23, నవంబర్ 2023, గురువారం

ఆశ్రమం ప్రారంభం

ఆశ్రమం సాకారమైంది.

ఆరునెలలుగా మేము పడుతున్న శ్రమ ఫలించింది. 

నిన్న జగద్ధాత్రి పూజా పర్వదినాలలో ఆశ్రమం మొదలైంది. సింహవాహిని యైన దుర్గాదేవిని జగద్దాత్రిగా ఈ సమయంలో పూజిస్తారు. ఇదే సమయంలో మా ఆశ్రమం ప్రారంభించబడింది. 

దూరదూరాల నుండి వచ్చిన శిష్యుల సమక్షంలో నిరాడంబరంగా మా ఆశ్రమ ప్రారంభోత్సవం నిన్న ఉదయం పది గంటలకు జరిగింది. విచ్చేసిన శిష్యులు చాలామంది తమతమ భావాలను అనుభవాలను తమ ఉపన్యాసాలలో వెలిబుచ్చారు.

పంక్షన్ అంతా లైవ్ ఇవ్వబడింది.     

త్వరలో మా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో క్లిప్స్ కొన్ని పెట్టబడతాయి.

మా ఆశ్రమాన్ని గురించి కొద్దిమాటలలో....

కొందరు భావిస్తున్నట్లు, ఈ ఆశ్రమం వృద్ధాశ్రమం  కాదు, జ్ఞానవృద్ధులైన నిత్యయవ్వనుల ఆశ్రమం.

ఇంకొందరు అనుకుంటున్నట్లు, ఇది అనాధాశ్రమం కాదు. దైవం తప్ప వేరే దిక్కులేని అనాధల ఆశ్రమం. 

ఇది కాలక్షేప ఆశ్రమం కాదు. కాలాన్ని జయించాలనుకునే వారి ఆశ్రమం.

ఇది వ్యాపార ఆశ్రమం కాదు. వ్యాపకాలను ఖండించే ఆశ్రమం.

ఇక్కడ జ్ఞానదాహార్తులకు దాహం తీర్చబడుతుంది.

ఇక్కడ యోగసాధకుల సాధన ఫలిస్తుంది.

ఇక్కడ మంత్రచైతన్యం వెల్లివిరుస్తుంది.

ఇక్కడ వైధీభక్తి పరాభక్తిగా మారుతుంది.

ఇక్కడ మోక్షం అరచేతిలో వచ్చి నిలుస్తుంది.

మాకు ప్రపంచంతో పనిలేదు. కానీ ప్రపంచాన్ని వదిలిపెట్టం.

మాకు మనుషులతో పనిలేదు. కానీ వారి మధ్యనే ఉంటాం.

లోకోద్ధరణ మా పని కాదు. కానీ లోకానికి బోధిస్తూనే ఉంటాం.

లౌకిక బాధలను తీర్చడం మా పని కానేకాదు. అన్ని బాధలను దాటే మార్గం చూపడమే మా పని.

'ఎందుకలా?' అని కొందరడిగారు.

గడపమీదున్న దీపం లోపలకూ బయటకూ చెందదు. కానీ రెండుప్రక్కలకూ వెలుగును ప్రసరిస్తుంది. అలాంటిది మా ఆశ్రమం.

మలయమారుతం సుడిగాలిలా వీచదు. సుతారంగా తాకుతుంది. అలాంటిది మా విధానం. 

ఉలుకూపలుకూ లేకుండా మేము ఉండము. అంటీ ముట్టనట్లుగా మా ఉనికిని ప్రదర్శిస్తాం. అంతేగాని, లోకంతో, లోకులతో అతిగా పూసుకోము.

అర్హులైన వారికి ఇక్కడ అందలాలు అందుతాయి. అర్హతలు లేనివారు ఇక్కడ అడుగుకూడా పెట్టలేరు. ఒకవేళ పెట్టినా, ఎక్కువకాలం మాతో కలిసి నడవలేరు.

సెల్ఫ్ సర్వీసే మా పని. సోషల్ సర్వీస్ మా పని కాదు. ప్రస్తుతపు మాయ ప్రపంచానికి, మాయ మనుషులకు ఎటువంటి సర్వీసూ చెయ్యవలసిన పని లేదు. ఇది నా ఖచ్చితమైన అభిప్రాయం.

అదృష్టవంతులు కొందరు ప్రారంభోత్సవానికి రాగలిగారు. ఇతరులు రాలేకపోయారు.

వచ్చినవారిలో కూడా అందుకున్నవారికి అందుకున్నంత.

ఇన్నాళ్లూ సమాజపు సందుగొందులలో  నా పాదయాత్ర సాగింది. ఇక ఆధ్యాత్మిక హైవే పైన సూటిప్రయాణం మొదలు.

పాత్రతను బట్టి యాత్ర.

read more " ఆశ్రమం ప్రారంభం "

3, నవంబర్ 2023, శుక్రవారం

నవంబర్ 22 న మా ఆశ్రమం ప్రారంభం

అమెరికా నుండి తిరిగి వచ్చాక, గత ఏప్రిల్ నెలనుంచి ప్రకాశంజిల్లా దొడ్డవరం గ్రామంలో ఉంటూ, చండ్రపాడు గ్రామపరిధిలో మా ఆశ్రమాన్ని కట్టిస్తున్నామని మీకందరికీ తెలుసు. నిరాడంబరంగా కట్టబడుతున్న ఈ ఆశ్రమం దాదాపుగా పూర్తి కావచ్చింది.

పన్నెండేళ్ల నుంచి మేము కంటున్న కల ఇప్పటికి నిజం కాబోతున్నది.

ఇన్నాళ్లుగా నా వ్రాతలను, మాటలను నమ్మినవాళ్లున్నారు. నమ్మనివాళ్ళూ ఉన్నారు. నమ్మినవాళ్లలో కొందరు నాతోపాటు మా ఆశ్రమంలో జీవిస్తూ, నా సాధనామార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాలో తమ ఉద్యోగాలను కూడా వదిలేసి మరీ ఈ జీవితాన్ని వరించి ఇండియాకు వచ్చేశారు. మరికొందరు వారివారి ఉద్యోగాలలో  మాకు దూరంగా ఉన్నప్పటికీ, నా మార్గంలోనే నడుస్తున్నారు. నా శిష్యులలో అవినీతి పరులు గానీ, సోమరిపోతులు గానీ, దురహంకారులు   గానీ లేరు.

ఇకపోతే, నమ్మనివాళ్ళ సంగతి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అది వాళ్ళ ఇష్టం.

అయితే, ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా, నేను చెప్పినదానిని మాత్రం చేసి చూపిస్తున్నాను. దానికి ఈ ఆశ్రమమే తార్కాణం.

ఈ నెల 22 న మా ఆశ్రమ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇదే మీకందరికీ ఆహ్వానం. 

ప్రకాశం జిల్లా వెల్లంపల్లి డ్యామ్ దగ్గరలోని దొడ్డవరం - చండ్రపాడు గ్రామాల మధ్యలో మా ఆశ్రమం ఉంటుంది. ఇదే బ్లాగులోని గూగుల్ మ్యాప్ లో మా లొకేషన్ ను  మీరు చూడవచ్చు.

గత పదేళ్లుగా ఎంతోమంది నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని, నా దారిలో నడవాలని, దానికి నా గైడెన్స్ తీసుకుంటామని, వారి వారి ఉత్సుకతను వెలిబుచ్చారు. దానికి సమయం రాలేదని  చెప్పి వారిని ఆపుతూ వచ్చాను. ఇప్పటికి ఆ సమయం వచ్చింది. వారందరికీ ఇదే మా ఆహ్వానం.

పూజలు, పునస్కారాలు, పార్ట్ టైం దీక్షలు, గుడులు, భజనలు, యాత్రలు, ప్రవచనాలు మొదలైన తక్కువస్థాయి పనుల జోలికి పోనివారు, దురహంకారం లేనివారు, నిజమైన ఆధ్యాత్మికజీవనం కోసం తపించేవారు,  వేదాంత-యోగ-తంత్ర సాధనామార్గంలో నడవాలనుకునేవారు, డైరెక్ట్ గా ఈ జన్మలోనే దైవానుభూతిని కోరుకునేవారు, ఎవరైనా సరే, వారికి ఇదే మా ఆహ్వానం.

22 వ తేదీన  ఉదయం పదింటికి  ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలౌతుంది. దాదాపు మూడుగంటల పాటు కార్యక్రమం ఉంటుంది. వచ్చినవారికి లంచ్ ఏర్పాటు చెయ్యబడుతుంది. వస్తున్నవారు 15 వ తేదీ లోపు 98493-89249 అనే నెంబర్ కు ఫోన్ చేసి 'పంచవటి ఫౌండేషన్' సెక్రటరీ శ్రీరామమూర్తి కి తెలియజేస్తే ఏర్పాట్లు చేసుకోవడం మాకు తేలికగా ఉంటుంది.

ప్రారంభోత్సవ ఉత్సవాలు వారం రోజుల పాటు వరుసగా జరుగుతాయి. ఈ వారం పాటు నా శిష్యులందరూ ఇక్కడే ఉండి  ప్రతిరోజూ జరిగే స్పిరిట్యువల్ రిట్రీట్ లో పాల్గొంటారు. బయటివారికి మాత్రం ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు. ఏమంటే, ఇప్పటికి వారు మా దారిలో లేరు కాబట్టి. మాతో పరిచయం పెంచుకుని, నా సాధనా మార్గంలో నడవడానికి వారి త్రికరణశుద్ధిని నిరూపించుకుంటే మాత్రమే, రాబోయే రిట్రీట్స్ లో వారికి అవకాశం ఇవ్వబడుతుంది.

ఇంతకు ముందే నేను చెప్పినట్లుగా, ఈ రిట్రీట్స్ లో - వేదాంత, యోగ, తంత్ర, జ్యోతిష రహస్యాలు, ఆచరణాత్మకంగా, సింపుల్ గా, నేర్పబడతాయి. కావాలంటే హోమియోపతి, మార్షల్ ఆర్ట్స్ కూడా,  మీకు ఉపయోగపడే పరిధిలో నేర్పబడతాయి. తపన ఒక్కటే  దీనికి కావలసిన అర్హత, కులంతో, మతంతో, డబ్బుతో, హోదాతో,  వయసుతో, రాజకీయాలతో  మా మార్గానికి ఎటువంటి సంబంధమూ లేదు. అసలైన హిందూమతాన్ని, దాని కోర్ ఫిలాసఫీని, దాని సాధనామార్గాలను ఆచరణాత్మకంగా నేర్చుకుని అభ్యసించాలనుకునే వారు, దైవసాధనా మార్గంలో నిజంగా నడవాలనుకునేవారు అందరూ దీనికి అర్హులే.

ఆశ్రమ ప్రారంభోత్సవానికి రావాలని అనుకుంటున్న వారు, ఫోన్ ద్వారా ముందుగా  మాకు తెలియబరచడం  మాత్రం మర్చిపోకండి.

ఇన్నాళ్లు థియరీ చెప్పాను. ఇప్పుడు ప్రాక్టికల్ సాధనలు మొదలౌతాయి.

దివ్యజీవన మార్గంలోకి ఇదే మీకు ఆహ్వానం.

నవంబర్ 22 న కలుసుకుందాం !

read more " నవంబర్ 22 న మా ఆశ్రమం ప్రారంభం "

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల

అమెరికానుండి వచ్చిన తరువాత, ఆశ్రమ పనులలో పడి, గ్రంథరచనకు, ముఖ్యమైన విషయాలపైన వీడియోలు చేయడానికి అడ్డుకట్ట వేసి ఆరునెలలు అయింది. ప్రస్తుతం ఆశ్రమం పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. కనుక గ్రంథరచనను మళ్ళీ మొదలుపెట్టాను. అందుకోసం కొన్నినాళ్ళబట్టి జిల్లెళ్ళమూడిలో ఉంటూ ఈ గ్రంధమును పూర్తి గావించాను.

స్వరశాస్త్రం పైన గ్రంధాన్ని వ్రాయమని చాలామంది నన్ను గతంలో కోరారు. ప్రస్తుతం కూడా కోరుతున్నారు. అందువల్ల నా కలం నుండి వెలువడుతున్న 61 వ గ్రంధంగా ఈ గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను.

ఇది నా అభిమాన టాపిక్స్ లో ఒకటి. చాలా చిన్నవయసులో ఈ సబ్జెక్ట్ ను నేను అధ్యయనం చేయడం జరిగింది. అప్పటినుండి ఇది నా అభిమాన విషయాలలో ఒకటిగా మారింది. దానికి కారణాలున్నాయి.

మార్షల్ ఆర్ట్స్ కు, శ్వాస సాధనకు, ప్రాణనిగ్రహానికి ఉన్న సంబంధము, స్వరశాస్త్రం పైన నాకున్న అభిమానాన్ని పెంచింది. జ్యోతిష్యశాస్త్రానికి స్వరశాస్త్రానికి ఉన్న సంబంధం ఆ అభిమానాన్ని ఇంకా ఎక్కువ చేసింది. శ్వాస పైన అదుపు లేకుండా యోగసాధన లేదు. కనుక, యోగశాస్త్రంలో ఇది కోర్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు.

ఈ గ్రంధం తంత్రసాహిత్యానికి చెందినది. మధ్యయుగాలలో ఈ గ్రంధము రచింపబడినప్పటికీ, దీనిలోని భావనలు, అభ్యాసములు అంతకుముందు ఎన్నో వేలఏండ్ల క్రిందటివి.

మనదేశంలో ముస్లిం దురాక్రమణ దారులు జరిపిన రాక్షస విధ్వంసకాండలో ఇటువంటి ఎన్నో వేలాది గ్రంధాలు నాశనమైనాయి. కోట్లాదిమంది హిందువులు, వేలాదిమంది గురువులు చంపబడ్డారు. గురుకులాలు, ఆశ్రమాలు, లైబ్రరీలు గోరీలదొడ్లుగా మార్చబడ్డాయి. ఆ అరాచక రాక్షస చర్యలనుండి బ్రతికి బట్టగట్టిన అమూల్యములైన గ్రంధాలలో ఇదీ ఒకటి.

ఈ గ్రంధం ఈనాడు మనకు లభిస్తూ ఉండటం మన అదృష్టమని చెప్పుకోవాలి. ఇన్నేళ్లకు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా సుకృతమని భావిస్తున్నాను.

ఈ గ్రంధంలో చెప్పబడిన కొన్ని విధానములు నా సుదీర్ఘ ఉద్యోగపర్వంలో నన్ను ఎంతో ఆదుకున్నాయి. అవినీతితో నిండి, అడుగడుగునా నక్కలు తోడేళ్ళ వంటి మనుషులున్న రైల్వేవ్యవస్థలో, కులపిచ్చితో, వ్యక్తిగత దురహంకారాలతో నన్ను హింసపెట్టి నా రికార్డ్ పాడుచేయాలని చూచిన పై అధికారులతో వ్యవహరించేటపుడు ఈ స్వరశాస్త్ర విధానములను ఉపయోగించి సత్ఫలితములను పొందాను. 

అదేవిధంగా, చిన్నాపెద్దా అనారోగ్యములు కలిగినపుడు, కలుగబోతున్నపుడు, స్వరశాస్త్రమును ఉపయోగించి వాటిని తేలికగా నివారించుకోగలిగాను. 

కనుక ఇది నిత్యజీవితంలో ఆచరణాత్మకంగా ఎంతో ఉపయోగపడే శాస్త్రమని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు శ్రీలలిత, అఖిలలకు, శిష్యులు ప్రవీణ్, శ్రీనివాస చావలి లకు నా ఆశీస్సులు.

మా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి వచ్చిన మిగిలిన గ్రంధములను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను.

త్వరలో మా ఆశ్రమంలో జరుగబోయే రిట్రీట్స్ లో ఈ స్వరశాస్త్రము యొక్క ప్రాక్టికల్ ఉపయోగాలను నా శిష్యులకు ఆచరణాత్మకంగా నేర్పించడం జరుగుతుంది.

read more " మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల "

17, ఆగస్టు 2023, గురువారం

ఆ రొచ్చు నాకొద్దు

యధావిధిగా మా ఫ్రెండ్ ఉదయాన్నే ఫోన్ చేశాడు.

నేను రిటైరయ్యాను. తనింకా సర్వీస్ లో ఉన్నాడు. ఇంకో నాలుగు నెలలలో తనూ రిటైర్ అవుతాడు.

ఆమాటా ఈ మాటా మాట్లాడాక, 'ఫలానా వాడి గురించి తెలిసిందా?' అని అడిగాడు.

ఈ ఫలానా అనే అతను కూడా నాతోబాటే రిటైరయ్యాడు.

నేను రైల్వే వదిలేసి ఏడాది దాటింది. సర్వీసులో ఉన్నప్పుడే ఆ రొచ్చు రాజకీయాలకు నేను దూరంగా ఉండేవాడిని. ఇక ఇప్పుడెందుకు? రైల్వే పక్షులతో నాకేంటి పని? పట్టించుకోవడం మానేశాను.

'ఏం పోయాడా?' అన్నాను.

'ఛీ అదేం కాదు. రిటైరయ్యాక, ఒక తెలిసినాయని పట్టుకుని ప్రెవేట్ ఉద్యోగంలో చేరాడు. హైద్రాబాద్ లో ఫ్రీ క్వార్ట్రర్స్. ఫ్రీ కారు. నెలకు లక్ష జీతం' అన్నాడు.

'మంచిదే' అన్నాను.

'నువ్వూ ట్రై చెయ్యచ్చుగా' అన్నాడు.

'నాకంత  పరిగెత్తాలని లేదు. నన్నిలా బ్రతకనీ' అన్నాను.

'అలాకాదు. ఊరకే కూచునే బదులు కాసేపు ఆఫీసుకి పోయి వస్తే లక్ష వస్తుంది కదా? ఎందుకు పోగొట్టుకోవడం?' అన్నాడు.

తను చెప్పేది వాస్తవమే. అలా చేస్తున్న వాళ్ళు మా కొలీగ్స్ లో చాలామంది ఉన్నారు.

'జీవితంలో అతని గోల్స్ వేరు. నా గోల్ వేరు. నేనేమీ ఊరకే కూచుని లేను. చేయవలసిన  సాధన ఎంతో ఉంది. జీవితమనేది ఒక్క డబ్బు కోసమే కాదు. చచ్చేదాకా డబ్బుకోసం నేను బ్రతకలేను. ఆ వెట్టిచాకిరీ నాకొద్దు. నీకు ఆశ ఉంటే నాలుగు నెలల తర్వాత నువ్వు ట్రై చెయ్యి' అన్నాను.

'ఊరకే చెప్పాను. నాకూ అంత అవసరం ఏమీ లేదులే' అన్నాడు.

'మంచిది. ఎవరి జీవితం వారిది. ఎవరి గోల్స్ వారివి. అందరూ  ఒకేలాగా ఎలా ఉంటారు? డబ్బుకు మితం ఎక్కడుంది? ఎక్కడో ఒకచోట 'ఇకచాలు' అంటూ నువ్వు గీత  గీసుకోక తప్పదు. లేకపోతే, ఆ పరుగులో ఏదో ఒకరోజున ఆఫీస్ టేబుల్ ముందే హార్ట్ ఎటాక్ తో పోవలసి వస్తుంది. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాం కదా మన సర్వీసులో. అలాంటి జీవితం నాకొద్దు. ఎందుకా బ్రతుకు?' అన్నాను.

'సర్లే నీ భావాలు అందరికీ నచ్చవు' అన్నాడు ఫ్రెండ్.

'నచ్చాలని నేనేమీ చెప్పడం లేదు. అలా ఆశించడమూ లేదు. కాస్త కళ్ళు తెరిచి జీవితాన్ని విశాలంగా చూడమని మాత్రమే అంటున్నాను. బావిలో కప్పలాగా చివరిక్షణం వరకూ డబ్బు, సుఖాలు అంటూ బ్రతకవద్దని మాత్రమే అంటున్నాను. అంతే' అన్నాను.

'ఉంటామరి' అని ఫోన్ పెట్టేశాడు ఫ్రెండ్.

నవ్వుకుంటూ నా పనిలో పడ్డాను.

read more " ఆ రొచ్చు నాకొద్దు "

15, జులై 2023, శనివారం

చేపలు తినేవాళ్లు దైవాత్ములెలా అవుతారు? ఇస్కాన్ స్వామీజీల అజ్ఞానం

వివేకానందస్వామి చేపలు తిన్నారు గనుక ఆయన దివ్యాత్ముడు కాదని ఇస్కాన్ కు చెందిన అమోఘ్ లీలాదాస్ అనే సాధువు అన్నాడు. అంతేగాక, వివేకానందుల గురువైన శ్రీ రామకృష్ణులను కూడా విమర్శించాడు. శ్రీ రామకృష్ణులు 'యతో మత్ తతో పథ్' అని బెంగాలీలో అనేవారు. అంటే, 'ఎన్ని మతములో అన్ని మార్గాలు (మతాలన్నీ ఒకే దైవాన్ని చేరే వేర్వేరు దారులు)' అని అర్ధం. ఇది సరికాదని, అన్ని మతాలు ఒకే చోటకు చేర్చవని అమోఘ్ లీలాదాస్ అన్నాడు. ఈ వ్యాఖ్యను ఆయన బెంగాల్లోని పానీహాటి అనే ఊర్లో ఒక మీటింగులో మాట్లాడుతూ చేశాడు. దానితో పెద్ద గొడవ చెలరేగింది.

బెంగాల్లో రామకృష్ణులను ప్రతి ఇంటిలోనూ పూజిస్తారు. పూజామందిరంలో ఆయన ఫోటో లేని ఇల్లు ఆ రాష్ట్రంలో ఉండదు. ఇక వివేకానందస్వామి అంటే చెప్పనే అక్కర్లేదు. కలియుగంలో ఆయన లేని హిందూమతాన్ని ఊహించలేం. ఈ వ్యాఖ్యలతో బెంగాలీలు మండిపడ్డారు. దుమారం రేగింది. ఇస్కాన్ దిగి వచ్చింది. లీలాదాస్ ను నెలపాటు సస్పెండ్ చేసింది. ఎవరికీ ముఖం చూపకుండా ఏకాంతవాసం చెయ్యమని ఆదేశించింది. ఆయన సరేనంటూ బృందావనం వెళ్ళిపోయాడు.

బేలూర్ మఠాన్ని దర్శించి  రామకృష్ణా మిషన్ కు క్షమార్పణ చెబుతామని ఇస్కాన్ ప్రకటన చేసింది. ఇది మంచి నిర్ణయం. అసలైన విజ్ఞతకు ఇది నిదర్శనం.

ఈ అమోఘ్ లీలాదాస్ అనే సాధువుకు దాదాపు 41 ఏళ్ళుంటాయి. ఈయన ఒక సాఫ్ట్ వేర్ నిపుణుడు. ముప్పై ఏళ్ల వయసులో ఇస్కాన్ లో చేరాడు. ప్రస్తుతం ద్వారకా నగరం లోని ఇస్కాన్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. యూట్యూబ్ లో మంచి పేరున్న వక్త. కానీ, నోరు జారిన పాపానికి ఈ శిక్ష పడింది. మంచిదే.

చేతిలో మైకుంది కదా అని, యూ ట్యూబ్ సెలెబ్రిటీని కదా అని, నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు.  రామకృష్ణ వివేకానందుల స్థాయిని లీలాదాస్ లాంటి కుర్రసన్నాసులు అర్ధం చేసుకోలేరు. అంత నోటి దూలగా ఉంటే, చాపక్రింద నీరులాగా పాకుతున్న క్రైస్తవం పైనా,  జిహాద్ పేరుతో నానా ఘోరాలు దౌర్ణన్యాలు నేరాలు చేస్తున్న ఇస్లాం పైనా మాట్లాడి ఉండవలసింది.  అంతేగాని, తనకు అర్ధం కాని స్థాయి మనుషుల గురించి ఈ విధంగా మాట్లాడటం లీలా దాస్ చేసిన ఘోరమైన తప్పు.

ప్రస్తుతం జరగవలసిన యుద్ధం క్రైస్తవం పైనా, ఇస్లాం పైనా మాత్రమే. ప్రతి ఒక్కరికీ ఈ రెండు మతాలు భారతదేశానికి చేస్తున్న ద్రోహం ఏమిటో తెలియాలి. ఇవి ఎలాంటి విషపు మతాలో, ఎలాంటి విష ప్రచారాలు చేస్తున్నాయో తెలియాలి. ఆ కోణంలో అందరికీ సమాచారం అందాలి., చర్చలు జరగాలి. జ్ఞానం పెరగాలి. అంతేగాని ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలు చెయ్యకూడదు.

లీలాదాస్ లాంటి మనుషులకు కొన్ని విషయాలు గుర్తు చెయ్యదలుచుకున్నాను.

1. మనం అవతార పురుషులుగా పూజించే శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ఇద్దరూ మాంసాహారులే. ఇస్కాన్ వాళ్ళు జపించే 'హరేరామ హరేకృష్ణ' మహామంత్రంలో వీళ్ళిద్దరే ఉంటారు.

2.  అహింసామూర్తి అని లోకంలోని అజ్ఞానులు చాలామంది భావించే బుద్ధుడు మాంసాహారి. పందిమాంసం  తినడం వల్ల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ తో బుద్ధుడు చనిపోయాడు.

3. మన ప్రాచీన ఋషులందరూ మాంసాహారులే.

మాంసం తింటేనే దైవత్వం వస్తుంది అనేది నా ఉద్దేశ్యం కాదు. తిండికీ దైవత్వానికి సంబంధం లేదని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఇంకా సాధకదశలో ఉండి, తపస్సు చేస్తున్న వాళ్ళు ఆహారనియమం తప్పక పాటించాలి. సిద్ధస్థితిని పొందినవారికి ఈ నియమం వర్తించదు. ఈ విషయం లీలాదాస్ కు తెలియదు లాగుంది.

రామకృష్ణ, వివేకానందుల జీవితాలను లీలాదాస్ లాంటి వాళ్ళు ముందు శ్రద్దగా చదవాలి. ఆ తరువాత మాట్లాడాలి.

'నరేంద్రుడు (వివేకానందస్వామి) స్నేహితులతో కలసి ఒక హోటల్లో చికెన్ తిన్నాడు' అని శ్రీ రామకృష్ణులతో ఇంకొక శిష్యుడు ఫిర్యాదు చేస్తాడు.

'నరేంద్రుడు అగ్ని వంటివాడు. అగ్నిని ఏదీ అపవిత్రం చేయలేదు. అందులో పడిన ప్రతిదీ భస్మం అయిపోతుంది' అని శ్రీ రామకృష్ణులు జవాబిచ్చారు.

అంతేకాదు. ఆయన ఆ వ్యక్తితో ఇలా అన్నారు, 'ఇదే పనిని నువ్వు చేసి ఉంటే, జన్మలో మళ్ళీ నీ ముఖం చూసి ఉండేవాడిని కాను'.

సద్గురువులు అందరికీ ఒకే నియమం పెట్టరు. ఎవరి స్థాయి ఏమిటో చూచి దానికనుగుణంగా వారికి నియమాలను నిర్దేశిస్తారు. నరేంద్రుడు సప్తఋషులలో ఒకడని, ధర్మోద్ధరణ కోసం తనతో ఈ భూమికి దిగి వచ్చాడని శ్రీ రామకృష్ణులు అనేకసార్లు అనేవారు. సప్తఋషులంటే సామాన్యులు కారు. భగవంతునికి ఉన్న శక్తులు వీరికి కూడా ఉంటాయి. వారు శాపానుగ్రహ సమర్థులు. సంకల్పమాత్రంతో ఎదుటి మనిషి తలవ్రాతను మార్చగల శక్తి వారికి ఉంటుంది. వివేకానంద స్వామిది ఆ స్థాయి.

వివేకానందుడు చేపలు తిన్నాడని, బుద్ధుడు పందిమాంసం తిన్నాడని మనం కూడా ట్రై చెయ్యకూడదు. శంకరులు, బ్రహ్మంగారు మద్యం త్రాగారని మనం త్రాగకూడదు. మనం వాళ్ళతో సమానం కాము, కాలేము. లీలాదాస్ అసలే చెయ్యకూడదు. ఆయన మరమరాలు తిని, నీళ్లు త్రాగి  మాత్రమే జీవించాలి. అప్పుడే ఆ నోటి దూల తగ్గుతుంది.

వివేకానంద స్వామి చేపలు, చికెన్ తిన్నది నిజమే. అయితే, ఉత్త మంచినీళ్ళు మాత్రమే త్రాగుతూ వారం రోజులపాటు నిరాహారిగా కూడా ఆయన ఉన్నాడు. శ్రీ రామకృష్ణుల నిర్యాణం తరువాత, పరివ్రాజకదశలో దేశమంతా తిరుగుతున్న దశలో ఇది జరిగింది. హిమాలయాలలో ఉన్నపుడు ఎన్నో రోజులపాటు ఆహారం దొరకని స్థితిలో ఆయనున్నాడు. ఈ విషయాలు లీలాదాస్ తెలుసుకోవాలి.

ఇస్కాన్ సాధువులకు, భక్తులకు మరొక్క విషయం గుర్తు చేస్తాను.

వారు పరమపవిత్రంగా, సాత్వికాహారంగా భావించే ఆవుపాలు కూడా సైన్స్ ప్రకారం మాంసంతో సమానమే.  పాలు వెజిటేరియన్ డైట్ కాదు. అది జంతువు నుండి వచ్చిన ఆహారం, పాలను సైన్స్ 'లిక్విడ్ మీట్' అంటుంది. పాలు త్రాగుతూ, అదేదో గొప్ప ఆహారనియమమని, సాత్వికాహారం తింటున్నామని అనుకునే వారు పిచ్చి భ్రమలో ఉన్నట్లే. మాంసం తినేవారికి, పాలు త్రాగేవారికీ పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే వీగన్స్, పాలతో సహా అన్ని రకాలైన జంతు ఉత్పత్తులకూ దూరంగా ఉంటారు.

టెక్నికల్ గా చూస్తే,  పాలతో చేసిన స్వీట్లు,  పాలకోవా మొదలైనవి కూడా మాంసాహారంతో సమానమే.

పైగా, దూడలకు అవి తాగినన్ని పాలు ఉంచనిస్తే, మనం త్రాగడానికి పాలెలా వస్తాయి? కాబట్టి మనం త్రాగుతున్న పాలన్నీ దూడల నోటి దగ్గర కూడే. అవి త్రాగవలసిన పాలను, మనం లాక్కొని త్రాగుతున్నాం. సత్యంగా చెప్పాలంటే ఇది మహాపాపాల్లో ఒకటి. మరి పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించే ఇస్కాన్ సాధువులు, భక్తులు అందరూ మహాపాపం చేస్తున్నట్లే. 

చేపలు తిన్నంత మాత్రాన దైవత్వం దూరమైతే, పాలు త్రాగేవారికి, స్వీట్లు తినేవారికి మాత్రం అదెలా వస్తుంది?

మరోమాట !

బెంగాల్ శక్తి ఉపాసనకు నిలయం. కాళికాదేవికి మాంసాన్ని నైవేద్యంగా పెడతారు. భైరవునికి మద్యాన్ని నైవేద్యం పెడతారు. అదీగాక, బెంగాల్లో చేపలను శాకాహారంగా భావిస్తారు. అక్కడ బ్రాహ్మణులు కూడా చేపలను తింటారు. చేప కూర లేనిదే బెంగాలీలకు, వారు ఏ కులం వారైనా, పూట గడవదు.

ప్రాచీనకాలంలో బ్రాహ్మణులందరూ మాంసాహారులే. మధ్యయుగాల లోనే వారు శాకాహారులయ్యారు.

అసలు ఏ ప్రాణినీ హింసించకూడదంటే, ఉత్తగాలిని మాత్రమే పీల్చి బ్రతకాలి. ఇంకా చెప్పాలంటే, ఆ గాలిలో కూడా కొన్ని సూక్ష్మజీవులుంటాయి. అవీ చనిపోతాయి. నీళ్లలో బోలెడన్ని సూక్ష్మజీవులుంటాయి. నీటిని త్రాగితే అవికూడా చనిపోతాయి. కనుక, అహింసను నిక్కచ్చిగా పాటించాలంటే, మనం చనిపోవడం ఒక్కటే దారి. అంతకంటే వేరే మార్గం లేదు.

అహింసయే పరమధర్మం అనుకునే పనైతే లీలాదాస్ అర్జంటుగా కృష్ణభక్తిని విడిచిపెట్టి జైన సాధువుగా మారాలి. ఏమంటే,  ఒక్క జైనసాధువులు మాత్రమే, బ్రతికుంటే ఏదో ఒక జీవిని చంపవలసి వస్తుంది కాబట్టి,  ప్రాయోపవేశం అనే దీక్షను పట్టి ఉపవాసం ఉంటూ తమంతట తాముగా చనిపోతారు. కానీ ఇది కూడా అత్యున్నతమైన జ్ఞానానికి సూచిక కాదు. దీనిని బుద్దుడు నిరసించాడు. ఆత్మహత్య మహాపాపమని సనాతన ధర్మం కూడా అంటుంది. 

కాబట్టి తత్త్వం సరిగ్గా అర్ధం కావడం అనేది యూ ట్యూబ్ లో వీడియోలు పెట్టినంత చీప్ విషయం ఏమీ కాదు.

'కాషాయం కట్టినంత మాత్రాన తత్త్వం అర్ధం కాదు' అనడానికి అమోఘ్ లీలాదాస్ లాంటి కుర్రసాధువులే ఉదాహరణ. యూ ట్యూబ్ మాయలో పడి, కామెంట్లు లైకులు చూసుకుంటూ అదే ఏదో గొప్ప విజయంగా భావిస్తున్నంతవరకూ నిజమైన సన్యాసం ఎలా వంటపడుతుంది మరి?

బృందావనంలో ఉంటూ నెలరోజులు మౌనవ్రతం పాటించినంత మాత్రాన ఎవరికీ జ్ఞానోదయం కాదు. అలా అయ్యే పనైతే, ఈపాటికి వేలాది లక్షలాది జ్ఞానులు ఎప్పుడో తయారై ఉండేవారు. జీవితాంతం అక్కడ ఉంటున్నవాళ్లకే దిక్కూ దివాణం లేదు. ఒక్క నెలకే ఏమొస్తుంది లీలా దాస్?

అసలు వాక్కు మీద అదుపు రాకుండానే ఈయనకు సన్యాసం ఇచ్చిన ఇస్కాన్ గురువులది తప్పు. ఇప్పుడు ఆన్లైన్ దీక్షలు, ఆన్లైన్ సన్యాసం కూడా వచ్చాయట ఆన్లైన్ మోక్షం ఒక్కటే తక్కువ. కలిమాయలలో ఇదీ ఒకటి !! 

బృందావనంలో మౌనదీక్షకు బదులుగా, మా ఆశ్రమంలో నెలపాటు మా అతిథిగా ఉంటే చాలు. అసలైన ఆధ్యాత్మికత ఏమిటో రుచి చూపిస్తాను. ప్రయత్నించమని లీలాదాస్ కు ఆఫర్ ఇస్తున్నాను.

ఆయనకు నిజంగా జ్ఞానోదయమే కావాలి అనుకుంటే ఇది సువర్ణావకాశం. ఉత్త యూ ట్యూబ్ సెలబ్రిటీ స్టేటస్ చాలు అనుకుంటే ఆయనిష్టం.

శాకాహారం జ్ఞానసిద్ధికి సూచిక కాదు. అలాగని మాంసాహారాన్ని మానలేని వారికి జ్ఞానం ఎన్ని జన్మలకూ కలగదు.

ఇంత చిన్న విషయం అర్థం కావడానికి పెద్ద జ్ఞానం ఏమీ అవసరం లేదు.
read more " చేపలు తినేవాళ్లు దైవాత్ములెలా అవుతారు? ఇస్కాన్ స్వామీజీల అజ్ఞానం "

1, జులై 2023, శనివారం

మా ఆశ్రమంలో మొదటి గురుపూర్ణిమ ఉత్సవం

ఈ ఊళ్ళో సాయిబాబా గుడులు ఒకటో రెండో ఉన్నాయి. వాటినుండి ఎవరో ఒక పాంప్లెట్ ను నాకు తెచ్చిచ్చారు. ఎల్లుండి గురుపూర్ణిమ గనుక ఆ సందర్భంగా గుళ్ళో జరిగే కార్యక్రమం వివరాలు అందులో ఉన్నాయి.

గత వారం నుండి సాయిబాబా గుడిలో సప్తాహం  జోరుగా జరుగుతోంది. మైకులు రాత్రి పగలూ మోగుతున్నాయి. దాని ముగింపుగా గురుపూర్ణిమనాడు తెల్లవారుజామునుండి రాత్రివరకూ అనేక కార్యక్రమాలు, పూజలు, భజనలు, వ్రతాలు, సన్మానాలు గట్రా అందులో రాయబడి ఉన్నాయి.

అప్పుడు గుర్తొచ్చింది. 

మొన్నొకరోజున ఆశ్రమానికి పోతుంటే ఒకామె ఎదురైంది. పట్టుచీరలో హడావుడిగా వెళుతోంది.

'ఎక్కడికండి అంత హడావుడిగా వెళుతున్నారు?' అడిగాను

'సాయిబాబా భజన ఉందండి. సప్తాహం జరుగుతోంది కదా. మా బ్యాచ్ భజనకు టైమైంది. అందుకే పరిగెత్తుతున్నాను' అందామె.

'మీరు రామనామ భజనలు చిన్నప్పటి నుండి చేస్తానని చెప్పినట్లు గుర్తు. సాయిబాబా భజన కూడా చేస్తారా?' అడిగాను నవ్వుతూ.

'ఏముందండి? అంతా ఒకటే కదా? ఏ దేవుడైతే  ఏమైంది?' అందామె కొంచం ఇబ్బందిగా.

నాకు 'ఎవడైతే నాకేంటి?' అనే సినిమా గుర్తొచ్చింది.

'అలాగా? అయితే వచ్చే వారం ఏసు భజన కూడా  ఉంటుందా?' అన్నాను మళ్ళీ నవ్వుతూ.

'ఇంకా అంత ఎదగలేదు లెండి' అందామె వెళ్ళిపోతూ

'ఏ ఎదుగుదలనూ మధ్యలో ఆపకూడదండి. ఆ కాస్తా కానివ్వండి, అద్భుతంగా ఉంటుంది' అన్నాను 

ఆమె  వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయింది.
    
భజనకదా, లేటవ్వకూడదు. 

జాలేసింది.

మళ్ళీ ఈ పాంప్లెట్ కూ జాలేసింది. ఈ మనుషులంతా ఇంతేనేమో? ఎప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి?

అతనితో ఇలా చెప్పాను.

'రావడం కుదరదండి. మా ఆశ్రమంలో కూడా ఆ రోజున అనేక కార్యక్రమాలుంటాయి కదా ' అన్నాను

'ఏమేముంటాయి?' అన్నాడాయన.

'మీ అంత గొప్పగా ఉండవనుకోండి. కానీ మీకూ మాకూ ఒక కామన్ విషయం ఉంది. మన వ్యాసమహర్షిని, నారదమహర్షిని, శుకమహర్షిని, వాల్మీకిమహర్షిని, సప్తఋషులను, త్రిమూర్తులను, శంకర, రామానుజ, మధ్వ, నింబార్క, చైతన్య, రామకృష్ణ, వివేకానందులను, మన దీక్షాగురువులను, విద్యలు నేర్పించిన గురువులను  అందరినీ కట్టగట్టి మర్చిపోవడంలో మీరూ మేమూ ఒకటే. ఎంతైనా మనమంతా హిందువులం కదా !  మన ధర్మాన్ని సంప్రదాయాలను గాలికొదిలెయ్యడంలో మనం మనం ఒకటే.

కాకపోతే  ఏదో మాకు చేతనైనంతలో కాస్త డిఫరెంట్ గా గురుపూర్ణిమను చేసుకుంటున్నాము' అన్నాను.

'అదే ఏంటో చెప్పచ్చు కదా?' అన్నాడాయన.

'అబ్బే చెప్పకూడనంత ఏమీ లేదు. చాలా సింపుల్. తెల్లవారుజామునే సులేమాన్ సుప్రభాతంతో కార్యక్రమం మొదలౌతుంది. దాని తర్వాత ఔరంగజేబు అష్టోత్తరం, షాజహాన్ సహస్రనామాలతో పూజలుంటాయి. ఆ తర్వాత అక్బరుకు ఆకుపూజ, బాబరుకు భజన ఉంటుంది. మధ్యాన్నం పిచ్చితుగ్లక్ వ్రతం,  దాని తర్వాత మాలిక్కాఫర్ మంత్రపుష్పం.  'అల్లాహో అక్బర్' అనే మహామంత్రం కోటిసార్లు పారాయణతో పూర్ణాహుతి ఉంటాయి. ఆ పైన మైకులో పెద్దగా అరుస్తూ అజాన్ చదువుతూ గోడకు హారతి ఇవ్వడంతో ఉదయపు కార్యక్రమం ముగుస్తుంది.

ఆ తర్వాత మహమ్మద్ గజనీ, గోరీలను భక్తితో స్మరించుకుంటూ మూడు నిముషాలు మౌనం పాటిస్తాం. తదుపరి హలాల్ చెయ్యబడిన మటన్ బిర్యానీ ప్రసాదవితరణ అందరికీ చెయ్యబడుతుంది. వెజిటేరియన్ ఆప్షన్ లేదు. సారీ ఏమనుకోకండి.

సాయంత్రం అజ్మీర్ బృందం వారిచే హుషారైన భక్తిగీతాలతో ఖవ్వాలీ కార్యక్రమం. తదుపరి పాకిస్తాన్ టెర్రరిస్ట్ బృందానికి శాలువాలు కప్పి ఘనసన్మానంతో ఆనాటి గురుపూర్ణిమ మహోత్సవం దిగ్విజయంగా ముగుస్తుంది.

ఇదీ మా కార్యక్రమం. చూశారుగా ఎంత బిజీ షెడ్యూలో? అందుకని మీ గుళ్లో పూజలకు మేము రాలేము. సారీ. ఏమనుకోకండి' అని చెప్పాను.

'వాళ్ళందరూ ఎందుకు?' అడిగాడు

'కోరికలు త్వరగా తీరతాయి. వాళ్ళందరూ కూడా సెయింట్సే. అందరిలోకి ఔరంగజేబు చాలా పెద్ద సెయింట్. నవ్వులాట కాదు. మదాని మొన్న అదే అన్నాడు. కోట్లాది ముస్లింల నమ్మకం కూడా ఇదే. సాయిబాబా గతజన్మలో ఔరంగజేబు సైన్యంలో సైనికుడే. ఈ సంగతి స్వయానా మెహర్ బాబానే చెప్పాడు. చదవండి అర్థమవుతుంది. కాబట్టి ఈ సెయింట్స్ అందర్నీ ప్రార్థిస్తే మీ కోరికలు ఇంకా ఫాస్ట్ గా తీరతాయి. ఎలా అయితేనేం?  ఎవరైతేనేం? మనక్కావలసింది మన కోరికలు తీరడం. అంతేకదా? మనధర్మం ఎటుపోతే మనకెందుకు? అన్నాను.

అతనికి అర్ధమైనట్టు నాకనిపించలేదు. కనీసం మీకైనా అర్థమైందా?

ఇంతకంటే గొప్పగా గురుపూర్ణిమను మనం మాత్రం ఎలా జరుపుకోగలం చెప్పండి?

కాదంటారా?
read more " మా ఆశ్రమంలో మొదటి గురుపూర్ణిమ ఉత్సవం "

21, జూన్ 2023, బుధవారం

International Yoga Day 2023






రోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం. నేటినుండి దక్షిణాయన పుణ్యకాలం మొదలు కావడమే ఈ కార్యక్రమానికి ఈ తేదీని మనం ఎంచుకోవడానికి గల కారణం.

ఈరోజున పంచవటి యోగాశ్రమంలో యోగా రిట్రీట్ జరపాలని అనుకున్నాం. కానీ అనుకున్న సమయానికి ఆశ్రమం పనులు పూర్తికానందున ఈ రిట్రీట్ జరుపలేకపోయాం. అయినా పరవాలేదు. ' నువ్వు పెట్టినది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం ' అనే జిల్లెళ్ళమూడి అమ్మగారి మాటను మేం అనుసరిస్తున్నాం.

నా శిష్యులు ఎక్కడున్నప్పటికీ, అది ఇల్లైనా, ఆశ్రమమైనా ఇంకెక్కడైనా, యోగపరమైన సాధనామయమైన జీవితాలను గడపమని నేనెప్పుడూ చెబుతాను. అదే క్రమంలో భాగంగా నేడు వారివారి ఇళ్లలో ఉన్న పంచవటి సభ్యులు మా యోగాభ్యాస క్రమాన్ని అభ్యాసం  చేశారు. ఆ ఫోటోల కొలెజ్ లను ఇక్కడ చూడవచ్చు.

యోగశాస్త్రం ఎంతో విశాలమైనది. ఎంతో లోతైనది. మహనీయులందరూ దాని సాయంతో ఉత్తీర్ణులైనవారే. దానిలో ఎన్నో మెట్లున్నప్పటికీ, ఎన్నో క్రియలు, అభ్యాసాలు, సాధనలు ఉన్నప్పటికీ, మొదటిమెట్టు మాత్రం ఆసనాల అభ్యాసమే. యోగంలోని ఉన్నతస్థాయి అభ్యాసాలను అందరూ చెయ్యలేక పోవచ్చు. చెయ్యలేరు కూడా. కానీ కొద్ది అభ్యాసంతో ఆసనాలను అందరూ చెయ్యవచ్చు,

నేడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు న్యూయార్క్ లో 175 దేశాల సభ్యులతో ఐక్యరాజ్యసమితిలో యోగాభ్యాసం చేయిస్తున్నారు. ప్రపంచమంతా నేడు యోగా  చేస్తున్నది. ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం ఇండియా వైపు చూస్తున్నది.

కానీ మన ఇండియాలోనే యోగాను  చాలామంది చెయ్యడం లేదు. ఇక్కడే దీనిని వ్యతిరేకించే దుష్టశక్తులున్నాయి. కరుడుగట్టిన ఇస్లామిక్ వాదులు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, నాస్తికులు, సెక్యులరిస్టులు ఈ గుంపులో ఉంటారు. ప్రపంచమంతా ఒప్పుకుంటున్న యోగాను ఒప్పుకోకపోవడం వీళ్ళ ఖర్మ.

ప్రపంచ క్రైస్తవదేశాలన్నీ యోగా చేస్తున్నాయి, ఒక్క ఇండియన్ క్రిస్టియన్స్ తప్ప. ఒక్క సౌదీని, పాకిస్తాన్, మలేషియా  దేశాలను మినహాయిస్తే మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ యోగాకు మద్దతు పలికాయి కానీ ఇండియన్ ముస్లిములు మాత్రం యోగాను ఒప్పుకోరు. ఇదెంటో అర్ధం కావడం చాలా తేలిక. రెండూ శాంతి మతాలే కదా! అందుకే వాటికి ద్వేషం ఎక్కువ !

ఏదేమైనప్పటికీ, 'పంచవటి'లో మాత్రం యోగా అనేది మా జీవనవిధానంగా ఎప్పటినుంచో ఉంది. యోగా అనేది ప్రపంచానికి ఇండియా ఇచ్చిన వరాలలో అతి ముఖ్యమైనది. ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి కృషివల్ల నేడిది అంతర్జాతీయ పండుగ కావడం చాలా సంతోషకరంగా ఉన్నది.

జూలై నెలాఖరుకు మా ఆశ్రమం ఒక కొలిక్కి రావచ్చు. ఆ తరువాత మా ఆశ్రమంలో  మొట్టమొదటి రిట్రీట్ గా మూడురోజుల యోగా రిట్రీట్ జరుగుతుంది. అప్పుడిక్కడ జరిగే మరిన్ని విశేషాలను మీరు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఈ కొలెజ్ లను చూడండి.

మీ అదృష్టం బాగుంటేనే మీరు యోగమార్గం లోకి, అందులోనూ సరియైన యోగమార్గం లోకి అడుగుపెడతారు. 

జై భారత్ ! జై హింద్ !

read more " International Yoga Day 2023 "

1, మే 2023, సోమవారం

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన

నిన్న వైశాఖ శుద్ధ దశమి.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగా పిలువబడే బ్రహ్మంగారు సజీవ సమాధిలో ప్రవేశించిన రోజు. ఈ సంఘటన 1693 CE లో జరిగింది. ఈ సంఘటనను స్మరిస్తూ బ్రహ్మంగారి భక్తులు ప్రతి ఏడాదీ ఈ రోజున బ్రహ్మంగారి ఆరాధనను చేస్తారు. 

ఇక్కడ దొడ్డవరం గ్రామంలో బ్రహ్మం గారి భక్తులు చాలామంది ఉన్నారు. బ్రహ్మం గారి గుళ్ళు రెండు మూడున్నాయి. వాటిలో పాత గుడిలో నిన్నంతా ఆరాధనలు జరిగాయి. మొన్న రాత్రి బ్రహ్మంగారి పద్యనాటకం వేశారు. కుల మత భేదం లేకుండా, ఊరి జనాభా మొత్తానికీ రెండుపూటలు అన్నసంతర్పణ చేశారు.

ప్రసుతం మేము అద్దెకుంటున్న ఇంటివాళ్ళ పెద్దబ్బాయి ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ళ నుంచీ జరిపిస్తున్నాడు. ఇది ఎంతో మంచి విషయం. నాకు బాగా నచ్చింది.

ఒక మహాయోగిగా బ్రహ్మంగారిని నా చిన్నప్పటి నుంచీ నేను ఎంతో గౌరవిస్తాను. బ్రహ్మంగారి గురించి నేను మొదటిసారిగా 1976 లో తెలుసుకున్నాను. అప్పటికి ఒక ఏడాది ముందు 1975 లో రాజమండ్రిలో కొన్ని యోగాసనాలను 12 ఏళ్ళ వయసులో నేర్చుకున్నప్పటికీ, మొదటిసారిగా అన్ని ఆసనాలను ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర‘ అనే పుస్తకంలోనే 1976 లో చూశాను. అభ్యాసం మొదలుపెట్టాను. అప్పట్లోనే పల్లెటూర్లలో రాత్రంతా ప్రదర్శించే బ్రహ్మంగారి నాటకాన్ని చూడటం, ఆయన జీవితచరిత్రను చదవడం జరిగింది. యోగసాంప్రదాయంతో నా పరిచయం అలా మొదలైంది. అప్పటికీ ఇప్పటికీ 45 ఏళ్ళు గడిచాయి. నా యోగసాధన అనేక పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది. బ్రహ్మంగారి పైన నా గౌరవం  కాలంతో బాటు పెరుగుతూ వచ్చింది.

నేడు, మా ఆశ్రమం వచ్చిన దొడ్డవరం గ్రామంలో చూస్తే, బ్రహ్మంగారి గుడులు  మూడున్నాయి. ఆయన ఆరాధనను నిష్ఠగా చేసే గ్రామస్తులున్నారు. బ్రహ్మంగారి గుడి ఉన్న బొడ్డురాయి ప్రక్కనుంచే మా ఆశ్రమానికి పోయే దారి ఉంటుంది. ఇదంతా కాకతాళీయం కాదని నేను నమ్ముతున్నాను. 

బ్రహ్మంగారి చరిత్రను పరిశీలిస్తే, ఆయన తన సంచారంలో భాగంగా అద్దంకి, ధేనువకొండలకు వచ్చినట్లు తెలుస్తున్నది. ధేనువకొండ గ్రామం మాకు కేవలం పది నిముషాల దూరం మాత్రమే.

NTR తీసిన బ్రహ్మంగారి చరిత్ర సినిమాను నేను 1984 లో గుంతకల్ లో చూశాను. ఆ సినిమా షూటింగ్ రాయలసీమలోనే జరిగింది. ఆ షూటింగ్ లో నా తోటి ఉద్యోగులు కొంతమంది నటించారు కూడా. షూటింగ్ చూద్దామని వాళ్ళు కందిమల్లాయపల్లి వెళితే, నటులు తక్కువయ్యారని గ్రామస్తులుగా వేషాలు వీళ్ళకే వేయించి వీళ్ళనే  సినిమాలో పెట్టాడు NTR. ఆ సినిమాకు నేను పోయిన రోజున, గుంతకల్ లో ఉండే శ్రీ శంకరానందగిరి స్వాములవారు కూడా సినిమాహాలుకు వచ్చి బాక్స్ లో కూచుని ఆ సినిమాను చూచారు. నేను దర్శించిన బ్రహ్మజ్ఞానులలో ఆయన ఒకరు.

అయితే ఆ సినిమా నన్ను నిరాశపరచింది. NTR కు తోచిన రీతిలో ఆ సినిమా వాస్తవ వక్రీకరణకు గురయింది. అది నాకు నచ్చలేదు. జనాకర్షణ కోసం చరిత్రను మార్చాడాయన. 'అతి'నటన కూడా చేశాడు. అందుకే ఆ సినిమాను రెండవసారి నేను చూడలేదు. ఆ సినిమాను ఇంకా బాగా, వాస్తవాలకు దగ్గరగా తీసి ఉండవచ్చుననేది నా అభిప్రాయం. 

తరువాత నేను గుంటూరు డివిజన్ లో పనిచేసినప్పుడు, నంద్యాల యర్రగుంట్ల లైన్ వేస్తున్న సమయంలో, బనగానపల్లెలో బ్రహ్మంగారి సమాధిని దర్శించాను. వారి వంశస్తులను చూచి నిరాశ చెందాను. కారణం? ఆయన శక్తి వారిలో కనిపించకపోవడం.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమన్వయం చేసి  ఆచరణాత్మకమైన సిద్ధమార్గాన్ని రాయలసీమలోను, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల లోని పల్లెపట్టులలోను బహుళ ప్రచారం చేసిన మహాయోగిగా బ్రహ్మంగారిని నేను అమితంగా గౌరవిస్తాను. హిందూమతం యొక్క ఆచరణాత్మక యోగవిధానాలు గ్రామ్యప్రాంతాలలో ఇంకా బ్రతికి ఉన్నాయంటే అది బ్రహ్మంగారి చలవే. మా మార్గం కూడా అదే కాబట్టి మా ఆశ్రమంలోని ధ్యానమందిరంలో బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచబోతున్నాను. 

బ్రహ్మంగారిని ఆరాధించినంత వరకూ, SC, ST, BC లను క్రైస్తవం తాకలేకపోయింది. ఆయనను మరచిన తర్వాతనే పల్లెల్లో అది ఎక్కువైంది. ఇది వాస్తవం.

బ్రహ్మంగారి తత్త్వాలన్నా, బ్రహ్మంగారి నాటకమన్నా నాకు చాలా ఇష్టం. అందుకే మొన్న రాత్రి తెల్లవారుజాము 4 వరకూ, ఎద్దులబండి వేదికగా  ఇక్కడ సాగిన ఆ పద్యనాటకం నాకు చాలా ఆనందాన్ని కలిగించి, నా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది. తెలుగునాట పల్లెటూర్ల జీవితాన్ని మళ్ళీ ఆస్వాదించే అవకాశం ఇన్నాళ్ళకు మళ్ళీ నాకు ఈ విధంగా లభించింది.

పండితులలాగా ఉత్తమాటలు ఉపన్యాసాలు చెప్పడం కాకుండా, దైవశక్తిని, అమానుష యోగశక్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపి, కుల మతాలకు అతీతమైన వేదాంతతత్త్వాన్ని ఆచరణలో నిరూపించిన మహాయోగి - బ్రహ్మంగారు. అసలైన హిందూమతాన్ని నిలబెట్టినది ఇటువంటి మహనీయులే. సాంఖ్యము, తారక రాజయోగము, అమనస్కము, కుండలినీ యోగములకు ఆయన జీవితమే ప్రత్యక్ష నిదర్శనం.

అయితే, ఉత్తగా ఏడాదికొకసారి ఆయన ఆరాధనను చేసి ఊరుకోవడమో, లేదా ఆయనను తమ కులానికే పరిమితమైన మహనీయునిగా భావించి ఒక గుడి కట్టి ఒదిలేయడమో నేను హర్షించను. ఆయన చూపిన సమగ్రమైన యోగమార్గంలో నడచి ఆయా సమాధిస్థితులను డైరెక్ట్ గా అందుకోవడము, ఆయా అమానుష యోగశక్తులను సాధించి, అవసరమైతే ప్రదర్శించి చూపగలగడమే ఆయనకు మనం చేయగల అసలైన ఆరాధన అని నేను నమ్ముతాను. దానినే మా ఆశ్రమంలో అనుసరిస్తున్నాము. బోధిస్తున్నాము.  

ఆయన చూపిన యోగమార్గంలో నడుస్తున్న మేము, ఆయన ఆరాధింపబడుతున్న గ్రామానికి, ఆయన సంచరించిన ప్రాంతానికి చేరుకోవడం ఆయన అనుగ్రహం గానే భావిస్తున్నాను.

అందరూ నమ్ముతున్నట్లు వేమనయోగి రెడ్డికులానికి ప్రతీక అని, బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులానికి ప్రతీక అని నేను నమ్మను. వారిది యోగికులం. అది కులమతాలకు అతీతమైన ఋషికులం. నిజమైన మహనీయులందరిదీ అదే కులం.

అందుకనే, ఆచరణాత్మక యోగసాధనకు పెద్దపీటను వేసే మా ఆశ్రమంలో, శ్రీ రామకృష్ణులవారు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్లతో బాటు, బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచి పూజించబోతున్నాము. 

ఇదే మేము చేయబోతున్న బ్రహ్మంగారి ఆరాధన. ఈ ఆరాధన ఏడాది కొకసారి జరిగేది కాదు. అనుక్షణం జరిగేది. ఇదే అసలైన ఆరాధన అనేది మా నమ్మకం.

read more " శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన "

29, ఏప్రిల్ 2023, శనివారం

పరలోకం - నిత్యజీవం

క్రైస్తవ విషబోధలు తలకెక్కితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ ఈ మధ్యనే కెన్యాలో జరిగింది. Good News International Ministries అనే క్రైస్తవ సంస్థను స్థాపించిన పాల్ మెకంజీ తెంగే అనే పాస్టర్ ను ఈ నెల 15 వ తేదీన అరెస్ట్ చేశారు. కారణం? తిండీ నీళ్ళూ మానేసి చనిపోయేదాకా అలాగే ఉపవాసం ఉంటూ క్షీణించి క్షీణించి చనిపోతే, సరాసరి జీసస్ దగ్గరకు వెళతారని నూరి పోసి చాలామందిని ఈ పాస్టర్ చంపేశాడు. ఇతనికి 6౦౦ ఎకరాల చర్చ్ ప్రాపర్టీ ఉంది. అందులో పోలీసులు వెతుకుతుంటే ఎక్కడికక్కడ శవాలను పాతిపెట్టిన దిబ్బలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. ఇప్పటికి కనీసం 100 శవాలను తవ్వి తీశారు. వాటిలో ఎక్కువమంది చిన్నపిల్లల శవాలే ఉన్నాయి. వాళ్ళందరూ ఇతని మాటలు నమ్మి, తిండీ నీళ్ళూ మానేసి, క్షీణించి చనిపోయినవారే. 

2003 కు ముందు ఒక కారు డ్రైవరుగా పనిచేసిన ఈ పాల్ మెకంజీ, 2003 లో ఈ మిషనరీ సంస్థను స్థాపించి అతి త్వరలో వేలాదిమందిని ఆకర్షించాడు. ఇతని బోధనలు ముఖ్యంగా Dooms Day చుట్టూ తిరిగేవి. అంటే, త్వరలో భూమి అంతం కాబోతున్నదని, జీసస్ ను నమ్మితే స్వర్గానికి వెళతారని, లేకపోతే నరకమే గతి అని నూరిపోసే బోధలన్నమాట. ఆ విధంగా భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, జీసస్ ను నమ్మేలాగా చెయ్యడం ఈ ప్లాన్ లో ఒక భాగం. ఇదే పిచ్చి ఇంకా ముదిరితే, చివరకు ఈ రకంగా సూయిసైడ్ చేసుకుని జీసస్ దగ్గరకు చేరుకోవాలని విషబోధలు ఈ క్రమంలో బోధిస్తారు. 

చెప్పగా చెప్పగా అబద్దాలను కూడా నిజాలుగా ఒప్పించవచ్చు. అమాయకులకు బ్రెయిన్ వాష్ చెయ్యవచ్చు. క్రైస్తవ పిడివాదులు గాని, ఇస్లామిక్ టెర్రరిస్టులు గాని తయారయ్యేది ఇలాగే.

ఇంతమంది అమాయకుల చావులకు కారకుడైన పాస్టర్ పాల్ మెకంజీ, అందరినీ ముందుగా పరలోకానికి పొమ్మని, తను మాత్రం చివరలో వస్తానని వాళ్ళకు చెప్పేవాడు. ఎందుకంటే, చివరలో తను స్వర్గం గేట్లు మూయాలట. లేకపోతే పాపులు లోపలికి వచ్చేస్తారట. ఈ విధంగా జనాన్ని మభ్యపెట్టేవాడు. ఇతని బోధలను నమ్మిన గొర్రెలు తమ ఆస్తులన్నీ అమ్మి ఇతని సంస్థకు డొనేషన్ క్రింద ఇచ్చేసేవారు. ఆ తరువాత పస్తులుండి చనిపోయేవారు. ఈ విధంగా అతను బాగా ఆస్తులను కూడబెట్టి కోట్లకు పడగలెత్తాడ. ఇప్పుడు అరెస్టయ్యాడు.

ఆ వివరాలన్నీ నెట్లో దొరుకుతాయి. ఇతనికి ఒక యుట్యుబ్ చానెల్ కూడా ఉంది. చూడండి. అర్ధమౌతుంది. అయితే, నేను చెప్పాలనుకున్నది అది కాదు. ముఖ్యంగా రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను.

ఒకటి, అమాయకులైన ప్రజలు ఏ విధంగా గొర్రెలుగా మారి ఇలాంటి పాస్టర్ల మాయలో పడుతున్నారు అనే విషయం.

రెండు, అసలు బైబిలు బోధల లోనే ఉన్న అబద్దాలు, లోపాలు ఏమిటన్న విషయం. ఈ రెండు విషయాలు నేను చెప్పబోతున్నాను.

కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలలో పేదరికం, చదువులేనితనం ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో ఇవి ఉన్నాయి. అటువంటి చోట్ల క్రైస్తవ పాస్టర్ల కళ్ళు పడతాయి. డబ్బు ఎరవేసి బైబిల్ అబద్దాలు అమాయకులకు నూరిపోస్తారు. మతాలు మారుస్తారు. సమాజంలో చిచ్చు రేపుతారు. ఇది ఇండియాలో ముమ్మరంగా జరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్రలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఇక్కడ ప్రతి పల్లెలోనూ కనీసం రెండు చర్చిలున్నాయి. మైకులు మారు మోగుతున్నాయి. కాకమ్మ కబుర్లను పాస్టర్లు బాగా నూరిపోస్తున్నారు. వెర్రి గొర్రెలు నమ్మేస్తున్నారు.

ఈ పాస్టర్లు చెప్పే ముఖ్యమైన బోధ, పరలోకం, నిత్యజీవం అనేవి. పరలోకం అనేది ఒకటి ఉందని, జీసస్ ను నమ్మితే అక్కడకు పోతారని, అక్కడ నిత్యజీవం ఉంటుందని పచ్చి అబద్దాలను పాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా అమాయకులకు నూరిపోస్తున్నారు. ఇవన్నీ అబద్దాలే. అవే నిజాలైతే, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులేంటి?

1. క్రైస్తవం పుట్టి కేవలం రెండువేల సమత్సరాలు మాత్రమే అయింది. భూమి పుట్టి నేటికి 454 కోట్ల సంవత్సరాలైంది. మరి జీసస్ పుట్టకముందు ఉన్న కోట్లాది మనుషులందరూ నరకానికే పోయారా? ఇది నమ్మదగిన విషయమేనా?

2. నేటికీ ఇజ్రాయెల్ దేశంలో జీసస్ ను నమ్మరు. అక్కడ ఓపన్ గా క్రైస్తవాన్ని బోధిస్తే జైల్లో పెడతారు. మరి ఇజ్రాయెల్ దేశస్తులందరూ నరకానికే పోతారా? అప్పుడు వాళ్ళు నమ్ముతున్న యెహోవా ఏం చేస్తాడు మరి?

3. క్రైస్తవం తెలియనివారు, దానిని అనుసరించని ఇతర మతస్తులు, నాస్తికులు  ఎక్కడికి పోతారు? 

4. క్రైస్తవబోధలు నిజాలైతే, ఇజ్రాయెల్ దేశం ఈనాటికీ జీసస్ ను ఎందుకు నమ్మడం లేదు?

అసలు విషయమేమంటే, క్రైస్తవం చెబుతున్న శాశ్వత పరలోకం అనేది ఎక్కడా లేనేలేదు. అది అబ్రహామిక్ మతాలు సృష్టించిన పచ్చి అబద్దం మాత్రమే.

హిందూమతం ప్రకారం, స్వర్గ నరకాలనేవి తాత్కాలికమైన లోకాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇవి మరణానంతర స్థితులు మాత్రమే. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం కొంతకాలం పాటు ఉంటాయి. అవి అనుభవించిన తర్వాత మళ్ళీ  కర్మానుసారంగా జన్మ ఉంటుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని అందుకునేటంత వరకూ జననమరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది మన సనాతన ధర్మం చెబుతున్న సత్యం.  అంతేకాదు, బౌద్దమూ జైనమూ కూడా ఇదే చెబుతాయి. ఇది మాత్రమే సత్యం. అంతేగాని, జీసస్ ని నమ్మితే స్వర్గం, లేకపోతే శాశ్వత నరకం అనేవి బూటకాలు, పచ్చి అబద్దాలు మాత్రమే. కానీ ఈ అబద్దాలను కోట్లాదిమంది నిజాలని నమ్ముతున్నారు. గొర్రెలుగా మారుతున్నారు. దీనికి కారకులు పాల్ మెకంజీ వంటి దొంగ పాస్టర్లు. ఇది వాళ్ళ వ్యాపారం.

ఈ పాల్ మెకంజీకి పెంటకోస్ట్ డినామినేషన్ తో సంబంధాలున్నాయి. ఇది తీవ్రమైన భావాలున్న సంస్థ. వీరిలో చాలామంది రోగమొస్తే మందులు వాడరు. జీసస్ తగ్గిస్తాడని మూర్ఖంగా నమ్ముతారు. 

ముప్పై ఏళ్ళ క్రితం మా దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఇదే విధంగా నమ్ముతూ, తనకు గుండెజబ్బు వచ్చినా మందులు వేసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా, జీసస్ రక్షిస్తాడని చెబుతూ అర్ధాంతరంగా చనిపోయాడు. పెంటకోస్ట్ మిషన్ గురించి వారి నమ్మకాల గురించి నాకప్పుడే మొదటిసారి తెలిసింది.

పోతే, పాల్ మెకంజీ దృష్టిలో ఇతను చెప్పేదే అసలైన క్రైస్తవమతం. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో ప్రచారంలో ఉన్న క్రైస్తవం అసలైన క్రైస్తవం కాదని ఇతను బోధిస్తాడు. రోగాలు వస్తే మందులు వేసుకోవడం పాపమని, మొబైల్, కంప్యూటర్ వంటి మోడరన్ పరికరాలు వాడకూడదని, అమెరికా వంటి దేశాలు సైతాన్ అనుచరులని ఇతను బోధించేవాడు. సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది తీసుకోవద్దని, అది Seal of the Beast  అని ఆ గొర్రెలకు ఎక్కించేవాడు. అందుకే, ఓటర్ లిస్టులో నమోదు కూడా చేసుకోకుండా తన బోధలను వినే గొర్రెలకు నూరిపోసేవాడు. చివరకు  తిండీ నీళ్ళు మానేసి ఆత్మహత్యలు చేసుకోమని అదే జీసస్ ను చేరుకునే అసలైన దారి అని వాళ్ళను హిప్నటైజ్ చేశాడు. నమ్మించాడు. వాళ్ళందరూ చచ్చారు. ఇతను మాత్రం హేపీగా ఉన్నాడు.

అసలీ Seal of the Beast అంటే ఏమిటి? ఇది బైబిల్ లోని ప్రకటనల గ్రంధం (Revelations Chapter) లో ఉంటుంది. ఈ చాప్టర్ 66 CE ప్రాంతంలో వ్రాయబడింది. ఇది రాజకీయపరంగా వ్రాయబడిన అబద్దపు వ్రాతలే గాని నిజాలు కావు.

ఎలా అంటే, అప్పట్లో నీరో చక్రవర్తి రోం ను పాలించేవాడు. ఇతని బొమ్మతో నాణేలు చలామణీలో ఉండేవి. పాతకాలంలో రాజులందరూ తమ తమ బొమ్మలతో నాణేలను ముద్రించేవారు. ఇది మామూలే. అయితే, రోమన్ల ఏలుబడిలో ఉన్న యూదులు యెహోవా పిచ్చిలో ఓల్డ్ టెస్టమెంట్ మాయలో పడి, దీనిని వ్యతిరేకించారు. నీరో చక్రవర్తి బొమ్మ ఉన్న నాణేలను Seal of the Beast గా వాళ్ళు వర్ణించారు. అయితే, డైరెక్ట్ గా దీనిని వ్యతిరేకిస్తే రాజు చేతిలో చావు తప్పదు కనుక, మార్మిక భాషలో అర్ధం అయ్యీ కానట్టుగా దీనిని వ్రాసి, 'ప్రకటనల గ్రంధం' అని దీనికి పేరు పెట్టారు. దీనిని నేటి క్రైస్తవులు దైవాదేశంతో వ్రాయబడిన ప్రకరణంగా భావిస్తూ మోసపోతున్నారు.

ఇలాంటి తెలిసీ తెలియని బోధలను చేస్తూ జనాలను చీకటి యుగాలలోకి తీసుకుపోతున్న క్రైస్తవ పాస్టర్లు నేడు ఇండియాలో కూడా లక్షలాది మంది ఉన్నారు. ఇటువంటి పిచ్చి బోధలను నమ్మి పిచ్చోళ్లుగా మారుతున్న అమాయకులు కోట్లల్లో ఉన్నారు 

పాప్ మెకంజీ ఈ బోధలను క్రొత్తగా చెయ్యడం లేదు. 2016 లో కూడా ఇలాగె చేసి కొన్ని వందల మందిని ఇదే విధంగా ఉపవాసాలుండమని ప్రేరేపించి, వాళ్ళ చావులకు కారకుడయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ చేశాడు. ఈ విధంగా జనాభాని తన వంతు కృషితో తగ్గిస్తున్నాడన్న మాట.

ఇటువంటి విషప్రచారాలు చేస్తున్నవారిని చట్టపరంగా నిరోధించవలసిన అవసరం ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ఇండియాలో చాలా ఉన్నది. లేదంటే నిన్న కెన్యాలో జరిగిన ఇటువంటి సంఘటనలే  రేపు ఇండియాలో కూడా జరిగే ప్రమాదం ముందు ముందు ఉన్నదనేది వాస్తవం. 

రూల్ ఆఫ్ లా లేనంతవరకూ ఇలాంటి వెఱ్ఱి పోకడలు తప్పవనేది కూడా వాస్తవమే. 

మతమార్పిడి నిరోధకచట్టం ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ కఠినంగా అమలు కావలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, సక్రమమైన రీతిలో హిందూమతాన్ని హిందూసంస్థలు అందరికీ ప్రచారం చెయ్యవలసిన అవసరం కూడా ఉన్నది. లేకపోతే Dooms Day అనేది త్వరగా రావడానికి ఇటువంటి విషబోధనలే కారణాలు అవుతాయి.

read more " పరలోకం - నిత్యజీవం "

25, ఏప్రిల్ 2023, మంగళవారం

దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు

ఈరోజు మంగళవారం.

నేడు దొడ్డవరం ఊరిలో ఉన్న లక్ష్మినరసింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. అర్చకులు నరసింహాచార్యులు గారు, నడివయసు దాటిన మనిషి. మా వివరాలు విని చాలా సంతోషించారు. 'ఈ ఊరికి మేమొచ్చి పది రోజులైందని, ఊరిలో అతి ప్రాచీన ఆలయం ఏమిటి? అని వాకబు చేస్తే నరసింహస్వామి గుడి అని చెప్పారని, అందుకని ఈ ఆలయానికి నేటికి వచ్చి దర్శనం చేసుకోగలిగామ'ని ఆయనతో అన్నాను.

ఆలయంలో ఎవరూ లేరు. ఇతర గ్రామస్తులు సామాన్యంగా ఈ ఆలయానికి రారని తెలిసింది. ఎందుకంటే, ఇక్కడ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారట. ఇది పెద కమ్మవారి అధ్వర్యంలో నడుస్తున్న ఆలయం. విశాలంగా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. అంకమ్మతల్లి గుడి అయితే, మొక్కులు, బలులు మొదలైన వాటితో గ్రామ్యపంధాలో ఉంది. దానికి విభిన్నంగా నరసింహస్వామి ఆలయం, వైదిక సాంప్రదాయ విధానంలో శుచిగా ఉన్నట్లుగా అనిపించింది. ఇక్కడి 'ఆరా' కూడా చాలా బాగుంది.

వచ్చే నెల 4. 5 తేదీలలో సరసింహ జయంతి జరుగుతుందని, రోజంతా పూజలు, భజనలు ఉంటాయని, రమ్మని ఆచార్యులు అన్నారు. 'అలాగే వస్తామని' అంటూ, 'జనం వచ్చే పర్వదినాలలో కంటే, రాని మామూలు రోజులే మాకు బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఆలయంలో  ఒక్కడినే కూర్చుని జపధ్యానాలు అనుష్టానము చేసుకోవచ్చా?' అని అడిగాను.

'బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంతకంటే కావలసింది ఏముంది? వచ్చి చేసుకోండి' అని ఆయన అన్నారు.

'ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తన జరుగుతుంది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకూ ఉంటుంది. ఆడవాళ్ళ సంకీర్తనా బృందం ఉంది. వాళ్ళు చాలా బాగా భజన చేస్తారు. మీరూ వచ్చి పాల్గొనండి' అని ఆహ్వానించారు.  

'మా ఆశ్రమంలో కూడా ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తనం మొదలుపెట్టి చెయ్యబోతున్నాము. అయినా, ఇక్కడకు కూడా వస్తాను' అని  ఆయనతో చెప్పాను.

దొడ్డవరం తెల్లబాడు గ్రామాలలో రామనామ సంకీర్తనం చేసే ఆడవాళ్ళ బృందాలున్నాయి. వీరిది అవధూతేంద్ర సరస్వతీస్వామి వారి పరంపర. వీరికే రఘువరదాసుగారని పేరున్నది. నా చిన్నపుడు గ్రామగ్రామాలలో రామనామ ఏకాహాలు, సప్తాహాలు వీరి అధ్వర్యంలో జరిగేవి. రామనామాన్ని  తెలుగునాట గ్రామగ్రామాలలో ప్రచారం చేసి తరించిన మహనీయుడాయన. పాతతరం వారికి ఆయన సుపరిచితుడే. రామనామం మారుమ్రోగుతున్నంత వరకూ పల్లెటూర్లు ఎంతో బాగున్నాయి. కాలక్రమేణా క్రైస్తవ  విషప్రచారాలతోను, ఇతర వెర్రిపోకడలతోనూ నేటి పల్లెటూర్లు ఎంతగా భ్రష్టు పట్టినప్పటికీ, ఈ నాటికీ రామనామ సంకీర్తనమే పల్లెలను కొద్దో గొప్పో రక్షిస్తున్న శక్తి అనేది నా నమ్మకం.

రామనామ సంకీర్తనను నేను చాలా ఇష్టపడతాను. దాని శక్తి నాకు బాగా తెలుసు. దానితో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా చిన్నప్పటిది.

దొడ్డవరం, తెల్లబాడు గ్రామాలు రెండూ కలిసే ఉంటాయి. వీటిలో అసలు ఊరు దొడ్డవరం గ్రామమే. ఇది వెయ్యేళ్ళ క్రితం గడ్డ ఎత్తబడిన ఊరు. అప్పటిలో చోళరాజుల పరిపాలనలో ఉండేది. అద్దంకి రాజధానిగా ఉండేది. కాలక్రమంలో యాదవ రాజులు, రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

మొదట్లో ఈ గ్రామం గడ్డను ఎత్తినది బ్రాహ్మణులే. బ్రాహ్మణులు, పెద కమ్మవారు కలసి ఈ గ్రామాన్ని స్థాపించారు. ఈ గ్రామం అసలు పేరు వీరనరసింహపురి అగ్రహారం. అందుకే వెయ్యేళ్ళనాటి నరసింహస్వామి ఆలయం ఈ ఊరిలో ఉన్నది.

ఏభై ఏళ్ళ క్రితం వరకూ ఈ ఊరిలో ముప్పై దాకా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలున్నాయి. అందరూ ఇళ్ళను పొలాలను అమ్ముకుని ఊరు ఒదిలి చదువులు, ఉద్యోగాల కోసం పట్నాలకు వెళ్ళిపోయారు. పెదకమ్మవారి కుటుంబాల పిల్లలు కూడా చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు.ఆ కులంలోని పెద్దవాళ్ళు మాత్రం ఊరిలో మిగిలారు. శివాలయం వైపుగా చిన్న కమ్మవారి కుటుంబాలు ఉన్నాయి. వారు వ్యవసాయవృత్తిలో ఉన్నారు. వారిలో వాడే బత్తుల వెంకటసుబ్బయ్య. వృత్తిరీత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినప్పటికీ, వేదం మీద ఆసక్తితో ఎంతో పరిశోధన చేసి, 'అతిరుద్రం- షడ్దర్శనాలు' అనే విషయం మీద సంస్కృతభాషలో Ph.D చేశాడు. జ్యోతిష్యశాస్త్రంలో M.A చేశాడు. ఇతని గురించి ఇంతకు ముందు వ్రాశాను. ఈ ఊరి ఆణిముత్యం ఇతడు. బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మవారు గాక, వడ్డెరలు, యాదవులు, మాలలు, మాదిగలు, ఇతర కులస్తులు కొంతమంది ప్రస్తుతం గ్రామంలో ఉన్నారు.

ఈ ఊరు చాలా పేరు గాంచిన ఊరు. సినీనటి భానుమతి పుట్టినది ఇక్కడే. ఇక్కడ రామాలయం వీధిలోనే ఆమె పుట్టిన ఇల్లు ఉన్నది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య బ్రాహ్మణుడు. తల్లి సరస్వతి, కళావంతులని చెప్పారు. మద్రాసులో స్థిరపడి, ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత కూడా, అప్పుడప్పుడు ఆమె తన స్వగ్రామమైన దొడ్డవరానికి వచ్చి పోయేదని ఇక్కడివాళ్ళు చెప్పారు. ఇక్కడి ఆలయ ఉత్సవాలలో ఆమె తల్లి సరస్వతి నాట్యం చేసేదని, తల్లి వెంట చిన్నపిల్ల భానుమతి వస్తూ ఉండేదని అన్నారు. సరస్వతి గారు సంగీత విద్వాంసురాలు. ఆమె దగ్గరే భానుమతి తన మొదటి సంగీత పాఠాలను అభ్యసించి ఉండవచ్చు.

సంగీత విద్వాంసులకు, కళాకారులకు, సాహిత్యప్రియులకు ఈ ఊరు పెట్టింది పేరు.

బుర్రకధకు మన దేశంలోనే పేరు తెచ్చిన మేటి కళాకారుడు జంగం వెంకటస్వామి, ఆయన శిష్యుడు హరిజనుడైన కాకుమాను రాఘవులు ఈ ఊరి వారే. వెంకటస్వామి గాత్రం ఎంత ఖంగుమనేదంటే, దానిని రికార్డు చేయబోతుంటే గ్రామఫోను ప్లేటు చిట్లిపోయిందట. దీనిని ఇప్పటికీ కధగా చెప్పుకుంటారు.

ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు శింగంశెట్టి చంద్రశేఖరం ఈ ఊరివాడే. ఈయన పక్కా కమ్యునిస్టు. కానీ నిరంతరం కృష్ణనామాన్ని జపించేవాడు. భక్తిరసంలో ఓలలాడేవాడు.

ప్రఖ్యాత వీధి భాగవతకళాకారుడు జక్కుల వెంకట రామదాసు ఈ ఊరిలో పుట్టినవాడే.

సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తన నాదస్వర గానంతో మెప్పించిన నాదస్వర ప్రవీణుడు చినబాలాజీ ఈ గ్రామస్తుడే.

(ఈ వివరాలను శ్రీ గొల్లపూడి ప్రకాశరావు రచించిన 'మా జంట గ్రామాలు' అనే పుస్తకం నుంచి గ్రహించాను)

ఇంకా ఎందరెందరో ఎన్నో రంగాలలో ప్రసిద్ధి కెక్కినవారు ఈ గ్రామం నుంచి వచ్చారు. అలాంటిది దొడ్డవరం గ్రామం. కానీ ప్రస్తుతం మాత్రం గతకాలపు సాంస్కృతిక వైభవం అంతా అంతరించింది. జనాల దగ్గర డబ్బు పెరుగుతున్నది గాని సాంస్కృతిక పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

నాలుగు వేల జనాభా ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నది. నరసింహస్వామి ఆలయానికి తోడు, ఒక రామాలయం (అసంపూర్తిగా వదలివెయ్యబడింది. చందాలు వసూలు చేసినవారు కొందరు చనిపోగా, మరికొందరు అమెరికాకు వెళ్ళిపోయారట),  మాలపల్లిలోని రామాలయం, పాత శివాలయం, అంకమ్మ తల్లి గుళ్ళు రెండు, బ్రహ్మంగారి గుళ్ళు మూడు, పోలేరమ్మ తల్లి గుడి ఒకటి, శక్తి క్షేత్రం అనే అమ్మవారి గుడి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి, ఈ మధ్యనే కట్టబడిన ఒక పెద్ద నల్లరాతి ఆంజనేయస్వామి విగ్రహం, ఈ విధంగా చాలా గుడులున్నాయి. ఇవిగాక మూడు చర్చిలున్నాయి. ఎవరికి వారే, వారి వారి కులగుళ్ళు కట్టుకుంటూ వాళ్ళ ఉనికిని  సామాజికబలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తున్నది గాని, పాతకాలపు ఆలయాల సంస్కృతిని పద్ధతులను నిలబెట్టే క్రమం మాత్రం గోచరించడం లేదు. మైకులు మాత్రం మోగిపోతున్నాయి.

ఈ గ్రామానికి మాకు గల అనుబంధం ఏనాటిదో? ఎప్పటిదో? నేడు మేము ఈ గ్రామానికి చేరుకున్నాము. మా మొదటి ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. మొదటి ఆశ్రమం అని ఎందుకన్నానంటే, గోదావరి తీరంలో మా ఇంకొక ఆశ్రమం రావాలన్నది నా సంకల్పం. పేరుకు చంద్రపాడు గ్రామ పరిధిలో ఉన్నప్పటికీ, ఏది కావాలన్నా మేము రావలసింది దొడ్డవరం గ్రామానికే. కనుక ప్రస్తుతానికి మేము దొడ్డవరం గ్రామస్తులమే.

ఈ ఊరుకు ఆనుకుని ఉన్న ఇంకొక గ్రామం ఇలపావులూరు. 1984 ప్రాంతాలలో మాకు బాగా పరిచయస్తుడైన IT Rao గారు ఈ గ్రామపు ఆయనే. ఆయనపేరు ఇలపావులూరి తిరుమలరావు. ఈయన గుంతకల్లు రైల్వే డివిజన్ లో TTE గా పనిచేశారు. అప్పుడప్పుడూ తన స్వగ్రామానికి వచ్చి పోతూ ఉండేవాడు. ఆ ఇలపావులూరు గ్రామం మా ప్రక్కనే ఉంది.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమగ్ర సమన్వయం చేస్తున్న మా ఆశ్రమం ఇక్కడ రావడం ఈ నేల చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి. కానీ ఈ గ్రామస్తులకు మా ఆశ్రమ విధానాలు, ఆశయాలు అర్ధమౌతాయా? ప్రపంచంలో ఎక్కడా దొరకని అత్యున్నత ఆధ్యాత్మిక సంపద వాళ్ళ ముంగిటిలోకి వచ్చి నిలుచున్న విషయం వారికి ఎప్పటికైనా  తెలుస్తుందా? దానిని అందుకోగలిగే వాళ్ళు ఒక్కరైనా ఇక్కడ కనిపిస్తారా?

ఏమో? కాలమే నిర్ణయించాలి.

read more " దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు "