ఆచార్యులవారి జననతేదీ గురించి చాలామంది పరిశోధకులు రకరకాలైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. వాటిని ఇక్కడ పరిశీలిద్దాం.
1. ఏదో ఒక శక ప్రారంభం నుంచి 1443 ఏళ్ల తర్వాత ఆయన జన్మించినట్లు కొందరు వ్రాశారు. కలియుగం క్రీ. పూ 3102 లో మొదలైనట్లు మనకు తెలుసు. అక్కడనుంచి చూస్తే, క్రీ పూ 1659 వ సంవత్సరం వస్తున్నది. శ్రీ రామానుజులు కుళోత్తుంగచోళుని కాలంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. కరికాలచోళునితో ఆయనకు విరోధం ఉండేది. ఈ కరికాలచోళునికే క్రిమికంఠచోళుడని మరో పేరుంది. ఈ రాజు గొంతుకేన్సర్ తో చనిపోయాడు. కుళోత్తుంగ చోళుడు క్రీ. శ 1070 - 1122 మధ్యలో తమిళనాడును పాలించినట్లు ఆధారాలున్నాయి. కనుక క్రీ. పూ 1659 సరియైన సంవత్సరం కాదు.
2. చిత్తిరైమాసంలో తిరువాధిరై నక్షత్రం ఉన్న రోజున ఆచార్యులు జన్మించారని చెప్పబడింది. తిరువాధిరై అంటే ఆర్ద్రానక్షత్రం. అయితే, తమిళ చిత్తిరైమాసం వేరు. తెలుగు చైత్రమాసం వేరు. ఇవిరెండూ ఒకటి కావు. కారణం, మనది చాంద్రమానం, తమిళులది సూర్యమానం. వారి చైత్రమాసం సూర్యుని యొక్క మేషరాశి ప్రవేశంతో ప్రారంభమౌతుంది. ఇది ఏప్రిల్ 14 న జరుగుతుంది. అంటే, మన వైశాఖమాసంలో వారి చిత్తిరైమాసం వస్తుంది. లెక్కలు వేసేటప్పుడు ఇది గుర్తుండాలి. లేకపోతే పొరపాటు పడే ప్రమాదం ఉంటుంది.
3. 'ప్రపన్నామృతం' అనే గ్రంధం ప్రకారం, 4119 కలియుగాదిగా ఆచార్యుల జననం జరిగింది. కలియుగం 3102 BC లో మొదలైంది. కనుక దానిని తీసివేస్తే ఇది క్రీ. శ 1017 అవుతుంది.
4. ఇంకొక గ్రంధం ప్రకారం పింగళనామ సంవత్సరమని, కర్కాటకలగ్నమని, మిట్టమధ్యాహ్న జననమని చెప్పబడింది. 1017 పింగళనామ సంవత్సరమే. మధ్యాన్నమంటే సూర్యుడు దశమంలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అంటే, ప్రసిద్ధకర్మ యోగం కలిగింది.
5. మరొక్క గ్రంధం ప్రకారం ఆచార్యులవారు ఆయుష్మాన్ యోగంలోనూ, భద్ర కరణంలోనూ జన్మించారు. ఇది నిజమే కావచ్చు కానీ ప్రస్తుత లెక్కలతో సరిపోవడం లేదు. అప్పటి పంచాంగగణనం తేడాగా ఉండి ఉండవచ్చు. కానీ, ఆయన 120 ఏళ్ళు జీవించారు. దైవానుగ్రహంతో ఎన్నో గండాలను భద్రంగా దాటారు. ఈ వివరాలు, ఆయన జనన సమయాన్ని సరిగ్గా గుర్తించడానికి ఉపయోగిస్తున్నాయి. పంచాంగముల అసలైన ఉపయోగం ఇదే.
6. ఇంకొక గ్రంధం ప్రకారం, ఆచార్యులవారు శుక్లపంచమి రోజున, శుక్రవారం నాడు జన్మించారు. కానీ, గురువారం అని మరికొన్ని చోట్ల చెప్పబడింది. తిధులు వారాల లెక్కలలో ప్రాంతీయ పంచాంగాల ఉపయోగాన్ని బట్టి ఈ తేడాలు వచ్చి ఉండవచ్చు.
7. చాలా సంస్కృత, తమిళ గ్రంధాలలో చెప్పబడిన వివరం ప్రకారం ఈయన క్రీ. శ 1017 లో చెన్నై దగ్గరలోని శ్రీ పెరుంబుదూర్ లో జన్మించారు. ఈ వివరాన్ని ఒక కోడ్ భాషలో పొదిగి రికార్డ్ చేశారు అప్పటి గ్రంథకర్తలు.
ఆచార్యులవారి జనన సంవత్సరాన్ని 'ధీర్లబ్దా' పదంతోనూ, దేహత్యాగం చేసిన సంవత్సరాన్ని 'ధర్మోనష్ట:' అనే పదంలోనూ నిక్షిప్తం చేశారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ? సంస్కృతంలో ఉన్న ఈ విచిత్రమైన కోడ్ భాష అర్ధం కావాలంటే కటపయాది సూత్రం తెలియాలి.
నేను వ్యాఖ్యానం వ్రాసిన అభినవగుప్తులవారి 'తంత్రసారం' గురించిన పోస్ట్ లో 'వసురస' అనే పదం 68 అనే అంకెను ఎలా సూచిస్తుందో వివరించాను. అది ఒకరకమైన కోడ్ భాష అయితే, కటపయాది సూత్రం మరొక విధమైనది. ఎంతో క్లిష్టమైన సంఖ్యలను కూడా ఈ విధానంలో చాలా తేలికగా ఇమిడ్చి గుర్తుపెట్టుకోవచ్చు. వినండి !
సూత్రం : 'కాదినవ టాదినవ పాదిపంచ యాద్యష్టౌ' అనేదే ఆ సూత్రం.
అంటే,
కాదినవ - క నుంచి మొదలయ్యే తొమ్మిది వర్ణములు ఒకటి నుంచి తొమ్మిది వరకూ ఉన్న అంకెలను సూచిస్తాయి.
క -1; ఖ -2; గ -3; ఘ -4; ఙ -5; చ - 6; ఛ - 7; జ -8; ఝ -9; ఞ- 0
టాదినవ - ట నుంచి మొదలయ్యే తొమ్మిది వర్ణములు ఒకటి నుంచి తొమ్మిది వరకూ ఉన్న అంకెలను సూచిస్తాయి.
ట -1; ఠ -2; డ -3; ఢ -4; ణ -5; త - 6; థ - 7; ద -8; ధ -9; న- 0
పాదిపంచ - ప నుంచి మొదలయ్యే అయిదు వర్ణములు ఒకటి నుంచి అయిదు వరకూ ఉన్న అంకెలను సూచిస్తాయి.
ప - 1; ఫ - 2; బ - 3; భ-4; మ- 5
యాద్యష్టౌ - య నుంచి మొదలయ్యే ఎనిమిది వర్ణములు ఒకటి నుంచి ఎనిమిది వరకూ ఉన్న అంకెలను సూచిస్తాయి.
య - 1; ర -2; ల -3; వ -4; శ - 5; ష - 6; స - 7; హ -8
ఈ సూత్రాన్ని ఉపయోగించి పైన చెప్పబడిన ఆచార్యుల జనన మరణ సంవత్సరాలను ఎలా కనుక్కోవాలి?
జనన సంవత్సరం - 'ధీర్లబ్దా'. ఈ పదానికి అర్ధం 'బుద్ధి వచ్చింది' అని.
అంటే, ' ఆచార్యులవారి జననంతో, అప్పటివరకూ ఉన్న అయోమయం తొలగిపోయి శాస్త్రాల పరంగా చక్కని ఆవగాహన వచ్చింది 'అని అర్ధం. కటపయాది సూత్రం ప్రకారం ధీ - 9; ల - 3; ధా - 9; అంకానాం వామతో గతి: గనుక, ఈ మాటకు 939 అని అర్ధం. శక సంవత్సరం క్రీ. శ 78 లో మొదలైందని మనకు తెలుసు. కనుక 78+939 --- క్రీ. శ 1017 వ సంవత్సరమని అర్ధం.
ఇక, ఆయన దేహత్యాగం చేసిన సంవత్సరాన్ని 'ధర్మో నష్ట:' అనే పాదంతో సూచించారు. అంటే, 'ధర్మం నశించింది, మాయమైపోయింది' అని అర్ధం. కటపయాది సూత్రాన్ని ఉపయోగిస్తే, ధ - 9; మ-5; న - 0; ట - 1; దీనిని తిరగద్రిప్పితే 1059 అవుతుంది. శక సంవత్సరానికి కలిపితే 78+1059 --- క్రీ. శ 1137 అవుతుంది.
అంటే, ఆచార్యులవారు క్రీ. శ 1017 లో పుట్టి, 1137 లో పోయారన్నమాట. కనుక 120 ఏళ్ళు జీవించారు. ఈ విధంగా రెండే రెండు పదాలలో అద్భుతంగా ఆచార్యుల జనన, మరణ సంవత్సరాలను నర్మగర్భంగా ఇమిడ్చారు ఆయన చరిత్రను వ్రాసిన శిష్యులు.
శ్రీవైష్ణవ సాంప్రదాయంలో చెప్పబడే ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణుల పరమభక్తుడైన శ్రీ రామకృష్ణానందస్వామి 1898 లో బెంగాలీ భాషలో రచించిన 'శ్రీ రామానుజ చరిత్ర' అనే పుస్తకంలో ఉటంకించారు.
3. బీవీ.రామన్ గారు తన 'నోటబుల్ హోరోస్కోప్స్' అనే పుస్తకంలో శ్రీమద్రామానుజాచార్యులవారి జాతకాన్ని ఇస్తూ, జననతేదీ 4-4-1017 అని వ్రాశారు. ఆయనిచ్చిన జాతకంలో చంద్రుడు 13.50 మిధునం అని, ఆర్ద్రా నక్షత్రమని వ్రాశారు. కానీ ఆ రోజున చంద్రుడు మీనరాశి 14.03 డిగ్రీలమీద సంచరించాడు. ఆ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రమైంది. 10-4-1017 న మాత్రమే చంద్రుడు ఆర్ద్రా నక్షత్రంలో ఉన్నాడు. 10 వ తేదీ జాతకాన్ని ఇస్తూ ఆయన పొరపాటున 4 వ తేదీగా చూపించారని, అది ముద్రా రాక్షసమని సరిపెట్టుకుందాం.
4. చిత్తిరై మాస శుక్ల పంచమి, షష్టి, ఏకాదశి అనే మూడు తిధులు ఆచార్యులవారి జనన తిధులుగా చాలా పుస్తకాలలో కనిపిస్తున్నాయి. గురువారం, ఆర్ద్రా నక్షత్రం, మిట్టమధ్యాహ్న జననమని చెప్పబడింది. సామాన్యంగా సూర్యుని మేషసంక్రమణం ఏప్రిల్ 14 న జరుగుతుంది. కానీ 1017 సంవత్సరంలో ఇది ఏప్రిల్ 1 వ తేదీన జరిగింది. 1017 సంవత్సరంలో ఏప్రిల్ 10 తేదీన ఆర్ద్రా నక్షత్రం, గురువారం అయింది. తిధి శుక్లషష్టి అయింది. కనుక 10-4-1017 వ తేదీని ఆచార్యులవారి జననతేదీగా నేను పరిగణిస్తున్నాను.
జనన సమయం మధ్యాన్నం 11. 50 నుండి 12. 04 మధ్యలో ఉంటుంది. అది కూడా, 11. 59 నిముషాలకు జరిగి ఉంటుందని నేను ఊహిస్తున్నాను. ఈ లెక్క ఎలా వేశానో చెప్పను, తెలివైన జ్యోతిష్య విద్యార్థులు ఊహించి తెలుసుకోండి.
(ఇంకా ఉంది)