ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కృష్ణ కృష్ణా !

ఇవాళ కృష్ణాష్టమి.

మరి తెలుగురాష్ట్రాలలో చడీచప్పుడూ లేదేంటి?

హిందువుల ఇళ్లూ, గుళ్ళూ అన్నీ మౌనంగా ఉన్నాయేంటి?

ఓ సారీ ! మర్చేపోయాను.

మనకు పొరుగింటి పుల్లకూరే రుచి కదా !


అయినా  నా పిచ్చిగానీ,

సాయిబాబాలకూ, బోయబాబాలకూ, పీర్లకూ, ఫకీర్లకూ అభిషేకాలూ, పూజలూ చేసేవాళ్లకు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? అసంభవం ! 

మహా అయితే ఆయననొక ద్వారపాలకుడిగా పెట్టేద్దాం !

అప్పయ్యస్వామి ఆధార్ కార్డునే.  తెలుగునాడుకు మార్చేసి, ఆ నీడన చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే సుమీ ! 

కేరళం కంటే గుజరాత్ ఇంకా దూరం కదా ! మరి గురువాయూర్ని మర్చిపోయారేంటో?

ఛిన్నమస్త చిన్నబోయినచోట, ప్రత్యంగిర పట్టించుకోని వేళ, రాధాదేవి మాత్రమే రక్షిస్తుంది. ఆ క్షణానికి ఆమె కావలసి వస్తుంది. మరుక్షణమే ఆమె పనికిరాకుండా పోతుంది. మళ్ళీ భయంకర హోమదేవతలే మనకు కావాలి. అవున్లే రాధాదేవి మన వ్యాపారానికి పనికిరాదు కదా !

మన బ్రతుకులింతే !

వ్రేలాడే శవమంటే వేలంవెర్రిగా పరిగెత్తేవాళ్లకు, జగన్మోహనుడైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే. 

ఆయనేమీ బిర్యానీ పెట్టి, ఖర్చులకు డబ్బులివ్వడు కదా ! రాత్రిపూట కూడికలూ, తీసివేతలూ నేర్పించడు కదా !  

గుండు సాధువులనూ, బండస్వాములనూ, 'ళ' కీ, 'ల' కీ తేడా తెలియని మహాయోగులనూ పూజించేవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? సహజమే కదా ! 

ఆయనేమీ వీళ్ళలాగా నైటీ వేసుకోడుగా !

అర్ధరాత్రిళ్ళు క్షుద్రదేవతలకు బొగ్గులూ ఎండుమిర్చిలతో హోమాలు చేసే క్షుద్రులకు చిన్నికృష్ణుని చిరునవ్వులెలా నచ్చుతాయి? అర్ధం చేసుకోగలం ! 

90 వచ్చినా, మాకింకా వయసుడిగి పోలేదుగా? కోరికలు చావలేదుగా? చిన్నికృష్ణుడిని పూజించడానికి?

మళ్ళీ నోరుతెరిస్తే అందరూ చెప్పేది భగవద్గీతా శ్లోకాలే ! కానీ శ్రీకృష్ణుడెవరికీ అక్కర్లేదు.

ఆయన ఎనిమిదేళ్ల వయసులోనే రాసలీలలు చేశాడంట ! గోపికలు స్నానాలు చేస్తుంటే బట్టలు కాజేసి చెట్టుపైన కూర్చున్నాడంట ! ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. మనకు కావలసింది కూడా అదే కదా !

మనం చెయ్యాలనుకుంటూ, చేయలేకపోతున్న పనులన్నీ ఆయనెప్పుడో అయిదువేల ఏళ్ళక్రితమే చేసేశాడు. లక్కీ ఫెలో ! దీన్నే 'అసూయ' అంటారేమో? సర్లే ఏదో ఒకటి !

కానీ, అంతకు ముందే, గోవర్ధన పర్వతాన్ని చిటికెనవ్రేలితో ఎత్తి తనవారిని కాపాడాడు. నెలలపిల్లవాడుగా ఉన్నపుడే ఎంతోమంది రాక్షసులను సంహరించి, లోకపీడను వదిలించాడు. బోసినోటిలో విశ్వాన్ని చూపించాడు. అవెలా చేశాడు? మనకనవసరం ! అవన్నీ యశోదాదేవి భ్రమలు !

ఆ తర్వాత ఎన్నో మానవాతీతపు పనులను కూడా చేశాడు. రాజ్యాలేలాడు. రాజకీయాలు చేశాడు. మహాభారతయుద్ధాన్ని కూడా నడిపించాడు. 

ఆగండాగండి ! ఈ పాయింట్ మాకు బాగా నచ్చింది.

మేము కూడా మా ఆశ్రమం పై ఫ్లోరులో, అమ్మాయిలతో అర్ధరాత్రి, శివరాత్రి, డాన్సులెయ్యచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. వాళ్లేమో గోపికల అంశలతో పుట్టారు.

మేముకూడా రాజకీయులతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ బ్లాక్ మనీని మా భూగృహాలలో దాచిపెట్టి, రాజకీయం చెయ్యవచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. కాకపోతే మా తర్వాత లారీలలో ఆ బంగారమంతా ఎక్కడికో తరలిపోతుంది. పోతేపోనీ. బ్రతికున్నన్నాళ్లు మా పబ్బం గడిచిందిగా !

మేముకూడా విద్యార్థులను స్థంభాలకు కట్టేసి కాల్చిపారెయ్యొచ్చు. మేమూ  కృష్ణుని అంశలమే. కేసులేమీ ఉండవు. ఏం? భారతయుద్ధాన్ని దగ్గరుండి నడిపించిన కృష్ణుడిపైన ఉన్నాయా?

కృష్ణుడు శివుడిని ఆరాధించాడట. మేముకూడా చేస్తాం. మాటమాటకూ 'షివా షివా' అంటాం. లేదా 'చెంబో చెంబో' అంటాం. కానీ ఆ చెంబెక్కడుందో మాకైతే తెలీదు. కైలాసయాత్రకని పోయి, దారితప్పి సరాసరి కైలాసానికే పోతాం. లేదా 'కైలాస' అని ఒక ద్వీపాన్నే కొనేస్తాం. దానికి మా ప్రధానగోపికని, సారీ శిష్యురాలిని, ప్రధానమంత్రిగా చేసేస్తాం. కృష్ణుడెప్పుడైనా ఇలాంటి పనులు చేశాడా? చేయగలిగాడా? కనుక ఆయనకంటే మేమే గొప్పవాళ్ళం.

'కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే' అని మా శాస్త్రాలంటున్నాయి. కానీ మేమాయనను పూజించము. మాకు భగవంతుడెందుకు? ఈరోజు మందుకెవడు డబ్బులిస్తే వాడే మా దేవుడు.

ఆయన మాకర్ధం కాడు. 

గౌడీయమఠానికీ, ఇస్కానుకే ఆయన అర్ధం కాలేదు. ఇక మాకెలా అవుతాడు?

అయినా మా పూజామందిరాలూ, పందిళ్ళూ ఖాళీగా లేవు. వాటిల్లో ఎక్కడ చూసినా పీర్లూ, ఫకీర్లూ, వ్రేలాడుతున్న శవాలూ, క్షుద్రదేవతలూ, గుండుగురువులూ, బండబాబాలూ, గడ్డం స్వాములూ, అజ్ఞాతసిద్ధులూ, విదేశీదేవుళ్ళూ, గురువులూ ఉంటారు. 

మా టేబిల్ మీదా, హాల్లోనూ, ప్రతిరాత్రీ యముడితో డిన్నర్ చేసి, మార్కింగ్ బ్రేక్ ఫాస్ట్ హిమాలయ బాబాజీతో చేసి, సాయంత్రానికి సిద్ధాశ్రమం దొడ్లో రెస్టు తీసుకునే పిరమిడ్లూ,  క్రియాయోగ గృహిణులూ, కళ్ళు మూసుకుంటే లోకలోకాలు తిరిగే NRI మహిళలూ, కాళికాదేవితో కబుర్లు చెప్పేవాళ్ళూ, లలితాదేవితో లంచ్ చేసేవాళ్ళూ, సహజయోగంతో మిమ్మల్ని అసహజంగా మార్చేసేవాళ్లూ, ఆ మిషనూ, ఈ మిషనూ అంటూ మిషన్లతో మిమ్మల్ని కుట్టేసేవాళ్ళూ, ఆత్మలతో మాట్లాడేవాళ్లూ, యక్షిణీలను ఎదుటకు రప్పించేవాళ్లూ, వీళ్ళ ఫొటోలే ఉంటాయి.

వీరి మధ్య కృష్ణుడికి చోటేది?

ఆయన పరిపూర్ణ అవతారమైతే మాకేంటి? కాకపోతే మాకేంటి? వితంతువులకూ, అనాదులకూ డబ్బులిస్తాడా లేదా? నిద్రపోతున్న మా కుండలినిని అయిదే అయిదునిమిషాలలో లేపుతాడా లేదా? మా మతవ్యాపారానికి పనికొస్తాడా లేదా? అది చెప్పండి !

మనల్ని ఆ శ్రీకృష్ణుడే రక్షించాలి. మనల్నే  కాదు. భూమి మొత్తాన్నీ ఆయనే రక్షించాలి.

రక్షిస్తాడా? మనలాంటి వాళ్ళని? ఒకవేళ ఏదైనా బలహీనక్షణంలో ఆయన ముందుకొస్తే మాత్రం, మనం రక్షించనిస్తామా?

ఏమో నాకైతే సందేహమే !

read more " కృష్ణ కృష్ణా ! "

31, ఆగస్టు 2026, సోమవారం

నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు

నేపాల్ దుర్ఘటన జరిగింది.

850+ మంది చనిపోయారు. 2500+ మంది ఆచూకీ లేరు. 

నిత్య, నైమిత్తిక ప్రళయాలకు ఇదొక ఉదాహరణ. 

కాకపోతే, ఇంటర్నెట్ గురువులెవ్వరికీ ఈ విషయం చూచాయగా కూడా ముందస్తుగా తెలియలేదు.

----------------------

వీరిలో ప్రతిరాత్రీ శంభలాకు చెంబుతీసుకొని పోయి వచ్చేవాళ్ళున్నారు. 

సిద్ధాశ్రమంలోనే పుట్టిపెరిగామని చెప్పుకునే హిమాలయయోగులున్నారు. 

కైలాసపర్వతంలో వారంవారం జరిగే సీక్రెట్ మీటింగులకు హాజరయ్యేవాళ్లున్నారు.

సాక్షాత్తూ శివుడితోనే సరాసరి హాట్ లైన్లో మాట్లాడేవాళ్లున్నారు. 

శివుడి భుజాలపైనే ఎప్పుడూ కూర్చుని ఉండే సద్గురువులున్నారు. 

మాటమాటకీ 'షివా షివా' అని 'షో' చేసేవాళ్లున్నారు. 

అతీతలోకాలన్నీ అలా అలా సరదాగా ధ్యానంలో తిరిగొచ్చే యో/రోగులున్నారు. 

గడ్డాలు పెంచినవాళ్ళూ, పెంచనివాళ్ళూ, గుండు చేయించుకున్నవాళ్లూ, జుట్టు పెంచినవాళ్ళూ, కొప్పు కట్టుకున్న వాళ్ళూ, విప్పుకున్నవాళ్ళూ, ఇలా రకరకాల వేషాలతో ఎంతో వినోదాన్ని పంచుతున్నవారున్నారు.

అతితెలివితేటల ఉపన్యాసాలతో, చర్చలతో, గొఱ్ఱెప్రజలకు "గ్నానాన్ని" పంచుతూ  అదరగొట్టేవాళ్లున్నారు.

సినీనటుల అక్రమసంబంధాల దగ్గరనుంచీ, వాళ్ళ కాపురాలు నిలుస్తాయా లేదా అన్నదానివరకూ ప్రతిదానినీ చెప్పే కమెడియన్ జ్యోతిష్కులున్నారు.

ఇంకా ఎంతోమంది ఆన్లైన్ విదూషకులున్నారు.

ఎవరికీ ఈ ప్రమాదం గురించిన ముందస్తు సూచన కొంచెం కూడా లేదు.

ఎన్నో లోకాలలో ఏమి జరుగుతోందో చూడగలిగే జ్ఞానులకు, ఈ లోకంలో ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో తెలీదు !

ఈషా భక్తబృందమైతే అదేదో ఎపాయింట్ మెంట్ తీసుకున్నట్టు సరిగ్గా పదినిముషాల  ముందు ఠంచన్ గా అక్కడకు చేరుకొని 'రామ్మా ! వరదా ! వచ్చి  మమ్మల్ని ముంచెయ్యి' అన్నట్టు సామాన్లు సర్దుకొని మరీ రెడీగా ఉంది.

కాబట్టి వాళ్ళకొక్కరికే, కైలాసం నుండి కరెక్ట్ గా ముందస్తు సమాచారం ఉందని నేననుమానిస్తున్నాను. లేకపోతే సరిగ్గా పదినిమిషాల ముందుగా అక్కడికెలా చేరుకుంటారు వాళ్ళు?

ఇప్పుడంతా అయిపోయాక,  మళ్ళీ వేరే రకం 'షో' లు, "షివా షివా" అంటూ షంతాప షభలు, విశ్లేషణలు, సమర్ధింపులు, నాటకాలు.

-------------------

వైకుంఠద్వారం టికెట్ల త్రొక్కిసలాటలో పడి సరాసరి వైకుంఠానికే పోయారు గతంలో కొందరు.

ఇప్పుడు కైలాసయాత్ర చేసొస్తూ, కైలాసానికే డైరెక్ట్ గా చేరుకున్నారు మరికొందరు.

బ్రహ్మలోకానికి మాత్రం ఎవరూ పోవడం లేదు ! పాపం ఆయనని పూజించేవారు లేరుకదా !

పిచ్చిభక్తులు నిజంగా వైకుంఠానికీ, కైలాసానికీ పోతున్నారో లేదో తెలియదు గానీ, వీళ్ళ డబ్బులు మాత్రం చేరవలసినవారికి చేరుతున్నాయి.

రెలిజియస్ వ్యాపారాలూ, రెలిజియస్ టూరిజం వ్యాపారాలూ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి.

---------------------

అసలూ, హిమాలయాలతో మనకెందుకు?

ఎవరుండవలసిన చోట వాళ్ళుండాలి.

మనకు దూరంగా ఎక్కడో ఉన్న మంచుకొండలలోకి మనం పోయి, అక్కడ మన చెత్తా చెదారమూ, సారాసీసాలూ, ప్లాస్టిక్కులతో నింపడం అవసరమా?

అక్కడెవరో పాపం ముక్కులు మూసుకుని, గోచీలు పెట్టుకుని కూర్చుని ఉంటే, మనం పోయి, వాళ్ళనింకా లోతట్టు కొండల్లోకి తరిమికొట్టడం అవసరమా?

స్వచ్ఛమైన హిమాలయాలను టూరిస్టు సెంటర్లుగా మార్చేసి, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు కట్టి, మబ్బుచాటు వ్యాపారాలు చెయ్యడం అవసరమా?

అక్కడకూడా డ్యాములు, బ్రిడ్జీలు కట్టి, కొండలను తొలిచి సొరంగాలు త్రవ్వడం అవసరమా?

ప్రకృతిని ఈ విధంగా పాడు చెయ్యడం అసలంటూ అవసరమా?

చేస్తే, అది చూస్తూ ఊరుకుంటుందా?

---------------------

గత మూణ్నెళ్లుగా వర్షాలెందుకు లేవు?

ఎక్కడచూచినా ఈ వేడీ, ఉడకా, కొనసాగుతున్న ఈ వేసవీ ఏమిటి?

యూరప్ లో ఎండవేడికి వేలాదిమంది చావడమేమిటి?

ఉత్తర అమెరికాలో కూడా పెరుగుతున్న ఉష్టోగ్రతలేమిటి?

ఇవన్నీ ఎందుకో, గ్లేషియర్లు కరగడమూ అందుకే.

కానీ, మనుషులేమీ నేర్చుకోరు. నేర్చుకోకండి. ఇలాగే ఉండండి.

---------------------------- 

సర్లే, ఈ న్యూసు ఇప్పటికే పాతబడిపోయింది.

బోరుకొడుతోంది. ఇంకో క్రొత్త న్యూసు రాదేంటి?

ఎవరైనా ఒక రేపో, ఒక మర్డరో, ఇంకొకటో, ఇంకొకటో కాస్త వెరైటీగా చెయ్యండ్రా బాబూ !

ఇంకెన్ని రోజులీ నేపాల్ గోల?

ఇవన్నీ చూస్తుంటే గతంలో వ్రాసుకున్న ఒక కవిత గుర్తుకొస్తోంది.

------------------------

కొందరు బాధాపీడితులు
కొందరు మాయామోహితులు.

కొందరు మాయగాళ్లు.
కొందరాశ్చర్య చకితులు.

కొందరు ఆపకుండా వాగేవాళ్ళు
కొందరు లేవకుండా వినేవాళ్ళు

కొందరు  నాటకాలేసేవాళ్ళు
కొందరు నవ్వుకుంటూ చూసేవాళ్ళు

కొందరు తీర్పులు తీర్చేవాళ్ళు
కొందరు తిరిగిరాకుండా పోయేవాళ్లు.

చివరికందరూ,
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడేవాళ్లు !

ఓ జీవితమా ! అర్థంకాని నీ ఆట జరుగుతూనే ఉంటుంది !
ఓ విశ్వమా ! అంతులేని నీ పయనం సాగుతూనే ఉంటుంది !!
read more " నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు "

9, ఆగస్టు 2026, ఆదివారం

గడపలో దీపం

మొన్నామధ్యన కాలేజీరోజుల నాటి ఒక స్నేహితుడు ఆశ్రమానికి వచ్చాడు.

కుశలప్రశ్నలయ్యాక, "ఆశ్రమం నిర్మించావని తెలిసింది. చూద్దామని వచ్చాను" అన్నాడు.

"మంచిది. చూడు" అన్నాను.

"నీ ఇంటర్వ్యూ తీసుకుని మా ఛానల్లో వేస్తాము. అందుకని కెమెరాలతో సహా వచ్చాను. కార్లో ఉన్నాయి. నువ్వు సరేనంటే మొదలుపడదాం." అన్నాడు.

"అవసరం లేదు" అన్నాను.

ఆశ్చర్యంగా చూచాడు.

"పబ్లిసిటీ అవుతుంది. ఇంకా చాలామంది వస్తారప్పుడు" అన్నాడు.

"ఏం చేస్తారు చాలామంది వచ్చి?" అడిగాను.

"ఏవో బాధలుంటాయిగా వాళ్లకు" అన్నాడు.

"వాళ్ళ బాధలను తీరుస్తూ, నాకు బాధలను సృష్టించుకోమంటావా?" అడిగాను. 

"మరి బ్లాగు, బుక్సు, ఆన్లైన్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తున్నావుగా" అడిగాడు.

"అవి లోకుల కష్టాలను తీర్చడంకోసం కాదు. జనం పెరిగితే గోలతప్ప ఇంకేదీ ఉండదు. లోకపు కర్మబరువును మొయ్యడం అవతారపురుషులకే సాధ్యం కాలేదు. మనమెంత? ఛానల్స్ చూసేవాళ్ళు కాలక్షేపానికి మాత్రమే ఆ పని చేస్తారని నీకూ తెలుసు. నాకూ తెలుసు. ఎందుకలాంటి వాళ్లంతా ఇక్కడికొచ్చేది? " అన్నాను.

"మరి ఇదంతా ఎందుకు?" అడిగాడు చుట్టూ చూస్తూ. 

"దీపాన్ని వెలిగించి గడపలో ఉంచాను. నాలుగురోడ్ల కూడలిలో ఉంచవలసిన పని లేదు" అన్నాను.

సాయంత్రం వరకూ ఉండి, అదీఇదీ మాట్లాడి, సెలవు తీసుకున్నాడు.

కారులోని కెమెరాలు  కారుతోబాటే వెళ్లిపోయాయి.

గడపలో దీపం వెలుగుతూనే ఉంది.

read more " గడపలో దీపం "

5, ఆగస్టు 2026, బుధవారం

మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల

ఇవాళ నా 63 వ పుట్టినరోజు. 63 పూర్తై 64 లోకి అడుగుపెడుతున్నాను.

ఈ సందర్భంగా, నా కలం నుండి వెలువడుతున్న 80 వ పుస్తకంగా "వెలుగుదారులు" రెండవభాగాన్ని నేడు విడుదలచేస్తున్నాము.

ఇది "మ్యూజింగ్స్ - II" కు తెలుగు అనువాదం. "ఈ-బుక్" కనుక ఒకే పుస్తకంగా విడుదలౌతోంది. ప్రింట్ లో  రెండు పుస్తకాలుగా వస్తుంది.

ఇందులోకూడా 360 ఆధ్యాత్మిక టాపిక్స్ మీద నేను చెప్పిన విషయాలు, సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. దీనిని, దీని మొదటిభాగాన్ని దగ్గర ఉంచుకుని వీటిలో ఉన్న 720 టాపిక్స్ ను చదువుతూ ఉంటే, ఆధ్యాత్మికప్రపంచంలో మీకొచ్చే ఎటువంటి సందేహమైనా పటాపంచలైపోతుందని నేను  చెప్పగలను. 

పంచవటి శిష్యులకు "వెలుగుదారులు", ఒక భగవద్గీత వంటిదని చెప్పడం అతిశయోక్తి కాబోదు.

మొదటిభాగంలాగే ఇదికూడా జిజ్ఞాసువులకు అభిమానపాత్రమౌతుందని భావిస్తున్నాము.

ప్రచురణలో పాలు పంచుకున్న అందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల "

30, జులై 2026, గురువారం

సత్యం - అసత్యం

దూరపు ఊళ్లలో ఉన్న శిష్యులను గురుపూర్ణిమ కోసం ఆశ్రమానికి రావద్దనే నేను చెబుతాను. ఈ ఇంటర్నెట్ యుగంలో అసలెక్కడికీ పోనవసరం లేదు. ఎక్కడవాళ్ళు అక్కడే ఉండి, అన్నీ చేయవచ్చు.

ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఉండవలసిన విధంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అది లేనప్పుడు, ఎక్కడికొచ్చినా ఏమీ ఒరగదు.

కానీ, దగ్గర ఊళ్లలో ఉన్న శిష్యులు కొంతమంది, వద్దన్నా వస్తూ ఉంటారు. భౌతికంగా వచ్చి ఇక్కడ కాసేపైనా ఉంటే, వాళ్లకు బాగుంటుంది. అదేవిధంగా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదులనుండి కొంతమంది నిన్న ఆశ్రమానికి వచ్చారు.

మాటలసందర్భంలో, ఒక శిష్యురాలు ఇలా అన్నది. 

'ఒంగోలు నుండి వస్తుంటే దారిపొడుగూతా  పందిళ్లు, బాబా కటౌట్లు. రోడ్డుపక్కన పందిళ్ళేసి గురుపౌర్ణమంటూ భోజనాలు చేస్తున్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తుంటే'.

నవ్వాను.

'కానీ నాకు మాత్రం, బాబా కటౌట్ చూసిన ప్రతిసారీ మీరే గుర్తుకు వచ్చారు' అన్నది.

'మంచిదేగా. అలాగైనా ఒక మంచిపని జరిగింది బాబావల్ల' అన్నాడొక శిష్యుడు.

అందరూ నవ్వేశారు.

'అంతే ! అసత్యాన్ని చూచినా సత్యం గుర్తుకురావడమే హిందూమతవిధానం' అన్నాను.

'వాళ్లకూ మాకూ తేడా ఏమిటి?' అని ఒక శిష్యుడడిగాడు.

'సత్యమేదో ఆసత్యమేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, సత్యాన్ని సత్యంగా గుర్తించగలిగే స్థితిలో మీరున్నారు. అదే తేడా' అన్నాను.

ఆర్భాటాలకు, అన్నసంతర్పణలకు, అతిచేష్టలకు, అనవసరపుగోలకు అతీతంగా, అసలైన గురుపౌర్ణమి వేడుక మా ఆశ్రమంలో అద్భుతంగా జరిగింది.

read more " సత్యం - అసత్యం "

29, జులై 2026, బుధవారం

గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల

2021 లో నా కలంనుండి MUSINGS - Part I అనే పుస్తకం విడుదలైంది. అది వెయ్యిపేజీల పుస్తకం. దానిలో 360 టాపిక్స్ చర్చించబడ్డాయి. అది విడుదలై నేటికి ఐదేళ్లు గడిచాయి. ఆ పుస్తకం ఎంతో పాఠకాదరణను పొందింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జిజ్ఞాసువులను కదిలించింది. ఆలోచింపజేసింది. చాలామంది జీవితాలను మార్చివేసింది.

తరువాత దాని తెలుగు అనువాదం 'వెలుగుదారులు' అనే పేరుతో విడుదలై, తనపేరును సార్ధకం చేసుకుంటూ, ఎంతోమందికి వెలుగుదారులను చూపించింది.

ఈ ఐదేళ్లలో ఎన్నో జరిగాయి. ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. పంచవటిని విస్తృతపరచడం జరిగింది. నేను చూపిస్తున్న సాధనామార్గాన్ని ఎంతోమందికి పరిచయం చెయ్యడం జరిగింది. ఈ మధ్యలో అనేకమంది జ్ఞానార్థులు, శిష్యులు, సందర్శకులు, ఔత్సాహికులతో ఎన్నో విషయాలపైన నేను మాట్లాడాను. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. ఆ సంభాషణలలో నుండి ఇంకొక 360 టాపిక్స్ ను ఏర్చికూర్చి ఇప్పుడు గురుపూర్ణిమ సందర్భంగా ఈ పుస్తకం యొక్క  రెండవభాగంగా విడుదల చేస్తున్నాము. ఇదికూడా వెయ్యిపేజీల పుస్తకమే.

మొదటిభాగంలోలాగే ఇందులోకూడా, అన్నీ నిత్యజీవితంలో జరిగిన సంఘటనలనుండి, ఇతరులు అడిగిన ప్రశ్నలనుండి  తీసుకున్నవే. ఊహించి వ్రాసినది ఒక్కటికూడా లేదు. కనుక, మీ జీవితంలో జరుగుతున్న అనేకవిషయాలకు, మీకొస్తున్న అనేక ఆధ్యాత్మికసందేహాలకు ఈ  పుస్తకం అద్దాన్ని పడుతుంది. వాటికి స్పష్టములైన జవాబులనిస్తుంది.

ఒక్కవారంలో రాబోతున్న నా 63 వ పుట్టినరోజు సందర్భంగా దీని తెలుగు అనువాదం "వెలుగుదారులు-రెండవభాగం" గా విడుదల అవుతుంది. అనువాదం ఇప్పటికే పూర్తయింది. అదికూడా వెయ్యిపీజీలను దాటిపోయింది. దానిని ఒకే పుస్తకంగా ముద్రించడం కష్టం కనుక,  రెండుభాగాలుగా ముద్రించి, 'వెలుగుదారులు' - 3 మరియు 4 భాగాలుగా, డిసెంబర్లో జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శన నాటికి మీకు అందుబాటులోకి తెస్తాము.

అజ్ఞానంలో పడి, ఎవరేది చెబితే దాన్ని నిజమని నమ్ముతూ, నానారకాల గురువులతో, గుడులతో, దేవుళ్లతో, దీక్షలతో, మతవ్యాపారాలతో దిక్కుతెలియకుండా పోతున్న నేటి హిందువులకు జ్ఞానజ్యోతిని చూపిస్తూ, సరియైనదారిలో వారిని నడిపించేదిశగా మేము చేస్తున్న ఈ జ్ఞానయజ్ఞాన్ని సఫలం చేయమని, సమస్తసృష్టికీ పరమగురువైన పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ ఉద్గ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల "

27, జులై 2026, సోమవారం

రాములవారు

మొన్న ఒంగోలుకు వెళుతూ దారిలోని ఒక వెల్డింగ్ షాపుదగ్గర ఆగాను.

అక్కడ ఇనుపపైపులతో ఒక రధాన్ని తయారు చేస్తున్నారు. తయారు చేయిస్తున్నది మనకు తెలిసినవాళ్ళే.

అక్కడ నా పనిని ముగించుకుని ఒంగోలుకు బయలుదేరబోతుండగా, అడగకపోయినా రధం గురించి చెబుతూ ' మా ఊళ్లో రామాలయానికి, ఊరేగింపుకి' అన్నాడతను.

'అలాగా. బాగుంది' అన్నాను.

'ఒకసారి రాండి. మా రాములవారిని చూద్దురుగాని' అని ఆహ్వానించాడతను.

 'సరే వీలైనప్పుడు వస్తాలే' అన్నాను.

'అట్టా అనుకుంటే ఎప్పుడొచ్చేది? రేపు పౌర్ణమికి రధం ఊరేగింపు. భలే ఉంటుంది. రాండి' అన్నాడు.

'చిన్నప్పటినుంచీ చాలా చూశాను. ప్రస్తుతం ఆసక్తి లేదు' అన్నాను.

'పోనీ రాములవారిని చూడండి' అన్నాడు.

ఒక్కక్షణం అతనివైపు చూచి, 'చూస్తున్నాను' అన్నాను.

'ఎక్కడా?' అన్నాడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ.

'ఇక్కడ' అంటూ ఛాతీపైన చేయివేసుకున్నాను.

ఈసారి అయోమయంగా చూస్తున్నాడు.

'రాములవారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని చూట్టానికి గుడికెందుకు? అయినాసరే, మీరు మంచిగా పిలిచారు కదా. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను మీ ఊరికి' అన్నాను.

అతనికర్ధమైంది. ఇంకేమీ అడగలేదు.

నా దారిన ఒంగోలుకు బయల్దేరాను.

read more " రాములవారు "

పేలపిండి

చాలామందిలో ఒక జబ్బును గమనిస్తున్నాను. 

ఆశ్రమంలో మేమేం చేస్తున్నాము? మా ఆదర్శాలేమిటి? మా గమ్యాలేమిటి? వాటిని అందుకోవడానికి మేమనుసరిస్తున్న మార్గమేమిటి? ఇవేవీ వారికి ఆవసరం లేదు. దానిబదులు, వాళ్ళిష్టప్రకారం గానూ, వాళ్ళు ఊహించుకున్నట్లుగానూ మేమున్నామా లేమా? అన్నదానిని మాత్రమే చూస్తున్నారు. 

నన్ను కలుస్తున్నవారిలో, మాట్లాడుతున్న వారిలో అందరూ ఇలాగే ఉన్నారు.

వాళ్ళెలా ఉన్నప్పటికీ,  యధాప్రకారం నాకు మాత్రం నవ్వూ, జాలీ, ఈ రెండే కలుగుతున్నాయి.

మొన్నొకరోజున ఒకాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాను.

మాటలసందర్భంలో 'ఈరోజు తొలి ఏకాదశి' అన్నాడాయన.

నేనేమీ మాట్లాడలేదు.

'ఇవాళ విష్ణుదేవునికి పేలపిండి నైవేద్యం పెట్టాలి' అన్నాడు.

'అవునా !' అన్నాను.

'మీరు చేస్తున్నారా ఆశ్రమంలో?' అడిగాడు.

'మీరన్నది పేలపిండా లేక పేలాలపిండా?' అడిగాను.

అంత సున్నితంగా చెబితే ఈ జనానికెక్కడ అర్ధమౌతుంది?

'అదేలెండి. పేలాల పిండే. మా పల్లెటూళ్ళలో ఇలా కూడా అంటాము' అన్నాడు నవ్వుతూ.

నేనేమీ అనలేదు.

'ఏకాదశినాడు విష్ణుదేవునికి ఈ నైవేద్యం పెడిదే మంచిది' అన్నాడు మళ్ళీ.

యూట్యూబ్ యూనివర్సిటీలో బాగానే చదువుకుంటున్నాడు. ముచ్చటేసింది.

'విష్ణువు అనే పదానికి అర్ధమేమిటి?' అడిగాను.

'ఏముంది? విష్ణువే' అన్నాడు.

ఇంకేం మాట్లాడగలం?

నాకీమాత్రం కూడా తెలీనందుకు అతనికి నామీద చాలా జాలేసినట్టుంది.

'చెయ్యండి గురువుగారు. చేస్తే మంచిది' అన్నాడు మళ్ళీ.

'నాకు బట్టతలుంది. పేలు పడే అవకాశం లేదు.' అన్నాను.

పెద్దగా నవ్వి, 'అయితే ఏమైంది? నాకూ ఉంది, ప్రతి మొగాడికీ కొద్దో గొప్పో ఉంటుంది' అన్నాడు.

'పేలే లేనప్పుడు పేలపిండితో పనేముంది?' అన్నాను.

'అర్ధం కాలేదు' అన్నాడు నీరసంగా.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అని ఫోన్ పెట్టేశాను.

read more " పేలపిండి "

26, జులై 2026, ఆదివారం

తెలివిలేని సంత

మొన్న పనుండి ప్రక్కఊరికెళ్ళాను.

మైకులో సాయిబాబా భజన వినవచ్చింది.

కావలసిన వస్తువులు కొంటూ ఉండగా, తెలిసిన ఒకతను కనిపించి, 'సాయిబాబా సప్తాహం జరుగుతోంది. గుడికి రండి' అని పిలిచాడు.

'ఎందుకది?' అన్నాను.

' నాలుగురోజులలో గురుపౌర్ణిమ కదా ! అందుకని చేస్తున్నాం' అన్నాడు.

జాలికలిగింది.

'గురుపూర్ణిమ అయితే, సాయిబాబాకి భజనెందుకు? అసలు సాయిబాబాకి భజనేంటి? మీరు చేయడమేంటి?' అన్నాను.

ఈ పల్లెటూరి జనానికి ఏమి చెప్పినా ఎక్కదు.

'భజన బాగుంటుంది. వచ్చి చూడండి' అన్నాడు నా మాట వినిపించుకోకుండా.

'తెలివిలేని సంతలోకి తెలివితో ఉన్నవారెందుకు?' అని, నాకు కావలసిన వస్తువులను తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాను.

read more " తెలివిలేని సంత "

9, జులై 2026, గురువారం

U.G గారి 108 వ పుట్టినరోజు

ఇవాళ జూలై తొమ్మిది. 

యూజీగారి 108 వ పుట్టినరోజు.

యూజీగారి సన్నిహితులలో ఒకరైన చంద్రశేఖర్ బాబుగారు (బెంగుళూరు) నాకు పంపించిన యూజీగారి మాట ఒకటి మనకోసం.

"The absence of imagination, the absence of will, the absence of effort, the absence of any movement in any direction, on any level, in any dimension - that is the thing."

" ఊహ లేకపోవడం, ఇచ్ఛ లేకపోవడం, ప్రయత్నం లేకపోవడం, ఎటువైపూ, ఏ స్థాయిలోనూ, ఏ భూమికలోనూ, ఏ విధమైన కదలికా లేకపోవడం - అదీ అసలైన విషయం. "

read more " U.G గారి 108 వ పుట్టినరోజు "

22, జూన్ 2026, సోమవారం

యోగా డే - 2026


నిన్న అంతర్జాతీయ యోగదినోత్సవం గనుక, ఆ సందర్భంగా దేశవిదేశాలలో ఉన్న "పంచవటి" సభ్యులు, నా పోరును భరించలేక మొక్కుబడిగా  యోగాసనాలను అభ్యాసం చేసినట్టు కాసేపు నటించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

నరేంద్రమోదీగారి ప్రయత్నం వల్ల జూన్ 21 International Yoga Day గా నిర్ణయించబడింది. యోగా అనేది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అనిన విషయం అధికారికంగా నిర్ధారణ అయింది. లేకపోతే, యోగాను కూడా "ఇది మాదే" అనడానికి ఇతర దేశాలు మతాలు గతంలో ప్రయత్నాలను చేశాయి. కొన్నిదేశాలలో అయితే కొన్ని ఆసనాలకు కాపీరైట్ ను కూడా కొంతమంది తీసుకున్నారు. 

అయితే, నిన్న యోగా చేసినవాళ్లు, ఫోటోలకు పోజిచ్చినవాళ్లు ప్రతిరోజూ చేస్తున్నారా అంటే, సందేహమే. వాళ్ళ దేహాలను, అవి వంగలేక అవస్థపడుతున్న తీరులను చూస్తుంటే వాళ్ళు యోగాను ఎంత రెగ్యులర్ గా చేస్తున్నారో ఎవరికైనా అర్థమౌతోంది.

కాకపోతే ఒకటి ! పూర్తిగా మర్చిపోవడం కంటే, ఎప్పుడో కాసేపైనా చెయ్యడం కొంతలో కొంత మంచిది కదా ! ఇదొక్కటి తప్ప ఈ మొక్కుబడి యోగాకు విలువేమీ లేదు.

మోదీగారికి మాత్రం ప్రణామమే ! నెహ్రూలాంటి ప్రధానమంత్రులు మన దేశపు సంస్కృతిని, మతాన్ని, పక్కనపెట్టే ప్రయత్నము, ఇంకా చెప్పాలంటే నాశనం చెయ్యాలనే ప్రయత్నమూ  చేస్తే, మోదీగారు స్వయంగా కలకత్తావీధులలో కొచ్చి, యోగా చేస్తున్న వారి మధ్య తిరుగుతూ, వారిని ప్రోత్సాహపరిచారు. ఇదెంత గొప్పవిషయం !  అంతేగాక, రామకృష్ణులు, వివేకానందస్వామి, అరవిందులు, లాహిరీమహాశయులను తన మెసేజిలో ప్రస్తావించారు. ఈ దేశపు ప్రధానమంత్రి అంటే ఇలా ఉండాలి ! నెహ్రూలాగా, ఇందిరాగాంధీలాగా ఉండకూడదు.

ఇప్పుడు కూడా యోగా చేయనివాళ్ళు, ఈ పండుగలో పాలుపంచుకోనివాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిములు,  ప్రతిపక్షాలు దీనికి దూరంగా ఉన్నారు. ఎక్కడో కొద్దిమంది చేసి ఉండవచ్చు. కానీ అందరూ చేయలేదు. వాళ్ళుంటున్న దేశసంస్కృతి గురించిన కనీసగౌరవం అంటూ ఏమైనా వీరికి ఉందా అని సందేహం కలుగుతోంది. వాళ్ళ భావజాలం ఎంత లోలెవల్లో ఉందో అర్థమౌతోంది.

మంచి అలవాట్లు తేలికగా రావు. అప్పుడప్పుడూ చెయ్యగానైనా కొన్నాళ్ళకో  కొన్నేళ్లకో అలవాటౌతాయి. ఈలోపల మనల్ని పట్టుకుని ఉన్న బద్దకం అనే రాక్షసిని వదిలించుకోవాలి. కనీసం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆరోగ్యమైనా, ఏదైనా మనకు దక్కుతుంది.

జిమ్ములు చేసి హార్ట్ ఎటాక్స్ తెచ్చుకుని కుప్పకూలి పోకండి. ఇంట్లోనే యోగాభ్యాసం చేసి నూరేళ్లు ఆరోగ్యంగా జీవించండి.

ప్రస్తుతానికి ఇంతే చెప్పగలం !

read more " యోగా డే - 2026 "

16, జూన్ 2026, మంగళవారం

U.G - 11 (అమనస్కస్థితి)

9-7-1963 నుండి 9-7-1967 వరకూ జరిగిన నాలుగేళ్ళ కాలంలో యూజీగారి జీవితం గొప్ప మలుపులు తిరిగింది.

ఆ సమయంలో ఆయన జాతకంలో శుక్ర శుక్ర బుధ దశనుండి శుక్ర కుజ శని దశ వరకూ నడిచింది.

1963 సెప్టెంబర్ లో లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన పారిస్ చేరుకున్నాడు. ఒక గమ్యమంటూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఇండియాకు ఉన్న తన తిరుగుప్రయాణపు టికెట్టును అమ్మివేయగా 350 పౌండ్లు వచ్చాయి. ఘనానందస్వామి ఇచ్చిన 50 పౌండ్లు ఉన్నాయి. ఆ డబ్బుతో పారిస్ లోని ఒక చిన్నహోటల్ రూములో ఉంటూ, డిసెంబర్ వరకూ కాలక్షేపం చేశాడు. రోజుకొక్క ఛీజుముక్కను మాత్రం తినేవాడు. అదే ఆయన ఆహారం.

అప్పట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడైన చార్లెస్ డి గాల్ "360 రకాల ఛీజులను చేసే దేశాన్ని పాలించడం చాలా కష్టం' అనేవాడు. ఈ మాటను వినిన యూజీగారు ఫ్రాన్స్ లో అన్ని రకాల ఛీజులుంటాయా? అనిన సందేహంతో రోజుకొక కొత్తరకం ఛీజును తింటూ ఉండేవాడు.  నిజంగానే రోజుకొక కొత్తరకం ఛీజు చొప్పున ఏడాదికి 365 రకాల ఛీజులను అక్కడ తయారు చేస్తారు. ఆ విధంగా ఆ మూడునెలలు గడిచాయి.

ఆ సమయంలో ఆయనకు శుక్ర శుక్ర శని నుండి శుక్ర శుక్ర బుధ దశ వరకు నడిచింది. శుక్రుడంటే కేతువని, శుక్ర - శని అంటే శుక్ర - కేతువులేనని ముందే చెప్పి ఉన్నాను. వాళ్ళేం చేస్తారో కూడా గత పోస్టులో చెప్పాను.  ఇక, బుధుడు బుద్ధికారకునిగా ఈయన యొక్క బుద్ధిని సూచిస్తున్నాడు. 12-3 భావాల అధిపతిగా అంతచ్చేతనను, భావవ్యక్తీకరణను సూచిస్తాడు. కనుక శుక్ర శుక్ర బుధ దశలో భావవ్యక్తీకరణ తగ్గిపోయింది. దానికసలు అవకాశమే లేదు.

లండన్ వీధులలో తిరిగినట్లే పారిస్ వీధులలో కూడా గమ్యరహితంగా తిరుగుతూ ఉండేవాడాయన. ఆ తిరగడానికి ఒక అర్ధమేమీ ఉండేది కాదు. కాసేపిక్కడ, కాసేపక్కడ, ఈ విధంగా అన్నిచోట్లకూ గాలికి ఎగురుతున్న ఎండుటాకులా ఆయన పరిస్థితి ఉండేది.

కుండలిని ఒక మనిషిలో నిద్రలేచిందంటే ఊరకే కూచోదు. ఆ మనిషి మెదడు, సెంట్రల్ నెర్వస్ సిస్టం, హార్మోన్ సిస్టం, ఎండోక్రిన్ గ్రంధులు అన్నీ సమూలమైన మార్పులకు లోనౌతాయి. ఈ రోజున్నట్లుగా రేపు ఆ మనిషి ఉండడు. రోజురోజుకూ మారిపోతూ ఉంటాడు. అతని మనసుకూడా అతని అదుపులో ఉండదు. అతని భావజాలమంతా సమూలమైన మార్పులకు లోనౌతుంది. చివరకు మనసే లేకుండా పోతుంది. అలాంటి మార్పులను తెస్తుంది కుండలిని. ఒక్కొక్కసారి ఈ ప్రక్రియలో గుండె ఆగిపోయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది.

అందుకే కుండలిని అంటే ఆటలు, మాటలు కాదు. కుండలిని నిజంగా నిద్రలేస్తే ఇక నీ ఒళ్ళు నీ అదుపులో ఉండదు. ప్రతిరోజూ ఎన్నో మార్పులు నీ దేహంలో జరిగిపోతూ ఉంటాయి. అవి సుఖంగా ఏమీ  ఉండవు. వాటిని నువ్వు ఆపలేవు. కేవలం ప్రేక్షకపాత్రగా చూస్తూ ఉండటం తప్ప, ఆ నరకం అనుభవించడం తప్ప, నువ్వు ఏమీ చేయలేవు. అవధూతస్థితికి ముందు స్థితి అలా  ఉంటుంది.

చాలామందికి ఈ విషయాలన్నీ తెలీక, కుండలిని అంటే ఏదో పిల్లచేష్టలనుకుంటూ ఉంటారు. రోజూకాసేపు ముక్కు మూసుకుని అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే చాలు కుండలిని నిద్రలేస్తుంది, వెంటనే మన ఇష్టదేవత మన ఎదురుగా ప్రత్యక్షమై వరాలిచ్చేస్తుంది. లేదా మోక్షం వచ్చి ఒళ్ళో కూచుంటుంది. అనుకుంటారు. అలా ఏమీ జరగదు. జరుగుతుందని ఎవరైనా చెబితే అది పక్కా మోసమే.    

సరే, చేతిలో ఉన్న 400 పౌండ్లు ఆ విధంగా అయిపోయాక, మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న ఎదురైంది. చెయ్యటానికేమీ లేదు. చెయ్యాలని మనసూ లేదు. చివరికా స్థితిలో, జెనీవాలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కు వెళ్లి, తన పరిస్థితిని వివరించి, తనను ఇండియా పంపించెయ్యమని వారిని అడిగాడాయన. వాళ్ళు కుదరదన్నారు.

ఈ సంభాషణనంతా అక్కడున్న వాలెంటైన్ డి కెర్విన్ అనే ఒక స్టాఫ్ మెంబర్ వింటూ ఉన్నది. నిజానికి ఎంబసీలో ఆమె ఒక భాషా అనువాదకురాలుగా పనిచేస్తున్నది. ఆ రోజున ఫ్రంట్ డెస్కులో ఉండవలసిన స్టాఫ్ సెలవు పెడితే, ఆ స్థానంలో ఆమె పనిచేస్తున్నది. యూజీగారు ఎంబసీవారితో మాట్లాడుతూ ఉండటమంతా ఆమె విన్నది. యూజీగారి నిజాయితీ ఆమెకు నచ్చింది. ఆయనపైన ఆమె జాలిపడింది. వెంటనే ముందుకొచ్చి, ఈ సమస్య తేలేవరకూ తనతో బాటు తన ఇంట్లో ఉండవచ్చని యూజీగారిని ఆహ్వానించింది.

వాలెంటైన్ గారి జాతకాన్ని ఆమె జీవితాన్ని ఇంకొక సీరీస్ లో పరికిద్దాం. ప్రస్తుతానికి ఒక చిన్నమాటను మాత్రం చెప్తాను. వాలెంటైన్ ఒక మామూలు వనిత కాదు. ఆమె ఒక కారణజన్మురాలు. అమ్మవారి అంశ ఆమెలో ఉంది. కనుకనే ముక్కూ ముఖం తెలియకపోయినా, నమ్మి యూజీగారికి ఆమె ఆశ్రయాన్ని కల్పించింది. అంతేకాదు, ఒకసారి ఆయనేమిటో అర్ధమయ్యాక, తనకు తండ్రినుండి సంక్రమించిన ఆస్తిని, తన పెన్షన్ ను, అంతటినీ కలిపి ఒక ట్రస్ట్ ను ఏర్పరచి, తనున్నా లేకపోయినా, యూజీగారికి నెలఖర్చులకు జీవితాంతం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆమె ఏర్పాటు చేసింది. ఆ విధంగా 1963 లో మొదలైన వారి విచిత్రబంధం 1991 లో తన 90 వ ఏట ఆమె బెంగుళూరులో చనిపోయేవరకూ నిరాఘాటంగా కొనసాగింది.

ఆమె చనిపోయాక, ఆమె డైరీలను వెతుకుతుంటే, అందులో యూజీగారిని గురించి ఆమె వ్రాసుకున్నది బయటపడింది. యూజీగారిని ఆమె ఎలా అర్ధం చేసుకున్నదో ఆమె మాటలలోనే చూద్దాం. ఆమె ఫ్రెంచి భాషలో వ్రాసుకున్న మాటలకు ఇంగ్లీషు అనువాదం  ఇది.

"Where can I find a man like him? I have at last met a man, a man the like of whom can be met very rarely"

ఇది తెలుగు అనువాదం.

"ఇటువంటి మనిషి ఎక్కడ దొరుకుతాడసలు? ఎట్టకేలకు నేనొక నిజమైన మనిషిని కలుసుకున్నాను. ఇటువంటి మనుషులను చాలా అరుదుగా మాత్రమే మనం కలుస్తాం".

ఇంకొక సందర్భంలో, యూజీగారి గురించి హిందీనటి పర్వీన్ బాబీతో మాట్లాడుతూ వాలెంటైన్ ఇలా అన్నారు, 

"I have known a lot of men in my life; he is the kindest man I have known in my life."

(నా జీవితంలో ఎంతోమందిని నేను చూచాను.  నేనెరిగిన అందరిలోకీ ఈయన అత్యంత దయాహృదయుడు).

యూజీగారిని ప్రపంచానికి అందించే నాటకంలో ఒక ముఖ్యపాత్ర వాలెంటైన్ కు ఇవ్వబడింది. అది ఆమె అదృష్టం. జగజ్జనని ఆ పాత్రకు ఆమెను ఎన్నుకుంది.

ఎలాగైతే, 1893 సంవత్సరంలో, చేతిలోని పత్రాలు పోగొట్టుకుని, దిక్కులేని పరిస్థితిలో శోషవచ్చి చికాగోలో రోడ్డుపైన పడిపోయే స్థితిలో ఉన్న వివేకానందస్వామిని మేరీ హేల్ అనే అమెరికన్ వనిత రక్షించి, తన ఇంటిలోనికి తీసుకెళ్లి మంచినీళ్ళిచ్చి ఆదుకున్నదో, అదేవిధంగా 1963 డిసెంబర్లో యూజీగారికి కూడా వాలెంటైన్ అనే యూరోపియన్ వనిత  ఆసరాగా నిలబడి ఆదుకుని సంరక్షించింది. 

70 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సంఘటన పునరావృతమైంది. ప్రాంతాలు వేరు కావచ్చు, వ్యక్తులు వేరు కావచ్చు, కానీ స్పందించిన ఇద్దరూ స్త్రీమూర్తులే కావడం, అందులోనూ నిస్వార్ధప్రేమమూర్తులు కావడం వింతలలో వింత ! కాళికామాత లీలలంటే ఇలాగే ఉంటాయి మరి !

చొక్కాలో దాచిపెట్టిన బూడిదను గాల్లోంచి తీసినట్టు నటిస్తూ బయటకు తియ్యడం,  రాళ్లముక్కలను మింగి, తెముల్చుకుని, లింగాలంటూ వాటిని కక్కడం, బూడిదతో అద్భుతాలు చెయ్యడం, కీబోర్డు వాయించి రోగాలు తగ్గించడం, గ్రానైట్ రాయితో వీపుమీద ఇస్త్రీచేసి కేన్సర్ తగ్గిస్తాననడం, నెత్తిమీద చెయ్యిపెట్టి శక్తిపాతం చేస్తానని డబ్బులు కాజెయ్యడం, చిన్నమస్త, ప్రత్యంగిర మొదలైన పేర్లు చెప్పి, దయ్యాలని, భూతాలని, చేతబడులు, హోమాలు అని మాయమాటలు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించడం ఇలాంటి పిచ్చిచేష్టలు అసలైన అద్భుతాలు కావు. 

పిచ్చిజనాల్లారా ! అసలైన అద్భుతాలంటే ఇవి ! కాస్త కళ్ళు తెరిచి చూడటం నేర్చుకోండి !

మనకధలో ముందుకెళదాం !

ఆ విధంగా వాలెంటైన్ సంరక్షణలోకి యూజీగారు వచ్చారు. ఒక వారం తర్వాత, "మేము మా ఖర్చులతో మిమ్మల్ని ఇండియాకు పంపించలేము. అది సాధ్యం కాదు" అని ఎంబసీ వాళ్ళు చెప్పేశారు. ఇక ఆయన వాలెంటైన్ తోనే ఉండిపోయాడు. మిగిలిన కథ అంతా చంద్రశేఖర్ బాబు, మహేష్ భట్, ముకుందరావు, మొదలైనవారు వ్రాసిన యూజీగారి జీవితం గురించిన పుస్తకాలలో చూడండి. వాళ్ళు ఆయనను బాగా ఎరిగినవాళ్లు, ఆయనతో ఎన్నో ఏళ్ళు జీవించినవాళ్లు. అదంతా వివరించి చాలా బాగా వ్రాశారు.

ఇకపోతే, నిద్రలేచిన కుండలినీశక్తి, ఆయన దేహంలో తనపనిని తాను చేసుకుంటూ పోతోంది.

కుండలిని ముఖ్యంగా పెద్దమెదడు, చిన్నమెదడు, కేంద్రనరాల వ్యవస్థ, గ్రంధుల వ్యవస్థలపైన పనిచేసి వాటి పనితీరులలో సమూలమైన మార్పులు తెస్తుంది. ఈ ప్రక్రియలో దేహం అతలాకుతలమై పోతుంది. మెడికల్ సైన్సుకు అంతుబట్టని అనేక విచిత్రమార్పులు ఆ వ్యక్తిలో జరుగుతాయి.

మన దేహంలో పినియల్, పిట్యూటరీ, హైపోతాలమస్ అనే గ్రంధులు మెదడులో ఉంటాయి. ఇవి సహస్రార ఆజ్ఞాచక్రాలకు స్విచ్చుల వంటివి. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంధులు గొంతుభాగంలో ఉంటాయి. ఇవి విశుద్ధచక్రానికి సంబంధించబడినవి. థైమస్ గ్రంధి ఛాతీమధ్యలో గొంతుభాగం క్రిందుగా ఉంటుంది. ఇది అనాహతచక్రానికి సంబంధపడి ఉంటుంది. పాంక్రియాస్ గ్రంధి మణిపురచక్రంతో ముడిపడి ఉంటుంది. గోనాడ్ గ్రంధులు స్వాధిష్టానచక్రంతో ముడిపడి ఉంటాయి. ఎడ్రినల్ గ్రంధులు మూలాధారచక్రానికి చెందినవి.

కుండలిని నిద్రలేచిందంటే ఈ గ్రంథుల పనితీరులో సమూలమైన మార్పులొస్తాయి.

జాగృతకుండలిని వల్ల యూజీగారి దేహంలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉండేవి. ఆయా గ్రంధులు ఉబ్బి ఆయన చర్మంపైన రకరకాల రంగులలో కనిపించేవి. అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన దేహంలోని ఎడమభాగం స్త్రీలాగాను, కుడిభాగం పురుషునిలాగాను మారిపోయింది. ఆయన ఛాతీ కూడా ఎడమవైపు స్త్రీ కున్నట్లు, కుడివైపున పురుషుని లాగాను ఉండేదట. రెండుకళ్ళల్లో కూడా కుడికన్ను ఒక విధంగా, ఎడమకన్ను మరొక విధంగా ఉండేదట. ఈ విధంగా యోగగ్రంధాలలో చెప్పబడిన మార్పులన్నీ ఆయన దేహంలో స్పష్టంగా బయటకే కనిపిస్తూ ఉండేవి. అమావాస్య పౌర్ణమి రోజులలో ఆయన దేహం అతలాకుతలమై పోతూ ఉండేది. ఇతరులకూ తనకూ భేదం ఆయనకు తెలిసేది కాదు. తన దేహమే తనకు కనిపించేది కాదు. అసలు తను బ్రతికున్నానా, చనిపోయానా కూడా తెలిసేది కాదు.

ఆయన దేహమంతా విద్యుత్తు ప్రవహించడం మొదలైంది. ఆయన తన రెండు అరచేతులను రుద్దుకుంటే చక్కుమని మెరుపులు వెలిగేవి. నిద్రలో పక్కమీద దొర్లితే ఆ గదిలో మెరుపులు మెరిసేవి. తన పక్కమీద ఉన్న నైలాన్ బట్టవల్ల అలా స్టాటిక్ విద్యుత్తు ఏర్పడుతున్నదేమో అనిన అనుమానంతో పక్కగుడ్డలను మార్చేసి, కాటన్ దుప్పట్లను వేసినప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉండేది. కాళ్లలోనుంచి విద్యుత్తు ఎర్త్ అవుతుంటే, దానిని ఆపడానికి ఆయన ఇంట్లో కూడా చెప్పులేసుకుని నడిచేవాడు. స్నానం చేద్దామని షవర్ కింద నిలబడితే, నీళ్ళు తగలడంతోనే ఒళ్ళంతా కరెంట్ షాకు కొట్టేది.

ఆయన ప్రతిరోజూ చనిపోతూ ఉండేవాడు. ఒళ్ళంతా క్రమంగా బిగుసుకుపోయి, ఎగశ్వాస మొదలై, ఊపిరి ఆగిపోయేది. సరిగ్గా 48 నిమిషాల తర్వాత మళ్లీ ఆయన దేహం మామూలుగా పనిచెయ్యడం మొదలుపెట్టేది. ఇలా ప్రతిరోజూ జరిగేది.

ఈ మార్పులన్నీ ఈ నాలుగేళ్ళ కాలంలో అంచెలంచెలుగా ఆయన దేహంలో వచ్చేశాయి.

మనకు తెలిసి, ఇటువంటి స్థితులను పొందినవాళ్ళు చరిత్రలో ఇంకా ఇద్దరున్నారు.  రామకృష్ణులకు కూడా ఇదేవిధంగా జరిగేది. మళ్ళీ, 'ఆనందమయి మా' కు కూడా ఇవే మార్పులు జరిగినట్లు మనం ఆమె జీవితంలో చూడవచ్చు.

కుండలిని అంటే ఇలా ఉంటుంది.

ఇదంతా ఆయన యొక్క యూరోపియన్ స్నేహితులు, సన్నిహితులు దగ్గరగా గమనించి చూచారు. ఎందరో డాక్టర్లు, శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించారు. వారికేమీ అర్ధం  కాలేదు.

ఈయనలోని ఈ మార్పులను గమనించిన నవీనకాలపు యోగపితామహుడు తిరుమలై కృష్ణమాచార్య, 'ప్రస్తుతం జీవించి ఉన్న అత్యున్నతుడైన యోగి' గా యూజీగారిని గురించి చెప్పేవారు.

"మీలో జరుగుతున్న మార్పులు నా ఊహకు అనుభవానికి మించి ఉన్నాయని" కృష్ణమాచార్యగారి తనయుడు మరియు హఠయోగంలో పండిపోయిన ఆచార్యుడు దేశికాచారి గారు అనేవారు.

యూజీగారిలో జరిగిన మార్పులను గురించి వినిన కంచి పరమాచార్యులవారు "ఇది జీవన్ముక్త స్థితి" అని  అన్నారు.

శృంగేరి శంకరాచార్యులైన అభినవ విద్యాతీర్ధులవారు యూజీగారి స్థితిని చూచి, "ఈ స్థితులను మా గురువుగారైన చంద్రశేఖర భారతీస్వామివారిలో చూచాము. మరలా మీలో చూస్తున్నాము" అన్నారు. అంతేగాక,  ఇలా అంటూ యూజీగారికి ఆయన సాష్టాంగనమస్కారం చేశారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు.

కనుక, అలాంటివారికి మాత్రమే ఆయన యొక్క స్థితి ఏమిటో తెలుస్తుంది. మనబోటివారికి అటువంటి స్థితులు ఎలా అర్ధమౌతాయి? 

ఇప్పుడు కొద్దిగా జ్యోతిషశాస్త్రం వైపు దృష్టి సారిద్దాం.

సాధనాపరంగా చూచినపుడు గ్రహాలను గురువర్గం శుక్రవర్గం అని రెండువర్గాలుగా విభజించవచ్చు. ఒకటేమో దేవతావర్గం, రెండవది దానవవర్గం. శుక్రాచార్యుడు దానవగురువు. ఆయనకు మృతసంజీవినీవిద్య తెలుసు. దేవగురువుకు కూడా అది తెలియదు. మృతసంజీవని అంటే కుండలినీవిద్యనే. అజ్ఞానంలో పడిఉన్నవాళ్ళు చచ్చినవాళ్ళకిందే లెక్క. జ్ఞానులైనవాళ్లు బ్రతికినవాళ్లు. అజ్ఞానిని జ్ఞానిగా మార్చేది కుండలిని. అంటే, చనిపోయినవాడిని బ్రతికిస్తుంది.

అందుకే, యూజీగారి జాతకంలో కూడా శుక్రదశలోనే కుండలినీజాగృతి జరిగింది. కుండలినీశక్తిని సూచించే రాహుకేతువులు కూడా, మన పురాణాల ప్రకారం రాక్షసులేనని మనం గుర్తుంచుకోవాలి.

ఈ  విధంగా నాలుగేళ్లు గడిచాయి. 1967 సంవత్సరం వచ్చేసింది. జూలై నెల 9 వ తేదీ యూజీగారి పుట్టినరోజు. ఆరోజున సానెన్ లో తన ఇంటిని ముందున్న ఒక చెస్ట్ నట్ చెట్టుక్రింద ఒక బెంచీమీద ఆయన కూచుని  ఊరకే శూన్యంలోకి చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద విస్ఫోటనం ఆయన దేహంలో జరిగింది. అది ఒక ఆటంబాంబు పేలుడు లాంటిది. ఆ రోజునుంచీ ఏడురోజులపాటు ఆయనలో అనేక మార్పులు చకచకా జరుగుతూ వచ్చాయి. ఏడవనాటికి అవి పూర్తయ్యాయి. అప్పటివరకూ ఆయనకున్న మనస్సు నాశనమైపోయింది. ఆలోచన పూర్తిగా అంతరించింది.

బుద్ధునికి రావిచెట్టు క్రింద జ్ఞానోదయమైంది. రావిచెట్టు బ్రహ్మ-విష్ణు-శివుల సమ్మిళిత స్వరూపం. యూజీగారికి చెస్ట్ నట్ వృక్షం క్రింద అమనస్కస్థితి సిద్ధించింది. మహనీయులకు అటువంటి స్థితులను అందించిన వృక్షాలకు కూడా చాలా ప్రాముఖ్యతలుంటాయి. అయితే అవి అందరికీ అర్ధం కావు.

ఈ చెట్టును సంస్కృతంలో నాగకేసర వృక్షమంటారు. నాగాహ్వ, అహిపుష్ప అనికూడా  అంటారు. నాగకేసరమనే మాట కుండలినీశక్తికి, వికసించిన యోగచక్రాలకు సూచిక. ఆ చెట్టు క్రిందనే యూజీగారికి అటువంటి స్థితి కలగడం కాకతాళీయం ఏమాత్రం కాదు. అది ప్రకృతి చేసిన ఒక మార్మిక ఏర్పాటు మాత్రమే.

ఇక్కడ మరొక్క విషయాన్ని చెప్తాను. రామకృష్ణులు నాగకేసరపుష్పాలను చాలా ఇష్టపడేవారు.

అప్పటివరకూ యూజీగారిని ఆయన మనస్సు నడుపుతూ వచ్చింది. ఆ క్షణంనుంచి అది నశించిపోయింది. విశ్వమంతా నిండి ఉన్న ఏదో ఒకశక్తి ఆయన దేహాన్ని తన అదుపులోకి తీసుకొని, సూటిగా దానిని నడపడం మొదలుపెట్టింది. దాని పనిముట్లు దేహంలోని ఎండోక్రిన్ గ్రంధులు. ఆయనలోని పినియల్, పిట్యూటరీ గ్రంధులు పూర్తిగా ఉత్తేజితాలై, విశ్వశక్తికి ప్రతిస్పందిస్తూ, ఆయన  దేహాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకుని నడపడం మొదలుపెట్టాయి. ఇన్నాళ్లూ ఆ పనిని మనసు చేస్తూ ఉండేది. ఇప్పుడు విశ్వశక్తి, గ్రంధుల వ్యవస్థ దానిని తమ చెప్పుచేతలలోకి తీసుకున్నాయి.

యోగపరిభాషలో ఈ రెండుగ్రంథులను 'ఆజ్ఞాచక్రం (పిట్యూటరీ గ్రంధి), సహస్రారచక్రం (పినియల్ గ్రంధి)' అంటారు. ఆజ్ఞాచక్రానికి రెండుదళాలున్నాయని యోగశాస్త్రం అంటుంది. ఆ దళాలే పిట్యూటరీగ్రంథిలోని రెండు లోబ్స్ (యాంటీరియర్ లోబ్ లేదా ముందుభాగం, పోస్టిరియర్ లోబ్ లేదా వెనుక భాగం). ఇవి ఒక గింజలోని రెండు పప్పులలాగా ఉంటాయి. పిట్యూటరీ గ్రంధి దేహంలోని మాస్టర్ గ్లాండ్. అంటే దేహంలోని ప్రతిభాగాన్నీ, ప్రతిగ్రంథినీ ఇది కంట్రోల్ చేయగలదు. ఆజ్ఞాపించి నడిపించగలదు. అందుకే దీనిని "ఆజ్ఞాచక్రం" అన్నారు.

ఆజ్ఞాచక్రం జాగృతమైతే దేహంలో ఇదంతా జరగాలి. కానీ, క్రియాయోగులమని, కుండలినిని సాధించామని, లోకలోకాలు సూక్ష్మశరీరంతో తిరుగుతామని గప్పాలు కొట్టుకునే నేటి జోకర్లలో ఎవడిలోనూ ఈ మార్పులు కనిపించవు. అందుకే ప్రతివాడూ, "నాకు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయింది, కుండలిని లేచింది" అని చెబుతుంటే నాకు చచ్చే నవ్వొస్తూ ఉంటుంది. "మీ కర్మ ! అనుభవించండి" అనుకుంటూ ఉంటాను.

మన కధలోకొద్దాం.

దేనికోసమైతే దాదాపు 40 ఏళ్లుగా తాను వెదుకుతున్నాడో ఆ జ్ఞానోదయం అనేదేమీ అసలు లేనేలేదని యూజీగారికి అర్ధమైపోయింది.  తన మనసే తనకు అడ్డు అని అర్ధమైంది. ఆ మనసే ధ్వంసమైపోయింది. ఆ క్షణంలోనే ఆయన యొక్క వెదుకులాట అంతమైపోయింది. అమనస్కస్థితి ఆయనకు సిద్ధించింది.

చాలామంది "రాజయోగం" అనేమాటను తెలిసీ తెలియకుండా వాడేస్తూ ఉంటారు. సాంఖ్య, తారక, అమనస్కయోగాల కలయికకే రాజయోగమని పేరు. వీటిల్లో ఒకదానికంటే మరొకటి పైమెట్లలో ఉంటాయి. అమనస్కయోగాన్ని సాధించినవాడే రాజయోగి అనిన పదానికి అర్హుడు.

కనుక, యూజీగారు ఒక రాజయోగి అని చెప్పాలి. అందుకే ఆయన ఒక రాజులాగానే బ్రతికాడు. రాజులు సంపాదించరు. సేవకులు  మాత్రమే సంపాదిస్తారు. రాజులకు సంపాదనతో అవసరం ఉండదు. కానీ, దేనికీ వారికి లోటుండదు. యూజీగారి జీవితమే దీనికి సజీవతార్కాణం.

ఉన్నమాటను ఉన్నట్లుగా చెప్పాలంటే,  పరమహంస తోతాపురి, త్రైలింగస్వామి,  రామకృష్ణులు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు, యూజీగారు మొదలైనవారే నిజమైన రాజులు, చక్రవర్తులు. వీరిముందు, ప్రపంచపు రాజులు, రాజ్యాధినేతలు, కేవలం సేవకులు మాత్రమే.

ఇకపోతే, జ్ఞానోదయమైనవాడికి అది జ్ఞానోదయమని తెలియదు. ఆత్మజ్ఞానికి తాను ఆత్మజ్ఞానినని తెలియదు. అదే ఆ స్థితియొక్క విచిత్రం. అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు తరచూ "నాది తెలిసీ తెలియని స్థితి" అంటూ  ఉండేవారు.

యూజీగారైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఆత్మజ్ఞానమనేదే లేదు పొమ్మన్నారు. నిజమే కదా ! ఆత్మలయమైనవాడికి ఆత్మజ్ఞానమెలా మిగిలి ఉంటుంది?

ఇంకా చెప్పాలంటే, సాధనామర్గంలో ఉన్నది మనోలయం, మనోనాశాలు మాత్రమే. అప్పుడు మిగిలేదానిని 'ఆత్మ' అనుకుంటే అభ్యంతరమేమీ లేదు. కానీ ఆ ఆత్మ అనేది ఒక ఆకారమూ కాదు, ఒక స్థితీ కాదు. మరేమిటది? అదేంటో దానికే  తెలుసు. లేదా, దానిక్కూడా తెలీదేమో? మనకు మాత్రం దానిసంగతి ఏమీ తెలియదు. తెలుసుకోవడం సాధ్యం కాదు కూడా !

స్థూలంగా చెప్పాలంటే, మనల్ని నడిపించేది మన మనస్సు. మనస్సంటే ఏమిటి? జ్ఞాపకాల గుట్ట. జ్ఞాపకాన్ని నియంత్రించే మెదడు భాగం ఏమిటి? ఒకటి కాదు. చాలా ఉంటాయి. అవన్నీ కలసి జ్ఞాపకాలను దాచిపెడతాయి, మళ్ళీ గుర్తు చేస్తాయి, అదే దారిలో మనల్ని నడిపిస్తాయి. ఆ భాగాలేంటి? Hyppocampus, Amygdala, PFC, Cerebellum లు ఈ పనిని చేస్తాయి. వాటికి కావలసిన స్రావాలను పినియల్, పిట్యూటరీ గ్రంధులు విడుదల చేస్తాయి. అప్పుడు జ్ఞాపకాల పరంపర మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దీనికే మనసు అని పేరు.

అయితే, ఈ వ్యవస్థ అంతా మన జీన్ కోడ్ ను బట్టి నడుస్తుంది. దానికే సంస్కారాలని పేరు. గతజన్మలలో మనం చేసిన పనులు, ఆలోచించిన ఆలోచనలే జీన్ కోడ్ రూపంలో ఉంటాయి. వాటికి తగిన తల్లిదండ్రులకే మనం పుట్టడం జరుగుతుంది. మన జీవితాలు కూడా ఈ జీన్ కోడ్ ను బట్టే నడుస్తుంటాయి. దీనినే గతజన్మసంస్కారాలని వేదాంత - యోగ పరిభాషలో పిలుస్తారు. 

ఈ విధంగా, కోటానుకోట్ల జీవులకు ఎక్కడా పొల్లుపోకుండా వారివారి జన్మజన్మాంతరాలలో జరుగుతూ ఉంటుంది. దీనినంతా కొంచెంకూడా తేడా రాకుండా  కోట్ల ఏళ్లనుంచీ నడిపిస్తున్న మహాశక్తినే జగన్మాత, జగజ్జనని, ఆదిశక్తి అని మనం పిలుస్తున్నాము.

మామూలు మనుషులకైతే ఇదంతా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కుండలినీశక్తి నిజంగా జాగృతమైన యోగులలో అయితే, ఈ వ్యవస్థ అంతా తారుమారౌతుంది. వారి మెదడులోని అన్నిభాగాలు, కేంద్రాలు, గ్రంధులు అన్నీ పూర్తిగా నిద్రలేచి పనిచేయడం మొదలుపెడతాయి. ఒక క్రొత్తవ్యవస్థ వారి దేహాన్ని తన చెప్పుచేతలలోకి తీసుకుంటుంది. ఇక, వారి దేహంపైన వారికి నియంత్రణ ఉండదు. వారి మనస్సు ఆగిపోతుంది గనుక, విశ్వశక్తి వారిదేహాన్ని నడిపించడం మొదలుపెడుతుంది.

మనస్సు లేదు గనుక, లోకాన్ని వారు చూచేతీరు మారిపోతుంది. వారి ఇంద్రియానుభూతులు మారిపోతాయి. వారి జీవనవిధానం అంతా ఒక క్రొత్తపంథాను అనుసరిస్తుంది. వారి గతం అంతరిస్తుంది. ప్రతిక్షణం వారికి క్రొత్తగానే ఉంటుంది. ఒక అప్పుడే పుట్టినపిల్లవాడు చూచినట్లు లోకాన్ని వారు చూస్తుంటారు. వారి సంగతి వారికే అర్థంకాకుండా ఉంటుంది.  కుండలినీ జాగృతి మనిషిలో ఇన్ని మార్పులను తీసుకొస్తుంది.

ఆ రోజున యూజీగారికి ఇదే జరిగింది. ఇప్పుడు దీనివెనుక ఉన్న జ్యోతిష్యకోణాలను పరికిద్దాం.

9-7-1967 న యూజీగారి జాతకంలో శుక్ర కుజ శని బుధ శని దశ నడిచింది. చతుర్ధాధిపతిగా శుక్రుడు మనస్సును సూచిస్తాడు. కేతువుతో కలసినందువల్ల మనస్సు ధ్వంసమైపోయింది. కుజుడు పంచమాధిపతి. అంటే  బుద్ధిని సూచిస్తాడు. అక్కడున్న నీచరాహువు వల్ల బుద్ధి నాశనమైపోయింది. శని సప్తమ, అష్టమాధిపతి. మనస్సును బుద్ధిని సూచించే చంద్రబుధులతో కలసి నీచరాహువుచేత చూడబడుతున్నాడు. రాహువంటే కుండలినీశక్తి గనుక దాని జాగృతివల్ల అవి రెండూ మాయమయ్యాయి. 

అంటే, పైన చెప్పిన మెదడులోని భాగాలన్నీ  ఆజ్ఞాచక్రం (పినియల్/ పిట్యూటరీ గ్రంధుల) కంట్రోల్ లోకి వెళ్లిపోయాయి. ఇక బుధుడేమో బుద్ధికారకుడు, పైగా 12-3 భావాల అధిపతిగా భావవ్యక్తీకరణ లోపించడాన్ని సూచిస్తున్నాడు. తనలో ఏమి జరుగుతున్నదో దానిని ఏ యోగీ బయటకు చెప్పలేడు. చెప్పినా, అది వాళ్ళ అనుభవంలో లేదు గనుక, వినేవాళ్లకు అది అర్ధం కాదు.

కనుక, ఆనాటి దశ యూజీగారిలో జరిగిన కుండలినీజాగృతిని, తత్ఫలితంగా ఆయనకు సిద్ధించిన అమనస్కస్థితిని స్పష్టాతిస్పష్టంగా సూచిస్తున్నది.

ఆనాటి (9-7-1967) గోచారగ్రహాలను పరికిద్దాం.

చతుర్ధమైన తుల రాహుకేతువులచేత కొట్టబడుతూ, మనోనాశాన్ని సూచిస్తున్నది. జననచంద్రునిపైన ఉచ్ఛగురువు సంచరిస్తూ ఉత్తమగజకేసరీయోగాన్నిస్తున్నాడు. జాతకంలో ఉచ్ఛగురువు ఉండటం ఒక అదృష్టయోగం. ప్రస్తుతం కూడా గోచారగురువు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. రవిబుధులు 12 వ భావంలో పడి, బుద్ధినాశనాన్ని సూచిస్తున్నారు. 9 వ భావమైన మోక్షరాశిలో శని ఉంటూ, సిద్ధిని సూచిస్తున్నాడు. యూజీగారి జాతకంలో సర్వాష్టకవర్గులో  మీనమేషాలకు అత్యధికంగా 37 మరియు 40 బిందువులొచ్చాయి. అక్కడే గోచార శనిరాహువులున్నారు.

పై విశ్లేషణను బట్టి, ఆనాడు యూజీగారికి అమనస్కసిద్ధి కలిగిందని స్పష్టంగా గోచరిస్తున్నది. అందుకే ఆయన చెప్పినదంతా కుదించి కొద్దిమాటలలో చెప్పాలంటే, ఆయన మాటలలోనే Mind is a myth అని చెప్పవలసి వస్తుంది.

అయితే ఆయనలాంటి మనుషులు ఆమాటను చెబితే ఒక అర్ధముంటుంది. మనలాంటి వాళ్లూ, 24 గంటలూ మనసులో పడి కొట్టుకుంటున్నవాళ్లూ ఆ మాటను అంటే బాగోదు. హాస్యాస్పదంగా ఉంటుంది.

అందుకే ఆయన మనకు అర్ధం కాడు. మనస్సు పరిధిలో మాత్రమే  బ్రతకడానికి అలవాటు పడినవాళ్లకు, మనస్సును దాటిన భూమికలో నిరంతరం ఉండేవాళ్ళు ఎలా అర్ధమౌతారు?

అసలు మనం ఆయనను అర్ధం చేసుకోవలసిన అవసరమేముంది? మనం అర్ధం చేసుకోకపోతే ఆయనకొచ్చిన నష్టం మాత్రం ఏముంటుంది?

అటువంటి మనుషులకు, ఒకళ్ళు వారిని అర్ధం చేసుకుంటే ఎంత? అర్ధం చేసుకోకపోతే ఎంత? ఎవడెట్లా పోతే వాళ్లకేంటసలు?

read more " U.G - 11 (అమనస్కస్థితి) "

14, జూన్ 2026, ఆదివారం

U.G - 10 (కుండలిని - రాహుకేతువులు - తపస్వీయోగం)

చంద్రశేఖర్ గారు యూజీగారి స్మృతులను వ్రాస్తూ 'బ్రహ్మణస్పతి యోగం' అనే ఒక జ్యోతిషయోగాన్ని ఉటంకించారు.

జ్ఞానచక్రవర్తి బిరుదాంకితులైన సత్యనారాయణగారనే జ్యోతిష-వేదపండితుడొకాయన యూజీగారి జాతకాన్ని చూచి, ఆ సమయంలో (ఒకానొక సమయంలో యూజీగారు బెంగుళూరు మైసూరులను సందర్శించినప్పుడు) ఆయన జాతకంలో ఆ యోగం నడుస్తున్నదని అన్నాడు. దీనివల్ల ఈయన యొక్క సాధన ఇంకా లోతులను అందుకుంటుందని, బహుముఖతా విస్తరిస్తుందని, లోకప్రఖ్యాతి కలుగుతుందని ఆయన జోస్యం చెప్పాడట. అలాగే జరిగిందని చంద్రశేఖర్ గారు వ్రాశారు.

జ్యోతిశ్శాస్త్రంలో నాకున్న స్వల్ప అనుభవంలో అటువంటి యోగమెక్కడా నాకు గోచరించలేదు. కాకపోతే, శాస్త్రం అనంతం గనుక, పాండిత్యం కూడా ఆనంతమే గనుక, సత్యనారాయణ గారు దానినెక్కడ చూచారో మనకు తెలియదు గనుక, సందేహలాభాన్ని (benefit of doubt) ఆయనకు ఇచ్చివేసి మనం ముందుకెళదాం.

రాహుకేతువులకు కుండలినీశక్తికి ఉన్న సంబంధాన్ని ఇప్పుడు గమనిద్దాం.

జ్యోతిషశాస్త్రంలో రాహుకేతువులను ఒక మహాసర్పంగా భావిస్తాము. దానికే కాలసర్పమని పేరు.  అంటే, కాలానికే మరొక పేరు రాహుకేతువులు. కాలానికి అతీతుడైన మనిషి ఈ భూమ్మీద లేడు గనుక, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అందరూ రాహుకేతువుల అదుపులో ఉన్నవారేనని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కాలసర్పం నోటిలో చిక్కుకుని ఉన్నవారమే అందరమూ.

సర్పానికి తలా తోకా ఉంటాయి. భూమికున్న ఉత్తరదక్షిణ ధ్రువాలే అవి. భూమియొక్క ఉత్తర అయస్కాంతధృవం రాహువైతే, దక్షిణం కేతువౌతుంది. మనం "కాలము" అంటున్నప్పుడు, అది భూమిపైన మనకు అనుభవంలోకి వస్తున్న కాలంగానే మనం చూడవలసి ఉంటుంది. ఇతర గ్రహాలలో ఇతర లోకాలలో ఉన్న కాలప్రమాణాలు మనకు అవసరం లేదు. మనవరకే మనం చూడాలి. అలాంటప్పుడు, భూమిని చుట్టుకుని ఉన్న ఒక మహాసర్పంగా రాహుకేతువులను మనం భావించవచ్చు. నిజానికి అవి రెండూ భూ-అయస్కాంత శక్తులే.

కుండలినీజాగృతి జరగాలంటే జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో గాని, నీచస్థితిలో గాని ఉండాలని ఇంతకుముందు వ్రాశాను. అయితే, రాహువు వృషభంలో ఉండటానికీ, మిథునంలో ఉండటానికీ తేడా ఉంటుంది. అదే విధంగా నీచలో ఉన్నపుడు వృశ్చికంలో ఉండటానికీ, ధనుస్సులో ఉండటానికీ చాలా తేడా ఉంటుంది. కేతువుక్కూడా ఇంతే అవుతుంది. వాటిని బట్టి ఆయా జాతకుల సాధనావిధానాలు, వారికి కలిగే ఫలితాలు రకరకాలుగా ఉంటాయి.

సాధారణంగా చెప్పాలంటే, ఉచ్ఛజాతకులకు భక్తిమార్గం బాగా యోగిస్తే, నీచజాతకులకు జ్ఞానమార్గం యోగిస్తుంది. భక్తిలోనైనా, జ్ఞానంలోనైనా కుండలినీజాగృతి లేకుండా సాధన ముందుకు కదలదు. అయితే వారి దృష్టి భక్తిమీదనో జ్ఞానసిద్ధిమీదనో ఉంటుంది గాని, కుండలినిని  వారు పట్టించుకోరు. ఒక్క యోగమార్గంలో మాత్రమే దానికి విలువనివ్వడం, సూటిగా దానితో డీల్ చెయ్యడం ఉంటుంది. మిగతావారు దీనిని పట్టించుకోరు.

రాహువేమో అనుభవాలను సూచిస్తే, కేతువు వాటికి అతీతమైన స్థితిని సూచిస్తాడు.  రాహువు సహస్రారచక్రాన్ని, కేతువు మూలాధారాన్ని సూచిస్తారు. వీరు ఉచ్ఛస్థితిలో  ఉంటే జీవితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత కుండలినీజాగృతి  కలుగుతుంది. నీచస్థితిలో ఉంటే, జీవితం మొదట్లోనే అనేక ఎదురుదెబ్బలు, గందరగోళాలు జరిగి, జీవితంపైనా మనుషులపైనా విసుగుపుట్టి వైరాగ్యంవైపు మరలుతారు. ఆ ఫలితంగా కుండలినీజాగృతి కలుగుతుంది. ఈ విధమైన తేడాలు జాతకాలలో ఉంటాయి.

ఆయా జాతకాలలో ఉన్న మిగతా గ్రహస్థితులను బట్టి, రాహుకేతువులపైన వారి దృష్టులను, ప్రభావాలను బట్టి వారివారి దారులుంటాయి.

యూజీగారి జాతకంలో రాహుకేతువులు వృశ్చిక - వృషభరాశులలో నీచస్థితిలోను, చంద్రుని నుండి రాహువు బుద్ధిస్థానంలో ఉండటంతో ఆయనది జ్ఞానమార్గపు ఛాయ అయింది. 

నాకు తెలిసినంతవరకూ యూజీగారి జాతకంలో బ్రహ్మణస్పతి యోగం కంటే, తపస్వీయోగం బలంగా ఉన్నది. ఈ యోగాన్ని గురించి జైమినీమహర్షి యొక్క జ్యోతిషసూత్రములలో  మనకు కనిపిస్తుంది.

సూ || శనిదృష్టే తపస్వీ ప్రేష్యో వా || (జైమిని సూత్రములు 1:2:36)

కారకాంశకు జైమినిమహర్షి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. కారకాంశలో ఉన్న కేతువును శని చూస్తూ ఉన్నట్లయితే ఆ జాతకుడు తపస్విగాని, సేవకుడు గాని అవుతాడని ఆయనన్నాడు. ప్రతి ఉద్యోగీ ఒకవిధంగా సేవకుడేగాని, ఇక్కడ సేవకుడంటే చిన్న ఉద్యోగని అర్ధం చేసుకోవాలి. 

శనికేతుయోగం దరిద్రాన్నిస్తుంది. అది కర్మఫలితంగా వచ్చేది కావచ్చు, లేదా ఖర్మకాలి తను ఆహ్వానించేది కావచ్చు. తపస్సుకు కేతువు, సేవకత్వానికి శనీ కారకులు. కనుక మహర్షి ఈ విధమైన సూత్రాన్ని మనకు ఇచ్చారు.

గతకర్మవల్ల ఈ యోగం ఏర్పడితే, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ఒకరిక్రింద ఊడిగం చేసుకుంటూ, డబ్బుకోసం ఇబ్బంది పడుతూ, దరిద్రంలో బ్రతికే పరిస్థితి వస్తుంది. ఖర్మకాలి వచ్చే పనైతే, అన్నీ ఉన్నప్పటికీ, నిరాడంబరంగా బ్రతకడం, తినగలిగి ఉన్నా ఉపవాసాలుంటూ మాడటం, లంకంత కొంప ఉన్నా, ఒక చిన్నరూములో చాప వేసుకుని పడుకోవడం, లేదా ఆస్తులన్నీ వదులుకుని ఒక ఆశ్రమంలో ఉండటం, ఒంటిపూట తినడం మొదలైనవి జరుగుతాయి. అది ఆరోగ్యం కోసం కావచ్చు, సాధనగా కావచ్చు. ఎలాగైతేనేమి, చివరకు ఇలాగే  జరుగుతుంది. 

గ్రహాలమధ్యన ఉన్న పఞ్చవిధసంబంధాల వల్ల యోగాలేర్పడతాయి. భారతీయ జ్యోతిషశాస్త్రమంతా గ్రహయోగాలపైననే ఆధారపడి ఉంటుంది. జాతకంలోని యోగాలను సరిగ్గా గుర్తించడం వస్తే, జ్యోతిషంలో పట్టు చిక్కినట్లే అవుతుంది. ఈ విషయాన్ని పాతపోస్టులలో వివరించాను. కనుక, శనికేతువుల మధ్యనున్న ఐదువిధాలైన సంబంధాలవల్ల తపస్వీయోగం ఏర్పడుతుందని స్థూలంగా అర్ధం చేసుకోవచ్చు.

యూజీగారి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

యూజీగారి జాతకంలో లగ్నం, శనికేతువుల అర్గళంలో ఉన్నది. కేతువు 12 వ భావంలో నీచస్థితిలో ఉంటూ శుక్రుడినే సూచిస్తున్నాడు. శుక్రునితో కలసి ఉన్నాడు. ఈ విధంగా వీరి జాతకంలో తపస్వీయోగం ఏర్పడింది.

అందుకనే, 1961 లో శుక్రదశ మొదలు కావడంతోనే ఆయన "సంపాదన" అనే మాటను తన జీవితంలోనుంచి తీసివేశాడు. ఆయన దగ్గర డబ్బులు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కానీ సంపాదన పైన ఆసక్తి పోయింది. ఎలా బ్రతకాలి? ఏమో? దానికి జవాబు లేదు. కానీ సంపాదన పైన ఇచ్ఛ లేదు. ఇచ్ఛలేనపుడు చెయ్యడం ఎలా సాధ్యమౌతుంది? కాదు. అందుకని ఆయన డబ్బు సంపాదించే ప్రయత్నాలేమీ చేయలేదు. అప్పటికాయనకు కేవలం 43 ఏళ్లే. చేతిలో ఒక్క రూపాయి లేకుండా ఆయన జీవితం నుండి రిటైర్ అయిపోయాడు. కానీ, చీకూచింతా లేవు. ఇది తపస్వీయోగ ప్రభావం.

ఆ తరువాత ఆయన 46 ఏళ్ళు బ్రతికాడు. కాణీ సంపాదన లేదు. కానీ, సాధారణ జీవనానికి ఎక్కడా లోటురాలేదు. ఆ విధంగా ఆయనను చూచుకునేవారిని జగన్మాత ఎక్కడికక్కడ ఏర్పాటు చేసింది.

పైగా, 1963 లో కుండలినీజాగృతి కలిగిన సమయంలో ఆయనకు నడిచిన దశకూడా శుక్ర శుక్ర శని శుక్ర శుక్ర దశనే. ఈ జాతకంలో కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడు. కనుక అది కేతు శని దశనే అవుతుంది. అందుకే, అప్పటినుండి తపస్వీయోగం ఆయన జీవితాన్ని ఆక్రమించింది.

అంతేకాదు, 1963 మే నెలలోనే గోచారంలో కూడా ఇదేయోగం మొదలైంది. ఆ సమయంలో కేతువు ధనుస్సులోకి వచ్చి ఉచ్ఛస్థితిని అందుకున్నాడు. మకరంలో ఉన్న శని తన వక్రత్వం వల్ల ధనుస్సులోకి వచ్చి కేతువును కలసినట్లే అవుతుంది. జూలై నెల వచ్చేసరికి, మిధునం నుండి వీరిని శుక్రుడు చూస్తున్నాడు. కనుక సంసారం దూరం కావడం, కుండలినీజాగృతి, అమనస్కస్థితి మొదలైనవన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఇవన్నీ తపస్వీయోగ ప్రభావాలే.

గోచారగురువు కూడా దీనికి ఆసరాగా ఉంటూ, నవమభావంలో స్వస్థానంలోకి వచ్చి, జననకాలచంద్రుడిని, అక్కడున్న బుధశనులను చూస్తున్నాడు. ఇది తీవ్రవైరాగ్యాన్ని, అంతర్ముఖత్వాన్ని ఇచ్చింది.  

ఈ విధంగా యూజీగారి జాతకంలో, మిగిలిన యోగాలకంటే తపస్వీయోగప్రభావం చాలా ఎక్కువగా పనిచేసిందని చెప్పాలి.

ఆయనకు అమనస్కస్థితి సిద్ధించిన 9-7-1967 న కూడా ఇదేయోగం ఏ విధంగా పనిచేసిందో ఇప్పుడు గమనిద్దాం.

(ఇంకా ఉంది)

read more " U.G - 10 (కుండలిని - రాహుకేతువులు - తపస్వీయోగం) "

13, జూన్ 2026, శనివారం

U.G - 9 (కెలామిటీ)

U.G  గారి జీవితంలో కెలామిటీ అనేది చాలా ముఖ్యమైన సంఘటన. దీనిని సాంప్రదాయిక యోగపరిభాషలో అయితే 'కుండలినీజాగృతి' అని  చెప్పాలి.

ఈయనేమో ఆధ్యాత్మికతకున్న సాంప్రదాయవివరణలకు భిన్నంగా తనదైన ప్రాణిక-భౌతికపదాలలో దానిని వివరించాడు గనుక కెలామిటీ (విపత్తు లేదా మహాప్రమాదం) అన్నాడు. పదాలేవైనా పదార్ధం ఒకటే గనుక,  అర్ధం చేసుకోగలిగితే ఇబ్బంది  లేదు. అదిలేనప్పుడే అన్ని ఇబ్బందులూ వచ్చేది !

మొన్న బెంగుళూరులో చంద్రశేఖర్ గారిని కలిసినపుడు, యూజీగారు ఇలా అనేవారని ఆయనన్నారు, "ఎవరైనా జ్యోతిష్యశాస్త్ర పరిశోధకులు, నా జాతకాన్ని ప్రామాణికంగా  తీసుకోవచ్చు. నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ జ్యోతిషశాస్త్ర  ప్రకారమే జరిగాయి" అని ఆయన ఆనేవారట. యూరోప్ లో ఉన్న సమయంలో స్వయానా ఆయనే హస్తసాముద్రికాన్ని సరదాగా నేర్చుకున్నారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు.

ఆయన సమక్షంలో చాలామంది ప్రసిద్ధజ్యోతిష్కులు ఆయన జాతకాన్ని విశ్లేషించారు. వారి విశ్లేషణలను ఆయన సరదాగా వింటూ ఉండేవారు.

ఇప్పుడు కెలామిటీని జ్యోతిషశాస్త్ర పరంగా పరిశీలిద్దాం.

ప్రప్రధమంగా ఆయనకు కుండలినీజాగృతి అనేది లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ లో ఉన్న సమయంలో కలిగింది. అక్కడి సాధువులు భక్తులు అందరూ జపధ్యానాలు చేస్తూ ఉండటం చూసి, వాళ్లంతా సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, అలాంటి సాధనలవల్ల ఏమీ ఉపయోగం లేదని యూజీగారు అనుకున్నారు.  ఏమంటే, అవన్నీ ఆయన తన 14-21 ఏళ్ల మధ్యలో స్వామి శివానందగారి పర్యవేక్షణలో హిమాలయాలలో చేసి ఉన్నాడు. కనుక అవన్నీ ఆయనకు బాగా తెలిసినవే.

అలా అనుకుంటూ శూన్యమనస్సుతో అలా కూచుని ఉండగా, ఉన్నట్టుండి ఏదో శక్తి తనలో క్రిందినుండి పైకి సుడులుగా తిరుగుతూ  పైపైకి లేస్తున్నట్లు ఆయన అనుభూతి చెందాడు. అది కాసేపు సవ్యదిశలోనూ, మరికాసేపు అపసవ్యదిశలోనూ తిరుగుతున్నది. అంతకుముందు విమానాశ్రయంలో తను చూసిన విల్స్ సిగరెట్ యాడ్ లో పొగ సుడులు తిరుగుతున్న విధంగా అది ఆయనకు అనిపించింది.

ఇది 1963 లో  జరిగింది. ఆ ఏడాది వేసవిలో ఆయన లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ లో ఆశ్రయాన్ని పొంది, మూడునెలలపాటు అక్కడున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7 వ తేదీన ఆ ఆశ్రమ స్వామీజీకి ఒక ఉత్తరాన్ని వ్రాసి అక్కడనుండి బయటకు వచ్చేశాడు.

కనుక జూన్ నెల నుండి మూడు నెలలపాటు ఆయన లండన్ లో ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఆ సమయంలో ఆయనకు శుక్రమహర్దశ నడుస్తున్నది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, శుక్ర శుక్ర శని శుక్ర దశ నడుస్తున్నది. ఏరోజున ఈ సంఘటన మొదటిసారి జరిగిందో ఆయనయొక్క జీవితచరిత్రలలో ఎక్కడా దొరకడం లేదు గనుక, ప్రాణదశను ఖచ్చితంగా గుర్తించడం సాధ్యం కావడం లేదు. కానీ త్రవ్వి బయటకు తీయవచ్చు.

యూజీ గారి జీవితంలో శుక్రమహర్దశ 4-4-1961 న మొదలైంది. దీనిలోనే ఆయనకు కుండలినీ జాగృతి కలిగింది. దానికి కారణాలేమిటో జాతకం నుండి గమనిద్దాం.

జాతకంలో శుక్రకేతు యోగాన్ని కలిగి ఉండటం కుటుంబపరంగా, జాతకపరంగా అంత మంచిది కాదు. ఇది భార్యావియోగాన్నిస్తుంది. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆందులోనూ, ఈయన జాతకంలో నీచకేతువున్నాడు. శుక్రక్షేత్రంలో ఉండటంతో మళ్ళీ శుక్రుడినే సూచిస్తున్నాడు. కనుక 1961 లో శుక్రమహర్దశ ఆయనను ఒంటరివాడిని చేసేసింది. 

నిజానికి 1959 లో అమెరికాలో ఉన్న సమయంలోనే ఈయన కుటుంబంలో కలతలు మొదలైపోయాయి. అమెరికాలో ఉండలేక కుటుంబంతో సహా ఇండియాకు వెళ్ళిపోదామని అప్పుడే నిశ్చయం జరిగిపోయింది. ఆ సమయంలో ఆయనకు కేతు శని దశ నడుస్తున్నది. కర్కాటకరాశికి శని సప్తమాధిపతి అవుతాడు. కేతువుచే సూచింపబడుతున్న శుక్రుడు బాధకుడౌతాడు. కనుక, ఆ దశలోనే కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. కానీ భార్యాపిల్లలతో ఇండియాకు వెళ్లకుండా ఈయన యూరప్ లో ఉండిపోయాడు.

యూజీగారి జాతకంలో కాలసర్పయోగం ఉన్నది. అందుకే, కేతుదశలో కోటీశ్వరుడల్లా బికారైపోయాడు. 1955 ప్రాంతాలలోనే లక్షరూపాయలకు చెక్కురాసి ఇవ్వగల ఆస్తిపరుడాయన. కానీ ఆ ఆస్తినంతా పెద్దకొడుకుకు అమెరికాలో ఇప్పించిన పోలియో ట్రీట్మెంట్ రూపంలో మింగేసిన కేతువు ఆయనను బిచ్చగాడిగా మార్చి యూరప్ వీధులలో వదిలేశాడు.

సరిగా ఇదే సమయంలో ఆయనకు శుక్రదశ మొదలైంది.

డిగ్రీపరంగా శుక్రుడొక్కడే దీనికి బయట ఉన్నాడు. కనుక కాలసర్పం నోటపడకుండా తప్పుకున్నది శుక్రుడొక్కడే. కనుకనే రాహుకేతుస్వరూపమైన కర్మకు అతీతస్థితిని తన దశలో అందించాడు.

చంద్రలగ్నం నుంచి రాహుకేతువులు 5-11 ఇరుసులో నీచస్థితిలో  ఉన్నారు. కనుక బుద్ధిని నశింపజేసే జ్ఞానయోగవిధానం ఈయనదై  కూచుంది. రాహువున్నది వృశ్చికరాశి గనుక, కుండలినీయోగం దానికి తోడైంది.

నవాంశచక్రాన్ని గమనిస్తే ఒక విచిత్రమైన యోగం మనకు గోచరిస్తుంది. లగ్నంలో ఉన్న శుక్రుడిని మిగతా అన్ని గ్రహాలూ ఒక చక్కని వ్యూహంలో ఆర్గళంలో బంధించాయి. 

2-12 ఇరుసులో చంద్రకుజులు, 3-11 లో బుధ సూర్యులు, 4-10 లో రాహుకేతువులు, 6-8 లో  దృఢకర్మ గ్రహాలైన గురుశనులు వెరసి అన్ని గ్రహాలూ తమతమ శక్తులను శుక్రునిపైన కేంద్రీకరించాయి. కనుక, ఎన్నో జన్మలనుంచి చేస్తున్న సాధన ఈ శుక్రదశలో ముగింపుకు వచ్చింది. జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని అందించింది.

ఆనాటి గోచారగ్రహాలను గమనిద్దాం.

1960 - గురుశనులు ధనూరాశిలో ఉన్నారు. ఇది కర్కాటకరాశికి కర్మస్థానమౌతుంది. 

1961 - ఇద్దరూ మకరంలోకి మారారు. గురువు నీచస్థితిలో పడ్డాడు. శని స్వస్థానంలో బలంగా ఉన్నాడు. కానీ గురుయుతి మంచిది కాదు. గోచారంలో ఇటువంటి స్థితి ఉన్న సమయంలో ఈయనకు శుక్రమహర్దశ మొదలైంది.

1962 - శని మకరంలో ఉండిపోయాడు. గురువు కుంభంలోకి ప్రవేశించాడు.

1963 - గురువు మీనంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకూ యూజీగారు లండన్ లోని రామకృష్ణా మిషన్ బ్రాంచిలో ఉన్నాడని పైన చెప్పాను. అప్పుడే కుండలినీజాగృతిని ఈయన మొదటిసారిగా అనుభూతి చెందాడు.

ఇది జూలైలో జరిగి ఉంటుందని నా భావన. కారణమేమంటే, జూలై 9 న ఈయన జన్మించాడు. 1967 లో ఈయనకు కలిగిన జ్ఞానోదయం వంటి స్థితి కూడా అదే తేదీన కలిగింది. దానికి నాలుగేళ్ళ ముందు కుండలినీ జాగృతి జరిగిందని ఆయన అన్నాడు. కనుక 1963 జూలై 9 న ఈ సంఘటన జరిగి ఉంటుందని నా భావన. ఇదే నిజమైతే ఆనాడు ప్రాణదశ కూడా శుక్రుడే నడిచింది. కనుక, ఆ రోజున యూజీగారి జాతకంలో శుక్ర శుక్ర శని శుక్ర శుక్ర దశ నడిచింది. ఆనాటి గ్రహస్థితిని ఈ చార్టులో చూడండి.

ఆయన జననలగ్నమైన మిధునంలో నాలుగు గోచార గ్రహాలున్నట్లుగా మనం చూడవచ్చు. వీరిలో గోచారరవి సరిగ్గా జననరవి పైన సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో ఉన్నారు. శనిచంద్రులు కలసి సప్తమంలో అస్తమిస్తూ శూన్యమానసాన్ని సూచిస్తున్నారు. నవాంశలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. బుధుడు నీచస్థితిలో ఉంటూ బుద్ధి మాయం కావడాన్ని సూచిస్తున్నాడు.మిధునంలోని నాలుగు గ్రహాలు ఈయన యొక్క రాశియైన కర్కాటకం నుండి 12 వ భావంలో ఉంటూ అంతచ్ఛేతనలోని శక్తి జాగృతం కావడాన్ని సూచిస్తున్నాయి.

ఇక్కడ ఇంకొక విచిత్రం  ఉన్నది. స్విట్జర్లాండ్ లో ఈ సంఘటన జరిగిన సరిగ్గా మూడురోజులకు జూలై 13 వ తేదీన ఇండియాలో నేను పుట్టాను. కనుక, ఒక్క చంద్రుని స్థితి తప్ప, నా జాతకచక్రం కూడా ఇదే. యూజీగారికి కుండలినీజాగృతి కలిగినది నేను పుట్టినది, కేవలం మూడురోజుల తేడాతో, ఒకే సమయంలో జరిగింది.

అది 1963 వ సంవత్సరం. మళ్ళీ ఇన్నాళ్లకు, సరిగ్గా నాకు 63 వ ఏట బెంగుళూరు వెళ్లి చంద్రశేఖర్ గారి ఇంటిలో యూజీగారి గదిని దర్శించి వచ్చాను. ఇదంతా అనుకోకుండా జరిగింది. ప్లాన్ వేసుకొని చేసినది కాదు. ఇవన్నీ కాకతాళీయం కాదని, వీటి వెనుక మామూలు దృష్టికి కనిపించని కర్మసంబంధాలున్నాయని నా భావన. ప్రస్తుత టాపిక్ అది కాదు గనుక, అందరికీ వీటిని వివరించవలసి పని లేదు గనుక, ఆ రహస్యాలలోకి ఇంతకంటే ఎక్కువగా పోవడం లేదు.

నేడు కుండలిని అనేది ఒక ఫేషన్ అయిపోయింది. అందులోను విదేశీయుల చేతులలో పడి కుండలిని, చక్రాలు మొదలైనవన్నీ భ్రష్టు పడుతున్నాయి. డ్రగ్సు వాడడం, పిచ్చిపిచ్చిగా అరవడం, గెంతడాన్నే కుండలిని అని చెబుతున్నారు. ఇదంతా పెద్దమాయ.

మార్కెట్లో కనిపించే కుండలిని అంతా వ్యాపారమే. కుండలిని కోర్సులు, చక్రా హీలింగ్ కోర్సులు, చక్రా రేకీ కోర్సులు, మెడిటేషన్ క్లాసులు అన్నీ బూటకాలే. వీళ్ళలో ఎవరికీ కుండలిని గురించి ఏమీ తెలియదని నేను ఘంటాపథంగా చెప్పగలను.

కుండలినీ జాగృతి అనేది అందరికీ కలగదు. అలా జరిగినవారిలో కూడా పూర్ణజాగృతి అనేది మళ్ళీ వెయ్యిమందిలో ఒకరికి మాత్రమే అవుతుంది. దానికి మార్మికమైన కారణాలున్నాయి. కుండలినీ జాగృతి జరగడానికి కావలసిన దైహిక, ప్రాణిక, మానసిక అర్హతలు చాలామందిలో ఉండవు. అదే దీనివెనుక ఉన్న ముఖ్యమైన కారణం !

ఇంకా చెప్పాలంటే, ఆధ్యాత్మికత అనేది అందరికీ పనికొచ్చే బటాణీ కాదు. మానవులలో చాలామంది ఆధ్యాత్మికతకు అస్సలు పనికిరారు. పనికొస్తాం అని వాళ్ళనుకోవచ్చు, కానీ పనికిరారు. ఆధారాలు లేకుండా కేవలం మనం ఊరకే అనుకున్నంతమాత్రాన అన్నీ నిజాలైపోవు. ఈ రంగంలో గత ఏభై ఏళ్లుగా నేను చేస్తున్న పరిశీలన, పరిశోధనల వల్ల నేనీ అభిప్రాయానికొచ్చాను. 

జీవితంలోని అన్ని సంఘటనలకూ జాతకంలోని గ్రహాలకూ ఖచ్చితమైన సంబంధం  ఉంటుంది.  అదేవిధంగా,కుండలినికి కూడా ఉంటుంది !

ఒకనికి కుండలినీజాగృతి కలగాలంటే అతని జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్థితులలో  గాని, నీచస్థితులలోగాని ఉండాలి. అదికూడా, మిధున-ధనూరాశుల ఇరుసులో వీరున్నపుడు మాత్రమే ఈ అద్భుతం సాధ్యమౌతుంది.

యూజీగారి జాతకంలో రాహుకేతువులు వృశ్చిక-వృషభరాశుల ఇరుసులో నీచస్థితిలో ఉన్నాయి. కనుక ఈయనకు కుండలినీ జాగృతి విధిగా వ్రాసిపెట్టి ఉన్నది. కానీ 1963 లో రాహుకేతువులు మిధున - ధనూరాశులలో ఉచ్ఛస్థితిలోకి వచ్చిన సమయంలో మాత్రమే జాతకంలో ఈ యోగం జాగృతమైంది.

5, మే 1963 న రాహువు మిధునరాశిలోకి కేతువు ధనూరాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిలోకి వచ్చారు. అప్పటికింకా యూజీగారు దిక్కులేనివాడిగా లండన్ వీధులలో తిరుగుతూనే  ఉన్నాడు.కానీ చేతిలో డబ్బులు అయిపోవస్తున్నాయి. పగలంతా వీధులలో తిరుగుతూ, రాత్రిళ్ళు హైడ్ పార్కులో పడుకుంటూ, ఒక పిచ్చివాడిలాంటి స్థితిలో ఆయన ఉండేవాడు. అదేసమయంలో  ఒకనాడు పోలీసుచేత హైడ్ పార్కు నుండి వెళ్లగొట్టబడ్డాడు. ఇది 1963 జూన్ నెలలో జరిగింది.

ఆ సమయానికి ఆయన చేతిలో అయిదు పెన్నీలు మాతమే మిగిలి ఉన్నాయి.  అవికూడా అయిపోయాక ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? అని ఆలోచిస్తూ ఉండగా, రామకృష్ణా మిషన్ సెంటర్ కు వెళ్లమనిన ఒక సూచన ఆయనకు అందింది. అందుకని, ఆ అయిదు పెన్నీలతో వచ్చిన స్టేషన్ వరకూ టికెట్టు కొనుక్కుని, అక్కడ దిగి, అక్కడనుండి లండన్ రామకృష్ణా మిషన్ కు నడుచుకుంటూ వెళ్ళాడు. 

ఆ సమయంలో స్వామి ఘనానందగారు ఆ కేంద్రానికి అధ్యక్షులుగా ఆన్నారు. 1948 లో ఆ కేంద్రాన్ని ఆయనే స్థాపించి, 1969 లో చనిపోయేవరకూ ఆయనే దానిని నడిపారు.

ఆయన రామకృష్ణుల ప్రత్యక్షశిష్యుడైన స్వామిశివానందగారి శిష్యుడు. శివానందస్వామివారు నా పరమగురువులు. మా గురువుగారైన గంభీరానందగారు, ఘనానందగారు ఇద్దరూ సోదరశిష్యులు.  ఈవిధంగా, యూజీగారికీ నాకూ ఉన్న అనుబంధం రామకృష్ణుల ద్వారానే కలిగింది.

మొన్న బెంగుళూరులో చంద్రశేఖర్ గారి ఇంటికెళ్ళినపుడు, అక్కడున్న రజని అనే యూజీగారి ఫాలోయర్, 'యూజీగారితో మీకెలా పరిచయం?' అని ఒక మాటను అడిగారు.

'నేనాయనను చూడలేదు' అని చెప్పాను.

 'మరి?' అని ఆమె అడిగారు.

దానికేదో నెట్లో చదివానని ఆమెతో చెప్పాను. కానీ, నెట్లో చదివినంతమాత్రాన, పుస్తకాలు చదివినంత మాత్రాన అందరూ మనల్ని కదిలించరు. వెళ్లి వాళ్ళను కలవాలని కూడా అనిపించదు. అలా  అనిపించాలన్నా, అలా ఒకరిని కలవాలన్నా, ఆ వెనుక బలమైన కర్మసంబంధాలుండాలి. వాటినెలా వివరించి మీటింగులలో అందరితో చెప్పగలం? కనుక ఆమెకు అలా చెప్పాను.

స్వామి ఘనానందగారు యూజీగారి పరిస్థితిని విని, తమ ఆశ్రమంలో ఆయనను ఉండమని ఆశ్రయం ఇచ్చారు. Complete Works of Swami Vivekananda పుస్తకాల ప్రూఫ్ రీడింగ్ చెయ్యమని యూజీగారికి చెప్పారు. ఆయన ఆ పనిని చేసుకుంటూ అక్కడ ఉంటూ  ఉండేవారు. ఆ విధంగా 1963 జూన్ నెల నుండి సెప్టెంబర్ 7 వ తేదీ వరకూ మూడు నెలలపాటు  రామకృష్ణులు ఆయనకు ఆశ్రయాన్నిచ్చి కాపాడారు.

రామకృష్ణులంటే కాళికామాతనే. కాళికామాతనే కుండలినీశక్తి. కాళీఅనుగ్రహం లేనిదే ఎవరికీ కుండలినీజాగృతి అనేది కలగదు.

లండన్ రామకృష్ణా మిషన్ ఆశ్రమంలో ఉన్న సమయంలోనే ఆయనకు కుండలినీ జాగృతి కలిగింది. ఈ విధంగా లోకానికి అర్ధం కాని కర్మరహస్యాలు మహనీయుల జీవితాలలో చాలా ఉంటాయి. తరచి చూస్తేగాని వాటి లోతుపాతులు అర్ధం కావు.

(ఇంకా ఉంది)

read more " U.G - 9 (కెలామిటీ) "

10, జూన్ 2026, బుధవారం

అవతార ప్రయోజనం

'గురువుగారు ! మీ అవతార ప్రయోజనం ఏమిటి?' అని ఒక శిష్యపరమాణువు ఇప్పుడే ఫోన్లో అడిగాడు.

తడుముకోకుండా, 'చిక్కుముడులు విప్పడం, చిక్కుల్లో పడెయ్యడం' అని చెప్పాను.

అవతలనించి మౌనం !

'ఏం !  అర్ధం కాలేదా ?' అడిగాను.

'లేదు. ఈ మాటే పెద్ద చిక్కుముడిలాగా ఉంది' అన్నాడు.

'నీ మనసులో మాట బయటికి రానీయ్' అన్నాను.

'ఎప్పుడో 30 ఏళ్ళక్రితం తప్పిపోయిన రాజ్ కిరణ్ జాతకం ఇప్పుడెందుకు గురూగారు?' అన్నాడు చనువుగా.

'రహస్యం చెప్పనా?' గొంతు తగ్గించి గుసగుసగా అడిగాను.

రహస్యమనేసరికి మనవాడికి ఉత్సాహం ఎక్కువైపోయింది.

'చెప్పండి చెప్పండి' అన్నాడు.

'నిన్న రాజ్ కిరణ్ కనిపించి, తన జాతకం రాయమన్నాడు. సోమీ అలీ లాంటి కొందరు తనకోసం ఇంకా  వెదుకుతున్నారని, బాలీవుడ్ కూడా తనకోసం వెదుకుతోందని చెప్పాడు. ఈ సందిగ్దతకు ఆఖరుచుక్క పెట్టమన్నాడు. అందుకే రాశా' అన్నాను.

'పోయినోళ్ళ జాతకాలెందుకు గురూగారు? బ్రతికున్న మావి చెప్పచ్చు కదా !' అడిగాడు.

'నాకు బ్రతికున్నవాళ్ళు ఇష్టం ఉండరు' అన్నాను.

'మాకు ఉపయోగంగా ఉంటుంది కదా?' అడిగాడు.

'మీకు  ఉపయోగపడాల్సిన పని నాకు లేదు. ఎవరికి నిజంగా అవసరమో నాకు తెలుసు. వారికే పడతాను. ఇదే నా అవతార ప్రయోజనం' అన్నాను సీరియస్ గా.

'మాకోసం దాన్ని కొంచెం మార్చుకోలేరా?' దీనంగా అడిగాడు.

'లేను. పెట్టెయ్ ఫోను' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

read more " అవతార ప్రయోజనం "

29, మే 2026, శుక్రవారం

నిజమైన అవధూత









వారం పాటు బెంగుళూర్లో మకాం.

సోమవారంనాడు శ్రీ కొర్లిమర్ల చంద్రశేఖర్ బాబు గారి ఇంటికెళ్లి వారిని కలసి వచ్చాను. వారిల్లు బనశంకరిలో ఉంది. కానీ నాకు అడ్రసు తెలియదు. ఆమాటకొస్తే బెంగుళూరులో ఎక్కడేముందో కూడా నాకు తెలియదు. అందుకని, ముందుగా మెట్రోరైల్లో 'మైసూర్ రోడ్' స్టేషన్లో దిగి 'వాలెంటైన్ పబ్లిక్ స్కూల్' కు వెళ్లి, అక్కడ వారిని కలుసుకున్నాను. 

నేను వెళ్లిన సమయానికి వారు స్కూల్లో లేరు. అక్కడ స్టాఫ్ ను అడిగి వారి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాను. ఆయన ఫోనెత్తగానే, 'నేను మీ స్కూలు నుంచి మాట్లాడుతున్నాను' అన్నాను.

ఆయన ఆశ్చర్యపోయారు.

'మీ నంబర్ నావద్ద ఉండేది. ఎలాగో పోయింది. ఎన్నో ప్రయత్నాలు చేశాను. దొరకలేదు. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు మిమ్మల్ని అనుకున్నాను. ఉన్నట్టుండి మీరే వచ్చేశారు' అన్నారాయన.

'ఇంతకుముందు నా నంబర్ నా బ్లాగులో ఉండేది. ఎవరుపడితే వాళ్ళు ఫోన్లు చేసి పిచ్చిగోలంతా మాట్లాడుతున్నారని తీసేశాను ' అన్నాను.

2020 లో హైద్రాబాద్ లో ఉన్న రోజులలో యూజీగారి గురించి బ్లాగులో వ్రాశాను. అది చదివి ఆయన నాకు ఫోన్ చేశారు. యూజీగారి మీద ఆయన వ్రాసిన Stopped in our tracks అనే ఆణిముత్యాలవంటి పుస్తకాలను నాకు పంపించారు.  నా శ్రీవిద్యారహస్యాన్ని ఆయనకు పంపించాను. ఆ విధంగా మాకు పరిచయం ఏర్పడింది. ఈనాటికి నేనే ఆయనను వెతుక్కుంటూ వెళ్లాను.

కాసేపట్లో స్కూలుకు వచ్చి. వారి కారులో ఇంటికి తీసుకెళ్లారు. వారిని చూడటంతోనే ఎప్పటినుంచో పరిచయం ఉన్న మనిషిలా అనిపించారు.

వారి ఇంటిముందు నిలబడటంతోనే నాకు ధ్యానస్థితి మొదలైపోయింది. యూజీగారు ఎన్నోసార్లు వచ్చిన ఇల్లది. అలాంటి చోట ట్రాన్స్ కలగడం వింతెలా అవుతుంది?

ఇంటిలోకెళ్ళి చూస్తే, ఇల్లంతా యూజీగారి ఫోటోల మయం. అక్కడనుండి మొదటి అంతస్తులో యూజీగారు ఉన్న గదికి నన్ను తీసికెళ్లారు. అది 9x7 అడుగుల చిన్నగది. అద్భుతమైన ఆరా ఆ అంతస్తులోను, ఆ గదిలోనూ అలుముకొని ఉంది. ఇండియాకు వచ్చిన ప్రతిసారి ఇదే గదిలో యూజీగారు ఉండేవారు.

గత ఏభై ఏళ్లనుంచి నాకు ఆధ్యాత్మికం తెలుసు. ఎన్నోచోట్ల తిరిగాను, ఎంతో చూచాను. కానీ,  ఇటువంటి ఆరాను మూడుచోట్ల మాత్రమే నేను చూడగలిగాను. ఒకటి, రామకృష్ణులు దేహం చాలించిన కాశీపూర్ మఠం మొదటి అంతస్తులోని గది, రెండు, జిల్లెళ్ళమూడిలో అమ్మగారు నివసించిన గది, ఆ తరువాత బెంగుళూరులో చంద్రశేఖర్ గారి ఇంటిలోని యూజీగారి గది. ఈ మూడుచోట్లా ఒకటే విధమైన తరంగాలున్నాయి. ఇంతటి బలమైన స్వచ్ఛమైన ఆధ్యాత్మికతరంగాలను ఏ పుణ్యక్షేత్రంలోగాని, ప్రసిద్ధఆలయాలలో గాని, మహనీయులని చెప్పబడేవారి స్థలాలలోగాని నేను ఫీల్ కాలేదు.

'మీ ఇల్లు ఒక ఇల్లు కాదండి. ఇదొక మహాపుణ్యక్షేత్రం' అని చంద్రశేఖర్ గారితో అన్నాను.  

చంద్రశేఖర్ గారు పూర్తిగా యూజీగారితో నిండిపోయి ఉన్నారు. యూజీగారితో 40 ఏళ్ల అనుబంధం వారిది. తన చివరిరోజులలో మతిస్థిమితం సరిగ్గా లేని వాలెంటైన్ ను చిన్నపిల్లలాగా అయిదేళ్లపాటు చూసుకున్న గొప్పమనసు వారిది. సొంత తల్లిదండ్రులనే ఓల్డేజి హోములకు తోసేస్తున్న ఈ లోకంలో, తమకు సంబంధంలేని ఒక విదేశీయురాలిని చిన్నపిల్లలాగా చూసుకున్న అమృతహృదయాలు వారివి. దానికి ఒకే ఒక్క కారణం, దిక్కులేకుండా యూరప్ లో తిరుగుతున్న యూజీగారికి ఆమె ఆశ్రయం ఇవ్వడమే. వారి సంరక్షణకు ఆమెను యూజీ అప్పగించడమే.

నిరాడంబరుడైన గృహస్థుగా జీవితం గడుపుతున్న ఒక మహనీయుడిని చంద్రశేఖర్ గారిలో చూచాను. ఆయనకు సరియైన సహచారిణి ఆయన శ్రీమతిగారు. వారింట్లో ఉన్నపుడు, ఏదో ఒక ప్రాచీనకాలపు ఋష్యాశ్రమంలో ఉన్న ఫీలింగ్ నాలో కలిగింది. ఈ కాలంలో కూడా ఇటువంటి పుణ్యదంపతులు ఎక్కడైనా ఉన్నారా? అనిన సందేహం ఈరోజుతో నాకు తీరిపోయింది.

తనకోసం అరుణాచలానికి వచ్చిన జిల్లెళ్ళమూడి అమ్మగారిని చూచి చలించిపోయిన చలంగారు ఇలా అన్నారు, ' ఏడిరా నీ ఈశ్వరుడు? అని ఎవరైనా అడిగితే ఇన్నాళ్లూ చెప్పలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు చెప్పగలను'.  

అదేవిధంగా, 'మంచిమనసున్న దేవతలవంటి మనుషులు ఎక్కడైనా ఉన్నారా?' అని నన్నెవరైనా అడిగితే 'ఉన్నారు. నేను చూచాను' అని ఈరోజున చెప్పగలను.

లోకం దృష్టిలో  పెద్దపెద్ద స్వామీజీలనబడే వాళ్ళు  నన్ను కలిసినప్పుడు, కనీసం లేచి నిలబడటానికి కూడా ఇష్టపడని నేను, ఈ పుణ్యదంపతుల పాదాలను తాకి ప్రణామం చేశాను.

సోమవారం అలా  గడిచింది. నిన్న గురువారం సెలవు కావడంతో శిష్యులందరూ ఖాళీగా ఉంటారు. అందుకని మళ్ళీ నిన్న, బెంగుళూరు శిష్యులందరితో  కలసి వారి ఇంటిని దర్శించి, యూజీగారి సమక్షాన్ని వారికి కూడా రుచి చూపించాను.

ఒక్క గంటలో వచ్చేద్దామని వెళ్లిన అందరం, మూడున్నర గంటలపాటు అక్కడే ఉండిపోయాము. యూజీ గురించి ఎన్నెన్నో గతస్మృతులు, ఉన్నతమైన తాత్వికవిషయాలు చంద్రశేఖర్ గారు చెబుతుంటే కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు.

మాటలమధ్యలో యూజీగారిది ఆత్రేయసగోత్రమని తెలిసింది. అంటే దత్తాత్రేయులవారి గోత్రమే. అత్రిమహాముని వంశంలో యూజీవంటి బ్రహ్మజ్ఞాని, అవధూత జన్మించడం విచిత్రమేముంది?

నవీనకాలంలో భారతదేశంలో జన్మించిన అవధూతలలో అగ్రగణ్యునిగా యూజీగారిని నేను భావిస్తాను.

'నన్ను పూజించారంటే మీ తోలు తీస్తా' అని గర్జించడం ఒక అవధూత కాకపోతే ఇంకెవరు చేయగలుగుతారు?

'నిజమైన గురువు తననుంచి కూడా నిన్ను విముక్తుడిని చేస్తాడు' అన్న బంగారుమాటను మహేష్ భట్ తో యూజీగారన్నారు. ఈ ఒక్క మాటచాలు ఆయనేంటో చెప్పడానికి. అదీ అవధూతతత్త్వమంటే !

యూజీగారు కృష్ణాజిల్లా తెలుగువాడు.  మచిలీపట్నంలో పుట్టాడు. గుడివాడలో చదువుకున్నాడు. అటువంటి మనిషి వందలఏళ్లలో ఒక్కరు కూడా ఈ భూమ్మీద పుట్టరు. కానీ ఆయనెవరో తెలుగువారికి చాలామందికి తెలియదు.
 
అసలూ, తెలుగుప్రజలంత తెలివితక్కువవాళ్ళు ఇంకెక్కడా ఉండరనేది నా నిశ్చితాభిప్రాయం. యూజీలాంటి అసలైన అవధూతలు వాళ్ళమధ్యనే పుట్టినా వారు గుర్తించరు. నకిలీలకు మాత్రం గుళ్ళు కట్టిస్తారు. తండోపతండాలుగా మొక్కుతారు. 

పిచ్చి జనం ! పిచ్చి లోకం !

కోహినూర్ వజ్రం ఎక్కడో ఒకచోట మాత్రమే ఉంటుంది. గులకరాళ్లు మాత్రం ఎక్కడపడితే అక్కడే ఉంటాయి. ఇది లోకసహజమే. వింతేముంది? ఈ మాటను నేను చాలాసార్లు అంటుంటాను.

ఆ విధంగా, చిరస్మరణీయంగా, ఈ రోజు గడిచింది.

యూజీగారి అనుచరులైన సత్యనారాయణ, రజనిగార్లను కూడా వారింట్లో కలుసుకున్నాము.  వాళ్ళుకూడా చాలా సహృదయులు. 

యూజీగారిగురించి సమగ్రమైన సమాచారాన్ని అందించే వీరి వెబ్ సైట్ ను ఇక్కడ చూడండి. 
read more " నిజమైన అవధూత "