Pages - Menu

Pages

30, డిసెంబర్ 2014, మంగళవారం

పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది

28.12.2014 న తలపెట్టిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకావిష్కరణ సభ దిగ్విజయంగా ముగిసింది.

జగన్మాత అనుగ్రహంతో వెలుగుచూచిన ఈ పుస్తకం అమ్మ(దుర్గమ్మ) పాదాల చెంత,కృష్ణాతీరంలో విజయవాడలో ఆవిష్కరింప బడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఉదయం 10.30 ప్రాంతంలో మొదలైన సభ దాదాపు మధ్యాన్నం 1.30 ప్రాంతంలో వందన సమర్పణతో ముగిసింది.

దాదాపుగా 60 మంది ఈ సభకు వచ్చారు.వారిలో విజయవాడ వాస్తవ్యులే గాక,హైదరాబాద్,అనంతపూర్,బెంగుళూరు,ఒంగోలు,తిరుపతి,విజయనగరం,విశాఖపట్నం మొదలైన దూరప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.అమెరికా నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.

ఆహూతులందరూ దాదాపు 3 గంటలపాటు కదలకుండా నిశ్శబ్దంగా ఉండి కార్యక్రమాన్ని ఆసాంతమూ ఆస్వాదించారు.

మహాలక్ష్మీ పబ్లికేషన్స్ విశ్వమోహన్ గారి మాటల్లో చెప్పాలంటే -' ఇంత క్రమశిక్షణతో జరిగిన పుస్తకావిష్కరణ సభను నేను ఇంతవరకూ చూడలేదు.ఎన్నో ఫంక్షన్స్ నేను చూచాను.పుస్తకావిష్కరణ అయిపోవటం తోనే అందరూ లేచి వెళ్ళిపోతారు.కానీ మీ ఫంక్షన్ లో మాత్రం పుస్తకావిష్కరణ తర్వాత కూడా ఇంకొక రెండుగంటల పాటు అంత శ్రద్ధగా కూచుని మీ ఉపన్యాసం విన్నారంటే  చాలా వింతగా ఉన్నది.మిగిలిన ఫంక్షన్స్ లో వాలంటీర్స్ ను పెట్టి చెప్పిస్తాము మొబైల్స్ ఆఫ్ చెయ్యండి.మౌనంగా ఉండండి.అని.కానీ ఈ కార్యక్రయంలో ఎవరికీ ఏమీ చెప్పవలసిన పని లేకపోయింది.ఎవరికి వారే ఎంతో సెల్ఫ్ డిసిప్లిండ్ గా ఉన్నారు." అని ఆయన అన్నారు.

'వీళ్ళు మామూలు ఆడియన్స్ కారు.ఈ సబ్జెక్ట్ మీద ఎంతో శ్రద్దతో,ఆధ్యాత్మికత అంటే తపనతో,అమ్మ మీద నమ్మకంతో వచ్చినవారు.అందుకే వారు అంత ఓపికగా అన్ని గంటలు కూర్చున్నారు.అంత డిసిప్లిన్ గా ఉన్నారు.' అని నేను చెప్పాను.

నేను దాదాపు ఒక గంటన్నర పైనే మాట్లాడాను.నా ఉపన్యాసంలో 'శ్రీవిద్యోపాసన' గురించీ ఈ పుస్తకం ఎలా ఉద్భవించింది అన్న విషయం గురించీ వివరంగా మాట్లాడాను.

శ్రోతలను నా ఉపన్యాసం రంజంపచేయగలిగింది అనే నేను అనుకుంటున్నాను.

ఫంక్షన్ అయిపోయిన తర్వాత,వచ్చిన వారందరూ నన్ను కలిసి మాట్లాడారు. వేదాంతం గురించి,తంత్రసాధన గురించి అడిగిన వారు కొందరైతే,జ్యోతిష్యం గురించి,ఈతిబాధల గురించి,రోగబాధల గురించి అడిగినవారు కొందరు.ఎవరికి కావలసిన పరిష్కారం వారికి చూపబడింది.అక్కడ మాట్లాడలేని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకున్న వారికి నా ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో పాల్గోన్నవారివి చాలామందివి అడ్రసులూ ఫోన్ నంబర్లూ సేకరించడం జరిగింది.కానీ ఇంకా కొందరి వివరాలు దొరకలేదు.కనుక వారందరికీ నా అభ్యర్ధన ఏమంటే,పుస్తకం మీద నా ఫోన్ నంబర్ ఉన్నది,ఇక్కడ కూడా ఇస్తున్నాను గనుక,ఈ పుస్తకం మీద మీమీ అభిప్రాయాలనూ సూచనలనూ,అలాగే ఈ ఫంక్షన్ ఎలా జరిగింది అన్నదానిమీద మీమీ అభిప్రాయాలనూ,ఇంకా మీమీ వ్యక్తిగత సమస్యలనూ,మీరు అడగాలనుకుని అడగలేక పోయిన విషయాలనూ,తరువాత మీకు గుర్తొచ్చిన విషయాలనూ, నాకు ఫోన్ ద్వారా తెలియజెయ్యండి.

నేనేదో బిజీగా ఉంటానని,మీరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నామనీ అనుకోకండి.సిన్సియర్ గా మీరు అడిగితే మీమీ సందేహాలను తీర్చడానికి (అది అర్ధరాత్రి అయినా,అపరాత్రి అయినా సరే) నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానన్న విషయం గమనించండి.

ఇంకొక్క ముఖ్య విషయం:--

ఈ కార్యక్రమంలో పాల్గొని 'శ్రీవిద్య' మీద నా ఉపన్యాసాన్ని విన్న చాలామంది దీక్ష ఇవ్వమనీ వారికి మార్గనిర్దేశనం చెయ్యమనీ వారిని ఆధ్యాత్మిక పధంలో ప్రాక్టికల్ గా నడిపించమనీ అడిగారు.

ఈ అభ్యర్ధనకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.

నావద్ద దీక్ష తీసుకోవాలని అనుకునేవారు ఎటువంటి సంకోచాలూ పెట్టుకోకుండా నన్ను సంప్రదించండి.ఎవరెవరి కోరికలను బట్టి,సంస్కారాలను బట్టి,అంతరిక శక్తిని బట్టి,అర్హతను బట్టి వారివారికి దీక్ష ఇవ్వబడుతుంది.నా వద్ద దీక్షాస్వీకారం చేసిన,చెయ్యబోతున్న గ్రూపు సభ్యులతో కలసి అతిత్వరలో 'సాధనా సమ్మేళనాలు' జరుపబడతాయి.

ఆ సమ్మేళనాలలో -- శుద్దమైన నిజమైన ఆధ్యాత్మిక సాధనను వారిచేత దగ్గరుండి చేయించడం, వారి సందేహాలను తీర్చడం,వారిని సత్యమైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా ముందుకు నడిపించడం జరుగుతుంది.దీనికి కులంతోనూ మతంతోనూ వయస్సుతోనూ ప్రాంతంతోనూ సంబంధం లేదు.

హృదయపూర్వకమైన 'తపన' ఒక్కటే నిజమైన అర్హత.

ఇన్నాళ్ళూ విషయాలను స్థూలంగా వివరించడం మాత్రమే జరిగింది. ఇకనుంచి వాటిని ప్రాక్టికల్ గా ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి?అంతరిక యోగసాధన ఎలా చెయ్యాలి?జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి? అనే విషయాన్ని ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుంది.

అంతేగాక,జ్యోతిష్యవిద్యార్ధులకు ఆసక్తి ఉన్నవారికి Astrology workshops నిర్వహించి రెండు దశాబ్దాల సాధనా ఫలితంగా నేను తయారు చేసుకున్న నా ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణా విధానాన్ని నేర్పించడం కూడా ముందు ముందు జరుగుతుంది.

ఇది పుస్తకం మీద కూడా ఉన్నది.సాధనా మార్గంలో నా మార్గనిర్దేశనం కావలసినవారు,శ్రద్ధ ఉన్నవారు సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్నెన్నో పనులను మానుకొని దూరాభారాన్ని లెక్కచెయ్యకుండా వచ్చి దీనిని జయప్రదం చేసిన అందరికీ మళ్ళీ ఈ బ్లాగుముఖంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీరు చూపించిన గౌరవానికీ మీ అభిమానానికీ నా ప్రతిస్పందనను నేను మాటలలో చెప్పలేను.

నాతో వ్యక్తిగత పరిచయాన్ని పెంచుకోవాలనీ,నిజమైన ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించాలనీ,ఆ మార్గంలో ముందుకు నడవాలనీ అనుకునేవారిని "పంచవటి గ్రూపు" లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. 

కావలసినవారు నాకు 'ఈ మెయిల్' చేస్తే వారికి గ్రూప్ యాక్సెస్ ఇస్తాను.

మరొక్క విషయం:--

కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చెయ్యాలన్న మా కోరిక పూర్తిగా తీరలేదు.దానికి కారణం ఆ ఫంక్షన్ హాలు వారు అక్కడ భోజనాలు చెయ్యడానికి అనుమతించకపోవడమే.కనుక దూరంగా ఉన్న శ్రీ మైథిలీ రాం గారి ఇంటిలో భోజన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది.దూరం గనుక అక్కడకు రాలేక పోయినవారిని, మమ్మల్ని మన్నించమని  ఈ సందర్భంగా కోరుతున్నాను.

ముందు ముందు రాబోయే మరిన్ని పుస్తకావిష్కరణ సభలలో ఈ లోపాన్ని దిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది.

ధన్యవాదాలతో,

మీ 

సత్యనారాయణ శర్మ

24, డిసెంబర్ 2014, బుధవారం

19, డిసెంబర్ 2014, శుక్రవారం

28-12-2014 ఆదివారం - 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకావిష్కరణ

ఆంధ్రదేశానికి,తెలుగు ప్రజలకు,ఒక అద్భుతమైన కానుక.

తెలుగుపద్య సాహిత్య చరిత్రలోనూ,ఆధ్యాత్మిక చరిత్రలోనూ,శుద్ధ శ్రీవిద్యాసాంప్రదాయం లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన.

చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంఘటన.
జగజ్జనని అనుగ్రహంతో ఎట్టకేలకు సాకారం కానున్నది.

రాబోయే ఎంతోకాలంపాటు అటు ఆధ్యాత్మికరంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ ధృవతారగా నిలిచి ఉండి,ఎంతమంది చేతనో చదవబడుతూ,ఎంతమంది జీవితాలనో దివ్యత్వంతో వెలిగించబోయే అద్భుతమైన ఆధ్యాత్మికగ్రంధం 'శ్రీవిద్యారహస్యమ్' వెలుగు చూడబోతున్నది.

1200 పైగా తెలుగు పద్యాల ద్వారా,వాటి వివరణద్వారా,శుద్ధ శ్రీవిద్యోపాసన ఎలా ఉంటుందో,ఈ ఉపాసనకు గల తాంత్రిక మూలములు ఏమిటో,దానికి గల వేదప్రామాణికత ఏమిటో,ఈ గ్రంధంలో అత్యంత సరళమైన వ్యావహారిక భాషలో వివరించబడింది.అంతేగాక,నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుంది?దానికి కావలసిన అర్హతలు ఏమిటి? దానిని చేసే విధానాలు ఎలా ఉంటాయి?దాని పరమ గమ్యం ఏమిటి?దానిని ఎలా సాధించాలి?మొదలైన అనేక విషయాలు కూడా సందర్భోచితములుగా వివరించబడ్డాయి.

28-12-2014 ఆదివారంనాడు విజయవాడలో 'శ్రీవిద్యారహస్యమ్' గ్రంధావిష్కరణ జరుగుతుంది.అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఆదివారంనాడు పెట్టుకోవడం జరిగింది.

ఆ తర్వాత, జనవరి 1 నుంచి 10 వరకు విజయవాడ P.W.D గ్రౌండ్స్ లో జరుగబోయే 'పుస్తక మహోత్సవం (Book Exhibition)' లోని 'శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పోరేషన్' వారి స్టాల్లో ఈ పుస్తకం లభ్యమౌతుంది.

దూరప్రాంతాలలో ఉన్నవారికోసం ఈ పుస్తకం ఆన్ లైన్ లో కూడా లభ్యమౌతుంది.'కినిగే' వారితోగానీ,ఇతర ఆన్ లైన్ బుక్ ప్రొవైడర్స్ తో గాని అనుసంధానం అవ్వడం ద్వారా ఈ సౌకర్యం కల్పించబడుతుంది.ఆ పని జరుగుతున్నది.

నా శిష్యులను,అభిమానులను,నా బ్లాగు పాఠకులను,నన్ను కలవాలని అనుకునే అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను.నాతో ముఖాముఖీ మాట్లాడాలనుకునే వారికి,సందేహాలు తీర్చుకోవాలనుకునేవారికి ఇదే నా స్వాగతం.

చాలామంది నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నారు.మీ 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకం రిలీజ్ చేసేది ఎప్పుడో చెప్పండి? అని.

అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆలస్యం అవుతూ వస్తున్నది.అందుకే అడిగినవారికందరికీ 'ఒకవారం ముందుగా చెప్తాను' అని చెబుతూ వస్తున్నాను.చెప్పిన విధంగా ఒక వారం ముందుగా బ్లాగుముఖంగా ఈ సభను ఎనౌన్స్ చేస్తున్నాను.

ఆ రోజున-'శ్రీవిద్యోపాసన' గురించి,ఈ పుస్తకం గురించి,నా ఉపన్యాసం ఉంటుంది.అలాగే,ఆధ్యాత్మిక రంగంలో అనుభవజ్ఞులైన మిత్రులు మరికొందరు కూడా మాట్లాడతారు.ఈ సభకు రాలేని వారికోసమై,మరియు విదేశాలలో ఉన్న నా అభిమానుల కోసమై,సభాకార్యక్రమం వీడియో అంతా ఈ బ్లాగ్లో కాలక్రమేణా అప్ లోడ్ చెయ్యబడుతుంది.

తేదీ
28-12-2014 (ఆదివారం)

సమయం
ఉదయం 10.00 గంటలకు.

పుస్తకావిష్కరణ వేదిక
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అసోసియేషన్ హాల్
అంజనం బిల్డింగ్
సివిల్ కోర్టుల ఎదురుగా
గవర్నర్ పేట.
విజయవాడ.

అందరూ ఆహ్వానితులే.

14, డిసెంబర్ 2014, ఆదివారం

లక్ష్మీగణపతి హోమం

మొన్నీ మధ్యన ఒక గ్రూపువాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిశారు.

అదీ ఇదీ మాట్లాడాక,వచ్చిన విషయం చెప్పారు.

'మేము ఫలానా రోజున సామూహిక లక్ష్మీగణపతి హోమం చేస్తున్నాం.మీ పేరు కూడా చేర్చుకుందామని వచ్చాం.'-అన్నారు.

వాళ్ళ ముఖాలలోకి తేరిపార చూచాను.

బొట్లు పెట్టుకుని ఉన్నారుగాని,ఒక్కడి ముఖంలోనూ తేజస్సుగానీ వర్చస్సుగానీ లేదు.దొంగల ముఖాలలాగా ఉన్నాయి.

వీళ్ళకు జ్ఞానభిక్ష పెట్టక తప్పదనుకున్నా.

'లక్ష్మీ గణపతియా? అదేంటి? లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదా? లక్ష్మీ గణపతి ఎక్కడనుంచి వచ్చాడు?ఆయన పుట్టు పూర్వోత్తరాలెంటి?ఎప్పుడూ వినలేదే?' అడిగాను ఏమీ తెలీనట్లు.

నా అజ్ఞానానికి వాళ్ళ లీడర్ చిరునవ్వు నవ్వాడు.

'పెద్దవారు మీరు కూడా అలా అంటే ఎలా సార్?కోరికలు తీరడానికి లక్ష్మీ గణపతి హోమాన్ని మించింది లేదు' అన్నాడు.

'ఓరి మీ కోరికలు పాడుగాను.ఎవడిని కదిలించినా కోరికలు కోరికలు అంటూ చస్తున్నారు' అనుకున్నా లోలోపల.

వీడికి ఇలా కాదు జవాబు చెప్పాల్సింది అని రూటు మార్చా.

'మీకూ చూడబోతే ఒక ఏభై ఏళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.మీరూ పెద్దవారే కదా.మరి మీకు ఇంకా కోరికలేమిటి?అంత తీరని కోరికలు మీకు ఇంకా ఏం మిగిలున్నాయి?'అడిగాను.

చెప్పగానే ఎగిరి గంతేసి "నా పేరు కూడా వ్రాసుకోండి" అనకుండా వాదన పెట్టుకున్నందుకు వారి ముఖాలలో చికాకూ అసహనమూ ప్రత్యక్షమయ్యాయి.

'ఏవో ఒకటి ఉంటాయి కదా సార్.కోరికలో బాధ్యతలో.'అన్నాడు.

'అవి తీరాలంటే హోమాలు చేస్తే తీరుతాయా?లేక ఆ మార్గంలో ప్రయత్నం చేస్తే తీరుతాయా?' అడిగాను.

'పొద్దున్నే అనవసరంగా వీడి దగ్గరికి ఎందుకొచ్చాంరా దేవుడా?' అన్న ఫీలింగ్ వాళ్ళ ముఖాలలో కనిపించింది.

'ఇంతకీ లక్ష్మీగణపతి పుట్టు పూర్వోత్తరాల గురించి నా సందేహం మీరు తీర్చనే లేదు?' అడిగాను.

'పోదాం పదండి సార్.ఈయన ఇచ్చేటట్లు లేడు' అన్నాడు వాళ్ళ గ్రూపులో ఒక వ్యక్తి అసహనంగా.

'ఉండు బాబు.అప్పుడే ఒక నిర్ణయానికి రాకు.ఇవ్వనని నేను చెప్పలేదు కదా. కానీ విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరడిగిన వెంటనే ఎలా ఇస్తాను?నేనూ ఒక లక్ష రూపాయలు అడుగుతాను.నీవు వెంటనే ఇచ్చేస్తావా?' అడిగాను.

వాళ్లకు బాగా కోపం వచ్చేసిందని వాళ్ళ ముఖాలు చూస్తూనే తెలుస్తున్నది.

'ఆయన ఒక దేవత' అన్నాడొకడు.

'ఏమిటో ఆయన ప్రత్యేకత?'- అన్నాను ప్రాస కలుపుతూ.

'చెప్పాం కదా సార్.కోరికలు తీరుతాయని.' అన్నాడు ఇంకొకడు.

అలా అంటూ నాకొక ఫోటో చూపించారు.

'ఇంతకు ముందు చేసిన హోమంలో ఫోటో తీస్తే మంటల్లో వినాయకుడి ఆకారం ఎంత స్పష్టంగా పడిందో చూడండి.'అని చెప్పారు.

వాళ్ళ మొహం మీదే నవ్వాను.

'హోమజ్వాలలో వినాయకుడి రూపం ఒక సెకన్ పాటు కనిపిస్తే మీకేం ఒరిగింది?' అడిగాను.

జవాబు లేదు.

'మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ హోమం చేస్తున్నారు?' అడిగాను.

'అయిదేళ్ళ నుంచి వరుసగా చేస్తున్నాం' అన్నాడు లీడర్.

'మరి మీమీ కోరికలు అన్నీ తీరాయా? నిజంగా చెప్పండి.ఒకవేళ తీరితే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు?' అడిగాను.

'లోకకల్యాణం కోసం చేస్తున్నాం.' అన్నాడొకడు.

'లోకానికి కల్యాణం ఒక్కటేనా శోభనం కూడా మీరే చేస్తారా?' అని అందామని నోటిదాకా వచ్చి ఆగిపోయింది.

'మీరేం అనుకోకపోతే ఒకమాట చెప్తాను' అన్నాను.

వాళ్ళు ప్రశ్నార్ధకంగా చూస్తున్నారు.

'మీ ఇల్లెక్కడ' అడిగాను ఆ లీడర్ని.

'అరండల్ పేట' అన్నాడు.

'రైల్వే స్టేషన్ మీ దగ్గరలోనే ఉన్నది కదా' అడిగాను.

'అవును' అన్నాడు.

'గత వారం రోజులుగా ఒక దిక్కులేని ఆడది ఒంటిమీద చీర కూడా సరిగ్గా లేకుండా స్టేషన్ పరిసరాలలో తిరుగుతున్నది.గమనించారా మీలో ఎవరైనా?' అడిగాను.

వాళ్ళు ముఖముఖాలు చూచుకున్నారు.

'మీకు నిజంగా లోకకల్యాణం చెయ్యాలని ఉంటే,అలాంటి దిక్కులేని వాళ్లకి సాయం చెయ్యండి.చలికాలం కదా మీరు దుప్పట్లు కప్పుకుని వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నారు.ఆ ఆడది ఒంటిమీద బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఈ చలిలో దోమలతో కుట్టించుకుంటూ ఆరుబయట తెల్లవార్లూ ఎలా ఉంటున్నదో ఆలోచించారా?మీరు బాగా తిని రోజుకు పదిసార్లు టీలో కాఫీలో తాగుతారు. ఆమెకు అసలు తిండి ఉందో లేదో ఎన్నాళ్ళ నుంచీ అలా పస్తుంటున్నదో ఆలోచించారా?మీకు నిజంగా లోకానికి మేలు చెయ్యాలని ఉంటె అలాంటి వారికి సాయం చెయ్యండి.అంతేగాని ఇలాంటి పిచ్చిపిచ్చి హోమాలు కాదు.

మీ హోమానికి అయ్యే ఖర్చుతో ఒక బీదవిద్యార్ధి చదువుకు సాయం చెయ్యండి. లేదా ఆకలితో ఉన్న ఒక దీనుడికి ఒక పూట అన్నం పెట్టండి.లేదా ఇంకా మీకు ఓపికుంటే అతని బ్రతుకు తెరువుకు మార్గం చూపండి.దేవుడు నిజంగా సంతోషిస్తాడు.' అన్నాను సీరియస్ గా.

'అది వారివారి ఖర్మ.మనమే చేస్తాం?' అన్నాడొకడు.

'మీ కోరికలు తీరకపోవడం కూడా మీ ఖర్మే అని దేవుడూ అనుకోవచ్చుగా.మీ హోమాలకు ఆశపడి మీకెందుకు ఆయన సాయం చెయ్యాలి?' అడిగాను.

అందరూ లేచి నిలబడ్డారు.

'సార్.మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పండి.ఈ డొంక తిరుగుడు మాటలెందుకు?' అన్నాడొకడు సీరియస్ గా.

వాళ్ళ పౌరుషం చూచి నాకు చచ్చే నవ్వొచ్చింది.

'దీన్నే వీరముష్టి అంటారు.అడుక్కుండే వాళ్లకి అంత బలుపు ఉండకూడదు.' అన్నా నేనూ సీరియస్ గానే.

'పోదాంపదండి సార్.లక్ష్మీగణపతి గురించి ఈయనలాంటి వాళ్ళకెలా తెలుస్తుంది?' అన్నాడొక పిలకాయన నిర్లక్ష్యంగా చూస్తూ.

'బాబూ నీ వయసెంత?' అడిగాను పిలకని.

'నలభై ఒకటి' అన్నాడు.

"నీకు ఇంకా లాగూ సరిగ్గా కట్టుకోవడం రాకముందే నాకు లక్ష్మీగణపతి మంత్రానుష్టాన విధానం తెలుసు.ప్రపంచంలో నీతోనే అన్నీ పుట్టాయని అనుకోకు.అనుష్టానవిధానమే కాదు,కామ్యకర్మలలో ప్రయోగ ఉపసంహార విధానాలు కూడా తెలుసు." అంటూ "ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే..."అనే లక్ష్మీగణపతి శ్లోకం చదివాను.

వాళ్ళు బిత్తరపోయారు.

'మరి తెలిసి ఎందుకు మమ్మల్ని అడిగారు?పరీక్షా?' అన్నాడు వాళ్ళ లీడర్.

'పరీక్షేమీ లేదు.మీకు నిజంగా తెలుసో లేదో తెలుసుకుందామని అడిగాను. మీకు తెలీదని తెలిసిపోయింది.మీకే తెలీనిదాన్ని పట్టుకుని ఇంకొకరి దగ్గరకు మీరెలా వచ్చారు?' నేనూ ఎదురు ప్రశ్నించాను.

వాళ్ళందరూ మూకుమ్మడిగా నా గదిలోనుంచి బయటకు వెళ్ళిపోయారు.

లోకం అంతా ఇలాంటి దొంగలతో నిండి ఉన్నది.

ఏదో ఒక దేవతని పట్టుకోవడం,గుడో గోపురమో హోమమో ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని ఇక జనాల భయాన్నీ ఆశనీ ఆసరాగా తీసుకుని వాళ్ళను రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునే ఇలాంటి వెధవలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు.

చుట్టూ ఉన్న దీనుల బాధలు పట్టని మనం,మన బాధలు మాత్రం తీర్చమని దేవుడిని అడుగుతాం.దేవుడికి కూడా లంచం ఇవ్వబోతాం.ఆయనతో వ్యాపారం మొదలుపెడతాం.దేవుడేం పిచ్చివాడా మన దొంగపూజలకూ ట్రిక్కులకూ కరిగిపోవడానికి?నీ సాటిమనిషి బాధ నీకు పట్టనప్పుడు నీ బాధను దేవుడెందుకు పట్టించుకుంటాడు?

సాటి మనిషిలో దైవాన్ని చూడమని వివేకానందస్వామి అన్నారు.అదే అత్యుత్తమమైన పూజ అని ఆయన చెప్పారు.మనం ఆయన్ను మరచిపోయాం.ఆయనేం చెప్పారో మరచిపోయాం.సాటి మనిషిలో దైవాన్ని చూడలేని వాడు హోమగుండంలో పూజల్లో రాతి విగ్రహాలలో ఏం చూడగలడు?

ప్రసిద్ధ దేవాలయాలలో దర్శన సమయంలో పక్క మనిషిని చేతులతో కాళ్ళతో తోసేస్తూ తొక్కుతూ గర్భగుడిలోని విగ్రహాన్ని చూడాలని ఎగబడే అర్భకుల వంటి వారే వీళ్ళు కూడా.

మానవత్వమే లేనివారికి దైవం గురించి మాట్లాడే హక్కెక్కడిది?

12, డిసెంబర్ 2014, శుక్రవారం

June 21-World Yoga Day

జూన్ 21 ని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం చాలా ముదావహం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానుల కందరికీ ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది.అదికూడా సమ్మర్ సోల్స్టైస్ అయిన జూన్-21 ఆరోజుగా ఎంచుకోవడం జ్యోతిష్యశాస్త్ర పరంగా కూడా చాలా సరిగ్గా ఉన్నది.

నరేంద్రమోడీగారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశ విధానాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి.ఎన్నోరంగాలలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తున్నాయి.అలాగే సాంస్కృతిక ధార్మికరంగాలలో కూడా వస్తున్నాయనడానికి ఇదొక సూచన.

నా ఉద్దేశ్యం ప్రకారం ఇది ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిన సంఘటన.

అన్నిదేశాల వాళ్ళూ వారివారి సంస్కృతిలో ముఖ్యమైన అంశాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకోసం ప్రయత్నాలు చేస్తూ ఆ గుర్తింపును సాధించుకుంటూ ఉంటె,మనం మాత్రం లోలోపలకు ముడుచుకుపోతూ ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఉన్నాం.

మనదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతులు ఎన్నో ఉన్నాయి.పెట్టిన జ్ఞానభిక్ష ఎంతో ఉన్నది.కానీ వాటిని మనం క్లెయిం చేసుకోవడం లేదు.అలా చేసుకోవడానికి మనకు సెక్యులర్ ఇమేజి ఒకటి అడ్డోస్తూ ఉన్నది.

'యోగా' అనేది ఎంత విలువైనదో ప్రపంచవ్యాప్తంగా బుద్ధి అనేది ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించారు.దాదాపు ఏభై ఏళ్ళ క్రితం నుంచే హాలీవుడ్ సెలెబ్రిటీలతో సహా ఎందఱో 'యోగా' చేస్తూ దేహసౌష్టవాన్నీ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ వస్తున్నారు.కాని మనకుమాత్రం నేటికీ యోగామీద పూర్తి అవగాహన లేదు.ఇది శోచనీయం.

నిజమైన 'యోగా' అంటే శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడుకునే ఒక వ్యాయామం కాదు.అది ఒక ఆధ్యాత్మికమైన జీవనవిధానం.పోనీ ఈ మాట అందరికీ నచ్చకపోయినా,యోగాలోని కొన్ని అంశాలైన ఆసనాలు, ప్రాణాయామం,కొన్ని ముద్రలు,కొన్ని క్రియలు చెయ్యడంవల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండే మాట వాస్తవమే.

యోగా అనేది మన హిందూమతంలో అంతర్భాగమే.యోగా అనేది మతం కాదు ఇదొక జీవనవిధానం అంటూ మనం నంగినంగిగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు.ఇందులోని కాన్సెప్ట్స్ అన్నీ హిందూమతానికి ముడిపడి ఉన్నట్టివే.ఇందులో ఏమీ అనుమానం లేదు.అయితే యోగా చేసినంత మాత్రాన మతం మార్చుకోవలసిన పనేమీ లేదు.ఈ విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

కొందరు పాశ్చాత్య పిడివాదులు అనుకునేటట్లు యోగా అనేది 'సైతాన్ ఆరాధన' కానేకాదు.యోగా అనేది భగవంతుని చేరుకునే అనేక మార్గాలలో ఒకటని మన మతం ఎప్పుడో చెప్పేసింది.

మనకు స్వాత్రంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకైనా కనీసం మన విద్యకంటూ ఒక అంతర్జాతీయ గుర్తింపు లభించినందుకు యోగాభిమానులంతా పండుగ చేసుకోవలసిన శుభదినం ఇది.

వివేకానందస్వామి వల్ల ప్రపంచానికి మన దేశపు ధార్మికఔన్నత్యం అర్ధమైతే, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఆయన అనుచరుడైన నరేంద్రమోడీ వల్ల మన 'యోగా'కి ఒక అంతర్జాతీయ గుర్తింపు అఫీషియల్ గా వచ్చింది.

ఈ విషయంలో నరేంద్ర మోదీగారిని మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు.

11, డిసెంబర్ 2014, గురువారం

భగ్నప్రేమ

మొన్నీ మధ్యన ఒక తెలిసినాయన ఫోన్లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.

'సార్.మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను.'

'ఏమనుకుంటానో ముందే చెప్పలేనుగాని మీరు చెప్పాలనుకున్నది చెప్పండి' అన్నాను.

'మీ పోస్ట్ లు చదివి మా ఆవిడ ఒక మాటన్నది.ఈయన భగ్నప్రేమికుడై ఉంటాడు.'-అన్నది సర్.

ఫకాల్న ఫోన్లోనే నవ్వేశాను.

'ఎందుకు నవ్వుతున్నారు?' అడిగాడాయన.

'ఎందుకలా అన్నారో మీ శ్రీమతి?' అన్నాను.

'అంటే మీరు వ్రాసే కవితలు,పాడే పాటలను బట్టి అలా అనిపించింది' అన్నాడు.

ఈ సారి ' హ హ్హ హ్హ' అంటూ వికటంగా పెద్దగా నవ్వాను.

'ఇప్పుడు మీరూ ఏమీ అనుకోకూడదు.నేనూ ఒక విషయం చెప్తాను.' అన్నాను.

ఆయన గొంతులో అనుమానం ధ్వనించింది.

'చెప్పండి.'

'అసలు మీ ఆవిడే ఒక భగ్నప్రేమికురాలేమో కనుక్కోండి.'

'అదేంటి అలా అన్నారు?'

'అవును.మన లోపల ఏముందో అదే బయట కనిపిస్తుంది. నా పోస్ట్ లలో భగ్నప్రేమ ఆమెకు కనిపించిందీ అంటే ఆమెకూడా ఒక భగ్నప్రేమికురాలే అయి ఉంటుంది.సైకాలజీ ఇంతే చెప్తుంది.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.ఫోన్ పెట్టేశాడు.

మొన్నీ మధ్యన ఒక స్నేహితురాలు కూడా ఇదే చెప్పింది.ఆమె ఫ్రెండ్ కి కూడా నా కవితలు చదివి ఇలాగే అనిపించిందిట.

ఆమెతో ఇంకా సూటిగా చెప్పాను.

"మేకకి దేనినైనా తినడమే తెలుసు.అంతకంటే దానికి ఇంకేం తెలుస్తుంది?" అన్నాను.

ఆమెకి అర్ధం కాలేదు.

'అదేంటి అలా అన్నారు?' అంది.

'ఒక గులాబీ పువ్వును తీసుకెళ్ళి మేక ముందు ఉంచామనుకో.దాని సౌందర్యాన్ని ఆస్వాదించడం దానికి రాదుకదా.అందుకని నోట్లో వేసుకుని పరపరా నమిలి పారేస్తుంది.దానికి తెలిసిన 'టేస్ట్' అంతే.మీ స్నేహితురాలు కూడా ఒక మేకలాంటిదే.' అన్నాను.

వింటున్న తనకు కోపం వచ్చి ఉండవచ్చు.కానీ నేను నిజం చెప్పక తప్పదు.

ఒక గులాబీ అందాన్నీ సౌందర్యాన్నీ ఆస్వాదించాలంటే ఆపని ఒక భావుకత ఉన్న హృదయం వల్లే అవుతుంది.మొరటు మనిషికి మొగలి పువ్వు ఇస్తే ఏం జరుగుతుందో సామెత ఊరకే పుట్టలేదు.ఇదీ అంతే.ఒక ఉదాత్తమైన భావనను అర్ధం చేసుకోవాలంటే ఉదాత్తమైన హృదయం ఉన్నపుడే అది కుదురుతుంది. అది లేనప్పుడు ఒక అతీతమైన భావాన్ని పొందుపరచిన కవిత కూడా భగ్నప్రేమ లాగే చీప్ గా కనిపిస్తుంది.ఎందుకంటే మనకు తెలిసిన దానినిబట్టే మనం దేనినైనా చూస్తాం.తెలీని దాన్ని బట్టి చూడలేం.మనదగ్గర గజంబద్ద ఉంటే దానితోనే దేనినైనా కొలవగలం.లేనిదానితో ఎలా కొలుస్తాం?

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఒక మాట అనేవారు.

'గజంలో అంగుళాలున్నాయి గాని అంగుళంలో గజాలు లేవు నాన్నా' అనేవారు.

ఇదెంత అద్భుతమైన మాటో?

ఎవరైనా ఒక మంచి హృద్యమైన కవిత వ్రాసినా,ఒక పాథోస్ సాంగ్ పాడినా వెంటనే వినేవారు అనుకునే మాట -"భగ్నప్రేమ".

మార్మికులందరూ (Mystics) లోకానికి భగ్నప్రేమికుల లాగానో,పిచ్చివారి లాగానో మాత్రమే కనిపించారు.ఇదేమీ కొత్తవిషయం కాదు.ఎప్పటినుంచో జరుగుతున్న పాతకధే.సూఫీ యోగులందరూ లోకానికి పిచ్చివారిగానే కనిపించారు.మీరాబాయిని లోకం పిచ్చిదనే అన్నది.వేశ్య అని కూడా అన్నది. బస్రా నివాసి 'రబియా' అనే ఒక సూఫీ మహాత్మురాలిని కూడా లోకం వేశ్య అనే అనుకుంది.అక్కడిదాకా ఎందుకు?కులాన్నీ మతాన్నీ ప్రాంతాన్నీ లెక్కచెయ్యకుండా అందర్నీ ప్రేమగా దగ్గరకు తీసుకునే జిల్లెళ్ళమూడి అమ్మగారి గురించి కూడా లోకులు రకరకాలుగా అనుకునేవారు.

ఆ విషయం అలా ఉంచితే,అసలు 'ప్రేమ' అనేది ఎలా భగ్నం అవుతుందో నాకెప్పటికీ అర్ధం కాదు. భగ్నమయ్యేది ప్రేమ కానే కాదని నేను నమ్ముతాను. మన ఆశ భగ్నం కావచ్చు,మన కోరిక భగ్నం కావచ్చు,మన ఎక్స్ పెక్టేషన్ భగ్నం కావచ్చు.కానీ 'ప్రేమ' ఎలా భగ్నం అవుతుంది? అది అసంభవం.

లోకంలో అత్యంత బలమైన శక్తి 'ప్రేమ'.అది భగ్నం అవుతుందీ అంటే,పైనుంచి కింద పడేస్తే 'వజ్రం' పగిలిపోయింది అన్నట్లుగా ఉంటుంది.పైనుంచి కింద పడేస్తే గాజు పగులుతుంది కానీ వజ్రం పగలదు.

మనుషులలో ఎక్కువమందికి 'ప్రేమ' అంటే ఏమిటో తెలీదని నా ప్రగాఢవిశ్వాసం.ఆడామగా మధ్య ఉండే ఆకర్షణనే ప్రేమ అని లోకంలోని చవకబారు మనుషులు అనుకుంటారు.నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచం మొత్తం మీద ఒక పదిమంది కూడా ఉంటారో ఉండరో అని నా ఊహ.

పగిలిపోవడానికీ భగ్నం కావడానికీ 'ప్రేమ' అనేది గాజుబొమ్మ కాదు.అది వజ్రం.దానికి చావు లేదు.

మార్మికులనేవాళ్ళు (Mystics) భగ్నప్రేమికులు కారు.వాళ్ళు అన్వేషకులు. ఈ ప్రపంచంలో దొరకని ఏదో ఒక అతీతసౌందర్యాన్నీ సత్యాన్నీ స్వచ్చతనీ వాళ్ళు నిరంతరం వెదుకుతూ ఉంటారు.దాన్ని అందుకోవాలని వాళ్ళు పరితపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు.చాలాసార్లు వాళ్ళా ప్రయత్నంలో సఫలీకృతులౌతారు కూడా.

అయితే వాళ్ళ ప్రయత్నం అంతా అంతరికంగా ఉంటుంది.వాళ్ళ అన్వేషణ కూడా అంతరికంగానే ఉంటుంది.వాళ్లకు కలిగే సిద్ధి కూడా బయటకు కనపడకుండా అంతరికంగానే జరుగుతుంది.అయితే దానిని వాళ్ళు బయటకు వ్యక్తపరిచే తీరు,లోకానికి తెలిసిన భగ్నప్రేమికుల తీరుకు దగ్గరగా ఉంటుంది.

ఈ విషయం తెలియనివారు,మార్మిక అన్వేషకులను చూచి భగ్నప్రేమికులని అనుకోవడం వింతేమీ కాదు.

శ్రీ రామకృష్ణులిలా అంటారు.

'పుచ్చు వంకాయలు అమ్ముకునేవారికి వజ్రం విలువెలా తెలుస్తుంది?దాని విలువను కూడా వాళ్ళు వంకాయలలోనే కొలుస్తారు."కోహినూర్ వజ్రాన్ని చూచి -- "మహా అయితే రెండుకేజీల వంకాయల విలువ దీనికి ఉండవచ్చు"- అంటారు.అనుభవజ్ఞుడైన వజ్రాల వర్తకునికే దాని అసలైన విలువ తెలుస్తుంది.'

ఈ మాటలు అక్షర సత్యాలు.

ఎవరెస్ట్ శిఖరం మీద ఏముందో లోయలో ఉన్నవారికెలా కనిపిస్తుంది?

గురువుగారి వక్రస్థితి - ఫలితాలు

డిసెంబర్ 9 నుంచి గురువు గారి వక్రస్థితి మొదలైంది.ఈ స్థితి  2015 ఏప్రిల్ 8 వరకూ నాలుగు నెలలపాటు ఉంటుంది.

ఈ నాలుగునెలల క్రమంలో గురువుగారు ప్రస్తుతం ఉన్న ఆశ్లేషా నక్షత్రం 4 పాదంనుంచి క్రమంగా వెనక్కు వెళుతూ ఒకటోపాదం వరకూ సంచరిస్తాడు.ఆ తర్వాత ఋజుగతిలోకి ప్రవేశించి మళ్ళీ ఆశ్లేషానక్షత్రం మొత్తాన్నీ దాటుతాడు.

ఈ ప్రతి మార్పూ మనుషుల జీవితాలలో మార్పులు తీసుకొస్తుంది.

చంద్రుడు లేదా గురువు ఆయా రాశులలో ఉన్నవారికి ఆయా ఫలితాలు వర్తిస్తాయి.గమనించండి.

మేషరాశి
చదువు మీద దృష్టి ఎక్కువౌతుంది.ప్రేమవ్యవహారం ముగుస్తుంది.షేర్ మార్కెట్లో నష్టాలోస్తాయి.సంతానానికి చేటుకాలం.

వృషభరాశి
వృత్తి ఉద్యోగాలలో,ఇంటి వ్యవహారాలలో పనిభారం ఎక్కువౌతుంది.

మిధునరాశి
తండ్రికి,పితృసమానులకు,తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు ఆరోగ్య భంగం.కష్టకాలం.

కర్కాటక రాశి
ఖర్చులు నష్టాలు ఎక్కువౌతాయి.మానసిక చింత పీడిస్తుంది.

సింహరాశి
భార్యకు/భర్తకు కష్టకాలం.దూరప్రాంత నివాసం.ఉన్నత స్థాయిలో వారితో విరోధం.

కన్యారాశి
అజీర్ణ బాధలు.గృహసౌఖ్యలోపం.అనుకోని ఆకస్మిక ఖర్చులు.త్రిప్పట ఉంటుంది.

తులారాశి
సంతాన విషయంలో,విద్యావిషయంలో చింత ఎక్కువౌతుంది.స్నేహితుల సాయం అందుతుంది.

వృశ్చికరాశి
ఇంటిలో సమస్యలు కలుగుతాయి.గృహసౌఖ్యం లోపిస్తుంది.తండ్రికి లేదా పితృ సమానులకు కష్ట కాలం.వృత్తిలో ఇబ్బందులు.

ధనూరాశి
కమ్యూనికేషన్ లోపాలు.చికాకులు.విద్యాభంగం.ఇంటిలోని పెద్దవారికి ఆరోగ్య సమస్యలు.

మకరరాశి
తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కష్టకాలం.నేత్రరోగాలు.విద్యా,ధన సంబంధ విషయాలలో చికాకులు.

కుంభరాశి
అజీర్ణ,కాలేయ సంబంధ సమస్యలు.భార్య/భర్తకు కష్ట కాలం.డబ్బుకు ఇబ్బంది పడతారు.

మీనరాశి
రహస్యవిషయాలలో శ్రద్ధ పెడతారు.మతదృక్పధాలు మారుతాయి. మార్మిక,మాంత్రికవిద్యలలో సాధన చేస్తారు.గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. వాటి కొరకు ఖర్చు పెడతారు.

ఈ ఫలితాలు నేటినుంచి జనవరి 12 వరకూ కనిపిస్తాయి.

10, డిసెంబర్ 2014, బుధవారం

నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా?

మొన్న నాలుగో తేదీన ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ఘంటసాల జయంతి సందర్భంగా మ్యూజికల్ నైట్ జరిగింది.అదేమంత ఊహించినంత గొప్పగా సాగలేదు.నాకే నచ్చలేదంటే ఇంక అనుభవజ్ఞులైన ఆడియన్స్ కి నచ్చకపోవడం వింతేముంది?

మంచిపాటలు పాడగల సింగర్స్ ఉన్నప్పటికీ వారికి సరియైన పాటలు ఇవ్వకపోవడం,అసలు ప్రోగ్రాం కంటే కొసరు 'సన్మాన కార్యక్రమం' ఎక్కువ సమయాన్ని ఆక్రమించడం,ఘంటసాల మాస్టారి పాటలకంటే ఒక స్పాన్సర్ తను స్వంతంగా వ్రాసుకున్న ప్రైవేట్ పాటలు పాడి విసిగించడం ప్రేక్షకులలో నిరాశను మిగిల్చింది.ఘంటసాల మాస్టారి అభిమానులు ఎందఱో ఆ కార్యక్రమాన్ని చూద్దామని వచ్చారు.కానీ నిర్వహణాలోపం వల్ల కార్యక్రమం ఫెయిలైంది.

ఆయన పాడుతుంటే జనం 'ఒద్దు ఒద్దు ఆపు దిగిపో దిగిపో' అని ఒకటే గోల.కానీ ఆయనెవరో స్తితప్రజ్ఞుడిలా ఉన్నాడు.తను వ్రాసుకున్న సొంత పాటలన్నీ తాపీ ధర్మారావులా నిదానంగా పాడి చివరిలో 'మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి' అంటూ ఏమీ జరగనట్లుగా స్టేజీ దిగిపోయాడు.ఒక రాగంలేదు, తాళంలేదు,గాత్రధర్మం లేదు. స్టేజీకింది ప్రేక్షకులూ స్టేజీ మీద మేమూ కూడా వినలేక చచ్చాం.

మధ్యలో నేను ఏదో పనుండి బైటకు వచ్చాను.అప్పుడు కొందరు ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టి వారి నిరాశను వ్యక్తం చేశారు."సార్.ఇది ఘంటసాల గారి ప్రోగ్రామా?ఆ ప్రైవేట్ పాటలాయన ప్రోగ్రామా?ఆయన ఇంకాసేపు పాడినట్లైతే స్టేజీమీద చెప్పులు పడి ఉండేవి సార్" అని ఒకతను నాతో అన్నాడు.

నేను సరిగ్గా ఆయన వెనుకే కూచుని ఉన్నాను.ఒకవేళ అదే జరిగి ఉంటే, ఉన్నట్టుండి ఒక పల్టీ కొట్టి,చెప్పుల నుంచి తప్పుకుని స్టేజీ కిందకు దూకే అవకాశం మిస్సయింది కదా? మన మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడే అవకాశం పోయిందే? అని బాధపడ్డాను.

'బాబూ.నేను కార్యక్రమ ఆర్గనైజర్ ను కాను.నేనూ ఒక గాయకుడిని మాత్రమే.ప్రోగ్రాం సరిగ్గా జరగకపోవడంలో నా బాధ్యత ఏమీలేదు.' అంటూ నా నిస్సహాయతను వ్యక్తం చేశాను.ఒక చిన్న ప్రోగ్రాములో కూడా ఎన్ని రాజకీయాలు జరుగుతాయో ప్రత్యక్షంగా చూచిన నాకు ఒక్కసారిగా ఇలాంటి ప్రోగ్రాములంటే విరక్తి వచ్చేసింది.

అక్కడున్న ప్రతి ఒక్కరూ వారివారి రాజకీయాలు నడిపారు.గాయకులకు ఎలాట్ చేసిన పాటలు చివరి నిముషంలో మారిపోయాయి.ఆర్కెష్ట్రా వారు బిట్ వర్క్ సరిగ్గా ఇవ్వలేదు.ఘంటసాల మాస్టారి మాటలకంటే జానకి,సుశీల గార్ల సోలో పాటలు ఎక్కువగా పడ్డాయి.నిర్వాహకులలోనూ ఆర్కేష్ట్రా లోనూ ఒక్కరిలో కూడా చిత్తశుద్ధి గానీ ఓపన్ మైండు గాని లేనేలేదు.ఒక టౌన్ లెవల్ ప్రోగ్రాం లోనే ఇన్ని రాజకీయాలుంటే ఇంక కోట్ల రూపాయలతో నడిచే సినిమా ఫీల్డ్ లో ఇంకెన్ని ఉంటాయో అనిపించింది.

ఆరోజు స్టేజీమీద 'మల్లియలారా మాలికలారా' సోలో సాంగ్ పాడాను.వ్యాఖ్యాత ఆ పాటను పొరపాటుగా ఇది 'తోడికోడళ్ళు' చిత్రంలో ఆత్రేయగారు వ్రాసిన పాట అని ఎనౌన్స్ చేశాడు.ప్రేక్షకులలో సంగీతం బాగా వచ్చినవారూ బాగా పాడగలిగిన వారూ ఘంటసాల మాస్టారి వీరాభిమానులూ ఉన్నారు.ఎవరో ఒకాయన లేచి 'అయ్యా ఇది "నిర్దోషి" చిత్రంలోని పాట.నారాయణ రెడ్డిగారు వ్రాసిన పాట.సంగీతం ఘంటసాల మాస్టారు.సరిగ్గా ఎనౌన్స్ చెయ్యండి.'అని అరిచాడు.

నేను పాడటానికి రెడీగా మైకు పుచ్చుకుని ఉన్నాను గనుక వెంటనే 'అవును ఇది సి.నారాయణ రెడ్డిగారు వ్రాయగా ఘంటసాల మాస్టారు స్వరపరచిన పాట.నిర్దోషిలోదే. మీరు చెప్పినది కరెక్టే.' అని మైకులో చెప్పి అతన్ని శాంతింప చేశాను.

ఆ విధంగా 'ఘంటసాల నైట్' నిరాశాజనకంగా ముగిసింది.

ఆ మర్నాడు బృందావన్ గార్డెన్స్ లో జరిగిన "సావిత్రి జయంతి" కార్యక్రమంలో భాగంగా ఆమె నటించిన చిత్రాలలోని గీతాలను కొన్ని ఆలపించాము.

'ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది' పాటను నేనూ,హెలెన్ కుమారీ కలసి పాడాము.

మూడు రోజుల తర్వాత ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు.

మామూలు విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఇలా అన్నాడు.

'స్టేజీమీద  పాటల వరకూ బాగానే ఉన్నాయి.బ్లాగులో పాటలు కూడా వింటున్నాను.బాగుంటున్నాయి.కాని ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోతున్నావ్.బ్లాగుల్లో ఇప్పటివరకూ ఒక ఆధ్యాత్మిక ఇమేజ్ నీకున్నది. నీ అనాధ్యాత్మిక పోస్ట్ ల వల్ల అది పాడైపోతున్నది.నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా?ఉద్యోగపరంగా చూద్దామా అంటే ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారిగా ఉన్నావు.అలాంటి నీవు గుళ్ళలో గోపురాలలో పాటలు పాడటానికి వెళ్ళడం ఏమిటి?

సరే పాడితే పాడావు.బాగా పాడుతున్నావని ముందుముందు వినాయకచవితి పందిళ్ళలో, శ్రీరామనవమి పందిళ్ళలో కూడా రమ్మంటారు.ఆ తర్వాత పెళ్లి ఫంక్షన్స్ లో పాడమంటారు.ఆ తర్వాత రోడ్డుమీద బ్యాండ్ మేళంలో పాడమని పిలుస్తారు.వెళతావా? ఎంత చండాలంగా ఉంటుంది? ఆలోచించు.

బ్లాగుల్లో ఒక్కసారిగా నీ ఆధ్యాత్మిక ధోరణి మార్చేసి సినిమా పాటలు ఇంకా ఏవేవో ఇతర విషయాలూ మొదలుపెట్టావు.నిన్ను గురువుగా భావించే వాళ్ళు కొందరున్నారు.వాళ్ళు ఎంత నొచ్చుకుంటారు?" అంటూ ఈ ధోరణిలో నాకు హితబోధ గావించాడు.

నాకు చచ్చే నవ్వొచ్చింది.

'నీ బాధ నాకర్ధమైందిలే గాని ఒక విషయం చెప్తా శాంతంగా వింటావా?' అడిగాను.

'చెప్పు.తప్పుతుందా?' అన్నాడు.

'ఓషో రజనీష్ అమెరికాలో ఉపన్యాసాలు ఇస్తున్నపుడు అక్కడి క్రిష్టియన్స్ ఒక దుమారం లేవదీశారు."నీ ఉపన్యాసాల వల్ల మా మతం దెబ్బతింటున్నది. నీ బోధలు ఆపు" అంటూ గొడవ చేశారు.

దానికి ఆయన భలే జవాబిచ్చాడు.ఆయనేమన్నాడో తెలుసా?

"నేనిచ్చే రెండు ఉపన్యాసాలతో,రెండువేల ఏండ్ల చరిత్రగలిగిన మీ మతం కూలిపోయే పనైతే అటువంటి మతం ఉంటే ఎంత? ఊడితే ఎంత?" అన్నాడు.

నేనూ అదే అందామనుకుంటున్నాను.నేను పాడే పాటలతోనూ నా ఇతర పోస్ట్ ల తోనూ నాకున్న ఆధ్యాత్మిక ఇమేజి దెబ్బతినే పనైతే అదెంత గొప్ప ఇమేజో అక్కడే అర్ధం చేసుకోవచ్చు.అలాంటి చవకబారు ఇమేజి నాకక్కరలేదు. అలాంటి ఇమేజి కోసం ప్రాకులాడే ఖర్మా నాకొద్దు.

అయినా,ఆధ్యాత్మికత అంటే నీకేమీ అర్ధం కాలేదని నీ సలహావల్ల నాకర్ధమైంది.ముందు మీకు అసలైన ఆధ్యాత్మికత ఏంటో అర్ధమైతే కదా ఆ తర్వాత నేనేంటో అర్ధం కావడానికి?

పైగా నేను ఇమేజి మీద ఆధారపడి బ్రతకడంలేదు.అలా ఒళ్ళు చూపించుకుని బ్రతకడానికి నేను సినిమా హీరోయిన్ని కాను.నేను ఏది చేసినా ఇతరుల కోసం చెయ్యడంలేదు.నా ఆత్మానందం కోసం చేస్తున్నాను. ఆధ్యాత్మిక పోస్ట్ లు వ్రాసినా నాకోసమే వ్రాస్తున్నాను.పాటలు పాడినా నాకోసమే పాడుకుంటున్నాను.జాతకాలు చూసినా నా ఆనందం కోసమే చూస్తున్నాను.మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసినా నా కోసమే,యోగాభ్యాసం చేసినా నాకోసమే.ఇంకేం చేసినా నా ఆనందం కోసమే చేస్తున్నాను.ఇదంతా నా ఆనందం కోసమే.అంతేగాని ఇతరుల మెప్పుకోసం కానేకాదు.ఇతరుల మెప్పు మీద బ్రతికేంత చీప్ టేస్ట్ నాకులేదు.ఎవరికి ఏది నచ్చినా నచ్చకపోయినా నాకనవసరం.వాళ్ళేదో అనుకుంటారని నా పధ్ధతి నేను చస్తే మార్చుకోను.

నువ్వు భయపడినంతగా చివరికి రోడ్డుమీద బ్యాండ్ మేళంలో పాడనులే. భయపడకు.మంచి ప్రోగ్రాం అయితేనే చేస్తాను.లేకుంటే చెయ్యను.మొన్న రెండుసార్లకే బుద్ధొచ్చింది.ఆ కుళ్ళు రాజకీయాలు మనకు గిట్టవని నీకూ తెలుసుగా.

ఇక గురుత్వం సంగతి చెప్తా విను.

నాకు శిష్యులంటూ ఎవరూ లేరు.శిష్యుల్ని పోగేసుకోవాలనే దురద నాకేమీ లేదు.వాళ్ళు ఊరకే 'గురువుగారు' అని పిలిచినంత మాత్రాన నేనేమీ పొంగిపోయి పగిలిపోను.ఇలాంటి పిలుపు నాకు చిన్నప్పటినుంచీ అలవాటే. ఇది నాకేమీ కొత్తకాదు.కనుక నేనేమీ ఉబ్బిపోను.ఈ పిలుపు ఊరకే మాటవరసకు పిలిచే పిలుపని నాకు బాగా తెలుసు.నిజంగా నేను ఉపదేశం ఇస్తానంటే ఎగురుకుంటూ వచ్చి తీసుకునేవాళ్ళు ఎవరూ లేరు.ఉన్నా నేను పెట్టే పరీక్షలకు వాళ్ళు క్షణంకూడా తట్టుకోలేరు.నా మార్గాన్ని వాళ్ళు అనుసరించలేరు.అలా ట్రై చేసిన వాళ్ళు ఎందఱో ఇప్పటికి మళ్ళీ కనపడకుండా పత్తా లేకుండా పారిపోయారు.

వాళ్ళ  స్వార్ధంకోసం స్వలాభం కోసం నన్ను అలా 'గురువుగారు' అంటూ పిలుస్తున్నారని నాకు తెలుసు.స్వార్ధాన్ని ఒదిలిపెట్టి నేను చెప్పేదారిలో మనస్ఫూర్తిగా నడిచేవారు ఒక్కరూ లేరు.అదీ నాకు తెలుసు.

ఇలాంటి చెత్త ఇమేజిల మీదా,చెత్త మనుషులమీదా నాకు ఎలాంటి నమ్మకమూ లేదు.కనుక నువ్వేమీ భయపడకు.అయినా ఆధ్యాత్మికత అనేది అలా ఊరకే పొయ్యేదికాదు.అంత త్వరగా వచ్చేదీకాదు.ఆధ్యాత్మికత అంటే విడాకులు కాదు,నచ్చకపోతే వరుసగా ఇచ్చుకుంటూ పోవడానికి.అంత చెయ్యకూడని పని నేనేమీ చెయ్యలేదు.ఒకవేళ పాడినా పిచ్చిపిచ్చి పాటలేమీ పాడను.కనుక నీవు నిశ్చింతగా ఉండు." అని చెప్పాను.

మా ఫ్రెండ్ కొంచం కన్విన్స్ అయినట్లే కనిపించాడు.కానీ పూర్తిగా అయినట్లు అనిపించలేదు.ఏదేమైనా నేను స్టేజీలెక్కి సినిమాపాటలు పాడటం తనకు నచ్చలేదని అర్ధమైంది.

లోకులేమనుకుంటారో అని అనుక్షణం భయపడుతూ ఉండటం ఇంకేదైనా అవుతుందేమో గాని ఆధ్యాత్మికత మాత్రం కానేకాదు.అలా భయపడేవారు ఇంక సాధనేమి చెయ్యగలరు?ఆధ్యాత్మికంగా ఎలా పురోగమించగలరు?అసంభవం.నిజమైన ఆధ్యాత్మికులు సంఘాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తారు.లోకుల అభిప్రాయం అంటే వారికి చెత్తతో సమానం.

మా ఫ్రెండ్ మాటలను బట్టి లోకుల అభిప్రాయాలకు మనుషులు ఎంత విలువనిస్తారో, ఇమేజి అనే చట్రంలో బంధింపబడి తమ జీవితాన్ని ఎంతగా కోల్పోతుంటారో మళ్ళీ ఇంకొకసారి నాకర్ధమైంది.

ఒక తాత్వికుడు హేళనగా ఇలా అంటాడు.

"ఇతరుల కళ్ళలో మనమీద మెచ్చుకోలే మన జీవం.అది లేకుంటే మనలో ప్రాణం ఉన్నా లేనట్లే.ఇతరులు మనల్ని మెచ్చుకోకపోతే మనం శవాలతో సమానమే."

ఇమేజి అనేది ఒక దిష్టిబొమ్మ.దానికేమీ విలువనివ్వవలసిన పనిలేదు. ఆత్మవిశ్వాసం లేనివారే ఇమేజికి విలువనిస్తారని నా ప్రగాఢ విశ్వాసం.

ఇమేజి అంటే తెలుగులో ప్రతిబింబం అని అర్ధం.ప్రతిబింబం మాయ.దానికి ఉనికి లేదు.అది నిజం కాదు.బింబమే నిజం.బింబాన్ని మర్చిపోయినవారే ప్రతిబింబం వెంట పడతారు.దానికి విలువనిస్తారు.

తన విలువ తనకు తెలియనివారు మాత్రమే ఇతరులు తనకిచ్చే విలువ మీద ఆధారపడతారు.తానేమిటో తనకు తెలిసినవారు ఇమేజికి ఏమాత్రం విలువనివ్వరు.తనమీద తనకు నమ్మకం ఉన్నవారు 'ఇతరులేమనుకుంటారో' అని ఒక్క క్షణం కూడా భయపడరు.

తాను సత్యం.ఇమేజి అబద్దం.మనిషి సత్యాన్నే అనుసరించాలి గాని అసత్యాన్ని కాదు.

మనిషనేవాడు తనకోసం తాను బ్రతకాలి.ఇమేజి కోసం బ్రతకకూడదు.

7, డిసెంబర్ 2014, ఆదివారం

క్రికెట్ ఆటగాడు P J Hughes - గండాంత జాతకం

క్రికెట్ ఆటగాడు P.J.Hughes గత నెలలో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి మెడకు బలంగా తగలడం వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే.

ఒక రీడర్ అడిగిన మీదట ఈ జాతకాన్ని పైపైన చూస్తున్నాను.

ఇతను 30-11-1988 న ఆస్ట్రేలియాలోని మేక్స్ విల్లి అనే ఊరిలో పుట్టాడు.జనన సమయం తెలియదు.నక్షత్రం ఆశ్లేషగాని మఖగాని అవుతుంది.చంద్రుడు ఆశ్లేషా నక్షత్రం నాలుగో పాదంలో 29 డిగ్రీలలో ఉన్నాడని నా ఊహ.ఇది గండాంతస్థితి. సామాన్యంగా ఇలాంటి జాతకులకు బాలారిష్టాలుంటాయి.లేదా అల్పాయుష్కులౌతారు.32 ఏళ్ళ లోపు పోతే అల్పాయుష్కులనుకోవచ్చు. ఇతను సరిగ్గా 26 చివరలో పోయాడు.కనుక అల్పాయుష్కుడే.

వృషభరాశి చెడిపోయిన వారికి గొంతు మెడలకు సంబంధించిన థైరాయిడ్ లేదా సెర్వికల్ స్పాండిలైటిస్ వంటి బాధలుంటాయి.ఇంకా చెడుఖర్మ ఉంటె ఇతనికి తగిలిన దెబ్బల వంటివి మెడ ప్రాంతంలో తగులుతాయి.ఇతనికి వృషభరాశిలో గురువు వక్రించి ఉండటం చూడవచ్చు.వృషభరాశికీ గురువుగారికీ సంబంధించిన రెమెడీలు చేసుకుని ఉంటే ఈ దోషం నివారణ అయ్యి ఉండేది.కానీ దృఢకర్మ ఉన్నపుడు రెమేడీలు చేసుకునే అవకాశం ఉండదు.

తృతీయంమీద కుజుని దృష్టి స్పోర్ట్స్ లో ప్రావీణ్యతను ఇస్తుంది.కానీ అదే ఇక్కడ అసహజ మరణానికి కూడా కారణం అయ్యింది.దానికి కారణం మోక్షరాశి అయిన మీనంనుంచి ఉన్న కుజదృష్టి.అసహజ మరణాలకు సంబంధించి నేను గతంలో ఎన్నోసార్లు చెప్పిన జైమినిమహర్షి సూత్రం ఇక్కడ స్మరణీయం.ఈ జాతకంలో కూడా ఆ సూత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అష్టమంలో రాహువు వల్ల యాక్సిడెంటల్ డెత్ సూచింపబడుతున్నది.

ఇంతకంటే ఈ జాతకాన్ని చూడటానికి పెద్దగా ఏమీ లేదు.

మార్గశిర పౌర్ణమి+రోహిణీ శకటం=ప్రమాదాలు

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకిరాం మరణించడం నిన్న సాయంత్రం 6.30 ప్రాంతంలో జరిగింది.

ఇది యాదృచ్చికం కాదు.ఎందుకంటే పౌర్ణమి ఘడియలలోనే ఈ సంఘటన జరిగింది.గ్రహస్థితులు బాలేనప్పుడు వచ్చే అమావాస్య పౌర్ణమి ఘడియలు చాలా మందికి ప్రమాదాలను కొనితెస్తాయన్న విషయాన్ని నేను గతంలో లెక్కలేనన్ని పోస్ట్ లలో ఉదాహరణలతో సహా నిరూపించాను.ఈ సంఘటన కూడా అలాంటిదే.మనుషులమీద పౌర్ణమి అమావాస్యల ప్రభావానికి మళ్ళీ ఇదొక తిరుగులేని రుజువు.

నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో యాదృచ్చికమూ కాకతాళీయమూ అంటూ ఏదీ లేదు,ఉండదు.కారణాలు తెలియనిదానిని కాకతాళీయం అనుకుంటాం అంతే. కారణాలు మనకు అర్ధం కానంత మాత్రాన అసలు లేవని అనుకోవడం పొరపాటు.

నిన్న మార్గశిర పౌర్ణమి.ప్రతి మార్గశిర పౌర్ణమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమంటే ఆరోజున సూర్యుడు బలహీనుడుగా ఉంటాడు.చంద్రుడు ఉచ్చ స్థితిలో చాలా బలంగా ఉంటాడు.ఇద్దరి మధ్యనా సంపూర్ణ సమసప్తక దృష్టి ఉంటుంది.అలాంటి సమయంలో ప్రకృతిలోని సమతుల్యతలో తేడాలు వస్తాయి.అందువల్ల మనుషుల మనస్సులు తీవ్రంగా సంక్షోభానికి గురౌతాయి.అయితే తీవ్రమైన ఉద్రేకమయినా కలుగుతుంది.లేదా తీవ్రమైన డిప్రెషన్ అయినా కలుగుతుంది.కొందరికి ఆరోగ్యాలలో తేడా వస్తుంది. ఇంకొందరికి మానసికంగా చికాకులు ఎక్కువై పోతాయి.వారివారి జాతకాలలో సూర్యచంద్రుల స్థితులను బట్టి ఒక్కొక్కరినీ ఈ మార్గశిర పౌర్ణమి ఒక్కొక్క విధంగా ఊపుతుంది.

అదీగాక ఇప్పుడు శనీశ్వరుడు సూర్యునితో కలసి ఉన్నాడు.రోహిణీ నక్షత్రాన్ని త్వరలో తన వీక్షణద్వారా స్పర్శించబోతున్నాడు.కనుక ఈ చెడుప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.రోహిణీ శకటభేదనం యొక్క చెడు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో కొద్ది నెలలక్రితం ముందే హెచ్చరించాను.

అసలీ "శకట భేదనం" అనే పదం మన ప్రాచీనులు ఎలా పెట్టారో మన ఊహకు అందదు గాని,ప్రస్తుతం జానకిరాం విషయంలో జరిగింది అదే.శకట భేదనం అంటే "బండి విరిగిపోవడం" అనే కదా అర్ధం !!

జ్యోతిష్య పరమైన వివరాలను అలా ఉంచితే,రోడ్డు ప్రమాదాల గురించి నేను గతంలో వ్రాసిన ఒక పోస్ట్ లో మన దేశంలో ఎవడూ రోడ్డు రూల్స్ పాటించకపోవడాన్ని తూర్పార బట్టాను.మన దేశంలో ఒక టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గాని తీసుకుని రోడ్డెక్కిన చాలామంది తమకు ఏ రూలూ వర్తించదని భావిస్తారు.వాళ్లకు సినిమా హీరో ఆవహిస్తాడు.రోడ్డుమీద తాము తప్ప ఇంకెవరూ లేరనీ తాము ఏ రూల్సూ పాటించనవసరం లేదనీ భావిస్తారు.డ్రైవ్ చేస్తున్న వాహనాన్ని ఎటునించి ఎటు తిప్పినా ఎవరూ అడిగేవారు మన దేశంలో ఉండరన్నది వాస్తవమే.సగటు ఇండియన్ కు రోడ్ సెన్స్ ఎప్పుడూ ఉండదు.పొరపాటు ఎవరిదైనా,ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఎన్నెన్ని విలువైన ప్రాణాలు రోడ్డు పాలు అయిపోతున్నాయో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.

ట్రాఫిక్ రూల్స్ ను సగటు భారతీయపౌరుడు ఎవడూ తనంతట తానుగా పాటించడు.అంతటి సివిక్ సెన్స్ ఉంటె మన దేశం ఎప్పుడో ఇంకా చాలా బాగా ఉండేది.రోడ్ రూల్స్ ని పౌరులు ఖచ్చితంగా పాటించేలా చెయ్యడం ప్రభుత్వ బాధ్యత అయి కూచుంది మన దేశంలో.

ఒక రాంగ్ టర్న్ తీసుకున్నా,రాంగ్ సైడ్ లో ఓవర్ టేక్ చేసినా,రాంగ్ సైడ్ లో వచ్చినా,రాంగ్ ప్లేస్ లో డివైడర్ని దాటినా వెంటనే భారీ పెనాల్టీ పడే విధంగా మన వ్యవస్థలో మార్పులు వచ్చిననాడే ప్రాణాలతో పెనాల్టీ చెల్లించే ఇలాంటి పరిస్థితులు తప్పుతాయి.

ఎక్కడ చూచినా స్వార్ధపూరితులైన ప్రజలతో నిండి ఉన్న మన దేశంలో,'ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందిలే' అని ప్రతివారూ అనుకునే సమాజంలో, వ్యవస్థాపరంగా అంతటి గొప్ప పరిణతి అంత స్పీడుగా వస్తుందని ఊహించడం తప్పేమో?

డ్రైవర్ ను తీసుకుని బయలుదేరి ఉంటె ఇతని ప్రాణాలు దక్కి ఉండేవని కొందరు అనడం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది.అప్పుడు డ్రైవర్ పోయి ఉండేవాడు.అంటే డ్రైవర్ ది ప్రాణం కాదా?ఈ మాట ఎంత స్వార్ధపరమైనదో?ఎవరివైనా సరే ప్రాణాలు పోవాలని మనం ఎందుకు కోరుకోవాలి?అది డ్రైవరైనా, యజమాని అయినా, ఎవరి ప్రాణమూ ఈ విధంగా పోకూడదు.ప్రయాణం సుఖంగా ముగించి వారు ఇళ్ళకు చేరుకోవాలనే మనం ఆశించాలి.ఎందుకంటే వారివారి భార్యాబిడ్డలు వారికోసం ఎదురుచూస్తూ ఉంటారు గనుక.వారి మీద ఎందరి ఆశలో అల్లుకుని ఉంటాయి గనుక.

లాంగ్ డ్రైవ్స్ అనేవి ఇండియాలో చాలా రిస్క్ తో కూడుకున్నవనేది అక్షరసత్యం.ఎందుకంటే గమ్యం చేరేలోపల కొన్ని వందల రోడ్ రిస్క్ లను దాటుకుని ఇల్లు చేరవలసి ఉంటుంది.ఎటువైపు నుంచి ఎవడు ఎలా హటాత్తుగా అడ్దోస్తాడో తెలియదు గనుక అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తూ వెళ్ళవలసి ఉంటుంది.అందులో రాత్రిపూటా,తెల్లవారే సమయంలో, పొగమంచు ఉన్నప్పుడూ ఇంకా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యవలసి ఉంటుంది.

రోడ్డు ప్రయాణం సేఫ్ గా జరిగే విధంగా మన రోడ్డు రవాణావ్యవస్థ రూపు దిద్దుకోవడమే దీనికి ఉన్న ఏకైక పరిష్కారం.పౌరులందరూ విధిగా రోడ్ రూల్స్ పాటించడమే ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఏకైక మార్గం.

ఆ దిశగా పౌరులలోనూ ప్రభుత్వ విధానాలలోనూ మార్పు రావలసి ఉన్నది. అంతవరకూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

జానకిరాంకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిద్దాం.

3, డిసెంబర్ 2014, బుధవారం

జనన తేదీ-కొన్ని నివ్వెరపరచే నిజాలు

నీవు మహా తెలివైనవాడవని అందరూ అనుకోవాలంటే కనిపించిన ప్రతిదాన్నీ 'ఇందులో ఏముంది?' అందులో ఏముంది?' అని విమర్శించు. సరిపోతుంది. అని వెనకటికి ఒకాయన సలహా చెప్పాట్ట.వారికి అర్ధంకాని విషయాలను కూడా విమర్శించే ఇలాంటి చవకబారు మనుష్యులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు.

ఇలా 'అందులో ఏముంది? ఇందులో ఏముంది?' అని ప్రతిదానినీ విమర్శించే వారు డబ్బు దగ్గర మాత్రం బొక్క బోర్లా పడిపోతూ ఉండటాన్ని నేను చూస్తూ ఉంటాను.ఎందులోనూ ఏమీ లేనప్పుడు వారు వెంపర్లాడే "డబ్బులో మాత్రం ఏముంది? అవి మనం ప్రింట్ చేసుకున్న కాగితాలేగా?"అని నేనంటాను.దానికి వారి దగ్గర సమాధానం ఉండదు.

అంతేగాదు ఇంకొకడుగు ముందుకేసి - నేనిలా అంటాను.

'ఎందులోనూ ఏమీ లేనప్పుడు ప్రతిదాన్నీ విమర్శించే మీ విమర్శలో మాత్రం ఏముంది?'

దానికీ వారివద్ద సమాధానం ఉండదు.

అసలు విషయం ఏమంటే,ఇలా ప్రతిదానినీ తెలిసినా తెలియకపోయినా విమర్శిస్తూ ఉండేవారికి లోలోపల చాలా కుళ్ళూ అసూయా ఉంటాయి. మనకు తెలియనిది ఏదో ఎదుటివాడికి తెలుసు అన్న భావనను వారు భరించలేరు.చాలాసార్లు ఇలాంటివారు అసూయాగ్రస్తులే కాదు భయంకరమైన అహంకారులు కూడా అయి ఉంటారు.

అర్ధం చేసుకునే జ్ఞానం మనలో ఉంటే అన్నిట్లోనూ అన్నీ ఉంటాయి.మనం లోపల డొల్ల అయితే ఎందులోనూ ఏమీ ఉండదు.ఉన్నా కనపడదు.

ఇదే విధంగా,"జననతేదీలో ఏముందిలే?" అని చాలామంది అనుకుంటూ ఉంటారు.అలాంటి నాసిరకం మనుషులతో మనకెందుకులే గాని,విషయంలోకి వస్తే,జననతేదీ అనేది మనిషి జీవితాన్ని చాలావరకూ స్థూలంగా వివరిస్తుంది.అంటే ఆ మనిషి జీవిత గమనంలో మేజర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయో జాతకం చూడకుండానే ఉత్త జనన తేదీ చూస్తూనే చెప్పేయవచ్చు.ఇది జ్యోతిష్య విజ్ఞానంలో ఒక రహస్యమైన అంశం.

"శ్రీవిద్యా రహస్యం" పుస్తకం పనిమీద నిన్న విజయవాడ వెళ్లాను.శ్రీకాంతూ నేనూ కలసి పబ్లిషర్ దగ్గరికి వెళ్లి కలిశాము.ఆయనకు దాదాపు 60 పైనే ఉంటాయి.మాటల సందర్భంలో ఆయనిలా అన్నారు.

'శర్మగారు.ఈ సబ్జెక్టు నాకస్సలు తెలీదు.శ్రీవిద్య అనే పదం వినడమే గాని అదేంటో ఎలా ఉంటుందో నాకేమీ తెలీదు.అలాంటి నాకే,మీ పుస్తకం చదువుతుంటే ఒక రకమైన ట్రాన్స్ లాంటి స్థితి కలిగింది.చదువుతూ చదువుతూ అలా ఒకవిధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను.ఏమీ తెలియని నాకే ఇలా అయితే ఇంక ఈ సబ్జెక్ట్ బాగా తెలిసినవారికి ఇది ఎంత గొప్ప అనుభూతి కలిగిస్తుందో ఊహించగలను.'

నిజాయితీగా ఒక అపరిచిత వ్యక్తి చెప్పిన ఆ మాటలు విని నాకు చాలా సంతోషం కలిగింది.ఒక న్యూట్రల్ వ్యక్తి నుంచి వచ్చిన ఈ కామెంట్ నా రచనకు ఇవ్వబడిన ఒక అత్యుత్తమ సర్టిఫికేట్ అనుకున్నాను.

అక్కడ పని ముగించుకుని బయటకు వచ్చాము.

ట్రెయిన్ కు ఇంకా టైం ఉండటంతో కొన్ని పుస్తకాలు కొనాలని శ్రీకాంత్ అంటే అతనితో ఒక పుస్తకాల షాపుకు వెళ్లాను.

అది గాంధీనగర్లో ఒక పుస్తకాల షాపు.అందులో ఒక నడివయస్సు ఆమె కూచుని ఉన్నది.మధ్యాన్న సమయం కావడంతో ఎవ్వరూ జనం లేరు.

"స్కాంద పురాణం ఉన్నదా?" అని శ్రీకాంత్ అడిగాడు.

'ఉన్నది' అంటూ రెండు భాగాల బైండ్ బుక్స్ ను చూపించారు ఆమె.

మాటల సందర్భంలో 'నేనూ కొన్ని జ్యోతిష్య పుస్తకాలు వ్రాశాను' అని శ్రీకాంత్ అన్నాడు.

'మీకు జ్యోతిష్యం తెలుసా?' అడిగింది ఆమె.

'ఏదో కొద్దిగా తెలుసు' అన్నాడు.

'అలా అయితే మా షాపులో పంచాంగం ఉన్నది.చూచి ఒక జాతకం చెప్పగలరా?' అడిగింది ఆమె.

'నాకు పంచాంగంతో పనిలేదమ్మా.నా మొబైల్లో ఇరవై రకాల జ్యోతిష్య సాఫ్ట్ వేర్లున్నాయి.'అన్నాడు.

'అయితే ఒక జాతకం చెప్పండి' అంటూ ఆమె ఒక తేదీ చెప్పింది.

శ్రీకాంత్ తన మొబైల్లో ఒక సాఫ్ట్ వేర్ తెరచి ఆ జాతకచక్రం వేసే ప్రయత్నంలో ఉన్నాడు.

అప్పటి వరకూ మౌనంగా వింటున్న నేను ' ఈ జాతకం అమ్మాయా అబ్బాయా?' అడిగాను.

'అమ్మాయే' అన్నది ఆమె.

'ఈ అమ్మాయికి తండ్రి సపోర్ట్ లేదు' అన్నాను వెంటనే.

ఆమె బిత్తరపోయినట్లు చూచింది.

'నిజమే.ఎలా చెప్పారు?' అడిగింది ఆశ్చర్యంగా.

దానికి నేను జవాబు చెప్పకుండా 'అంతేకాదు.ఈ అమ్మాయికి అన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి.కష్టం ఎక్కువ ఫలితం తక్కువ.' అన్నాను.

ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ' నిజమే' అని "మీకూ జ్యోతిష్యం వచ్చా?' అడిగింది.

'ఏదో కొద్దిగా వచ్చమ్మా' అన్నాను నేను ఎక్కువగా పొడిగించకుండా.

ఇంతలో శ్రీకాంత్ తన మొబైల్లో జాతక చక్రం వెయ్యడం జరిగింది.నేను శ్రీకాంత్ వైపు తిరిగి 'ఈ జాతకానికి సర్పదోషం ఉన్నది చూడండి' అన్నాను.

శ్రీకాంత్ తన మొబైల్లోని ఆ జాతకచక్రాన్ని చూచి 'అవును ఉన్నది'.అన్నాడు.

ఆమెవైపు తిరిగి 'ఈ అమ్మాయి పెళ్లి ఆలస్యం అవుతున్నది.అవునా?' అన్నాడు.

'అవునండీ.అదే నేను అడగబోతున్నాను.సంబంధాలు చూస్తున్నాము.ఏదీ కుదరడం లేదు.ఎంతో మంది జ్యోతిష్కులకు చూపించాము.వారు చెప్పినట్లు కుజుడు, శుక్రుడు,శని,రాహు,కేతువులు,గురువు గ్రహాలకు శాంతులు చాలా చేయించాము' అన్నది ఆమె.

'బాగానే వదిల్చి ఉంటారుగా?' అన్నాడు శ్రీకాంత్.

'అవును,బాగానే వదిలింది.' అన్నది ఆమె.

'అమ్మా.నవగ్రహాలలో దాదాపు ఆరేడు గ్రహాలకు శాంతులు ఇప్పటికే మీరు చేయించామని అంటున్నారు.ఆ మిగిలిన రెండు గ్రహాలకు కూడా చేయించేస్తే టోకుగా అన్నీ అయిపోయేవిగా? ఇలా ఎవరు పడితే వారు చెప్పే రెమేడీలు పనిచెయ్యవమ్మా.' అన్నాడు శ్రీకాంత్.

'ఆ సంగతి అన్నీ చేయించిన తర్వాతే కదండి అర్ధమయ్యేది?' అన్నది ఆమె.

'ఇంత డబ్బుపోసి ఇవన్నీ చేసే బదులు ఆ డబ్బుతో అమ్మాయి పెళ్ళికి కావలసిన బంగారమో నగలో చేయిస్తే బాగుండేది' అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

ఆమెను చూస్తే మన అమ్మలాగానో మన అక్కయ్య లాగానో ఒక సదభిప్రాయం కలుగుతూ ఉన్నది.కొంతమంది "ఆరా" లు అలా ఉంటాయి.

ఏమనుకున్నాడో ఏమో అక్కడికక్కడే ఆమెకు కొన్ని రెమెడీలు చెప్పాడు శ్రీకాంత్.

నేను మౌనంగా చూస్తూ ఉన్నాను.

ఆమె ఇంకా ఏవేవో అడగబోతుంటే,'ముందు ఈ రెమేడీలు మీ అమ్మాయి చేత చేయించండి.వీటికి మీరు ఏమీ ఖర్చు పెట్టనక్కరలేదు.అవి చేశాక నాకు ఫోన్ చెయ్యండి.ఈ లోపలే మీకు ఫలితాలు కన్పించడం మొదలౌతుంది.నిజానికి ఇలా రోడ్డుమీద రెమెడీలు చెప్పకూడదు.కానీ మీ బాధా ఆత్రుతా చూచి చెప్పాను.ముందు నేను చెప్పిన రెమేడీ ఆచరించి ఆ తర్వాత నాకు చెప్పండి' అన్నాడు.

ఆమె కృతజ్ఞతగా తలూపింది.

తనకు కావలసిన పుస్తకాలు కొనుక్కుని నన్ను స్టేషన్లో దిగబెట్టి శ్రీకాంత్ వెళ్ళిపోయాడు.నా దారిన నేను గుంటూరుకు వచ్చేశాను.

లోకంలో ఎక్కడ చూచినా కుహనా జ్యోతిష్కులు తయారై,అమాయకులను మోసం చేస్తూ,రెమేడీల పేరిట నానా రకాల అశాస్త్రీయపు పనులను చేయిస్తూ, జనం దగ్గర డబ్బులు వదిలిస్తున్న మాట వాస్తవం.అన్యాయపు సంపాదనను సగం డాక్టర్లకూ సగం జ్యోతిష్కులకూ జనం వదిలించుకుంటున్న మాటా వాస్తవమే.

అదే విధంగా,ఉత్త జననతేదీని బట్టి జీవితాన్ని చాలావరకూ అంచనా వెయ్యగలగడం కూడా వాస్తవమే.

అదే విధంగా,సత్కర్మబలం ఉన్నవారికి మాత్రమే సరియైన రెమేడీలు అందుతాయన్న మాట కూడా అక్షరాలా నిజమే.భగవంతుడు కరుణిస్తే రావలసినవాళ్ళు మన ముంగిటికే వచ్చి ఉపాయాలు చెప్పిపోతారు.ఆ సత్కర్మబలమే గనుక లేకుంటే మనం ఎంత తిరిగినా,ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వారు దొరకరు,ఒకవేళ వాళ్ళు మన పక్కనే ఉన్నాకూడా మనం ఉపయోగించుకోలేము అనడానికి నిన్న జరిగిన ఈ సంఘటనే సాక్ష్యం.

లేకుంటే,ఎక్కడో షాపులో కూచుని ఉన్న ఆమె దగ్గరకు మేము వెళ్లి,ఆమె కూతురి పెళ్లి త్వరగా జరగడానికి ఉచిత రెమెడీస్ చెప్పి రావడం ఏమిటి?