30, ఏప్రిల్ 2015, గురువారం

Telugu Melodies-Satya-Ninne talachi talachi..



ఒక మంచి రాగం నాకు నచ్చితే దానికి లిరిక్స్ వ్రాసుకోవడం నా అలవాటు.ఆ క్రమంలో అసలు పాట భావాన్ని మార్చి నాకు నచ్చినట్లుగా వ్రాస్తూ ఉంటాను.

ఈ పాట కూడా అలాంటిదే.సి హెచ్ ఆత్మా పాడిన 'కేహనే కో బహుత్ కుచ్ థా' పాట రాగానికి నేను వ్రాసి పాడిన పాట ఇది.

ప్రియురాలికోసం ఎదురుచూడటం ఈ పాటలో పైపైన కనిపించే భావం.దైవాన్ని చేరుకోవడం కోసం పడే తపన అంతర్లీన భావం.ఈరోజు మధ్యాన్నం పదే పది నిముషాలలో ఈ పాట వచ్చేసింది.వెంటనే పాడటం జరిగింది.

'ఒకరోజు నిన్ను చేరుటకై--శిలనై నిలిచానే..." అనే పాదంలో, జీవితానుభవాలనూ కష్టాలనూ రాయిలా సహిస్తూ ఒకనాటికి నీ ఒడిలోకి చేరడంకోసం ఎదురుచూస్తూ జీవయాత్ర సాగిస్తున్నాననే మాటను దైవంతో చెబుతున్నట్లు భావిస్తూ వ్రాయడం జరిగింది.

మొన్న మా పల్లెటూరికి వెళ్ళినపుడు అక్కడ చెరువుగట్టుమీద మర్రిచెట్టు కింద తీసిన ఫోటో ఇది.నా చిన్నప్పుడు ఈ చెరువుగట్టుమీదే ఈ చెట్టుకిందే చాలాసేపు ఒక్కడినే కూర్చుని ఉండేవాడిని.సరిగ్గా 39 ఏళ్ళక్రితం మొదటిసారిగా నాకు ధ్యానానుభవాలు కలిగిన చోటు ఇదే.ఈ చెట్టుక్రిందే ఇలాంటి భావాలు నాకు తరచుగా అప్పట్లో కలిగేవి.

Song:--Ninne talachi talachi
Original song:--Kehne ko bahuth kuch tha by Ch.Atma.
Lyrics and Singing:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే-2
నీ కొరకై వేచివేచి - నా నిదురే కరువాయే
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే

ఏనాటిదో ఈ హృదయమునే- నీ ముంగిట పరచానే
నీ ప్రేమకే నే బానిసనై - నీ వాకిట నిలిచానే
ఆనాటి వలపు దారులలో-- నీకై వేచానే...
నిన్నే తలచి తలచి - ఈ రేయి బరువాయే

ఉన్మాదినై నీ మోహములో - ప్రతిరేయి గడపేనే
నీ రూపమే నా ధ్యానముగా- మదిలోన తలచేనే
ఒకరోజు నిన్ను చేరుటకై-శిలనై నిలిచానే...
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే

నీ కొరకై వేచివేచి - నా నిదురే కరువాయే
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే...
read more " Telugu Melodies-Satya-Ninne talachi talachi.. "

27, ఏప్రిల్ 2015, సోమవారం

Kazi Nazrul Islam జాతకం పరిశీలన-2

ఒక మనిషి జీవితంలోని దశా వివరాలను పరిశీలించడం ద్వారా గ్రహస్వభావాలనూ అవి మానవజీవితాన్ని ఎలా ప్రభావితం గావిస్తాయన్న విషయాలనూ మనం తెలుసుకోవచ్చు.నజరుల్ జీవితంలో దశలు ఎలా పనిచేశాయో గమనిద్దాం.

ఈయన విశాఖా నక్షత్రం -2 పాదంలో జన్మించాడు.విశాఖ రెండోపాదం అంటే అది వృషభ నవాంశ అవుతుంది.కనుక శుక్ర లక్షణాలైన కళలు సాహిత్యం నటన పాటలు రాగాలు ఇత్యాది ఈయన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.అలాగే జరగడాన్ని మనం గమనించవచ్చు.నక్షత్రపాదాల ప్రభావం మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తుందో అనడానికి ఇదే ఒక ప్రబలమైన ఉదాహరణ.

జననసమయంలో గురుమహర్దశ సగం అయిపోయి ఉన్నది.ఈయన గురు/శుక్ర/శుక్ర దశ జరుగుతున్న సమయంలో భూమిమీదకు వచ్చాడు.అందుకే జీవితమంతా ఆధ్యాత్మిక,సాహిత్య,కళారంగాలలో తపించాడు.జనన సమయం లో జరుగుతున్న దశలు ఈవిధంగా మనిషి జీవితాన్ని మొత్తాన్నీ శాసిస్తాయి.

ఈయన జాతకంలో గురుదశ(1907) వరకూ,శనిదశ(1926)వరకూ జరిగాయి.ఈ రెండు దశలు ఆయన జీవితానికి ఒక దిశను సమకూర్చాయి. శనిచంద్రుల కలయికవల్ల ఈ సమయంలో ఆయనకు విశాలమైన ఉదారమైన ఆధ్యాత్మిక భావాల పునాదులు పడ్డాయి.మనిషి జీవితంలోని కష్టాలను కూడా ఆయన అప్పుడే చవిచూచాడు.ఇది శనీశ్వరుని కారకత్వ ప్రభావమే. జీవితంలో కష్టాలను చూడని మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడం అసాధ్యం.

1917 లో చదువు మానేసి బ్రిటిష్ సైన్యంలో చేరాడు.ఆ సమయంలో శని/శుక్ర దశ జరిగింది.చంద్ర లగ్నాత్ శనిశుక్రులిద్దరూ ఈయనకు మంచివారే.కనుక కాళిదాసు సూత్రం ప్రకారం చదువును మధ్యలో మాన్పించి సైన్యంలో చేర్పించారు.లగ్నాత్ బుధుడు పాపి.పైగా చతుర్దంలో వక్ర గురువున్నాడు.కనుక చదువు చెడిపోయింది.సైన్యంలో ఉంటూ విప్లవ కవిత్వం వ్రాస్తూ ఉంటె ఏ ప్రభుత్వం ఊరుకుంటుంది?అందుకని 1920 లో సైన్యాన్ని విడచిపెట్టి కలకత్తాకు చేరాడు.వక్రగ్రహ దశ జరిగే సమయంలో జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయన్న సూత్రం ఇక్కడ అక్షరాలా పనిచెయ్యడం గమనించవచ్చు.

18-6-1921 న ఈయన జీవితంలో ఒక ముఖ్య సంఘటన నరిగింది. ఈయనకు నర్గీస్ అనే యువతితో నిశ్చితార్ధం అయింది.కానీ ఆ రోజున పెళ్ళిపెద్దలు ఒక షరతు విధించారు.వివాహం తర్వాత తను దౌలత్ పూర్లో శాశ్వతంగా ఉండిపోవాలి.ఆ షరతు నజరుల్ కు ఇష్టం లేదు.అందుకని ఆ వివాహాన్ని తిరస్కరించి బయటకు వచ్చేశాడు.ఆ రోజున ఆయన జీవితంలో శని/రాహు/గురు దశ జరుగుతున్నది.శని రాహువులు శపిత యోగం.రాహు గురువులు చండాలయోగం.కనుకే పీటలమీద పెళ్లి ఆగిపోయింది.ఆ విధంగా ఆ పెళ్లి బ్రేక్ అయిపోయింది.

ఆ తర్వాత కొద్ది కాలానికే 1922 లో ఆయన వ్రాసిన 'బిద్రోహీ' అనే కవిత ఆయనకు చిరకాలం నిలిచి ఉండే పేరును తెచ్చి పెట్టింది.ఆ సమయంలో ఏ దశ జరిగిందో గమనిస్తే విచిత్రం కలుగుతుంది.అది శని/రాహు/శనిదశ. అలాంటి శపితదశలో అలాంటి విప్లవ తిరుగుబాటు కవిత్వమే మనిషి వ్రాయగలడు.పేరును తెచ్చేదీ అదే.అలాగే ఖచ్చితంగా జరిగింది.అయితే ఈయన వ్రాసిన కవితలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం చేత నిషేధించబడ్డాయి.రాజద్రోహ నేరం క్రింద ఈయన జైల్లో కూడా పెట్టబడ్డాడు.ఇది కూడా శని/రాహువుల (శపితయోగ)ప్రభావమే.

25-4-1924 న ఈయన ప్రమీలాదేవి అనబడే బ్రహ్మసమాజ సభ్యురాలిని ప్రేమవివాహం చేసుకున్నాడు.ఆ సమయంలో తనకు శని/గురు/శనిదశ జరిగింది.శని పంచమంలో ఉండటమూ,చంద్రలగ్నాత్ మళ్ళీ పంచమాదిపతి కావడమూ,గురుచంద్రులయోగం చతుర్దంలో ఉండటమూ చూస్తే ప్రేమవివాహం కనిపిస్తూనే ఉన్నది.అదే ఆ సమయంలో జరిగింది.

పంచమంలో ఉన్న అష్టమాదిపతి శనివల్ల ఏమి జరుగుతుంది? సంతానానికి గండాలుంటాయి.వారు అల్పాయుష్కులౌతారు.అదే జరిగింది.ఈయన మొదటి కుమారుడు కృష్ణమొహమ్మద్ చిన్నప్పుడే చనిపోయాడు.రెండవ కుమారుడు బుల్బుల్ కూడా అమ్మవారు పోసి చిన్నప్పుడే చనిపోయాడు. తర్వాత సంతానం సవ్యసాచి,అనిరుద్ద్ ఇద్దరూ బ్రతికారు.వీరిలో అనిరుద్ద్ మంచి గిటారిస్ట్ గా ఎదిగాడు.కానీ ఈయన కంటే రెండేళ్ళు ముందే ఈయన కళ్ళముందే చనిపోయాడు.పంచమంలోని వక్రశని వల్ల జరిగే విలయం ఇలా ఉంటుంది మరి.

1936 లో 'విద్యాపతి' అనే సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేశాడు.ఆ సమయంలో బుధ/రాహుదశ నడిచింది.తమ సహజ కారకత్వాలను బట్టి యధావిధిగా రాహు బుధులు ఈయనను సినిమా రంగంలోకి తీసుకెళ్ళారు. బుధుడు శుక్రునితో కలసి దశమంలో ఉండటం చూడవచ్చు.

1939 ప్రాంతాలలో బుధ/గురుదశలో కలకత్తా రేడియోలో పనిచేశాడు.ఆ సమయంలో అనేక సాంప్రదాయ రాగాలపైన పరిశోధన చేశాడు.గురువు యొక్క సాంప్రదాయ కారకత్వమూ ఆయనపైన గల శుక్రబుధుల దృష్టీ ఇలా పనిచేశాయి.

1939 లో బుధ/గురు/కేతుదశలో భార్యకు పక్షవాతం వచ్చింది.సప్తమం నుంచి బుధుడు,కేతువులిద్దరూ రోగాన్ని సూచిస్తారు.గురువు మంచివాడు కాదు.కనుక భార్యకు బుధకారకత్వాలలో ఒకటైన పక్షవాతం వచ్చింది.

1941 లో ఈయనే సీరియస్ రోగం బారినపడ్డాడు.మెదడు నరాలకూ, జ్ఞాపకశక్తికీ కూడా బుదుడే కారకుడు.ఆ సమయంలో బుధ/శని/శుక్రదశ జరిగింది.కర్కాటక లగ్నానికి ఈ ముగ్గురూ పాపులే.శని దీర్ఘరోగానికి సూచకుడు.శుక్రుడు బాధకుడు.బుధుడు పాపి.కనుక జీవితాంతం బాధించిన రోగం ఈ సమయంలోనే ఆయన్ను ఎటాక్ చేసింది.

30-6-1962 న శుక్ర/గురు/చంద్ర దశలో ఈయన భార్య మరణించింది. దారాకారకుడైన గురుని వక్రస్థానం కన్యనుంచి గమనిస్తే,శుక్రుడు అష్టమంలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు.గురు చంద్రులిద్దరూ ద్వితీయ మారక స్థానంలో ఉన్నారు.ఇంకేం కావాలి?

1974 లో రవి/బుధదశలో చిన్నకుమారుడు అనిరుద్ద్ మరణించాడు. పంచమం నుంచి చూస్తే రవి సప్తమ మారకస్తానంలోనూ బుధుడు రోగస్థానంలో మారకుడైన శుక్రునితో కలసి ఉండటం చూడవచ్చు.

29-8-1976 న చంద్ర/చంద్ర/గురుదశలో నజరుల్ మరణించాడు.ఆ సమయంలో గజకేసరీయోగ దశ జరిగింది.కనుక ఆయన కర్మ మొత్తం ప్రక్షాళన చేసుకుని ఉత్తమమైన మరణాన్ని పొందాడని మనం చెప్పవచ్చు. ఆయన ఆత్మ ఉత్తమలోకాలకు చేరుకుని ఉంటుంది. మరుజన్మలో ఈ లౌకిక బాదరబందీలేని ఒక ఉత్తముడైన యోగిగా ఆయన జన్మించాడని మనం ఊహించవచ్చు.ఫోటోలోని ఆయన కళ్ళను గమనిస్తే అవి యోగినేత్రాలన్న విషయం మనం స్పష్టంగా చూడవచ్చు.

అదే నిజం కూడా.

(సమాప్తం)
read more " Kazi Nazrul Islam జాతకం పరిశీలన-2 "

26, ఏప్రిల్ 2015, ఆదివారం

నేపాల్ భూకంపం-రోహిణీ శకట ప్రభావమే

శనీశ్వరుడు రోహిణీ నక్షత్రదృష్టికి దగ్గరౌతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా విలయాలు జరగడం మొదలౌతున్నది.నిన్న నేపాల్లో జరిగిన భూకంపం దీని ప్రభావమే. రోహిణీ శకటభేదనం అనే శీర్షికలో స్టాటిస్టికల్ ఆధారాలతో సహా వివరంగా వ్రాసిన పోస్ట్ లలో ఇలాంటి ప్రకృతి విలయాలు జరుగుతాయని ముందే హెచ్చరించడం జరిగింది.

ఇప్పుడొచ్చిన ఈ భూకంపానికి కారణం మొన్న వచ్చిన సంపూర్ణ చంద్రగ్రహణం కూడా.ఆ చంద్రగ్రహణం భూతత్వరాశియైన కన్యలో సంభవించిందని ఇక్కడ గుర్తుంచుకోవాలి.అంతేగాక చంద్రగ్రహణం వచ్చిన రోజుకూడా శనివారమే. ఈ భూకంపం వచ్చింది కూడా శనివారమే.

ఏ ఏ దేశాలలో అయితే ఈ గ్రహణాలు పూర్తిగా కనిపిస్తాయో ఆయా చోట్ల భూ అయస్కాంత క్షేత్రాలలో మార్పులు రావడమూ తద్వారా ప్రకృతి భీభత్సాలు జరగడమూ మామూలే. గ్రహణాలకూ, గ్రహచారాలకూ, భూమిపైన విలయాలకూ గల ఈ సూక్ష్మ సంబంధాలను ప్రాచీనకాలంలోనే గుర్తించడం జరిగింది.

ఈ గ్రహణం మన దేశంలోని ఈశాన్యరాష్ట్రాలలో సంపూర్ణంగా కనిపించింది. ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రాంతాలు కూడా కలకత్తా నుంచి నేపాల్ వరకూ ఉన్నాయి.ఈ విషయం గమనార్హం.

మొన్న శుక్రవారం నాడు సూర్యశనులు ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిలోకి వచ్చి ఉన్నారు. మర్నాడే ఈ విలయం జరిగింది.

రోహిణీ శకటభేదనం జరిగే ప్రతిసారీ భారీ జననష్టం జరగడం తప్పనిసరి. ప్రస్తుత భూకంపం కూడా ముందుముందు రాబోతున్న ఇంకా భారీ విలయాలకు సూచిక మాత్రమే.

శనిగ్రహ సప్తమదృష్టి ఎంత భయంకరమైనదో వివరిస్తూ నేటికి సరిగ్గా ఆర్నెల్ల ముందు సెప్టెంబర్ -2014 లో వ్రాసిన పోస్ట్ ను ఇక్కడ చదవండి.భారత్, నేపాల్ లలో భూకంపం ఎందుకొచ్చింది అన్న విషయం క్లియర్ గా అర్ధమౌతుంది. 
read more " నేపాల్ భూకంపం-రోహిణీ శకట ప్రభావమే "

23, ఏప్రిల్ 2015, గురువారం

Kazi Nazrul Islam జాతకం-ఒక పరిశీలన

మనుషులంతా ఒక్కటే అని ఎవరన్నారో గాని అది శుద్ధ తప్పుమాట.పూర్తి అజ్ఞానంతో అనబడిన మాట.ఈ మాటను నేనెప్పుడూ నమ్మను.నేనేకాదు ఈ మాటను అనే సోషలిస్టులుగాని కమ్యూనిస్టులుగాని నాస్తికులుగాని ఇంకెవరైనాగాని వారుకూడా దీనిని నిజంగా నమ్మరు. ఏదో మాటవరసకు అంటారంతే.

అందరి రక్తమూ ఎర్రగానే ఉంటుంది అని వాదించే వారికికూడా రక్తంలో గ్రూపులున్నాయనీ,మళ్ళీ ఆ గ్రూపులలోకూడా సూక్ష్మమైన తేడాలుంటాయనీ తెలుసో లేదో నాకైతే తెలియదు.

ఆచరణయోగ్యం కాని అన్ని సిద్ధాంతాల లాగే,ఈ సమ(సామ్య)వాద సిద్ధాంతం కూడా మాటలు చెప్పి ఎదుటిమనిషిని మోసంతో దోచుకోవడానికే అంతిమంగా ఉపయోగపడింది. కోట్లకు పడగలెత్తిన కమ్యూనిస్టు నాయకులే దీనికి ఋజువులు.

ఏ ఇద్దరు మనుషులూ ఎన్నటికీ ఒక్కటి కారు, కాలేరు.శక్తి యుక్తులలో గాని, తెలివిలో గాని,నీతిలో గాని,బలంలో గాని,పాండిత్యంలో గాని,జ్ఞానంలో గాని, ఇతరములైన ఇంకే టాలెంట్స్ లో గాని ప్రతివ్యక్తీ ప్రత్యేకుడే.విభిన్నుడే.మనిషి మనిషికీ మధ్యన స్థాయీ భేదాలు తప్పకుండా ఉంటాయి.

భిన్నత్వమే ప్రకృతిధర్మం.అంతేగాని ఏకత్వం కాదు.అసమానతే ప్రకృతి నియమం.అంతేగాని సమత్వం కాదు.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెబుతున్నానంటే,మనుషుల్లో కూడా చాలా ప్రత్యేకమైన టాలెంట్స్ ఉన్నవారు కొందరుంటారు.అలాంటి వారి జీవితాలను గమనిస్తే చాలా విచిత్రంగా విభిన్నంగా ఉంటాయి.అలాంటివారిలో ఒకడే కాజీ నజరుల్ ఇస్లాం.ఈయన జాతకాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మనిషి టాలెంట్ కూ అతని జీవితం సుఖంగా జరగడానికీ ఏ సంబంధమూ లేదు.సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే-మనం ఏదైనా సాధించగలం,అంతా మన చేతుల్లోనే ఉంది అనుకుంటారు.అది పిచ్చి భ్రమ మాత్రమే.మన చేతుల్లో ఏదీ లేదనే విషయం చాలా లేటుగా మనిషికి అర్ధమౌతుంది.అయితే,మనవల్ల చేతకాని పరిస్థితులు జీవితంలో ఎదురయ్యేదాకా ఈ విషయం చాలా మందికి అర్ధం కాదు.

ఈయన 24-5-1899 న పశ్చిమ బెంగాల్ లోని చురూలియా అనే గ్రామంలో పుట్టాడు.జనన సమయం తెలియదు.ఉదయం 10.20 అని కొందరు అంటున్నారు.అయితే దీనికి ఆధారాలు లేవు.

గురుశనుల వక్రీకరణ వల్ల లోకంతో చాలా కర్మబంధం ఉన్న జాతకం అని అర్ధమౌతున్నది.అంతేగాక చాలా కష్టజాతకం అన్న విషయం కూడా చూడగానే స్ఫురిస్తున్నది.

గురుచంద్రుల యోగం ఉన్నప్పటికీ గురువు వక్రత్వం వల్ల అది ఈయనకు పెద్దగా ఉపయోగపడకుండా పోతుంది.బుధశుక్రులు కలసి ఉన్నందువల్ల కవిత్వం, కళానైపుణ్యం, రచనాశక్తి, భావుకతా ఉంటాయి.శుక్రునిపైన గురుదృష్టి వల్ల ఆధ్యాత్మిక రచనా నైపుణ్యం కలుగుతుంది.రాహుకేతువుల స్థితులు రాశి నవాంశలలో తారుమారవ్వడం వల్ల ఈయన జీవితం అనేక ఆటుపోట్లకు గురౌతుంది.జీవితంలో అత్యంత వైభవాన్నీ అత్యంత దయనీయ స్థితులనూ ఈయన చవిచూస్తాడు.కుజుని నీచభంగస్థితి వల్ల అట్టడుగునుంచి తన శక్తితో జీవితంలో పైకొస్తాడని తెలుస్తున్నది.నవాంశలో రాహుచంద్రులూ గురుకేతువుల కలయిక వల్లా వారిమధ్యనున్న సమసప్తక దృష్టి వల్లా ఈయనది మంచి ఆధ్యాత్మికదృక్పథం ఉన్న జాతకమేగాక,ఒక మతానికి కట్టుబడని మనస్తత్వం అని తెలుస్తున్నది.అనేక మతాలను శ్రద్ధగా అధ్యయనం చేసే విశాలస్వభావం అనీ తెలుస్తున్నది.

ఇప్పుడు ఈయన జీవితంలోని ఘట్టాలను పరికిద్దాం.

ఈయన ఒక ముస్లిం కాజీల కుటుంబంలో జన్మించాడు.చిన్నప్పుడే మతశిక్షణ తీసుకుని మసీదులో పనిచేశాడు.ఆ సమయంలోనే సాంస్కృతిక సంఘాలతో పరిచయం పెంచుకుని నాటకం,సాహిత్యం,కవిత్వాలలో ప్రవేశం పొందాడు.కొన్నాళ్ళు బ్రిటిష్ సైన్యంలో పనిచేసి ఆ తర్వాత కలకత్తాలో జర్నలిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టాడు.

తన రచనలద్వారా తిరుగుబాటును ప్రోత్సహించేవాడు.అందుకని బ్రిటిష్ వారు చాలాసార్లు ఈయన్ను జైల్లో పెట్టారు.'బిద్రోహీ కవి(విప్లవకవి)' అనేది ఈయన బిరుదు.బంగ్లాదేశ్ ఆవిర్భావం సమయంలో కూడా,పాకిస్తాన్ నుంచి విడిపొమ్మని,ఈయన తన రచనలతో ప్రజలని ఎంతో ప్రోత్సహించాడు.

నజరుల్ చాలా అద్భుతమైన కవి.ఈయన దాదాపు 4000 పాటలు వ్రాశాడు. అంతేకాదు వాటికి రాగాలూ సమకూర్చాడు.వీటినే నజరుల్ గీత్ అంటారు. కాళీమాతను ప్రార్ధిస్తూ కొన్నివందల గీతాలు రచించాడు.వాటిని శ్యామాకీర్తనలంటారు.బెంగాలీలో ఘజల్స్ వ్రాయడం మొదలుపెట్టింది ఈయనే.అంతేగాక కొన్ని కొత్త రాగాలనూ ఈయన సృష్టించాడు.మరుగున పడిన రాగాలను కొన్నింటిని వెలికి తీశాడు.

ముస్లింగా పుట్టినా ఈయన ఒక ఉదారవాది.కాళీమాత భక్తుడు. అన్నిమతాలూ చెప్పినది మంచే అని భావించేవాడు.మతాలు ముఖ్యంకాదు మానవత్వం ముఖ్యం అనీ, ఆ మతాలకోసం కొట్టుకుచావడం కాదు,వాటిలోని సారాన్ని అర్ధం చేసుకుని ఆచరించాలనీ లేకపోతే ప్రయోజనం లేదనీ భావించేవాడు.ఈయన శ్రీరామకృష్ణ వివేకానందులను,వారు బోధించిన వేదాంత తంత్రభావాలనూ అమితంగా ఆరాధించేవాడు.

'శ్మశానే జాగిచే శ్యామా మా(అమ్మా కాళీ! నీవు శ్మశానంలో జాగృతురాలవై ఉన్నావు...)' అంటూ భక్తితో ఈయన వ్రాసిన శ్యామాకీర్తన నేడు బెంగాల్లో హిందువులందరి నోళ్ళలోనూ నానుతూ ఉంటుంది.ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.ఇలాంటి భక్తి కీర్తనలు కొన్ని వందలు ఆయన రచించాడు.

1930 ప్రాంతాలలో ఈయన తను వ్రాసిన 800 పాటలను ప్రచురించాడు. వాటిల్లో దాదాపు 600 గీతాలు సాంప్రదాయ రాగాల ఆధారంగా వ్రాయబడినవే.ఈయన వ్రాసిన పాటలలో దాదాపు రెండువేల పాటలు కనుమరుగై పోయాయి.దొరకడం లేదు.ఈయన ఎక్కువగా భైరవీ రాగంలో తన పాటలను వ్రాసేవాడు.అప్పట్లో కొన్ని సినిమాలకు సంగీతదర్శకత్వం కూడా వహించాడు.1939 లో కలకత్తా రేడియోలో ఉద్యోగం చేస్తూ,సంగీతం మీద చాలా రీసెర్చ్ చేసి ఎన్నో మంచి ప్రోగ్రాములు అందించాడు.

ఈయన జాతకంలో ఇదంతా బుధశుక్రుల కలయికవల్లా వారిమీద ఉన్న గురుచంద్రుల దృష్టి వల్లా సూచింపబడుతున్నది.

ఇకపోతే ఈయన జీవితంలోని కష్టాలను గమనిద్దాం.

ఈయన శుక్లచతుర్దశి రోజున జన్మించాడు.పౌర్ణమి దగ్గరలో జన్మించిన వారి వివాహ జీవితాలు బాగుండవని నా రీసెర్చిలో కనిపెట్టిన జ్యోతిష్యసూత్రం ఈయన జీవితంలో కూడా అక్షరాలా నిజం కావడం గమనించండి.మన జన్మతిధిని బట్టి మన జీవితంలో జరిగే సంఘటనలు చాలావరకూ తెలుస్తాయి.దీనికీ శ్రీవిద్యోపాసనకూ సంబంధం ఉన్నది.

ఈయన మొదట్లో ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుందామనుకున్నాడు.కానీ అభిప్రాయ భేదాలవల్ల నిశ్చితార్ధం సమయంలోనే ఆమెతో విడిపోయాడు.ఆ తర్వాత ప్రమీలాదేవి అనే తన అభిమానిని వివాహం చేసుకున్నాడు.కానీ వీరిద్దరి జీవితాలూ చాలా విషాదంతో ముగిశాయి.

1939 లో ప్రమీలాదేవికి నడుమునుంచి క్రింది భాగమంతా పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయింది.1941 లో రవీంద్రనాథ్ టాగోర్ మరణం ఈయన్ను బాగా కృంగదీసింది.ఆ తర్వాత కొద్దినెలలకే ఈయన ఆరోగ్యం కూడా బాగా దిగజారింది.మనస్సు యొక్క స్థితి అనేది శరీరంమీద ఎంత ప్రభావం చూపిస్తుందో అనడానికి ఇదే ఉదాహరణ.

క్రమేణా ఈయనకు మతిమరుపు ఎక్కువైంది.మాటమీద అదుపు తప్పింది. ప్రవర్తన విచిత్రంగా మారింది.చివరకు 1942 లో ఈయన ఒక పిచ్చాసుపత్రిలో చేర్చబడ్డాడు.జీవితం అగమ్యగోచరంగా తయారైంది.చేతిలో డబ్బు అయిపోయింది.భార్యాభర్తలిద్దరూ నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అలా కొన్ని సంవత్సరాలు దుర్భర పేదరికంలో,అనారోగ్యంలో జీవితం గడిచింది.

చివరకు కొందరు అభిమానులూ ముఖ్యంగా 'శ్యాంప్రసాద్ ముఖర్జీ' చొరవతో ఇద్దరినీ మంచి ట్రీట్మెంట్ కోసం లండన్ కూ ఆ తర్వాత వియెన్నా కూ 1952 లో పంపారు.ఇద్దరికీ సరియైన ట్రీట్మెంట్ ఇవ్వబడలేదని అక్కడి వైద్యులు తేల్చారు.ఈరోగాలు తగ్గేవి కావనీ,మరణించేవరకూ ఇలా బాధపడుతూ ఉండటమే తప్ప వీటికి విరుగుడు లేదనీ తేలింది.1953 లో ఇద్దరూ తిరిగి ఇండియాకు తీసుకురాబడ్డారు.

ఈయనకు పిట్స్ డిసీస్ అనేది వచ్చిందని వైద్యులు తేల్చారు.ఈ రోగంలో మెదడులోని నరాల కణాలు క్రమేణా క్షీణించిపోతాయి.దీనివల్ల విపరీతమైన ప్రవర్తన రోగిలో కనిపిస్తుంది.జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.ఆలోచనలు అదుపు తప్పుతాయి.మాట స్వాధీనంలో ఉండదు.అతిబద్ధకం నుంచి అతిప్రవర్తన వరకూ అన్ని స్థితులూ వేగంగా వీరిలో మారిపోతూ ఉంటాయి.సామాన్యంగా ఈ రోగం వంశపారంపర్యంగా జీన్స్ లో వస్తూ ఉంటుంది.

1962 దాకా అలాగే అనారోగ్యంతో బాధపడి ప్రమీలాదేవి చనిపోయింది.1972 దాకా నజరుల్ ఇంటెన్సివ్ కేర్ లోనే ఉన్నాడు.అప్పట్లో ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈయన్ను జాతీయకవిగా గుర్తిస్తూ డాకాకు ఈయన్ను ఆహ్వానించింది.1974 లో ఈయన కుమారుడు కాజీ అనిరుద్ద్ తన కనుల ఎదుటే చనిపోయాడు.ఇన్ని ఎత్తుపల్లాలనూ వైరుద్ధ్యాలనూ విషాదాలనూ తన జీవితంలో చవిచూచిన కాజీ నజరుల్ ఇస్లాం 1976 లో తన 77 వ ఏట కన్నుమూశాడు.ఆయన సమాధి బంగ్లాదేశ్ లో ఉన్నది.

మొత్తం మీద 1939 నుంచీ ఈయన జీవితం మలుపు తిరిగింది.అక్కడనుంచీ కష్టాలు ఈయన్ను వెంటాడటం మొదలైంది.ఆ తర్వాత దాదాపు 36 ఏళ్ళ పాటు నానాబాధలు పడ్డాడు.శనిగురువులు వక్రించిన జాతకాలలో పెద్దవయసు దుర్భరంగా గడుస్తుందని చెప్పే నాడీజ్యోతిష్య సూత్రం ఈ జాతకంలో అక్షరాలా నిజం కావడం గమనించవచ్చు.

ఆత్మకారకుడైన శనీశ్వరుడు జ్యేష్టానక్షత్రంలో వక్రించి ఉంటూ రోహిణీ నక్షత్రంలో ఉన్న సూర్యునితో దృష్టిని కలిగి ఉండటం అనే యోగంవల్ల పెద్ద వయస్సులో ఇన్ని కష్టాలు కలిగాయి.వక్రీకరణ వల్ల చంద్రునితో కలసిన శనీశ్వరుడు కూడా అనేక కష్టాలను ప్రసాదించాడు.ఈ యోగం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం కూడా మనిషికి ఇవ్వబడుతుందని గమనించాలి.జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నవారే ఆధ్యాత్మికం వైపు చూస్తారు.హాయిగా సుఖంగా జీవితాలు గడపేవారు ఆధ్యాత్మికం వైపు రావడం చాలా కష్టం.ఈ విచిత్రం కూడా జాతకాలలో ప్రతిబింబిస్తూ ఉంటుంది.

ఒక విచిత్ర విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.Normal పరిధిని దాటనిదే ఎవడూ ఏ ప్రత్యేకతనూ పొందలేడు.మిగిలిన వారికంటే కొంత abnormality లేకుంటే ఎవరిలోనూ టాలెంట్స్ అనేవి వికసించవు.కానీ ఆ abnormality కూడా కొన్ని పరిధులలోనే ఉండాలి.ఆ పరిధులు కూడా దాటినప్పుడు అదే పిచ్చిగా మారుతుంది.అయితే పిచ్చివాడికి తనకు పిచ్చి అని తెలియదు.వాడికి అది సహజంగానే తోస్తుంది.

లిమిట్స్ లో ఉన్న abnormality ని టాలెంట్ అంటున్నాం.మరీ ఎక్కువైపోయి ఆ లిమిట్స్ కూడా దాటితే దానినే పిచ్చి అంటున్నాం.

కాజీ నజరుల్ ఇస్లాం జీవితమే దీనికి ఉదాహరణ.

నజరుల్ కూ,ఇతని భార్యకూ కూడా, నయంకాని అసాధ్య రోగాలు రావడమూ అది కూడా నరాలకు సంబంధించినవే కావడమూ చాలా విచిత్రం.ఈయన ప్రజలను స్వాత్రంత్ర్యం కోసం రెచ్చగొడుతున్నాడని గమనించిన బ్రిటిష్ వారు జైల్లో పెట్టి విషప్రయోగం చేశారనీ అందుకనే అప్పటినుంచీ ఈయనకు ఈ రోగం సంక్రమించిందనీ ఒక వాదన ఉన్నది.అందులో నిజం ఉందేమో మనకు తెలియదు.ఓషోకు కూడా అమెరికన్స్ విషప్రయోగం చేశారని ఒక వాదన ఉన్నది.అది కూడా నిజమో కాదో మనకు తెలియదు.

ఒక మనిషిలో టాలెంట్స్ మనకు నచ్చనపుడు అసూయతో విషప్రయోగం చేసి అతని జీవితాన్ని దుర్భరం చెయ్యడం పాతకాలంలో ప్రత్యర్ధుల కుట్రలో భాగంగా ఉండేది.ఒక వ్యక్తి మంచి గాయకుడైతే అతన్ని ఏ విందుకో ఆహ్వానించి మెచ్చుకుని గంగసిందూరాన్ని అతని ఆహారంలో కలిపి తినిపిస్తే అతని గొంతు పాడైపోయి జీర వచ్చేసి అతను చివరకు పాడలేని పరిస్థితికి రావడం జరిగేది.ఇలాంటి పనులు పాతకాలంలో చేసేవారు.

అంతదాకా ఎందుకు? "నువ్వు బాంబే చిత్రసీమలో పాడవద్దు.ఇక్కడ అడుగు పెట్టావంటే తేడాలోస్తాయి జాగ్రత్త"- అంటూ జేసుదాస్ కు ఇవ్వబడిన వార్నింగ్ చాలదూ మనుషులలో అసూయ ఎలా పనిచేస్తుందో గ్రహించడానికి?

అదే విధంగా-మొదటి భార్య తరఫు వారు చేయించిన క్షుద్ర ప్రయోగం వల్లనే ఈయన గతీ ఈయన భార్య గతీ ఇలా అయిందని కూడా ఒక వాదన ఉన్నది.ఇదెంత నిజమో కూడా మనకు తెలియదు.

ఒకవేళ ఈ జనన సమయం కరెక్టే అనుకుంటే -- అప్పుడు ఈ లగ్నానికి ఆధిపత్య రీత్యా పాపి అయిన శనీశ్వరుడు ఆరింట రోగస్థానంలో ఉండటం ఒక అసాధ్య దీర్ఘ రోగానికి సూచనే.అలాగే వక్రరీత్యా లగ్నాధిపతి తో కలుస్తూ మనస్సుకు సూచిక అయిన చతుర్దంలో ఉంటూ దశమస్థానంలో ఉన్న మరొక ఇద్దరు పాపులైన బుధశుక్రులను చూడటం ఈయన పడిన బాధలన్నిటికీ సూచిక.బుధశుక్రులిద్దరూ లలితకళలకూ,సంగీత సాహిత్యాలకూ కారకులన్న విషయం మనకు తెలిసినదే.అందుకే ఆ బుదునికీ శనికీ సంబందించిన నరాల రోగమే ఈయనకు వచ్చింది.

లగ్నాన్ని ఆవహించి ఉన్న పంచమాధిపతి నీచకుజుడు కూడా మతి భ్రమణానికి సంబంధించిన ఒక అసాధ్య రోగాన్నే సూచిస్తున్నాడు. 

కళాకారులకు జీవిత చరమాంకంలో మెదడుకూ నరాలకూ సంబంధించిన రోగాలు రావడం మనం గమనించవచ్చు.ఉదాహరణకు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు పక్షవాతంతో బాధపడ్డారు.అలాగే కేవీ మహాదేవన్ కూడా చివరలో మతిభ్రమణం(dementia) తో బాధపడ్డారు.

అయితే మహా సంగీతజ్ఞులైన త్యాగరాజు,శ్యామాశాస్త్రి,ముత్తుస్వామి దీక్షితులు మొదలైనవారికి చివరిలో ఇలాంటి మతిభ్రమణ రోగాలు,నరాల రోగాలు రాలేదు.దానికి కారణం వారికున్న భక్తి కవచం,ఉపాసనాబలం వారిని కాపాడటమే కావచ్చు.

జీవితంలో మనం ఏ అవయవాన్ని ఎక్కువగా వాడతామో దానికి చెందిన రోగమే వస్తుందనేది ఒక సామాన్య సూత్రం.అయితే ఇది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు.అసలు వాడని అవయవాలు కూడా క్రమేణా క్షీణించి వాటికి సంబంధించిన రోగాలు కూడా రావచ్చు.ఇదికూడా ఎల్లవేళలా నిజం కాకపోవచ్చు.ఎందుకంటే ప్రతి ప్రకృతి నియమానికీ ఒక వెసులుబాటు కూడా ఉంటుంది.

ఏదేమైనా--ఒక గొప్పకవీ,ఉదారవాదీ,భావుకుడూ,సున్నిత మనస్కుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలీ అయిన ఒక మనిషి జీవితం ఇలా దుర్భర విషాదాంతం కావడం జీర్ణించుకోలేని విషయం.మనిషి ఎంతటివాడైనా చివరకు కర్మకు బద్దుడే అనడానికి ఇలాంటి జీవితాలే ఉదాహరణలు.
(సశేషం)
read more " Kazi Nazrul Islam జాతకం-ఒక పరిశీలన "

22, ఏప్రిల్ 2015, బుధవారం

మత్తెక్కిన నా హృదయం...


మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..
మఱుగుపడిన ఒక లోకపు
అవధులనే తాకుతోంది...

ఈ ఆనందానికి
ఏ హేతువూ అవసరం లేదు
ఈ ఆనందాన్ని
ఏ తీతువూ అపహరించలేదు
దీనికొకరి తోడూ అవసరం లేదు
ఒకరి నీడా అక్కర్లేదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

ఈ ఆనందం
ఈలోకానిది కాదు
ఈ లోకపు వస్తువులపై 
ఆధారపడి లేదు
దానికి ఒక కారణం లేదు
దానికి మరణమూ లేదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

నేనున్నాను 
నా చుట్టూ ప్రకృతి..
ఇంకేం కావాలి?
ఓహ్..
ఏమిటీ నిష్కారణానందం..?

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

నేనొక మధుపాయినని
చూచేవారనుకున్నారు
అనుకోనీ..
ఈ ఆనందం వారికర్ధం కాదు
నా మధువు రుచి వారికి తెలియదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

మత్తెక్కిన నా హృదయం...
read more " మత్తెక్కిన నా హృదయం... "

15, ఏప్రిల్ 2015, బుధవారం

హోమియో అద్భుతాలు-పాము విషంతో HIV కి ఔషధం

హోమియోపతి అసలు ఒక వైద్యమే కాదని వాదించే అజ్ఞానులు నేటికీ మన చుట్టూ చాలామంది ఉన్నారు.వారితో వాదించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం.వారి అదృష్టం బాగుంటే తెలిసిననాటికి వారికే సత్యం తెలుస్తుంది.లేకుంటే వారి ఖర్మ.మనం ఏమీ చెయ్యలేం.లోకం మొత్తాన్నీ బాగుచెయ్యడం మన పని కాదు.వాదన అనవసరం.

కాకుంటే, హోమియోపతి అనేది ఖచ్చితమైన శాస్త్రీయ విజ్ఞానమే అన్న దానికి రుజువులు మనకు రోజురోజుకూ లభిస్తూనే ఉన్నాయి.

రకరకాల పాములు,తేళ్ళు,మండ్రగబ్బలు,విషపూరిత సాలీళ్ళు,తేనెటీగలు ఇలా అనేక ప్రాణుల విషాలతో చేసిన మందులు హోమియోపతిలో ఉన్నాయి. అవి అనేక రోగాలలో అద్భుతంగా పనిచేస్తాయి.

మొన్న ఏప్రియల్ 10 డా||హన్నేమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ హోమియోపతి సదస్సులో ఒక ముఖ్య విషయం వెల్లడైంది.

మానవాళిని వేధిస్తున్న HIV వైరస్ ను ఎదుర్కోవడంలో 'క్రోటేలస్ హారిడస్' అనబడే హోమియోమందు అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆ పరిశోధనా సారాంశం.ఈ మందు 'రక్తపింజరి' అనే పాము విషం నుంచి తయారు చెయ్యబడుతుంది.ఈ పామునే శాస్త్రీయంగా 'క్రోటేలస్ హారిడస్' అని పిలుస్తారు.ఇంగ్లీషులో 'ర్యాటిల్ స్నేక్' అంటారు.

HIV వైరస్ తన డిజైన్ ను శరవేగంగా ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటుంది.కనుక దానిని డీకోడ్ చెయ్యడం శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారింది.HIV వైరస్ తన వైరల్ RNA ను వైరల్ DNA గా చాలా స్పీడుగా మార్చుకుంటుంది.ఆ విధంగా అది కొన్ని మిలియన్లుగా పెరిగిపోయి రోగి ప్రాణం తీస్తుంది.

మనకు పురాణాలలో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు.వాడి ఒక రక్తపుచుక్క నేలమీద పడితే అందులోనుంచి అనేకమంది రక్తబీజులు పుట్టుకొస్తారు.కనుక వాడికి చావులేదు.వాడిని ఒక్క కాళికామాత మాత్రమే సంహరించగలదు.ఇంక ఏ దేవతలవల్లా ఆపని కాదు.

నేటి వైరస్ లకు ఈ రక్తబీజుడు ఒక మార్మికసూచిక కావచ్చు. వైరస్ లన్నీ రక్తం ఆధారంగా పనిచేసేవే.మన శరీరంలో ఉన్న శక్తిని అవి వాటికనుగుణంగా మలచుకొని విపరీతంగా పెరిగిపోయి శక్తిని పుంజుకుంటాయి.ప్రస్తుత హోమియో ఔషధం ఈ కార్యక్రమాన్ని సమర్ధంగా అడ్డుకుంటుంది.కనుక HIV వైరస్ శరీరంలో పెరిగిపోవడం అనే ప్రక్రియ ఆగిపోతుంది.

ఇది ఊహ కాదు.ఇతర సంస్థలతో కలసి హోమియోపతి రీసెర్చి సంస్థలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ మందు వాడిన రోగిలో HIV virus multiplication ఆగిపోవడం టెస్ట్ లలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది.ఈ విషయాన్నే మొన్నటి హోమియోపతి సదస్సు వెల్లడించింది.

ఇంతకంటే హోమియో ఔషధాల పనితీరుకు వేరే ఋజువు అవసరం లేదనుకుంటాను.

హోమియో ఔషధాలు చాలా బాగా పనిచేస్తాయి.అందులో ఏమీ అనుమానం లేదు.కాకపోతే అవి ఎలా పనిచేస్తున్నాయో హోమియో వైద్యులు చెప్పలేరు. అందుకు కావలసిన నవీన సాంకేతికపరిజ్ఞానం వారివద్ద లేదు.ఆ పరిజ్ఞానం ఉన్న సంస్థలు ఆ విషయాన్ని ఋజువు చెయ్యాలి.పరమాణు స్థాయిలో ఏఏ మార్పులను హోమియో ఔషధాలు తెస్తున్నాయో ఆయా సంస్థలు ప్రాక్టికల్ గా పరిశీలించాలి.అప్పుడు మాత్రమే హోమియో ఔషధాల పనితీరు అర్ధమౌతుంది.

HIV వైరస్ అనేది రాహుకేతువుల చెడుప్రభావం వల్ల మనిషికి వచ్చే వ్యాధి అన్నది నగ్నసత్యం.వైరస్ లన్నీ రాహుకేతువుల ఆధీనంలోనివే.కనీసం వైరల్ ఫీవర్ ఒక మనిషికి రావాలంటే కూడా ఆ మనిషిమీద రాహుకేతువుల చెడుప్రభావం ఉండాలి.అప్పుడే ఆ వైరస్ అతన్ని ఎటాక్ చేస్తుంది.లేకుంటే చెయ్యదు.HIV అనేది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మానవజాతికి రాహుకేతువుల శాపమే.కనుకనే మళ్ళీ పామువిషమే దానికి విరుగుడు కూడా అయ్యింది.రాహుకేతువులకు మన జ్యోతిష్యశాస్త్రం పాము ఆకారాన్నే ఇచ్చిందన్నది గమనార్హం.

రోగాలకూ గ్రహాలకూ ఉన్న జ్యోతిశ్శాస్త్రపు మార్మిక సంబంధాన్ని కూడా ఈ పరిశోధన ఋజువు చేసినట్లే అవుతున్నది.
read more " హోమియో అద్భుతాలు-పాము విషంతో HIV కి ఔషధం "

12, ఏప్రిల్ 2015, ఆదివారం

Telugu Melodies-జీవితమే ఒక ముగియని కలగా...




సి.హెచ్.ఆత్మా పాడిన - జీవన్ ఏక్ అధూరా సప్నా...పాటకు తెలుగులో నేను వ్రాసుకుని పాడిన పాట ఇది.గీత సౌలభ్యం కోసం భావాన్ని అక్కడక్కడా మార్చాను.

Song:--Jeevithame Oka...
Lyrics:--Satya Narayana Sarma
Music:--Kersi Mistry
Singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------


[జీవితమే ఒక ముగియని కలగా
మెలకువ లోనీ... మరుపేగా ]-2
సుఖ దుఖ్ఖములా చిక్కటి వలగా-2
నడపునదెపుడూ విధియేగా
జీవితమే ఒక ముగియని కలగా

ఆశయనే చిరుదీపము చేగొని

నడచితి చీకటి దారులలో
జీవితమనియెడి పరదేశములో
గమ్యము నెరుగని పయనములో
అడుగడుగునా...
అడుగడుగున-కంటక పధములలో -2
ఒంటరినై- నే - నడచితిగా
జీవితమే ఒక ముగియని కలగా...

నావారెవరో కానిది ఎవరో-2
అందరినెరిగితి నెంతయునే
నీతో నడువగ రారెవ్వరునూ-2
ఈ జగమే ఒక మాయ కదా...
విధిగా...
విధిగా నీ నొసటను వ్రాసినదేదో
కాదనినా అది జరుగునుగా

జీవితమే ఒక ముగియని కలగా
మెలకువ లోనీ మరుపేగా
సుఖదుఖ్ఖములా చిక్కటి వలగా-2
నడపునదెపుడూ విధియేగా

జీవితమే ఒక ముగియని కలగా...
read more " Telugu Melodies-జీవితమే ఒక ముగియని కలగా... "

2, ఏప్రిల్ 2015, గురువారం

4-4-2015 చంద్రగ్రహణం - ప్రభావాలు

4-4-2015 తేదీన రాబోతున్న సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశం అంతటా కనిపిస్తుంది.కనుక ఈ గ్రహణ ఫలితాలు మన దేశం మీదా,పౌరుల మీదా ఆరునెలల వరకూ ఉంటాయి.అవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

ఈ గ్రహణం శనివారం నాడు సాయంత్రం 15.47  నుంచి 19.15 వరకూ ఉంటుంది.ఆ సమయంలో కన్యారాశిలోని హస్తానక్షత్రం నాలుగో పాదంలో చంద్రుడు సంచరిస్తూ రాహుగ్రస్తుడౌతున్నాడు.

కనుక కన్యా లగ్నంలో పుట్టినవారి మీదా,శనివారం నాడు పుట్టినవారి మీదా,హస్తానక్షత్ర జాతకుల మీదా ఆర్నెల్లపాటు దీని ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫలితాలు హస్త-4 పాదంలో పుట్టినవారి మీద బలంగా ఉంటాయి.వీరి మానసికస్థితిలో ఈపాటికే మార్పులు గోచరిస్తూ ఉంటాయి. ఎవరికి వారు గమనించుకోవచ్చు.

లగ్న/చంద్రరాశి పరంగా వీటిని గమనించండి.

మేషం
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి.అప్పులు చెయ్యరాదు.శత్రువులనుంచి జాగ్రత్తగా ఉండాలి.రాష్ డ్రైవింగ్ పనికిరాదు.అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు.

వృషభం
మానసిక చింత ఎక్కువౌతుంది.సంతానపరమైన చికాకులు బాధపెడతాయి. ప్రేమికుల ప్రేమ విఫలం అవుతుంది.చదువులో,పోటీ పరీక్షలలో,ఆటంకాలు అపజయాలు కనిపిస్తాయి.

మిధునం
గృహజీవితంలో అశాంతి పెరుగుతుంది.సుఖం లోపిస్తుంది.చదువు కుంటు పడుతుంది.వాహన ప్రమాదాలు జరుగుతాయి.తల్లికి గండం.ఆలోచన లేని నిర్ణయాలవల్లా, ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయాలవల్లా నష్టం కలుగుతుంది.గుండె జబ్బు ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉన్నది.అతి జాగ్రత్త అవసరం.

కర్కాటకం
మాట దురుసు వల్ల,కమ్యూనికేషన్ చేతగాకపోవడం వల్ల నష్టపోతారు. తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు గండం.ఇష్టం లేని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ENT సమస్యలు వెంటాడతాయి.

సింహం
కంటిరోగాలు వెంటాడతాయి.మాట తీరు మార్చుకోకపోతే ఘోరమైన నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.సమయానికి తిండీ తిప్పలు లోపిస్తాయి.ఇంటిలో ఉన్న పరిస్థితుల వల్ల శాంతి ఉండదు.

కన్య
నష్టాలు ఎదురౌతుంది.స్నేహితులు మోసగిస్తారు.పొరుగువారి ఇంటిలో ఒక దుర్ఘటన జరుగుతుంది.మానసిక చింతా,భయమూ పీడిస్తాయి.అనారోగ్యం వెంటాడుతుంది.యాక్సిడెంట్ జరుగవచ్చు.జాగ్రత్తగా ఉండాలి.

తుల
అనుకోకుండా విపరీతమైన ఖర్చు అవుతుంది.ఒక చెడు సంఘటన వల్ల ఆస్పత్రిని దర్శిస్తారు.ఉన్న చోటిని విడచి పెట్టవలసి వస్తుంది.నష్టం ఎదురౌతుంది.

వృశ్చికం
అన్నలకు అక్కలకు స్నేహితులకు గండకాలం.లాభం ఆశించిన చోట నష్టం ఎదురౌతుంది.యాక్సిడెంట్ జరిగి మోకాళ్ళు,పిక్కలకు దెబ్బలు తగులవచ్చు. వాతరోగాలు ఎక్కువౌతాయి.ఇరుగు పొరుగువారికి,సేవకులకు నష్టాలు ఎదురౌతాయి.

ధనుస్సు
వృత్తి వ్యాపారాలలో అనుకోని చెడు ఎదురౌతుంది.కొందరికి ఉద్యోగాలు ఊడిపోతాయి.నష్టం సంభవిస్తుంది.తండ్రిగాని,తండ్రి సమానులు గాని మరణిస్తారు లేదా ఏదైనా రోగంతో మంచాన పడతారు.లేదా వారికి యాక్సిడెంట్ జరుగుతుంది.సమాజంలో చెడ్డపేరు వస్తుంది.

మకరం
కుటుంబంలో ఒక చెడువార్త వింటారు.పెద్దలుగాని,గురువులు గాని పితృసమానులుగాని గతిస్తారు.లేదా ఒక దుర్ఘటనను ఎదుర్కొంటారు.ఒక అనవసరమైన దూరప్రయాణం చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక ప్రగతి మందగిస్తుంది.

కుంభం
ఒక ఘోరమైన నష్టాన్ని చవిచూస్తారు.ఒక దీర్ఘరోగం పట్టుకుంటుంది లేదా తిరిగి విజ్రుంభిస్తుంది.కోర్టు కేసులలో చుక్కెదురౌతుంది.ఆస్తి నష్టపోతారు.

మీనం
జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.వారినుంచి పోరు ఎక్కువౌతుంది.ఒక మానసిక సమస్య తీవ్రంగా వేధిస్తుంది.సమాజంలో నీలాపనిందలు ఎదుర్కుంటారు.

ఈ ఫలితాలను ఎదుర్కోడానికి -- తెలిసినవారి వద్ద సరియైన పరిహారాలు తెలుసుకొని వ్యక్తిగత జీవితంలో వాటిని ఆచరిస్తూ, ఆర్నెల్ల పాటు జాగ్రత్తగా ఉండాలి.

టీవీలలోనూ,రోడ్డు పక్కనా,ఎవరుబడితే వారు చెప్పిన పిచ్చిపిచ్చి రెమెడీలు చేసి డబ్బు నష్టపోవద్దు.తార్కిక శాస్త్రీయత లేని పరిహారాలు పనిచెయ్యవు.

ఈ ఫలితాలు అందరికీ జరుగుతాయని భయం వద్దు.ఇవి అందరికీ జరగవు.ఎవరికైతే చెడు దశలు జరుగుతున్నాయో,ఎవరికైతే ఏలినాటి శని, అష్టమశని,అర్దాష్టమ శని వంటి గోచారాలు జరుగుతున్నాయో వారికి మాత్రమే ఇవి జరుగుతాయి.మంచి దశలు జరుగుతున్నవారికి స్వల్పమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తాయి.కనుక అనవసరమైన భయాందోళనలు పనికిరావు.
read more " 4-4-2015 చంద్రగ్రహణం - ప్రభావాలు "

26, మార్చి 2015, గురువారం

అతిసాహసం-అందం పైన మక్కువ-గ్రహాలు మానవ మనస్సుపై ఎలా పనిచేస్తాయి?

సూక్ష్మ జ్యోతిష్య ఫలితాలు నిజమే అని ప్రతిరోజూ రుజువులు వస్తున్నాయి.ఈ పదిహేను రోజులూ ప్రత్యేకమైనవి గనుకనే-నూతన సంవత్సర ఫలితాలు కూడా వ్రాయకుండా-ఇవి వ్రాశాను.

మచ్చుకి రెండు సంఘటనలు చూద్దాం.సరిగ్గా మొన్న రెండు సంఘటనలు జరిగాయి.

1.అతి సాహసం-80 ఏళ్ళ వయసులో

మా ఇన్స్పెక్టర్ ఒకాయన తండ్రికి 80 ఏళ్ళు.మొదట్నించీ పొలం పనులు చేసిన ఒళ్ళు కావడం ఏమో,మనిషి ఇప్పటికీ గట్టిగానే ఉంటాడు.కానీ సరిగ్గా మొన్న మధ్యాహ్నం పూట-ఏదో పూనినట్టు-మోటార్ సైకిల్ తీసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ బయల్దేరాడు.ఒక్కడివే మోటార్ సైకిల్ ఒద్దని ఇంట్లోవాళ్ళు ఎంత చెప్పినా వినలేదు.స్పీడుగా పోతుంటే,ఆపుకోలేక క్రిందపడి,యాక్సిడెంట్ అయింది.తుంటి ఎముక, తొడ ఎముకలు మూడు చోట్ల విరిగిపోయాయి.ఈ యాక్సిడెంట్ ఒంగోలులో జరిగింది.

ఆయన్ను హుటాహుటిన గుంటూరుకు తెచ్చి ఆపరేషన్ చేసి,ఇంకా వెన్నెముకకు సంబంధించిన పరీక్షలు ఏవో చెయ్యాలంటే విజయవాడకు తీసుకెళ్ళి ఆ పరీక్షలు కానిచ్చి,అక్కడనుంచి మళ్ళీ ఒంగోలుకు చేర్చారు.ఆపరేషన్ సక్సెస్ అయింది.కానీ కనీసం మూడునెలలు మంచం మీద ఉండాలి.

మనం ఎన్నోసార్లు ఒక పని చేసి ఉంటాం.ఇంకోసారి కూడా చేస్తే ఏమీ కాదులే అని అనుకుంటాం.కానీ అప్పుడే జరగాల్సినది జరుగుతుంది.ఆ విధంగా-ఆ సమయంలో -ఆ పని చెయ్యమని- గ్రహాలు మనిషిని తీవ్రంగా ప్రేరేపిస్తాయి.

అందుకే పాతకాలంలో అనేవారు- "ఎంతమంది చెప్పినా వినకుండా -ఏదో గ్రహం పూనినట్లు చేశాడు-ఇలా జరిగింది."--అని.

పెద్ద వయసులో సాహసాలు పనికిరావు- అందులోనూ గ్రహస్థితులు బాలేనప్పుడు అస్సలు పనికిరావు- అనేది ఈ సంఘటన నేర్పే గుణపాఠం.

2.అందం మీద అతి శ్రద్ధ-ప్రాణం తీసిన 6 కేజీలు

మా దగ్గర పనిచేసే ఒక గార్డుగారి అమ్మాయి మంచి తెలివైనది.మెరిట్లో MBBS సీటు తెచ్చుకుంది.కోర్స్ అయిపోయింది.PG ఎంట్రెన్స్ వ్రాసింది. అందులో కూడా స్టేట్ ర్యాంక్-3 వచ్చింది.ప్రస్తుతం PG లో చేరాలి.ఈలోపల అందం మీద శ్రద్ధ ఎక్కువైంది.తను ఉండవలసిన బరువు కంటే ఒక్క 6 కేజీలు మాత్రం ఎక్కువ ఉన్నదట.ఆ 6 కేజీలు మాత్రం ఎందుకుండాలి? అన్న బాధతో ఒక జిమ్ లో చేరింది.యూనివర్సిటీ క్లాసులు మొదలయ్యే లోపు ఈ 6 కేజీలు ఎలాగైనా తగ్గాలన్న పట్టుతో జిమ్ తీవ్రంగా చేస్తున్నది.

సరిగ్గా మొన్న సాయంత్రం - గుంటూరులో జిమ్ లో ట్రెడ్ మిల్ మీద పరిగెత్తుతూ పరిగెత్తుతూ హటాత్తుగా కుప్పకూలిపోయింది.ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపు చనిపోయింది.

ఆమె వయసు 22 ఏళ్ళు.

ఇప్పుడేం చేస్తే, ఆ తల్లిదండ్రుల గుండెకోత తీరుతుంది? వారి శేషజీవితం అంతా కుమిలిపోతూ శాపగ్రస్తులలాగా జీవచ్చవాల లాగా బ్రతకాల్సిందేగా?

ఆ మధ్య ఒక మోడల్ - జీరోసైజు కోసం తిండి మానేసి,ఉపవాసాలుండి,ఎక్సర్ సైజులు చేసి,చివరకు ర్యాంప్ మీదే కుప్పకూలిపోయి చనిపోయిందని వార్తల్లో చదివాం.ఇప్పుడు 6 కేజీల కోసం ప్రాణం పోగొట్టుకున్న మెడికో మన కళ్ళ ఎదురుగా ఉన్నది.

6 కేజీల బరువుకోసం ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఏం తెలివైన పని?

ఈ మధ్యన అమ్మాయిలకు అందంమీద అనవసరమైన అతిశ్రద్ధ ఎక్కువౌతున్నది.దానికోసం తిండి మానుకొని అతిగా వ్యాయామాలు చేస్తున్నారు.ఇది చాలా పొరపాటు.ఎవరి అందం వారికుంటుంది.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకోవడం మహా తెలివితక్కువపని.

భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని జంక్ ఫుడ్ తిని చెడగొట్టుకుంటారు. సరియైన రోజువారీ వ్యాయామం లేకుండా పిచ్చి పిచ్చిగా ఒళ్ళు పెంచేస్తారు.ఆ తర్వాత TV లో యాడ్స్ చూచో,లేకపోతే స్నేహితులు చెప్పిన సలహాలు వినో--తీవ్రమైన వ్యాయామాలు మొదలు పెడతారు.తెలిసీ తెలియకుండా చేస్తే అవి ప్రాణం మీదకు తెస్తాయన్న విషయం గ్రహించలేరు.

వీటికి తోడు పనికిమాలిన సినిమా కబుర్లు తోడౌతాయి.

'ఫలానా సినిమా కోసం ఫలానా హీరో ఒక్క నెలలో 20 కేజీలు బరువు పెరిగాడట.మళ్ళీ ఒక్క నెలలో 30 కేజీలు తగ్గిపోయాడట.' అని స్నేహితులు కలసి చెప్పుకుంటూ ఉంటారు.

ఇంతలో పేపర్లో వస్తుంది.ఫలానా సినిమా కోసం జీరో సైజుకు మారిపోయిన హీరోయిన్ అంటూ ఆమె ఫుల్ పేజీ ముప్పాతిక నగ్నచిత్రాన్ని ఆ పేపర్ వేస్తుంది.అది చూచి మన కాలేజీ అమ్మాయిలకు వెర్రి పుట్టుకొస్తుంది.మనం కూడా ఆ హీరోయిన్లా బక్కపలచగా తయారుకావాలి.పొట్ట అనేది వెన్నుకు అంటుకుపోవాలి.అదికూడా ఒక్కనెలలోనే-కాలేజీలు తెరిచేలోపే- జరిగిపోవాలి. తనే కాలేజీ బ్యూటీ అనిపించుకోవాలి.

ఇంకేముంది? తిండి మానేసి జిమ్ ల మీద పడతారు.అదృష్టం బాగుంటే చివరకు ఆస్పత్రిలో తేలతారు.లేకపోతే మార్చురీలో తేలతారు.

జిమ్ లో చేరి వ్యాయామాలు చెయ్యనక్కరలేదు.జంక్ ఫుడ్ తినకుండా,టీవీ ముందూ,కంప్యూటర్ ముందూ కూచునే సమయాన్ని తగ్గించి,రాత్రులు ఎక్కువ మేలుకోకుండా ఉండి,రోజువారీ పనులను ఒళ్ళొంచి చెయ్యడం నేర్చుకుంటే,ఏ ప్రత్యెక వ్యాయామాలూ అవసరం లేదు.మహా కావాలంటే రోజూ ఒక ఇరవై నిముషాలు సింపుల్ యోగా చేస్తే చాలు.

ప్రతి వ్యాయామానికి ఒక ప్రత్యేకమైన డైట్ తీసుకోవాలి.ఒక అనుభవజ్ఞుడైన శిక్షకుని సలహా తీసుకోవాలి.తమంతట తాము నిర్ణయించుకుని తిండి మానేసి ఇష్టం వచ్చిన వ్యాయామాలు అతిగా చేస్తే ఇలాగే అవుతుంది.వ్యాయామాలు ఎవరికీ వారు నిర్ణయించుకుని అతిగా చెయ్యరాదు.చేస్తే ఇలాగే మంచికి బదులు చెడు జరుగుతుంది.

ప్రతి శరీరానికీ ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది.ఆ భాషను అర్ధం చేసుకుని దానికి తగిన వ్యాయామాలు మాత్రమే చెయ్యాలి.అంతేగాని ఎవరో ఏదో చేస్తున్నారని మనమూ అదే చెయ్యబోతే అది మనకు సరిపడక వికటించి ఇలాగే జరుగుతుంది.

మన ఒళ్ళు మనకు చెబుతూనే ఉంటుంది.నువ్వు లిమిట్స్ దాటుతున్నావు.జాగ్రత్త అని.దాని మాట వినడం ముందుగా నేర్చుకోవాలి.అప్పుడు అంతా బాగుంటుంది.

మా అబ్బాయి స్నేహితుడొకడు నాలుగేళ్ల క్రితం ఇలాగే- తన అభిమాన హీరోను చూచి- తనూ 6 ప్యాక్ పెంచాలనుకుని- రైస్ పూర్తిగా మానేసి- ఫ్రూట్ జ్యూసులు మాత్రమె త్రాగుతూ వ్యాయామాలు తీవ్రంగా చేశాడు.ఒకరోజున జిమ్ లో కళ్ళు తిరిగి పడిపోతే,ఆస్పత్రిలో చేర్చారు.కోలుకోడానికి ఆర్నెల్లు పట్టింది.సిక్స్ ప్యాక్ సంగతేమో గాని సిక్స్ మంత్స్ ఆస్పత్రి బెడ్లో ఉండవలసి వచ్చింది.అప్పటి దుష్ప్రభావాలు ఇప్పటికీ ఆ అబ్బాయి ఒంట్లోనుంచి పూర్తిగా పోలేదు.కొన్ని ఇర్రివర్సిబుల్ మార్పులు వస్తే ఇంక అవి తగ్గడం కష్టం.

సరే మీరు చెప్పేది అంతా బానే ఉంది -- గ్రహాలకూ ఆ సంఘటనలకూ సంబంధం ఏమిటి? అని అనుమానం రావచ్చు.

ఉంది.

గ్రహాలు మనిషి మనస్సుమీద పనిచేస్తాయి.లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాయి. పిచ్చిపిచ్చి పనులు చెయ్యమని ప్రేరేపిస్తాయి.ఆ క్రమంలో ప్రమాదాలు ఎదురౌతాయి.ఇదంతా మనిషి పూర్వకర్మానుసారమే జరుగుతుంది.ఇలా అందరికీ ప్రేరేపణ కలగదు.గ్రహస్థితులు బాగాలేనప్పుడు- ఎవరెవరి పూర్వకర్మ బాగులేదో - వారికి మాత్రమె ఇలాంటి పెడబుద్ధులు పుడతాయి. అందరికీ పుట్టవు.

ఇదంతా ఒక సీక్రెట్ సైన్స్.

అందుకే మనవాళ్ళు పాతకాలంలో ఒక మాట అనేవారు.

'పోగాలం వచ్చినపుడు పిదప బుద్ధులు పుడతాయి' అని.

అది అక్షరాలా నిజం. అది ఎంతో అనుభవం మీద చెప్పబడిన మాట.

ఆ ముసలాయన కూడా ఎంతమంది చెప్పినా వినకుండా ఆ రోజున మోటార్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు.అలా జరిగింది."మూర్ఖత్వం" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

ఆ అమ్మాయికి కూడా ఇప్పటివరకూ అందంమీద అంత శ్రద్ధలేదు.అందం మీద చిన్నప్పటినుంచీ అంత శ్రద్ధ ఉంటె ర్యాంకర్ ఎలా అవుతుంది? కానీ ఇప్పుడు ఆయుస్సు అయిపోవస్తున్నది.యముడు పిలుస్తున్నాడు.కనుక ఇప్పుడు హటాత్తుగా అందంమీద అతిశ్రద్ధ పుట్టుకొచ్చింది.అదే ప్రాణం మీదకు తెచ్చింది."అతి" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

జీవితంలో జరిగే విచిత్రాలు ఇలాగే ఉంటాయి.మనిషి మీద గ్రహప్రభావాలు ఇలాగే సూక్ష్మంగా ఉంటాయి.వాటిలోని తారతమ్యాలను గ్రహించాలంటే యోగశక్తీ సూక్ష్మదృష్టీ  ఉండాలి.

గ్రహస్థితులు బాగాలేనప్పుడు సాహసాలు చెయ్యకూడదు.ఆ సమయాలలో అనేక జాగ్రత్తలు పాటించాలి.ఈ సూత్రం మళ్ళీమళ్ళీ అనేకసార్లు ఎందరి జీవితాలలోనో రుజువౌతూనే ఉన్నది.

నాకు మొన్న వచ్చిన యాస్ట్రల్ సూచన నిజమే అని ఈ సంఘటనలూ ఇంకా రోజూ జరుగుతున్న ఎన్నో సంఘటనలూ రుజువు చేస్తున్నాయి.
read more " అతిసాహసం-అందం పైన మక్కువ-గ్రహాలు మానవ మనస్సుపై ఎలా పనిచేస్తాయి? "

24, మార్చి 2015, మంగళవారం

సూక్ష్మ జ్యోతిష్యం

సూక్ష్మజ్యోతిష్యం అనేది ఒకటుందన్న విషయాన్ని చాలా పాత పోస్ట్ లలో, అంటే దాదాపు మూడేళ్ళ క్రితం వ్రాసిన పోస్ట్ లలో ప్రస్తావించి ఉన్నాను.ఆ తర్వాత నన్ను అనుసరించే అతి దగ్గరివారితో తప్ప ఈ విషయాన్ని ఎవరితోనూ చర్చించలేదు.

జగన్మాత కృపవల్ల, ఈ సూక్ష్మజ్యోతిష్య రహస్యాలు అనేకం నాకు వాటంతటవే స్ఫురిస్తూ ఉంటాయి.వీటిని ఆమధ్య అప్పుడప్పుడూ వ్రాస్తూ ఉండేవాడిని. తర్వాత కొంతకాలం పాటు ఈ విషయాలు వ్రాయడం ఆపాను.

నా బీరువాకు అనేక సొరుగులున్నాయి.వాటిలో అనేక విషయాలు ఒకేసారి నడుస్తూ ఉంటాయి.ఒక్కొక్కసారి ఒక్కొక్క సొరుగులో విషయాలను గురించి వ్రాస్తూ ఉంటాను.ఇప్పుడు జ్యోతిష్యపు సొరుగును తెరిచి కొన్ని విషయాలను చూద్దాం.

మొన్న మధ్యాహ్నం నాకొక అలౌకికమైన సూచన వచ్చింది.దాని ప్రకారం గమనించగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి.మొన్న మధ్యాహ్నం నుంచి మనుషుల జీవితాలలో- పదిహేనురోజుల పాటు- జరగబోయే మార్పులు ఎలా ఉంటాయో దానివల్ల నాకర్ధమైంది.

వాటిని ఈ క్రింద వ్రాస్తున్నాను.

లగ్నం/రాశిని బట్టి ఈ ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి.గమనించండి.

మేషరాశి
కొత్త ఆలోచనలు కలుగుతాయి.రచనలు గావిస్తారు.ప్రేమ వ్యవహారాలు, కొత్త స్నేహాలు మొదలౌతాయి.కానీ అవి అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు.

వృషభరాశి
ఇంట్లో ఊహించని గొడవలు మొదలౌతాయి.చికాకు ఎక్కువౌతుంది. మనశ్శాంతి లోపిస్తుంది.వాహన ప్రమాదాలు ఎదురౌతాయి.

మిధునరాశి
కాసేపు ధైర్యం కాసేపు పిరికితనం కలిగే పరిస్థితులు ఎదురౌతాయి.సోదర సోదరీలకు కష్టాలు ఎదురౌతాయి.మాట తేలికగా అపార్ధం చేసుకోబడుతుంది.

కర్కాటకరాశి
ఇంట్లో పరిస్థితులు చికాకులు కలిగిస్తాయి.మాట తీరు వల్ల గొడవలు జరుగుతాయి.ధననష్టం ఉంటుంది.

సింహరాశి
హటాత్ అనారోగ్య సూచన ఉన్నది.మానసిక క్రుంగుబాటు ఉంటుంది.ధైర్యం తగ్గుతుంది.పరిస్థితులు ఎదురు తిరుగుతాయి.

కన్యారాశి
నష్టాలు ఎదురౌతాయి.అనుకోని హటాత్ ప్రయాణాలు గావిస్తారు.రోగాలకు ఖర్చు పెరుగుతుంది.ఆస్పత్రులు సందర్శిస్తారు.

తులారాశి
ఇరుగు పొరుగువారికి,బంధువులకు,స్నేహితులకు,నౌకర్లకు కష్టకాలం. చెడువార్తలు వింటారు.డబ్బు నష్టపోతారు.

వృశ్చికరాశి
అనుకున్న పనులు జరగవు.మందగమనంతో నడుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.ఇంట్లో కూడా వాతావరణం అశాంతిమయం అవుతుంది.

ధనూరాశి
పెద్దలు తీవ్ర అనారోగ్యం పాలు అవుతారు.కొందరికి పెద్దలు గతిస్తారు. జీవితంలో అనైతిక ధోరణులు పెరుగుతాయి.

మకరరాశి
డబ్బు ఖర్చు అనుకోకుండా పెరుగుతుంది.హటాత్తుగా డబ్బు ఖర్చైపోతుంది. నష్టాలు చవిచూస్తారు.ఆరోగ్య భంగం ఉంటుంది.

కుంభరాశి
జీవిత భాగస్వామికి చెడుకాలం.సమాజంలో నీలాపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది.వ్యాపారంలో నష్టం వస్తుంది.

మీనరాశి
అనుకోని శత్రువుల నుంచి తాకిడి పెరుగుతుంది.మొండి బాకీలు వసూలౌతాయి.మొండి పనులు అనుకోకుండా అయిపోతాయి.విచక్షణ పెరుగుతుంది.దీర్ఘరోగాలు అదుపులోకి వస్తాయి.జీవితంలో ఆశ పెరుగుతుంది.

రెండు రోజులనుంచీ (సరిగ్గా చెప్పాలంటే మొన్న మధ్యాహ్నంనుంచీ) ఈ మార్పులు అనేకమంది జీవితాలలో మొదలయ్యాయి.నిన్నటినుంచీ స్పష్టంగా ఎక్కువయ్యాయి.గమనించండి.
read more " సూక్ష్మ జ్యోతిష్యం "