అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

28, మార్చి 2017, మంగళవారం

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !!

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

దేనికోసం నీ యుగాల అన్వేషణ?
దేనికోసం  ఈ ఎడతెగని పరిశ్రమ?

నువ్వు వెదికే హృదయం
ఈలోకంలో ఉందంటావా?
నువ్వాశించే ప్రణయం
నీకసలు లభిస్తుందంటావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

చీకటి నిండిన ఈ లోకంలో
ఆకలి దప్పుల పెనుమైకంలో
నువ్వు కోరే వెలుగు నీకు దొరికేనా?
నీ పయనం ఒక మలుపు తిరిగేనా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పంకంతో నిండిన సరస్సులో
పద్మం కోసం వెదుకుతున్నావా?
స్వార్ధంతో కుళ్ళిన లోకంలో
ప్రేమకోసం తపిస్తున్నావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పెనుచీకటిలో దారి తెలీకున్నా
ధృవనక్షత్రం పైనే దృష్టి నిలిపి
అరికాళ్లను ముళ్ళు కోసేస్తున్నా
చిరునవ్వును పెదవులపై నిలిపి

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

నిరాశకే ఆశను నేర్పిస్తూ
విధాతకే వణుకును పుట్టిస్తూ
నీ రాతనే నువ్వు మార్చి వ్రాసుకుంటూ
వడపోతగా జ్ఞాపకాలను పేర్చుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

ఉందో లేదో తెలియని
గమ్యాన్ని వెదుక్కుంటూ
ఎదురౌతుందో లేదో తెలియని
నేస్తాన్ని తలచుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

కృంగుబాట్లకు చెదరకుండా
వెన్నుపోట్లకు వెరవకుండా
అలుపునెరుగని బాటసారివై
మొక్కవోవని ప్రేమఝరివై

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!
read more " ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !! "

27, మార్చి 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర - ఇంటెన్సివ్ సాధన కోసం

అమెరికా వెళ్ళొచ్చి ఏడాది అవుతున్నది.అందుకని వచ్చే ఆదివారం రాత్రి మళ్ళీ అమెరికాకు ప్రయాణం అవుతున్నాము. ఈ సారి మూడునెలలు అక్కడ మకాం. మళ్ళీ జూలైలో ఇండియాకు తిరిగి వస్తాము.

'అమ్మో మూడునెలలా?ఒక్క పదిహేను రోజులకే మాకు ఏమీ తోచక బోరుకొట్టి చచ్చాం అక్కడ. మీకు టైం పాస్ ఎలా?' అడిగాడు ఒకాయన.

'టైం ఎందుకు పాస్ అవదు? నువ్వు ఊరకే కూచున్నా టైం పాస్ అవుతూనే ఉంటుంది.కూచునే విద్య నీకు తెలియాలి.' అన్నా నవ్వుతూ.

'అదికాదు.అక్కడ ఏమీ తోచదు. బయటకు వెళ్ళలేము. విసుగు పుడుతుంది.' అన్నాడు. 

'బయటకు ఎందుకు పోవాలి అసలు?' అడిగాను నవ్వుతూ.

వింతగా చూచాడు.

'నీకు పదిహేను రోజులకే బోరు కొట్టింది.నాకు మూణ్నెల్లు చాలదు. అదే మీకూ నాకూ తేడా' చెప్పాను నవ్వుతూ.

'అదేంటి? బాగా ఊళ్లు తిరుగుతారా? అప్పుడైతే బోరు ఉండదు. లాస్ వెగాస్ చూడండి బాగుంటుంది. ' అన్నాడాయన.

'లాసూ వద్దు ఏ గ్యాసూ వద్దు. ఏముందక్కడ సోది, భ్రష్టు పట్టడం తప్ప? ఎక్కడికీ తిరగను. కనీసం టీవీ కూడా చూడను.కానీ నాకేం బోరు కొట్టదు.' అన్నాను.

'ఎలా సాధ్యం?' అడిగాడు.

'నాతో వచ్చి ఉండు ఎలా సాధ్యమో తెలుస్తుంది. కాకుంటే నాతో జీవితం ఒక్కరోజుకే నీకు తట్టుకోలేని బోరు కొట్టేస్తుంది. పారిపోతావ్! ' అన్నాను నవ్వుతూ.

'ఏమి చేస్తారు మూడు నెలలు?' అన్నాడు.

'ఏమీ చెయ్యను. నాలో నేనుంటాను. ఇక బోరెక్కడుంటుంది?' అడిగాను.

'ఆ మాత్రం దానికి అమెరికా పోవడం ఎందుకు? ఇక్కడే మీ ఇంట్లోనే కూచోవచ్చుగా?' అడిగాడు చనువుగా.

'కూచోవచ్చు. కానీ ఇక్కడే ఉంటానంటే మూడునెలల పాటు నాకెవరూ లీవ్ ఇవ్వరు. అదే అమెరికాకైతే పెట్టుకోవచ్చు. ఇస్తారు కూడా. అందుకే లీవు పెట్టి అమెరికాకు పోతున్నా' అన్నాను.

'లాస్ట్ టైం బాగా ఊళ్లు తిరిగారా?' అడిగాడు.

'తిరగవలసినవి తిరిగాను. చూడవలసినవి చూచాను. అయినా నేను నీలా తిరుగుబోతును కాను.' అన్నా నవ్వుతూ.

'సరే. పనుంది వస్తా' అంటూ దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

చాలామంది ఇంతే. ఎక్కడెక్కడో తిరగాలని ఏవేవో చూడాలనీ అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ఎంత తిరిగినా ఎన్ని చూచినా ఏముంది? ఎక్కడా ఏమీ లేదు. ఉన్నదంతా మనలోనే ఉంది.ఈ సత్యం బాగా అర్ధమైతే, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఉండవు. పోయిన సారీ ఇదే చెప్పాను. ఇప్పుడూ ఇదే చెబుతున్నాను.

మనిషి చెయ్యవలసిన పని అంతా నిజానికి లోలోపల ఉన్నది. దానిని సక్రమంగా చేస్తే చాలు.అప్పుడు బోరూ ఉండదు.ఏమీ ఉండదు.

ఈసారి అమెరికాలో గడపబోయే మూణ్ణెల్లలో నాకు చాలా పనులున్నాయి.

శ్రీవిద్యా రహస్యం ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చెయ్యాలి. తారాస్తోత్రం ఈ-బుక్ రిలీజ్ చెయ్యాలి.లలితాసహస్రనామ భాష్యం తెలుగు+ఇంగ్లీషు పుస్తకాలు విడుదల చెయ్యాలి. ఇవి గాక 300 live charts Astro analysis పుస్తకం రెడీ చెయ్యాలి.ఇవి గాక ఇంకా కొన్ని పుస్తకాలు వ్రాయాలి.

పరాశక్తి ఆలయంలోనూ, కొన్ని స్పిరిట్యువల్ రిట్రీట్స్ లోనూ మళ్ళీ ఉపన్యాసాలు ఇవ్వాలి. పరాశక్తి ఆలయంలో అమ్మవారి సమక్షంలో కూచుని నా సాధనలు చేసుకోవాలి.

వీలు చిక్కితే గాంగెస్ ఆశ్రమం, చికాగో, టెక్సాస్, సెడోనాలను దర్శించాలి. అక్కడ శిష్యులతో స్పిరిట్యువల్ రిట్రీట్స్ చెయ్యాలి. గాంగెస్ లో మా ఆశ్రమం లాండ్ పనులు చూడాలి.

ఇవిగాక,నా రోజువారీ మంత్రధ్యాన సాధనా,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసమూ, యోగాభ్యాసమూ,పాటలూ,జ్యోతిష్యపరిశ్రమా, నాతో నివసించే శిష్యులతో సంభాషణలూ, హోమియోపతీ ,అక్కల్టూ మొదలైనవన్నీ యధావిధిగా సాగుతూనే ఉంటాయి.ఈసారి ట్రిప్ లో క్లాసులు పెట్టి ఇవన్నీ నా శిష్యులకు నేర్పించబోతున్నాను. నా శిష్యులను ఈ విద్యలలో నా అంతవారిని చెయ్యడం నా లక్ష్యాలలో ఒకటి.

పోయినసారి మొదటి లెవల్ దీక్ష తీసుకున్న నా అమెరికా శిష్యులకు ఈ సారి రెండవ లెవల్ దీక్ష ఇవ్వబోతున్నాను.

అన్నింటినీ మించి, నేను ఎప్పటినుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్న కొన్ని రహస్య తంత్రసాధనలను ఈసారి పూర్తి చెయ్యాలి. దానికి పూర్తి ఏకాంతవాసమూ కొన్ని ప్రత్యేక పరిస్థితులూ అవసరం అవుతాయి.ఈసారి మూడునెలలలో పైన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ నా తంత్రసాధనలను తీవ్రస్థాయిలో చెయ్యబోతున్నాను.ఇవన్నీ చెబితే ఎవడికి అర్ధమౌతుంది? అందుకనే ఇవన్నీ చెప్పకుండా, మూడునెలలు ఏమాత్రం చాలదని సింపుల్ గా మా కొలీగ్ కి చెప్పాను.

పైగా - మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఎక్కడుంటే అదే మన ప్రపంచం అవుతుంది.నాకలాంటి వాళ్ళు అమెరికాలో చాలామంది ఉన్నారు.

ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే, తపస్సు కోసం అమెరికాకు వెళుతున్నాను.నన్ను ప్రేమించే నా మనుషులకోసం అక్కడకు వెళుతున్నాను.బార్లూ క్యాసినోలూ చూడటం కోసం కాదు.అవి ఇక్కడా ఉన్నాయి. వాటి కోసమే అయితే అంత దూరం పోవలసిన పని లేనేలేదు.

పిచ్చిజనం, పిచ్చిప్రపంచం! ఎలా చెబితే వీళ్లకు అర్ధమౌతుందో?
read more " రెండవ అమెరికా యాత్ర - ఇంటెన్సివ్ సాధన కోసం "

20, మార్చి 2017, సోమవారం

Yogi Adityanath horoscope analysis



ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నియమితుడయ్యాడు. ఈయన జనన వివరాలు 5-6-1972; 11-50 am; Panchur; Pauri Garhwal (UP) 78E26; 29N57 గా లభ్యమౌతున్నాయి. ఈయన జాతకాన్ని విశ్లేషణ చేద్దాం.

ఈయన జాతకంలో కొన్ని విచిత్రమైన యోగాలున్నాయి. కుజ శుక్రులతో లాభస్థానంలో ఏర్పడిన ధర్మకర్మాధిపతి యోగం ఒక స్పష్టమైన రాజయోగం.అలాగే దశమంలో సూర్య బుధుల డిగ్రీ కంజంక్షన్, వీరితో శనీశ్వరుడు కలవడం కూడా రాజయోగమే. ఆరూ పన్నెండులలో ఉండటం రాహుకేతువులకు చాలా మంచి యోగకరమైన ప్లేస్ మెంట్ అని చెప్పాలి.

సప్తమంలో ద్వాదశాదిపతి  అయిన క్షీణ చంద్రుడు ఉండటం వివాహ నాశక యోగం.చంద్రుడు గురు నక్షత్రంలో ఉంటూ మతగురువు కావడం కోసం తన వివాహాన్ని ఈయన త్యాగం చేశాడని సూచిస్తున్నాడు. పంచమంలో గురువూ, చంద్రలగ్నాత్ పంచమంలో కుజశుక్రులూ ఉండటం మంచి ఆధ్యాత్మిక యోగాలు.కానీ గురువు వక్రత్వమూ, శుక్రుని వక్రత్వమూ, ఈ ఆధ్యాత్మికతకు లౌకికత కూడా తోడైందనీ, ఈయనది ప్రపంచాన్ని పట్టించుకోని ఆధ్యాత్మికత కాదనీ, లోకంతోనూ ప్రజలతోనూ బలమైన సంబంధాలు ఉండే ఆధ్యాత్మికత అనీ సూచిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో హిందువులకు ఎక్కడ ఏం కష్టం వచ్చిందని తెలిసినా అక్కడకు ఈయన తన అనుచరులతో వాలిపోతాడు.వారిని ఆదుకుంటాడు. తన గోరఖ్ నాద్ మఠంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ లక్షణాలే ఈయనకు విపరీతమైన ప్రజాభిమానాన్ని సంపాదించి పెట్టాయి.

నవాంశలో గురు చంద్రులు ఉచ్చస్థితిలో ఉండటం మంచి ఆధ్యాత్మికమైన యోగం. వీరిద్దరూ శనీశ్వరుని అర్గలం చేస్తున్నారు.కనుక ఈయన అంతరాంతరాలలో ప్రజాసమస్యలు తీర్చాలన్న తాపత్రయం బాగా ఉంటుంది. ఈయనలో ఆధ్యాత్మికతా ప్రజా సంబంధాలూ రెండూ కలగలసిన విచిత్రమైన యోగం ఉంటుంది. 

కారకాంశ వృషభం అవుతూ దశమంలో ఉన్న చంద్రుని నవాంశ ఉచ్చస్థితి వల్ల ప్రజాజీవితంతో పెనవేసుకుపోయి వారి అభిమానాన్ని సంపాదించిన నాయకుడిని సూచిస్తున్నది.

ఈయన గురు నక్షత్రంలో కుంభరాశిలో జన్మించాడు.కనుక ఒక గురువుగా ప్రజలకు మేలు చెయ్యాలన్న ఋణానుబంధంతో ఈయన ఈ జన్మలోకి వచ్చాడు. గణితంలో బీఎస్సీ పూర్తి చేసిన ఈయన తన 21 ఏట కుటుంబాన్ని వదిలిపెట్టి మహంత్ అవైద్యనాద్ శిష్యునిగా చేరాడు.ఆ సమయంలో 1992 ప్రాంతాలలో ఈయనకు శనిదశలో సూర్య అంతర్దశ జరిగింది. ఈయన జాతకంలో వీరిద్దరూ దశమకేంద్రంలో బలంగా ఉండటం చూడవచ్చు. అందుకే ఆ దశలో కన్నతండ్రిని వదిలి ఆధ్యాత్మిక తండ్రి అయిన గురువు దగ్గరకు చేరాడు. శనీశ్వరుడు సూర్యుని తనయుడే అన్న విషయమూ వీరిద్దరికీ ఎప్పుడూ ఎడబాటే నన్న విషయమూ జ్యోతిష్కులు గుర్తుంచుకోవాలి. అందుకే ఈ దశలో తండ్రి ఎడబాటు సంభవించింది.

1998 నుంచి ఈయన నాలుగు సార్లు వరుసగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ గా ఎన్నికౌతూ వస్తున్నాడు.అంటే శనిదశ చివరిభాగం, బుధదశ మొత్తం ఈయనకు బ్రహ్మాండంగా యోగిస్తూ వస్తున్నాయి. దానికి కారణం వీరిద్దరూ దశమంలో బలంగా ఉండటమే. చంద్రలగ్నాత్ ఈ యోగం చతుర్ధ కేంద్రంలో ఉండి దశమాన్ని బలంగా చూస్తున్నది. ఇప్పుడు బుధ మహర్దశలో చివరి ఘట్టం అయిన శని అంతర్దశ జరుగుతున్నది.అందులో మళ్ళీ సూర్య విదశ జరుగుతున్నది. బుధ, శని సూర్యులు దశమంలో ఉంటూ ఈయన్ను మన దేశంలోని అతి ముఖ్యమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసారు.

ఈ ముగ్గురిలో లగ్నాధిపతిగా సూర్యుడు ఈయన్ను సూచిస్తే, తెలివైన వ్యూహవేత్తగా బుధుడు అమిత్ షానూ, ఖచ్చితమైన క్రమశిక్షణతో పనిచేసే తత్త్వం ఉన్న శనీశ్వరుడు మోడీనీ సూచిస్తున్నారు. వెరసి బుధ శనులు ఇద్దరూ కలసి సూర్యుడిని గద్దె నెక్కించారని మనం భావించాలి. అదే నిజం కూడా.

ఈయన జాతకంలో 2018 నుంచీ రాబోయే కేతుమహార్దశ ఏడు సంవత్సరాలుంటుంది. ఈ ఏడు సంవత్సరాలు నల్లేరు మీద నడక ఏమీ కాదు.మత కలహాలు సృష్టించడం ద్వారా ఈయన్ను ఇబ్బంది పెట్టాలని చూచేవాళ్ళు ఉంటారు. కనుక ఒడిదుడుకులు తప్పవు. ఈ ఒడిదుడుకులన్నీ కేతువు నుంచి శత్రుస్థానంలో ఉన్న గురువు వల్ల, అంటే, మతపరమైన విషయాల వల్ల సంభవిస్తాయి. కానీ ద్వాదశంలో ఉన్న కేతువు వల్ల వాటిని తన రహస్య ప్లానింగ్ తో ఎదుర్కొని గెలుపును సాధిస్తాడు.

ఈయన ప్రమాణ స్వీకారం 19-3-2017 నాడు 14.15 కి లక్నోలో జరిగింది.ఈ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని గమనిద్దాం.

గోచారరీత్యా శనీశ్వరుడు జననకాల చంద్రునికి లాభస్థానంలోకి వచ్చి ఉన్నాడు. శని గోచారం గురించి గత పోస్టులో నేను వ్రాసిన ఫలితాలు ఈ జాతకంలో ఖఛ్చితంగా జరగడం గమనించండి. అలాగే సూర్య బుధులు కూడా జననకాల సూర్యబుధులకు లాభస్థానంలోకి వఛ్చి ఉండటం గమనించండి.అందుకే ఇతనికి ఈ లాభం దక్కింది.

లగ్నం మృదు స్వభావ రాశి అయిన కర్కాటకం అయింది. లగ్నాధిపతి చంద్రుని పంచమ నీచస్థితి కుజుని దశమ కేంద్రస్థితివల్ల భంగమై పోయింది.కనుక కొందరి భయాలను అపోహలను పటాపంచలు గావిస్తూ అందరికోసం సుపరిపాలన సాగుతుంది. 

అయితే అంతర్లీనంగా హిందూత్వ భావన తప్పకుండా ఉండే సూచనలున్నాయి.అది మంచిది కూడా. ఎందుకంటే నిజమైన హిందూత్వం ఎవరినీ ద్వేషించదు. అందరినీ కలుపుకుని పోవాలనే అది కోరుకుంటుంది.తొమ్మిదింట శుక్రుని ఉచ్చస్థితి ఆధ్యాత్మిక రంగానికి, పరిపాలనకూ మంచిది. అయితే బుధుని నీచస్థితివల్ల ముస్లిమ్స్ తో బాగున్నప్పటికీ హిందువులతోనే కొందరు మేధావులతో అభిప్రాయభేదాలు వచ్చే సూచనలున్నాయి. మొత్తం మీద దశమాదిపతి కుజుని దశమ స్థితివల్ల పరిపాలన బాగానే ఉంటుంది.చంద్ర బుధులతో సమస్యలు కన్పిస్తున్నాయి. ముస్లిమ్స్ తో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రామమందిరాన్ని నిర్మించే ప్రయత్నాలు జరుగుతాయి.

ఈ రాజయోగి పరిపాలన ఉత్తరప్రదేశ్ లోని అందరికీ మంచి చెయ్యాలనీ, క్షీణిస్తున్న ధర్మాన్ని తిరిగి నిలబెట్టాలనీ ఆశిద్దాం.
read more " Yogi Adityanath horoscope analysis "

17, మార్చి 2017, శుక్రవారం

విజయనగరంలో ఒక వారం



మొన్నీ మధ్యన విజయనగరంలో ఒక వారం రోజులు ఉన్నాను. అప్పుడు తీసిన ఫోటోలు ఇవి.


 

విజయనగరం మొత్తం గజపతి రాజాగారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాజాగారంటే ఆ ఊరి ప్రజలకు ఇప్పటికీ మంచి భయభక్తులు ఎక్కువ.ఊరుకూడా పాతకొత్తల మేలుకలయికలా ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సెంటర్లలో గంట స్థంభం సెంటర్ ఒకటి. అదే ఈ ఫోటో. గంట స్థంభం మీద ఆకాశంలో చంద్రుడిని చూడవచ్చు.

ఆటోల్లో ఊరంతా తిరిగేటప్పుడు ఆటోవాడితో మాటలు కలిపాను. రాజుగారంటే వీళ్లకు ఎంత భక్తో అప్పుడు తెలిసింది. 'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న నేలంతా మా రాజుగారిదే. దానిని మిగతా రాజులకు దానం చేసేశారు అని అతను అంటుంటే నాకు నవ్వాగలేదు. పోనీలే అతని నమ్మకాన్ని మనమెందుకు చెడగొట్టాలి? అని మాట్లాడకుండా విన్నాను'. 





విజయనగరం మహారాజా కళాశాల చాలా పాతది.ఇది 1879 లో స్థాపించబడింది. ఇక్కడి రాజుల ఔదార్యం గొప్పది.తమ కోటలు భవనాలు అన్నిటినీ విద్యాలయాలుగా ఎప్పుడో ఇచ్ఛేశారు. ఇప్పుడు వాటిలో స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి.వారు చేసిన పని చాలా దూరదృష్టితో చేశారని నా ఉద్దేశ్యం.లేకుంటే ఆ కోటలన్నీ పాడుబడిపోయి ఉండేవి. ఈ కాలేజీలో చాలామంది పెద్దవాళ్ళు చదివారు. హెరిటేజ్ లుక్ తో అప్పటినుంచీ అలాగే మేనేజ్ చెయ్యబడుతూ వస్తున్నది.మనకు హెరిటేజ్ కట్టడాలంటే బాగా ఇష్టం గనుక దానిదగ్గర ఒక ఫోటో తీసుకోవడం జరిగింది.





గురజాడ అప్పారావు గారి ఇల్లు మంచి సెంటర్లో కోట దగ్గరగానే ఉంటుంది. దీనిని ఇప్పుడు గ్రంధాలయంగా మార్చారు. దీని దగ్గరలోనే కన్యాశుల్కం కధ అంతా జరిగిన సానివీధి ఉందని రత్న చెప్పింది. ఆ వీధి పేరు అలాగే ఉంటె బాగుండదని ఈ మధ్యనే దానిని శివాలయం వీధిగా మార్చారట. రోడ్ వైడెనింగ్ లో కూడా ఈ ఇంటిని కూల్చకుండా అలాగే ఉంచడం మునిసిపాలిటీ వారి ఔదార్యాన్ని చాటుతున్నది.ఈ ఇల్లు పాతకాలంలో లాగే ఉండి చిన్నప్పటి పల్లెటూళ్ళ స్మృతులను గుర్తుకు తెచ్చింది.



మా అమ్మాయి స్కూటర్ మీద రాత్రిపూట  విజయనగరంలో విహారం. ఊరు పెద్దదేమీ కాదు. ఒక రెండు గంటల్లో ఊరంతా తిరిగేయ్యచ్చు.కాసేపట్లో ఊరంతా అర్ధమై పోయింది. మేమున్న ఏరియా పేరు పూల్ బాగ్. పాతకాలంలో ఇది రాజుగారి ప్రియురాళ్లు ఉండే పూలతోట ఏరియా అట. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మూడులాంతర్ల సెంటర్. మా వెనుకగా పైడితల్లి ఆలయాన్ని చూడవచ్చు..


మేమున్న ఇంటి దగ్గరలోనే కుమారస్వామి ఆలయం ఉన్నది. అందులో ఉన్న పెద్ద విగ్రహం రాత్రిపూట ఇలా దర్శనమిస్తుంది.దీనిని మలేషియా కుమారస్వామి విగ్రహం మోడల్లో కట్టారు. 



మేము అక్కడ ఉన్న వారంలో రెండ్రోజులు మధ్యాన్నం నుంచి మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసింది. అప్పుడు మేఘావృతమై ఉన్న ఆకాశం ఈ ఫోటోలో దర్శనమిస్తుంది. దూరంగా కనిపించేది రాజుగారి ఒకానొక కోట ఉన్న కొండ. రాజుగారి కుటుంబంలో ఎవరికో ఒకాయనకు కుష్టువ్యాధి వస్తే ఆయనకోసం దూరంగా కొండమీద ఒక కోట కట్టించి అందులో ఆయన్ను ఉంచారట. ఆ కొండే దూరంగా కనిపిస్తున్నది.దాని పక్కన రామతీర్ధం కొండా కనిపిస్తూ ఉంటుంది. 


రాత్రిపూట డాబామీద కూచుని పాలకోవా, బజ్జీలూ లాగిస్తూ వింటుంటే ఎక్కడో పెళ్లి ఆర్కెస్ట్రా పాటలు వినిపించాయి. మనవైపు అయితే అన్నీ లేటెస్ట్ సినిమా పాటలే వినిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం పాత సినిమాలలోని - 'కోటలోని మొనగాడా వేటకు వచ్చావా? ' , ' నెలవంక తొంగిచూచింది చలిగాలి మేను సోకింది' అనే పాటలు పాడుతున్నారు.వినసొంపుగా అనిపించింది.నేనూ వెళ్లి నాలుగు పాటలు పాడదామని అనుకున్నా గాని మనం అడుగు పెట్టి వాళ్ళ బిజినెస్ చెడగొట్టడం ఎందుకులే అని జాలేసి వదిలేశాను.




బయలుదేరే రోజున రైల్వే స్టేషన్లో సెండాఫ్.నాకోసం ఇంటినుంచి ఫ్లాస్క్ లో టీ తెచ్చింది రత్న.పాపం ఎంత శ్రద్ధగా తయారు చేసిందో? క్రిందటిరోజే మా అమ్మాయికి 'ఈరోజు నుంచీ టీ మానేస్తున్నాను' అని మాటిచ్చినప్పటికీ, రత్న ఎంత శ్రద్ధగా చేసుకుని తెచ్చిందో అన్న ఒక్క ఆలోచన వచ్చేసరికి ఆ ప్రామిస్ ని పక్కన పెట్టి చక్కగా 'టీ' లాగించేశాను. అదే నేను త్రాగిన ఆఖరు 'టీ'. గుర్రుగా చూచిన మా అమ్మాయికి ఇలా చెప్పాను. 'రూల్స్ ని పాటించడమే కాదు వాటిని ఎక్కడ రిలాక్స్ చెయ్యాలో కూడా మనకు తెలిసి ఉండాలి.నియమాలు పాటించడంలో మూర్ఖత్వం పనికిరాదు.మన నియమాల కోసం ఇతరులను బాధపెట్టకూడదు.'



దారిలో విశాఖపట్నం స్టేషన్లో వెంకటరాజుగారు కలిశారు. నేను జూలైలో అమెరికానుంచి తిరిగి వఛ్చిన తర్వాత విజయనగరంలో ఒక వారం ఉండి అక్కడ ఒక స్పిరిట్యువల్ రిట్రీట్ పెడదామని నిశ్చయించాం. అదే సమయంలో శ్రీకూర్మం, అరసవిల్లి, రామతీర్ధం, భీమిలీ మొదలైన ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకుని గుడ్ బై చెప్పుకున్నాం.


తిరుగు ప్రయాణంలో పై బెర్తెక్కి అది నిద్రా? ధ్యానమా? లేక పరధ్యానమా? అదిమాత్రం అడక్కండి.
read more " విజయనగరంలో ఒక వారం "

15, మార్చి 2017, బుధవారం

నాళీ వేష్టిత జననం - కొన్ని నివ్వెరపరచే వాస్తవాలు

Cord around the neck of fetus
జ్యోతిష్యశాస్త్రంలో నాళీవేష్టిత జననాన్ని ఒక చెడు శకునంగా భావిస్తారు. నాళీవేష్టిత జననం అంటే బొడ్డుత్రాడును తన మెడ చుట్టూ వేసుకుని శిశువు పుట్టడం. కొంతమంది శిశువులలో ఇది ఉరిత్రాడులా మెడకు బిగుసుకుని శిశువు నీలంగా మారడం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని మరీ చెడు శకునంగా భావిస్తారు.కొన్నిసార్లు బొడ్డుత్రాడును జంద్యంలాగా వేసుకుని మరీ శిశువు పుట్టడం జరుగుతుంది. ఇది కూడా దోషమేనని భావిస్తారు.

Cord as a thread around the body
సామాన్యంగా ఇలాంటి శిశువు పుట్టడం తండ్రికి మేనమామకు దోషంగా భావిస్తారు. దానికి దోష పరిహారాలు కూడా మన గ్రంధాలలో చెప్పబడ్డాయి. ఇవిగాక కొన్ని కొన్ని  కులాలలో కొన్ని రకాలైన వింత ఆచారాలు కూడా ఆచరణలో ఉన్నాయి. నవీనులు వీటిని మూఢనమ్మకాలుగా భావిస్తున్నప్పటికీ, వీటి వెనుక మనకు తెలియని ఎంతో విజ్ఞానం దాగి ఉన్నదన్నమాట చాలా నిజం.

ప్రపంచంలో ఏదీ కాకతాళీయం కాదు.ప్రకృతిలోని ప్రతి సంఘటనకూ, కనీసం ఒక పిట్ట అరిచినా సరే, దానికీ ఒక అర్ధం ఉంటుంది.ఈ అవగాహన నుంచీ పరిశీలన నుంచీ పుట్టినదే శకున శాస్త్రం. శకునాలు చాలామంది నమ్మరు కానీ అవి నిజాలే. వాటిని సరిగ్గా అర్ధం చేసుకుని తద్వారా మనం ప్రవర్తించడం నేర్చుకుంటే ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పుకోవచ్ఛు.

మనం మూఢ నమ్మకాలని భావించేవి నిజానికి ఎంతో పరిశీలన నుంచి పుట్టిన వాస్తవాలు.వాటిని అంత తేలికగా కొట్టి పారవెయ్యడానికి వీలులేదు.ప్రకృతిలో ఏదీ వేస్ట్ కాదు. మనకు అర్ధంకాని ప్రతిదానినీ మూఢనమ్మకం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇలాంటి జననం కలిగిన శిశువుల జాతకాలలో రాహుకేతువుల దోషాలు తప్పకుండా ఉంటాయి. సామాన్యంగా వారి వంశాలలో నాగదోషాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక సర్పం శిశువు మెడ చుట్టూ చుట్టుకుని బిగించి ఊపిరి ఆడకుండా చేసినట్లుగా ఇది ఉంటుంది. ఇదే నాగదోష ప్రభావానికి సూచన.

సూక్ష్మంగా గమనిస్తే ఇలాంటి శిశువులు పెరిగి పెద్దయే కొద్దీ వారికి వచ్ఛే రోగాలకూ, ఈ నాళీవేష్టిత జననానికి సంబంధాలు చక్కగా కనిపిస్తాయి. మోడరన్ మెడిసిన్ కూడా ఈ లింకులను ఇప్పుడు ఒప్పుకుంటున్నది.

శిశువు మెడచుట్టూ బొడ్డుత్రాడు గట్టిగా బిగుసుకున్నప్పుడు అమ్మ పొట్టలోని ఆ శిశువుకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికి శ్వాస క్రియ లేకున్నప్పటికీ ఆ శిశువుకు ఊపిరాడనట్లు ఫీలింగ్ ఉంటుంది. అదొక ట్రామా కండిషన్ వంటిది. గర్భంలో ఉన్నప్పుడు గాని, లేదా డెలివరీ టైం లో గాని ఇలాంటి ట్రామా కండిషన్ ఎదుర్కొన్న శిశువులు సామాన్యంగా పెరిగి పెద్దయ్యాక ఆస్త్మా పేషంట్స్ గా, బీపీ పేషంట్స్ గా, హార్ట్ పేషంట్స్ గా మారతారు.ఏదైనా విపత్కర పరిస్థితి వారి జీవితంలో ఎదురైనప్పుడు వారికి ఊపిరి అందదు. ఛాతీని చేత్తో పట్టుకుని కూచుండి పోతారు.లేదా ఎగశ్వాస పెడతారు. మెట్లెక్కేటప్పుడు కూడా ఇలాంటి వారికి ఆయాసం వస్తుంది.ఇది ఒకరకమైన హార్ట్ కండిషనే. దీనికంతా కారణం పుట్టుక సమయంలో వారికి కలిగిన ఊపిరాడని పరిస్థితే. ఆ జ్ఞాపకం వారి అంతచ్ఛేతనలో నిక్షిప్తమై పోయి ఇలాంటి పరిస్థితులను వారి భవిష్యత్ జీవితంలో కల్పిస్తుంది. ఏదైనా క్రైసిస్ వారి జీవితంలో వఛ్చినపుడు నేటల్ ట్రామా మెమరీ మళ్ళీ ట్రిగ్గర్ చెయ్యబడుతుంది. ఇదంతా "బొడ్డుత్రాటి ఉరి" ప్రభావమే.ఇదంతా నిజమేనని ఇప్పుడు మోడరన్ మెడిసిన్ కూడా ఒప్పుకుంటున్నది.ఇటువంటి రోగాలు రావడానికి కూడా జాతకంలోని నాగదోష ప్రభావమే కారణం.

మీకెవరికీ తెలియని ఒక రహస్యాన్ని ఇప్పుడు తేటతెల్లం చేస్తున్నాను. ఇది యోగదృష్టి ఉన్నవారికి మాత్రమే అర్ధమయ్యే నిజం.

పుట్టుక సమయంలో బొడ్డుత్రాడు మెడచుట్టూ చుట్టుకొని నీలంగా మారి పుట్టిన పిల్లలు, గత జన్మలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నవారై ఉంటారు. ఇది వారి జాతకంలో స్పష్టంగా దర్శనమిస్తుంది.జాతకచక్రాన్ని సరిగ్గా డీకోడ్ చెయ్యడం చేతనైతే ఈ విషయాన్ని ఆయా జాతకాలలో స్పష్టంగా చూడవచ్చు.చనిపోయేటప్పుడు ఉన్న పరిస్థితే మళ్ళీ తిరిగి పుట్టే సమయంలో కూడా ఉంటుందనేది మన భగవద్గీతతో సహా ఎన్నో మార్మిక విజ్ఞానగ్రంధాలు చెబుతున్న వాస్తవం. అందుకనే, చనిపోయే సమయంలో ఉరితో ఊపిరాడక చనిపోయినవారు ఈ జన్మలో ఈ విధంగా బొడ్డుత్రాడు మెడచుట్టూ బిగింపబడి ఊపిరాడని పరిస్థితిలో పుడతారు. 

జీవియొక్క జన్మ పరంపరలలో ఏ అనుభవమూ ఎక్కడా మిస్ అవదు.గతజన్మ అనుభవాలే ఈ జన్మలో మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఎక్కడా బ్రేక్ అనేది రాదు.ఇవన్నీ సూక్ష్మమైన మార్మిక కర్మరహస్యాలు.

మీరు దిమ్మెరపోయే ఇంకొక రహస్యాన్ని ఇప్పుడు మీకు చెబుతాను.


Surukuku Snake found in South America
ఇలా జన్మించి నీలంగా మారిన శిశువులకు హోమియోపతిలో ఒక అద్భుతమైన మందు ఉన్నది. దానిని అతి కొద్దీ మోతాదులో వాడితే వెంటనే ఆ నీలం రంగు పోయి శిశువుకు ఊపిరంది దానికి పునర్జన్మ వస్తుంది. దానిపేరు 'లేకసిస్'. అసలైన విచిత్రం ఏమంటే, ఈ మందును బ్రెజిల్ లోని అత్యంత ప్రమాదకరమైన 'సురుకుకు' అనే పాము విషం నుంచి తయారు చేస్తారు.

నాగదోషంతో పుట్టిన పిల్లల జీవన్మరణ సమస్యకు సర్పవిషంతో తయారైన ఔషధమే జీవితాన్ని ప్రసాదించడం విచిత్రంగా లేదూ? ఇదే జ్యోతిష్యశాస్త్రానికి హోమియోపతికీ ఉన్న రహస్యమైన లింక్. ఈ రెండు శాస్త్రాలలో ఇలాంటి కర్మ రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. మచ్ఛుకు ఒకటి మాత్రం మీకు పరిచయం చేశాను.

నాళీవేష్టిత జననం అనేది ఖఛ్చితంగా నాగదోషమే అందులో ఏమీ అనుమానం లేదు.తెలివిలేనివారు నమ్మకపోవచ్చుగాక. కానీ ఇది వాస్తవమే. ఇలాంటి పిల్లల జీవితాలు పరిశీలిస్తే,ముందు ముందు వారికి ఎదురయ్యే సమస్యలు గాని, వారికి వచ్ఛే రోగాలు గాని, దీనికి అనుగుణంగానే ఉంటాయి. ఇది నూటికి నూరు శాతం నిజం. సరిగ్గా గమనించడం చేతనైతే,  ఈ దోషాన్ని వీరి జీవితాలలో అనేక సందర్భాలలో మనం చూడవచ్చు. 

నాగదోషం అనేది నిజమే. ఇది మనిషిని ఎన్నో రకాలుగా వెంటాడుతుంది.నాస్తికులు హేతువాదులు నమ్మినా నమ్మకపోయినా ఇందులో నిజం ఉన్నది.మన దేశంలో మూలమూలలా ఉన్న నాగారాధన ఊరకే పనీపాటా లేనివాళ్ల సృష్టి కాదు. ఎన్నో వేల సంవత్సరాల పరిశీలనా పరిశోధనా దీనివెనుక ఉన్నాయన్నది వాస్తవం.

ఇలా వ్రాసినంత మాత్రం చేత నేను కుహనా జ్యోతిష్కుల మోసాలనూ, పల్లెల్లో నాగదోషం పేరు చెప్పి మోసగాళ్లు చేసే మోసాలనూ సమర్ధిస్తున్నానని అనుకోకండి. అలాంటి వేషాలను నేనస్సలు సమర్ధించను. అంతమాత్రం చేత నాగదోషం మూఢనమ్మకమంటే కూడా నేను ఒప్పుకోను. ఇది మూఢనమ్మకం కాదు.సూక్ష్మ పరిశీలనలో మాత్రమే అందే నిజం.

Disclaimer:-- ఈ పోస్ట్ చదివి, అప్పుడే పుట్టిన పిల్లలకు 'లేకసిస్' మందును పొరపాటున కూడా వెయ్యకండి. దీనిని అనుభవం ఉన్న వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఒకవేళ ఎవరైనా ఆ సాహసానికి ఒడిగడితే అప్పుడు జరిగే దుష్పరిణామాలకు నాకు బాధ్యత లేదని గమనించండి.

హోమియోపతి అనేది ఒక విశిష్ట వైద్య విధానం.ఇందులో ఈ రోగానికి ఈ మందు అని స్పెసిఫిక్స్ ఉండవు.రోగం ఒకటే అయినా మనిషిని బట్టి మందు మారిపోతుంది.కనుక ఈ కండిషన్ కు లేకసిస్ ఒక్కటే మందు అని భ్రమించకండి. 
read more " నాళీ వేష్టిత జననం - కొన్ని నివ్వెరపరచే వాస్తవాలు "

13, మార్చి 2017, సోమవారం

Bollywood actor Raj Kiran Horoscope - Analysis

Hip hip hurray సినిమాలో దీప్తి నావల్, రాజ్ కిరణ్
జగ్జీత్ సింగ్ అభిమానులకు రాజ్ కిరణ్ పేరు తప్పకుండా గుర్తుంటుంది. ఎందుకంటే జగ్జీత్ సింగ్ పాడిన సోలో సినిమా పాటల్లో మరపురాని మధురగీతం 'తుమ్ ఇత్ న జో ముస్కురా రహేహో క్యా గం హై జిస్ కో చుపా రహే హో' లో షబానా అజ్మీతో బాటు నటించినది రాజ్ కిరణే గనుక. ఈ పాట Ardh అనే సినిమాలోది. ఈ పాటను నేను గతంలో పాడి ఉన్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి.

అయితే, ప్రస్తుత విషయం అది కాదు. 1970-80 దశకంలో బాలీవుడ్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన రాజ్ కిరణ్ ప్రస్తుతం ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. 1998 ప్రాంతంలో అతను హటాత్తుగా మాయమై పోయాడు. ప్రస్తుతం గత 15 ఏళ్ళుగా అమెరికాలోని అట్లాంటాలో ఒక పిచ్చాసుపత్రిలో ఇన్ పేషంట్ గా ఉన్నాడని కొందరూ, లేదు న్యూయార్క్ లో క్యాబ్ డ్రైవర్ గా బ్రతుకు గడుపుతున్నాడని కొందరూ అంటున్నారు. మొత్తం మీద దాదాపు గత పది ఏళ్ళు పైగా అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.

బాధాకరమైన విషయం అదొక్కటే కాదు.

ఇతను దివంగత సత్య సాయిబాబాకు వీరభక్తుడు. కానీ ఎన్నో అద్భుతాలు చేశానని కట్టుకధలు చెప్పుకునే బాబా ఇతన్ని ఏమీ రక్షించలేకపోయాడు. రాజ్ కిరణ్ 150 పైన సినిమాలలో నటించాడు.బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగాడు.కానీ తన సంసార జీవితంలో ఎన్నో బాధలు పడ్డాడు. ఇతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల భార్యాపిల్లలు ఇతనికి క్రమేణా దూరమయ్యారు.బాబా తనను రక్షిస్తాడన్న పిచ్చి నమ్మకంతో ఇతను 1996 లో బెంగుళూరు వెళ్లి వైట్ ఫీల్డ్ ఆశ్రమంలో ఉన్న బాబాను కలిశాడు. కానీ బాబా ఇతన్ని పట్టించుకోకుండా తన అనుచరుల చేత ఆశ్రమం బయటకు నెట్టించాడు.అప్పటికే రాజ్ కిరణ్ కెరీర్ దెబ్బతిని ఉన్నది. బడాబడా వాళ్ళను మాత్రమే తన దగ్గరకు రానిచ్చే బాబాకు సినిమాలు లేని నటుడితో పనేముంటుంది? దాంతో ఇంకా మతి చలించిన రాజ్ కిరణ్ తను గుడ్డిగా నమ్మిన సాయిబాబాను ఎలాగైనా కలవాలన్న పిచ్చి ఉద్రేకంలో ఒక నిచ్చెన వేసుకుని ఆశ్రమం గోడను ఎక్కుతూ సెక్యూరిటీ వాళ్లకు దొరికిపోయాడు. సత్యసాయిబాబా మీద హత్యాయత్నం చేస్తున్నాడన్న అభియోగం ఇతని మీద మోపి ఇతన్ని 11-6-1996 న బెంగుళూరు సెంట్రల్ జైల్లో పెట్టారు.దీనివెనుక కూడా బాబా హస్తం ఉన్నదని తెలిసినవాళ్ళు అంటారు.

మతి స్థిమితం సరిగ్గా లేని స్థితిలో ఒక నెల రోజులు దయనీయమైన పరిస్థితిలో జైల్లో ఉన్న తర్వాత 11-7-1996 న ఇతని తండ్రి బాంబే నుంచి వచ్చి బెయిల్ ఇచ్చి కొడుకును జైలు నుంచి విడిపించుకుని తీసికెళ్ళాడు.

ఆ తర్వాత ఇతనికి కొన్ని నెలలపాటు బాంబేలో ట్రీట్మెంట్ ఇప్పించారు.అక్కడా ఇతని పిచ్చి కుదరక పోవడంతో ఇతని అన్న ఇతన్ని అమెరికా తీసుకుపోయి అక్కడ పిచ్చాసుపత్రిలో చేర్చాడని అంటారు.క్రమేణా పిచ్చి ఎక్కువై పోయి అట్లాంటాలో ఒక మెంటల్ ఎసైలం లో చేర్చబడ్డాడు. అప్పటినుంచీ అక్కడే దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నాడని కొందరి భావన.

ఇతను నమ్మిన సాయిబాబా ఇతన్ని ఏ విధంగానూ ఆదుకోలేదు సరిగదా అబద్దపు నేరం మోపి జైల్లో పెట్టించాడు.విచిత్రం ఏమంటే అదే సాయిబాబా తన చివరి రోజుల్లో తనూ దయనీయమైన పరిస్థితులలో చనిపోయాడు.పైగా తనే పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనే ఉంచుకుని మరీనూ !! ఆ వివరాలు అందరికీ తెలుసు.నేను మళ్ళీ చెప్పనక్కర లేదు.

తనను గుడ్డిగా నమ్మిన అమాయకభక్తులను గాలికి ఒదిలేసి మోసం చేసిన నేరానికి బాబాకు భగవంతుడు విధించిన శిక్షేమో అది? సరే బాబా సంగతి మనకెందుకు? ఆయన్ను అలా వదిలేసి మన కధలోకి వద్దాం.

దాదాపు పదిహేనేళ్ళ పాటు రాజ్ కిరణ్ ఏమై పోయాడో ఎవరికీ తెలియదు.చనిపోయాడని చాలామంది అనుకున్నారు. బాలీవుడ్ లో ఇతని అభిమానులు అందరూ గగ్గోలు పెట్టారు. స్టార్స్ లో ఇతని సహనటులూ మిత్రులైన దీప్తినావల్, రిషికపూర్ మొదలైన వాళ్ళు ఇతనెక్కడున్నాడా అని వాకబు చెయ్యడం మొదలెట్టారు.చివరకు అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఇతను ఉన్న విషయం నటుడు రిషికపూర్ అమెరికా వెళ్లి వాకబు చేస్తే తెలిసింది. కానీ కొందరు చెబుతున్న ప్రకారం అయితే ప్రస్తుతం న్యూయార్క్ లో క్యాబ్ డ్రైవర్ గా ఇతను పనిచేస్తున్నాడు. అయితే, ఇతని గురించి ఖచ్చితమైన ఏ వివరమూ చెప్పడానికి ఇతని ఫేమిలీ మెంబర్స్ అయిన భార్యా కూతురూ ఏమాత్రమూ ఇష్టపడటం లేదు. అతనెక్కడున్నాడో మాకూ తెలియదు మేమూ అతని కోసం వెదుకుతున్నాం అని మాత్రమే వారు చెబుతున్నారు. పైగా రిషి కపూర్ కూ, దీప్తి నావల్ కూ వాళ్ళు ఫోన్ చేసి - అనవసరంగా రాజ్ కిరణ్ కోసం వెదకొద్దు, అంతేకాదు మాకు అనవసరమైన పబ్లిసిటీ ఇవ్వొద్దు. ఇదంతా మాకిష్టం లేదని తేల్చి చెప్పారట.

మనకు లభిస్తున్న కొద్ది వివరాలతో ఇతని జాతకాన్ని పరిశీలిద్దాం.

ఇతను 5-2-1949 న ముంబై లో జన్మించాడు. ఆరోజు శనివారం. అశ్వని 3-4 పాదాలు, భరణీ నక్షత్రం-1 పాదం ఆరోజు నడిచాయి.సమయం తెలియదు గనుక లగ్నం తెలియదు.

ఇతని ముఖం తీరును బట్టి, బాడీ లాంగ్వేజిని బట్టి ఇతనిది అశ్వని నక్షత్రం అయ్యే వీలు లేదు. కనుక భరణి -1 పాదమే ఇతని నక్షత్రం అని నా భావన. ఎందుకంటే ఈ నక్షత్రపాద నవాంశాధిపతి అయిన సూర్యుడు వృత్తిని సూచించే దశమంలో శత్రు స్థానంలో ఉంటూ శనితో పరివర్తన చెంది ఉన్నాడు.పైగా, భరణీ నక్షత్రం వారు వృత్తిని మధ్యలో హటాత్తుగా వదిలేసి కనుమరుగు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది అశ్వని వారికి జరగదు. కనుక ఇతనిది భరణి - 1 పాదం అనుకుందాము. అలా అయినప్పుడు ఇతని జనన సమయం మధ్యాన్నం 3.30 నుంచి అర్ధరాత్రిలోపులో ఉండాలి.ఈ సమయంలో ఇతనికి మిథున, కర్కాటక,సింహ, కన్యా లగ్నాలు నడుస్తాయి. వీటిలో ఇతనిది కర్కాటక లగ్నం అవ్వాలి. ఎందుకంటే ఇతని ముఖం బొద్దుగా పూర్ణ చంద్రుడిలాగా మంచి కళగా ఉంటుంది. పైగా దశమంలోని రాహు చంద్రులవల్ల ఇతని వృత్తి అనేక ఒడిదుడుకులకు లోనౌతుంది.అంతేగాక చతుర్ధంలోని కేతువు వల్ల ఇతని మనస్సు డిప్రెషన్ లో పడిపోతుంది. అంటే మెంటల్ గా బేలెన్స్ తప్పుతుంది. ఇన్ని విధాలుగా ఇతని లక్షణాలు సరిపోతున్నందున ఇతని లగ్నం కర్కాటకం అని నేను నిశ్చయిస్తున్నాను.అప్పుడు ఇతని జన్మ సమయం 16.50 - 18.50 మధ్యలో ఉండాలి.

ఇప్పుడు లగ్న డిగ్రీలు రెక్టిఫై చేద్దాం.

కర్కాటక రాశిలో ఉన్న తొమ్మిది నవాంశలలో ఇతనిది సింహ నవాంశ అని నా అభిప్రాయం.అలాంటప్పుడు ఇతని జనన సమయం.సాయంత్రం 5.00 నుంచి 5.16 లోపు అని తెలుస్తున్నది. నవాంశను ఎలా నిర్ణయించాననే విషయం ఇక్కడ చెప్పను. అన్ని రహస్యాలూ బ్లాగులోనే చెప్పేస్తే ఎలా? వాటిని నా క్లోజ్ శిష్యులకు మాత్రమే నేర్పిస్తాను. ఇంకా లోతుగా వెళ్లి ఖచ్చితమైన జనన సమయాన్ని కూడా రాబట్టవచ్చు.కానీ ప్రస్తుతం మన పని అది కాదు గనుక ఇంతటితో జననకాల సంస్కరణ ఆపుదాం.

నక్షత్ర లక్షణాలు క్షుణ్ణంగా తెలిస్తే భారతీయ జ్యోతిష్య శాస్త్రం చాలావరకు ఒంట బట్టినట్లే లెక్క. చాలామంది బేసిక్స్ ని ఒదిలేసి సరాసరి భావ ఫలిత విచారణ లోకి వెళుతూ ఉంటారు.అక్కడే వారు పప్పులో కాలేస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకునే విధానం అది కాదు. నిజం చెప్పాలంటే ఏ శాస్త్రమైనా సరే బేసిక్స్ లో మనం గట్టిగా ఉన్నప్పుడే బాగా ఒంటబడుతుంది.

పైగా - జ్యోతిష్య శాస్త్రంలో లోతుపాతులు అర్ధం కావాలంటే ఈ క్రింది విషయాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అది అర్ధమౌతుంది.

1. మహామంత్ర ఉపాసన
2. దీనివల్ల వచ్చే ఇంట్యూటివ్ ఎబిలిటీ
3. జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం

ఈ మూడూ కలసినప్పుడే ఫలితాలు ఒక ఫ్లాష్ లాగా స్ఫురిస్తాయి గాని, ఊరకే గ్రహాలు రాశులు దశలు అని లెక్కలు వేసుకుంటూ కూచుంటే ఈ శాస్త్రపు లోతులు అంతుబట్టవు. 

ఇతని కెరీర్ 1970 - 1980 మధ్యలో బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఇతనికి చంద్ర మహర్దశ జరిగింది.దశమంలో ఉన్న చంద్రమంగళ యోగం వల్ల ఇతను పట్టుకున్నది ఆ టైములో బంగారం అయింది. కానీ 1984 లో కుజ మహర్ధశ మొదలు కావడం తోనే ఇతనికి చెడుకాలం మొదలైంది. దీనికి కారణం కుజుడు అష్టమంలో శత్రుస్థానంలో పడిపోవడమే.1991 లో మొదలైన రాహుదశ ఇతన్ని నానా బాధలు పెట్టింది. అదే సమయంలో ఫిబ్రవరి 16, 1996 న ఇతనికి ఏలినాటి శని మొదలైంది. ఆరోజునుంచీ ఇతని జీవితంలో నిజమైన కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో శపితదశ ఇతని జాతకంలో వచ్చింది. ఇక అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు కదా?

రాహువులో శనితో జరుగుతున్న శపితదశా సమయంలోనే అంటే 1996-1999 మధ్యలోనే ఇతను సత్యసాయిబాబా ఆశ్రమం గోడ ఎక్కబోతూ దొరికిపోయి బెంగుళూర్ సెంట్రల్ జైల్లో నెలరోజులు ఉండి ఆ తర్వాత ఏమై పోయాడో ఎవరికీ తెలియదు. ఇప్పటివరకూ ఇతని అడ్రస్ కూడా ఎవరికీ తెలియకుండా మాయమై పోయాడు.

డబ్బు చేతిలో ఉండి సుఖంగా కాలం గడుస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దశ మారిందంటే ఏం జరుగుతుందో ఒక్క నిజమైన దైవజ్ఞులు తప్ప ఎవ్వరూ చెప్పలేరు.జాతకం సరిగ్గా లేకపోతే జీవితం మొత్తం తల్లక్రిందులు కావడానికి ఒక్క రోజు చాలు.

అందుకే, ఈరోజు మన చేతిలో డబ్బు ఉందని విర్రవీగటం ఎప్పుడూ కరెక్ట్ కాదు.ఎందుకంటే రేపు ఏమౌతుందో ఎవరికీ తెలియదు.విధి వక్రిస్తే, మన విర్రవీగుడు మొత్తం మాయం కావడానికి ఒక్క క్షణం చాలు.

పెద్ద వయసులో ఏ విధమైన కష్టమూ లేకుండా మనల్ని చక్కగా చూచుకునేవారు ఉండటమే అసలైన అదృష్టం.వయసులో ఉన్నపుడూ చేతిలో డబ్బు ఉన్నపుడూ అందరూ వెంటబడతారు ప్రేమలు కురిపిస్తారు. అది నిజం కాదు పెద్ద భ్రమ.వయసు మళ్ళి, చేతిలో డబ్బు లేనప్పుడే మేమున్నామని మనల్ని చూచుకునేవారు ఉండాలి. అదే అసలైన వరం.

వయసులో ఉన్నపుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు పెద్దవయసులో పడ్డప్పుడు ఎవరూ తోడులేని దిక్కులేని జీవితం గడపడం కంటే దుర్భరం ఇంకోటి ఉండదు మరి.

ప్రస్తుతం ఇతని పరిస్థితి ఏమిటో జ్యోతిష్య పరంగా చూద్దాం.

మే 26, 2005 నుంచీ జూలై 16,2007 వరకూ ఇతనికి అర్ధాష్టమ శని నడిచింది. అదే సమయంలో ఇతనికి రాహు మహర్దశలో శుక్ర, సూర్య,చంద్ర అంతర్దశలు నడిచాయి. సూర్య శుక్రులు సప్తమంలో ఉండి దూరదేశంలో పడే బాధలను సూచిస్తున్నారు. చంద్రుడు సరాసరి రాహువుతో కలసి పిశాచగ్రస్తయోగంలో ఉంటూ మతిభ్రమణాన్ని సూచిస్తున్నాడు.కనుక ఆ సమయంలో ఇతను నానా బాధలు పడి ఉండాలి.

తరువాత, 2014-2016 మధ్యలో ఇతనికి అష్టమశని నడిచింది. ఆ సమయంలో గురువులో బుధ అంతర్దశ నడిచింది. కర్కాటక లగ్నానికి గురువు యోగకారకుడే అయినప్పటికీ, ఇతనికి రోగ స్థానంలో ఉన్నాడు కనుక రోగబాధను ఇచ్చాడు.ఈయనకు కోణంలో ఉన్న రాహుచంద్రుల వల్ల మతిస్థిమితం లేకుండా పోయింది.బుధుడు వక్రించి అస్తంగతుడై సప్తమంలో ఉంటూ దూరదేశాన్ని, మతిస్థిమితం లేకపోవడాన్ని సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో ఇతని మానసిక రోగం బాగా ఎక్కువగా ఉండి ఉండాలి.2016-2017 మధ్యలో ఇతనికి గురువులో కేతు అంతర్దశ నడిచింది. నవాంశలో వీరిద్దరూ మనస్సుకు సూచిక అయిన నాలుగో ఇంట్లో ఉన్నారు.రాశిలో కేతువు నాలుగులో ఉన్నాడు.కనుక ఆ సమయంలో కూడా ఇతని పరిస్థితి బాగాలేదని చెప్పాలి.ప్రస్తుతం ఇతనికి గురువులో శుక్ర దశ నడుస్తున్నది.శుక్రుడు బాధకుడు గనుక ఇప్పుడు కూడా ఇతనికి కాలం సరిగా ఉండదు.

2025 వరకూ ఇతనికి గురుదశే జరుగుతుంది. ఆ తర్వాత అష్టమాధిపతి అయిన వక్రశని దశ వస్తుంది. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. కనుక ఇతనికి రోగం నయం కాదని చెప్పవచ్చు.

స్టార్ గా ఒక వెలుగు వెలిగి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అదృష్టవంతులకు ఇలాంటి దుస్థితి పట్టడం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని గతి పట్టడం,దేశంకాని దేశంలో మెంటల్ హాస్పిటల్లో దిక్కులేని పేషంట్ గా ఉండవలసిన పరిస్థితి రావడం, ఖర్మ కాకపోతే ఇంకేమిటి మరి?
read more " Bollywood actor Raj Kiran Horoscope - Analysis "