18, జులై 2019, గురువారం

కలబురిగి కబుర్లు - 5 (తాంత్రిక బౌద్ధం)

మళ్ళీ ఒక వారం పాటు కలబురిగిలో నివాసం ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతిరోజూ మా అమ్మాయినడిగి తన స్కూటర్ తీసుకుని, బుద్ధవిహార్ దర్శనం, అక్కడి ధ్యానమందిరంలో కూచుని ధ్యానం చెయ్యడం, లైబ్రరీలో కూచుని బౌద్ధగ్రంధాల అధ్యయనం చెయ్యడం యధావిధిగా జరిగింది. ఇవి తప్ప ఆ ఊరిలో ఇంకేమీ నేను చూడలేదు.

ఊరికి ఏడు కి.మీ దూరంలో విశాలమైన పొలాల మధ్యన నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న కొండగుట్ట పైన ఉన్న బుద్ధవిహార్ చాలా పెద్ద పాలరాతి కట్టడం. చెట్లూ తోటలతో విశాలంగా ఉంటుంది. దానిలో ఒక మూలన ఉంటుంది ఈ లైబ్రరీ భవనం. ఇవన్నీ కట్టడానికి, మెయిన్ రోడ్డు నుంచి రెండు కి.మీ పొడవున పొలాలలోకి పక్కా సిమెంట్ రోడ్డు వెయ్యడానికి, ఎన్ని వందల కోట్లు ఖర్చయ్యాయో నాకైతే తెలీదు.

ఈ లైబ్రరీ చాలా పెద్ద భవనం. ఒక్కొక్క బీరువాలో కొన్నివందల పుస్తకాలు అక్కడ ఉన్నాయి. వాటిల్లో పాళీ మూలగ్రంధాలే గాక, నవీన కాలపు యూరోపియన్ అమెరికన్ స్కాలర్లు వ్రాసినవీ, టిబెటన్ లామాలు వ్రాసినవీ చాలామంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. మన ఫేవరేట్ టాపిక్ అయిన తాంత్రికబౌద్ధం మీద మంచి పుస్తకాలు చాలా కన్పించాయి అక్కడ.

నేనక్కడికి వెళ్ళిన రోజున సాయంత్రం నాలుగైంది. మబ్బులు పట్టి వర్షం పడుతోంది. అంత పెద్ద ప్రాంగణంలో లైబ్రరీ ఎక్కడో అర్ధం కాలేదు. లైబ్రరీకోసం వెతుక్కుంటూ వెళ్లి, "ఈ బిల్డింగ్ లో లైబ్రరీ ఎక్కడా?" అని, ఒక్కడినే తిరుగుతుంటే, ఒక మూలనున్న గదిలోనుంచి శవాకారంతో ఉన్న ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చి నన్ను అనుమానంగా చూచింది. ఆమె చంకలో ఒక రెండేళ్ళ పిల్లాడు ఈసురోమంటూ కూచుని చూస్తున్నాడు. మాల్ నూట్రిషన్ కు ప్రతిబింబాలుగా ఉన్నారు వాళ్ళిద్దరూ.

'లైబ్రరీ ఎల్లి ఇద్ది?' అడిగా కన్నడంలో.

'అల్లి. ఆ మూలదల్లి' అందా అమ్మాయి. అంటూ ఆ మూలడోర్ వైపు దారి తీసింది. అనుసరించా.

ఆ తలుపు తీసి విశాలమైన కారిడార్ లాగా ఉన్న ఒక పెద్ద హాల్లోకి అడుగు పెట్టింది ఆమె. ఆ హాలంతా లైట్లు లేకుండా చీకటిగా ఉంది. గోడలకు ఆనించి పెద్ద పెద్ద బీరువాలూ, వాటిల్లో వందలాది గ్రంధాలూ కనిపిస్తున్నాయి. ఆమె, ఆమెకు తోడుగా పిల్లాడు, నేను తప్ప అంత పెద్ద చీకటి హాల్లో ఎవరూ లేరు. అసలు, ఊరికి దాదాపు ఏడు కి.మీ.దూరంలో ఆ కొండమీద ఉన్న ఆ లైబ్రరీకి నాలాంటి పిచ్చోడు తప్ప ఇంకెవరూ రానట్లు నాకనిపించింది.

ఆమెకు తోడుగా కనీసం ఒక పిల్లాడున్నాడు. నాకు తోడు ఎవరూ లేరు.

మాట్లాడకుండా నిలబడి ఉన్న నన్ను చూస్తూ, రిజిస్టర్ ను ముందుకు తోసింది ఆమె. తన టేబుల్ దగ్గర ఉన్న లైటు వెలిగేటట్లు ఏదో స్విచ్ వేసింది. అంత పెద్ద చీకటి హాల్లో ఒక లైట్ మాత్రమే వెలిగి, అక్కడి భయానక వాతావరణాన్ని ఇంకా ఎక్కువ చేసింది. ఆ బుక్కులో నా పేరు వ్రాస్తూ పేజీలు  తిప్పి చూచాను. పన్నెండేళ్ళు అయింది ఆ లైబ్రరీ కట్టి. కనీసం రోజుకు ఒక్కడు కూడా వచ్చి ఆ పుస్తకాల ముఖం చూడటం లేదు. నా పేరు, వివరాలు అందులో వ్రాసి, బీరువాల వైపు నడిచాను. వాటిల్లో నుంచి నాక్కావలసిన పుస్తకాలు ఎంచుకుని ఆమెకు దూరంగా ఉన్న ఒక టేబిల్ దగ్గర కూచుని చదవడం సాగించాను.

పుస్తకం తెరిచానో లేదో కరెంట్ పోయింది. అంత పెద్ద భవనంలో ఆ చీకటి హాల్లో నేనూ ఆ దయ్యం లాంటి ఆమె, ఆమె దయ్యం పిల్లాడు, బయటేమో వర్షం, చదవబోతున్నది తంత్రం గురించి. "మంచి స్కేరీగా ఉందిరా బాబూ సెట్టింగ్" అనిపించింది. ఒక కిటికీ తెరిచి, దాని దగ్గరకు కుర్చీ లాక్కుని కూచుని ఆ గుడ్డి వెలుతురులోనే చదవడం మొదలుపెట్టాను.

మధ్యలో తలెత్తి దూరంగా తన టేబుల్ దగ్గర కూచున్న ఆమె వైపు చూచాను. ఆ చీకట్లో, పిల్లాడితో కూచుని వింతగా నావైపు చూస్తోంది ఆమె. "ఈ చీకట్లో ఈ వర్షంలో వీడెవడ్రా బాబూ, వచ్చి కూచుని ఈ పుస్తకాలు గుడ్డి వెలుతురులో చదువుతున్నాడు?' అన్నట్లుగా.

అదేమీ పట్టించుకోకుండా నా అధ్యయనం సాగించాను. రెండు గంటల తర్వాత ఇంకా చదువుతూ ఉంటే, ఏదో అలికిడి అయినట్లు అయితే, తల తిప్పి చూచాను. ఎప్పుడొచ్చిందో ఆమె సైలెంట్ గా వచ్చి నా వెనుకే నిలబడి ఉంది. అదేదో పాత తెలుగు సినిమాలో దయ్యం సీను గుర్తొచ్చింది.

'టైం ఆయిత్తు. హోగబేకు' అంది అదే దయ్యం గొంతుతో, భావరహితంగా ఉన్న ముఖంతో చూస్తూ.

'సరే' అంటూ లేచి, పుస్తకాలు యధావిధిగా బీరువాలో ఉంచి, రిజిస్టర్ లో డిటైల్స్ వ్రాసి బయటకు వచ్చి చూస్తే, వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షంలోనే తడుస్తూ ఆ చిన్న కొండ క్రిందకు దిగి నా స్కూటర్ దగ్గరకు వచ్చాను. వర్షం ఇంకా ఆగలేదు. అక్కడ కొంచం సేపు వేచి చూచి, వర్షం తగ్గాక, చదివిన విషయాలు నెమరు వేసుకుంటూ, ఇంటికి బయల్దేరాను.

ఇంటికొచ్చాక అనుమానం వచ్చింది. అసలా లైబ్రరీ ఉందా? లేక నా భ్రమా? ఆమె మనిషేనా? లేక దయ్యమా? ఏమీ అర్ధం కాలేదు. "రేపు మళ్ళీ వెళ్లి చూడాలి. అవన్నీ అక్కడే ఉంటే, నిజమని అర్ధం లేకపోతే ఆమె ఖచ్చితంగా దయ్యమే" అనుకున్నాను.

"నా పిచ్చిగానీ, బుద్దిస్ట్ టెంపుల్ లో దయ్యం ఎందుకుంటుంది?" అని మళ్ళీ అనుమానం వచ్చింది. అంతలోనే - "ఎందుకు కాకూడదు. అది బుద్ధిష్ట్ దయ్యం కావచ్చుగా" అని వచ్చిన నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది.

"రేపు చూద్దాంలే" అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాను.

(ఇంకా ఉంది)
read more " కలబురిగి కబుర్లు - 5 (తాంత్రిక బౌద్ధం) "

2, జులై 2019, మంగళవారం

రెండవ లక్నో యాత్ర - 2

గెస్ట్ లెక్చరర్స్ లో డా. రాజేష్ హర్షవర్ధన్ ఒకరు. ఈయన లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక విభాగానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. చాలా డిగ్రీలున్న ప్రముఖుడు. 'మెడికల్ వేస్ట్ మేనేజిమెంట్' అనే సబ్జెక్ట్ మీద ఈయన మాకు లెక్చర్ ఇచ్చారు. ఎక్కువగా పర్యావరణం గురించి, దానిపట్ల మనకున్న బాధ్యత గురించి, ప్రకృతిని కాపాడవలసిన అవసరం గురించి తాత్వికంగా మాట్లాడాడు. ఈయనకు మెడికల్ నాలెడ్జ్ తోడు మన భారతీయ వేదాంతం మీద మంచి అవగాహన ఉన్నట్లుగా తోచింది.

క్లాస్ అయిపోయింది. టీ బ్రేక్ సమయంలో అటెండర్ వచ్చి 'ప్రొఫెసర్ శుక్లా గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు' అన్నాడు.

నేను లేచి విశాలమైన లాన్స్ మీదుగా అడ్మిన్ బ్లాక్ కి నడుచుకుంటూ వెళ్లాను. నేను వెళ్లేసరికి ప్రొఫెసర్ శుక్లా గారు, డా. హర్షవర్ధన్ గారు కూర్చుని 'టీ' సేవిస్తున్నారు.

'రండి శర్మాజీ. వీరు డా. హర్షవర్ధన్ గారు' అంటూ శుక్లాగారు నాకు పరిచయం చేశారు.

నేనాయన్ని విష్ చేసి, 'మీ లెక్చర్ చాలా బాగుంది. మీకు పర్యావరణ పరిరక్షణ మీద మంచి అవగాహన ఉంది' అన్నాను.

ఆయన చిరునవ్వు నవ్వాడు.

అంతలో గ్రీన్ టీ వచ్చింది. దాన్ని సేవిస్తూ ఉండగా మాటలు సాగాయి.

'మీ వెబ్ సైట్ చూచాము. చాలా బాగుంది. డాక్టర్ గారు మీ ఇంగ్లీష్ బ్లాగ్ ఫాలో అవుతారట. క్లాస్ రూమ్ లో మిమ్మల్ని చూచి గుర్తుపట్టారు. నా రూమ్ కి రావడం తోనే, విషయం చెప్పారు. ఇద్దరం కలసి మీ వెబ్ సైట్ చూస్తున్నాము' అన్నారు శుక్లా గారు.

ఎదురుగా ఉన్న శుక్లా గారి లాప్ టాప్ వైపు చూచాను. 'ఆలోచనా తరంగాలు' బ్లాగ్ పేజి కనిపించింది. తెలుగు అర్ధం కాకపోయినా దాన్ని చూస్తున్నారు వాళ్ళు.

'మీ పుస్తకాలలో ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి కదా. అవి మాకు కావాలి, మీ సబ్జెక్ట్స్ మాకు చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.' అన్నాడాయన.

 'పంపిస్తాను. ఇంకా వస్తున్నాయి. అవైతే మీకు ఇంకా బాగా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి డాక్టర్ గారు' అన్నాను హర్షవర్ధన్ గారితో.

'ఏంటవి?' అన్నారు హర్షవర్ధన్ గారు.

'మెడికల్ ఆస్ట్రాలజీ' మీద పుస్తకం వ్రాస్తున్నాను. త్వరలో అయిపోతుంది. అందులో నూరు జాతకాలను విశ్లేషిస్తూ జలుబు నుంచి ఎయిడ్స్ వరకూ రకరకాల రోగాలు ఎలా వస్తాయో, అలా రావడానికి ఏయే గ్రహయోగాలు కారణాలు అవుతాయో వివరించాను. మీరు డాక్టర్ కదా, ఆ పుస్తకం మీకు బాగా నచ్చుతుంది' అన్నాను.

డా. హర్షవర్ధన్ గారు విభ్రమంగా చూచారు.

'చాలా బాగుంది. అంటే, మనుషుల మీద గ్రహాల ప్రభావం గురించి మీరు రీసెర్చి చేస్తున్నారన్న మాట' అన్నాడాయన.

'అవును. నా రీసెర్చి అంతా అదే' అన్నాను.

ముగ్గురం రిలాక్స్ గా కూచుని టీ సేవిస్తూ మాట్లాడుకుంటున్నాం.

'ఈ సబ్జెక్ట్ గురించి కొంత క్లుప్తంగా చెప్పగలరా?' అడిగాడాయన.

'ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను వినండి. ఆడవారి మెన్సస్ కీ, చంద్రుని మూమెంట్ కీ డైరెక్ట్ సంబంధం ఉన్నది. రెండూ సరిగ్గా 28.5 రోజులలో జరుగుతాయి. ఆడవారు cycle based beings. సముద్రం ఆటుపోట్లకు గురైనట్లు అందుకే వారు ఎక్కువగా చెదిరిపోతూ ఉంటారు. దీనికి చంద్రుని స్థితులు కారణం. ఒక స్త్రీ పుట్టిన తేదీ తెలిస్తే, ప్రతినెలా ఆమెకు మెన్సస్ ఏ రోజు వస్తుందో కరెక్ట్ గా చెప్పవచ్చు.' అన్నాను.

'అవును. ఇది నాకు తెలుసు. ఆడవారిలో ఇదొక్కటే సైకిల్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి. వారి జీవితమే అనేక సైకిల్స్ లో సాగుతూ ఉంటుంది. మెడికల్ గా కూడా ఇది ప్రూవ్ అయింది.' అన్నాడాయన. 

'మగవారు కూడా అంతే, అయితే గ్రహప్రభావం వీరి మీద ఇంకొక రకంగా పనిచేస్తుంది. మళ్ళీ ఆడవారిలోనూ మగవారిలోనూ జనరల్ ప్రభావం వేరు. వారి వారి జాతకాన్ని బట్టి వ్యక్తిగత ప్రభావాలు వేరు. ఇదంతా నేను చాలా కాలం నుంచీ పరిశోదిస్తున్నాను' అన్నాను.

మధ్యలో కల్పించుకుంటూ శుక్లా గారు ' అసలు ఇన్ని పనులు చెయ్యడానికి మీకు సమయం ఎక్కడుంటుంది?' అన్నారు ఆశ్చర్యంగా.

'అదే నా జాతకం' అన్నాను నవ్వుతూ.

వాళ్ళు కూడా పెద్దగా నవ్వేశారు.

'శర్మాజీ. మీకు ఒక జాతకం ఇస్తాను. దానిని చూచి కొన్ని వివరాలు నాకు చెప్పాలి' అన్నారు శుక్లాగారు.

ఉత్త మాటలెందుకు? వీరికి కొంత ప్రూఫ్ చూపిద్దామని అనిపించింది. మనసులోనే ఆ సమయానికున్న ప్రశ్నచక్రాన్ని గమనించాను. లగ్నం నుంచి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. లగ్నాధిపతిని చూస్తున్నాడు. శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నాడు.

'మీరు అడగాలనుకుంటున్నది మీ భార్య గురించి' అన్నాను.

త్రాగుతున్న టీ కప్పును టేబిల్ మీద ఉంచాడు శుక్లాగారు.

'ఇంకా చెప్పండి?' అన్నాడు.

'ఆమె ఆరోగ్యం గురించి మీరు అడగాలనుకుంటున్నారు' అన్నాను.

కాసేపు మౌనంగా ఉన్న ఆయన ఇలా అన్నాడు - 'శర్మాజీ. నేనేమీ ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే, మా బాబాయి గారు మంచి జ్యోతిష్కుడు. ఆయన దగ్గర ఇలాంటి విచిత్రాలు చాలా చూచాను. మీరు సరిగానే ఊహించారు.' అంటూ ఆమె జనన వివరాలు ఇచ్చాడాయన. నిదానంగా జాతకం చూచి మిగతా వివరాలు చెబుతానని ఆయనతో చెప్పాను.

'ఈ సారి మీరు లక్నో వస్తే మా యింటికి తప్పకుండా రావాలి. మా హాస్పిటల్ చాలా పెద్దది. మీకు దగ్గరుండి అన్నీ చూపిస్తాను.' అన్నాడు డా. హర్షవర్ధన్ గారు.

సరేనని చెప్పాను.

నా ఫోన్ నంబర్ ఇద్దరూ తీసుకున్నారు. నా పుస్తకాలు పంపమని మరీ మరీ చెప్పారు. టీ త్రాగడం అయిపొయింది. వారి దగ్గర సెలవు తీసుకుని క్లాస్ కి బయల్దేరాను.

క్యాంపస్ చాలా పెద్దది. చెట్ల మధ్యలో నడుస్తూ అడ్మిన్ బ్లాక్ నుండి క్లాస్ రూమ్స్ కి రావడానికి ఒక అయిదు నిముషాలు పడుతుంది. నడుస్తూ ఉండగా నాకే నవ్వొచ్చింది.

ఇరవై ఏళ్ళ క్రితం మా ఫ్రెండ్ వెంకటాద్రి గారు ఒక మాట అంటూ ఉండేవాడు. 'జ్యోతిష్యం, వైద్యం బాగా తెలిస్తే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికెయ్యవచ్చు. మంచి పేరూ, గౌరవమూ సంపాదించవచ్చు'. అంటూ.

ఈ రెంటికోసమూ నేనెప్పుడూ ప్రాకులాడలేదు. కానీ, తెలుగు రాని హిందీవాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టి, గౌరవించడం గమనించి, మనస్సులోనే నా గురువులకు, ఇష్టదైవానికి ప్రణామాలు అర్పిస్తూ క్లాస్ రూమ్ కి చేరుకున్నాను.
read more " రెండవ లక్నో యాత్ర - 2 "

29, జూన్ 2019, శనివారం

శ్రీవిద్యా రహస్యం (రెండవ ప్రచురణ) ప్రింట్ పుస్తకం విడుదలైంది


చాలామంది ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న పుస్తకం 'శ్రీ విద్యా రహస్యం' రెండవ ప్రచురణ ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్నది.

ఆధ్యాత్మిక సాధకులకు ఈ పుస్తకం ఒక భగవద్గీత, ఒక బైబిల్. ఒక ఖురాన్, ఒక జెంద్ అవెస్తా, ఒక ధమ్మపదం, ఒక గురు గ్రంధసాహెబ్ వంటిది. అన్ని ఆధ్యాత్మిక సందేహాలకూ ఇందులో సమాధానాలున్నాయి. అన్ని తాత్విక చింతనలకూ పరమావధులు ఇందులో ఉన్నాయి. 1380 తెలుగు పద్యాలతో వాటి సులభ వివరణలతో ఈ పుస్తకం ఆధ్యాత్మిక సాహిత్యచరిత్రలోనే ఒక అనర్ఘరత్నంగా వెలుగుతోంది. మొదటి ముద్రణకు విపరీతమైన ఆదరణ లభించిన కారణంగా రెండవ ముద్రణ అవసరమైంది. కాకుంటే కొంత ఆలస్యమైంది. ఇన్నాళ్ళకు ఈ పుస్తకం తిరిగి పాఠకులకు లభిస్తోంది.

కావలసినవారు రేపటినుంచీ ఈ పుస్తకాన్నిgoogle play books నుంచి పొందవచ్చు.
read more " శ్రీవిద్యా రహస్యం (రెండవ ప్రచురణ) ప్రింట్ పుస్తకం విడుదలైంది "

28, జూన్ 2019, శుక్రవారం

రెండవ లక్నో యాత్ర - 1

17 నుంచి 21 వరకూ IRITM Lucknow లో ఒక చిన్న ట్రైనింగ్. ఆరేళ్ళ క్రితం ఒకసారి లక్నో వెళ్లాను. మళ్ళీ ఇప్పుడు. అప్పుడేమో మాయావతి రాజ్యం. ఇప్పుడు యోగి గారి రాజ్యం. ఊరంతా తేడాలు కనిపిస్తూనే ఉన్నాయి.

నార్త్ ఇండియా అంతా హీట్ వేవ్ లో మునిగి ఉంది. మునుపటి కంటే ఇప్పుడు లక్నో ఇంకా దరిద్రంగా తయారైంది. జనం ఎక్కువయ్యారు. వేడి ఎక్కువైంది. దుమ్ము పెరిగింది. వాహనాలు ఎక్కువయ్యాయి. కానీ అదే తిండి. అదే వాతావరణం. అదే మనుషులు.

ఎందుకొచ్చాంరా బాబూ? అనిపించింది. క్లాస్ రూమూ, లివింగ్ రూమూ మొత్తం సెంట్రల్ ఏసీ గనుక బ్రతికిపోయాం గాని, లేకుంటే ఆ వేడికి హరీమనేవాళ్ళం. సాయంత్రం ఏడువరకూ బజారులోకి పోలేనంత వేడి ఊళ్ళో ఉంది. మొదటిరోజు క్లాస్ అయ్యాక, సిటీ లోకి వెళ్లి దగ్గరలోనే ఉన్న ఆలంబాగ్ అనే సెంటర్లో కాసేపు అటూ ఇటూ తిరిగి వచ్చాం.

IRITM మాత్రం మునుపటి కంటే ఇంకా బాగుంది. కాలుష్యం లేదు. ఎక్కడ చూచినా పచ్చని చెట్లు, పచ్చిక, మంచి పర్యవేక్షణతో చాలా క్లాస్ గా, చాలా హాయిగా ఉంది. ఎరువులు లేకుండా కూరగాయలను క్యాంపస్ లోపలే పండిస్తున్నారు. క్యాంపస్ లోపల నీటి కొలనులు మూడున్నాయి. బోలెడన్ని పూలమొక్కలు, పక్షులు, నెమళ్ళు కనిపించాయి. మెయిన్ హాల్లో ఉన్న వివేకానందస్వామి చిత్రం చూచి సంతోషం కలిగింది.

వాన నీటిని జాగ్రత్తగా పట్టి, భూమిలోకి పంపే ప్రక్రియద్వారా నీటిని రక్షిస్తున్నారు. 'క్యాంపస్ లో మేము వాడుతున్న నీటికంటే వందరెట్లు నీటిని భూమికి అందిస్తున్నాం' అని IRITM డైరెక్టర్ ఏ. పీ . సింగ్ గారు సగర్వంగా మాతో అన్నారు. సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. క్యాంపస్ అవసరాలకు చాలా భాగం సోలార్ విద్యుత్తే ఉపయోగపడుతోంది. 

క్లాస్ లో చాలా భాగం పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, రైల్వేలలో వీటిని ఎలా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి? మొదలైన విషయాల గురించే చెప్పారు. మన దేశంలో వేస్ట్ మేనేజిమెంట్, వాటర్ మేనేజిమెంట్ సరిగా చేసి, అర్జంటుగా పొల్యూషన్ తగ్గించక పోతే, ఒక ఇరవై ముప్పై ఏళ్ళలో అనేక రోగాలతో భారతదేశ జనాభాలో సగంమంది హరీమనడం ఖాయమని, లెక్చర్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రముఖులు స్టాటిస్టిక్స్ తో సహా పవర్ పాయింట్ చేసి చూపించారు. కానీ ఎవరికీ ఈ విషయం పట్టడం లేదు. అదే విచారకరం.

ఇప్పటికే తమిలనాడులో నీటి ఎద్దడి మొదలైంది. వర్షాలు లేవు. భూగర్భ జలాలు లేవు. మద్రాస్ లో నీళ్ళను రేషన్ పద్ద్తతిలో ఇస్తున్నారట. లాటరీ తీసి అందులో పేర్లు వచ్చిన వారికి నీరు సరఫరా చేస్తున్నారట కార్పోరేషన్ అధికారులు. తిరుమల కొండపైన జలాశయాలన్నీ అడుగంటుతున్నాయని అంటున్నారు. ఇంకా రెండు నెలలు మాత్రమే అక్కడ నీరు సరిపోతుందట. వర్షాలు పడకపోతే తిరుమలలో నీరు ఉండదు. నీరు లేకుంటే భక్తులు పోలేరు. ప్రకృతిలో వస్తున్న మార్పులకు ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే.

ఇప్పటికే మనకు వాతావరణంలో చాలా మార్పులు కన్పిస్తూ ఉన్నాయి. వర్షాలు లేవు. వేడి ఎక్కువైంది. దుమ్ము ఎక్కువైంది. త్రాగునీరు అడుగంటుతున్నది. తినే తిండి అంతా కాలుష్యమయం. జంక్ ఫుడ్ వాడకం ఎక్కువైంది. నేటి యూత్ లో పిల్లల్ని పుట్టించే శక్తి తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ పుట్టినా రోగిష్టి పిల్లలు పుడుతున్నారు. బయటకు అంతా బాగా ఉన్నట్లు కన్పించినా, భవిష్యత్తు అంధకారమయమే అని విసిటింగ్ లెక్చరర్స్ అందరూ ముక్తకంఠంతో అన్నారు.

ఎప్పటినుంచో నాలో ఉన్న భావాలనే మళ్ళీ వాళ్ళు మాకు లెక్చర్ ఇస్తుంటే మౌనంగా విన్నాను.

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. క్యాంపస్ లో కూడా జరిగింది. ఉదయం అయిదున్నరకి లోకల్ యోగా టీచర్స్ కొంతమంది వచ్చి లాన్స్ లో యోగా చేయించారు. 'మీలో ఎవరికైనా యోగాలో అనుభవం ఉందా?' అని అడిగారు. నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా నాకేమీ రానట్లు ఊరుకుని, వాళ్ళు చెప్పినవి చేశాను. చాలా బేసిక్ లెవల్ ఆసనాలు చేయించారు. యోగా గురించి వాళ్ళ లెక్చర్ వింటే నవ్వొచ్చింది. మౌనంగా అదీ విన్నాను. వాళ్ళంతా వెళ్ళిపోయాక స్టేజి మీద శీర్షాసనం వేసి ఒక ఫోటో దిగాను.

యోగా చెయ్యడం వల్ల వాళ్ళ జీవితాలలో ఎంత మంచి జరిగిందో వక్తలు చెప్పుకొచ్చారు. ఎంతసేపూ వారి వారి అహంకార ప్రదర్శన తప్ప, విషయం ఏమీ లేదు. జాలేసింది. పోనీలే, ఏదో కొంచం మంచిదారిలోనే పోతున్నారు కదా అనిపించింది.

మనుషుల మనస్తత్వాలు మాత్రం ఎక్కడైనా ఒకటే. అహంకారం, భయం, దురాశ, ఏం చెయ్యాలో తెలియని ఒక విధమైన ఆత్రం - ఇవి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఊర్లో తిరుగుతూ మనుషులను గమనిస్తూ ఉంటే ఎప్పుడో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది.

'ఎప్పుడు చూసినా దేనినో వెదుకుతున్నట్లు కనిపిస్తావు. మళ్ళీ ఏదీ ఉంచుకోవు. ఏదీ ఒద్దంటావు. అసలు దేనికోసం నీ వెదుకులాట?' అని ఒక ఫ్రెండ్ ముప్పై ఏళ్ళ క్రితం నన్నడిగాడు.

'మనిషి కోసం' అని  క్లుప్తంగా జవాబిచ్చాను.

మూడు దశాబ్దాల క్రితం నేను చెప్పిన ఆ జవాబు ఈ నాటికీ వర్తిస్తుంది. అదే వెదుకులాట ఈనాటికీ కొనసాగుతోంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పట్లో నావాళ్ళంటూ నాకెవరూ లేరు. ఇప్పుడు నాకోసం ప్రాణం పెట్టే మనుషులు కొందరు కాకపోతే కొందరైనా నాతో ఉన్నారు.

నిజమైన మనుషులను చూడకుండానే నేను పోతానేమో? మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో నాకసలు కనిపించడేమో? అని నా జీవితంలో చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎట్టకేలకు కొందరిని చూడగలిగాను.














(ఇంకా ఉంది)
read more " రెండవ లక్నో యాత్ర - 1 "

24, మే 2019, శుక్రవారం

జ్యోతిష్కుల్లారా దుకాణాలు మూసుకోండి !

తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చాలామంది జ్యోతిష్కులు జోస్యాలు చెప్పారు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. టీడీపీ గల్లంతు లేకుండా ఓడిపోయింది. టీడీపీకి అనుకూలంగా చెప్పిన జ్యోతిష్కుల అంచనాలన్నీ తప్పయ్యాయి.

ఈ రోజుల్లో నాలుగు మాయమాటలు నేర్చుకున్న ప్రతివాడూ ఒక జ్యోతిష్కుడే. తెలిసీ తెలియని పూజలు, హోమాలు చేయించి అమాయకుల్ని మోసం చేసి డబ్బులు కాజేయ్యడం తప్ప అసలు సబ్జెక్టు వీళ్ళలో ఎక్కడా లేదు.

రెండు నెలల క్రితం జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూని ఈరోజు మధ్యాన్నం యూట్యూబులో చూచాను. అందులో ఆయన క్లియర్ గా చెప్పాడు. ''ఇప్పుడు ఎన్నికలంటూ వస్తే, టీడీపీకి 40 సీట్ల కంటే రావు. కావాలంటే రాసిస్తాను'' అని స్పష్టంగా చెప్పాడు. అదే జరిగింది. మరి జగన్ కి జ్యోతిష్యం రాదే? జరగబోయేదాన్ని అన్ని నెలలముందే ఎలా చెప్పాడు?

సమాజంలో ఏం జరుగుతున్నది? ప్రజల నాడి ఎలా ఉంది? అన్న విషయాలు జాగ్రత్తగా గమనించిన ప్రతివారూ జగన్ రెండు నెలల క్రితం చెప్పినదే చెప్పారు. అదే జరిగింది. దీనికి పెద్ద జ్యోతిష్యాలు రానక్కరలేదు. వాస్తవిక దృక్పధం ఉంటె చాలు. మన చుట్టూ ఏం జరుగుతున్నదో గమనిస్తే చాలు.

అసలీ జ్యోతిష్కులలో దొంగ జ్యోతిష్కులే ఎక్కువ. వీళ్ళకున్నంత దురహంకారం ఇంకెవరికీ ఉండదు. వీళ్ళలో నీతి నియమాలతో కూడిన జీవితం కూడా ఉండదు. డబ్బుకోసం ఏమైనా చేసే రకాలే నేడు జ్యోతిష్కులుగా సమాజంలో చెలామణీ అవుతున్నారు. వీళ్ళ మాటలు నిజాలెలా అవుతాయి?

నిన్న మా మిత్రుడు ఒకాయన పోన్ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్.

'రిజల్స్ చూశారా?' అన్నాడాయన.

'చూశాను' అన్నాను.

'మీ అభిప్రాయం?' అడిగాడు.

'జనం అభిప్రాయమే నాది కూడా. టీడీపీ ప్రభుత్వం మీద ప్రజలలో విశ్వాసం లేదు. వాళ్ళు చెప్పే అబద్దాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి చూడలేక జనం విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే జగన్ స్వీప్ చేశాడు. ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. ఇంకేం కావాలి? కమ్మవారికి కంచుకోటలైన కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా టీడీపీ ఓడిపోయింది అంటే, వాళ్ళు కూడా టీడీపీకి వెయ్యలేదని స్పష్టంగా తెలుస్తున్నది. కులాలకతీతంగా ప్రజాతీర్పు జగన్ వైపే ఉంది. కనిపిస్తోంది కదా? ప్రజలు పిచ్చోళ్ళు కారు. ఎల్లకాలం అబద్దాలు చెప్పి వారిని మోసం చెయ్యడం సాధ్యం కాదనేది మళ్ళీ రుజువైంది' అన్నాను.

'మరి నాకు తెలిసిన జ్యోతిష్కుడు ఒకాయన టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాడు. అదేంటి?' అన్నాడాయన.

ఎవరా జ్యోతిష్కుడు? అని నేను అడగలేదు. ఎందుకంటే, అలాంటి వారి పేరు తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆయనే చెప్పుకొచ్చాడు.

'ఆయన చాలా పేరున్న జ్యోతిష్కుడు. పది వేళ్లకీ పది ఉంగరాలుంటాయి. టీవీలో వస్తుంటాడు. టీడీపీ గెలుపు ఖాయం అన్నాడు. బోర్లా పడ్డాడు.' అన్నాడు.

'అడక్కపోయారా మరి?' అన్నాను.

'ఫోన్ చేసి అడిగాను. ''అదే నాకూ అర్ధం కావడం లేదండీ?'' అని నసిగాడు' అన్నాడు మా ఫ్రెండ్.

భలే నవ్వొచ్చింది నాకు.

'ఆయనకే అర్ధం కాకపోతే ఇక జనానికేం చెబుతాడు జ్యోతిష్యం? దుకాణం మూసుకొని, ఉంగరాలు మొత్తం తీసేసి, ఏదైనా పని చేసుకుని బ్రతకమనండి బుద్ధుంటే.' అన్నాను.

'అదేంటి అంతమాటన్నారు?' అన్నాడు.

'ప్రతి జ్యోతిష్కుడూ తప్పులు చేస్తాడు. ఎక్కడ తప్పు పోయిందా అని తన జోస్యాన్ని సరిచూసుకోవాలి. అది కూడా తెలీకుండా 'ఎక్కడ తప్పు పోయిందో అర్ధం కావడం లేదండీ' అంటే అతను వేస్ట్ అని అర్ధమన్నమాట. అలాంటప్పుడు అది చెయ్యక ఇంకేం చెయ్యాలి?' అన్నాను.

'అంతేలెండి. కానీ నాదొక డౌటు. జ్యోతిష్యం అనేది ఒకటే సబ్జెక్టు కదా? ఇలా రకరకాలుగా ఎలా చెబుతారు వీళ్ళు?' అన్నాడు.

'చెప్తా వినండి. జ్యోతిష్యం ఒకటే సబ్జెక్టు. కానీ వీళ్ళకు రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. వీళ్ళేమైనా ఋషులా స్వచ్చమైన నిష్కల్మషమైన మైండ్ తొ ఉంటానికి? వీళ్ళలో చాలామంది డబ్బుకు అమ్ముడుపోయే రకాలే. పైగా దురహంకారం నిలువెల్లా నిండి ఉంటుంది వీళ్ళకు. ఇక వీళ్ళకు జ్యోతిష్యవిద్య ఎలా పట్టుబడుతుంది? ఏవో ఫుట్ పాత్ పుస్తకాలు నాలుగు చదివేసో, లేదా తెలుగు యూనివర్సిటీ నుంచి ఎమ్మే జ్యోతిషం కరెస్పాండేన్స్ కోర్స్ చేసో, నాకు జ్యోతిష్యం వచ్చేసింది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జ్యోతిష్యశాస్త్రం పట్టుబడాలంటే కొన్ని దైవికమైన క్వాలిటీస్ మనిషిలో ఉండాలి. అది ఉత్త ఎకాడెమిక్ సబ్జెక్ట్ కాదు ఆషామాషీగా రావడానికి. పైగా, జ్యోతిష్కుడికి బయాస్ లేని మైండ్ ఉండాలి. ఈ సోకాల్డ్ జ్యోతిష్కులందరూ ఏదో ఒక పార్టీకి బాకారాయుళ్ళే. పైగా డబ్బుకు అమ్ముడుపోయే రకాలే. కనుక వీళ్ళకు unbiased minds ఉండవు. వేషంలో తప్ప వీళ్ళ జీవితాలలో ఏ విధమైన దైవత్వమూ ఉండదు, సబ్జెక్టూ  ఉండదు, నీతీ ఉండదు. అందుకే వీళ్ళ జోస్యాలు ఫలించవు.

'ఈయనకు పదివేళ్ళకూ పది ఉంగరాలున్నాయని చెప్పాను కదా?' అన్నాడు మా ఫ్రెండ్.

'అంతమాత్రం చేత జ్యోతిశ్శాస్త్రం వస్తుందని అనుకోకండి. అది ఉత్త వేషం. వేశ్యకూడా వేషం వేస్తుంది. కానీ అది పతివ్రత కాలేదు. వీళ్ళూ అంతే. రెమెడీలు చేబుతామంటూ అమాయకుల్ని మోసం చేసిన డబ్బులతో చేయించుకున్న ఉంగరాలు అవన్నీ. అవి వాళ్ళ చెడుఖర్మకు సూచికలు. వాళ్ళ జ్ఞానానికి కాదు. గడ్డం పెంచి, రుద్రాక్షమాలలు మెళ్ళో వేసుకుని, వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటే జ్యోతిష్యం రాదు. వస్తుంది అనుకుంటే అది పెద్ద భ్రమ. అలాంటి వేషాలు చూసి మోసపోకండి.' అన్నాను.

'మరి మా జ్యోతిష్కుడిని ఏం చెయ్యమంటారు?' అడిగాడు ఫ్రెండ్.

'దుకాణం మూసుకోమనండి' అని ఫోన్ కట్ చేశాను.
read more " జ్యోతిష్కుల్లారా దుకాణాలు మూసుకోండి ! "

20, మే 2019, సోమవారం

ఆంజనేయ కళ్యాణము చూతము రారండి !

'సీతారాముల కల్యాణం చూతము రారండి' అనే పాటను మీరు వినే ఉంటారు. ఈ టైటిల్ కూడా అలాగే ఉంది కదూ? వినడానికి ఏదో ఇబ్బందిగా కూడా  ఉంది కదూ ! మీ సందేహం కరెక్టే. ఈ టైటిల్ ఎందుకో చెప్పాలంటే చాలా కధుంది. వినండి మరి !

మొన్నొక రోజున ఏదో పనుండి ఎక్కడికో వెళితే, ఒకాయన నాకు పరిచయం కాబడ్డాడు.

'ఈయనే 'సువర్చలా సహిత ఆంజనేయ కళ్యాణవిధానము ' అనే పుస్తకం వ్రాసినాయన' అంటూ ఒకరిని నాకు పరిచయం చేశాడు ఒక ఫ్రెండ్.

నవ్వుతో నాకు పొలమారింది. కానీ నవ్వితే బాగుండదని తెగ తమాయించుకుని, ఆయనకు నమస్తే చెబుతూ ' ఓహో మీరేనా అది?' అన్నాను.

'అవును. నేనే' అన్నాడాయన గర్వంగా.

'సర్లే! పుర్రెకో బుద్ధి' అనుకుంటూ నాపని చూసుకుని అక్కడనుంచి వచ్చేశాను.

మర్నాడు మళ్ళీ అక్కడికే పనిమీద వెళితే ఆయన లేడుగాని, మా ఫ్రెండ్ కూచుని ఉన్నాడు. ఆమాటా ఈ మాటా అయ్యాక మెల్లిగా - 'నిన్నంతా చంపాడు ఆయన. ఒకటే సోది' అన్నాడు నవ్వుతూ.

'ఏమైంది?' అన్నాను.

'ఏంటో ఆంజనేయుడి గోత్రం మారిందంటాడు. పెళ్లి తంతు మార్చాలంటాడు. వినలేక చచ్చాను' అన్నాడు నవ్వుతూ. 'ఎందుకు నువ్వాయన్ని రానిస్తున్నావ్?' అని నేనడగలేదు. ఎందుకంటే, అది అతని వృత్తి కాబట్టి.

'ఇంతకీ ఆంజనేయుడికి పెళ్లయిందా?' అడిగాడు మా ఫ్రెండ్.

'చిన్న జీయర్ స్వామి నడుగు. చెప్తాడు' అన్నాను.

'అదేంటి?' అన్నాడు

'వైష్ణవం మీద ఆయనే కదా ప్రస్తుతం అధారిటి? ఆంజనేయస్వామి వైష్ణవసాంప్రదాయపు దేవుడే. కనుక చిన్నజీయర్ స్వామి ఏది చెబితే అదే కరెక్ట్' అన్నాను.

'ఆయన ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మచారి. బ్రహ్మచారికి పెళ్ళేంటి నాన్సెన్స్ అంటున్నాడు స్వామీజీ' అన్నాడు.

'అంతేకదా మరి ! కరెక్టే' అన్నాను.

'మరి ఈయనేంటి ఏకంగా పెళ్లితంతుతో పుస్తకమే వ్రాశాడు? గోత్రనామాలతో సహా ఇచ్చాడు. ఇదేంటి? అంతా గందరగోళంగా ఉంది.' అన్నాడు మావాడు.

'అందుకే ఈ గోలంతా వద్దుగాని, వాళ్ళిద్దర్నీ వదిలేసి నా శిష్యుడివైపో, ఏ బాధా ఉండదు. హాయిగా ఉంటుంది' అన్నా నవ్వుతూ.

'చివరకు అదే చేస్తాలేగాని, ప్రస్తుతం నా సందేహం నివృత్తి చెయ్యి' అన్నాడు మావాడు.

'రామాయణాలలో వాల్మీకి రామాయణం తర్వాతనే ఏదైనా. దానిప్రకారం ఆంజనేయస్వామి బ్రహ్మచారి. ఆయనకు పెళ్లి కాలేదు. కనుక మనం ఆయనకు కల్యాణం చెయ్యకూడదు. వాల్మీకి కాకుండా ఇంకా తొంభై ఆరు రామాయణాలు మనకున్నాయి. వాటిల్లో ఎవడికి తోచిన కధలు వాడు రాసి పారేశాడు. అవి నిజాలు కావు. ఈ కాకమ్మ కబుర్లు నమ్మకు.' అన్నాను.

'అసలేంటి ఇదంతా? చెప్పవా ప్లీజ్' అడిగాడు ఫ్రెండ్ దీనంగా.

'చెప్తా విను. సువర్చల అంటే అమ్మాయి కాదు. సు అంటే మంచి, వర్చల అంటే వర్చస్సు, వెరసి 'సువర్చల' అంటే మంచి తేజస్సు అని అర్ధం. ఆంజనేయస్వామి బ్రహ్మచారి. బ్రహ్మచర్యం పాటించే ఎవడికైనా మంచి వర్చస్సు ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ లాస్ ఉండదు కాబట్టి. అదే 'సువర్చల' అంటే. దానిని ఒక అమ్మాయిని చేసి ఆయన పక్కన కూచోబెట్టి ఆయనకు పెళ్లి చేస్తున్నారు అజ్ఞానులు. వాళ్ళ పబ్బం గడుపుకోడానికి అమాయకుల్ని ఫూల్స్ ని చేస్తున్నారు కొందరు సోకాల్డ్ పండితులు, పూజారులు. తెలీని గొర్రెలు మోసపోతున్నాయి. ఇదంతా పెద్ద ఫార్స్.' అన్నాను.

'అంతేనా? నాకూ ఇలాంటిదేదో ఉందనే అనిపించేది ఇన్నాళ్ళూ' అన్నాడు ఫ్రెండ్.

'అవును. ఇంకా విను. వినాయకుడు కూడా బ్రహ్మచారే. కానీ ఆయనకు సిద్ధి బుద్ధి అని ఇద్దరు అమ్మాయిల్ని జోడించాం మనం. వాళ్ళూ అమ్మాయిలు కారు. మరెవరు? విఘ్నేశ్వరుడు మంత్రసిద్ధిని ఇవ్వగలడు. సిద్ధి అంటే అదే. మంచి బుద్దినీ ఇవ్వగలడు. బుద్ధి అంటే అదే. ఆ రెంటినీ అమ్మాయిలుగా మార్చి ఆయనకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం.

యావరేజి హిందువుకు జీవితంలో తెలిసిన అతిగొప్ప ఎచీవ్ మెంట్ పెళ్లి ఒక్కటే. అంతకంటే వాడి బుర్ర ఎదగదు. అంతకంటే పెద్ద ఆదర్శమూ వాడి జీవితంలో ఉండదు. కనుక 'మాకు పెళ్ళోద్దురా బాబూ' అని పారిపోతున్న బ్రహ్మచారులకు కూడా కట్టేసి మరీ పెళ్ళిళ్ళు చేస్తాం మనం. చివరకు దేవుళ్ళను కూడా వదలం. ఇంకోటి చెప్తా విను. కుమారస్వామికి కూడా ఇద్దరు భార్యలని అంటారు కదా. అదీ అబద్దమే. ఎలాగో చెప్తా విను. శ్రీవల్లి సంగతి అలా ఉంచు. దేవసేన అని రెండో అమ్మాయి ఉంది కదా. ఆమె సంగతి విను.

కుమారస్వామి అనే దేవుడు దేవతల సైన్యానికి అధిపతిగా ఉండి తారకాసురుడిని చంపాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన దేవసేనాపతి. ఈ పదాన్ని దేవ-సేనాపతి (దేవతల సైన్యానికి అధిపతి)  అని చదవాలి. దాన్ని మనవాళ్ళు దేవసేనా-పతి అని విడదీసి దేవసేన అనే అమ్మాయికి పతి అని వక్రభాష్యం చెప్పారు. దేవసేనను ఒక అమ్మాయిగా మార్చి ఆయనకు పెళ్ళిచేశారు. దానికొక తంతు తయారు చేశారు. ఇలాంటి చీప్ పనులు చాలా చేశారు మన పండితులూ పూజారులూనూ. అందుకే వీళ్ళ మాటలు నమ్మకూడదు. అదీ అసలు సంగతి' అన్నాను.

పగలబడి నవ్వాడు మా ఫ్రెండ్. ' అమ్మో ఇదా అసలు సంగతి! నిజాలు తెలీకపోతే ఎంత మోసపోతాం మనం? అన్నాడు నోటిమీద వేలేసుకుంటూ.

'అంతేమరి ! దీంట్లో సైకాలజీ ఏంటంటే - పెళ్లి చేసుకుని మనం నరకం అనుభవిస్తున్నాం కదా, ఈ దేవుడుగాడు ఎందుకు సుఖంగా ఉండాలి? వీడికి కూడా ఒకటో రెండో పెళ్ళిళ్ళు చేసేస్తే అప్పుడు తిక్క కుదురుతుందనేది మన ఊహన్నమాట. అంటే, నేనొక్కడినే చావడం ఎందుకు? నాతోపాటు ఇంకొకడిని కూడా తీసుకుపోదాం అనే చీప్ మెంటాలిటీకి ఇవన్నీ రూపాలు. అర్ధమైందా? సరే నే వస్తా !' అంటూ నేను బయలుదేరాను.

'ఆజన్మబ్రహ్మచారికి కల్యాణం ఏంట్రా దేవుడా?' అంటూ కుర్చీలో కూలబడ్డాడు మా ఫ్రెండ్.
read more " ఆంజనేయ కళ్యాణము చూతము రారండి ! "

17, మే 2019, శుక్రవారం

'ధర్మపదము' - మా క్రొత్త E Book ఈరోజు విడుదలైంది

రేపు బుద్ధపౌర్ణమి. బుద్ధభగవానుని నేను ఎంతగానో ఆరాధిస్తాను. ఆయనంటే పడని చాందస హిందువులకు చాలామందికి ఇదే కారణంవల్ల నేను దూరమయ్యాను. అయినా సరే, నేను సత్యాన్నే ఆరాధిస్తాను గాని లోకులని, లోకాన్ని, కాదు. నా సిద్ధాంతాల వల్ల కొందరు వ్యక్తులు నాకు దూరమైతే, దానివల్ల నాకేమీ బాధా లేదు నష్టమూ లేదు. నేను అసహ్యించుకునే వారిలో మొదటిరకం మనుషులు ఎవరంటే - చాందసం తలకెక్కిన బ్రాహ్మణులే. మన సమాజానికి జరిగిన తీరని నష్టాలలో కొన్ని వీరివల్లనే జరిగాయి.

బుద్ధుని వ్యతిరేకించిన వారిలోనూ, అనుసరించిన వారిలోనూ బ్రాహ్మణులున్నారు. ఛాందసులు ఆయన్ను వ్యతిరేకిస్తే, నిస్పక్షపాతంగా ఆలోచించే శక్తి ఉన్న బ్రాహ్మణులు తమ వైదికమతాన్ని వదలిపెట్టి 2000 ఏళ్ళ క్రితమే ఆయన్ను అనుసరించారు. విచిత్రంగా - బుద్ధుని ముఖ్యశిష్యులలో చాలామంది బ్రాహ్మణులే. అయితే, వైదికమతంలా కాకుండా, ఆయన బోధలు కులాలకతీతంగా అందరినీ చేరుకున్నాయి. అందరికీ సరియైన జ్ఞానమార్గాన్ని చూపాయి. అదే బుద్ధుని బోధల మహత్యం.

కులానికీ మతానికీ బుద్ధుడు ఎప్పుడూ విలువనివ్వలేదు. సత్యానికే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. గుణానికీ, శీలానికీ, ధ్యానానికీ, దు:ఖనాశనానికీ ప్రాధాన్యతనిచ్చాడు. చాలామంది నేడు నమ్ముతున్నట్లుగా 'అహింస' అనేది ఆయన యొక్క ముఖ్యబోధన కానేకాదు. అయితే ఈ సంగతి చాలామందికి తెలియదు.

బుద్ధుని యొక్క ముఖ్యమైన బోధలన్నీ త్రిపిటకములలో ఉన్నాయి. ఆయా బోధలన్నీ ఈ దమ్మపదము (ధర్మపదము) అనే గ్రంధంలో క్రోడీకరింపబడి మనకు లభిస్తున్నాయి. 2000 సంవత్సరాల నాటి ఈ పుస్తకం మనకు ఇంకా లభిస్తూ ఉండటం మన అదృష్తం. దీనికి తెలుగులో వ్యాఖ్యానాన్ని వ్రాయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా బుద్ధుని అసలైన బోధనలు ఏమిటన్న విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు.

పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పూజలు చేస్తూ, లలితా పారాయణాలు, విష్ణు సహస్రపారాయణాలు చేస్తూ ఉండే బ్రాహ్మణులు ఎందఱో మనకు కనిపిస్తారు. కానీ సాటి మనిషితో ఎలా ప్రవర్తించాలి? మనసును మాటను చేతను ఎలా శుద్దంగా ఉంచుకోవాలి? అన్న విషయం మాత్రం వీరిలో చాలామందికి తెలియదు. ఇలాంటివారు బ్రాహ్మణులు అన్న పేరుకు తగరు. బ్రాహ్మణవంశంలో పుట్టిన చీడపురుగులు వీరంతా.

నిజమైన బ్రాహ్మణుడు ఎవరో వివరిస్తూ బుద్ధుడు అనేక సందర్భాలలో చెప్పిన మాటలు ఈ పుస్తకంలోని 26 అధ్యాయంలో వివరించబడ్డాయి. ఆయా నిర్వచనాలతో నేటి బ్రాహ్మణులలో ఎవరూ సరిపోరు. కనుక వీరంతా కులబ్రాహ్మణులే కాని నిజమైన బ్రాహ్మణత్వం వీరిలో లేదని నేను భావిస్తాను.

అసలైన జీవితసత్యాలను బుద్దుడు నిక్కచ్చిగా చెప్పాడు. అందుకే ఆయన్ని మన దేశంలోనుంచి తరిమేశాం. దశావతారాలలోని బలరాముణ్ణి తీసేసి ఆ స్థానంలో బుద్ధుడిని కూచోబెట్టి చేతులు దులుపుకున్నాం. కానీ బుద్ధుని బోధనలను మాత్రం గాలికొదిలేశాం. అంతటి ఘనసంస్కృతి మనది !

బుద్ధుని బోధలనే ఆయన తదుపరి వచ్చిన కొన్ని ఉపనిషత్తులూ, పతంజలి యోగసూత్రాలూ, భగవద్గీతా నిస్సిగ్గుగా కాపీ కొట్టాయి. క్రీస్తు బోధలు కూడా చాలావరకూ బుద్దుని బోధలకు కాపీలే. అయితే తన పూర్వీకులు అనుసరించిన యూదు మతాన్ని కూడా బుద్ధుని బోధలకు ఆయన కలిపాడు. అంతే తేడా ! కానీ బుద్ధుని పేరును మాత్రం హిందూమతం గాని, క్రైస్తవం గాని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది ఆయా మతాలు చేసిన సిగ్గుమాలిన పనిగా నేను భావిస్తాను. నేను హిందువునే అయినప్పటికీ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఈ విషయాన్ని నేను సతార్కికంగా నిరూపించగలను.

అప్పటివరకూ లేని ఒక క్రొత్తమార్గాన్ని బుద్ధుడు తను పడిన తపన ద్వారా, తన సాధనద్వారా ఆవిష్కరించాడు. లోకానికి దానిని బోధించాడు. ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఇప్పటికి కొన్ని కోట్లమంది జ్ఞానులైనారు. పరమస్వేచ్చను, బంధ రాహిత్యాన్ని, దుఖనాశనాన్ని పొందారు. 

బుద్ధభగవానుని ఉపదేశసారమైన 'ధర్మపదము' కు నేను వ్రాసిన వ్యాఖ్యానాన్ని E - Book రూపంలో ఈరోజున విడుదల చేస్తున్నాను. తెలుగులో ఇలాంటి పుస్తకం ఇప్పటివరకూ లేదని నేను గర్వంగా చెప్పగలను. త్వరలోనే దీని ఇంగ్లీష్ వెర్షన్ మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రింట్ పుస్తకం రేపు బుద్ధపౌర్ణిమ నాడు జిల్లెళ్ళమూడిలో అమ్మ పాదాల సమక్షంలో విడుదల అవుతుంది.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకెంతో సహాయపడిన నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, కవర్ పేజీల డిజైన్ అధ్బుతంగా చేసి ఇచ్చిన నా శిష్యుడు ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం google play books నుండి లభిస్తుంది.
read more " 'ధర్మపదము' - మా క్రొత్త E Book ఈరోజు విడుదలైంది "

5, మే 2019, ఆదివారం

ఆధ్యాత్మిక కులపిచ్చి

మన దేశంలో అంతా కులమయమే. వాడు ఎంత వెధవ అయినా సరే, 'మనోడు' అయితే చాలు, వాడిని చంకనెక్కించుకుంటాం. 'మనోడు' కాకపోతే వాడిలో ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోం, లేదా వాడిని అణగదోక్కేస్తాం. ఇది చేదునిజం.

మన దేశమూ, మన సమాజమూ పెద్ద మేడిపండులని గతంలో నేనెన్నో సార్లు వ్రాశాను. ఇది అబద్దం కాదు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో ఎక్కడ చూచినా ఈ 'కులపిచ్చి' మీదే అంతా నడుస్తూ ఉంటుంది. సినిమాలలో అయితే, 'మనోడు' కాకపోవడం వల్ల ఎందఱో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవకాశాలు రాక మట్టి కొట్టుకుపోయారు. అంత టాలెంట్ లేని నటులు కూడా 'మనోళ్ళు' అవ్వడంతో జనాల నెత్తిన రెండు మూడు దశాబ్దాల పాటు రుద్దబడ్డారు.

ఎమ్జీఆర్ ని చూచో, లేక తనకే బుద్ధి పుట్టిందో తెలీదు కాని, ఎన్టీఆర్ రాజకీయాలోకి వచ్చి పార్టీ పెట్టాక, సినీ పాపులారిటీని రాజకీయాలకు ఇలా కూడా వాడుకోవచ్చా అని సినీజీవులకు బాగా అర్ధమై, వాళ్ళు కూడా రాజకీయ షెల్టర్ తీసుకోవడమూ లేదా తమతమ కులాలను కూడగట్టుకుని పార్టీలు పెట్టడమూ చేసారు. దీనివల్ల ప్రజలు ఏమైపోయినా, కొందరు వ్యక్తిగతంగా బాగా సక్సెస్ అయ్యారు. ఇదంతా లోకవిదితమే.

మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ కులపార్టీలే. కులం అనేది 'లేదు లేదు' అని ఎంతమంది ఎంతగా అరిచి 'గీ' పెట్టినా అది రోజురోజుకీ బలపడుతూనే ఉంది. గతంలో కంటే ఇప్పుడింకా బలపడింది.

ఇదంతా అలా ఉంచితే, ఆధ్యాత్మికరంగం కూడా దీనికి మినహాయింపు కాకపోవడం విచిత్రాతి విచిత్రం.

బ్రహ్మంగారు మా వాడని కంసలివారు ఆయన్ను తప్ప ఇంకొకరిని కొలవరు. కన్యకాపరమేశ్వరి మా అమ్మాయి అని కోమటివారు ఆమెను తప్ప ఇంకొకరిని కొలవరు. ఇకపోతే వెంకటేశ్వరస్వామి కమ్మవారి కులదైవం. వారు శివుడి జోలికే పోరు. ఎందుకంటే, శివుడు డబ్బులివ్వడని వారి ప్రగాఢవిశ్వాసం. వేమనయోగి రెడ్డివంశంలో పుట్టాడు కనుక ఆయన మా దేవుడని రెడ్లు అంటున్నారు. కాశినాయనను కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. మొన్నమొన్నటి దాకా జనాన్ని తన మాయలతో మెస్మరైజ్ చేసిన సత్యసాయిబాబా గారు రాజుల వంశంలో పుట్టాడు గనుక, రాజులలో ఆయన భక్తులు ఎక్కువని ఒక మిత్రుడు ఈ మధ్యనే నాకు చెప్పాడు. రాజులు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలలో అందుకనే ఆయనకు ప్రాబల్యం ఎక్కువట.

ఇకపోతే, శ్రీ రామకృష్ణులు, రమణమహర్షీ, జిల్లెళ్ళమూడి అమ్మగార్లు బ్రాహ్మణులు గనుక వారి భక్తులలో బ్రాహ్మలే ఎక్కువట. మిగతా కులాలవారు వీరిని ఎక్కువగా ఇష్టపడరట. అరవిందులది క్షత్రియవంశం గనుక ఆయన అనుచరుల్లో క్షత్రియులు ఎక్కువట, ఇక ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణాలంటే కోపం గనుక ఈ దేవుళ్ళను ఎవరినీ వారు పూజించరట. అందుకే విదేశీప్రవక్త అయిన జీసస్ నే వాళ్ళు దేవుడిగా కొలుస్తారట.

ఈ గోలంతా వింటే, కులం అనేది మన రక్తంలో ఎంతగా జీర్ణించుకుపోయిందో, ప్రతివిషయాన్నీ కులం ఒక్కటే ఎలా డిసైడ్ చేస్తుందో, చివరకు దైవత్వాన్ని నిర్ణయించేది కూడా 'కులం' ఏ విధంగా అవుతున్నదో అని ఆశ్చర్యం వేసింది.

మొన్నీ మధ్యన రోడ్డుమీద వస్తుంటే, నెహ్రూనగర్లో ఎస్వీ రంగారావు విగ్రహం ఒకటి కనిపించింది. అది కీచకుని గెటప్ లో ఉంది. ఇదేం ఖర్మో నాకర్ధం కాలేదు. ఎన్టీఆర్ బొమ్మలు కూడా దుర్యోధనుడి వేషంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కీచకుడూ దుర్యోధనుడూ దుర్మార్గులు. మంచివాళ్ళు కారు. అన్యాయాలూ అక్రమాలూ రేపులూ చేసినవాళ్ళు. అలాంటి దుర్మార్గుల వేషాలలో తమ అభిమాననటులను చూచుకుని మురిసిపోవడం ఏం ఖర్మో నాకైతే అర్ధం కాలేదు. అన్యాయాలూ అధర్మాలూ చేసినవాళ్ళ వేషాలలో ఉన్న వారిని పూజించడం ఆరాధించడం దేనికి సంకేతమో నాకైతే అర్ధంకావడం లేదు. ఎన్టీఆర్ దుర్యోధనుడి వేషంలో ఉన్నాడు గనుక, కీచకుడి వేషంలో ఎస్వీఆర్ ను పెట్టారన్నమాట కాపులు? ఇంకే వేషమూ దొరకనట్లు? వెనకటికి ఒకడు ఒంటికి నిప్పు పెట్టుకుంటే, ఇంకొకడు ఇంటికి నిప్పు పెట్టుకున్నాడట. అలా ఉంది. ఏంటో ఈ వేలం వెర్రి? అని బాధేసింది.

ఒక కులంలో పుట్టినంత మాత్రాన 'టాలెంట్' అనేది రాదు. 'టాలెంట్' ఉన్నవాళ్ళు అన్ని కులాలలోనూ ఉంటారు. కులాలకు అతీతంగా 'టాలెంట్' అనేదాన్ని గుర్తించి దానికివ్వాల్సిన మెప్పును దానికి అందించే  పరిస్థితి మన సమాజంలో రావాలి.

అదేవిధంగా, ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఎవడూ మహనీయుడు అవడు. కులాన్నీ మతాన్నీ ప్రాంతాన్నీ దేశాన్నీ, ఈ లిమిట్స్ అన్నింటినీ దాటిన భూమికను అందుకున్నవాడే ఆధ్యాత్మికంగా మహనీయుడౌతాడు. మహనీయులకు ఏ కులమూ ఉండదు. ఏ మతమూ ఉండదు. మానవసంబంధమైన పరిమితులను అన్నింటినీ వారు దాటిపోతారు. ఈ సింపుల్ విషయాన్ని అర్ధం చేసుకోకుండా, 'మన కులంలో పుట్టాడు గనుక వీడే మన దేవుడు' అంటూ, మిగతా దేవుళ్ళకు పోటీగా వీరికి కూడా గుళ్ళు కట్టించి ఆర్భాటాలు చెయ్యడం చూస్తుంటే మన జనాలు ఎప్పటికీ ఎదగరేమో అని నాకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది.

నిజమైన మహనీయుడెవడూ 'నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, ఊరకే నన్ను నమ్ము చాలు. నిన్ను నేను రక్షిస్తాను. నీదంతా నేనే చూసుకుంటాను.' అని ఎన్నడూ చెప్పడు. అలా చెప్పేవాడు అసలు మహనీయుడే   కాడు. 'ముందు నువ్వు ధర్మంగా బ్రతుకు. ఆ తర్వాత నా దగ్గరకు రా. అప్పుడు చూద్దాం' అనే అంటాడు. బుద్ధుడు కూడా ఇదే  స్పష్టంగా   చెప్పాడు గనుక ఆయన్ను మన దేశం నుంచే బయటకు తరిమేశాం. అంత గొప్ప సమాజం మనది !

మొన్నొక మిత్రుడు ఇలా అన్నాడు.

'మా ఏరియాలో రామాలయానికి ఎవరూ పోవడం లేదు. ఎప్పుడు చూచినా అది నిర్మానుష్యంగా ఉంటోంది. కానీ షిర్డీ సాయిబాబా గుడి మాత్రం కిటకిటలాడుతోంది. ఏంటీ వింత?'

అతనికిలా చెప్పాను.

'మనుషులలో పెరుగుతున్న అధర్మానికి, స్వార్ధానికి ఇది గుర్తు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. నీ కోరికలు అప్పనంగా ఆయన తీర్చడు. నువ్వు ధర్మంగా ఉన్నప్పుడే ఆయన మెచ్చుతాడు. లేకుంటే మెచ్చడు. సాయిబాబా అయినా అంతే. కాకపోతే, శ్రీరాముడు దేవుని అవతారం. సాయిబాబా కాదు. ఆయనొక ముస్లిం సాధువు. కానీ కొందరు కుహనా గురువులు ఆయనను ఒక దేవుడిని చేశారు. అన్ని కోరికలూ అప్పనంగా తీరుస్తాడని ప్రచారం చేసారు. గొర్రెజనం నమ్ముతున్నారు. ఎగబడుతున్నారు. రాముడినీ, ధర్మాన్నీ వదిలేశారు. స్వార్ధంతో కొట్టుకుంటున్నారు. అందుకే సాయిబాబా గుడి కిటకిట లాడుతోంది. రామాలయంలో ఎవరూ ఉండటం లేదు. అంతే ! వెరీ సింపుల్ !' అన్నాను.

మనిషి - కులానికి, స్వార్ధానికి, మోసానికి పెద్ద పీట వేసుకుని, తమకు నచ్చినవారిని దేవుళ్ళుగా మార్చుకుని, గుడులు కట్టుకుని, వారిని పూజిస్తూ, ఆరాధిస్తూ, అదే పెద్ద ఆధ్యాత్మికత అనుకుంటూ భ్రమిస్తూ ఉన్నంతకాలం ఈ సమాజం ఇలాగే అఘోరిస్తూ ఉంటుంది.

కులపిచ్చితో, స్వార్ధంతో, అధర్మంతో, కుళ్ళిపోతున్న ఇలాంటి సమాజానికి నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం కలుగుతుందని ఆశించడం ఒక పెద్ద భ్రమ. అంతే !
read more " ఆధ్యాత్మిక కులపిచ్చి "

29, ఏప్రిల్ 2019, సోమవారం

ప్రహ్లాదుడు ఎదురింట్లో ఉండాలి. మనింట్లో కాదు

కొంతకాలం క్రితం ఒకాయన నాకు తెగ ఫోన్లు చేస్తూ ఉండేవాడు. ఎందుకు చేస్తున్నారు అనడిగితే 'నేను ఒకసారి గుంటూరు వచ్చి మిమ్మల్ని కలవాలి. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి?' అని అడుగుతూ ఉండేవాడు. 'కారణం ఏమిటి?' అంటే చెప్పెవాడు కాడు. 'మిమ్మల్ని కలవాలి, వచ్చినప్పుడు చెబుతాను' అని అంటూ ఉండేవాడు.

ఇలాంటి వారిని కలవడానికి నేనేమీ ఇక్కడ ఖాళీగా లేను గనుక - 'నాకు కుదరదు'  అని చెబుతూ ఉండేవాడిని.

'పోనీ వీకెండ్ లో అయినా ఖాళీ రోజు చెప్పండి. వస్తాను' అనేవాడు.

'వీకెండ్ లో  మరీ బిజీగా ఉంటాను. అస్సలు కుదరదు' అని చెబుతూ ఉండేవాడిని.

అయినా సరే, పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోన్లు చేస్తూనే ఉండేవాడు.

అలా ఒకసారి  ఫోన్ చేసినపుడు, 'అసలు మీకేం కావాలి? ఎందుకు నాకిలా మాటమాటకీ  ఫోన్ చేస్తున్నారు?' అనడిగాను.

'మాకొక సమస్య ఉంది. దానికి సొల్యూషన్  కావాలి' అన్నాడు.

'సారీ. సమస్యలు తీర్చడం నా పని  కాదు. నాకే   బోలెడన్ని సమస్యలున్నాయి. వాటిని తీర్చేవారి కోసం నేనూ వెదుకుతున్నాను. దొరికితే అడ్రస్ మీకూ ఇస్తాను. ఆయన్ని కలవండి' అని చెప్పాను.

'అది కాదు. మా సమస్య మీరే' అన్నాడు.

' నేనా?' ఆశ్చర్యపోయాను.

'అవును. మీరే' అన్నాడు.

'ఎలా?' అన్నాను.

' మా అబ్బాయి మీ ఫాలోయరు' అన్నాడాయన.

' సరే. ఇందులో సమస్య ఏముంది?' అడిగాను.

'అదే అసలు సమస్య. మా వాడు మీ పుస్తకాలు విపరీతంగా చదువుతున్నాడు. ఎప్పుడు చూసినా మీ మాటలే మాట్లాడుతూ ఉన్నాడు' అన్నాడు.

'ఇందులో తప్పేముంది?' అడిగాను.

'మావాడికి ఇంకా ముప్పై కూడా రాలేదు.ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇప్పుడే  ఆధ్యాత్మికం ఏంటి?' అన్నాడు దురుసుగా.

'ఓహో అదా విషయం? మరి ఆధ్యాత్మికత ఏ వయసులో కావాలి?' అడిగాను.

' అది పెద్ద వయసులో కదా కావలసింది?' అన్నాడు ఇంకా విసురుగా.

' అలాగా !   మీకిప్పుడు ఎన్నేళ్ళు?'  అడిగాను.

'అరవైకి దగ్గరలో ఉన్నాను' అన్నాడు.

'మరి మీకు  వచ్చిందా ఆధ్యాత్మికత?' అడిగాను.

' నేను డైలీ యోగా చేస్తాను' అన్నాడు కోపంగా.

' ప్రతి ఏడాదీ షిరిడీ తిరుపతీ కూడా వెళుతుంటారా?' అన్నాను నవ్వుతూ.

' అవును' అన్నాడు.

' అయ్యప్ప   దీక్ష కూడా చేస్తుంటారా?' అడిగాను.

' ప్రతి ఏడాదీ చేస్తాను. ఇప్పటికి ఇరవై సార్లు శబరిమల వెళ్లాను' అన్నాడు  గర్వంగా.

'ఇంతమాత్రానికే ఆధ్యాత్మికత మీకు వచ్చిందని, అసలిదొక ఆధ్యాత్మికతనీ అనుకుంటున్నారా?'  అడిగాను.

జవాబు లేదు.

' పోనీ, మీరు నా పుస్తకాలు చదివారా?' అడిగాను.

' లేదు' అన్నాడు.

'మరి చదవకుండా వాటిల్లో ఏముందో మీరేం చెప్పగలరు?' అడిగాను.

' అదికాదు.  మా వాడు మిమ్మల్ని ఫాలో  అవడం  మాకిష్టం లేదు' అన్నాడు.

'నేనేమీ చెడిపోమ్మని ఎవరికీ చెప్పడం లేదు. మంచినే చెబుతున్నాను. ధర్మంగా బ్రతకమని చెబుతున్నాను. ఇందులో తప్పేముంది?  అసలీ విషయాలు మీ పిల్లలకు మీరు చెప్పాలి. మీరు చెయ్యని పనిని నేను చేస్తున్నందుకు మీరు నాకు థాంక్స్ చెప్పాల్సింది పోయి ఇలా అరుస్తున్నారేంటి?' అడిగాను.

'ఏదేమైనా సరే, మావాడు మీ పుస్తకాలు చదవడం మాకు నచ్చదు' అన్నాడాయన.

'మానిపించుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు'  అన్నాను.

'మీరు చెప్పండి' అన్నాడాయన గట్టిగా.

'నేను చెప్పను. అతనే పుస్తకాలు చదవాలో నేనెలా డిసైడ్ చేస్తాను? అది  అతనిష్టం' అన్నాను.

'మరి మేమేం చెయ్యాలి?' అన్నాడు.

'నాకేం తెలుసు? అది మీ సమస్య. మీరే  తీర్చుకోవాలి. నేను ముందే చెప్పాకదా నేనున్నది సమస్యలు తీర్చడానికి కాదని' అన్నాను నేనూ గట్టిగానే.

ఫోన్ కట్ అయిపోయింది.

భలే నవ్వొచ్చింది.

పరిపూర్ణంగా ఎలా జీవించాలో, ఆనందంగా  ఎలా జీవించాలో తప్ప ఇంకేమీ నా పుస్తకాలలో ఉండదు. మంచిగా, ధర్మంగా ఎలా జీవించాలో  తప్ప ఇంకేమీ ఉండదు. ఇది చెడెలా అవుతుందో నాకైతే అర్ధం కావడం లేదు.

'మా అబ్బాయి  మీ పుస్తకాలు చదివి మంచిగా తయారౌతున్నాడు. వాడి ఈడు పిల్లలు హాయిగా తాగుతూ తిరుగుతూ అవినీతి డబ్బు ఎలా సంపాదించాలో  నేర్చుకుంటూ ఉంటే మావాడు మీ పుస్తకాలు చదివి మంచిగా చెడిపోతున్నాడు. ఇది మాకిష్టం  లేదు' - అని తల్లిదండ్రులు అంటున్నారు. ఇక ఆ తల్లిదండ్రులు ఎలాంటి మనుషులై ఉంటారో వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.  రాక్షసకులంలో ప్రహ్లాదుడు పుట్టినట్లు కొందరు పిల్లలు పుడుతూ ఉంటారు. వాళ్ళు మంచిమార్గంలో నడవడం ఆ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.

హిరణ్యకశిపులూ ప్రహ్లాదులూ పాతయుగాలలోనే కాదు, ఇప్పుడూ ఉన్నారు.

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఒక మాటను తరచుగా అనేవారు - 'ప్రహ్లాదుడు ఎదురింట్లో  ఉండాలి. మనింట్లో కాదు' అని.

ప్రహ్లాదచరిత్ర చదివి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాం. 'అబ్బా ! పాపం! దేవుడి కోసం ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడో' అంటూ. కానీ మన పిల్లలు ధర్మమార్గంలో నడుస్తూ, నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతూ ఉంటె మాత్రం సహించలేం. ఇదీ లోకం తీరు !

ఆధ్యాత్మికమైనా, దేవుడైనా, ఇంకేదైనా  సరే !  అది మన ఇష్టం వచ్చినట్లు ఉండాలి గాని, అది చెప్పినట్టు మనం ఉండం !  ఇదీ మన వరస !

నా పుస్తకాలు చదివి చెడిపోతున్నారట ! చెడిపోవడం అంటే ఏమిటో అసలు? తాగి తందనాలాడుతూ, ఫ్రెండ్స్ తో కలసి తిరుగుతూ, యూ ట్యూబులో ఫోర్న్ చూస్తూ, అమ్మాయిల వెంట పడుతూ ఉంటె బాగుపడటం అన్నమాట నేటి తల్లిదండ్రుల దృష్టిలో ! దానికి విరుద్ధంగా మంచి పుస్తకాలు చదువుతూ, మంచి సర్కిల్ లో ఉన్నవారితో స్నేహం చేస్తూ, మంచిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటె, దానిని ' చెడిపోవడం' అంటున్నారు !

అద్భుతం ! గొప్ప తల్లిదండ్రులురా బాబూ ! 

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఎన్ని సంఘటనలను చూచిన పిదప ఈ మాటన్నారో గాని  అది అక్షర సత్యం.

' ప్రహ్లాదుడు ఎదురింట్లో ఉండాలిగాని మనింట్లో ఉండకూడదు'

కరెక్టే కదూ !
read more " ప్రహ్లాదుడు ఎదురింట్లో ఉండాలి. మనింట్లో కాదు "

26, మార్చి 2019, మంగళవారం

గుడ్డి గురువులు - 3

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఫంక్షన్ జరుగుతూ ఉండగా, ఇంకొకాయన్ని తీసుకొచ్చి 'ఈయన మా ఇంకో గురువుగారు' అంటూ మళ్ళీ పరిచయం చేశాడు మొదటాయన.

'ఈయన మూడో కృష్ణుడన్నమాట' అనుకుంటూ ఆయనవైపు నిర్లిప్తంగా చూస్తూ జీవం లేని చిరునవ్వొకటి నవ్వాను.

ఆయనకూడా నావైపు అలాగే చూస్తూ 'నమస్కారం' అన్నాడు ఏదో అనాలి అన్నట్టు.

నేనుకూడా ఏడిచినట్టు ముఖం పెట్టి 'నమస్కారం' అన్నాను. కానీ లోలోపల మాత్రం నవ్వు ఉబికి వస్తోంది.

ఇక మూడో గురువుగారి పరిచయం మొదలైంది.

'ఈయన ఫలానా గుళ్ళో ఉంటారు. ఒకరోజున ఈయన నన్ను రమ్మని పిలిచారు. ఏంటా అని వెళ్లాను. నువ్వు ఈ రోజంతా ఎక్కడికీ వెళ్లొద్దు. ఈ గుళ్లోనే ఉండు' అన్నారు. 'ఎందుకు?' అనడిగాను. 'భూమిలోనుంచి అమ్మవారు వస్తుంది' అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మధ్యాన్నానికి నేలలోంచి అమ్మవారు వచ్చింది' అన్నాడు పరిచయం చేసినాయన.

హటాత్తుగా నా బ్రతుకు మీద నాకే విపరీతమైన అసహ్యం వేసింది. 'చూసేవాళ్ళకి మరీ ఇంత వెర్రి వెంగళప్పలాగా కనిపిస్తున్నానా?' అని అనుమానం వచ్చి ఒక్కసారి నన్ను నేనే తాట ఊడేలా గట్టిగా గిచ్చుకున్నా.

'ఏంటండీ అలా గోక్కుంటున్నారు?' అన్నాడు గురువుగారు.

'గిచ్చుకోదానికీ గోక్కోడానికీ తేడా తెలియదు వీడికి' అని మనసులో అనుకుంటూ, మళ్ళీ జవాబు సరిగా చెప్పకపోతే, 'గుడికి రండి, తీర్ధం ఇస్తా' అంటాడేమో అని భయం వేసి, ' అబ్బే అలాంటిదేం లేదండి. ఊరకే జస్ట్ ఏదో పాకినట్టుంటేనూ' అన్నా మొహమాటంగా నవ్వుతూ.

నేను సరిగా వినలేదేమో అని అనుమానం వచ్చినట్టుంది. మళ్ళీ అమ్మవారు నేలలోనుంచి బయటకు రావడం సీనంతా వివరించాడు మొదటాయన.

నేను అనుమానంగా గురువుగారి ముఖంలోకి చూచాను.

ఆయన నేలచూపులు చూస్తూ 'ఏదోలెండి అమ్మవారి దయ' అన్నాడు వినయంగా.

'ఏ అమ్మవారు నాయనా. ఇంట్లో అమ్మవారా? లేక బయట అమ్మగారా?' అందామని నోటిదాకా వచ్చిన మాట నోట్లోనే ఆగిపోయింది.

'అంత చెప్పినా కూడా నా దగ్గర నుంచి ఆశ్చర్యం గాని, ఇంకోటి గాని రాకపోయే సరికి వాళ్ళకూ నేనంటే చిరాకు వేసినట్టుంది, 'సరే ఉంటానండి' అన్నాడు మర్యాదగా చేతులు జోడిస్తూ. 'మంచిదండి' అన్నా నేనూ అదే రాగంలో.

ఇది చాలా ప్రిమిటివ్ ట్రిక్. ఆటవిక సమాజాలు ఉన్నప్పటినుంచీ ఈ ట్రిక్ భూమ్మీద ఉంది. నేలలో విగ్రహాలు పాతిపెట్టి అక్కడ తవ్వించి, 'స్వామి బయటకు వచ్చాడు. అమ్మవారు బయటకు వచ్చింది' అని జనాన్ని నమ్మించే దొంగపూజారులు దొంగస్వాములు పాతకాలంలో ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారన్నమాట అని మళ్ళీ రుజువైంది. కొంతకాలం క్రితంవరకూ జనం వేలం వెర్రిగా పూజించిన ఒక బాబాగారు ఈ ట్రిక్ చెయ్యడంలో సిద్ధహస్తులు. నది ఒడ్డున ఇసకలో కృష్ణుడి విగ్రహం పాతిపెట్టి, మళ్ళీ దాన్నే తవ్వి బయటకు తీసి, పెద్ద పెద్ద సైంటిస్టులను కూడా బోల్తా కొట్టించిన ఘనుడాయన.

ఆ తర్వాత అందరూ చందాలేసుకుని ఆ విగ్రహానికి గుడి కట్టడమూ, ఆ గుడిమీద పడి ఈ మెజీషియన్ బ్రతికెయ్యడమూ జరుగుతూ ఉంటుంది.

పనీపాటా చెయ్యకుండా లోకంలో ఇతరుల మీద పడి ఊరకే బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళనే పారాసైట్స్ అనవచ్చు. వీళ్ళలో రెలిజియస్ పారాసైట్స్ మరీ నీచులు. ఇలాంటి వారంటే నాకు చెప్పరానంత అసహ్యం. ఏదో ఒక గుడినో స్వామీజీనో ఆశ్రయించి ఇలా బ్రతికేస్తూ ఉండేవారికంటే, కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికేవారికే నేను ఎక్కువ విలువనిస్తాను.

19 ఏళ్ళ వయసులో ఉన్నపుడు స్వామీజీ అయ్యే అవకాశం నాకొచ్చింది. కానీ అది పారాసైట్ బ్రతుకని నేను దాన్ని తిరస్కరించాను. ఎప్పుడో ముప్పై అయిదేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన ఒక్కసారి నా కళ్ళముందు మళ్ళీ మెదిలింది.

ఏంటో ఈ మాయ లోకం? అసలైన దానికి విలువ ఉండదు. నకిలీకి విపరీతమైన విలువ ఉంటుంది. ఈ ప్రపంచం తీరు ఇంతేనేమో? ఎప్పటికీ ఇది మారదేమో? అన్న ఆలోచనలు నాలో కలిగాయి.

'బుద్ధుడికి మర్రిచెట్టు కింద జ్ఞానోదయం అయింది. నీకు మామిడిచెట్టు పక్కనే అయిందన్నమాట' అంటూ నవ్వుతున్న కర్ణపిశాచి స్వరం స్టేజిమీద నుంచి హటాత్తుగా వినిపించి నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

తలతిప్పి అటువైపు చూసిన నాకు, పురోహితుడి పక్కనే కూచుని మంత్రాలు చదువుతున్నట్టు పోజు కొడుతున్న కర్ణపిశాచి కనిపించింది.

నవ్వుతూ దానివైపు చెయ్యి ఊపాను. అదీ నన్ను చూస్తూ చెయ్యి ఊపింది.

తనకు చెయ్యి ఊపుతున్నాననుకుని పురోహితుడు నావైపు కోపంగా చూస్తున్నాడు.

'చూశావా నిన్నెలా బోల్తా కొట్టించానో?' అన్నట్లుగా కర్ణపిశాచి పగలబడి నవ్వుతోంది.

(అయిపోయింది)
read more " గుడ్డి గురువులు - 3 "