“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఆగస్టు 2014, శనివారం

Wise Bucket Challenge

ALS(Amyotrophic Lateral Sclerosis) అనే రోగానికి సంబంధించిన ఎరుక సమాజంలో పెరగడానికీ దాని నివారణకోసం రీసెర్చ్ కి తోడ్పడటానికీ ఐస్ బకెట్ చాలెంజ్ అనేది అమెరికాలో మొదలైంది.ఇందులో ఒక బకెట్ లో నీళ్ళూ ఐస్ ముక్కలూ వేసి వాటిని తలమీద పోసుకుని కొంతమందిని నామినేట్ చేస్తారు.వారు కూడా దీనిని చేసి ఇంకొంతమందిని నామినేట్ చెయ్యాలి. అందరూ కలసి కొంత డబ్బును ఆ రీసెర్చి ఫౌండేషన్ కి దానం చెయ్యాలి.

చాలామంది అమెరికన్లూ దీనిని చేస్తున్నారు.అక్కడ ఉన్న మనవాళ్ళూ చేస్తున్నారు.ఆ రోగానికి సంబంధించిన ఎవేర్ నెస్ పెంచుతున్నారు.బాగానే ఉంది.

పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, దీనిని చూచి మన దేశంలో "రైస్ బకెట్ చాలెంజ్" అనేదొకటి మొదలైంది.మన దేశంలో పేదరికం అధికం కనుక మనకు కావలసింది ఐస్ బకెట్ చాలెంజ్ కాదు, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ఒక బకెట్ లో బియ్యాన్ని నింపి దానిని ఎవరైనా పేదవారికి దానం ఇవ్వడం కొందరు మొదలు పెట్టారు.

ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే మన దేశంలో తీసుకునే వారికి కొదవేముంది?మనదేశంలో కోటీశ్వరులకు కూడా తెల్లకార్డులుంటాయి కదా.ఒక బకెట్ రైస్ వస్తున్నది తీసుకుంటే పోలా అని బెంజీ,  బీ ఎం డబ్లూ, కార్లలో పోయేవారు కూడా ఆగి ఒక బియ్యం బకెట్ ను డిక్కీలో వేసుకుని పోతున్నారు. 

మన దేశంలో ప్రస్తుతం పేదవారు అనేవారు అసలున్నారా? అని నాకొక పెద్ద అనుమానం గత కొన్నేళ్ళ నుంచీ ఉంది.ప్రతి పేదవాడి ఇంట్లోనూ నేడు కలర్ టీవీ ఉంది.ఒకవేళ లేకపోతే ప్రభుత్వమే ఇస్తోంది.ఇంటింటికి కేబుల్ నెట్ వర్క్ ఉన్నది.ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్నది.ఇంటికి నాలుగు చొప్పున సెల్ ఫోన్లూ ఉన్నాయి.మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త మొబైల్నూ కొని పాతదాన్ని నెలకొకసారి మార్చిపారేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ నేడు ఒక మొబైల్ షాపు పెట్టడానికి సరిపోయినన్ని పాత సెల్ ఫోనులు పడున్నాయి.ఇంటికి నాలుగు టూ వీలర్లూ రెండు కార్లూ ఉంటున్నాయి.

ఇకపోతే ఇప్పటికీ మంచినీళ్ళు దొరకని పల్లెటూళ్ళు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి.కాని సారాయి కొట్టులేని ఊరు మాత్రం ఎక్కడా లేదు. ఒకవేళ లేకపోతే,ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలే వాటిని అమర్చిపెట్టి పోయాయి.అన్ని సారాయి షాపులూ సాయంత్రానికి కిటకిట లాడుతున్నాయి.జనంతో కళకళ లాడుతున్నాయి.కొన్ని ఊర్లలో అయితే పొద్దు పొద్దున్నే కూడా అవి జనంతో సందడిగా కనిపిస్తున్నాయి.కాలేజీ ఆడపిల్లల దగ్గరనుంచీ అందరూ నేడు సారాయిని (ఏదో ఒకరూపంలో) చక్కగా తాగుతున్నారు. సారాయి అని చీప్ గా అన్నందుకు మళ్ళీ అది తాగేవారికి కోపం రావచ్చు. పేరు ఏదైనా పదార్ధం అదేగా.

మన దేశంలో 'వైన్ బకెట్ చాలెంజ్'(Wine Bucket Challenge) మాత్రం ఎప్పటినుంచో నడుస్తోంది.దానికి ఎవరి ప్రోత్సాహమూ ఆహ్వానమూ అక్కర్లేదు.ఎవరికి వారే స్వచ్చందంగా పరమోత్సాహంతో దీనిలో పాల్గొంటున్నారు.

ఇలాంటి ప్రజలకు రైస్ బకెట్ నిజంగా అవసరమా? అంటే లేదనే సమాధానం వస్తుంది.ఎవరికో దురదపుట్టి ఇస్తున్నారు గనుక తీసుకునేవారు తీసుకుంటున్నారు గాని నిజంగా మన దేశంలో పేదవాడు ప్రస్తుతం ఎక్కడా లేడు.అందరి దగ్గరా డబ్బులు బాగానే ఉన్నాయి.

ఆ మధ్యన అమెరికానుంచి చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చిన ఒక మిత్రుడు ఇలా అన్నాడు.

'నేను నాలుగేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను.ప్రస్తుతం ఇండియాను చూస్తుంటే అమెరికాలో ఉన్న మేమే మీకంటే పేదవాళ్ళమని అనిపిస్తున్నది.'

ఐస్ బకెట్టూ, రైస్ బకెట్టూ మన దేశానికి అవసరం అవునో కాదో నేను చెప్పను గాని ప్రపంచం మొత్తానికీ అవసరం అయిన చాలెంజ్ ఒకటి మాత్రం నేను చెప్పదలచుకున్నాను.

అదే వైస్ బకెట్ చాలెంజ్ Wise Bucket Challenge

అంటే మనం వైస్ గా జ్ఞానంతో బ్రతకడం,ఇతరులలో దానిని పెంపొందించే పనిని చెయ్యడం అన్నమాట.ఒక్కమాటలో చెప్పాలంటే నిజమైన సనాతనమైన భారతీయ ఆధ్యాత్మికతను నిత్యజీవితంలో ఆచరిస్తూ ఇతరులను కూడా దానిని ఆచరించేలా ఉత్తెజపరచడమే Wise Bucket Challenge.వారూ వీరూ అన్న భేదం లేకుండా ప్రపంచంలోని మనుష్యులకందరికీ ఇది నేటి కాలంలో అత్యంత అవసరం.

అయితే ఆధ్యాత్మికతకీ బకెట్ కీ ఏంటి సంబంధం? అని అనుమానం రావచ్చు.

ఇంగ్లీషులో 'కికింగ్ ద బకెట్' అనే మాట ఉన్నది.అంటే బాల్చీ తన్నెయ్యడం అన్నమాట.

పుట్టిన ప్రతి మనిషీ ఏదోరోజున పోక తప్పదు.ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఆ పోయే సమయానికి కర్మ బ్యాలెన్స్ ను పూర్తిగా ఖాళీ చేసుకుని పోవడమే నేను చెప్పే 'వైస్ బకెట్ చాలెంజ్'.

జ్ఞానంతో జీవిస్తేనే ఇది సాధ్యమౌతుంది.జ్ఞానంతో కర్మ చేస్తూ బ్రతికితేనే ఇది సాధ్యమౌతుంది.అప్పుడే మన ఎకౌంట్లో ఉన్న కర్మ తగ్గుతూ వస్తుంది.దానికి విరుద్ధంగా అజ్ఞానంలో బ్రతికి తదనుగుణమైన కర్మలు చేస్తూ ఉంటే అది రోజురోజుకూ పెరుగుతుంది.అప్పుడు బాల్చీ తన్నేసే సమయానికి తలకు మించిన భారంతో పోవలసి వస్తుంది.ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకున్న కర్మ బ్యాలెన్స్ ను ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ చేసుకుని పోవలసి వస్తుంది. అది అభిలషణీయం కాదు.

మనం ఈలోకంలోకి వచ్చేటప్పుడే ఒక పెద్దబకెట్ నిండా కర్మతో వచ్చాం. జ్ఞానహీనులమై ఇష్టం వచ్చినట్లు బ్రతికితే,బకెట్ తన్నేసే సమయానికి ఒక పెద్ద కర్మగంగాళాన్ని మోసుకుని పోవలసి వస్తుంది. ఆ గంగాళం బరువుతో అప్పుడెక్కడికి పోతామో,ఏ జన్మ ఎత్తుతామో మనకు తెలియదు. 

అలా కాకుండా,చేతిలో ఉన్న బకెట్ ని ఖాళీచేసి అవతలపారేసి హాయిగా చేతులూపుకుంటూ పోవాలంటే,నిత్యజీవితంలో కర్మను యోగంగా మార్చుకుని జీవితాన్ని నడిపినప్పుడే ఈ వైస్ బకెట్ చాలెంజ్ లో మనిషి నెగ్గగలుగుతాడు.

దీనికి ఇంకొకరిని నామినేట్ చెయ్యనవసరం లేదు.అలా నామినేట్ చెయ్యడం కుదరదు కూడా.ఇది ఎవరికి వారికి లోనుండి రావలసిన చాలెంజ్.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకునే చాలెంజ్ కాదు.

ఐస్ బకెట్ చాలెంజ్ వల్ల ALS అనే వ్యాధి నిర్మూలనానికి దోహదం అవుతుంది.

వైస్ బకెట్ చాలెంజ్ వల్ల కూడా ALS అనే వ్యాధి పోతుంది.అయితే ఈ వ్యాధి వేరు.దీనిని నేను 'అజ్ఞాన లంపటం సిండ్రోం' (ALS) అని పిలుస్తాను.వైస్ బకెట్ చాలెంజ్ చెయ్యగలిగిన వాడికి అజ్ఞానమూ పోతుంది.ప్రపంచ లంపటమూ పోతుంది.

ఆత్మారామత్వమూ ఆనందస్వరూపమూ వాడికి మిగులుతాయి.

ఐస్ బకెట్, రైస్ బకెట్ల వల్ల ఏవేవి పోతాయో నేను చెప్పలేను గాని వైస్ బకెట్ వల్ల మాత్రం మూలవ్యాధి (fundamental disease) అయిన అజ్ఞానం నశించిపోతుందని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు.భగవంతుడే దీనిని గురించి చెప్పినాడు.

శ్లో||తేషామేవానుకంపార్ధ మహమజ్ఞానజం తమ:
నాశాయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వతా

(భగవద్గీత 10:11)

(వారి మీద కరుణతో వారి హృదయాలలో నేనే నిలిచి ఉండి,జ్ఞాన తేజస్సుతో వాటిని నింపి,అజ్ఞాన జనితమైన అక్కడి చీకటిని నాశనం చేస్తున్నాను)

అంటూ భగవంతుడే ఈ ఛాలెంజ్ స్వీకరించేవారికి అభయప్రదానం గావిస్తున్నాడు.ఇంక భయమేముంది?

ఈ ఛాలెంజ్ ని మనం స్వీకరించకుండా అడ్డుపడే తమస్సు అంటే ఏమిటో కూడా భగవంతుడే చెప్పాడు.

శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత

(భగవద్గీత 14:8)

నిర్లక్ష్యమూ,ఆలస్యమూ,బద్ధకమూ -- ఈ మూడూ అజ్ఞానం నుంచి పుట్టినవి.ఇవే సమస్త జీవులనూ మోహంలో ముంచి జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి.

ప్రమాదం (నిర్లక్ష్యం) అంటే - మనకిప్పుడే ఆధ్యాత్మికత ఎందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి.

ఆలస్యం అంటే - రేపు చేద్దాంలే అని ఏరోజుకారోజుకి సాధనను వాయిదా వెయ్యడం.


నిద్ర అంటే - సాధనలో బద్ధకాన్ని వదిలించుకోలేని అశక్తత.


తమస్సు అంటే ఈ మూడు లక్షణాలే.


అంతేకాదు, Wise Bucket Challenge (WBC) అనే ఈ ఛాలెంజ్ ని స్వీకరించే వాడికి అంతర్గత WBC (White Blood Corpuscles) కౌంట్ తగినంతగా పెరిగి అజ్ఞానం అనే మహమ్మారిని అడ్డుకునే వ్యాధినిరోధక శక్తి అతనిలో విపరీతంగా పెరుగుతుందని నేను చెబుతున్నాను.

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని సాక్షాత్తూ భగవంతుడే విసుగనేది లేకుండా ఎప్పటినుంచో మనలను పిలుస్తున్నాడు.కానీ ఆయన మాట ఎవరూ వినడం లేదు.

శ్లో||తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసి నాత్మనః
ఛిత్వైనం సంశయం యోగమాత్తిష్టోత్తిష్ట భారత

(భగవద్గీత 4:42)

(ఓ భారతపుత్రా! అజ్ఞానం నుండి పుట్టి నీ హృదయంలో తిష్ట వేసి ఉన్నట్టి సంశయములను జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించు.యోగమును ఆధారంగా చేసుకొని నీ జీవనసమరాన్ని నడిపించు)

ఇదే వైస్ బకెట్ ఛాలెంజ్

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని మన సనాతన ధర్మమూ మన మహర్షులూ కూడా కొన్నివేల ఏళ్ళ నుంచీ మనలను ఆహ్వానిస్తూనే ఉన్నారు.

కానీ ఈ ఛాలెంజ్ ని మనస్ఫూర్తిగా స్వీకరించేవారు ఎందరున్నారు?అందరూ పనికిమాలిన ఐస్ బకెట్ ఛాలెంజ్,రైస్ బకెట్ ఛాలెంజ్ లను స్వీకరించేవారేగాని అసలైన వైస్ బకెట్ ఛాలెంజ్ ని స్వీకరించేవారు ఎవరున్నారు?

కనీసం ఒక్కరన్నా ఉన్నారా???
read more " Wise Bucket Challenge "

27, ఆగస్టు 2014, బుధవారం

స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి

మొన్నొక రోజున పొద్దున్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది.

ఏదో కొత్త నంబర్.

సామాన్యంగా కొత్త నంబర్లకు నేను పలకను.

'సరే చూద్దాంలే పొద్దున్నే ఎవరో' అనుకుని 'హలో' అన్నా.

'స్వామిగారున్నారా?' అవతలనుంచి ఒక గొంతు వినిపించింది.

'నేను స్వామినెప్పుడయ్యానా?' అని నాకే అనుమానం వచ్చింది.

ఏమిటో చూద్దామని -'ఏ స్వామివారు?' అని అడిగాను.

'అదే... గుళ్ళో స్వామిగారు ఉంటారట కదా?' అన్నాడు ఆ వ్యక్తి.

'గుళ్ళో స్వామి ఫోన్లో ఎలా మాట్లాడతాడు?' అడిగాను.

'అదికాదు.ఆయన అపాయింట్ మెంట్ కావాలి.'

పొద్దున్నే ఏమిటో ఈ హాస్యప్రభంజనం అనుకుని-'గుళ్ళో స్వామి అపాయింట్ మెంట్ మీక్కావాలా?' అడిగాను.

'అవును'

'మీ వయసెంత?' అడిగాను.

'నలభై'

'అప్పుడే అంత తొందర ఎందుకు? ఇంకా కొన్నాళ్ళు ఉండండి.' అన్నాను.

నేను చెబుతున్నది అవతల ఎక్కడం లేదు.

'అలా కాదు.నేను చాలా ట్రబుల్స్ లో ఉన్నాను.స్వామిగారిని అర్జెంట్ గా కలవాలి' అన్నాడు.

'స్వామిగారు కూడా ప్రస్తుతం చాలా ట్రబుల్స్ లో ఉన్నారు.ఆయన ఎవర్ని కలవాలో ఆలోచిస్తూ ధ్యానంలో ఉన్నారు.' అన్నాను.

వినిపించుకునే పరిస్థితిలో అవతల వ్యక్తి లేడు.

'ధ్యానం లోనుంచి లేచాక,ఆయనతో మాట్లాడి అపాయింట్ మెంట్ ఇప్పించండి.ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'వీలుకాదు.ధ్యానం తర్వాత ఆయన ప్రియశిష్యురాలితో ఏకాంతసేవలో ఉంటారు.మధ్యాన్నం మూడువరకూ బయటకు రారు.ఈలోపల కదిలిస్తే ఆయనకు మహాకోపం వస్తుంది.'అన్నాను సీరియస్ గా.

అవతలి వ్యక్తి పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు.

'పోనీ ఈలోపల ఏదైనా రెమెడీ మీరు చెప్పినా పరవాలేదు." అన్నాడు.

మధ్యాన్నం మూడువరకూ కూడా ఆగలేడట!!వెంటనే పనిచేసే రెమెడీ ఈలోపల నేను చెప్పాలట!!! ఇదేమైనా తలనొప్పి మాత్రా వేసుకున్న పదినిముషాలలో నొప్పి మాయం అవడానికి??

టీవీ జ్యోతిష్కుల పుణ్యమా అని 'రెమేడీ'అనేది ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది.ఒక లెక్కా ఏమీ లేకుండా ఎవరి నోటికోచ్చినవి వారు చెబుతున్నారు.చేసేవారు చేస్తున్నారు.ఇది కర్మతో చెలగాటం అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఈ ఫోన్ కాల్ ఎవరికో చెయ్యబోయి నాకు చేశాడని అర్ధమైపోయింది.

'అలాంటి రెమెడీలు నాకు తెలియవు.నా రెమెడీలు మీరు ఆచరిస్తే మీ సమస్యలు పోవుగాని ఏ సమస్య వచ్చినా చెదరకుండా మీరు ఉండగలుగుతారు.కానీ అలాంటివి ఫోన్లో చెప్పను.' అన్నాను.

'అందుకే సార్.వచ్చి కలుస్తాం.' అన్నాడు.

'మీరెలాంటి రేమేడీలు ఆశిస్తున్నారు?' అడిగాను.

'స్వామిగారు హోమాలు చేయిస్తారట కదా?అన్ని ప్రాబ్లెమ్స్ పోతాయట కదా?' అన్నాడు.

ఆ స్వామివారెవరో ఈ గోలేమిటో విషయం వెంటనే అర్ధమై పోయింది.

'స్వామివారి డైరీలో ఇంకో అయిదేళ్ళ వరకూ కాల్షీట్లు ఖాళీలు లేవు. అపాయింట్ మెంట్లు ముందే ఫిక్స్ అయిపోయాయి.' అన్నాను.

'అలా అంటే ఎలా సార్?పోనీ మీరైనా ఏదైనా రేమేడీ చెప్పండి.' అన్నాడు.

నేను స్వామివారి అసిస్టెంట్ ను అనుకుంటున్నాడని నాకర్ధమైంది.

'అసలు మీ ప్రాబ్లెం ఏమిటి?' అడిగాను.

'రెండు కోట్లు బ్లాక్ అయిపోయాయి.అవతలి పార్టీ మోసం చేసాడు.వాడు నా ఫ్రెండే.ఆ డబ్బు వచ్చే మార్గం చెప్పాలి' అన్నాడు.

ఇక ఇతనికి ఉపదేశం అవసరం అనుకున్నా.

'చూడండి.అత్యాశ మంచిది కాదు.ఉన్నంతలో బ్రతకడం నేర్చుకోండి. దురాశకు పోయి నానా పాడుపనులూ చేసి డబ్బు సంపాదించకండి.ఎంత సంపాదించినా వెంట తీసుకుపొయ్యేది ఏమీ లేదు.సుఖాలకు అంతూ పొంతూ కూడా లేదు.మానవ జీవితగమ్యం డబ్బు సంపాదన ఒక్కటే కాదు. అమూల్యమైన మానవజీవితాన్ని అనవసరమైన విషయాలలో వృధా చేసుకోకండి.ధర్మంగా బ్రతకండి.ఒకవేళ అధర్మం అయితే మీకు నష్టం కలిగినా సరే ఆ పనిని ఒదిలెయ్యండి.' అన్నా.

అవతలవైపు నుంచి భయంకరమైన నిశ్శబ్దం వినిపించింది.

ఫోన్ పెట్టేశా.

ఆయన ఫోన్ చేసిన స్వామివారు ఎవరో నాకు తెలుసు.ఆ స్వామివారే ప్రస్తుతం పీకల్లోతు లౌకిక సమస్యలలో కూరుకుని పోయి ఉన్నారు.పోనీ ఆధ్యాత్మిక జ్ఞానమన్నా ఆయనకు ఎక్కువైపోయిందా అంటే అదీ లేదు.అలాంటి స్థితిలో ఉండి వారు ఇతరులకు సలహాలిస్తున్నారు.వీరు స్వీకరిస్తున్నారు.

ఏమిటో ఈ మాయ!!

ఆశ అనేది చాలా గొప్ప శక్తి.దురాశ అనేది ఇంకా గొప్ప శక్తి.ఇవి రెండూ మనిషిని పట్టుకుని పీడిస్తూ ఉన్నంతవరకూ ఇలాంటి స్వాముల చేతులలో చిక్కి బలికాక తప్పదు.ఇలాంటి అనైతిక పనులకు సలహాలిచ్చే వీరు 'స్వామి' అన్న పదానికి అర్హులేనా అని నా ప్రాచీన అనుమానం.చివరకు 'నేటి స్వాములు' హవాలా కార్యకలాపాలకు బ్రోకర్లుగా మారుతున్నారు. ఇంతకంటే చండాలం ఇంకొకటి ఉండదు.

తప్పుదారిన పోతున్నవారికి 'ఇదితప్పు' అనిచెప్పి దారి మళ్ళించి మంచిదారిలో పెట్టేపనిని వారు చెయ్యాలి.అంతేగాని,ఆయా పనులకు సహకరిస్తూ,అవి తేలికగా అయ్యే మార్గాలు చెబుతున్న వీరు 'స్వామి' అన్న పదం తగిలించుకుని దానిని భ్రష్టు పట్టిస్తున్నారు.

దశనామీ సంప్రదాయాన్ని సృష్టించిన ఆదిశంకరుల వంటి మహనీయులు ఇలాంటి స్వాములను పైనుంచి చూచి ఎంతగా బాధపడుతున్నారో అనిపించింది.

దేవుడా!! ఎంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించావయ్యా!! ఎలాంటి లీలను నడిపిస్తున్నావయ్యా !! అని దైవానికి మనస్సులో నమస్కారం చేసుకుని నా పనిమీద నేను బయలుదేరాను.
read more " స్వామివారి అపాయింట్ మెంట్ కావాలి "

20, ఆగస్టు 2014, బుధవారం

BKS Iyengar-శపిత యోగం

నేడు ప్రపంచంలో BKS Iyengar (బేలూర్ కృష్ణమాచార్ సుందరరామ అయ్యంగార్ )పేరు తెలియని వారు ఉండరు.

Light on Yoga, Light on Pranayama మొదలైన గ్రంధాలు అనేకం వ్రాసి దాదాపు 60 పైన దేశాలలో యోగా స్కూల్స్ స్థాపించిన ఈ 95 ఏళ్ళ యోగాచార్యుడు ఈరోజు ఉదయం పూనాలో దేహం చాలించాడు.

ఈ వయసులో కూడా ఆయన అరగంట సేపు శీర్షాసనంలో ఉండగలడు.మిగిలిన ఆసనాలంటే ఇంక చెప్పనక్కరలేదు.అవన్నీ ఆయనకు కొట్టిన పిండి.'లైట్ ఆన్ యోగా' పుస్తకంలో ఆయన చూపించిన యోగాసనాలు చూస్తే అసలు ఈయన శరీరంలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.

ఈయనకూడా శపితయోగానికి బలయ్యారంటే చదువరులకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

ఒక్కసారి ఈయన జాతకం పరికిద్దాం.

ఈయన 14-12-1918 తేదీన కర్ణాటక కోలార్ జిల్లాలోని బేలూర్ లో ఉదయం 3.00 గంటలకు జన్మించారు.తల్లిదండ్రులు సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణులు.

గురుశనుల వక్రీకరణ వల్ల ఈయనకు లోకంతో ఎంతో కర్మసంబంధం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తున్నది.అందుకేనెమో దేశదేశాలు తిరిగి యోగా స్కూల్స్ స్థాపించి భారతీయ హఠయోగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.

ప్రపంచంలో లక్షలాదిమందికి యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని కలిగించారు. ఇలాంటి వ్యక్తి తన చిన్నతనంలో ఫ్లూ మలేరియా టీబీ టైఫాయిడ్ లతో బాధపడ్డారంటే మనకు నమ్మశక్యం కాదు.కానీ ఇది నిజం.

కాలయుక్తి నామ సంవత్సరం మార్గశిర ఏకాదశి రోజున ఆయన జన్మించారు. ఈయన చనిపోయినది కూడా ఏకాదశి రోజుననే కావడం ఒక విచిత్రం.శ్రావణ ఏకాదశి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమికి దగ్గరగా ఆయన చనిపోవడం ఆయనపైన ఉన్న కృష్ణానుగ్రహాన్ని సూచిస్తున్నది. వైష్ణవునిగా జన్మించినందుకు ఏకాదశి రోజునా అందులోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరగా పోవడం చాలా మంచిది.ఈయనకు ఉత్తమ గతులు కలుగుతాయన్న దానికి ఇది సూచన.

అశ్వనీనక్షత్రం రెండోపాదంలో ఈయన జన్మించారు.అశ్వనీ దేవతలు దేవ వైద్యులు.ఈయన కూడా తన యోగవైద్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు.నక్షత్ర లక్షణాలు ఈ విధంగా జీవితంలో కనిపిస్తూ ఉంటాయి.

ఈయన పుట్టినపుడు కేతు/కుజ దశ జరుగుతూ ఉన్నది.కేతు కుజుల సంబంధం గురించీ వీరవిద్యల గురించీ నేను ఇంతకు ముందు వ్రాసి ఉన్నాను.దీనికి ఋజువు మళ్ళీ ఈ జాతకంలో కనిపిస్తుంది.ఈ సంబంధం ఉన్నప్పుడు శరీరంతో చేసే వ్యాయామవిద్యలు చాలా త్వరగా పట్టుబడతాయి.యోగానికీ వీరవిద్యలకూ సంబంధం ఉన్నదని నేను స్వానుభవంతో నిర్ధారణగా చెప్పగలను.

జననకాల దశాదిపతి అయిన కేతువు అష్టమంలో ఉండటంతో ఆయన చిన్నతనం అంతా రోగాలతోనూ గండాలతోనూ గడిచింది. బలహీనంగా, ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండే ఈ పిల్లవాడు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి యోగాగురువు అవుతాడనీ 95 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతాడనీ బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు.

కుజుడు బలంగా ఉన్న జాతకులకు భౌతిక పరిధిలో అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి.వారు దానిని దాటి వెళ్ళలేరు.ఒకవేళ వెళ్ళినా వారి మూలాలు భౌతికం లోనే పాతుకుని పోయి ఉంటాయి.కుజునికి ఉచ్ఛరాశి మకరం కూడా భూతత్వ రాశియే.అందుకే వారికి భౌతిక శరీర సంబంధం అంత త్వరగా వదలదు.

ఈయన జాతకంలో కుజుడు రాశి నవాంశలలో ఉచ్ఛలో ఉన్నాడు.కనుక చాలా బలంగా ఉన్నట్లు లెక్క.కనుక భౌతిక శరీరంతో చేసే హఠయోగాన్ని ఈయనకు వరంగా ప్రసాదించాడు.
  
18 ఏళ్ళ వయసులో 'యోగా' ను నేర్పడానికి ఆయన పూనాలో అడుగు పెట్టాడు.అప్పుడు ఆయనకు శుక్ర/శని దశ జరుగుతున్నది.మొదట్లో ఎన్నో కష్టాలు పడినా క్రమేణా గుర్తింపు లభించింది.శనీశ్వరుడు ఈయన జాతకంలో విద్యకు కారకుడు.కనుక శరీరకష్టంతో కూడిన యోగవిద్య ఆయనకు పట్టుబడింది.శుక్రుడు లగ్నాదిపతిగా మూడింట నవమాధిపతి అయిన బుదునితో కలసి ఉన్నాడు.నవమం నుంచి గురువుతో చూడ బడుతున్నాడు.కనుక దూరప్రాంతానికి యోగాగురువుగా వెళ్ళాడు.

1952 లో వాయులీన విద్వాంసుడు యెహోదీ మెనూహిన్ ద్వారా ఈయన లండన్ లో యోగా క్లాస్ ప్రారంభం చేశాడు.ఆ సమయంలో చంద్ర/గురు దశ ఈయన జాతకంలో జరిగింది.చంద్రుడు సప్తమంలోనూ గురువు నవమంలోనూ ఉండటం చూడవచ్చు.ఈ రెండూ విదేశాలను సూచించే స్థానాలే.

90 ఏళ్ళ వయస్సులో కూడా రోజుకు మూడుగంటలు ఆసనాభ్యాసమూ ఒక గంట ప్రాణాయామమూ ఆయన ఖచ్చితంగా చేసేవాడు.వంక దొరికితే సాధనను ఎగర గొడదామని చూచే నేటి మనుష్యులు ఈయన్ని చూచి బుద్ధి తెచ్చుకోవలసిన అవసరం చాలా ఉన్నది.

ఈయన జిడ్డు కృష్ణమూర్తికి కూడా యోగా నేర్పించాడు.

ఈయనా రజనీషూ ఇద్దరూ పూనాలోనే ఉండేవారు.రజనీష్ చివరలో రకరకాల రోగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈయన దగ్గర యోగా నేర్చుకోమని కొందరు సూచించగా రజనీష్ తిరస్కరించాడు.శీర్షాసనం అంతసేపు వేస్తే మెదడులో రక్తనాళాలు చిట్లిపోతాయని రజనీష్ వాదించాడు. మరి నేటివరకూ అయ్యంగార్ కు ఏ రక్తనాళాలూ చిట్లలేదు.

1984 లో నేను గుంతకల్లు లో ఉన్నప్పుడు అక్కడ యోగా క్లాసు మొదలు పెట్టించడానికి అక్కడి వైశ్యప్రముఖులు ఈయనను రప్పించారు.అప్పుడు ఆయన యోగా క్లాసును దగ్గరుండి చూచాను.అప్పటికే నేను మార్షల్ ఆర్ట్స్ మరియు యోగా చాలా తీవ్రంగా చేసేవాడిని.అయ్యంగార్ గారి విధానంలో చాలా రకాలైన props వాడతారు.అవీ మంచివే.కానీ యోగాలో నా విధానం వేరు.నాకు ఆ క్లాసులో కొత్త ఏమీ కనపడలేదు.కనుక నేను అందులో చేరలేదు.

పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు ఈయనను వరించాయి.

పద్మశ్రీ 1991 లో వచ్చింది.ఆ సమయంలో గురు/కేతు దశ జరిగింది.వీరిద్దరూ అష్టమంలో ఉండటం చూస్తే ఈ అవార్డ్ ఈయనకు వ్రాసిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది.గత జన్మలో బాకీ ఉన్న దానిని ఈ జన్మలో ఇలా అందుకున్నాడు.

పద్మభూషణ్ 2002 లో శని/శని దశలో వచ్చింది.శనీశ్వరుడు ఈయనకు విద్యాదిపతిగా దశమ లాభ స్థానాలలో ఉండటం చూడవచ్చు.

పద్మవిభూషణ్ 2014 లో శని/రాహు దశలో వచ్చింది.ఘటీ లగ్నం రాహు నక్షత్రంలో ఉండటం గమనిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.

నేడు అంటే 20-8-2014 న శని/రాహు/శనిదశలో ఈయన మరణించాడు.ఇది ఖచ్చితమైన శపితయోగ దశ అని మళ్ళీమళ్ళీ నేను వివరించనవసరం లేదు.ఇదేమిటో నా పాత పోస్ట్ లు చదివిన వారికి సుపరిచితమే.

ప్రస్తుతం గోచార కుజశనులు ఈయన జననలగ్నం మీద సంచరిస్తున్నారు. అంటే ఈయన జన్మలగ్నానికి శపితయోగం పట్టింది.

రాశి నవాంశలలో ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు ఈయనకు శరీర ప్రధానమైన హఠయోగవిద్యనూ ఇచ్చాడన్నది వాస్తవం.అంతర్జాతీయ గుర్తింపును రాహువూ గురువూ ఇచ్చారు.

మన యోగవిద్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఇటువంటి విశిష్ట వ్యక్తులకు 'భారతరత్న' ఇవ్వడం చాలా అవసరం.అలా ఇవ్వడం ద్వారా మన ప్రభుత్వం తనను తానే గౌరవించుకున్నట్లూ మన విద్యలను గౌరవించినట్లూ అవుతుంది.

మన సంస్కృతిని గౌరవించే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్నది గనుక అలా జరుగుతుందని ఆశిద్దాం.
read more " BKS Iyengar-శపిత యోగం "

ఉచిత సలహాలు

ఈ లోకంలో ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలా ఎక్కువ.

కాకపోతే ఆ సలహాలు ఇవ్వబోయే ముందు వారివారి అర్హతలు ఏమిటో చూచుకోకుండా చాలామంది సలహాలు ఇవ్వబోతూ/ఇచ్చేస్తూ ఉంటారు.

నాక్కూడా చాలామంది ఉచిత ఆధ్యాత్మిక సలహాలిస్తుంటారు.

నిన్నగాక మొన్న,పిరమిడ్ ధ్యానం వంటి పిచ్చిపిచ్చి ధ్యాన విధానాలు ప్రారంభం చేసిన కొందరూ,అటుమొన్న సాయంత్రం నుంచీ రమణమహర్షి పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన ఇంకొందరూ,ఒక నెలక్రితం ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన ఇంకొందరూ,ఇంకేదో నిషా పుట్టించే యోగా చేసే మరికొందరూ తరచుగా నాకు ఉచిత సలహాలు ఇస్తుంటారు.

వారి సలహాలకు నాకు చచ్చే నవ్వు వస్తూ ఉంటుంది.ఆ సలహాలు చాలా సరదాగా కామెడీగా ఉంటాయి.నా బిజీ లైఫ్ లో వారి కామెడీ సలహాలు నాకు చాలా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటాయి.

అందుకు,ముందుగా వారికి థాంక్స్ చెప్పాలి.

వాటిలో కొన్నింటినీ,వాటికి నా జవాబులనూ ఇక్కడ చదవండి.

మీరూ హాయిగా నవ్వుకొని రిలాక్స్ అవ్వండి.
-----------------------------------------------
ఈ మధ్యనే ఒక పిల్లకాకి ఇచ్చిన సలహా ఇది.

1) కృష్ణుని జనన సమయం తెలుసుకోవడానికి జ్యోతిష్యం ఎందుకు?ధ్యానంలో అన్నీ తెలుస్తాయి.అలా ట్రై చెయ్యండి.నేను మొన్న ధ్యానంలో ఉన్నప్పుడు ఒక తెల్లని రెక్కల గుర్రాన్ని ఎక్కి గుంటూరులో మీ ఇంటి డాబా మీదకు వచ్చాను.డాబా మీద దిగుదాం అనుకునేలోపు గుర్రం ముందుకు వెళ్ళిపోయింది.ఫోర్త్ డైమెన్షన్ లోకి వెళితే అన్నీ తెలుస్తాయి.

నా జవాబు:

అవునా? ధ్యానం అంటే ఏంటో అదెలా చెయ్యాలో నాకు తెలియదే? ఎలా మరి?పోనీ ఒక పని చేద్దాం.నేను అజ్ఞానిని గనుక జ్యోతిష్య లెక్కలతో కుస్తీ పడుతున్నాను.మీరు ధ్యానసిద్ధులు కదా,మీ ధ్యానంలో చూచి కృష్ణుని అసలైన జననతేదీ వివరాలు చెప్పండి చూద్దాం.నాకీ బాధ తప్పుతుంది.

పోతే నాదొక సలహా.అలా గుర్రంఎక్కి ఆకాశంలో ఎగిరేటప్పుడు దాని మెడను గట్టిగా వాటేసుకోండి.ఒకవేళ బాలెన్స్ తప్పి ఆకాశంలోనుంచి జారి కింద పడితే రక్షించే దిక్కు ఉండరు.మా డాబా మీద పడితే పరవాలేదు.ఏదో ఒక హోమియో మందు నోట్లోవేసి నేను లేపుతాను.కానీ బిజీ రోడ్డు మీద పడితే చాలా కష్టం.

అసలే గుంటూరులో అందరూ పరమ దుర్మార్గులున్నారు.కనీసం 108 ని పిలిచి అందులో ఎక్కించే పనికూడా ఎవరూ చెయ్యరు.రోడ్డుమీద మీ ఖర్మానికి మిమ్మల్ని అలా వదిలేస్తారు.తెల్లరెక్కల గుర్రం మీకోసం ఎలాగూ ఆగదు.ఇంకొక ధ్యానిని వెదుక్కుంటూ అది ముందుకు ఎగిరిపోతుంది.కనుక జాగ్రత్త.

ముందుజాగ్రత్తగా,ఈసారి ధ్యానంలో కూచోబోయే ముందు తలకొక హెల్మెట్ పెట్టుకుని,వీపుకొక పేరాచూట్ కట్టుకుని కూచోండి సరిపోతుంది.అప్పుడు రెక్కలగుర్రంమీద నుంచి కింద పడినా కనీసం తలవరకూ సేఫ్ గా ఉంటుంది.

రాత్రి పూట పడుకోబోయే ముందు నాగేస్పర్రావు నటించిన 'కీలుగుఱ్ఱం' లాంటి పిచ్చిపిచ్చి సినిమాలు చూడకండి.అలా చూస్తే ఇలాంటి కలలే వస్తాయి.

ఇంకొక మహాజ్ఞాని సలహా ఇది.

2) శర్మగారు? అసలు మీకెందుకు ఈ గోల?ఈ బ్లాగులలో వీళ్ళతో ఈ గోలంతా మీకెందుకు? ఆత్మజ్ఞాని లక్షణాలు ఇలా ఉండవు.వెంటనే మీ బ్లాగు మూసేసి ఊరుకోండి.

నా జవాబు:-

మీ సలహాకి నా కృతజ్ఞతలు.

ఆత్మజ్ఞాని లక్షణాలు చెబుతున్నారంటే మీకూ ఆ జ్ఞానం ఉండే ఉంటుంది.మీరూ ఆత్మజ్ఞానులే అయి ఉంటారు.మరి మీరుమాత్రం నా బ్లాగు చూచీ,అందులోని విషయాలు మీకు జీర్ణం కాకా,ఇంత అసూయ పుట్టీ ఇలా బాధపడటం ఎందుకు?నాకు చెబుతున్నట్లు మీరు కూడా ఈ బ్లాగుల గోల వదిలిపెట్టి హాయిగా ఆత్మస్థితులై ఉండవచ్చుగా?

నాకు చెప్పబోయేముందు మీరే ఆపని చెయ్యాలి.ముందా పనిమీద ఉండండి.

మరో మహాజ్ఞాని సలహా ఇది.

3) మౌనమే అత్యుత్తమం అని రమణమహర్షి అన్నాడు.నిజమైన జ్ఞాని మీలా రోజుకొక పోస్ట్ వ్రాస్తూ బోధనలు చెయ్యడు.ఆ సంగతి గ్రహించండి.

నా జవాబు:-

అవునా? రమణమహర్షి మీతో అలా చెప్పారా పాపం? ఆయన బ్రతికి ఉన్న రోజులలో చక్కగా సోఫాలో కూచుని కాఫీత్రాగి న్యూస్ పేపర్ చదివేవారు. రేడియో వినేవారు.ఎందరితోనో ఎన్నో విషయాలు ముచ్చటించేవారు.ఈ సంగతులన్నీ మీకు ఇంకా తెలీవేమో?అవున్లే నిన్నగాక మొన్ననేగా మీరు రమణసాహిత్యం చదవడం మొదలుపెట్టింది.లోతులు అర్ధం కావాలంటే ఇంకా టైం పడుతుంది.

కనీసం ఒక రెండేళ్ళపాటు ఆ పుస్తకాలు బాగా చదివాక అప్పుడు నాతో మాట్లాడే కనీస అర్హత మీకు వస్తుంది.ఆ తర్వాత మళ్ళీ మెయిల్ ఇవ్వండి.

రమణమహర్షి పుస్తకాలు చదవడం కాదు.కనీసం మంచి ప్రశ్నలు ఎలా అడగాలో ముందు నేర్చుకోండి.మీరన్నట్లు రోజుకోక్క పోస్ట్ ఏం ఖర్మ? రోజుకు రెండూ మూడూ పోస్ట్ లు ఎలా వ్రాయాలో నేనీలోపల ప్రాక్టీస్ చేస్తాను.ఈరోజుకి ఇది రెండో పోస్ట్ చూచుకోండి.
---------------------------------------------------
ఇలా రకరకాలైన ఉచిత సలహాలూ విమర్శలూ నాకు వస్తూ ఉంటాయి. వీరిలో చాలామందికి సరియైన తెలుగు వ్రాయడమూ రాదు.మంచి ఇంగ్లీషు వ్రాయడమూ రాదు.సబ్జెక్టూ వారివద్ద ఉండదు.ఇలాంటి వారు నాకు ఉచిత సలహాలు ఇవ్వబోవడం నాకు భలేనవ్వు తెప్పిస్తూ ఉంటుంది.

ఉచిత సలహాలు వారే కాదు.నేనూ ఇవ్వాలి కదా కొన్ని.

అలాంటి వారికందరికీ నాదొక ఉచిత సలహా.

దయచేసి మీమీ ఉచిత సలహాలు ఆపకండి.కనీసం రోజుకొకటి నాకు మెయిల్ ఇస్తూ ఉండండి.ఎందుకంటే ముందే చెప్పినట్లుగా,మీ సలహాలు వచ్చినప్పుడల్లా నవ్వుతో నాకు పొలమారి మంచి నీళ్ళు త్రాగే పరిస్థితి వస్తూ ఉంటుంది.కాకపోతే నా బిజీ లైఫ్ లో మీ కామెడీ మెయిల్స్ వల్లే నేను ఉల్లాసంగా నవ్వుతూ ఉండగలుగుతున్నానంటే మళ్ళీ మీకు మా చెడ్డకోపం వస్తుందేమో.

నా ఈ పోస్ట్ చూచి అలా మీకు కోపం వస్తే, ఒక పని చెయ్యండి.

పిరమిడ్ ధ్యానం అలవాటైన వారు,పిరమిడ్లోకి దూరి తలుపేసుకుని గట్టిగా గాలిపీలుస్తూ శ్వాసమీద ధ్యాస ఉంచండి.మీ కోపం మాయమౌతుంది. కాకపోతే మొత్తం తలుపులు మూసుకోకండి.కనీసం ఒక్క కిటికీ అన్నా ఓరగా తెరిచి ఉంచుకోండి.లేకపోతే ఆ లోపల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయి ఊపిరాడక ఏదన్నా అయితే మీ బంధువులు మీకే ఒక పిరమిడ్ కట్టించవలసిన పరిస్థితి దాపురించవచ్చు.

రమణమహర్షి పుస్తకాలు చదివి నాకు ఉచిత సలహాలు ఇస్తున్న వారికి ఈ పోస్ట్ చదివి పిచ్చికోపం వస్తే - 'ఈ కోపం ఎవరికి వస్తున్నది? అసలు శర్మగారికి ఉచితసలహాలు ఇవ్వడానికి "నేనెవర్ని"?'-అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.మీ కోపం మహర్షి దగ్గరకు వెంటనే పారిపోతుంది.

పాములు పట్టే స్వాములవారి శిష్యులైతే, ముందుగా ఒక మాంఛి పుట్టను సెలెక్ట్ చేసుకుని దాని ఎదురుగా కూచుని నాదస్వరం ఊదుతూ ఆ పామును బయటకు రప్పించే పనిలో ఉండండి.ఏ పక్కనుంచి ఆ పాము బయటకు వస్తుందో అనే భయంలో నామీద కోపం ఎక్కడికో మాయమై పోక తప్పదు. ఒకవేళ మీ ఖర్మం చాలక పుట్టలోంచి పాము బయటకు వస్తే దానికోసం ఒక బుట్టను రెడీగా పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా,మీమీ sub- standard సలహాలు ప్రతిరోజూ నాకివ్వడం మాత్రం దయచేసి మానకండి.ఇంత మంచి ఫ్రీ కామెడీ మీలాంటి వారి దగ్గర కాకపోతే ఇంక నాకెక్కడ దొరుకుతుంది?
read more " ఉచిత సలహాలు "

19, ఆగస్టు 2014, మంగళవారం

మహనీయుల దర్శన మార్గాలు

నా పోస్ట్ లు చదివిన చదువుతున్న కొందరు గుజరాత్ అడవులలోకి వెళ్లి అశ్వద్దామను కలవాలని ప్రయత్నించబోతున్నారని నాకు తెలిసింది.

మహనీయులైన వారిని కలవాలంటే విధానం అది కాదు.పిక్నిక్ కు వెళ్ళినట్లు అడవిలోకి వెళ్లి వెతికితే అక్కడ ఎవరూ కనిపించరు.ఇంకా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో ఏ నక్సలైట్లో రాడికల్సో కనిపించవచ్చు.అది మరీ ప్రమాదం.

చిరంజీవులు ఉన్నారు.కానీ వారు మనకు కనిపించరు.వారికి అతీత శక్తులు ఉంటాయి.రకరకాల వేషాలలో రకరకాల చోట్ల వారు సంచరిస్తూ ఉంటారు.ఒకే సమయంలో అనేక చోట్ల కూడా ఉండగలరు.అందుకే అశ్వత్థామ గుజరాత్ అడవులలోనూ మధ్యప్రదేశ్ అడవులలోనూ హిమాలయాల లోనూ చాలామందికి కనిపించాడు.ఇప్పటికీ కనిపిస్తున్నాడు.

అలాగే ఆంజనేయస్వామి కూడా.

రామనామ భజనా స్మరణా జరిగేచోట ఆయన తప్పకుండా ఉంటాడని మన నమ్మకం.ఆయనను చూచిన వారు ఎందఱో నేటికీ ఉన్నారు.

అయితే అలా చూడడానికి విధానం వేరే ఉన్నది.బజారులో వస్తువుకోసం వెదికినట్లు వెదికితే వారు కనపడరు.వారి దర్శనాన్ని పొందాలంటే దానికి చాలా సాధనాబలం ఉండాలి. నియమయుతమైన జీవితాన్ని కొన్నేళ్ళ పాటు తపోమయ దీక్షలో గడపి ఉండాలి.అప్పుడే వారిని దర్శించే భాగ్యం కలుగుతుంది.

నానా రకాల కోళ్ళనూ కుక్కలనూ పందులనూ ఇంకా ఇతర జంతువుల మాంసాలనూ తింటూ,సారాయి త్రాగుతూ,బ్రహ్మచర్యం లేకుండా,జీవితంలో నానా వెర్రివేషాలూ వేస్తూ, అసూయా కుళ్ళూ కుత్సితాలతో అహంకారంతో ఇంద్రియలాలసత్వంతో నిండి ఉన్న నేటి మనుష్యులు చిరంజీవుల దర్శనాన్ని కాంక్షించడం హాస్యాస్పదం. 

అదెన్నటికీ జరిగే పని కాదు.

నియమయుతమైన జీవితమూ నిరంతర తపస్సూ లేనిదే ఎవరూ వారిని దర్శించడం సాధ్యం కాదు.అలాంటి ఎవరో ధన్యాత్ములకు మాత్రమే వారి దర్శనం కలుగుతుంది.అది కూడా మనం అడవులలో పడి వెదికితే వారు కనబడరు.వారు కనిపించాలి అనుకుంటే మనకు కనిపిస్తారు.లేకుంటే వారు మన పక్కనే ఉన్నా కూడా మనం గుర్తించలేము.ఆయనెవరో ఎల్లయ్యో పుల్లయ్యో అనుకుంటాము.అలాంటి మాయ మన మనస్సులను ఆ సమయంలో కప్పివేస్తుంది.

పాతతరాలలో మన కుటుంబాలలో ఋషితుల్యులైన మనుష్యులు ఉండేవారు.వారు ఎంతో నియమయుతములైన జీవితాలను గడపేవారు.అలాంటి వారికి మహనీయుల దర్శనాలు కలగడం విచిత్రమేమీ కాదు.ఈనాడంటే బ్రాహ్మణ కుటుంబాలు కూడా భ్రష్టు పడుతున్నాయి గాని,మొన్న మొన్నటి వరకూ కూడా ఋషితుల్యులైన మనుష్యులు ప్రతి కుటుంబంలోనూ ఉండేవారు.

హైదరాబాద్ నుంచి సంజయ్ చంద్ర ఇలా వ్రాస్తున్నారు.
-----------------------------
అశ్వథామ యోగిపుంగవుని గురించి మీరు వ్రాస్తున్న పోస్ట్ లను చదువుతున్నప్పుడు, మీతో రెండు విషయాలను పంచుకోవాలని అనిపించింది.

1) మా తాతగారు శ్రీ బులుసు సత్యనారాయణ గారు (మా నాన్నగారి తండ్రి) 

ఈయనకు ఆంజనేయస్వామి వారి దర్శనము అయింది అని అంటారు. విజయవాడ కొండలలోని పురుగుల ఆంజనెయస్వామి (వీర అభయ) వారిని ఉపాసించారట.మూడు తరముల వరకు యేవిధమైన పీడలు లేకుండా మా కుటుంబాన్ని రక్షించెదను అని స్వామి అభయం ఇచ్చారట. ఈయన తపోబలము గురించి మా బంధు వర్గములో చాలా సంఘటనలు కధలుగా చెపుతారు. వీరిని నేను చూడలేదు.

2) మా తాతగారు శ్రీ రొయ్యూరు సత్యనారాయణగారు ( మా తల్లిగారి తండ్రి) :

ఈయనకు అశ్వథామ యోగిపుంగవుని దర్శనము అయ్యింది అని మా తల్లిగారు చెప్పేవారు. వీరు నిరంతర ధ్యాని. అత్యంత ప్రశాంత మనస్కులు. వీరు నిరంతర గాయత్రిమంత్ర ధ్యానులు. వీరికి భద్రాచలం అడవులలో అశ్వథామవారు ఒక సూర్యోదయ సమయమున కనిపించారట. ఫది అడుగుల ఎత్తు, బ్రహ్మతేజముతొ,అత్యంత ఆత్మవిశ్వాసముతో కనిపించారట.చిరు దరహాసముతో వీరివంక కరుణపూర్వకముగా చూసి అడవిలోకి వెల్లిపోయారంట.మా తాతగారి తండ్రిగారు, భద్రాచలములో సన్యాసాస్రమములో శ్రీరామ ఐక్యం అయినప్పుడు ఈ సంఘటన జరిగిందట.
-------------------------------------
తపోబలం ఉన్నపుడు అలాంటి వారి దర్శనం కలుగుతుంది.అంతేగాని తపస్సు లేకుండా ఉత్త క్యూరియాసిటీతో కొండలలో కోనలలో తిరుగుతూ అక్కడి గుహలలోకి పోయి తొంగి చూస్తే ఏమి జరుగుతుందో వేమన యోగి ఒక పద్యంలో వివరించాడు.

ఆ||గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ
క్రూరమృగ మొకండు తారసిలిన
ముక్తి మార్గమదియె ముందుగా జూపురా
విశ్వదాభి రామ వినురవేమ

గురువుల కోసం కొండ గుహలలోకి పోయి వెదికితే అక్కడ ఏ పులో సింహమో కూచుని ఉంటే అప్పుడు ఎక్కువ కష్టపడకుండా ముక్తిమార్గాన్ని అదే చూపిస్తుంది.ఉత్త బోధ చేసి ఊరుకోదు.సరాసరి మోక్షాన్నే ప్రసాదిస్తుంది.

ఒక వస్తువుకోసం ప్రయత్నం చెయ్యడంలో లౌకిక విధానాలు వేరు.ఆధ్యాత్మిక విధానాలు వేరు.చాలాసార్లు ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి.ఆధ్యాత్మిక లోకంలో అర్హత ప్రధానమైనది.దానిని సంపాదించకుండా ఊరకే దేశాలు పట్టుకుని తిరిగినంత మాత్రాన అక్కడ ఏమీ కనపడదు.

చదువరులు ఈ విషయాన్ని చక్కగా గ్రహించాలి.
read more " మహనీయుల దర్శన మార్గాలు "

17, ఆగస్టు 2014, ఆదివారం

అశ్వత్థామ - మహాభారతంలోని కొన్ని ధర్మసూక్ష్మాలు

మహాభారతం ఒక అద్భుతమైన చరిత్రగ్రంధం.

అంతేకాదు అది సమస్త ధర్మాల సమాహారం.సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రపంచం మొత్తంలో ఈ గ్రంధం ఒక్కటి చాలు.సమస్త ధర్మాలూ అవగతం అవుతాయి.

ఇటువంటి అద్భుతమైన గ్రంధరాజం ప్రపంచవాజ్మయ చరిత్రలోనే లేదు అనేది నిజం.

కానీ మనకు మన గ్రంధాల విలువ తెలియదు.

అది కలిప్రభావం.

అసలు మహాభారతాన్ని వ్యాస భగవానుడు ఇన్ని వందల పాత్రలతో ఎలా రచించాడో అన్నన్ని ఘట్టాలను అంత అద్భుతంగా ఎలా వర్ణించాడో, ఆయా పాత్రల ధర్మాలనూ స్వరూప స్వభావాలనూ వాళ్ళ మధ్యన నడిచిన భావోద్వేగాలనూ ఆవేశ కావేషాలనూ ఎలా అక్షరబద్ధం చేసినాడో ఊహిస్తే దిగ్భ్రమ కలుగుతుంది.వ్యాసమహర్షి యొక్క అద్భుతమైన మేధస్సుకు మన చేతులు అప్రయత్నంగా ఆయనను స్మరిస్తూ నమస్కార ముద్రలోని వెళ్ళిపోతాయి.మనస్సు ఆయనపట్ల అమితమైన భక్తిభావంతో నిండిపోతుంది.

'నానృషి కురుతే కావ్యమ్'-

ఋషి కానివాడు కవి కాలేడు.కావ్యాన్ని వ్రాయలేడు అంటుంది మన సంస్కృతి.

కవి అనే పదానికి ప్రాచీనమైన అర్ధం ఋషి,ద్రష్ట అని.అంతేగాని ఏవో రెండు కధలు వ్రాసేసినంత మాత్రాన ఎవ్వరూ కవులు కాలేరు.నేటి ప్రజలు వారి జీవితాలలాగే అన్ని పదాలను కూడా భ్రష్టు పట్టించారు.వాటి అసలు అర్ధాలు మాయమై ఆ అర్ధాల స్థానంలో వీరనుకుంటున్న అర్ధాలు వచ్చి చేరుకున్నాయి.అంటే కలిప్రజలు భాషను కూడా ఖూనీ చేసేశారన్నమాట.

కావ్యాలను అందరూ వ్రాయలేరు.కావ్యం అనబడే దానికి కొన్ని లక్షణాలుండాలి.

సరే ఆ సంగతులు ప్రస్తుతానికి అలా ఉంచుదాం.

మహాభారతంలోని పాత్రలు ఎంత గొప్పవంటే ప్రతి పాత్రా తానూ ధర్మాన్ని ఆచరిస్తున్నాననే అనుకుంటుంది.వారిలో ఎవరి లాజిక్ వారికుంటుంది.శకునీ దుర్యోధనుడూ వంటివారు కూడా ధర్మాన్ని అనుసరిస్తున్నామనే అనుకున్నారు.ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని చేస్తున్న దుశ్శాసనుడు కూడా తన అన్న ఆజ్ఞను పాటిస్తున్నాననీ అదే ధర్మమనీ అనుకున్నాడు.

ఈ ధర్మం అనేది చాలా విచిత్రమైనది.

విశ్వం మొత్తానికీ వర్తించే ధర్మం ఒకటి ఉన్నది.అది కాకుండా మానవ జీవితంలోని స్థితినిబట్టీ స్థాయినిబట్టీ కులాన్నిబట్టీ వృత్తినిబట్టీ సాంఘికమర్యాదను బట్టీ కుటుంబమర్యాదను బట్టీ ఇలా రకరకాలైన ధర్మాలు ఉన్నాయి.ఆయా ధర్మాలను విశ్వధర్మంతో అనుసంధానం చేసుకుంటూ జీవించడమే దైవధర్మం.అప్పుడు కర్మ తగ్గుతుంది.

ఈ నియమాన్ని తప్పి,ఎవరి ధర్మం వారిదే అనుకుంటూ,వారివారి ఆలోచనలన్నీ సరియైనవే అనుకుంటూ ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తే విశ్వధర్మం దూరమౌతుంది.అది కర్మ పెరగడానికి దారితీస్తుంది.ఆ కర్మ కొంత ఫలితాన్నిస్తుంది.మళ్ళీ అది ఇంకొక కర్మకు దారితీస్తుంది.ఈ వలయం ఇలా నిరంతం తిరుగుతూ మనిషిని జన్మవలయాలలో బంధించి పారేస్తుంది.

ఈ విషయాన్ని మహా భారతం కంటే చక్కగా చెప్పిన గ్రంధం ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కానేరదు.

ఇందులోని పాత్రలకున్న ఇంకొక్క విచిత్రమైన లక్షణం ఏమంటే-వాటిలో మనల్ని మనమే చూచుకోవచ్చు.జాగ్రత్తగా గమనిస్తే మహాభారత పాత్రలు ప్రతిమనిషి లోనూ ఉన్న అనేక విభిన్న దృక్పధాలుగా మనకు దర్శనమిస్తాయి.

సంతానం చెడునడతలో ఉన్నాసరే వారిమీద ఉన్న అతిప్రేమకు నిదర్శనాలుగా ధృతరాష్ట్రునివద్ద నుంచీ అనేకులు మనకు దర్శనమిస్తారు.

పతులు ఎలాంటివారైనా కూడా వారిని తూచా తప్పక అనుసరించే పాతివ్రత్య ధర్మం కలిగిన గాంధారి వంటి ఎందఱో వనితలు కనిపిస్తారు.

మంత్రములవంటి అతీత శక్తులతో ఆటలాడి తద్వారా ఎంతోమందికి ఎన్నోరకాల క్షోభలు కలగడానికి కారణమైన కుంతీదేవి వంటివారూ దర్శనమిస్తారు.

పాండవుల ప్రతాపానికి అసూయతో వారిని అంతం చెయ్యాలన్న దుగ్ధతో చివరికి అన్ని కోట్ల మంది చావుకు కారకుడైన దుర్యోధనుడు కనిపిస్తాడు.

పగతీర్చుకోవడం కోసం చాపకింద నీరులా కౌరవుల పక్షాన ఉంటూ చివరకు వారి వినాశానాన్నే కొనితెచ్చిన శకుని వంటి వారూ కనిపిస్తారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ఇంకొక ప్రత్యేకవ్యాసం అవుతుంది.అందుకని ఇంతటితో ఆపి మన విషయంలోకి వద్దాము.

అశ్వత్థామ కూడా మహాభారతంలోని మరుగున పడిన పాత్రలలో ఒకడు. సాహిత్యకారులు గానీ చరిత్రకారులు గానీ ఆయనకు పూర్తి న్యాయం చెయ్యలేకపోయారన్నది వాస్తవం.అందుకు ఒక కారణం ఏమంటే,ఆయన ఒక దుష్టుడూ దుర్మార్గుడూ అనుకోవడమే.

'పంచమవేదం' అని ఎంతో గౌరవంగా పిలువబడిన మహాభారతం వంటి ఒక ఉద్గ్రంధాన్నీ మహాకావ్యాన్నీ అర్ధం చేసుకోవాలంటే సంకుచితమైన దృష్టి ఉంటె ఏమాత్రం చాలదు.విషయాన్ని ఒకే ఒక్క కోణంలో చూస్తే అలాంటివారికి ఆ విషయపు లోతులూ ధర్మసూక్ష్మాలూ అర్ధం కావు.

ఒక విషయాన్ని అనేక కోణాలలో చూస్తూ తాను మాత్రం దేనివైపూ మొగ్గకుండా ప్రభావితుడు కాకుండా చూచే దృష్టినే 'సమగ్రదృష్టి' అంటాము. అలాంటి సమగ్రదృష్టి ఉన్నప్పుడే మహాభారతంలోని ధర్మసూక్ష్మాలు అర్ధమౌతాయి.లేకుంటే అర్ధం కావు.అటువంటి కధను రకరకాల ఘట్టాలలో మన ఎదుట సాక్షాత్కరింప చెయ్యడంలోనే వ్యాసమునీంద్రుని యొక్క అద్భుతమైన ప్రతిభ మనకు గోచరిస్తుంది.

ఉదాహరణకు--

పాండవులు మంచివారు.కౌరవులు చెడ్డవారు.అన్న ప్రాధమిక అవగాహన మనం ముందే ఏర్పరచుకుని భారతాన్ని చదివితే అది మనకు ఏమీ అర్ధం కాదు.పాండవులు మంచిగానే కనిపిస్తారు.కౌరవులు చెడ్డవారుగానే కనిపిస్తారు.కానీ అసలు విషయం అది కాదు.

ఇరుపక్షాలలోనూ ధర్మం ఉన్నది.ఇరుపక్షాలలోనూ అధర్మం ఉన్నది.ఆ ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసుకోవాలంటే భారతాన్ని pre-conceived ideas తో చదవకూడదు.ఉన్నదాన్ని ఉన్నట్లుగా నిష్పక్ష పాతంగా చదవాలి.అర్ధం చేసుకోవాలి.అప్పుడే దానిలోని సౌందర్యం అర్ధమౌతుంది.

మహాభారతం లోని ప్రతిపాత్రకూ ఒక ఆత్మ ఉన్నది.ఆ ఆత్మను మనలోకి ఆవహింప చేసుకోవాలి.దాని ఆరాటాన్నీ ఆలోచనలనూ బాధలనూ మానసిక సంక్షోభాన్నీ మనం 'ఫీల్' అవాలి.అలా చెయ్యగలిగితే అప్పుడు మాత్రమే మనకు ఆ పాత్ర పూర్తిగా అర్ధమౌతుంది.అప్పుడే వ్యాస మహాభారతం ఎంతటి గొప్ప గ్రంధమో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది.

ఇక మన ప్రస్తుత విషయం లోకి వద్దాం.

మహాభారతం చదివినవారికి అనేక సందేహాలు తేనెటీగలవలె ముసురుకుంటాయి(మనసు పెట్టి చదివితే).ఆ సందేహాలు అన్నీ నేను ఇక్కడ చర్చించ బోవడం లేదు.ఒక్క అశ్వత్థామ కథలో వచ్చే సందేహాలను మాత్రమె ఇక్కడ చర్చిస్తాను.

1.
అశ్వత్థామకు చిరంజీవిత్వ వరాన్ని ఇచ్చిన ద్రోణాచార్యుడు 'అశ్వత్థామ హత:' అన్న మాటను నమ్మి నిండు యుద్ధభూమిలో ఎలా అస్త్రసన్యాసం చేశాడు?

నిజమే.ఈ వరం ఇచ్చినది తానే.వ్యాసమునీంద్రుని అత్యద్భుతమైన ప్రతిభ ఇలాంటి చోట్లనే మనకు దర్శనమిస్తుంది.మానవ సహజములైన బలహీనతలను అంత చక్కగా వర్ణించడం బహుశా ఆయనకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాకపోవచ్చు.'ప్రమాదో ధీమతామపి' అంటారు.అలాగే ధీమంతులు నిగ్రహపరులు అయినవారికి కూడా ఆపత్కాలంలో మనస్సు చెదిరిపోతుంది అనడానికి ఇదే రుజువు.

తాను చిరంజీవినన్న విషయం తెలిసినా కూడా అశ్వత్థామ ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసినాడు.అంటే కూడా ఇదే సమాధానం.


ధృతరాష్ట్రునికి ఎంత పుత్రవ్యామోహం ఉన్నదో ద్రోణునికీ అంత ఉన్నది. ఎందుకంటే అశ్వత్థామ ఎంతో తపస్సు అనంతరం పుట్టినవాడు. కనుక లేకలేక కలిగిన పుత్రుడంటే అమితమైన ప్రేమ ద్రోణునికి ఉండటం సహజం.

యుద్ధమధ్యంలో మన తర్కం పనిచెయ్యదు.అక్కడ ఆవేశమే ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి అది మంత్రాంగ మందిరం కాదు.అలా ఆలోచిస్తూ కూచుంటే అక్కడ ప్రాణాలు క్షణంలో గాలిలో కలసి పోతాయి.మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకుంటూ విజ్రుమ్భిస్తేనే అక్కడ నిలవడం సాధ్యమౌతుంది.

ఇంకొక్క విషయం.

ఆ మాట చెప్పినది ఎవరు?ఎట్టి పరిస్తితుల్లోనూ అబద్ధం చెప్పడని పేరుపొందిన ధర్మరాజు.అతను ప్రాణం పోయినా కూడా అబద్ధం ఆడడని గురువైన ద్రోణునికి తెలుసు.కనుక అతను చెప్పినపుడు నమ్మకపోవడం అంటూ ఉండదు.ఈ విషయం తెలిసే కృష్ణుడు ధర్మరాజు చేత ద్రోణునికి వినబడేటట్లుగా ఆ అబద్ధం పలికిస్తాడు.

కనుక యుద్ధభూమిలో ద్రోణుడు అటువంటి హటాత్ నిర్ణయం తీసుకుని అస్త్రసన్యాసం చెయ్యడం సమంజసమే.

2.
ఋషి పుత్రుడైన అశ్వత్థామ యుద్ధ న్యాయాన్ని విస్మరించి రాత్రిపూట పాండవ శిబిరం మీదకు దాడి చెయ్యడం సబబేనా?

దీనికి సమాధానం ఇప్పటివరకూ వ్రాసిన పోస్ట్ లలో వివరంగానే చెప్పినాను.

అశ్వత్థామకు ధర్మం తెలుసు.కానీ మిత్రధర్మం ఒకవైపూ,తండ్రి వధకు ప్రతీకారం చెయ్యడం ఒకవైపూ,పాండవులు చేసిన అధర్మయుద్ధాలు ఒకవైపూ కనిపిస్తూ ఆయన్ని పురికొల్పాయి.తాను చేస్తున్నది తప్పు కాదు అన్న బలమైన భావంతోనే ఆయన ఆ పని చేశాడు.పైగా తనను ఆవహించి ఉన్న రుద్రశక్తి ఆయనను కుదురుగా ఉండనివ్వదు.అందుకే ఆయనలా చెయ్యవలసి వచ్చింది.

3.
అన్నీ తెలిసి కృష్ణుడు ఆ రాత్రి పూట పాండవులను ఎక్కడికో తీసుకుపోవడం ఏంటి?అంటే ఆయన కూడా ఈ పనిలో అశ్వత్థామకు సహకరించినట్లే కదా?

అంతే.అసలు ఈ యుద్ధాన్ని నడిపించినదే ఇద్దరు.ఒకరు కృష్ణుడు ఇంకొకరు శకుని.ఒకరు స్క్రిప్ట్ రైటర్ అనుకుంటే ఇంకొకరు డైరెక్టర్ అనుకోవచ్చు.

ఆ మాటకొస్తే అభిమన్య సంహార సమయంలో కూడా కృష్ణుడికి అన్నీ తెలిసే అర్జునుడిని దూరంగా తీసుకువెళ్ళాడు.ఈ యుద్ధంలో అంతా సర్వనాశనం అవుతుందని కృష్ణుడు తన వంతుగా ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు.కర్మ బలీయంగా ఉన్నపుడు మంచి చెప్పినా తలకెక్కదు అంటే ఇదే.

అన్నీ దగ్గరుండి చేయించినది ఆయనే.కానీ ఆయనకు ఏమీ అంటలేదు.అందుకే గీతలో ఆయన ఇలా అంటాడు."నేను అన్నీ చేసినా ఏమీ చెయ్యనివాడనే.ఎందుకంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం నాకు లేదు.'

4.
అలాంటప్పుడు మరి అశ్వత్థామను తాను శపించడం ఎందుకు?

అశ్వత్థామ చిరంజీవి.అతను చేసిన కర్మను అనుభవించడానికి అతనికి మరొక మానవజన్మ లేదు.రాబోయే జన్మలో అతడు వేదవ్యాసునిగా జన్మిస్తాడని అంటారు.ఆ తర్వాత సప్తఋషులలో ఒకరౌతాడని అంటారు. కనుక ఈ మానవకర్మను కుదించడానికి కృష్ణుడు అలా శపించాడు.తద్వారా అతనికి చివరకు ఇంకా ఉత్తమగతే కలిగింది.కృష్ణుడు సరాసరి శాపం ఇచ్చిన సన్నివేశాలు ఇది తప్ప ఇంకెక్కడా నాకు తెలిసినంతవరకూ లేవు.

భగవంతుని శాపం కూడా వరమే(అర్ధం చేసుకోగలిగితే).

5.
మహాభారత  యుద్ధంలో ఎన్నో అన్యాయాలు కృష్ణుడే దగ్గరుండి మరీ చేయించాడు.ఇది ధర్మం ఎలా అవుతుంది?

సామాన్య దృష్టికి అది ధర్మం కాకపోవచ్చు.కానీ సూక్ష్మ దృష్టితో ఆయా కర్మలనూ వాటి ఫలాలనూ అర్ధం చేసుకుంటే అది న్యాయమే అవుతుంది.వారు వారు అలా ఎందుకు చంపబడ్డారో ప్రతిదానికీ ఒక హేతువున్నది.అది కృష్ణునకు తెలుసు.

ఒకవేళ అలా ఏమీ హేతువులు లేవు అనుకున్నప్పటికీ,ధర్మాధర్మములను సృష్టించిన భగవంతునికి వాటి కట్టుబాటు ఏమున్నది?సాధారణంగా ఆయన కూడా వాటిని ఉల్లంఘించడు.కానీ ప్రత్యేక పరిస్తితులలో ఆయన ఒకవేళ మనం అనుకునే అధర్మం చేసినా అది ధర్మమే అవుతుంది.ఎందుకంటే ధర్మమూ తానే అధర్మమూ తానే,రెండూ అవడం ద్వారా రెంటికీ అతీతుడూ తానె గనుక.

ఒకదేశపు చట్టం ఇంకొక దేశంలో పనికిరాదు.ఒకచోట నేరం ఇంకోచోట కాకపోవచ్చు.ఇతర దేశాలలో లిట్టరింగ్ నేరం.మన దేశంలో అది సర్వసాధారణం.ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే అది నేరం.అతనికి ఉరిశిక్ష పడుతుంది.కానీ యుద్ధంలో శత్రుదేశ సైనికులను చంపినవాడికి అవార్డులూ పతకాలూ ఇవ్వబడతాయి.ఇద్దరూ చేసినది హత్యే.ఒకరికి ఉరేమిటి?ఇంకొకరికి అవార్డులేమిటి?

కనుక న్యాయమూ ధర్మమూ అనేవి దేశకాలపాత్రతలను బట్టి మారిపోతూ ఉంటాయి.ఒకరికి ధర్మం అయినది ఇంకొకరికి కాకపోవచ్చు.

ఒక్కొక్కసారి పెద్ద నేరాన్ని నివారించడానికి చిన్న నేరం చెయ్యవలసి వస్తుంది.ఆ చిన్న నేరం అప్పుడు ధర్మమే అవుతుంది.పెద్దప్రాణమా చిన్న ప్రాణమా ఏదో ఒకటే కాపాడగలం అనిన పరిస్తితిలో వైద్యుడు తల్లి ప్రాణాన్ని రక్షించి పిల్ల ప్రాణాన్ని బలిచేస్తాడు.అది నేరం కాదా?అంటే ఏం చెప్పగలం? ఆ పరిస్థితిలో అది న్యాయమే.కానీ మామూలు దృష్టికి అది న్యాయం కాకపోవచ్చు.ప్రాణ విత్త మాన భంగములయందు అబద్ధం చెప్పడం తప్పుకాదు అని ధర్మశాస్త్రం అంటుంది.

కనుక మూడు కాలములూ తెలిసిన భగవంతుని చర్యలను మన సంకుచితమైన ధర్మాధర్మ దృష్టితో చూడటానికి మనమెవరం?దైవం ఏది చేసినా అది ధర్మమే.ఒకవేళ మనం అనుకునే అధర్మం ఆయన చేసినా కూడా అదీ ధర్మమే.కాకపోతే దానిలోతుపాతులు మనకు తెలియక మనం అలా అనుకోవచ్చు.

6.
వ్యాసుడూ పరశురాముడూ ఎందుకు అశ్వత్థామను రక్షించాలని ప్రయత్నించారు?

ఋషులు కారుణ్యమూర్తులు.శరణాగత రక్షకులు.అందులోనూ పరశురాముడు విష్ణు అవతారం.ఆయన సాక్షాత్తూ భగవంతుడే.

చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి తమను శరణు కోరిన వారిని రక్షించడం దైవధర్మం.వారికి తగిన దారి చూపించడమూ అందులో భాగమే.యుద్ధం చివరలో కూడా ఇప్పుడైనా ఈ పద్ధతి మానుకొని దారికి వస్తే మంచిదని కృష్ణుడు దుర్యోధనునికి ఎంతో చెబుతాడు.అప్పుడు కూడా ఆయన ఇంకా ఒక అవకాశం ఇస్తూనే ఉన్నాడు.

దైవసృష్టిలో శాశ్వతస్వర్గం గానీ శాశ్వతనరకం గానీ లేవు.తప్పును దిద్దుకోనడానికి ఇక్కడ ప్రతిక్షణమూ అవకాశం ఇవ్వబడుతూనే ఉంటుంది. అదే దైవన్యాయం.ఆ న్యాయానుసారమే వారు అశ్వత్థామను రక్షించ బూనుకున్నారు.పైగా వ్యాసమహర్షి కూడా చిరంజీవి.ఆయన కూడా విష్ణు భగవానుని అంశావతారమే.కనుక వారిలో దైవసహజమైన క్షమాగుణం ఉండటం సహజం.

(సంపూర్ణం)
read more " అశ్వత్థామ - మహాభారతంలోని కొన్ని ధర్మసూక్ష్మాలు "

16, ఆగస్టు 2014, శనివారం

అశ్వత్థామ-ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా?

తన పరమగురువైన పరశురాముని ఉపదేశంతో పునీతుడై సాధనను ప్రారంభం చేశాడు అశ్వత్థామ.

అతడు స్వతహాగా ఋషిపుత్రుడు గనుకా,అస్త్ర సముపార్జన కోసం గతంలో కఠినమైన నియమాలను పాటించినవాడు గనుకా సాధన అనేది అతనికి కొత్తకాదు.అస్త్రమంత్రములు సిద్ధించాలంటే ఆయా మంత్రదేవతా సాక్షాత్కారాలను పొందాలి.దానికి బ్రహ్మచర్య పూరితమైన సాధన చాలా అవసరం.అవి అంత ఆషామాషీగా సిద్ధించే శక్తులు కావు.అవన్నీ అశ్వత్థామకు తెలుసు.ఋషిపుత్రునకు తపస్సూ సాధనా వంశపారంపర్యంగా రక్తంలోనే వస్తాయి.

పన్నెండు సంవత్సరాలు గనుక బ్రహ్మచర్యనిష్టను పాటించి సాధన గావిస్తే మనిషి శరీరంలో 'మేధానాడి' అనే ఒక క్రొత్త నాడి ఉద్భవిస్తుంది.ఆ నాడీ సహాయంతో సమస్తమైన జ్ఞానాన్నీ ఒక్క క్షణంలో గ్రహించడం సాధ్యమౌతుంది.ఈ నాడి శరీరంలో ఉద్భవించనిదే ఎట్టివారికైనా భగవదనుభూతి సాధ్యం కాదు. 

ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులు చాలాసార్లు చెప్పినారు. వివేకానంద, బ్రహ్మానంద,శివానందాది ఆయన శిష్యులు అందరూ ఈ సూత్రాన్ని పాటించి సాధన గావించిన ఘనులే.

శ్లో||మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా
దుర్గాసి దుర్గ భవసాగర నౌరసంగా
శ్రీ: కైటభారి హృదయైక కృతాధివాసా
గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్టా

అంటుంది మార్కండేయ పురాణాంతర్గతమైన 'దేవీమాహాత్మ్యం'.

ఆ||అఖిల శాస్త్రతతుల నవలీలగా జూచు
మహిమ నొసగునట్టి మేధ వీవు
భయము గొల్పు నట్టి భవసాగరం బెల్ల
దాట జేయగల్గు దుర్గ వీవు

ఆ||కైటభాంతకునకు కైదోడు వైనిల్చి
సర్వసృష్టి నడపు సిరివి నీవు
చంద్రశేఖరునకు సగభాగమై యొప్పి
గరిమనంద జేయు గౌరి వీవు

(అమ్మా!అఖిల శాస్త్రముల సారమునూ ఆకళింపు జేసుకొనగలిగే శక్తినిచ్చే మేధవైన సరస్వతివి నీవే.దాటశక్యముగాని భవసాగరమును భద్రముగా దాటించే దుర్గవు నీవే.మధుకైటభులనే రాక్షసులను సంహరించిన మహావిష్ణువు హృదయంలో కొలువై ఉన్న 'శ్రీ' యనబడే లక్ష్మివి నీవే.శశిమౌళి యగు పరమేశ్వరుని యందు సగభాగమవై నిలచియున్న గౌరివీ నీవే)

సాధనాఫలంగా అటువంటి మేధానాడి సాధకునిలో ఉద్భవించడం వల్లనే అతడు అతీతములైన శక్తులను పొందగలుగుతాడు.అప్పుడే లలితా రహస్య నామములలో చెప్పబడిన-

'మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధి విభేదినీ
ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ'

అనిన మూడుగ్రంధులనూ భేదించగలిగే సామర్ధ్యం అతనికి సంప్రాప్తిస్తుంది.

అశ్వత్థామ కూడా పరమగురు ప్రణీతమైన శ్రీవిద్యా అంతర్యాగసాధనలో మునిగి ప్రతి పన్నెండేండ్లకూ ఆయన చెప్పినట్లుగా ఒక్కొక్క గ్రంధిని భేదించుకుంటూ ముప్పై ఆరెండ్ల కఠోరసాధనలో తన దీక్షను పూర్తి గావించాడు.

ఒక్కొక్క గ్రంధి భేదింపబడినప్పుడు అతనిలోని ఒక్కొక్క శరీరమూ పరిశుద్ధం కాసాగింది.రాశిచక్రంలో బృహస్పతి మూడు ఆవృత్తులు గడచేసరికి అతడు కృష్ణశాపం నుండి విముక్తుడయ్యాడు.శ్రీవిద్యా సాధనాబలంతో జగన్మాతృ కటాక్షాన్ని పొంది మహర్షిగా రూపుదిద్దుకున్నాడు.

భారద్వాజ గోత్రాన్ని పునీతం గావించాడు.

ఆ సాధనా విధానంలో ఆయన ఏయే అంతరిక కష్టాలను ఎదుర్కొన్నాడు?ఏ విధంగా ఆ సాధనలో ఉత్తీర్ణుడయ్యాడు?అనేవి మనకు అప్రస్తుతాలు.తన సాధనను జయప్రదంగా పూర్తిగావించి జగన్మాతను మెప్పించి సిద్ధిని అందుకున్నాడన్న విషయం మాత్రమే మనకు ప్రస్తుతం అవసరం.

ఈలోపల సరిగ్గా 36 ఏండ్లకు పరశురాముడు చెప్పినట్లుగా ముసలం పుట్టి యాదవనాశనం జరగడమూ ఆ తదుపరి కృష్ణనిర్యాణమూ జరిగిపోయాయి. పాండవులు తమ రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పజెప్పి తాము హిమాలయాల దిశగా ప్రయాణం సాగిస్తూ దారిలో ప్రయాగ తీర్ధాన్ని చేరుకున్నారు.

అక్కడ దుర్వాసమహర్షి ఆశ్రమంలో వారు పరశురామ దుర్వాసుల సమక్షంలో శాంతుడై కూర్చుని ఉన్న అశ్వత్థామను చూచారు.

అతనిలో మునుపటి ఉద్రేకస్వభావం లేదు.మునుపటి క్రౌర్యంలేదు.పరమ శాంతమూర్తిగా బ్రహ్మతేజస్విగా వారికి అతడు దర్శనమిచ్చాడు.పాండవులు కూడా అప్పటికి అతని మీద ఉన్న క్రోధాన్ని విసర్జించారు.కాలం అనేది ఎంతటి గాయాన్నైనా మాన్పివేస్తుంది కదా!!

పాండవులు మహర్షులవద్ద సెలవు తీసుకుని హిమాలయాల దిశగా సాగిపోయారు.ఆ తర్వాత వారేమయ్యారో ఎవరికీ తెలియదు.

పురాణయుగం అంతరించింది.

నవీన కలియుగం ప్రవేశించింది.

ఎక్కడ చూచినా అధర్మం మళ్ళీ పెచ్చు మీరసాగింది.

ఋషులు అదృశ్యులైనారు.

చిరంజీవులు ఇంతకు ముందులాగా అందరికీ కన్పించడం మానివేశారు.

కానీ వారు ఇప్పటికీ ఉన్నారు.మన పవిత్ర భారతభూమిలో వారి వారి స్థానాల్లో వారు ఇప్పటికీ సంచరిస్తూ మన మధ్యనే అజ్ఞాతంగా ఉన్నారు.

ఆంజనేయస్వామిని దేహంతో చూచినవారు ఇప్పటికీ కొందరున్నారు. తులసీదాసు ఆయన దర్శనాన్ని పొందినాడు.శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడైన బ్రహ్మానందస్వామి హనుమంతుని సజీవంగా దర్శించిన మహనీయుడు.ఈ ఘట్టాన్ని పురస్కరించుకునే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామకృష్ణ మఠాలలో ఏకాదశి రోజున రామనామ పారాయణ గావిస్తారు.

కాశీక్షేత్రంలో వ్యాస భగవానుని దర్శనాన్ని పొందినవారు ఇప్పటికీ కొందరున్నారు.

పశ్చిమ కనుమలలో పరశురాముని దర్శనభాగ్యాన్ని పొందినవారున్నారు.

శ్రీరంగపట్టణంలో విభీషణుని దర్శించిన వారున్నారు.

కుర్తాళం అడవులలో అగస్త్యమహర్షిని చూచినవారు ఇప్పటికీ ఉన్నారు.

వీరందరూ ఇప్పటికీ అవే దేహాలతో సజీవులుగా ఉన్నారు.ఇది మనం నమ్మలేని సత్యం.

మరి అశ్వత్థామ ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా?

ఉన్నాడు.

కృష్ణశాపానికి గురైన తర్వాత అశ్వత్థామ గురించి మహాభారతంలో ఎక్కడా పెద్దగా కనిపించదు.వ్యాసమునీంద్రుడు అశ్వత్థామను అక్కడే వదలి ముందుకు వెళ్ళిపోతాడు.ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో ఎక్కడా కనిపించదు.ఆ వివరాలు మనకు దొరకవు.జిజ్ఞాసువులైన వారి పరిశీలనకూ పరిశోధనకూ పనికి వచ్చేవిధంగా అనేక 'త్రెడ్స్' ను అసంపూర్తిగా అలా వదిలేశాడు వ్యాసమునీంద్రుడు.

నిజానికి అశ్వత్థామ మనం అనుకున్నంత దుర్మార్గుడేనా?అని ఆలోచిస్తే కాదని తేలుతుంది.మహాభారతం లోని అందరిలాగే తన ధర్మం తాను ఆచరించాడు.తద్వారా శాపానికి గురయ్యాడు.అది కూడా ఘోరమైన శాపానికి గురయ్యాడు.

ఈ విషయమై వ్యాసమహర్షి తర్వాత ఎందఱో కవులు ఆలోచించారు. ఆరాటపడ్డారు.ఎందుకంటే,అశ్వత్థామ చిరంజీవి.ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు.కనుక ఆయనను దర్శించగలిగితే ఆ తర్వాత ఏమి జరిగిందో ఆయనే చెబుతాడు.

కన్నడ రాష్ట్రంలోనూ ఒరిస్సాలోనూ ఈ విధంగా ఆరాటపడిన కవులు ఇద్దరున్నారు.

అలా ఆరాటపడిన వారిలో ఒకడు కుమార వ్యాసుడనబడే కన్నడకవి. ఆయన 15 శతాబ్దంలో రెండవ దేవరాయల కాలంలో కర్నాటరాష్ట్రంలో ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.ఆయన మహాభారతాన్ని కన్నడంలో రచించాడు.

దానినే కుమారవ్యాస భారతం అంటారు.

అది వ్రాయడానికి ముందు అసలైన సరియైన భారతాన్ని వ్రాయాలన్న తపనతో ఆయన గదగ్  లో ఇప్పటికీ ఉన్న వీరనారాయణస్వామి ఆలయంలో ఉంటూ మహావిష్ణువును తదేకనిష్టతో ప్రార్ధించాడు.అప్పుడు ఆయన స్వప్నంలో నారాయణుడు దర్శనం ఇచ్చి కొన్ని కొండగుర్తులు చెప్పి ఆశ్వత్తామను ఎలా గుర్తించాలో సూచనలిచ్చాడు.ఆ సూచనల ఆధారంగా ఒకరోజు కుమారవ్యాసుడు అశ్వత్థామను గుర్తించి ఆయన పాదాలపైబడి ప్రార్ధించగా ఆయన వరంవల్ల అసలైన మహాభారతాన్ని వ్రాయగలిగాడు. అయితే ఈ రహస్యాన్ని భీమ దుర్యోధనుల గదాయుద్ధ ఘట్టం వ్రాస్తున్న సందర్భంలో తన భార్యకు వెల్లడించిన ఫలితంగా అక్కడితో ఆయనకు స్ఫురణ ఆగిపోయింది.ఇది ఒక గాధ.

కనుక అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉన్నది నిజమే అని ఒక ఆధారం దొరికింది.

ఒరియా ఆదికవి సరళదాసు రచించిన ఒరియా భారతం రెండవ రుజువు.

మనకు తెలుగుభాషలో ఆదికవి నన్నయ ఉన్నట్లే ఒరియాలో ఆదికవి సరళదాసు ఉన్నాడు.ఆయనకూడా దాదాపు 15 శతాబ్దం వాడే.ఆయన కూడా ఒరియా భాషలో మహాభారతం వ్రాశాడు.దానిలో ఆయన ఇంకా కొన్ని వివరాలిచ్చాడు.

ఆ వివరాల ప్రకారం-తమ స్వర్గారోహణ క్రమంలో ఉన్న పాండవులు ప్రయాగతీర్ధంలోని ఆశ్రమంలో పరశురామ దూర్వాసమహర్షులతో కలసి ఉన్న అశ్వత్తామను కలుస్తారు.అశ్వత్థామ అప్పటికే కృష్ణశాపంనుంచి విముక్తుడై ఉంటాడు.పరమతేజస్విగా మారి యుంటాడు.అప్పటికి భారతయుద్ధం జరిగి 40 ఏళ్ళ లోపే అవుతుంది.

ఇది సరళదాసుగారి అనుభవం. లేదా ఆయనకు కలిగిన దర్శనం అయి ఉంటుంది.

నాకు మార్మికంగా తెలిసిన వివరాలతో సరళదాసు ఒరియా భారతంలో రచించిన వివరాలు సరిపోతున్నాయి.

ఇకపోతే,అశ్వత్తామను చూచినట్లుగా అనేక సందర్భాలలో అనేకమంది వ్రాసిన వ్రాతలున్నాయి.వాటిని మనం నమ్మినా నమ్మకపోయినా కొన్ని ప్రామాణిక గ్రంధాలను నమ్మవచ్చు.వాటిలో 'పృధ్వీరాజ్ రాసో' ఒకటి.

దీనిని చాంద్ బర్దాయ్ అనే కవి వ్రాశాడు.క్రీ.శ.1170 ప్రాంతంలో పృధ్వీరాజ్ చౌహాన్ డిల్లీ ప్రాంతాన్ని పరిపాలించాడు.ఆ సమయంలో చాంద్ బర్దాయ్ ఆయన యొక్క ఆస్థానకవిగా ఉన్నాడు.కనుక పృధ్వీరాజచరిత్రను ఆయన వ్రాశాడు.ఆ పుస్తకం ఇప్పటికీ దొరుకుతున్నది.

దాదాపు తొమ్మిదివందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ పుస్తకంలో పృధ్వీరాజ్ చౌహాన్ అడవులలో సంచరిస్తూ ఉన్నపుడు అతను అశ్వత్తామను ఎలా కలుసుకున్నదీ వివరం వ్రాయబడి ఉన్నది.

మిగతా కధలను మనం నమ్మినా నమ్మకపోయినా దీనిని నమ్మవచ్చు. ఎందుకంటే ఇది చారిత్రిక గ్రంధం గనుక.పృధ్వీరాజ్ చౌహానే మరుజన్మలో అక్బర్ గా పుట్టాడని ఒక నమ్మకం ఉన్నది.ఆ సంగతి మళ్ళీ ఇంకోసారి చూద్దాం.

ఇకపోతే,వ్యాసమహాభారతం ప్రకారం --'త్రీణి వర్ష సహస్రాణి' అన్న కృష్ణ శాపాన్ని మనం చూస్తే,మూడువేల ఏండ్ల కాలమే అశ్వత్థామకు శాపం ఉన్నది.ఆ తర్వాత అతను దానినుంచి సహజంగానే విముక్తుడు కావాలి. 

ఇప్పుడు మహాభారత కాలాన్ని ఒక్కసారి గమనిద్దాం.

కలియుగం అనేది 3102 BC లో మొదలైందని కొందరు అంటారు.కానీ అది నిజం కాకపోవచ్చు.డాక్టర్ వర్తక్ పరిశోధన ప్రకారం మహాభారత యుద్ధం అనేది 16-10-5561 BC న మొదలై 2-11-5561 BC రోజున ముగిసిందని ఆయన ఖచ్చితమైన తేదీలతో సహా నిరూపించాడు.యాదవులలో ముసలం పుట్టి వారంతా కొట్టుకుని చనిపోయినది 5525 BC అనేది ఆయన పరిశోధన.ఇది వాస్తవానికి దగ్గరగా ఉంటున్నది.

ఎందుకంటే,నవగ్రహాలే గాక,మనం ఇప్పుడు కనుక్కున్నామని చెప్పుకునే యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లు కూడా వ్యాసమహర్షికి తెలుసనీ ఆయన వాటి పోజిషన్స్ ను ఖచ్చితంగా ఎలా రికార్డ్ చేసి పెట్టాడో ఆయన భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ రుజువు చేస్తూ వివరించాడు.ఈ పన్నెండు గ్రహాలూ, వ్యాసమహర్షి మహాభారతంలో రికార్డ్ చేసి పెట్టిన గ్రహస్థితులతో ఎలా సరిపోతున్నాయో ఆయన వివరించిన పరిశోధనా వ్యాసం ఇక్కడ చూడండి.

కనుక మహాభారత యుద్ధం అనేది 3100 BC లో జరిగినా లేక డా|| వర్తక్ గారన్నట్లు BC 5561 లో జరిగినా కూడా దానితర్వాత 3000 ఏళ్ళకు అంటే 100 BC నాటికి గానీ లేదా 2561 BC నాటికి గానీ అశ్వత్థామ శాపం పరిసమాప్తి అయ్యి ఉండాలి.

మరి ఇదే నిజమైతే 1100 AD లో పృధ్వీరాజ్ చౌహాన్ కు అడవిలో అశ్వత్థామ అనేక రోగబాధలతో కనిపించడం నిజం కావడానికి వీల్లేదు."పృధ్వీరాజ్ రాసో" అనేది పూర్తిగా చారిత్రిక గ్రంధం కాదు.దానిని వ్రాసిన చాద్ బర్దాయ్ అనేకవి పృధ్వీరాజు ఆస్థానకవి గనుక కొన్ని అతిశయోక్తులతో కలగలిపి తన రాజును పొగుడుతూ దానిని వ్రాసి ఉండవచ్చు.

దానిలో కొన్ని కల్పితాలు కూడా ఉన్నాయన్నది చరిత్ర పరిశోధకులు ఒప్పుకున్న వాస్తవం.కనుక ఒకవేళ పృధ్వీరాజ్ అశ్వత్థామను దర్శించినా కూడా అప్పటికే ఆయన శాపవిమోచనాన్ని పొంది ఉండటంవల్ల ఆయన మామూలు రూపాన్నే చూచి ఉండవచ్చు.అంతేగాని ఆయన రోగిష్టిగా ఉన్న రూపంతో 1100 AD లో కనిపించడం అసంభవం.

అలాగే ఉత్తరభారతదేశంలోనూ పశ్చిమ తీరంలోనూ మధ్య ప్రదేశ్ లోనూ చాలా చోట్ల అశ్వత్థామ ఇప్పటికీ సంచరిస్తున్నాడన్న వార్తలలో నిజం ఉన్నది. కాకుంటే ఆయన ఇంకా శాప ప్రభావంతో ఒంటినిండా గాయాలతో పుండ్లతో రోగాలతో ఇప్పటికీ ఉన్నాడన్న మాట మాత్రం వాస్తవం కాదు.

ఒరియా ఆదికవి సరళదాసు వ్రాసిన దానిలో నిజం ఉన్నది.

ఎందుకంటే,కృష్ణ శాపం తర్వాత ఆ శాపాన్నించి విమోచనం కలిగించే గురువు కోసం అశ్వత్థామ సహజంగానే వెదుకులాట సాగించి ఉంటాడు.ఈ గొడవంతా వ్యాసాశ్రమంలోనే వ్యాసుని ఎదుటనే జరిగింది కనుక ఇక అక్కడ ఉండటం ఆయనకు ఇష్టం లేకపోవచ్చు.

ఇక ఆయనకు మిగిలిన ఏకైన దిక్కు అవతార పురుషుడూ మహాఋషీ, మహాగురువూ అయిన పరశురాముడు.

పరశురాముడు అశ్వత్థామకు పరమగురువు.ఎందుకంటే ద్రోణాచార్యుడు సమస్త ఆయుధాలనూ అస్త్రశస్త్రాలనూ ఆయన వద్దనే అందుకున్నాడు. కనుక తన తండ్రికి గురువైన పరశురాముని వద్దకే అశ్వత్థామ చేరుకోవడం సమంజసంగా ఉన్నది.

ఇక్కడ నుంచి జరిగిన కధ ఏమిటో నేను వివరించాను.

అశ్వత్థామ చరిత్ర కృష్ణశాపం వరకే మనకు వ్యాసమహాభారతంలో దర్శనమిస్తుంది.ఆ తర్వాతి ఘట్టాలు ఏ గ్రంధంలోనూ ఎక్కడా మనకు కనబడవు.

అశ్వత్థామ నేటికీ అదే దేహంతో ఉన్నమాట వాస్తవమే.ఆయనకు కల్గిన కృష్ణ శాపం నుండి విముక్తుడు అయినదీ వాస్తవమే.

మరి మీకు మాత్రం ఈ వివరాలు ఎలా తెలిశాయి? అని మాత్రం నన్నడక్కండి.

కొన్నికొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉంటేనే బాగుంటుంది.

అవి ఎప్పటికీ అలా ఉండవలసిందే.

(తరువాతది చివరిభాగం)
read more " అశ్వత్థామ-ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా? "