5, నవంబర్ 2010, శుక్రవారం

సర్దార్ పటేల్ జాతకం-- జనన కాల సంస్కరణ

రాజకీయాలను నేను ఏ మాత్రం ఇష్టపడను. దానికి కారణం విలువలు లేని రాజకీయ నాయకులతో ప్రస్తుతం ఆ రంగం నిండిపోవటమే.

నా అభిమాన రాజకీయ నాయకులు ఎవరు అని అడిగితె ఇద్దరు ముగ్గురి పేర్లు మాత్రమెచెప్పగలను. వారూ ఇప్పటివారు కారు. ఇప్పుడు లేరు. వారిలో ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ను నేను అమితంగా అభిమానిస్తాను. గౌరవిస్తాను. ఆయనలాటి ధృఢచిత్తం, దూరదృష్టీ ఉన్న నాయకులు ఇప్పుడు మన దేశానికి చాలా అవసరం.నేను గుజరాత్ లోని సోమనాధ ఆలయానికి వెళ్ళినపుడు ఆలయం లోని ఈశ్వరునికి ఎలా నమస్కరించానో అంతే భక్తిగా ఆలయం బయట ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికీ నమస్కరించాను. ఆయన ప్రధాని అయినట్లయితే మన దేశ రూపురేఖలు ఇలా ఉండేవి కావని ఎంతో బాగుండేవని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని.

ఆయన జాతకాన్ని ఇక్క చూద్దాం. ఆయన యొక్క అసలైన జనన వివరాలు లేవని అందరూ అంటున్నారు. ప్రముఖ జ్యోతిష్కులైన కే ఎన్ రావుగారు కూడా ఇదే అభిప్రాయ పడ్డారు. కాని చాలా మంది అభిప్రాయం ప్రకారం ఆయన 31-10-1875 న గుజరాత్ లోని నాదియాడ్ అనే ఊళ్ళో జన్మించారు. జనన సమయం తెలీదు కనుక ఆయన జన్మ లగ్నాన్ని జ్యోతిష్కులు రకరకాలుగా ఊహించారు. పట్టుదలకు ప్రతిరూపం అయిన మకర లగ్నాన్ని చివరకు ఖాయం చేశారు. ఆది సమంజసంగా ఉంటుంది కూడా. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇచ్చాను. దీనిని నేను కొంచెం ఫైన్ ట్యూన్ చేశాను. అదెలా చేశానో ఆ వివరాలు చూధ్ధాం.

ఆ రోజున మకర లగ్నం 12.15 నుంచి 14.03 గంటలవరకూ ఉంది. ఈ రెండు గంటల సమయంలో ఆయన యొక్క జనన నిముషాన్ని మనం కనిపెట్టాలి. దీనికి ప్రశ్న శాస్త్ర సహాయం తీసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం నేను వేసిన ప్రశ్న చక్రంలో రూలింగ్ ప్లానెట్స్ ఇలా వచ్చాయి.

లగ్నాధిపతి= గురువు
లగ్న నక్షత్రాధిపతి= శని
చంద్రాధిపతి= రవి
చంద్ర నక్షత్రాధిపతి= కేతువు
వారాధిపతి= చంద్రుడు
హోరాధిపతి= గురువు

శని చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. వారాధిపతి చంద్రుడు. కనుక చంద్రుడు రెండు సార్లు వచ్చాడు. గురువు కూడా రెండు సార్లు వచ్చాడు. కనుక వీరిద్దరూ రూలింగ్ ప్లానెట్స్ గా ఉన్నారు. రవి, కేతువులు రాహు నక్షత్రంలో ఉన్నారు. కనుక ఆయన జాతకంలో రాహు కేతువుల యోగం ఏదో ఉండి ఉండాలి. దీనికి సరిపోతూ ఆయన జాతకంలో కాలసర్ప యోగం ఉన్నది.

గురువు ప్రస్తుతం సున్నా డిగ్రీలలో బలహీనుడుగా ఉన్నాడు. మకర లగ్నం గురువుకు నీచ కనుక ఆ కారకత్వం ఇలా సరిపోయి మకర లగ్నాన్ని క్రరెక్ట్ గా సూచిస్తున్నది. కనుక అందులో చంద్ర నక్షత్రమైన శ్రవణం ఆయన లగ్న నక్షత్రమై ఉండాలి. ఆ శ్రవణం మకరంలో నాలుగో పాదం నుంచీ ఏడోపాదం వరకూ ఉంటుంది. ఆ సమయం మధ్యాహ్నం 12.55 నుంచి 13.40 వరకూ ఉంది. ఇప్పుడు రెండు గంటల సమయాన్నించి దాదాపు ఒక గంట సమయం మనకు కుదించబడింది. అందులోకూడా 13.09 కి దశాంశ లగ్నం మకరం అయ్యింది. దశాంశలో కూడా మకరంలో ఉచ్ఛస్థితిలోఉన్న కుజుడున్నాడు. ఈయన జాతకంలో ఉఛ్ఛస్థితిలో ఉన్న కుజుడు ప్రముఖపాత్ర వహిస్తున్నాడు. ఈయన జనన సమయం కూడా కుజహోరలోనే జరిగింది.

ఈ సమయానికి ఆయన జాతకం లోని మరికొన్ని వివరాలు సరిపోతాయా లేదా చూద్ధాం. ఈసమయానికి నవాంశ లగ్నం వృషభం అయ్యింది. అందులో శుక్ర కేతువులున్నారు. కనుక ఈయన భార్య ఒక దీర్ఘవ్యాధితో మరణించి ఉండాలి. ఈ సమయానికి వచ్చిన దశల ప్రకారం 1909 లో భార్య కేన్సర్ వ్యాధితో మరణించింది. అప్పుడు ఈయనకు కేతు/శని/శుక్ర దశ జరుగుతున్నది. కనుక ఈ సమయం సరిగానే ఉన్నది.

ఇకపోతే
దశాంశనుబట్టి ఈ సమయానికి ఇతర జీవిత వివరాలు చూద్దాం. 1917 లో ఆయన అహమదాబాద్ శానిటరీ కమిషనర్ గాఎన్నికయ్యాడు. అప్పుడు ఆయనకు శుక్ర/కుజ దశ జరుగుతున్నది. ఉచ్చ స్తితిలోని కుజ అంతర్దశ యోగించింది.

1947 నుంచి ఆయనకు కుజమహాదశ మొదలైంది. సెప్టెంబర్ 1948 లో ఆపరేషన్ పోలోను ధైర్యంగా అమలు జరిపి సంస్థానాలను విలీనం చేశాడు. అప్పుడు ఆయన జాతకంలో కుజ/గురు దశ జరుగుతున్నది. కుజుడు ఉఛ్ఛ స్థితిలోనూ గురువు మేషంలో చతుర్ధంలోనూ ఉండి ఈ సంఘటనను సూచిస్తున్నారు.

ఈయన కుజ/బుధ/శుక్ర దశలో డిసెంబర్ పదిహేనో తేదీన 1950 లో మరణించారు. చంద్రుని నుంచి కుజుడు ఆయుస్థానంలో ఉన్నాడు. బుధ శుక్రులు ద్వాదశంలో ఉన్నారు. చంద్రలగ్నానికి ఇద్దరూ మారకులే. కనుక అంతా సరిపోయింది.

ఈ సమయానికి ఆయన జనన నక్షత్రం అనూరాధ రెండవపాదం వచ్చింది. కుందస్ఫుటం ప్రకారం ఉత్తరాభాద్ర రెండవపాదం గా వచ్చి జనన సమయం సరియైనదే అని చూపిస్తున్నది.

ఈ విధంగా ఆయన జనన సమయాన్ని 13.09.05 గా నిర్ణయించాను.

మిగిలిన ఆయన జీవిత వివరాలు తరువాత పోస్ట్ లో చూధ్ధాం.
read more " సర్దార్ పటేల్ జాతకం-- జనన కాల సంస్కరణ "

4, నవంబర్ 2010, గురువారం

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగ పర్వదినాన "ఆలోచనా తరంగాలు" బ్లాగు సభ్యులకు, చదువరులకు, తోటి తెలుగుబ్లాగర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరి హృదయాలలో దివ్య దీపాలు వెలగాలి. అజ్ఞాన తిమిరాలు పోవాలి. ఆనందపు జ్యోతులు విరజిమ్మాలి అని ఆకాంక్షిస్తున్నాను.
read more " దీపావళి శుభాకాంక్షలు "

31, అక్టోబర్ 2010, ఆదివారం

ఉచ్చాటన క్రియ పనిచేస్తుందా?

తాంత్రిక క్రియల్లో ఒకటైన ఉచ్చాటన క్రియకు నిత్యజీవితాలలో జరిగిన కొన్ని ఉదాహరణలు చూద్దామా.

>>పాము మంత్రం వేసేవాళ్ళు మంత్రించిన ఇసుకను ఇంటి చుట్టూ పొయ్యమంటారు. ఇసుకను దాటి సర్పాలు లోపలికి రాలేవు. అక్కడి దాకా వచ్చి వెనక్కు వెళ్ళిపోతాయి. ఇది నిజంగా జరుగుతుంది. పాము మంత్ర సిధ్ది నిజంగా ఉన్నవాళ్ళు ఇది చేసినప్పుడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది ఒక రకమైన ఉచ్చాటన క్రియే. కాని పాము మంత్రగాళ్లమని చెప్పుకునే వారందరికీ నిజమైన మంత్ర సిద్ది ఉండదు. నిజమైన సిద్ధి ఉన్నవారు ఇదిచేస్తే చక్కగా జరుగుతుంది.

>>ప్రేతాత్మలను మనిషి నుంచి వదిలించటమూ (exorcism), భూతగృహం (haunted house) నుంచి దురాత్మను వెళ్లగొట్టే పద్ఢతులూ కూడా ఉచ్చాటన క్రియలే. మహనీయులు సంకల్ప మాత్రం చేత వీటిని చెయ్యగలుగుతారు. మామూలు సాధకులు అయితే ఆ క్రియా విధానం ప్రయోగించి కష్టపడవలసి వస్తుంది. ఆ క్రమంలో కొన్నిసార్లు శక్తి చాలకపోతే ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది కూడా.

>>ఒక భూతపీడితుడైన మనిషి నుంచి ప్రేతాత్మలను జీసస్ తన యోగశక్తితో వెళ్లగొడితే అవి అక్కడే ఉన్న పందుల గుంపులో ప్రవేశించగా, ఆ పందులన్నీ పిచ్చిపిచ్చిగా పరిగెత్తి సముద్రంలో దూకి చచ్చాయని బైబుల్ లో ఉంది. అతను అనేక ఆత్మలచేత ఆవేశించబడిన దురదృష్టవంతుడు. ఇది ఉచ్చాటన క్రియనే.

>>షిరిడీ ఊరిలో కలరా మహమ్మారి ప్రబలుతున్నపుడు బాబా స్వయంగా తిరగలితో పిండి విసిరి ఆ పిండిని దుష్ట శక్తులకు ఆహారంగా విసురుతున్నట్లుగా చేస్తూ ఊరంతా చల్లాడని, తత్ఫలితంగా కలరా ఆ ఊరిని తాకలేదనీ ఆయన జీవిత చరిత్రలో వ్రాసి ఉంది. ఇదీ ఒకరకమైన ఉచ్చాటన క్రియనే.

>>గౌతమబుద్ధుని వద్దకు ఒక ప్రేతాత్మ ఆవేశించిన వ్యక్తిని తీసుకురాగా, ఆయన తన శక్తితో దానిని ఆ వ్యక్తి నుంచి వెళ్లగొట్టినపుడు, ఆ ఆత్మ పోతూ పోతూ తాను పోతున్నందుకు నిదర్శనంగా పక్కనున్న చెట్టుకొమ్మను పేళ్ళున విరిచి వెళ్ళిపోయిందని బుద్దుని జీవితం లో ఉంది. ఇదీ ఉచ్చాటన క్రియే.

>>శ్రీరామకృష్ణుని జీవితంలో ఒక సంఘటన. ఆయన చివరిరోజులలో కాశీపూర్ గార్డెన్ హౌస్ లో ఉన్నపుడు, ఆ ఇంటి ఆవరణలో ఒక మూలన ఉన్న ఈత చెట్టువద్ద
తన శిష్యులను కాటేయటానికి పొంచి ఉన్న విషసర్పాన్ని అక్కడనుంచి పొమ్మని ఆదేశించి దానిని వెళ్లగొట్టాడు. ఇదీ ఒక రకమైన ఉచ్చాటన క్రియనే.

>>తన చెల్లెలి వెంట పడుతున్న ఒక వ్యక్తి బారినుంచి తన చెల్లెలిని కాపాడమని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అతనికి ఈ క్రియ ఎలా చెయ్యాలో చెప్పాను. అతను దాన్ని తూచా తప్పకుండా ఆచరించాడు. దాని ఫలితంగా ఆ యువకుడు హఠాత్తుగా ఆ ఊరినుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత మళ్లీ ఆ అమ్మాయివైపు చూడలేదు.

>>> ఒక ఆఫీసర్ తన క్రింది ఉద్యోగి అయిన నా మిత్రుని అనవసరంగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. నా మిత్రుడు తట్టుకోలేని స్థితిలో నన్ను సంప్రదించాడు. అతనికి ఈ క్రియ ఎలా చెయ్యాలో చెప్పాను. దాని ఫలితంగా ఆ ఆఫీసర్ ఉన్నట్టుండి ఒక కేసులో ఇరుక్కుని ట్రాన్స్ ఫర్ కాబడి ఆ ఊరినుంచి వెళ్ళిపోయాడు. సామాన్యంగా టర్మ్ పూర్తికాకుండా అలా ట్రాన్స్ ఫర్ కావటం జరుగదు.

>>>ఒకసారి నేను నడుస్తూ వెళుతుంటే ఒక బర్రె కొమ్ములు విసురుతూ నాకే ఎదురొచ్చింది. నెను దానిపైన ఉచ్చాటనక్రియను మౌనంగా ప్రయోగించాను. విచిత్రంగా ఆ బర్రె సడన్ గా ఆగిపోయి ఎవరో తరుముతున్నట్లు వేరే దిక్కులో పారిపోయింది.

>>>కావ్యకంఠ గణపతి ముని జీవితంలో జరిగిన సంఘటన. ఆయన కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక పొలంలో తన శిష్యులతోకూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. వారి చుట్టూ ఉన్న గడ్డివాములను మంటలు ఆక్రమించి వాళ్ళు తగలబడే పరిస్థితి వచ్చింది. అప్పుడాయన ఒక వైదిక మంత్రాన్ని ప్రయోగించగా హఠాత్తుగా సుడిగాలి చెలరేగి గడ్డివాములను దూరంగా చెదరగొట్టింది. వైదిక మంత్రాలకున్న శక్తిని ఆయన ఆ విధంగా చూపించాడు. ఇదీ ఉచ్చాటనా క్రియనే.

>>>వదలకుండా తనను వేధిస్తున్న ఒక ఆలోచన (obsessive thought) గురించి అరవిందులకు ఒక శిష్యుడు వివరించి సాయం చెయ్యమన్నాడు. ఆయన అతని తలదగ్గరగా చెయ్యిపెట్టి ఒక పురుగును తీసి విసిరినట్లుగా చెయ్యిని దూరంగా విదిలించాడు. తరువాత ఆలోచన తిరిగి శిష్యుడి మనసులో తలెత్తలేదు.మదర్ ను విషయమై అడిగితే అరవిందులు తన చర్య ద్వారా ఆలోచనను దూరంగా శూన్యాకాశంలోకి విసిరేశారని చెప్పారు. ఇదీ ఒక ఉచ్చాటనక్రియనే.

అధర్వణ వేదంలో ఇలాటి విధానాలు ఎన్నెన్నో ఇవ్వబడ్డాయి. సాధన చెయ్యగలిగితే వీటిని సాధించవచ్చు.
ఈ విధంగా ఉచ్చాటన క్రియను మంచిపనులకు కూడా చక్కగా వాడవచ్చు.
read more " ఉచ్చాటన క్రియ పనిచేస్తుందా? "

30, అక్టోబర్ 2010, శనివారం

ఇండోనేషియా సునామీ అగ్నిపర్వత పేలుళ్లు- జ్యోతిష పరిశీలన

26-10-10 సోమవారం నాడు ఇండోనేషియాలోని సుమత్రా దీవిని భూకంపం, సునామీ రెండూ దెబ్బతీశాయి. మర్నాడు అగ్నిప్రళయాలకు కారకుడైన కుజునిదైన మంగళవారంనాడు మేరాపీ అగ్నిపర్వతం బద్దలై విలయం సృష్టించింది. దీనికివెనుక కొన్ని జ్యోతిష కారణాలు కనిపిస్తున్నాయి. అవేమిటోచూద్దాం.

రోజున ఉన్న గ్రహస్థితి ఇక్కడ ఇస్తున్నాను. రోజు పూర్ణిమకు మూడురోజుల దూరంలో ఉంది. అప్పుడే బహుళ చవితి మొదలైంది.

చంద్రుడు, శనీ ఇద్దరూ ఖచ్చితంగా 16 డిగ్రీలమీదున్నారు. చంద్రుడు రోహిణిలో ఉంటే శని హస్తలో ఉన్నాడు. రెండూ చంద్ర నక్షత్రాలే. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండి భూమిమీదతనయొక్క అసాధారణమైన ప్రభావాన్ని సూచిస్తున్నాడు. ఇద్దరూ భూతత్వరాశులలో ఉండి భూమిలోని తీవ్రచలనాన్ని సూచిస్తున్నారు. సముద్రంలో ఏర్పడిన భూకంపంవల్లనే సునామీ వచ్చిందని శాస్త్రవేత్తలంటున్నారు.

భూతత్వగ్రహమైన బుధుడు 14 డిగ్రీలలోనూ, జలతత్వ గ్రహమైన శుక్రుడు 13 డిగ్రీలలోనూ రాహువుయొక్క స్వాతీనక్షత్రంలో దగ్గరగా ఉన్నారు. పశ్చిమాన్ని సూచిస్తున్న తులారాశిలో ఉన్నారు. గురువు సున్నా డిగ్రీలలో అతి బలహీనుడుగా ఉన్నాడు. రాహువు కేతు నక్షత్రంలోనూ కేతువు రాహునక్షత్రంలోనూ ఉన్నారు. ఇండోనేషియాలోని పశ్చిమతీరంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఇండోనేషియాను సూచించే ధనూరాశిలోనే ప్రమాదాలకు కారకుడైన రాహువు ఉండటమూ, బుధుడూ శుక్రుడూ రాహునక్షత్రంలోనే ఉండటమూ గమనించవచ్చు.

అసాధారణ శక్తితో ఉన్న చంద్రుని దృష్టి అగ్నిపర్వత ప్రేలుళ్ళకు కారకుడైన కుజునిపైన ఉండటం చూడండి. మంగళవారం నాడే అగ్నిపర్వతం పేలింది.

read more " ఇండోనేషియా సునామీ అగ్నిపర్వత పేలుళ్లు- జ్యోతిష పరిశీలన "

28, అక్టోబర్ 2010, గురువారం

మీ వాహనం యొక్క జాతకం

నేను వ్రాయబోతున్నది వినడానికి విచిత్రంగా ఉంటుంది. నవ్వు కూడా వస్తుంది. కాని ఇది నిజం. మనుష్యులకే కాదు జంతువులకూ జాతకాలు ఉంటాయని ప్రఖ్యాత జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు తన బృహజ్జాతకంలోని వియోని జన్మాధ్యాయము లో వివరించాడు. ఇదే కాన్సెప్ట్ ను కొంత పొడిగించి దీనిని వాహనాలకూ వర్తించి చూశాను. ఆశ్చర్య పరిచే ఫలితాలు వచ్చాయి.

జాతకుని కుండలిలో చతుర్ధ స్థానం వాహనయోగాన్ని సూచిస్తుంది అని మనకు తెలుసు.ఈ రాశి ద్విపాద రాశి అయితే అతనికి టూ వీలర్ యోగం ఉంటుంది. అది చతుష్పాద రాశి అయితే అతనికి ఫోర్ వీలర్ యోగం ఉంటుంది. వాయుతత్వరాశి అయితే వాయుయానం (ఎయిర్ ట్రావెల్) ఎక్కువగా జరుగుతుంది. భూతత్వ రాశి అయితే భూమిమీద ప్రయాణం సాగుతుంది. జలతత్వ రాశి అయినవారికి సముద్ర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇదే లాజిక్ ను ఇంకొంచం ముందుకు పొడిగించి రీసెర్చి చేశాను. గ్రహాలకు మన దేహంలోని వివిధ అవయవాలమీద అధిపత్యం ఉన్నదని మనకు తెలుసు. ఒక వాహనం కూడా మన దేహం వంటిదే. మన దేహంలోని వ్యవస్ఠ లాగే వాహనంలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఎలాగో చూద్దామా?

గుండె, కళ్ళు = ఇంజన్, హెడ్ లైట్= రవి
రక్తం= పెట్రోల్/డీజిల్/ఫ్యూయల్= చంద్రుడు
కండబలం, ఆకలి= కంబషన్ చాంబర్/పిస్టన్/మొబిలిటీ= కుజుడు
బుద్ది, చర్మం= టైర్లు, బాడీ= బుధుడు
జీర్ణశక్తి,బైల్ సెక్రీషన్= ఇంజన్ ఆయిల్= గురువు
శరీరానికి సుఖమైన స్తితి=మెత్తని సీటు, వాహనం రిపేర్ లేకుండా ఉండటం= శుక్రుడు
నరాలు, బాధలు, బద్ధకం=వాహనం లోని వైరింగ్, టైర్లలోని గాలి, తరచూ రిపేర్లు, స్టార్టింగ్ ట్రబుల్= శని
శరీరంలో తరచూ మార్పులు, అర్ధంకాని రోగాలు= మాటమాటకీ రిపేర్లు, వాహనాన్ని కొత్త కొత్త మార్పులు చెయ్యవలసి రావటం, వాహనాలు తరచూ మార్చటం= రాహువు
శరీరంలో హఠాత్తుగా వచ్చే మార్పులు, ప్రమాదాలు= అనుకోకుండా వాహనం ట్రబుల్ ఇవ్వటం, ఏక్సిడేంట్లు= కేతువు

మన వాహనం కొన్న తేదీ, డెలివరీ తీసుకున్న టైమ్ కు జాతకం వెస్తే అది ఆ వాహనం యొక్క జాతకం అవుతుంది. ఆ జాతకాన్ని బట్టి, పైన ఇచ్చిన కారకత్వాలను బట్టి, గ్రహాల యోగాలను బట్టి, ఆ వాహనానికి ఏ సమయంలో రిపేర్ వస్తుంది? ఏ పార్ట్ పాడౌతుంది? ఏక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది? దాని ఆయుష్షు ఎంత ఉంది? ఈ వాహనం ఏ కార్యక్రమాలకు వాడబడుతుంది? మొదలైన వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు. వ్యక్తి జాతకానికి వలెనే వాహన జాతకం కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది నేను అనుభవంలో పరిశీలించి చూచాను.

>>>కొన్ని వాహనాలు కొనిన కొద్ది రోజులలోనే ఏక్సిడెంట్ లో తుక్కు తుక్కు అవుతాయి. ఇలాటి వాహనాలకు బాలారిష్టాలు కనిపిస్తాయి. లేదా లగ్నం మీద షష్ట అష్టమాధిపతుల ప్రబావం ఖచ్చితంగా ఉంటుంది. చ చ ఈ కారు కొన్న తర్వాత అన్నీ అపశకునాలే. ఏక్సిడెంట్లే అని ఎందరో తిట్టుకోటం నాకు తెలుసు.

>>>కొన్ని వాహనాలు కొన్న తరువాత యజమానికి బాగా కలిసి వస్తుంది. ఇలాటి వాహనాలకు రాజయోగాలు ఉంటాయి. లగ్న, పంచమ, నవమాధిపతుల సంబంధం చతుర్ధ దశమాలతో ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కొత్త వాహనం కొన్నా కూడా పాత వాహనం అమ్మకుండా ఉంచుకుంటారు. దానికి కారణం సెంటిమెంట్ మరియు అది కొన్న తరువాత కలిసి రావటం. దీని జాతకంలో ఆయుశ్షు కూడా పూర్ణాయుష్షుగా ఉంటుంది.

>>> జాతకంలో ద్వికళత్ర యోగం ఉంటే రెండో భార్య వస్తుంది అని మనకు తెలుసు. అలాగే వాహన జాతకంలో ద్వియజమాని యోగం ఉంటే ఆ వాహనం అమ్ముడు పోయి ఇంకొకరి చేతిలోకి పోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో ఆయా దశలవల్ల తెలుసుకోవచ్చు.

>>>అల్పాయుష్షు ఉన్న వాహనాలు స్క్రాప్ గా మారి గారేజీలలో పడి ఉంటాయి. అంగచ్చేదన యోగం ఉన్న వాహనాలు పార్ట్ లు గా విడదీయబడి అమ్మబడతాయి. గురుచండాలయోగం గాని, షష్టాష్టమాధిపతుల యోగాలు గాని ఉన్న వాహనాలు కేసుల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లలోగాని, స్కూటర్ స్టాండ్ లలో గాని నెలల తరబడి పడి ఉంటాయి. లేదా దొంగ సొమ్ముగా విక్రయించబడతాయి.

>>>విధవాయోగం ఉన్న వాహనాలు వాటి సీ బుక్/ఇతర సర్టిఫికెట్లు పోగొట్టుకుని అనాధలుగా మారుతాయి. మాటిమాటికీ చేతులుమారి అనేక మందిచేత వాడబడతాయి.

>>>శని ప్రబావం అధికంగా ఉన్న వాహనాలు లగేజి కారియర్లుగా, కార్గో కారియర్లుగా వాడబడతాయి. అంతేగాక పెయింట్స్ పోయి, కళావిహీనంగా, పాత వాహనాలలాగా కనిపిస్తుంటాయి. వీల్ ఎలైన్ మెంట్ తప్పి ఊగుతూ నడుస్తుంటాయి.

>>> రాహు/కేతు ప్రభావం అధికంగా ఉన్న వాహనాలు అంబులెన్సులుగా, శవయాత్ర వాహనాలుగా వాడబడతాయి. కిడ్నాప్ వాహనాలుగా, క్రిమినల్స్ వాడే వాహనాలుగా, నేరస్తులను జైలుకు తరిలించే వాహనాలుగా రూపాంతరం చెందుతాయి.

>>>దుర్మరణయోగం ఉన్న వాహనాలు ప్రమాదంలో చిక్కుకుని పూర్తిగా ముక్కలు ముక్కలు అవుతాయి. తమలో ప్రయాణం చేస్తున్న వారిని కూడా అంతం చేస్తాయి.

>>>గురు బలం ఉన్న వాహనాలు రెలిజియస్ పనులకు, దేవాలయాల పనులకు, విగ్రహాల ఊరేగింపులకు వాహనాలుగా, శుభ కార్యాలకు, పెళ్ళిళ్ళకు వాహనాలుగా వాడబడతాయి.

>>>కుజ ప్రభావం ఉన్న వాహనాలు అతి వేగంగా రాష్ గా నడుపబడతాయి. ఎక్కువ ధ్వని కలిగి ఉంటాయి. అదే శని ప్రభావం ఉన్న వాహనాలు స్పీడ్ కంట్రోల్ చేయబడి నిదానంగా స్లో లేన్ లో పోతుంటాయి. వాటి హారన్లు నెమ్మదిగా మోగుతాయి.వీటిలో సీట్లు కంపు కొడుతూ ఉంటాయి. సీట్ కవర్లు మురికిగా ఉంటాయి.

>>>రాహు/శుక్ర ప్రభావం అధికంగా ఉన్న వాహనాలలో తాగుడు మొదలైన వ్యవహారాలు ఇంకా ఇతర అనైతిక కార్యక్రమాలు జరుగుతాయి. విలాసవంతంగా ఉంటాయి. మంచి పెర్ ఫ్యూమ్ వీటిలో వాడబడుతుంది. సువాసనగా ఉంటాయి.

>>> ప్రమాధాలలో కూడా వాహనానికి ఎక్కడ దెబ్బలు తగులుతాయో ఇదే లాజిక్ వల్ల చెప్పవచ్చు. లగ్నానికి, ద్వితీయ, తృతీయాలకు చెడుయోగాలుంటే ముందుభాగంలో సొట్టలు పడటం, దెబ్బలు తగలటం జరుగుతుంది. అదే దశమం నుంచి ద్వాధశం వరకూ ఈ యోగాలుంటే వాహనం వెనుక భాగానికి దెబ్భలు తగులుతాయి.

>>>ఎప్పుడూ తళతళ లాడె వాహనాలకు శుక్రబలం ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అదే దుమ్ము కొట్టుకుని ఉంటే శని/రాహువుల ప్రబావం వాటిమీద ఎక్కువగా ఉన్నట్లు లెక్క.

>>>మాటమాటకీ ఎలక్ట్రికల్ రిపేర్లు, బాటరీ రిపేర్లు వస్తుంటే కుజుని దుష్ట ప్రబావం ఉన్నట్లు లెక్క.

రంగులను బట్టి కూడా ఆ వాహనం మీద ఏ గ్రహం ప్రభావం అధికమో చెప్పవచ్చు. గ్రహాల రంగులు మనకు తెలుసు. వాటిని బట్టి ఈ పరిశీలన జరుగుతుంది. జాతకుని త్రికస్థానాధిపతుల రంగులలో వాహనం ఉంటే అతనికి యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది.

ఈ విధంగా వ్రాస్తూ పోతే ఇది ఒక పుస్తకం అవుతుంది. ఊరకే ఔట్ లైన్స్ ఇక్కడ ఇచ్చాను. ఇది ఒక నావెల్ మెధడ్. ప్రాక్టికల్ గా కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని నేను కొంత కాలం నుంచీ గమనిస్తూ వచ్చి, ఇవన్నీ నిజాలేనని నిర్ధారించుకున్న తర్వాతనే వ్రాస్తున్నాను.
read more " మీ వాహనం యొక్క జాతకం "

26, అక్టోబర్ 2010, మంగళవారం

ఒక చిన్న దీపం చాలు

"ఒక చిన్న దీపం చాలు యుగాల చీకటిని తొలగించడానికి"

మొన్న ఒకరోజు ట్రెయిన్ లో ప్రయాణిస్తున్నాను. సామాన్యంగా ఏసీ బోగీలో ప్రయాణీకులు ఒకరు ఇంకొకరితో మాట్లాడుకోరు. లాప్ టాప్ లో సినిమా చూడటమో, లేక పాటలు వింటూ పడుకోటమో, లేకుంటే ఏదైనా పుస్తకం చదువుకోటమో చేస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మోటుగా భావిస్తారేమో నాకర్ధం కాదు. కాని ఆరోజు నేను ఎక్కేసరికి అక్కడ కూచున్న వారిమధ్యన మంచి చర్చ జరుగుతున్నది. బహుశా వాళ్ళు స్నేహితులనుకుంటాను.

ఒకాయన జ్యోతిష్యాన్ని సమర్ధిస్తున్నాడు. ఇంకొకాయన విమర్శిస్తున్నాడు. నేను మధ్యలో ఎక్కాను కనుక మౌనంగా నా సీట్లో కూచుని కిటికీ లోంచి చూస్తూ వాళ్ల సంభాషణ వింటున్నాను. చర్చ చాలా సేపు జరిగింది. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళే.

సమర్ధిస్తున్న వ్యక్తికి కొన్ని అనుభవాలున్నాయి. వాటి ఆధారంగా అతను జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాడు అని నాకు అర్ధమైంది. విమర్శిస్తున్న వ్యక్తికి అనుభవం లేదు. సైన్సు ఒప్పుకోదు కనుక జ్యోతిష్యం బూటకం అని వాదిస్తున్నాడు. ఎక్కడో ఉన్న గ్రహాలు మన మీద ఎలా పని చేస్తాయి మొదలైన వాదనలు నడుస్తున్నాయి.

చాలాసేపు వారి వాదనలు జరిగినా విషయం ఎటూ తేలేటట్లు కనిపించడం లేదు. ఈ లోపల విమర్శిస్తున్న వ్యక్తి చేతులు ఊపుతూ మాట్లాడేటప్పుడు అతని చేతి రేఖలు కొన్ని నాకు కనిపించాయి. మళ్లీ ఒకటి రెండు సార్లు పరీక్షగా చూచి నిర్ధారించుకున్న తరువాత ఇలా అడిగాను.

మీ మాటల్లో కల్పించుకుంటున్నందుకు క్షమించాలి. ఒక చిన్న మాట అడగనా? అన్నాను.

శ్యూర్. శ్యూర్. అన్నారు వాళ్ళు.

మీరు చిన్నప్పుడు మీ ఇంటికి దూరంగా పెరిగారు. అవునా కాదా? జ్యోతిష్య విమర్శకుణ్ణి అడిగాను.

అతను ఆశ్చర్యంగా చూచాడు.

డు యు నో మి? అన్నాడు అనుమానంగా.

ఆఫ్ కోర్స్ ఐ నో యు. బట్ ఐ డోంట్ నో యు ఇన్ ది వే యు సపోజ్. అన్నాను.

అవును. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అన్నాడు.

మీరేమనుకోకపోతే ఇంకొకటి అడగనా? అన్నాను.

చెప్పండి.

మీ తల్లిదండ్రులు గొడవపడి విడిపోయారా? మీకు ఇబ్బంది లేకుంటెనే చెప్పండి. అన్నాను.

అతని ముఖంలో బాధ కదలాడింది.

అవును. మా నాన్న మా అమ్మను వదిలేశాడు. ఆమె పల్లెటూళ్ళొ తాతయ్య ఇంట్లోనే ఉండి చనిపోయింది. అన్నాడు విచారంగా.

అతని విషాదగతాన్ని గుర్తు చేసినందుకు నాకు బాధ కలిగింది. కాని తప్పదు మరి. సామాన్యంగా ఇలాటి విమర్శలు చేశేవారి జీవితాలలో బాధామయ విషయాలుంటాయి. ఇలాటి శాస్త్రాలు ఉండికూడా ఎవరూ తమకు సాయం చెయ్యలేదన్న బాధ వాళ్ళను అలా మాట్లాడేందుకు పురికొల్పుతుంది.

ఇప్పుడు జ్యోతిష్యాన్ని నమ్ముతారా? నవ్వుతూ అడిగాను.

అతను నివ్వెరపోయినట్లు ఉండిపోయాడు. చాలాసేపు ఏం మాట్లాడలేదు.

హౌ ఈస్ ఇట్ పాసిబుల్? అడిగాడు

ఇట్ ఈస్ పాసిబుల్. యు హావ్ సీన్ ఇట్. హావెన్ట్ యు? అన్నాను నేను.

అతను తలూపాడు.

కెన్ యు టెల్ మి సంతింగ్ మోర్? అన్నాడు.

ఐ కెన్. బట్ ఐ డోన్ట్ వాన్ట్ టు. అన్నాను నేను.

వాళ్ల వాదన అంతటితో ఆగిపోయింది. ఇద్దరూ నాతో చర్చ మొదలు పెట్టారు. ఈ రెండు విషయాలూ ఎలా చెప్పానో తెలుసుకుందామని వారి ప్రయత్నం. జ్యోతిషం మీదా మార్మిక శాస్త్రాలమీదా మా చర్చ సాగింది.

ఒక గంట ప్రయాణం తర్వాత ముగ్గురం స్నేహితులమయ్యాము. ఈలోపల నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.

థాంక్ యు సో మచ్ ఫర్ కన్విన్సింగ్ మై ఫ్రెండ్.అన్నాడు రెండో వ్యక్తి. వి విల్ చెరిష్ థిస్ మెమొరబుల్ డే ఫరెవర్. అన్నాడు విమర్శకుడు.
నా ఫోన్ నంబర్ తీసుకుని గుంటూరు స్టేషన్ రాగానే నాకు వీడ్కోలు చెప్పారు.

ఒక చిన్న దీపం చాలు యుగాల చీకటిని తొలగించడానికి.
read more " ఒక చిన్న దీపం చాలు "

24, అక్టోబర్ 2010, ఆదివారం

అంబేద్కర్ జాతకం-కొన్ని ఆలోచనలు












డా|| అంబేద్కర్ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన నాయకుడేగాక, సమాజంలో అట్టడుగున ఉండి బాధలు పడుతున్న దళితులను ఉద్ధరించిన కారణ జన్ముడని చెప్పవచ్చు. ఆయన జాతకాన్ని విశ్లేషించమని కొందరు మిత్రులు నన్ను చాలా కాలం నుంచి కోరుతున్నారు. నెట్ లో వెతుకగా, ఆయన జననతేది దొరికింది గాని ఆయన జన్మ సమయం దొరకలేదు. ఆయన 14-4-1891 న మధ్యప్రదేశ్ లో మహో అనే ఊళ్ళో జన్మించాడు.ఖచ్చితమైన జనన సమయం దొరకనందున చంద్రలగ్నం నుంచి ఆత్మ కారకుని నుంచీ కొన్ని పాయింట్స్ చూద్దాం.

ఈయన మేష సంక్రాంతి రోజున జన్మించాడు. రవి ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. గురువు దశాంశలో ఉఛ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఈయన ఒక కారణ జన్ముడని చెప్పవచ్చు.

ఈయన జాతకంలో ముఖ్యమైన యోగం రవి ఉఛ్ఛ స్తితి. ఈ రవి మేషం ఒకటవ డిగ్రీలో ఉండి దాదాపుగా పరాశరుని షోడశ వర్గ చక్రాలన్నింటిలోనూ ఉఛ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఈయన ఉత్తమమైన ఆత్మశక్తి కలవాడని తెలుస్తున్నది. బుదాధిత్య యోగం వల్లనూ, రవి తృతీయాధిపతిగా ఉఛ్చస్థితివల్ల భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యే యోగం కలిగింది. అనేక పుస్తకాలు ఆర్టికిల్సూ ఈ సూర్యభగవానుని యోగం వల్లనే ఆయన వ్రాయగలిగాడు. రవి రాజులకు సూచకుడు. కనుకనే బరొడా మహారాజిచ్చిన స్కాలర్ షిప్ వల్ల కొలంబియా యూనివర్శిటీలో చదువుకునే సహాయం వచ్చింది.

ఈయనకు దశాంశ చక్రములో గురువు ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. దేవగురువైన బృహస్పతి ఈయన జాతకంలో ఉఛ్ఛ స్థితివల్ల ఉన్నత పదవులు, మంచి మేధాశక్తి, వాక్పటిమ ఈయనకు వచ్చాయి.అయితే ఇదే చక్రంలో శుక్రుని నీచ స్థితివల్ల ఇవన్నీ ఆయనకు అనేక కష్టాల తర్వాతా, ఎదురుదెబ్బల తర్వాతా మాత్రమే లభించాయి.

గాంధీగారి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఈయన జాతకంలో దశాంశలో నీచ స్థితిలో ఉండటం చూడవచ్చు. ఈయనకు గాంధీగారంటే ఏమంత గొప్ప అభిప్రాయం ఉండేది కాదు. ఈ విషయాన్ని ఆయన తన ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో కూడా లభిస్తున్నది.

పంచమ దశమాధిపతులైన శుక్ర గురువులు నవమ స్థానంలో కలసి ఒక రాజయోగాన్ని ఈయనకు ఇచ్చారు. కాని వారిద్దరూ శత్రువులైనందున ఆ యోగం సునాయాసంగా అందలేదు. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తర్వాతనే అది లభించింది.

శని వక్ర స్థితివల్ల ఈయన సమాజంలోని బలహీన వర్గాలకు మేలు చేయటానికి జన్మించాడని సూచింపబడుతున్నది. అది సూర్యుని దైన సింహరాశిలో జరగడం వల్ల సమాజంలో ఉన్నత పదవులలో, ఉన్నత స్థాయిలో ఉన్నవారితో పోరాటం వల్ల అది సాధిస్తాడని కూడా సూచింపబడుతున్నది.

ఈయన జాతకం లోని మరొక గొప్ప అనుకూల యోగం రాహు కేతువుల ఉఛ్చ స్థితి. అది ద్వాధశ, షష్ట స్థానములలో ఉండటం వల్ల ఆయనకు శత్రువిజయాన్ని ఈ గ్రహాలు ఇస్తాయని , కాలం చక్కగా అనుకూలిస్తుందని తెలుస్తున్నది.

గాంధీగారి లగ్నమైన తులకు, ఈయన యొక్క రవి సప్తమస్థానంలో ఉంటూ వీరిద్దరి భావాలూ ఎప్పుడూ విభేదించేవని తెలుపుతున్నాడు.

వింశాంశలో తులారాశిలో రాహు, గురు, కేతువులు కలసి ఉన్నారు. వీరి కలయిక బౌద్ధ మతాన్ని సూచిస్తుందని మనకు తెలుసు. కనుకనే ఆయన జీవిత చరమాంకంలో బుద్ధుని అనుయాయిగా మారాడు. అన్ని దేశాలు తిరిగీ, క్రైస్తవంలో బాగా పాండిత్యం ఉండి కూడా, ఆయన మనదేశపు మతమే అయిన బౌద్దాన్ని ప్రేమించటం ఆయనలోని ఒక గొప్ప ఆలోచనాపరుని సూచిస్తున్నదని నా నమ్మకం. కొన్ని కొన్ని కోణాలలో బౌద్దమతం అనేది నేడు మనం ఆచరిస్తున్న హిందూమతం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనదని నా నమ్మకం మాత్రమే గాక సత్యం కూడా.

ఆత్మ శక్తి కారకుడైన సూర్యుని పరిపూర్ణ అనుగ్రహం ఈయనకు ఉంది. దానికి సూచనగానే, షోడశ వర్గ చక్రాలలోనూ సూర్యుడు ఉఛ్ఛ స్థితిలో దర్శనం ఇస్తాడు. ఇంత గొప్ప యోగం గాంధీగారి జాతకంలో లేదు. అందుకనే గాంధీ గారి జాతకాన్ని ఈయన జాతకాన్ని పక్కపక్కన పెట్టి, ఏ జాతకం ఎవరిదో చెప్పకుండా, ఎవరి జాతకంలో ఆధ్యాత్మిక బలం అధికం అంటే, అంబేద్కర్ జాతకాన్నే చూపవలసి వస్తుంది.

సరియైన జన్మసమయం దొరికితే ఇతర జీవిత వివరాలను కూడా చక్కగా వివరించవచ్చు.
read more " అంబేద్కర్ జాతకం-కొన్ని ఆలోచనలు "

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

అడవులదీవి సరదాయాత్ర

రేపల్లె దగ్గర అడవులదీవి అని ఒక ఊరుంది. అది సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ఊరు. అక్కడనుంచి కృష్ణా కాలువలో ఒకగంటన్నర ప్రయాణం చేస్తే అది సముద్రం లో కలిసే చోట ఒక బీచ్ఉంది. మొన్నీమధ్యన బీచ్ కి సరదా ప్రయాణం చేశాము.

రేపల్లెలో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి సాయంత్రం ఆరుగంటలకు మళ్లీ సముద్రంలోనుంచి వెనక్కు వచ్చాము.మొత్తంఒక ఇరవై మందిమి బయలుదేరి సరదా యాత్రలోపాల్గొన్నాము. బీచ్ నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి లేకపోతే దారిన ఎవరినీ రానివ్వరు. డీఎఫ్వో గారికి ముందే చెప్పాముగనుక ఆయనరెండు పడవలు, సెక్యూరిటీ గార్డ్ లను ఏర్పాటు చేసాడు. అందరం కలిసి రేపల్లెనుంచి కార్లలో బయలుదేరి అక్కడికి ఏడుమైళ్ళ దూరంలోని ఒక పల్లెకు చేరాము. అక్కడనుంచి ముళ్లచెట్లలో, బురదలో కొద్దిదూరం నడచి కృష్ణా కాలువ ఒడ్డు చేరిపడవలెక్కాము.

రెండు మరపడవలలో బయలుదేరి వీఐపీ లందరూ ఒక బోట్ లో, ఇతరులు ఒక బోట్లో దాదాపు గంటన్నర కృష్ణాకాలువలో ప్రయాణించి సముద్రానికి చేరాము. సాయంత్రం మూడున్నర నుంచి నాలుగున్నరవరకు ఒక గంట బీచ్ లోసరదాగా గడిపి మళ్ళీ వెనక్కు వచ్చాము. ఆ రోజంతా మబ్బు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది.

బీచ్ లో చేరి కొంచెం కుదుటపడ్డాక, అందరిలోని చిన్నపిల్లలు బయటకొచ్చారు. ఆటలాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నీళ్ళలో దిగి కేరింతలు కొట్టేవాళ్ళు, నత్తగుల్లలు ఆల్చిప్పలు ఏరేవాళ్ళు - ఇలా రకరకాలుగా పెద్దవాళ్ళలోని చిన్నవాళ్ళుబయటకొచ్చారు.

ఇంతలో మా బాస్ ఒక గొప్ప విషయం కనిపెట్టాడు. అక్కడక్కడా నీళ్లలో బంక మట్టి ముద్దల్లాటివి పడి ఉన్నాయి. మెత్తటిఒండ్రు మట్టి అలల ప్రవాహానికి అలా ముద్దలుగా మారింది. బహుశా నది సముద్రం కలిసే చోటనే ఇలాటివిఉంటాయనుకుంటా. మామూలు బీచ్ లలో అవి కనపడవు. చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉంది.

" ఇదే ముల్తానీ మట్టి. దీన్నే బ్యూటీ పార్లర్లలో మొహానికి పూసి వేలకు వేలు గుంజుతారు." అని గట్టిగా ఎనౌన్స్ చేశాడుమా బాస్. అంతే . ఎవరికి వారు ఒక కారీ బ్యాగ్ ఎక్కణ్ణించో బయటకు తీసి పేడముద్దలు ఏరుకున్నట్లు మట్టినిసంచుల్లో సేకరించటం మొదలు పెట్టారు. మా బాస్ గుంభనంగా నవ్వుతున్నాడు. నేను ప్రహసనాలన్నీ గమనిస్తూఅటూ ఇటూ తిరుగుతూ సరదాగా గడిపాను.

ఇంతలో మా పెద్ద బాస్ గారు వారి సతీమణి ధ్యానానికి కూచున్నారు. ఆయన వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. చాలామంచి వ్యక్తి. గట్టి మిలిటరీ డిసిప్లిన్ మనిషి. బీచ్ ఒడ్డున సముద్రానికి అభిముఖంగా కూచొని ధ్యానం చేస్తున్నారు. వారినిచూచి ఇంకొందరు కూడా పద్మాసనాలు వేసి వారూ బుద్దులవలె కూచున్నారు. కొందరు బాబా రామ్ దేవ్ గారి కపాలభాతి మొదలు పెట్టారు. నేను వారిని తమాషాగా చూస్తున్నాను.

ఇంతలో మా గ్రూపులోని ఒకాయన నన్ను అడిగాడు. " ఏమండీ మీరు ధ్యానం చెయ్యరా?"

నేను అడ్డంగా తలూపాను.

"ధ్యానం ఆరోగ్యానికి చాలా మంచిదండీ. నేర్చుకోండి." ఆయన ఉచిత సలహా ఇచ్చాడు.

నేను నవ్వుతూ "అలాగే" అన్నట్లు తలూపాను.

"చూడండి మన జీఎమ్ గారే వయసులో కూడా ధ్యానం చేస్తున్నారు. మనం చెయ్యకపోతే ఎలా?" ఆయన ఇంకొకప్రశ్న సంధించాడు.

"నిజమే. ఆయన చేస్తున్నపుడు మనం చెయ్యకపోతే ఎలా?" అన్నాను నేను నవ్వుతూ.

"మరి చేద్దాం రండి" ఆయన ఆహ్వానం.

"ధ్యానం చెయ్యటం నాకు రాదే. పైగా ధ్యానం ఎవరికి వాళ్లే చెయ్యాలనుకుంటా." అన్నాను.

నన్నొక వింత జంతువును చూచినట్టు చూచాడు ఆయన.

నేనది పట్టించుకోకుండా అలాగే చూస్తున్నాను.

నాతో అనవసరం అనుకున్నాడేమో, కళ్ళుమూసుకొని కాసేపు ఇసకలోనే చతికిల బడ్డాడు.

ఈలోపల తెచ్చిన బాక్సులు విప్పి కూల్ డ్రింకులు, బిస్కట్లు, పండ్లు బయటకు తీసి అందరికీ పంచుతున్నారు కొందరు. మాటలకు, చప్పుళ్లకు అందరి ధ్యానాలూ ఎగిరిపోయాయి. నాకు ధ్యానం నేర్పుతానన్న ఆయన గభాల్న కళ్ళు తెరిచి లేచి తన ప్లేట్ తీసుకుని స్నాక్స్ లాగించటం మొదలుపెట్టాడు.

"ఏమండీ ధ్యానం అయిందా" అడిగాన్నేను.

". అయింది." అంటూ తలాడించాడు ఆయన. "ధ్యానంలో చాలా ప్రశాంతంగా ఉంటుందండీ" అన్నాడు పైగా.

"మరి ప్రశాంతతలో అలాగే ఉండక, లేచారెందుకు?" అమాయకంగా అడిగాను నేను.

"ఆత్మారాముణ్ణి శాంతింపచేయాలిగా." అన్నాడాయన అది కూడా ఒక డ్యూటీ అయినట్లు.
ఇంతలో అటూ ఇటూ చూచిఏదో రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి "ధ్యానమంటే ఏమీ లేదండీ శ్వాస మీద ధ్యాస. అంతే." అన్నాడు.

"ఓస్ ఇంతేనా. నేనింకా ఏదో అనుకున్నాను కదండీ" అన్నాన్నేను నవ్వాపుకుంటూ.

"అదంత తేలికనుకోకండి మరి. చాలా కష్టం. కూచుంటే తెలుస్తుంది" ఆయన ఉవాచ.

ఇక లాభం లేదనుకుని "సరేగానండీ, నాకొక సందేహం ఎప్పటినుంచో పీడిస్తోంది. మీరే దీనికి జవాబు చెప్పాలి" అన్నా.

". అడగండీ. దాందేముంది" అన్నాడు గురూజీ.

" పెద్ద గొప్ప డౌటు కాదనుకోండి. చిన్నదే"

"పర్లేదు చెప్పండి సార్" స్నాక్స్ లాగించి కూల్ డ్రింక్ అందుకుంటూ అన్నాడు ఆయన.

"మనమంటే దాహానికి కూల్ డ్రింకులు తాగుతున్నాం కదా. మరి చేపకు దాహం వేస్తే ఎలా?.అదేంతాగుతుంది పాపం?" అన్నాను.

అదోరకంగా చూచాడు ఆయన. నాకు నవ్వాగడం లేదు.

"ఏంటండి? నేను ధ్యానం గురించి చెబుతుంటే మీకొచ్చిన డౌటు ఇదా?" అన్నాడు అసహ్యంగా మొహం పెట్టి.

"ఇది నా డౌటు కాదండీ కబీరుకు కూడా ఇదే డౌటొచ్చిందిట ఒకసారి" అన్నాన్నేను.

"చుట్టూ నీళ్ళుంటే దాహమెందుకండీ" అన్నాడాయన.

"నిజమే కదా. మర్చేపోయాను. చుట్టూతా ఉన్నదానికోసం వెతకటం ఎందుకు? కరెక్ట్ గా చెప్పారు మీరు" అన్నాన్నేను.

ఆయనకు అర్ధం అయిందని నాకనిపించలేదు.

ఇంతలో మా జీఎమ్ గారు వారి సతీమణి ధ్యానం లోంచి లేచారు. వారి స్నాక్స్ అయినాక అందరం కలిసి మళ్లీ పడవలెక్కి వెనక్కు ప్రయాణంకట్టారు. మా గురూజీకి ఇందాకటి చేపదాహం పజిల్ అర్ధం కాక నన్ను అనుమానంగా చూస్తున్నాడు. అందులో ఏదో కిటుకుందని మాత్రం అతనికి తెలుస్తోంది. అదేంటో అర్ధమై చావటం లేదు.

బయలుదేరి వస్తూ పడవలోనుంచి వెనక్కు చూస్తూ మౌనంగా కూచున్నాను. మేమొదిలేసిన బీచి ప్రశాంతంగా మాకువీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తూనే ఒక్క క్షణం ఏకాగ్రతగా ఈగిల్ విజన్ మోడ్ లోకి వెళ్లాను. క్రమేణా మాకు దూరంగాజరుగుతున్న బీచ్, సముద్రం, ఆకాశం అన్నీ మౌనంగా ధ్యానంలో ఉన్నట్లుగా అకస్మాత్తుగా నాకు ఒక ఫీలింగ్ కలిగింది.
వెంటనే చాందోగ్యోపనిషత్తులోని మంత్రం నాకు స్ఫురించింది.

శ్లో|| ధ్యాయం వావ చిత్తాధ్బూయో ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షమ్ ధ్యాయతీవ ద్యౌ ర్ధ్యాయన్తీవాపో ధ్యాయన్తీవపర్వతా...........||

ఆ ఉపనిషద్రుషికి అన్నీ ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించాయి. భూమి, అంతరిక్షం, ఆకాశం, జలమూ, పర్వతాలూ అన్నీ ధ్యానంలో మునిగి ఉన్నట్లుగా
మంత్రద్రష్టకు కనిపించాయి. ఎంత అద్భుతమైన భావన? దీనిని భావన అనడం కంటే దర్శనం అనాలేమో? నిజమే. మనం ధ్యానంలో ఉంటే ప్రకృతికూడా ధ్యానంలో ఉన్నట్లే కనిపిస్తుంది. మన లోపలి స్థితి ఏదో అదే బయటకూడా దర్శనమిస్తుంది. లోపల మార్కెట్టును ఉంచుకొని కళ్ళుమూసుకుని బిగదీసుకుని కూచుంటే లాభంలేదు.

మనిషి గొడవ చెయ్యకుండా మౌనంగా ఉంటే చాలు. ప్రత్యేక ధ్యానాలు అక్కర్లేదు. సమస్తప్రకృతి ఎల్లపుడూ ధ్యానంలోనేఉంది. మనమే గందరగోళంలో ఉన్నాము. మన అంతరంగ కల్లోలాలు శాంతిస్తే చాలు. మన ఆవేశాలు చల్లారితే చాలు. ఎల్లప్పుడూ ఉన్నది ధ్యానమే.
తన్ను తాను మరచి ప్రకృతితో మౌనంగా మమేకం కాగిలిగితే చాలు. తాను అదృశ్యుడై ప్రకృతిని దానిమానాన ఉండనిస్తే చాలు. అదే ధ్యానం. అని ప్రకృతి నాతో చెబుతున్నట్లు అనిపించింది. భావాన్ని ఆస్వాదిస్తూ ఏకాగ్రతను చెదిరిపోనివ్వకుండా నిమిషనిమిషానికీ దూరమౌతున్న బీచ్ వైపు చిరునవ్వుతో చూస్తున్నాను.

బీచ్ చాలా దూరం వెళ్ళిపోయింది. చేప గురూజీ ఇంకా ఆ పజిల్ మీదే ఉన్నాడు.

"సారు బలే విచిత్రమైన మనిషండీ. చేపకు దాహం వేస్తే ఎలా అని ఆలోచిస్తున్నట్లున్నారు" అంటూ జోకేస్తున్నాడు గురూజీ.

అందరి నవ్వులతో నెనూ శృతి కలిపాను.
read more " అడవులదీవి సరదాయాత్ర "

18, సెప్టెంబర్ 2010, శనివారం

జైమినీయ కారకాంశ- ఒక పాత జ్ఞాపకం

1998 ప్రాంతాలలో నాకొక స్నేహితుడుండేవాడు. అతని పేరు శ్రీనివాస్ అప్పటికే అతను.మంచి జ్యోతిష్య జ్ఞానం ఉన్నవాడు. అప్పట్లోనే పదివేలు పెట్టి ఒక పామ్ టాప్ కంప్యూటర్ లాటిది కొని దాన్ని వాడుతూ జాతక చక్రాలు వేసి చూస్తుండేవాడు. ఒక రూం నిండా అతని లైబ్రరీ ఉండేది. వాళ్ళుబ్రాహ్మణులు కారు. పద్మ శాలీలని ఒకసారి చెప్పినట్లు లీలగా గుర్తుంది. రాత్రింబగళ్ళు జ్యోతిష్య శాస్త్రాన్ని శోధిస్తుండేవాడు. అతనికి జ్యోతిష్య శాస్త్రం మీద అంతటి నిమగ్నత ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యం వేసేది. నేను నా స్నేహితుల కులాలని ఎప్పుడూ అడగను. కొంతమంది నా కాలేజి స్నేహితుల కులాలు ఈ మధ్యనే నాకు ఒక వివాహ మూలకంగా తెలిశాయి. మా స్నేహాలు, ఆ విధంగా కులాలకు అతీతంగా సబ్జెక్ట్ పరంగా ఉండేవి.

అదలా ఉంచితే, అతను సాయంత్రానికి స్నానం చేసి గణపతి మంత్రం జపించేవాడు. ఎవరిదగ్గర ఉపదేశం పొందాడో నేనూ అడుగలేదు అతనూ చెప్పలేదు. అతను కృష్ణమూర్తి పద్దతి ఫాలో అయ్యేవాడు. కృష్ణమూర్తి గారు ఉచ్చిష్ట గణపతిఉపాసకుడు కనుక విధానం ఫాలో అయ్యేవారు చాలామంది మంత్రాన్ని జపిస్తారని నాకు తెలుసు. అందుకనినేనూ అడుగలేదు. కాని రాత్రి కాగానే మద్య మాంసాలు స్వీకరించేవాడు. అతనికి ఇలాటి అలవాట్లు ఉన్నాయని అప్పటిదాకా నాకు తెలియదు. కాని ఒక జ్యోతిష్య కాన్పరెన్స్ కు కలకత్తా వెళ్ళినపుడు అతనూ నేనూ ఒకే గదిలో ఉన్నాము. అప్పుడు ఇదంతా చూచాను. ఒకపక్క జ్యోతిష్య సాధన చేస్తూ, మంత్ర సాధన చేస్తూ, పనులేమిటి అని మాత్రం అడిగాను. దానికి సమాధానం చెప్పలేదు గాని "తాంత్రికసాధనలో మద్య మాంసాలు తీసుకోవచ్చుగా" అని చెప్పాడు. నాకప్పటికే తంత్రసాధనలో గట్టి అనుభవం ఉంది. చాలామంది తమ నిగ్రహలేమికి తంత్రం అని పేరుపెట్టుకుని సరిపుచ్చుకోవటం నాకు తెలుసు. అతను అర్ధం చేసుకునేస్థితిలో లేడని గ్రహించి, వాదనెందుకని నేను నవ్వి ఊరుకున్నాను. కాని ఒకటి మాత్రం చెప్పాను. "జ్యోతిష్య సాధన చేసేవారు నియమ నిష్టలు పాటించాలి. ఇలాటి అలవాట్లు ఉండరాదు.లేకపోతే ఈ జ్ఞానం పట్టుబడదు. ఒకవేళ పూర్వకర్మప్రభావం వల్ల గట్టి ఇంట్రెస్టు ఉన్నా సరిగా ఉపయోగపడదు. దానికి తోడు రెమెడీలు పని చెయ్యవు. ఇతరుల కర్మవిపాక విధానాలను చెప్పేమాట అటుంచి, తన కర్మ తానే తీర్చుకోలేడు " అన్నాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అతను వినడని, అలవాట్లు మానుకునే స్థాయి దాటిపోయాడని నేను గ్రహించాను.

ఒకరోజు అతని జాతకం చూస్తూ చర్చిస్తుండగా జైమిని సూత్రాల ప్రకారం "ఆత్మాధిక కలాధిభి:" అని జైమిని మహర్షిచెప్పినదానిని బట్టి, " భవేద్రాశి కలయో రాధిక్యా దాత్మకారక:" అని పరాశరులు చెప్పినదానినిబట్టి అతని ఆత్మకారకుని నిర్ధారించి పరిశీలిస్తున్నాము. అతనికి జైమిని విధానం తెలియదు. కనుక దానిగురించి నన్ను అడిగేవాడు. అప్పట్లో మేము రకరకాల జ్యోతిషవిధానాలను తీవ్రంగా పరిశీలిస్తూ వాటిని వివిధ జాతకాలకు అప్లై చేసి చర్చిస్తూ ఉండేవాళ్లం. కాని అతను సాంప్రదాయ రెమెడీలు పాటించేవాడు కాదు. ఏవో పిరమిడ్స్ అని, డాలర్స్ అని, రుద్రాక్షలని ఇంకా ఏవేవో తనకు తోచిన వాటిని, బజారులోని పుస్తకాలలో వచ్చేవాటిని రోజుకొకటి చొప్పున రెమెడీల క్రింద ట్రై చేస్తుండేవాడు. మాయలో పడవద్దని నేను చెప్పేవాణ్ణి కాని అతను వినేవాడుకాదు. సాంప్రదాయం గా వస్తున్న రెమెడీలు పాటించేవాడు కాదు. అతని జాతకంలోని కారకాంశను చూడటం తోనే "సమే వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం " అన్న జైమిని సూత్రం నాకు స్ఫురణకు వచ్చింది. కారకాంశ ధనుస్సుగనుక అయితే వాహనాలనుంచి పడటంవల్ల గాని ఎత్తైన ప్రదేశాలనుంచిపడటం వల్ల గాని ప్రమాదం ఉంటుంది. అతని జాతకంలో అదే కాంబినేషన్ కనిపించింది. వెంటనే జైమినీయ చరదశను, గోచారాన్ని పరిశీలించాము. అప్పుడు జరుగుతున్న దశ చూడగానే నా గుండె గుభిల్లుమంది. ఎలా చెప్పాలా అనిచాలాసేపు ఆలోచించి, " ఏది ఏమైనా సరే, వాహనాలు స్పీడుగా నడపకు" అని మాత్రం చెప్పాను. సరే అనితలూపాడు.

ఇది జరిగిన నెల రోజులకనుకుంటాను. రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి మోటార్ సైకిల్ మీద తాడేపల్లికి వస్తుండగా, సాయిబాబా గుడి టర్నింగ్ వద్ద స్పీడు గా ఎదురునుంచి వస్తున్న ఒక కారు అదుపుతప్పి ఇతన్ని గుద్దేసింది. వాహనం మీదనుంచి పడి దొర్లుకుంటూ రోడ్డుపక్కన డౌన్ లో పడిపోయాడు. కాలుప్రాక్చర్ అయింది. ఒక వారం హాస్పటల్ లో ఉండి, ఆపరేషన్ టేబుల్ మీద హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అప్పుడతనికి 33 సంవత్సరాలు మాత్రమే. "వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం" --"వాహనం మీద నుంచి పడి ఎత్తునుండి కిందకు దొర్లుటద్వారా ప్రమాదం జరుగును" అని జైమిని మహర్షి వేల సంవత్సరాల క్రితం చెప్పిన సూత్రం అక్షరాలా అతని విషయం లో జరిగింది. కాని అన్ని వేల ఏళ్ళ క్రితమే ఇలాటి కాంబినేషన్స్ ను పరిశోధనలో నిగ్గు తేల్చి వాటిని సూత్రాలుగా వ్రాసిపెట్టిన మహర్షుల మేధాశక్తి ఎంతటిదో అల్పజ్ఞులమైన మన ఆలోచనకు అందదు. విషయం నన్ను చాలాఆశ్చర్యానికి గురిచేసింది. శాస్త్రంలో ఇంకా లోతైన పరిశీలన చెయ్యాలన్న ఆసక్తిని పురికొల్పింది. చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ, మరువలేని కొన్ని పాత ప్రిడిక్షన్స్ లో ఇదొకటి.
read more " జైమినీయ కారకాంశ- ఒక పాత జ్ఞాపకం "

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నిజమైన ఇంకో జోస్యం (వ్యక్తి జాతకంలో)

రెండు రోజులనాడు ఒక స్నేహితుని జాతకం చూస్తూ ఇలా చెప్పాను.

"రాబోయే రెండురోజులలో నీకు ఒక ప్రమాదం జరుగబోతున్నది. కేతువు యొక్కసూక్ష్మ దశ జరుగుతున్నది కనుక ఏదో ఒక ఊహించని ప్రమాదంకలుగుతుంది. జాగ్రత్తగా ఉండు."

అతనికి జ్యోతిష్యాలంటే పెద్ద నమ్మకమూ లేదు. అలాగని అపనమ్మకమూలేదు. చాలామంది లాగే దానితో మనకెందుకు అనుకునే రకం మనిషి. మన పనిమనం చేసుకుంటే గ్రహమూ ఏమీ చెయ్యదు అని నమ్ముతాడు.

అతను నవ్వాడు.

"అంటే జాగ్రత్తగా ఉంటే జరిగే ప్రమాదం జరగదా? అలాగైతే జ్యోతిష్యం తప్పు అయినట్లే కదా" అన్నాడు.

నాకు ఇలాటి పిల్లకాకి వాదనలు వినీ వినీ విసుగొచ్చింది.

వీళ్ళకున్నపాటి అరికాలి మెదడు లేకుండానే మహర్షులు ఇన్నిన్ని శాస్త్రాలు వ్రాశారా? అని వీళ్ళు ఎందుకు ఆలోచించరోఅనిపిస్తుంది.

ఇంకొడైతే "నీ ఖర్మ" అని ఒదిలేసేవాణ్ని.కాని నాకు మంచి స్నేహితుడు. మా నమ్మకాలలో విభేదాలున్నప్పటికీమేమిద్దరం మంచి స్నేహితులం.

కనుక సరేరా "నీ నమ్మకాలు ప్రస్తుతానికి అలా ఉంచు. నే చెప్పిన మంత్రం స్మరిస్తూ ఉండు". అని చెప్పాను.

వాడు నాస్తికుడు కాదు గాని జాతకాలను గ్రహాలను నమ్మడు. దైవభక్తి ఉన్నవాడు.

గుణాన ఉన్నాడో "సరేరా" అన్నాడు. అంటూ " రకమైన ప్రమాదమో అదికూడా చెప్పుమరి" అన్నాడు. నీ జాతకంలోకేతువున్న స్థితిని బట్టి నీ తలకు బలమైన దెబ్బ తగులవచ్చు. జాగ్రత్త అని చెప్పాను.

తరువాత సంగతి మరిచిపోయాను. ఇద్దరం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యాం.

రోజు ఏం జరిగిందో చూద్దామా?

ఇప్పుడే పనిమీద విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో వార్త తెలిసింది. వెంటనే ఫోన్చేయగా తెలిసిన విషయాలివి.

రేపు వినాయక చవితి కనుక చవితి పందిళ్ళు అన్ని చోట్లా వేస్తున్నారు. మన వాడు రోడ్డుపక్కగా నిలబడి ఎవరితోనోమాట్లాడుతున్నాడు.

ఇంతలో మాట్లాడుతున్న
రెండవ వ్యక్తి " ఒరేయ్. వినాయక విగ్రహం చూడు ఎంత బాగుందో" అన్నాడు. రకరకాలరంగు రంగుల వినాయక విగ్రహాలు రిక్షాలమీదా, ఆటోలలోనూ తీసుకుపోతున్నారు.

మనవాడు తలతిప్పి చూడటం, పక్కనే కడుతున్న పందిరి నుంచి ఒక సర్వి గుంజ (సర్వి బాదు అని కూడా పిలుస్తారు) జారి, వీడి తల పక్కగా తాకుతూ వచ్చి భుజం మీద పడటం బలమైన దెబ్బ తగలటం ఒక్క క్షణం లో జరిగింది. ఇంకేముంది లబలబ మొత్తుకుంటూ దగ్గరలోని హాస్పటల్ కు పరిగెత్తి టెస్ట్ లూ, ఇంజక్షన్లూ అన్నీ మామూలుగాజరిగిపోయాయి.

" మంచి దెబ్బ తగిలిందిరా. మనది ఎక్సర్ సైజ్ బాడీ గనుక తట్టుకున్నాను. అదృష్టం బాగుండి ఫ్రాక్ఛర్ కాలేదు. తలపక్కకి తిప్పక పోయి ఉంటే గుంజ తలమీద పడి తల పగిలి ఉండేది. నువ్వు చెప్పింది నిజం అయ్యిందిరా. వినాయకవిగ్రహం చూద్దామని తల తిప్పటం నన్ను రక్షించింది. కాదు కాదు వినాయకుడే రక్షించాడు." అని మూలుగుతూ మావాడుఫోన్ లో చెప్పాడు.

ఇలాటి ఘటనలు చాలా చూచాను గనుక, అనుభవంతో, "నిన్ను పక్కకు చూడమని చెప్పిన ఫ్రెండ్ పేరు ఏమిట్రా" అనిఅడిగాను.

"వాడిపేరు గణేశ్వర్రావు రా. నీకూ తెలుసుగా. మొన్న మీ ఆఫీస్ కు నాతో బాటు వచ్చాడే .అతనే" అని అవతల పక్కనుండి జవాబు.

నాకు అంతా అర్ధమైంది.

"మరి నేను చెప్పిన మంత్రం రెండు రోజులూ జపిస్తున్నావా?" అని అడిగాను.

"చేస్తున్నానురా బాబూ . లేకపోతే నువ్వు ఊరుకోవుగా." అని వాడి జవాబు

ఇంతకీ నేను మావాణ్ణి స్మరించమని చెప్పింది గణేశ మంత్రమే మరి.

మనం గనుక సరియైన రెమెడీ పాటిస్తే, అదే దేవత పేరుగల ఒక వ్యక్తి నుంచో, లేక సాకుతోనో ఏదో ఒక అనుకోనిసహాయం అంది మనం రక్షింపబడతాం. వీడి విషయం లో అదే జరిగింది. వినాయక విగ్రహం చూడమని గణేశ్వర్రావు అనేప్రెండ్ చెప్పటం వీడు తల తిప్పటం వల్ల తల పగలకుండా రక్షింపబడ్డాడు. కాని కర్మ ఫలితం తప్పదుగదా మరి. అందుకేభుజం మీద దెబ్బ తగిలింది. గొడ్డలి వేటు పడాల్సిన చోట గోటితో గీరుకుంటుంది అంటే ఇదేగా మరి.

జ్యోతిష్య విజ్ఞానం యొక్క మహత్వానికి ఆశ్చర్య పోవడం విన్నవారి వంతు అయింది. అభినందనలతో మిత్ర బృందం నుంచిఇంకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇలాటి సంఘటనలు చాలా చూచాను గనుక నాకేమీ ఆశ్చర్యం కలగలేదు.

ఇదీ జ్యోతిష్యం వల్ల ఉపయోగం.
read more " నిజమైన ఇంకో జోస్యం (వ్యక్తి జాతకంలో) "