30, జనవరి 2017, సోమవారం

'USA Panchawati' website ఈరోజు ప్రారంభం అయింది

గత ముప్పై ఏళ్ళుగా యోగ - వేదాంత - తంత్ర సాధనామార్గంలో నడచిన నేను ప్రత్యక్షంగా దర్శించిన సత్యాలను అనుభవాలను గుదిగుచ్చి నాదంటూ విభిన్నమైన సాధనా విధానాన్ని ఒకదాన్ని తయారు చేశాను. నా ఈ మార్గం నచ్చి దానిలో నడవాలని ఆరాటపడుతున్న వాళ్ళంతా కలసి "పంచవటి" అని ఒక ఫౌండేషన్ ప్రారంభించాం.ఈ దారిలో నడుస్తూ నన్ననుసరిస్తున్న వారు ఇండియాలోనూ అమెరికాలోనూ చాలామంది ఉన్నారు.

మా "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" కు రెండు వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇండియా ఫౌండేషన్ కు ఒకటి. అమెరికా ఫౌండేషన్ కు ఒకటి. ఇండియా వెబ్ సైట్ చాలా కాలం నుంచీ ఉంది.నా ఇండియా శిష్యులు ఈ మధ్యనే దీనికి కొత్తగా మార్పులు చేర్పులు చేసి కొంగ్రొత్త రూపాన్నిచ్చారు.వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు.

మేమేం తక్కువ తిన్నామా అంటూ నా అమెరికా శిష్యులు శిష్యురాళ్ళు  కలసి USA Foundation Web Site ను చాలా కష్టపడి తయారు చేశారు. అది ఈరోజు ప్రారంభం చెయ్యబడింది. దీని వెనుక ఎంతో ప్లానింగ్, ఎంతో శ్రమా దాగి ఉన్నాయి.సైట్ డిజైన్, ఫీచర్స్ అన్నీ  చాలా బాగున్నాయి. ఈ పాజెక్ట్ లో పాలు పంచుకున్న USA Team Members అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మొదట్లో ఒకే వెబ్ సైట్ ఉంటె బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇండియా పౌండేషన్ కార్యక్రమాలు వేరు. అమెరికా ఫౌండేషన్ కార్యక్రమాలు వేరు, రెండింటి కార్యవర్గ సభ్యులు వేర్వేరు గనుక ప్రస్తుతానికి రెండు సైట్స్ గా ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు మేం చేస్తున్న కార్యక్రమాలు ఆయా సైట్స్ లో ఆడియో వీడియోలుగా ఫోటోలుగా ఉంచబడతాయి.

USA web site ను చూడటం కోసం ఇక్కడ నొక్కండి.
read more " 'USA Panchawati' website ఈరోజు ప్రారంభం అయింది "

24, జనవరి 2017, మంగళవారం

శనీశ్వరుని రాశి మార్పు - ధనూరాశి ప్రవేశం - ఫలితాలు

26-1-2017 గురువారం నాడు, పూర్వాషాఢ నక్షత్ర పరిధిలో మధ్యాన్నం 2 గంటల 07 నిముషాలకు శనీశ్వరుడు రెండున్నరేళ్ళుగా తానుంటున్న వృశ్చికరాశిని వదలిపెట్టి ధనూరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. ఈ రాశిమార్పు ఎందరి జీవితాలలోనో పెనుమార్పులు తీసుకు రాబోతున్నది. ఈరోజు మన రిపబ్లిక్ డే కూడా.

ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మనిషి జీవితం మీద గ్రహప్రభావం ఉండటం నిజమే. దీనివల్ల మనిషి జీవితంలో అనేక మార్పులు చేర్పులు కలగడమూ నిజమే.

జ్యోతిశ్శాస్త్రంలో శనీశ్వరుని కర్మకారకునిగా భావిస్తారు. అంటే - సామాన్యంగా మనిషి చేసే రోజువారీ కర్మ గాని, అతను బ్రతకడం కోసం చేసే వృత్తి గాని ఈయన ఆధీనంలోనే ఉంటుంది. శనీశ్వరుని ప్రభావానికి గురికాని వ్యక్తి  ఈ భూమిమీద ఎవడూ ఉండడు.రాజులైనా బంటులైనా ఆయన చెప్పినట్లు వినవలసిన వారే.

జాతకంలో శనీశ్వరుని స్థితిని బట్టి ఆ జాతకుని వృత్తిలోని ఎగుడు దిగుళ్ళను తేలికగా గ్రహించవచ్చు. ప్రస్తుతం 26 తేదీన జరుగబోతున్న ఈ గోచారం, ద్వాదశ రాశులను ఎలా ప్రభావితం చేస్తుందో స్థూలంగా చూద్దాం.

నక్షత్ర ఫలితం:--
నక్షత్రాధిపతి అయిన శుక్రుడు (వింశోత్తరీ దశా రీత్యా) కేతువుతో కలసి శనిరాశి అయిన కుంభంలో ఉన్నందువలన - అనేకమంది భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది.వీరిలో కొంతమంది విడాకులు తీసుకుంటారు.మరికొందరు అలా తీసుకోకుండానే విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు. వీరు గాక ఇంకా ఎంతోమందికి అభిప్రాయ భేదాలు వచ్చి మానసికంగా వారిమధ్యన అగాధాలు ఏర్పడటం జరుగుతుంది. దీనికి నిదర్శనంగా ఎంతోమంది కుటుంబాలలో ఇప్పటికే గొడవలు తారాస్థాయికి చేరుతూ ఉండటాన్ని గమనించండి.

అలాగే - స్నేహితులు గాని, కుటుంబ సభ్యులుగాని,సంస్థలుగాని, మిత్రరాజ్యాలు గాని, చాలాకాలంగా కలిసున్నవారు - వారి మధ్యన విభేదాలు వచ్చి విడిపోవడం తప్పకుండా జరుగుతుంది.

వార ఫలితం :-- 
వారాధిపతి మరియు హోరాధిపతి అయిన గురువుపైన శుక్రోచ్చరాశియగు మీనం నుంచి కుజుని దృష్టి వల్ల,శని గోచారం జరుగుతున్న ధనుస్సు గురురాశి కూడా కావడం వల్ల - అనేకులలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోతుంది.కానీ అది ప్రాక్టికల్ గా శుద్ధంగా ఉండకుండా, ఉత్తగా గ్రంధాలు చదవడం,వాద ప్రతివాదాలు చేసుకోవడంతోనే అదంతా అంతమౌతుంది.అనవసర మాటలవల్లా,ఆడవారి వ్యవహారాల వల్లా,గురువులకు చెడ్డపేరు రావడం,వారిపైన విమర్శలు మేధోపరమైన దాడులు జరగడం చూస్తారు.గురువులకు ఖర్మ ఎక్కువౌతుంది.

ఈ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.గమనించండి.

మేషరాశి
దూరపు వ్యక్తులు దగ్గరౌతారు.దూరపు ప్రాంతాలకు బదిలీలు అవుతాయి.కొత్త ఉద్యోగాలు వస్తాయి.జీవితంలో కొత్త మలుపులు ఎదురౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.తండ్రికి, గురువుకు లేదా పెద్దలకు గండకాలం.

వృషభరాశి
అష్టమశని ప్రారంభం అవుతుంది.దీని ఫలితంగా మానసిక వత్తిడి, క్రుంగుబాటు, నలుగురితో విరోధం, అనవసర మాటలు ఎక్కువౌతాయి.అనేక కష్ట నష్టాలు చుట్టు ముడతాయి.

మిథునరాశి
దూరప్రాంతాలకు మార్పు ఉంటుంది. పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడటం జరుగుతుంది. విరక్తితో ఇల్లు వదలి వెళ్ళిపోతారు.లేదా అలాంటి ఆలోచనలు కలుగుతాయి. చుట్టు పక్కల వారితో మాటా మంతీలో అభిప్రాయ భేదాలవల్ల పరస్పర సంబంధాలు దెబ్బ తింటాయి.

కర్కాటకరాశి
ఇంటిలో గొడవలు పెరుగుతాయి. చర్చలు జోరుగా జరుగుతాయి. శత్రుబాధ, పోరు మిక్కుటంగా ఉంటుంది. కానీ చివరకు అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి
రహస్య ప్రేమ వ్యవహారాలు,స్నేహాలు పెరుగుతాయి. ఇంకొందరిలో ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది.నిర్లిప్తతా వైరాగ్యమూ పెరిగిపోతాయి.నెగటివ్ థింకింగ్ ఎక్కువై నీరస పడిపోతారు.ఏం చెయ్యాలో అర్ధంకాని సందిగ్ధ పరిస్థితి ఎదురౌతుంది.ధైర్యం సన్నగిల్లుతుంది.

కన్యారాశి
అర్దాష్టమ శని మొదలౌతుంది.ఇష్టంలేని ఉద్యోగాలు చెయ్యవలసి వస్తుంది.చదువు లేదా ఉద్యోగ రీత్యా ప్రాంతపు మార్పు ఉంటుంది.ఇంటిలో మనశ్శాంతి కరువై పోతుంది. కుటుంబ వ్యవహారాలు చీకాకును సృష్టిస్తాయి.మనసు డిప్రెషన్ లో పడుతుంది.

తులారాశి
ఏడున్నరేళ్ళుగా వీరు పడుతున్న ఏలినాటి శని వదలి పోతుంది.కనుక వీరిని విజయాలు వరిస్తాయి.వెలుగు కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కనిపిస్తుంది.మాట చెల్లుబాటవుతుంది.తరచూ ప్రయాణాలు ఊపందుకుంటాయి. అయితే వాటిల్లో ప్రమాదాలు జరిగే సూచన కూడా ఉన్నది.

వృశ్చికరాశి
వీరికి ఏలినాటి శని మూడవ పాదం మొదలైంది. కనుక ఇంటివారితో, స్నేహితులతో అనవసర మాటల వల్ల గొడవలు అవుతాయి. ఒకటి చెబితే ఇంకొకటిగా అర్ధం చేసుకోబడుతుంది. ఇది మనస్పర్ధలకు దారితీస్తుంది.కంటి రోగాలు బాధిస్తాయి. డబ్బు నష్టపోతారు.

ధనూరాశి
అందరిలోకీ ఈ రాశివారు బాగా నష్టానికి గురౌతారు.ఎందుకంటే వీరికి ఏలినాటిశని రెండోపాదం మొదలౌతుంది.అన్ని రంగాలలో వీరిని దురదృష్టం మొదలౌతుంది.మానసికంగా క్రుంగిపోయి ఒంటరివారౌతారు.అనవసర ఊహల వల్ల వాస్తవానికి దూరంగా జరిగి అంతర్ముఖులౌతారు.దీనివల్ల సమాజంతో వీరి సంబంధాలు దెబ్బతింటాయి. స్వయంకృతాపరాధాలు ఎక్కువౌతాయి.

మకరరాశి
వీరికి ఏలినాటి శని మొదలౌతున్నది.కనుక కష్టాలు మొదలౌతాయి. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఎదురౌతుంది. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆస్పత్రి ఖర్చులతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ నేపధ్యంలో నష్టాలు కష్టాలు ఉంటాయి.మానసిక చింత వెంటాడుతుంది.ప్రేమ వ్యవహారాలలో, భార్యాభర్తల గొడవలలో మనసు చాలా డిప్రెషన్ కు గురౌతుంది.

కుంభరాశి
వీరికి అంతా లాభంగా ఉంటుంది.రహస్య ప్రేమ వ్యవహారాలు మొదలౌతాయి.స్నేహితులు ఎక్కువౌతారు.అయితే దీనివల్ల ఇంటిలో మనస్పర్ధలు గొడవలు జరుగుతాయి.జీవిత భాగస్వామితో మానసికంగా దూరం పెరుగుతుంది.వ్యాపారం కలిసి వస్తుంది.సంఘంలో మంచి పేరు వస్తుంది.ధనానికి లోటు ఉండదు.అంతా లాభసాటిగా ఉంటుంది.

మీనరాశి
వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది.అయితే 'ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే' అనే ఒక విధమైన నిర్లిప్త ధోరణి ఎక్కువౌతుంది.ఇంటిలోనూ వృత్తిపరంగానూ అనేక మార్పులను చూస్తారు.ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఇంటిని వదలి దూర ప్రాంతాలకు పోవలసి వస్తుంది.తనవారితో విరోధం కలుగుతుంది.వృత్తి పరంగా మార్పులు ఉంటాయి.
---------------------------------------
ఇవన్నీ స్థూలఫలితాలు మాత్రమే.ఎందుకంటే ప్రపంచ జనాభాను పన్నెండు రాశులుగా విభజిస్తూ ఈ ఫలితాలను అంచనా వెయ్యడం జరుగుతుంది.కనుక ఇవి బ్రాడ్ ఇండికేషన్స్ మాత్రమే. వ్యక్తిగత జాతకాలతో సమన్వయం చేసుకుని గోచార ఫలితాలను అర్ధం చేసుకోవాలి.

దానిని బట్టి తగిన రెమెడీస్ పాటించడం వల్ల చెడు ఫలితాలను నివారించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
read more " శనీశ్వరుని రాశి మార్పు - ధనూరాశి ప్రవేశం - ఫలితాలు "

19, జనవరి 2017, గురువారం

Donald Trump Oath taking Chart - Predictions

మీడియా వార్తల ప్రకారం రేపు మధ్యాన్నం పన్నెండు గంటల సమయంలో,వాషింగ్టన్ డీసీ లో,డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు. ప్రెసిడెంట్ కుర్చీలో కూచున్నాక ఈయన తీసుకోబోయే నిర్ణయాల వల్ల ముందు ముందు ఎలా ఉంటుందో అని ఎందరికో అనేక భయాలున్నాయి.

ఈ ముహూర్త సమయ కుండలి ప్రకారం ఈయన ఏలబోయే రాజ్యం ఎలా ఉండబోతున్నదో,అసలు ఈయన చెప్పినవన్నీ చెయ్యగలడా, లేడా,మొదలైన విషయాలను గమనిద్దాం.

ఈ ముహూర్తం జ్యోతిష్యం వచ్చినవారు నిర్ణయించినదే అని తెలుస్తున్నది. ఎందుకంటే - సూర్యుడిని దశమంలో ఉంచుతూ మిట్టమధ్యాన్నపు అభిజిత్ లగ్నాన్ని ముహూర్తంగా నిర్ణయించారు. దీనినే మన పల్లెల్లో "గడ్డపార ముహూర్తం" లేదా "పలుగు ముహూర్తం" అంటారు. సూర్యుడు సరిగా నడినెత్తికి వచ్చాడా లేదా అనేది చూడటానికి ఒక పలుగును భూమిలో పాతి దాని నీడ పూర్తిగా మాయం అయినప్పుడు ముహూర్తంగా నిర్ణయిస్తారు.ఈ ముహూర్తం కూడా అదే.

అయితే సూర్యుడు ఊరకే దశమంలో ఉంటే సరిపోదు.ఆయన మంచి బలంగా కూడా ఉండాలి. అది లేనప్పుడు ఏదో అరకొర ఫలితాలే లభిస్తాయి.

ఈ చార్టులో సూర్యుని పరిస్థితి గందరగోళంగా ఉన్నది. గురుదృష్టి సూర్యునికి బలాన్నిస్తున్నప్పటికీ, శని దృష్టి దానిని బలహీనం చేస్తున్నది. సూర్యునికి రెండింట ఉన్న శుక్ర కేతువుల వల్ల అనేక రకాలైన స్కాండల్స్ కనిపిస్తున్నాయి. ద్వాదశంలో ఉన్న బుధునివల్ల రహస్య అజెండాలు దర్శనమిస్తున్నాయి.అష్టమంలోని రాహువు వల్ల ముస్లిం దేశాలతో శత్రుత్వం, నష్టం కనిపిస్తున్నాయి.

ఈ చార్టులో కనిపిస్తున్న మాలికాయోగం కూడా -- ఈయన పాలన అనేక ఎగుడు దిగుడులతో సాగుతుందని సూచిస్తోంది.

ఇప్పుడు ఫలితాలను గమనిద్దాం.

ఈరోజు పుష్య కృష్ణనవమి, శుక్రవారం, స్వాతీ నక్షత్రం అయింది. వార నక్షత్రాదిపతులైన శుక్ర, రాహువులను బట్టి ఈయన పాలసీ అంతా - ముస్లిమ్స్ ని అమెరికాలోకి రాకుండా కంట్రోల్ చెయ్యడం,సుఖవంతమైన జీవితం కోసం బ్రెజిల్ మొదలైన ఇతరదేశాలనుంచి అమెరికాలోకి వస్తున్న వలసదారులను కంట్రోల్ చెయ్యడం మొదలైన పనుల మీద ఉంటుందని ఊహించవచ్చు.

1.లగ్నాధిపతి కుజుని సున్నా డిగ్రీల బలహీన గండాంతస్థితివల్ల --  ఈయన టర్మ్ అనుకున్నంత సాఫీగా ఎదురులేకుండా ఏమీ ఉండదని తెలుస్తున్నది.కుర్చీలో కూచున్న తర్వాత ఈయనను అనేక సంకట పరిస్థితులు చుట్టుముడతాయి. తను చెప్పినవి అన్నీ చెయ్యడానికి అనేక అడ్డంకులు ఈయనకు ఎదురు వస్తాయి. కాకపోతే లోపల్లోపల తన ఎజెండాకు అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకుంటాడు.కానీ ఆ నిర్ణయాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. చెప్పినవన్నీ చెయ్యడం అంత సులువు కాదని ఈయనకు బాగా తెలిసి వస్తుంది.

2. చంద్రుని స్థితివల్ల -- ఈయనకు ప్రజాభిమానం ఊహించినంత ఉండదు. అభిమానం కంటే వ్యతిరేకతే ప్రజలలో ఈయనకు ఎక్కువగా ఉంటుంది.

3. రాహువు స్థితివల్ల -- అహంకారపూరితమైన నిర్ణయాలు విధానపరంగా తీసుకోవడం జరుగుతుంది. తను అనుకున్నదే కరెక్ట్ అనే దూకుడు ధోరణివల్ల నష్టపోవడం ఉంటుంది.ఈ ధోరణి వల్ల సన్నిహితులు కూడా క్రమేణా దూరం అవుతారు. ముస్లిం తీవ్రవాదులతో బద్ధవైరం ఉంటుంది. ఈయన పాలసీలన్నీ వాళ్ళను ఎలా కట్టడి చెయ్యాలి అన్నదాని మీదే కేంద్రీకృతం అవుతాయి.

4. గురువు స్థితివల్ల -- దూరదేశాలతో శత్రుత్వం ఎక్కువౌతుంది. మతపరంగా వివిధ వర్గాలతో విభేదాలు ఎక్కువౌతాయి.అయితే -- విపరీత రాజయోగం వల్ల వీటిల్లో కొంత మంచి కూడా చివరకు ప్రాప్తిస్తుంది.

5. శని స్థితివల్ల -- విధానపరమైన నిర్ణయాలవల్ల, శ్రామిక వర్గంతోనూ, పేదప్రజలతోనూ ముఖ్యంగా బ్లాక్స్ తోనూ ఇతనికి కుదరక, చెడ్డపేరు వస్తుంది. ముఖ్యంగా డ్రాగన్ కు సూచిక అయిన చైనాతో, ఇతర శ్రామిక కమ్యూనిస్టు దేశాలతో బద్ధ విరోధం ఏర్పడుతుంది. దశాంశలో శనీశ్వరుని నీచస్థితీ, ఆయనతో కలసిన బుధుని స్థితీ దీనినే సూచిస్తున్నది.

6. బుధుని స్థితివల్ల -- ఈయన ఇచ్చే స్టేట్ మెంట్స్ గాని, ఈయన కమ్యూనికేషన్ గాని అంతా గందరగోళంగా,రెండు పడవల మీద ప్రయాణంలాగా ఉంటుంది. కొంతసేపు నిరంకుశంగా కొంతసేపు ప్రజారంజకంగా ఇలా ద్వంద్వ వైఖరితో సాగుతుంది.

7. సూర్యుని స్థితి వల్ల -- మన దేశానికి ఈయన పాలసీల వల్ల మేలూ కీడూ రెండూ జరుగుతాయి.అయితే మనం భయపడుతున్నంత తీవ్రమైన చెడు ఉండదు.క్వాలిటీ ఉన్న మన వర్క్ ఫోర్స్ కు ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల భయం ఉండవలసిన అవసరం ఏమీ లేదు.

8. కేతు శుక్రుల వల్ల -- ఇంటా బయటా ఈయనకు విభేదాలు ఎక్కువై తనవారితోనే క్రమేణా విడిపోవడాలు జరుగుతాయి. ఆడవాళ్ళతో స్కాండల్స్ వల్ల ఈయనకూ ఈయన అనుచరులకూ చెడ్డపేరు వస్తుంది. దశాంశలో నీచశుక్రుని స్థితికూడా దీనినే సూచిస్తున్నది. రాహు కేతు యాక్సిస్ యొక్క స్థితిని బట్టి, శుక్ర కేతువుల బాధకరాశి స్థితిని బట్టి, ముస్లిం తీవ్రవాదులతో అమెరికాకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు.

9. నవాంశచక్రం ఎప్పుడూ రాశిచక్రం కంటే బలమైనది. దీనిలో ఒక ముఖ్యమైన సూచన ఉన్నది.కర్కాటకంలో ఉన్న నీచకుజ,బుధ,రాహువులను బట్టి అమెరికా ప్రజలలో దురహంకార ధోరణులు జాత్యహంకార ధోరణులు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక బాగా పెరుగుతాయని ఈ గ్రహయోగం సూచిస్తున్నది.

10. మీనంలో ఉన్న శని సూర్య యోగం -- ప్రజలకూ పాలకులకూ ఎప్పుడూ ఉండే అభిప్రాయ భేదాలనూ గొడవలనూ సూచిస్తున్నది.చతుర్ధమైన కర్కాటకం నుంచి దశమమైన మకరంవైపు ఉన్న రాహుకేతు ఇరుసు కూడా దీనినే సూచిస్తున్నది. కన్యనుంచి గురుదృష్టి అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే బలమైన రిపబ్లికన్ సపోర్ట్ ను  సూచిస్తే, ఉత్తర పశ్చిమ రాష్ట్రాలనుంచి ఉన్న డెమొక్రాటిక్ అసమ్మతిని కుంభంలోని చంద్రుడూ మీనంలోని శనీశ్వరుడూ సూచిస్తున్నారు. వెరసి ట్రంప్ పరిపాలన ఒక మిక్సెడ్ బ్యాగ్ కాబోతున్నదని ఈ యోగాలవల్ల తెలుస్తున్నది.

అమెరికా దేశపు సహజలగ్నం మిథునమనీ, ధనుస్సనీ అభిప్రాయ భేదాలున్నాయి. ఈ రెంటిలో ఏదైనా కూడా కొన్ని రోజుల్లో జరుగబోతున్న శనీశ్వరుని గోచారమార్పు ఈ రెంటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

దీనివల్ల రాబోయే రెండున్నరేళ్ళలో అమెరికాతో విదేశాల సంబంధాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అంటే --అమెరికా ఫారిన్ పాలసీ విధానాలు ఇప్పటిదాకా ఉన్నదానికి విభిన్నంగా తీవ్రమైన మార్పుకు గురౌతాయి.

ఆ తర్వాత శనీశ్వరుడు మకరరాశిలో సంచరించే రెండున్నరేళ్లలో అమెరికా చాలా గడ్డుకాలాన్ని చవిచూస్తుంది. అది ఇంటా బయటా కూడా ట్రంప్ కు గడ్డు కాలమే. అంటే -- ఈయన టర్మ్ లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పేలవంగా ఉంటుందని ఆ సమయంలో అనేక సమస్యలను ఈయన ఎదుర్కోవలసి ఉంటుందని గోచారం చెబుతున్నది.
read more " Donald Trump Oath taking Chart - Predictions "

19, డిసెంబర్ 2016, సోమవారం

నోట్ల కష్టాలు - నోటి పద్యాలు

అందరినీ అల్లాడిస్తున్న నోట్ల కష్టాల మీద ఆశుపద్యాలను వినండి మరి.

ఆ|| రెండువేల నోటు రంగులీనుచు నుండు
మార్చబోయినంత మూర్ఛ వచ్చు
చిల్లరంచు వెదుక చీకాకు గలిగించు
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| మందు షాపు లందు మనుషులే కరవైరి
విందు హోటలేమొ వెలిసి పోయె
అందమెల్ల దిద్దు అందాల పార్లర్లు
బోసిపోయి మిగుల బోర్డు దిప్పె

ఆ|| రెండువేల నోట్లు నిండు జేబున బెట్టి
పాని పూరి దినగ పరువు బోయె
చిన్న నోట్లు లేక చింతాయె బ్రతుకంత
వంద నోటులున్న వాడె రాజు

ఆ|| రెండు వేలు దెచ్చి నిండుగా పెట్రోలు
వెయ్యి రూప్యములకు పొయ్యమన్న
చిల్లరడిగినంత ఛీకొట్టి పొమ్మంచు
భాష మార్చివేసె బంకు వాడు

ఆ|| రెండు టీలు దెచ్చి రంజుగా ఇమ్మంచు
ఆర్డరేసి నంత అట్లె నిలిచి
చిల్లరివ్వ మంచు చేజాచి బెదిరించె
వెయిటరొక్కరుండు వింతగాను

ఆ|| మిరపకాయ బజ్జి మింగబోయిన యంత
చిల్లరడిగె బండి శీనుగాడు
ఛాటు బండివాడు నోటీసు అతికించె
పిల్ల నోట్ల వారె ప్రిన్సులనుచు

ఆ|| మంచి హోటలనుచు లంచి జేయగబోయి
పట్టి పట్టి యచటి ఫుడ్డు మెక్కి
కార్డు ఇచ్చినంత క్యాషివ్వమనె వాడు
క్లీను జెయ్యమనుచు కిచెను జూపె

ఆ|| బారు షాపులెల్ల భోరుభోరున యేడ్చె
కూర గాయలేమొ కొక్కిరించె
పెట్టురోలు బంకు పెనుశాపమాయెరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| అతి ఖర్చుల్ ఆవిరులై
మితిమీరిన ఎచ్చులెల్ల మిస్టున గలసెన్
ప్రతివాడున్ నేలకు దిగి
గతి ఏమని ఏడ్వసాగె గొల్లున సత్యా

కం|| సరదా లన్నియు మానిరి
జరభద్రం బనిరి; జనుల జావలు గారెన్
పొరపాటున యన్వాంటెడు
కొరఖర్చుల బెట్టకుండ గుమిలిరి ప్రజలే !!

కం|| సినిమా హాళ్ళకు ఈగలు
మినిమంలో బ్రతుకునట్లు మెయింటెనెన్సుల్
పనిపాటలు కరువాయెను
తినికూర్చొను వారి లైఫు తుక్కై పోయెన్

కం|| పొదుపే మరచిరి లోకులు
మదుపున్ జేయంగబోవ మని కనపడదే !
అదుపున బెట్టక ఖర్చుల
విదిలించగ డబ్బులన్ని వీధిన బడుగా !!

కం|| లేజీ లైఫుకు అలవడి
పోజులు కొట్టుట మరిగిన పోరంబోకుల్
ఈజీ మని కన్పించక
క్రేజీగా యనిరి మోడి క్రూరుండంచున్

ఆ|| క్రైము రేటు తగ్గె క్రీముపూతలు తగ్గె
నల్ల వర్తకములు డొల్ల బారె
కట్న కాన్క లిచ్చు కల్యాణములు తగ్గె
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| అన్ని కార్డు లిచట యాక్సెప్టు లౌనంచు
బార్ల ముందు పెద్ద బోర్డు లొచ్చె
మందుబాబు లెల్ల మంచిగా స్వైపింగు
చేయసాగిరంత చేష్ట లుడిగి

కం|| బ్యాలెట్టుల వెర్డిక్టున
వ్యాలెట్టుకు బొక్క బడగ వ్యాల్యూ తగ్గెన్
టూలెట్టుల బోర్డులవే
రోలెట్టుల యాక్టులౌచు రోడ్డుల వెలసెన్ 

కం|| ఐటీ దాడుల భయమున
పోటీ పడి మూసివేసి బిజినెసు హౌసుల్
కోటీశ్వర నల్ల దొరలు
నోటీసుల కందకుండ నక్కిరి ఎటనో ??

ఆ|| చిల్లరున్న వాడు చిట్వేలు యువరాజు
పెద్ద నోట్ల వాడు పేడివాడు
చిన్న పెద్దలందు చిక్కొచ్చి పడెనయా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| మోదీ వేసిన మందుకు
దీదీకే భేదులొచ్చి దిక్కులు మరచెన్
ఏదీ మునుపటి ధైర్యము?
మాదీఫల లేహ్యమింక మ్రింగక యున్నన్

కం|| యూపీ ఎన్నికలందున
పాపాలే బ్రద్దలౌను పంటలు బండున్
కోపపు పెద్దల యుద్ధము
పాపము ! పౌరుల బ్రతుకుల శాపంబయ్యెన్

కం|| ఏటీ ఎమ్ముల ముంగిట
మాటేసిన రాత్రి యంత మంచున బడుచున్
నోటే దక్కక పాయెను
వోటేసిన నమ్మకంబు వేస్టై పోయెన్

కం|| మోడీ కొట్టిన దెబ్బకు
కేడీలై కూలబడిరి కోటీశ్వరులే
ఏడీ మేనేజరుడని
లేడీలై పరుగులిడిరి లక్షల కొరకై

ఆ|| పెద్ద నోటులున్న పోతురాజౌ గాని
నూరు నోట్ల వాడు నూకరాజు
చిన్నచిన్న నోట్లు శ్రీమహాలక్ష్మిరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| తెల్ల డబ్బులన్ని నల్లడబ్బై పోయె
బ్యాంకు కొచ్చు నోట్లు మాయమాయె
కొత్త కొత్త నోట్లు కోట్లాదిగా మార్చి
పెద్ద పెద్ద వారి ఫేసు వెల్గె

ఆ|| లూపు హోలు బట్టి లూటింగు మాస్టరై 
బ్యాంకు బాబు జేసె బ్యాకు స్టాబు
మోడి ప్లాను జూడ ముక్కలై పోయెరా
దేశమెట్లు వెలుగు దొంగలున్న?

ఆ|| రెండువేల నోట్లు రద్దౌను ముందంచు
భయము మాని వినుడు బెస్టు ట్రూతు
ట్వెల్వు మంత్సు లోన తెల్ల పేపర్లుగా
మారునంట తిక్క దీరునంట !!
read more " నోట్ల కష్టాలు - నోటి పద్యాలు "

18, డిసెంబర్ 2016, ఆదివారం

ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు

అధికారంలో ఉంటూ పదేళ్ళ పాటు నల్లధనం సంపాదిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఒక్క రాత్రిలో ఆ మొత్తం చిత్తు కాగితాలుగా మారిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

దేశాన్ని బాగు చెయ్యాలని కంకణం కట్టుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బ్యాంకర్ల రూపంలో పిశాచాలుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని పార్లమెంట్లో రచ్చ చేస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
పీఎం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

చనిపోయిన ప్రతివారినీ ఏటీఎం క్యూలో పోయారని పేపర్లో చూపిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
స్మశానాలలో కూడా "ఈ - పోస్" మిషన్లు వచ్చేస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

బిచ్చగాడి ఎకౌంట్లో కూడా రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మూడ్రోజులలో మళ్ళీ నిల్ బేలెన్స్ అయిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

శ్రీవారి సొమ్ముతో బంగారం గోడల ఇల్లు కట్టుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఐటీ వాళ్లోచ్చి అదంతా పట్టుకుపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

చనిపోయి ఇరవైరోజులైనా ఆమె ఆరోగ్యం భేషని టీవీలో న్యూసొస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బాడీకి కాళ్ళు లేవన్న విషయం జనానికి తెలిసిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండి అన్నీ అనుభవిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ప్రాణం పోయి ఇరవై రోజులైన శవానికి ఇంకా ఇంజక్షన్లు చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

దేశం చాలా ముందుకెల్తోందని మన చంకలు మనమే చరుచుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
రాజధానిలో ప్రతిరోజూ రేపులమీద రేపులు జరుగుతూనే ఉంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఆకాశంలోకి ఉపగ్రహాలను పంపామని పండగ చేసుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
దేశం నిండా అవినీతి శనిగ్రహాలే అయితే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ప్రెసిడెంట్ గా గెలిచానని సంబరపడి గంతులేస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ప్రతివాడూ "ఛీ" నువ్వు మా ప్రెసిడెంట్ వి కావు అంటుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

అధ్యక్ష ఎన్నికలు ఎంతో పకడ్బందీగా చేసామని ఎగురుతుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఎలక్షన్ ప్రక్రియను రష్యా హైజాక్ చేసిందని తెల్సిన రోజున 
ఏమీ .....ఉపయోగం ఉండదు

సెక్రెటరీ అయ్యానని సంబర పడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మెంబర్స్ మీద అలిగి తనే బయటకు వెళ్ళిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఏళ్ళకేళ్ళు కష్టపడి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
అన్నీ అయిపోయాక తీరిగ్గా విశ్లేషణ చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

నలభై రోజులు నల్ల డ్రస్సు వేసుకుని డబ్బా ఫోజులు కొడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
కొండ దిగీ దిగకముందే మందు బాటిలు ఓపన్ చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఫేస్ బుక్ ఫోటో చూసి లవ్వులో మునిగిపోతే
ఎంతో .....బాగుంటుంది
కానీ
అది ముప్పై ఏళ్ళ క్రితం ఫోటో అని తీరిగ్గా తెలిస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

జుట్టుకి రంగేసుకుని కుర్ర వేషాలేస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఆ కెమికల్స్ బాడీలోకి ఇంకి కిడ్నీలు పాడయ్యాయని తెలిసిన రోజున 
ఏమీ .....ఉపయోగం ఉండదు

అందరికీ అల్లోపతీ ఇచ్చే డబల్ ఎండీకి సంఘంలో
ఎంతో .....బాగుంటుంది
కానీ
తనింట్లో మాత్రం హోమియోపతీ వాడుతుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఆఫీసు యూ ట్యూబులో సెక్స్ సినిమాలు చూస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బాసు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రోజున
ఏమీ .....ఉపయోగం ఉండదు

అమెరికా సంబంధం అని ఎగురుకుంటూ పెళ్లి చేసి పంపిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
నెల తిరక్కుండానే 'నీ అల్లుడు సంసారానికి పనికిరాడని' పిల్ల వెనక్కొచ్చేస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

"గో క్యాష్ లెస్" అన్న నినాదాన్ని విన్న రోజున
ఎంతో .....బాగుంటుంది
కానీ
హోటల్లో బాగా తిని కార్డిస్తే - 'ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్' అంటూ వాళ్ళు పిండి రుబ్బిస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

నల్ల డబ్బు నిర్మూలనం ఐపోయిందని సంబరపడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మర్నాడే పాకిస్తాన్ తీవ్రవాదుల దగ్గర మన కొత్త కరెన్సీ ప్రత్యక్షమైతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

రెండువేల నోట్లు జేబు నిండా ఉన్నాయని గంతులేస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఎక్కడికి పోయినా 'నో చేంజ్' అని వినిపిస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు
read more " ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు "

7, డిసెంబర్ 2016, బుధవారం

సాయన సూర్య సంక్రమణం - ప్రముఖుల మరణాలు

ప్రస్తుతం వరుసగా ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయి. వీటి వెనుక గల జ్యోతిష్య కారణం వృశ్చికరాశిలో ఉన్న శనిసూర్య సంయోగమే. దీనిగురించి కొంత చూద్దాం.

శనీశ్వరుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్న ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చాలా ఘోరాలు జరుగుతాయని గతంలో ఎంతోముందే వ్రాశాను.దానికి కారణాలు కూడా వివరించాను.ఇప్పుడు గోచార సూర్యుడు శనీశ్వరునితో కలసిన ఈ నెల సమయంలో ముఖ్యంగా ప్రముఖుల మరణాలు, వాయుయాన ప్రమాదాలు, రసాయన పేలుళ్లు జరుగుతున్నాయి.

కాకపోతే ఈసారి సాయన సూర్య సంక్రమణం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సాయన సిద్ధాంత రీత్యా ప్రస్తుతం సూర్య శనులిద్దరూ ధనూరాశిలో ఉన్నారు. ఎందుకంటే - సాాయన సిద్ధాంత రీత్యా నవంబర్ 22 న సూర్యుడు వృశ్చిక రాశినుంచి ధనూరాశిలోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న శనీశ్వరుని పరిధిలోకి వచ్చాడు.

సూర్యుడు అధికారులకు, ప్రముఖులకు సూచకుడని జ్యోతిశ్శాస్త్రం వచ్చినవారికి బాగా తెలిసిన విషయమే.మరణానికి కారకుడైన శనీశ్వరునితో ఈయన కలసినప్పుడు ఏం జరుగుతుందో మళ్ళీ ప్రత్యేకంగా వివరించనక్కరలేదు.

>>బాల మురళీకృష్ణ మరణం
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సరిగా అదే 22-11-2016 న మరణించాడు.

>>జయలలిత మరణం
దీనికి సరిగ్గా రెండు నెలల ముందు (ఆ నెలలో సాయన సంక్రమణానికి ఒకరోజు ముందు) 22-9-2016 రోజున జయలలిత సింపుల్ అనారోగ్యం(fever and dehydration) తో ఆస్పత్రిలో చేరింది.కానీ క్రమేణా ఈ అనారోగ్యం ముదురుతూ పోయింది.విదేశాల నుంచి డాక్టర్ని రప్పించి మరీ చికిత్స మొదలు పెట్టారు.తులారాశిలోకి వఛ్చిన ఈ సంక్రమణం సూర్యునికి నీచత్వాన్ని ఆపాదిస్తుంది.కనుకనే సింపుల్ ఫీవర్ అండ్ డీ హైడ్రేషన్ తో ఆస్పత్రిలో చేరిన ఆమెను ట్రీట్ చెయ్యడానికి విదేశీ డాక్టర్లు అవసరం అయినారు.

22-10-2016 వృశ్చిక సంక్రమణానికి ఒకరోజు ముందు "కోలుకుంటున్నది" అని ప్రకటించబడిన ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించడం మొదలైంది.

నవంబర్ 19 న "ఆమె పూర్తిగా కోలుకుంది" అని చెప్పిన డాక్టర్లు ఆమెను క్రిటికల్ కేర్ నుంచి మామూలు రూముకు మార్చారు.

కానీ నవంబర్ 22 తర్వాత ఆమె ఆరోగ్యం మళ్ళీ వేగంగా క్షీణించింది.ఇదే రోజున బాలమురళీ కృష్ణ కన్ను మూశాడు. డిసెంబర్ ఐదున హార్ట్ ఎటాక్ తో ఆమె చనిపోయింది.

దీర్ఘరోగాలతో బాధపడేవారు చాలామంది, అమావాస్యకూ పౌర్ణమికీ, నెలనెలా సూర్యుడు రాశి మారే సమయంలోనూ, మళ్ళీమళ్ళీ ఆస్పత్రిలో చేరుతూ ఉంటారు.దీనిని చాలామంది జీవితాలలో గమనించవచ్చు.ఈ విధంగా వెంటవెంటనే జరుగుతూ ఉంటే - వారి ప్రాణశక్తి పని అయిపోయిందనీ అవి ఆఖరు రోజులనీ అర్ధం చేసుకోవచ్చు.ఎంతమంది డాక్టర్లు ట్రీట్ చేసినా "ప్రాణం" సహకరించనిదే వాళ్ళు ఏమీ చెయ్యలేరు. 

>>నేడు - అంటే - 7-12-2016 న - తమిళ ప్రముఖుడైన "చో రామస్వామి" (శ్రీనివాసయ్యర్ రామస్వామి) చెన్నైలో మరణించాడు.

ప్రముఖులే కాదు, మామూలు మనుషులలో కూడా, సామాన్యస్థితి నుంచి ఎదిగి ఉన్నతస్థితికి వచ్చిన వారిలో వృద్ధులు చాలామంది ఈ నెలలో పరలోక ప్రయాణం కట్టక తప్పదు. ఎందుకంటే వారివారి జీవితాలలో వారూ ప్రముఖులే కాబట్టి.

సాయన సూర్యుడు ధనూరాశిని వదలి మకరరాశిలోకి ఈ నెల 22 న ప్రవేశిస్తాడు. అంటే ఇంకా 15 రోజులుంది. చూద్దాం ఈలోపల ఇంకా ఎంతమంది లేచిపోతారో??

సాయనానికీ నిరయనానికీ అయనాంశ ఒక్కటే తేడా కాదు. సూక్ష్మమైన తేడాలు చాలా ఉన్నాయి.అయితే అవన్నీ వివరించి చెప్పడమూ, మనిషి జీవితాన్ని అవెలా ప్రభావితం చేస్తాయో భూతద్దంలో చూపిస్తూ చక్కగా వివరించడమూ నేను ఇక్కడ చెయ్యదలుచుకోలేదు.వాటిని తెలుసుకోవడానికి ఎవరికి అర్హత ఉన్నదో వారికి మాత్రమే నేర్పిస్తాను.

జ్యోతిశ్శాస్త్రం పైకి కనిపించేటంత సింపుల్ సైన్స్ కాదు. దీనిలో చాలా అర్ధంకాని లోతులున్నాయి.సాయన సూర్య సంక్రమణం కూడా ప్రముఖుల జీవితాలను ఎలా ప్రభావితం గావిస్తుందో చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశ్యం.
read more " సాయన సూర్య సంక్రమణం - ప్రముఖుల మరణాలు "

30, నవంబర్ 2016, బుధవారం

నవంబర్ 2016 - అమావాస్య ప్రభావం

Mundane Astrology వైపు దృష్టి సారించి చాలా రోజులైంది.ఒక్కసారి అటువైపు తొంగి చూద్దాం.

ఆఫ్కోర్స్ ! మనం చూచినా చూడకున్నా, గ్రహాలు వాటిపని అవి చేస్తూనే ఉంటాయి. అమావాస్యకూ పౌర్ణమికీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి.కర్మచక్రం నిరంతరంగా తిరుగుతూనే ఉంటుంది.

ఈ అమావాస్య ఘడియలలో ఒక విమానం కూలింది. ఒక ఉగ్రవాద దాడి జరిగింది. అదికూడా సరాసరి సైనిక స్థావరం పైనే. అదీగాక ఈరోజున బెంగాల్లోని సుఖ్నా అనేచోట చీటా హెలీకాప్టర్ కూలి ముగ్గురు ఆర్మీ అధికారులు చనిపోయారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది.

విమానం కూలిన సంఘటన నిన్న రాత్రి కొలంబియాలో జరిగింది.75 మంది చనిపోయారు. వీరిలో ఫుట్ బాల్ జట్టు మొత్తం ఉంది. అయిదుగురో ఆరుగురో ఇంత ఘోర ప్రమాదంలో కూడా బ్రతికి బయటపడ్డారు.నేనెప్పుడూ చెప్పే కర్మసూత్రం ఇదే.ఇలాంటి ఘోర ప్రమాదంలో కూడా కొందరు బ్రతకడం వింత కాదా మరి !!

ఇకపోతే జమ్మూలోని సైనిక స్థావరం మీద ఆర్మీ దుస్తులలో వచ్చి దాడి చేసిన పాకిస్తాన్ తొత్తులు మన సైన్యంలో కొందరిని చక్కగా చంపేశారు. దానికి 'బలిదానం' అని మనం పేరు పెట్టుకుంటున్నాం. మొన్నీ మధ్యన మన సైనికుడి తల నరికినందుకు మనవాళ్ళు ఏదో తీవ్రంగా పాక్ సైనిక శిబిరాలను ధ్వంసం చేశారని, ఆ దెబ్బను తట్టుకోలేక వాళ్ళు మన కాళ్ళ బేరానికి వచ్చి 'దాడులు ఆపండి.మేం తట్టుకోలేక పోతున్నాం' అని మెసేజీలు ఇచ్చారని మన రక్షణ మంత్రిగారు మొన్ననే ఒక సభలో గర్వంగా చెప్పుకున్నారు. మరి రెండ్రోజుల్లోనే ఇదేంటి? పాకిస్తాన్ మాటల్ని ఇంకా ఎంతకాలం నమ్మాలి?

అసలు సంగతి అది కాదు.పాకిస్తాన్ కొత్త సైన్యాధిపతిగా కమర్ జావేద్ బజ్వా పగ్గాలు చేపట్టిన సందర్భంలో 'మేమేం చెయ్యగలమో చూడండి' అని వాళ్ళు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు.అంతే !! మనం అది మరచిపోయి పాకిస్తాన్ మాట్లాడే మాటల్ని నమ్మి 'హిందూ ముస్లిం భాయీ భాయీ' అని వాళ్ళ భుజాల మీద చేతులేస్తే ఆ తర్వాత సైలెంట్ గా మన చేతులు మాయమై పోతాయి.గతంలో ఇదెన్నో సార్లు రుజువైంది.ఇంకా ఎన్నాళ్ళు పాకిస్తాన్ మాటలల్ని నమ్ముదాం?

ఇకపోతే, ఈరోజున బెంగాల్లో సుఖ్నా అనేచోట, ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయి ముగ్గురు ఆర్మీ ఆఫీసర్లు చనిపోయారు. ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఆస్పత్రిలో ఉన్నారు.

వీటన్నిటికీ కారణమైన ఈ అమావాస్య గ్రహస్థితి ఏంటో చూద్దామా?

అపసవ్య కాలసర్ప యోగం??
----------------------------------
ప్రస్తుతం గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యన ఉన్నాయి.కానీ ఇది కాలసర్ప యోగం కాదు. ఎందుకంటే రాహువు పోతున్న దిశలో గ్రహాలు లేవు.కనుక దీనిని అపసవ్య కాలసర్ప యోగం అని పిలుద్దాం. ఇలా పిలవడం నాకిష్టం లేదు.కానీ ఇంకో పేరు లేదు గనుక ఇప్పటికిలా సర్దుకుందాం. ప్రస్తుతం జనాలు పడుతున్న బాధలన్నిటికీ ఇదొక కారణం.

గురుకుజుల ఉచ్చనీచ స్థితులు
----------------------------------------
నవాంశలో గురువు ఉచ్చ.కుజుడు నీచ.కుజుడు రాశిలో ఉచ్చ అయినా నవాంశలో నీచ గనుక అతని మంచితనం ఆవిరై పోయింది.కానీ గురు అనుగ్రహం ఉంది గనుకే గండాలు కొద్దిలో పోతున్నాయి.లేకుంటే ఇంకా పెద్దవి జరిగేవి.

శనీశ్వరుని అధీనంలో అమావాస్య
-------------------------------------------
ఈ అమావాస్య శనీశ్వరుని అధీనంలో ఉంది. ఎందుకంటే రవి చంద్రులు ఆయనతో కూడి వృశ్చికంలో ఉన్నారు.చంద్రునికి ఇది నీచ స్థితి. శనీశ్వరుడు వాయుతత్వానికి అధిపతి గనుక వాయుయాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే !!

వృశ్చికం జలతత్వ రాశి గనుక ఇంకో రెండు మూడు రోజులలో జలయాన ప్రమాదాలు కూడా జరగాలి.చూద్దాం !!

పోతే - వృశ్చికరాశి వారిని ఈ అమావాస్య బాగా ఇబ్బంది పెట్టె మాట కూడా వాస్తవమే !!

అమావాస్య ఎఫెక్ట్ మళ్ళీ ప్రూవ్ అయిందా లేదా???
read more " నవంబర్ 2016 - అమావాస్య ప్రభావం "

26, నవంబర్ 2016, శనివారం

స్వామి యదునాధానందతో సంభాషణ -8 (శ్రీ రామకృష్ణులు దైవం యొక్క అవతారమా? నేనొప్పుకోను )





ఈ విధంగా చాలా సేపు మాట్లాడుతూ కూచున్నాము. ఇంతలో భోజనాల వేళ అయింది.అదేరాత్రి పదింటికి చెన్నై బస్సులో స్వామీజీ బయలుదేరి వెళ్ళాలి. అందుకని పెందలాడే భోజనం కానిచ్చాము.

'నాకు గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి.చల్లనీళ్ళు నేను త్రాగను.నాకు కొంచం జలుబు చేసే తత్త్వం ఉంది.' అన్నారు స్వామీజీ.

'అలాగే. నేనూ అంతే. చలికాలం గోరువెచ్చని నీరే నేనూ త్రాగుతాను.' అన్నాను.

'మీరు వంటల్లో వెల్లుల్లి వాడతారా?' అడిగారు స్వామీజీ అనుమానంగా.

'శుభ్రంగా వాడతాము.అలాంటి పట్టింపులు మాకు లేవు.' అన్నాను.

'అవును.వెల్లుల్లి గుండెకు చాలా మంచిది.శాకాహారంలో కూడా ఇది పనికిరాదు అది పనికిరాదు అంటూ అనవసరమైన పట్టింపులు చాదస్తాలు మంచివి కావు.ప్రతి వస్తువుకూ కొంత చెడు గుణం ఉంటుంది.దానిని పోగొట్టి వాడుకుంటే అది శరీరానికి మంచే చేస్తుంది.చలికాలంలో జలుబు చేసే తత్త్వం ఉన్నవారు పొద్దున్నే ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచం మిరియాలు కలిపి నూరి దానిని ఒక గ్లాసు నీళ్ళలో కాచి, దానికి కొంచం ఉప్పు తగిలించి త్రాగితే చాలా మంచిది.తిన్నది కూడా బాగా అరుగుతుంది.నేను అదే చేస్తాను.' అన్నాడు స్వామీజీ.

శుద్ధ వైష్ణవ సాంప్రదాయం నుంచి వచ్చిన స్వామీజీకి తిండి విషయంలో ఇంత విశాల భావాలు ఉన్నందుకూ వెల్లుల్లి తింటానని అన్నందుకూ నాకు సంతోషం అనిపించింది.

'అవును స్వామీజీ ! హోమియోలో కూడా వెల్లుల్లిని ఒక మందుగా వాడతారు. "అల్లియం సటైవా" అంటే అదే.' అన్నాను.

మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చి, శ్రీమతి వద్ద సెలవు తీసుకుని కార్లో బస్టాండ్ కు బయలుదేరాము.

దారిలో మా సంభాషణ ఇలా సాగింది.

'రామకృష్ణా మఠానికి గాని, శారదా మఠానికి గానీ అప్పుడప్పుడూ వెళుతూ ఉంటారా? ' అడిగాడు స్వామీజీ.

'చిన్నప్పుడు వెళ్ళేవాడిని. కానీ ఒక పాతికేళ్ళ నుంచీ పూర్తిగా మానేశాను.' అన్నాను.

'ఎందుకు?' అన్నాడాయన.

'అక్కడ వాతావరణాలు నాకు నచ్చడం లేదు.నేను ఆశించినంత ఉన్నతమైన వ్యక్తులూ నాకు కన్పించడం లేదు.ఎంతో మహనీయులైన స్వామి నందానంద, స్వామి తపస్యానంద,స్వామి ఉద్ధవానంద,స్వామి గంభీరానంద మొదలైన వారిని నేను చూచాను.అలాంటి స్వామీజీలు ప్రస్తుతం ఎక్కడా కన్పించడం లేదు.అందుకని ప్రస్తుతం నేనెక్కడికీ పోవడం లేదు.ఈ జీవితంలో చూడవలసిన వారిని చూచాను. చాలు. ఇక ఎవరినీ చూడవలసిన పని లేదు. ఎవరి బోధలూ వినవలసిన పని కూడా లేదు.' అన్నాను.

ఆయన మౌనంగా వింటున్నాడు.

'అదీగాక నేటికాలపు స్వామీజీలలో ఆధ్యాత్మిక అహంకారం ఎక్కువగా నాకు కనిపిస్తున్నది."మీరు గృహస్తులు కనుక మీకు మోక్షం రాదు.కారణం ఏమంటే మీకు బ్రహ్మచర్యం ఉండదు కదా?మీకంటే మేమే గొప్ప" అని వీరి భావన. ఇదే మాటను కొంతమంది మాతాజీలు అన్నారు. ఆ దెబ్బతో నాకు వీళ్ళంటే విరక్తి వచ్చేసింది. అందుకని ఎక్కడికీ వెళ్ళడం మానేశాను. పాతకాలపు స్వామీజీలు ఎవరూ ఇలా సంకుచితమైన భావాలు ఉన్నవారు కారు.

మా గురువైన గంభీరానందస్వామి ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన మహనీయుడు. ఒకసారి కల్పతరు దినోత్సవ సందర్భంగా 1963 లో కలకత్తాలో ఒక సభ జరిగింది.ఆ సభకు గంభీరానంద స్వామి అధ్యక్షులుగా ఉన్నారు.సభలో మాట్లాడిన వక్తలలో - సాదువులే గొప్ప అని కొందరు - గృహస్తులే గొప్ప - అని కొందరు మాట్లాడారు.శ్రీ రామకృష్ణుల అనుగ్రహం మాకే ఉందంటే మాకే ఉందని వారు వాదులాడు కున్నారు.

అందరూ మాట్లాడాక, అధ్యక్షోపన్యాసం చెయ్యడం కోసం గంభీరానంద స్వామి లేచారు. ఆయన ఈ ఇరువర్గాలకూ బాగా చీవాట్లు పెట్టారు.

'శ్రీరామకృష్ణులను మీరు ఎంత తక్కువ చేస్తున్నారు? ఎంత దిగజారుస్తున్నారు? ఇటువంటి సంకుచిత భావాలను ఆయన సహించేవారే కాదు.ఆయన్ను మీరేం అర్ధం చేసుకున్నారసలు? మీ రెండు వర్గాల కోసమేనా ఆయన పుట్టింది? కాదు. ప్రపంచంలోని అన్ని జాతులూ అన్ని కులాలూ అన్ని జీవుల కోసం ఆయన అవతారం దాల్చాడు.వారూ వీరూ అని ఆయనకు తారతమ్యం ఎంతమాత్రమూ లేదు.ఆయనొక మహాసముద్రం వంటి వాడు.ఆయన్ను మీరొక ఉగ్గుగిన్నెలో దాచాలని చూస్తున్నారు.ఇది చాలా తెలివితక్కువ పని.' అని గట్టిగా వారికి బోధించారు.

అలా చెప్పేవారు ఇప్పుడు కరువయ్యారు. స్వామీజీలలో కూడా క్వాలిటీ తగ్గింది.అందుకే నేను వారి దగ్గరకు వెళ్ళడం పూర్తిగా మానేశాను.అసలు శ్రీ రామకృష్ణులను వీరెవరూ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదని నా ఉద్దేశ్యం.లోకం ఎలాగూ ఆయన్ను అర్ధం చేసుకోలేదు. కనీసం ఆయన సాంప్రదాయపు స్వామీజీలు కూడా అలాగే ఉన్నారు.అదీ బాధాకరం.

అసలీ గోలంతా ఏమిటి? సన్యాసులేమిటి? గృహస్థులేమిటి? అందరికీ ఆయన మోక్షం ఇచ్చారు.సాధన అనే పదమే వినని రసిక్ అనే కాళికాలయ పాకీవాడికి కేవలం ఆయన అనుగ్రహంతో మోక్షం దొరికింది.వినోదిని అనే డ్రామా నటికి అలాగే మోక్షం లభించింది. ఊరకే ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చినందుకు రమణి అనే వేశ్యకు ఆయన మోక్షం ఇచ్చారు.మన్మద్ అనే రౌడీ, ఆయన అనుగ్రహంతో గొప్ప సెయింట్ గా మారిపోయాడు.జీవితమంతా తనను తిట్టిపోసిన హాజ్రాకు మోక్షం ఇచ్చారాయన.అహంకారంతో తనను వదిలేసి వెళ్ళిపోయిన హృదయ్ కు మోక్షం ఇచ్చారు.ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు ఉన్నాయి. వీరికందరికీ మోక్షం వచ్చినపుడు మనకు రాదా? తప్పక వస్తుంది. అనన్యమైన భక్తి ముఖ్యం గాని ఇవన్నీ ఏమిటి నాన్సెన్స్?" అన్నాను.

ఆశ్చర్యంగా నా వైపు చూచారు స్వామి.

'మీ భావాలు వింటూ ఉంటే,బేలూర్ మఠంలో నేను బ్రహ్మచారి ట్రెయినింగ్ లో ఉన్నపుడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తున్నది.' అంటూ చెప్పసాగారు ఆయన.

చెన్నై మఠంలో రెండేళ్ళు ఉన్న తర్వాత నాకు బేలూర్ మఠంలో బ్రహ్మచారి ట్రెయినింగ్ మొదలైంది.ఆ బ్యాచ్ లో మేం మొత్తం దాదాపు ముప్పై మందిమి ఉన్నాము.ట్రెయినింగ్ అయిపోయాక మేము ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మిగతా ప్రశ్నలతో బాటు ఒక ప్రశ్న ఉంటుంది. అదేమంటే - 'శ్రీ రామకృష్ణులను మీరు అవతారంగా ఒప్పుకుంటున్నారా?" అని.

మా బ్యాచ్ లోని అందరూ  దానికి 'అవును.ఒప్పుకుంటున్నాను.' అని వ్రాశారు.కానీ నేను మాత్రం 'నో. నేను ఒప్పుకోవడం లేదు' అని వ్రాశాను. బ్రహ్మచర్య ట్రెయినింగ్ కాలేజికి ఒక సీనియర్ స్వామీజీ ప్రిన్సిపాల్ గా ఉంటారు.ఆయన నా ఆన్సర్ చూసి షాకయ్యారు. నన్ను ఆఫీస్ రూమ్ కి పిలిపించి అడిగారు.నేను నా మాట మీదే ఉన్నాను."శ్రీ రామకృష్ణులు అవతారం కాదు.నేనొప్పుకోను." - అని ఆయనతో గట్టిగా చెప్పాను.ఏం చెయ్యాలో ఆయనకు పాలు పోలేదు. 

"ఇలా అయితే నీకు బ్రహ్మచర్య దీక్షను ఇవ్వడం కుదరదు.నిన్ను మా మఠంలో ఉంచుకోవడం కూడా కుదరదు." అని ఆయన అన్నారు.

'మీ ఇష్టం.కానీ నా మాట మాత్రం అదే. ఇక్కడ నన్ను ఉంచుకోవడమూ లేదా పొమ్మనడమూ మీ ఇష్టం కాదు.బ్రహ్మచర్యదీక్షనూ సన్యాసదీక్షనూ మాకు మీరివ్వడం లేదు. ఠాకూర్ ఇస్తున్నారు. ఆయన ఇష్టమైతే ఉంటాను.లేకుంటే ఆయనే నన్ను పంపించేస్తారు.' అని నేనన్నాను.

కాసేపు ఆలోచించిన మీదట ఆయన నాతో ఇలా చెప్పారు.

'నీ కేసును నేను ట్రస్టీలకు పుటప్ చెయ్యవలసి ఉంటుంది. నీవు వెళ్లి వారిని కలువు.' ఇలా అంటూ ఆయన ఫోన్ చేసి నా విషయం వారికి చెప్పారు.

రామకృష్ణా మిషన్ లో అత్యున్నతమైన అడ్మినిస్ట్రేటివ్ బాడీని ట్రస్ట్ బోర్డ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మఠాలు మిషన్ లు అన్నింటినీ ఈ ట్రస్టీలు కంట్రోల్ చేస్తూ ఉంటారు.వీరు చాలా సీనియర్ స్వామీజీలై ఉంటారు.మిషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు అందరూ ఈ బోర్డులో ఉంటారు. వారి దగ్గరకు నన్ను ఇంటర్వ్యూకు పంపారు. నాతోటి బ్రహ్మచారులందరూ నా పని అయిపోయిందని అనుకున్నారు. ఆరోజుతో నన్ను బాగా తిట్టి ఇంటికి పంపించేస్తారని భయపడ్డారు.

ట్రస్టీ స్వామీజీలు అందరూ ఒక గదిలో సమావేశమై నన్ను పిలిచారు.నేను ధైర్యంగా ట్రస్టీల రూమ్ లోకి వెళ్లాను. అయిదారుగులు మోస్ట్ సీనియర్ స్వామీజీలు అక్కడ కూచుని ఉన్నారు.వాళ్ళ ముఖాలు చాలా సీరియస్ గా ఉన్నాయి.

'ఠాకూర్ ను అవతారంగా నువ్వు ఒప్పుకోవా?' అని వారు అడిగారు.

'ఒప్పుకోను.అదేగా నేను ఆ కాగితంలో వ్రాసింది.' అన్నాను.

'అలా అయితే ఇన్నాళ్ళూ ఈ మఠంలో ఎందుకున్నావు? బ్రహ్మచారి ట్రెయినింగ్ ఎందుకు కంప్లీట్ చేశావు?' అని వారడిగారు.

'నా మనసులో ఉన్న విషయం నేను చెప్పాను. మిగతా బ్రహ్మచారులు తల ఊపారని నేను కూడా ఊపలేను.' అని నేను ధైర్యంగా చెప్పాను.

ఆ రూమ్ లో వాతావరణం అంతా చాలా సీరియస్ గా ఉన్నది.

'అసలు నీ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా చెప్పు. ఠాకూర్ ను నువ్వేమని అనుకుంటున్నావు?' అని వారు అడిగారు.

అప్పుడు నేను ఇలా చెప్పాను.

'ఠాకూర్ ను అవతారం అని మీరంటున్నారు.కానీ అలా అనడం ఆయన్ను తక్కువ చెయ్యడం అని నేను భావిస్తున్నాను. భగవంతుడంటే ఒక మహాసముద్రమైతే, అవతారం అనేది ఆ సముద్రంలోని ఒక అల మాత్రమే. రాముడైనా కృష్ణుడైనా ఇంకే అవతారమైనా కూడా ఆ మహాసముద్రంలోని అలలే. కానీ - ఆ సముద్రమే శ్రీరామకృష్ణులని నేను భావిస్తున్నాను. అవతారం అనేది చాలా చిన్న మాట. అలాంటి మాట వాడి ఠాకూర్ ను మనం ఎందుకు తక్కువ చెయ్యాలి? అది నాకిష్టం లేదు. అందుకే అలా జవాబు చెప్పాను.

'ఠాకూర్ ను అవతారంగా నువ్వు ఒప్పుకుంటావా?' అన్న ప్రశ్నను మీరు ఆ ఫార్మాట్ లో నుంచి ముందు మార్చండి.సమస్త ప్రకృతికీ అతీతుడైనప్పటికీ, సమస్త ప్రకృతికీ ఆధారంగా కూడా ఉన్నట్టి అవాన్మానస గోచరుడైన పరబ్రహ్మంగా నీవు శ్రీరామక్రిష్ణులను గుర్తిస్తున్నావా లేదా? అంతటి పరిపక్వతా అవగాహనా నీకున్నాయా?' అని మీరు అడగాలి. అదే సరియైన ప్రశ్న." - అని నేనన్నాను.

ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది.

అప్పటివరకూ మహా సీరియస్ గా ఉన్న ట్రస్టీ స్వామీజీల ముఖాలు ఒక్కసారిగా పరమానందంతో వికసించాయి. అందరూ లేచి నా భుజం తట్టి - 'వెరీ గుడ్ త్యాగరాజ్. అద్భుతంగా చెప్పావు.నువ్వు చెప్పినది పరమసత్యం.ఇదా నీ భావన !! మరి ముందే ఎందుకు చెప్పలేదు?' అని నన్ను బ్లెస్ చేశారు.

'నువ్వు మంత్రదీక్ష తీసుకున్నది ఎవరి దగ్గర? నీ గురువు ఎవరు?' అని వారు అడిగారు.

'తపస్యానందస్వామి శిష్యుడనని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను.' అని వారికి ధైర్యంగా చెప్పాను.

'ఓ ! అదా సంగతి ! నువ్వు వారి శిష్యుడవా? వెరీ గుడ్. You have proved yourself' అని అందరూ అన్నారు. అనడమే కాదు. ఒక్కొక్కరూ ఒక కేజీ స్వీట్స్ ప్యాకెట్ నాకిచ్చారు. అన్ని స్వీట్స్ ప్యాకేట్స్ తో బయటకొచ్చి, అక్కడ నాకోసం వెయిట్ చేస్తున్న బ్రహ్మచారులందరికీ ఆ స్వీట్స్ పంచాను.

తిట్లు తిని, ఊస్టింగ్ తో బయటకు వస్తానని అనుకున్న ప్రిన్సిపాల్ స్వామీజీ, మొయ్యలేనన్ని స్వీట్స్ పేకెట్స్ పట్టుకుని నేను రావడం చూచి మళ్ళీ షాకయ్యారు. విషయం తెలిసిన తర్వాత మహదానందంతో ఆయన కూడా ఇంకొక స్వీట్ ప్యాకెట్ నాకిచ్చారు.' అన్నాడు స్వామీజీ.

మౌనంగా వింటున్న నాకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగింది. కారును సైడుకు తీసి ఆపేశాను. ఆయన వైపు తిరిగి ఇలా అన్నాను.

'స్వామీజీ.పొద్దున్న నుంచీ మీరు చెప్పిన విషయాలన్నీ ఒక ఎత్తు. ఇదొక్కటీ ఒక ఎత్తు. అద్భుతంగా చెప్పారు మీరు.చాలా కరెక్ట్.' అన్నాను.

'అవును. ఎందుకంటే శ్రీరామకృష్ణులను గురించి వివేకానంద స్వామికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఆయన్ను సరిగ్గా అర్ధం చేసుకున్నది వివేకానందుడొక్కడే. కానీ ఆయన కూడా శ్రీ రామకృష్ణుని జీవితాన్ని గురించి వ్రాయడానికి వెనుకంజ వేశాడు. ఆపనిని తాను చెయ్యలేననీ, ఆయన మహత్యాన్ని వర్ణించడంలో తాను న్యాయం చెయ్యలేననీ ఆయనన్నాడు.

కానీ - ఎన్నో పేజీలు  వ్రాసి కూడా చెప్పలేని విషయాన్ని ఒక్క చిన్న పదంలో చెప్పవచ్చు. అందుకే వివేకానంద స్వామి వ్రాసిన శ్రీరామకృష్ణ స్తోత్రంలో ఒక మాట వాడాడు. " భాస్వర భావసాగర" అనేదే ఆ మాట !!

నాకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి !!

స్వామీజీ కంటిన్యూ చేశాడు.

'ఠాకూర్ భావసాగరుడు. అవికూడా మామూలు భావాలు కావు. ఉజ్జ్వలమైన కాంతితో వెలుగుతున్న దివ్యభావాలవి. మిగతా మహనీయులూ అవతారాలూ ప్రవక్తలూ ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని మాత్రమే వారి జీవితాల్లో ఆచరించగలిగారు.మనకు చూపించగలిగారు.ఉదాహరణకు బుద్ధుడు - శుద్ధ జ్ఞానమూర్తి.శంకరుడూ అంతే. చైతన్యుడు భక్తి భావ ప్రపూర్ణుడు.గోరఖ్ నాద్, మొదలైనవారు యోగులు.రమణమహర్షి జ్ఞాన స్వరూపుడు.అరవిందులది యోగమార్గం.ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని మాత్రమే ఆచరించగలిగారు. కానీ శ్రీరామకృష్ణులలో ఇవన్నీ ఉన్నాయి. ఆయనలో యోగము, భక్తి, జ్ఞానము,తంత్రము ఇంతేగాక అన్ని రకాలైన మతాలూ మార్గాలూ సాధనలూ మొత్తం రాశిగా ఏర్పడి ఉన్నాయి.

మిగతా మహనీయులది ఒక భావం మాత్రమే.కానీ ఈయనో?భావసముద్రుడు. మిగతా మహాపురుషులందరూ నీటి బిందువులు. ఈయన మహాసాగరుడు. ఈ విషయం స్పష్టంగా తెలుసు గనుకనే వివేకానందస్వామి, శ్రీ రామకృష్ణులను - "భాస్వర భావసాగర" అని సంబోధించాడు.

కనుక - ఆయన్ను ఉత్త అవతారం అని భావించడం తప్పు. అది కరెక్ట్ భావన కాదు. అవతారాలన్నీ ఏ పరబ్రహ్మం నుంచి ఉద్భవిస్తాయో అదే శ్రీరామకృష్ణుడు. ఇది సత్యం. అందుకని నేను అదే భావాన్ని వారితో చెప్పాను.' అన్నాడు స్వామీజీ.

నేను చాలాసేపు ఏమీ మాట్లాడలేక పోయాను. ఎందుకంటే స్వామీజీ చెబుతున్నది సత్యం అని నాకు తెలుసు.మహనీయులైన నా గురువుల నోళ్ళ వెంట ఇవే మాటలను నేను 30 ఏళ్ళ క్రితం విన్నాను.

స్వామీజీ కొనసాగించాడు.

'ఇంకో విషయం వినండి. బేలూర్ మఠంలో న్యూ యియర్ రోజున ఠాకూర్ కు ప్రత్యేక పూజ జరుగుతుంది.ఆనాడు ఆయనకు దాదాపు ఏభై రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.వాటిల్లో చేపకూర కూడా ఉంటుంది. బెంగాల్ లో అది సర్వసాధారణం.

ఆ పూజ చేసే స్వామీజీ ఒక న్యూ యియర్ రోజున నాతో ఇలా అన్నారు.

'త్యాగరాజ్. పూజ అయిపోయింది. ప్రసాదం తీసుకోండి. ముఖ్యంగా ఆ చేపకూర ప్రసాదం కొంచం టేస్ట్ చెయ్యండి. బాగుంటుంది.' 

' క్షమించండి మహరాజ్ ! నేను చేపలు తినను.' అని నేను సమాధానం చెప్పాను.

దానికాయన "ఠాకూర్ దగ్గర అవన్నీ వదిలెయ్యాలి. దీనిని ప్రసాదంగా మాత్రమే తీసుకోండి.కొంచమే తీసుకోండి. ఎక్కువ తినమని నేను చెప్పడం లేదు. ఒక చిన్న ముక్క తినండి.అసహ్యం అనే భావాన్ని మీ మనసులో నుంచి తీసెయ్యాలి." అన్నాడు.

నాకు కోపం వచ్చింది.

'అసలు మీరు పెడుతున్న నైవేద్యం ఆయన తీసుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా?' అని సూటిగా అడిగాను.

'అదేంటి త్యాగరాజ్ ! నేను ఈ ఆలయంలో గత పదేళ్లుగా ఈ పని చేస్తున్నాను. అలా అంటావేంటి. ఠాకూర్ నా పూజను స్వీకరించడం లేదని నీకెలా తెలుసు?" అని ఆయన అన్నాడు.

నేనిలా చెప్పాను.

'మీరు మాట్లాడే తీరును బట్టే నాకలా అనిపిస్తున్నది. చేపలు తినమని నన్ను మీరు బలవంతం చెయ్యడం ఎందుకు? వేరే చాలా ఉన్నాయి కాదా ఆ నైవేద్యంలో? ఏదో ఒక స్వీట్ తీసుకుంటాను. నా చాయిస్ ను మీరు గౌరవించాలి. మిమ్మల్ని చేపలు మానుకొమ్మని నేను చెప్పడం లేదు. కానీ నన్ను మీరు ఫోర్స్ చెయ్యకూడదు.ఎందుకంటే ఇది నా ఇష్టం. ఠాకూర్ ఎప్పుడూ ఎదుటి మనిషిని గౌరవించమనే చెప్పేవారు.ఇతరుల విశ్వాసాలను దెబ్బ తీయవద్దనే ఆయన ఎప్పుడూ అనేవారు.అన్ని మతాలూ అన్ని సంప్రదాయాలూ సత్యాలే అనేది ఆయన బోధలలో ఒకటి. మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. పరమ విశాల భావాలకు నిలయం అయిన ఠాకూర్ ను మీలాంటి సంకుచిత భావాలతో మీరెన్నటికీ అర్ధం చేసుకోలేరు. అందుకే అలా అన్నాను.' అని ఆయనతో చెప్పాను.

ఇందులో స్వామీజీ ఏం చెప్పాలని అనుకున్నారో నాకర్ధం కాలేదు. ఆ అర్చక స్వామి చెప్పిన మాటల్లో కూడా కొంత సత్యం ఉందనీ, దానికీయన అంతగా రియాక్ట్ కావలసిన అవసరం లేదనీ నాకనిపించింది.కానీ ఆ విషయాన్ని నేను బయటకు అనలేదు.

అప్పటిదాకా కారును రోడ్డు పక్కనే పార్కు చేసి మౌనంగా ఇదంతా వింటున్నాను. యధాలాపంగా టైం వైపు చూచాను. బస్సు టైం దగ్గర పడిందని అర్ధమైంది. వెంటనే కార్ స్టార్ట్ చేసి బస్టాండ్ వైపు పోనిచ్చాను.

బస్టాండ్ లో కొద్ది సేపు వెయిట్ చేసిన తదుపరి, చెన్నై వెళ్ళే బస్సు వచ్చింది. స్వామీజీ బస్సెక్కి నాకు టాటా చెప్పి తన సీట్లో కూచున్నాడు. బస్సు బయల్దేరింది.

నేనూ ఆయనకు టాటా చెబుతూ మౌనంగా అక్కడ నిలబడ్డాను. బస్సు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు నేనక్కడే నిలబడి ఉన్నాను. చివరకు తేరుకుని బయటకొచ్చి ఇంటి దారి పట్టాను.

కారు ప్రయాణిస్తోంది. యాంత్రికంగా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను.కానీ మనస్సులో ఒకటే మాట పదేపదే మెదులుతోంది.

'భాస్వర భావసాగర'

ఎంత గొప్ప పదం !! తన దైవం అయిన శ్రీ రామకృష్ణులను వర్ణించడానికి వివేకానందస్వామి ఉపయోగించిన మాట ఇది !! రామకృష్ణుల జీవితాన్ని వ్రాయడానికి తాను అశక్తుడనని ఆయన భావించి ఉండవచ్చుగాక. ఆ ప్రయత్నం చెయ్యడానికే ఆయన భయపడి ఉండవచ్చు గాక !! కానీ ఈ ఒక్క పదంతో ఆ పనిని ఆయన చేశాడు.కనీసం చాలావరకూ కృతకృత్యుడయ్యాడు.లెక్కలేనన్ని ఉజ్జ్వల దివ్యభావముల మహాసాగరమే శ్రీరామకృష్ణుని స్వరూపం అన్న విషయం ఆయన ఎంతో స్పష్టంగా ఈ పదంలో చెప్పాడు. ఎంత గొప్ప విషయం !!

ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించాను. నిద్ర పోతున్నా కూడా ఆ ఒక్క పదమే నా మనస్సులో సుడి తిరుగుతూ ఉన్నది. కలల్లో కూడా ఎన్నెన్నో కాంతి వలయాలు! రంగురంగుల తేజోగోళాలు! ఒకదానిలో మరొకటి లీనమౌతూ, విడిపోతూ, విశ్వాంతరాళాలను ఆక్రమిస్తూ, అనంత దిగంతాలలోకి మాయమై పోతూ, తెల్లవార్లూ కనిపిస్తూనే ఉన్నాయి.

తెల్లగా తెల్లవారింది. మెలకువ వచ్చింది. మెలకువ వస్తూనే నా మదిలో, శ్రీ రామకృష్ణ స్తోత్రం నుంచి ఈ పాదం మెదిలింది  - 

'భాస్వర భావసాగర చిర ఉన్మద ప్రేమ పాధార్ 
భక్తార్జన యుగళచరణ తారణ భవ పార్ ".

"నీవు అనంతములైన దివ్య భావముల మహా సముద్రమువు. ప్రేమోన్మత్తుడవు. నీ భక్తులు నీ చరణములను ధ్యానించి, ఈ ప్రపంచమనే సాగరమును అతి తేలికగా దాటగలుగుతున్నారు".

నిద్ర లేచినా, కళ్ళు తెరవకుండా అలాగే పడుకొని ఉన్న నా మనోనేత్రం ముందు దివ్య దరహాసంతో వెలుగుతున్న శ్రీరామకృష్ణుని మనోహర తేజోమయ రూపం ప్రకాశిస్తూ కనిపిస్తూనే ఉంది.

ఫోన్ మ్రోగుతుంటే కళ్ళు తెరిచి ఫోనెత్తాను.

'నేను యదునాధానందను మాట్లాడుతున్నాను. ఇప్పుడే చెన్నైలో క్షేమంగా దిగాను. మీతో గడిపిన రోజంతా ఎంతో ఆనందంగా గడిచింది. రాత్రంతా నిద్రలేదు.సీట్లో కూచుని శ్రీరామకృష్ణులను ధ్యానిస్తూనే ఉన్నాను. చాలా బాగుంది. ఎప్పుడో బేలూర్ మఠంలో జరిగిన సంఘటన మీ మాటలతో బయటకు వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. త్వరలో మళ్ళీ కలుద్దాం.' అన్నాడాయన.

'అలాగే స్వామీజీ.త్వరలో చెన్నై వచ్చే పని ఉన్నది. వచ్చినపుడు మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను.' అని ఫోన్ పెట్టేశాను.  

ఉన్నతములైన భావములను నిరంతరం మనస్సులో చింతించేవారిని కలవడం నాకూ ఆనందమేగా మరి !!

(అయిపోయింది)
read more " స్వామి యదునాధానందతో సంభాషణ -8 (శ్రీ రామకృష్ణులు దైవం యొక్క అవతారమా? నేనొప్పుకోను ) "

24, నవంబర్ 2016, గురువారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 7 (శ్రేష్ఠభక్తి)

స్వామీజీ చెప్పసాగారు.

"ఒక్క జపమే చాలు.దానితోనే సర్వమూ సాధించవచ్చు" అని శ్రీమాత అనేవారు. అమ్మ చెప్పిన తదుపరి ఏ విషయంలో నైనా సరే ఇక మారుమాట ఏముంటుంది? కానీ ఈ మాటను సరిగా అర్ధం చేసుకోవాలి. ఏ సాధనా చెయ్యకుండా జపం ఒక్కటే చేసేవారికి జపమే చాలు.అనుక్షణమూ లోపల్లోపల 'అజపాజపం' చేసేవారికి అదొక్కటే చాలు.దానినుంచే అన్నీ వస్తాయి. కానీ రోజంతా కర్మలలో మునిగి ఉండేవారికి ఒక అరగంటో గంటో చేసే ఉత్తుత్తి జపం ఏ మాత్రమూ సరిపోదు.వారు మిగతా విషయాలలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.


ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా - చివరకు మనం శ్రేష్ఠభక్తులుగా మారాలి.అదొక్కటే అతి ముఖ్యమైన విషయం.

శ్రేష్ఠభక్తికి మొదటి ఉదాహరణ ప్రహ్లాదుడు.అతను పూర్తిగా పాజిటివ్. తండ్రి హిరణ్యకశ్యపుడు పూర్తిగా నెగటివ్.పాజిటివ్ నెగటివ్ కలిస్తే ఎలక్ట్రిక్ స్పార్క్ వస్తుంది. ఆ విద్యుత్ శక్తి స్వరూపమే నరసింహస్వామి.

"ఎక్కడున్నాడో నీ దేవుడు చూపించు" అని తండ్రి కోపంగా అరిచాడు.అన్ని చోట్లా ఉన్నాడని అన్నాడు ప్రహ్లాదుడు."అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు" అంటూ స్తంభాన్ని గదతో మోదాడు హిరణ్యకశ్యపుడు.ఆ పగిలిన స్తంభంలో నుంచి వెయ్యి సూర్యుల కాంతితో నరసింహస్వామి ఆవిర్భవించాడు. దేవుని అవతారాలు ఎన్నో ఉన్నాయి.కానీ అన్నింటిలోకీ మహా శక్తివంతమైన అవతారం నరసింహావతారమే.ఈ అవతారంలో భగవంతుడు ఉన్నది కూడా అత్యంత స్వల్పకాలమే. మహా అయితే ఒక గంటసేపు ఉన్నదేమో ఈ అవతారం.

మహోగ్రస్వరూపంతో ఉన్న నృసింహుడిని చూచి దేవతలే భయంతో వణికిపోయారు. ఆయన్ను శాంతింప చెయ్యడానికి మళ్ళీ చిట్టి ప్రహ్లాదుడినే ముందుకు పంపారు.తన బుజ్జి భక్తుడిని చూచి ఆయన శాంతించాడు. ప్రహ్లాదుడిని తన తొడపైన కూర్చోబెట్టుకుని ముద్దు చేశాడు.

అప్పుడు దేవతలతో ఇలా అన్నాడు.

'హిరణ్య కశ్యపుడిని చంపడం కోసం నేనీ అవతారం ఎత్తవలసిన అవసరం లేనే లేదు.నేనున్నచోటనుంచే 'ఉఫ్' అని ఊదితే వాడు గాలిలో కలిసి పోతాడు.నా సృష్టిలో వాడొక జీవి అంతే.ఈ అవతారం ఎత్తకుండానే నేను అతడిని సంహరించగలను.కానీ నా శ్రేష్ఠభక్తుడైన ప్రహ్లాదుడి మాట నిలబెట్టడం కోసం, ఈ స్తంభంలోనుంచి ఈ విధంగా ఆవిర్భవించాను.నా ప్రియభక్తుల మాటను నేను గౌరవిస్తాను.వారు ఏదో యధాలాపంగా అన్నా సరే, దానిని నేను నెరవేర్చక తప్పదు."

శ్రేష్ఠ భక్తి అంటే అది !!

ఇటువంటి శ్రేష్ఠభక్తికి రెండో ఉదాహరణ అభిరామి భట్టార్.ఈయన అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. ఈయన 18 వ శతాబ్దంలో తమిళనాడులో ఉండేవాడు. పార్వతీ అమ్మవారికి ఈయన మహాభక్తుడు.ఆ ఊరిలో ఉన్న పార్వతీ దేవికి పేరు 'అభిరామి'.

ఆ సమయంలో మరాఠా రాజు సెర్ఫోజీ తమిళనాడును పాలించేవాడు. ఒకరోజు మహారాజు శివాలయానికి వచ్చాడు.అక్కడ పూజలేమీ చెయ్యకుండా ఊరకే కూచుని ఒళ్ళు మరచిన ధ్యానంలో ఉన్న సుబ్రమణ్య అయ్యర్ ను ఆయన చూచి - "ఈయన ఎవరు? ఈయన ప్రవర్తన వింతగా ఉన్నదే? మీలా ఈయన మామూలు పూజలు చెయ్యడం లేదు? ఊరకే కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు? ఏంటిది?" - అని అక్కడి పూజారులను ప్రశ్నించాడు.

వారిలో కొంతమంది - ' ఈయన అమ్మవారికి శ్రేష్ఠ భక్తుడు.' అని జవాబు ఇచ్చారు. కానీ అయ్యర్ అంటే గిట్టని మరికొందరు అర్చకులు మాత్రం - ' అతనొక పిచ్చివాడు.దురహంకారి. అతన్ని పట్టించుకోకండి' అని రాజుగారికి చాడీలు చెప్పారు.

అతన్ని పరీక్షించాలని అనుకున్న సెర్ఫోజీ మహారాజు, ధ్యానంలో ఉన్న అయ్యర్ దగ్గరికి వెళ్లి -'ఈరోజు తిధి ఏమిటి?' అని ప్రశ్నించాడు. అయ్యర్ అప్పటిదాకా తన ధ్యానంలో అమ్మవారి దివ్యతేజోవంతమైన రూపాన్ని చూస్తున్నాడు.అది పున్నమి చంద్రునిలా వెలుగుతున్నది. రాజు ప్రశ్నతో ధ్యానం చెదరి కళ్ళు తెరిచిన అయ్యర్ తను చూస్తున్న జగజ్జనని తేజస్సును మర్చిపోలేక - "ఈ రోజు పౌర్ణమి" అని జవాబు చెప్పాడు.

కానీ ఆరోజు అమావాస్య !!

మహారాజు కోపంతో ఊగిపోయి, "మహారాజునైన నాతోనే నీకు వెటకారంగా ఉన్నదా?నీకు చాలా పొగరులా ఉన్నదే? సరే చూస్తాను. ఈరోజు రాత్రికి పున్నమి చంద్రుడు కన్పించకపోతే నీకు చావు తధ్యం." అని అదే ఊరిలో ఆ రాత్రికి బస చేశాడు.

ఆరోజు అమావాస్య గనుక చంద్రుడు కనిపించడు గనుక అయ్యర్ కు చావు తప్పదని అందరూ అనుకున్నారు.  ఆ రాత్రికి సుబ్రమణ్య అయ్యర్ ఆశువుగా శ్లోకాలలో అమ్మను ప్రార్ధించసాగాడు.నూరు శ్లోకాలు పూర్తయ్యేలోపు ఏదో ఒక అద్భుతం జరగకపోతే అగ్నిలో దూకి తానే చనిపోదామని, రాజు చేతిలో శిరచ్చేదం చేయించుకోవడం కంటే అదే మంచిదని ఆయన అనుకున్నాడు. ఎదురుగా మహారాజు కూర్చుని ఇదంతా చూస్తున్నాడు.

78 శ్లోకాలు పూర్తయ్యేసరికి అయ్యర్ కు మాత్రమే దర్శనమిస్తూ ప్రత్యక్షమైన పరమేశ్వరి తన చెవికమ్మను తీసి ఆకాశంలోకి విసిరిందని, అది పున్నమి చంద్రునిలా కాంతులు విరజిమ్మి, దశదిశలా తెల్లని వెలుగును నింపిందని చరిత్ర చెబుతున్నది. ఆ విధంగా అమావాస్య రోజున పౌర్ణమి అయింది. దీనిని కళ్ళారా చూచిన సెర్ఫోజి మహారాజు అదిరిపోయి, అయ్యర్ ను క్షమించమని ప్రార్ధించి అతనికి 'అభిరామి భట్టార్' అని బిరుదు ప్రదానం చేశాడని రికార్డ్ చెయ్యబడి ఉన్నది.ఇది మొన్న మొన్న జరిగిన సంఘటనే. ఎప్పటిదో కాదు. ఆ తర్వాత మిగిలిన 22 శ్లోకాలనూ ఆయన పూర్తి చేశాడు.

"తాటంక యుగళీ భూత తపనోడుప మండలా" - కదా అమ్మ !!

తన శ్రేష్ఠభక్తుడైన అభిరామి భట్టార్ మాటను నిజం చెయ్యడానికి అమావాస్య రాత్రిపూట పున్నమి వెన్నెలను కాయించింది జగజ్జనని.

శ్రేష్ఠ భక్తి అంటే అది !!

ఇలాంటి శ్రేష్ఠభక్తికి ఇంకో నిదర్శనం రామానుజాచార్యుల వారి జీవితంలో మనం చూడవచ్చు.ఆయన మహాభక్తుడే గాక పూర్ణాయుష్కుడై 120 ఏళ్ళు బ్రతికిన మహనీయుడు.

ఒకరోజున ఆయన దగ్గర పనిచేసే చాకలి వచ్చి ఇలా అన్నాడు.

' అయ్యా ! నేను ఎప్పటినుంచో మీకు బట్టలు ఉతుకుతూ ఉన్నాను. మీరు కూడా నాకు తగినంత ధాన్యం వగైరాలు ఇస్తూ ఉన్నారు.కానీ మీరిస్తున్న సంభారాలు ఈ మధ్య నాకు సరిపోవడం లేదు.ఎందుకంటే, నా కుటుంబం పెద్దదై పోయింది.అందుకని ఆ వెచ్చాలను ఇంకొంచం ఎక్కువగా ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.'

రామానుజులు యధాలాపంగా - 'సరే ! రేపటినుంచీ నీకు కావలసినంతగా అవి ఇవ్వబడతాయి' అని అన్నారు.కానీ ఆ సంగతి ఆయన మరచిపోయారు.ఆ చాకలి కోరినట్లు రేపటినుంచీ ఎక్కువ సంభారాలు ఇవ్వమని తన కోశాదికారికి చెప్పడం విస్మరించారు. ఆ తర్వాత కొన్నేళ్ళు గడిచాయి.

కొన్నాళ్ళకు ఆ చాకలి మరణించాడు. పరామర్శ కోసం అతని ఇంటికి వెళ్ళారు రామానుజులు. అప్పుడు హటాత్తుగా తానిచ్చిన మాట ఆయనకు గుర్తుకొచ్చింది. ఆయన పశ్చాత్తాపంతో క్రుంగి పోయాడు. ఇచ్చిన మాటను నెరవేర్చలేక పోయానే అని ఎంతో బాధ పడ్డాడు.

కానీ ఆ చాకలి భార్య ఆయనతో ఇలా చెప్పింది.

'స్వామీ ! మాకు మీరిస్తున్న సంభారాలు చాలడం లేదనీ, ఇంకా ఎక్కువగా కావాలనీ నా భర్త కొన్నేళ్ళ క్రితం మిమ్మల్ని అర్ధించాడు. ఆ మరుసటి రోజు నుంచీ మాకు ఏ లోటూ లేకుండా మీ సంస్థానం నుంచి మాకు కావలసినంత సరుకులు ఇన్నేళ్ళుగా లభిస్తూ ఉన్నాయి.దానివల్ల మేము ఏ లోటూ లేకుండా హాయిగా బ్రతుకుతున్నాము. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు.' అంటూ ఆయన పాదాలకు నమస్కరించింది.

రామానుజులు నిర్ధాంతపోయారు !!

'తను చెప్పిన మాటను తానే మరచి పోయాడు. తన ఉద్యోగులకు తాను ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు. కానీ తన మాట నెరవేరింది. ఇదెలా సాధ్యం?" అని ఆలోచనలో మునిగిన ఆయన మనోనేత్రం ముందు మనోహరమైన చిరునవ్వుతో వెలుగుతున్న నారాయణుని దివ్యరూపం గోచరమైంది.

భక్తుడు మరచిపోయినా భగవంతుడు మరచిపోడు. యధాలాపంగా తన భక్తుడు ఇచ్చిన మాటను ఆయనే నిజం చేస్తాడు. అన్నేళ్ళుగా ఆ చాకలి కుటుంబానికి ఏ లోటూ లేకుండా అన్నీ సరఫరా చేసింది దైవమే !!

ఇది నమ్మలేని వింతగా మనకు అనిపించవచ్చు. అలా అనిపించడానికి కారణం మనలో పాతుకుపోయిన విశ్వాస రాహిత్యం తప్ప ఇంకేమీ కాదు. భక్తిప్రపంచంలో అన్నీ సాధ్యాలే.భక్తి అంటే ఏమిటో తెలియని వారికి ఇవి కాకమ్మ కబుర్లలా అనిపించవచ్చు. కానీ వారికి తెలియని ప్రపంచం ఎంతో ఉంది.

శ్రేష్ఠ భక్తికి ఇది ఇంకొక ఉదాహరణ !!

నేనొకసారి కడప రామకృష్ణాశ్రమానికి వెళ్లాను. అక్కడ ఒక ముసలాయన నాతో మాట్లాడటానికి వచ్చారు.

తాను ఎన్నో గ్రంధాలు చదివానని, మహా పండితుడనని, అనర్గళంగా ఏ విషయం మీదనైనా మాట్లాడగలనని, ఎంతో మందికి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చానని ఆయన ఎంతో గర్వంగా నాకు చెప్పారు.వేదాలు ఉపనిషత్తులు, పురాణాలు, సమస్త గ్రంధాలు తనకు కొట్టిన పిండి అని అన్నారు.

'గాస్పెల్ చదివారా?' - అని నేనడిగాను.

'అదేంటి స్వామీ అలాగంటారు? శ్రీ రామకృష్ణుల భక్తుడినై ఉండి గాస్పెల్ చదవకుండా ఉంటామా? ఎన్నోసార్లు తిరగా మరగా చదివాను' అన్నాడు.

'ఊరకే చదవడం కాదు. దానిలోనివి మీరు ఏం పాటిస్తున్నారు?తన పాండిత్యం గురించి ఇలా గొప్పలు చెప్పుకోమని ఠాకూర్ చెప్పారా ఎక్కడైనా? అసలు పాండిత్యానికి ఆయనేమైనా విలువ ఇచ్చేవారా? మరి మీరెందుకు దాని గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు?' అని ఆయన్ను అడిగాను.

ఆయనేమీ జవాబు ఇవ్వలేదు.

భక్తులమని, ఆధ్యాత్మికులమని భావించుకునేవారు అందరూ ఇలాగే ఉంటారు. వారికి పాండిత్యం ఉండవచ్చు, విషయం తెలియవచ్చు, కానీ ఆచరణ లేకుంటే వారి "జ్ఞాన"మంతా  ఎందుకూ పనికిరాదు.ఇలా ఉన్నవాళ్ళు అసలు భక్తులే కారు.ఇక శ్రేష్ఠభక్తులు ఎలా కాగలరు?" అన్నాడు స్వామీజీ.

నా భావాలు కూడా ఇలాగే ఉంటాయి గనుక ఆయన చెబుతున్న మాటలు నాతో నేనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటే, మౌనంగా వింటూ ఉన్నాను.

(ఇంకా ఉంది)
read more " స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 7 (శ్రేష్ఠభక్తి) "