Pages - Menu
Pages
15, డిసెంబర్ 2025, సోమవారం
హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2025
9, డిసెంబర్ 2025, మంగళవారం
' వైద్యజ్యోతిషం రెండవభాగం ' ప్రింట్ పుస్తకం విడుదల
మొదటిభాగంలో లాగానే దీనిలోకూడా నూరుజాతకాల విశ్లేషణలతో జలుబు నుండి ఎయిడ్స్ దాకా అనేకరకాలైన వ్యాధులను జాతకాలలో ఎలా గుర్తించాలో వివరించాను. 2022 లో మొదటిభాగం విడుదల అయినప్పటినుండి, తెలుగుపుస్తకం కోసం అనేకమంది జ్యోతిషవిద్యార్థులు, తెలుగుయూనివర్సిటీ నుండి M.A.జ్యోతిషం కోర్సు చేసినవారు, చేస్తున్నవారు అడుగుతున్నారు. ఇప్పటికి ఇది విడుదల అవుతున్నది.
2026 లో, ఇంకొక నూరు జాతకాలతో వైద్యజ్యోతిషం మూడవభాగాన్ని విడుదల చేస్తాను. ఈ విధంగా పదిభాగాలను వ్రాయాలన్నది నా సంకల్పం. మానవజాతిని బాధపెడుతున్న సమస్తరోగాలను జాతకపరంగా ఎలా గుర్తించాలో మొత్తం వెయ్యిజాతకాల విశ్లేషణలతో వివరించే ఈ గ్రంధాలు ప్రపంచ జ్యోతిషచరిత్రలోనే అరుదైన రీసెర్చిగా మిగిలిపోతాయి.
ఈ గ్రంధాన్ని ప్రచురించడంలో తోడ్పడిన నా శిష్యులందరికీ ఆశీస్సులందిస్తున్నాను. ఈ పుస్తకంకూడా జ్యోతిషాభిమానులను ఎంతగానో అలరిస్తుందని భావిస్తున్నాను.
ప్రస్తుతానికి ఈ బుక్ ఇక్కడ లభిస్తుంది.
7, డిసెంబర్ 2025, ఆదివారం
భూతశుద్ధి వివాహం
నేను విజయవాడలో సర్వీసులో ఉన్నరోజుల్లో నాతోపాటు పనిచేసిన కొలీగు ఒకడుండేవాడు. మంచివాడు. కాస్త అమాయకుడు కూడా. పాపం ఏదో రోగంతో 2000 లోనే అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పటికి సర్వీసు ఇంకా పాతికేళ్ళు మిగిలుంది.
వాళ్ళది విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్. అదలా ఉంచితే, వాడు భూతంగా మారి తిరుగుతున్నాడని ఈ మధ్యనే కొందరు ఫ్రెండ్స్ చెప్పారు. నేనైతే నమ్మలేదు. కానీ మంత్రతంత్రాలపైన బాగా రీసెర్చి చేసిన ఒక ఫ్రెండ్ గాడు చెబితే ఏమోలే అనుకున్నాను. ఆ సంగతి అంతటితో విని వదిలేశాను.
ఈ మధ్యన ఆశ్రమం దగ్గర పొలిమేరచెట్లలో దిగాలుగా కూచుని కనిపించాడు. అప్పుడు నమ్మక తప్పలేదు.
' ఏంటి ఇక్కడ కూచున్నావ్?' అంటూ నేనే పలకరించాను.
' గుర్తుపట్టావన్నమాట ! మర్చిపోయావేమో అనుకున్నా' అన్నాడు
' ఎలా మర్చిపోతాను? ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపించినా నీలో మార్పేమీ లేదు' అన్నాను.
' కనీసం నువ్వైనా హెల్ప్ చేస్తావని నీ దగ్గరకి వచ్చాను' అన్నాడు.
' రా మాట్లాడుకుందాం' అంటూ ఆశ్రమంలోకి దారితీశాను.
టీ త్రాగుతూ, ' ఇప్పుడు చెప్పు నీ కధ' అన్నాను.
'ఏం లేదు. ఈ భూతంజన్మ నుండి విముక్తి కోసం వెతుకుతూ ఒక గురూజీని కలిశాను. ఆయనొక ఉపాయం చెప్పాడు. నాలాంటి భూతాన్నొకదాన్ని తెచ్చుకుంటే మా ఇద్దరికీ భూతశుద్ధివివాహం చేయిస్తానన్నాడు. అప్పుడు మాత్రమే మాకు ఈ జన్మనుండి విముక్తి కలుగుతుందట. నాకు నమ్మకం కలగలేదు. పాత ఫ్రెండ్ వి, అందులోను ఇప్పుడు గురూజీవయ్యావు కదాని సెకండ్ ఒపీనియన్ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చా' అన్నాడు.
' భూతశుద్దా? వివాహంతోనా? దీనికి సెకండ్ ఒపీనియనా?' అన్నాను అయోమయంగా.
భూతం బిక్కముఖం వేశాడు.
'అసలు భూతశుద్ధి అనేది ఉందా? లేదా?' అడిగాడు నిరాశగా.
' ఉంది. కానీ అది వివాహంతో రాదు. వివాహంతో ఉన్నది కాస్తా పోతుంది' అన్నాను.
' మరెలా?' అడిగాడు భూతం.
' ధాతుశుద్ధి ఉంటే భూతశుద్ధి జరుగుతుంది. ఇవి రెండూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. అప్పుడు శివానుగ్రహం లభిస్తుంది. నీకు విముక్తి దొరుకుతుంది. నాకు తెలిసినంతవరకూ అదీ ప్రాసెస్. అయితే ఇది పెళ్లితో రాదు. సాధనతో వస్తుంది. సరియైన గురువును అనుసరిస్తూ, సరియైన దిశలో సాధనచేస్తే, నీ అదృష్టం బాగుంటే ఈ జన్మలో రావచ్చు. లేకపోతే అనేకజన్మలు పట్టవచ్చు' అన్నాను టీ సిప్ చేస్తూ.
' అబ్బో అంత లాంగ్ ప్రాసెస్ అయితే కష్టమే. అవన్నీ ఎప్పుడు జరగాలి? ఎప్పుడు నాకు మోక్షం సిద్ధించాలి? దీనికంటే భూతశుద్ధివివాహమే బెటర్. అసలిదంతా లేకుండా సింపుల్ గా పని జరగాలంటే ఎలా?' భూతం ఏడ్చినంత పని చేశాడు.
' ఒకమార్గం ఉంది' అన్నాను.
'ఏంటది?' అడిగాడు ఉత్సాహంగా.
'దేహశుద్ధి ప్రయోగం అని ఒకటుంది. దానిని చేస్తే, భూతశుద్ధివివాహంతో పనిలేకుండానే నీకు మోక్షం వచ్చేస్తుంది. చేయమంటావా?' అడిగాను మంత్రదండంపైన చెయ్యివేస్తూ.
'ఒద్దులే. ఇప్పటికే చాలామంది చేతిలో అయింది. కానీ మోక్షం మాత్రం రాలేదు. నీ ఉపాయం కంటే, ఆ గురూజీ చెప్పినదే బాగుంది. నాకు నచ్చిన భూతాన్ని వెతుక్కుంటా. దొరికాక ఆయన్ను కలుస్తా' అన్నాడు.
'సరే. ఆ పనిమీదుండు. మళ్ళీ ఈ ఛాయలకు రాకు' అని ఉచ్చాటనామంత్రాన్ని జపించాను.
ఫ్రెండ్ భూతం కెవ్వున కేకేసి మాయమైపోయింది.
ఆ విధంగా భూతానికి దేహశుద్ధి చేసే బాధ నాకు తప్పింది. ఎంతైనా పాతఫ్రెండ్ కదా ! చూస్తూచూస్తూ నేనుమాత్రం ఎలా చెయ్యగలను ! ఏదో మాటవరసకన్నాను. నిజమనుకుని పారిపోయింది.
పిచ్చిభూతం !
5, డిసెంబర్ 2025, శుక్రవారం
ఫౌండేషన్
ఈ మధ్యన కొంతమంది స్త్రీలు ఒక కారులో ఆశ్రమానికి వచ్చారు. దానిమీద ఏదో గవర్నమెంట్ పేరు, హోదా వ్రాసి ఉన్నాయి. చూస్తూనే అది గవర్నమెంట్ కారని తెలిసిపోతోంది. అది వారిలో ఒకామె మరిదిగారి అఫీషియల్ కారని తెలిసింది.
వాళ్లు చాలాసేపు కూర్చుని అదీఇదీ మాట్లాడారు.
వారిలో ఒకామె ' నేనుకూడా మెడిటేషన్ చేస్తూ ఉంటాను ' అంది.
ఇప్పుడు ప్రతివారూ ఒక గురువే గనుక ఆమె మాటలకు నేనేమీ స్పందించలేదు.
'ఫలానా గురువు దగ్గర యోగా నేర్చుకున్నాను. ఇంకొక గురువు దగ్గర విపస్సానా చేశాను. ఈషా ఫౌండేషన్ కూడా చేశాను ' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
చూడబోతే, తనను తానొక ప్రత్యేకవ్యక్తిగా ఊహించుకుంటూ, గొప్పలు చెప్పుకునే మనిషిలాగా అనిపించింది. ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నారు కదా !
వినీ వినీ చివరకు ఇలా అన్నాను, ' మీరు చాలా ఫౌండేషన్స్ తిరిగారు నిజమే. కానీ అసలైన ఫౌండేషన్ మాత్రం మీకు పడలేదు'.
వాళ్ళు స్టన్నయ్యారు.
ఇంకా ఇలా చెప్పాను.
'పర్సనల్ పనిమీద వస్తూ, మీ మరిదిగారి అఫీషియల్ కారులో మీరంతా వచ్చారు. అంటే, అఫీషియల్ రిసోర్సెస్ ను వ్యక్తిగతపనులకు వాడుతున్నారు. మెడిటేషన్ కు యమనియమాలే పునాదులు. వాటిలో అపరిగ్రహం అత్యంతముఖ్యమైనది. వ్యక్తిగతజీవితంలో నీతినియమాలు లేకుండా మీరెన్ని ఫౌండేషన్స్ వెంట తిరిగినా, ఎన్ని కోర్సులు చేసినా, చివరకు మీకేమీ ఒరగదు. అసలైన ఫౌండేషన్ మీకు లోపించింది'.
' అలా ఉంటే జీవితంలో చాలా లాసవుతాం కదండి ' అందామె.
'లాసుకు భయపడేవ్యక్తి, ఎంతసేపూ లాభనష్టాలు మాత్రమే చూసుకునే వ్యక్తి, ఆధ్యాత్మికజీవితంలో ఎక్కువదూరం ప్రయాణించలేడు' అన్నాను.
వాళ్ళు నొచ్చుకున్నట్లు కనిపించారు.
ఆ తరువాత వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేదు. బయలుదేరి వెళ్లిపోయారు.
ఒకళ్ళు నొచ్చుకుంటారని నేను అబద్దాలు చెప్పలేను. ఒకళ్ళను మెప్పించవలసిన పనికూడా నాకు లేదు.
ఆధ్యాత్మికజీవితం అనేది ఒక ఇల్లు కట్టడం లాంటిదే.
ఒక శిష్యుని కజిన్ హైదరాబాద్లో ఇల్లు కట్టించుకున్నాడు. కొత్తింటి ఆనందంలో గృహప్రవేశం చేసుకున్నారు. అయితే, బిల్డర్ యొక్క మెటీరియల్ కక్కుర్తి, క్యూరింగ్ సరిగా చేయకపోవడాల వల్ల కొద్దినెలలలోనే ఫ్లోరింగ్ కృంగిపోయి, మక్రానా మార్బుల్స్ అన్నీ బీటలిచ్చాయి. 15-20 లక్షలు ఖర్చుపెట్టి, మార్బుల్ ఫ్లోరింగ్ అంతా మళ్ళీ చేయించుకున్నారు. ఆధ్యాత్మికజీవితం కూడా ఇంతే.
ఫౌండేషన్స్ సరిగ్గా లేకుండా ఎన్ని ఫౌండేషన్స్ వెంట తిరిగినా చివరకు బిల్డింగ్ కృంగిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు.
ఇదెప్పుడు అర్ధం చేసుకుంటారో ఈ మనుషులు !
4, డిసెంబర్ 2025, గురువారం
మనుషులుగా పుట్టే అవకాశం
చాలాకాలం నుంచీ ఈ మనుషులను, ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నాకు నవ్వు, జాలి ఈ రెండే కలుగుతూ ఉండేవి . ఇప్పుడు అసహ్యం కూడా అనిపిస్తోంది. కారణం? సివిక్ సెన్సు, కామన్ సెన్సు, అసలు ఏ విధమైన సెన్సూ లేనివాళ్లు కూడా చాలామంది మనిషిజన్మ ఎత్తుతూ ఉండటమే.
కలికాలమంటే ఇదేనేమో?
మొన్నీమధ్యన ఒంగోలునుంచి కొందరువ్యక్తులు ఆశ్రమానికి వచ్చారు. వచ్చినది మధ్యాన్నం రెండుగంటలకు. అదికూడా చెప్పాపెట్టకుండా అత్తగారింటికి వచ్చినట్లు వచ్చారు. అక్కడే ఆ మనుషుల నిర్లక్ష్యధోరణి అర్ధమౌతున్నది.
ఇక్కడ దగ్గరలోని ఏదో గుడికి వచ్చి, దగ్గరేకదా అని మిమ్మల్ని కూడా చూచిపోదామని వచ్చామన్నారు.
ఇంకా నయం, మీకు మోక్షం ఇవ్వడానికి వచ్చామనలేదు. అంతవరకూ సంతోషం కలిగింది.
'ఇది ఆశ్రమమా?' అన్నాడు వారిలో ఒకాయన కూచుంటూ.
అంటే, ఎక్కడికొచ్చారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారన్నమాట !
నేనేమీ మాట్లాడలేదు.
'ఏం చేస్తారిక్కడ?' మరొకామె అడిగింది అనుమానంగా చూస్తూ.
'చెప్పినా మీరర్ధం చేసుకోలేరు ' అన్నాను.
'ఇంతదూరం వచ్చి ఉంటున్నారేంటి?' మళ్ళీ అతని ప్రశ్న.
'మీ స్వగ్రామం ఎక్కడ?' అడిగాను.
' హైద్రాబాద్ ' అన్నాడు.
'నువ్వెందుకు ఇంతదూరం వచ్చి ఒంగోల్లో ఉంటున్నావు?' అడిగాను.
అదేమీ పట్టించుకోకుండా, 'మీ జ్యోతిష్యపుస్తకాలను ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్ లో కొన్నాము. మా జాతకాలు చూస్తారా?' అడిగాడు.
అంటే, 'నేను జాతకాలు చూచే కమర్షియల్ జ్యోతిష్కుడిలా కనిపించానా?' అని నాపైన నాకే సందేహం వచ్చింది.
'చూడను. నాకు జ్యోతిషం మీద నమ్మకం లేదు' అన్నాను.
'మరి బుక్స్ రాశారుగా' అన్నాడు.
'రాసింది నమ్మేవాళ్ళకోసం. నాకోసం కాదు' అన్నాను.
'ఒంగోలు వస్తుంటారా అప్పుడప్పుడు?' అడిగింది ఆమె.
'తక్కువ. ఎప్పుడైనా వస్తుంటాను' అన్నాను.
'ఈసారి వచ్చినపుడు నాకు ఫోన్ చేయండి. నేనొచ్చి కలుస్తాను' అన్నాడతగాడు.
'నాకు కుదరదు' అన్నాను.
'అదేంటి సార్? ఊరకే జస్ట్ కలుస్తాము. అంతే' అన్నాడాయన.
'అందుకే కలవనంటున్నాను. ముచ్చట్లకు నాకు టైం ఉండదు ' అన్నాను.
'ఈ ల్యాండ్ అంతా మీదేనా?' అడిగింది ఆమె చుట్టూ చూస్తూ.
'కాదు. వేరేవాళ్లది. కబ్జా చేశాను' అన్నాను సీరియస్ గా.
'ఎంతకి కొన్నారు?' అడిగాడొకడు నేను చెబుతున్నది వినకుండా.
' ఎకరం పదిరూపాయలు ' అన్నాను.
వాళ్ళు ఆమాట కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరు.
'మరిక్కడ అన్నీ దొరుకుతాయా?' అడిగిందామె.
'ఏవీ దొరకవు ' అన్నాను.
'మరెలా?' అన్నది.
'ఎందుకు దొరకాలి? దొరక్కపోతే ఏమౌతుంది? ' అన్నాను.
'మీ పుస్తకాలు ఇంకా ఏవైనా ఉంటే చూపిస్తారా?' అడిగాడతను.
' ఇక్కడుండవు' అన్నాను.
' అదేంటి?' అతనికి సందేహం వచ్చింది.
'రాసేది నేను చదువుకోవడానికి కాదు' అన్నాను.
'ఇక్కడ గుడేమీ లేదా? ' అన్నాడు అతనే మళ్ళీ.
'ఇప్పుడే బయటకెళ్ళింది. సాయంత్రం వస్తుంది ' అన్నాను.
'సరేనండి వెళ్లొస్తాం. మీలాంటి పెద్దవాళ్ళని కలవడం మా అదృష్టం' అన్నాడతను లేస్తూ. వాళ్ళకు చెవుడా? లేకపోతే వాళ్ళ ధోరణే అంతేనా? నాకైతే అర్ధం కాలేదు.
'గురువుగారు లేచాక చెప్తాలెండి మీరొచ్చి వెళ్లారని ' అన్నాను నేనూ లేస్తూ.
వాళ్ళది కూడా వినిపించుకోలేదు. వాహనం ఎక్కి వెళ్లిపోయారు. అసలెందుకొచ్చారో ఎందుకు వెళ్లారో వారికన్నా తెలుసా? అనే అనుమానం నాలో తలెత్తింది.
మనం ఎక్కడికొచ్చాం? ఏం మాట్లాడాలి? అన్న స్పృహకూడా చాలామందిలో ఉండటం లేదు.
నాకీసారి దేవుడిపైనే జాలి కలిగింది. అన్నిజీవులకూ మనుషులుగా పుట్టే సమాన అవకాశం ఇస్తున్నందుకు.

