Pages - Menu

Pages

23, ఫిబ్రవరి 2015, సోమవారం

Astro Workshop -2 విజయవాడలో జరిగింది.
























Astro Workshop -2 విజయవాడలో జయప్రదంగా జరిగింది.

హైదరాబాద్ లో జరిగిన Astro workshop-1 కు హాజరు కాలేని వారికోసం విజయవాడలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరువరకూ ఈ కార్యక్రమం జరిగింది.హైదరాబాద్ లో చెప్పిన విషయాలనే కొత్తపద్ధతిలో వివరిస్తూ,ఇంకా కొన్ని ఎక్కువ విషయాలను చెప్పడం జరిగింది.

ఈ సమావేశానికి హాజరై,జ్యోతిష్యశాస్త్రపు మౌలికాంశాలను ఆకళింపు చేసుకున్నవారికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

వదలకుండా ఈ సబ్జెక్టును బాగా నేర్చుకుని మంచి జ్యోతిశ్శాస్త్రవేత్తలుగా రాణించాలని వారందరినీ కోరుతున్నాను.

21, ఫిబ్రవరి 2015, శనివారం

ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మంచిరోజులు


ఒంటిమిట్ట రామాలయం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది.దానికి కారణాలు అనేకం ఉన్నాయి.

ఒకటి-
భక్తకవి అయిన పోతన్నగారు ఇక్కడ నివసిస్తూ,కోదండరాముని కటాక్షాన్ని పొందినవాడై,తనయొక్క శ్రీమద్భాగవత రచన గావించడం వల్ల ఆ క్షేత్రానికి వచ్చిన ప్రాశస్త్యము.

రెండు-
ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారు ఈ క్షేత్రంలోనే ఎక్కువకాలం ఉండి తన తెలుగు రామాయణం (మందరం) ను వాల్మీకి ప్రణీతమైన సంస్కృత రామాయణానికి సరిసమానమైన 24000 పద్యాలలో రచించడము.అంతేగాక దాదాపు నూరేళ్ళ నాడే దేశమంతా తిరిగి భిక్షమెత్తి,జీర్ణస్థితికి చేరిన ఈ దేవాలయాన్ని  ఆ ధనంతో బాగుచెయ్యడము.  

మూడు-
ఈ ఆలయంలోని కోదండరాముని దర్శించిన క్షణంనుంచే నాలో కవితాఝరి ఉప్పొంగి దాదాపు 108 తెలుగు ఆశుపద్యాల రూపంలో ప్రవహించడము.ఆ తర్వాత అప్పటినుంచీ ఇప్పటివరకూ దాదాపు రెండువేల తెలుగుపద్యములు నా నోటినుంచి ఆశువుగా రావడము.

నాలుగు-
మార్కండేయుడు తన తపస్సుతో పరమేశ్వరుని మెప్పించి మరణాన్ని జయించిన ప్రదేశం ఇదే కావడము.

అయిదు-
అన్నింటి కంటే మించినది,సీతా రామలక్ష్మణులు తమ వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మూడురోజులు నివసించడము.

ఈ కారణముల వల్ల,ఈ ఆలయం అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమాభిమానములు ఉన్నవి.ఇక్కడి కోదండరాముని కటాక్షం అనుపమానమైనదన్న విశ్వాసం నాకు అనేక అనుభవములు రుజువులతో సహా లభించింది.ఇదంతా జరిగి ఇప్పటికి దాదాపు అయిదేళ్ళు అవుతున్నది. అప్పట్లో నేను వ్రాసిన ఆయా పద్యములన్నీ నా బ్లాగు చదువరులకు సుపరిచితములే.

ఇన్నాళ్ళ తర్వాత,ఒంటిమిట్ట ఆలయాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలని భావించడం,నిర్దారించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది.విజయనగరం  జిల్లా రామతీర్ధమా? లేక కడపజిల్లా ఒంటిమిట్టయా? యన్న సందిగ్ధత తొలగిపోయి,ఒంటిమిట్ట వైపే ప్రభుత్వం మొగ్గుచూపడం బాగున్నది.రామతీర్ధం తక్కువది అని నా ఉద్దేశ్యం కాదు. అదికూడా మహత్తరమైన పుణ్యక్షేత్రమే.కానీ అనేక ఇతర అంశాలను బేరీజు వేసిన మీదట,ప్రభుత్వం చేత ఈ నిర్ణయం తీసుకోబడటం ముదావహం. రామతీర్ధాన్ని కూడా బాగా అభివృద్ధి చెయ్యవలసిన అవసరం గట్టిగా ఉన్నది.

ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారి కలలు ఈ విధంగానైనా నెరవేరి మహిమాన్వితమైన ఈ ఆలయం వెలుగులోకి వచ్చితే తెలుగుజాతికి అంతకంటే అదృష్టం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం.

అయితే,ఇదే అదనుగా చూచుకుని,వ్యాపారులు,షాపులు,దళారీలు, మోసగాళ్ళు ఇక్కడకు చేరి దీనిని కూడా ఒక వ్యాపారకేంద్రంగా మార్చి చివరకు ఒంటిమిట్టను కూడా తిరుపతిలా తయారు చెయ్యకుండా,దాని పవిత్ర వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలమీదా ప్రభుత్వంమీదా కూడా ఉన్నది.

అన్నింటినీ,చివరకు దేవాలయాలనూ పుణ్యక్షేత్రాలనూ కూడా భ్రష్టు పట్టించే ఈ కలియుగంలో ఇది ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.

ఇక్కడ వాతావరణం దిగజారకుండా,ఆలయ పవిత్రత కాపాడబడుతూ, ఇంకొకవైపు సౌకర్యాలు అభివృద్ధి జరిగితే అంతకంటే సంతోషం రామభక్తులకు ఇంకొకటి ఉండదు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

Astro Workshop-1 విజయవంతంగా జరిగింది





















Astro Workshop-1 హైదరాబాద్ లో విజయవంతంగా జరిగింది.

ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం అయిదున్నర వరకూ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.హేతువాద భవనంలో,హేతువాద (logical) శాస్త్రం అయిన జ్యోతిష్యం చర్చింపబడటం చాలా సమంజసంగా అనిపించింది.

కార్యక్రమానికి 49 మంది హాజరయ్యారు.వీరిలో ఉద్యోగులు(ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు),వ్యాపారులు,గృహిణులు ఉన్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చినవారే కాక,దూరప్రాంతాలైన బెంగుళూర్ మొదలైన ప్రదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వచ్చినవారందరూ చాలా శ్రద్ధగా ఏడుగంటలపాటు మౌనంగా ఉండి సబ్జెక్టును వింటూ అర్ధం చేసుకుంటూ చక్కగా సహకరించారు.

దాదాపు 280 slides తో కూడిన పవర్ పాయింట్ సహాయంతో సబ్జెక్ట్ ని వివరించడం జరిగింది.

అయితే చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలన్న అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ సబ్జెక్ట్ అనేది ఇంతకు ముందు పరిచయం లేకపోవడంతో అతి బేసిక్ స్థాయి నుంచి మొదలుపెట్టి వివరిస్తూ రావడం జరిగింది.ఈ క్రమంలో సబ్జెక్ట్ లో ప్రవేశం ఉన్నవారికి కొంత విసుగు కలిగి ఉండవచ్చు.ఈ విషయాన్ని ముందుగానే చెప్పి,తమ సహచరులను దృష్టిలో ఉంచుకుని,సంయమనాన్ని పాటించమని వారందరినీ ముందుగానే కోరడం జరిగింది.

జ్యోతిష్య విజ్ఞానంలో ఉన్న పరాశర,జైమిని,తాజక,నాడీ మొదలైన రకరకాల సిస్టమ్స్ ను క్లుప్తంగా పరిచయం చేస్తూ,గ్రహాలు,రాశులు,నక్షత్రాలు,భావాలు, వాటి రకరకాల కారకత్వాలు,పంచాంగవివరాలను బట్టి జాతకుని జీవితాన్ని స్థూలంగా ఎలా గ్రహించాలి?ప్రాధమిక గ్రహయోగాలైన వేసి,వాసి, ఉభయచరి, అనఫా,సునఫా,దురుధరా,కేమద్రుమ,పంచమహాపురుష యోగాలైన రుచక, భద్ర,హంస,మాలవ్య,శశయోగాలు,కాలసర్పయోగం మొదలైన అనేక విషయాలను వివరించడం జరిగింది.

జ్యోతిర్విజ్ఞానంలో ఉన్న ప్రాధమిక అంశాలను,దాని పునాదులుగా నిలిచి ఉండే రకరకాల విషయాలను సభ్యులకు అర్ధమయ్యేలా చెప్పడంలో ఈ సమావేశం ఫలప్రదం అయిందని నేను భావిస్తున్నాను.

ఆరోజున క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ దానిని కూడా వదులుకొని ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.ఇది వారిలోని శ్రద్ధకు తార్కాణంగా నేను భావిస్తున్నాను.

ఈ సెమినార్ లో వివరింపబడిన విషయాలను బాగా ఆకళింపు చేసుకుని, ఇవ్వబడిన హోం వర్క్ చక్కగా చేస్తూ,ఒకటి రెండునెలలలో మళ్ళీ జరగబోయే రెండవ వర్క్ షాప్ కు సిద్ధం కావాల్సిందిగా మొన్న అటెండ్ అయిన అందరినీ కోరుతున్నాను.

ఈసారి జరగబోయే వర్క్ షాప్ లో - జాతకచక్రాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?ఎలా విశ్లేషణ చెయ్యాలి? అనే అంశాలను,అనేక సెలెబ్రిటీ చార్టులను ఉదాహరణలుగా చూపిస్తూ,జ్యోతిష్యపరమైన టెక్నికల్ పదాలను ఉపయోగిస్తూ డైరెక్ట్ గా వివరించడం జరుగుతుంది.ఈలోపల మొన్నటి వర్క్ షాప్ లో ఇవ్వబడిన మెటీరియల్ ను బాగా అర్ధం చేసుకుని తయారు అవ్వవలసిందిగా కోరుతున్నాను.ఆపైన జరుగబోయే వర్క్ షాపులలో 'అడ్వాన్సుడ్ ఎస్ట్రాలజీ టాపిక్స్' లోకి సరాసరి వెళ్ళడం జరుగుతుంది. 

ముఖ్యంగా స్త్రీలుకూడా జ్యోతిష్య విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం కలిగించింది.మనకు మహిళా జ్యోతిష్యవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు.ఒక గాయత్రీ దేవి వాసుదేవ్(బీవీ రామన్ గారి కుమార్తె),ఒక మృదులా త్రివేది మొదలైనవారు తప్ప జ్యోతిష్యరంగంలో పెద్దగా మనకు మహిళలు కనిపించరు.ఈ నేపధ్యంలో, ఇంతమంది స్త్రీలు ఈ వర్క్ షాప్ లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇందులో పాల్గొన్న 49 మందీ,సబ్జెక్టును బాగా నేర్చుకుని మంచి జ్యోతిష్యవేత్తలుగా రాణించాలని ఎంతోమంది జీవితాలను బాగుచేసే శక్తిని తద్వారా వారు సంపాదించాలని శ్రీరామకృష్ణులను,కాళీమాతను ఈ సందర్భంగా ప్రార్ధిస్తున్నాను.

అన్ని పనులనూ ఎంతో ప్లానింగ్ తో చూచుకుని,ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి కారకులైన రాజూ సైకం (MA Astrology),జానకిరాం,గిరిధర్ వర్మ లకు,మంచి ఫోటోలను తీసి ఇచ్చిన రేణూకుమార్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Astro workshop-2 ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలో మళ్ళీ బ్లాగు ముఖంగా ప్రకటన చెయ్యబడుతుంది.

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఉచ్చు

లౌకికజీవితంలో ఎదురయ్యే ఆటంకాలనూ అడ్డంకులనూ ఎలా అధిగమించాలో మానవుడికి తెలుసు.కానీ అంతరికలోకంలో,ఆధ్యాత్మిక లోకంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా దాటాలో తెలీదు.

లోకంలో ఎవరైనా మనల్ని ఒక తాడుతో కట్టేస్తే ఆ కట్లు ఎలా విప్పుకోవాలో మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మికలోకంలో మనల్ని మనమే రకరకాల తాళ్ళతో కట్టేసుకుంటూ ఉన్నామన్న సంగతి మనకు తెలియదు.మనల్ని మనమే కట్టేసుకుంటున్నామన్న విషయం తెలియకపోతే ఇక ఆ కట్లను విప్పుకోవాలని ఎలా అనిపిస్తుంది?మనకు తెలియకపోవడమే కాదు. తెలిసినవారు చెప్పినా వినిపించుకునే స్థితిలో,ఒప్పుకునే స్థితిలో మనం ఉండము.అదే ఆధ్యాత్మిక లోకంలో అసలైన విచిత్రం.

ఇలా జరగడానికి కారణం ఏమిటి?

బయట ప్రపంచంలో ఉన్న ఉచ్చులు ఆటంకాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.కనుక వాటిని దాటటం మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉండే ఆటంకాలు ఉచ్చులు కనిపించవు.బయట ప్రపంచంలో ఆటంకాలు బయటనుంచి వస్తాయి.ఇతరుల నుంచి వస్తాయి.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఆటంకాలు తమనుంచే పుట్టుకొస్తాయి.లోలోపలే అవి ఉంటాయి.వాటిని తయారు చేసుకునేదీ మనమే.వాటితో మనల్ని మనం కట్టుకునేదీ మనమే.కనుక వాటిని దాటే విధానం మనకు తెలియదు.దాటాలని కూడా మనకు అనిపించదు.ఆ కట్లను విప్పుకోవాలన్న స్పృహే మనకు ఉండదు. ఎందుకంటే ఆ కట్లు చాలా సుఖంగా ఉన్నట్లు అనిపిస్తాయి.

ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నవారుకూడా తాము స్వేచ్చగా ఉన్నామని అనుకోవడమే ఆధ్యాత్మిక లోకంలోని విచిత్రాలలో ఒకటి.

ఆధ్యాత్మిక లోకపు ఉచ్చులు ఎలా ఉంటాయో చూద్దామా?

'అ' 'ఆ' లు రానివారికి అద్భుతాల ఉచ్చు
అన్నీ చదివిన వాడికి అహంకారపు ఉచ్చు
అతితెలివి ఉన్నవాడికి అడుగు పడని ఉచ్చు
ఆశ ఎక్కువైపోతే అయోమయపు ఉచ్చు

ఆధ్యాత్మికత అంటే ఓనమాలు తెలియనివారు చాలామంది ఉంటారు.వారికి అద్భుతాల మీద మహామోజుగా ఉంటుంది.గారడీవిద్యలకూ ఈ అద్భుతాలకూ ఏమీ తేడాలేదు.రోడ్డుమీద గారడీ చేసి డబ్బులు అడుక్కునేవారికీ అద్భుతాలు చేసే మహాత్ములకూ పెద్దగా భేదం ఏమీలేదు. ఇద్దరూ దాదాపుగా ఒక స్థాయిలోని వారే.ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నవారు ఇలాంటి గారడీవిద్యలు చూచి బోర్లా పడిపోయి మోసపోతూ ఉంటారు.

ఇంకొంతమంది పుస్తకాలు విపరీతంగా చదివేసి విషయసేకరణ చేసి ఉంటారు. తద్వారా అన్నీ తెలుసుకున్నామని అనుకుంటూ ఉంటారు.ఇలాంటివారు పాండిత్య అహంకారం అనే ఉచ్చులో చిక్కుకుని ఇక అక్కడనుంచి ముందుకు కదలలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంతమంది అతితెలివితో నిండిపోయి ఉంటారు.వీరికి ఆధ్యాత్మికత అంటే ఒక పిచ్చివ్యవహారం కింద లెక్క.అదొక "టైంవేస్ట్" అని వారి ఉద్దేశ్యం.ఇలాంటి అతితెలివి మనుషులకు వారి అతితెలివే ఉచ్చుగా మారి వారిని ముందుకు అడుగు వెయ్యనివ్వకుండా ఆపుతూ ఉంటుంది.మాకన్నీ తెలుసు అనే భ్రమలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని కామెంట్ చేస్తూ వారు ఏమి కోల్పోతున్నారో వారే గ్రహించలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంత మందికి అత్యాశ ఉంటుంది.వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఏదో లాభం పొందుదామనే ప్రయత్నిస్తూ ఉంటారు.ఇలాంటివారు ఎన్నేళ్ల తరబడి అందులో ఉన్నాకూడా చివరకు ఏమీ అర్ధంకాని అయోమయమే వారికి మిగులుతుంది.వారి అత్యాశే వారికి ఉచ్చుగా మారి బిగిస్తుంది.అప్పనంగా వరాలొస్తాయన్న అత్యాశతో నిన్నా మొన్నటివరకూ కొందరు ప్రసిద్ధ గురువులను,అవతార పురుషులను(?) అనుసరించిన వారికి నేడు మిగిలింది అదే.ఆయా గురువులూ,అవతార పురుషులూ 'ఫ్రాడ్' అని నేడు తేలడంతో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో వారు ప్రస్తుతం ఉన్నారు.

గురువులమనుకునేవారికి గ్రుడ్డితనపు ఉచ్చు
మోసకారులకు వారి మోహపాశమే ఉచ్చు
అడుగు వెయ్యని వారికి అలసత్వమనే ఉచ్చు
అర్పణ చేతకానివారికి అహంకారమే ఉచ్చు

అసలు "విషయం" అంటూ వారిదగ్గర పెద్దగా లేకపోయినా, అనేకమంది వారికివారే 'సద్గురు' వులమని పేర్లు పెట్టుకుని శిష్యులచేత ప్రచారాలు చేయించుకుంటూ తెలిసీ తెలియని ఆధ్యాత్మికతను బాగా మార్కెటింగ్ చేస్తున్నారు.ఇలాంటి స్వయంగురువులకు వారి గ్రుడ్డితనమే వారికి ఉచ్చుగా మిగులుతుంది.

ఇంకొంతమంది వారి మోసకారుతనాన్ని ఆధ్యాత్మికలోకంలో కూడా ప్రయోగిస్తూ ఉంటారు.ఇలాంటివారికి కావలసింది ఆయా సర్కిల్స్ లో దొరికే పరిచయాలు.ఆ పరిచయాల ద్వారా అయ్యే పనులు.వీరంతా పచ్చి మోసగాళ్ళు.పనులు కావడమే వీరికి ప్రధానంగాని పరిణతి రావడం కాదు. వారిని పట్టి పీడిస్తున్న మోహాలే ఇలాంటివారికి ఉచ్చులుగా మారుతాయి. పక్కదారులు పట్టిస్తాయి.

ఇంకొంతమంది ఏళ్ళతరబడి ప్రవచనాలూ బోధలూ వింటూ ఉన్నప్పటికీ ఆచరణలో ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేరు.ఇలాంటి వారికి వారి అలసత్వమూ బద్ధకాలే ఉచ్చులుగా మారి కట్టివేస్తాయి.

ఇంకొంతమంది గురువుకూ దైవానికీ శరణాగతి కాలేరు.దానికి అడ్డుపడేది వారి అహంకారమే.'అహం' అన్న మాటను ఒప్పుకోకుండా దానికి రకరకాల కారణాలను వారు చెబుతారు.అలా వారికి వారే సర్దిచెప్పుకుంటూ సంతృప్తి పడుతూ ఉంటారు.ఇలాంటివారికి వారి అహంకారమే ఉచ్చుగా మారి బంధిస్తుంది.దానిని వారు దాటలేరు.

లోన శుద్ధికాకపోతె లోకమనేదే ఉచ్చు
కాలు కదపలేకపోతే కల్లమాటలే ఉచ్చు
మానవత్వమెరుగనిచో మాయతంతులే ఉచ్చు
దేశద్రిమ్మరులకేమో దేబిరింపే ఉచ్చు

మనస్సు శుద్ధి కాకపోతే లోకంలో ప్రతిదీ ఉచ్చుగా మారి మనల్ని కదలకుండా బంధిస్తుంది.మనస్సు శుద్దంగా ఉంటే లోకంలో ఏదీ మనల్ని బంధించలేదు.మనస్సు ద్వారానే బంధమైనా స్వతంత్రమైనా మనిషికి ప్రాప్తిస్తుంది.

కొంతమంది ఆచరణ అనేది లేకుండా ఊరకే కూచుని ఉపన్యాసాలు ఇస్తుంటారు.వారికి చివరకు మిగిలేవి కల్లమాటలూ సొల్లుమాటలే.ఆ మాటలే వారికి ఉచ్చులు.

ఇంకొంతమంది దేశాలు పట్టుకుని ఊరకే పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.అదే నిజమైన ఆధ్యాత్మికత అని వారనుకుంటారు.పోయిన ప్రతీచోటా ఏదో దొరుకుతుంది అన్న దేబిరింపే వారికి ఉచ్చుగా మారి వారిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా కట్టి ఉంచుతుంది.ఆ సంగతి వారు గ్రహించలేరు.

మరికొంతమంది మాయతంతులు హోమాలూ పూజలే మహాగొప్ప విషయాలని భ్రమిస్తూ వాటిల్లో మునిగి తేలుతూ ఉంటారు.వారికి మానవత్వం మాత్రం ఉండదు.ఇలాంటి మనుషులకు వారి మాయతంతులే ఉచ్చుగా మారి వారిని బంధిస్తూ ఉంటాయి.వారూ ఈ విషయాన్ని గ్రహించలేరు.

ఈ విధంగా ఆధ్యాత్మికలోకంలో అడుగడుగునా ఎవరి అజ్ఞానమూ స్వార్ధమూ అహంకారమూ అలసత్వమూ ఆశపోతుతనాలే వారికి ఉచ్చులుగా మారి వారిని కట్టిపడేస్తూ ఉంటాయి.కానీ అలా కట్టబడి ఉన్నామన్న స్పృహ వారికి ఉండదు.

ఇదే ఆధ్యాత్మిక లోకపు విచిత్రాలలో ఒక మహావిచిత్రం.

ఈ ఉచ్చులనుండి బయటపడలేకపోతే నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో ఎన్నటికీ అర్ధం కాదనేది మాత్రం కఠోరవాస్తవం.అర్ధం చేసుకోడానికే జన్మంతా సరిపోతుంటే ఇక దానిని ఆచరణలో పెట్టేది ఎన్నడు? అనుభవాన్ని పొందేది ఎప్పుడు?