అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

28, జూన్ 2015, ఆదివారం

ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు

ఈరోజు ఉదయం పంచవటి సభ్యుడు గిరీష్ సూరపనేని గుంటూరుకు వచ్చాడు.

'ప్రస్తుతం గుంటూరులో ఉన్నాను.మీ ఇంటి అడ్రస్ చెబితే వచ్చి కలుస్తాను.' అని ఫోన్ చేశాడు.

'ఏం పని మీద కలవాలనుకుంటున్నారు?' - ఇలా అడగడం కొంచం దురుసుగా అనిపించినా తప్పక అడిగాను.

'ప్రత్యేకంగా పనేమీ లేదు.ఊరకే కలుద్దామని వచ్చాను' అన్నాడు.

'పనేమీ లేకుంటే కలవడం ఎందుకు? పిచ్చాపాటీ కబుర్లు నేనిష్టపడను.' అన్నాను.

ఎందుకలా అనవలసి వచ్చిందంటే,ఆదివారం నేను ఖాళీగా ఉంటే, నా సాధనకే నాకు సమయం సరిపోదు.అందుకని ఇతర పనులు సాధారణంగా పెట్టుకోను. ముచ్చట్లలో సమయం గడపడాన్ని అసలు ఇష్టపడను. చాలామంది వచ్చి కూచుని మాట్లాడే కబుర్లు (ఆధ్యాత్మిక కబుర్లు అయినా సరే) నాకు మహా కంపరం కలిగిస్తాయి.ఇక వారివారి కష్టాలూ కాకరకాయలూ కుటుంబ విషయాలూ లోకాభిరామాయణమూ చెబుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.

"ఇన్నాళ్ళూ నా భావజాలం చదివి ఇదా వీరు అర్ధం చేసుకున్నది?" అనిపిస్తుంది.కనుక వారి ఆరా నాకూ నచ్చదు. నా ఆరాను వారూ భరించలేరు. అందుకే అలా అనవలసి వచ్చింది.

అవతలనుంచి నిశ్శబ్దం. బహుశా చిన్నబుచ్చుకున్నాడేమో అనిపించింది.

'సరే.రండి.కానీ ఒక్క పదిహేను నిముషాలు మాత్రం మీతో మాట్లాడగలను.' అన్నాను.

కాసేపట్లో గిరీష్ ఇంటికి వచ్చి చేరాడు.

విజయవాడనుంచి హైదరాబాద్ వెడుతూ మధ్యలో నన్ను చూచి వెళదామని గుంటూరుకు వచ్చానని చెప్పాడు.శ్రీశైలం సాధనా సమ్మేళనానికి రావాలనుకుని కూడా రాలేకపోయానని అన్నాడు.

నేనేమీ రెట్టించలేదు.

కాసేపు కుశలప్రశ్నలు అయ్యాక - 'ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి. కాసేపయ్యాక మళ్ళీ ధ్యానం కొనసాగించవచ్చా?' అడిగాడు.

'అసలు చెయ్యవలసింది అదే. ఆలోచనలలో కొట్టుకుపోతున్నామన్న తెలివి వచ్చాక మళ్ళీ ధ్యానాన్ని సాగించాలి' అన్నాను.

అనవసరమైన కబుర్లు పెట్టుకోకుండా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు గనుక కొన్ని విషయాలు చెబుదామని అనిపించింది.

'పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో ఇదే అన్నారు. యోగానికి ఆయనిచ్చిన నిర్వచనం చిత్తవృత్తి నిరోధం.చిత్తం అనే పదానికి స్థూలంగా మనస్సు అని అనుకోవచ్చు.రెండూ నిజానికి ఒకటి కాకపోయినా సమానార్ధకాలే.

మనస్సులో ఆలోచనలు నిరంతరం వస్తూ ఉంటాయి. చిత్తంలో అలా కాదు. అక్కడ ఎన్నో జన్మల సంస్కారాలు పోగుపడి ఉంటాయి.నవీన కాలపు సైకాలజీ చెప్పే "సబ్ కాన్షస్ మైండ్" నే చిత్తం అని అనుకోవచ్చు.అక్కడ ఉన్న సంస్కారాల అనుగుణంగా ఆలోచనలు తలెత్తి పైకి వస్తుంటాయి.ఒక సరస్సు అడుగున బుడగలు ఏర్పడి పైకి ఉబికి వచ్చినట్లు ఇది జరుగుతుంది.ఆ బుడగలకు మూలం సంస్కారాలు.అవి మనస్సు అడుగు పొరల్లో దాగి ఉంటాయి. అవి ఆలోచనలుగా రూపాంతరం చెందకుండా మూలంలోనే వాటిని ఆపడమే యోగం అని మహర్షి అన్నారు.అది చాలా లోతైన స్థాయి.మీరు అంత చెయ్యలేకపోయినా కనీసం ఆలోచనలలో పడి కొట్టుకుపోకుండా ఉంటే చాలు. ధ్యానం అదే కుదురుతుంది.' అన్నాను.

'ఆలోచన రాకుండా ఉండటం అనేది ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమేనా? ఇరవై నాలుగ్గంటలూ అలాగే ఉండాలా? - అడిగాడు.

'ధ్యానంలో ఉన్నకాసేపు అలా ఉండి బయటకు రాగానే మామూలు అయిపోతే ఏమీ ఉపయోగం లేదు.ఇరవై నాలుగ్గంటలూ అలాగే ఉండాలి.' అన్నాను.

'ఎప్పుడూ ఆలోచన అనేదే లేకుండా ఉంటే బయట ప్రపంచంలో ఫెయిల్ అవుతామేమో కదా?' అడిగాడు గిరీష్.

'అదేమీ ఉండదు.మొదట్లో అవగాహనా లోపం వల్ల అలా అనిపిస్తుంది.మన మనశ్శక్తిలో పదిశాతం ఉపయోగిస్తే చాలు.బయట పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు.అదే సమయంలో మిగతా 90% మనస్సును ధ్యానంలో ఉంచవచ్చు.ఇది సాధ్యమే.అయితే ఇలా చెయ్యగలగాలంటే దానికి తగినంత సాధనాశక్తి ఉండాలి.మాటలు తక్కువ, సాధన ఎక్కువ చెయ్యాలి.

సాధన మొదటి దశలలో ఉన్నప్పుడు ,లోపలా బయటా బేలెన్స్ చేసుకోవడం కష్టమౌతుంది.ఆ సమయంలో ఇలా అనిపిస్తుంది.అందుకే ధ్యానం ఇప్పుడే మొదలు పెట్టినవాళ్ళు బయట ప్రపంచంలో తప్పకుండా ఫెయిల్ అవుతూ ఉంటారు.కాలక్రమేణా నీకు సాధనలో పట్టుచిక్కిన తర్వాత ఈ బాధ ఉండదు. అప్పుడు అన్ని పనులూ చేస్తూ కూడా నిరంతరం ధ్యానంలో ఉండవచ్చు

అదీగాక సక్సెస్ - ఫెయిల్యూర్ అనేవాటి నిర్వచనాలు మనిషి మనిషికీ మారుతాయి.సక్సెస్ అనేదానికి లోకం ఇచ్చిన నిర్వచనాన్ని మనం అనుసరించవలసిన పనిలేదు.లోకం అనుకునే సక్సెస్ ఒక్కటే నీ గమ్యమైతే నీకు ధ్యానం కుదరదు.ఆధ్యాత్మికంగా నువ్వెప్పటికీ ఎదగనూ లేవు. మార్మికుల సక్సెస్ నిర్వచనం వేరుగా ఉంటుంది.' చెప్పాను.

'ధ్యానం కొన్నిసార్లు బాగా కుదురుతుంది.కొన్నిసార్లు కుదరదు.ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి.' అన్నాడు.

'సహజమే.మనసే సాధనకు అడ్డు పడుతూ ఉంటుంది. సాధనకు ఆలోచనలు అడ్డువస్తాయి.తీరని కోరికలు అడ్డు వస్తాయి.బలంగా ఉన్న సంస్కారాలు అడ్డువస్తాయి. ఇంద్రియాలు అడ్డు వస్తాయి.అది విచిత్రం  ఏమీకాదు.ఇదంతా మనసు చేసే గారడీ.

ఇంతాచేస్తే తప్పు మనస్సుది కాదు.అది ఒక పరికరం.ఒక కత్తి వంటిది. దానితో ఆపరేషనూ చెయ్యవచ్చు. హత్యా చెయ్యవచ్చు. ఇన్నాళ్ళూ నువ్వు దానితో హత్యలు చేస్తున్నావు.ఇప్పుడు ఆపరేషన్ చేద్దామని నిశ్చయించుకున్నావు.ఆ నిశ్చయం కూడా బలమైనది కాదు.ఒకరోజు గుర్తుంటుంది.మర్నాడు మర్చిపోతావు.మళ్ళీ హత్య చేస్తావు.ఇన్నాళ్ళూ హత్యలకు అలవాటు పడిన మొద్దుకత్తికి సానపెట్టి ఆపరేషన్ కు సరిపోయే విధంగా దానిని నీవు మార్చాలి.అలా మారడం దానికి ఇష్టం ఉండదు.అందుకే అది ఎదురు తిరుగుతుంది.

అసలు ధ్యానం చెయ్యాలంటే దీక్ష అనేది తప్పనిసరిగా తీసుకోవాలి.లేకపోతే ధ్యానం ఎలా చెయ్యాలో ఎలా తెలుస్తుంది?ధ్యానాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని వందల రకాలున్నాయి.వాటిల్లో మనకు సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.మనకంత తెలివి ఉండదు కనుక గురువు చెప్పిన బాటలో నడవాలి.పట్టుదలతో నడవగా నడవగా దారి అర్ధమౌతుంది.' అన్నాను.

'దీక్షకు కావలసిన అర్హతలు ఏమిటి" అడిగాడు.

'తపనే అర్హత.అది తప్ప వేరే అర్హతలు ఏమీలేవు.కులం, మతం, ప్రాంతం, వయస్సు,నీ స్టేటస్ - ఇవేవీ అర్హతలు కావు. దైవాన్ని చేరాలన్న తపనా, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనలే ముఖ్యం.' అన్నాను.

'అదెలా వస్తుంది?' అడిగాడు.

'ముందుగా మనిషికి కొన్ని ఆలోచనలు కలగాలి."మనిషి జీవితంలో మౌలికప్రశ్నలు"- అనే ఒక పోస్ట్ లో వ్రాశాను. అసలు ఈ జీవితం ఏమిటి? ఎందుకు పుట్టాను?చనిపోయిన తర్వాత ఏమౌతాను?పుట్టకముందు ఎక్కడున్నాను?ఇన్నాళ్ళూ బ్రతికిన ఈ బ్రతుకులో ఏం సాధించాను?ఈ బాంధవ్యాలూ స్నేహాలూ నిజమైనవేనా?నిలుస్తాయా? ఎవరు నిజంగా నావాళ్ళు?' మొదలైన ప్రశ్నలు మనిషి గుండెల్లోంచి పొంగి రావాలి.అప్పుడు తపన కలుగుతుంది.ఒకవిధమైన ఆరాటం లోలోపల ఏర్పడుతుంది.అది రావాలి.అది బాగా పెరిగి పెరిగి ఒక వేదనగా మారాలి.అప్పుడు భగవంతుని కరుణతో గురువు దర్శనం కలుగుతుంది.దీక్ష అనేది అప్పుడే సాధ్యమౌతుంది.అంతవరకూ సాధ్యం కాదు.ఈ లోపల తీసుకున్న సరదా దీక్షలవల్ల ఉపయోగం కూడా ఉండదు.' అన్నాను.

'కొన్నాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు గురువు పరిచయం అవుతుంది' అంటారు కదా? - అడిగాడు.

'అది సరికాదు.ఎలా చెయ్యాలో తెలీకుండా ఏం చేస్తావు? నడవాలంటే దారి కనపడాలి కదా.దారి తెలీకుండా ఎలా నడుస్తావు?ఆధ్యాత్మిక ప్రయాణం ఒక రహస్యమైన నడక.దాని రహస్యాలు ఎక్కడా పుస్తకాలలో ఉండవు.అవి సరాసరి గురువునుంచి శిష్యునికి ప్రసారం అవుతాయి.పుస్తకాలలో కనిపించేది అంతా పొట్టు మాత్రమే.అసలైన మార్గం రహస్యంగా ఉంటుంది. గురువు ద్వారా ఆ మార్గం సుగమం అవుతుంది.ఆ తర్వాత ఎక్కడా ఆగకుండా,మనసు చేసే మాయలకు లోబడకుండా,మనం ఎంత గట్టిగా ఆ దారిలో నడుస్తాం అనేదే ముఖ్యం.

ఎంత జాగ్రత్తగా ఉన్నా మనస్సు మనల్ని పడేస్తుంది.పడటం తప్పు కాదు. అందరూ పడతారు.కానీ తెలివి తెచ్చుకుని లేచి మళ్ళీ నడక సాగించాలి.ఈ సారి మళ్ళీ పడకుండా ఉండాలి.అప్పుడు మనస్సు ఇంకో రకంగా పడేస్తుంది.మళ్ళీ బుద్ధి తెచ్చుకుని నడక సాగించాలి.ఈ విధంగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. తప్పులు చేస్తూ దిద్దుకుంటూ అది ముందుకు సాగుతుంది.' అన్నాను.

'ధ్యానంలో నిదర్శనాలు ముఖ్యమా?' అడిగాడు.

'ముఖ్యంకాదు.వాటికోసం మనం సాధన చెయ్యకూడదు.అవి వస్తాయి. కనిపిస్తాయి.కానీ వాటికోసం మనం చూడకూడదు. ప్రయాణం చేసేవాడికి గమ్యం మీద మాత్రమే దృష్టి ఉండాలి. కానీ మైలురాళ్ళ మీద దృష్టి ఉండకూడదు.దారిలో అవి వచ్చినపుడు 'ఓహో ఇంతదూరం వచ్చానా?' అని తెలుస్తుంది. కానీ అక్కడే ఆగరాదు.' అన్నాను.

'మనం సరియైన దారిలో నడుస్తున్నామా లేదా అని తెలుస్తుందా?' అడిగాడు.

'అలాకాదు.సరియైన దారిలోనే ఉంటాము.గురువు మనకు సరియైన దారిని కాకుండా తప్పుదారిని ఎందుకు సూచిస్తాడు?అది సరియైన దారే.కాకపోతే, మనం ఎంతవరకు వచ్చాము?మనలో దిద్దుకోవలసిన లోపాలు ఎన్ని ఉన్నాయి?ఎక్కడెక్కడ ఉన్నాయి?'--మొదలైన విషయాలు అర్ధమౌతాయి. వాటిని దిద్దుకుంటూ నడక సాగించాలి.

నిదర్శనాలు కూడా నీవున్న స్థాయిని బట్టి కలుగుతాయి.సాధనలో ఎన్నో లెవల్స్ ఉన్నాయి.నీవున్న స్థాయిని బట్టి నీకు నిదర్శనాలు కనిపిస్తాయి. తక్కువ స్థాయులలో ఉన్నపుడు కలలు మొదలైనవి వస్తూ ఉంటాయి.పై స్థాయిలలో అయితే దేవతాదర్శనాలు,మహనీయులు కనిపించి మాట్లాడటం, సూచనలు ఇవ్వడం,ఇతర లోకాలతో సంబంధం ఏర్పడటం మొదలైనవి కలుగుతాయి.కొన్ని శక్తులు కూడా వస్తాయి.ఎక్కడో ఎవరో చెప్పుకుంటున్న మాటలను నీవు వినవచ్చు.ఎక్కడో జరుగుతున్నవాటిని నీ మనస్సు తెరమీద స్పష్టంగా చూడవచ్చు.వీటినే దూరశ్రవణం,దూరదర్శనం అంటారు. ఇంకా ఎదిగితే, సంకల్ప మాత్రంతో ఎక్కడో ఉన్నవారికి నీవు సాయపడవచ్చు. వారు ఉన్నచోటికి నీవు సూక్ష్మశరీరంతో వెళ్ళవచ్చు.వారికి స్వప్నంలో నీవు కనిపించి సందేశాలు ఇవ్వవచ్చు.ఇవన్నీ సాధ్యాలే.అయితే వీటికోసం మనం ఆత్రపడకూడదు.కానీ మార్గమధ్యంలో అవి వచ్చే మాట వాస్తవమే.' అన్నాను.

గిరీష్ మౌనంగా వింటున్నాడు.

'మనిషి ఎక్కువగా బయట వస్తువులమీదా మనుషుల మీదా ఆధారపడతాడు.ఎప్పుడూ ఏదో ఒకటి కోరుతూ ఉంటాడు.అందుకే మన దృష్టి ఎప్పుడూ బయటవైపే ఉంటుంది.ఇదొక పెద్ద పొరపాటు.ఈ పొరపాటు క్రమేణా ఒక రోగంగా మారుతుంది.ఈ రోగం ముందుగా నయం కావాలి.ఈ అలవాటు ముందుగా మారాలి.

ఈ క్రమంలో కొందరు డబ్బుమీద ఆధారపడతారు.కొందరు పదవి మీద, ఇంకొందరు కులాహంకారం మీద, మరికొందరు అందచందాల మీదా, ఇంకొందరు ఆస్తిపాస్తులమీదా ఇలా రకరకాలుగా ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు.ఇవి పోవాలి.పోవాలంటే మనిషికి లోతైన చింతన ఉండాలి. ఆ చింతన నుంచి తపన బయలుదేరుతుంది.అంతేగాని ఏదో గాలివాటంగా బ్రతకకూడదు.

ఉదాహరణకు పదవినే తీసుకుందాం.పదవితో వచ్చే దర్పం ఎన్నాళ్ళు ఉంటుంది?మనం పుట్టుకతోనే పదవితో పుట్టామా?పోయాక పదవి ఉంటుందా?డబ్బైనా, అందమైనా,ఆస్తి అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా అంతేకదా?కొన్నాళ్ళకు ఇవన్నీ పోతాయి.అప్పుడు ఇన్నాళ్ళూ అవే సర్వస్వం అనుకున్న నీ గతేమౌతుంది?కనుక వాటిమీద నీవు ఆధారపడకూడదు. ఎప్పుడైతే నీకు వాటిమీద మోజు లేదో అప్పుడు నీవు ఎవరిమీదా ఆధారపడవు.ఏ వస్తువుమీదా ఆధారపడవు. నీమీదే నీవు ఆధారపడతావు. ఎప్పుడూ ఏమార్పూ లేకుండా ఉండే ఆత్మ మీదే నీవు ఆధారపడతావు. అప్పుడు నీ దగ్గర ఏ వస్తువున్నా లేకున్నా, ఎవరు నీతో కలసి ఉన్నా లేకున్నా,లోకం అనుకునే సక్సెస్ నీ దగ్గర ఉన్నా లేకున్నా - నీకేమీ తేడా ఉండదు.అలా నీవు ఉండగలిగితే అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా నీవు ఒక స్థాయికి చేరినట్లు లెక్క.ఆ తర్వాత ఇంకా పైనకూడా చాలా లెవల్స్ ఉన్నాయి.' అన్నాను.

'మీకుకూడా ఇంకా ధ్యానం అవసరమా? మీరు ఇప్పటికీ చేస్తూ ఉంటారా?' అడిగాడు.

నవ్వాను.

'చేస్తాను.నాకూ అవసరమే.నా ప్రయాణం ముగింపుకు రాలేదు.నడవవలసిన దారి ఇంకా చాలా ఉన్నది.నిజం చెప్పాలంటే ఈ దారికి అంతూపొంతూ కనిపించడం లేదు. దీనికి ఒక ముగింపు ఉందని కూడా నేననుకోవడం లేదు.నడచే కొద్దీ కొత్తకొత్త గమ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.ఒక శిఖరం అందితే,ఇంకా ఎత్తైన శిఖరాలు కన్పిస్తూనే ఉంటాయి.ఇదొక నిరంతర ప్రయాణం.కనుక ధ్యానం అవసరమే.

అది ఎవరికి అవసరం లేదంటే -- శ్రీరామకృష్ణులు,రమణమహర్షి, అరవింద యోగి,జిల్లెళ్ళమూడి అమ్మగారు వంటి కొందరికి మాత్రమే ధ్యానం యొక్క అవసరం ఉండదు.మిగతావారికి అది అవసరమే. ఎవరైనా సరే, మాకు ధ్యానం అవసరం లేదు.మేము ఆ స్థితిని దాటాము అని చెబితే నమ్మవద్దు.అది మోసం అయినా అయి ఉంటుంది.లేదా వాళ్ళు అజ్ఞానంతోనైనా మాట్లాడుతూ ఉంటారు.' అన్నాను.

ఆ తర్వాత తన చిన్నప్పుడు జరిగిన సంగతులు కొన్ని చెప్పాడు.అయిదేళ్ళ వయస్సులో తనొక చెరువులో మునిగిపోవడం,ముఖం మూసుకుని నీళ్ళలో ఉండికూడా ఊపిరి పీలుస్తూ ఉండటం, అయినా బ్రతికే ఉండటం, కాసేపటికి ఎవరో స్త్రీ నీళ్ళకోసం చెరువుకు వచ్చి నీళ్ళలో తేలుతున్న జుట్టును చూచి తనను బయటకు లాగారని చెప్పాడు.

"ధ్యానం చేస్తే నిబ్బరంగా ఉండగలుగుతాం, ఇంటర్వ్యూలలో బెదరకుండా చెయ్యగలుగుతాం"-అని విని,ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాననీ, మొదటిసారి ధ్యానం చేసినప్పుడు చాలా చక్కగా కుదిరిందనీ, తన మెడక్రింద శరీరం అంతా అసలు లేనట్టు అనిపించిందని, ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థితి రాలేదని చెప్పాడు.

నేనేమీ కామెంట్ చెయ్యలేదు.మౌనంగా విన్నాను.

కాసేపు మాట్లాడి సెలవు తీసుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాడు.

నేను నా రోజువారీ కార్యక్రమాలలోకి ప్రవేశించాను.
read more " ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు "

23, జూన్ 2015, మంగళవారం

ఆరోగ్యవంతమైన జీవితానికి అసలైన సూత్రాలు

ఒక విషయం నేను చెబితే చదువరులకు ఆశ్చర్యం కలుగుతుంది.

గత ముప్ఫై ఏళ్ళలో,ఒక్కసారి తప్ప,నేను ఎప్పుడూ ఆస్పత్రి ఛాయలకు పోలేదు.ఇంగ్లీషుమందులు మింగలేదు.ఇక ఇంజక్షన్ అంటే ఏమిటో, చిన్నప్పుడు టీకాలు వేయించినప్పుడు తప్ప, నాకు ఇప్పటివరకూ తెలీదు. నాకిప్పుడు 52 ఏళ్ళు వచ్చాయి.కళ్ళకు సైట్ అనేది ఇంతవరకూ నాకు లేదు. బీపీ,షుగరూ ఇతరత్రా రోగాలేవీ నాకు లేవు.శరీరశ్రమ చేసినాకూడా అలుపనేది అంత త్వరగా నాకు రాదు.

అయితే,నేనేమీ సూపర్ మ్యాన్ ని కాను.అందరిలాంటి మామూలు మనిషినే. పైగా,ప్రకృతికి వ్యతిరేకంగా రాత్రింబగళ్ళు పనిచేసే ఉద్యోగం నాది.ఒకచోట తిండి,ఒకచోట నీళ్ళు ఉండవు.వేళకు భోజనం ఉండదు,ఇలాంటి పరిస్థితులలో చేసే ఉద్యోగం నాది.

మరి ఇదెలా సాధ్యం?

మితమైన సాత్వికాహారం,యోగాభ్యాసం,ధ్యానం,పరిమితమైన హోమియో ఔషధాల వాడకం,దురలవాట్లకు దూరంగా ఉండటం,నవ్వుతూ ఉండటాల వల్ల ఇది సాధ్యమైంది.

చాలామంది అనుకుంటారు--యోగా అనేది సర్వరోగ నివారిణి అని.

గత రెండు రోజులుగా ప్రచారం కూడా అలాగే జరుగుతోంది.నిన్నెవరో రాజకీయ నాయకుడు -- యోగా అనేది సర్వరోగ నివారిణి -- అని ఒక స్టేజీ మీద నుంచి చెప్పాడు.నాకు చచ్చే నవ్వొచ్చింది.ఆయన్ను చూస్తే, యోగా అనేదాన్ని ఎప్పుడూ చేసిన పాపాన పోలేదని తెలుస్తూనే ఉన్నది.

అది నిజం కాదు.

యోగా- అనేది నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. చక్కని ఫిట్ నెస్ ను ఇస్తుంది.కానీ -- నీకు వంశపారంపర్యంగా జీన్స్ లో వచ్చే రోగాలను అది తగ్గించగలదా? అంటే - గలదు, లేదు అని రెండు జవాబులు వస్తాయి.

సామాన్యంగా అందరూ కాసేపు చేసే యోగా ఆ పనిని చెయ్యలేదు.అది నీకు ఫిట్ నెస్ మాత్రమే ఇవ్వగలదు.వంశపారంపర్య రోగాలను అది తగ్గించలేదు.

కానీ, హైయ్యర్ యోగా అనేది ఆ పనిని చెయ్యగలదు.అయితే దానిని చెయ్యాలంటే, దానికి బోలెడంత ఓపిక కావాలి.శ్రద్ధ కావాలి.రోజూ ఉదయం మూడుగంటలు సాయంత్రం మూడుగంటలు హైయ్యర్ యోగాను చెయ్యగలిగితే,అప్పుడు నీ శరీరాన్ని అది సమూలంగా మార్చిపారేస్తుంది.నీలో ఉన్న ఎలాంటి దీర్ఘ రోగాన్నైనా సరే అది నయం చెయ్యగలుగుతుంది.కానీ అంత ఓపిక మనకెక్కడుంది?అంత తీరిక మనకెక్కడుంది?అంత శ్రద్ధ మనకెక్కడిది?రోజుకు ఆరుగంటలపాటు యోగాభ్యాసం చేస్తూ కూచుంటే మనల్ని పోషించేవాళ్ళెవరు?ఈ జీవన పోరాటంలో అది సాధ్యమేనా?సాధ్యం కాదు.

కనుక ఆహారనియమం,యోగాభ్యాసంతో బాటు,హోమియో ఔషధాలను మితంగా వాడుకుంటే,ఆ పని సులభంగా జరుగుతుంది. 

వంశపారంపర్య దీర్ఘరోగులలో గనుక మనం గమనిస్తే, యోగాభ్యాసంవల్ల,వాళ్ళ బాధ కంట్రోల్లో ఉంటుంది.మినిమం స్టేజ్ లో ఉంటుంది.కానీ పూర్తిగా తగ్గదు. అలా అది పూర్తిగా తగ్గాలంటే,దానిని సమూలంగా కూకటివేళ్ళతో పెకలించగల హోమియో ఔషధాలవల్లే ఆ పని జరుగుతుంది.లేదా హయ్యర్ యోగాతో జరుగుతుంది.

ఏమిటి హోమియో ఔషధాల ప్రత్యేకత? అని మీకు అనుమానం రావచ్చు. మామూలు అల్లోపతి మందులు ఆ పనిని ఎందుకు చెయ్యలేవు? అని కూడా అనుమానం రావచ్చు.

ఈ రెంటికీ చాలా తేడా ఉన్నది.

హోమియోపతి మందులు పొటెన్సీ ఔషధాలు గనుక,దేహంతో చాలా సూక్ష్మ స్థాయిలలోకి వెళ్లి పని చేస్తాయి.ఇంగ్లీషు మందులు ఆ పనిని చెయ్యలేవు.

ఈ రెంటికీ అసలైన భేదం ఇంకొకటి ఉన్నది.

ఇంగ్లీషు మందులు శరీరం చెయ్యవలసిన పనిని అవి చేసి, శరీరానికి బద్ధకాన్ని పెంచుతాయి.అందుకని శరీరం వాటిమీద ఆధారపడి పోయే పరిస్థితి తలెత్తుతుంది.ఒక మందుల కట్టను ఎక్కడికి పోయినా మోసుకు పోవలసిన ఖర్మ పడుతుంది.తిండి తిన్న వెంటనే ఆ కట్టను తెరిచి ఆ మందులు ప్రతిరోజూ మింగవలసిన గతి పడుతుంది.ఒక్కరోజు అవి వేసుకోకపోతే కుప్పకూలిపోయే పరిస్థితికి మిమ్మల్ని ఆ మందులు తీసుకెళతాయి.

హోమియో ఔషధాలు పనిచేసే తీరు అలా ఉండదు.

అవి శరీరపు రోగనిరోధక శక్తిని ఉత్తెజపరుస్తాయి.శరీరం తన పనిని తాను మునుపటిలా చేసుకునేటట్లు చేస్తాయి.తన రోగాన్ని తానే నయం చేసుకునే స్థాయికి ప్రాణశక్తిని ఉద్ధరిస్తాయి.కనుక వాటిని అదేపనిగా ప్రతిరోజూ వాడవలసిన పని ఉండదు.

ఇంగ్లీషు మందుల వాడకంలో -- అనవసరమైన కెమికల్స్ క్రమేణా దేహంలో పోగుపడుతూ ఉంటాయి.కొన్నాళ్ళ తర్వాత రోగం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం మీదకు ప్రాకుతూ పోతుంది.ముదురుతూ పోతుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్ లనేవి ఆ విధానంలో తప్పకుండా కలుగుతాయి.

కానీ హోమియోపతిలో అలాంటి పరిస్థితి ఉండదు.ఇందులో హానికర రసాయనాలు ఏమీ ఉండవు.అవి శరీరంలో పోగుపడవు.రోగం అన్ని అవయవాలకూ ప్రాకదు.ముదరదు.ఉత్తేజితమైన ప్రాణశక్తి వల్ల రోగం కూకటి వేళ్ళతో పెకలింపబడుతుంది.

యోగాద్వారా కూడా ఈ అద్భుతాన్ని సాధించవచ్చు.కానీ మామూలుగా అందరూ చేసే అరగంట యోగా వల్ల ఈ అద్భుతం జరగదు.హయ్యర్ యోగా మాత్రమే ఈ పనిని చెయ్యగలదు.

ఒక అరగంటలో ఎన్ని ఆసనాలు వెయ్యగలరు? అవి కూడా ఎంత సరిగ్గా తప్పులు లేకుండా చెయ్యగలరు? ఆసనాలనేవి అసలైన యోగాభ్యాసంలో ఎంత భాగం గనుక?

యోగాలో ఆసనాలతో పాటు,షట్కర్మలు,ముద్రలు,క్రియలు,బంధాలు, ప్రాణాయామ సాధనలు,ధారణాభ్యాసాలు,మంత్రజపం మొదలైన కొన్ని వందల టెక్నిక్స్ ఉన్నాయి.అవన్నీ కలసినదే హయ్యర్ యోగా. దానిని ప్రతిరోజూ కనీసం మూడుగంటలపాటు చేస్తే అప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది. దేహంలోని రోగాలన్నీ మటుమాయం అవుతాయి.శరీరం వజ్రకాయం అవుతుంది.అంతేగాని పైపైన ఒక పది ఆసనాలు సూర్యనమస్కారాలు చేస్తే ఈ అద్భుతం జరగదు.

వంశపారంపర్య వ్యాధులు లేని మనిషి ఈ రోజున ప్రపంచంలో ఎక్కడా లేడు. పరిపూర్ణ ఆరోగ్యవంతుడూ ఎక్కడా లేడు.కనుక ఈ రోగాలు పోయి, మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే,ఒక్కటే మార్గం -- ఆహారనియమం,యోగాభ్యాసం, మితంగా హోమియో ఔషధాల వాడకం,దురలవాట్లకు దూరంగా ఉండటం.

ఇది తప్ప -- ప్రపంచమంతా గాలించినా సరే -- దీనికి వేరే మార్గం ఇంకేమీ లేదు.

ఈ రోజువారీ షెడ్యూల్ ను క్రమం తప్పకుండా పాటించగలిగితే,అరవైలో కూడా ఇరవైలాగా హుషారుగా ఉండవచ్చు.జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా జీవించవచ్చు.నేను పుస్తకపరిజ్ఞానంతో ఈ మాటను చెప్పడం లేదు.అనుభవంతో చెబుతున్నాను.నేను చెబుతున్నవాటిని నా జీవితంలో ఆచరించి, ఫలితాలను పొంది, ఈ మాటను చెబుతున్నాను.

అయితే, ఈ మార్గం అందరికీ నచ్చదు. అన్నీ మానుకొని అలా బ్రతకకపోతే ఏం?అనేవారు చాలామంది ఉన్నారు.ఈ రకంగా నోరు కట్టేసుకుని వెయ్యేళ్ళు బ్రతకడం కంటే అన్నీ తింటూ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఒక నెల బ్రతికినా చాలు అనుకునేవారూ అనేవారూ చాలామంది ఉన్నారు.నా స్నేహితులే చాలామంది ఈ మాటను పది పదిహేనేళ్ళ క్రితం కూడా అనేవారు. ఇప్పుడు వారందరూ రకరకాల రోగాలతో గుప్పెళ్ళు గుప్పెళ్ళు మందులు మింగుతున్నారు.అది వారి ఖర్మ.

అలాంటి వారికి జీవితం అంటే -- ప్రతిరోజూ సాయంత్రానికి త్రాగడం, ఇష్టం వచ్చిన మాంసాలు తెగతినడం,సాధ్యమైనంత మంది అమ్మాయిలతో తిరగడం, షాపింగులు చెయ్యడం,బ్యూటీ ప్రాడక్ట్స్ ఎడాపెడా కొనేసి వాడటం,హోటళ్ళలో పడి నానాచెత్తా తినడం,ప్రతిదానికీ ఉద్రేకపడిపోతూ జీవితాన్ని గడుపుతూ అదొక ఘనమైన ఎంజాయ్ మెంట్ అనే భ్రమలో ఉండటం,ఏదైనా రోగం వస్తే కార్పోరేట్ ఆస్పత్రిలో చేరి బెడ్ మీద పడుకొని శరీరాన్ని వాళ్లకు అప్పజెప్పడం--ఇవన్నీ చెయ్యడానికి కావలసింది బోలెడంత డబ్బు గనుక--పొద్దున్న లేచిన దగ్గరనుంచీ రాత్రి పడుకునే వరకూ పరుగులు పెడుతూ, డబ్బు డబ్బు డబ్బు  అని కలవరిస్తూ దానికోసమే బ్రతకడం -- ఇంతే.

అసలైన జీవితం ఇది కాదు.

చక్కని ఆరోగ్యంతో,ప్రశాంతమైన మనస్సుతో,పరిపూర్ణ ప్రజ్ఞతో,ఉల్లాసకరమైన జీవితాన్ని గడుపుతూ,చేతనైనంతలో సాటి మనిషికి సాయం చేస్తూ,అన్ని టెన్షన్ల మధ్య ఉన్నాకూడా,ఏ టెన్షనూ లేకుండా,నిశ్చలంగా,నిబ్బరంగా ఉంటూ,అత్యాశ లేకుండా,జెలసీ లేకుండా,కోపతాపాలు దరిచేరకుండా, ప్రతిదానికీ క్రుంగిపోకుండా,తన మనస్సును తన కంట్రోల్ లో ఉంచుకుని గడిపేదే అసలైన జీవితం.

అప్పుడే మనిషికి అసలైన ఆనందం అంటే ఏమిటో అర్ధమౌతుంది.అయితే ఈ ఆనందం ఊరకే అనుకున్నంత మాత్రాన లభ్యంకాదు.'ఈ ఆనందం నాకూ కావాలి'- అని తలచుకున్నంత మాత్రాన అది రాదు.

ఈ ఆనందం సొంతం కావాలంటే మన దినచర్య మారాలి.

మన ప్రయారిటీస్ మారాలి.

మన ఆలోచనా విధానం మారాలి.

మన అలవాట్లు మారాలి.మన పద్ధతులు మారాలి.

వెరసి మన జీవన విధానమే మారాలి.

డబ్బుకోసం,బయట వస్తువులకోసం,అవిచ్చే సోకాల్డ్ సుఖాలకోసం మన ఉరుకులు పరుగులు తగ్గాలి.ఇతరులతో మనల్ని పోల్చుకుని మనం పడే టెన్షన్లు మాయం కావాలి.వస్తువులలో ఆనందం ఉన్నదనే భ్రమ మనల్ని వదలాలి.బయట ప్రపంచంలో కొత్త కొత్త సుఖాల కోసం అన్వేషణ ఆగిపోవాలి.

మినిమం సౌకర్యాలతో - మేగ్జిమం ఆనందంతో బ్రతికే కళను మనం నేర్చుకోవాలి.

ప్రకృతితో,దైవంతో మమేకమైన జీవితాన్ని మనం గడపగలగాలి.అప్పుడే మంచి ఆయుస్సుతో,మంచి ఆరోగ్యంతో,మంచి మనస్సుతో మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం.మనం ఆనందంగా ఉండటమే గాక,మన చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉంచగలుగుతాం.మన పిల్లలని కూడా చక్కగా పెంచగలుగుతాం.వారికి కూడా మన వారసత్వాన్ని అందించగలుగుతాం.

అలా ఉండగలిగితే -- అంతకంటే జీవితంలో కావలసింది ఇంకేముంటుంది?

ఆనందం కోసమేగా మనిషి అన్వేషణ.

కాదంటారా?
read more " ఆరోగ్యవంతమైన జీవితానికి అసలైన సూత్రాలు "

22, జూన్ 2015, సోమవారం

International Day of Yoga-Photos









 
 








 



 




 






























 







 


 




 







 

 



 





 

read more " International Day of Yoga-Photos "