“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, డిసెంబర్ 2011, ఆదివారం

మార్గశిర పౌర్ణమి - మేదినీజ్యోతిష్యం

మార్గశిరపౌర్ణమికి కొన్ని ముఖ్యమైన గ్రహస్తితులు వచ్చాయి. వాటివల్ల చంద్రుని ప్రభావం నూటికి నూరుపాళ్ళు భూమ్మీద ఉంటుందనీ, అనేక సంఘటనలకు  ఇది కారణం అవుతుందనీ ఈ పౌర్ణమికి మళ్ళీ రుజువైంది. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు నేను వ్రాస్తూ రుజువుచేస్తూ వచ్చాను. కనుక  దీన్నొక తిరుగులేని యాస్ట్రో ఎనలిటికల్ ఫేక్టర్ గా పరిగణించవచ్చు అనేది రూడిగా తేలింది. 

ఈ నేపధ్యంలో కొద్దిగా వెనక్కు వెళ్లి వరుస సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మెక్సికోలో 6 .7  స్థాయిలో భూకంపం, రష్యాలో ఎలక్షన్ కుంభకోణం వల్ల లక్షలాది ప్రజల నిరసన, కలకత్తాలో AMRI ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, తమిళనాడు - కేరళ రాష్ట్రాలమధ్య డ్యాం చిచ్చు, నటుడు దేవానంద్ మరణం, ఆంధ్రలో అవిశ్వాసతీర్మానం రూపంలో ప్రభుత్వ ఉనికికి తాత్కాలికప్రమాదం, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద దాడి, ఇలా చాలా చాలా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ జరిగే చిన్నచిన్న విషయాలు నేను వ్రాయడంలేదు. ఎప్పుడో ఒకసారి జరిగే ముఖ్యమైన పెద్దవిషయాలు మాత్రమె పరిగణనలోకి తీసుకున్నాను.

ఈసారి పౌర్ణమికి తోడుగా సంపూర్ణ చంద్రగ్రహణం కూడా వచ్చి పడింది. కనుక రకరకాలైన ఘటనలు జరిగాయి. మామూలుగానే మార్గశిర పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పుకోబోయే ముందుగా, 26 -12 -2004 న దక్షిణభారతాన్ని కుదిపేసిన సునామీ సరిగ్గా ఇదే మార్గశిర పౌర్ణమి రోజున వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఆ రోజున గ్రహస్తితులను తెలిపే కుండలి ఇక్కడ ఇస్తున్నాను. ఆరోజున వచ్చిన సునామీ ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ దేశాలను అతలాకుతలం చేసింది. దీని ప్రభావం వల్ల హిందూమహాసముద్ర తీరంలోని పద్నాలుగుదేశాలలో దాదాపు రెండులక్షల ఏభైవేలమంది పైగా ఒకే దెబ్బతో మరణించారు. ఇది మన దేశంలో ఉదయం 9.30 నుంచి 10.00 మధ్యలో జరిగింది. 

ఈ సారి వచ్చిన మార్గశిర పౌర్ణమికి ఉన్న ప్రత్యేకతలలో రాహుకేతువుల నీచస్తితి ఒకటి. ఇలాంటి స్తితి పద్దెనిమిది ఏళ్లకొకసారి వస్తుంది. అలాంటి నీచస్తితిలో ఉన్న కేతువుతో కూడిన చంద్ర గ్రహణం కూడా ఈసారి వచ్చింది. అందుకే ఇన్ని సంఘటనలు జరిగాయి.

పోయినసారి ఇలాంటి గ్రహస్తితి పద్దెనిమిది ఏళ్లక్రితం 10-12-1992  న వచ్చింది. దాని ప్రభావంగా అప్పుడు ఏమేం జరిగాయో ఒక్కసారి చూద్దాం.

>> 6-12-1992 న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. దానివల్ల ఇన్నేళ్ళలో ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు.

>>యెమెన్ లో గోల్డ్ మొహర్ హోటల్లో బసచేసి ఉన్న అమెరికన్ సైనికులమీద మొట్టమొదటి ఆల్ ఖైదా ఎటాక్ 29-12-1992 న జరిగింది. 

>> ప్రిన్స్ చార్లెస్ డయానాల పెళ్లి పెటాకులైందనీ వాళ్ళు  విడిపోతున్నారనే ప్రకటన కూడా డిసెంబర్   లోనే  వెలువడింది. కొందరి దృష్టిలో ఇదంత ముఖ్య సంఘటన కాకపోవచ్చు. కాని వారు ప్రముఖవ్యక్తులు గనుక వ్రాస్తున్నాను.

>>అంతకు ముందు 1992  మే లో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో కల్తీ సారా తాగి 200 మంది మరణించారు. దాదాపు ఇంకో 600 మంది ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఈ సంఘటన రాహుకేతువులు నీచస్తితిలో ఉన్నపుడే జరిగింది. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత రాహుకేతువులు అదే నీచ స్తితిలో ఉన్నపుడు మళ్ళీ 13-12-2011  న పశ్చిమ బెంగాల్లో అదే కల్తీమద్యం తాగి దాదాపు 150 మంది చనిపోయారు. 

ఎప్పుడూ ఏదో ఒకటి జరిగి మనుషులు పిట్టల్లా చావడం, మర్నాటికి దానిని అందరూ మర్చిపోవడం, మనదేశంలో సర్వసాధారణం. ఇక్కడ కల్తీసారానే నిందించడం ఎందుకు? మన దేశంలో చాలాప్రాంతాలలో ఉత్తనీళ్ళు  తాగితే చాలు పరలోకప్రయాణం సుఖంగా జరుగుతుంది. ఇక సారా సంగతి చెప్పే పనేముంది? అసలు సారాకీ  గ్రహాలకూ ఏమిటి లింకు? అని కొందరికి సందేహం రావచ్చు. ఒక్క మంచినీళ్లకూ  సారాయికే కాదు, లోకంలో చీమ చిటుక్కుమనడానికి కూడా కారణాలుంటాయి. ఆ కారణాలను గ్రహాలు వాటి భాషలో చెబుతూనే ఉంటాయి. అయితే ఆయా కారణాలను మనం అర్ధం చేసుకోవడంలోనే మన తెలివి పనిచెయ్యాలి. నాదొక్కటే ప్రశ్న. ఒకే రకమైన సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీమళ్ళీ అవే రకమైన గ్రహస్తితులు ఎందుకుంటున్నాయి? వీటి వెనక ఉన్న సంబంధం ఏమిటి?  అన్న నా ప్రశ్నకు వారూ జవాబు చెప్పాలి మరి. ఇది కాకతాళీయం అంటే నేనొప్పుకోను.

>> పోయినసారి రాహుకేతువులు నీచలో ఉన్నప్పుడు 1992 లో సినీరంగానికి చెందిన ప్రముఖులు సత్యజిత్ రే, అమ్జాద్ ఖాన్, ప్రేమ్ నాథ్ మరణించారు. మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు 2011 లో దేవానంద్, మల్లెమాల చనిపోయారు. 2012 ఏడాది మొత్తం రాహుకేతువులు ఇదే నీచపరిస్తితిలో ఉంటారు. జనవరి 2013 లో మాత్రమే వారి స్థానాలు మారుతాయి. కనుక 2012 లో మరికొందరు సినీపెద్దల మరియు దేశప్రముఖుల అస్తమయం జరుగనుంది అని ఖచ్చితంగా ఊహించవచ్చు.

గ్రహప్రభావం మనుషులమీదా భూమ్మీదా ఉంది అన్నమాట నిర్వివాదాంశం. అది ఏ విధంగా ఉంటుందో  అర్ధంచేసుకుని విజ్ఞతగా ప్రవర్తించడంలోనే మానవుల తెలివి దాగుంటుంది.
read more " మార్గశిర పౌర్ణమి - మేదినీజ్యోతిష్యం "

9, డిసెంబర్ 2011, శుక్రవారం

శ్రీరామరాజ్యం

ఈ సినిమామీద మీఅభిప్రాయం ఏమిటో వ్రాయకూడదా అని ఒకమిత్రుడు అడిగాడు. ఎందుకులే బాబు, నా అభిప్రాయాలు చాలామందికి నచ్చవు. ఏదన్నా అంటే అదుగో ప్రతిదానికీ విమర్శిస్తావు అంటారు. అని తప్పుకుందామని చూశాను. నచ్చటం నచ్చకపోవటం వేరేసంగతి ముందు మీరేమనుకుంటున్నారో మాకు తెలియాలి. చెప్పండి అని బలవంతం చేసాడు. సరే వ్రాస్తాలే అని చెప్పాను.

మొన్నెప్పుడో వినుకొండలో దోమలచేత కుట్టించుకుంటూ ఒక మామూలుహాల్లో ఈసినిమా చూశాను. కొందరు అంటున్నంత మహాగొప్పగానూ లేదు, అలాగని చెత్తగాకూడా ఏమీలేదు అనిపించింది. బాగులేని హాలూ, దోమలబాధ వల్ల కలుగుతున్న అసహనమూ నా అభిప్రాయాన్ని ఏమాత్రమూ ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్తపడుతూ మరీ ఈ సినిమా చూశాను.

బాపు స్వతహాగా చిత్రకారుడు గనుక ప్రతి ఫ్రేమూ చక్కగా చిక్కగా ఒక పెయింటింగ్ లాగా ఉండేలా జాగ్రత్తపడుతూ సినిమాని తీశాడు. కాని ఒక కళాఖండాన్ని తీసేటప్పుడు అదొక్కటే సరిపోదు. అందులోనూ ఉత్తరరామచరితం వంటి మహత్తరమైన కథని తీసేటప్పుడు చాలాజాగ్రత్తగా తియ్యాలి. ఒక్క ఆర్టిస్టిక్ అవుట్ లుక్ ఒక్కటే చాలదు.

ముందుగా కేరక్టర్ ఫిట్నెస్ ఉన్న నటులను ఎంచుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బహుశా ఆయనకు ఈ విషయంలో స్వతంత్రం లేదేమో అనిపించింది.  సీతారాములను మన దేశంలో వాడవాడలా పూజిస్తారు. అలాటి పురాణపాత్రల కథను తీసేటప్పుడు ఎంతో రీసెర్చిచేసి ఎన్నోకోణాల్లో ఆలోచించి మరీ సినిమా తియ్యాలి.అందులోని సంగీతమూ, సాహిత్యమూ, తరతరాలకూ చిరస్థాయిగా నిలిచిపోయేలా జాగ్రత్త వహించాలి.  సరైన ట్యూన్లకోసం, సరైన సాహిత్యం కోసం ఒక తపస్సులాగా నెలల తరబడి సిట్టింగ్స్ చెయ్యాలి. నటీనటుల ఉచ్చారణా, ఆహార్యమూ స్పష్టంగా ఆహ్లాదంగా ఉండేలా చూచుకోవాలి. డైలాగ్స్ మంచి భాషలో ఉండేటట్లు చూచుకోవాలి. ఇవేవీ ఈ సినిమాలో లేవు.  ఇలా చెప్పుకుంటే బోలెడన్ని లోపాలు ఈ సినిమాలో ఉన్నాయి.

>> పౌరాణిక చిత్రానికి ఒక ప్రత్యేకమైన భాష వాడాలి. జానపద భాషలోనో, సాంఘిక భాషలోనో డైలాగులు వ్రాస్తే పౌరాణికానికి అతకదు. పోనీ కధలోని గ్రామీణప్రజల చేత గ్రామ్యభాష మాట్లాడించినా నాగరిక పాత్రలచేతకూడా గ్రామ్యమాండలిక పదాలను పలికిస్తే పాయసంలో రాళ్ళలాగా బాధ కలిగిస్తాయి. గ్రాంధికభాష వాడితే సామాన్యజనానికి అర్ధం కాదు అందుకే అలా  మామూలుభాష వాడారులే అని సర్ది చెప్పుకోవచ్చు. ఇక  ఆ విధంగా దిగజారుతూ పొతే ఆ దిగజారుడుతనానికి అంతూపొంతూ ఉండదు. కనుక ఎక్కడో ఒకచోట ఒక స్థాయిలో సర్దుబాటు చేసుకుని గ్రాంధికానికీ గ్రామ్యానికీ మధ్యేమార్గం పాటించాలి. అలా చెయ్యలేకపోవడం ఈ సినిమాలోని ఒక పెద్ద లోపం.

>> ఇకపోతే ఒక భాషాశైలిని  ఎంచుకున్న తర్వాత, అదే భాషను అన్ని ఫ్రేముల్లోనూ అన్ని సీన్లలోనూ ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడాలి. దీన్నే 'డిక్షన్ కంటిన్యూటీ' అంటారు.అందుకు విరుద్ధంగా ఈ సినిమాలోని  కొన్ని ఫ్రేముల్లో గ్రాంధికమూ, కొన్ని ఫ్రేముల్లో సాంఘికమూ, ఇంకొన్ని ఫ్రేముల్లో అదేదో అర్ధంకాని కలగలుపు భాషా,  వినిపిస్తుంది. ఇవీ పాయసంలోని రాళ్ళేనని  చెప్పుకోవచ్చు. ఉదాహరణకు సీతాదేవిని లక్ష్మణుడు అడివిలో వదిలి వెళ్ళిపోయాక భూదేవి ప్రత్యక్షమౌతుంది. అప్పుడు శ్రీరాముని శపించబోతున్న భూదేవిని అడ్డుకుని సీతాదేవి " అసలు నువ్వెందుకోచ్చావ్ ? వెళ్ళిపో ఇక్కణ్ణించి " అనే సాంఘికనాటకరీతిలో మాట్లాడటం చాలా చికాకుగా అనిపిస్తుంది. ఇదే డైలాగులు ఇంకాబాగా వ్రాసి ఉండవచ్చు. ఇలాటి పరిస్తితి సినిమా మొత్తంమీద చాలాసార్లు ఎదురౌతుంది. భాషాశైలిలో ఒక స్తిరమైన నడక లేకపోవడం  పెద్ద లోపం.

>> ఇకపోతే అక్కినేని నటన చాలా నిరాశపరిచింది. ఆయన ముఖంలో వాల్మీకిమహర్షి ముఖంలో ఉండవలసిన మార్దవం ఎక్కడా కనిపించలేదు. ఏదో కరుకుదనం గోచరిస్తూ ఉంది. వాల్మీకి ఒక మహర్షి మాత్రమేకాదు, క్రౌంచపక్షుల వ్యధనుచూచి చలించిన దయార్ద్రహృదయుడు. తన బాధాపూరితభావాన్ని ఆశువుగా శ్లోకరూపంలో చెప్పిన మహాకవి. వాల్మీకియొక్క మహర్షిత్వాన్నీ, ఒక కవియొక్క ముఖంలో ప్రతిఫలించే సున్నితమైన సుకుమారమైన దార్శనికతనూ అక్కినేని పండించలేకపోయాడు. బహుశా ముసలితనం వల్ల ఆయన ముఖంలో భావవ్యక్తీకరణా సామర్ధ్యం తగ్గిపోయిందేమోలే  అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

>> బాలకృష్ణకూ శ్రీకాంత్ కూ ఒత్తులు స్పష్టంగా పలకవు. అయినా సరే డైలాగ్స్ చెప్పడానికి వాళ్ళు శ్రమించిన తీరు పరవాలేదనిపించింది. ఇలా ఎక్కడికక్కడ సర్దుకుంటూ సినిమా చూడటమే కాని శభాష్ అనిపించేలా ఒక్క సీనూ లేదు.

>> పాత్రలకు మేకప్ చేసిన తీరు చూస్తే,  పౌరాణికానికి సరిగ్గా మేకప్ చేసే ఆర్టిస్టులు ఇప్పుడు లేరేమో అన్న సందేహం కలిగింది. ముఖ్యంగా వాల్మీకి ని దగ్గరగా చూపించిన సీన్లలో అవి పెట్టుడుగడ్డమూ, పెట్టుడుమీసమూ, విగ్గూ అని స్పష్టంగా తెలిసేటట్లు మేకప్ చేశారు. ఆంజనేయుడి మూతిని కూడా మరీ కదలటానికి సాధ్యంకాకుండా బిగించి మరీ అతికించారు. ఆయన డైలాగులు చెప్పేటప్పుడు నోరు తెరవలేక పడుతున్న అవస్త స్పష్టంగా కనిపించింది. ఇలాటివి  చికాకు కలిగించాయి.

>> ఇకపోతే ఆంజనేయుడు ఒక పిల్లవాని రూపంలో వాల్మీకి ఆశ్రమంలో కోతిచేష్టలు చేస్తూ సీతమ్మ వారిని అలరిస్తూ ఉన్నట్లు చూపించడం, వినోదంకోసం సినిమాలో  చేసిన మార్పు అని సర్దుకున్నప్పటికీ, మూలకథలో లేదుకనుక అసహజంగా ఉంది. ఇలా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు మార్చడంవల్లే మన పురాణకధలు గందరగోళంగా తయారయ్యాయి. పురాణపాత్రల్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చి రావణుణ్నీ  కర్ణుణ్నీ   దుర్యోధనున్నీ హీరోలుగా చూపించే ఇటువంటి ట్రెండ్ ఎన్టీఆర్ తో మొదలైంది.

>> లవకుశలో ఘంటసాల ఇచ్చిన సంగీతానికీ ఈ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన సంగీతానికీ పోలికే లేదు. ఘంటసాల సంగీతమూ అప్పటి సాహిత్యమూ తపోఫలాలుగా అనుకుంటే, ఈ సినిమా సంగీతం ఇమిటేషన్ పండ్లలాగా ఉంది.  ఎంతగా పోలిక కూడదనుకున్నప్పటికీ, ఘంటసాల కూర్చిన పాతపాటలు గుర్తురాక మానవు. ఘంటసాల బాణీలముందు ఇళయరాజా బాణీలు పేలవంగా తేలిపోయాయనే చెప్పాలి. అయితే వినగా వినగా ఇళయరాజా పాటలు కూడా బాగున్నట్లుగానే అనిపించినప్పటికీ, ఘంటసాల పాటలతో పోల్చుకుంటే చాలా నాసిరకంగా ఉన్నాయి.

>>పాటలలో వాడిన సాహిత్యం అన్నింటిలోకీ పరమచెత్త అని చెప్పవచ్చు. పాటలు ఎవరు వ్రాశారో నేను గమనించలేదు గాని, సాహిత్యం ఖూనీ అయింది అనిమాత్రం చెప్పగలను. అది గ్రాన్దికమో, గ్రామ్యమో, ఇంకేదో తెలీనంతగా ఇష్టంవచ్చిన పదాలు కలగాపులగంగా వాడుతూ వినడానికి కంపరం పుట్టించారు. పాటల సాహిత్యంలో జీవం లేదు. కృతకంగా ట్యూన్ కోసం అక్కడ ఆ పదాలను బలవంతంగా ఇరికించి  వాడినట్లుగా ఉన్నాయి.  

>> సీతాదేవిగా నయనతార అభినయం పరవాలేదు అనిపించిందిగాని, సీతాదేవి ముఖంలో పలకవలసిన భావాలు ఆమె ముఖంలో ఏమాత్రం పలకలేదు. మరీ ఎక్కువగా ఒదిగిపోయి నటించడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కన్నెసీతగా చూపించిన సీన్లలో ఆమె హావభావాలు అస్సలు అతకలేదు. పరికిణీ ఓణీ వేసినంత మాత్రాన ప్రౌఢవయస్కురాలు కన్యగా కనిపించడం కష్టమని దర్శకుడు మర్చిపోయాడు లాగుంది. పైగా జీరోసైజు కోసం డైటింగ్ చేసి ఎక్సర్సైజులూ గట్రాలూ చేసేవారి ముఖంలో లావణ్యమూ నవకమూ లోపిస్తాయి. ముఖం ఎండిపోయినట్లుగా, జీవం లేనట్లుగా తయారౌతుంది. ఎంత మేకప్ చేసినా జీవకళ లోపం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా కొన్ని క్లోజప్ షాట్లలో ఆమె నవ్వినపుడు అస్తిపంజరం నవ్వినట్లు అనిపించింది. శ్రీరాముని పాత్ర ఎవరైనా చెయ్యవచ్చు. కాని సీతాదేవి పాత్ర చెయ్యటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖంలో దేవతాభావం, కళ్ళలో పవిత్రతాభావం ప్రతిఫలించాలి. గ్లామర్ పాత్రలకు అలవాటుపడ్డ నయనతార, తన కళ్ళల్లో ముఖంలో పవిత్రతాభావాన్ని పలికించటంలో  పూర్తిగా విఫలం అయింది. నీరసంగా నవ్వినంత మాత్రాన ముఖంలో దైవత్వం కనిపించదు  అన్నది వీళ్ళు తెలుసుకోవాలి.

>> బాలయ్యా, మురళీమోహన్ వంటి సీనియర్ నటుల డైలాగ్ డెలివరీ చాలా అసహజంగా బట్టీపట్టి పట్టిపట్టి ఒప్పజేప్పినట్లు ఉంది. వాళ్ళకు సరిగా అతకని పెట్టుడుపళ్ళసెట్లు ఉన్నాయేమో అని అనుమానం వచ్చింది.

>> ఇకపోతే, సీతాదేవి భూప్రవేశం అడివిలో జరగలేదు. వాల్మీకం ప్రకారం అది సభామధ్యంలో జరిగింది. జైమినిమహర్షి ప్రకారం అసలు జరగనేలేదు. లవకుశలో చూపినట్లు మక్కీకిమక్కీగా ఈ సినిమాలోనూ చూపబోయారు. కాకపోతే నేటి టెక్నాలజీ ఉపయోగించి గ్రాఫిక్స్ బాగా వాడుకున్నారు. నేను లవకుశ చూడలేదు. చాలా చిన్నప్పుడు ఒకటి రెండు సంవత్సరాల వయసులో చూసానేమో గుర్తులేదు. మొన్న యూట్యూబ్ లో లాస్ట్ సీన్ మాత్రం చూశాను.  

>> సీతాదేవి రామబాణాన్ని పూజించడమూ  అదోచ్చి రామ-కుశుల యుద్ధాన్ని ఆపడమూ వంటి కృతకఘట్టాలు ఏమాత్రం అలరించలేకపోయాయి. తన సృజనాత్మకతను దర్శకుడు ఇలాకాకుండా వివిధ రామాయణాలలో ఉన్న ఘట్టాలను రీసెర్చిచేసి ఒక గొప్ప కళాఖండాన్ని నిర్మించడంలో చూపించి ఉంటె ఇంకా బాగుండేది. 

>> మొత్తం మీద రామాయణంమీదా, ఇంకా ఘట్టిగా చెప్పాలంటే సీతాదేవియొక్క ఔన్నత్యంమీదా ఉన్న భక్తీగౌరవాల కొద్దీ ఈసినిమాను చూడవచ్చు. అంతేగాని పెద్ద గొప్పగా ఏమీలేదు. నేను లవకుశ చూడలేదు కాబట్టి దానితోపోల్చి ఈ సినిమాను చూడలేకపోయాను. కాకపోతే లవకుశ పాటలు చిన్నప్పటినుంచి విన్నాను.

>>  బాలకృష్ణ బాగా కష్టపడి జాగ్రత్తగా నటించాడు. అయితే దగ్గర్నించి అతన్ని చూడలేం. వయసుమళ్ళిన చాయలు స్పష్టంగా కనిపించాయి. అదీగాక క్లోజప్ షాట్లలో నీలి మందుడోసు మరీ ఎక్కువైనట్లుంది. లాంగ్ షాట్లు పరవాలేదు.
లవకుశులుగా పిల్లలనటన బాగుంది. బాలహనుమంతుడి నటనా బాగుంది. ఇంతమంది సీనియర్ నటులు నటించిన ఈ సినిమాలో పిల్లల నటన మాత్రమే బాగుంది  అని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం.

ముఖ్యంగా నేటికాలంలో ఇలాటి సినిమా తియ్యాలన్న సాహసంచేసిన నిర్మాత ఒక్కడే ఈచిత్రం మొత్తానికీ అభినందనీయుడు.
read more " శ్రీరామరాజ్యం "

5, డిసెంబర్ 2011, సోమవారం

అభీ నా జావో ఛోడ్ కర్

మొన్నొకసారి స్కైప్ మీటింగ్ లో మిత్రులతో అన్నాను గోచారరవి నీచరాహువు దగ్గరకి వచ్చినపుడు ప్రముఖుల మరణం సంభవిస్తుంది,అని. ఇంకా అనేక విషయాలు సంభవించవచ్చు అని కూడా అనుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం వంటివి. కాని విధి విచిత్రం కాకపోతే, దేవానంద్ మరణం కూడా ఇప్పుడే జరగాలా?

మనకున్న సమాచారాన్ని బట్టి దేవానంద్ 26 -9 -1923  న గురుదాసపూర్ లో పుట్టాడు. ఆయన జన్మసమయం తెలియదు. అందుకని చంద్రలగ్నాత్ జాతకాన్ని చూద్దాం. ఈయన రేవతీనక్షత్రంలో పుట్టాడు. రేవతీనక్షత్ర జాతకులకు ప్రస్తుతం అష్టమశని జరుగుతున్నది. అష్టమశని అనేది చెడుకాలం అని ఇంతకుముందు పోస్ట్ లో వ్రాశాను. ఈయనకు ప్రస్తుతం 88 ఏళ్ళు. ఎనిమిదో అంకె శనియొక్క ఆధీనంలో ఉంటుంది. 88 అంటే డబల్ శనిప్రభావం అనుకోవచ్చు. ఈ సమయంలోనే మరణం ఆయన్ను వరించింది.

కన్యారాశిలో ఉన్న బుధశుక్రులయుతి అనేది ఈయన జాతకంలో ఒక విచిత్రయోగం. కన్యారాశి బుధునికి ఉచ్చస్తితినీ, శుక్రునికి నీచస్తితినీ ఇస్తుందని మనకు తెలుసు. శుక్రుడు కళత్రకారకుడేకాక, ప్రేమవ్యవహారాలకు కారకుడనీ మనకు తెలుసు. ఈ శుక్రుని నీచస్తితివల్లనే తాను అమితంగా ప్రేమించిన సురయాను పెళ్లిచేసుకోలేక పోయాడు. శుక్రునినీచత్వం, చంద్రునినుంచి బుధుని యొక్క కేంద్రస్తితివల్ల రద్దుఅయిందని అనుకోవచ్చు. కాని ఇది పూర్తిగా నిజంకాదు. ఎందుకంటే బుధుడు వక్రస్తితిలో ఉండి బలహీనుడుగా ఉన్నాడు. కనుక శుక్రునియొక్క నీచత్వాన్ని బుధుడు పూర్తిగా రద్దు చెయ్యలేడు. అందుకే శుక్రునియొక్క దుష్టప్రభావం ఇతని జీవితంలో అలా పనిచేసింది. ఇతనికి ఒక రొమాంటిక్ హీరో ఇమేజినీ ఇదే ఇచ్చింది. భగ్నప్రేమనూ, బాధాతప్తహృదయాన్నీ ఇదే ఇచ్చింది. ఈ బుధశుక్రులకలయిక ఇతనిజాతకంలోని  "కార్మిక్ సిగ్నేచర్" అని చెప్పవచ్చు. 

ఇతని జీవితంలోని ప్రతిఘట్టంలోనూ ఈగ్రహయుతి ప్రభావం కనిపిస్తుంది. ఈయన వ్రాసుకున్న " రొమాన్సింగ్ విత్ లైఫ్" అనేపుస్తకం పేరుకూడా బుధశుక్రుల ప్రభావానికి అతీతంగా ఏమీలేదు. రొమాన్స్ శుక్రుని ఆధీనంలోనూ, ఓపెన్ గా మాట్లాడటం బుధుని ఆధీనంలోనూ ఉంటుందని మనకు తెలుసు. అందుకే ఆ పుస్తకం పేరుకూడా అలా పెట్టబడింది. ఈ విధంగా జీవితంలో ఒకరు చేసే ప్రతిపనీ గ్రహాధీనంలోనే ఉంటుంది. మన సొంతంగా మనం చేస్తున్నాం అనుకునేపని వెనుకకూడా మనకు తెలీని శక్తులప్రభావం ఉంటుంది. ఇదే గ్రహప్రభావం వల్ల, తనజీవితంలో ఎంతమంది అమ్మాయిలతో తానుప్రేమలో పడిందీ దేవానంద్ బాహాటంగా చాలాసార్లు చెప్పేవాడు. 

ప్రస్తుతం గోచారశుక్రుడు రాహువునుదాటి ముందుకు వచ్చాడు. 14 -11 -11  న శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నప్పటినుంచీ ఈయనగానీ ఈయనసతీమణి గానీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలి అని నాఊహ. కాని జాతకబలం వల్ల గోచారసూర్యుడు రాహువుతోకలిసి బాగా దగ్గరకు వచ్చేవరకూ మరణం దూరంగా వేచిచూచింది. ఈయన రవివారంరోజున రవిహోరలో కన్నుమూయడం ఒకవిచిత్రం. రవి గుండెకు కారకుడని మనకు తెలుసు, రాహువు నిద్రకు కారకుడు. కనుక రవివారంనాడు, రవిహోరలో, గోచారసూర్యుడు రాహువుకు బాగాదగ్గరగా ఉన్నప్పుడు నిద్రలో గుండెపోటుతో తనువు చాలించాడు.

అష్టమశనికి తోడు, గోచారరవిబుధులు నీచరాహువుకు బాగాదగ్గరగా వచ్చారు. రాహువు విదేశాలకు కారకుడు. అందుకే విదేశం అయిన లండన్లో మరణాన్ని ప్రసాదించాడు. అంతేకాక  రవిబుధులు వృశ్చికం 17 డిగ్రీ మీద కంజంక్షన్లో ఉన్నారు. వృశ్చికం 17 డిగ్రీ అంటే నవాంశలో ధనుస్సు అవుతుంది. జైమినిమహర్షి ప్రకారం ధనురాశి హటాత్ పరిణామాలకూ, ఉన్నతస్థానంనుంచి  పతనానికీ కారణం అవుతుంది. ప్రస్తుతం అదే జరిగింది.

నవంబర్ 15  న శనిభగవానుడు తులారాశికి మారినప్పటి నుంచీ రేవతీనక్షత్రజాతకులకు అష్టమశని ప్రభావంవల్ల అనేక బాధలు మొదలయ్యాయి. ఈ బాధలనేవి ఆయా జాతకుల దశాభుక్తులను బట్టి, వారివారి వయస్సును బట్టి జరుగుతుంటాయి. ప్రస్తుతం దేవానంద్ 88 ఏళ్ల వృద్ధుడు. ముసలివయసులో శనిగోచారం ప్రమాదకరమైనది. కనుక అష్టమశని ఈయనకు దేహబాధల నుంచి విముక్తి ప్రసాదించింది. జీవితమనే స్టేజిమీదనుంచి గ్రీన్ రూం లోకి  తీసుకెళ్ళింది. మళ్ళీ కొత్తమేకప్ వేసుకుని ఇంకోకొత్తవేషంలో ఎక్కడో ఏదోనాటకంలో ఇంకోపాత్ర ధరింపచేయడానికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. 


జీవకారకుడైన జననగురువుపైన కర్మకారకుడైన గోచారశని సంచరించడం మరణసూచకం (సరైన దశలు నడుస్తుంటే). నాడీజ్యోతిష్యంలో ఇదొక రహస్యం. ప్రస్తుతం దేవానంద్ జాతకంలో అదే జరిగినట్లుంది.

ఈ రహస్య విశ్వప్రణాళికలో, తన కర్మానుసారం చేరవలసిన సరైనచోటుకి, దేవానంద్ ఆత్మ చేరుతుందని ఆశిద్దాం.   
read more " అభీ నా జావో ఛోడ్ కర్ "