13, ఏప్రిల్ 2012, శుక్రవారం

కాలజ్ఞానం -10

ఆగిపోయినవన్నీ మళ్ళీ కదులుతాయి
పడుకున్న పాములు నిద్రలేస్తాయి
గొడవలు మళ్ళీ మొదలౌతాయి
ప్రమాదాలూ భయభ్రాంతులూ 
పెద్ద విపత్తుకు సూచనలు

మనిషి అతితెలివితో విర్రవీగితే  
ప్రకృతేనా తెలివి లేనిది?   

సంపదవెంట పరుగులు మాని 
సంతోషంకోసం విలువలకోసం
జీవించడం తెలివైన పని
లోకానికి ఇది పిచ్చిలా తోచినా 
నిజం నిలకడమీదే తెలుస్తుంది
సారమే చివరికి మిగుల్తుంది
read more " కాలజ్ఞానం -10 "

సినిమా నటులా మనకు ఆదర్శం?

ఈమధ్య ఒక తెలిసినవారి ఇంటికి వెళితే అందరూ టీవీ ముందు కూచుని గుడ్ల ప్పగించి చూస్తున్నారు.ఏం ప్రోగ్రాం వస్తోందా అని చూస్తె,ఒక సినిమా నటుడికి సన్మానం జరుగుతోంది.దానికి ఇంటిల్లిపాదీ పనులు మానుకుని టీవీ ముందు కూచుని పరవశంగా చూస్తున్నారు. వాళ్ళ చీప్ టేస్ట్ ని చూచి నాకు బాధేసింది. అలాటివాళ్ళ ఇంటికి వచ్చినందుకు సిగ్గేసింది. మా ఇంట్లో టీవీని ఒక్కొక్కసారి వారంరోజుల వరకూ ఆన్  చెయ్యటం అంటూ జరుగదు.అందుకని ఆ ప్రోగ్రాం సంగతి నాకు తెలీలేదు.ఆవిషయం అలా ఉంచితే,ముఖానికి రంగేసుకుని వేషాలేసిన నటులను ఏదో చారిత్రిక పురుషులలాగా భావించడం,వాళ్ళను మహనీయులు మహానుభావులు యుగపురుషులు అని సంబోధించే వాళ్ళను,పుస్తకాలు రాసేవాళ్ళను చూస్తె,ఈ అభిమానులు  అసలేం మాట్లాడు తున్నారో వాళ్లకు తెలుస్తోందా? వాళ్ళు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేదా? అని నాకు సందేహం వస్తుంటుంది. నేటి అభిమాన సంఘాలు కులసంఘలేగాని ఇంకేమీ కాదు.కులపిచ్చితో మనుషులు ఎంతలా దిగజారగలరో వీళ్ళు నిరూపిస్తూ ఉంటారు. 

కెమెరా ముందు తైతక్కలాడినంత మాత్రాన సినీనటులు మహనీయులు యుగపురుషులు ఎలా అవుతారో నాకు ఎప్పటికీ అర్ధం కాదు. ఒక  నటుడు వేసిన తాగుబోతు వేషాలవల్ల 1970  లలో ఒక తరమంతా తాగుబోతులుగా మారారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. జీవితంలో ఏ రకమైన ఆదర్శాలూ లేనివారికి సినిమానటుల వేషాలేకదా ఆదర్శం !!! అందులోనూ మన తెలుగువాళ్లకున్న సినిమా పిచ్చి అంతాఇంతా కాదు. హీరో ఏది చేస్తే అది చెయ్యడం గొప్ప అని వీడనుకుంటాడు. కనుక ఆ నటుడు వేసిన తాగుబోతు వేషాలు చూసీ, ఆ గ్లాసు పట్టుకోవడం, సిగిరెట్టు తాగడం, అర్ధనగ్న డాన్సర్లతో ఎగరడం, ఈ చండాలం అంతా చూసి డంగై పోయి, వాటిని అనుకరిస్తూ తాగుడికి తిరుగుడికి జూదానికి అలవాటుపడి తనతోబాటు తన కుటుంబసభ్యుల జీవితాలను కూడా నాశనం చేసినవాళ్ళు 1970 దశకంలో ఎందఱో ఉన్నారు. 

సమాజం ఈ రకంగా దిగజారడానికి కారణం అయిన నటుణ్ణి చూసి వీళ్ళు ఒళ్ళుమరిచిపోయి చప్పట్లు కొట్టడం, కాళ్ళమీద పడి దణ్ణాలు పెట్టడం, మహానుభావుడంటూ పొగడటం  చూచి నాకు నోటమాట రాలేదు. మానవ మనస్తత్వస్థాయి ఇంత  చండాలంగా ఉంటుందా అని నాకు బాధ కలిగింది. ఈ నటులు మానవాళికి ఏమి మేలు చేశారని వీళ్ళకు ఇంత విలువ ఇవ్వాలో నాకెప్పటికీ అర్ధం కాదు. ముఖానికి రంగేసుకుని వేషాలు వేసినంత మాత్రాన వీళ్ళకు ఏమి ఔన్నత్యం వస్తుందో, ఎలా వస్తుందో, వీళ్ళు ఆదర్శ పురుషులు ఏరకంగా అవుతారో నా మట్టి బుర్రకైతే ఎప్పటికీ అర్ధంకాదు.

పాతతరంలో అయితే పురాణగాధలు, మహనీయుల జీవితాలు, త్యాగమయుల చరిత్రలు, ధార్మికుల జీవితాలలోని సంఘటనలు, మహాభక్తులజీవితాల నుంచి, అవతారపురుషుల జీవితాలనుంచి ఉత్తేజపూరిత ఘట్టాలు, కీర్తనలు, శతకాలు, పాటలు, పద్యాలూ చిన్నప్పటినుంచే నేర్పించేవారు. దానివల్ల ఒక బాలునికి గాని బాలికకు గాని  చిన్నవయసులోనే మంచి ధార్మికమైన పునాదులు పడేవి. మాటగాని, చేతగాని, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండేది. జీవితం ధర్మపరంగా గడిపేవారు. ఇతరులకు సాయపడదామన్న తత్త్వం ఉండేది. మాటల్లో అసభ్యపదాలు దొర్లేవి కావు. పెద్దవాళ్ళను గౌరవించడం, పద్దతిగా ఉండటం, మంచీ మర్యాదా ఇత్యాదులు సహజంగా అలవడేవి.

సినిమాలు రాకముందు ఎక్కడచూచినా ఇటువంటి పరిస్తితి ఉండేది.సినిమాలు వచ్చిన తర్వాతకూడా మొదటితరం వరకూ కొంత బాగానే ఉంది. ఆ తర్వాత సినిమాలలో వెర్రిపోకడలు, వెకిలివేషాలు, ద్వంద్వార్ధపు పాటలు,డాన్సులు ఎప్పుడైతే మొదలయ్యాయో సమాజంలో మార్పురావడం మొదలైంది.నేటి సమాజం ఇలా అఘోరించడానికి సినిమారంగానిదే పూర్తిబాధ్యత అని చెప్పచ్చు. డబ్బుకోసం నానా ఛండాలపు సినిమాలు నిర్మించి జనంమీదకు వదిలి సమాజం సర్వనాశనం కావడానికి కారకులైనవారికి లోకం నీరాజనం పట్టడం చూస్తుంటే ఇదేకదా కలిమాయ అనిపిస్తుంది.

తాగుడూ డ్రగ్సూ తార్పుడు బిజినెస్ ఎంత నీచమైనదో, విలువలు లేని సినిమాలు తీసేవారి వృత్తీ అంత నీచమైనదే.కాని ఇంద్రియాలను రేగజేస్తుంది గనుక అది చాల ఆకర్షణీయంగా ఉంటుంది. లాభసాటిగా కూడా ఉంటుంది. అయితే దీనివల్ల సమాజం ఎంతగా నాశనం అవుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరెన్ని చెప్పినా సినిమా అనేది ఒక శక్తివంతమైన మాధ్యమం అనీ అదిఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది అనీ అనడం అబద్దం కాదు.

ఇంటర్ చదువుతున్న విద్యార్ధుల ప్రేమకధ అంటూ ఒక పదిహేనేళ్ళక్రితం వచ్చిన ఒక చిత్రమైన సినిమాతో టీనేజి లవ్వులు సమాజంలో విజ్రుమ్భించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా "ప్రేమకి కొందరు-పెళ్ళికి ఒక్కరు" అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నారంటే సినిమాలు టీవీలదే  పూర్తిబాధ్యత. పెళ్ళికిముందు సాధ్యమైనంత ఎక్కువమందితో తిరిగేసి తర్వాత ఎవడో ఒకడితో తాళికట్టించుకోవడం నేటి అమ్మాయిలకు ఫేషన్ అయిపోతున్నది.ఇక అబ్బాయిలకైతే విలువలు అనేవి పూర్తిగా మృగ్యమై పోతున్నాయి.ఇదీ సినిమాల ప్రభావమే. 

నేటిసమాజంలో విద్యార్ధి ని "జీవితంలో నీ ఆదర్శం ఎవరు" అనడిగితే సినిమానటుల పేర్లు చెబుతున్నాడు.అది కూడా తన కులపు హీరోపేరు చెబుతున్నాడు.సినీనటుల అభిమానసంఘాలన్నీ కులసంఘాలే అన్నది నగ్నసత్యం.అంతటి సంకుచితభావాలు నేటియువతకు ఉంటున్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన మహనీయులైన ప్రాచీన చక్రవర్తుల పేర్లు కానీ,సంప్రదాయ నిర్మాతలైన మహర్షులపేర్లు కానీ,వారి చరిత్రలు కానీ నేడు ఎవరికీ తెలియవు.కనీసం నవీనకాలపు సంఘసంస్కర్తల పేర్లు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు కూడా తెలియవు. నేటితరానికి తెలిసిందల్లా పక్షవాతం వచ్చిన కోతుల్లా ఎగిరే నటులపేర్లు మాత్రమే. నేటి యువతకు ఆదర్శప్రాయులు కూడా వీరే. అంతగా దిగజారిపోయింది ప్రస్తుత సమాజం.

సమాజాన్ని పూర్తిగా సర్వనాశనం చెయ్యడంలో సినిమాలు చక్కని పాత్రను పోషించాయి, ప్రస్తుతం కూడా పోషిస్తూ ఉన్నాయి అన్నది నిజం.సినిమా నటులే మనకు ఆదర్శంగా ఉన్నంతవరకూ మన మేధోస్థాయి ఎదిగే అవకాశం ఎంతమాత్రమూ లేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను. కలిపురుషునిస్థానాలుగా మన పురాణాలు కొన్ని కొన్ని ప్రదేశాలను సూచించాయి.ఆ జాబితాలో సినిమాహాళ్ళు కూడా చేర్చుకోవలసిన అవసరం ఉంది. సినిమానటులను కలిపురుషుల అవతారాలుగా భావించవచ్చు.

సినీనటులను యుగపురుషులుగా,మహానీయులుగా,మహానుభావులుగా  భావించి కీర్తించే స్థాయికి చెందిన మరుగుజ్జు మనస్తత్వాలున్న సమాజం ఔన్నత్యాన్ని పొందగలుగుతుందని ఎప్పటికైనా ఎలా ఆశించగలం?
read more " సినిమా నటులా మనకు ఆదర్శం? "

11, ఏప్రిల్ 2012, బుధవారం

ఆంధ్రాలో విద్యావంతుల కంటే కేరళలో తాగుబోతులు మేలు

మొన్నీ మధ్య మా స్నేహితులు కేరళ వెళ్ళి వచ్చారు. ఆ సందర్భంగా వారు చూచిన విషయం ఒకటి చెప్పారు. అక్కడ ఉన్న శుభ్రతా, ఏ వస్తువైనా దానిమీద ఉన్నధరకే అమ్మడమూ,మోసం లేకపోవడమూ, దేవాలయాలలో నియమనిష్టలు చక్కగా పాటించడమూ,రోడ్డుపక్కన మూత్రవిసర్జన చేసేవాళ్ళు వెతికి చూచినా లేకపోవటమూ, రైల్వే ట్రాక్ శుభ్రంగా ఉండటమూ, అడుక్కుండేవాళ్ళు కనపడకపోవటమూ,నదీతీరాలలో మలవిసర్జన  చేసేవారు లేకపోవడమూ  చూచి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. 

మన తెలుగువాళ్ళు కేరళని చూచి చాలా నేర్చుకోవలసిన అవసరం ఉందని వాళ్ళు వెంటనే గ్రహించారు. ఇవన్నీ ఇలా ఉంచితే,వాళ్ళను సంభ్రమానికి గురిచేసిన అసలైన  విషయం ఇంకోకటుంది. తిరువనంతపురంలో ఒకచోట పెద్ద క్యూ కనిపిస్తే, ఎవరా ఇంత క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఉన్నారు?ఎక్కడికి పోతున్నారు? అని చూస్తె అదొక బార్.వాళ్ళంతా దానిముందు క్యూలో ఉన్న జనం.అంటే తాగుబోతులలో కూడా ఎంత క్రమశిక్షణ ఉందో అని మావాళ్లకు మతిపోయిందిట.

దీనికి వ్యతిరేకంగా మన ఆంధ్రాలో కొన్ని సంఘటనలు చూద్దాం.బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆంధ్రాలో ఎక్కడా క్యూలో నిలబడరు.ఏదో ఒకరకంగా అడ్డదారిలో దూరేద్దాం అనేచూస్తారు.గుడిదగ్గరైనా,బడి దగ్గరైనా,సినిమా హాలైనా,రైల్వేస్టేషనైనా,కారుపార్కింగ్ దగ్గరైనా,రోడ్డు మీదైనా ఎక్కడైనా ఇదే తంతు. సందు దొరికితే దూరిపోదాం అనే ప్రతివాడూ చూస్తాడు కాని క్రమశిక్షణతో క్యూలోవద్దాం అని ఎవడూ ఆలోచించడు.పోలీసు లేకపోతే, సిగ్నల్ దగ్గర స్వీయ క్రమశిక్షణ పాటించేవారు ఎంతమంది మన ఆంధ్రాలో ఉంటారు? అని ప్రశ్నించుకుంటే ఒక్కడంటే ఒక్కరు కూడా ఉండరు అని ఘంటాపధంగా చెప్పవచ్చు.

మొన్న ఏవో పరీక్షలు అయిపోయాయి.రోడ్డుమీద ఒక స్కూల్ బస్సు పోతున్నది. దాంట్లోంచి కాయితాలూ నోట్సులూ చించి విద్యార్ధులందరూ రోడ్డు మీదకు విసురుతున్నారు. ఆ కాయితం ముక్కలు ఆ బస్సు వెనుక వస్తున్న ఒక స్కూటరిష్టు ముఖాన పడ్డాయి.అతనా కంగారులో, నడిచివస్తున్న ఒకతన్ని గుద్దేసి  ఇద్దరూ కింద పడిపోయారు. ఈమధ్య ఇదొక పాడు అలవాటు మొదలైంది. పరీక్షలు అయిపోతే ఆ నోట్సులు అన్నీ చించి స్కూల్ బస్సులోనుంచి రోడ్డు మీదకి విసురుతున్నారు. ఆ కాగితాలు ఎవరు ఎత్తి పోస్తారు? అలా చెయ్యడం తప్పు అని ఆ విద్యార్ధులకు ఎవరూ చెప్పడం లేదు. కార్పోరేట్ స్కూళ్ళలో ఏమి క్రమశిక్షణ నేర్పుతున్నారో అర్ధం కావడం లేదు. మా చిన్నప్పుడు కాగితాన్ని పొరపాటున తొక్కితే, కాగితం సరస్వతీ స్వరూపం, తీసి కళ్ళకద్దుకోమని పెద్దవాళ్ళు బుద్ధి చెప్పేవారు.   

నేను మనదేశంలో చాలారాష్ట్రాలు చూచాను.మన ఆంధ్రాలో ఉన్నన్ని దరిద్రపు అలవాట్లు ఇతరరాష్ట్రాలలో ఎక్కడాలేవు (బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలు మినహాయించి)అని చెప్పగలను. ఇప్పుడు బీహార్ కూడా  బాగుపడుతున్నది.దానిస్థానాన్నిత్వరలో మన ఆంధ్రా ఆక్రమించబోతున్నది. దక్షిణాదినున్న నాలుగురాష్ట్రాలలో కేరళ కర్నాటకలు బాగుంటాయి. తమిళనాడు ఆంధ్రాలు వాటిముందు దిగదుడుపే.ఈ రెంటిలో మళ్ళీ మనఆంధ్రా పరమదరిద్రం. మనకు శుచీశుభ్రతా, క్రమశిక్షణా ఏకోశానా లేవు. మిగతారాష్ట్రాలవాళ్ళు మన  ఆంధ్రాకు వచ్చి ఈస్తితి మీద  చండాలంగా కామెంట్ చెయ్యడం చాలాసార్లు చూశాను. అందులో నిజం లేకపోలేదు.

ఆంధ్రాలో చదువుకున్నవాళ్ళ కంటే, కేరళలో తాగుబోతులు నయం అనేది నిజమే అనిపిస్తోంది.
read more " ఆంధ్రాలో విద్యావంతుల కంటే కేరళలో తాగుబోతులు మేలు "

10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఈ రోజు డా. హన్నేమాన్ పుట్టినరోజు

వాన ముందు పుట్టే ఉసిళ్లలాగా ఈ ప్రపంచంలో ఎందఱో పుట్టి చనిపోతుంటారు. శిశ్నోదర పరాయణులై నిరర్ధకమైన జీవితాలు గడుపుతూ ఉంటారు.కాని జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశయం కోసం వెచ్చించి, చనిపోయేముందు గొప్ప ఆత్మతృప్తితో, "నేను నా జీవితాన్ని వ్యర్ధంగా గడపలేదు. నావల్ల మానవాళికి ఈమంచి జరిగింది.నేను భూమ్మీద పుట్టినందుకు ఇంతమందికి మేలు చెయ్యగలిగాను. మానవాళికి ఎప్పటికీ మిగిలిపోయే ఈ మంచి పనిని నేను చేశాను. ఈ తృప్తి నాకుచాలు." అన్న భావనతో చనిపోయేవారు ఎక్కడో అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే కారణజన్ములు. వాళ్లకు మన మెప్పులూ కిరీటాలూ అవసరం లేదు. వాళ్ళు వచ్చ్సిన పని చేసి నిష్క్రమిస్తారు.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ రోజు ప్రపంచ మానవాళికి అద్భుతమైన మేలు చేసిన ఒక నిజమైన మహనీయుడు పుట్టినరోజు. రెండువందల ఏళ్ల క్రితం ఇదే తేదీన డా. హన్నేమాన్ జన్మించాడు. ఎనభై ఏళ్ల సార్ధక జీవితాన్ని గడిపి, దాదాపు నూరుకు పైగా మందులను కనిపెట్టి, హోమియో సూత్రాలను క్రోడీకరించి, దీర్ఘవ్యాధుల స్వరూపాన్ని అర్ధం చేసుకొని, వాటిని నయం చెయ్యాల్సిన తీరును వివరించి చెప్పి, కొన్ని కోట్ల మందికి ప్రాణదానం చేసిన మహనీయుడు డా. హన్నేమాన్. కాని ఇలాంటి వారిని ఎవరూ తలుచుకోరు. ఎక్కడో కొందరు తెలిసినవాళ్ళు మాత్రం వారిని స్మరిస్తారు. మిగతా గొర్రెలన్నీ, సినిమానటులనో రాజకీయ నాయకులనో చూస్తూ భజన  చేస్తూ ఉంటాయి.

ఒక్క ఔషదం కనిపెట్టినవాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తే, నూరు మందులు కనిపెట్టినవాడికి ఏమివ్వాలి? ఒక శాస్త్రంలో ఒక సూత్రాన్ని కనుగొన్నవాడిని గొప్ప శాస్త్రవేత్తగా హారతి పడితే, ఒక శాస్త్రాన్ని ఆమూలాగ్రమూ తానొక్కడే నిర్మించి, దానిని సూత్రీకరించి,క్రోడీకరించిన వానికి ఎంత గౌరవం ఇవ్వాలి? కానీ లోకం ఇలాంటి విషయాలు పట్టించుకోదు. దానికెప్పుడూ చౌకబారు విషయాలూ, నాశిరకం కాలక్షేపాలూ మాత్రమే కావాలి. ఎందుకంటే లోకుల మేధోస్థాయి అలాంటిది.

వైద్యరంగంలో ట్రీట్మెంట్ అనేది మానవతతో కూడి ఉండాలని, సరళంగా ఉండాలనీ, అనవసర మందులు వాడకూడదనీ, నిజాయితీగా ఉండాలనీ చెప్పినవాడు డా.హన్నేమాన్. పిచ్చివాళ్ళకు కరెంట్ షాకులివ్వకూడదనీ, గొలుసులతో కట్టకూడదనీ, వాళ్ళను మానవత్వంతో ట్రీట్ చెయ్యాలనీ, హింసించకూడదనీ చెప్పడమే కాక ఆచరించి చూపిన గొప్ప డాక్టర్ శామ్యూల్ హన్నేమాన్. ప్రూవింగ్ అన్న విధానాన్నీ, పొటేన్టైజేషన్ అన్న ప్రక్రియనీ కనిపెట్టి, కనీసం నూరుమందుల స్వరూప స్వభావాలను రికార్డ్ చేసిపెట్టి,  మయాజంస్ అనే దీర్ఘరోగకారక దోషాలను గుర్తించి, వాటిని ఎలా ట్రీట్ చెయ్యాలో వ్రాసిపెట్టి లోకానికి మహోపకారం చేసిన కారణజన్ముడు డా. హన్నేమాన్. 

ఒక మనిషి,మానవాళి మేలుకోసం తపించి,ఒక శాస్త్రాన్ని పునాదులనుంచి నిర్మించుకుంటూ వచ్చి,ఒక మహాసౌధంగా దాన్ని తయారుచేసి,తన కష్టాన్ని లోకంకోసం ధారపోసి తృప్తిగా వెళ్ళిపోయిన ఇటువంటి జీవితాలు లోకంలో అతి కొన్నిమాత్రమే ఉంటాయి.కానీ ఇలాటివాళ్ళను లోకం అసలు గుర్తించదు. పనికిమాలిన సినిమానటులకూ రాజకీయనాయకులకూ మాత్రం  కుళ్ళులోకం బ్రహ్మరధం పడుతుంది.

డా. హన్నేమాన్ తన చివరిరోజులలో ఒక మాట అనేవాడు -- "My life has not been spent in vain." డబ్బు సంపాదించడమో, లేక భార్యా పిల్లలను పోషించడమో లేక పది ఇళ్ళు కట్టించడమో చేసి అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు ఉబ్బిపోయే లోకులకు ఈ మాటలోని లోతు అర్ధం కావాలంటే వాళ్ళు ఒక పది జన్మలెత్తాలి. అప్పుడు గాని వాళ్లకు కావాల్సినంత  పరిణతి రాదు. ఈ మాటను నిజాయితీగా మనలో ఎందరం అనగలమో, డా. హన్నేమాన్ జన్మదినం రోజున ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందామా?
read more " ఈ రోజు డా. హన్నేమాన్ పుట్టినరోజు "

9, ఏప్రిల్ 2012, సోమవారం

కాలజ్ఞానం - 9

మూలుగుతున్న దేశానికి 
వ్యతిరేకంగా కుట్ర 
విధ్వంసరచనకు వీలు కల్పిస్తోంది
స్వార్ధ నాయకులకు
ముందు చూపేదీ 
కన్నతల్లిని అమ్ముకునేవాళ్ళకు
నీతి ఎలా ఉంటుందీ?
నీచులంతా కలిసి 
నిస్సహాయ అబలను 
చుట్టుముడతారు
read more " కాలజ్ఞానం - 9 "

7, ఏప్రిల్ 2012, శనివారం

కాలజ్ఞానం -8

వాహనాల ప్రమాదాలు
ఎగసిపడే కోరికలు 
విలాసజీవిత కష్టాలు  
కనిపించే అగ్నిజ్వాలలు 
పోటెత్తే నేరాలు 
బలయ్యే అబలలు 
ముంచెత్తే జలాలు
కపట పొరుగుదేశాలు 
ఓ మంజునాధా ...
read more " కాలజ్ఞానం -8 "

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

బాబు జగజ్జీవన్ రాం జాతకం - అధికార యోగాలు

బాబూ జగజ్జీవన్ రాం 5-4-1908  తేదీన బీహార్లో జన్మించాడు. పేదరికంలో, నిమ్న కులాలలో పుట్టినప్పటికీ జాతకంలో మంచి యోగాలు ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతస్థానాలకు తప్పకుండా  ఎదుగుతాడు అన్న విషయం ఈయన జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మంచి పూర్వకర్మ లేకుంటే ఇటువంటి యోగాలు జాతకంలో ఉండవు. కనుక ఇతనికి మంచి పుణ్యబలం ఉందని అర్ధం చేసుకోవాలి. ఈయనయొక్క జనన సమయం దొరకలేదు. కనుక ముఖ్యమైన గ్రహస్తితులను బట్టి పైపైన చూద్దాం.

ఈయన చైత్రశుక్లపంచమి రోజున, శనివారంనాడు, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. జనన సమయానికి చంద్రుడు గురువు ఉచ్ఛస్తితిలో ఉన్నారు. వారాదిపతి శని, స్వనక్షత్రంలో ఉండి, ఉచ్ఛగురువుయొక్క క్షేత్రంలో  ఉన్నాడు. రాహుకేతువులు మంచిస్తితిలో ఉన్నారు. ఈ గ్రహస్తితులవల్ల జీవితంలో మంచి అభివృద్ధి తప్పక కలుగుతుంది. అలాగే జరిగింది కూడా.

శుక్లపంచమి చాలా మంచితిధి. తిధినిబట్టి ఒక వ్యక్తి జాతకంలోని రవిచంద్రుల  బలాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఇది భారతీయజ్యోతిష్యంలోని ఒక గొప్పసూత్రం. పాశ్చాత్య జ్యోతిష్యంలో ఇటువంటి విధానాలు లేవు. బుధుడు ఉచ్చ గురువుయొక్క నక్షత్రంలో ఉండటం వల్ల,  మంచి విద్య కలిగింది.  ఈ యోగంవల్ల, ఆరోజులలోనే, బెనారెస్ హిందూ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలలో చదివాడు. ఉచ్ఛగురువు యొక్క దృష్టి శని రవుల మీద ఉంది. ఈ యోగం వల్ల, సామాన్యజనానికి సంబంధించిన ధర్మపోరాటం చేస్తాడనీ, ఆ కోణంలో ఉన్నతస్థానాలకు చేరుకుంటాడనీ, అధికార ప్రాప్తి ఉంటుందనీ అర్ధం అవుతుంది. గురుగోచారంలో మూడవ ఆవృత్తిలో కుజచంద్రశుక్రులను తాకినప్పుడు,36ఏళ్ళకే, నెహ్రూమంత్రిమండలిలో అతిచిన్నవయస్కుడైన మంత్రి అయ్యాడు అంటే గురుచంద్రుల ఉచ్ఛస్తితి ఎంత బలీయంగా పనిచేసిందో చూడవచ్చు. దీనికి తోడు రాహుకేతువుల మంచిస్తితి తోడై 30 సంవత్సరాలపాటు కేబినేట్ మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని ఇచ్చింది. ఇది చిన్నాచితకా యోగం కాదు.రాహుకేతువుల మంచి స్తితివల్ల ఈవిధంగా కాలం కలిసివస్తుంది.

రవి శనుల యుతి వల్ల ఆయన అలంకరించిన పదవులన్నీ, లేబర్ , రైల్వే , ఆహారం, వ్యవసాయం,రవాణా ఇత్యాదులయ్యాయి. ఒక మనిషికి వచ్చే పదవులూ,చేసే ఉద్యోగాలూ కూడా జాతకపరంగానే ముందే నిర్ణయింపబడి ఉంటాయి. దానికి భిన్నమైన ఉద్యోగాలూ వృత్తులూ చెయ్యాలని ఆశ ఉన్నా అది వీలుకాదు. ఇది ఎన్నో జాతకాలలో నిరూపితమైంది.

గురువుగారి ఏడో ఆవృత్తిలో కేతువుని తాకినప్పుడు తన  78వ ఏట ఈయన  మరణించాడు. ఒక మనిషి చదివేచదువూ,చేసే వృత్తీ, జీవితంలో ఎదుగుదలా, ముఖ్య సంఘటనలూ, చివరికి మరణం కూడా, ఎలా జరగాలో ముందే నిర్ణయింపబడి ఉంటుంది అని ఎన్నోజాతకాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే,జాతకాన్ని సరిగా డీకోడ్ చెయ్యడం రావాలి.

ఒక మనిషి జాతకం బాగుంటే, అతను ఏ కులంలో,ఏ సామాజిక వర్గంలో, ఎంత అట్టడుగు స్థాయిలో పుట్టినప్పటికీ ఉన్నతస్థానాలకు చేరుకోగలడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే అతని కృషి లేకుండా ఉత్తజాతకమే సరిపోతుందా, తలుపులేసుకుని ఇంట్లో కూచుంటే అన్నీ అవేవచ్చి ఒళ్లో పడతాయా అనే అనుమానం చాలామందికి వస్తుంది. ఈ అనుమానం అర్ధరహితం. జ్యోతిష్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం వల్లే ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. జాతకం బాగా ఉన్నప్పుడు అతనికి ఎదగాలని ఆకాంక్ష, తపన, పట్టుదలలు ఉంటాయి. దానికి తోడు అవకాశాలు కూడా సరైన సమయానికి కలిసి వస్తాయి. తద్వారా త్వరగా ఎదగడం జరుగుతుంది. అంతేగాని ప్రయత్నం లేకుండా ఇంట్లో కూచుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తడుతుందని మాత్రం కాదు. అలాంటివారు అలా కూచోలేరు కూడా. దీనికి భిన్నమైన గ్రహస్తితులు ఉన్నప్పుడు జీవితం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. అలాటి వారికి ఎదగాలని తపన ఉండదు. ఒకవేళ ఉన్నా కాలం కలిసిరాదు.

ఉన్నతస్థానాలకు ఎదిగిన వారి జాతకంలో, అటువంటి ఎదుగుదలను చూపే గ్రహస్తితులు తప్పకుండా ఉంటాయి. బాబూ జగజ్జీవన్ రాం జాతకం కూడా దీనికి నిదర్శనమే.
read more " బాబు జగజ్జీవన్ రాం జాతకం - అధికార యోగాలు "

1, ఏప్రిల్ 2012, ఆదివారం

బ్లాగు క్వాలిటీ -ఆధ్యాత్మిక సందేహాలు.

నిన్న ఒక మిత్రురాలు ఫోన్ చేసింది. 
'మీరేమనుకోక పోతే ఒక విషయం చెప్తా' అంది.
'చెప్పండి' అన్నాను. 
'మీ బ్లాగు గురించి మాట్లాడాలి' అంది.
'పర్లేదు చెప్పండి' అన్నాను.
'ఏమీ లేదు. మీ బ్లాగులో క్వాలిటీ తగ్గింది. మొదట్లో మంచి డెప్త్ ఉన్న పోస్ట్ లు వ్రాసేవారు. రాన్రాను వాటిల్లో డెప్త్ తగ్గుతూ వస్తున్నది. గమనించారా?' అడిగింది.
'డెప్త్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి?' అడిగాను.
'అంటే,మంచి స్పిరిట్యువల్ డెప్త్ ఉన్న పోస్ట్ లు ఇంతకూ ముందు వ్రాసేవారు. ఇప్పుడు వ్రాయడం తగ్గించారు. అవునా?'
'మీరు సరిగ్గానే గమనించారు. అది నిజమే.' అన్నాను.
'ఎందుకలా చేస్తున్నారు. ఇలా చెయ్యడం బాలేదు.' అవతలనుంచి ప్రశ్న.
'చదువరులకు ఆకలి ఉందేమో అని ఇంతకు ముందు మంచి ఆహారం వండి పెట్టెవాణ్ని. అది సరైన విధానం కాదు అని తెలుసుకున్నాను. అందుకే వంటలో మార్పు చేసాను.' అన్నా.
'మరి ఈ మార్పు మీ అభిమానులకు బాధ కలిగిస్తోంది. మేం మీ నుంచి ఇంకా మంచి మంచి ఆధ్యాత్మిక పోస్ట్ లు కోరుకుంటున్నాం.' చెప్పింది.
'కుదరదు. మీ కోరిక నేను తీర్చలేను' చెప్పాను.
'ఎందుకో తెలుసుకోవచ్చా.' అటునుంచి ప్రశ్న.
'ఎందుకంటే,మొదటిగా మీలో ఎవరికేం కావాలో నాకు తెలియదు. రెండవదిగా, ఆధ్యాత్మికత అనేది ఊరకే చదివి ఆనందించే విషయం కాదు. మూడవదిగా, నిత్యమౌనులముందు ఊరకే వాగుతూ ఉండటానికి నేను హరికధాభాగవతార్ని కాను. నాలుగవదిగా,మీరు పంచవటి మెంబర్ అయితే అక్కడ అడగండి.మీ సందేహం తీరుస్తాను.' చెప్పాను.
'ఇవేవీ కాకుండా మరేం చెయ్యాలి.' అడిగింది.
'ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా. మీరేం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అడగండి. చెప్తాను' అన్నాను.
'అలా అయితే అది పర్సనల్ ఇంటరాక్షన్ అవుతుంది. ఇలా కాకుండా బ్లాగులోనే మీరు మంచి మంచి పోస్ట్ లు వ్రాయవచ్చు కదా.' అడిగింది.
'దానికి జవాబు ఇందాకే ఇచ్చానుకదా.నిజమైన ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతంగా మాట్లాడి తెలుసుకోవడం ద్వారానే అర్ధమౌతుంది. పైగా ఆధ్యాత్మికత అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. వ్యాసాలలో అయితే జెనెరల్ గా మాత్రమే మనం వ్రాయగలం.అది ఊహాజనితం.దానికంటే,మీ వ్యక్తిగత ఆలోచనలు సందేహాలు అడిగి తెలుసుకోడమే మంచిది.నిజమైన ఆధ్యాత్మికత మీరంటున్న పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారానే వస్తుంది.' అన్నాను.


నా జవాబు ఆమెకు నచ్చినట్లు అనిపించలేదు. కానీ,అంతకంటే నేను చెయ్యగలిగిందీ లేదు. సత్యాన్ని చెప్పడంవరకే నావంతు. ఒకరి మెప్పు కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పడం నా పని కాదు.

చాలామందితో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళ మనసులో ఉన్న విషయం మనం కనిపెట్టి దానికి జవాబు చెప్పాలని కోరుకుంటారు. బయటపడి అడిగితే ఏదో తక్కువ అయినట్లు, ఏదో పోగొట్టుకున్నట్లు, చులకన అయినట్లు బాధపడతారు. అలా దాక్కుని ఆధ్యాత్మికసందేహాలు తీర్చుకుందామని చూడటం మంచిపద్దతి కాదు. అవి అలా తీరేవీ కావు. అడిగితే మనం చులకన అవుతామేమో అని బాధపడేవాళ్ళు ఆధ్యాత్మికతకు పనికిరారు. వాళ్ళు మానసికంగా ఇంకా చాలా ఎదగవలసి ఉంటుంది. ఆవిధమైన మానసికచట్రం నుంచి వారు బయటకు రావలసి ఉంటుంది.

పత్రికలలో, టీవీలలో, 'సందేహాలు-సమాధానాలు' శీర్షికల ద్వారా కొందరు ఏవేవో అడుగుతూ ఉంటారు. చెప్పేవాళ్ళు వారికి జవాబులు చెబుతూ ఉంటారు. కొన్ని పత్రికలలో యాజమాన్యమే కల్పించి ఆ ప్రశ్నలు వ్రాస్తారని కూడా అంటారు. ఉదాహరణకి 'సీత రాముని కంటే పెద్దదా?, 'హరిశ్చంద్రుని తల్లిదండ్రులెవరు?'' ఇలాటివి. ఇవన్నీ నాకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. 


సీత రామునికంటే పెద్దదైనా చిన్నదైనా మనకు ఒరిగేదేమీలేదు. హరిశ్చంద్రుని తల్లిదండ్రులేవరో తెలిసినంత మాత్రాన మనకు ఆధ్యాత్మికంగా ఒక్క అడుగుకూడా ముందుకుపడదు.ఇలాటివన్నీ,ప్రయాణాలలో తోచక ఒకరికొకరు చెప్పుకునే కాలక్షేపం కబుర్ల వంటివి.  ఎవరి మజిలీ వచ్చిన తర్వాత వారు దిగిపోతారు. తర్వాత ఒకరికొకరు అసలు గుర్తుకూడా ఉండరు. ఈ సందేహాలూ సమాధానాలూ ఇలాంటివే. వాటివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఇవి ఆధ్యాత్మికసందేహాలు కానేకావు.


అసలు ఆద్యాత్మికసందేహాలు ఆలోచనాస్థాయిలో తీరేవి కావు. నిజమైన ఆధ్యాత్మిక సందేహాలు అనుభవస్థాయికి చెందినవి. సరైన అంతరిక అనుభవంతోనే అవి తీరుతాయి. అనుభవం సాధనద్వారా మాత్రమె కలుగుతుంది. అది చెయ్యకుండా ఉత్త ఊహాజనిత సందేహాలు, పుస్తకాలు చదవడంవల్ల వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండటంవల్ల ఏమీ ఫలితం ఉండదు. ఉత్త కాలక్షేపం మాత్రం జరుగుతుంది. మహా అయితే 'అహం' ఇంకా పెరుగుతుంది.

బౌద్ధికస్థాయిలో వచ్చే సందేహాలు, ఊహాజనిత సందేహాలు, ఆధ్యాత్మికమైనవి కావని, జెనెరల్ గా వ్రాసిన వ్రాతలవల్ల వ్యక్తిగత సందేహాలు తీరవనీ మనం గుర్తుంచుకోవాలి.
read more " బ్లాగు క్వాలిటీ -ఆధ్యాత్మిక సందేహాలు. "

31, మార్చి 2012, శనివారం

డిల్లీ విశేషాలు

రెండురోజులు డిల్లీలో నివాసం.ఉన్న కొద్దిసమయంలోనే ముఖ్యమైన ప్రదేశాలు చూడటం. ఇరవైఏళ్ల క్రితం సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఒక వారం అక్కడ ఉన్నాను. ఆ తర్వాత కొన్నిసార్లు వెళ్ళినా పని చూచుకొని వెంటనే బయలుదేరి రావడం జరిగేది. ఈసారి కూడా, కుతుబ్ మీనార్, లోటస్ టెంపుల్, ఎర్రకోట, పార్లమెంట్, ఇండియాగేట్, రాజఘాట్ లాంటి కొన్ని మాత్రమె చూడగలిగాను. కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్, సరోజినీమార్కెట్ లాంటి కొన్నిచోట్ల షాపింగ్ చెయ్యడంతో ఉన్న కాస్త సమయం అయిపొయింది. మళ్ళీ తిరుగు ప్రయాణం. అక్షరధామ్ చూడటం కుదరలేదు.  



డిల్లీ వెళితే సాగర్ పబ్లికేషన్స్, రంజన్ పబ్లికేషన్స్ కి వెళ్లి ఒక సంచినిండా పుస్తకాలు కొనడమూ అవి మొయ్యలేక నాతో వచ్చినవాళ్ళు విసుక్కోవడమూ, ప్రయాణం పొడుగూతా ఆ పుస్తకాలు తిరగెయ్యటమూ,గమ్యం చేరేలోపు అవన్నీ చదివేయ్యడమూ,మామూలుగా జరుగుతుంది. కానీ ఈసారి అటువైపు వెళ్ళే సమయం చిక్కలేదు. అందువల్ల సమయమూ డబ్బూ ఆదా అయ్యాయి. నాతో వచ్చిన వాళ్లకు విసుగూ తప్పింది. 


పంచవటి సభ్యుడూ తెలుగు బ్లాగర్లకు సుపరిచితుడూ 'విట్రియల్'. పాపం నేనున్న చోటికి వెతుక్కుంటూ వచ్చి మరీ కాసేపు మాట్లాడాడు. ఆయనా పనుల్లో బిజీగా ఉన్నాడు. నేనూ ఊరు తిరిగే పనిలో ఉన్నాను. కనుక మాట్లాడుకునే సమయం పెద్దగా చిక్కలేదు.'వ్రాతలను బట్టి మనిషిని ఎప్పుడూ అంచనా వెయ్యకూడదు అని నేనెప్పుడూ మా స్టాఫ్  కి చెబుతూ ఉంటాను. ఎందుకంటే మనం చెప్పాలనుకున్నది మన వ్రాతద్వారా పూర్తి సరిగ్గా ఎదుటివారికి చెప్పలేము. అందువల్ల చదివేవారికి మనమీద కలిగే అభిప్రాయం సరిగ్గా ఉండదు.మిమ్మల్ని చూచాక  నా ఆలోచన నిజం అనిపిస్తోంది'. అన్నాడు. నా వ్రాతలను బట్టి నేనొక రాక్షసున్నై ఉంటానని ఆయన ఊహించాడేమో అనిపించి నాకు నవ్వొచ్చింది.


మాటల సందర్భంలో ఒక జాతకం చర్చకు వచ్చింది. వివాహవిషయం. కర్కాటక లగ్నంలో రవిశనులు ఉన్నారు. ఈ గ్రహస్తితి చూస్తూనే, 'వీరి నాన్నగారికీ ఈయనకూ భేదాభిప్రాయాల వల్ల సంబంధాలు ఆలస్యం అవుతున్నాయా?' అని అడిగాను. 'నిజమే' అని చెప్పాడు. ఇందువల్లనే కొన్ని సంబంధాలు ఆఖరి నిముషంలో కేన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే అనుమానం నవమంలోని కేతువువల్ల తనకూ వచ్చింది. ఈవిధంగా జాతకంలో ఒకదానికోకటి సాయం చేసుకునే గ్రహగతులుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే విషయం చక్కగా అర్ధం చేసుకోవచ్చు. సరైన పరిహారక్రియల ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చు కూడా.




మెట్రో రైల్ ఎలా పని చేస్తున్నదో చూద్దామని వెళ్ళాను. నేను బస చేసిన ద్వారకా-13 సెక్టార్ కు దగ్గరలోనే మెట్రో స్టేషన్ ఉంది. ఒకసారి ఆ మూలనించి ఈ మూలకు రైల్లో ప్రయాణం చేసి దాని పనితీరు ఎలా ఉందో గమనించాను. దానితో బాటు మనుషుల తీరుతెన్నులూ, పోకడలూ కూడా గమనించాను.హైస్కూల్ వయసునుంచీ ప్రేమలూ,ఎక్కడ చూచినా కుర్రజంటలూ కనిపించాయి. ప్రతి స్టేషన్ లోనూ ఇదే వరస. రైల్లోనూ ఇదే వరస. ఒంటరిగా ఖాళీగా ఉన్న అమ్మాయిలూ అబ్బాయిలూ తక్కువగా కనిపించారు. పక్కన మనుషులున్నారు మనం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాం అన్న ధ్యాస కూడా వీరిలో కనిపించలేదు. డిల్లీలో నేరాలూ ఎక్కువే. మనుషులలో దురుసుతనం బాగా ఎక్కువ. పనీ పాటా చేసేవాళ్ళూ, చిన్న చితకా వ్యాపారాలూ, పనులూ చేసేవాల్లందరూ రాజస్థాన్ నుంచీ, హర్యానా నుంచీ వచ్చినవాళ్ళు. ఊరంతా కార్ల మాయం. ఒక ఇంటికి కనీసం నాలుగు కార్లున్నాయి. పార్కింగ్ కి చాలా ఇబ్బంది.మెట్రో రైల్ పుణ్యమాని బస్సులూ పొగా లేవు. కాని ఊరంతా జనారణ్యం లాగా కనిపించింది. జనమంతా ఒకటే ఉరుకులు పరుగులు. జీవనపోరాటంలో ప్రతివాడూ ఒక సైనికుడి లాగా పోరాడుతున్నాడు. పొట్టతిప్పలకే జీవితంలో ఎక్కువభాగం అయిపోయేటట్లు  కనిపించింది. 

నేనక్కడ ఉన్నరోజునే ఒక ఘోరం జరిగిందని పేపర్లు కోడై కూశాయి. ఒకమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో ఊరంతా తిప్పుతూ ఏడుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత ఆ అమ్మాయిని ఎక్కడో రోడ్డు పక్కన పడేసి  వెళ్ళిపోయారు.వాళ్ళంతా బాగా డబ్బున్న కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలు. అంతా పాతికేళ్ళ లోపున్నవాళ్ళు. రెండో రోజే డిల్లీ పోలీసులు వాళ్ళని పట్టేశారు.డబ్బు ఎక్కువైతే మనిషి బుద్ధి ఎంత వెర్రి వేషాలు వేస్తుందో వీళ్ళు నిరూపిస్తున్నారు. పెద్దలుకూడా అడ్డగోలుగా డబ్బు సంపాదించి పిల్లలకు సౌకర్యాలు సమకూర్చడమే గొప్ప అనుకుంటున్నారు గాని వారికి సంస్కారం నేర్పాలన్న జ్ఞానం వీరికి ఉండటం లేదు. దానికి తోడూ చిన్నప్పుడే సెల్ ఫోనూ, నెట్టూ, టీవీ ప్రభావమూ, స్నేహాలూ, చేతిలో డబ్బూ అన్నీ కలిసి యువనేరస్తులు పుట్టుకొస్తున్నారు. నేను చూచిన ప్రదేశాలలో ఎక్కడా ఆధ్యాత్మిక స్పందనలు అస్సలు లేవు. అంతా కామకాంచనాలమయంగా కనిపించింది.ఎవరి 'ఆరా' చూచినా ఈ రెండే ఆలోచనలు కనిపించాయి. అమ్మాయిలయితే మరీ ఘోరం. వాళ్ళు పుట్టిందే ఎక్స్ పోజింగ్ చెయ్యడానికా అన్నట్లు ఉంది ప్రతివారి వేషమూ. ఇలాంటి  కిడ్నాప్  గ్యాంగులూ, క్రిమినల్సూ నాకొక్కసారి తగిల్తే బాగుండు నేర్చుకున్న విద్యకు సార్ధకత కలుగుతుంది అని చాలాసార్లు అనుకుంటాను. ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే మార్షల్ ఆర్ట్స్ వాడే అవకాశం ఒకటి రెండుసార్లు కలిగింది. తర్వాత చేతులూ కాళ్ళూ తుప్పుపట్టి పోతున్నాయి. ఇదే మాట మా ఫ్రెండ్ తో అంటే, 'నువ్వు అమ్మాయివి కావుగా, నీకా చాన్స్ లేదు' అంటాడు నవ్వుతూ.

కుతుబ్ మీనార్లో ఉన్న ప్రాచీన కట్టడాలు పరికిస్తే ఒక విషయం గోచరిస్తుంది. అక్కడ హిందూ సాంప్రదాయ శిల్పరీతులున్న మంటపాలు చాలా కనిపిస్తాయి. వాటిపక్కనే తర్వాత ముస్లింశిల్ప రీతులతో కట్టిన బురుజులూ దర్వాజాలూ కనిపిస్తాయి.హిందూ కట్టడాలు అతి ప్రాచీనమైనవని చూస్తేనే అర్ధమైతుంది. అదొక విష్ణుదేవాలయం, లేదా శివాలయం అయ్యి ఉంటుందని నాకు అనిపించింది. తురక రాజులు హిందూ దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని జయించినప్పుడు ఇక్కడ ఒక్కొక్క దర్వాజా కట్టించారు. బానిసవంశపు రాజుల సమాధులూ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళలో మొదటి రాజు అల్తమష్ సమాధి ఉంది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ  సమాధి చూచినప్పుడు సివిల్ సర్వీస్ మెయిన్స్ లో ఆన్సర్ చేసిన 'అల్లా ఉద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు' ప్రశ్న గుర్తొచ్చింది.



లోటస్ టెంపుల్ లో ఏమీ లేదు. బహై గ్రూపు వాళ్ళ సిద్ధాంతాలు కొన్ని చెప్పే వాలంటీర్లు అక్కడ ఉన్నారు. అవి వాళ్లకు ప్రత్యేకంగా కనిపిస్తాయేమో గాని నాకు వాటిల్లో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు.వాళ్ళు ఊరకే బట్టీపట్టి అప్పచెబుతున్నట్లుగా నాకు అనిపించింది.హిందూమతాన్ని సరిగ్గా కూలంకషంగా అర్ధం చేసుకుంటే, ఇక ప్రపంచంలోని ఏ మతంలోనూ, ఏ సంప్రదాయంలోనూ, కొత్తదనం ఏమీ కనిపించదు. అంతటి విశాలపరిధి, అంతటి లోతూ మన మతానికి ఉంది. కాని దానిని అర్ధం చేసుకునే వారు హిందూమతంలో కూడా అరుదుగా ఉన్నారు. లోటస్ టెంపుల్లో ఉన్నంతసేపూ ఒక చర్చిలోకి వెళ్లి కాసేపు కూర్చొని వచ్చినట్లు అనిపించింది. అంతేగాని అక్కడ ఆధ్యాత్మికస్పందనలు ఏమీ లేవు.  

ఎర్రకోట మొత్తం తిరిగి చూడాలంటే ఒక పూట పడుతుంది. అక్కడ ఉన్న ఒక భవనం చూస్తే  చాలు విసుగు పుడుతుంది.అన్నీ అలాగే ఉంటాయి. ముస్లిం శిల్పకళలో ఉన్నపెద్ద లోపం అదే. అందులో పెద్ద శిల్ప చాతుర్యమూ అచ్చెరువు గొలిపే నైపుణ్యమూ ఉండవు. ఏదో పేలవంగా డ్రైగా ఉన్నట్లు అనిపిస్తుంది. విగ్రహాలూ జంతువుల బొమ్మలూ ఇతరత్రా అన్ని శిల్పాలూ ఈ రీతిలో నిషేధం. కొంతలో కొంత లతలు మాత్రమె చేక్కనిస్తారు. క్రూరమైన మతపుచట్రంలో కళ వికసించడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎర్రకోట బయట అంతా చెత్తాచెదారమూ తినిపారేశిన కాయితాలూ, ప్లాస్టిక్ కవర్లూ  దరిద్రంగా ఉంది. కనీసం పర్యాటకస్థలాలలో కూడా పరిశుభ్రత లేకపోతే ఎలా? 

పరిశుభ్రత పాటించడం అంటే మనకు అస్సలు పడదు అని మళ్ళీ రుజువైంది. 'ఇండియాగేట్' పార్లమెంట్ కు అతి దగ్గరలో ఉంది. అక్కడికి విదేశీ యాత్రికులు ఎందఱో వస్తుంటారు. అక్కడ మేయిన్టేనేన్స్ మాత్రం ఘోరంగా ఉంది. ఒక 'డీ' క్లాస్ పార్కులో అంతకంటే మంచి పరిశుభ్రత ఉంటుంది. నీళ్ళన్నీ మడుగుకట్టి ఒక మురికికాలవలాగా అక్కడ తయారై ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అదిచూచి కొందరు విదేశీయులు ఎగతాళిగా నవ్వుకోడం గమనించాను. మనసు చివుక్కుమంది. ఊరిచివరనున్న 'స్లం' ఏరియాలు బాగుచెయ్యడం ఎలాగూ మనకు రాదు. దేశ రాజధాని నడిబొడ్డునకూడా పరిశుభ్రత లేకపోతే ఎలా? డిల్లీ మున్సిపల్ యంత్రాంగం ఏమి చేస్తోందో మరి? కనీసం పబ్లిక్ ప్రదేశాలలో ఖచ్చితమైన పరిశుభ్రత పాటించేలా ముందు మన దేశం మారాలి. ఈ కోణాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

హజరత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా చూద్దామని అనుకున్నాను కాని కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెళ్లిరావాలి. నేను కాలేజీ రోజుల్లో సూఫీతత్వాన్ని బాగా చదివాను. అందుకే కొందరు సూఫీ సాదువులంటే నాకు చాలాఇష్టం. కరుడుగట్టిన ఎడారిలాంటి ఇస్లాంమతంలో సూఫీ సాధువులు ఒయాసిస్సుల వంటివారు. విశాలభావాలూ ప్రేమతత్వమూ వారి విధానాలు. కనుక హిందువులకు వీరు నచ్చుతారు.

మొత్తమ్మీద డిల్లీలాంటి ఉరుకులు పరుగులతో నిండిన ఇంద్రియభోగపూరిత జనారణ్య ప్రదేశాలు మనకు నప్పవు అని అతిత్వరలోనే అర్ధం అయింది. ఇంకో రెండు రోజులు అక్కడ ఉంటె పిచ్చి పుట్టేటట్లు అనిపించింది. చూచింది చాల్లే అనుకోని తిరుగుప్రయాణం మొదలు పెట్టాము.
read more " డిల్లీ విశేషాలు "

29, మార్చి 2012, గురువారం

కాలజ్ఞానం - 7

అధికార వర్గాలపై అవినీతి ప్రభావం
ఉన్నత స్థాయిలలో లుకలుకలు
దిక్కుతోచని రాజుల మల్లగుల్లాలు
మొయ్యలేని ముళ్ళ కిరీటాలు 
మనం పెంచి పోషించిన అవినీతి
మనల్నే మింగబోతుంది
అధికారవర్గాలకు గండం ఈరోజు
అనైతిక సమావేశాలు
మత గురువులకూ తప్పవు తిప్పలు
విధికి అతీతులెవ్వరు?   


read more " కాలజ్ఞానం - 7 "