“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

మంత్రాలయ మఠం- రేణుకాదేవి ఆగ్రహం


నిన్న సాయంత్రం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాను. మఠమూ, ఊరూ మునిగిపోయిన తర్వాత ఇదే నేను మంత్రాలయం దర్శించడం. ఊరికి చాలా ముందుగానే దారిపొడుగునా చెట్లకు ఎండుగడ్డి వేలాడుతూ కనిపించింది. అంటే వరదకు కొట్టుకొచ్చిన గడ్డి చెట్లకు పట్టుకుని వరద తీసిన తర్వాత అలా వేలాడుతూ ఉండిపోయిందన్నమాట. నీరు మేటవేసిన మేరకు గీత గీసినట్లు, ఊరిలో కూడా చాలా ఇళ్ళకు గుర్తులు ఉండిపోయాయి.

దర్శనం అంతా బాగానే జరిగింది. గురువారం అయినా భక్తులు పెద్దగా లేరు. బుధవారం రాత్రికి కర్ణాటక భక్తులు వచ్చి చేరుకుంటారు. గురువారం తెల్లవారుఝామున దర్శనం చేసుకుని మధ్యాహ్నానికి వెనక్కు బయలు దేరి వెళతారు. ఊరు పూర్తిగా ధ్వంసం అయింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకూ అన్ని ఇళ్ళూ, షాపులూ మునిగి పోయాయి. ఒండ్రు మట్టిలో ఊరు మేట వేసింది. ఒండ్రుమట్టి ఎండకు ఎండుతున్నపుడు భయంకరమైన దుర్వాసన ఊరంతా వ్యాపించిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే తిరిగి షాపులూ, వ్యాపారమూ అవీ తిరిగి పుంజుకుంటున్నాయి.

ఆలయం కూడా సన్ షేడ్ లెవెల్ వరకూ మునిగింది. ఆలయం నిండా పాములు, తేళ్ళు, ఇతర కీటకాలు కుప్పలుగా కొట్టుకొచ్చాయిట. ఎన్ని రకాల పాములనో చూచామని ఆలయ పూజారులు చెప్పారు. పాము కాట్లకు కూడా కొందరు మరణించారట. మేటవేసిన ఒండ్రు మట్టిలో యాసిడ్ లక్షణాలుండి, క్లీన్ చేసిన పనివాళ్ళ కాలి వేళ్ళను చేతివేళ్ళను తినేశాయిట. మొత్తం ఆలయం శుభ్రం చెయ్యటానికి దాదాపు నెలరోజులపైగా పట్టిందిట.

తుంగభద్రానది విశ్వరూపం దాల్చి ఇంత విధ్వంసం సృష్టించడానికి కారణాలు ఏవై ఉంటాయా అని నేను రకరకాలైన కోణాల్లో ఆలోచించాను. జ్యోతిష్య పరంగా కొంత పరిశోధన కూడా చేశాను. కారణాలు అలా ఉంచితే, నిన్న నాకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఆలయ ప్రముఖుడొకరు విషయాన్ని నా చెవిన వేశారు.

మంత్రాలయ మఠం పక్కనే గ్రామదేవత మంచాలమ్మ ఆలయం ఉంటుంది. సందర్శకులు ముందుగా మంచాలమ్మను పూజించి తరువాత రాఘవేంద్ర స్వామిని దర్శిస్తారు. అసలీ గ్రామం పేరు మంచాల. గ్రామ దేవత మంచాలమ్మ. అంటే రేణుకాదేవి. చాలా చోట్ల ఉండే విగ్రహం లాగానే, ఒక దేవీ మూర్తి శిరస్సు మాత్రం మంటలతో ఆవరింపబడిన కిరీటం తో కూడి ఉంటుంది. ఈమె చాలా ఉగ్ర మూర్తి అని అంటారు. భారత దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే, గ్రామదేవతగా పూజించబడుతున్నది రేణుకాదేవి మాత్రమే అని కొందరి భావన. ఈమెను దుర్గాదేవిగా, కాళిగా కూడా కొందరు పూజిస్తారు. ఉత్తర భారతంలో జ్వాలాముఖి అనే పేరుతో అర్చింపబడుతుంది. ఎక్కడైనా సరే, ఒక ముఖం మాత్రమే ఉన్న దేవీ విగ్రహం ఉంటే, అది రేణుకాదేవి విగ్రహమే అని నేను నమ్ముతాను.

రేణుక పరశురామ జనని. ఒక అవతార మూర్తి జనని మామూలు మనిషి అయి ఉండే అవకాశం లేదు. అందులోనూ పరశురామావతారం ఉగ్రమైనది. మహత్తరమైన వీరవిద్యలకు ఆద్యుడు పరశురాముడు. పరశురాముడు ఖండించిన శిరస్సు రూపంలో రేణుకాదేవి నేటికీ అలాగే పూజలందుకుంటూ ఉన్నది. దశమహావిద్యలలో- తన తలను తానే ఖండించుకునే రూపంలో దర్శనం ఇచ్చే, ఛిన్నమస్త ఈమే అని గణపతి ముని (నాయన) అంటారు. యోగమార్గంలో సిద్ధిదాత్రి అయిన కుండలిని శక్తి, రేణుకాదేవి ఒక్కరే అని తాంత్రికులు యోగులు చెబుతారు. రేణువుల రూపంలో భూమిని చేరుతున్న విశ్వ శక్తియే (Cosmic Energy) రేణుక అని యోగుల భావన.

రేణుకాదేవి ఆలయం ఎందువల్లనో ఒక ఏడాది క్రితం నుంచీ నిర్లక్ష్యానికి గురై, సరిగా పట్టించుకోబడకుండా పోయిందనీ, పాత ఆలయం స్థానంలో కొత్తగా ఒక ఆలయం కడుతూ, పాత విగ్రహాన్ని కదిలించి పక్కన ఉంచి, సరియైన పూజాపునస్కారాలు లేకుండా ఏడాది నుంచీ ఉంచారనీ అందువల్లనే ఆమె తన ఉగ్ర రూపాన్ని చూపిందని, అందువల్లనే తుంగభద్ర పొంగి ఆలయాన్ని ముంచిందనీ ఆయన చెప్పాడు. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని అడిగాను. కారణం తెలుసుకున్న తరువాత ఇప్పుడు జాగ్రత్తగా పూజలు చేస్తున్నామని ఆయన చెప్పాడు.

ఎందరి సమస్యలనో తీరుస్తున్న రాఘవేంద్రస్వామి, తన ఆలయం మునిగిపోతుంటే ఎందుకని ఊరుకున్నారు? అని మా అమ్మాయి అడిగింది. నేను సమాధానం చెప్పలేదు. అది నాకూ తెలియదు. ఏది ఊహించినా అది మన ఊహ మాత్రమే. ఊహ కొంత నిజం కావచ్చు. కొంత కాకపోవచ్చు. అసలు కారణాలు మనకేం తెలుసు? అందుకే నేను ఏమీ చెప్పలేదు. కాని "మునిగిపోవటం కూడా ఆయన సంకల్పమే కావచ్చు" అని ఒక్కమాట మాత్రం చెప్పాను. "అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే, మరి అశుద్ధమో?" అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మాట నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. "మంచి జరగడం మాత్రమే దేవుని కరుణ కాదు, చెడు కూడా వాడి కరుణే " అని ఆమె ఎప్పుడూ అనేవారు.

ఒకసారి దక్షిణేశ్వర్ కాళికాలయంలో దొంగలు పడి శ్రీకృష్ణుని నగలు దోచుకుని పోతారు. అప్పుడు రాణి రాసమణి అల్లుడైన మధురానాధ్ కోపంతో " నీ నగలు కాపాడుకోలేని నువ్వేం దేవుడివి" అని అంటాడు. అది విని శ్రీరామకృష్ణులు ఆతన్ని బాగా చీవాట్లు పెడతారు. " నీ దృష్టిలో నగలు గొప్పవి
కావచ్చు. కాని భగవంతుని దృష్టిలో అవి మట్టితో సమానం. సర్వ సంపదలకూ మూలం అయిన మహా లక్ష్మి ఆయన పాదాల వద్ద ఉంటుంది. అది గ్రహించి మాట్లాడితే మంచిది" అని ఆయన మధురానాధ్ కి సలహా ఇస్తారు. ఘటన నాకు గుర్తోచ్చింది.

పైగా ఇటువంటి ఘటనలకు చాలా సూక్ష్మ కారణాలుంటాయి. యాత్రా స్థలాలు క్రమేణ
పవిత్రతను కోల్పోవటం, రాజకీయ జోక్యాలు మితిమీరటం, విలాసాలు విందులు ఎక్కువ కావటం, నిర్వహణాధికారులలో నిర్లక్ష్యం, అవినీతి, ఊరిలో కూడా అపవిత్రత పెరగటం వంటి అనేక కారణాలుంటాయి. మన ఇల్లు కంపు కొడుతుంటే మనం ఏం చేస్తాం? నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటాం. అలాగే ఊరు ఊరంతా ఒక్క సారి కడగబడినట్లుగా అలా జరిగింది.

ఈ సారి నేను గమనించిన ఇంకో విచిత్రం. రాఘవేంద్ర స్వామి సమాధి పక్కనే ఇంకొక స్వామి సమాధి ఉంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న అర్చక స్వామి రుద్ర పారాయణ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. మధ్వ సాంప్రదాయులు శివ స్మరణ అస్సలు చెయ్యరు. శివ స్తోత్రాలు పఠించరు. అలాటిది ఆయన పెద్ద గొంతుతో రుద్రపారాయణ చెయ్యటం నాకు చాలా వింతగొలిపింది.

ఏది ఎమైనా, ఈ వరదల తర్వాత, అక్కడ ప్రజలలో కొంత భయ భక్తులు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్న పొగరు, నిర్లక్ష్యం, మితిమీరిన విచ్చలవిడి తనం తగ్గాయి. ప్రకృతి వైపరీత్యాలు జరగడం వల్ల మానవులలో నీతి నియమాలు పెరిగితే బహుశా వైపరీత్యాల ఉద్దేశ్యం చాలావరకు నెరవేరినట్లేనేమో? పర్యావరణ సమతుల్యం మాత్రమే గాక, మానసిక నైతిక సమతుల్యం కూడా తద్వారా సాధింపబడితే ప్రకృతి యొక్క ప్రయోజనం ఫలించినట్లేనా? ప్రకృతికి వర్తించే ఈ సూత్రం మనిషి జీవితానికి కూడా వర్తిస్తుందా? అదే నిజమైతే, మనిషి జీవితంలో చెడు సంఘటనలు జరిగితే, అవి అతన్ని ప్రక్షాళన చెయ్యడానికి భగవంతునిచే / ప్రకృతిచే జరపబడుతున్న కార్యక్రమంగా అనుకోవచ్చా?

కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు మరి.
read more " మంత్రాలయ మఠం- రేణుకాదేవి ఆగ్రహం "

18, ఏప్రిల్ 2010, ఆదివారం

ఆదోని కొండ- ఒక సాయంత్రపు ఏకాంతవాసం







నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆదోని కొండ పైన ఏకాంత వాసం. ఏకాంతంగా, మౌనంగా, కొండల్లో ధ్యానం చెయ్యటం గొప్ప అనుభూతిని ఇస్తుంది.

దీనికి కొన్ని కారణాలు కనిపిస్తాయి.

ఒకటి:- చుట్టూ మైళ్ళ వరకూ జనసంచారం లేకపోవటం ఒక విధమైన ఏకాకి తనాన్ని ఇస్తుంది. మానసికంగా మనిషి ఎప్పటికైనా ఏకాకే అన్న సత్యం మనస్సుకు హత్తుకున్నట్లు కనిపిస్తుంది.

రెండు:- ఆత్మావలోకనానికి జన సమ్మర్దం ఉన్న ప్రదేశాలు, వాతావరణాలు సరిపోవు. దానికి ఏకాంత ప్రదేశాలు, విశాల ప్రకృతి ఒడిలో ఒంటరిగా ఉండే ప్రదేశాలు బాగా దోహదం చేస్తాయి.

మూడు:- ఎప్పుడూ మనుషుల మధ్య ఉండటం వల్ల ఒక విధమైన ఫాల్స్ సెక్యూరిటీ మనకు అలవాటు అవుతుంది. ఇలాటి ఏకాంత ప్రదేశాలలో ఉండటం వల్ల అది తొలగి పోతుంది.

నాలుగు:- ఇలాటి ప్రదేశాలలో ప్రకృతి యొక్క విశాలత్వం, మానవుని అల్పత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పైన కప్పులా పరుచుకున్న విశాలాకాశం మరియు చుట్టూ నిర్మానుష్య ప్రదేశాలు మనస్సును సహజంగా అంతర్ముఖం చేస్తాయి.

అయిదు:- ఇటువంటి ప్రదేశాలలో, కొద్దిపాటి ఏకాగ్రత ఉంటే, హమ్మింగ్ ధ్వనిలా వినిపించే ఓంకారనాదాన్ని వినవచ్చు. ముఖ్యంగా ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత బాగా స్ఫుటంగా వినిపిస్తుంది.

చుట్టూ మైళ్ళ తరబడి జన సంచారం లేని ఏకాంత ప్రదేశాలలో రాత్రిళ్ళు ఒంటరిగా గడపటం, ప్రకృతిలో వినిపించే సహజ ధ్వనులను వింటూ మౌన ధ్యానంలో ఉండటం నాకు బాగా ఇష్టం. అటువంటి ప్రదేశాలలో, ముఖ్యంగా, అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారే వరకు ఉండే వాతావరణం చాలా బాగుంటుంది. అయితే, దయ్యాల భయం గాని, లేదా దొంగల భయం గాని మనసులో ఉంటే ఇలా ఉండటం చాలా కష్టం అవుతుంది.

నువ్వు ఇలా ఏకాంత వాసం చేస్తున్నపుడు ఎవరైనా దొంగలు నిన్ను ఎటాక్ చేస్తే నీ గతి ఏమిటి అని ఒక మిత్రుడు అడిగాడు.నాకు నవ్వొచ్చింది. వీర విద్యలలో చిన్నప్పటి నుంచి సాధన, ప్రావీణ్యత నాకు ఉన్న విషయం, మరియు మల్టిపుల్ స్పారింగ్ నా స్పెషలైజేషన్ అన్న విషయం అతనికి తెలియదు. "ఎటాక్ చెయ్యటం వరకు ఓకే, కాని తరువాత వాళ్ళ గతి ఏమౌతుందో మాత్రం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ శవాలను అన్ని అడుగుల ఎత్తు నుంచి కిందకు తరలించటం నిజంగానే సమస్య అవుతుంది" అని జవాబిచ్చాను. కేరళలో మాస్టర్ గోవిందకుట్టి నాయర్ గురుక్కళ్ దగ్గర నేర్చుకున్న "మర్మ అడి" విద్యలోని ఒక చిన్నఆయుధం నా దగ్గిర ఉంటుంది. అది జేబులో ఇమిడి పోతుంది. మర్మ స్థానాలలో (Vital nerve centers) దానితో ఎటాక్ చెయ్యటం ద్వారా అవసరమైతే మనిషి ప్రాణాలు సెకండ్లలో తీయవచ్చు.

సామాన్యంగా ఇలా వెళ్ళేటప్పుడు ఎవరినీ తోడు తీసుకెళ్ళను. ఎందుకంటే చాలామంది మౌనాన్ని భరించలెరు. మౌనంగా ఉండలేరు. అనవసరంగా ఏదేదో మాట్లాడుతుంటారు. అది నాకు విసుగు పుట్టిస్తుంది. పైగా కనీస వసతులు కూడా అటువంటి చోట్ల ఉండవు.వెంట తీసుకెళ్ళకపోతే ఒక్కొక్కసారి మంచినీళ్ళు కూడా దొరకవు. కాని ఈసారి మా అబ్బాయి నాతో వస్తానన్నాడు. సరే అని నాతో పాటు తీసుకెళ్ళాను.తను నా మానసిక స్థితి బాగా అర్థం చేసుకోగలడు. ఇటువంటి సందర్భాలలో అవసరం అయితే తప్ప మాట్లాడడు.

కొండ ఎక్కుతున్నప్పుడు, మధ్య మధ్యలో కూర్చున్నప్పుడు, అక్కడక్కడా ఆధ్యాత్మిక విషయాలు చర్చకు వచ్చాయి. మా వాడికొక ఆలోచన వచ్చింది. దీన్నంతా ఒక వీడియోగా తీస్తానని ఉత్సాహ పడ్డాడు. సరే కానీమన్నాను. ఆ సందర్భంగా తీసిన ఒక చిన్న వీడియోను ఈ పోస్ట్ తో చూడవచ్చు.

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఇదే కొండను నా గురుతుల్యులైన స్వామి నందానందగారితో కలసి ఎక్కాను. కొండ కొమ్మున రణమండల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అది వ్యాస రాయల ప్రతిష్ట అని ఎవరో చెప్పారు. ఆయన విజయనగర రాజుల రాజ గురువు. రాయలసీమలో ఆంజనేయ విగ్రహాలు అన్నీ ఎక్కువగా ఆయనే ప్రతిష్ట చేశారు.

అదలా ఉంచితే, అప్పుడు నాకు ఇరవై ఆరేళ్ళు. స్వామికి దాదాపు అరవై దాటి ఉంటాయి. కొండనెక్కుతుండగా స్వామి అనేక విషయాలు చెప్పారు. ఆయన జన్మత: కన్నడిగుడు. తెలుగు కంటే ఇంగ్లీషు చక్కగా మాట్లాడేవారు. దాదాపుగా అరవై ఏళ్ళ క్రితమే ఆయన గ్రాడ్యుయేట్. కొండ సగానికి ఎక్కిన తర్వాత పైకి చూస్తూ, " కొండ కొమ్ముకు చేరాలంటే ఇంకా చాలా మెట్లు ఎక్కాలి స్వామీజీ" అని రొప్పుతూ అన్నాను నేను. దానికి ఆయన నవ్వుతూ ఒక మాటన్నారు. "ఇంకా ఎన్ని మెట్లెక్కాలో అని ఎప్పుడూ అనుకోకు. తల వంచుకొని మెట్లెక్కుతూ ఉండు. కొంతసేపటికి చూస్తే నీవు కొండ కొమ్మున ఉంటావు." లోతుగా ఆలోచిస్తే ఇది జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు కూడా చక్కగా అన్వయిస్తుందేమో అని నాకెప్పుడూ అనిపిస్తుంది. అదే జ్ఞాపకాన్ని మా అబ్బాయికి చెప్పాను. దాన్ని తను వీడియో తీసాడు.

దాదాపు రాత్రి తొమ్మిది వరకు కొండపైన ధ్యానంలో గడిపాము. నల్లని ఆకాశం క్రింద, నక్షత్రాల వెలుగులో కూర్చుని, క్రియాయోగానికి, కుండలినీ యోగానికి సంబంధించిన లోతైన మూలరహస్యాలు కొన్ని మావాడికి వివరించి చెప్పాను. యుగాలు, వాటి నిడివి, అయనాంశ విలువ, ప్రెసెషన్ ఆఫ్ ఈక్వినాక్సెస్, సాయన నిరయన విధానాల మధ్యన గల భేదాలు, ఇతర జ్యోతిష రహస్యాలు, వీటికీ యోగానికి ఉన్న సంబంధాలు, సూక్ష్మ శరీరం, ఆత్మలు మొదలైన విషయాలు చాలా దొర్లాయి. చిన్నప్పటినుంచి ఇటువంటి విషయాలు వినటం అలవాటు అయినందువల్ల తను కూడా చాలా శ్రద్దగా విన్నాడు. తరువాత నెమ్మదిగా కొండ దిగి నడక ప్రారంభించాము.

చుట్టూ చిమ్మ చీకటి. శుద్ధ తదియ కావటంతో చంద్రుడు సన్నగా కనిపిస్తున్నాడు. సన్నని నెలవంక, నక్షత్రాల వెలుతురులో, ప్రాచీన శిధిల కట్టడాలు, మశీదులు, గుడులు, రాజుల కాలం నాటి కోట బురుజుల మధ్యగా కొండ దిగి క్రిందికి వస్తుంటే, కీచు రాళ్ళ అరుపులు మా అడుగుల చప్పుళ్ళె తప్ప ఎక్కడా శబ్దమనేది లేదు. అప్పుడప్పుడు ఆ శిధిలాల దారుల పక్కగా పాము జరజర పాకుతూ పోతున్న శబ్దం వినిపించేది.

ఒక గంట తర్వాత కొండ దిగి ఊరిలోకి వచ్చాము. మహాయోగిని లక్ష్మమ్మ గారి సమాధి మందిరంలో కొద్దిసేపు ధ్యానంలో గడిపి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరాము. నేటి సామాజిక భాషలో చెప్పాలంటే ఈమె ఒక చదువు రాని దళిత మహిళ. దాదాపు అరవై డెభ్భై ఏళ్ల క్రితం ఆదోని పట్టణంలో ఒక పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉండేది. ఈమె అనేక యోగసిద్ధులు కలిగిన ఒక అవధూత అని చెప్తారు.

రాత్రిళ్ళు గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఈమె కాళ్ళూ చేతులూ ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కటి పడి కనిపించేవిట. తిరి
గి తెల్లవారిన తర్వాత ఈమె మామూలుగా ఊరిలో తిరుగుతూ ఉండేది అని చెబుతారు. దీన్ని ఖండయోగం అంటారు. దీనిని సాయిబాబా గారు కూడా చేసినట్లు చెబుతారు. ఇలాటి మహిమలు ఆమె చాలా చేసింది అని అంటారు. ప్రస్తుతం ఈమె సమాధిమందిరం నగర నడి బొడ్డున ఉంది. భూగర్భంలో ఆమె సమాధి, దాని పైన నేల బారుగా దేవాలయం ఉంటాయి. సమాధి మందిరం ధ్యానానికి బాగా అనుకూలంగా ఉంటుంది. రాయలసీమలో ఇటువంటి యోగులు,సూఫీలు,మహాత్ములు చాలామంది ఉంటారు. నేను ఆదోని పట్టణానికి వస్తే, లక్షమ్మగారి సమాధిని దర్శించకుండా సామాన్యంగా తిరిగి వెళ్లను.

నిన్న సాయంత్రం అలా గడిచింది.

read more " ఆదోని కొండ- ఒక సాయంత్రపు ఏకాంతవాసం "

14, ఏప్రిల్ 2010, బుధవారం

అపర ధన్వంతరి - శామ్యూల్ హన్నేమన్


తర తరమ్ముల నంటి తరుము వ్యాధుల
మూల మెరుగంగ తపియించే నే తపస్వి
సారూప్య సిద్ధాంత సంస్థాప నార్ధమ్ము
త్యాగాగ్ని దూకేనే ధర్మ యోద్ధ
ఆత్మ శోదిత పదార్దానుభూత
జ్ఞాన సంపద నిచ్చెనే శాస్త్ర వేత్త

హోమియో వైద్య విధాన సృష్టికర్త అయిన డా || హానెమాన్ గారి పైన పొన్నూరు వాస్తవ్యులు డా|| పీ. వీ గోపాల రావుగారు వ్రాశిన పద్యం ఇలా సాగుతుంది. మొన్న పదవ తేది డా|| శామ్యూఎల్ హాన్నేమాన్ గారి జన్మ దినం. సందర్భంగా మహనీయుని తలచుకోవటం ఒక హోమియో వైద్యునిగా, హానెమాన్ అభిమానిగా నా కర్తవ్యం కూడా.

ఒక ఆలోచన


వ్యక్తిగతంగా నా కొక ఆలోచన ఉన్నది. ప్రాచీన కాలంలో మన దేశంలో ప్రతి సబ్జెక్ట్ లోనూ విపరీతమైన రీసెర్చి జరిగింది. అయితే అదంతా కాలగర్భంలో కలిసిపోయింది. తిరిగి దాన్ని ఉద్దరించాలంటే గడచిన తరాలలో మన దేశంలో అనువైన పరిస్తితులు లేవు. అందుకని ఆయా శాస్త్రవేత్తలు, రుషులు యూరోపియన్ దేశాలలో పుట్టి ఆయా విజ్ఞానాన్ని పునరుద్ధరించారని నా అభిప్రాయం. హోమియో వైద్యం కూడా అటువంటి అద్భుత విజ్ఞానమే గనుక డా|| హాన్నెమాన్ ఒక భారతీయ ఋషిపుంగవుడే అని, ప్రాచీన ఆయుర్వేద ఋషియో విధంగా జెర్మనీలో పుట్టి ఉంటాడనీ నా నమ్మకం. హోమియో వైద్యానికి మన వేదాంతానికీ ఉన్న సంబంధమూ, వైద్యాన్ని మన దేశం గొప్పగా ఆదరించి వెంటనే అక్కున చేర్చుకోవడమూ, శ్రీ రామకృష్ణుడు, జిల్లెళ్ళమూడి అమ్మగారు వంటి మహనీయులు విధానాన్ని వాడటమూ మెచ్చుకోవడమూ, కూడా నమ్మకానికి ఆధారాలు.

హోమియో శాస్త్రానికి- యోగ సంబంధం

యోగం మానవుణ్ణి దేవునిగా చెయ్యగలదు. యాత్రా క్రమంలో మానవుని తరతరాల కర్మను ప్రక్షాళన చేసే శక్తి యోగానికి ఉన్నది. ప్రక్షాళన ఎలా జరుగుతుంది అనే విషయం ప్రస్తుతం అవుసరం లేదు గనుక దాని జోలికి పోను. హోమియో వైద్య విధానంలో కూడా కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా హయ్యర్ పొటెన్సీలు వాడినప్పుడు మానవుని శరీరంలోని అంతర్గత కల్మషాలు బయటపడి ప్రక్షాళన కాబడతాయి. ఉన్నత పొటెన్సీలు వాడినప్పుడు కర్మ ప్రక్షాళన జరుగుతుంది అని డా|| రుడాల్ఫ్ స్టీనర్ మొదలైన వారుకూడా నమ్మేవారు. క్రమంలో మానవునికి రోగం తగ్గటమే గాక, అతని మానసిక, ప్రాణిక స్థాయిలలో గొప్ప వైన మార్పులు కలుగుతాయి. అతని అలవాట్లు మారుతాయి. తరతరాలనుంచి వెంటాడుతున్న రోగాలు,అలవాట్లు,దోషాలు పోతాయి. ఇదంతా నెను కళ్ళారా చూచాను కనుక అధికారికంగా వ్రాయగలుగుతున్నాను.

యోగసాధనలో కూడా ఇదంతా జరుగుతుంది. కుండలినీ యోగాన్ని సాధించిన వ్యక్తి శరీరంలొ గొప్ప మార్పులు కలుగుతాయి. అతని జీన్ లెవెల్ లొ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. తరతరాల నుండి వస్తున్న జన్యు దోషాలు, అలవాట్లు విసర్జింపబడతాయి. శరీరంలోనే గ్రహ పరమైన రెమెడీలు జరుగుతాయి. తద్వారా జాతకంలో ఉన్న చెడు యోగాలు సరిచేయబడతాయి. దోషాలు నివారణ అవుతాయి. ఇదంతా నిజంగానే జరుగుతుంది. నేను తమాషాకి వ్రాయడం లేదు. ఎవరికి వారు స్వానుభవంలో పరిశీలించి తెలుసుకోవచ్చు.

అయితే, యోగానికి, హొమియో వైద్యవిధానానికి కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. యోగంలో ఉన్నత స్తరాలు చేరటం కష్ట సాధ్యం. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దానితో పోలిస్తే హోమియోలో ఉన్నత పొటెన్సీ వాడకం సులువు. మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాని ఇక్కడకూడా, రోగం పూర్తిగా శరీరంలోనుంచి బయటకు ప్రక్షాళన అయ్యేవరకూ వేచి చూడగలిగే వారు చాలా అరుదుగా ఉంటారు. కర్మ మనిషిని వేచి చూడనివ్వదు. ట్రీట్ మెంట్ మధ్యలో ఆపి వేరే వైద్య విధానాలకు మారటం చాలా సార్లు చేయిస్తుంది.

ఇదంతా కర్మ ఫలితం.
అనుభవించవలసిన బలీయ మైన కర్మ ఉన్నపుడు హోమియో లో తత్వ పరమైన చికిత్స (కాన్ స్టిట్యూషనల్ ట్రీట్ మెంట్ ను) తీసుకోనివ్వదు. అనేక కారణాలు చెప్పి రోగి చికిత్సను మధ్యలోనె ఆపివెయ్యటం జరుగుతుంది. లేదా అనెక అవాంతరాలు ఎదురై చికిత్స మధ్యలో ఆపడం జరుగుతుంది. ఇతర మందులు వాడడం, లేదా సర్జరీలు చేయించుకోవడం జరుగుతుంది. విచిత్రాన్ని కూడా చాలా సార్లు గమనించాను.

ఇతర వైద్య విధానాలు

ఇతర వైద్య విధానాలకు హోమియో విధానానికి ఉన్న ముఖ్యమైన భేదం ఏమనగా- హోమియోలో రోగి లోపలనుంచి బయటకు రోగం నెట్టివేయబడుతుంది. అందుకే రోగం తగ్గినతరువాత అతనికి చాలా హాయిగా తేలికగా ఉంటుంది. ఏదో పెద్ద బరువు ఒంటిలో నుంచి మాయం అయ్యినట్లు గా ఉంటుంది. మానసిక స్థాయిలో ప్రాణిక స్థాయిలో చాలా హాయిగా అనిపిస్తుంది.

ఇతర విధానాలలో అయితే -- రోగం బయటనుంచి లోపలకు అణగగోట్ట బడుతుంది. చూడటానికి రోగం తగ్గినట్లే కనిపిస్తుంది. రోగ లక్షణాలు మాయం అవవచ్చు. కాని రోగం శరీరంలోనుంచి బయటకు పోదు. అందుకే రోగ లక్షణాలు తగ్గినట్లు అనిపించినా, రోగికి హాయిగా ఉండదు. విపరీతమైన నీరసంగా ఉంటుంది. రోగం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం మీదకు నెట్టబడుతుంది. మానసికంగా చిరచిర, చికాకు, విసుగు, బీపీ ఎక్కువ అవుతాయి.

ఉదాహరణకు-నూటికి తొంభై కేసులలో- అణచబడిన ఇతర రోగాలవల్లే డయాబెటీస్ అనబడే షుగర్ వ్యాధి కలుగుతుంది. ఇది నా అనుభవంలో చాలా సార్లు గమనించాను. బహుశా శరీరంలోని గుండె, మెదడు,కిడ్నీలు మొదలైన ఇతర అంతర్గత అవయవాలతో పోలిస్తే పాంక్రియాస్ అంత ముఖ్యమైనది కాదు అని అనిపిస్తుంది. కనుక వ్యాధి అణచివేత అనివార్యం అయినప్పుడు, తత్వ పరమైన లోతైన చికిత్స జరుగకుండా బలీయమైన పూర్వకర్మ ఆడ్డుపడుతున్నపుడు ,శరీరం తన లోని
ఏదొ ఒక అంత ముఖ్యం కాని అవయవాన్ని త్యాగం చేసి మిగతా సిస్టం ను కాపాడుకుంటుంది. క్రమంలో భాగంగా, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో అంత ముఖ్యం కాని పాంక్రియాస్ ను రోగానికి అప్పజెప్పి మిగతా ప్రాణాధార అవయవాలను శరీరం కాపాడుతుంది.

అందువల్లనే నేటి సమాజంలో డయాబెటీస్ అంత ఎక్కువగా ఉన్నది. దీనికి కారణం బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటీ బయోటిక్స్ వాడకం వల్ల జరుగుతున్న రోగ అణచివేత మాత్రమే అని నా అభిప్రాయం. శరీర శ్రమ లేక పోవడం ఒక్కటే షుగరు వ్యాధికి పూర్తి కారణం కాదు అని నేను నమ్ముతాను. ఇది నా పరిశీలనలో తేలిన నిజం.

శుద్ధ ఆయుర్వేదం

ఆయుర్వేదాన్ని శుద్ధంగా ఆచరించగలిగితే, అది కూడా చాలా ప్రభావ వంతంగా పనిచెయ్యగలదు. కాని అలా చెయ్యగల వైద్యులు నేడు చాలా అరుదుగా ఉన్నారు. ఆయుర్వేదంలో ఎమ్. డీ చేసిన అనేక మంది వైద్యులు కనీసం రోగి యొక్క నాడి పరిశీలన చెయ్యకుండా అతని శరీర తత్వం ఏమిటో తెలుసుకోకుండా
మందులివ్వటం నాకు తెలుసు.

ఔషధాన్ని సొంతంగా తయారు చేసి ఇవ్వగల ఆయుర్వేద వైద్యులు కూడా నేడు చాలా అరుదుగా ఉన్నారు. చాలా మందికి మూలికా సంగ్రహణ విధానాలు తెలియవు. జ్యోతిర్విజ్ఞానం చాలామందికి బొత్తిగా
లేదు.ఆయుర్వేద కంపెనీలు తయారు చేసిన మందులు వాడిస్తూ రోగులతో ఆటలాడటంలో ఇంగ్లీషువైద్యులతో వారు పోటీపడుతున్నారు.మరి వారు అనుసరిస్తున్న విధానం ఆయుర్వేద వైద్యం అంటారో ఇంకేమంటారో వారికే ఎరుక.

ఎవరో చెప్పినట్లు, డాక్టర్ అవటం చాలాతేలిక. ఎందుకంటే రోగం ఏమిటో రోగి చెబుతాడు. దానికి మందేమిటో మెడికల్ రిప్రజెంటేటివ్ చెబుతాడు. మేచింగ్ చెయ్యటమేగా డాక్టర్ పని అని అన్నాడట ఒకాయన. విషయం అలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు, ఆయుర్వేదాన్ని శుద్దంగా ఆచరిస్తున్న వైద్యులు నేడు లేరు అని చెప్పవచ్చు.

మరి హోమియో వైద్యం మాటేమిటి?

హోమియో మాత్రలిచ్చిన ప్రతి వైద్యుడూ హోమియో వైద్యం చేస్తున్నట్లు కానే కాదు. డా|| హానెమన్ ప్రతిపాదించిన సూత్రాలకనుగుణంగా వైద్యాన్ని చేసినవాడే హోమియో వైద్యం చేస్తున్నట్లు లెక్క. చాలామంది అనేక మందులు ఒకేసారి కలిపి ఇస్తుంటారు. ఇంకొందరు హోమియో ఔషధాలతో పాటు, ద్వాదశ లవణాలు ఇస్తారు. ఇంకొందరు ఇంగ్లీషు మందులు హోమియో మందులూ ఒకేసారి ఇస్తారు. ఇంకొందరు పది మాత్రలు వేసుకున్నా, ఒక మాత్ర వేసుకున్నా ఒకటే-చేతికి ఎన్ని మాత్రలోస్తే అన్ని వేసుకోవచ్చు అంటారు. ఇవన్నీ తప్పులే. రకమైన వైద్యం హానెమాన్ ప్రతిపాదించిన హోమియో వైద్యం కాదు. అందుకే అటువంటి వైద్యంతో అద్భుత మైన ఫలితాలు కనిపించవు. నిజమైన హోమియో వైద్యం చేస్తున్న వైద్యులు కూడా నేడు చాలా అరుదుగా ఉన్నారు.

కుహనా గురువుల దగ్గర నిజమైన యోగ శాస్త్రం దొరకనట్లే, కుహనా వైద్యుల దగ్గర కూడా
నిజమైన వైద్యం దొరకదు. ఇక్కడ కుహనా వైద్యులు అంటే నా అభిప్రాయం-డిగ్రీలు లేని క్వాక్ లు అని కాదు. డిగ్రీలు ఉండికూడా అసలైన వైద్య సిద్ధాంతాలను అనుసరించని వారు అందరూ కుహనా వైద్యులే అని నా అభిప్రాయం. ఈనాడు హోమియో వైద్యంలో ఎమ్. డీ లు చాలామంది చేస్తున్నది హోమియో వైద్యం కాదు. వ్యాపార వైద్యం మాత్రమే. హోమియో వైద్యాన్ని పదేళ్ళపాటు పరిశోధించి నేను తెలుసుకున్న నిజం ఇది. విచిత్ర మేమిటంటే చాలామంది రోగులు కూడా కుహనా వైద్యులను నమ్మినట్లు శుద్దంగా వైద్య విధానాన్ని అనుసరించే వైద్యుల మాట నమ్మరు.

ఉన్నత మైన ఆశయాలతో, ఆలోచనలతో ఒక వినూత్న వైద్య విధానాన్ని ఆవిష్కరించిన హానెమాన్ ఆత్మ నేడు తన పేరిట జరుగుతున్న మోసపూరిత వైద్యాన్ని గమనించి ఎంతగా క్షోభిస్తున్నదో తలుచుకుంటే బాధ కలుగుతుంది. హోమియో షాపులు కూడా పచారీ కొట్ల వలె కనిపిస్తూ కంపెనీ ప్రాడక్టులతో షెల్ఫులు నిండి, హోమియో టూత్ పేష్టులు, హోమియో సబ్బులు, హోమియో హెయిర్ ఆయిల్సు, హోమియో వక్కపొడి..... ఇదంతా చూస్తుంటే కొంతకాలానికి హో్మియో కాఫీపొడి, హోమియో టీ పొడి కూడా అమ్ముతారేమో షాపులలో అని నవ్వొస్తుంది.

సత్యాన్ని గ్రహించి అనుసరించే సున్నితత్వాన్నిప్రపంచం కోల్పోతున్నదా?

ఏదేమైనప్పటికీ, ప్రపంచం డా|| హానెమాన్ కు ఇవ్వవలసిన విలువను ఇవ్వలేకపోయింది. కనీసం నేటికీ ఆయన సిధ్ధాంతాలను సరిగ్గ అర్ధం చేసుకోలేక పోయింది అని గట్టిగా చెప్పవచ్చు. బహుశా అందరు మహనీయులకు స్వార్ధపూరిత ప్రపంచం లో ఇదే గతి పట్టక తప్పదేమో? ఎవరేమి ఆవిష్కరించినా మానవ జాతికి తెలిసింది మాత్రం వ్యాపారం ఒక్కటేనేమో? ఏదో రకంగా డబ్బుని విపరీతంగా సంపాదించడమే జీవిత గమ్యం అని తలుస్తున్న నేటి ఆలోచనా ధోరణి మారనంత వరకూ ఎంతమంది హానెమాన్ లు వచ్చినా ప్రపంచానికి కొత్త వ్యాపార దారులు తెరవడం తప్ప ఉపయోగం పెద్దగా లేదు.

ఎన్ని
కొత్త యోగ విధానాలు వచ్చినా అవి చివరకు వ్యాపారంగా మారటం ఒక్కటే మనకు కనిపిస్తున్న నిజం. కర్మ క్షాళన అనేది పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారం. అంతే గాని మొత్తం సమాజం అంతటికీ దీన్ని వర్తింపచెయ్యటం అసాధ్యం అనీ, కుదరని పని అనీ, ప్రకృతి ప్రణాలికకు ఇది పూర్తిగా విరుద్దం అనీ నా నమ్మకం. హోమియో లో తత్వ పరమైన లోతైన చికిత్స తీసుకోగలగాలంటే అతనికి కర్మ తీరే సమయం దగ్గర పడాలి. జాతకంలో మంచి దశలు రావాలి అప్పుడే అది సాధ్యపడుతుంది లేకుంటే సాధ్యం కాదు అని నా అనుభవం చెబుతోంది.
read more " అపర ధన్వంతరి - శామ్యూల్ హన్నేమన్ "

10, ఏప్రిల్ 2010, శనివారం

వైద్య జ్యోతిషం- ధాతువులు, గ్రహాలు

ఈ విశ్వం లో భూమి ఏకాకి గ్రహం కాదు. ఈ విశ్వంలో ప్రతి వస్తువూ ఇతర వస్తువులను ప్రభావితం చేస్తుంది. బలీయమైనగ్రహాలూ, నక్షత్ర మండలాలు తమ తమ రేడియేషన్ ద్వారా భూమిని అందలి జీవరాశులనూ ప్రభావితం చేస్తాయి అనిమన జ్యోతిష్య గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే మానవ శరీరం మీద గ్రహ ప్రభావం తప్పకుండా ఉంటుంది అని జ్యోతిష గ్రందాలు చెబుతున్నాయి. అంతే గాక ఇంకొంచం ముందుకు వెళ్లి శరీరం లోని ధాతువుల పైన గ్రహాల ప్రభావం ఉంటుందో కూడా వివరంగా చెప్పాయి. ప్రాచీన ఋషులు అంతటి సూక్ష్మ పరిశీలన చేసి మనకు ఆ పరిజ్ఞానాన్నిఅందించారు. దానిని అంగీకరించటమో తిరస్కరించటమో మన ఇష్టం.

ఆయుర్వేద గ్రందాల ప్రకారం శరీరం లోని ధాతువులు ఏడు. చరక సంహిత (సూత్ర స్థానం) ప్రకారం, ఆయా సప్త ధాతువులేమనగా- రస, రక్త, మాంస,మేద,ఆస్తి,మజ్జ,శుక్రములు.

రసమనగా-జీవ రసము అని అర్థం. నవీన వైద్య శాస్త్రం దీనిని ప్లాస్మా అని పిలుస్తోంది. మాంస మనగా కండ, మేద అనగా కొవ్వు, మజ్జ అనగా మూలుగ అని అర్థములు. మిగిలిన మూడు పదములు,రక్త,అస్తి,శుక్రములు సులభ గ్రాహ్యములే.

ప్రాచీన కాలములో వైద్యులకు జ్యోతిష విజ్ఞానము తప్పని సరిగా ఉండేది. మూలికలను సేకరించాలంటే తిధి, వార, నక్షత్ర, యోగ పరిజ్ఞానం ఉండాలి. మన ఇష్టం వచ్చిన సమయాలలో వాటిని పెకలిస్తే అవి ప్రభావ వంతంగా పని చెయ్యవు. కొన్ని కొన్ని సమయాలలో వాటి పోటేన్సీ అతి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయాలలో సేకరించిన మూలిక నూరు రెట్లు ఎక్కువ బలంగా పనిచేస్తుంది.అంతే గాక దీర్ఘరోగి యొక్క తత్వాన్ని బట్టి అతనికి కొన్ని కొన్ని సమయాలలో ఔషధ ప్రయోగం మొదలు బెడితే అది అమృతోపమానంగా పని చేసి రోగం త్వరగా మాయం అయ్యేది. వాటినే అమృత ఘడియలు అనేవారు. ఆ సమయాలలో గ్రహముల యొక్క అనుకూల తరంగాలు(రేడియేషన్) ఆ మనిషిపైనప్రసరించటం వల్ల ఔషధాలు బలీయంగా పనిచేసేవి. ఆయా సమయాలను కూడా పరిశోధన చేసి నిర్ధారించి వ్రాసి పెట్టారంటే ప్రాచీన కాలం లో ప్రకృతి మీద ఎంతటి రీసెర్చి జరిగిందో మనం ఊహించు కోవచ్చు.

అంతే కాదు. ఔషధ తయారీ సమయంలో వైద్యుడు, శిష్యులు నియమ నిష్టలను పాటిస్తూ మూలిక యొక్క అధిష్టాన దేవత అయిన నక్షత్రము యొక్క సూక్తములను, మంత్రములను జపిస్తూ ఏకాగ్ర చిత్తం తో ఔషధములను నూరేవారు, వండేవారు, కలిపేవారు. కనుక అవి అమృతము వలె పని చేసేవి. ప్రస్తుతం ఫార్మసీలలో అవే మూలికలు వాడినప్పటికీ, అదే ఫార్ములా కలిపినప్పటికీ, అదే ఫలితం రాక పోవటానికి మూలికా సంగ్రహణ విధానం మరియు తయారీలోని లోపములు ముఖ్య కారణాలని చెప్పవచ్చు.

శ్రీ విద్యోపాసకులైన చందోలు శాస్త్రి గారు ఒక మూలికను సంగ్రహిద్దామని దగ్గరలోని కొండకు వెళితే, దానిని పెకలించబోయే ముందుగా, మూడు తలలున్న ఒక బాలుడు ఆయనకు కనబడి దానిని పెకలించకుండా అడ్డుకున్నాడనీ, చివరకు దానిని సంగ్రహించటం ఆయన వల్లగాక, తరువాత ఇంటికి వచ్చి విచారించగా ఆ మూలికకు అధిపతి దత్తాత్రేయుడనీ ఆయనకు తెలిసిందని వారి జీవిత గాధలో ఉన్నది.

విషయాలు అలా ఉంచితే,శరీరం లోని సప్త ధాతువులమీద సప్త గ్రహాల ఆధిపత్యాన్ని గురించి బృహత్ పరాశర హోరా శాస్త్రం విధంగా చెబుతున్నది:

శ్లో|| ఆస్థి రక్త స్తధా మజ్జా త్వక్ మేదో వీర్య మేవచ
స్నాయు రేతే ధాతవశ్యు: సూర్యాదీనాం క్రమాద్ద్విజ ||

(చూ: బృహత్ పరాశర హోరా శాస్త్రం-మూడవ అధ్యాయం- 32 శ్లోకం)


ఎముకలు: సూర్యుని అధీనంలో ఉన్నవి
రక్తం: చంద్రుని అధీనంలో ఉన్నది.
మజ్జ: కుజుని అధీనంలో ఉన్నది.
చర్మము: బుధుని అధీనం లో ఉన్నది.
కొవ్వు: గురుని అధీనం లో ఉన్నది.
శుక్రం: శుక్రుని అధీనం లో ఉన్నది.
కండరాలు: శని అధీనం లో ఉన్నది.

కాయ కష్టం చేసి కండరాలు ఎక్కువగా వాడేవారు, కండర శక్తితో జీవనాన్ని గడిపెవారి జాతకాలలో శని ముఖ్య పాత్రవహించటాన్ని గమనించ వచ్చు. అలాగే, శుక్ర గ్రహ దోషాలు ఉన్నవారి కి సంతాన సమస్యలు, సెక్స్ పరమైన సమస్యలుకలగటం కూడా గమనించ వచ్చు. రక్త పరమైన దోషాలు రోగాలు వచ్చే వారి జాతకాలలో చంద్రుని చెడు యోగాలనుగమనించ వచ్చు. చర్మ రోగాలు వస్తున్న వారి జాతకంలో బుధుని పాత్రా, ఊబకాయులలో గురు గ్రహం యొక్క చెడుయోగాలు స్పష్టం గా కనిపిస్తాయి. ఇక ఎముకలు, కళ్ళు, హృదయ సంబంధ రోగాలలో సూర్యుని పాత్ర ను చాలా చక్కగాగమనించ వచ్చు. పొతే, జెనెటిక్ డిసార్డర్స్ అనబడే జన్యు దోషాలలో కుజ గ్రహం యొక్క పాత్ర జాతకంలో స్ఫుటం గా కనిపిస్తుంది. రాహు కేతువులవల్ల,డయాగ్నసిస్ కు, ట్రీట్ మెంట్ కు, లొంగక ముప్పు తిప్పలు పెట్టె విచిత్ర మొండి రోగాలు సూచింప బడతాయి.

గ్రహాలపరస్పర యోగాలవల్ల (అనగా పెర్ముటేషన్స్ మరియు కాంబినేషన్స్ వల్ల) అసంఖ్యాకములైన రుగ్మతలు అన్నీజాతకంలో దర్శనం ఇస్తాయి. అంతేగాక తరతరాలుగా చాలా కుటుంబాలలో వారసత్వం గా వస్తున్న రోగాలను సూచించేగ్రహ యోగాలు చక్కగా దర్శనం ఇస్తున్నాయి. తాత/నాయనమ్మ/అమ్మమ్మ, తండ్రి/తల్లి, కొడుకు/కూతురుజాతకాలు- అనగా- మూడు తరాల జాతకాలను తులనాత్మక పరిశీలన చేస్తే వంశ పారంపర్య రోగాల వివరాలు అద్దంలో చూచినట్లు కనిపిస్తాయి. గుంటూరుకు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్కులు బీ. జే. రావుగారు (బుద్ధవరపు జగన్నాధ రావుగారు) ఈ వంశ పారంపర్య గ్రహ దోషాల పైన రీసెర్చి చెయ్యమని నాకు సలహా చెప్పారు. (ఆయన ప్రస్తుతం లేరు. రెండు ఏళ్ల క్రితం గతించారు). ఆయనతో నా చర్చలను, అనుభవాలను ముందు ముందు వ్రాస్తాను.


జాతకం లోని ఆయా దశలను,చెడు సమయాలను ముందుగానే గుర్తించటం ద్వారా, జాగ్రత్తలు తీసుకొని, సరియైన ఔషధాలు వాడుకొని, ఆహార విహారాదులలో సంయమనం పాటించి, ఆరోగ్యాన్ని చేజారి పోకుండా కాపాడు కోవచ్చు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మేలు కదా. యమ రాజు సోదరులైన నేటి ఆధునిక వైద్యుల, విలువలు లేని, మోసపూరిత వైద్యాల బారిన పడి, బాంక్ బేలన్స్ నిల్ చేసుకొని, రోగం తగ్గక బాధపడటం కంటే ముందుగా రాబోయే రోగాన్ని తెలుసుకొని నివారించుకోవటం ఉత్తమం కదూ? మెడికల్ఆస్ట్రాలజీ అనబడే వైద్య జ్యోతిషం యొక్క అద్భుతమైన ప్రాక్టికల్ కేస్ స్టడీస్ -- నా కేస్ ఫైల్స్ నుంచి-- ముందు ముందు చూద్దామా?
read more " వైద్య జ్యోతిషం- ధాతువులు, గ్రహాలు "

6, ఏప్రిల్ 2010, మంగళవారం

జెన్ కథలు-పుచ్చకాయా,రాయీ

నాన్ సేన్ ఒకరోజు బయటకు వెళుతూ తకేషి అనే తన శిష్యుణ్ణి తనతో వ్యాహ్యాళికి రమ్మన్నాడు.
ఇద్దరూ మౌనంగా అడవిగుండా నడుస్తున్నారు.
అలా నడుస్తూ ఒక సెలయేటి వద్దకు చేరుకున్నారు.
అడవిలో ఒక పక్కగా ఉన్న ఒక పుచ్చకాయను తెంపి సెలయేటిలో పారవేసాడు నాన్ సేన్.
తరువాత ఒడ్డునే ఉన్న ఒక రాయిని తీసుకుని నీళ్ళలోకి విసరి వేశాడు.
వెనక్కి తిరిగి తన ఆశ్రమం దారి పట్టాడు. తకేషి మౌనంగా అనుసరించాడు.
ఆశ్రమం చేరే వరకూ ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
మరుసటి రోజు తకేషి ఆశ్రమాన్ని వదలి వెళ్ళిపోయాడు.
-------------------------------------------------------

జెన్ కథలు చాలా లోతైన అర్థాలు కలిగి ఉంటాయి. పై పైన చదివితే అర్థం కావు. వాటిపైన ధ్యానం చెయ్యాలి.లోతైన చింతన చెయ్యాలి. అప్పుడే వాటిలోని అంతరార్థాలు తేటతెల్లం అవుతాయి.

తకేషి అనే శిష్యుడు నాన్ సేన్ అనే జెన్ గురువు దగ్గర చాలా కాలం పాటు ధ్యాన బౌధ్దాన్ని అభ్యాసం చేశాడు. కాని అతనికి జెన్ ఏమాత్రం అర్థం కాకపోగా,సతోరి అనబడే తాత్కాలిక సమాధి కూడా అతనికి అందలేదు. విషయమై అతను చాలా చింతాక్రాంతుడై ఉండేవాడు. సతోరి అనేది ఒక అనుభూతి. ఒక చిన్నపాటి సమాధి స్తితి వంటిది. సమాధిస్థితికి మొదటి మెట్టు అని అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గర ఉండి సాధన చేసిన తరువాత కూడా, కనీసం సతోరి కూడా అందుకోలేక పోయానని అతడు బాధ పడేవాడు. కాని తన బాధను గురువు దగ్గర వెళ్ళబుచ్చేవాడు కాదు.

జెన్ విధానాలు చాలా చిత్రమైనవి. మౌనబోధ కు జెన్ లో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. నిజానికి, ప్రకృతిలో సమస్తమూ తెరిచిన పుస్తకం వలే ఉన్నది. కాని ప్రకృతి మర్మాలు మనకు అర్థం కావటంలేదు. మన మనస్సులు మూసుకొని పోయి ఉండటమే దానికి కారణం. లోతైన పరిశీలనా దృష్టి లేకపోవటమే దానికి కారణం. తప్పు ప్రకృతిది కాదు. మనదే.

కళ్ళతో చూస్తున్నదాన్ని అర్థం చేసుకోలేని వాడు చెప్పినా అర్థం చేసుకోలేడు. పైగా, నోటితో చెబితే ఒక అనర్థం ఉన్నది. అదేమంటే- బుద్ది పరంగా అర్థం చేసుకొని, అదే సర్వస్వం అనుకునే ప్రమాదం ఇందులో ఉన్నది. మన వేదాంతం అంతా ఇలాగే భ్రష్టు పట్టింది. వేదాంత సత్యాలను నోటితో వల్లె వేసి, మహావాక్యాలు బట్టీ పట్టి, సర్వం బోధ పడింది అనుకునే పండితమ్మన్యులు మన దేశంలో చాలామంది ఉన్నారు.

మనకు కావలసింది బట్టీ కాదు. పుస్తక జ్ఞానం కాదు. అనుభవ జ్ఞానం కావాలి. పుస్తకంలో ఉన్న జ్ఞానం మన సొంతంకాదు. అది ఎవరిదో వేరేవారి అనుభవం. దాన్ని వల్లె వేసినంత మాత్రాన అది నీ అనుభవం గా మారదు. మరి నీ అనుభవం ఏమిటి? కళ్ళు మూసుకుంటే కటిక చీకటి కనిపించటమే మన అనుభవం. అటువంటి పరిస్తితిలో ఉంటూ "అహం బ్రహ్మాస్మి" వంటి మహావాక్యాలు అర్థమైనాయని అనుకోవటం ఉత్త వెర్రితనం. వేదాంతమైనా మహావాక్యాలైనా బుద్ధిపరంగా అర్థం అయితే చాలదు. అనుభవపరంగా తెలియాలి. అప్పుడే అనుభవం నీ సొత్తు అవుతుంది. అలాగే, బౌద్ధ సూత్రాలు బట్టీ పట్టిన మాత్రాన సత్యం అనుభవంలోకి రాదు. దానికి సాధన చేయాలి.

కనుకనే జెన్ సాంప్రదాయం లో గురువులు ఉపన్యాసాలు ఇవ్వరు. బోధలు చెయ్యరు. ఒక చిన్న ఉదాహరణో, చిన్నమాటో చెప్పి ఊరకుంటారు. శిష్యుడు దాన్ని ఊతగా తీసుకోని మౌనంగా ఏళ్ళకేళ్ళు సాధన చెయ్యాలి. పరిపక్వత సాధించాలి. తన ఆంతరిక లోతుల్లోకి మునగాలి. అక్కడ పుస్తక పాండిత్యం పనికిరాదు. బట్టీపట్టిన చిలుక పలుకులు అక్కరకు రావు. అది మరణంతో ముఖాముఖి. అక్కడ అనుభవమే ప్రధానం. పరిపక్వత శిష్యునికి కలిగిననాడు గురువే దానిని గ్రహిస్తాడు. శిష్యుడు నోరుతెరిచి చెప్పనక్కరలేదు. ప్రచారం చేసుకోనక్కర లేదు. శిష్యుని చూపు, మాటతీరు, ప్రవర్తన ను బట్టి గురువుకు అతని పరిణతి తేలికగా అర్థం అవుతుంది. అతడు జ్ఞానాన్ని పొందాడా లేదా అనే విషయాన్ని గురువు తేలికగా గుర్తించగలడు.

తకేషి పడుతున్న బాధను గురువైన నాన్ సేన్ గమనించాడు. జెన్ గురువులు మాటలతో బోధించరు. చేతలద్వారా మార్మికంగా సూచిస్తారు. అది అర్థం చెసుకోలేని శిష్యుడు, నోటితో చెప్పినా గ్రహించలేడని , అలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదనీ వారికి బాగా తెలుసు. అందుకే నాన్ సేన్ వ్యాహ్యాళికి పోతూ తకేషిని తనతో రమ్మన్నాడు.

సెలయేరు మనస్సుకు సూచిక. అందులో నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మనస్సులో నిరంతరం ఆలోచనా తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. పుచ్చకాయ నీటిలో మునగదు. తేలుతూ ఎంతదూరమైనా అలాగే పోతూఉంటుంది. ఏకాగ్ర ధ్యానస్థితి లేని సాధకునికి అది సూచిక. ఆలోచనా తరంగాలలో పడి కొట్టుకుపోతుంటే జ్ఞాన ప్రాప్తి ఎన్నటికీ కలుగదు. పుచ్చకాయ ఆకారంలో పెద్దది. అలాగే మనుష్యులు ధన కనక వస్తు వాహనాలలో చాలా గొప్పవారు కావచ్చు. పుచ్చకాయలో తియ్యని నీరు వలే వారివద్ద ఎంతో తెలివితేటలు, మరెన్నో విద్యలూ ఉండవచ్చు. కాని మనో భూమికలో పడి ఈదులాడుతూ బ్రతికేవారు పుచ్చకాయ వలే నీటితో పాటు కొట్టుకుపోయి మృత్యువాత పడక తప్పదు. వారికి నీటి అడుగు ఎన్నటికీ అందదు.

రాయి చిన్నదైనా, దాన్ని నీటిలో వేస్తే బుడుంగుమని మునిగి అది పడిన చోటే నీటి అడుగుకు చేరుకుంటుంది. అంతే కాని నీటి ఒరవడికి కొట్టుకుపోదు. అటువంటి ఏకాగ్రత సాధకునికి కావాలి. అప్పుడు అతడు మనో రాజ్యంలో పడి కొట్టుకుపోడు. ఆలోచనలను సూటిగా చేదించే విద్య అతనికి తలుస్తుంది. వాటి మూలానికి అతడు సూటిగా చేరగలడు. అటువంటి సామర్ద్యం ఉన్నవానికి జ్ఞాన ప్రాప్తి తేలికగా కలుగుతుంది. సతోరి అనుభవంలోకి వస్తుంది.

కావ్యకంఠ గణపతి ముని ఎన్నో మంత్రాలను ఏళ్ళతరబడి ఉపాసించాడు. కాని ఫలితం కనిపించలేదు. చివరకు బ్రాహ్మణస్వామి వద్దకు చేరాడు. అప్పటికి రమణమహర్షి అన్న పేరు ఆయనకు లేదు. అందరూ బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. ఆయన మౌని. ఎవరితోనూ పలకడు. తన లోకంలో తానుంటాడు. గణపతి ముని తన బాధను వెళ్ళబోసుకున్నాడు. ఆయన యొక్క నిజాయితీని గమనించి బ్రాహ్మణస్వామి మనస్సు కరిగింది. ఏళ్ళ తరబడి మౌనం వల్ల ఆయన గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని " మంత్రజపం చేసేటప్పుడు నాదం ఎక్కడ పుడుతున్నదో గమనించి ఆ స్థానంలో స్థిరంగా ఉండు. నేను అన్న భావన ఎక్కడ జన్మిస్తున్నదో గమనించి ఆ స్థానంలో స్థిరంగా ఉండు" అన్న మహొపదేశం చేశాడు. ఆ ఉపదేశమే గణపతి మునికి దారి చూపింది. ఆ తర్వాత ఎందరికో తారక మంత్రమైంది.


పుచ్చకాయతో పోలిస్తే రాయి చిన్నది. ఆకర్షణ లేనిది. ప్రపంచపు హోదాలు, మెరమెచ్చులు, పుచ్చకాయ వంటివి. అవి ఉపయోగపడతాయి. కాని జీవిత గమ్యానికి చేర్చలేవు. వాటికంటే, సూటిగా మూలానికి చేరగల చిన్న రాయి ఎంతో విలువైనది. ప్రజలు పుచ్చకాయను మోసుకోని పోయి తింటారు. కాని రాయికి కాళ్ళతో తంతారు. అలాగే, హోదాలకు ధనానికి ఈ ప్రపంచం ఎంతో విలువనిస్తుంది. కాని నిజమైన ఆధ్యాత్మికతను అది అర్థం చేసుకోలేదు. దానిని చూచి భయపడుతుంది. దూరంగా ఉంచుతుంది. ఇది లోకం తీరు.

నీటిలో పడి కొట్టుకొని పొయే పుచ్చకాయలాగా, ఆలోచనలలో పడి కొట్టుకొని పోయె స్థితిలో ఉన్న సాధకుడు ఎన్నిఏళ్ళు సాధన చెసినా ఆ సాధన అతన్ని గమ్యానికి చేర్చలేదు. రాయివలె, మనస్సు అడుగులకు సూటిగా చేరగలిగిన వాడు ఈ క్షణంలోనే జ్ఞానప్రాప్తిని పొందగలడు. ఇన్నాళ్ళూ తకెషి తన ఆలోచనలలో పడి ఈత కోడుతున్నాడు. అందుకే బుద్ధత్వాన్ని చేరుకోలేక పోతున్నాడు. అలాకాక, తన ఆలోచనల మూలాన్ని చేరుకున్న నాడు అతడు వెంటనే బుద్ధత్వాన్ని పొందగలడు.

నాన్ సేన్ తన ఈ చర్య ద్వారా ఇంతటి గూఢార్ధాన్ని తకేషికి సూచించాడు. తకేషి కూడా సామాన్యుడు కాదు. ఎంతో తపన ఉన్నటువంటి సాధకుడు. కనుకనే గురువుగారి చర్యలలోని అంతరార్ధాన్ని వెంటనే గ్రహించగలిగాడు.

ఆ రోజు రాత్రి తకేషి తన సర్వ శక్తులూ ఒడ్డి అంతర్ముఖుడు కావాలని ప్రయత్నించాడు. ఆలోచనలను నిర్దాక్షిణ్యంగా ఖండిస్తూ పోయాడు. నదిలో పడిన రాయి వలె తన ఆలోచనల మూలాన్ని చేరాలని ప్రయత్నించాడు. గంటలు గడిచాయి. తెల్లవారు ఝాము అయింది. హఠాత్తుగా అతనికి జ్ఞానోదయం కలిగింది. ఆలోచనలు పూర్తిగా ఆగిపొయాయి. కొలను అడుగుకు అతని చేతన చేరుకుంది. నిశ్చల సమాధి నిమగ్నత కలిగింది. అదే స్థితిలో తెల్లవారింది. అతనికి సర్వం తేటతెల్లంగా అర్థం అయింది. అతని ప్రయాణం సమాప్తం అయింది. బుద్ధత్వం లోకి అతడు ప్రవేశించాడు.

ఇక ఆశ్రమం లో ఉండవలసిన పని లేదు. అందుకే ఆశ్రమాన్ని వదలి మౌనంగా నిష్క్రమించాడు. నాన్ సేన్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అతనికి మహదానందం కలిగింది. నిజానికి తకేషి గురువును వదలి ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఇన్నాళ్ళూ ఇల్లు వదలి అతడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ప్రస్తుతం తన ఇంటికి తాను చేరాడు. బుద్ధత్వం పొందిన వారందరూ అదే ఇంటికి చేరుతారు.

నాన్ సేన్ శిష్యుడి నిష్క్రమణాన్ని మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయాడు.
read more " జెన్ కథలు-పుచ్చకాయా,రాయీ "