నిన్నమధ్యాన్నం పాతఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. తనతో మాట్లాడి దాదాపు రెండేళ్లయింది. 2023 లో తిరువన్నామలై వెళ్ళినపుడు చెన్నైలో కలిశాడు. అప్పటికి తనింకా సర్వీసులోనే ఉన్నాడు. ఏడాది క్రితం చెన్నైలోనే రిటైరయ్యాడు. చాలామంది మా కొలీగ్స్ లాగే తనుకూడా హైద్రాబాద్ లో సెటిలయ్యాడు.
'ఏంటి ఉన్నట్టుండి గుర్తొచ్చాను?' అడిగాను.
'ఈ నెల చివరివారంలో మన బ్యాచ్ వాళ్లందరికీ గెట్ టుగెదర్ పెడుతున్నాం. నువ్వూ రావాలి' అన్నాడు.
మా బ్యాచ్ లో అందరికంటే చిన్న కొలీగ్ మొన్న జూలైలో దిగిపోయాడు. దీనితో రైల్వేలో మా బ్యాచ్ అందరూ రిటైరయ్యారు.
ఇలాంటి పార్టీలన్నీ హైదరాబాద్ లోనే పెడుతుంటారు వీళ్ళు. అది మొదటినుంచీ అలవాటు.
'సారీ నేన్రాను' అన్నాను తడుముకోకుండా.
'అదేంటి? ఎందుకలా?' అన్నాడు.
'మీరు మాట్లాడుకునే మాటలు నేను భరించలేను. దానికోసం అంతదూరం రావడం ఎందుకు?' అన్నాను.
'హైదరాబాద్ రావా అసలు?' అడిగాడు.
'నిన్నగాక మొన్న హైదరాబాద్లోనే ఉన్నా' అన్నాను.
'ఏం?' అన్నాడు.
'ఏదో పనిమీద వచ్చాలే' అన్నాను.
'మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నేను అత్తాపూర్ లో ఉంటాను. వచ్చి కలిసేవాణ్ని కదా' అన్నాడు.
'మామాపూర్ వద్దన్నాడు' అన్నాను.
'వాడెవడు?' అన్నాడు.
'నేనే. ఎవరికీ చెప్పాలనిపించలేదు. అందుకే ఎవరినీ కలవలేదు. వచ్చిన పనిచూసుకున్నాను. వెనక్కు వచ్చేశాను' అన్నాను.
'మనవాళ్ళని కలవచ్చుగా కనీసం' అన్నాడు.
'నా వాళ్ళని కలిశాను. మనవాళ్లతో నాకెందుకు?' అన్నాను.
పార్టీకి నన్ను ఒప్పించాలని చాలాసేపు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు.
'ఆశ్రమం కట్టుకున్నావని విన్నాను' అన్నాడు చివరకు.
'నేను కట్టుకోలేదు. మేస్త్రీలు కట్టారు' అన్నాను.
'అదేలే. ఏం చేస్తుంటావక్కడ?' అడిగాడు కుతూహలంగా.
'నువ్వు మీ ఇంట్లో చేసేదే' అన్నాను.
'దానికోసం అంతదూరం పోవడమెందుకు?' అడిగాడు.
'మనుషులని వెతుక్కుంటూ అడివిలోకి వచ్చాను' అన్నాను.
'ఊరికి దూరమని విన్నాను' అన్నాడు.
'నువ్వు సరిగ్గా వినలేదు. ప్రపంచానికే దూరం' అన్నాను.
'అదికాదు. టైం పాస్ ఎలా అవుతుంది?' అన్నాడు.
చాలామంది అడిగే ప్రశ్న ఇదే.
'దానిదేముంది? మనం పట్టుకోకపోతే చాలు, అదే పాసవుతుంది' అన్నాను.
అదేదో పెద్ద జోకులాగ గట్టిగా నవ్వేశాడు.
'పుస్తకాలు చదువుతుంటావేమో?' అడిగాడు.
'రాస్తుంటాను' అన్నాను.
అది వినకుండా, 'నేనొచ్చి నాల్రోజులుంటా మీ ఆశ్రమంలో' అన్నాడు.
'నాలుగు గంటలు కూడా ఉండలేవు' అన్నాను.
'అదేంటి? వస్తానంటే వద్దంటావు?' అన్నాడు నిష్టూరంగా.
'వచ్చాక నువ్వు పడే బాధ చూడలేను కాబట్టి, వద్దంటున్నాను' అన్నాను.
'మనవాళ్లంతా హాయిగా హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీస్ లో సెటిలైతే, అసలెందుకు అలా దూరంగా ఉంటున్నావు?' అడిగాడు.
'నా కర్మ' అన్నాను.
'అయితే చూడాల్సిందే మీ ఆశ్రమాన్ని' అన్నాడు.
'నీ కర్మ' అన్నాను.
'గాయత్రిని వదలకు. అప్పట్లో బాగా చేసేవాడివి కదా' అడిగాడు 30 ఏళ్లనాటి సంగతులు గుర్తుచేసుకుంటూ.
'నేను వదల్లేదు. తనే వదిలేసింది' అన్నాను.
'అదేంటి?' అన్నాడు మళ్ళీ.
'సావిత్రి వచ్చిందని గాయత్రి వెళ్ళిపోయింది' అన్నాను.
'ఏంటి అదోలా మాట్లాడుతున్నావ్?' అన్నాడు.
'నిన్న సాయంత్రం నుంచీ పిచ్చెక్కింది' అన్నాను.
'ఇంతకీ పార్టీకి రానంటావ్?' అడిగాడు.
'రానని, రాలేనని కాదు. వచ్చి, మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నాను' అన్నాను.
'ఏంటిరా బాబు. సరిగ్గా చెప్పు' అన్నాడు తల బాదుకుంటూ.
'ఏముందిరా? మీరంతా అక్కడ చేరి ఏం చేస్తారు? తింటారు. తాగుతారు. షేర్లు, కార్లు, ఆస్తులు, ఒక్కొక్కడు ఎన్ని ఇళ్ళు కొన్నాడు, పిల్లలు ఎక్కడ సిటిలయ్యారు, వాళ్లెలా సంపాదిస్తున్నారు, మీమీ గొప్పలు, ఎచ్చులు, ఈగోలు, రంకుపురాణాలు, రాజకీయాలు ఇవేగా మీరు మాట్లాడుకునేవి.
సర్వీసులో ఉన్నపుడు ఒక్కడంటే ఒక్కడు మనుషుల్లాగా బ్రతికార్రా మీరు? సగంమందివి అవినీతి బ్రతుకులు. మిగతా సగంమందివి అర్ధంలేని బ్రతుకులు. ఏముంది మీరు చెప్పేది నేను వినేది? మీ సోది నేను తట్టుకోలేను. నా సోది మీరు తట్టుకోలేరు. ఇంకెందుకు అక్కడకి రావడం?' అడిగాను.
ఫ్రెండ్ గాడు పట్టువదలని విక్రమూర్ఖుడు.
'అయినా సరే ఒకసారి రావచ్చుకదా నా కోసం' అన్నాడు.
'నీకోసమైతే, ఈసారి వచ్చినపుడు చెప్తాను. కలువు. ఎక్కడన్నా డిన్నర్ చేద్దాం. మాట్లాడుకుందాం ' అన్నాను.
'సరే అలాగే. కానీ ఇదికూడా కాదనకు. ప్లీజ్'' అన్నాడు.
పాపం ఇంతగా భంగపోతున్నాడని, చివరికిలా చెప్పాను.
'సరే. వస్తాను. డేటు, వెన్యూ పంపించు. ఆ తర్వాత ఏం జరిగినా నా బాధ్యత లేదు. ముందే చెబుతున్నాను. మళ్ళీ నన్ను అనొద్దు' అన్నాను.
'అమ్మయ్య. ఒప్పుకున్నావ్. నేను మేనేజ్ చేస్తాలే. డోంట్ వర్రీ. నువ్వు రా' అన్నాడు.
'తెలిసి తెలిసి దిగుతున్నావ్. నీ కర్మ' అన్నాను.
ఫ్రెండ్ గాడు ఫోన్ పెట్టేశాడు.