“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, సెప్టెంబర్ 2011, బుధవారం

కుజప్రభావం

మనిషి జీవితంలో కుజగ్రహానికున్న పాత్ర అనూహ్యం. ఈయననే అంగారకుడని, భూమిపుత్రుడని కూడా అంటారు. కుజదోషం అనే దోషం గురించి అందరికీ కొద్దో గొప్పో తెలుసు. ఈ దోషం మనుషుల జీవితాలతో ఎంత చెలగాటం ఆడుతుందో అనుభవించినవారికే అర్ధమౌతుంది. అది అనుభవంలోకి వచ్చేవరకూ దాని తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో తెలియదు. మన రాష్ట్రంలో కంటే తమిళనాడులో దీనిగురించి చక్కని అవగాహన ఉంది. దానికి కావలసిన జాగ్రత్తలుకూడా వారుబాగా తీసుకుంటారు. 

మనం అన్నీ గాలికొదిలేశాం. మనకు సంగీతమూ పట్టదు, సాహిత్యమూ పట్టదు, జ్యోతిష్య వేదాన్తాది ప్రాచీననిధులూ పట్టవు. మనకు తెలిసిందల్లా అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, నా అంతవాడు లేదని మిడిమిడి జ్ఞానంతో విర్రవీగడం. సంస్కృతీ సాంప్రదాయాలను గాలికి వదిలేసి పూర్తిగా విలాసాల వెంటపడినందుకే మన ఆంధ్రుల పరిస్తితి ఇలా నిత్యాగ్నిహోత్రంలా ఉంది. మన ప్రాచీన నిధులను మనమే ఎగతాళి చెయ్యడం ఒక గొప్పగా భావించే ఎలుకపిల్లలు నేడు ఎక్కడచూచినా పుట్టుకొచ్చారు. కలిప్రభావం అంటే ఇదేనేమో.

ఆ విషయాలు అలా ఉంచితే, నిన్న డిల్లీలో మూడంతస్తుల భవనం కుప్పకూలి చాలామంది మరణించారు. ఒక్కసారి వెనక్కు చూస్తే, 2010  నవంబర్ లో ఇలాగే ఇదే డిల్లీలో అయిదంతస్తుల భవనం కూలిపోయి జనం నలిగిపోయి పరలోక ప్రయాణం కట్టారు. ఈ రెండు సంఘటనల వెనుకా కుజగ్రహం పాత్ర స్పష్టంగా ఉందంటే విచిత్రంగా ఉండవచ్చు. కాని ఇది పచ్చినిజం. ఆయా ఘటనలు జరిగినప్పుడు ఆయా గ్రహస్తితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.

16 -11 -2010 న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిన అప్పటి ఘటనలో 42 మంది చనిపోయారు. 65 మంది గాయపడ్డారు. ఆరోజు కన్యాశనికీ, వృశ్చికకుజునికీ డిగ్రీ దృష్టి ఉంది.బుధుడు కుజునితో చాలాదగ్గరగా ఉన్నాడు. రవి సున్నాడిగ్రీలలో ఉండి అప్పుడే వృశ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహకూటమి వల్లనే ఈ ఘటన జరిగింది. ఇంకొక్క విచిత్రం ఏంటంటే ఆరోజు మంగళవారం. అంతే కాదు అప్పటి హోర కూడా కుజహోర. ఇంతకంటే కుజ ప్రభావానికి రుజువులేం కావాలి? మన పెద్దలు వారాలకూ హోరలకూ ఇచ్చిన ప్రాధాన్యత వెనుక తరతరాల అనుభవం ఉందనీ అవి మూఢనమ్మకాలు కావనీ అర్ధం చేసుకోవాలి. 
   
ఇక నిన్నటిఘటన చూద్దాం. కర్కాటక కుజుడు, కన్యాశనితో నక్షత్రపరివర్తనలో ఉన్నాడు. అంటే కుజనక్షత్రంలో శనీ, శనినక్షత్రంలో కుజుడూ ఉన్నారు. గ్రహాల మధ్యన ఉండే పంచవిధ సంబంధాలలో ఇదీ ఒకటి. కుజునికీ, కన్యారవికీ డిగ్రీదృష్టి అప్ప్లైయ్యింగ్ స్తితిలో (applying aspect) ఉంది. ఈరోజు ఖచ్చితమైన దృష్టి (exact aspect) వచ్చింది. బుధుడు రవికి అతి దగ్గరగా ఉన్నాడు. నిన్నటి ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే, నిన్న కూడా మంగళవారమే. ఈ ఘటన జరిగింది కూడా 19.45 ప్రాంతంలోనే. అయితే ఈసారి డిల్లీలో శనిహోర జరుగుతున్నది. ఈ ఘటన వెనుక ఉన్న శని కుజుల సంబంధం ఏమిటో పైన వివరించాను. 

మరొక్క విషయం. పోయినేడాది జరిగిన ఘటన పౌర్ణమికి మూడ్రోజుల ముందు వ్యవధిలో జరిగింది. నిన్నటి ఘటన సరిగ్గా అమావాస్య ఘడియలలో జరిగింది. నేనెప్పటినుంచో చెబుతున్న ఈ "పౌర్ణమి - అమావాస్య" ప్రభావం మళ్ళీ రుజువైంది.

అలాగే, కుజుని కర్కాటకప్రవేశం నుంచీ ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు జరుగబోతున్నాయని ముందే వ్రాశాను. అలాగే  జరుగుతుండటం చూడవచ్చు. మారణహోమం లేని రోజంటూ ఈ మధ్యలో లేనేలేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట సామూహిక మానవహననం జరుగుతూనే ఉన్నది. ఆయా సంఘటనల మీదా ఆయా గ్రహస్తితుల మీదా వాటివెనుక ఉన్న లింకులమీదా అన్నీ అయినతర్వాత వివరంగా ఒక పోస్ట్ త్వరలో వ్రాస్తాను. జరుగబోయే ఘటనలను సాంకేతికభాషలో కాలజ్ఞానంలో వ్రాసాను. అవి అర్ధం చేసుకునేవారికి అర్ధమౌతున్నాయి.

ఈ పోస్ట్ చదివినవారు ఏమంటారో ఊహించగలను. మీకంత తెలిస్తే ముందేచెప్పి ఆపద నివారించవచ్చుకదా అంటారు. సామాన్యులకు సేవచెయ్యవచ్చు కదా అంటారు. వారికి తెలీని ఒకవిషయం చెప్పదలుచుకున్నాను. తనకు  తెలిసినంతమాత్రాన అందరికీచెప్పి అందరి ఆపదలూ నివారించడం దైవజ్నుని కర్తవ్యం కాదు. నివారణ అనేది అర్హులైన సన్నిహితులైన కొందరికే చెప్పడం జరుగుతుంది. మిగిలినవారు ఎవరిఖర్మను వారనుభవించక తప్పదు. ఎందుకంటే, వారి అహంకారమే వారి కర్మను తొలగించుకోవడంలో అడ్డుగా నిలుస్తుంది. సామూహిక దుర్ఘటనలను నివారించడం జ్యోతిర్వేత్తల పనికాదు. అలా చెయ్యడం అహంకారం అనిపించుకుంటుంది. దైవనియమాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. పైగా "సామాన్యులూ" "సేవా" అన్న కాన్సెప్ట్ లకు నేడు కాలం చెల్లిందని నేను నమ్ముతాను. ఈనాడు  సామాన్యులంటూ  ఎవ్వరూ లేరు. సేవ ఎవ్వరికీ అవసరం లేదు. ఒకరికి సేవచెయ్యాలి అనుకోవడం పెద్ద భ్రమ. తీవ్రమైన inferiority complex, guilt complex లున్నవారే  అలా ఎవరికైనా సేవచెయ్యాలని భావిస్తారు. నాదృష్టిలో అసలు సోషల్ సర్వీస్ అనేదే పెద్ద మోసం. స్వంతలాభం చూసుకోకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నవారు నేడు ఎక్కడా లేరు. సోషల్ సర్వీస్ అవసరంలేదు కూడా. నేడసలు కావాల్సింది పరసేవ కాదు. ఆత్మసేవ కావాలి. ఆత్మసేవకులే నిజమైన సేవ చెయ్యగలరు. ఇతరులు చేసేది సేవలా కనిపిస్తుంది కాని సేవ కాదు. అదొట్టి బూటకం.

ఇవన్నీ అలా ఉంచితే, మన ప్రాచీనులు కుజుని ప్రభావాన్ని ఎందుకంత నొక్కిచెప్పారో ఇప్పుడైనా అర్ధం చేసుకుందామా?
read more " కుజప్రభావం "

26, సెప్టెంబర్ 2011, సోమవారం

కాలజ్ఞానం - 3

మేధస్సుకు ఔన్నత్యం పైపూతల అదోగమనం 
సాహితీవేత్తల కళాకారుల నిష్క్రమణం 
రాజుకు పట్టిన దోషం రాజ్యాలకేమో గ్రహణం 
త్రిమూర్తుల చూపులతో చెదిరిపోయె వీరత్వం

లేత ఆశలను తుంచుతున్న ఉచ్చు. 
తండ్రీ కొడుకుల మధ్యన చిచ్చు
తానింతటి  భారాన్ని ఎన్నాళ్ళని మోస్తుంది?
read more " కాలజ్ఞానం - 3 "

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కాలజ్ఞానం - 2

భయంకర సమఉజ్జీలిద్దరు 
ఒకరి కోటలో ఒకరు పాగావేశారు
ఇక మొదలౌతుంది ధ్వంసం 
విలాసపు మోజులో పడిన ధర్మం

కళ్ళు మూసుకుని ఊరుకుంటుంది
నాకెందుకులే అంటూ 
నాలుగు శక్తులూ వేటాడితే  
అల్పుడైన మనిషి బ్రతుకెంత ?
read more " కాలజ్ఞానం - 2 "

21, సెప్టెంబర్ 2011, బుధవారం

కాలజ్ఞానం -- 1

జరగబోయే విషయాలను ముందేచెప్పటం మంచిది కాదు. అది జ్యోతిష్కునికైనా సరే, మహాత్ములకైనా సరే. ఎందుకంటే అది సృష్టినియమానికి విరుద్ధం. కాని మరి జ్యోతిశ్శాస్త్రం ఉపయోగం ఏమిటి? అని సందేహం వస్తుంది. జ్యోతిర్వేత్తలకు భవిష్యత్తు తెలుస్తుంది. కాలజ్ఞానం వారికి కలుగుతుంది. కానీ తెలిసిందికదా అని దానిని అడ్డూఅదుపూ లేకుండా అందరికీ చెప్పటం నిషేధం. ఇదొక విచిత్రపరిస్తితి. 

వ్యక్తుల విషయంలో కూడా అడిగిన అందరికీ చెప్పడం మంచిది కాదు. అడిగినవారికి తెలుసుకునే  యోగం ఉందా లేదా, వారి కర్మబలం ఎలా ఉంది అన్నవిషయం  పరిశీలించిన మీదటే విషయం చెప్పాలి. చెప్పకూడదని సూచన వస్తే అటువంటి వారికి చెప్పరాదు. వారి కర్మ తీరే సమయం ఇంకా రాలేదని అర్ధం చేసుకొని మౌనం వహించాలి. కానీ దేశ గోచారం విషయం వేరు. అది స్థూలంగా ఏ ఒక్కరికీ చెందనిదీ అందరికీ చెందేదీ అయిన విషయం. కనుక ఆ విషయాన్ని ఒకరి ప్రమేయం లేకుండా చెప్పవచ్చు. కానీ అక్కడకూడా గోప్యత అవసరం.

అందుకే ఈ జటిలసమస్యను అధిగమిస్తూ, విషయం  తెలిసినవారందరూ, జరగబోయేదాన్ని చెప్పీచెప్పకుండా నిగూఢసాంకేతికభాషలో చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అయినా, నోస్త్రాదేమస్ క్వార్త్రైన్స్ అయినా, వేమనపద్యాలైనా ఇవన్నీకూడా అందుకే  నిగూఢ సాంకేతికభాషలో చెప్పబడినవే.  అర్ధంచేసుకునే వారికి అవి అర్ధం అవుతాయి. ఆ స్తాయి లేనివారికి అర్ధంకావు. మార్మిక విషయాలలో ఈమాత్రం సాంకేతికత్వం, నిగూడత్వం తప్పనిసరి. 

భగవంతుని సృష్టి కూడా అలాంటిదే. దాని రహస్యాలు కూడా అంతే. అవి ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ అందరికీ అర్ధం కావు. అర్ధం చేసుకోగలవారికి అవి అర్ధం అవుతాయి. మిగిలినవారికి అర్ధం కావు. కనుక ఇలా నిగూఢసాంకేతిక భాషలో చెప్పడం ద్వారా కాలజ్ఞానులు సృష్టితో సామరస్య స్తితిలోనే ఉంటారు. అలా చెప్పడం వల్ల  సృష్టినియమాన్ని ఉల్లంఘించినట్లు అవదు.ఆ దోషం వారికి అంటదు.

అందుకే ఇన్నాళ్ళబట్టీ నేను డైరెక్ట్ గా చాలావిషయాలను చెబుతూ చేసిన పొరపాటును సవరించుకుంటున్నాను. ఇకనుంచీ జరుగబోయే విషయాలు ఇక్కడకూడా నిగూఢ సాంకేతికభాషలోనే చెప్పబడతాయి. ఏ గ్రహస్తితులను బట్టి నేను వీటిని చెబుతున్నానో, నా విశ్లేషణ ఏమిటో అనే విషయాలు మాత్రం చెప్పను. దీనికి కాలజ్ఞానం అని పేరు పెడుతున్నాను. ఈ కాలజ్ఞానం అందరికీ అర్ధంకాదు. మార్మికభాషను అర్ధం చేసుకోగలవారికీ, జ్యోతిష్యపరిజ్ఞానం ఉన్నవారికీ, ప్రపంచవిషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నవారికే ఇవి అర్ధం అవుతాయి. సంఘటనలు జరుగబోయే కొద్దిరోజులు ముందుగా వీటిని ఇవ్వడం జరుగుతుంది. కాలజ్ఞానాన్ని ఈ పోస్ట్ తోనే మొదలు పెడుతున్నాను.

కాలజ్ఞానం -- 1 

ఒక ఆవిష్కరణ వెలుగు చూస్తుంది.
ఒక విప్లవం గెలుస్తుంది.
ప్రాణాన్ని కాపాడేదే ప్రాణం తీస్తుంది.
హటాత్తుగా పరిస్తితులు మారిపోతాయి.

చీకటి శక్తులు విజ్రుమ్భిస్తాయి.
హింస నాట్యం చేస్తుంది.
అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలు
అధర్మానిదే రాజ్యం
read more " కాలజ్ఞానం -- 1 "

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

లండన్ అల్లర్లకు కారణాలేంటి?

ఆ మధ్య లండన్ లో దోపిడీలు అల్లర్లు జరిగాయి. దానికి కారణాలేంటో ఇదమిత్థంగా ఎవరూ తేల్చి చెప్పలేదు. కానీ కొందరి ద్వారా నేను విన్నదాన్ని బట్టి దాని కారణాలు ఇవి.

ఇంగ్లాండ్ లో దాదాపు పది శాతం జనాభాకి పనీ పాటా లేదు. ప్రభుత్వమే వారికి కన్సెషన్ రేట్ లో అన్నీ సమకూరుస్తుంది. అతి తక్కువ ధరలో ఇల్లూ, ఫుడ్ కూపన్లూ, హెల్త్ సర్వీసూ అన్నీ ప్రభుత్వం నుంచి ఫ్రీ గా అందుతాయి. కనుక వారికి పని చెయ్యవలసిన అవసరం లేదు. బోలెడంత సమయం ఉంటుంది. ఏమి చెయ్యాలో తెలియదు. కనుక విలాస జీవితాలు గడుపుతున్న సంపన్నుల మీద వారి కన్ను పడుతుంది. ఇంగ్లాండ్ లో ఇప్పటికీ అరిస్తోక్రాట్ కుటుంబాలకు కొదవే లేదు. వాళ్ళ విలాస జీవితాలను చూచిన ప్రీ సర్వీస్ గాళ్ళకు దోపిడీ మీద మనసు పోవడం ఖాయం కదామరి.

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పెద్ద గొప్పవిగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏమీ లేవు. ఉన్న కొన్నింటినీ విదేశీ కంపెనీలు హస్తగతం చేసుకుంటున్నాయి. ఇక ఇంగ్లాండ్ కు మిగిలింది టూరిజం ఒక్కటే. టూరిజం మీద వచ్చే ఆదాయమే ప్రస్తుతం ఇంగ్లాండ్ కు ఉన్న అతి పెద్ద ఏకైక ఆదాయ మార్గం. అందులో ఎంతమంది ఉద్యోగాలు చెయ్యగలరు? కనుక నిరుద్యోగుల సంఖ్య అక్కడ బాగా పెరుగుతున్నది. 

పేదా గొప్పల మధ్య అంతరం బాగా పెరిగిన ప్రతి సమాజంలోనూ నేరాలు తప్పకుండా జరుగుతాయి. వ్యవసాయపనులు మొదలైన సామూహికపనులు లేని సమయాలలో దొంగతనాలు పెరగడానికి కారణం కూడా ఇదే. అందులోనూ పోలీసు వ్యవస్థ బలహీనం అయితే ఇక చెప్పే పనే లేదు. మన దేశంలో నక్సలిజం ప్రారంభానికి ఈ ఆర్ధిక అసమానతే మూలకారణం. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరిగిన అల్లర్లవెనుకకూడా ఇవేకారణాలు కనిపిస్తున్నాయి. జమైకానుంచి వచ్చిన బ్లాక్స్ అయినా, పనిలేక ఊరకేఉంటున్న బ్రిటిషర్లు అయినా, అందరూ కలిసి ఈ అల్లర్లకు దోపిడీలకు కారకులయ్యారు. 

ఇవన్నీ చూస్తున్నప్పుడు -- అన్నిటినీ మించి, ఆర్ధిక స్తితిగతులే మానవసంబంధాలను ప్రభావితం చెయ్యడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి -- అన్న కారల్ మార్క్స్ ఆలోచన చాలావరకూ సరియైనదే అని నమ్మకతప్పదు.

ధనవంతులూ దరిద్రుల  మధ్యన అంతరాన్ని బాగా తగ్గించడమూ, అందరికీ సరియైన పని కల్పించడమూ -- ఈ రెండుపనులను సమర్ధవంతంగా చెయ్యగలిగిన ప్రభుత్వాలు ఉన్నదేశంలో శాంతిభద్రతలతో కూడిన సమాజస్థాపన పెద్దసమస్య కానేకాదు. 

అవి చెయ్యలేని సమాజంలో శాంతి అనేది నేతిబీరకాయలో నెయ్యి లాంటిదే. ఆ సమాజం పైపైకి శాంతిగా కనిపించినా అది రగులుతున్న అగ్నిపర్వతమే. ఆర్ధిక విషయాలకు కులమతాలూ జాతులూ దేశాలూ  భాషలూ అన్న భేదం లేదు. అవి ఎక్కడైనా ఒకటే అని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయ్.

ఈ పోస్ట్ చదివి గడ్డిపాటి అరుణ్ చంద్రగారు( http://krishnaveniteeram.blogspot.com) వ్రాసిన మెయిల్ ను ఇక్కడ ఇస్తున్నాను.
" మీ టపాలో కేవలం ఆర్థిక కారణాలే ప్రధానం అల్లర్లకు అని వ్రాశారు. కానీ ప్రధాన కారణం జాతి వివక్ష. మీరు ఉదహరించిన సౌకర్యాలన్నీ ప్రభుత్వం సమకూరుస్తుంది నిజమే కానీ అవన్నీ పెక్కుశాతం శ్వేతజాతీయులే దక్కించుకుంటారు. ఇతర జాతులవారి పరిస్థితి దుర్భరం. కేవలం రెండుపూట్లా అన్నం పెడితే చాలు పనిచేయటానికి సిద్ధంగా నల్లజాతి ప్రజలున్నారు నేడు ఇంగ్లాండు సమాజములో. వారుండే చోట సరైన వసతులుండవు, వారికి సామాజిక భద్రత ఉండదు. ఉదారవాద వలస విధానాన్ని అనుసరించి ప్రపంచములో అన్ని ప్రాంతాల నుంచీ జనాన్ని ఆహ్వానించి ఇప్పుడు వారిని పొమ్మనకుండా పొగపెడుతున్న ఫలితమే అల్లర్లు. పోతే ప్రపంచములో అత్యంత బలమైన పోలీసు వ్యవస్థ ఉన్న దేశాల్లో యు.కె ఒకటి."

"నవ్వులాట" శ్రీకాంత్ గారు ఇంకొక కొత్త కోణాన్ని నిన్న అందించారు.
మొదట్లో జరిగిన గొడవల్లో ఇద్దరు బ్లాక్స్ ను పోలీసులు కాల్చి చంపారు. అప్పుడు కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు కొంత అలసత్వాన్ని ప్రదర్శించి ఊరుకున్నారు. గట్టి చర్యలు తీసుకోలేదు. దాన్ని అలుసుగా తీసుకుని ఘర్షణలు చెలరేగాయి. వీటికి తోడు జాతి వివక్షా, సామాజిక అసమానతలు ఆజ్యం పోశాయి. లండన్ అల్లర్ల వెనుక ఒకే కారణం లేదు. ఈ విధంగా చాలా కోణాలున్నాయి.
read more " లండన్ అల్లర్లకు కారణాలేంటి? "

12, సెప్టెంబర్ 2011, సోమవారం

నా పాట లక్ష

షిర్డీసాయిబాబా పాదుకలు ఊళ్లోకోచ్చాయని జనం విరగబడి చూడటానికి వెళుతున్నారు. వాటిని నెత్తిమీద పెట్టుకొని మొయ్యటానికి వాళ్ళలోవాళ్ళు పోటీలుపడి వేలంపాటలేసుకొని  మరీ ఎగబడుతున్నారు. ఇదంతా చూస్తె నాకు భలే వింతగా ఉంటుంది. వెర్రివెర్రి  అంటే వేలంవెర్రి అని సామెత ఒకటి ఉంది. జీసస్ శిలువపైన మరణవేదన పడుతుంటే, ఆయన తొడుక్కున్న అంగీకోసం లాటరీ చీట్లు వేసుకున్న రోమన్ సైనికులు నాకు గుర్తొస్తున్నారు. ఈ తతంగమంతా అలా ఉంది. చివరికి వేలంపాటలో ఒకాయన లక్ష రూపాయలకు పాటపాడి పాదుకలు మోశాట్ట. ఎందుకిదంతా చేస్తున్నారు? అని వాళ్ళలో ఒకన్ని అడిగాను. "అలాచేస్తే మంచి జరుగుతుంది." అని జవాబు వచ్చింది. నువ్వు మంచిగాజీవిస్తే మంచి జరుగుతుందిగాని పాదుకలు మోస్తే మంచి ఎలా జరుగుతుంది? ఒకవేళ జరిగినా, నీవు కష్టపడి సంపాదించుకోకుండా తేరగా వచ్చే మంచి నీదేలా అవుతుంది? అని అడిగాను. జవాబు లేదు.

మాకు తెలిసిన ఒకాయన ఒక ఊళ్ళో సాయిబాబా గుడి కట్టించిన ప్రముఖులలో ఒకడు. ఆ కమిటీ మెంబర్లలో అతి ముఖ్యుడు. ముందు ఆ గుడిని ఒకచోట ప్లాన్ చేసారు. కట్టుబడి చాలావరకూ అయిపొయింది కూడా. ఆ తరువాత కమిటీ మెంబర్లలో  వాళ్ళలోవాళ్లకు గొడవలోచ్చి రెండు కులవర్గాలుగా విడిపోయారు.  ఒక వర్గం వేరొకచోట స్తలంకొని మళ్ళీ అక్కడ గుడి కట్టటం ప్రారంభించారు. పాతగుడి మధ్యలో అలాగే ఆగిపోయి ఇప్పటికీ అలాగే అఘోరిస్తోంది. కొత్తగుడి మంచి హంగుగా వచ్చింది. జనం కిటకిటలాడుతుంటారు (గురువారం మాత్రం). నేనూ ఒకరోజు వెళ్లి చూశాను. అక్కడి సోకాల్డ్ ప్రముఖుల వేషాలూ, జనం ఎదురుగా అతిభక్తి నటించటమూ చూసి మళ్ళీ ఆ ఛాయలకు వెళ్ళలేదు. 

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, మాకు తెలిసిన ఆ ప్రముఖుడు ఆఊళ్ళో పెద్ద వడ్డీవ్యాపారి. ఆఊళ్ళో కదిలిస్తే అతనంటే ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. తరువాత విచారిస్తే తేలిందేమంటే, ఆ కమిటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఘనచరిత్ర ఉంది. సామాన్యంగా నిత్యజీవితంలో సక్రమంగా ఉండనివాళ్ళే ఇలా గుళ్ళూ గోపురాలూ కడుతుంటారు. వాళ్ళ చీకటి జీవితాలను సమర్ధించుకోటానికి  ఇదొక దొంగదారి. ఇలాంటి వాళ్ళని  చాలామందిని నేనెరుగుదును. ఈ మధ్యలో తామరతంపరగా వస్తున్న సాయిబాబాగుళ్ళూ, అయ్యప్పగుళ్ళూ అన్నీ పెట్టుబడిలేని పక్కా వ్యాపార కేంద్రాలని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇంకొక డాక్టరున్నాడు. సమాజంలో మంచి పేరుంది. కాని తన దగ్గరికి వచ్చిన పేషంటును పంచవర్షప్రణాళిక టైపులో తిప్పుకుంటూనే ఉంటాడు. ఆరోగం పూర్తిగా తగ్గదు. తగ్గినట్లే ఉంటుంది. కానీ పూర్తిగా తగ్గదు. క్లినిక్కు మాత్రం కిటకిట లాడుతూ ఉంటుంది. ప్రతి పేషంటుకూ ఒకమాట మాత్రం చెప్తాడు. "నేను ఫలానా ఊళ్ళో సాయిబాబా గుడి కట్టించాను. వెళ్లి దర్శనం చేసుకుని రండి" అని చెప్తాడు. రోగి ఇక్కడ చెల్లించే ముడుపు చాలక అక్కడికెళ్ళి గుళ్ళో కూడా ముడుపు కట్టి రావాలి. ఇదీ తంతు.

పనీపాటా ఉద్యోగం సద్యోగం వ్యాపారం లేనివాళ్ళేవరైనా  ఉంటే వాళ్లకు ఒక మంచి చిట్కా ఉంది. ఒక చెట్టునో, పుట్టనో, ఫుట్పాత్  మీద ఒక మంచి చోటునో ఎంచుకొని అక్కడ సాయిబాబా ఫోటో పెట్టి నెమ్మదిగా పూజా పునస్కారాలు మొదలుపెడితే చాలు. ఒక రెండేళ్లకు అక్కడ పెద్ద గుడి లేవడం ఖాయం. అది సరిగ్గా రోడ్డుమధ్యలో ఉంటే మరీ మంచిది. జనాలే పక్కకు తప్పుకొని పోతారు. లేకుంటే వేరే రోడ్డు వేసుకుంటారు. ప్రతిదానికీ భయపడే మన దద్దమ్మ ప్రజలు అంతకంటే ఇంకేం చెయ్యగలరు గనుక ?

గుడి కట్టించిన వడ్డీ వ్యాపారైనా, ట్రీట్మెంట్ సరిగ్గా చెయ్యకుండా భక్తిముసుగులో వ్యాపారం చేస్తున్న  డాక్టరైనా, పాదుకలు మొయ్యడానికి బ్లాక్ మనీతో వేలంపాట పాడుతున్న ప్రముఖులైనా, పాదుకలు నెత్తిన పెట్టుకుని ఊరేగితే మంచి జరుగుతుంది అని నమ్ముతున్న సామాన్యుడైనా -- ఎవరైనా సరే, వీరంతా మరచిపోతున్న విషయం ఒకటుంది.  పొద్దున్న లేచింది మొదలు కుళ్ళు జీవితాలు గడుపుతూ సాయిబాబా పాదుకలు మోస్తేనో, పార్ట్ టైం దీక్షలు చేస్తేనో, లేక తమ అక్రమార్జనతో దేవుళ్ళకు నగలు చేయిస్తేనో తాము చేసిన పాపాలు అన్నీ హుష్ కాకీ అన్నట్లు  ఎగిరిపోతాయని అనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ ఇంకొకటి ఉండదు.

మనం చెయ్యవలసిన పని సక్రమంగా చెయ్యకుండా దేవుడికి లంచం ఇవ్వబోతే దానికి ఆశపడి దేవుడు మనం చెప్పినట్లు ఆడతాడు అనుకోవడం మన దిగజారుడు ఆలోచనకు నిదర్శనం. అక్రమసంపాదనతో కట్టించిన గుళ్ళలో ఏ దేవుడూ ఉండడు. వ్యాపార దేవాలయాలలో దైవత్వమూ ఉండదు. అసలిదంతా "స్లేవ్ మెంటాలిటీ" అని నా ప్రగాఢ విశ్వాసం. "మమ్మీ" సినిమాలో తనను వెంటాడుతున్న మమ్మీకి ఒకడు రకరకాల మతాల గుర్తులున్న బంగారువస్తువులు లంచాలుగా ఇవ్వబోతాడు. అతని అవస్తలన్నీ మౌనంగా చూస్తున్న మమ్మీ "స్లేవ్ మెంటాలిటీ" అన్న ఒక్క మాట మాత్రం అంటాడు. నిత్య జీవితానికి సంబంధం లేని భక్తి భక్తికాదు. అది "స్లేవ్ మెంటాలిటీ" మాత్రమే.

అనునిత్యం రుజుమార్గంలో నడిచేవాడికి ఏ గుళ్ళూ గోపురాలూ అక్కర్లేదు, అటువంటి వాడు  ఏ పాదుకలూ మొయ్యనక్కర్లేదు. అతని హృదయమే ఒక దేవాలయం. వాని హృదయంలోనే దైవం ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది. అలా నడవనివాడు ఎన్ని పాదుకలు మోసినా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ఏ ఉపయోగమూ ఉండదు.

మన అతితెలివిని గమనించలేనంత తెలివితక్కువవాడు దేవుడని అనుకోవడం మన తెలివితక్కువతనం. మానవుడిగా సక్రమంగా జీవించలేనివానికి దైవత్వం అందుతుంది అనుకోవడం మానవుల వెర్రితనం మాత్రమే. అదెన్నటికీ జరిగే పని కాదు.
read more " నా పాట లక్ష "

10, సెప్టెంబర్ 2011, శనివారం

రెండు నెలల గండకాలం

మనుష్యులు చేస్తున్న అధర్మానికి తగిన శిక్ష వేసే కోపగ్రహం కుజుడు ఈ రోజునుంచి నీచస్తితిలో ప్రవేశిస్తున్నాడు. తనయొక్క  యుద్ధప్రియత్వాన్నీ, రక్తదాహాన్నీ చల్లార్చుకునేందుకు అనేక పధకాలు రచిస్తున్నాడు. అయితే, ఆయా పధకాలు  ఆయన సొంత పధకాలు కావు. మనుష్యులు తెలివితక్కువతనంతో దూరదృష్టిలేమితో, అత్యాశతో చేసుకుంటున్న చెడుకర్మ ఫలితాలే అవి. ఇక యాక్సిడెంట్లకూ, ఆయుధఘాతాలకూ, రక్తదర్శనాలకూ, శస్త్రచికిత్సలకూ ప్రజలు సిద్ధంగా ఉండాలి. 

కుజుడు మిధునరాశిలో చివరినక్షత్రపాదంలో సెప్టెంబర్ 4 న ప్రవేశించగానే ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు మళ్ళీ మొదలయ్యాయి. మొన్న ఏడవతేదీన ఏకాదశిరోజున డిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ళ వెనుక ఎవరిహస్తమైనా ఉండవచ్చుగాక. అంతిమంగా మాత్రం మనకు కనిపించకుండా వీటిని ప్రేరేపించిన ప్రకృతిశక్తులు ఉన్నాయి. వాటి ప్రేరేపణ కూడా మన ఖర్మానుసారమే ఉంటుంది. అదీ అసలైన విచిత్రం.

కుజుడు తనయొక్క నీచస్తితిలో  అక్టోబర్ 30 వరకూ ఉంటాడు. ఈ రోజునుంచి 14 వరకూ రాశి నవాంశలలో నీచ స్తితి కొనసాగుతుంది. ఈ సమయంలోనే భాద్రపద పౌర్ణమి వస్తుంది. కనుక ఈ నాలుగు రోజులు కూడా గండకాలమే.  తరువాత, సెప్టంబర్  27 న వస్తున్న భాద్రపద అమావాస్య, అక్టోబర్  26 న వస్తున్న ఆశ్వయుజ అమావాస్యలకు అటూఇటూగా కుజుడు తనప్రతాపం ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ సంఘటనలు ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జాతకాలలోనూ కూడా ఉంటాయి. భూకంపాలు, వాహనప్రమాదాలు, ప్రక్రుతిభీభత్సాలు, దుండగులదాడుల రూపంలో ప్రజాజీవితంలో ఇవి కనిపిస్తాయి. యాక్సిడెంట్లు, ఆపరేషన్లు, గొడవలు, దెబ్బలు తగలడం, రక్తాలు కారడం, జ్వరాలు వంటి రూపంలో వ్యక్తిగతజాతకాలలో ఉంటాయి. మనం ఏమిచేసినా చెల్లుబాటు అవుతుంది, మనల్ని గమనించేవారు ఎవరూలేరు అని అనుకుంటూ అధర్మాన్ని పోషిస్తున్న నాయకులూ,  దైవధర్మాన్ని, ప్రక్రుతి ధర్మాన్ని తప్పుతున్న ప్రజలూ తమచర్యలకు తగిన ఫలితాన్ని పొందడానికి, కుజాగ్రహాన్ని చవిచూడటానికి ఈ సమయంలో సిద్ధంగా ఉండండి.
read more " రెండు నెలల గండకాలం "