30, సెప్టెంబర్ 2025, మంగళవారం

పదకొండో అవతారం

పొద్దున్నే ఫ్రెండ్ ఫోన్ చేశాడు.

'ఈ వార్త విన్నావా?' అన్నాడు సంభ్రమంగా.

'ఏంటది?' అన్నాను.

'ఈ ఏడాది అమ్మవారికి పదకొండో అవతారం వచ్చింది' అన్నాడు.

'ఏం? పది సరిపోలేదా?' అన్నాను నిరాసక్తంగా.

'అవును. ఈ ఏడాది పదకొండు తిథులొచ్చాయి. అందుకే పదకొండు అవతారాలు' అన్నాడు.

'బాగుంది నీ అవతారం' అన్నాను.

'నువ్విలాంటివేవీ చెయ్యవు కదా. నీకు తెలీదులే' అన్నాడు.

'అసలు అమ్మవారంటే ఏంటో తెలిస్తే ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'పోనీ నీ అవతారమేంటో తెలుసుకున్నా, ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.

'ఇదీ అర్ధం కాలేదు' అన్నాడు.

'ఫోన్ పెట్టేసి నీ వ్యాపారం నువ్వు చేసుకో' అన్నాను.

'నాకేం వ్యాపారం లేదు' అన్నాడు.

'పోనీ ఇంకొకరి వ్యాపారంలో సమిధవై పో' అన్నాను.

ఫ్రెండ్ ఫోన్ పెట్టేశాడు.

నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.

read more " పదకొండో అవతారం "

29, సెప్టెంబర్ 2025, సోమవారం

మైకుకు మోక్షం

నిన్న రాత్రి ఏదో పనుండి ప్రక్క పల్లెకెళ్ళాను

ఆ టైములో కూడా,  ఒక గుడిపైన మైకు జోరుగా మ్రోగుతోంది.

ఏవో జానపద భక్తిగీతాలు పెద్ద సౌండుతో వినవస్తున్నాయి

గుడిలో ఒక్క పురుగు లేదు.

అమ్మవారు అయోమయంగా చూస్తోంది.

'నవరాత్రుల మైకు' అన్నది ప్రక్కనున్న శిష్యురాలు

'నాల్రోజుల్లో దానికి మోక్షం గ్యారంటీ' అన్నాను ఏడుస్తున్న ప్రశాంతతను చూస్తూ.

read more " మైకుకు మోక్షం "

22, సెప్టెంబర్ 2025, సోమవారం

నవ్వుతున్న నవరాత్రులు

ప్రక్కఊరినుండి అప్పుడపుడు కొంతమంది ఏదో పనిమీద ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వారిలో ఒకతను ఈ మధ్యన ఇలా అడిగాడు.

'ప్రతి ఏడాది మా గుడిలో నవరాత్రులు చేస్తాము. మీరూ ఆశ్రమంలో చేస్తారా?'

'రాత్రులను మనం చేసేదేముంది? అవే వచ్చిపోతుంటాయి' అన్నాను.

షాకయ్యాడు.

'అంటే, అమ్మవారికి ప్రత్యేకపూజలు ఏవీ చెయ్యరా?' అడిగాడు అనుమానంగా.

'ప్రత్యేకంగా చేసేది పూజ ఎలా అవుతుంది?' అన్నాను.

అయోమయంగా చూచాడు.

'మరి నైవేద్యాలు?' భయంగా అడిగాడు.

'కాలానికి మనం అవుతున్నాంగా ప్రతిరోజూ - నైవేద్యం' అన్నాను.

కాసేపు మాటరాలేదు.

'మరి మైకులు భజనలు ఉండవా?' అన్నాడు.

'అమ్మవారికి చెవుడు లేదు. ఆమెకు భజనపరులు నచ్చరు' అన్నాను.

అతను లేచి వెళ్ళిపోయాడు.

నవరాత్రులు నవ్వుతున్నాయి.

read more " నవ్వుతున్న నవరాత్రులు "

18, సెప్టెంబర్ 2025, గురువారం

కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు

146 కోట్ల ప్రజలు. అంతకంటే ఎక్కువ సమస్యలు. 

దేశంనిండా దేశద్రోహులు. నల్లడబ్బు, అవినీతికంపు. సొంతదేశాన్ని బలహీనపరచి విదేశాలకు అమ్మేయాలని ప్రయత్నించే రాజకీయశక్తులు. వాటికి విదేశీసహాయాలు, వీరిని గుడ్డిగా నమ్మే పిచ్చిజనాలు, సరిహద్దు గొడవలు, దేశద్రోహపార్టీలు, వర్గవిభేదాలు, కులవిభేదాలు,  అవకాశవాదాలు, మతమార్పిడులు, జిహాద్ లు, కమ్యూనిష్టు విషప్రచారాలు, టెర్రరిస్టుల దాడులు, కుట్రలు, కుతంత్రాలతో రకరకాలుగా చీల్చబడుతూ సర్వనాశనం దిశగా శరవేగంగా పోతున్న దేశం.

ఇలాంటిస్థితిలో దేశపగ్గాలు చేపట్టారు మోదీగారు.

ఆయనకు కుటుంబం లేదు. 

ఒకప్పుడు ఉండేది, దేశంకోసం కుటుంబాన్ని వదులుకున్నారు. 

ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.

కోట్లకు కోట్లు నల్లధనం లేదు.

ఆయన తినేది చాలా తక్కువ. అదికూడా పూర్తి శాకాహారం.

నిద్రపోయేది రోజుకు 3 గంటలు. 

దేశంకోసం కష్టపడేది 21 గంటలు.

ఏడాదిలో ఎక్కువరోజులు ఉపవాసదీక్షలు. నేలమీద నిద్రిస్తారు.

విలాసాలు లేవు. సరదాలు లేవు. ఇతర వ్యాపకాలు లేవు.

క్రమశిక్షణతో కూడిన జీవితం.

ఉన్నతమైన ఆదర్శాలతో కూడిన ఆలోచనావిధానం.

75 ఏళ్ల వయసులో కూడా అలసిపోని దేహం.

చెరిగిపోని చిరునవ్వు.

తను ఏ దేశంకోసం పాటుపడుతున్నాడో, అదేదేశంలో దాదాపు సగంమంది తనను వ్యతిరేకించినా, ఆ వ్యతిరేకతకు మతపిచ్చి తప్ప ఏ ఇతరకారణమూ లేకపోయినా, చెదరని సంకల్పశక్తి. 

వారికి కూడా అభివృద్ధి ఫలాలను, ఫలితాలను సమానంగా అందించే ఉదారత్వం.

అదీ నరేంద్రమోదీగారు !

పదేళ్లు తిరిగాయి.

ఒకప్పుడు అన్నిదేశాల దగ్గరా అప్పులు చేసిన దేశం, ఈనాడు అన్ని అప్పులూ తీర్చేసింది. చిన్నదేశాలను ఆదుకునే స్థితికి ఎదిగింది. 

నేడు మనదేశం అన్ని రంగాలలో ముందుకు పోతూ,  అగ్రరాజ్యాల బెదిరింపులకు లొంగకుండా, వాటికే షరతులు విధిస్తూ, వాటితో సమానంగా అంతర్జాతీయ వేదికలపైన నిలబడిందంటే - నరేంద్రమోదీ గారు మాత్రమే కారణం !

'సన్యాసి రాజ్యపాలన చేస్తాడు' అని వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసింది ఈయన గురించే.

మోదీగారు కాషాయవస్త్రాలు కట్టుకోనక్కరలేదు. కానీ, ఆయన ఏ పీఠాధిపతికీ, ఏ స్వామీజీకి తక్కువ కాదు. నిజానికి వాళ్లలో చాలామంది ఈయన కాలిగోటికి కూడా ఏమాత్రమూ సరిపోరు.

కారణం?

వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు. 

ఈయ దేశంకోసం పాటుపడుతున్నాడు.

ఎవరు ఎక్కువ?

దేశం బాగుంటే కదా మతం, ధర్మం బాగుండేది?

చట్టం సరిగ్గా ఉంటేకదా మఠాధిపతులైనా, మతాధిపతులైనా, నిర్భయంగా తిరగగలిగేది?

మోదీగారు ఒక రాజర్షి.

జనకమహారాజు గురించి మనం చదివాము. శివాజీ మహారాజు గురించి చదివాము. గురు గోవింద్ సింగ్ గురించి చదివాము. ఇప్ప్పుడు మోదీగారిలో వారందరినీ చూస్తున్నాము.

ఇటువంటి రాజర్షి, ఇటువంటి కర్మయోగి మన ప్రధానమంత్రిగా ఉండటం కోట్లాది భారతీయుల పుణ్యఫలం.

ఎంతమంది దేశభక్తుల ఎన్నివేల ఏళ్ల ప్రార్ధనల ఫలితమో ఈనాడు ఈ రాజర్షి మన దేశసారధి అయ్యాడు.

ఈయనకు నిన్న 75 ఏళ్ళు నిండాయి.

ఇంకా 25 ఏళ్ళు, నిండునూరేళ్ళు, ఈయన ఇదేవిధంగా జీవించాలని, దేశాన్ని మున్ముందుకు నడిపించాలని,  మన దేశపు పూర్వవైభవాన్ని మళ్ళీ ఆవిష్కరించాలని, పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.

మనదేశంలో వేలాదిసంవత్సరాలుగా పుట్టిన అందరు మహనీయుల ఆశీస్సులూ ఈయనపైన ఉండుగాక !

పరమేశ్వరుని కటాక్షం ఈయనపైన పరిపూర్ణంగా ఉండుగాక ! 

జై మోదీజీ ! జై భరతమాత ! జై హింద్ !

read more " కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు "

15, సెప్టెంబర్ 2025, సోమవారం

దీపపు కుదురు

అయితే,

ఎర్రజెండా మొండి మనుషులు

లేకపోతే, 

తురకబాబా మూఢభక్తులు


కాకపోతే,

కొలుపులు, బలుపులు, బలులు

ఇంకా చాలకపోతే,

కోరికల భజనలు, దీక్షలు, పూజలు


అదీకాదంటే,

పిరమిడ్లు, సమాధుల దొడ్లు, సూక్ష్మలోక ప్రయాణాలు


ఇదీ ఒంగోలు చుట్టుప్రక్కల గోల . . . 


మనుషుల అజ్ఞానం ఎంత దట్టంగా ఉందంటే

చిమ్మచీకటి కూడా దీనిని చూచి సిగ్గుపడుతోంది


చెవిటివాడికి శంఖం ఊదటం ఎలాగో 

వీరికి అసలైన ఆధ్యాత్మికత నేర్పడం అలాగ


అందుకే,

ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్లో మా బుక్ స్టాల్

ఇదే మొదటిసారి,

ఇదే చివరిసారి కూడా


ఎడారిలో చిరుదీపం వెలుగుతోంది

దాని వెలుగు చాలా దూరానికి ప్రసరిస్తోంది

కానీ కుదురుదగ్గర మాత్రం

చీకటిగానే ఉంది.


ఏ దీపమైనా ఇంతేనేమో?

read more " దీపపు కుదురు "

8, సెప్టెంబర్ 2025, సోమవారం

ఏడవ రిట్రీట్ విశేషాలు

 



ఏడవ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం ఈనెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు పంచవటి ఆశ్రమప్రాంగణంలో జరిగింది.

ఊకదంపుడు ఉపన్యాసాలకు, సోదికబుర్లకు పూర్తివ్యతిరేకదిశలో సాగుతున్న మా నడక, ఉత్త థియరీని వదలిపెట్టి, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో ముందుకు పోతోంది.

సాధనామార్గంలో పురోగమిస్తున్న శిష్యులకు ఆశీస్సులనందిస్తూ, ఉన్నతస్థాయికి చెందిన ఒక ధ్యానవిధానంలో వీరికి దీక్షనిచ్చాను. అందుకున్నవారు అదృష్టవంతులు.  వీరిలో ఒక 13 ఏళ్ల చిన్నపిల్ల కూడా ఉన్నది. ఇంత చిన్నవయసులో ఇటువంటి దీక్షను పొందటం ఈమె అదృష్టం. ఏమంటే, అసలైన హిందూమతం ఇదే. అసలైన సనాతన ధర్మమార్గం ఇదే. కోట్లాదిమందికి 83 వచ్చినా ఇది దొరకదు. అలాంటిది 13 ఏళ్ల వయసులో ఇది లభించడం అదృష్టం కాకపోతే మరేమిటి?

నిజానికి, సాధన మొదలుపెట్టవలసింది ఈ వయసులోనే. దైవకటాక్షంతో లభించిన ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోమని వారికి గుర్తుచేస్తున్నాను.

మూడురోజులపాటు బయటప్రపంచాన్ని మర్చిపోయి ఆశ్రమంలోని  ప్రశాంతవాతావరణంలో సాధనలో సమయాన్ని గడిపిన శిష్యులందరూ తిరిగి వారివారి ఇళ్లకు ఈ రోజు ఉదయానికి చేరుకున్నారు.

తిరిగి డిసెంబర్ లో జరుగబోయే సాధనాసమ్మేళనంలో కలుసుకుందామనిన సంకల్పంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.

మనుషులనేవారు కనిపించడం అరుదైపోయిన ఈ రొచ్చుప్రపంచంలో, కనీసం కొంతమందినైనా నిజమైన మనుషులను తయారు చేయగలుగుతున్నానన్న సంతృప్తిని నాకు మిగిల్చింది.

read more " ఏడవ రిట్రీట్ విశేషాలు "

15, ఆగస్టు 2025, శుక్రవారం

ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్







ఒంగోలులో నేటినుండి జరుగుతున్న పుస్తకమహోత్సవంలో మాకు 28 వ నెంబరు స్టాల్ కేటాయించబడినది. పదిరోజులపాటు జరిగే దీనిలో మా గ్రంధాలన్నీ మీకు లభిస్తున్నాయి. అంతేగాక, అక్కడ పంచవటి సభ్యులను మీరు కలుసుకోవచ్చు. మాట్లాడవచ్చు.

హైదరాబాదు, విజయవాడ బుక్ ఫెయిర్ లతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదే. కానీ మాకు దగ్గర గనుక, మా స్టాల్ ను కూడా ఇక్కడ పెడుతున్నాము. ఒంగోలు ప్రాంతంలో పుస్తకప్రియులు, అందులోనూ, ఆచరణాత్మకమైన అసలైన హిందూధర్మాన్ని తెలుసుకుందామనిన జిజ్ఞాస ఉన్నవారు, ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. కానీ అమూల్యములైన మా గ్రంధాలను ఈ ప్రాంతపు ప్రజలకు కూడా పరిచయం చేద్దామన్న సత్సంకల్పంతో ఈ పనిని చేస్తున్నాము.

పంచవటి ఆశ్రమాన్ని గురించి, మా భావజాలాన్ని గురించి, అసలైన హిందూమతాన్ని గురించి తెలుసుకోవడానికి ఒంగోలు చుట్టుప్రక్కల ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

read more " ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్ "

11, ఆగస్టు 2025, సోమవారం

మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 73 వ పుస్తకంగా 'పది శాక్తోపనిషత్తులు' నేడు విడుదల అవుతున్నది.

ఇప్పటిదాకా నేను ప్రధానమైన వేదాంతోపనిషత్తులను, యోగోపనిషత్తులను వ్యాఖ్యానించి మా సంస్థనుండి పుస్తకములుగా ప్రకటించాను. కానీ శక్తిప్రధానములైన ఉపనిషత్తులకు వ్యాఖ్యానమును వ్రాయలేదు. ఆ పనిని ఇప్పుడు చేశాను. ఆ వివరమంతా ఈ గ్రంధపు ముందుమాటలో చర్చించాను.

దీనిలో 1. కౌలోపనిషత్తు 2. త్రిపురా మహోపనిషత్తు 3. భావనోపనిషత్తు 4. అరుణోపనిషత్తు 5. బహ్వృచోపనిషత్తు 6. కాళికోపనిషత్తు 7. తారోపనిషత్తు 8. సరస్వతీ రహస్యోపనిషత్తు 9. త్రిపురాతాపినీ ఉపనిషత్తు 10. సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తులకు నా వ్యాఖ్యానం మీకు లభిస్తుంది.

ఇవి, నాలుగువేదములనుండి తీసుకున్నవి అయినప్పటికీ, అధర్వణవేదం నుండి ఎక్కువగా ఉన్నాయి. తంత్రప్రధానములైన ఉపనిషత్తులు దానిలోనే మనకు కనిపిస్తాయి.

బ్లాగులో వ్రాతలను నేను బాగా తగ్గించినప్పటికీ, రచనావ్యాసంగానికి మాత్రం చుక్కపెట్టలేదు. ఉన్నతభావ సంప్రేరితములైన ప్రాచీనగ్రంథముల అధ్యయనము, వ్యాఖ్యానము, సాధన మరియు బోధనలు నిరాఘాటంగా మా ఆశ్రమంలో  కొనసాగుతూనే ఉన్నాయి. అవే లేకపోతే, ఈ చెత్తలోకంలో చెత్తమనుషుల మధ్యన మనం మనుగడ సాగించేదెలా మరి?

నేను సమాజానికి దూరంగా ఉంటున్నప్పటికీ, నిజమైన సాధకులకు మా ఆశ్రమం తలుపులు మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ గ్రంధాన్ని ఆవిష్కరించడంలో తమవంతు పాత్రను పోషించిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. యధావిధిగా ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఆగస్టు 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవం సమయానికి దీనితోబాటు మరికొన్ని మా అముద్రిత గ్రంధాలను ముద్రించి, మా స్టాల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నది.

మా మిగతా గ్రంధాలలాగా దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
read more " మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల "

10, ఆగస్టు 2025, ఆదివారం

'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల

నేను మొట్టమొదట వ్రాసిన పుస్తకం 'శ్రీవిద్యారహస్యం'. దీని మొదటి ముద్రణ పదేళ్లక్రితం 2015 లో జరిగింది. ఆ తరువాత పాఠకుల డిమాండ్ ను బట్టి 2019 లో రెండవముద్రణ జరిగింది. ఇప్పుడు 2025 లో మూడవ ముద్రణ జరిగింది. అభిమానుల సూచనలను బట్టి ప్రతిసారీ దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతున్నది.

మొదటి ముద్రణలో 1318 పద్యములున్నాయి. మూడవముద్రణలో 1731 పద్యములైనాయి. అంటే దాదాపు 400 పద్యములను అదనంగా వ్రాసి చేర్చడం జరిగింది. అంతేగాక, అదనపు అధ్యాయములను కూడా చేర్చడం జరిగింది.

ప్రస్తుతపు మూడవముద్రణలో చేర్చబడిన ముఖ్యాంశము మంత్రభాగపు వివరణ. మొదటి రెండు ముద్రణలలో మంత్రభాగాన్ని పెద్దగా స్పృశించలేదు. కారణం, మంత్రములను పుస్తకరూపంలో ఇవ్వడం ఎందుకని భావించడమే. కానీ,  శ్రీవిద్యకు మంత్రమే ప్రాణం గనుక అది కూడా ఉండాలని కొందరు అభిమానులు పదే పదే చెప్పడంతో, దానిని ఈ ముద్రణలో వివరంగా చర్చించడం జరిగింది. అయితే, గురూపదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పడం జరిగింది.

మంత్రములను పుస్తకముల నుండి గ్రహించవచ్చు. కానీ వాటియొక్క జపధ్యానవిధానములను (తంత్రమును) మాత్రం గురూపదేశపూర్వకంగానే నేర్చుకోవలసి ఉంటుంది. 

2015 తరువాత ఈ పదేళ్లలో 70 పైగా పుస్తకములను నేను వ్రాసినప్పటికీ, మొట్టమొదటిసారిగా వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' మాత్రం నేటికీ పాఠకుల అభిమానగ్రంధంగా నిలిచి ఉన్నది. నా భావజాలాన్ని, మా సాధనామార్గాన్ని చదువరులకు స్పష్టం చేస్తూనే ఉన్నది.

ఈ మూడవముద్రణ సందర్భంగా నా శిష్యులకు, అభిమానులకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ నెల 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవంలో 'పంచవటి స్టాల్' లో 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణతో సహా  మా పుస్తకాలన్నీ లభిస్తాయి.

ఇది మా ఆశ్రమానికి దగ్గరే కాబట్టి, పుస్తకప్రాంగణంలో నేను కూడా మీకు అప్పుడపుడు కనిపిస్తాను. పుస్తకప్రాంగణంలో కలుసుకుందాం.

read more " 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల "

22, జూన్ 2025, ఆదివారం

International Yoga Day - 2025



International Yoga Day - 2025 సందర్భంగా పంచవటి శిష్యులు వారివారి ఇళ్లలో చేసిన యోగవ్యాయామాలను ఇక్కడ చూడవచ్చు.

ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఏడాదికి ఒక రోజు మాత్రమే లోకానికి 'యోగా డే'  కావచ్చు. మాకు ప్రతిరోజూ 'యోగా డే' నే. ప్రతిరోజూ యోగంతోనే మొదలౌతుంది,  యోగంతోనే నడుస్తుంది. యోగంతోనే ముగుస్తుంది. పంచవటి సాధనామార్గానికి యోగం ఒక పునాది. అందుకే మా ఆశ్రమానికి 'పంచవటి యోగాశ్రమం' అని పేరు పెట్టాను.

కనీసం కొంతమందైనా, మొక్కుబడిగా నైనా, నేడు యోగాభ్యాసం చేస్తున్నారు. అంతవరకూ మంచిదే. పట్టుబట్టి మంచిని నేర్పకపోతే చుట్టూ ఉన్న చెడు లోపలి ప్రవేశించే ప్రమాదం గట్టిగా ఉంది.

కనీసం ఆరోగ్యం కోసమైనా యోగాభ్యాసం చేయడం మొదలుపెడితే, మీ అదృష్టం బాగుంటే, అసలైన యోగశాస్త్రమేమిటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎక్కడో ఒకచోట మొదలంటూ పెట్టాలి కదా !

Good luck world !

Better late than never !
read more " International Yoga Day - 2025 "