3, ఫిబ్రవరి 2014, సోమవారం

సాధనా సమ్మేళనం -కోటప్పకొండ -3



ఉదయం మూడుకే ఏవో కేకలు అరుపులూ గోలగోలగా వినిపించాయి.ఎవరో యాత్రిక బృందం వచ్చినట్లుంది అనుకుంటూ మెలకువలోకి వచ్చేసాను. భారతీయులలో సివిక్ సెన్స్ చాలా తక్కువ అన్నది నగ్నసత్యం.సివిక్ సెన్స్ ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ స్వార్ధం ఎక్కువగా ఉంటుంది అన్నదీ సత్యమే. సోకాల్డ్ భక్తులలో అయితే ఈ స్వార్ధం మరీ ఎక్కువగా ఉంటుంది. గడ్డకట్టిన స్వార్ధాన్నే భక్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు.

బయటకెళ్ళి చూచాను.'సమైక్యాంధ్ర కోసం ఫలానా అసోసియేషన్ వారి తీర్ధయాత్రలు' అని ఒక బస్సుకు ఒక ఫ్లెక్సి కట్టి ఉన్నది.దానిలోనే వాళ్లందరూ వచ్చినట్లున్నారు.ఇదొక ఆత్మవంచన.


'గాలికి ఎగిరిపోయిన పేలాలు రామార్పణం'-అన్నట్లుగా ఉన్నది వీరి తంతు. వీరికి తీర్ధయాత్ర అంటే ఏమిటో తెలియదు.పిక్నిక్ కీ దీనికీ తేడా అసలె తెలియదు.పైగా సమైక్యాంధ్ర ఒకటి.ఈ గోలతో పక్కవారిని డిస్టర్బ్ చెయ్యడం.దానికి భక్తి అనేది ఒక ముసుగు.

మనుష్యుల అజ్ఞానం ఎన్ని వెర్రితలలు వేస్తుందో ఆ దేవుడికే తెలియాలి.రాన్రాను ఈ సోకాల్డ్ భక్తులనే వాళ్ళని చూస్తుంటే నాకు పిచ్చికోపం వస్తున్నది.సివిక్ సెన్స్ లేనివాడు భక్తి అనే కాన్సెప్ట్ ని అసలు ఎలా అర్ధం చేసుకోగలడు?ఈ మనుషుల అజ్ఞానాన్ని దేవుడు కూడా బాగుచెయ్య లేడనిపించింది.

ఈరోజు వేసిన ప్లాన్ ప్రకారం విష్ణుశిఖరానికి వెళ్ళి అక్కడ ఉన్న పాపనాశేశ్వర స్వామిని దర్శించుకుని రావాలి.

దానికోసం కొంతమందిని విచారించగా - 'ముందుగా కొండదిగి నరసరావుపేట దారిలో ఉన్న రెడ్లసత్రం దాటి కొంతదూరం వెళితే అక్కడ చింతతోపు ఒకటి వస్తుంది.ఆ చింతతోపునుంచి వెదికితే ఒక కాలిబాట వంటిది కనిపిస్తుంది.ఆ బాటలో మెట్లేమీ ఉండవు. రాళ్ళమీదుగా ఒక అరకిలోమీటరు దూరం కొండ ఎక్కితే అక్కడ ఒక చిన్న గుడీ దానిపక్కన ఒక కొలనూ ఉంటాయి' -అని చెప్పినారు.

అనుకున్న సమయానికే పొద్దున్నే బయలుదేరి కారులో కొండ దిగినాము. కారును యాదవసత్రం బయటగా పార్క్ చేసి అక్కడనుంచి దారి వెదకడం మొదలుపెట్టాము.అక్కడనుంచి చూస్తే విష్ణుశిఖరం అచ్చం హిమాలయాలోని కైలాసశిఖరంలా కనిపించింది.మంచు ఒక్కటే తక్కువ.అదికూడా ఉంటే కైలాసశిఖరానికీ దీనికీ పెద్ద తేడాలేదు.పెద్దగా కష్టపడకుండానే దారి కనబడింది.మెకన్నాస్ గోల్డ్ సినిమాలో కొండల మధ్య దారి ఉన్నట్టుండి కనిపించినట్లు మాకూ దారి కనిపించింది.దట్టమైన చెట్లపొదల మధ్యగా రాళ్ళమీదుగా దారి ఉన్నది.దానిగుండా కొండ ఎక్కాలి. చెట్లమధ్యలో ఒక్కమనిషి మాత్రమే నడవగలిగే ఇరుకుదారిలాగా ఉన్నది.

నిజానికి అది దారి కాదు.వర్షం పడినప్పుడు ఆ నీరు కొండమీదనుంచి కిందకు జారిన నీటివాలే ఆ దారిగా కనిపిస్తున్నది.నిన్న ఎక్కిన దారికంటే కూడా ఇదే కష్టమైన దారి.నిన్న కనీసం కొందరు పనివాళ్ళన్నా దారిలో అక్కడక్కడా కనిపించారు.ఇక్కడ దారి పొడుగునా ఎవరూ లేరు.పైగా దట్టమైన చెట్ల మధ్యలోనుంచి ఒంటరిగా ఎక్కాలి.నలుగురితో కాకుండా ఒంటరిగా వస్తే ఇంకా బాగుంటుంది.మౌనాన్నీ ప్రకృతినీ బాగా ఉపయోగించుకోవచ్చు.ఈసారి ఒక్కడినే రావాలి,ఒకరోజంతా ఈ కొండమీద చెట్లలో ఏకాంతంగా ఒక్కడినే ఉండాలి అని నిశ్చయించుకున్నాను.


సగం కొండను ఎక్కిన తర్వాత ఒక చోట రాళ్ళన్నీ అరుగుల మాదిరి సహజంగా అమరి ఉన్నాయి.అక్కడ చెట్లుకూడా గుబురుగా వంగి పైన మంచి నీడనిస్తూ ఉన్నాయి.అక్కడ కూచుంటే ఒక పందిరిలో కూచున్నట్లు ఉన్నది.అక్కడ కొంచంసేపు కూర్చుని సేదతీరాము. అక్కడ ఎవరో కూచోడానికి అరుగులలాగా రాళ్ళను పెర్చుకున్నట్లు తోచింది.బహుశా ఎవరైనా సాధువులు కొద్దిసేపు ఈ ప్రదేశంలో కూచోడానికి అలా ఏర్పాటు చేసుకున్నారేమో అనుకున్నాను.


ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉన్నది.చల్లనిగాలి వీస్తున్నది.మధ్యమధ్యలో పక్షులు చేసున్న శబ్దాలు తప్ప అంతా మౌనంగా ప్రశాంతంగా ఉన్నది.ఈ చెట్ల పందిరి క్రింద కూచుని ఎక్కడో క్రింద ఉన్న ఇళ్ళనూ ఊరినీ చూస్తుంటే ఉపనిషత్తులలోని'ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షం..'అన్న మంత్రం అకస్మాత్తుగా నా మదిలో మెదిలింది.సమస్త ప్రకృతి,పరమేశ్వరధ్యానంలో తన్మయమై ధ్యానమగ్నమై ఉన్నట్లు అనిపించ సాగింది.మనస్సు అప్రయత్నంగా ధ్యానస్తితిలోకి వెళ్ళసాగింది.

నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ 'జయజయ మహాదేవా...' అని  ఘంటసాల పాడిన సినిమా పాటను రామన్నగారు అందుకోబోయారు.

మెల్లగా ఆయన భుజం మీద తట్టి 'మౌనంగా ఉండండి.' అని సున్నితంగా చెప్పినాను.

'భగవన్నామమే కదా సార్.తప్పేముంది?' అని ఆయన అన్నారు.


'భగవన్నామం మనం చెయ్యకూడదు. సమస్త ప్రకృతీ భగవద్ధ్యానంలో ఇప్పటికే ఉన్నది. ఓంకారనాదంగా భగవన్నామం ప్రకృతిలో నిరంతరం మారు మ్రోగుతున్నది.మనం దానిని వినాలి. దానిలో మన మనస్సులు లీనం కావాలి.మనం చేసే శబ్దాలు ఆ ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయి.కనుక మౌనంగా ఉండి మీచుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి' అని చెప్పినాను.పాపం ఆయనేమనుకున్నారో గాని ఏమీ మాట్లాడలేదు.

యోగమార్గం ప్రశాంత నిశ్శబ్దమౌనం.మౌనంలోనే నిజమైన సాధన జరుగుతుంది.స్తోత్రాలూ భజనలూ పాటలూ పూజలూ చాలా తక్కువ స్థాయికి చెందిన మతప్రక్రియలు.అవన్నీ కూడా చివరకు మౌనానికే దారితీస్తాయి.అలా తీసినప్పుడే వాటికి నిజమైన సార్ధకత.


కాసేపు అక్కడ కూర్చుని మళ్ళీ నడక ప్రారంభించి నాము.ఆ విధంగా ఒక ముప్పావుగంట నడిచి కొండ మీదున్న గుడిదగ్గరకు చేరుకున్నాము.మదన్ అక్కడి కొలనులో స్నానం చేశాడు.మేము తలమీద నీళ్ళు చల్లుకుని కాళ్ళు చేతులు కడుక్కున్నాము. కొండలలో అలాంటి సరస్సుల దగ్గర మనస్సు అప్రయత్నంగా ధ్యానోన్ముఖం అవుతుంది.ఆదోని కొండమీద కూడా ఇలాంటి చెరువు ఒకటి ఉంటుంది.అక్కడి వాతావరణం కూడా నిశ్శబ్దంగా చాలా మనోహరంగా ఉంటుంది.ఇరవై అయిదేళ్ళ క్రితం నేను ఆదోనిలో ఉన్న రెండేళ్ళూ ఆ కొండనెక్కి ఒంటరిగా అక్కడకు పోయేవాడిని.ఆ చెరువు ఒడ్డున చాలాసేపు కూచుని చీకటి పడినాక కొండ దిగి వచ్చేవాడిని.

ఈ కొండమీద కూడా అలాంటిదే ఒక కొలనులాగా సహజంగా ఏర్పడి ఉన్నది.వర్షాకాలంలో పడిన వాననీటితో అక్కడ ఒక సహజసరస్సు వంటిది ఏర్పాటైంది.అది నిండి పొంగిపోయిన నీళ్ళు క్రిందకు ప్రవహించిన దారే మేము నడచి వచ్చిన రాళ్ళదారి.'విశాలమైన జలాశయాల సమీపంలో ధ్యానం చెయ్యండి' అని తమ శిష్యులకు శ్రీరామకృష్ణులు చెప్పేవారని మహేంద్రనాధగుప్త వ్రాస్తారు.ఎందుకంటే అనంతమైన ఆకాశం తనక్రింద ఉన్న నీటిలో ప్రతిఫలించినట్లుగా,అనంతమైన దివ్యత్వం నిమ్నమానవచేతస్సులో ప్రతిఫలిస్తుంది.నిశ్చలత్వాన్ని ఇస్తుంది. అలాంటి పరిసరాలు ధ్యానానికి ఇతోధికంగా దోహదం చేస్తాయి. అందుకే యోగులైనవారు కొండలనీ సరస్సులనీ ఏకాంత నిశ్శబ్ద ప్రదేశాలనీ అమితంగా ఇష్టపడతారు. 

గుడిలోనికి వెళ్ళి చూస్తే ఎప్పుడో ఎవరో పూజచేసిన ఆనవాళ్ళు కనిపించాయి.చిన్నచిన్న కవర్లూ చెత్తా చెదారమూ కొబ్బరి పీచులూ కాగితం ముక్కలూ ఇలా ఏవేవో లింగం చుట్టూ ఉన్నాయి. వాటినీ అనవసరమైన ప్లాస్టిక్ సీసాలనూ గట్రానూ అన్నీ ముందుగా బయటకు విసిరేసి గుడిలోపల అంతా శుభ్రం చేశాము.

రామన్నగారికి రుద్రం నోటికి వచ్చు.అందరం కలసి మేము తెచ్చుకున్న సీల్డ్ వాటర్ బాటిల్స్ లోని నీటితో రుద్రమూ పంచబ్రహ్మ మంత్రములూ చదువుతూ శివలింగానికి అభిషేకం చేశాము.అందరికీ ఆనందం కలిగింది.రామన్నగారు చాలాసేపు గుడిలో ధ్యానంలో కూచున్నారు.మేము లేచి బయటకు వచ్చినాము.

బయటకు వచ్చాక కొద్దిసేపు అక్కడ ఉన్న బండల మీద కూచున్నాము.ఎవరో అక్కడ రాళ్ళపొయ్యి పెట్టి వంట చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి.బహుశా ఎవరైనా సాధువులు అక్కడ రాత్రిళ్ళు ఉంటారేమో అనుకున్నాను.

అక్కడి ప్రశాంతప్రకృతినీ నిశ్శబ్దంలోని మాధుర్యాన్నీ ఆస్వాదిస్తూ ఆ బండలమీద కొద్దిసేపు కూచున్నాము. మానవ నివాసాలనూ భూమినీ వదలి ఆకాశంలోకి పోయేకొద్దీ మనస్సు తేలికగా ధ్యాన నిమగ్నమౌతుందని రజనీష్ అనేవాడు.అది నిజమే.దానికి మార్మికమైన కారణాలున్నాయి.ఎత్తులలో భూమి యొక్క ఆకర్షణ క్రమేణా తగ్గిపోతుంది.అప్పుడు భూసంబంధమైన నిమ్నవాంచలు మనస్సును తేలికగా వీడిపోతాయి. అందుకే యోగులూ ఋషులూ ఎత్తైన కొండల్లో నివాసం ఏర్పరచుకుంటారు. అది వారి సాధనకు ఎంతగానో దోహదం చేస్తుంది.టిబెట్లో అత్యున్నతమైన యోగమూ బౌద్ధతంత్రమూ విలసిల్లడానికి కారణం అదే.

ఈలోపల రామన్నగారు ధ్యానంలోనుంచి లేచి గుడి బయటకు వచ్చినారు.

'ఈ ప్రదేశం తపస్సుకు చాలా అనుకూలంగా ఉన్నది' అని రామన్నగారన్నారు.

'అవును.ఇప్పుడు మనమందరమూ తపస్సు చేద్దాం.అయితే ఇదొక రకమైన విలక్షణ తపస్సు'- అన్నాను.

ఏమిటి అన్నట్లు అందరూ చూచారు.

'ఒక్కసారి చుట్టూ చూడండి' అన్నాను.

అక్కడ చెట్లకొమ్మల మీద చినిగిపోయిన ప్యాంటులూ షర్టులూ వేలాడుతూ కనిపిస్తున్నాయి.చెట్లలో అస్తవ్యస్తంగా విసిరేసి ఉన్న చీరలూ పరికిణీలూ కనిపిస్తున్నాయి.ఎవరో అక్కడ స్నానాలు చేసి, విడిచిన బట్టలు చెట్లలోకి విసిరేసి వెళ్ళినట్లు కనిపిస్తున్నది.గుడి చుట్టూతా ప్లాస్టిక్ సీసాలూ, ప్లాస్టిక్ కవర్లూ,రకరకాల కాగితాలూ, వాడిపారేసిన పూజా సామగ్రీ అంతా కలసి దరిద్రంగా ఉన్నాయి.మన పూజ అయిపొయింది కదా ఇక చెత్తాచెదారాన్ని ఎలా పడేస్తే మనకెందుకు అనుకుని ఆయా భక్తులు ఇష్టం వచ్చినట్లుగా గుడి పరిసరాలను పాడుచేసి పారేశారు అన్న విషయం స్పష్టంగా దర్శనం ఇస్తున్నది.

ప్రకృతి మౌనంగా రోదిస్తున్నట్లు నాకనిపించింది.

'వీటన్నిటినీ మనం ఇప్పుడు శుభ్రంచేసి మూటకట్టి తీసుకుని పోయి కొండ కింద పడేద్దాం.ఇవన్నీ ఈ ప్రకృతికి ఫారెన్ మెటీరియల్స్.పనికిమాలిన భక్తులు ఇక్కడికి కూడా వచ్చి ప్రకృతిని ప్లాస్టిక్ తోనూ విడిచేసిన గుడ్డలతోనూ ఎలా పాడు చేశారో చూడండి.ఇదే మన హిందూమతానికి పట్టిన దరిద్రం.ఏ పుణ్యక్షేత్రం చూచినా ఘోరమైన లిట్టరింగ్ కనిపిస్తుంది.మినిమం శుభ్రత అనేది లేని వీళ్ళేం భక్తులో నాకెప్పుడూ అర్ధంకాదు.'

శివునికి అష్టరూపాలున్నాయని మన గ్రంధాలలో ఉన్నది. పంచభూతాలూ, మనస్సు,అహమూ,జీవుడూ ఈ ఎనిమిదీ ఆయన రూపాలే అని శైవం అంటుంది.అంటే ఏమిటి?భూమీ,నీరూ,గాలీ,నిప్పూ,ఆకాశమూ శివ స్వరూపాలే.వాటిని పాడుచేస్తే శివద్రోహం చేసినట్లే.మూర్ఖులైన భక్తులు ఇక్కడకు వచ్చి భక్తి పేరిట ఇక్కడి ప్రకృతినంతా పాడుచేసి పెడుతున్నారు.ఇది భక్తి కాదు.దైవద్రోహం'- అన్నాను.
   
రాజు ఆశ్చర్యంగా చూచాడు.

'కొత్త విషయం వింటున్నాను సార్.అంటే పంచభూతాలలో దేనిని పాడు చేసినా అది శివలింగాన్ని ధ్వంసం చేసినట్లేనా?' అన్నాడు.

'అవును రాజు.ముస్లిములు మన దేవాలయాలు ధ్వంసం చేశారని వారిని మనం ఇప్పటికీ ద్వేషిస్తూ ఉంటాము.వాళ్ళే కాదు.మనమూ శివద్రోహం చేస్తున్నాము.శివస్వరూపమైన ప్రకృతిని పాడుచెయ్యడమే మనం చేస్తున్న శివద్రోహం' అన్నాను.

'ఇంక వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఉపయోగం ఏముంటుంది సార్?' అడిగాడు రాజు.

'అదేగదా నేను చెప్పేది.ఉపయోగం ఉండదూ ఏమీ ఉండదు.భక్తి పేరుతో ఇదొక ఆత్మవంచన.సోకాల్డ్ ఆధ్యాత్మికలోకంలో చాలా అజ్ఞానం ఉన్నది రాజూ. విగ్రహానికి పూజచేయ్యడమే గొప్ప అనుకుంటారు మూర్ఖులు.వారికి అంతకంటే అర్ధం కాదు.' అన్నాను.

ఇంతలో రామన్న గారికి ఒక అనుమానం వచ్చింది.

'అదేంటి సార్.మనకే ఈ కొండ ఎక్కడానికి ఇంత కష్టం అయ్యింది.ఇక చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు ఇక్కడికి ఎక్కి వచ్చి స్నానాలు చేసి చీరలు విసిరి పారేశారంటే ఆశ్చర్యంగా ఉన్నది.' అన్నారు.

'రామన్నగారు.గుంటూరు కృష్ణాజిల్లాల ఆడవాళ్ళను తక్కువ అంచనా వెయ్యకండి.వాళ్ళు మనకంటే ఎందులోనూ ఏమీ తీసిపోరు.' అన్నాను.

ఇలా మాట్లాడుకుంటూ ఆ కొండరాళ్ళ మీదా చెట్లకొమ్మల్లోనూ చిక్కుకున్న విడిచేసిన గుడ్డలన్నీ ఏరి రెండు చీరలలో మూటలు కట్టినాము.ఆ క్రమంలో ముళ్ళు గీరుకున్నా లెక్కచెయ్యకుండా,చెట్లలోకి వెళ్ళి,కొండఅంచులకి వెళ్ళి మరీ చెత్తను సేకరించాము.కొన్ని చీరలైతే కొన్నినెలల క్రితం విసిరి పారవేసినట్లుగా వాటిమీద మట్టీ రాళ్ళూ పేరుకుని ఉన్నాయి.అక్కడ ఉన్న ప్లాస్టిక్ సీసాలూ చెత్త కాయితాలూ ప్లాస్టిక్ కవర్లూ ఏరి మొత్తం నాలుగు మూటలు చేసినాము.ఆ చెత్త అంతా ఏరిన తర్వాత చుట్టూ చూస్తే ప్రకృతి అంతా నవ్వుతూ మమ్మల్ని దీవిస్తున్నట్లు అనిపించింది.

ఇంతలో రాజు ఒక అనుమానం వెలిబుచ్చాడు.

'సార్.ఈ బట్టలు విసిరేసిన వాళ్ళు ఇక్కడకొచ్చి ఏఏ వెధవ పనులు చేశారో?ఆ చీడపీడలు మనకెందుకు?ఏవో వెధవపనులు చేసి,ఇక్కడ స్నానాలు చేసి, పాపాలు వదిలించుకుని,బట్టలు విడిచి పారేసి,కొత్తబట్టలు తొడుక్కుని వెళ్ళిపోయారేమో?ఆ పాపాలన్నీ మనం ఎందుకు తాకాలి?ఈ పీడా మనకు పట్టుకోవచ్చు కదా?' అన్నాడు.

అది నిజమే.ఆ గుడ్డలు పట్టుకుంటుంటే, కుళ్ళిపోయిన శవాన్ని తాకినప్పుడు వచ్చేలాంటి ఏదో దరిద్రపు ఫీలింగ్ వస్తున్నది.

'చూడు రాజు.కాళీమాత మనల్ని ప్రసన్నంగా చూస్తున్నది.మనల్ని అనుక్షణం రక్షిస్తున్నది.శివకటాక్షం మనకు పుష్కలంగా ఉన్నది.ఏ చీడాపీడా మనల్ని ఏమీ చెయ్యలేదు.కాళికాశక్తి ముందు ప్రపంచంలోని ఏశక్తి అయినా తోకముడిచి పారిపోవలసిందే.ఏం భయపడకు.ఆ చీడాపీడా సంగతి నాకొదిలెయ్యి.వాటి సంగతి నేను చూచుకుంటాను.దుష్టశక్తులు మనల్ని చూచి భయపడాలి.వాటిని చూచి మనం భయపడటం ఏమాత్రం జరగదు.

మనం ఒక మంచిపనిని చేసున్నాము.ఈశ్వరభావంతో ప్రకృతిని శుభ్రం చేస్తున్నాము.దీనివల్ల మనకు మంచే జరుగుతుంది కాని చెడు జరగదు. భయం లేదు.కానివ్వు.మనం చేస్తున్నది నిజమైన తపస్సు.' అన్నాను.

పాపం రామన్న గారు.ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఈ కొండల్లో గుట్టల్లో పడి తిరుగుతూ ఎవరో పనికిమాలిన వెధవభక్తులు విడిచి పారేసిన గుడ్డలు ఏరుతూ ప్రకృతిని శుభ్రం చెయ్యడం చూస్తుంటే,విచక్షణా రహితంగా ప్రకృతిని పాడుచేస్తున్న మన భారతీయులు సిగ్గుతో తలవంచుకోవాలనిపించింది.సివిక్ సెన్స్ అనేది మన ఇండియా వెధవలకు ఎప్పుడు వస్తుందో కదా అని బాధ కలిగింది.రామన్నగారి మాతృదేశప్రేమకు ఆశ్చర్యం వేసింది.

ఆ మూటలు మోసుకుని కొండదిగి కిందకు వచ్చి వాటిని కిందపడేశాము.ఒకచేతిలో మూటతో రాళ్ళలో కొండ దిగడంకదా.దారిలో రామన్నగారు ఊపుగా కిందకు దిగుతూ బొక్కబోర్లా ముందుకు పడబోయారు.ఆయనకంటే ముందుగా దిగుతూ అక్కడ ఉన్న మదన్ పట్టుకుని ఆపినాడు.నేనైతే కాలు స్లిప్ అయి కిందపడి రెండడుగులు జర్రున రాళ్ళమీద జారాను. సరే మొత్తంమీద ఒకగంట సేపు కష్టపడి కిందకు దిగినాము.అప్పుడు గనక మా వాలకాలు ఎవరైనా చూస్తే కాలవలో గుడ్డలు ఉతకడానికి మూటలు మోసుకుపోతున్న పల్లెటూరి చాకలివాళ్ళలా ఉన్నాము.బాగా చదువుకుని సమాజంలో ఉన్నతస్థానంలో మంచి ఉద్యోగాలలో ఉన్నామని ఆ క్షణంలో మమ్మల్ని చూచిన ఎవ్వరూ అనుకోరు.

'ఈ మూటలతో కొన్ని ఫోటోలు దిగుదాము.పాతకాలంలో పులిని కొట్టి తెచ్చినవారు దాని శవం ముందు నిలబడి ఫోటోలు దిగేవారు.మనం ఆ పని చెయ్యలేము.కాబట్టి ఈ చెత్తమూటలనే కాసేపు పులి అనుకుందాం.మనమే జిం కార్బెట్ అనుకుందాం కాసేపు.' అన్నాను.

అందరం నవ్వుకుంటూ ఫోటోలు దిగి, ఆ మూటలను రోడ్డుపక్కన ఉన్న ఒక డస్ట్ బిన్ దగ్గర పడేసి మా కారు తీసుకుని మళ్ళీ కొండపైకి(బ్రహ్మశిఖరం వైపు) బయల్దేరాము.

కార్ డ్రైవ్ చేస్తూ తలతిప్పి కొండవైపు చూచాను.శుభ్రపడిన విష్ణుశిఖరం ప్రసన్నంగా మమ్మల్ని దీవిస్తున్నట్లు అనిపించింది. 

(ఇంకా ఉంది)
read more " సాధనా సమ్మేళనం -కోటప్పకొండ -3 "

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

దేహనిష్ట కంటె మనోనిష్ఠ గొప్పది

పంచవటి సభ్యుడైన నరేష్ అతని భార్యా నిన్న వచ్చినారు.ఒక పెళ్ళికి గుంటూరుకి వచ్చి పనిలో పనిగా మా ఇంటికి కూడా వచ్చినారు.

'పెళ్ళికంటే కూడా ముఖ్యంగా మిమ్మల్ని కలిసి మాట్లాడడానికే గుంటూరుకు వచ్చాను' అన్నాడు.

దూరం నుంచి నన్ను వెదుక్కుంటూ వచ్చినందుకు సంతోషం కలిగింది. నిజమైన ఆధ్యాత్మిక తపన ఉన్నవారు- "మాకు కుదరలేదు. వీలుకాలేదు. తీరిక లేదు"- ఇలాంటి ఏవేవో కుంటిసాకులు చెబుతూ కాలాన్ని వృధా చెయ్యరు.ఏదోరకంగా సంకెళ్ళు తెంచుకోవాలని చూస్తారు.మార్గం కోసం తపిస్తారు.అది దొరికేవరకూ అసహనంతో వేగిపోతారు.అలాంటి వారిని చూడటంతోనే వారి లోపల ఉన్న అగ్ని వారి కళ్ళలోనే కనిపిస్తుంది.ఎవరు నిజమైన సాధకులో ఎవరు కారో,ఎవరు ఎంతలో ఉన్నారో,ఎవరి స్థాయి ఏమిటో,వారిలోని అడ్డంకులూ లోపాలూ ఏమిటో,వారిని చూడగానే నేను గ్రహించగలను.

'మీకోసం ఇది తెచ్చాను.తీసుకోండి' అంటూ 'అమ్మత్త్వమ్' అన్న పుస్తకాన్ని నాకు ఇవ్వబోయాడు.ఆ పుస్తకం జిల్లెళ్ళమూడి అమ్మగారిమీద ఎవరో వ్రాసిన పుస్తకం.

నవ్వాను.

'నరేష్.పుస్తకాలు నాకెందుకు?చిన్నప్పటినుంచి కొన్ని వేల పుస్తకాలు చదివాను.వద్దు.నీవే ఉంచుకో. కాని ఒక సలహా విను.ఈ మధ్యకాలపు రచయితలు వ్రాసిన పుస్తకాలూ,ఎవరు బడితే వారు వ్రాసిన పుస్తకాలూ చదవవద్దు. వీరికి విషయం మీద సరియైన అవగాహన లేదు.పాతకాలం వారు వ్రాసిన పుస్తకాలు చదువు.ఉదాహరణకు శ్రీపాద,కొండముది రామకృష్ణ,మొదలైన పాతతరంవారివీ,వీలైతే ఇంకా పాతవారివీ రచనలు చదువు.అమ్మగారి విషయం సరిగ్గా చక్కగా అర్ధమౌతుంది.' అని చెప్పినాను.

'రాత్రి మాతోపాటు గుంటూరుకి చెందిన ఒకాయన రైల్లో ప్రయాణం చేసినారు. ఆయన టీవీలో కూడా ప్రవచనాలు ఇస్తుంటారు.' అన్నాడు.

'అలాంటి పండితులు గుంటూరులో చాలామంది ఉన్నారు.ఆయన ఈ పేటలోనే ఉంటారు.నేనెప్పుడూ వారి ఛాయలక్కూడా పోను.ఎందుకంటే వారికి లోకుల బ్యాంక్ ఎకౌంట్లలో ఎంతెంత డబ్బుందో తెలుసు.కాని వారి ఎకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఉంటుందో ఉండదో అనుమానమే.పండితుల దగ్గరా పూజారుల దగ్గరా పురోహితుల దగ్గరా నిజమైన ఆధ్యాత్మికత ఉంటే నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్లే.' అన్నాను.

చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత 'తారాస్తోత్రం పారాయణ చేస్తున్నాను.మీ చేతితో ఇస్తే తీసుకుందామని ప్రింట్ తీసి మరీ తెచ్చాను.'అంటూ తారాస్తోత్రం కాపీని నా చేతికి ఇచ్చినాడు.

అతని శ్రద్ధకు ముచ్చటేసింది.

దానిని చేతిలోకి తీసుకుని మౌనంగా అమ్మను ప్రార్ధించి ఆ కాగితాలు అతనికి తిరిగి ఇచ్చేశాను.

'దీనిని పారాయణ చేసేటప్పుడు ఏవైనా నియమనిష్టలు పాటించాలా?' అడిగాడు నరేష్.

'అవును.మనసుతో పాటించాలి.శరీరంతో కాదు.శరీరనిష్టలకు నా పధ్ధతి విరుద్దం అని నీకు తెలుసుకదా.దేహంతో నేను ఏ నిష్ఠ పాటించానని ఈ స్తోత్రం ఉద్భవించింది?ఒక్కోసారి నేను రెండురోజులపాటు స్నానమే చెయ్యను. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు స్నానం చేస్తాను.దేవుడి దగ్గర ప్రత్యేకంగా కూచుని నేను పూజచెయ్యగా దీపారాధనలూ వగైరాలూ చెయ్యగా ఇంతవరకూ ఎవ్వరూ చూడలేదు.నాతో ఎవరైనా కలిసి కొన్నాళ్ళు జీవిస్తే ఇలాంటి వింత విషయాలు వారే ప్రత్యక్షంగా చూడవచ్చు. 

ఉదాహరణకి చెబుతాను విను.తారాస్తోత్రంలోని ఒక శ్లోకం నేను బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలోనే తటాలున స్ఫురించింది.వెంటనే తడిబట్టలతో బయటకొచ్చి కాగితం మీద వ్రాశాను.ఇంకొన్ని రోడ్డుమీద పోతున్నపుడు ఉద్భవించాయి.బాహ్యనిష్ఠతో ఈ స్తోత్రం ఉద్భవించలేదు.అంతరికనిష్ఠ నుంచి పుట్టింది.కనుక నిష్ఠ కావలసింది మనస్సుకి.శరీరానికి కాదు.' అన్నాను.

శ్రీరామకృష్ణుల ప్రత్యక్షశిష్యులైన బ్రహ్మానందస్వామి ఇలా అనేవారు.

'దేహాన్ని నియమంలో పెట్టడం బహుతేలిక.మనస్సుని కట్టడి చెయ్యడం అతికష్టం.'

'మరి శరీరానికి నిష్ఠ అవసరంలేదా?'- అనేవారున్నారు.

అవసరమే.మొదట్లో అవసరం.ఎల్లకాలం అవసరం లేదు.దేహనిష్ట కంటె మనోనిష్ట ఉత్తమమైనది.అనవసరమైన మడీ నియమాలూ నిష్టలూ నేనెప్పుడూ ప్రోత్సహించను.నాది అంతరిక నిగూఢ యోగమార్గం.దానికి ప్రాధమికంగా కొంత దేహనిష్ట అవసరమే గాని అదే పరమావధి కాదు.

'నిజమైన సాధనకు శుభ్రత అవసరం.అంతేగాని నీళ్ళలో నానుతూ ఉండే మడి అవసరం లేదు.'-అని నేనంటాను.అనడమే కాదు.పాటిస్తాను.

'బాహ్యపూజ కంటె అంతరికపూజ ఉత్తమం' అని కూడా నేనంటాను.అనడమే కాదు నిత్యజీవితంలో ఆచరిస్తాను.

'పూజలు చెయ్యకపోయినా పరవాలేదు.ఉత్తమమైన మానవుడిగా జీవిస్తే చాలు.' అనికూడా నేనంటాను.అలా ఉండాలని ప్రయత్నిస్తాను.

'కులం కంటె గుణం ప్రధానం' అని చాలామంది అంటారు.కాని ఆచరించరు.నేను ఆచరిస్తాను.

'మతం కంటె మానవత్వం ప్రధానం' అని నేను గట్టిగా విశ్వసిస్తాను.

'ఎల్లకాలం బాహ్యపూజలూ దీపారాధనలూ అష్టోత్తరాలూ అభిషేకాలూ సంధ్యావందనాలూ వ్రతాలూ చేస్తూ ఉండటం ఆధ్యాత్మికత కాదు.అది ఒక stagnation.' - అని నేనంటాను.

నా భావాలన్నీ ఇలాగే చాందస భావాలకు విరుద్దంగా విలక్షణంగా ఆచరణాత్మకంగా ఉంటాయి. అందుకే అవి చాలామందికి నచ్చవు.కాని ఒకరికి నచ్చలేదని సూర్యుడు ఉదయించడం మానుకుంటాడా?

వివేకానందస్వామి తరచుగా ఇలా అనేవారు.

'సత్యం సంఘాన్ని ఎప్పుడూ అనుసరించదు.సంఘమే సత్యాన్ని అనుసరించాలి.లేదా నశించాలి.మూడో మార్గం లేదు.'

అతని భార్యకు ఇలా చెప్పినాను.

'అమ్మా.నీవు ఎంతో అదృష్టవంతురాలివి గాబట్టి నీకు నిజమైన ఆధ్యాత్మిక భావాలున్న భర్త దొరికాడు.అతన్ని ప్రోత్సహించు.ఈ మార్గంలో అతనికి సహకరించు.అంతేగాని అడ్డంకివి కాకు.మానవ జీవితగమ్యం ఆధ్యాత్మిక సిద్ధిని పొందడమే.

'ఎంత సంపాదించినా ఎన్నెన్ని చేసినా చివరకు అవేవీ చెదరని మనశ్శాంతినీ తృప్తినీ ఇవ్వవు.ఒక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అవి దక్కుతాయి.ఎక్కడో ఎవరికో గాని ఇలాంటి నిజమైన ఆధ్యాత్మికభావాలు ఉండవు.నచ్చవు.కనుక ఆధ్యాత్మికమార్గంలో నీ భర్తను నీవు అనుసరించాలి.అతని తోడుగా నీవు నడవాలి.ఎప్పుడూ మంచి స్నేహితులలాగా నవ్వుతూ కలసిమెలసి మీరు ఉండాలి. అదే మన ధర్మం చెబుతున్న పరమసత్యం.' అన్నాను.

శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు.

"స్త్రీలలో రెండు రకాలైన వారున్నారు.ఒకరు విద్యాశక్తి.ఇంకొకరు అవిద్యాశక్తి. భర్తకు సాధనలో సహాయపడుతూ అతని అడుగుజాడలలో నడచే స్త్రీ విద్యాశక్తి. దానికి వ్యతిరేకంగా అనుక్షణం అతన్ని లౌకికమైన కోరికలతో వేధిస్తూ ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కకు లాగే స్త్రీ అవిద్యాశక్తి.ఈ రెండు రకాలైన స్త్రీలు ప్రపంచంలో ఉంటారు."

కొన్ని కుటుంబాలలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.అక్కడ స్త్రీలు ఆధ్యాత్మిక సంస్కారాలు కలిగి ఉంటే పురుషులు వారిని పక్కకు లాగుతూ ఉంటారు. మొత్తమ్మీద స్త్రీయైనా పురుషుడైనా సాధనకు సహకరించే జీవిత భాగస్వామి దొరకడం ఎంతో పూర్వజన్మ పుణ్యఫలమే అనాలి.

ఆమె ముఖం చూస్తే ఉత్తమ సహధర్మచారిణి లాగే అనిపించింది.

తారాస్తోత్రం ఎలా పారాయణ చెయ్యాలో అతనికి చెప్పాను.

వారు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
read more " దేహనిష్ట కంటె మనోనిష్ఠ గొప్పది "

1, ఫిబ్రవరి 2014, శనివారం

సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-2

ఉదయం అంతా కొండ ఎక్కి దిగాంకదా మధ్యాన్నం నిద్రపోదామని అనుకున్నాం గాని నిద్ర రాలేదు.ఊరకే రిలాక్స్ అవుతూ ఉన్నాము. సాయంత్రం నాలుగువరకూ రామన్నగారు ఏదో మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను.నాలుగుకు లేచి పక్కరూం తలుపు తట్టినాను.మదన్ తలుపు తెరిచాడు.

'తయారవ్వండి బయటకు వెళ్లి టీ త్రాగుదాం' అని చెప్పి గదికి వచ్చి కూచున్నాను.

కాసేపట్లో మదన్ రాజూ తయారై వచ్చారు.

మదన్ ఇలా అన్నాడు.

'సార్.త్రికూటం గురించి ఉదయం మనం మాట్లాడుకున్నదానినీ,గొల్లభామ కధనీ కలిపి ఇందాకటి నుంచీ ఆలోచిస్తే నాకు ఒక విషయం అనిపిస్తున్నది.' అన్నాడు.

'ఏంటది చెప్పు.' అడిగాను.

'కొండకొమ్ము అంటే సహస్రారం కదా.అక్కడ ఉన్న శివుడిని గొల్లభామ రోజూ పాలతో ఆరాధించేది.కుండలిని శిరస్సుకు చేరినప్పుడు దేహంలో అమృతస్రావం జరుగుతుందని మీరు చెప్పినారు కదా.లలితాసహస్రంలో 'కులామృతైకరసికా'అని నామం ఉన్నది కదా.పాలతో ఆరాధించడం అంటే ఇదేనేమో.

తరువాత,శివుణ్ణి నేలకు రమ్మని ఆమె పిలిచింది.అంటే,తన దేహంలోని భౌతిక స్థాయికి భగవంతుని దివ్యచైతన్యాన్ని దిగిరమ్మని సాధకుడు చేసే విజ్ఞప్తిగా దీనిని తీసుకోవచ్చు.' అన్నాడు.

మదన్ చెప్పిన ఈ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది.

'అవును.అరవిందుల యోగం అదేకదా.' అన్నాను.

మదన్ కొనసాగించాడు.'కాని సాధకుని దేహం ఇంకా మలినాలతో కూడుకుని ఉన్నందున,ఇంకా సిద్ధంగా లేనందున,దివ్యచైతన్యం పూర్తిగా క్రిందివరకూ దిగిరాలేక,మధ్యవరకూ వచ్చి ఆగిపోయింది.అంటే అనాహతం వరకూ దిగివచ్చింది.అంటే సాధకుడు ఇంకా సాధన చెయ్యవలసిన అవసరం ఉన్నది.'

'అద్భుతమైన వివరణ ఇచ్చావు మదన్.చాలా బాగుంది.' అభినందించాను.

ఇలా మాట్లాడుకుంటూ బయటకు వచ్చి కాసేపు అక్కడే ఉండి,గొల్లభామ గుడివైపు నుంచి క్రిందకు వెళ్ళే మెట్లదారి గుండా రోడ్డు వద్దకు దిగడం ప్రారంభించాము.దారిలో కోతులు గుంపులు గుంపులుగా ఎదురయ్యాయి. వాటికి కూడా సరిహద్దులూ రాజ్యాలూ ఉన్నాయి.గ్రూపులు ఉన్నాయి.ఏ గ్రూపు సరిహద్దులో ఆ గ్రూపు ఉంటుంది.పొరపాటున వేరు గ్రూపు కోతి సరిహద్దు దాటి ఈ ప్రదేశంలోకి వస్తే యుద్ధం అయిపోతుంది.


రమణమహర్షి జీవితంలో కూడా కోతులతో ఆయనకు అనుబంధం కనిపిస్తుంది.అక్కడ కూడా కోతి గ్రూపులు ఉండేవి.ఒక కోతి,గ్రూపుయుద్దంలో గెలిచి రాజు అయినప్పుడు మహర్షి వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకుంటుంది. అలాగే వాటికి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆయనవద్దకు వచ్చి వాటి బాధను చెప్పుకునేవి.వాటి భాషా,పద్ధతులూ,అలవాట్లూ మహర్షికి బాగా తెలుసు. ఇదంతా ఆయన జీవితం చదివితే తెలుస్తుంది.

అడవినీ చెట్లనూ కోతులనూ గమనిస్తూ దాదాపు 650 అడుగులు క్రిందకు దిగి రోడ్డు మీదకు చేరుకొని అక్కడ ఉన్న టీ స్టాల్లో బజ్జీలు తిని టీ త్రాగి నెమ్మదిగా మళ్ళీ అదే మెట్లదారి గుండా గెస్ట్ హౌస్ దగ్గరకు ఎక్కడం ప్రారంభించాము.


'మదన్.ఉదయం నీవు అడిగినదానికి ఇంకా చెప్తా విను.ఆలోచన పుట్టడం బ్రహ్మతత్వం.అది కొంతసేపు కొనసాగడం విష్ణుతత్వం.లయించడం రుద్రతత్త్వం.ఇవే త్రికూటములు.ఈ మూడు ప్రక్రియలూ ఒకదాని ఆధారంతో జరుగుతాయి.ఆ ఆధారమే బ్రహ్మం.అదే త్రికూటేశ్వరుడు.' అన్నాను.


అర్ధమైందని మదన్ కళ్ళతోనే సూచించాడు.

తిరిగి మెట్లెక్కుతుండగా మార్గమధ్యంలోనే చీకటి పడింది.అమావాస్య ముందు రోజులేమో మినుకుమినుకు మంటున్న నక్షత్రాలు తప్ప ఏ కాంతీ లేదు.చిమ్మ చీకట్లో అడవిమధ్యలో కొండ మెట్లెక్కుతూ మెం నలుగురమూ దయ్యాల్లా నిలబడి ఉన్నాము.అప్పటివరకూ గంతులేస్తున్న కోతులన్నీ చెట్లమీదకు చేరుకొని మౌనంగా నిద్రకుపక్రమిస్తున్నాయి.

'కాసేపు కూచుందాం' అన్నాను.


చీకట్లో ఆ మెట్లమీద అందరం పక్కపక్కనే కూచున్నాము.కాసేపు ఆ మౌనాన్నీ,చీకటినీ,శీతాకాలపు చల్లదనాన్నీ,చుట్టూ ఉన్న అడవినీ ఆస్వాదిస్తూ ఉండిపోయాము.

నిశ్శబ్దాన్ని భేదిస్తూ రామన్నగారు ఒక సందేహం వెలిబుచ్చారు.


'శర్మగారు.మనస్సును శరీరం నుంచి విడదియ్యడం సాధ్యమేనా?'


'సాధ్యమే.యోగంలో ఇది చాలా చిన్నపని.సాధన మొదటి స్థాయిలలో ఉన్నవారికే ఈ శక్తి వచ్చేస్తుంది.దానికి పెద్దపెద్ద స్థితులేమీ అవసరం లేదు. రమణమహర్షి చేతికి కేన్సర్ పుండు వస్తే మత్తుమందు లేకుండానే ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు.మనస్సును వేరు చెయ్యగలిగారు కనుకనే ఇది సాధ్యం అయింది.

సదాశివ బ్రహ్మేంద్రసరస్వతి జీవితంలో ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది.ఆయన ధ్యానంలో ఉండి ఒళ్ళు తెలియని స్థితిలో నడుచుకుంటూ వెళుతూ ఒక ముస్లింరాజు గుడారంలోకి అడుగుపెట్టాడు.కోపించిన ఆ ముస్లిం కత్తిదూసి స్వామి చేతిని నరికేస్తాడు.చెయ్యి తెగి కింద పడిపోయిందన్న స్పృహ కూడా లేకుండా స్వామి అలా నడచి వెళ్ళిపోతూనే ఉంటారు.అతను భయపడిపోయి స్వామి కాళ్ళమీద పడి ప్రార్ధిస్తే,అప్పుడు స్వామి స్పృహలోనికి వచ్చి తెగిపోయిన చేతిని అతికించుకుని ఏమీ జరగనట్టుగా నడచి వెళ్ళిపోతారు.ఇవన్నీ రికార్డ్ కాబడిన సంఘటనలు.

కానీ ఇంతకంటే పై స్థాయి కూడా ఉన్నది.జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇలా అనేవారు."సుఖం దేవుడిస్తుంటే, కష్టం ఎవరిస్తున్నట్లు?"

ఇది మీరడిగిన స్థాయి కంటె పైది.ఏదైనా భగవంతుని వరమే అనుకున్నపుడు ఇంక బాధ ఏముంటుంది?మనస్సును శరీరం కంటె వేరు చెయ్యవలసిన అవసరం ఏముంటుంది?బాధనుంచి దూరంగా పారిపోవలసిన పని ఏముంటుంది?

శ్రీరామకృష్ణులకు గొంతు కేన్సర్ వచ్చింది.నయం చేసుకొమ్మని భక్తులు ప్రార్ధించారు.ఆయన ఏమీ జవాబు చెప్పలేదు.రోజుల తరబడి భక్తులు వేడుకోగా చివరకు 'నా మనస్సును ఈదేహం మీద ఏకాగ్రం చెయ్యలేను' అని ఆయన చెప్పినారు.

భక్తులు అప్పటికీ ఆయన్ను వదలలేదు.

అలా కొన్నాళ్ళు గడిచినాక 'నా చేతిలో ఏమీలేదు.అంతా అమ్మ ఇచ్ఛ' అని ఆయన చెప్పినారు.

అయితే 'అమ్మనే అడగండి.' అని భక్తులన్నారు.ఎంత ప్రార్ధించినా ఆయన వినడం లేదని చివరకు వివేకానందస్వామిచేత కూడా అడిగించినారు.

విసిగిస్తున్న భక్తులతో చివరకు ఆయన ఇలా అన్నారు.

'అమ్మ ఇలా చెప్పింది.ఇందరి నోళ్ళతో తింటున్నావు కదా? ఒక్క నోటితో తినకపోతే ఏం?'

ఇది మన ఊహక్కూడా అందనంత అత్యున్నతమైన స్థాయి.ఇక్కడ మనస్సును దేహంనుంచి వేరుచేసే అవసరం ఏమీ ఉండదు.కర్మనుంచి పారిపోవడం ఉండదు.ఏం జరిగినా అది దైవంనుంచే వచ్చిందని స్వీకరించేవారికి తిరస్కరించడానికి ఏమి మిగిలి ఉంటుంది?అప్పుడు మనస్సూ దేహమూ ఒకటే అవుతాయి.ఇలాంటి స్థితిలో ఉన్నవారు సోకాల్డ్ మహిమలను చూచి నవ్వుతారు.జరిగేది అంతా మహిమే అని వారికి తెలుసు. కనుక ప్రత్యెక మహిమలను,సిద్ధులను వారు లెక్కచెయ్యరు.

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఎవరో అడిగారు.

'అమ్మా?మీరుపదేశించే మంత్రం ఏమిటి?'

'సరే మంత్రం.'అన్నారు అమ్మ.

జీవితంలో ప్రతిదానికీ 'సరే' అనగలిగితే అంతకంటే గొప్ప ఆధ్యాత్మికస్థితి ఇంక ఏమీ లేదు.

'Saying Yes to life' అనే ఉపన్యాసంలో రజనీష్ కూడా ఇదే అంటాడు.

"Theism is saying yes to life with all its imperfections, as it is, saying yes to it with no conditions, with no strings attached."

రజనీష్ ఇచ్చిన ఈ నిర్వచనం కంటె ఆధ్యాత్మికతకు గొప్ప నిర్వచనం ఇవ్వడం చాలాచాలా కష్టం.మహానీయులందరూ దీనినే చెప్పినారు ఆచరించినారు. చాలామంది దీనిని ఉపన్యాసాలలో చెబుతారు.కాని ఆచరించినవారే నిజమైన యోగులు. వారే ధన్యులు.దీనిని చెప్పడం చాలా తేలిక.ఆచరణ బహుకష్టం.

శ్రీరామకృష్ణుల శిష్యులైన తురీయానందస్వామి జీవితంలో ఒక సంఘటన జరిగింది.స్వామి పూరీ క్షేత్రంలో ఉన్నపుడు కంటి సంబంధమైన ఏదో బాధ వస్తే,డాక్టర్ ఐ డ్రాప్స్ వేసుకొమన్నారు.అవి వెయ్యడానికి స్వామికి పరిచారకునిగా స్వామి శర్వానంద అని ఒక సేవకస్వామి ఉండేవారు.ఒకరోజున పొరపాటుగా ఆ మందుబదులు అక్కడే ఇంకొక సీసాలో ఉన్న డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ ను స్వామి కంటిలో వేశాడు సేవకుడు.

కన్ను మొత్తం కాలిపోయినంత బాధ కలిగింది స్వామికి.అది యాసిడ్ కాబట్టి కాలి ఉండవచ్చు కూడా.కాని ఆ సేవకుడిని ఒక్కమాట కూడా అనలేదు.విషయం గ్రహించి సేవకుడు భయంతో ఒణికిపోయాడు. అతన్ని స్వామే ఓదార్చారు.

While staying at Puri, Swami Turiyananda consulted a doctor, who diagnosed that he had diabetes and his treatment was started there. Although Turiyananda’s health slightly improved in Puri, he had some trouble with eyes. The doctor prescribed eye drops.

One morning, as soon as his attendant, Sharvananda, put eye drops in his eyes, he cried out:“I think you have given me the wrong medicine. See what you have used!” The attendant was shocked when he discovered that it was diluted nitric acid. Filled with remorse and fear, he began to tremble and cry while someone else washed the acid out of the swami’s eyes.Turiyananda remained calm and composed.He never uttered a single word to scold his attendant. He was a perfect embodiment of forbearance.

He later consoled his attendant: “You see, as soon as you put the drops in my eyes, I felt a terrible burning sensation covering my whole body. I thought: ‘O Mother, what can I do if You want to take away my eyes? May your will be done!'

అదీ అసలైన పరమహంస స్థితి.'కళ్ళు పోవడమే అమ్మ నిర్ణయం అయితే పోనీ' అన్నటువంటి సంపూర్ణ శరణాగతి అది.నిజమైన దేహాతీతస్థితి అంటే అదే. మీరడిగిన స్థితి కంటె ఇది చాలాచాలా పై స్థితి.నేడుకూడా చాలామంది 'శ్రీశ్రీశ్రీ 108 పరమహంస పరివాజకాచార్య'అంటూ ఇంకా ఏవేవో బిరుదులు తగిలించుకుంటున్నారు.లేదా వాళ్ళ శిష్యులు తగిలిస్తున్నారు.బిరుదులు ఊరకే తగిలించుకుంటే చాలదు.'బలభీమ' అని బిరుదు పెట్టుకుంటే చాలదు. భీముడికి ఉన్న బలం మనకి కూడా ఉన్నప్పుడే ఆ బిరుదుకి సార్ధకత.

'నేనడిగేది అదికాదు.మీరు ఆసనసిద్ధిని గురించి పంచవటిలో ఒకసారి చెప్పినారు.మూడు గంటలు కదలకుండా ఒకే ఆసనంలో కూచుంటే అది ఆసనసిద్ధి అని అన్నారు కదా?' రామన్న గారు అడిగారు.

'అవును.' అన్నాను.

'ధ్యానంలో ఉన్నపుడు కొన్నిసార్లు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి.ఇంకొన్ని సార్లు ఒళ్ళు బాగా నెప్పులు పుడుతుంది.లేదా ఏదో దురద వస్తుంది.లేదా ఏ దోమో ఇంకొకటో కుడుతుంది.కొన్నిసార్లు గీరుకోకుండా నిగ్రహించుకోవడం వీలవుతుంది.కాని ఇంకొన్నిసార్లు అలా నిగ్రహించుకోవడం సాధ్యం కాదు. అలాంటప్పుడు మనస్సును దేహంనుంచి వేరు చెయ్యగలిగితే ఫలితం ఉంటుంది కదా?'

'మీరు అడుగుతున్నవి ధ్యానాభ్యాసంలో చాలామొదట్లో వచ్చే ఆటంకాల గురించి.అవి సాధన మొదట్లో వస్తాయి.కాని అభ్యాసంమీద క్రమేణా అన్నీ సర్దుకుంటాయి.సాధన చేస్తూచేస్తూ ఉంటే పురోగతి అదే ఉంటుంది.ఆపితే ఆగిపోతుంది.అందుకే ఎలాంటి పరిస్తితిలోనూ సాధనను ఆపరాదని నేనంటాను.

'యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశ:
ఇంద్రియాణీంద్రియార్దేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా:'

'తాబేలు తన అవయవాలను ఎలా లోనికి ముడుచుకుంటుందో అదే విధంగా ఇంద్రియాలను యోగి నిగ్రహిస్తాడు'. అని గీతలో చెప్పబడింది. పతంజలిమహర్షి దీనినే ప్రత్యాహారం అన్నారు.ఈ స్థాయికి వస్తే మనస్సును దేహంనుంచి విడదియ్యడం సాధ్యమే అని అనుభవంలో తెలుస్తుంది.ఇవన్నీ చర్చించే విషయాలు కావు.సాధన చేసి అనుభవంలో గ్రహించవలసిన విషయాలు.' అన్నాను.

ఇలా మాట్లాడుకుంటూ మళ్ళీ 650 అడుగులు కొండనెక్కి బ్రహ్మశిఖరం వద్దకు చేరుకున్నాము.కొద్దిసేపు అక్కడే రోడ్డుచప్టా మీద కూచుని తేరుకున్నాక, హోటల్లో ఆహారం తిని గదులకు చేరాము.

మేము ఉన్న గదుల డాబామీదకు వెళ్ళిచూస్తే కింద ఉన్న ఊళ్లు దూరంగా ఉన్న నక్షత్రాలలాగా కనిపిస్తున్నాయి.అంతా నిశ్శబ్దం. చుట్టూ చీకటి ఆకాశం.చల్లని గాలి వీస్తున్నది.ధ్యానం చేసేవారికి ఇది చాలామంచి వాతావరణం.ఇలాంటి వాతావరణంలో మనస్సు అప్రయత్నంగా ధ్యాననిమగ్నతను పొందుతుంది.అలా పొందాలంటే క్షణక్షణానికీ చలిస్తూ రకరకాల సందేహాలను రేకెత్తించే మనస్సును నిశ్చలం చేసే కిటుకు తెలియాలి.

ఉదయమే లేచి విష్ణుశిఖరం వద్దకు వెళదామని నిశ్చయించుకుని ధ్యానానికి/నిద్రకు ఉపక్రమించాము.

(ఇంకా ఉంది)
read more " సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-2 "

28, జనవరి 2014, మంగళవారం

సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-1



ఇప్పటివరకూ పంచవటి సాధనా సమ్మేళనాలు నాలుగు జరిగాయి. మొదట పూనూరు,రెండు హైదరాబాద్,మూడు మహానంది నాలుగు హైదరాబాద్ లో జరిగాయి.ఇప్పుడు ఐదవ సాధనాసమ్మేళనం కోటప్పకొండ మీద జరిగింది.ఈసారి కొద్దిమందితో మాత్రమే ఇది నిర్వహించబడింది.

నేను,రామన్నగారు,మదన్,రాజు నలుగురమే ఈసారి ఇందులో పాల్గొన్నాము.శనివారం ఉదయం ఏడున్నరకు మొదలైన కార్యక్రమం సోమవారం ఉదయం పదిగంటలకు ముగిసింది.

కోటప్పకొండ నరసరావుపేట దగ్గరలో ఉన్న శైవక్షేత్రం.దీని అసలుపేరు త్రికూటేశ్వర క్షేత్రం.దీనిని త్రికూటాద్రి అనికూడా అంటారు.ఇది దూరంనుంచి చూస్తె అరుణాచలంలాగా ఉంటుంది.ఇక్కడ పరమశివుడు జ్ఞానమూర్తిగా దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉంటాడు.అమ్మవారికి ఇక్కడ ప్రత్యెక ఆలయం లేదు.ఇక్కడ మూడుకొండలు కలిసి ఉంటాయి.వీటిని బ్రహ్మ,విష్ణు,రుద్ర శిఖరాలంటారు.


వీటిలో ప్రస్తుతం అందరూ వెళ్ళే ఆలయం ఎడమవైపున ఉండే బ్రహ్మశిఖరం మీద ఉన్నది. ఇక్కడవరకూ రోడ్డుమార్గం ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈక్షేత్రం బాగా వృద్ధిలోకి వచ్చింది. రోడ్డునిర్మాణం చేసి పైన మంచి వసతులు కల్పించారు.అంతకు ముందు అయితే కొండకోమ్ముకు ఎక్కాలంటే చాలా కష్టం అయ్యేది.ఇప్పుడు రోడ్డు ఉన్నది కనుక బ్రహ్మశిఖరం వరకూ తేలికగా కార్లలో బస్సుల్లో వెళ్ళవచ్చు.

మూడుకొండలలో కుడివైపున విష్ణుశిఖరం ఉంటుంది.దీనికి కొంచం కిందగా పాపనాశేశ్వరస్వామిగా శివుడు ఉన్నాడు.ఇక్కడకు మెట్లదారి లేదు. రాళ్ళమీదుగా పాకుకుంటూ దట్టమైన చెట్లపొదలలోనుంచి ఒక అరకిలోమీటరు పైకి ఎక్కవలసి ఉంటుంది.దారిలో నరమానవుడు కనిపించడు.గుబురుగా కప్పేస్తున్న చెట్లమధ్యలోనుంచి పాములా పాక్కుంటూ కొండను ఎక్కాలి.

మూడవది మధ్యలో ఉన్న రుద్రశిఖరం.దీనిపైన కొండకొమ్మున పాత శివలింగం ఉన్నది.ఇక్కడకు కూడా మెట్లదారి లేదు.బ్రహ్మశిఖరం వద్దనుంచి రాళ్ళమీదుగా ఎక్కుతూ దాదాపు రెండు కిలోమీటర్లు పైనున్న శిఖరానికి పోవాలి.ఇదీ కష్టమే.పైన ఇప్పుడు ఒక మంటపం కట్టినారు. బ్రహ్మశిఖరం పైన ఉన్న పుట్ట పక్కనుంచి ఎగుడుదిగుడు కాలి బాటలో రాళ్ళమీదుగా నడుస్తూ దూకుతూ పాకుతూ వెళ్ళవలసి ఉంటుంది.

ఉదయం పదిగంటలకు త్రికూటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పుట్ట పక్కగా ఉన్న కాలిబాటలోనుంచి రుద్రశిఖరంవైపు ఎక్కడం ప్రారంభించాము.మెట్లు లేవు. రాళ్ళ మీదుగా ఎక్కుతూ పోవాలి. అక్కడక్కడా ఆగుతూ అలుపు తీర్చుకుంటూ నడక సాగించి ఒక గంటన్నర తర్వాత కొండకొమ్ముకు చేరుకున్నాము. నెత్తిమీద ఇసుక బస్తాలు మోసుకుంటూ కొండ కొమ్ముకు వెళుతున్న పనివాళ్ళు మాకు దారిలో కనిపించారు.మామూలుగా నడకే కష్టంగా ఉంటె వాళ్ళు ఇసుక బస్తాలు మోసుకుంటూ కర్రపోటుతో ఎక్కుతున్నారు.అలుపు లేకుండా ఉండటానికి ఫాస్ట్ బీట్ సినిమా పాటలు సెల్ లో వింటూ కొండ ఎక్కుతున్నారు.


'రామేశ్వరం పోయినా ఏదో తప్పనట్లు, నిశ్శబ్దాన్ని కోరుకుంటూ మనం ఇంత ఎత్తుకు వచ్చినా ఇక్కడకూడా సినిమా పాటలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయే' అన్నాను.

రాజు కూడా జ్యోతిష్కుడే గనుక వారిని బాగా గమనించి ఇలా అన్నాడు.



'సార్.వీళ్ళ జాతకాలలో శనిబుధుల మధ్యన శుభదృష్టి ఉండి ఉంటుంది. అందుకే ఇలాంటి సినిమా పాటలు వింటూ కాయకష్టంతో కొండ ఎక్కుతున్నారు.పైగా ఈరోజు శనివారం కూడా.'

నేను మెచ్చుకోలుగా అతనివైపు చూచాను.జ్యోతిష్య విద్యార్ధికి ఇలాంటి పరిశీలన చాలా అవసరం.దీనివల్లనే స్ఫురణశక్తి అనేది జ్యోతిష్కునిలో క్రమేణా మేల్కొంటుంది.

'బుధుడే కాదు.శుక్రుడు కూడా కావచ్చు.ఎందుకంటే సినిమా పాటలకు శుక్రుడే కదా కారకుడు' అన్నాను.

ఇంతలో ఒకతను తన సెల్ లో శివస్తోత్రాలు వింటూ కొండ ఎక్కుతూ కనిపించాడు.అతన్ని గమనించి ఇలా చెప్పాను.
'రాజు.ఇతని జాతకంలో గురు సంబంధం కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు చెత్త పాటలు వింటున్నారు.ఇతనొక్కడే భక్తి పాటలు వింటున్నాడు.ఈ తేడాను గమనించావా?' అడిగాను.

అవునంటూ రాజు తలూపాడు.

అలుపు తీర్చుకోవడానికి ఒకచోట కూచున్నాము.


'సార్.త్రికూటం గురించి కొంచం చెప్పండి' మదన్ అడిగాడు.

'మదన్.కంఠం పైది వాగ్భవకూటం. కంఠంనుంచి కటివరకూ కామరాజ కూటం. కటినుంచి క్రింద శక్తికూటం. 'శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా, కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ,శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా' అనే లలితానామాలు దీనినే సూచిస్తున్నవి.

శిరస్సుపైది అంబరం.అక్కడ అంతా శూన్యమే.త్రికూటమనబడే భ్రూమధ్యం లోనే ఇడాపింగళా సుషుమ్నానాడులు కలుస్తాయి.అదే త్రివేణీ సంగమం. అక్కడనుంచే కోటి కోరికలు పుట్టుకొస్తాయి.అందుకే 'త్రికూటా కామకోటికా' అని కూడా లలిత అంటుంది.'

'త్రికూటేశ్వరుడు అంటే మూడు కూటములకూ అధిపతి అని అర్ధమా?' అడిగాడు మదన్.

'అంతేగా మరి.ఈ శబ్దం త్రిగుణాతీత పరబ్రహ్మ వాచకం.త్రికూటేశ్వరుడు అనే పేరు క్రమేణా రూపాంతరం చెంది కోటేశ్వరుడు అయింది.అదే కోటప్పకొండ లేదా కోటయ్యకొండ అయింది.గుంటూరు జిల్లాలో తరచుగా వినిపించే కోటేశ్వరరావు అనే పేరు ఇదే.' అన్నాను.

ఈ ఆలయాల గురించి ఒక గాధ వినిపిస్తుంది.అందరూ చెప్పే కధ ఏమంటే,ఇక్కడ గొల్లభామ అని ఒకామె ఉండేది.ఆమె ఈ కొండమీద మేకలు కాచుకుంటూ ఉండేది.శిఖరం మీద ఉన్న శివునికి ఈమె రోజూ పాలు ఇస్తూ ఉండేది.కాలక్రమేనా ఈమెకు వివాహమై గర్భం దాల్చింది.కనుక కొండ ఎక్కలేక శివుడినే క్రిందకు వచ్చి నేలమీద ఉండమని కోరుకున్నది.ఆయన సరేనని ఒక నియమం పెట్టినాడు.

నీవు వెనక్కు తిరిగి చూడకుండా కొండ దిగి వెళుతూ ఉండు.నేను నీ వెనుకే నడుస్తూ వస్తుంటాను.నీవు వెనక్కు తిరిగితే మాత్రం అక్కడే నేను ఉండిపోతాను అని చెప్పినాడు.ఆమె సరే అని కొండ దిగుతూ ఉన్నది. వెనుకనుంచి ఏవేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటే ఏమిటా అని వెనక్కు తిరిగి చూచింది.అప్పటికి వాళ్ళు రుద్రశిఖరం పైనుంచి బ్రహ్మశిఖరం వరకూ వచ్చినారు.ఆమె వెనక్కు తిరిగి చూచింది గనుక అక్కడే శివుడు లింగరూపం ధరించి శిల అయిపోయినాడు.అని ఒక గాధ వినిపిస్తుంది.

మన పురాణాలు,ప్రాంతీయ కథలలో చరిత్రా,మార్మిక విషయాలూ,ప్రాంతీయ నమ్మకాలూ అన్నీ కలగలసి ఏది ఏదో చెప్పలేనంతగా పెనవేసుకుని ఉంటాయి.అందుకే వీటిలో ఏది నిజమో ఏది కాదో చెప్పలేము.కాకుంటే కొంత ప్రయత్నం చెయ్యవచ్చు.

శివుడు మానవనేత్రాలకు కనిపించటం దుర్లభం. కొండకొమ్ము మీద తపస్సులో ఉన్న శివునికి గొల్లభామ రోజూ పాలు సరఫరా చెయ్యడం అనేది సంభవం కాదు.పరమశివునికి పాలు అవసరం లేదు.కాకపోతే ఒకటి జరిగి ఉండవచ్చు.పాతకాలంలో రుద్రశిఖరం మీద ఒక యోగి తపస్సు చేసినాడని అంటారు.ఈ కొండశిఖరం మీద తపస్సు చేసిన యోగీశ్వరుడిని ఈమె మేకలు కాచుకునే సమయంలో చూచి అతనికి ఆహారంగా మేకపాలను ఇచ్చి ఉండవచ్చు.పాతకాలంలో ఇలాంటి అమాయక భక్తులు ఎందఱో ఉండేవారు. బుద్ధునికి కూడా సుజాత అనే యువతి పాయసాన్ని ఇచ్చినట్లు గాధ ఉన్నది. అలా రోజూ చేస్తూ ఉండగా కొన్నాళ్ళకు ఈమె కొండ ఎక్కలేని పరిస్తితిలో ఉన్నపుడు ఆయననే క్రిందకు వచ్చి ఉండమని కోరి ఉండవచ్చు.


సామాన్య జనసహవాసాన్ని తట్టుకోలేని ఆయన పూర్తిగా కిందకు రాకుండా బ్రహ్మశిఖరం వరకూ వచ్చి అక్కడే కొంతకాలం తపస్సులో ఉండి తన శరీరాన్ని వదలిపెట్టి శివైక్యం చెంది ఉండవచ్చు.ఆ సమాధిమీద శివలింగప్రతిష్ట జరిగి ఉండవచ్చు. ఎందుకంటే శైవంలో మహనీయుల సమాధులమీద శివలింగాన్ని ప్రతిష్టించడం ఆచారంగా ఉన్నది. కాలక్రమేణా ప్రాంతీయగాధలు దీనితో కలసిపోయి ఇప్పుడు మనం వినే కధ రూపుదిద్దుకుని ఉండవచ్చు.

ఇలా మాట్లాడుకుంటూ దాదాపు 1500 అడుగుల ఎత్తున ఉన్న రుద్రశిఖరం చేరుకున్నాము. అక్కడనుంచి చూస్తె చుట్టుపక్కల ఎన్నో ఊళ్లు కనిపిస్తున్నాయి. పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేట కూడా దూరంగా కనిపిస్తున్నది.శిఖరం పైన ఒక చిన్న దేవాలయమూ అందులో శివలింగమూ ఉన్నాయి.అక్కడ ఒక మంటపం నిర్మాణంలో ఉన్నది. దానికోసమే పనివాళ్ళు క్రిందనుంచి ఇసుక బస్తాలు మోసుకొస్తున్నారు.

అంతపైకి ఎక్కి వచ్చినందుకు బాగా అలుపు వచ్చింది.మంటపంలో కూలబడ్డాము.


ఆ మంటపంలో నల్లగా తుమ్మమొద్దులా ఉన్న ఒక కాంట్రాక్టర్ కామోసు కూచుని ఉన్నాడు.అతను కూడా సినిమా పాటలు సెల్ లో పెట్టుకుని వింటున్నాడు.'హతోస్మి' అనిపించింది.'ఇంత ఎత్తుకు ఎక్కి వస్తే ప్రశాంతతను భగ్నం చేస్తూ ఇక్కడ కూడా తయారయ్యావా నాయనా?' అనుకున్నాను.

కాసేపు అక్కడ కూచున్న తర్వాత 'లోపలకు వెళ్లి శివలింగాన్ని దర్శనం చేసుకోండి.మీకు వీలైతే అభిషేకం కూడా మీరే చేసుకోవచ్చు' అని ఆ కాంట్రాక్టర్ అన్నాడు.

లోనికి వెళ్లి చూద్దామని లేచాను.

'చొక్కా విప్పి లోపలకు వెళ్ళాలి' అని కాంట్రాక్టర్ అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'పంచె ఏం పాపం చేసింది?' అన్న మాట నా నోటివరకూ వచ్చి ఆగిపోయింది.

అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా చొక్కాతోనే లోపలకు వెళ్లి లింగానికి తలను తాకించి ప్రణామం చేసి బయటకు వచ్చాను.కాంట్రాక్టర్ ఏదో గొణగడం లీలగా వినిపిస్తున్నది.అతని ముఖం చూస్తె నామీద బాగా కోపం వచ్చినట్లు అర్ధమైంది.

'చెప్పినా కూడా వినకుండా చొక్కాతోనే లోపలికి వెళుతున్నాడు.చూడబోతే పెద్దాయనలాగా ఉన్నాడు. ఏంటిది?'అని విసుక్కున్నాడని తర్వాత క్రిందకు దిగేసమయంలో రాజు మాతో అన్నాడు.నవ్వుకున్నాను.మొత్తానికి కొండకొమ్ముమీద ప్రశాంత మౌనధ్యానంలో గడపవలసిన సమయం అనవసరమైన మాటలలో వృధా అయిపోయింది.

చాలాసార్లు ఇలాగే అవుతూ ఉంటుంది.అత్యున్నతమైన దాని పక్కనే అతి నిమ్నమైనదీ ఉంటుంది. నిధిని చుట్టుకొని విషసర్పం ఉన్నట్లు.

'కొండ పక్కనే లోయ ఉంటుంది' అని చైనీస్ తత్వవేత్త లావోజు అంటాడు.భగవంతుని ముఖద్వారం లో కూడా మనకోసం సైతాన్ ఎదురు చూస్తూనే ఉంటాడు.చాలామంది సత్యానికి ఒక్క అడుగు దూరంలోకి వచ్చి అక్కణ్ణించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు.ఇది లోక సహజమే.

అయితే శబ్దం నిశ్శబ్దాన్ని భగ్నం చెయ్యలేదు.దానికి ఆధారమైన ఆకాశాన్ని అదేం చెయ్యగలదు?శబ్దం కొంచంసేపు ఉండి తర్వాత లయిస్తుంది. దానిముందూ వెనుకా కూడా స్థిరంగా నిలిచి ఉండేది నిశ్శబ్దమే.అంతరిక నిశ్శబ్దం అనుభవంలో ఉన్నవారిని బయటి శబ్దాలు ఏమీ చలింపచెయ్యలేవు.


ఇంకాసేపు అక్కడే కూచుని క్రిందకు దిగడం మొదలుపెట్టాము.మదన్ చెప్పులు వేసుకుని రాలేదు. దిగేటప్పుడు కోసు రాళ్ళు కాళ్ళకు గుచ్చుకుని చాలా బాధ పడ్డాడు.అందుకని నా చెప్పులు అతనికిచ్చాను.కొండరాళ్ళమీద నడిచేటప్పుడు అడుగులు వెయ్యడంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి.అవి పాటించకపోతే కాళ్ళు బొబ్బలు వస్తాయి.లేదా స్లిప్ అయి కిందపడే ప్రమాదం ఉంటుంది.అయితే ఎక్కేటప్పుడు ఉన్న అలుపు దిగేటప్పుడు లేదు.క్రిందకు దిగేటప్పుడు పాటలు వినిపించ లేదు.ఎందుకంటే పనివాళ్ళు మూటలు పైన పడేసి వెంటనే క్రిందకు వెళ్ళిపోయారు.అప్పుడు రాజుతో ఇలా చెప్పాను.

'రాజు.ఇందాక మనం కొండ మీదకు ఎక్కేటప్పుడు బుధహోర నడుస్తున్నది. కనుక ఆ చెత్త పాటలు వినిపించాయి.ఇప్పుడు బుధహోర అయిపొయింది. చంద్రహార నడుస్తున్నది.శనిలో చంద్రుడు అంటే వైరాగ్యం,నిశ్శబ్దం.అందుకే ఆ పనివాళ్ళు ఇప్పుడు ఎవరూ మనకు తారసపడటం లేదు.మనం కూడా పూర్తి నిశ్శబ్దంగా వైరాగ్య భావాలతో నడక సాగిస్తున్నాం.'

'అవును సార్.హోరలు చాలా బాగా పనిచేస్తాయి.ఇంతకూ ముందు కూడా మీరు హోరలను ఉపయోగించి మంచి మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వడం నేను గమనించాను.' అన్నాడు.


'అవును రాజు.వాడుకోవడం తెలిస్తే హోరలు చాలా బాగా ఉపయోగిస్తాయి.' అన్నాను.

బ్రహ్మశిఖరం వరకూ దిగేసరికి మధ్యాన్నం రెండు అయింది.అక్కడ ఉన్న ఏకైక హోటల్లో ఏదో భోజనం చేశామనిపించి గదులకు బయల్దేరాము.కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగుకు లేచి మళ్ళీ సంచారానికి బయలుదేరుదామని  అనుకుని నిద్రకు ఉపక్రమించాము.

(ఇంకా ఉంది)
read more " సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-1 "

27, జనవరి 2014, సోమవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -4

ఒకసారి బ్రహ్మంగారు నంద్యాలలో పర్యటిస్తూ ఉన్నపుడు కంసాలి వీధిలో తన శిష్యులతో నడచి వెళుతున్నారు. ఆయనకు దాహం వేసి మంచినీళ్ళు అడిగారు.వాళ్ళు కరిగిన బంగారాన్ని తాగమని ఇచ్చినారు సార్.అప్పట్లో నంద్యాల అంతా సస్యశ్యామలంగా ఉండేది.అందరూ ధనమదంతో విర్రవీగుతూ ఉండేవారు. ఆయన్ని ఎగతాళి చెయ్యడానికి కరిగిన బంగారాన్ని త్రాగమని ఇచ్చినారు.పొగలు కక్కుతున్న ఆ బంగారాన్ని ఆయన గుటుక్కున త్రాగేసి ఏమీ జరగనట్లుగా తన శిష్యులతో నడచి వెళ్ళిపోయాడు.

'ఇదే మహిమను ఆదిశంకరులూ,త్రైలింగ స్వామీ కూడా చేసినారని కధలున్నాయి' అన్నాను.

'అదేమో నాకు తెలియదు సార్.ఇది మాత్రం నంద్యాలలో జరిగింది.బ్రహ్మంగారు చేసినారు.ఇంకొక మహిమ కాళికామాత ఆలయంలో చేసినాడు' అన్నాడు.

'ఈ ఊరిలో కాళికామాత ఆలయం ఉన్నదా?' అడిగాను.

'ఎందుకు లేదు సార్? ఈ ఊరికి రక్షాదేవత కాళీమాతనే.అయిదువందల ఏండ్ల క్రితం ఈ ఊరిని నందిమహారాజు పరిపాలించే సమయంలో ఈ ఊరి చుట్టూ పెద్ద అగడ్త ఉండేది.అందులో మొసళ్ళు ఉండేవి.ఆ కందకం బయటగా కాళీమాత ఆలయం ఉండేది.ఇప్పుడైతే అది ఊరిమధ్య అయిపొయింది.రాజు యుద్దానికి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ కాళీమాతను పూజించేవాడు.' అన్నాడు.

'కాళీమాత ఆలయంలో బ్రహ్మంగారు చేసిన మహిమ ఏమిటి?' అడిగాను.

'ఒకసారి ఆయన ఒక పదిమంది శిష్యులతో ఈ ఊరికి వచ్చినాడు సార్.మధ్యాన్నం భోజనానికి ఎవరినో అడిగినారు.వారు ఈయన్ను పరీక్షించాలని 'సరే మీరు స్నానం చేసుకుని రండి.ఈలోపల భోజనాలు సిద్ధం చేస్తాము'అని చెప్పినారు.వారు స్నానసంధ్యలు చేసుకొని వచ్చేసరికి ఏభైమందికి సరిపడా అన్నం వండించి కుప్పపోసి పెట్టినారు.

'తినండి' అని ఆయన్ను చాలెంజ్ చేసినారు.

బ్రహ్మంగారు వారి కుయుక్తిని గ్రహించి ' ఈ అన్నం అంతా నా శిష్యుడు సిద్దయ్య ఒక్కడికే చాలదు.మిగిలిన వారికి ఏమి పెడతారు?' అని అడిగినాడు.

వారు ఎగతాళిగా నవ్వుతూ 'ఏభై మందికి వండిన అన్నం ఒక్కడికే చాలదా? తినమనండి చూద్దాం" అనినారు.

అప్పుడు బ్రహ్మం గారు ఆజ్ఞాపించగా సిద్దయ్య కాళీమాతను మదిలో స్మరించి ఆ కుంభం ముందు కూర్చోనగా అతన్ని ఆవహించిన కాళికాశక్తి ఆ అన్నకుంభం మొత్తం అమాంతం ఆరగించి ఇంకా చాలక 'ఆకలి ఆకలి' అని పెడబొబ్బలు పెట్టసాగింది.అది చూచిన ఆ ప్రజలు భయంతో గడగడా వణికిపోయి బ్రహ్మంగారి కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నారు.

అప్పుడు బ్రహ్మంగారు 'అల్పులారా! మావంటివారిని మీరు పరీక్షించ తగునా? తప్పుకదా?' అని బుద్ధి చెప్పి, తన కమండలంలోని నీటిని సిద్ధయ్యమీద చల్లి 'అమ్మా!ఇక సిద్ధయ్యను వదలిపెట్టు' అని ప్రార్ధించగా అతన్ని ఆవహించిన కాళికాదేవి వదలి వెళ్ళిపోయింది. అప్పుడు సిద్దయ్య శాంతించాడు సార్.ఇది నిజంగా జరిగిన మహత్యం.ఇప్పటికీ దీనిని నంద్యాలవాసులు కధగా చెప్పుకుంటారు.' అన్నాడు.

అయితే ఈ సారి వచ్చినపుడు అమ్మ దర్శనం చేసుకోవాలి అనుకుంటూ దేవాలయం ఎక్కడ ఉంటుందో అడ్రస్ అడిగి తెలుసుకున్నాను.

ఇలా మాట్లాడుకుంటూ, మాటల్లోనే శ్రీశైలం చేరుకున్నాము.దారిలో ఒకచోట మల్లయ్య మాకోసం వేచిఉన్నాడు. అతన్ని కార్ ఎక్కించుకొని బయల్దేరాము.దారిలోనే కమీషనర్ గారి ఇల్లు ఉన్నది.పలకరించి వెళదాం అని మల్లయ్య అన్నాడు.సరే అని అటు దారి తీశాము.

మేం వెళ్లేసరికి ఆయన తోటపనిలో ఉన్నాడు.దగ్గరుండి మొక్కల పని చేయిస్తున్నాడు.కుశల ప్రశ్నలు అయ్యాక కూర్చుని టీ తాగుతూ ఉండగా 'మీకు గార్డెనింగ్ అంటే బాగా ఇష్టంలా ఉన్నది' అన్నాను.

అవునండి.ఎక్కడెక్కడి నుంచో నాకిష్టమైన మొక్కలు తెప్పించి పెంచుతూ ఉంటాను.' అన్నాడాయన. చుట్టూ చూస్తె దానికి తార్కాణంగా రకరకాల మొక్కలు తోటలో కనిపించాయి. వాటిలో కొన్నింటిని బొమ్మూరు నర్సరీ నుంచీ, ఇంకోన్నింటిని వేరే నర్సరీల నుంచీ, మరి కొన్నింటిని శ్రీశైలం అడవిలోనుంచీ తెప్పించానని ఆయన చెప్పాడు.

'ఇది బ్రహ్మకమలం.ఏడాదికి ఒకసారి పూస్తుంది.దీనిని హిమాలయాల నుంచి తెప్పించాను.'అంటూ ఒక మొక్కను చూపించాడు.అది కేక్టస్ జాతికి చెందిన మొక్కలాగా కనిపించింది.నీటిని బాగా నిలువచేసుకునే జాతి మొక్క అది.దాని కొమ్మను తుంచి ఇంకొకచోట పెట్టినా అది చెట్టుగా మారుతుందని చెప్పాడాయన.కొమ్మనుంచి ఆకులోకి వచ్చిన దాని నరాలు కూడా బలంగా బాగా ఉబ్బి కనిపిస్తున్నాయి.ఆ మొక్కను చూస్తూనే దాని ఆకారాన్ని బట్టి అది గురుగ్రహ అధీనంలో ఉన్నదని నాకర్ధమైంది.గురువుకు 'జీవుడు'అని ఇంకొక పేరు.అందుకే దీనికి కూడా జీవశక్తి అధికంగా ఉన్నది.'అనుకుంటూ తలపంకించాను.ఆయన హాబీని అభినందించాను.

'చాలామంది మా ఇంట్లో బ్రహ్మకమలం ఉన్నది అనీ అది పూసింది రండి చూద్దురుగాని' అనీ అనడం నేను విన్నాను.కొంతమంది అదేపనిగా వెళ్లి దానిని చూడడమూ నాకు తెలుసు.బ్రహ్మకమలం తోటలో ఉంటె చాలదు.ప్రతిమనిషిలోనూ బ్రహ్మకమలం ఉన్నది.నీలో ఉన్న బ్రహ్మకమలాన్ని నీవు దర్శించాలి.అదే అసలైన విషయం.

తోటలో బ్రహ్మకమలం ఉన్నా ముళ్ళచెట్టు ఉన్నా నీకేమీ ఉపయోగం లేదు.మహా అయితే ఫోటోలు తీసి నలుగురికీ చూపడానికి పనికొస్తుంది. ఇంటికొచ్చిన గెస్ట్ లకు చూపితే వారు ముక్కుమీద వేలేసుకుని 'ఇదేనా బ్రహ్మకమలం?'అని ఆశ్చర్యపోవడానికి పనికొస్తుంది.కాని దానివల్ల ఇసుమంతైనా ఉపయోగం లేదు.

ఈ ఆలోచనలో ఉన్న నా మనసులో ఒక పద్యం ఆశువుగా పుట్టుకొచ్చింది.

ఆ||బ్రహ్మకమలమంచు భేషజంబది యేల
పత్ర పుష్పములను పొగడనేల
కమలమందు వెలయు కైవల్యమెరుగరా
బాహ్యదృష్టి మీరి బ్రహ్మమందు

అసలైన బ్రహ్మకమలం మనిషి లోపల ఉన్నది.దానిని దర్శించే సులువును మనిషి తెలుసుకోవాలి.ఏడాదికి ఒకసారి పుష్పించే దాని రహస్యం ఏమిటో మానవుడు గ్రహించాలి.

ఈలోపల కమీషనర్ గారు ఆలయసిబ్బందికి ఫోన్ చేసి ఫలానావాళ్ళు వస్తున్నారు.దగ్గరుండి దర్శనం చేయించండి.అని ఆదేశాలు జారీ చేశాడు.ఫోన్ పెట్టేసి నావైపు తిరిగి ఇలా అన్నాడు 'ఇక్కడ ఎవరైనా సరే శివలింగాన్ని తాకవచ్చు.కాని కాలక్రమేణా ఎవరుబడితే వారి చెమట తాకడంవల్లా,పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు అందులోని కెమికల్స్ తాకడంవల్లా శివలింగం పాడైపోతున్నది.కనుక వెండిగాని బంగారుగాని కవచం చేయించి అందరూ శివలింగాన్ని తాకడం ఆపుదామని ఆలోచిస్తున్నాము.'

దానికి నేనేమీ జవాబు చెప్పలేదు.ఆయనకు థాంక్స్ చెప్పి గెస్ట్ హౌస్ కి దారితీశాము.కాసేపు అక్కడ ఫ్రెష్ అయ్యి సోఫాలో కూలబడుతుండగా 'టీవీ పెట్టమంటారా?' అడిగాడు అటెండర్.

'వద్దు' అన్నాను.

'పోనీ ఏసీ వెయ్యమంటారా?' అడిగాడు.

'అదీ వద్దు'అన్నాను.

అతను వింతగా చూచాడు.

'అదేంటి సారూ.ఇక్కడికి వచ్చేవాళ్ళు లోపలి వచ్చీరాకముందే ఏసీ వెయ్యి టీవీ పెట్టు అంటారు.మీరు వద్దంటున్నారు?' అన్నాడు విచిత్రంగా చూస్తూ.అంటూనే ఏసీ ఆన్ చేసి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

నేనేం జవాబు చెప్పలేదు.కాసేపు ఆ ఏసీలో ఆ సోఫాలలో కూచునేసరికి ఏదో కృత్రిమంగా అనిపించి ఒళ్లంతా కంపరం పుట్టింది.వెంటనే బయటకొచ్చి మెట్లమీద ఎండలో హాయిగా కూచున్నాను.

'అదేంటి సార్.లోపల హాయిగా ఏసీలో కూచోక ఇక్కడ కూచున్నారు?'అని మావాళ్ళు అడిగారు.ఇక అడుగువేసి అడుగుతీసిన ప్రతిదానికీ ఏమని జవాబులు చెప్తూ కూచునేది?అందుకని ఏం మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాను.

ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళడమూ యధావిధిగా దర్శనం చేసుకోవడమూ జరిగిపోయాయి.'శ్రీవిద్య' శుద్దోపాసనను పద్యరూపంలో అనుగ్రహించినందుకు లోపాముద్రాదేవికీ, అమ్మవారికీ, పరమేశ్వరునికీ మనస్సులో ప్రణామాలు అర్పించాను.శ్రీశైల దేవాలయంలో నాకిష్టమైన కొన్ని ప్రదేశాలున్నాయి.అక్కడ ప్రశాంతంగా కూచుని వేరే వాళ్లకు అనుమానం రానిరీతిలో నాపని పూర్తి చేశాను.

అర్ధం చేసుకోలేని మనుష్యులు వెంట ఉన్నప్పుడు ప్రతిదీ ఒక విసుగు అవుతుంది.కానీ తప్పదు.మనల్ని అర్ధం చేసుకుని మౌనంగా అనుసరించేవారు దొరకడం నిజంగా ఒక అదృష్టమే.ఆ అదృష్టం గొప్పగొప్ప యోగులకు కూడా దక్కదు.వారికీ అనుక్షణం ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది.అలా మాటమాటికీ విసిగించే మనుషులూ పరిస్థితులూ వారికీ అనుక్షణం ఎదురౌతూనే ఉంటాయి.ఇక మనమెంత?

కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత వెనక్కు బయలుదేరాము.దగ్గరలోని ఒక గెస్ట్ హౌస్ నుంచి కింద నదీ డ్యామూ చాలా మంచి వ్యూ ఉంటుంది.అక్కడకు వెళ్లి కొన్ని ఫోటోలు దిగాము.శ్రీశైలంలో రైల్వే గెస్ట్ హౌస్ నిర్మాణంలో ఉన్నది.దానిని కూడా చూద్దామని అక్కడకు వెళ్ళాము. 

రామమూర్తి ఇలా అన్నాడు.

'సార్.ఇక్కడ మనవైపునుంచి లైజాన్ ఆఫీసర్ గా ఉండమని నన్ను అడిగినారు.కాని నేను ఒప్పుకోలేదు.'

'ఎందుకు?మీకు కూడా ఇక్కడ ఉండటం ఇష్టమే కదా?'అడిగాను.

'ఒక్క సమస్య ఉన్నది సార్.నేను ఇక్కడకు వస్తే నా జీతం తగ్గిపోతుంది.'

'తగ్గితే ఏమి?మీకు ఇష్టమైన పని చెయ్యడంలో ఆనందం ఉంటుంది కదా?పైగా మీరు సర్వీస్ చివరికి వచ్చిఉన్నారు కూడా?' అడిగాను.

'అదికాదు సార్.ప్రస్తుతం నాకు ఏభైవేలు జీతం వస్తుంది.అందులోనుంచి ప్రతినెలా పాతికవేలు ఖర్చుపెట్టి అయిదుగురు అనాధ పిల్లలను చదివిస్తున్నాను.ఈ విధంగా గత ఇరవై ఏళ్ళనుంచీ నా జీతంలో సగం ఖర్చు చేసి పేద పిల్లలను చదివించడం ఒక సాధనగా చేస్తున్నాను.నేను జీవితంలో ఏదన్నా మిగుల్చుకుంటే ఈ పుణ్యమే సార్.ఇప్పుడు ఆ పిల్లలు కాలేజీకి వచ్చి ఉన్నారు.అర్ధాంతరంగా నేను సాయం చెయ్యడం ఆపితే వాళ్ళ జీవితాలు చెదిరిపోతాయి.అందుకని వాళ్ళ చదువు అయిపోయి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడితే అప్పుడు నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడ వచ్చి సెటిలై పోతాను సార్.మీరు నమ్ముతారో లేదో? ఇప్పటికీ నాకు సైకిల్ కూడా లేదు సార్.'అన్నాడు రామ్మూర్తి.

ఒక్క క్షణం అతని వైపు చూచాను.నా కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి.

అతను నా దృష్టిలో అమాంతం ఎదిగిపోయి ఎంతో ఉన్నతంగా కనిపించాడు.

'నీ అభిప్రాయాలు ఏమైతేనేమి?నీ ఆలోచనలు ఏమైతేనేమి?ఆధ్యాత్మికం అంటే నీకు సరియైన అవగాహన ఉంటేనేమి?లేకుంటేనేమి?కాశినాయనను నీవు సరిగ్గా అర్ధం చేసుకుంటే ఏమి?చేసుకోకపోతేనేమి?ఆయన చెప్పిన పనిని నీవు తూచాతప్పకుండా చేస్తున్నావు.నీ అవసరాలు మానుకొని ఇంకొకరి ఉన్నతి కోసం నీవు పాటుపడుతున్నావు.నీవు వివేకానందస్వామి అడుగుజాడలలో నడుస్తున్నావు.మహనీయుల కటాక్షం నీమీద కాకుంటే ఇంకెవరిమీద ఉంటుంది?కాశిరెడ్డినాయన  అనుగ్రహానికి ఇంతగా నీవు పాత్రుడవయ్యావంటే ఇదన్నమాట అసలు కారణం?' అనుకున్నాను.

ఒక మనిషికి కోటిరూపాయలు ఉంటే,ఒక వంద దానం చెయ్యడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు.కాని అందులోనుంచి ఒక ఏభైలక్షలను నిస్వార్ధంగా ఒక పనికి ఖర్చు చెయ్యడం గొప్ప.ఆ విధంగా ఏళ్ళ తరబడి చేస్తూనే ఉండటం అసలైన గొప్పవిషయం.తన అవసరాలు మానుకుని చెయ్యడం ఇంకా గొప్ప విషయం.

మహామహా కోటీశ్వరులు అతి పిసినారులై వాళ్ళవాళ్ళ సుఖాలకీ విలాసాలకీ మాత్రం కోట్లు ఖర్చు చేసుకుంటూ,సాటి మనిషి ఆకలిని పట్టించుకోని ఈ లోకంలో ఒక సామాన్య ఉద్యోగి తన జీతంలో నుంచి సరిగ్గా సగభాగం గత ఇరవై ఏళ్ళనుంచీ అజ్ఞాతంగా ఒక మంచిపని కోసం వెచ్చిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం?

చాలామందికి రైల్వే అంటే లంచగొండులైన టీటీయీలూ రిజర్వేషన్ క్లార్కులూ గుర్తొస్తారు.కాని ఇలాంటి ఉదాత్తులైన ఉద్యోగులు కూడా రైల్వేలో ఉన్నారు.కాని వాళ్ళు అజ్ఞాతంగా ఉంటారు.వారికి లోకం మెప్పు అవసరం లేదు.దైవం మెప్పు ఉంటె వారికి చాలు.రామ్మూర్తే దీనికి ఉదాహరణ.

లోకం మెప్పు పొందటంలో ఏ ఉపయోగమూ లేదు.అది నిలిచేదీ కాదు.దైవం మెప్పును నీవు పొందాలి.అది శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది.దానికి టాంటాం అవసరం లేదు.లోకంలో గొప్ప పనులు నిశ్శబ్దంగానే జరుగుతూ ఉంటాయి.తెలియనివారు ఊరకే గోల చేస్తుంటారు.తెలిసినవారు మౌనంగానే ఉంటారు.

వివేకానందస్వామి ఒక మాట అనేవారు.

'నలుగురూ చూస్తున్నపుడు వాళ్ళ మెప్పుకోసం ఒక గొప్ప పనిని చెయ్యడంలో ఘనత లేదు.నిత్యజీవితంలో ఎవ్వరూ నిన్ను గమనించడం లేదు అన్నటువంటి పరిస్థితిలో కూడా నీవు ఉదాత్తమైన జీవితం గడపగలిగితే అదీ నిజమైన ఘనత.'

ఒక మనిషిలోని ఆలోచనలూ అభిప్రాయాలూ అలవాట్లూ ప్రధానం కాదు. అతనిలో ఉన్న ఆచరణాత్మకమైన మంచితనమే అత్యంత ముఖ్యమైన విషయం.అంతర్దృష్టి ఉన్నవారు దానినే గమనిస్తారు.విలువిస్తారు.అంతేగాని పైపై వేషాలకు వారు ఏమాత్రం విలువను ఇవ్వరు.

'మల్లయ్యా.ఈసారి వచ్చినపుడు అక్కమహాదేవి తపస్సు చేసిన గుహలు చూడాలి' అన్నాను.

'తప్పకుండా చూద్దాం సార్.తీసుకువెళతాను' అన్నాడు తను.

వచ్చిన పని పూర్తయింది.తిరుగు ప్రయాణంలో నంద్యాల వెళ్ళకుండా, మార్కాపూర్ స్టేషన్ లో దిగి గుంటూరు వెళ్ళే రైలెక్కాము.

(సంపూర్ణం)
read more " శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -4 "