా
ఒగ్గు వగల జిక్కబోకు నరుడా                ||ఆడదాన్ని||

ఆడదంటె నరకమేర గురుడా
అందులోన సుఖము లేదు గురుడా       ||ఆడదాన్ని||

కోరచూపు కాటుకన్న నరుడా
కోడెత్రాచు కాటుమేలు నరుడా               ||ఆడదాన్ని||

ఆడదాని మాటలెపుడు గురుడా
అబద్దాల మూటలేర గురుడా                 ||ఆడదాన్ని||

ఆడదాన్ని దరిజేర్చకు నరుడా
ఆమడ దూరానబెట్టు నరుడా                ||ఆడదాన్ని||

గొగ్గెర వేషాల నమ్మి గురుడా
గోచిపాత జారనీకు గురుడా                   ||ఆడదాన్ని||

ఓయంటూ సరసమాడ నరుడా
ఓజస్సే క్షీణించును నరుడా                ||ఆడదాన్ని||

పడతి చెంత జేరినావ గురుడా
పనికిరాక పోతావుర గురుడా                 ||ఆడదాన్ని||

ఇచ్చకాల బడినావా నరుడా
ఇహపరముల చెడిపోదువు నరుడా         ||ఆడదాన్ని||

వనితల దూరాననుంచి గురుడా
విష్ణువునే ధ్యానించర గురుడా               ||ఆడదాన్ని||

బైరాగుల మాటలన్ని నరుడా
బంగారపు మూటలేర నరుడా               ||ఆడదాన్ని||

గురుబోధను చక్కగాను నరుడా
గుండెలోన నిలుపుకోర నరుడా            ||ఆడదాన్ని||

ఆడదాన్ని నమ్మబోకు నరుడా
అగచాట్లను పొందబోకు నరుడా
read more " ఆడదాన్ని నమ్మబోకు నరుడా....(గోసాయి తత్త్వాలు) "

28, మార్చి 2016, సోమవారం

స్త్రీ హృదయం

నేను కాలేజీలో చదివే రోజుల్లో నా స్నేహితుడొకడు ఒకమ్మాయిని ప్రేమించాడు.చదువుకునే వయసులో ప్రేమా గీమా ఎందుకురా అని మేమంతా ఎంతో చెప్పాం.కానీ వాడు వినలేదు.ఆ అమ్మాయీ అతన్ని ప్రేమించింది.ఇద్దరూ పెళ్లి చేసుకుందామని కలలు కన్నారు.కలిసి తిరిగారు.ఆ అమ్మాయి దేవత అంటూ మాతో ఎంతో పొంగిపోతూ చెప్పేవాడు.సరే అంతా బానే ఉంది కదా కధ సుఖాంతం అవుతుంది అని అందరం అనుకునేవాళ్ళం.

అలా కొన్నాళ్ళు గడిచాక ఆ అమ్మాయి సడన్ గా ఇతనితో మాట్లాడటం మానేసింది. కారణం తెలీదు.చదువైపోగానే ఇంకొకడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.మావాడు పిచ్చివాడిలాగా అయిపోయాడు.వాడిని మామూలు మనిషిని చెయ్యడానికి మా మిత్రబృందానికి తలప్రాణం తోకకొచ్చింది.కాలక్రమేణా వాడూ రియాలిటీలో కొచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇప్పుడు వాడూ బాగానే సెటిల్ అయ్యాడు.అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాడు కూడా.

అసలు విషయం ఏమంటే - చదువు పూర్తయ్యాక మిత్రులందరూ ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు.వీడికి ఉద్యోగం లేదు.ఎలా సెటిల్ అవుతాడో తెలియదు.అందుకని పెళ్లి దగ్గరకొచ్చేసరికి వీడిని నమ్మలేక,ప్రేమా దోమా అంతా మర్చిపోయి,చక్కగా ఒక బ్యాంకు ఉద్యోగిని చేసుకుని ఆ అమ్మాయి చక్కగా సెటిల్ అయిపొయింది.ఆ తర్వాత వీడికీ మంచి ఉద్యోగమే వచ్చింది.కాకపోతే,డబ్బు దగ్గరకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆ ప్రేమ అంతా ఏమైపోయిందా అనే విషయం మాకిప్పటికీ అర్ధం కాదు.వీడికి ఉద్యోగం వచ్చేదాకా ఒకటి రెండు ఏళ్ళు ఆ అమ్మాయి ఆగలేక పోయింది.

వీడు మాత్రం ఆ నమ్మకద్రోహం తట్టుకోలేక సూయిసైడ్ అటెంప్ట్ కూడా చేసి చావుతప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డాడు.అప్పట్లో,అర్ధరాత్రిపూట అప్పటికప్పుడు వాడిని  ఆస్పత్రిలో చేర్చడమూ,తాగిన పురుగు మందు కక్కించడమూ ఆ డాక్టర్ల చుట్టూ తిరగడమూ మాకందరికీ అదొక మరపురాని ఘట్టం.

ఆడవాళ్ళది చాలా సున్నిత హృదయమనీ,ప్రేమను వాళ్ళు మర్చిపోలేరనీ అందరూ అంటారు గాని అది అబద్దం అని నేను నమ్ముతాను.నిజానికి ప్రేమను మర్చిపోలేక బాధపడేదీ, పిచ్చివాడిలా తిరిగేదీ మగవాడే.ఆడది చాలా తేలికగా ఇవన్నీ మర్చిపోగలదు.చాలా ప్రాక్టికల్ గా ఆలోచించగలదు.తనను అమితంగా ప్రేమించినవాడిని కూడా తన స్వార్ధంకోసం అతి తేలికగా డిస్కార్డ్ చెయ్యగలదు. నిజమైన సెంటిమెంటల్ ఫూల్ ఎవరంటే మగవాడే.

దేవదాసు సినిమా వచ్చింది గాని 'దేవదాసి' అనే సినిమా రాలేదుగా?

ఇదీ, ఆ తర్వాత ఇంకా ఒకటి రెండు ఇలాంటి సంఘటనలూ చూచాక స్త్రీలంటే నాకున్న అంతకు మునుపటి ఉన్నతమైన అభిప్రాయం చాలా మారిపోయింది.స్త్రీలందరూ దేవతలని చాలాకాలం అనుకుంటూ ఉండేవాడిని.కానీ ఆ తర్వాత అది నిజం కాదని అర్ధమైంది.స్త్రీల మొదటి ప్రయారిటీ ప్రేమ కాదనీ సెక్యూరిటీ మాత్రమేననీ అనిపించింది.అప్పటినించీ స్త్రీలను నేనంత త్వరగా నమ్మను.ఆ తర్వాత నుంచీ నాకెదురైన స్త్రీలను ఈ కోణంలో చాలా పరిశీలించాను.సోషల్ సెక్యూరిటీ - ప్రేమ ఈ రెంటిలో పోటీ వస్తే ప్రేమను కోరుకునే స్త్రీ నాకింతవరకూ తారసపడలేదు.బహుశా నా ఆలోచన తప్పు కావచ్చు.కానీ నాకు అలాంటి ఆదర్శప్రాయులైన స్త్రీలు మాత్రం ఇప్పటిదాకా కనిపించలేదు.


స్త్రీలు చాలా తేలికగా నమ్మకద్రోహం చెయ్యగలరు.కానీ ఎల్లప్పుడూ మగవాడినే దుర్మార్గుడని నిందిస్తారు.

అప్పట్లో ఈ తతంగం అంతా చూచి వ్రాసుకున్న కవిత ఒకటి పాత కాయితాల త్రవ్వకాలలో బయట పడింది.

చదవండి.
---------------------------------------
స్త్రీ హృదయం స్వార్ధమయం
నాటకాల రంగస్థలం
ప్రేమకచట లేదు స్థానం
ప్రేమించినవాడికి - మహాప్రస్థానం

నాటకాల నిలయమైన
వనిత నెపుడు నమ్మరాదు
పెదవులపై ప్రియలాస్యం
మనసులోన మహావిషం

ఆడదాన్ని నమ్మినోడు
అస్సలెపుడు బాగుపడడు
మనసు లేని స్త్రీకంటే
గుండె లేని బండ మేలు

ప్రేమన్నది స్త్రీకెపుడూ
ఒక సరదా ఆట
అప్పుడపుడు వాడుకునే
పనికిరాని పైట

స్త్రీ హృదయం ప్రేమమయం
అన్న కవులు పిచ్చివాళ్ళు
అది మొత్తం స్వార్ధమయం
అక్కడుంది మురుగునీళ్ళు

స్వార్ధం తన పరమార్ధం
సర్వం రెండో పురుషార్ధం
మాటలు చేతలు అన్నీ
ఆ క్షణపు అవసరార్ధం

శాంతిని కోరే మనిషి
స్త్రీ స్నేహం చెయ్యరాదు
ఆడదాని సహవాసం
అనర్ధాల ఆవాసం

బండరాయి నర్చిస్తే
నీకు బ్రతుకు నిస్తుంది
ఆడదాన్ని ప్రేమిస్తే
నిన్నంతం చేస్తుంది

మంటల్లో దూకబోయే మిడత
మగవాడే
ఎంతగా ప్రేమించినా వాడు
పగవాడే
read more " స్త్రీ హృదయం "

23, మార్చి 2016, బుధవారం

బ్రసెల్స్ దుర్ఘటన - పౌర్ణమి ప్రభావం

రాహు కేతువులు రాశులు మారినప్పుడు వ్రాస్తూ --

తీవ్రవాద చర్యలు పెరుగుతాయనీ దానివల్ల దేశాల మధ్యన యుద్ధ వాతావరణం వస్తుందనీ వ్రాశాను.అది అక్షరాలా నిజం అవుతూ ఉండటం ఇప్పుడు చూడవచ్చు.

అంతేగాక అమావాస్య పౌర్ణములకున్న ప్రభావాల గురించీ యాక్సిడెంట్లు ఇతర దుర్ఘటనలు కల్పించగల వాటి శక్తిని గురించీ ఇంతకు పూర్వం చాలాసార్లు ఉదాహరణలతో సహా వ్రాసి ఉన్నాను.

మనుషుల మీద ఉన్న గ్రహప్రభావానికి ఇప్పుడు జరిగిన బ్రసెల్స్ సంఘటన మళ్ళీ ఒక ఉదాహరణ.

ఈ సంఘటన ఖచ్చితంగా పౌర్ణమి ఘడియలలో జరిగింది.ఎప్పుడో ఒకసారి జరిగితే అది కాకతాళీయంలే అనుకోవచ్చు.కానీ మళ్ళీ మళ్ళీ అవే అవే సంఘటనలు అవే అవే సమయాలలో రిపీట్ అవుతుంటే దానర్ధం ఏమిటి? అందులో ఏదో మర్మం ఉన్నట్లేగా? మనకు అర్ధం కాని ప్రకృతి నియమాలు అక్కడ ఉన్నట్లే కదా?

నిన్నటి కుండలి గమనిస్తే --

బుధుడు నీచస్థితిలో అస్తంగతుడై ఉండి కుట్రలనూ కుతంత్రాలనూ సూచిస్తున్నాడు.శుక్రుడు కేతువుతో కలసి ముస్లింల రహస్య ఉగ్రవాదాన్ని సూచిస్తున్నాడు.శని కుజుల కలయిక దుర్ఘటనను స్పష్టంగా సూచిస్తున్నది.గురు చంద్ర రాహువుల కలయిక మతపరమైన ఉగ్రవాదానికి సూచికగా ఉన్నది.వెరసి బ్రసెల్స్ లో ఇస్లామిక్ స్టేట్ దుర్మార్గుల ఘాతుకం జరిగింది.

మీలో ఎవరైనా గమనించారో లేదో?

గత మూడు రోజులుగా ఎక్కడ చూచినా చిన్నా పెద్దా యాక్సిడెంట్లూ,దెబ్బలు తగలడమూ జరుగుతున్నాయి. చాలాచోట్ల ప్రమాదాలలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఖచ్చితంగా ఈరోజున మనం పౌర్ణమి ప్రభావంలో ఉన్నాం.

కర్మ సత్యం.
జ్యోతిష్యం సత్యం.
మనుషుల మీద గ్రహప్రభావం సత్యం.
ప్రకృతి ముందు మనిషి అల్పత్వం సత్యం.
సృష్టిని మనిషి నాశనం చేసుకోవడం సత్యం.
దురాశతో తన మూలాన్ని తనే నరుక్కోవడం సత్యం.
సమాజాన్ని చేతులారా పాడుచేసుకోవడం సత్యం.
చివరికి అంతా సర్వనాశనం కావడం సత్యం.

మనుషుల మీద గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనదానికి ఇంకా రుజువులు కావాలా?
read more " బ్రసెల్స్ దుర్ఘటన - పౌర్ణమి ప్రభావం "

ప్రభూ నాకు విముక్తిని ప్రసాదించు...

ప్రభూ నాకు విముక్తిని ప్రసాదించు

పాండిత్యపు ప్రగల్భాల నుంచి
చాదస్తపు చండాలం నుంచి
దళారుల డాబుల నుంచి
పూజారుల జేబుల నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

వాచావైదుష్యం నుంచి
క్రియాకలాపం నుంచి
అహంకారపు ఆర్భాటం నుంచి
అసూయా ద్వేషాల అడుసులనుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

నమ్మలేని నీచత్వం నుంచి
నడవలేని నీరసం నుంచి
మార్పురాని మనసు నుంచి
కట్టివేసే కర్మ నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

అలుపులేని అలవాట్ల నుంచి
అంతమవని అగచాట్ల నుంచి
అన్నీ తెలుసనే అజ్ఞానం నుంచి
అక్కరకు రాని అహంకారం నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

లోకవ్యామోహ లౌల్యం నుంచి
దయాహీన క్రౌర్యం నుంచి
ఇంద్రియదాస్య జాలం నుంచి
కట్లు వదలని కాలం నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

విన్నా వినలేని అజ్ఞానం నుంచి
చూచినా నమ్మలేని దౌర్భాగ్యం నుంచి
ఇచ్చినా అందుకోలేని బలహీనత నుంచి
చచ్చినా మారలేని నిస్సహాయత నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

ఇతరులను నిందించే అల్పత్వం నుంచి
సుతరామూ నేర్చుకోని శూన్యత్వం నుంచి
మంకుతనం వదల్లేని మూర్ఖత్వం నుంచి  
అడుగు ముందుకెయ్యలేని అజ్ఞానం నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

నేను సృష్టించుకున్న బంధాలనుంచి
నన్ను నేనే కట్టుకున్న పాశాలనుంచి
అతితెలివితో వేసే వేషాలనుంచి
ముందుకు నడవనీని మోహాలనుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

కాటేసే కపటం నుంచీ
మాటేసే మోసం నుంచీ
పోటెత్తే వాంఛలనుంచీ
ఆటాడే ఆశలనుంచీ
నాకు విముక్తిని ప్రసాదించు

గర్వాహంకారాల చీకటి గుహలనుంచి
గమ్యం లేకుండా తిరిగే పయనాలనుంచి
నువ్వెన్నిసార్లు చెప్పినా వినలేని అశక్తతనుంచి
చెయ్యి పట్టి నడిపినా నడవలేని అసమర్ధత నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

నన్ను గెలవలేని నానుంచి
నన్ను మార్చుకోలేని నానుంచి
నన్ను దాటి ఎగరలేని నానుంచి
నన్ను మరచి నిన్ను చేరలేని నానుంచి
నాకు విముక్తిని ప్రసాదించు....
read more " ప్రభూ నాకు విముక్తిని ప్రసాదించు... "

21, మార్చి 2016, సోమవారం

హోమియో అద్భుతాలు - అయిదు నిముషాల్లో మాయమైన మైగ్రెయిన్

హోమియోపతి అంటే అది చాలా నిదానంగా పని చేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.నేను వాళ్ళతో వాదించను. అది అబద్దం అని ప్రాక్టికల్ గా చూపిస్తాను.

మొన్నొక రోజున కొంతమంది నాతో ఏదో జ్యోతిష్యపరమైన పని ఉండి వచ్చారు.వాళ్ళతో మాటల సందర్భంలో - వాళ్ళు ఇదే మాట అన్నారు.నేను నవ్వి ఊరుకున్నాను.

చాలామంది ఇంతే.వాళ్ళొచ్చిన పని చూసుకుని పోకుండా ఏదేదో అనవసరమైన సోది మొదలు పెడతారు.నాకు మహా విసుగు పుడుతుంది.

హోమియో స్లోగా పనిచేసే సంగతి నిజమా కాదా అని వాళ్ళలో ఒకాయన అడిగాడు.

దానికీ నేనేమీ జవాబు చెప్పలేదు.ఈ మధ్యలో నేను ఎవ్వరితోటీ వాదించడం లేదు.సత్యం నాకు తెలుసు ఒకరికి నిరూపించ వలసిన పని లేదు.ఎవరికి ఆ సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉన్నదో వారే నా దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు.మిగతా వాళ్ళు రాలేరు.ఈ విషయం స్పష్టంగా అర్ధమయ్యాక నేను ఇతరులతో వాదించడం ఒకరిని ఒప్పించాలని ప్రయత్నించడం పూర్తిగా మానేశాను.ఎదుటి వ్యక్తులు నాతో వాదన పెట్టుకోవాలని చూస్తే సింపుల్ గా నవ్వేసి ఊరుకుంటాను.ఒంటి చేత్తో వాళ్ళు మాత్రం ఎంతసేపు చప్పట్లు కొట్టగలరు? విసుగు పుట్టి వాళ్ళూ ఊరుకుంటారు.

ఈ సంభాషణ సాగుతూ ఉండగా మా క్రింద ఇంట్లో పనిచేసే ఒక పాతికేళ్ళ అమ్మాయి మా ఇంటికి వచ్చింది.ఆ అమ్మాయి ముఖం చూస్తే నిస్తేజంగా ఏదో బాధపడుతూ ఉన్నట్లు చాలా డల్ గా కనిపించింది.

'ఏంటి అలా ఉన్నావు?' అని అడిగాను.

'వారం నుంచీ తలనొప్పి వస్తున్నది.తగ్గడం లేదు.ఇంతకు ముందు ఒకసారి జ్వరం వస్తే మీరు మందిచ్చారు.వెంటనే తగ్గింది.అందుకని తలనొప్పికి కూడా మందు కోసం మీ దగ్గరకు వచ్చాను.' అంది నీరసంగా కూలబడుతూ.

'మరి తలనొప్పికి ఏం చేశావు?' అడిగాను.

'ఆస్పత్రికి పోతే ఎక్స్ రే తియ్యమన్నారు.తీశాము.అందులో ఏమీ లేదని ఈసారి స్కానింగ్ చేయించమన్నారు.మా దగ్గర అంత డబ్బులు లేవు.అందుకని ఏదైతే అదౌతుందని ఊరుకున్నాము. ఈ నొప్పి మాత్రం తగ్గడం లేదు.' అన్నది ఏడుపు మొహంతో.

ఇలాంటి సన్నివేశాలు ఎదురుకావడం నాకు చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది.అప్పటిదాకా నాతో హోమియోపతి గురించి వాదిస్తున్న వాళ్లకు నిదర్శనం చూపడం కోసమే ఈ సన్నివేశం సృష్టింప బడిందని నాకర్ధమైంది.

అమ్మ ఇలాంటి సన్నివేశాలు నా చుట్టూ చాలా సృష్టిస్తూ ఉంటుంది.ఆమెకు అదొక ఆట.

'నీ తలనొప్పి ఎలా ఉంటుందో కాస్త వివరించు' అన్నాను.

'మొత్తం కుడివైపే వస్తుంది.అది ఎక్కువైనప్పుడు విపరీతమైన నీరసంగా ఉంటుంది.' అన్నది.

'తలమొత్తం ఉంటుందా? లేక ఏదైనా ఒక్కచోటేనా ? అడిగాను.

'కుడివైపే మొత్తం ఉంటుంది.ఒక వారం నుంచి ఎక్కువగా ఉంటున్నది.ఒంట్లో రక్తం కూడా ఉండవలసినంత లేదన్నారు.' అన్నది.

'ఏం చేస్తే ఎక్కువౌతుంది? ఏం చేస్తే తగ్గుతుంది?' అడిగాను.

'ఏమో అవన్నీ నాకు తెలీవు.కానీ ఒక్కటి చెప్పగలను.తల ముందుకు వంచినప్పుడు బాగా ఎక్కువౌతుంది.నిటారుగా కూచుంటే కాస్త మామూలుగా ఉంటుంది.' అన్నది.

ఒక వారం నుంచీ గుంటూరులో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల వల్ల చాలామంది రకరకాల బాధలతో అడ్డం పడుతూ ఉన్నారు. డాక్టర్లేమో బీదా బిక్కీ అని కూడా చూడకుండా స్కానింగులూ ఇంకా ఏవేవో టెస్టులూ వ్రాసి వాళ్ళను హింస పెడుతున్నారు.

తలలో ఏవైనా గడ్డలు ఉంటేనే స్కానింగ్ అవసరం అవుతుంది. కానీ అలా ఉన్నప్పుడు ఉండే లక్షణాలు వేరే ఉంటాయి.అవి ఈ అమ్మాయిలో లేనప్పుడు స్కానింగ్ ఎందుకో నాకైతే అర్ధం కాలేదు.బహుశా ఇవన్నీ వాళ్ళు కొన్న ఎక్విప్ మెంట్ డబ్బులు త్వరగా రాబట్టుకోడానికి చేసే జిమ్మిక్కులై ఉంటాయి.

ఆ అమ్మాయిని అడిగి ఆ తలనొప్పి గురించి ఇంకొన్ని లక్షణాలు సేకరించి 'శాంగ్వినేరియా-200' అనే మందు రెండు గుళికలు ఇచ్చి చప్పరించమన్నాను.ఆ తర్వాత ఒక గుక్క నీళ్ళు త్రాగమని చెప్పాను.ఒక్క పది నిముషాలు కూచోమని ఆ అమ్మాయికి చెప్పాను.

ఇదంతా ఆ వచ్చిన వాళ్ళు గమనిస్తూ ఉన్నారు.

ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఒక పది నిముషాలు గడిచాయి.

'తలనొప్పి పూర్తిగా మాయమైంది సార్.ఒంట్లో నీరసం కూడా తగ్గింది.నేను వెళతాను' అంటూ ఆ అమ్మాయి లేచింది.

ఆమె వైపు చూశాను.

ముఖం తేటగా మారింది.వచ్చినపుడు ఉన్న అలసట ఇప్పుడు తన ముఖంలో లేదు.స్వరంలో కూడా మార్పు వచ్చింది.

'పూర్తిగా తగ్గిందా? కొంచం ఉందా ఇంకా?' అడిగాను.

'పిసరంత కూడా లేదు.మొత్తం మాయమై పోయింది.వెళతాను సార్,పనికి పోవాలి.చేసుకుంటే గాని మాకు తిండి గడవదు.' అంది తను.

'సరే.వెళ్ళు.మళ్ళీ తలనొప్పి వస్తే రా.అంతేగాని ఆ ఇంగ్లీషు వైద్యానికి వెళ్ళకు.' అని చెప్పాను.

సరే నని నమస్కారం పెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.

'మీ కళ్ళతో మీరే చూచారుగా? ఇప్పుడేమంటారు?' అడిగాను అప్పటి వరకూ హోమియో స్లోగా పనిచేస్తుంది అని వాదిస్తున్న వారిని.

వాళ్ళు ఇదంతా నమ్మలేక పోతున్నట్లు నాకు అనిపించింది.ఆ అమ్మాయిని నేనే పిలిపించి వాళ్ళను నమ్మించడానికి అలా యాక్షన్ చెయ్యమని చెప్పానేమో అని వాళ్ళ అనుమానం.

ఆ విషయం వాళ్ళ మొహాలు చూస్తే నాకర్ధమైంది.

వాళ్ళ కళ్ళెదురుగా కనిపించిన ఈ నిజం గురించి ఇంకా మాట్లాడి వాళ్ళను ఒప్పించాలని నేనేమీ ప్రయత్నించలేదు.సత్యాన్ని గ్రహిస్తే వాళ్ళ అదృష్టం, లేకపోతే వాళ్ళ ఖర్మ. అంతే. కళ్ళెదురుగా కన్పిస్తున్నా కూడా నమ్మకపోతే మనమేం చెయ్యగలం?

సరియైన హోమియో ఔషధం పడితే నిముషాలు కూడా అక్కర్లేదు.సెకండ్లలో నొప్పులూ జ్వరాలూ ఆయాసాలూ తగ్గడం నేనెన్నో సార్లు కళ్ళారా చూశాను.అయితే చెబితే వీటిని ఎవరూ నమ్మరు.ఏదైనా అనుభవం మీదే అర్ధమౌతుంది కదా మరి.

జనంలో ఎన్నో మూఢనమ్మకాలుంటాయి.సత్యాన్ని కూడా నమ్మకపోవడమూ, దానినే మూఢనమ్మకం అనుకోవడమే ఒక పెద్ద మూఢనమ్మకం.

మేము చదువుకున్న వాళ్ళం మాకంతా తెలుసు అని గర్వంతో విర్రవీగే వాళ్ళకు సత్యం అందదు.అమాయకంగా నమ్మేవాళ్ళ చెంతనే అది ఎప్పుడూ ఉంటుంది.

కర్మ నెత్తిన కూచుని ఆడిస్తున్నపుడు మంచి చెప్పినా అర్ధం కాదుకదా. అదంతే.
read more " హోమియో అద్భుతాలు - అయిదు నిముషాల్లో మాయమైన మైగ్రెయిన్ "

లక్ష్మణరేఖ

లక్ష్మణ రేఖ దాటాకే
నేనెవరో నాకు తెలిసింది
విలక్షణ పధంలో నడిచాకే
నేనేంటో నాకర్ధమైంది

ఇన్నాళ్ళూ
రావణుడు పూర్తిగా చెడ్డవాడని భ్రమపడ్డాను
రాముడు పూర్తిగా మంచివాడని అపోహ పడ్డాను
రెండూ అసత్యాలే అని ఇప్పుడర్ధమైంది

లక్ష్మణ రేఖ దాటాకే
నాలోని రాముడు అర్ధమయ్యాడు
నాలోని రావణుడూ దగ్గరయ్యాడు
ఇద్దరికీ పైనున్న ఆత్మారాముడూ అగుపించాడు

ఇన్నాళ్ళూ నేనొక శీలవతి ననుకున్నాను
ఇన్నాళ్ళూ నేనొక పతివ్రత ననుకున్నాను
అసలా మాటలకు అర్ధమే లేదని
ఇప్పుడే నాకర్ధమైంది

నా శీలమంతా నా అహమనీ
నా పాతివ్రత్యమంతా నా భయమనీ
నా ఛాందసమంతా నా బద్ధకమనీ
నా ధార్మికమంతా అధర్మమేననీ ఇప్పుడే నాకర్ధమైంది

లక్ష్మణ రేఖ దాటాకే
రాజభవనమూ అడవీ ఒకటేననీ
పతివ్రతా పతితా ఒక్కటే అనీ
రాముడూ రావణుడూ ఒక్కరే అనీ తెలిసింది

నా చుట్టూ నేను కట్టుకున్న
నాలుగు గోడలు కూలిపోయాకే
ప్రపంచపు విశాలత్వం గోచరించింది

నా మనసుకు నేనల్లుకున్న
సాలెగూడు చెరిగిపోయాకే
ఆ అవతల ఉన్నదేదో అర్ధమయ్యింది

ప్రస్తుతం
నేను రాముడి దగ్గరే ఉండి
రావణుడి ప్రేమలో పడ్డాను
రావణుడితో నా అంతట నేనే వెళ్లి
రాముడి ప్రేమలో మునిగిపోతున్నాను

రాముడిలో రావణుడినీ
రావణుడిలో రాముడినీ స్పష్టంగా చూస్తున్నాను
ఇద్దరినీ మించిన ఆత్మారాముడిలో
భేదం లేనంతగా ఐక్యమయ్యాను 

లక్ష్మణ రేఖ బయట లేదు
నాలోనే ఉంది
రాముడూ రావణుడూ బయట లేరు
నాలోనే ఉన్నారు
అసలు నేనే పెద్ద లక్ష్మణ రేఖను

లక్ష్మణ రేఖకు
అటు చూస్తే రావణుడు
ఇటు చూస్తే రాముడు
ఎటూ చూడకుంటే ఆత్మారాముడు
అందరూ నాలోనే ఉన్నారు

అసలు నిజం చెప్పనా?

రాముడూ రావణుడూ లక్ష్మణరేఖా నేనూ
నలుగురమూ ఒక్కరమే అన్న సత్యం
ఇప్పుడే నాకర్ధమైంది
నేననే లక్ష్మణరేఖ దాటాకే ఈ నిజం నాకు తెలిసింది

ఇప్పుడు నేను రావణుడి లంకలో ఉండి
అయోధ్యను పాలిస్తాను
రామరాజ్యంలో ఉంటూ
లంకలో వేదాలు చదివిస్తాను

కైకకూ కౌసల్యకూ ఒకే సత్కారం చేయిస్తాను
మంధరకూ త్రిజటకూ ఒకే బహుమానం ఇస్తాను
శూర్పణఖను నేనే పెళ్ళాడి
రామలక్ష్మణులను దాని బారినుంచి రక్షిస్తాను 

హనుమంతుడిని రాముడి వద్దకే
రాయబారం పంపిస్తాను
విభీషణుడి నోరుమూయించి
రావణుడికే దాసోహం అనిపిస్తాను

మేఘనాధుడి చేత యుద్ధాలు ఆపించి
అతడూ ఇంద్రుడూ ఒక్కరే అని తెలియపరుస్తాను
కుంభకర్ణుడిని నిద్రలోనే సమాధిస్థితికి చేరుస్తాను
మండోదరిని నాతోనే ఎల్లకాలం ఉండిపొమ్మంటాను

లంక నుంచి అయోధ్యకు
కనిపించని వారధి కట్టిస్తాను
నా ఇష్టం వచ్చినన్ని సార్లు అటూ ఇటూ
రాకపోకలు సాగిస్తాను

వానర సైన్యంతో రాక్షసులకు
పెళ్లి సంబంధాలు కుదురుస్తాను
ఇద్దరికీ ఒకే బంతిలో
భోజనాలు పెట్టిస్తాను

లంకలోనూ అయోధ్యలోనూ
నిరంతరం ఆటపాటలూ
ఆగిపోని విందువినోదాలూ
నడిపిస్తాను

ఎందుకంటే ...

లంకా అయోధ్యా ఒక్కటేననీ
రాముడూ రావణుడూ ఒక్కరేననీ
రాజభవనమూ అడవీ ఒక్కటే అనీ
జీవనమూ మరణమూ ఒక్కటే అనీ
ఇప్పుడే నాకర్ధమైంది

లక్ష్మణ రేఖ దాటాకే
నేనెవరో నాకు తెలిసింది
విలక్షణ పధంలో నడిచాకే
నేనేంటో నాకర్ధమైంది....
read more " లక్ష్మణరేఖ "

9, మార్చి 2016, బుధవారం

నమో అస్తు నీలగ్రీవాయ...

తిధుల ప్రకారం 10-3-2016  శ్రీ రామకృష్ణుల జన్మదినం.

శ్రీరామకృష్ణుల రూపంలో శరీరంతో అవతరించినది భగవంతుడే అని లక్షలాది ఆయన భక్తుల విశ్వాసం.ఇది ఉత్త విశ్వాసం మాత్రమే కాదు సత్యం కూడా. ఆయన కూడా తన అంతరంగ భక్తులకు ఈ విషయమే చాలాసార్లు చెప్పారు. చెప్పడమే గాక వారికి ఆయా దేవతల రూపంలో ప్రత్యక్ష దర్శనాలు కూడా ఇచ్చారు.అలాంటి ప్రత్యక్ష నిదర్శనాలు చూచారు గనుకనే వివేకానందాది మహనీయులు ఆయన్ను అవతార మూర్తిగా కొనియాడారు.

"నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అధో యే అస్య సత్వానోzహం తేభ్యోzకరం నమ:"

రుద్రం లోనుంచి ఈ మంత్రాన్ని గానీ, లేదా

"నమో నీలగ్రీవాయ శితికంఠాయ చ"

అన్న మంత్రాన్ని గానీ విన్నపుడు నాకు శ్రీ రామకృష్ణుల రూపమే స్మృతిపధంలో తళుక్కుమని మెరుస్తుంది.

"నమో అస్తు నీలగ్రీవాయ"- అనే మంత్రానికి అర్ధం ఇది.

'కాలకూట విషాన్ని గొంతులో ధరించడం వల్ల నీలకంఠుడని పేరు కలిగిన వాడును,వేయి కన్నులు కలిగిన వాడును (భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో సమస్త లోకాలలో జరుగుతున్న వాటిని చూడగలవాడును),వర్షధారలచేత లోకాన్ని తడిపే వాడును(తన అనుగ్రహవర్షం చేత భక్తులకు జ్ఞానోదయాన్ని కలిగించగల వాడును),అయిన రుద్రునకు నమస్కారము. మరియు ఆ రుద్రుని ఆశ్రయించి ఉన్నట్టి మహనీయులైన ఆయన యొక్క ప్రమధగణములకు నమస్కారము'.

అనేది ఈ మంత్రార్ధం.

పరమేశ్వరుడు నీలకంఠుడెలా అయ్యాడు?

జగత్తును కబళించబోతున్న కాలకూట విషాన్ని మ్రింగి జగత్తులను వినాశనం నుంచి కాపాడినది పరమేశ్వరుడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది.అదే విధంగా, ప్రపంచాన్ని నాశనం చెయ్యబోతున్న భయంకరమైన సామూహిక పాపఖర్మను (global sinful karma) మ్రింగి తన గొంతులో దానిని వ్యాధిరూపంలో ధరించి భరించడం ద్వారా జగత్తును రక్షించినది శ్రీరామకృష్ణుడు.

శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు.

'ఈ శరీరం పుట్టినప్పటి నుంచీ పాపమనేది ఎరుగదు.కలలో కూడా ఇది ఒక్కసారి కూడా అబద్దం అనేది చెప్పి ఉండలేదు. మరి ఈ శరీరానికి ఇలాంటి వ్యాధి(గొంతు కేన్సర్) ఏమిటి? లోకరక్షణార్ధమే ఈ శరీరానికి ఈ వ్యాధి కలిగింది.'

వందల వేల సంవత్సరాలుగా ప్రపంచంలో లోకులు చేస్తున్న అనేక రకాలైన పాపాలు భూమి చుట్టూ ఆవరించిన భయంకరమైన కల్మషపు విషంలా తయారై, ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఉపద్రవంగా మారి ఉన్న సమయంలో ఈభూమి మీద శ్రీ రామకృష్ణుల అవతరణం జరిగింది.

ఆ పాపం మొత్తాన్నీ ఆయన తన శరీరం మీదకు స్వీకరించి దానిని మ్రింగి లోకాన్ని రక్షించాడు.ఈ విషయం మామూలు మనుషులకు తెలియదు.భగవంతుని అనుగ్రహంతో దివ్యదృష్టి కలిగిన యోగీశ్వరులు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించగలరు.

శ్రీ రామకృష్ణులకు పాపం అనేది తెలియదు.ఏభై ఏళ్ళ తన జీవితంలో ఒక్క అబద్దం కూడా ఆయన చెప్పలేదంటే ఇంక మిగతా పాపాల సంగతి ఊహించనే అక్కర్లేదు.అంతటి పవిత్రమూర్తి ఆయన.

మరి అంతటి పవిత్ర దేహానికి గొంతు కేన్సర్ రావడం ఏమిటి?

కర్మకు బద్ధుడైన మామూలు మనిషనేవాడు తను చేసిన పాపాన్ని తానే అనుభవిస్తాడు.కానీ మనుషులందరూ చేసిన పాపాన్ని మోసేవాడు, మొయ్యగలవాడూ,కర్మాతీతుడైన ఒక్క భగవంతుడు మాత్రమే.

మానవాళి చేసిన పాపాన్ని ఒక్క భగవంతుడు మాత్రమే ప్రక్షాళన చెయ్యగలడు.ఆపని మహనీయుల వల్లా ఋషుల వల్లా యోగుల వల్లా కూడా కాదు.వారంతటి సమర్ధులు కారు.తమను ఆశ్రయించిన ఒక్కరిదో ఇద్దరిదో కర్మను వాళ్ళు మొయ్యగలరు. అంతేగాని, సృష్టిలోని పాపాన్ని మొత్తాన్నీ మొయ్యగల సమర్ధత వారికి ఉండదు.ఒక్క భగవంతుని అవతారం మాత్రమే ఆ పనిని చెయ్యగల శక్తిని కలిగి ఉంటుంది.

ఆయన కూడా ఏదో మంత్రం వేసినట్లు ఆ పాపాన్ని మొత్తాన్నీ ఒక్క క్షణంలో మాయం చెయ్యడు.దానిని తాను అనుభవించడం ద్వారా మాత్రమే ఆయన దానిని కబళిస్తాడు. అదే మానవాళి పట్ల దైవానికున్న కరుణకు సంకేతం.

పాపానికి శిక్ష అనేది ఎవరికైనా సరే తప్పదు.ఈరోజు కాకపోతే రేపు అంతేగాని శిక్ష మాత్రం తప్పదు.కనుకనే దైవం అయినా కూడా, ఆ పాపాన్ని తాను మోసి లోకులకు విముక్తి కలిగిస్తాడే గాని, అమాంతం ఏదో మాయ చేసినట్లుగా ఆ పాపాన్ని మాయం చెయ్యడు.ఎందుకంటే - సృష్టిలో తాను పెట్టిన రూల్ ను తాను కూడా ధిక్కరించడు గనుక.

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇలా అంటారు.

"నియమాన్ని పెట్టినవాడు కూడా ఆ నియమానికి బద్ధుడే".

తనకు లాభం లేకపోతే పక్కమనిషితో మాట్లాడటానికి కూడా ఇష్టపడని స్వార్ధపరులున్న ఈ లోకంలో, ఉత్తపుణ్యానికి లోకుల పాపఖర్మాన్ని మొయ్యడానికి ఎవరు ముందుకొస్తారు?ఒక్క దేవుడే ఆపని చేస్తాడు. చెయ్యగలడు కూడా.

ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి.ఈ సృష్టి అంతా ఆయనదే కాబట్టి.

లోకులు ప్రేమ గురించి ఎంతో మాట్లాడతారు.కానీ నిజమైన ప్రేమ అంటే ఏమిటో అదెలా ఉంటుందో వారు ఊహించలేరు. అది వారి ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉంటుంది.

ఎవరో తనకు సంబంధం లేని మనుషులు చేసిన పాపాలకు స్వచ్చందంగా తను బలి కావడమే ప్రేమకు గల ఏకైకలక్షణం. ఇతరుల పాపాల ప్రక్షాళన కోసం తన శరీరాన్ని సమిధలా అర్పించడమే అత్యున్నతమైన ప్రేమతత్త్వం.దీని స్థాయిని స్వార్ధపరులైన మామూలు మనుషులు కలలో కూడా ఊహించలేరు.

లోకుల పాపాన్ని ప్రతితరంలోనూ ఉన్న మహనీయులు ఎప్పుడూ కడుగుతూనే ఉంటారు.కానీ వారి శక్తి కూడా మించిపోయినంత పాపం లోకంలో పోగు పడినప్పుడు సాక్షాత్తూ భగవంతుడే దిగిరావలసి వస్తుంది. ఎందుకంటే - మహనీయుల వలన కడగబడటానికి కూడా సాధ్యం కానంత పాపం లోకంలో పోగుపడి ఉంటుంది గనుక. 

పరమేశ్వరుని మనం చూడలేదు.కానీ శ్రీ రామకృష్ణులు నిన్న మొన్నటి వారే.ఆయన సాక్షాత్తూ పరమేశ్వరుడే.తానే శివునిగా తానే కాళికగా రాణీ రాసమణి అల్లుడైన మధురబాబుకు ఆయన ఒక సందర్భంలో దర్శనం ఇచ్చారు.

లోకంలోని పాపాన్ని మొత్తాన్నీ ఆయన అమాంతం మ్రింగాడు కనుకనే 1836 వ సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు,అనేక సైన్సు ఆవిష్కరణలు సంభవించి జనజీవితం అనేక రకాలుగా ఉన్నతంగా మారింది.అంతేకాదు అప్పటి వరకూ లోకంలో ఉన్న చీకటి అంతరించి ఆధ్యాత్మికంగా అమితమైన వెలుగు అప్పటినుంచే లోకానికి వచ్చింది. అనేకమంది మహనీయులు పుట్టడం కూడా ఆ తర్వాతనే జరిగింది.ఇదంతా శ్రీరామకృష్ణుల అవతరణ ఫలితమే.

అందుకే ఈ రుద్రమంత్రాలను విన్నప్పుడల్లా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న శ్రీరామకృష్ణుల దివ్యరూపమే నా మనోనేత్రం ఎదుట సాక్షాత్కరిస్తుంది.

మామూలు మనిషి ఋణమే చాలాసార్లు మనం తీర్చుకోలేం. ఇంక భగవంతుని అనుగ్రహాన్ని ఏ విధంగా తీర్చుకోగలం? అసాధ్యం.

ఆయన్ను భక్తిగా స్మరించడం ఒక్కటే మనం చెయ్యగల పని.

అందుకే ఈ మంత్రాన్ని చదువుతూ శివస్వరూపమైన శ్రీ రామకృష్ణులను,ప్రమధగణాల లాగా ఆయనను ఆశ్రయించి ఉన్నట్టి వివేకానందాది మహనీయులను స్మరించడమే మనం ఈరోజున చెయ్యవలసిన పని.

భగవంతుని ధ్యానంతోనే, తనను పట్టి పీడిస్తున్న పాపాన్ని కడుగుకొని,మనిషనేవాడు ఉత్తముడుగా పుణ్యాత్ముడుగా ప్రకాశిస్తాడు.

అందుకే ఈ రోజు మనస్ఫూర్తిగా ఆ మహనీయుని పాదాలను స్మరిద్దాం.ఆ విధంగానైనా మనం చేసిన చేస్తున్న పాపాలు కొన్నైనా ప్రక్షాళన అవుతాయేమో?
read more " నమో అస్తు నీలగ్రీవాయ... "