“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, సెప్టెంబర్ 2013, శనివారం

పంచవటి సంస్థ (Panchawati Inc.) అమెరికాలో మొదలైంది

"సాటి మానవుని బాధలను పట్టించుకోని వేదాంతం నాకక్కరలేదు" అన్నారు వివేకానందస్వామి.రామకృష్ణుని శిష్యులు మెట్టవేదాంతులు కారు.వారు ఉత్త ఊకదంపుడు ఉపన్యాసకులు కారు.వారు ఆచరణవాదులు.అసలు సిసలైన సాధకులు.అంతేకాదు వారు నిజమైన మానవతావాదులు.

"ఆత్మనో మోక్షార్ధం జగద్ధితాయచ(నీ మోక్షం కొరకు,జగత్తుకు మంచి చెయ్యడం కొరకు నీ జీవితాన్ని అర్పించు) అన్న మహత్తరమైన ఆశయంతో వివేకానందులు రామకృష్ణామిషన్ స్థాపించారు.ఇన్నేళ్ళలో ఈసంస్థ లెక్కలేనంతమంది మహర్షులను మహనీయులను మహాత్ములను సృష్టించింది.

వారందరూ శ్రీరామక్రిష్ణులు చూపిన 'శివభావే జీవసేవ (శివుడినే సేవిస్తున్నాను అన్నభావంతో జీవుడిని సేవించు.జీవుడిలో శివుడిని చూడు)' అన్నబాటలో నడిచి చరితార్దులై ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలో ధృవతారలై వెలుగుతున్నారు.వారి అడుగుజాడలలో నడిచే ప్రయత్నంతోనే ఇప్పుడు పంచవటి సంస్థ(Panchawati Inc.)అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో మొదలైంది.

రాయిలో భగవంతుడిని కొలవడం మంచిదే.మనం కొన్ని వేల ఏళ్ళుగా అదే చేస్తున్నాం.కాని జీవులలో ఉన్న భగవంతుడిని ఆరాధించడం ఇంకా ఉన్నతమైనది.ఈ భావన మన వేదాలలో ఉపనిషత్తులలో ఎప్పటినుంచో ఉన్నది.దానిని బయటకు తీసి ఆచరణాత్మకంగా మలచి కర్మనే యోగంగా చెక్కి,సేవద్వారానే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగగలడు అని చెప్పిన ఘనత వివేకానందస్వామిది.

మానవ జీవితగమ్యం భగవత్ సాక్షాత్కారం.మానవుడు లౌకిక జీవితంలో ఎన్ని సాధించినా సరే,ఇది సాధించకుండా మరణిస్తే అతని జన్మ వృధా అవుతుంది.అతడు అసంతృప్తితో చావవలసి వస్తుంది.తర్వాత ఏ జన్మ వస్తుందో తెలియదు.కనుక మానవజన్మను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో వలసి ఉంటుంది.ఈ విషయాన్ని మనగ్రంధాలు అన్నీ నొక్కిచెప్పాయి. దైవసాక్షాత్కారాన్ని పొందడానికి మన ధర్మంలో మతంలో అనేక మార్గాలున్నాయి.వీటిలో భక్తి,జ్ఞాన,రాజ,కర్మయోగాలు నాలుగూ రాజ మార్గాలవంటివి.మిగిలిన చిన్నచిన్న మార్గాలన్నీ ఈ నాలుగింటిలో కలసి వస్తాయి.వాటిలో ఒకటిగాని,కొన్నిగాని,అన్నీగాని  ఎవరి శక్తిని బట్టి వారు ఆచరించి జీవితగమ్యాన్ని చేరమని వివేకానందస్వామి మహోపదేశం ఇచ్చారు.

మహోన్నతమైన మన సనాతనధర్మం కులానికి మతానికి జాతికి వర్గానికి వర్ణానికి అతీతమైనది.కాని అనేక కారణాలవల్ల తరతరాలుగా ఇవే సంకెళ్ళలో అది చిక్కుకుపోయింది.ఎందరికో దూరమై పోయింది.ఆ సంకెళ్ళను తెంచి దానిలోని అమూల్యసంపదను అందరికీ అర్ధమయ్యేలా పంచి ఆర్తితో వెదుకుతున్న ఎందరికో సరైన దారిచూపి,దాని ఒడిలోనికి వారినందరినీ ఆహ్వానించి,వారి ఆర్తిని తీర్చాలని నేను నావంతుగా మూడేళ్లుగా నా బ్లాగ్ ద్వారా నిజమైన సనాతనధర్మాన్ని వివరిస్తూ ప్రయత్నిస్తున్నాను.

ఈ ప్రయత్నంలో చాలావరకూ సఫలీకృతుడనయ్యాను అనడానికి నేను అందుకున్న వేలాది మెయిల్స్, నేను తీర్చిన వేలాది ఆధ్యాత్మిక సందేహాలే రుజువులు.నా బ్లాగ్ లోని పోస్ట్ లు చదివి -- "నిజమైన సనాతనధర్మం అంటే,హిందూమతం అంటే ఇదా? మన మతంలో ఇంత గొప్పదనం ఉన్నదా?ఇన్ని మహోన్నత విషయాలూ రహస్యాలూ మన ధర్మంలో ఉన్నాయా? అన్న విషయాలు తెలుసుకున్నాము.మీ బ్లాగ్ చదివి ఎంతో నేర్చుకున్నాము.మా ఆలోచనాపరిధి ఎంతో పెరిగింది.మా జీవితాలలో ఊహించని మార్పు వచ్చింది.మీ వ్యాసాలు చదవకుంటే జీవితంలో ఎంతో కోల్పోయి ఉండేవారము" - అంటూ నాకు వచ్చిన మెయిల్స్ కొన్ని వందలున్నాయి.నా ఈ నిస్వార్ధ ప్రయత్నాన్ని చూచి ఈనాడు నాకు తోడుగా ఇంకొందరు వచ్చి నిలిచారు.ఇంకా ఎందఱో మాతో కలవడానికీ,కలసి నడవడానికీ సిద్ధంగా ఉన్నారు.వారందరికీ నా కృతజ్ఞతలు.

పైన వివరించిన మహత్తరమైన ఆశయాలతో ఉత్తేజితులైన కొద్దిమందితో 'పంచవటి' సంస్థ ఈనాడు అమెరికాలో ప్రారంభమైంది.ఈ ఉన్నతమైన ఆశయం వెనుక విష్ణుభొట్ల రామన్నగారు,ఆకెళ్ళ పద్మజగారు,డాక్టర్ సావిత్రిగారు ప్రస్తుతానికి ఉన్నారు.వీరు ముగ్గురినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

త్వరలో మనదేశంలో ప్రారంభించబోతున్న 'పంచవటి ట్రస్ట్' లో చేరి దాని ఆశయాలలో పాలు పంచుకోవడానికి ఇప్పటికే ఉన్న మా 'పంచవటి' గ్రూప్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు.వారికీ నా కృతజ్ఞతలు.

ముందుముందు ఈసంస్థ ఎంతో ఎత్తుకు ఎదిగి,కులమతాలకు అతీతంగా,ఒక మహావృక్షంగా మారి ఎందఱో వ్యదార్తులకు స్వాంతన కలిగిస్తుందనీ ఎందఱో నిస్వార్ధసాధకులకు నిజమైన ఆధ్యాత్మికమార్గం చూపి వారిని భగవదున్ముఖులను గావిస్తుందనీ,దారి తెలియక వెదుకుతున్నవారికి సరియైన మార్గదర్శనం చెయ్యగలదనీ నేను నమ్ముతున్నాను.

ఈ కల సాకారం కావడానికి వెనుక ఎంతో తపన ఉన్నది. ఎన్నో హృదయాల నిరంతర అన్వేషణ ఉన్నది.అమూల్యమైన ఈ మానవజన్మను వృధాగా గడిపి అందరిలాగా చావకూడదన్న ఒక ఆర్తి ఉన్నది. అదంతా నేను ఇక్కడ చెప్పబోవడం లెదు.ఈ మూడేళ్ళలో జరిగిన సంఘటనలను అన్నింటినీ నేను ఇక్కడ వివరించబోవడం లెదు.కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

ఈ మార్గంలో మేము ఒంటరులం కాము.మా వెనుక భగవంతుని ఆశీస్సులున్నాయి.అంతేగాక పవిత్రాత్ములైన పరమపూజ్య స్వామి గంభీరానంద,స్వామినందానంద,స్వామిఉద్ధవానంద,స్వామి తపస్యానంద మొదలైన మహనీయుల,జగద్గురువుల,యోగేశ్వరుల ఆశీస్సులున్నాయి. ఇంకెందరో మహనీయుల కటాక్షం నిండుగా మావెంట ఉన్నది.స్వామి ఆత్మలోకానంద,గౌరీవ్రత్ మా మొదలైన ప్రస్తుత మహాత్ముల మార్గదర్శనం ఉన్నది.

'స్వామి ఆత్మలోకానంద','గౌరీవ్రత్ మా' - వీరిద్దరూ భారతీయులు కారు.శ్వేత జాతీయులు.వీరిలో 'గౌరీవ్రత్ మా' యూదు జాతీయురాలు.కాని భారతీయ సనాతనధర్మంతో ప్రభావితురాలై తన జీవితాన్ని రామకృష్ణ వివేకానందుల మహత్తర ఆశయాలకోసం త్యాగంచేసి సన్యాసం స్వీకరించి తపోమయజీవితం గడుపుతూ నలభైఏళ్ళ నుండి అమెరికాలో మనం ఊహించలేనంత గొప్ప సేవ చేస్తున్నారు.

చిన్నచిన్న ఆడపిల్లలను వ్యభిచార ఊబిలోకి దించి వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయించే child trafficking అనేది ఆసియా దేశాల తర్వాత అమెరికాలోనే ఎక్కువ. గౌరీవ్రత్ మా నాలుగు దశాబ్దాల నుంచి ఈ చెడును ప్రతిఘటిస్తూ అమెరికాలో ఎందఱో ఆడపిల్లలను ఈ ఊబినుంచి రక్షించి వారికి నూతనజన్మను ఇచ్చే పనిని చేస్తూ ఉన్నారు.ఒంటరి స్త్రీని నేనేమి చెయ్యగలను అనుకోకుండా,మొక్కవోని ధైర్యంతో,రామకృష్ణ,శారదా వివేకానందుల మీద అమేయమైన నమ్మకంతో,అమెరికన్ మాఫియాకు ఎదురు నిలిచి,ప్రాణాలకు తెగించి,ఎందఱో పురుషులు చెయ్యలేని ఈ పనిని గౌరీవ్రత్ మా ఒక్కరే చేస్తున్నారు.

హిందూ మతంలో పుట్టకపోయినా,భారత దేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా,ఈ దేశాన్ని ఈ సంస్కృతిని ప్రేమిస్తూ,ఊరకే మాటలు చెప్పి ఊరుకోవడం కాకుండా అవిచూపిన బాటలో నడుస్తూ,జీవితాలను చరితార్దాలుగా మలచుకున్న విదేశీయులు ఎందఱో నేడు మన కళ్ళెదురుగా ఉన్నారు.

వీరికి mothers trust అనే సంస్థ ఉన్నది.ఆ సంస్థ వివరాలనూ, వారు ఎంతటి అద్భుతమైన సేవను చేస్తూ ఎంతటి ఉదాత్తమైన ఉన్నతమైన జీవితాలను గడుపుతున్నారో ఇక్కడ చూడండి.

స్వామివివేకానంద యొక్క అనేకమంది శిష్యులలో ఒకరు స్వామి విరజానంద.1938 లోనే ఆయన రామకృష్ణా మిషన్ కు ఆరవ సర్వాధ్యక్షులుగా పనిచెశారు.స్వామి వివేకానందుల స్వహస్తాల నుంచి సన్యాసం స్వీకరించిన అదృష్టశాలి విరజానందస్వామి.ఆ భాగ్యమే ఆయనను జగద్గురువును చేసింది.శ్రీరామకృష్ణుల ప్రత్యక్షశిష్యులైన వివేకానందాది మహనీయుల తర్వాత తరంలో మొట్టమొదటి వారు స్వామి విరజానంద.

ఆయన శిష్యులలో ఒకరు స్వామి భాష్యానంద.ఆయన 1960 లలో అమెరికాలో నివసించి వేదాంతప్రచారం గావించారు.సనాతనధర్మాన్ని విదేశీయులకు అర్ధమయ్యేలా చెబుతూ తన ఉదాత్తమైన జీవితంతో ఎందరినో ప్రభావితులను చేశారు.ఆ ప్రభావంతో ఇప్పుడు రామకృష్ణ వివేకానందుల మార్గంలో ఎందఱో విదేశీయులు నడుస్తూ ఉజ్జ్వలమైన ఋషిజీవితాలు గడుపుతూ,భారతీయులమైన మనం సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నారు.మన ధర్మాన్ని గురించి ఈనాడు వారు మనకు బోధిస్తున్నారు. మన వేదాలలో ఏముందో మనకు తెలీదు.దానిని వారు గ్రహించడమే కాదు. జీవితాలలో ఆచరించి చూపిస్తున్నారు.మనమో,డబ్బు వెంటా, ఇంద్రియ సుఖాలవెంటా పిచ్చిగా పరిగెత్తుతున్నాం.కనీసం వారిని చూచైనా మన నిజమైన ధర్మం ఏమిటో మనం నేర్చుకునే ప్రయత్నం చెయ్యకపోతే మనకు నిష్కృతి లేనే లేదు.

మహోన్నతులైన మన పూర్వఋషులు చూపిన మార్గంలో,శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల అడుగుజాడలలో నడవాలనే మహోన్నత ఆశయంతో ఈనాడు అమెరికాలో 'పంచవటి' సంస్థ మొదలైంది.

"పంచవటి" - ఫలాపెక్ష లేని ఒక ఉదాత్తమైన సంస్థ.మాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లెదు.కిరీటాలు అక్కర్లేదు.ఆర్భాటాలు అక్కర్లెదు.పొగడ్తలు అక్కర్లెదు. ఏదో ఆశించి మేము ఈ పనిని చెయ్యడం లేదు.నిజమైన సనాతనధర్మాన్ని ఆచరించి జీవితాలను ధన్యములు చేసుకోవడమూ,ఆర్తి ఉన్న ఇతరులను కూడా ఈమార్గంలో నడిపించి వారిని కూడా ధన్యులను చెయ్యడమే మా ఆశయం.ఈ ఆశయానికి ఊతం శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానంద స్వామి.కులమతాలకు అతీతంగా వారు చూపిన విశ్వజనీనమైన మార్గమే మా బాట.

భగవదవతారమైన శ్రీరామకృష్ణుని కరుణాకటాక్షాలతో ఈ జన్మలోనే మా గమ్యాన్ని చేరగలమన్న నమ్మకం మాకున్నది.మా ప్రయత్నానికి దైవం తన చేయూతనిచ్చుగాక.

మా వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు.

త్వరలో మా కార్యక్రమాలను పై వెబ్ సైట్ ద్వారానూ,ఈ బ్లాగ్ ద్వారానూ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యడం జరుగుతుంది.