Pages - Menu

Pages

31, జులై 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 33 (గౌరీమా - ఊహాతీత తపోమయ జీవితం)

హరిద్వార్ నుంచి ఋషీకేశ్ కు అదే సాధువుల గుంపుతో కలసి ఆమె చేరుకుంది.ఆ తపోభూమికి చేరుకున్న తదుపరి వారినుంచి సెలవు తీసుకుని ఒంటరిగా హిమాలయ పర్వతాలలో సంచరించ సాగింది.

హిమాలయాలలో గడపిన మూడేళ్ళలో అనేక క్షేత్రాలను ఆమె దర్శించింది.బదరీనాథ్, కేదార్ నాద్,రుద్రప్రయాగ, అమర్నాథ్,ఉత్తరకాశీ వంటి లోతట్టు హిమాలయ ప్రాంతాలలో ఉన్న అన్ని క్షేత్రాలను ఆమె దర్శించింది.నిరంతరం ఆమె మనస్సు దైవధ్యానంలో మునిగి ఉండేది.

తనతో తెచ్చుకున్న గుడ్డసంచిలో - తనకు ప్రాణప్రదమైన దామోదర సాలగ్రామం,కాళీమాత చిత్రం, చైతన్యమహాప్రభువు చిత్రం, దుర్గాసప్తశతి, మహాభాగవతాలను మాత్రమే ఆమె తనతో ఉంచుకునేది. ఇవి తప్ప ఆమెదగ్గర ఇంకే వస్తువులూ ఉండేవి కావు.

తను ఆడపిల్లనన్న విషయం లోకులకు తెలియకుండా ఉండేందుకు ఆమె జుట్టును పొట్టిగా కత్తిరించి పారేసింది.అందవికారంగా కనిపించడానికి ముఖానికి ఒంటికి బురదను, బూడిదను పూసుకునేది.ఆ విధమైన బికారివేషంలో నిరంతరం కృష్ణధ్యానంలో తపిస్తూ, చలిని, ఆకలిదప్పులను సహిస్తూ,ఎక్కడో తింటూ ఎక్కడో నిద్రిస్తూ హిమాలయాలలో మూడేళ్ళపాటు ఘోరమైన తపస్సు చేసింది ఆ అమ్మాయి.

ఆ మూడేళ్ళలో ఆమె స్థిరంగా ఏ క్షేత్రంలోనూ పట్టుమని పదిరోజులు ఉండేది కాదు.బాగా అవసరం అయితే తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు. పూర్తిగా మౌనదీక్షలో ఉండేది.ఏ సాధుబృందంతోనూ ఎక్కువరోజులు కలసి ఉండేది కాదు. ఏం కట్టుకుందో ఏం తిన్నదో ఏ చెట్లక్రింద నిద్రించిందో ఆ పర్వతాలలో ఆ అడవులలో ఒక్కతే కాలినడకన అన్నన్ని వందల మైళ్ళు దైవం పైన భారం వేసి ఎలా నడిచిందో ఆమెకే తెలియాలి.

ఆమె మనస్సులో సర్వకాల సర్వావస్థలలోనూ కృష్ణుడే మెదులుతూ ఉండేవాడు.నిరంతరం ఆయన ధ్యాస తప్ప ఇంకేమీ ఆమెకు ఉండేది కాదు.

ఎప్పుడైనా రాత్రిపూట కొత్త ప్రదేశంలో ఒక్కతే ఉండవలసి వస్తే, రాత్రంతా నిద్రపోకుండా జపంలోనూ ధ్యానంలోనూ గడిపేది.లేదా గొంతెత్తి కీర్తనలు పాడుతూ తెల్లవార్లూ గడిపేది.

అప్పటివరకూ సుఖంగా తల్లిదండ్రుల చాటున ఉంటూ వేళకు తింటూ చీకూచింతా లేకుండా హాయిగా కాలం గడిపిన పిల్ల.ఒక్కసారిగా ఇటువంటి మార్పుకు ఆమె శరీరం తట్టుకోలేక పోయింది.కానీ అతి త్వరలోనే ఆమె హిమాలయాల చలికి, పస్తులుండటానికి, అనారోగ్యాలకు,మిగిలిన బాధలకు అలవాటు పడింది.

చాలామందికి ఒక సందేహం వస్తుంది. హాయిగా ఇంటి పట్టున ఉండకుండా ఇలాంటి జీవితాన్ని కోరి వరించడం,అందులోనూ వయసులో ఉన్న ఆడపిల్లకు,ఇవన్నీ అవసరమా? ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవచ్చు కదా? అని.

తీవ్రమైన వైరాగ్య జ్వాల మనసులో రగులుతున్నవారి అంతరంగం ఏమిటో అలాంటి స్థితిని అనుభవించిన వారికే అర్ధమౌతుంది గాని బయటనుంచి చూచేవారికి అర్ధంకాదు. ప్రపంచం పట్ల విరక్తీ, భగవంతుని పట్ల తీవ్రమైన తపనా ఉన్నవారి మానసిక స్థాయిని, ఎంతసేపూ తమ సుఖం తాము చూచుకుని,తమ స్వార్ధంకోసం ఎదుటిమనిషికి ఎలాంటి అన్యాయమైనా సరే చెయ్యడానికి ఏమాత్రమూ వెనుదియ్యని మనవంటి క్షుద్రులు ఎంతమాత్రమూ అర్ధం చేసుకోలేరు.

మరి ఆమూడేళ్ళూ ఆ అమ్మాయికి దిక్కెవరు అని అనుమానం వస్తుంది. 'దిక్కులేనివారికి దేవుడే దిక్కు' - అనే సామెత మనకు ఉన్నది.దిక్కులేనివారికే కాదు అందరికీ ఆ దేవుడే నిజమైన దిక్కు. ఎవరికైనా సరే, మనుషుల దిక్కు ఎంతవరకు? నిజంగా ఆలోచిస్తే మనిషికి ఇంకొక మనిషి ఎప్పటికైనా రక్షణ కల్పించగలడా?ఈ ప్రపంచాన్నీ ఈ సమస్తాన్నీ సృష్టించి రక్షిస్తున్న దైవమే ఎవరికైనా సరే నిజమైన దిక్కు.మనం అనుకునే ఇతర దిక్కులన్నీ నిజానికి దిక్కులు కావు. అవన్నీ పెద్ద భ్రమలు.

"అనన్యాశ్చింతయం తో మాం యే జనా: పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్"

"ఎవరైతే ఇతరములేవీ చింతించకుండా ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారి బాగోగులు నేనే చూచుకుంటాను."

అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు వాగ్దానం చెయ్యలేదా? దైవం ఇచ్చిన వాగ్దానం వృధాగా పోతుందా? కానీ ఆ విధంగా ఉండేవారేరి? కోటికి ఒకరైనా ఆవిధంగా ఉన్నవారున్నారా?అందరూ వారివారి అనుమానాలతో భయాలతో,స్వార్ధాలతో, అల్పమైన మనస్తత్వాలతో,అహంకారాలతో,కుళ్ళూ కుతంత్రాల తో కునారిల్లుతున్నవారేగాని చిత్తశుద్ధితో ఈ దైవ వాగ్దానాన్ని పరీక్షించి చూచిన వారెవరున్నారు? ఒకవేళ అలా ఉండి, ఆశాభంగం పొందిన వారు మాత్రం ఎవరున్నారు?

ఆ మూడేళ్ళలో మృడాని ఎన్నో దైవానుభూతులను పొందింది.నిరంతరమూ దైవం తనకు రక్షణగా ఉన్న అనుభూతిని ఆమె ఎన్నో సార్లు గమనించింది.చాలాసార్లు - ఊహించని మనుషుల నుంచీ ఊహించని పరిస్థితుల నుంచీ ఆమెకు సహాయం అందేది. ఎన్నో రోజులు తిండిలేక ఆమె పస్తులుంది.కానీ ఆకలిని లెక్కచెయ్యకుండా రోజంతా ధ్యానంలో కదలకుండా కూచుని ఉండేది.సాయంత్రానికి ఎవరో ఒకరు ఆహారం తెచ్చి ఆమె పక్కన ఉంచి పోయేవారు.కొన్నిసార్లు ఆ ఆహారాన్ని ఆమె తినేది.కొన్నిసార్లు కుక్కలు పిల్లులు మొదలైన జంతువులు ఆ ఆహారాన్ని తినేసేవి. తను మాత్రం దేహస్పృహ లేని ధ్యానంలో తన్మయురాలై ఉండేది.

ఈ విధమైన తపోదీక్షలో ఆ అమ్మాయి హిమాలయాలలో మూడేళ్ళు గడిపింది. ఈ మూడేళ్ళలో కృష్ణునిపైన ఆమె ప్రేమ ఊహించలేనన్ని రెట్లు పెరిగిపోయింది.నిరంతరం కృష్ణుని దర్శించాలని అతనిలో లీనం కావాలని తపించసాగింది.ఆ తపన ఆమెను హిమాలయాల నుంచి కృష్ణలీలా క్షేత్రమైన బృందావనం వైపు ఈడ్చుకొచ్చింది.కానీ అక్కడ యాత్రలకు వచ్చిన ఈమె బంధువు ఒకాయన ఈమెను గుర్తుపట్టి ఈ విషయాన్ని ఈమె తల్లిదండ్రులకు చేరవేశాడు.మళ్ళీ వాళ్ళు వచ్చి తనను ఇంటికి తీసుకుపోతారేమోనన్న భయంతో ఆమె బృందావనాన్ని వదలి పశ్చిమ దిక్కుగా ప్రయాణం సాగించింది.త్వరలోనే ఆమె ద్వారకా నగరాన్ని చేరుకుంది.

బృందావనం కృష్ణుని బాల్యక్రీడకు రంగస్థలం అయితే, ద్వారకా నగరం ఆయన రాజుగా రాజ్యం నడిపిన ప్రాంతం.తన రాజ్యం స్థాపించుకోవడానికి ఎక్కడా చోటు దొరకక, చివరకు సముద్రం వెనక్కు పోగా బయటపడిన ప్రాంతాన్ని తన రాజ్యంగా చేసుకుని అక్కడ ఉన్నాడాయన.అది కూడా ఆయన యొక్క దివ్యలీలకు భూమిక అయిన ప్రాంతమే.అక్కడ కూడా అనేక దేవాలయాలు ఆయనకు ఉన్నాయి.

అక్కడ రణచోడ్ జీ ఆలయంలో ఆమెకు ఒక దివ్యానుభవం కలిగింది.

ఆ ఆలయంలో ఉన్న కృష్ణుని విగ్రహం చాలా అందంగా ఉంటుంది.ఆ ఆలయానికి ఆమె చేరుకునే సరికి ఆరోజుకు కృష్ణునికి నైవేద్యం పెట్టడం అయిపొయింది.దేవాలయంలో కొంచం పక్కగా కూచుని ఆమె ధ్యానంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా ఆమె ఒక దృశ్యాన్ని చూచింది.

చాలా అందంగా ఉన్న ఒక నల్లని పిల్లవాడు అప్పుడే అన్నం తిని ఇంకా మూతి కడుక్కోకుండా,పెరుగన్నం అంటుకుని ఉన్న పెదవులతో నవ్వుతూ ఈమె ఎదురుగా నిలుచున్నట్లు హటాత్తుగా ఈమెకు కనిపించింది.మొదట్లో ఆ పిల్లవాడు కృష్ణుడని ఆమెకు తోచలేదు.ఎందుకంటే, దైవదర్శనాలలో సామాన్యంగా ఉండే వెలుగు మొదలైన లక్షణాలు ఆ దర్శనంలో లేవు.ఒక మామూలు పిల్లవానిలాగే కృష్ణుడు ఆమెకు కనిపించాడు.

ఇదేంటి? ఈ ఊరిలో పూజారులు తమ పిల్లలను గుడికి తీసుకువచ్చి వారికి ఇక్కడే అన్నం తినిపిస్తారేమో? ఇది ఇక్కడి పద్ధతేమో? అని ఆమె అనుకుంది.అలా అనుకుని చూస్తూ ఉండగానే ఆ పిల్లవానికి పూజారి నీళ్ళు ఇవ్వడమూ ఆ నీటితో మూతి కడుక్కున్న ఆ పిల్లవాడు పక్కనే ఉంచిన తన మురళిని తీసుకుని నవ్వుతూ గర్భగుడిలోని సింహాసనం మీద కూచోవడమూ ఆమె చూచింది.ఆ క్షణంలో - తాను చూస్తున్నది కృష్ణుడినే అన్న స్పృహ ఆమెకు కలిగింది. అలా ఆమెకు ఆ స్పృహ కలిగిన మరుక్షణమే ఆ దృశ్యం మాయమై పోయింది.

ఒక్క ఒదుటున లేచిన మృడాని పిచ్చిదానిలా పరుగెత్తుకుంటూ గర్భగుడి గడప వద్దకు వెళ్లి అక్కడ కూలిపోయి భోరుమంటూ ఏడవసాగింది. ఇదంతా చూస్తున్న పూజారులు ఆమె వద్దకు వచ్చి - 'పాపం ఈ పిల్లకు ఏం కష్టం వచ్చిందో?' - అంటూ ఓదార్చడానికి ప్రయత్నించసాగారు. కానీ ఆ ఏడుపు - కష్టాలనుంచి పుట్టిన మామూలు ఏడుపు కాదన్న సంగతి వారికెలా తెలుస్తుంది?

కృష్ణుడు చాలా అల్లరివాడు.తన ప్రేమికులను ఆయన భలే ఏడిపిస్తాడు.అలా ఆ గడప పైన పడి ఎంత ఏడ్చినా ఆ నల్లనివాడు మళ్ళీ మృడానికి కనిపించలేదు. ఎంత ఏడ్చినా ఉలకడు.పలకడు.తన గోపికలతో ఈ విధంగా దాగుడు మూతల ఆటలాడటం అంటే ఆయనకు భలే సరదాగా ఉంటుంది కాబోలు.

ద్వారకలో ఆ అనుభవం కలిగిన తదుపరి ఆమె మనస్సు మళ్ళీ బృందావనం వైపు బలంగా లాగబడింది.పగలూ రాత్రీ ఒకటే ఆలోచన ఆమెను వెంటాడి వేధించేది. నిరంతరం కృష్ణునితో ఎలా కలసి ఉండాలి? ఎప్పుడూ వీడిపోకుండా తన ప్రియునితో ఆనందసాగరంలో మునిగి రోజులు ఎలా గడపాలి? ఎల్లప్పుడూ ఇదే ఆలోచన ఆమెను భూతంగా వెంటాడేది. రేయింబవళ్ళు వేధిస్తున్న ఈ తపనను తట్టుకోలేక మళ్ళీ వెనక్కు తిరిగి బృందావనం చేరుకున్నది ఆమె.

ఒకసారి బృందావనం చేరుకున్నాక ఆమె తపన మరీ ఎక్కువైపోయింది.కృష్ణధ్యానంలో తనను తాను మరచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కదలకుండా కళ్ళు తెరవకుండా ఆమె ధ్యానంలో ఉండేది.తిండీ తిప్పలూ ఆమె దృష్టినుంచి మాయమై పోయాయి.ధ్యానం చెయ్యని రోజులలో బృందావనపు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉండేది.లేదా యమునా తీరంలో పిచ్చిదానిలా సంచరిస్తూ -' కృష్ణా ఎక్కడున్నావు? ఈ పిచ్చిదాన్ని కరుణించవా? కనిపించవా?నీకోసం ఇల్లూ వాకిలీ వదిలేసి ఇలా తిరుగుతున్నాను.నువ్వు కరుణామయుడవని అంటారు కదా. మరి నన్ను ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు?అన్నీ ఒదిలి నీకోసం ఇలా అలమటిస్తున్నాను.ఒక్కసారి కనిపించు. ఆనందమయమైన నీ దర్శనాన్ని ఒక్కసారి కలిగించు.' అని ఏడుస్తూ ఉండేది.

వేలసంవత్సరాల క్రితం రాధాదేవి ఎలాగైతే కృష్ణుని కోసం తపించిందో,పిచ్చిదానిలా చెట్లూ పుట్టలూ పట్టుకుని ఆయనకోసం యమునాతీరంలో వెదికిందో,పక్షులనూ మేఘాలనూ నదినీ మొక్కలనూ పువ్వులనూ తుమ్మెదలనూ ఆయన జాడ చెప్పమని ఏ విధంగా బ్రతిమాలిందో,అలా వెదికినప్పుడు ఆమెను ఏ ప్రేమోన్మాదం ఆవహించిందో,ఇప్పుడు మృడానిని అదే ఉన్మాదం ఆవహించింది.చూచేవారికి ఆమె ఒక అడుక్కుంటూ తిరిగే మతిస్థిమితం లేని పిచ్చిదానిలా తోచింది.

రోజులు గడిచే కొద్దీ ఆమె వేదన భరించలేనంతగా పెరిగి పోయింది.కానీ కృష్ణుని జాడా జవాబూ ఎక్కడా లేదు.అసలు తన గోడు ఆయన వింటున్నాడో లేదో కూడా తెలియడం లేదు.ఇలా కొన్ని నెలలు గడచే సరికి మృడానికి జీవితం మీద తీవ్రమైన విరక్తి వచ్చేసింది.ఈ పాడు బ్రతుకు బ్రతకకపోతే ఏం? తన కృష్ణుడు లేని జీవితం తనకెందుకు? ఎన్నాళ్ళు ఇలా వృధాగా బ్రతికినా ఉపయోగం ఏముంది?అన్న ఆలోచనలు ఆమెను చుట్టు ముట్టాయి.తీవ్రమైన విరక్తి నిండిన ఆమె తన జీవితాన్ని అంతం చేసుకుందామని నిశ్చయించుకుంది.

ఒకరోజు రాత్రి బాగా చీకటి పడిన తర్వాత దగ్గరలోనే ఉన్న "లలితాకుండం" అనబడే మడుగు దగ్గరకు ఆమె చేరుకుంది.చాలాసేపు ఆ నీటి మడుగు ఒడ్డునే ఆమె ఆ చీకట్లో మౌనంగా కూర్చుని ఉండిపోయింది.తన తల్లిదండ్రులను స్మరించింది.అనుకోకుండా తనకు తటస్థపడి మంత్రోపదేశం చేసి మళ్ళీ కనిపించకుండా పోయిన ఆ అజ్ఞాత యువక గురువును మనస్సులో తలుచుకుంది. తన ప్రాణానికి ప్రాణం అయిన కృష్ణుణ్ణి స్మరించింది.ఆయనతో ఇలా చెప్పింది.

'ప్రభూ.నీకోసం అన్నీ ఒదులుకున్నాను.ఎన్నో కష్టాలను భరిస్తూ సహిస్తూ నీ ధ్యానంలో ఇన్నేళ్ళు గడిపాను.నిరంతరం నిన్నే ప్రార్ధించాను.నీ ధ్యాసలోనే కాలం గడిపాను.కానీ నీ కరుణ నాకు అందలేదు.నీ దర్శనం నాకు నిరంతరం కలగడం లేదు. ఎప్పుడో నీకిష్టమైనప్పుడు ఒక్క క్షణకాలం కనిపిస్తున్నావు.మళ్ళీ మాయావిలా మాయమై పోతున్నావు.ఆ తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ కన్పించవు. ఎందుకు నన్నిలా వేధిస్తున్నావు? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు?ఈ వేదన నేను భరించలేను. నువ్వు లేని ఈ బ్రతుకు నాకొద్దు.ఈ శరీరమే కదా నీకూ నాకూ అడ్డంగా ఉన్నది?ఇదేకదా నిన్నూ నన్నూ వేరు చేస్తున్నది?అందుకే ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను.నేనూ నీ దగ్గరకే వస్తున్నాను.కనీసం ఇప్పుడైనా నన్ను కరుణించు.నన్ను నీ ఒడిలోకి చేర్చుకో.కనీసం ఇప్పుడైనా నన్ను అనుగ్రహించు.' - ఇలా ప్రార్ధిస్తూ చేతులు జోడించి నిశ్చలమైన మనస్సుతో కృష్ణుని ధ్యానిస్తూ ఆ మడుగులోకి నడుస్తూ వెళ్ళిపోయింది మృడాని.

అప్పుడొక మహాద్భుతం జరిగింది.

ఎంతో లోతైన ఆ మడుగులో ఎంతదూరం నడచినా ఆమెకు అడుగు తగలడం లేదు.ఇదేమి వింత? ఎంతో లోతుగా ఉండే ఆ చెరువు ఆరోజు హటాత్తుగా ఎండిపోయిందా?లేక, నడుస్తున్నానని భ్రమిస్తూ ఆమె అక్కడే నిలుచుండి పోయిందా?ఏది ఏమైనప్పటికీ, అలా నడుస్తూ ఆ మడుగులోకి పోతున్న ఆమె కళ్ళ ఎదురుగా హటాత్తుగా ఒక మహాద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

అప్పటివరకూ తన చుట్టూ ఉన్న చీకటి ఉన్నట్టుండి మాయమై పోగా, ఆ స్థానంలో తెల్లని పాలవెన్నెల పరుచుకుంది.ఆ చీకటి రాత్రి ఒక్క క్షణంలో పున్నమిరాత్రిగా మారిపోయింది.తన చుట్టూ ఉన్న చీకటి పరిసరాలు ఏదో తెలియని మంత్రం వేసినట్లు మాయమై పోయాయి.ఆ స్థానంలో మణుల కాంతులతో మెరుస్తున్న లతలూ పూపొదలూ వెన్నెలలో మెరిసిపోతూ దర్శనమిచ్చాయి.ఆ పొదలలో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి.చిలుకలు కోయిలలు మధురంగా కూస్తున్నాయి.తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ ఎగురుతూ పూల మకరందాలను గ్రోలుతున్నాయి.వాతావరణం అంతా మధురమైన పూల సువాసనలతో ఆహ్లాదంగా మనోహరంగా ఉన్నది.ఎటుచూచినా ఏదో తెలియని ఆనందం ప్రకృతిలో నిండి వెల్లువలా ప్రవహిస్తున్నది.

కళ్ళు విప్పార్చుకుని ఈ అద్భుతాన్ని చూస్తున్న మృడాని చెవులకు - 'ప్రియతమా! గౌరీ! ఇలా చూడు.నాకోసం ఎందుకు అంతలా వెదుకుతున్నావు?ఎందుకలా ఏడుస్తున్నావు?ఇదుగో చూడు.నేనిక్కడే ఉన్నాను.' అన్న మృదుమధురమైన స్వరం వినిపించి ఆమె శరీరాన్ని ఝల్లుమనిపించింది.

భయసంభ్రమాలతో ఆ స్వరం వినవచ్చిన దిక్కుగా చూచిన మృడానికి ఒక చెట్టుక్రింద విలాసంగా కూర్చుని,సిగలో నెమలిపించంతో, మెడలో పూలమాలతో, చేతిలో పిల్లనగ్రోవితో, కాళ్ళు విలాసంగా ఊపుతూ,చిరునవ్వుతో తననే చూస్తున్న పీతాంబరధారీ,గోపీజన మానసచోరుడూ, లీలానాటక సూత్రధారీ,భగవంతుని యొక్క పరిపూర్ణావతారమూ అయిన మురళీ మోహనుడు దర్శనమిచ్చాడు.

ఒక్కసారిగా మృడాని అంతరంగం కట్టలు త్రెంచుకుంది. సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకును ఊపినట్లు,అనేక యుగాల విరహం ఆమెను ఊపేసింది.పట్టలేనంత ఆనందం ఆమెలోకి ఒక వెల్లువలా దూసుకొచ్చింది. ఒళ్ళు తెలియని విహ్వలతలో పరుగెత్తుతూ ముందుకు దూకిన ఆమె నాలుగంగల్లో కృష్ణుని చేరుకొని ఆయనను తన చేతులతో చుట్టేసి తల్లి ఒడిని చేరుకున్న చిన్నారిలా ఆయన వడిలో వాలిపోయింది.తన కన్నీటితో ఆయన ఒడిని తడిపేస్తూ దివ్యమనోహరమైన ఆయన ముఖాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ అలా మైమరచి ఉండిపోయింది.

అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు తెలియదు.ఆ తర్వాత ఏం జరిగిందో అసలే తెలియదు.తానెవరో తెలియదు.ఎక్కడున్నదో తెలియదు.అసలు తాను ఉన్నదో లేదో తెలియదు.ప్రపంచం ఉందో ఏమై పోయిందో తెలియదు.తన ఉనికిని కూడా పూర్తిగా కోల్పోయిన మధుర పారవశ్య స్థితిలో ఆమె ఆ రాత్రంతా ఉండిపోయింది.

ఆ స్థితిలో తానూ కృష్ణుడూ వేర్వేరు కారు.ఇద్దరూ ఒకటే.ఒక్కటే అయిన అమితమైన ఆనందసముద్రంలో ఇద్దరూ కలసి కరిగిపోయారు.అప్పుడేమైంది?ఏమైందో తెలియడానికి 'తాను' అన్న స్పృహ విడిగా ఉంటేకదా?తానే కరిగి లేకుండా పోయినప్పుడు ఇక ఆ స్థితిలో ఎలా ఉంటుందో అర్ధం చేసుకునేవారెవరు?ఆ అనుభూతిని వివరించి చెప్పేవారెవరు?

అటువంటి దివ్యమైన ఆనంద సమాధిస్థితిలో మునిగి రాత్రంతా ఆ చీకట్లో ఆ చెరువునీళ్ళలో ఒళ్ళు తెలియని స్థితిలో ఆమె పడి ఉండిపోయింది.

తెల్లవారింది.

పొద్దున్నే చెరువు దగ్గరకు నీటికోసం వచ్చిన కొందరు స్త్రీలకు నీళ్ళలో పడి ఉన్న మృడాని శరీరం కనిపించింది.ఎవరో స్త్రీ నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుందని వారనుకున్నారు.కానీ పరిశీలించగా శ్వాస కొద్దిగా ఆడుతూ ఉన్నట్లు వారికి తోచింది.వెంటనే ఆమెను చేతులమీద ఇంటికి మోసుకుపోయి, ఉపచర్యలు చేసి ఆమెకు స్పృహ వచ్చేలా చేశారు ఆ స్త్రీలు.

కళ్ళు తెరిచిన మృడానిలో ఊహించని మార్పు వారికి కన్పించింది.ఆమెలో మునుపటి విషాదం లేదు.మునుపటి వైరాగ్యం లేదు. నిర్లిప్తతా, శూన్యదృక్కులూ లేవు.ఏదో తెలియని వెదుకులాట ఆ కళ్ళలో లేదు.వాటి స్థానంలో ఏదో తెలియని ఒక వెలుగూ,కారణం లేని ఒక చిరునవ్వూ, ఈ లోకానికి చెందని ఒక దర్పమూ,ఒక అమితమైన సంతృప్తీ వారికి దర్శనమిచ్చాయి.తను వెదుకుతున్న గమ్యాన్ని చేరుకున్న మనిషిలో ఉండే ఒక విధమైన నిండుదనమూ, ఒక విధమైన ప్రశాంతతా ఆమెలో వారికి కనిపించాయి.

ఆ రాత్రి ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి ఆమెను ఒక నూతన వ్యక్తిగా రూపుదిద్దింది.ఆ రాత్రితో ఆమె జీవితంలో ఒక క్రొత్త అధ్యాయం మొదలైంది. అప్పటివరకూ ఉన్న పాత మృడాని ఆ రాత్రితో మాయమై పోయింది.ఏదో తెలియని గమ్యంకోసం తపిస్తూ ఒక బిచ్చగత్తెలా దేశాలు పట్టుకుని తిరుగుతున్న పిచ్చిదాని స్థానంలో,విశ్వరహస్యాన్నీ మానవజీవిత గమ్యాన్నీ,అవగతం చేసుకున్న ఒక జ్ఞాని ఆవిర్భవించింది.ఆమె జీవితంలోనుంచి విషాదం శాశ్వతంగా అంతరించింది.దైవం కోసం ఆమె వెదుకులాట పరిసమాప్తమైంది.ఆమె జీవితం ధన్యమైపోయింది.

చదువరులారా! దైవదర్శనం పొందాలంటే ఎంతటి తపన ఉండాలో, ఎంతటి త్యాగం ఉండాలో, ఎంతటి నిర్మలమైన మనస్సు ఉండాలో అర్ధమైందా? ఊరకే తోచనప్పుడు కాసేపు గుడికి వెళ్లి అక్కడకూడా లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ,మన చెత్త కోరికలతో దైవాన్ని విసిగిస్తూ, మనం హుండీలో వేసే డబ్బులు అందరూ గమనిస్తున్నారో లేదో అని పక్కచూపులు చూచే మనం,ఇలాంటి పరమనీచ స్థితిలో ఉండికూడా చాలా గొప్ప భక్తులమని భావించుకుంటూ అహంకారంతో విర్రవీగే మనం, నిజానికి ఆ పదానికి తగుదుమా? అసలు మనం ఏంటని భగవంతుడు మన దగ్గరకు రావాలి? అలాంటి అవసరం ఆయనకు ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకోండి.

గౌరీమా వంటి మహనీయుల జీవితాలే మనకు నిజమైన గీటురాళ్ళు. నిజమైన భక్తులు ఎలా ఉంటారో,నిజమైన మహనీయులు ఎలా ఉంటారో ఇలాంటి మనుషులను చూచైనా కనీసం అర్ధం చేసుకోండి.

ఆ విధంగా బృందావనంలో కృష్ణ సాక్షాత్కారం పొందేసరికి ఆమెకు 22 ఏళ్ళు మాత్రమే.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక' - అంటూ పలికిన శ్రీరామకృష్ణుల అమోఘమైన నోటిమాట వృధాగా పోతుందా?

(ఇంకా ఉంది)

27, జులై 2016, బుధవారం

IAF -32 విమానం ఏమైంది? - ప్రశ్న శాస్త్రం ఏమంటోంది?

మొన్న శుక్రవారం నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం IAF - 32 చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళుతూ మధ్యలో మాయమై పోయింది. అందులో 29 మంది మనుషులున్నారు. ఇప్పటివరకూ దీని జాడా జవాబూ లేవు. ఇది ఏమైందో ఎక్కడుందో ప్రశ్న శాస్త్ర సహాయంతో చూద్దాం.

ఈరోజు ఉదయం 10.59 కి ప్రశ్నను చూడటం జరిగింది.ఆ సమయానికి వేసిన చార్ట్ పైన ఇస్తున్నాను.

ద్విస్వభావ లగ్నం ఉదయిస్తూ విషయంలో ఉన్న సందిగ్ధతను సూచిస్తున్నది.మన:కారకుడైన చంద్రుడు లగ్నాత్ అష్టమంలో ఉంటూ నాశనాన్ని సూచిస్తున్నాడు.అంటే ఈ విమానం నాశనమై పోయింది,ఇందులోని ప్రయాణీకులు అందరూ చనిపోయారన్న సూచనను చంద్రుడు ఇస్తున్నాడు.

చంద్రుడు అశ్వనీ నక్షత్రంలో ఉండి కేతుప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు.అంటే, హటాత్తుగా జరిగిన మాయవంటి ఒక సంఘటన వల్ల ఈ విమానం దారితప్పి అదృశ్యం అయిందని అర్ధమౌతోంది.

ఈరోజు బుధవారం. లగ్నం బుధునిదైన కన్య అయింది.విమానం నంబరు కూడా 32=5 అవుతూ బుధుడినే సూచిస్తున్నది. లగ్నాధిపతి బుధుడు ఖచ్చితమైన రాశిసంధిలో పడి ఉన్నాడు.ఈ రాశిసంధి కర్కాటక సింహ రాశుల మధ్యలో ఉన్నది.అంటే జలతత్వ అగ్నితత్వ రాశుల మధ్యలో ఉన్నది.అంటే ఈ విమానం నీళ్ళలో కూలిపోయి మంటల్లో కాలిపోయిందని అర్ధం. బుధుడు బుద్ధి కారకుడు గనుక, ఏం చెయ్యాలో దిక్కు తెలియని పరిస్థితిలో పైలట్ పడిపోయాడని, అతని బుద్ది అయోమయానికి లోనైనదని తెలుస్తున్నది.

ప్రశ్న సమయానికి సూర్యహోర ఉదయిస్తున్నది.సూర్యుడు అగ్నితత్వ గ్రహం.ఈయన జలతత్వ రాశి అయిన కర్కాటకంలో ఇంకొక జలతత్వ గ్రహమైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఆరూఢలగ్నం కూడా ఇదే అయింది.కనుక విమానం నీటిలో జలసమాధి అయిందని రూడిగా తెలుస్తున్నది.

విక్రమస్థానంలోని శనికుజుల వల్ల,ఈ విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం క్లియర్ గా కనిపిస్తున్నది.శనికుజుల కలయిక యాక్సిడెంట్లను ఇస్తుందని గతంలో లెక్కలేనన్ని సార్లు ఉదాహరణలతో సహా నిరూపించి ఉన్నాను.వీరిద్దరూ మళ్ళీ జలతత్వ రాశిలో ఉండటం వల్ల యాక్సిడెంట్ జరిగి జలసమాధి అవడం సూచితం అవుతున్నది.అలాగే లగ్నాధిపతి బుధుని రాశిసంధి స్థితివల్ల విమానం ఫిట్ కండిషన్ లో లేదని అర్ధమౌతున్నది.

సూర్యుడు తూర్పుదిక్కుకు అధిపతి.శుక్రుడు ఆగ్నేయానికి అధిపతి.కనుక ఈ విమానం బయలుదేరిన చోటినుంచి తూర్పు ఆగ్నేయ దిక్కులో పడి ఉన్నదని అర్ధమౌతున్నది.

ఇప్పుడు నవాంశ చక్రాన్ని పరిశీలిద్దాం.

నవాంశలో జలతత్వ రాశి అయిన కర్కాటక లగ్నం ఉదయిస్తున్నది.జలతత్వ గ్రహమైన చంద్రుడు అక్కడే ఉన్నాడు.వక్రించి ఉన్న శనీశ్వరుని కోణదృష్టి చంద్రుని మీద ఉన్నది.ఆ శనీశ్వరుడు సప్తమ మారక,అష్టమ నాశన భావాలకు అధిపతిగా ఉండి, మళ్ళీ నాశనాన్నే సూచిస్తున్నాడు.అష్టమ భావంలో విమానాలకు సూచకుడైన శుక్రుడు (మళ్ళీ ఇంకొక జలగ్రహం) ఉండి ఈ విమానం నీళ్ళలో కూలిపోయిందని తెలియజేస్తున్నాడు.

చతుర్ధంలోని రవి రాహువుల వల్ల ఈ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిసిపోతున్నది.అందులోనూ కుటుంబ స్థానాదిపతిగా రవి నీచలో ఉన్నాడు.కనుక విమాన వ్యవస్థలో అంతర్గత లోపాలు ఖచ్చితంగా ఉన్నాయని తెలుస్తున్నది.రవి గుండెకాయకు సూచకుడు గనుకా, ఆ రవి నీచస్థితిలో ఉన్నాడు గనుకా, విమానానికి గుండెకాయ అంటే ఇంజనే గనుకా, ఈ విమానం ఇంజన్లు సరియైన కండిషన్ లో లేవని స్పష్టంగా తెలుస్తున్నది.

కనుక,పై విశ్లేషణను బట్టి ఈ విమానం ఫిట్ కండిషన్ లో లేదనీ, సాంకేతిక వ్యవస్థలో లోపాలున్నాయనీ,అందువల్ల గాలిలో ఉండగానే ప్రమాదానికి గురైన ఈ విమానం ముక్కలు ప్రస్తుతం సముద్రపు అడుగు భాగంలో చేరుకొని ఉన్నట్లు మనం ఊహించవచ్చు.

అంతేగాక, లగ్నాధిపతి అయిన బుధుడు ఏకాదశస్థానాన్ని వదలి ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉండటాన్ని బట్టి, విమానం ముక్కలు సముద్రంలో పడినచోట లేకుండా స్థానభ్రంశం చెందుతూ ఉన్నాయనీ, బయలుదేరిన ప్రదేశానికి దగ్గరగా కదులుతూ వస్తున్నాయనీ ఊహించవచ్చు.

ఈ ప్రదేశం ఎక్కడుందో జ్యోతిశ్శాస్త్ర సాయంతో లెక్కిద్దాం.

లగ్నం కన్య - 23 డిగ్రీలు.
దుర్ఘటనా స్థలం - శని నక్షత్రంలో ఉన్న కుజుడు
కుజుని స్థితి - వృశ్చికం 3 డిగ్రీలు.
రెంటి మధ్య దూరం - 40 డిగ్రీలు.
దీనిని శని అంకె అయిన 8 చేత హెచ్చించగా 40x8=320 అవుతుంది.
కనుక తీరం నుంచి దాదాపు 320 కి.మీ దూరంలో తూర్పు ఆగ్నేయ దిక్కుగా సముద్రంలో వెదికితే ఫలితం ఉంటుంది.

వెదుకులాట జరుగుతోంది.

చూద్దాం ఏం బయట పడుతుందో?

26, జులై 2016, మంగళవారం

శ్రీవిద్యా రహస్యం E Book ఈరోజు రిలీజైంది

నాచే వ్రాయబడిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం రిలీజై ఒకటిన్నర ఏళ్ళయింది. అప్పటినుంచీ చదివిన ప్రతివారినీ ఇది మంత్రముగ్ధులను చేసింది.ఇంకా చేస్తున్నది.ఇది చదివి ఎందఱో నాకు అభిమానులుగా మారారు.చాలామంది శిష్యులుగా మారి నిజమైన ఆధ్యాత్మిక పధంలో నడుస్తున్నారు.అయితే, ఈ పుస్తకాన్ని E Book రూపంలో కూడా విడుదల చెయ్యమని చాలామంది చాలారోజులనుంచీ నన్ను కోరుతున్నారు. ఆపని ఇప్పటికి అయింది.

తిధుల ప్రకారం ఈరోజు నా పుట్టినరోజు గనుక నేటి రోజున శ్రీవిద్యారహస్యం E Book రిలీజ్ చేస్తున్నాను. Google play books నుంచి "ఈ పుస్తకాన్ని" పొందవచ్చు. సైడ్ బార్ లో వస్తున్న పుస్తకం బొమ్మ మీద క్లిక్ చేసి కూడా ఈ పుస్తకాన్ని పొందవచ్చు.

పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకోలేని దూరదేశాలలో ఉన్న వారికి 'E - Book' చాలా ఉపయోగంగా ఉంటుంది.

త్వరలో 'తారాస్తోత్రం', 'లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక', 'దక్షిణేశ్వర మహాత్యం, 'శ్రీరామకృష్ణ సుధాలహరి', '300 Live Charts-Astro analysis in a most comprehensive way' మొదలైన నా మిగిలిన పుస్తకాలు కూడా 'ఈ బుక్స్' గా విడుదల చేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

22, జులై 2016, శుక్రవారం

రెండేళ్ళ క్రితం చెప్పిన జ్యోతిషం ఇప్పుడు అక్షరాలా నిజమౌతోంది

జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం.మనిషి జీవితంలోనే గాక,ప్రపంచంలో కూడా ముందు ముందు ఏమేం జరుగుతుంది?అన్న విషయాన్ని చెప్పగలిగేది ఈ ఒక్క శాస్త్రం మాత్రమే.అయితే దీనిని శుద్ధంగా నేర్చుకోవాలి.ఉపాసనా పూర్వకంగా నేర్చుకోవాలి.అప్పుడు అది ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి.ఇందులో ఏమీ అనుమానం లేదు.

నేను సెప్టెంబర్ 2014 లో 'రోహిణీ శకట భేదనం' అనే పోస్ట్ లు వ్రాస్తూ ఆ సీరీస్ చివరి పోస్ట్ లో ఎర్రని అక్షరాలతో ఇలా వ్రాశాను.
  • మార్చి-సెప్టెంబర్ 2016 ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే,ఒకటిన్నర నెల వ్యవధిలో రాశి మారే కుజుడు,ఆసమయంలో మాత్రం దాదాపు ఆరునెలల కాలం స్తంభన,వక్ర స్థితులలోకి ప్రవేశిస్తూ వృశ్చికంలో ఉన్న శనీశ్వరునితో కలసి ఉండబోతున్నాడు.ఆ సమయంలో వారిద్దరి భయంకరమైన సప్తమదృష్టి వృషభం మీద పడుతున్నది.కన్యారాశిలో ఉన్న రాహువు యొక్క పంచమదృష్టి కూడా ఆ సమయంలో వృషభం మీద పడుతున్నది.కనుక ఇదొక భయంకరమైన Compounding effect ను సృష్టించబోతున్నది.కాబట్టి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకర దుర్ఘటనలు ఖచ్చితంగా జరుగబోతున్నాయని నేను ఈరోజు(ఒకటిన్నర సంవత్సరం ముందుగా) చెబుతున్నాను.కావలసిన వారు వ్రాసి పెట్టుకోండి.అవి జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
ఆ పోస్ట్ లింక్ ఇక్కడ ఇస్తూ,ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రిడిక్షన్ ను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. కావాలంటే ఆ పోస్ట్ ను ఇక్కడ చూడండి.


గత కొన్ని నెలలుగా గమనిస్తున్నారా?ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని జరుగుతున్నాయో? ఏదో ఒక పెద్ద దుర్ఘటన జరగకుండా ఈ మధ్యలో ఒక్కరోజు కూడా ప్రపంచం ముందుకు కదలడం లేదు.

ఇస్లామిక్ ఉగ్రవాద రాక్షసి ప్రపంచానికే పీడగా తయారైంది.దీని ఫలితంగా ఇంకొక పోస్ట్ లో వ్రాసినట్లు, కొన్ని దేశాల మధ్యన ఏకంగా యుద్ధ వాతావరణమే మొదలైంది.

ఈరోజున అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఈ పీడను వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్ధమౌతుంది.నిజానికి వాళ్ళు మాత్రమే దీనిని నిర్మూలనం చెయ్యగలరు.దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా మన ప్రభుత్వాల నయవంచన వల్ల ఇది మన సమాజంలో బాగు చెయ్యలేనంత స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు అమెరికాకు కూడా పెద్ద తలనొప్పిగా తయారౌతోంది.

ఒకవేళ ట్రంప్ గనుక అమెరికా అధ్యక్షుడైతే ఖచ్చితంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తాడు.దాని ఫలితంగా వారు అమెరికాను ఎదుర్కోలేక, అక్కడనుంచి బిచాణా ఎత్తేసి ఆసియాలోని ఇతర చిన్న దేశాలలో తమ కార్యకలాపాలు ముమ్మరం చేస్తారు. ఇప్పుడు మనం అమెరికాకు స్నేహితులం గనుక,పాకిస్తాన్ కు శత్రువులం గనుక, వారు అమెరికాను ఏమీ చెయ్యలేరు గనుక,మనదేశంలో లా అండ్ ఆర్డర్ పూర్ గనుక, ఆ కసితో ఖచ్చితంగా మన దేశంలో ఇంకా విధ్వంసాలు సృష్టిస్తారు. ముందు ముందు ఇది జరగడం మీరు కళ్ళారా చూడబోతున్నారు.దానికి కేంద్ర బిందువులు దక్షిణాదిన హైదరాబాద్, కేరళ, కర్నాటకలు కాబోతున్నాయి.

ఈ విధంగా రెండేళ్ళ క్రితం చెప్పిన దుర్ఘటనలన్నీ ఇప్పుడు అక్షరాలా జరుగుతున్నాయి. ముందు ముందు ఇంకా జరుగుతాయి.

దీనిని బట్టి చూస్తే, జ్యోతిష్యశాస్త్రం అనేది ఎంత గొప్ప విజ్ఞాన భాండాగారమో ఇప్పుడైనా అర్ధమౌతోందా మీకు?

21, జులై 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 32 (గౌరీమా అద్భుత జీవితం: పురుషుడా - పురుషోత్తముడా?)

తన సాధనకు ఇంట్లో భార్యనుంచి సహకారం లేదని చెప్పి బాధపడిన ఒక భక్తునితో శ్రీ రామకృష్ణులు ఇలా అంటారు.

'సాధనలో నీకు నిజంగా నిజాయితీ ఉంటే,నీ మనస్సు శుద్ధమైనదే అయితే - అన్నీ కాలక్రమేణా సర్దుకుంటాయి.నీకు సరిపోయే విధంగా అన్ని పరిస్థితులనూ అమ్మే సరిదిద్దుతుంది.నీ బాధను ఒదిలి పెట్టి సంతోషంగా నీ సాధనను కొనసాగించు. పరిస్థితులు ఎలా మారుతాయో నువ్వే చూస్తావు.'


ఈ మాటలు అక్షరాలా నిజాలు. ఇవి ఈనాటికీ అనేక మంది నా శిష్యుల జీవితాలలో నిజం కావడం నేను కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే,ముందే చెప్పినట్లుగా, మనలో నిజాయితీ చిత్తశుద్ధి అనేవి ఉన్నప్పుడు దైవం మనకు తప్పకుండా సాయం చేస్తుంది.అనేక రకాలైన అనుకూల పరిస్థితులను మనకోసం కల్పిస్తుంది.ఆ పరిస్థితులనేవి మనం ఊహించలేనట్లుగా ఉంటాయి.ఒక్క రోజులో మన జీవితం మొత్తం మారిపోతుంది.


గౌరీమాకు కూడా అలాగే జరిగింది.


భక్తునికి ఎప్పుడూ కూడా దైవం యొక్క మనోహరమైన రూపం కావాలి.ఒక జ్ఞానిలాగా, రూపరహితమైన తత్త్వం మీద భక్తుడు ఎప్పుడూ దృష్టి పెట్టడు. సుందరమూ, మనోహరమూ, ఆనంద స్వరూపమూ అయిన దైవం యొక్క రూపాన్నే అతడు నిత్యమూ ధ్యానిస్తాడు.ఎందుకంటే భక్తుని మనస్సు రసహీనం కాదు. అది రసమయం.తన సమస్త ఇంద్రియాలతోనూ అతడు భగవదానందాన్ని గ్రోలాలని వాంఛిస్తాడు.


శ్రీరామకృష్ణుల నుండి దీక్షా స్వీకారం చేసిన కొద్ది రోజులలో మృడానికి ఇంకొక అనుభవం కలిగింది.


గౌరీమా తల్లిదండ్రులు ఉత్తమ గృహస్థులు గనుక ఎప్పుడూ వారి ఇంట్లో ఎవరో ఒక సంచార సాధువులు కొన్నాళ్ళ పాటు ఉండి, ఆశ్రయం తీసుకుని,ఆ తర్వాత వారి దారిన వారు పోతూ ఉండేవారు.


ఆ విధంగా వారి ఇంటికి ఉన్నట్టుండి ఒక సన్యాసిని వచ్చి చేరుకుంది.ఆమె కృష్ణ భక్తురాలు.ఆమె దగ్గర ఒక దామోదర సాలగ్రామం ఉండేది.అదే ఆమె సర్వస్వం.అదే ఆమె ఆస్తి.అది ఆమె దగ్గరకు ఎలా వచ్చిందో తెలియదు. ఆ సాలగ్రామ శిలను ఆమె ఎంతో భక్తిగా రోజూ పూజ చేస్తూ ఆరాధిస్తూ ఉండేది. అది సాక్షాత్తూ కృష్ణస్వరూపమే. కృష్ణుడే తనతో ఉన్నట్లుగా ఆ సాధ్వి భావిస్తూ ఆ శిలను ఆరాధిస్తూ ఉండేది.అలా ఆమె ఎన్నేళ్ళ నుంచీ చేస్తున్నదో మనకు తెలియదు.


ఆ విధంగా కొన్నాళ్ళు వీరి ఇంట్లో ఉండి తన దారిన తాను పోయే ముందురోజు రాత్రి ఆమెకు నిద్రలో ఒక స్వప్నం వచ్చింది.


ఆ స్వప్నంలో - అమిత అందంగా ఉన్న ఒక పదేళ్ళ నల్లని పిల్లవాడు సిగలో నెమలి పించం ధరించి చేతిలో పిల్లనగ్రోవితో ఆమె ఎదురుగా కనిపించాడు.అతని చుట్టూ అద్భుతమైన కాంతి పరివేషం వెలుగుతున్నది.అతని సమక్షంలో మధురమైన ఓంకారనాదం అలలు అలలుగా ప్రతిధ్వనిస్తున్నది.ఆ పిల్లవాడిని చూస్తూనే ఆమె కలలోనే పరవశించి పోయింది. అప్రయత్నంగా చేతులెత్తి ప్రణామం చేసింది. కలలోనే ఆమెకు ఆనందబాష్పాలు కారిపోతున్నాయి.ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది కానీ ఏమీ మాట్లాడలేకపోతోంది.కదలాలని అనుకుంటోంది.కానీ కదలలేక పోతోంది.అంతకంటే ఏమీ చెయ్యలేని స్థితిలో నిశ్చేష్టురాలై అతన్నలా చూస్తూ ఉండిపోయింది.


అప్పుడా పిల్లవాడు మృదు మధురమైన తన స్వరంతో ఇలా అన్నాడు.

'చూడు.ఇన్నాళ్ళూ నన్ను చక్కగా చూచుకున్నావు. నేను సంతోషించాను.ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరకు పోవాలనుకుంటున్నాను. నన్ను ఆ అమ్మాయికి ఇచ్చెయ్యి. నేను నీ దగ్గర లేనని అనుకోకు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను.ఈ శిలారూపంలో నీ వద్ద లేకపోయినా ఎల్లప్పుడూ నీ మనస్సులోనే నేను కొలువుంటాను.కనుక ఏ సంకోచమూ పెట్టుకోకుండా నన్ను ఆ అమ్మాయికి అప్పగించు.నాకు ఆ అమ్మాయి దగ్గర ఉండాలని ఉంది.'

'ఏ అమ్మాయికి నిన్ను ఇవ్వాలి?' అన్న సంశయం నిద్రలోనే ఆ సన్యాసినికి ఆలోచనారూపంలో కలిగింది.

లోకాలనన్నిటినీ వెలిగిస్తున్న ఒక చిరునవ్వును నవ్వాడు ఆ పిల్లవాడు.

అలా నవ్వుతూ పిల్లనగ్రోవిని పట్టుకున్న తన చెయ్యిని సాచి  ఒక వైపుగా చూపించాడు.

ఆ దిక్కుగా చూచిన సన్యాసినికి,  నిద్రపోతున్న మృడాని కనిపించింది.

కల చెదిరిపోయింది.

మర్నాడు ఉదయమే తన దారిన తను బయలుదేరి వెళ్ళడానికి సిద్ధమౌతూ,మృడానిని తన దగ్గరకు రమ్మని పిలిచింది ఆ సన్యాసిని.

మృడాని ఆమె దగ్గరకు వచ్చింది.

దామోదర సాలగ్రామాన్ని తన రెండు దోసిళ్ళ మధ్యన జాగ్రత్తగా పట్టుకుని ఉన్నది ఆ సన్యాసిని.ఆమె చేతులు రెండూ వణుకుతున్నాయి.ఆమె కనుల నుంచి నీళ్ళు ధారలుగా కారి చెంపలను తడిపేస్తున్నాయి. గద్గద స్వరంతో ఆమె ఇలా అన్నది.

'చూడు అమ్మాయీ ! ఇది ఉత్త రాయి కాదు. శక్తివంతమైన జాగృత దామోదర సాలగ్రామం.దీని విలువ అనంతం. ఇది సాక్షాత్తూ కృష్ణుడే.ఇది నీతో ఉండాలని కోరుకుంటోంది. కనుక దీనిని నీకిస్తున్నాను.నీ దగ్గర దీనిని భద్రంగా ఉంచుకో. ఇది నీతో ఉన్నంతసేపూ భగవంతుడే నీతో ఉన్నట్లు లెక్క.దీనిని జాగ్రత్తగా చూచుకో.'

ఇలా చెప్పి, ప్రతిరోజూ ఆ సాలగ్రామానికి ఏయే పూజలు చెయ్యాలో,ఎలా దానిని జాగ్రత్తగా చూచుకోవాలో వివరించి, ఆ సన్యాసిని తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆమె ఎవరో, ఆ తర్వాత ఏమై  పోయిందో ఎవరికీ తెలియదు.ఆమె మళ్ళీ వారింటికి తిరిగి రాలేదు.

శ్రీరామకృష్ణుని లీలలు చాలా అద్భుతంగా,చాలా ఊహాతీతంగా ఉంటాయి.

ఒక ఊహించని అద్భుతం జరిగినట్లుగా అవి ఉండవు. నిత్యజీవితంలో చాలా సాధారణంగా జరిగిన సంఘటనలలాగే అవి ఉంటాయి.అవి జరిగినప్పుడు అద్భుతాలని మనకు అనిపించవు కూడా.కానీ కొన్నేళ్ళ తర్వాత వెనక్కు తిరిగి చూచుకుంటే, ఆ అద్భుతాలు నిజంగా ఎంత అద్భుతమైనవో, వాటివల్ల మన జీవితాలలో ఎంతటి ఊహించలేని మార్పులు కలిగాయో, కలుగుతున్నాయో, అప్పుడర్ధమౌతుంది.

ఆయన చేసే అద్భుతాలు లౌకికమైనవి కావు.మనసును దైవోన్ముఖంగా మార్చేటట్లు అవి ఉంటాయి.వాటితో పోల్చుకుంటే 'పనులు కావడం, రోగాలు తగ్గడం' మొదలైన లౌకిక అద్భుతాలు అసలు అద్భుతాలే కావు.అవి చిల్లర గారడీలు.మనస్సును దైవోన్ముఖంగా మార్చడమూ జీవితాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడమే అసలైన అద్భుతం.

మృడాని జీవితంలో జరిగిన ఈ అద్భుతం కూడా అలాంటిదే.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక' అని శ్రీరామకృష్ణులు అనడమేమిటి? తర్వాత కొన్నాళ్ళకు రాసపూర్ణిమ రోజున ఆమే వెదుక్కుంటూ వెళ్లి అరటితోటలో ఉన్న ఆయన్ను కలుసుకుని దీక్షను పొందటం ఏమిటి? ఆ వెనువెంటనే శ్రీకృష్ణుని ప్రతిరూపమైన జాగృత దామోదర సాలగ్రామం ఆమెను వెదుక్కుంటూ రావడమేమిటి? అన్నీ చకచకా జరిగిపోయాయి.

శ్రీ రామకృష్ణుల చిన్నమాట కున్న శక్తి అది !! అది జీవితాన్నే మార్చేస్తుంది.


ఆ విధంగా కృష్ణరూపమైన సాలగ్రామం తనవద్దకు వచ్చినప్పటి నుంచీ మృడాని తదేక దీక్షతో దానిని ఆరాధిస్తూ,కృష్ణుని ధ్యానిస్తూ ఉండేది.


ఈ విధంగా కొన్నేళ్ళు గడిచిపోయాయి.


మృడానికి పదమూడేళ్ళు వచ్చాయి.అప్పట్లో ఆడపిల్లలకు పెళ్లి ఈడంటే అదే.ఇంకా చెప్పాలంటే అప్పటికే చాలా ఆలస్యం అయినట్లుగా ఆకాలంలో భావించేవారు.అప్పటికి పెళ్లి చెయ్యకపోతే ఇరుగూ పొరుగుల సూటీపోటీ మాటలూ బంధువుల దెప్పులూ,ఇంకా ఆలస్యమైతే వ్యక్తిత్వం మీద నిందలూ భరించవలసి వచ్చేది. అందుకని తల్లిదండ్రులు మృడానికి పెళ్లిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు.


చిన్నప్పటినుంచీ వైరాగ్య మనస్కురాలైన ఈ పిల్లకు పెళ్లి అంటే సుతరామూ ఇష్టం లేదు.తాను పెళ్లి చేసుకోనని తల్లితో తరచూ చెప్పేది.


కూతురి పోకడ చిన్నప్పటినుంచీ తెలిసినా, వయసులో ఉన్న పిల్లలు మామూలుగా మాట్లాడే చపల సంభాషణగా ఆ మాటలను భావించి తల్లి పెద్దగా పట్టించుకునేది కాదు.వారి మానాన ఆ తల్లిదండ్రులు తమ కూతురికి సంబంధాలు చూస్తూ ఉండేవారు.


ఈ అమ్మాయి అభ్యంతరాలను ఏమీ పట్టించుకోకుండా,చివరకు ఈమె అక్కగారి భర్తయైన భోలానాద్ ముఖోపాధ్యాయ కు ఈమెనిచ్చి పెళ్లి చెయ్యాలని అందరూ కలసి నిశ్చయం చేశేశారు.ముహూర్తం కూడా పెట్టేశారు.


చివరకు పెళ్లి రోజు రానే వచ్చేసింది.


అప్పటిదాకా అక్కడే ఉన్న మృడాని ఉన్నట్టుండి మాయం అయిపోయింది.ఎంత వెదికినా ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలియడం లేదు.వెదుకగా వెదుకగా మారుమూల కొట్టుగది లోపలనుంచి గడియ పెట్టబడి కనిపించింది.

వాళ్ళింట్లో మారుమూల గది ఒకటి ఉండేది.దానిని సామాన్లు దాచే కొట్టుగదిగా వాడేవారు.
మృడాని పోయి ఆ గదిలో దూరి లోపలనుంచి తలుపు గడియ వేసేసుకుంది.తనతో బాటు తన కృష్ణుడిని (దామోదర సాలగ్రామాన్ని) తోడుగా ఉంచుకుంది.

ఎవరు ఎన్ని రకాలుగా తలుపు కొట్టినా బతిమాలినా భయపెట్టినా ఆ పిల్ల తలుపు తియ్యడం లేదు.చివరకు అందరూ కలసి ఆమె తల్లియైన గిరిబాలను అస్త్రంగా ప్రయోగించారు.ఆమె వచ్చి తలుపు దగ్గర ఏడుస్తూ ప్రాధేయపడింది. తల్లి ఏడుపు విని కరిగిపోయిన 
మృడాని తలుపు ఓరగా తీసి తల్లిని మాత్రం లోనికి రానిచ్చింది.ఈ పెళ్లిని తాను ఎట్టి పరిస్థితులలోనూ చేసుకోనని ఖరాఖండిగా తల్లితో చెప్పేసింది మృడాని.

పోనీ ఎవరిని చేసుకుంటావో చెప్పమని అడిగిన తల్లితో - తాను మామూలు మనిషిని పెళ్లి చేసుకోననీ,తనకు శ్రీకృష్ణుడే చెలికాడనీ,ఈరోజు ఉండి రేపు పోయే పురుషులకంటే, శాశ్వతుడైన పురుషోత్తముడే కోరదగినవాడనీ,తల్లితో స్పష్టంగా చెప్పేసింది ఆ పదమూడేళ్ళ అమ్మాయి.

అంత చిన్నవయసులో ఏమిటా పరిపక్వత !! ఏమిటా వైరాగ్యం !! మనలాంటి క్షుద్రులకు అసలు ఊహకైనా అందుతుందా ఆ మానసిక స్థాయి?


ఎన్నో వందల ఏళ్ళ క్రితం ఒక పార్వతి, ఒక రాధ, ఒక మీరా,ఒక అక్కమహాదేవి అన్న మాటలనే 140 ఏళ్ళ క్రితం మృడాని మళ్ళీ అన్నది.

"కాలమనే వంటింటిలో ఆహారంగా మారే అల్పులైన మగవాళ్ళు నాకొద్దు. కాలాతీతుడై మరణం లేకుండా నిత్యమూ వెలిగే పరమేశ్వరుడే నా భర్తగా కావాలి." అని అక్కమహాదేవి ఎప్పుడో అన్నమాటలను మృడాని ఈరోజు మళ్ళీ అన్నది.

ఈ రక్తం భారతదేశంలో ఉన్నంతవరకూ ఈ దేశానికి చ్యుతి లేదు.ఇలాంటి మాటలు ఈ దేశపు పౌరులలో కనీసం కొద్దిమంది నుంచైనా వినపడుతూ ఉన్నంత వరకూ ఈ దేశానికి పతనం లేదు.ఈ జీన్స్ ఈ దేశంలో ఉన్నంతవరకూ ఈ దేశానికి భగవంతుని అనుగ్రహం ఉంటూనే ఉంటుంది.ఇలాంటి మనుషులు పుడుతూ ఉన్నంత వరకూ ఈ దేశంలో నిజమైన ఆధ్యాత్మిక పవనాలు వీస్తూనే ఉంటాయి. దైవాన్ని చేరుకునే మార్గం తేటతెల్లం అవుతూనే ఉంటుంది.

కూతురి మాటలు విన్న గిరిబాలకు ఒకవైపు ఆనందం, ఒకవైపు భయం,ఒకవైపు బాధ కలిగాయి.ఇలా పరస్పర విభిన్న భావాలతో సతమతమై పోయిందా తల్లి.కూతురు సరదాకి ఈ మాటలు చెప్పడం లేదనీ,తన సంకల్పం చాలా దృఢమైనదే అనీ ఆమెకు నమ్మకం కుదిరింది.

'సరేనమ్మా! నీ సంకల్పం నాకర్ధమైంది. నువ్వు మామూలు మనిషివి కావు.
నీవు కారణ జన్మురాలవు. సరే ఒకపని చెయ్యి. నీవు వెంటనే ఈ కిటికీలోంచి దూకి వేరే ఊరిలో ఉన్న మన మేనత్త గారి ఇంటికి పారిపో.నువ్వు ఇక్కడే ఉంటే, ఇదే ముహూర్తానికి నీకు ఈ పెళ్లి తప్పకుండా చేసేస్తారు ఈ బంధుజనం.ఒక తల్లిగా నీకు నేను చెయ్యగల సహాయం ఇదే.' అని చెప్పిన గిరిబాల కిటికీ తలుపు తెరిచి అందులోనుంచి మృడాని పారిపోవడానికి సహాయం చేసింది.

కిటికీ లోనుంచి దూకిన 
మృడాని తన దామోదర సాలగ్రామ శిలను భద్రంగా పట్టుకుని ఆ చీకట్లో పరిగెత్తుకుంటూ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న తన మేనత్త గారి ఊరికి చేరుకుంది. అంత రాత్రి పూట ఆ చిన్న పిల్ల ఒంటరిగా ఆ చీకట్లో ఒక ఊరినుంచి ఇంకొక ఊరికి దారీ తెన్నూ లేని పొలం గట్లవెంట పరుగెత్తుకుంటూ ఎలా వెళ్లిందో ఆ దేవుడికే ఎరుక !!

తలుపు తెరిచి బయటకొచ్చిన గిరిబాల ఏ కధను వారికి వినిపించిందో,బంధువులందరూ ఎన్నెన్ని మాటలన్నారో పెళ్లి ఆగిపోయి పిల్ల మాయమైందని తండ్రి ఎంత బాధపడ్డాడో ఎవరికీ తెలియదు.


ఆ విధంగా మేనత్త ఇంటికి చేరిన 
మృడాని కొన్నాళ్ళు అక్కడ తన సాధన చేసుకుంటూ స్థిరంగా ఉంది.ఆ తర్వాత అక్కడ నుంచి హిమాలయాలకు పారిపోదామని ఎత్తు వేసింది.కానీ ఇలాంటి పనేదో చేస్తుందని పసిగట్టిన మేనత్త,నిరంతరం కళ్ళలో వత్తులు వేసుకుని మృడానికి కాపలా కాస్తూ ఉండేది. అందుకని మృడాని ప్రయత్నాలు ఫలించలేదు.

గొడవ కాస్త సద్దు మణిగాక తల్లి దండ్రులు వచ్చి 
మృడానిని ఒప్పించి మళ్ళీ తమతో ఇంటికి తీసుకెళ్ళారు.

ఆ విధంగా కొన్నేళ్ళు తమ ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవడానికి 
మృడానికి అవకాశం లభించింది.కానీ ఇంటిలోని లౌకిక వాతావరణంలో ఉంటూ సాధన చెయ్యడం ఆమెకు నచ్చేది కాదు.ఆమె మనసు ఎంతసేపూ హిమాలయాల వైపు సాగిపోతూ ఉండేది.అక్కడ అన్నింటినీ త్యజించిన సాధువులు, సన్యాసులు,ఏకదీక్షతో భగవంతుని కోసం ఎలా తపస్సు చేస్తూ పునీతులౌతూ ఉంటారో ఆమె విన్న కధలన్నీ ఆమెను శాంతిగా ఉండనిచ్చేవి కావు. అనుక్షణం ఆమె హిమాలయాలకు వెళ్లాలని తపిస్తూ ఉండేది.కానీ నిరంతరం కనిపెట్టి చూచుకుంటున్న తల్లిదండ్రుల కళ్లుగప్పి పారిపోవడం ఆమెకు కుదిరేది కాదు.

ఇలా కొన్నేళ్ళు గడిచాక,ఒకరోజున తెలతెలవారే సమయంలో అందరి కళ్ళు గప్పి 
మృడాని ఇంట్లోనుంచి బయటపడింది. గంగానదికి స్నానానికి పోతున్నదేమోలే అనుకుని వాకిట్లో ఉన్న కాపలాదారు మౌనంగా చూచీ చూడనట్లు ఊరుకున్నాడు. కానీ మృడాని గంగానది వైపు కాకుండా ఊరిబైటకు పోయే దారిపట్టుకునే సరికి అతనికి అనుమానం వచ్చి పెద్దగా కేకలు పెట్టి అందర్నీ నిద్రలేపేశాడు.అందరూ వచ్చి మృడానిని పట్టుకుని మళ్ళీ ఇంటిలో బంధించారు.

ఈ పిల్లను ఇలా గృహఖైదు చెయ్యడం కష్టం అనీ, ఎన్నో ఏళ్ళు ఇలా చెయ్యలేమనీ గ్రహించిన తల్లి దండ్రులు, బంధువులతో కలసి దగ్గర దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఆ అమ్మాయికి అనుమతి ఇచ్చారు.ఆ విధంగా ఆమె దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలను చూడగలిగింది.


కానీ ఆమెలో ఏదో తెలియని తపన నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండేది.అది ఆమెను శాంతిగా ఉండనిచ్చేది కాదు.ఏదో తెలియని గమ్యం ఆమెను ఎక్కడనుంచో పిలుస్తున్నట్లు తోచేది.ఆ పిలుపు ఫలితంగా ఇంట్లో ఉండటం ఆ అమ్మాయికి అసాధ్యం అయ్యేది.


ఈ విధంగా ఏళ్ళు గడుస్తూ ఉండగా ఈమెకు పద్దెనిమిదేళ్ళు వచ్చాయి.ఒకరోజున మేనత్త మేనమామ ఇంకా కొందరు బంధువులు గంగాసాగర్ యాత్రకు బయలుదేరారు.వాళ్ళ గుంపు దాదాపు ముప్పై మంది ఉండటంతో వాళ్ళతో బాటు 
మృడాని, గిరిబాలా కూడా బయలుదేరారు.కానీ చివరి క్షణంలో ఏదో అనారోగ్యం వల్ల గిరిబాల ప్రయాణం మానుకోవలసి వచ్చింది.పెద్ద బలగమే ఉన్నది కదా అన్న నమ్మకంతో మృడానిని ఒక్కదాన్నే వాళ్ళతో పంపడానికి ఒప్పుకున్నారు తల్లిదండ్రులు.

గంగాసాగర్ చేరాక కొన్నాళ్ళు ఆమె ఆనందంగా ఉన్నది.తన సాలగ్రామానికి పూజ చేసుకుంటూ,దానిని ఆరాధిస్తూ కృష్ణధ్యానంలో ఉంటూ హాయిగా కాలం గడిపేది.పాతకాలంలో తీర్ధ యాత్ర అంటే,పొద్దున్న పోయి సాయంత్రానికి తిరిగి వచ్చే పిక్నికు లాగా ఉండేది కాదు.కనీసం మూడురోజులు అక్కడ ఉండి,జపధ్యానాది అనుష్టానాలు చేసి, ఆ క్షేత్రదేవతానుగ్రహం పొంది వెనక్కు వచ్చేవారు చాలామంది.అసలైన తీర్ధయాత్ర అంటే అలాగే చెయ్యాలి.అంతేగాని నేటివారి వలె పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ యాత్రలు చెయ్యకూడదు.


అంతా బాగానే ఉన్నది కదా అని ఆమె మీద నిఘాను కొంచం తగ్గించారు బంధువులు. అదే అదనుగా భావించి ఒకరోజున ఉన్నట్టుండి దామోదర శిలతో సహా చెప్పాపెట్టకుండా మాయమై పోయింది
మృడాని.ఒక గిరిజన యువతిలా వేషం మార్చేసిన ఆమె హరిద్వార్ వెళుతున్న ఒక సాధువుల గుంపులో కలసిపోయి హిమాలయాల వైపు సాగిపోయింది.

ఆమెకోసం చాలా గాలించారు బంధువులు.కానీ ఆమె జాడా జవాబూ ఎక్కడా లేదు. ఇక చేసేది లేక ఈసురోమంటూ కలకత్తాకు వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పేశారు.


వయసులో ఉన్న పిల్ల.ఒంటరిది.ఎక్కడుందో ఏమైపోయిందో? అన్న భయంతో నిర్ఘాంతపోయిన గిరిబాల బెంగతో మంచం పట్టేసింది.కానీ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆమెను చల్లగా కాపాడాలని ప్రార్ధిస్తూ మౌనంగా రోదిస్తూ ఉండిపోయింది ఆ పిచ్చితల్లి.


ఇక్కడ - సాధు బృందంతో హిమాలయాలకు బయల్దేరిన మృడాని ఎట్టకేలకు తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. కాలినడకన ప్రయాణిస్తూ,దారిలో భిక్షాటనం చేత కడుపు నింపుకుంటూ,కృష్ణధ్యానంలో తపిస్తూ, తనదగ్గరున్న దామోదర శిలను నిరంతరం భద్రంగా చూచుకుంటూ,దానిని నిత్యమూ ఆరాధిస్తూ,నాలుగు నెలల కాలినడక తర్వాత కలకత్తా నుంచి తపోభూమి అయిన హిమాలయాలకు  చేరుకుంది ఆ పిల్ల.


హిమాలయాలు కనిపించే సరికి ఆ అమ్మాయి పులకించి పోయింది.పరమశివుడు నిరంతరం కొలువుండే కొండలు తన కెదురుగా కన్పించే సరికి అన్నీ మరచిపోయింది.ఎక్కడ చూచినా,అన్నీ వదిలేసి నిరంతరం దైవం కోసం తపిస్తూ ధ్యానంలో మునిగి ఉన్న సాధువులు తపస్వులు ఆమెకు కనిపించారు.వారిని చూచి మైమరచి పోయింది.ఇన్నాళ్ళకు తన స్వప్నం సాకారం అయింది, ఇక తను కూడా తన ప్రాణేశ్వరుడైన కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నిరంతరం ఆయనకోసం తపిస్తూ,ఏ విధమైన బాదరబందీలు లేకుండా హాయిగా తపస్సు చేసుకోవచ్చని ఉప్పొంగి పోయింది.

అప్పటికి ఆమెకు సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు.


(ఇంకా ఉంది)

18, జులై 2016, సోమవారం

జూలై 2016 పౌర్ణమి ప్రభావం - పాకిస్తానీ మోడల్ ఖందీల్ బలోచ్ హత్య

ఇస్లామిక్ మతమౌఢ్యానికి ఇంకొక అందమైన పువ్వు రాలిపోయింది.ఆటవిక భావాల క్రౌర్యానికి ఇంకొక సుమం నలిగిపోయింది.ఆధునిక భావాలు నచ్చని ఒక పాకిస్తాన్ మృగం తన సొంత చెల్లెల్నే గొంతు పిసికి చంపేసింది.

ఈ అమ్మాయికి 25 ఏళ్ళు.పేరు ఖందీల్ బలోచ్.పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన అమ్మాయి. తన ఫేస్ బుక్ వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

అవి అసభ్యంగా ఉంటున్నాయని భావించి ఆమె అన్న తన గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు.అది పరువు హత్య అని చెబుతున్నారు గాని ఏ హత్యైనా అది హత్యేగా?

మనం పౌర్ణమికి చాలా దగ్గరగా ఉన్నాం. ఈరోజు చతుర్దశి.

ఈ హత్య ద్వారా పాకిస్తాన్ అనేది ఎంత పరమ ఛండాలపు దేశమో లోకానికి మళ్ళీ తెలిసింది. అక్కడ ఉన్నది మనుషులు కారు మృగాలే.వాళ్లకు మంచీ మానవత్వమూ లేవు. ఉన్నదల్లా మతపిచ్చి ఒక్కటే.ఆ పనికిమాలిన మతపిచ్చి కోసం సొంత మనుషులను కూడా వాళ్ళు చంపుకుంటారు.ఈ మతపిచ్చి మెంటల్ గాళ్ళు లోకాన్ని ఉద్ధరిస్తారట.

ఇది కూడా ఇస్లామిక్ హత్యే.

ఇది చదివినప్పుడు నాకు మహమ్మద్ ప్రవక్త జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది.మహమ్మద్ బ్రతికున్న రోజులలో ఒక స్త్రీ ఉండేది.ఆమె ఒక కవయిత్రి మాత్రమే గాక ఒక మిస్టిక్ కూడా. అప్పటికి ఆమె దాదాపు 60 ఏళ్ళు పైబడిన స్త్రీ. కానీ ఆమె మహమ్మద్ భావాలను ఒప్పుకునేది కాదు.మహమ్మద్ కు చాలా పూర్వమే అరేబియాలో ఉన్న జోరాస్ట్రియన్ భావాలను అనుసరించేది.అలాంటి వాళ్ళు చాలామంది అప్పట్లో ఉండేవారు.వారందరినీ నిర్దాక్షిణ్యంగా చంపుకుంటూ రావడం ద్వారా ఎటువంటి ప్రతిపక్షమూ లేకుండా మహమ్మద్ వర్గం కాలక్రమేణా చేసేసింది.

ఒకరోజున మహమ్మద్ అనుచరుడు ఒకడు వచ్చి తన గుంపుతో కూచుని ఉన్న మహమ్మద్ తో ఇలా అన్నాడు.

'ఓ ప్రవక్తా. నిన్న రాత్రి ఆ నీచురాలిని నిద్రలో ఉండగానే కత్తితో పొడిచి చంపేశాను.నిద్రిస్తున్న ఆమె గుండెల్లో కత్తిని గుచ్చినపుడు ఆ కత్తి మంచంలోకంటా దిగిపోయి ఆమె మంచానికి అతుక్కుపోయింది.అలా ఆమె అడ్డును తొలగించి నీ మార్గాన్ని సుగమం చేశాను.'

నిద్రలో ఉన్న ఒక వృద్ధురాలిని ఆ విధంగా చంపి ఒక ఛండాలపు పని చేసిన ఆ నీచపు మృగాన్ని దండించక పోగా మహమ్మద్ అతన్ని ఎంతో మెచ్చుకుని సభామధ్యంలో సత్కరించాడు.

మహమ్మద్ జీవితం చదివితే ఈ సంఘటన తెలుస్తుంది.

మొదట్నించీ ఇదీ వాళ్ళ చరిత్ర !!

వాళ్ళేదో 'శాంతి శాంతి' అంటూ పెద్ద గొప్పలు చెప్పుకుంటారు గాని,వారిదంత గొప్పదైన ఘనచరిత్ర ఏమీ కాదు.అంతా దౌర్జన్యంతో రక్తపాతంతో,ఆడవారనీ పిల్లలనీ ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా,ఎవరిని బడితే వారిని చంపుకుంటూ వ్యాపించిన మతమే అది.

నేటికీ అదే తంతు సాగుతోంది.విత్తనమే అలాంటిది.ఇక మొక్కలు అద్భుతంగా ఎలా వస్తాయి?

చంద్రుడు తన నీచ స్థితిలో కుజ శనులను దాటిన పౌర్ణమికి ఇది జరగడం కాకతాళీయం ఏమీ కాదు.చంద్రుడు (శుక్రునితో బాటు) వయసులో ఉన్న స్త్రీలకు సూచకుడని మనకు తెలుసు.పౌర్ణమి సమయంలో భావోద్రేకాలు పెచ్చరిల్లుతాయని నేను ఎన్నో సార్లు గతంలో వ్రాశాను.ఈ సమయంలో ఇది జరగడం గ్రహ ప్రభావాన్ని మళ్ళీ రుజువు చేస్తోంది కదూ?

తన ఫేస్ బుక్ లో జూలై 4 న పోస్ట్ చేసిన పోస్ట్ లో ఆమె ఇలా వ్రాసింది. స్వేచ్చకు ప్రతిరూపమైన జూలై 4 నే ఆమె ఆఖరి పోస్ట్ కావడం చాలా బాధాకరం.

Atleast International media can see what I am upto.How I am trying to change the typical orthodox mindset of people who dont wanna come out of shells of false beliefs and old practices.

Here this one is for those people only.

Thank you my believers and supporters for understanding the message I try to convey through my bold posts and videos.Its time to bring a change because the world is changing.Lets open our minds and live in present.


ఈ అమ్మాయి 1-3-1990 న పాకిస్తాన్ లోని షా సదర్ దిన్ అనే ఊరిలో పుట్టింది. జన్మ సమయం తెలియదు. స్థూలంగా ఈ అమ్మాయి చార్ట్ ను పరిశీలిద్దాం.

ఈ జాతకంలో కొట్టొచ్చినట్లు కనపడే యోగం శని కుజుల డిగ్రీ సంయోగం.ఇది బలవంతపు యాక్సిడెంటల్ మరణాన్ని స్పష్టంగా సూచిస్తోంది. పోతే, రాత్రి 8 లోపు జననం జరిగి ఉంటే అది అశ్వనీ నక్షత్రం అవుతుంది.ఆ తర్వాత అయితే భరణీ నక్షత్రం అవుతుంది. ఏ నక్షత్రమైనప్పటికీ చంద్ర రాశి మాత్రం మేషమే అవుతుంది.

కనుక చంద్ర లగ్నం నుంచి చూస్తే --

నవమంలో శని కుజుల డిగ్రీ సంయోగం మతపరమైన యాక్సిడెంట్ ను సూచిస్తోంది. ప్రస్తుతం జరిగింది అదేగా?

దశమంలో రాహు శుక్రుల యోగం, మత మూర్ఖత్వాన్ని ప్రశ్నించే తత్వాన్నీ, కట్టుబాట్లకు లొంగని మనస్తత్వాన్నీ, సెక్సువల్ ఫ్రీడం నూ సూచిస్తోంది. ఈయోగమే ఈ అమ్మాయి చేత అలాంటి వీడియోలు చేయించి ఫేస్ బుక్ లో పెట్టించింది.

ప్రస్తుతం ఈ అమ్మాయికి గోచార రీత్యా - అష్టమ శని జరుగుతోంది. అందులోనూ ఆ శనితో కూడి కుజుడున్నాడు. కనుక యాక్సిడెంటల్ డెత్ వచ్చింది.

ఈ లగ్నానికి శని బాధకుడు. ఆ శని ఏకాదశాదిపతిగా అన్నను సూచిస్తున్నాడు. సోదర కారకుడైన కుజునితో కలసి మత మూర్ఖత్వాన్ని సూచించే ధనుస్సులో ఉన్నాడు. కనుక అన్న చేతిలో హత్యకు గురైంది.

ఆత్మకారకుడు కుజుడయ్యాడు.కారకాంశ మళ్ళీ ధనుస్సే అయింది.అక్కడనుంచి బుధుడు బాధకుడయ్యాడు. ఆ బాధకుడు నవమాధిపతి (మత పిచ్చి) అయిన సూర్యునితో కలసి తృతీయం ( సోదర స్థానం) లో ఉన్నాడు. కనుక సోదరుని మత పిచ్చి వల్ల చంపబడింది.అష్టమంలో కేతువు బాధకుడైన బుధుని నక్షత్రంలో ఉంటూ అల్పాయుష్కపు (33 ఏళ్ళ లోపు చనిపోయే) జాతకాన్ని సూచిస్తున్నాడు.

ఈ విధంగా, ఎవరి జాతకంలో నైనా సరే, జ్యోతిశ్శాస్త్రం పొల్లు పోవడం అంటూ ఎప్పుడూ జరగదు.

ఈ అమ్మాయి వీడియోలు కొన్ని ఈరోజు చూచాను.మరీ అంత చంపాల్సినంత అసభ్యంగా ఏమీ లేవు. ఈరోజుల్లో సినిమాలలో హీరోయిన్లు వేస్తున్న వేషాల కంటే చాలా తక్కువగానే అవి ఉన్నాయి. మరి ఈ పరువు హత్య ఏమిటో ఆ మూర్ఖులకైనా అర్ధం అవుతుందో లేదో?

'నా చెల్లెల్ని చంపుకున్నందుకు నాకేమీ రిగ్రెట్స్ లేవు' అని కస్టడీలో ఉన్న ఆ మానవమృగం చెప్పడం కొసమెరుపు. ఏ తీవ్రవాదికీ రిగ్రెట్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. ఆనాడు కసబ్ గాడిదకూ లేవు.ఈనాడు వీడికీ లేవు.

ఈ అమ్మాయి ఆత్మకు నేను ఒకటే చెబుతున్నా.

మరుజన్మలోనైనా ఆ దరిద్రపు పాకీదేశంలో పుట్టకు. స్వేచ్చ సమానత్వాలు ఉన్న ఏ అమెరికాలోనో ఇంకెక్కడో పుట్టి హాయిగా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు.

ఆ అమ్మాయి ఆత్మ శాంతించుగాక.

మా అమెరికా యాత్ర - 31 (గౌరీమా అద్భుత జీవితం - గురువై దిగివచ్చిన దైవం)

నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ విడిచి పెట్టడు. అతనికి తెలిసినా తెలియకపోయినా నిరంతరం అతన్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు.అయితే మనకు ఆ విషయం తెలియవచ్చు తెలియకపోవచ్చు.అలా తెలియకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి.కొన్ని సార్లు అది అజ్ఞానమై ఉంటుంది.కొన్నిసార్లు ఆ జీవితంలో అలా జరగాలని ఉంటుంది గనుక అలా జరుగుతుంది.ఆ జన్మలో స్క్రిప్ట్ అలా వ్రాయబడి ఉంటుంది గనుక అలా జరుగుతుంది.

మృడానికి పదేళ్ళు వచ్చాయి.అందరి పిల్లల పరిస్థితి వేరు.ఈ అమ్మాయి పరిస్థితి వేరు.వారి ఆటలు ఈ అమ్మాయి ఆడదు.మౌనంగా కూచుని వారు ఆడుకుంటూ ఉంటె చూస్తూ ఉంటుంది.ఆ అమ్మాయి మనసులో ఏదో చెప్పలేని సంఘర్షణ చెలరేగుతూ ఉండేది.

'నేనెందుకు పుట్టాను? ఈ జన్మకు సార్ధకత ఏమిటి? అందరిలా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అందరిలాగే సంసారం సాగించి చివరకు నిరర్ధకంగా చావడమేనా నా జీవితం? అలాంటి జీవితానికి అర్ధమేముంది? అంతకంటే ఉన్నతమైన గమ్యం బ్రతుక్కి లేదా? ఒకవేళ ఉంటే దానిని నేనెలా చేరుకోవాలి? నాకు దారి చూపేవారు ఎక్కడున్నారు? నేను అతన్ని కలుసుకోగలనా? లేక అలా కలుసుకోకుండానే ఈ జన్మ ముగుస్తుందా?' - ఇలాంటి ఆలోచనలు ఆమెను చుట్టుముట్టి శాంతిగా ఉండనిచ్చేవి కావు.

తమ కూతురిలోని ఈ వింత ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించకపోలేదు.కానీ వారు ఆమెను ఏమీ అనకుండా ఊరుకున్నారు.ఎందుకంటే - ఉన్నతమైన వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో తరతరాలుగా చూస్తున్నవారు గనుక వారు ఆ ప్రవర్తనను విపరీత ప్రవర్తనగా ఏమీ భావించలేదు.

నిజమైన భక్తులంటే భగవంతునికి చాలా ప్రీతి ఉంటుంది.వారికి ఏ సమయంలో ఏది చెయ్యాలో ఆయనకు తెలుసు.ముందుగానే ఆ ప్లాన్ అంతా నిశ్చయం అయి ఉంటుంది.వారిని ఆయన నిరంతరం గమనిస్తూనే ఉంటాడు.వారి మనస్సులలో రేగుతున్న సంఘర్షణను ఆయన ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. వారు బాధపడితే ఆయనకూడా శాంతిగా ఉండలేడు.

శ్రీరామకృష్ణులకు, మృడానికి వయస్సులో 21 సంవత్సరాల తేడా ఉంది.శ్రీ రామకృష్ణులు 1836 లో జన్మించారు.మృడాని 1857 లో పుట్టింది.18 సంవత్సరాలు ఆ పైనగల తేడా ఎప్పుడూ కూడా రాహుకేతువుల ఆవృత్తిలో గల తేడావల్ల వస్తూ ఉంటుంది. ఒకే కర్మబంధం కలిగిన జీవులు పుడితే ఒకే సమయంలో పుడతారు.కుదరకపోతే 18 నుంచి 20 ఏళ్ళ తేడాతో పుడతారు.ఎందుకంటే అప్పటికి గాని రాహుకేతువులు రాశిచక్రంలో ఒక ఆవృత్తిని పూర్తిచేసి మళ్ళీ అదే స్థానాలకు రారు. ఇది రాహుకేతువుల చేతిలో ఉన్న కర్మ రహస్యం.

మామూలు మనుషుల జీవితాల లో మాత్రమే కాదు. మహనీయుల జీవితాలలో కూడా గ్రహప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ భూమి మీద గ్రహ ప్రభావానికి లొంగని మనిషీ లేడు, అవి గీచిన గీత ప్రకారం నడవని జీవితమూ లేదు.

మృడానికి పదేళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఒక దైవ సంఘటన జరిగింది.భవానీ పూర్ అని కలకత్తా శివారులో ఒక గ్రామం ఉన్నది.అది జూలై ఆగస్టు సమయం.వర్షాలు పడుతూ ఆ పల్లెటూరి వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉన్నది. తన స్నేహితులు అందరూ ఆరుబయట ఆడుకుంటూ ఉన్నారు. మృడాని తన ఇంటి బయట కూచుని వారిని చూస్తూ ఉన్నది. బహుశా అది గురుపూర్ణిమ సమయమే కావచ్చు.

ఆ సమయంలో 30 ఏళ్ళ వయస్సున్న ఒక యువకుడు ఆ దారిన నడుస్తూ పోతున్నాడు.అతని ముఖం ఎంతో ఆనందంతో వెలిగిపోతూ ఉన్నది.ఆ ఆనందం ఈ లోకపు ఆనందం కాదు. అది ఒక వెలుగులాగా అతని లోనుంచి బయటకు విరజిమ్ముతూ ఉన్నది.అతను నడుస్తుంటే ఆ దారంతా ఏదో తెలియని వెలుగు పరుచుకుంటున్నట్లుగా ఉన్నది.

ఆ యువకుడు సరాసరి వరండాలో కూచుని ఉన్న మృడాని వద్దకు వచ్చి ఆగాడు. చిరునవ్వు మోముతో ఆ అమ్మాయిని ఇలా ప్రశ్నించాడు.

'ఏమ్మా? నీ స్నేహితులందరూ ఆడుకుంటుంటే నువ్వెందుకు ఇలా ఒక్కదానివే కూచుని ఉన్నావు?'

ఇతరులను మంత్రముగ్ధులను చేసే ఆ స్వరంలో ఏ మాయ ఉన్నదో? తన ఆలోచనలో తానున్న మృడాని తలెత్తి చూచింది.

అలా తలెత్తి చూచిన క్షణంలో, ఆ పిల్ల ఏదో తెలియని వివశత్వానికి గురైంది. అకస్మాత్తుగా ఎన్నో భావాలు ఆ చిన్నపిల్లలో ఉవ్వెత్తున చెలరేగాయి.

'ఈయన నాకు ఎన్నో జన్మలుగా తెలుసు.ఏదో విడదియ్యరాని బంధం మా ఇద్దరి మధ్యన ఉన్నది.నాకు దారి చూపగల గురువు ఈయనే.అంతేకాదు నా ఇష్టదైవమూ ఈయనే, నా సర్వస్వమూ ఈయనే.ఎన్నో ఏళ్ళ ఎడబాటు తర్వాత మళ్ళీ ఈయనను నేను చూస్తున్నాను.' అన్న బలమైన భావాలు ఆ చిన్నపిల్లను నిలువెల్లా ఊపేశాయి.అవి ఉత్త భావాలు కావు, ఎన్నో జన్మల నుంచి వెంటాడుతూ మధ్యలో మరచిపోగా మళ్ళీ ఇప్పుడు హటాత్తుగా గుర్తొచ్చిన జ్ఞాపకాలలా అవి తోచాయి.

తనేం చేస్తున్నానో తెలియని స్థితిలో మృడాని లేచి నిలబడింది.ఆమెకు తెలియకుండానే ఆ అమ్మాయి కళ్ళవెంట నీరు ధారలుగా కారిపోతున్నది. ఏం చేస్తున్నదో తెలియని స్థితిలో అతని పాదాల మీద వాలిపోయి తన కన్నీటితో ఆ పాదాలను అభిషేకించింది.

అదే చిరునవ్వుతో ఆ యువకుడు తన కుడిచేతిని ఆ అమ్మాయి తలమీద ఉంచి తన మధురస్వరంతో ఇలా అన్నాడు.

'నీవు కృష్ణభక్తిలో ధన్యురాలవు అవుతావు గాక'

ఆ యువకుడు అంతకంటే ఇంకేమీ మాట్లాడలేదు.మళ్ళీ తనదారిన తాను నవ్వుతూ వెళ్ళిపోయాడు. చేష్టలు దక్కిన మృడాని అతను వెళుతున్న వైపే అలా చూస్తూ నిలబడి పోయింది.

ఇది జరిగిన కొన్నాళ్ళకు ఇంకొక సంఘటన జరిగింది.

మృడాని అన్నగారు అక్కడకు దగ్గరలోనే ఉన్న వరాహ నగర్ అనే ఊరిలో ఉన్న తన మేనత్త దగ్గరకు వెళుతూ, తన చెల్లెలిని కూడా తోడు తీసికెళ్ళాడు.ఆమె కూడా సంతోషంగా అన్నగారితో ఆ ఊరికి వెళ్లి కొన్నాళ్ళు మేనత్తగారింట్లో ఉన్నది.

అక్కడ ఉండగా ఒకరోజున ఆ అమ్మాయికి ఒక దర్శనం కలిగింది.

తనను ఆశీర్వదించిన ఆ యువకుడు ఒక అరటితోట మధ్యలో గల ఒక చిన్న పాకలో కూచుని ధ్యాన సమాధిలో ఉన్నట్లు, ఆ యువకుని నుంచి వెలువడుతున్న తెల్లని పాలవెలుగు ఆ పాకను దాటి లోకమంతా నలువైపులా వ్యాపిస్తున్నట్లు ఒక దివ్యమైన దర్శనాన్ని ఆ అమ్మాయి హటాత్తుగా చూచింది.

ఆ దర్శనాన్ని చూచిన తర్వాత ఆ అమ్మాయి ఎంతమాత్రం తట్టుకోలేక పోయింది.

ఆ ఊరి చుట్టూ అరటి తోటలు దండిగా ఉన్నాయి. ఇక ఆ తోటల్లో పడి వెదకడం మొదలు పెట్టిందా అమ్మాయి.కనిపించిన ప్రతివారినీ ఆ యువకుని గురించి అడిగేది.అలా వెదకగా వెదకగా ఒకచోట కొందరు ఇలా అన్నారు.

'అవును.అదుగో అక్కడ తోటలో ఒక పాక ఉన్నది కదా. అందులోనే ఒకాయన ఉన్నాడు.ఆయన బయటకు రాడు. ఎప్పుడు చూచినా ధ్యానసమాధిలోనే ఉంటాడు.బహుశా నువ్వు వెదుకుతున్నది ఆయన కోసమేనేమో.వెళ్లి చూడు.'

దడదడా కొట్టుకుంటున్న గుండెతో ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆ పాక దగ్గరకు వెళ్లి మెల్లిగా తలుపు తోసి చూచింది.

ఆ గది మధ్యలో శాంతంగా కూచుని చిరునవ్వు నవ్వుతూ ధ్యాన సమాధిలో ఉన్న అదే దివ్యమూర్తిని ఆ అమ్మాయి చూచి అప్రతిభురాలై పోయింది. తాను దర్శనంలో చూచిన దివ్యమూర్తి అతడే.అతని చుట్టూ ఏదో దివ్యకాంతి ఆవరించి ఉండటం ఆ అమ్మాయి అమాయక నేత్రాలకు కనిపించింది. తాను నిత్యమూ పూజించే శివుడే ఆ రూపంలో ఎదురుగా ప్రత్యక్షమైనట్లుగా ఆ అమ్మాయికి అనుభవం కలిగింది.

ఏమీ మాట్లాడలేక ఆ పాకలో ఒకమూలగా కూచుని అతన్నే చూస్తూ ఉండిపోయింది ఆ పిల్ల.

అలా కొన్ని గంటలు గడిచాయి.ఆయన కళ్ళు తెరవలేదు.ఈ అమ్మాయి కళ్ళు ఆర్పలేదు.సంభ్రమ నేత్రాలతో ఆయన్ను చూస్తూ ఆ పాకలో ఒంటరిగా అలా కూచుండిపోయింది ఆ పిల్ల.

కొన్ని గంటల తర్వాత అదే చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన మెల్లిగా కళ్ళు తెరిచి ఈ అమ్మాయి వైపు దృష్టి సారించాడు.

ఒకే ఒక్క మాటను మెల్లిగా పలికాడాయన. 

'వచ్చావా?'

ఒక్కసారిగా భావోద్వేగం ఆ పిల్లలో కట్టలు త్రెంచుకుంది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అతని పాదాలపైన పడిపోయి రోదించ సాగింది. అలా చాలాసేపు ఏడ్చి శాంతించాక, 'తనను శిష్యురాలిగా స్వీకరించమని,దారి చూపించమని' ఆయనను అడిగింది మృడాని.

సరేనని చెప్పిన ఆయన, ఆ దగ్గరలోనే ఉన్న తన బంధువుల ఇంటిలో ఆ అమ్మాయి ఆ రాత్రికి బస చేసే ఏర్పాటు చేసి, మర్నాడు ఉదయం స్నానం చేసి ఏమీ తినకుండా రమ్మని అప్పుడు ఉపదేశం ఇస్తానని చెప్పి ఆ అమ్మాయిని వెనక్కు పంపించేశాడు.

మర్నాడు రాస పూర్ణిమ.

బృందావనంలో రాసలీల జరిగిన మహోన్నతమైన రోజది. జీవుడు,తనను వెనక్కు పట్టి లాగుతున్న సమస్త బంధాలనూ వదిలించుకున్నవాడై, ప్రేమ అనే మహోన్నత సాధనను రుచి చూచినవాడై,తన హృదయేశ్వరుడూ, ప్రేమస్వరూపుడూ, సచ్చిదానంద ఘనుడైన శ్రీకృష్ణుని కలుసుకుని,తన అస్తిత్వాన్ని కోల్పోయి,ఆయనలో సంపూర్ణంగా కరగిపోయే మహత్తరమైన రోజది.

ఆ రోజునే భూవాతావరణాన్ని 'ప్రేమ' అనే దివ్యమైన మత్తు మొదటిసారిగా తాకింది.జీవుల మాయామోహాలను వదిలించి వారికి దివ్యమైన ప్రేమోన్మాదాన్ని మొదటిసారిగా రుచి చూపించింది.

ఆ రోజున పొద్దున్నే లేచి స్నానం చేసి ఏమీ తినకుండా శుచిగా మళ్ళీ ఆ పాక దగ్గరకు వచ్చింది మృడాని. యధావిధిగా ఆ అమ్మాయికి మంత్రోపదేశం గావించాడాయన.

ఆయన చెప్పిన విధంగా ధ్యానానికి కూచున్న ఆ అమ్మాయి వెంటనే చాలా గాఢమైన సమాధిస్థితి లోకి వెళ్ళిపోయింది. లోలోపల ఎంతో ఆనందాన్ని అనుభవించింది.సహజంగానే పరిశుద్ధమైన ఆమె మనస్సు క్షణంలో భవబంధాలను అధిగమించి తన ఇష్టదైవాన్ని చేరుకుంది.ఆయనలో కరగి పోయింది.కాలం ఆగిపోయిన ఆ స్థితిలో ఎన్నో గంటలు నిశ్శబ్దంగా గడిచాయి.

ఈ లోపల నిన్నటి నుంచీ చెల్లెలి కోసం వెదుకుతున్న అన్నగారు, పల్లెప్రజల ద్వారా ఆమె ఇక్కడుందని తెలుసుకుని వెదుక్కుంటూ వచ్చాడు.

పాకలో ప్రవేశించి చూస్తే ఏముంది? 

గది మధ్యలో దివ్యతేజస్వి అయిన ఒక యువకుడు ధ్యాన సమాధిలో కూచుని ఉన్నాడు. ఒక మూలగా తన చెల్లెలు అదే స్థితిలో ధ్యానసమాధిలో కూచుని ఉన్నది. ఇద్దరికీ శరీర స్పృహ లేదు.

ఈ దృశ్యాన్ని చూచిన అన్నగారు బిత్తర పోయాడు.కానీ తన చెల్లెలి మనస్సు చిన్నప్పటినుంచీ తెలిసిన వాడు గనుక త్వరలోనే తేరుకున్నాడు.చాలా సేపు ఓపికగా వారు కళ్ళు తెరవడం కోసం వేచి చూచాడు.

కొన్ని గంటలు అలా గడిచాక వారిద్దరూ కళ్ళు తెరిచారు.

ఆ యువకుడు మృడానితో ఇలా అన్నాడు.

'ప్రస్తుతం మీ అన్నగారితో వెళ్ళు. పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ గంగానదీ తీరంలో నువ్వు నన్ను కలుస్తావు. ఇప్పటికి వెళ్ళు.'

దివ్య స్వరూపుడైన ఆ యువకుడే శ్రీరామకృష్ణుడని వేరే చెప్పనవసరం లేదు కదా !!

ఆ విధంగా పదేళ్ళ వయస్సులోనే మృడాని సాక్షాత్తు దైవం యొక్క అవతారమైన శ్రీ రామకృష్ణుల చేతిలో దీక్షను పొందిన భాగ్యవంతురాలైంది.

శీ రామకృష్ణుల వారిచ్చే దీక్ష విలక్షణంగా ఉండేది. 'ఇదుగో నీ ఇష్ట దైవం చూడు' అని ఆయన అనేవారు. అంతే ! భక్తుని ఎదురుగా అతని ఇష్టదైవం మహా తేజస్సుతో వెలిగిపోతూ ప్రత్యక్షమయ్యేది.ఆ దైవాన్ని అలా చూస్తూ అందులో కరగిపోవడమే భక్తుని పని.ఈ విధమైన దీక్షను ఇవ్వడం ఒక్క భగవంతుని అవతారానికే సాధ్యం అవుతుంది గాని మహాయోగులకు మహాజ్ఞానులకు కూడా సాధ్యం కాదు.

ఆయన ఇచ్చే దీక్షలో తంతులు ఉండవు.హోమాలు ఉండవు. పునశ్చరణలు ఉండవు.ఆయన ఆజ్ఞను శిరసావహించి, సరాసరి నీ ఇష్టదైవం నీ ఎదురుగా నిలబడి నీకు దర్శనం ఇస్తుంది. అంతే.

చదువరులకు ఒక అనుమానం రావచ్చు.

నేడు మేము ఎంతో తపన పడి ఎంతో వెదికినా కూడా మాకు సరియైన గురువు లభించడం లేదు కదా? మరి ఆ చిన్నపిల్లకు పదేళ్ళ వయస్సులో సాక్షాత్తు భగవంతుడే గురువుగా ఎలా లభ్యమయ్యాడు? అని.

సరియైన సమర్ధుడైన గురువు లభించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.అది అంత తేలికగా అందరికీ దక్కే వరం కాదు. దానికి చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఎంతో పుణ్యం మన ఎకౌంట్లో ఉండాలి.అన్నిటినీ మించి స్వచ్చమైన పవిత్రమైన నిష్కల్మషమైన మనస్సు ఉండాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.వీటిలో ఏది లోపించినా బాధగురువే లభిస్తాడు గాని బోధగురువు లభించడు, సిద్ధగురువు అసలే లభించడు.ఇక సాక్షాత్తు భగవంతుడే గురువుగా లభించడం అనేది అసంభవం.అది ఎక్కడో కోటిమందిలో ఒక్క మహాభాగ్యవంతుడికి మాత్రమే దక్కే అరుదైన వరం.

సరియైన మొగుడే ఈ రోజుల్లో దొరకడం లేదు.ఇక సరియైన గురువు ఎక్కడ దొరుకుతాడు?

తర్వాత కాలంలో శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు.

'గౌరి అందరిలాంటి మామూలు మనిషి కాదు. తను బృందావన గోపిక. ఈ జన్మలో ఇలా పుట్టింది.జన్మజన్మలుగా తను కృష్ణుని ప్రేమికురాలు.ఆయనతో అవినాభావ సంబంధాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉన్న పవిత్రమైన ఆత్మ ఆమె.'

అందుకేనేమో రాసపూర్ణిమ నాడు, శరీరంతో ఉన్న కృష్ణుని (శ్రీ రామకృష్ణుని) ఆమె కలుసుకోగలిగింది. ఆయన వద్ద దీక్షను పొంది ఆనంద సమాధిలో తనను తాను మరచిపోయి కృష్ణ దర్శనంలో ఓలలాడింది !

మహనీయుల జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా !

(ఇంకా ఉంది)

17, జులై 2016, ఆదివారం

జూలై 2016 పౌర్ణమి ప్రభావం - టర్కీలో తిరుగుబాటు, అమృత్ సర్ లో భూకంపం

ఎల్లుండే పౌర్ణమి. అంటే మనం ప్రస్తుతం పౌర్ణమి ఛాయలో ఉన్నాం.

ఖగోళంలో కొనసాగుతున్న గురుచండాల యోగ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.అదీగాక కుజుని వక్రత్యాగమూ తిరిగి వేగంగా తనదైన వృశ్చిక రాశిలో ఉన్న వక్రశనీశ్వరుని వద్దకు చేరడమూ,చంద్రుని నీచస్థితీ ఇవన్నీ కలసి ప్రపంచవ్యాప్తంగా ఘోరాలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

నిన్న టర్కీలో తిరుగుబాటు జరిగింది. అధ్యక్షుడు దేశంలో లేని సమయం చూచుకొని సైన్యంలో ఒక వర్గం తిరుగుబాటు చేసి ప్రజలను భయభ్రాంతులను చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించింది.కానీ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైన్యాన్ని ఎదుర్కొని దేశాన్ని కాపాడుకున్నారు.సైన్యాన్ని ఎదుర్కొనే ప్రక్రియలో వందలాది జనం చనిపోయారు.ఈలోపల మిగతా సైన్యం వచ్చి తిరుగుబాటు వర్గాన్ని అదుపులోకి తెచ్చింది.ప్రస్తుతం ఒక 6000 మందిని ఈ కుట్రకు దోషులుగా భావించి విచారిస్తున్నారు.

ఒక మంచి విషయం ఏమంటే - టర్కీ ప్రజలలో ఐకమత్యం ఏడిసింది. అదే మన దేశంలో గనక ఇలాంటిది జరిగితే, ఇదే అదనని ప్రజలే బరితెగించి 'సందట్లో సడే మియా' - అంటూ దోపిడీలూ దొంగతనాలూ రేపులూ యధేచ్చగా చేసేసేవారు.

రేపంటే గుర్తొచ్చింది.

రెండురోజుల క్రితం మహారాష్ట్రాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి, ఆమె కాళ్ళూ చేతులూ నరికేసి మొండాన్ని రోడ్డు మీద పారేశారు ముగ్గురు నరరూప రాక్షసులు.వాళ్ళలో కొందరికి రాజకీయ పలుకుబడి కూడా ఉందట.ఆయనగారి ఫేస్ బుక్ ఎకౌంట్లో మంత్రిగారితో దిగిన ఫోటో కూడా ఉందట.యధావిధిగా అన్నీ జరిగాక రాజకీయులు గోలగోల చేస్తున్నారు. అసలు డిల్లీ కేస్ జరిగినప్పుడే కఠినమైన చర్యలు తీసుకుని నిందితుల్ని పబ్లిక్ గా ఎన్ కౌంటర్ చేసేసి ఉంటే ఆ తర్వాత ఇవన్నీ జరిగేవే కావు. ఏం చేస్తాం? ఈ దేశంలో అమ్మాయిలకు రక్షణ రావడానికి ఇంకా ఎన్ని శతాబ్దాలు పడుతుందో? అయ్యా గాంధీ చూస్తున్నావా పైనుంచి నువ్వు తెచ్చిన స్వాతంత్రం ఎంత అందంగా ఉందో?

కొసమెరుపు ఏమంటే టర్కీలో కుట్రకు కారకుడు ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుని ఉన్న ఒక ఇస్లాం మతబోధకుడు.ఆయనగారి రెచ్చగొట్టుడు బోధనల ఫలితమే ఈ తిరుగుబాటు. ఇది కూడా ఇస్లాం స్థాపిస్తున్న శాంతే.

పౌర్ణమి ప్రభావం ఇంకా ఉంది. అప్పుడే అయిపోలేదు.

ఈరోజున అమృత్ సర్ లో భూకంపం వచ్చింది.ఈ ప్రకంపనలు పంజాబ్ లోని ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా వచ్చాయి. 4-5 మధ్య స్కేల్ లో ఈ భూకంపం ఉంది.దాని ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గ్రహాల ప్రభావం భూమ్మీద ఏమీ ఉండదని ఇంకా నమ్ముతున్నారా మీరు?

మా అమెరికా యాత్ర - 30 (గౌరీమా అద్భుత జీవితం)

'గౌరీ' అనే పేరు చాలా అద్భుతమైన పేరు. గౌర వర్ణం అంటే తెల్లని రంగు అని అర్ధం. హిమవంత మహారాజు పుత్రికగా పార్వతి జన్మించినపుడు ఆమె తెల్లని స్వచ్చమైన రంగులో చాలా అందంగా ఉండేది.అందుకే ఆమెకు 'గౌరి' అనే పేరు వచ్చింది.

నేను మొదటిసారిగా గౌరీమా గురించి నా చిన్నప్పుడు అంటే 13 ఏళ్ళ వయసులో (1976 లో) చదివాను. శ్రీ రామకృష్ణుల ప్రత్యక్షశిష్యుల గురించి చదువుతున్నప్పుడే గౌరీమా గురించి కూడా నేను తెలుసుకున్నాను.నా ప్రధమ గురువైన రాధమ్మగారి వద్ద ఆ సమయంలో నేను ఒకటిన్నర ఏళ్ళు ఉండవలసిన పరిస్థితులు ఆ సమయంలో జగజ్జనని చేత కల్పించబడ్డాయి. అప్పుడే నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది.

రాధమ్మగారు శ్రీరామకృష్ణులకు, జగన్మాతకు భక్తురాలైన గృహస్థ యోగిని. ఆ సమయంలో రాధమ్మ గారికి అనేక దర్శనాలు కలుగుతూ ఉండేవి.అమ్మ ఇస్తున్న కొన్నికొన్ని దర్శనాలను మాకు అప్పుడప్పుడూ ఆమె వివరించి చెబుతూ ఉండేది.

ఒకరోజున ఆమె నాతో ఇలా అన్నారు.

'ఈరోజు అమ్మ నన్ను 'గౌరీ' అని పిలిచిందిరా సత్యం. ఎందుకలా అందో తెలియడం లేదు.'

'ఎందుకై ఉంటుంది?' అని నేను అడిగాను.

'తెలియదు.శ్రీ రామకృష్ణులవారికి 'గౌరీమా' అని ఒక శిష్యురాలున్నది. బహుశా ఆమెకూ నాకూ ఏదో సంబంధం ఉన్నదేమో?' అని తాను సాలోచనగా అంది.

ఆ విషయం అంతటితో ఆగిపోయింది. ఇది జరిగిన కొన్నేళ్ళ తర్వాత మాత్రమే ఆ దర్శనానికి అర్ధం ఏమిటో నాకర్ధమైంది.

ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచి, గౌరీమా గురించి మాట్లాడుకుందాం.

1857 లో కలకత్తాకు చెందిన ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో గౌరీమా జన్మించింది.నాన్నగారి పేరు పార్వతీ చరణ్ చట్టోపాధ్యాయ.అమ్మగారిపేరు గిరిబాల.వీరి పేర్లను బట్టి ఇద్దరూ జగజ్జనని భక్తుల కుటుంబాలలో పుట్టిన వారని తెలిసిపోతూ ఉన్నది. ఆమెకు తల్లిదండ్రులు 'మృడాని' అనే పేరు పెట్టారు.ఇది జగన్మాత పేర్లలో ఒకటి. ఆమెను వారు 'రుద్రాణి' అని కూడా పిలిచేవారు.ఇదీ అమ్మవారి పేరే.

శివ సహస్రనామాలు - శివాయ నమ, హరాయ నమ, మృడాయ నమ, రుద్రాయ నమ ,,, -  అంటూ మొదలౌతాయి. వీటిలో 'మృడ' అనే పేరుకు అర్ధం 'మట్టి' అని. అలాగే రుద్ర అనే పేరుకు - కోపంతో ఉన్న, శిక్షించు, రోదనము కలుగజేయు అనే అర్ధాలున్నాయి.

పరమ శివునకు అష్టమూర్తి అని పేరుంది. ఆయనకున్న ఎనిమిది రూపాలలో భూమి కూడా ఒకటి. భూమి రూపంలో లోకాన్ని పోషిస్తున్నది ఈశ్వరుడే. ఆ భూమికి ఉన్న శక్తే మృడాని. సహనానికి భూమి ప్రతీక. ముందు ముందు జీవితమంతా ఎన్నో బాధలను కష్టాలను దైవం కోసం నవ్వుతూ సహించాలని కాబోలు తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఆ పేరును పెట్టారు !!

శివుని పేర్లకు 'ని' చేరిస్తే అమ్మవారి పేరుగా మారుతుంది. శివ - శివాని, మృడ - మృడాని, రుద్ర - రుద్రాణి, భవ-భవాని, శర్వ - శర్వాణి ఇలాగన్న మాట. ఈ విధంగా 'ని' అనే అక్షరం చేర్చి ఆ పేరును స్త్రీలింగంగా మార్చే ప్రక్రియ ఇండో యూరోపియన్ భాషలు అనేకాలలో ఉన్నది.

మహనీయులు చిన్నప్పటి నుంచే విలక్షణమైన జీవితం గడుపుతారు.వాళ్ళ తీరుతెన్నులు కూడా మిగిలిన వారికంటే విభిన్నంగా ఉంటాయి.ఎందుకంటే మనలాగా నిరర్ధకంగా జీవితాలు గడిపి చివర్లో ఏడుస్తూ చనిపోవడానికి వాళ్ళు పుట్టరు.వారి పుట్టుకను ఒక పరమార్ధం ఉంటుంది.

ఒక మామూలు మనిషి చనిపోతే ఆ మరుసటి రోజున అతని బంధువులే అతన్ని తలుచుకోరు.ఈరోజు మనం పోతే, రేపటికి ఎవరికీ కనీసం గుర్తు కూడా ఉండము. అలాంటిది, గౌరీమా చనిపోయిన 75 ఏళ్ళ తర్వాత నేడు మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నామంటే,లోకం ఆమెను స్మరిస్తోందంటే ఆమె ఎలాంటి మనిషో అర్ధం చేసుకోవచ్చు.

చిన్నప్పటి నుంచీ గౌరి చాలా ధైర్యసాహసాలు కలిగిన పిల్లగా ఉండేది. ప్రవర్తనలో చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ముక్కుసూటిగా ఉండేది. అనవసరమైన మాటలు మాట్లాడటం, అబద్దాలు చెప్పడం, అల్లరి చెయ్యడం మొదలైన చేష్టలు ఆమెలో మచ్చుకైనా కనిపించేవి కావు. ఒకవిధమైన గంభీరత్వం అంత చిన్నపిల్లలో కూడా కనిపిస్తూ ఉండేది. మిగిలిన పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటే, ఈ అమ్మాయి మౌనంగా కూచుని వాళ్ళను చూస్తూ ఉండేదిగాని తను ఆటలు ఆడేది కాదు.

శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులందరూ విలక్షణములైన వ్యక్తిత్వాలు కలిగినవారే. వాళ్ళు మనలా మామూలు మనుషులు కారు. భగవంతుని అవతారంతో బాటు ఈ భూమి మీదకు వచ్చినవారు ఆషామాషీ మనుషులు ఎలా అవుతారు? వారందరూ దేవతా స్వరూపాలే.భగవత్కార్య నిమిత్తమై ఈ భూమిమీద కొన్నాళ్ళు నివసించారు.అంతేగాని వారు మనలా కర్మజీవులు కారు.

గౌరీమాలో చిన్నప్పటి నుంచీ కొన్నికొన్ని వ్యక్తిత్వ లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉండేవి.ఆమెకు స్వార్ధం ఉండేది కాదు. దాచుకోవాలి అన్న ఊహ ఆమెలో కనిపించేది కాదు.సామాన్యంగా ఒక కుటుంబంలో పిల్లల్లో కూడా, అన్నకు ఏదైనా ఇస్తే చెల్లెలు ఏడవడం,లేదా తమ్ముడికి ఏదైనా ఇస్తే అన్న అలగడం ఇలాంటి క్షుద్ర పోకడలు ఉంటాయి.ఇలాంటి పోకడలు మామూలు చవకబారు జీన్స్ తో పుట్టిన పిల్లల్లో ఉంటాయి. ఉత్తమ సంస్కారాలతో జన్మించిన పిల్లలలో అవి ఉండవు. వారి తీరు వేరుగా ఉంటుంది.

గౌరీమాలో స్వార్ధం ఎక్కడా కన్పించక పోగా, ఎదుటి వారి బాధలను చూచి చలించే గుణం చిన్నప్పటినుంచే ఆమెలో దర్శనమిచ్చేది.ఎవరైనా బాధల్లో ఉంటే, తన దగ్గరున్న ఏ వస్తువైనా సరే, వెనకా ముందూ ఆలోచించకుండా వారికి ఇచ్చేసేది.తాను చిన్నపిల్ల అయి ఉండికూడా వారిని ఓదార్చాలని ప్రయత్నించేది.ఇది స్ఫుటమైన దైవీ లక్షణం.

ఎప్పుడైనా సరే, తల్లిదండ్రులను బట్టే పిల్లలు ఉంటారు.వారి జీన్సే వీరికి వస్తాయి.నేడు మనం చాలామంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం.' మా పిల్లలు చెడిపోయారు.మేం చెప్పినమాట వినటం లేదు.' అని బాధపడి ఏడుస్తూ ఉంటారు.అలాంటి వారిని చూస్తె నాకు నవ్వొస్తూ ఉంటుంది.

విత్తనం ఎలాంటిదో మొక్క అలాంటిదే వస్తుంది.నువ్వు వేప విత్తనానివి.నీకు పారిజాతం చెట్టు ఎలా వస్తుంది? సువాసనతో కూడిన పూలు ఎలా పూస్తుంది? పెళ్ళికి ముందు, నీ జీవితం నువ్వు సక్రమంగా గడిపి, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఉండి ఉంటే, అలాగే నీ భార్య కూడా ఉండి ఉంటే, అప్పుడు మాత్రమే మీకు పుట్టే పిల్లలు ఉన్నతమైన వాళ్ళుగా ఉంటారు.మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండి, ఇప్పుడు 'మా పిల్లలు చెడిపోయారు' అంటే దానికి బాధ్యులు ఎవరు? మీరే.

అందుకనే పాతకాలంలో కులానికి గుణానికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. మనకు ఒక సామెత ఉన్నది."కులమైనా ఉండాలి గుణమైనా ఉండాలి" అని.కులమంటే అదేదో తప్పు మాట ఏమీ కాదు. Clan అని దానర్ధం.నిజానికి 'కులం' అనే సంస్కృత పదం నుంచే Clan అనే ఇంగ్లీషు పదం పుట్టింది.

ఈరోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా నిశ్చయింపబడుతున్నాయి? నేటి పెళ్ళిళ్ళలో వ్యక్తిత్వం ముఖ్యం కాదు.కుటుంబం ఎలాంటిది అన్నది ముఖ్యం కాదు.తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అన్నది ముఖ్యం కాదు.డబ్బును ఒక్కదాన్ని చూస్తున్నారు. అంతే. అందుకనే నేటి పెళ్ళిళ్ళు త్వరలోనే పెటాకులై పోతున్నాయి. కొన్నాళ్ళు కలిసున్నాక తమకు సరిపడదని తెలుసుకొని, ధైర్యం ఉంటే విడిపోతున్నారు. అంత ధైర్యం లేకపోతే, తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసి బ్రతుకుతున్నారు.ఆ పుట్టే పిల్లలు కూడా అలాంటి వాళ్ళే పుడుతున్నారు.నేటి పిల్లల్లో ఎవరికీ ఉన్నతమైన వ్యక్తిత్వాలు లేవంటే ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అలాంటివాళ్ళే, ఇక పిల్లలు ఉన్నతులుగా ఎలా ఉంటారు?

మృడాని తల్లిదండ్రులు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు. నాన్నగారైన పార్వతీ చరణ్ మంచి దైవభక్తి పరుడు.నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన ఒక యూరోపియన్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు.పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళేవాడు.అక్కడి ఉద్యోగులు ఈ బొట్టు చూచి ఆయన్ను ఎగతాళి చేసేవారు.ఉద్యోగం మానెయ్యడానికైనా ఆయన సిద్ధమయినాడు గాని బొట్టు తీసెయ్యమంటే మాత్రం ఒప్పుకోలేదు. అలాంటి నిక్కచ్చి మనస్తత్వం ఆయకుండేది.

అమ్మగారైన గిరిబాలను చూద్దామంటే ఆమెది ఇంకొక రకమైన విలక్షణ వ్యక్తిత్వం.దైవభక్తికి తోడు ఆమెకు చాలా జాలిగుండె ఉండేది.తన గుమ్మంలోకి వచ్చిన ఆర్తుడిని ఉత్త చేతులలో ఆమె వెనక్కు పంపేది కాదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి సాయం చేసేది.ఆ ఊరిలోని పేదవారికి,కష్టాలలో ఉన్నవారికి, ఎప్పుడూ ఏదో ఒక సాయం చేస్తూనే ఉండేది ఆమె.ఆరోజుల్లోనే ఆమె బెంగాలీ,సంస్కృతాలలో మంచి ప్రవేశం ఉన్నవ్యక్తి. అంతేగాక ఆమెకు ఇంగ్లీషు, పర్షియన్ కూడా కొద్ది కొద్దిగా వచ్చేవి.ఆమె స్వరం చాలా చక్కగా వినసొంపుగా ఉండేది.అంతేగాక ఆమె గేయాలనూ స్తోత్రాలనూ వ్రాస్తూ ఉండేది. ఆమె వ్రాసిన అలాంటి స్తోత్రాలు -'నామసారం', వైరాగ్య గీతమాల' అనే రెండు పుస్తకాలుగా ప్రచురింపబడ్డాయి.

మొత్తం మీద మృడాని తల్లిదండ్రులిద్దరూ కూడా చాలా ఉన్నత వ్యక్తిత్వాలు కలిగినవారు,ఉత్తమ తరగతికి చెందిన గృహస్తులు, మంచి సంస్కారవంతులు, కష్టాలలో ఉన్నవారంటే జాలి దయ కలిగిన మంచి మనుషులై ఉండేవారు.

ఇలాంటి తల్లి దండ్రులకు పుట్టిన సంతానమైన మృడాని ఇంక అలా ఉండక ఇంకెలా ఉంటుంది?

మృడానికి ఆనందాన్నిచ్చే ఆట దైవాన్ని పూజించటం ఒక్కటే. తన చిట్టి చేతులతో,వచ్చీ రాని పూజలతో ఆ చిన్నపిల్ల శివుణ్ణి అర్చిస్తూ ఉండేది.అంత చిన్న వయసులో కూడా ఆమెలో ఒకవిధమైన నిర్లిప్తతా భావమూ, మౌనమూ ఉండేవి.ఒకరోజున ఆమె పడవలో గంగానదిని దాటుతూ ఉన్నది.ఆ సమయంలో ఆ చిన్నపిల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు రేకెత్తాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.

'ఆడవాళ్ళలో బంగారం అంటే ఎందుకంత మోజు? ఏముంది ఈ బంగారంలో? ఈ ఆభరణాలలో ఏముంది? ఎందుకు ఇవంటే స్త్రీలకు ఇంత వ్యామోహం? ఇవి లేకపోతే నేను బ్రతకలేనా?' - అన్న ఆలోచనలు ఆ అమ్మాయికి కలిగాయి. వెంటనే తన చేతికున్న బంగారు గాజులను తీసి గంగానదిలోకి విసిరేసింది ఆ అమ్మాయి.

నగలంటే ఆ పిల్లకు ఏ విధమైన మోజూ ఉండేది కాదు.అంతేకాదు సామాన్యంగా తన వయసు ఆడపిల్లల్లో ఉండే దుస్తులపట్ల మోజూ, అలంకరణ పట్ల శ్రద్ధా కూడా ఆమెలో ఉండేవి కావు. ఆమె మనస్సు ఎప్పుడూ ఈ చవకబారు ప్రపంచం కంటే, ఈ ప్రపంచాకర్షణల కంటే ఎంతో ఎత్తులో విహరిస్తూ ఉండేది.తక్కువ స్థాయికి చెందిన ఆలోచనలు ఆమెకు కలిగేవి కావు.

ఈరోజుల్లో డెబ్భై ఏళ్ళు వచ్చినా బ్యూటీపార్లర్ల వెంట తిరిగే ఆడవాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. మరి పదేళ్ళు కూడా నిండని అంత చిన్నపిల్లలో అంత వైరాగ్యమూ నిర్లిప్తతా ఉన్నాయంటే మన జన్మలు ఎలాంటివి? ఆమె జన్మ ఎలాంటిదో తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

వాళ్ళ ఇంటి పక్కనే 'చండీ మామ' అనే ఒక మంచి జ్యోతిష్కుడు ఉండేవాడు. ఒకరోజున అతను మృడాని చెయ్యి పరిశీలించాడు.అందులో ఆయనకు ఏయే రేఖలు కనిపించాయో? ఆయన ఇలా అన్నాడు.

'ఈ అమ్మాయి ముందు ముందు ఒక మహాయోగిని అవుతుంది'. 

(ఇంకా ఉంది)